Showing posts with label Fable. Show all posts
Showing posts with label Fable. Show all posts

Tuesday, 24 March 2020

సెల్ఫ్ ఐసోలేషన్‌లో బీర్బల్




అక్బర్ తన రవీజల్‌ వుజారా (ముఖ్యమంత్రి) అయిన బీర్బల్ మాటకు ఎంతో విలువనిచ్చేవాడు.  

బీర్బల్ తెలివితేటలు కేవలం అక్బర్ చెంత మాత్రమే కాక మొగల్ సామ్రాజ్యం అంతటా ప్రఖ్యాతి గాంచాయి.  పాదుషా తరువాత పాదుషా అంతటి వాడిగా ప్రజలందరూ అతడిని గుర్తించి గౌరవించారు.

అయితే ఇది అక్బర్ గారి వ్యక్తిగత హల్లాకు (మంగలి) అయిన రజాక్‌కు నచ్చలేదు. బీర్బల్ వచ్చిన తరువాత అక్బర్ తన లొల్లాయి సలహాలను అంతగా పట్టించుకోకపోవడమే అందుకు కారణం.  

ఇటువంటి కడుపుసంకటం కేవలం రజాక్‌కు మాత్రమే కాదు.  అక్బర్ మహ్‌కమా‌ (సభ) లోని వారందరికీ కూడా ఉండింది.  వారందరూ  అక్బర్‌ను ప్రతిరోజూ కలిసే రజాకుతో కలిసి బీర్బల్ పీడను ఎలా వదిలించుకోవాలో బాగా ఆలోచన చేసి ఒక పథకం వేశారు.

ఆ పథకం ప్రకారం, 
ఒకరోజు రజాక్ సభకు వచ్చి "ఆలంపనా, ఆలంపనా, నాకు రాత్రి ఒక ముఖ్యమైన కల వచ్చింది" అని పాదుషాకు అందరిముందూ విన్నవించుకున్నాడు.



"అవునా?  ఏమిటా కల?"

"ఆలంపనా!  గతరాత్రి మీ అబ్బాజాన్ గారైన హుమయూన్ నా కలలోకి వచ్చారు."

అక్బర్ సంతోషపడ్డాడు.  "శభాష్!  నీ రాజభక్తి మెచ్చదగింది" అన్నాడు.

"కానీ, ఆలంపనా" అంటూ రజాక్ నసిగాడు.

అతడి ముఖాన్ని చూసిన అక్బర్‌కు అనుమానం వేసి,  "ఏమైంది రజాక్? మా అబ్బాజాన్‌కు ఏమైనా సమస్య వచ్చిందా?" అని అడిగాడు.

"జీ, ఆలంపనా" అన్నాడు రజాక్.  
"జన్నత్‌లో మీ అబ్బాజాన్ దిగులుతో ఉన్నారు.  తమకు ఇక్కడ  బీర్బల్ ఉన్నట్లుగా జన్నత్‌లో తనకు ఎవరూ సరైన సలహాదారు లేడని చాల బాధగా ఉన్నారు.  అందువలన వెంటనే బీర్బల్‌ను తన చెంతకు పంపి, ఇక్కడ మీరు వేరొకరిని చూసుకొనవలసిందిగా తమకు చెప్పమన్నారు" అని చెప్పేశాడు .

సభ నిండా హాహాకారాలు చెలరేగాయి.  "యా ఖుదా!  పాదుషా గారి అబ్బాజాన్‌కు ఎంత కష్టం వచ్చింది!" అని అందరూ ముక్తకంఠంతో విచారం వ్యక్తం చేశారు.

పాదుషా తన అబ్బాజాన్ మాటను తప్పక గౌరవించాలని అందరూ ఒత్తిడి చేశారు.

అక్బర్ బీర్బల్ వైపు చూశాడు. 



బీర్బల్ ఠక్కున లేచి నిలబడ్డాడు.  "జహాపనా!  ఈ సభలో మరెవ్వరికీ కలుగని అపురూపమైన అదృష్టం నాకు కలగడం నాకు ఎంతో ఖుషీకీ బాత్.  నేను తప్పకుండా జన్నత్‌కు పోయి మీ అబ్బాజాన్‌కు సలహాదారుగా ఉంటాను.  అయితే నా కుటుంబానికి వీడ్కోలు చెప్పేందుకు గాను నాకు ఒక వారం రోజుల వ్యవధిని ఇవ్వవలసింది" అని కోరాడు.

అక్బర్ అందుకు అంగీకరించాడు.  బీర్బల్ కుటుంబం యావజ్జీవితం సుఖంగా ఉండేందుకు తగినన్ని ధన కనక వస్తు వాహనాలను ముందుగానే ఇచ్చేశాడు.

ఈ వారం రోజులలో బీర్బల్ తన ఇంటి నుంచి పాదుషా తోటలోనికి రహస్యంగా ఒక భూసొరంగం తవ్వించాడు.  

వారం రోజుల తర్వాత తిరిగి వచ్చి, తోటలో ఒక స్థలాన్ని చూపి, "జహాపనా, మీ అబ్బాజాన్‌గారు నాకు కలలో కనబడి, ఇక్కడ నన్ను సజీవంగా పూడ్చిపెట్టమన్నారు.  అలా చేస్తే నేను నేరుగా జన్నత్‌కు చేరుకుంటానట" అని చెప్పాడు.

అక్బర్ అలాగే ఆ ప్రాంతంలో గొయ్యి తవ్వించి అందులో బీర్బల్‌ను దింపించాడు.  దాని పైన పలకలు వేసి అందమైన సమాధిని కట్టించేశాడు.

బీర్బల్ సొరంగం గుండా హాయిగా తన ఇంటికి చేరుకున్నాడు.  ఆరు నెలలు మరీ హాయిగా కడుపులో చల్ల కదలకుండా సెల్ఫ్ ఐసోలేషన్‌లో కాలం గడిపాడు.

తరువాత ఒక శుభముహూర్తాన అక్బర్ తన దర్బారులో ఉండగా విచ్చేశాడు.  ఇంత బారున జులపాలు, గడ్డం పెరిగి ఉన్న బీర్బల్‌ను ఎవరూ వెంటనే గుర్తుపట్టలేకపోయారు.

బీర్బల్ తనను తాను పరిచయం చేసుకునేసరికి గుర్తించిన అక్బర్ ఎంతో ఆనందపడ్డాడు.  

మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోయారు.   కుట్రదారులు భయపడ్డారు. 

బీర్బల్ సభలోని వారందరికీ జన్నత్ లోని అనేక విషయాలను కథలుకథలుగా చెప్పాడు.  బీర్బల్ జన్నత్‌కు వెళ్లి తిరిగి వచ్చాడు అనే విషయం అందరికీ ఖచ్చితంగా తెలిసిపోయింది.  

"బీర్బల్! ముందుగా ఈ విషయం చెప్పు - మా అబ్బాజాన్ గారు కులాసాగా ఉన్నారా?" అని పాదుషా అడిగాడు. 

"అంతా బాగానే ఉంది కానీ జహాపనా" అని బీర్బల్ నసుగుతూ రజాక్ వైపు ఒక చూపు చూశాడు.

ఆ చూపులో ఏం కనిపించిందో ఏమో గాని, రజాక్ నిలువెల్లా గజ గజ వణికి పోయాడు.




"చెప్పు బీర్బల్! అక్కడ మా అబ్బాజాన్ గారికి ఏదైనా ఇబ్బందిగా ఉన్నదా?"

"అవును జహాపనా!" అన్నాడు బీర్బల్, మునివేళ్ళతో తన గడ్డం నిమురుకుంటూ.  

"అదేమి జన్నతో గాని జహాపనా, అక్కడ  ఒక్క హల్లాకు (మంగలి) కూడా లేడు.  నేను కేవలం ఆరు నెలలు మాత్రమే జన్నతులో ఉన్నానా?  అయినా నా గడ్డం చూడండి, ఎంతగా పెరిగిపోయిందో!   అటువంటిది, ఇప్పటికే సంవత్సరాల తరబడి అబ్బాజాన్ గారు జన్నత్‌లో ఉంటూ ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకొని, మీ వ్యక్తిగత హల్లాకు అయిన రజాక్‌ను వెంటనే తన చెంతకు పంపమని మీకు చెప్పవలసిందిగా నాకు హుకం జారీ చేశారు" అని తాపీగా చెప్పాడు.

☠💀☠💀☠💀

ఆ తరువాత ఏమి జరిగిందో చదువరులే తమ తమ ఊహానుగుణంగా తెలుసుకొనగలరు.

🍎నీతి🍎
ఎంత కాలము సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నచో మనకు అంతగా బుద్ధిసూక్ష్మత పెరుగును.  కావున, సెల్ఫ్ ఐసొలేషన్ కాలమును దిగులు చెందక, సంతోషంగా, హాయిగా గడుపుదుము గాక!

Monday, 23 March 2020

భాషలో కూడా DNA ఉంటుంది



ఒక ఆఫ్రికన్ జానపద కథ ఉంది.

ఒక అడవిలో బోయ అనే పిల్లవాడు ఉండేవాడు.  ఒక చిన్న గుడిసెలో అతడు తన తండ్రితోను తల్లితోను పిన్నితోను కలిసి ఉండేవాడు.  

ఆ పిన్ని  నిశ్శబ్దంగా ఉండే రకం కాదు.  ఆ పిల్లవాణ్ణి నిత్యం ఏదో ఒక వంక పెట్టి తిడుతూనే ఉండేది.  

ఒక రోజు బోయ పండ్లను ఏరుకురావడానికి అడవికి వెళ్ళాడు.   ఒక నది ఒడ్డున పండ్లను సేకరిస్తూ ఉండగా అతడికి ఒక వింత జంతువు కనిపించింది.  

బోయ అటువంటి జంతువును ఎన్నడూ చూసి ఎరుగడు.  దాంతో అది ఎటువంటి జంతువో అర్థం చేసుకోలేక భయపడి పండ్లను వదిలి పరుగు పెట్టాడు.  ఆ వింత జంతువు అతడి వెంట పడింది.  అది తన కంటే చాలా వేగంగా పరుగెట్టి తనను సమీపిస్తూ ఉండడంతో బోయ మరింత మరింత భయపడిపోయాడు.  తాను పరుగెత్తి తప్పించుకోలేనని అతడికి అర్థమైంది.  

దాంతో తానే ఆ జంతువును భయ పెడదామని అతడు తన దగ్గర ఉన్న ఒక చిన్నపాటి డప్పును వాయించడం మొదలుపెట్టాడు.  అప్పుడు విచిత్రంగా ఆ జంతువు కూడా పరుగును ఆపేసి నాట్యం చేయడం ప్రారంభించింది.  

బోయ డప్పును వాయిస్తూనే ఉన్నాడు.  ఆ జంతువు నాట్యం చేస్తూనే ఉంది.  డప్పును ఒక్కక్షణం అతడు ఆపి వేసేసరికి మీదకు వస్తోంది.  అందుకని అతను ఆపకుండా డప్పును వాయిస్తూనే ఉండిపోయాడు.  ఆ జంతువు కూడా అలా నాట్యం చేస్తూనే ఉంది.  

అలా సాయంత్రమై చీకటి పడేంతవరకు డప్పు మోగుతునే ఉంది. ఆ  జంతువు నాట్యం చేస్తూనే ఉంది.  పాపం నాట్యం చేసి చేసి అది బాగా అలసిపోయినట్లు కనిపించింది.  దాని కాళ్లు చేతులు నొప్పెడుతున్నట్లు తోచింది.  చాల ఆయాసపడుతోంది.  

బోయకు దాని మీద చాల జాలి కలిగింది.  ఒక్క క్షణం డప్పును మోగించడం ఆపేశాడు.  దాంతో అది బతుకుజీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది.

బోయ ఉత్త చేతులతో ఇంటికి వచ్చాడు.   పిన్ని కోపానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.  నోటికొచ్చినట్లు బోయను తిట్టి పోసింది.  బోయ ఆరోజు పండ్లు లేకుండా వచ్చినందుకు కారణం చెప్పాడు.  

"సరే గొడవ ఎందుకు?  మన పిల్లవాడు బోయ క్షేమంగా వచ్చాడు, అదే చాలు" అన్నాడు తండ్రి.

కానీ పిన్ని నమ్మలేదు.  "బోయ అబద్ధం చెపుతున్నాడు" అంటూ అరిచింది.  "రేపు వీడితోనే కలిసి అడవికి పోదాం.  ఈరోజు వచ్చిన జంతువు రేపు రాదా?  ఈ పిల్లవాడి మాటలు నిజమో అబద్ధమో అప్పుడు తేల్చుకుందాం" అన్నది.

ఆ మరుసటి రోజు అందరూ కలిసి అడవికి వెళ్ళారు.  ఆ జంతువు ఎక్కడా కనబడలేదు.  

"చూశారా? వీడు అబద్ధం చెప్పాడని నాకు ముందే తెలుసును" అంటూ పిన్ని అరిచింది.  

బోయ మౌనంగా నది ఒడ్డున పండ్లను ఏరడం ప్రారంభించాడు.  అంతే!  ఉన్నట్టుండి మరల ఎక్కడనుంచో ఆ వింత జంతువు వచ్చేసింది.  

బోయ గమనించే లోపలే అతడి పిన్నిని తల్లిని తండ్రిని కూడా మింగేసింది.  తరువాత బోయను కూడా మింగేద్దామని ప్రయత్నించింది.

కానీ బోయ ఒడుపుగా తప్పుకున్నాడు.  తన డప్పును తీసి వాయించడం మొదలు పెట్టాడు.  ఆ జంతువు మరల నాట్యం చేయడం ప్రారంభించింది.

బోయ డప్పు కొడుతూనే ఉన్నాడు.  ఆ జంతువు అలా నాట్యం చేస్తూనే ఉంది.  అలా చాలాకాలం జరిగాక జంతువు ఒకవైపు నాట్యం చేస్తూనే డప్పును మోగించడం ఆపమని బోయను ప్రాధేయపడింది.  

"మా అమ్మా నాన్నలను విడిచిపెట్టే దాకా నేను వాయిస్తోనే ఉంటాను" అని బోయ సమాధానం చెప్పాడు.  

చేసేదేమీ లేక ఆ జంతువు అతడి అమ్మానాన్నలను బయటకు కక్కేసింది.  



ఒప్పందం ప్రకారం బోయ డప్పును మోగించడం మానేశాడు.  ఆ జంతువు పారిపోవడం మొదలుపెట్టింది.  

అప్పుడు బోయ తల్లి "డప్పు మోతను ఆపవద్దు" అని చెప్పింది.  "మీ పిన్ని కూడా బయటకు రానీ" అని కోరింది.  

బోయకు అలా జరగడం ఇష్టం లేదు.  అయినప్పటికీ తల్లి కోరికను మన్నించి డప్పును మరలా మోగించడం మొదలుపెట్టాడు.  

ఆ జంతువు నీరసంగా నాట్యం చేయడం మొదలు పెట్టింది.  "మీ అమ్మానాన్నలను తిరిగి ఇచ్చేశానుగా? మరలా ఎందుకు వాయిస్తున్నావు?" అని అడిగింది.

"మా పిన్నిని కూడా నువ్వు పొట్టన పెట్టుకున్నావు కదా? ఆమెను కూడా విడిచిపెట్టు" అని సమాధానం చెప్పాడు బోయ.

చేసేదేమీ లేక ఆ జంతువు ఆమె పిన్నిని కూడా బయటకు కక్కేసింది.

బోయ మోగించడం ఆపేశాడు.  అప్పుడా జంతువు బ్రతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది.  

తరువాత అందరూ కావలసినన్ని పండ్లను ఏరుకొని ఇంటికి తిరిగి వచ్చేశారు.  

ఆ తరువాత ఇన్ని ఇంకెప్పుడు బోయను తిట్టలేదు. అతడిని జీవితాంతం తల్లిదండ్రుల కంటే ఎంతో ప్రేమతో దయతో చూసుకుంది.  
🍎🍎🍎🍎🍎🍎

ఇదీ కథ.

సరే, ఇందులో బోయ అనే పదాన్ని Boje అని వ్రాస్తారు.  దాన్ని మనం బోజే అని పలుకరాదు.  బోయ అని పలకాలిట. (నిజానికి భోజ అనే ప్రకృతిపదానికి బోయ అనేది వికృతిరూపం అని కొన్ని వాదనలు తెలుగుదేశంలో కూడా ఉన్నాయి.  చాల ఆశ్చర్యం కదూ?)   దక్షిణాఫ్రికా క్రికెట్ టీములో ఒకప్పుడు నికీ బోయె అనే ఒక ఆటగాడు ఉండేవాడు.   బోయ అది జర్మన్ పదమట.  దానికి అర్థం ఒక తాడుకు (మోకుకు) కట్టబడి నీళ్లలో తేలుతున్న కర్ర (కొయ్య మొద్దు) అని అర్థమట.  ఈ పదానికి లాటిన్ మూలాలు కూడా ఉన్నాయంటారు.

ఆఫ్రికాలో స్థిరపడిన యూరోప్ తెల్లజాతివారికి బోయర్లని పేరు.  (Boers)  బోయర్ అంటే యోధుడట.  వారు స్థానికులైన ఆటవిక-ఆఫ్రికన్లనుండి ఆ పేరును సంగ్రహించి ఉండవచ్చు. ఇంగ్లండ్ పెత్తనాన్ని సహించలేక వారు చేసిన యుద్ధాలకు ఆంగ్లో-బోయర్ యుద్ధాలంటారు.  

ఇంగ్లీషులో buoy అని వ్రాస్తారు.  పడవలు/నౌకలు కొట్టుకుపోకుండా ఆపే బోయకట్టె అని‌ ఆ పదానికి అర్థం.  విశాఖపట్నంలో పోర్టు దగ్గర వేంకటేశ్వరుని గుడినుండి స్టీమరులో సాగరదుర్గ గుడికి పోయేటపుడు హార్బరు కాలువలో ఈ విధమైన buoy లు కనిపిస్తాయి.



ఆ పదం నుండే buoyant అనే విశేషణం పుట్టుకొచ్చింది.  తేలికపరిచేది/తేలికైనది, ఉత్సాహపరిచేది/ఉత్సాహపూరితమైనది అనే అర్థంలో ఆ పదాన్ని వాడుతారు.  లైఫ్‌బాయ్ సబ్బు ప్రకటన గుర్తుందా?

సరే, మన తెలుగుదేశంలో కూడా బోయ అనే పదం వ్యవహారంలో ఉంది.  జంతువులను వేటాడి జీవించే ఆటవికుడు అనే అర్థంలో వాడుతాం.  దేశ జనాభా పెరిగి నాగరకత (నగరజీవనం) ప్రబలుతున్న కొద్దీ అడవులు నశించిపోతున్నకొద్దీ బోయలు కూడా క్రమంగా నాగరకులైనారు.  ఈనాటికి కూడా వారు భారతదేశమంతటా సమాజంలో అవిభాజ్యంగా ఉన్నారు.  

మాండలిక పదకోశం బోయ అనే పదానికి బెస్తవారు, మత్స్యకారులు అనే అర్థాన్ని కూడా చెబుతోంది.  పడవలు లేకుండా బెస్తవారిని ఎలా ఊహించగలం?  కాబట్టి, బోయలు ఒకప్పుడు చక్కని నౌకలను తయారు చేయగలిగిన పరిజ్ఞానాన్ని (technology) కలిగి ఉండేవారని అర్థం చేసుకోవచ్చు.

రామాయణంలో కూడా అందుకు సాక్ష్యముంది.  ఆటవికుడైన బోయడు ఒకాయన రామునికి ప్రాణమివ్వగల మిత్రుడు.  గుర్తొచ్చిందా?  అతడి పేరు గుహుడు.  నిషాదరాజు (బోయల రాజు)  అతడికి ఐదువందల యుద్ధ నౌకలు ఉండేవట.  (చిన్న పడవలు కావు.)  ఒకొక్క నౌకలో నూరేసి కైవర్తయోధులు (బోయజాతికి చెందిన సైనికులు) ఉండేవారట.  వారు గొప్ప ధనుర్ధారులు కూడా.  వారు అడవులలో పనిబడినవారికి దగ్గరుండి దారి చూపేవారు.  రాముని మాత్రమే కాక, భరతుని సైన్యాన్ని సైతం గంగానదిని దాటించి చిత్రకూటంలో ఉన్న రాముని చెంతకు భరతుని తీసుకుపోయింది వారే.



అంతవరకు ఎందుకు?  స్వయంగా వందే వాల్మీకికోకిలమ్ అని మనం పూజించే మహర్షి పూర్వాశ్రమంలో బోయవాడని, ఋష్యనుగ్రహంతో తారకమంత్రం గ్రహించి తత్ప్రభావం వలన పరమభాగవతుడైనాడని ఐతిహ్యముంది కదా?




మనం పరమపూజ్యంగా భావించే భగవద్గీతను మహాభారతమనే ఇతిహాసపేటికలో భద్రపరచి మనకందించిన వ్యాసమహర్షి ఒక బోయకన్య (మత్స్యకన్య) అయిన సత్యవతి కుమారుడే కదా?  సత్యవతి తండ్రికి దాశరాజు అని వ్యవహారం.  ఆయన కూడా తన జాతికి ఒక రాజే.  నీ కూతురైన సత్యవతిని నాకు రాణిగా ఇవ్వమని శంతనుమహారాజు ఆయనను ప్రాధేయపడ్డాడు.  భీష్మప్రతిజ్ఞ జరిగిన తరువాతగాని, ఆమెను శంతనుడు తన రాణిగా చేసుకొనలేకపోయాడు.  ఆమె ఉపరిచరుడనే వసువు కుమార్తె అట.




అనుమానం రాకూడదు గాని, గంగపుత్రుడైన దేవవ్రతుడు (భీష్ముడు) పూర్వం ఒక బోస్ (వసు/వసువు) కదా?  (చూడండి - వసు>బసు>బోసు>బోష>బోజ>బోయ అంటూ దేశాంతరాల ఉచ్చారణలో మార్పు కలిగే అవకాశం ఉండవచ్చేమో.)  గంగపుత్రుడు అంటే మరలా మత్స్యకారుడే, బెస్తవాడే.

రామాయణకాలానికే బోయనాయకులు చిన్నపాటి రాజ్యాలు ఏలేవారని, తమ సైన్యంతో మహారాజులకు అవసరమైనపుడు తోడ్పడేవారని తెలుస్తోంది.   తెలుగుదేశాలలో వారి నివాసాలను కొట్టం అనేవారు.  తూర్పు చాళుక్యుల శాసనాలలో బోయ అనే ఇంటిపేరు కలిగిన బ్రాహ్మణుల ప్రసక్తి ఉన్నదంటారు.  

గ్రామనాయకుడు అనే అర్థం కలిగిన భోజ అనే పదం బోయగా మారిందని కొందరి వాదన.  కుంతిదేవిని పెంచుకున్నది భోజుడే.  కాళిదాసును పోషించిన భోజరాజు కథలు ప్రసిద్ధాలు.  మహాభారతకాలం నాటికి విదర్భరాజులకు భోజులు అని వ్యవహారం.  రుక్మిణి భోజకన్య.  ఆమె శ్రీకృష్ణుని పట్టపురాణి.  ఆమెను కృష్ణుడు ఎత్తుకొచ్చి మరీ పెండ్లి చేసుకున్నాడు.  వివాహవయస్సు వచ్చినప్పటికీ చాలకాలం పెళ్లికాని కన్యకలకు ఆ రుక్మిణీకల్యాణఘట్టాన్ని వింటే వెంటనే వివాహయోగం కలుగుతుందని తత్పఠన/శ్రవణఫలానుకీర్తనం కూడా చేస్తారు.



కాళహస్తిలో తన దైవమైన శివుని కంటె ఎత్తైన కొండపై వెలసిన కణ్ణప్ప కూడా బోయడే కదా?

ఆహా!
ఈ బోయ అనే పదం "ఆటవిక" అనే అర్థంలో భారత-ఆఫ్రికాదేశాలలోను, "మత్స్యకార/నావిక" అనే అర్థంలో భారత-యూరోపు దేశాలలోను ఉండడం గమనిస్తే DNA అనేది మనుషుల శరీరాలలోనే కాక భాషలలో కూడా ఉంటుందని తెలుస్తోంది కదా?


Sunday, 22 March 2020

దానరాజు - ధర్మరాజు

ఈ కథను మీరు కూడా చిన్నపుడు వినే ఉంటారు. మహాభారతంలో ఎక్కడా లేని కథ. అయినా, జానపదులు సృష్టించిన కథ కాబట్టి, మాంచి రసవత్తరంగా ఉంటుంది.

ఒకసారి అర్జునునికి ఒక సందేహం వచ్చిందట.

"కృష్ణా కృష్ణా, మా అన్నను ధర్మరాజు అంటారు. కర్ణుని దానరాజు అంటారు ఈ ఇద్దరిలో ఏ రాజు గొప్ప?" అని అడిగాడు.

"కొన్ని రోజులు ఓపిక పట్టు అర్జునా. అవకాశం రాగానే నీకే ఆ విషయం ప్రత్యక్షంగా తెలిసేలా చేస్తాను" అని కృష్ణుడు చెప్పాడు.

ఎండా కాలం గడిచిపోయింది. వానాకాలం వచ్చింది. ధర్మరాజు రాజుగా ఉన్నాడు కాబట్టి, లోకమంతా మంచి వర్షాలు కురుస్తున్నాయి.

"అర్జునా, పద. వారిద్దరిలో ఎవరు గొప్ప రాజో ఇప్పుడే తెలుసుకుందాం" అని కృష్ణుడు అన్నాడు.

వారిద్దరూ తమను ఎవరూ గుర్తుపట్టకుండా బ్రాహ్మణుల వేషాలు వేసుకొని బయలుదేరారు. మొదటగా వారు ధర్మరాజు దగ్గరకు వెళ్లారు.

"రాజా రాజా, మేము ఒక గొప్ప యజ్ఞం చేయదలచుకున్నాము. అందుకుగాను వేయి మణుగులు గంధపుచెక్క కావాలి. దయచేసి ఇప్పించండి" అని కోరారు.

ధర్మరాజు ఆశ్చర్యపోయి, "వర్షాకాలంలో యజ్ఞాలు చేయడం ఏమిటి? పైగా వేయి మణుగుల గంధపు చెక్కను ఉపయోగించి చేయడమేమిటి? ఇటువంటి యజ్ఞాలను గూర్చి నేను ఎన్నడూ వినలేదే?" అన్నాడు.

"రాజా! అది ఒక రకమైన ప్రత్యేకయజ్ఞం" అని మాత్రమే వారు చెప్పారు.

ధర్మరాజు సరేనని, వేయి మణుగుల గంధపుచెక్క ఎక్కడ దొరికినా తీసుకురమ్మని తన భటులను పంపాడు.

వారు రాజ్యమంతా తిరిగివచ్చి, "మహారాజా! వేయి మణుగులేమిటి? పదివేల మణుగులైనా గంధపుచెక్కకు కొరత లేదు. కానీ ఇపుడు వర్షాకాలం కావడం వల్ల, అంతా తడిచిపోయి లభిస్తుంది. యజ్ఞానికి అవసరమైన పొడి గంధపు చెక్క మాత్రం ఎక్కడా ఒక్క మణుగు కూడా ప్రస్తుతం దొరకటం లేదు" అని విన్నవించారు.

అప్పుడు ధర్మరాజు ఆ బ్రాహ్మణులకు నమస్కారం చేసి, "మహాత్ములారా! మన్నించండి. మీరు వర్షాకాలంలో చేయరాని యజ్ఞాన్ని చేయదలపెట్టారు. అందువలన మీకు ఆ ప్రకృతి సహకరించేలా లేదు. దయచేసి వర్షాకాలం పూర్తి అయిన తరువాత మీరు యజ్ఞం చేయదలచుకుంటే, అపుడు మీ ఇంటికి నేను మీరడిగిన వేయి మణుగుల గంధపుచెక్క తో పాటు మిగిలిన యజ్ఞసంభారాలన్నీ పంపిస్తాను" అని అని వినయంగా పలికాడు.

అపుడు ఆ కపటబ్రాహ్మణవేషధారులు సరేనని చెప్పి అక్కడ నుండి నేరుగా కర్ణుని దగ్గరకు వెళ్లారు.

"రాజా రాజా, మేము ఒక గొప్ప యజ్ఞం చేయదలచుకున్నాము. అందుకుగాను వేయి మణుగులు గంధపుచెక్క కావాలి. దయచేసి ఇప్పించండి" అని కోరారు.

కర్ణుడు సరేనని, వేయి మణుగుల గంధపుచెక్క ఎక్కడ దొరికినా తీసుకురమ్మని తన భటులను పంపాడు.

వారు రాజ్యమంతా తిరిగివచ్చి, "రాజా! వేయి మణుగులేమిటి? పదివేల మణుగులైనా గంధపుచెక్కకు కొరత లేదు. కానీ ఇపుడు వర్షాకాలం కావడం వల్ల, అంతా తడిచిపోయి లభిస్తుంది. యజ్ఞానికి అవసరమైన పొడి గంధపు చెక్క మాత్రం ఎక్కడా ఒక్క మణుగు కూడా ప్రస్తుతం దొరకటం లేదు" అని విన్నవించారు.

కపటబ్రాహ్మణులు నిరాశగా ముఖం పెట్టారు. అది చూసి కర్ణుడు "అయ్యా! ఒక్క క్షణం ఆగండి. మీరు అడిగినది మీకు తప్పక ఇస్తాను" అని పలికాడు.

తరువాత తన భటులను పిలిచి, "భటులారా, భటులారా, నా ఇల్లు శ్రేష్ఠమైన గంధపు చెక్కతో నిర్మించబడింది. వెంటనే దీనిని పడగొట్టి ఈ బ్రాహ్మణులకు అవసరమైనంత గంధపు చెక్కను ఇచ్చి పంపండి" అని ఆజ్ఞాపించాడు.

అది విని అర్జునుడు ఆశ్చర్యపోయాడు.
"ఆహా! ఈ కర్ణుడు ఎంతటి దానతత్పరుడు!" అని భావించి అతడి పట్టుదలను మెచ్చుకున్నాడు.

ఇంతవరకు ఇది జానపదులు అల్లిన ఒక అందమైన కథ.

)))(((

ఇపుడు మనము ఈ కథను మరికొంత పొడిగిద్దాం.

"ఆహా! కృష్ణా! ఈ కర్ణుడు ఎంతటి దానతత్పరుడు!" అని అర్జునుడు పలికాడు.

"అయితే మీ అన్న అయిన ధర్మరాజు గొప్పవాడా లేక దానరాజు అయిన ఈ కర్ణుడు గొప్పవాడా? నీ సందేహం తొలగిపోయిందా?" అని కృష్ణుడు ప్రశ్నించాడు.

"నిస్సందేహంగా కర్ణుడే గొప్పవాడు కదా?" అని అర్జునుడు తన అభిప్రాయాన్ని తెలిపాడు.

"ఎందువల్ల?"

"బ్రాహ్మణుల కోరికను తీర్చడం కోసం కర్ణుడు తన సొంత ఇంటినే త్యాగం చేశాడు కదా?"

"అయ్యో అర్జునా! కర్ణుడు ఎంతటి విలాసపురుషుడు కాకుంటే తన ఇంటిని గంధపు చెక్కతో కట్టుకున్నాడు? సరే, అది అతడి ధనం, అతడి ఇష్టం. కానీ అతడి ఇంటిలో ఉండేది అతడొక్కడే కాదు. అతడి తల్లిదండ్రులు ఉంటారు. అతడి భార్యాబిడ్డలు ఉంటారు. అతడి పరివారజనం కూడా ఉంటారు. వీరందరికీ సరిపడిన ఆహారపదార్థాలు ఉంటాయి. వీరందరూ ఉపయోగించుకునే వస్త్రాలు పడకలు మొదలైనవి ఉంటాయి. వాటన్నింటినీ విస్మరించి, మంచి వర్షాకాలంలో ఇల్లు పడగొడితే వారందరి గతి ఏమిటి? ఇంటిలో ఉండే ఆ వస్తువులకు పదార్థాలకు రక్షణ ఏముంటుంది? బ్రాహ్మణుల కోరికను తీర్చడం కోసం, తాను దానరాజును అనిపించుకొనడం కోసం అంతమందిని ఇబ్బంది పెట్టడం ధర్మమేనా?" అని కృష్ణుడు అర్జునుని అడిగాడు.

అర్జునుడు ఆలోచనలో పడ్డాడు.

"అర్జునా! దేనిని గూర్చి ఆలోచిస్తున్నావు?"

"నీవు చెప్పిన విషయాన్ని గూర్చే బావా!"

"దానిని గూర్చి తరువాత ఆలోచిద్దువు గాని, ముందు దీనిని గూర్చి ఆలోచన చేయవయ్యా!"

"దేనిని గూర్చి బావా?"

"ఇల్లు పడగొట్టమని కర్ణుడు ఆజ్ఞాపించాడు కదా? ఇదిగో, భటులందరూ వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ, పలుగులు, పారలు, గునపాలు, తట్టలు తెచ్చుకున్నారు. కాసేపట్లో ఇంటిని పడగొట్టేస్తారు. అలా పడగొడుతూ ఉండగానే, ఇంటిని కట్టిన గంధపుచెక్క కూడా వర్షంలో తడిచి పోతుంది. అపుడు ఇలా తడిచిన గంధపు చెక్కను మనం మన యజ్ఞంలో ఎలా ఉపయోగించుకుంటాం?"

"అవును బావా! నిజమే!"

"కాబట్టి, ఏదో ఒక విధంగా దానం చేయాలి, దానరాజును అనిపించుకోవాలి అనే ఉద్దేశం అన్ని సందర్భాలలోనూ మంచిది కాదు. కాలధర్మాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి."

"నిజమే బావా! తెలిసింది."

"ఏమి తెలిసింది?"

"దానరాజుగా ఉండటం కంటే, ధర్మరాజుగా ఉండటం గొప్ప."

"శభాష్ అర్జునా!"

)))(((

ఈ విధంగా పొడిగించిన కథను, హఠాత్తుగా ముగిస్తే బాగుండదు. కాబట్టి,

కృష్ణార్జునులు తమ కపటబ్రాహ్మణవేషాలు విడిచి, తామెవరమో, ఎందుకు వచ్చామో కర్ణుడికి తెలియజేసి, తన ఇంటికి వచ్చి "ఇది కావాలి" అని ఎవరైనా నోరు తెరిచి కోరితే, "వారికి ఆ వస్తువును ఏ విధంగా అయినా ఇచ్చి తీరాలి" అనే అతడి పట్టుదలను మెచ్చుకొని, అతడు తన ఇల్లును పడగొట్టుకొనడం ఆపించి, వారిద్దరూ అతని ఇంట ఒక వారం రోజులపాటు హాయిగా ఆతిథ్యాన్ని స్వీకరించి బయలుదేరారు అని చెప్పడం బాగుంటుంది.

)))(((

అప్పట్లో అది గంధపు చెక్క.
ఇప్పట్లో ఇది ఇసుక.
ధర్మరాజు గొప్పవాడా?
దానరాజు గొప్పవాడా?
⚖️
మరో కథ అవసరమా?
పాత కథ చాలు కదా?

మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
26 అక్టోబర్, 2019
❇️✳️❇️✳️❇️✳️

Thursday, 20 December 2018

అడవిలో అన్యభాష

మనుషుల నడుమ Communication గొప్పేమిట్ట?
అసలు తన తోటి ప్రాణికి సమాచారాన్ని అందజేయలేని జీవజాతి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. మనం జడపదార్థాలుగా పరిగణించే వృక్షజాతులనడుమ కూడా సమాచారవినిమయం జరుగుతుందని జీవశాస్త్రవేత్తలు అంటున్నారు.
తల్లి చిరుత వేటాడినంత చలాకీగా పిల్లచిరుత కూడా వేటాడటం నేర్చుకోగలదు. తండ్రి గ్రద్ద ఎగిరినంత ఎత్తులకు పిల్ల గ్రద్దలు కూడా ఎగురగలవు. మునుపటి తరం పెలికన్లు, ఫ్లెమింగోలలాగానే మరుసటి తరం కూడా ఖండఖండాంతరాలు దాటి వలసలు, రాకపోకలు చేయగలవు.
అయితే
కొన్ని వందల వేల తరాలకు మునుపటి జీవప్రపంచం ఎలా ఉందో అది ఈనాటికీ అలాగే ఉండిపోయింది. జీవప్రపంచంలో మనిషి తన పూర్వీకులకంటె ఎంతగానో అభివృద్ధి చెందాడు. అది మానవజాతికి వరమా శాపమా అనే విషయంలో అనేకమంది అనేకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు.
ఆ విషయం కాసేపు పక్కనుంచితే, మనిషి అభివృద్ధికి మూలకారణాలలో భాష కూడా ఒకటి అనేది నిర్వివాదాస్పదవిషయాలలో ఒకటి. ఒక తరం తమ విజ్ఞానాన్ని మరుసటితరానికి అందించడం భాషవల్లనే సాధ్యమైంది. అదే క్రమాభివృద్ధికి పునాది అంటారు. సరే, ప్రపంచంలో అసంఖ్యాకమైన భాషలున్నాయి. అందులో - ఒక భాషలో కమ్యూనికేట్ చేయగలిగినవారు మాత్రమే అభివృద్ధి చెందుతారు మిగిలిన భాషలలో కమ్యూనికేట్ చేయగలిగినవారు వెనుకబడిపోతారు అనే భావన వ్యాపించడం, దానిని కొందరు రాజకీయకారణాలతోనూ కొందరు వ్యాపారకారణాలతోనూ సమర్థించడం జరుగుతోంది.
మన ఆంధ్రమంత్రి మరికొంత ముందుచూపు కలిగినవారు పాపం! ఆంధ్రులు తమ మాతృభాషను దాని ఖర్మకు దాన్ని వదిలి ఇంగ్లీషుభాషను దత్తమాతృభాషగా స్వీకరిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నంత సీరియస్ గా ఒక జీవో జారీచేశారు. మళ్లీ ఏమైందో వెనక్కు తీసుకున్నామని చెప్పారు గాని, ఇలా తలచుకున్న తక్షణమే గాని, జీవోలు జారీ అయిన మరుక్షణమే గాని భాషను మార్చుకోగల శక్తి మనిషికి తప్ప మరే జంతువుకూ లేదు! దాన్ని అభివృద్ధిచెందినవారి భాషలో adaptability అంటారట!
Existence కోసం Struggle చేయడం ప్రకృతిసహజం.
Struggle చేయడం కోసమే Existence ఉందని దబాయించి నిరూపించడం అధికారదర్పం!
ఓ జంతుప్రపంచపు అధికారదర్పం ఎలా ఉంటుందో ఈ క్రింది వ్యాసం చదివి మీ అభిప్రాయాన్ని చెప్పండి: 

1
 అనగనగా ఒక అడవి.
ఆ అడవినిండా రకరకాలజంతువులు, రకరకాల పక్షులు.
దానికి ఒక సింహం రాజు.
ఉన్నట్టుండి ఆ రాజుగారికి తన ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో తెలుసుకుందామనిపించింది.  నిజాలు తెలుసుకొనేసరికి ఆ రాజుగారికి తన ప్రజలమీద అమితమైన జాలి కలిగింది. 
 తనలా అవేమీ కూడా ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి తినటం లేదు!  కోతులు ఏవో దొరికిన పండ్లను తింటున్నాయి.  పక్షులు గింజలను ఏరుకొని తింటున్నాయి.  వడ్రంగి పిట్టైతే మరీ ఘోరంగా చెట్టులో అంగుళమంగుళం వెతికి పురుగులు పట్టి తింటోంది.  వేగంగా పరుగెత్తగలిగిన లేళ్లు, మంచి బలం కలిగిన కారెనుబోతులు సైతం గడ్డి మేస్తున్నాయి!  తేనెటీగలైతే ఎంతో శ్రమకోర్చి పూవు పూవూ తిరిగి మకరందాన్ని సేకరిస్తున్నాయి.  నక్కలు తొండేబిక్కలకోసం అడవంతా గాలిస్తున్నాయి!  తోడేండ్లు కుందేండ్ల వెనుక పారి పారి సొమ్మసిల్లి పోతున్నాయి.  చిరుతలకు తమను తిప్పలాడించే జింకలను పట్టుకొనేసరికి తల ప్రాణం తోకకొస్తోంది!  ఇలా వివిధవర్గాలకు చెందిన తన  ప్రజల కష్టాలను తెలుసుకున్న సింహరాజుగారి కళ్లనుండి దుఃఖాశ్రువులు జలజలకారాయి.
 అవన్నీ తనలాగా ఏనుగు కుంభస్థలాన్ని ఎందుకు తినలేకపోతున్నాయని ఆలోచించింది.  మేధోమథనం చేయగా చేయగా దానికి ఒకటే తట్టింది!  తాను గర్జించగలదు!  తన గర్జనకే గజరాజులు బెంబేలెత్తిపోతాయి.  మానసికంగా బలహీనపడతాయి.  ఏదో కాస్త నామ్ కే వాస్తే ప్రతిఘటన కనబరచినా, సులువుగానే లొంగిపోతాయి.  కాని, అడవిలో ఉన్న మిగిలిన జంతువులు పక్షులు తనలాగా గర్జించలేవు.  అందువల్ల వాటికి ఏనుగులు లొంగవు.  అవి లొంగటం లేదు కాబట్టి అవన్నీ గత్యంతరం లేక ఏనుగుకుంభస్థలాలనే శ్రేష్టమైన ఆహారాన్ని వదులుకొని వేరే ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి!
 ఇలా సమస్యకు మూలకారణం మిగిలిన జంతువులు సింహంలా గర్జించలేకపోవడమే అని తేలిపోయాక, అయితే ఈ సమస్యను పరిష్కరించేదెలా అని మరలా మేధోమథనం జరిగింది.  చివరకు  సమాధానం దొరికింది.  వెంటనే జంతువులన్నీ అర్జెంటుగా,  సింహంలా గర్జించడం నేర్చుకోవాలని సింహం జీవో పాస్ చేసింది.  ఇప్పటికే గర్జిస్తూ ఉన్నవి తమ గర్జనను కంటిన్యూ చేసుకోవచ్చునని, అలా కానిపక్షంలో జూన్ నుండి సింహగర్జనను మాత్రమే నేర్చుకొని తీరాలని, ఇదంతా అడవిజంతువుల శ్రేయస్సు కోసమే, ఉన్నతమైన బ్రతుకుతెరువుకోసమేనని,  దయచేసి ఈవిషయంలో రాజకీయాలు చేయవద్దని సింహం కోరింది.
 2
 సింహగర్జన జీవో పట్ల అడవిలో సహజంగానే కలకలం రేగింది.  సింహరాజుగారికి ప్రజల పట్ల ఉన్న అవ్యాజమైన ప్రేమకు, ఆ ప్రజల అభివృద్ధికి పాటుపడడంలో ఆయనకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆయన వందిమాగధులు ఆయనను పరిపరివిధముల పొగిడారు.  "అడవిలో అందరూ సింహగర్జనలు మాత్రమే చేస్తే, రకరకాల జంతుజలాల నోట సహజంగా ఉండే శబ్దవైవిధ్యం నశించిపోదా?  ఈ సింహగర్జన జీవో అరణ్యసంస్కృతి అనే మహావృక్షానికి గొడ్డలిపెట్టు" అంటూ కొన్ని ప్రకృతిప్రేమికులైన జంతువులు పక్షులు వాపోయాయి. 
 "నన్ను కమ్మని పాటలు పాడడం మానేసి గర్జించమంటే ఎట్లా?" అని కోకిల కన్నీళ్లు పెట్టుకుంటే "నిజమే!  కోకిల పాటలు లేకుంటే మన అడవిలోనికి వసంతకాలం వచ్చినట్టు ఎలా తెలుసుకొనేది?" అని కొన్ని పక్షులు జంతువులు దాన్ని "అమాయికంగా" సమర్థించాయి.  "నోరు మూసుకోండి!  వసంతమైతే ఏమిటి, చలికాలమైతే ఏమిటి?  మనకు కడుపునిండడం ముఖ్యం గాని, ఏ కాలమైతే మనకెందుకు?" అని మరికొన్ని వాటిని కసిరి నోరుమూయించాయి.
 తాము సింహగర్జన నేర్చుకుంటే ఇకమీదట తొండేబిక్కల బొక్కలను తోడక్కరలేదని, తాము కూడా ఏనుగు కుంభస్థలాన్ని తినొచ్చని నక్కలన్నీ సంబరపడి సింహగర్జన జీవోకు బేషరతుగా మద్దతు ప్రకటించాయి.  దానిని వ్యతిరేకించిన జంతువులపై విరుచుకు పడ్డాయి.  అభివృద్ధివ్యతిరేకులంటూ దుయ్యబట్టాయి.  నక్కల వాదన సమంజసమనిపించి వాటికి తోడేళ్లు చిరుతలు తోడయ్యాయి.
 కుందేళ్లు, జింకలు వంటి గడ్డితినే జంతువులన్నీ ఒక సంఘంగా ఏర్పడి సింహగర్జన జీవోకు తమ సంఘీభావం తెలిపాయి.  ఈ జీవోవల్ల తమను వేటాడే జంతువులకు ఆహారప్రత్యామ్నాయం లభిస్తుందని,  అందువల్ల తమ జాతులకు భద్రత ఏర్పడుతుందని,  ఆ రకంగా తాము అభివృద్ధి చెందగలమని చెప్పి, సింహరాజుగారికి పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశాయి.
 పక్షులు కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని తమకు ఈ జీవో ఎంతవరకు అనుకూలం అని చర్చించుకున్నాయి.  సింహరాజుగారి తరపున సమావేశానికి హాజరైన పదునుముక్కు గ్రద్దమంత్రి మాట్లాడుతూ, "ఇకమీదట పక్షిజాతులు నానాకూతలు కూసి ఎవరికీ లోకువ కానవసరం లేదని, సింహగర్జనను నేర్చుకుంటే ఏ అడవికి పోయినా అందరూ గౌరవిస్తారని" నచ్చజెప్పడంతో జీవోకు పక్షుల మద్దతు కూడా లభించింది.
 3
 మరోవైపు ఏనుగులు కూడా అత్యవసరసమావేశం ఏర్పాటు చేసుకున్నాయి.  సింహగర్జన జీవో వెనుక అసలు ఉద్దేశం తమ జాతికి సింహంతో ఉన్న జాతివైరం తప్ప మరొకటి  కారణం కాదని  అభిప్రాయపడ్డాయి.  అడవిలో ఉండే సమస్త జంతుజాలానికి తమ కుంభస్థలపు మాంసమే శ్రేష్ఠాహారమని చెప్పడం అశాస్త్రీయమని, ప్రకృతివిరుద్ధమని, భూమిమీద నడిచే జంతువులన్నిటిలోనూ అతి బలవంతమైన జాతిగా పేరు గడించిన తమపై తక్కిన జంతువులన్నింటినీ మూకుమ్మడిదాడికి ప్రేరేపించే విధంగా జీవో తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.  తమలో ఎవరమైనా ఎప్పుడైనా సింహానికి లొంగితే, దాని గర్జనకు భయపడి కానే కాదని, ఆ సింహంలో ఉండే సత్తాకు మాత్రమే లొంగామని, తాము ఆత్మరక్షణకు పూనుకున్నపుడు దాడికి దిగిన ఎన్నో సింహాలను తమ కాళ్లక్రింద మట్టగించి చంపేసిన సంఘటనలున్నాయని గుర్తు తెచ్చుకున్నాయి.  ఏనుగులే శ్రేష్ఠమైన ఆహారమని చెబుతున్న సింహాలకు కూడా ఆ ఆహారం నిత్యం అందుబాటులో ఉండదని,  అది అటుంచితే  సింహం గర్జిస్తే కొన్ని పిరికి జంతువులు మహా అయితే భయపడతాయేమో కాని లొంగిపోవని, అవి అంత సులువుగా  లొంగిపోయేమాటే గనుక నిజమైతే, జింకలను ఎనుబోతులను వేటాడేందుకు కూడా సింహాలు గుంపులు గుంపులుగా ఎందుకుపోతాయని ప్రశ్నించుకున్నాయి.  ఈనిజాలను అడవిజంతువులన్నటికీ తెలియజేయవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి.
 ఏనుగుల తిరుగుబాటును సింహాలు సహించలేకపోయాయి.  అడవిలో లభించే ఆహారం అడవిజంతువుల ఉమ్మడి సొత్తని, కాని, ఏనుగులు మిగిలిన ఏ జంతువుతో పోల్చినా అత్యధికంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయని, అలా తినడాన్ని అక్రమాహారంగా పరిగణించాలని, ఏనుగుల అక్రమాహారం వల్ల అడవి నాశనం కానున్నదని,  త్వరలోనే అడవిలోని జంతువులకు ఆహారపు కొఱత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, అలా ఆ ఏనుగులు అక్రమంగా తిన్న ఆహారాన్ని తమ కుంభస్థలాల్లో దాచుకున్నాయని, అందువల్ల వాటిని బద్దలుగొట్టి అడవిజంతువులన్నటికీ  పంచేందుకు కృతనిశ్చయులమై ఉన్నామని, ఆ ఉద్దేశంతోనే ఏనుగుల భరతం పట్టేందుకు సింహగర్జన జీవో తెచ్చామని, ఎవరూ ఏనుగుల దుష్ప్రచారాన్ని కల్లబొల్లి ఏడుపులను నమ్మవద్దని సింహాలు ప్రకటించాయి. 
 ఒకవైపు రాజకీయం చేయకండని కోరుతూ స్వయంగా రాజకీయం చేస్తారా అని ఏనుగులు మండిపడ్డాయి. 
4
సింహగర్జన జీవో జారీ అయి చాలా కాలమైంది.  జంతువులు పక్షులు సింహగర్జనను అంత సులువుగా నేర్చుకోలేకపోతున్నాయి.  కాని అనుకరణనిపుణులైన చిలుకలు మైనాలు కొంతవరకు నేర్చుకున్నాయి. సింహరాజుగారు సభలో ఒకసారి ఏదో విషయం అడిగితే అవి సింహగర్జనతోనే బదులు చెప్పాయి.  అది వాటి పొగరని సింహానికి కోపం వచ్చింది.  మిగిలిన జంతువులన్నీ తమలాగే గర్జించడం నేర్చుకుంటే తమ ప్రత్యేకత ఇంకేముంటుందని సింహాలన్నీ సింహరాజుకు మొరపెట్టుకున్నాయి. 
 సింహరాజు నవ్వి,
 "ఉరే అమాయికుల్లారా!  అసలు ఏ జంతువైనా తమ స్వంతభాషను వదిలి పరాయి భాషను మాట్లాడగలదా?  అలాంటివన్నీ మనిషనే వింత జంతువొకటే చేయగలదు.   సింహాసనం మీద ఉన్న నేను ఏదో చేస్తున్నానని అందరికీ అనిపించాలి.  మన ప్రత్యర్థులు మహా అవినీతిపరులని, మన పనులకు వారు అడ్డుపడుతున్నారని దుష్ప్రచారం చేయడానికి మాత్రమే ఈ హడావుడి" అని చిద్విలాసంగా  చెప్పాడు.
(ఈ నా వ్యాసం మునుపు ఏసియానెట్ న్యూస్ లో ప్రచురింపబడింది.)

Tuesday, 18 December 2018

శెట్టూరు వారిదప్ప కథ

ఎర్రనేల చేను. అక్కడ బలిష్ఠులైన వస్తాదుల్లాంటి మనుషులు గునపాలు, పారలు, తట్టలు ముందేసుకుని కూర్చుని ఉన్నారు. వారి మధ్యలో వారిదప్ప దిగులుగా కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కనే అతని భార్య దిగులుగా కూర్చుంది. వారి బిడ్డ వారిద్దరి మధ్య దిగులుగా కూర్చుంది.
ఎవరూ మాట్లాడటం లేదు. అందరూ నిశ్శబ్దంగా మౌనవ్రతం పాటిస్తున్నట్టు ఉన్నారు. ఏమైంది? వారికేమైంది? జరిగిన విషయం తెలుసుకుంటే గాని, వారి అయోమయపు అవస్థ ఏమిటో అర్థం కాదు. పదండి తెలుసుకుందాం.
<><><>

వేసవి కాలం. చిటపటలాడిస్తున్న ఎండ. వేడిగా వీస్తున్న గాలి. క్రింద ఎర్రనేలపై కణకణలాడుతున్న చిన్నా పెద్దా రాళ్లు. నెత్తి మీద ఒక నీళ్ల కడవను మోస్తూ ఆ రాళ్లమీద ఒక స్త్రీ జాగ్రత్తగా నడుచుకుని వస్తోంది. ఆమె ప్రక్కనే ఒక పదేండ్ల పిల్ల కూడా చిన్నపాటి మరో కడవలో నీళ్లు మోసుకొస్తోంది.
ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. "మాట్లాడితే అందుకు వొంట్లో ఉన్న కొంత శక్తి ఖర్చు అవుతుందేమో, దానిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి" అన్న పట్టుదలతో ఉన్నట్లు నిశ్శబ్దంగా నెమ్మదిగా నడుస్తున్నారు.



అప్పుడప్పుడు ఆ పిల్ల, "అమ్మా! మోసి మోసి తలకాయ నస్తా వుంది" అంటే కాసేపు ఆగి, బరువు దించుకుని మరలా తలల మీదికి ఎత్తుకొని బయలుదేరుతున్నారు. పాపం, ఓ చెట్టు క్రింద నీడలోనైనా ఆగుదామంటే, చుట్టుపక్కల అక్కడక్కడ చిన్న చిన్న పొదలే తప్ప, చెట్లే లేవాయెను!
ఇంతలో ఉన్నట్టుండి రాళ్లకు తట్లుకొని ఆ పిల్ల ముందుకు తూలి పడినంత పని అయింది. "ఇట్లైతే దెబ్బలు తగులుతాయి పాపయ్యా, నీకేమన్నా అయితేగిన మీ యప్పకి పానం బోతాది. యాడన్నా ఉన్నీలే, ఆ నీళ్లు పారబోసి ఉత్త కడవ మోసుకురా. నాతానుండే నీళ్లు సాలు" అంది ఆమె.
"లేదమ్మా! ఈట్నుంచి సక్కగా నడుస్తాలే" అంది ఆ పిల్ల.
తల్లి కంట్లో చిన్న నీటి తెర పరచుకుంది. అట్లే తుడుచుకుని ముందుకు నడిచింది. ఆ పిల్ల అనుసరించింది.
ఇంతలో వారికి దూరం నుండి గుఱ్ఱాల డెక్కల చప్పుడు వినిపించింది. ఇద్దరూ ఒక్క క్షణం ఆగి ఆ వైపు చూశారు. ఇద్దరు రౌతులు తమవైపే వస్తూ ఉండటం కనిపించింది.
"ఎవరమ్మా వారు?"
"ఏమో పాపయ్యా!"
వారు చూస్తూ ఉండగానే ఆ రౌతులు వారి వద్దకు వచ్చారు. వారి దగ్గర ఉన్న కత్తులను చూసేసరికి తల్లీకూతుళ్ళిద్దరికీ భయం వేసింది. కానీ వారు మాత్రం వీరి భయాన్ని పోగొట్టేందుకన్నట్టు చిరునవ్వు నవ్వారు. వారి ముఖాలు సౌమ్యంగా, ప్రశాంతంగా ఉన్నాయి. తల్లీకూతుళ్ళిద్దరికీ భయం వేసినంతసేపు పట్టలేదు, ఆ భయం పోవడానికి.
"ఎవరమ్మా మీరు? పాపం చాలా దూరం నుండి నీళ్లు మోసుకువస్తున్నట్టున్నారు?" అన్నాడు వారిద్దరిలో ఒకాయన.
"అవును అన్నా, కరువు కాలం కదా, వానలు పడక మూడేండ్లాయె. పంటల్లేక జనమంతా మా వూరిడిసి పాయిరి. మా చేనితాన నీళ్లు లేవు. వీళ్ళయ్య ఆడ బాయి తోగుతాండాడు. ఆయప్పకి నీళ్లు కొండబోతాండాము."
"బాయి తోగుతాండారా? ఆడ నీళ్లు పడకోకుంటే ఏమి జేస్తారు మడి?" అన్నాడు రెండో ఆయన.
"పడతాయి అన్నా, వీళ్ళయ్యకి నీళ్ల శాస్త్రుము తెలుసు. ఆరు మొట్లులో నీళ్లు పడతాయన్న్యాడు."
"నీళ్ల శాస్త్రం తెలుసునా?" అన్నాడు మొదటి ఆయన. "అయితే నీళ్లు పడతాయా మరి?" అని అడిగాడు చిరునవ్వుతో.
"ఊ, పడతాయి!" అన్నది ఆ చిన్న పిల్ల కళ్ళలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుండగా.
"సరే పదప్పా, ఆ వింత ఏమిటో చూద్దాము మనం కూడా" అన్నాడు మొదటి ఆయన.
***

తన భార్యాబిడ్డలు పరిచయం చేయగా వారిదప్ప తవ్వకం పని కాసేపు ఆపి, ఆ ఆగంతుకులకు స్వాగతం పలికాడు. వారిదప్ప భార్య పరచిన తుంగ చాప మీద ఎండలోనే కూర్చున్నారు వారిద్దరూ.
"ఏమప్పా, నీకు నీళ్ల శాస్త్రం తెలుసునంట కదా! మడి మూడేండ్లనుండి కరువుంటే ముందరే బాయి తోక్కొని ఏంటికి సేజ్జెం సేసుకోకుపోతివి?"
"ఈ సేన్లోనే గాని, ఈ సగాల్లో యేడ్యాడా నీళ్లు లేవు పెద్దయ్యా!
అబుడు ఈ సేనేమో మాది గాకపాయె. ఆటికీ ఈ సేనాయప్పకి సెప్పితి, ఇట్ల ఊరందురుమూ గలిసి ఈ సేన్లాన వొగ బాయి తోక్కొందామప్పా, ఊర్లా సేన్లన్నిటికీ సరిపోయినన్ని నీళ్ళుండాయీడ అని. సెప్పి సెప్పి సాలైపాయ గాని ఈ సేనాయప్ప యినకపాయ, ఊర్లా జనాలు కూడా యినకపాయిరి. అందరూ ఈ మూడేండ్లలో ఊరిడిసి పాయిరి. ఈ సేనాయప్ప పోతా పోతా నాకు ఈ సేను అమ్మిడిసి పాయ. ఇంక నేనొగుణ్ణ్యే ఈడ మిగిలినాను. దానికే, నేనొగుడే బాయి తోగుతుండాను. నీళ్లు బడినంక ఊరిడిసి పోయినోళ్ళందర్నీ మళ్ళీ రమ్మనల్ల. మళ్ళీ మా వూరు మనుషులతో కలకలలాడల్ల!" అన్నాడు వారిదప్ప.
"సరేనప్పా, బాయి తోగుతావు, సరే, కానీ, వానలు రాకుంటే రానురాను ఈ బాయి కూడా యెండిపోదా? అప్పుడేమి సేసేకుంది మడి?"
"పెద్దయ్యా! నిజమే! వానలు రాకుంటే ఎంత పెద్ద బాయిలయినా ఎండిపోతాయి. దానికే మడి, బాగా సెట్లు పెంచల్ల. సెట్లు బాగుండేతలికే వానలు బాగొస్తాయి. నీళ్ళుండేతప్పుడే సెట్లు నాటుకొని వాటిని బాగా సాకల్ల! బాతు ఉంటే గుడ్డు వస్తుంది. గుడ్డు ఉంటే బాతు వస్తుంది. బాతును సంపితే గుడ్డు రాదు, గుడ్డు లేకుంటే బాతూ పుట్టదు. అట్లే, సెట్లుంటే వానలు వస్తాయి, వానలు ఉంటే సెట్లు ఉంటాయి. మా జనాలందరూ శానా తిక్కోళ్లు. సెట్లూ గుట్టలూ కొడతాంటారు. గుట్టలు కొడితే సేజ్జం భూమి ఎక్కువైతాది అనుకుంటారు. సెట్ల నీడ పడితే పంట సరిగా రాదని సెట్లు కొడతారు. ఇట్లా ఊర్లా ఉండే సెట్లూ గుట్టలూ కొట్టి కొట్టి వానలు లేకుండా సేసుకొని, ఇబుడిట్లా ఊరిడిసిపాయిరి సుడి!"
"ఊరికే నీళ్ల శాస్త్రమంటివి, నువు సూస్తే వానలశాస్త్రము కూడా సదివినట్లుండావే వారిదప్పా?"
"వానల శాస్త్రం కాదులే పెద్దయ్యా, ఏదో వానాకాలం చదువుల శాస్త్రం" అన్నాడు వారిదప్ప సిగ్గుపడుతూ.
"సరేనప్పా, ఆరు మొట్ల బాయంటే నువ్వొగుడే తోగేకి యెబుడయ్యీని? అంతకాలుము నీ భార్య, నీ బిడ్డ యిట్ల ఎంతదూరమునుండి నీళ్లు బువ్వ మోసుకురావల్ల?"
"నాదేముందిలే పెద్దయ్యా, గుంత తోగేదొకటే పని. కానీ, వీళ్లదే పాపుము అసలైన కష్టుము" అన్నాడు వారిదప్ప మొగం సన్నది జేసుకొని.
"మా కష్టుము ఏమిలే అన్నా, నీళ్లు మోసుకొచ్చేది మాకు కొత్తపనేమీ గాదు. ఈయప్పే, ఎర్రటి ఎండలో మాడుకుంటా తోగేది సూస్తుంటే మాకు యేమేమో ఐతాది" అన్నది వారిదప్ప భార్య కన్నీళ్లు పెట్టుకుంటా.
"రైతన్నెంక యెండలో బొతుకు జేయక నీడలో గూకుని ఉత్తుత్త మాటల్తో పొద్దుబుచ్చే వాడనుకుంటివా?" అంటూ వారిదప్ప గట్టిగా నవ్వేశాడు. "ఈయమ్మ మాటలకేమిలే పెద్దయ్యా, మంచి ఆకలి పొద్దుకొచ్చినారు. మీరు గూడా రొవంత బువ్వ తినిపొండి." అన్నాడు.
ఆ ఆగంతుకులు సంతోషంగా అందుకు అంగీకరించి, ఆ దంపతుల ఆతిథ్యం స్వీకరించారు. వారు వెళ్ళబోతూ ఇవ్వబోయిన డబ్బును ఆ దంపతులు వద్దంటే వద్దన్నారు. దాంతో మొదటి ఆయన తన మెడలో నున్న ఒక ఖరీదైన ముత్యాలహారాన్ని తీసి వారి కూతురి మెడలో వేశాడు.
"అయ్యో, వద్దన్నా" అని వారిదప్ప భార్య అంటే, "తల్లీ, నువ్వు నన్ను నోరారా అన్నా అన్నావు. మరి ఈ హారం మేనమామ తన మేనకోడలికి ఇచ్చిన కానుక అనుకో" అన్నాడు ఆయన చిరునవ్వుతో.
***

ఆ మరుసటి రోజు పొద్దునే వారిదప్ప, ఆయన భార్యాబిడ్డలు చేనులో తాము బావి తవ్వుతున్న స్థలానికి వచ్చేసరికి అక్కడ చాలామంది మనుషులు బావిని తవ్వే పనిముట్లతో సిద్ధంగా కనిపించారు.
"యెవురయ్యా మీరందరూ? యేమిటికి ఇట్లొచ్చినారు?" అన్నాడు వారిదప్ప వారిని ఆశ్చర్యంగా చూస్తూ.
"సామీ, తిమ్మరాయ ప్రభువులు మీరు ఎట్లా చెబితే అట్లా, ఎంత లోతుకంటే అంత లోతుకు మీ సేనులో బాయి తోగి రమ్మని పంపిచ్చినారు" అన్నాడు ఆ మనుషుల నాయకుడు.
తిమ్మరాయప్రభువంటే కళ్యాణదుర్గం ప్రభువు. వారిదప్ప ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు.
"ఆయప్పకి తాను బాయి తోగుతున్నట్ల ఎట్లా తెలిసింది? తెలిసినా గాని, ఇట్లా మనుషులను పంపిచ్చే అవసరము ఆయప్పకేముంది? ఇంత మంది మనుషులు తనకి సాయం జేస్తే బాగానే ఉంటుంది కానీ, కరువు కాలంలో నీళ్లు పడేదంకన్నా ఇంతమందిని బువ్వ బెట్టి సాకి, నీళ్లు బడినంక వీళ్లికి దుడ్లిచ్చి పంపిచ్చేకి తాను పెద్ద సావుకారేమీ కాదే? అట్లని మీ సాయమేమీ నాకొద్దు, మీ దారిన మీరు పోండప్పా అనేకి వాళ్ళు మామూలు మనుషులు కారే? ప్రభువులు పంపిన మనుషులను వద్దు పొమ్మని తిరస్కరిస్తే ప్రభువులకు ఆగ్రహం రాదా?"
ఆశ్చర్యంతో మొదలైన వారిదప్ప ఆలోచన కాస్త విషాదంగా పరిణమించింది. పాపం, ప్రభువుల అనుగ్రహం కూడా సామాన్యులకు మహాభారం అని ఆ ప్రభువులకు ఎట్లా తెలిసేది?
వారిదప్ప ఏమీ మాట్లాడకుండా, ఏమి చేయాలో, ఎలా చేయాలో కూడా చెప్పకుండా నిశ్శబ్దంగా తలపట్టుకు కూర్చున్నాడు. పాపం, వారిదప్ప భార్య, ఆయన బిడ్డ కూడా ఏమి చేయాలో తెలియక బిక్కు బిక్కు మంటూ అలాగే కూర్చున్నారు. నిన్నటి వరకు ఎవరి సాయమూ లేకపోయినా హాయిగా సాగిన వారి పని, ఇప్పుడు ఇంతమంది సహాయానికి వచ్చినా ముందుకు సాగలేక ఆగిపోయింది. వచ్చిన మనుషులు కూడా ఏం చేయాలో తెలియక అలాగే వారి చుట్టూ కూర్చుండి పోయారు. ఎవ్వరూ ఒకరితో ఒకరు ఏమి మాట్లాడాలో తెలియక సామూహిక మౌనవ్రతం ఆచరిస్తున్న మనుషుల్లా ఉండిపోయారు. అదీ జరిగిన కథ!
<><><>

మధ్యాహ్నసమయానికి వారిదప్ప బిడ్డ తన మెడలో ఉన్న గొలుసును తడుముకుంటూ ఉత్సాహంగా ఒక కేక వేసింది. "అమ్మా! అదిగో మామ వస్తున్నాడు"
దూరంగా వస్తున్న వారిని చూసి చుట్టూ కూర్చున్న మనుషులందరూ లేచి నిలబడ్డారు. వారు దగ్గరకు వచ్చి గుఱ్ఱాలు దిగగానే అందరూ తలలు వంచి, "ప్రభువులకు వందనాలు" అన్నారు.
వారిదప్ప కుటుంబం పొందిన భయసంభ్రమాశ్చర్యాలకు అంతే లేదు. తిమ్మరాయ ప్రభువు దగ్గరకు వచ్చి తన మేనకోడలిని ఎత్తుకున్నాడు. "ఏమి వారిదప్పా? వారికి పని చెప్పకుండా అట్లే కూర్చోబెట్టినావంట?" అన్నాడు నవ్వుతూ.
వారిదప్ప ఏమి మాట్లాడాలో తెలియక వినయంగా నమస్కారం చేసి నిలుచున్నాడు.
"వారిదప్పా! నేటినుండి నీవు రాజోద్యోగివి. ఇకపై నుండి వీరందరూ నీ అనుచరులు. నువ్వు వారిపై అధికారివి. నీకు, మా చెల్లెలికి ఇష్టమైతేనే సుమా! ముందు నీ చేనిలో బావి త్రవ్వకం పూర్తి చేసుకో. చెట్లు నాటు. ఆ తరువాత మన రాజ్యంలో పర్యటించి ఎక్కడ నీరు ఉందని నీకు అనిపిస్తే అక్కడ బావులు తవ్వించడం, చెట్లు నాటించడం నీపని. నీ చేతులమీదుగా మన రాజ్యం హరితసౌభాగ్యాన్ని పొందాలి. అది నా కోరిక!" అన్నాడు తిమ్మరాయ ప్రభువు.
"మహాప్రసాదం ప్రభూ!"
“"సరే, అందరికీ భోజనాలు కూడా తెప్పించాము, ప్రొద్దున నుండి అందరూ ఉపవాసం చేసి పుణ్యం బాగానే సంపాదించారు, ఇప్పుడు భోజనం చేసి కార్యరంగంలోకి ప్రవేశించండి! వారిదప్పా! నువ్వు మొదట చెట్లు నాటించబోయే నీ స్వగ్రామం ఇకపై నుండి "చెట్టూరు" గా పిలవబడుతుంది. మీ యింటిపేరు కూడా చెట్టూరు అవుతుంది!” అన్నారు ప్రభువులు చిరునవ్వు నవ్వుతూ.
"ధన్యుడిని ప్రభూ!" అన్నాడు శెట్టూరు వారిదప్ప.

((గమనిక: కథ కల్పితమే కానీ, కథలో వర్ణించబడిన పరిస్థితులు రాయలసీమలో నిజంగా ఉన్నవేనని, ఆ పరిస్థితులను నివారించేందుకు మన శెట్టూరు వారిదప్ప చెప్పిన విషయాలు పాటించదగినవే అని చదువరులు గ్రహించగలరు.))

Monday, 23 July 2018

సర్వః సగంధేషు విశ్వసితి

ఫలకాలు చెప్పే పాఠాలు – 4
కాళిదాసమహాకవి శకుంతల నోట పలికించిన మాట...
“సగంధ” అనే పదానికి జ్ఞాతి అనే అర్థం చెబుతుంది వాచస్పత్యం.
“ప్రతి ఒక్కరూ తమవారినే విశ్వసిస్తారు.”
నిజమే కదా, అది సహజం.

It is an animal’s instinct.
Birds of the same feather flock together.
Like likes Like.

అది సరే, “తమవారు” అని ఎవరైనా సరే, కొందరిని ఎలా గుర్తుపడతారు?

ప్రాథమికంగా - తాము తినేటటువంటి తిండినే తినే వారిని తమవారని గుర్తుపడతారు...

అర్థం చేసుకొనేందుకు ఆధునికశిక్షణ పొందిన మన మనసు నిరాకరించినా అది చాలవరకు నిజం. 

విస్తారమైన ఆఫ్రికా అడవుల్లో నేషనల్ జాగ్రఫిక్ ఛానెల్ వాళ్ళు జంతువుల మీద తీసిన డాక్యుమెంటరీలు చూడండి...

చిన్నపాటి జింకలు ఒక చోట గడ్డిమేస్తూ ఉంటాయి. వాటికి పక్కనే మరింత పెద్ద కొమ్ముల జింకలు కూడా గడ్డిమేస్తూ ఉంటాయి. ఈ పక్క జీబ్రాలు మేస్తుంటాయి. ఆపక్క అడవి బర్రెలు, దున్నలు మేస్తుంటాయి. ఇవన్నీ వేరు వేరు జాతుల జంతువులు. అయినా ఒకదానిని చూసి మరొకటి భయపడవు. ఇంతలో అక్కడికి వీటన్నింటికన్నా బలమైన ఏనుగుల మంద వస్తుంది. వాటిని చూసి కూడా ఇవేవీ భయపడవు. మరికాసేపట్లో వీటన్నింటికన్నా పొడవైన జిరాఫీలు వస్తాయి. అప్పుడు కూడా ఇవేవీ భయపడవు. ఎందుకంటే, వీటన్నిటికీ ఆహారం సమానమైనదే. గడ్డి, ఆకులు, కొమ్మలు. 

ఇంతలో అక్కడికి ఒక చిన్న నక్క వచ్చిందనుకోండి...
అది కనబడకున్నా పొదలమాటున దాక్కున్నప్పటికీ దాని వాసన తగిలిన వెంటనే జింకలలో అలజడి ప్రారంభమౌతుంది. అవి ప్రశాంతంగా తినలేవు. కంగారుగా దిక్కులు చూస్తాయి. అటూ ఇటూ పరుగెడతాయి. అది సగంధమైనది (సమానమైన వాసన కలిగినది) కాదన్న మాట. సగంధ అనే పదాన్ని మనం ఇక్కడ ఇలా అర్థం చేసుకోవచ్చు.

సరే, ఎందుకు వాటికా భయం అంటే, ఆ నక్క ఆహారం గడ్డి కాదు, వాటికి ఉడతలు తొండేబిక్కలు దొరికితే సరే సరి, లేకుంటే తమలో ఒకదాన్ని ఆ నక్క లాక్కుపోయి పీక్కు తింటుందని ఆ జింకల భయం. ఏ చిరుతపులో వచ్చిందంటే ఇక జీబ్రాలకు బర్రెలకు కూడా భయమే. ఇక సింహాలమంద వచ్చిందంటే ఏకంగా జిరాఫీలు అడవిదున్నలు ఏనుగులలో కూడా భయం కలుగుతుంది. అవి గుంపులు గుంపులుగా దాడి చేస్తూ మొదట తమ చిన్నారులను, తమలోని బలహీనులను ఎత్తుకుపోతాయని వాటికి తెలుసు. సాధ్యమైనంతవరకు పారిపోయి తప్పుకునేందుకే అవి ప్రయత్నిస్తాయి. కొన్ని నిస్సహాయంగా వాటికి దొరికిపోతాయి. కొన్ని రోషంతో ఎదురు తిరిగి, వాటినే చంపేసిన సంఘటనలు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. 

సరే – ఈవిధంగా - ప్రాథమికంగా - తమకంటే భిన్నమైన ఆహారం కలిగినవాటిపై నమ్మకం కలిగి ఉండడం జంతువులలో కుదరదు. మనుషులలో కూడా పూర్వం ఇటువంటి మనస్తత్వం ఉండేదేమో. కాని, రాన్రాను అటువంటి జంతులక్షణాలు తగ్గి ఉంటాయి. 

కాని, ఇప్పటికి కూడా - తాము చేసేటటువంటి పనినే చేసేవారిని, తాము ధరించే దుస్తులవంటి దుస్తులనే ధరించేటటువంటివారిని, తమవంటి అలవాట్లే కలిగినవారిని, తాము పాటించేటటువంటి ఆచారాలనే పాటించేవారిని తమవారిగా మనుషులు సులువుగా నమ్మేస్తారు. వారిని తమ కులస్థులుగా, తమ మతస్థులుగా పరిగణించి వారితో సన్నిహితంగా మెలగడం చూస్తూనే ఉన్నాం. విద్య సార్వజనీనమై ఒకరి భాషను మరొకరు అర్థం చేసుకొనగలిగే స్థాయికి వచ్చాక మానవులందరూ సమానులేనన్న భావన బలపడింది. 

అయినప్పటికీ సమానమైన ఆలోచనలు కలిగినవారు, సమానమైన వ్యవహారాలు నడిపేవారు, సమానమైన కష్టనష్టాలు కలిగినవారు కులమతాల తేడా లేకుండా కలిసి ఒక సమూహంగా ఉండటం ఈ రోజుల్లో చూస్తున్నాము. ఇక్కడ కూడా మరొక అర్థంలో సగంధత కనిపిస్తోంది. ఇక్కడ గంధము అంటే – వాసన – అంటే - ఈ జన్మలోనో పూర్వజన్మలోనో అబ్బిన సంస్కారాలు కొందరిని పరస్పరం మిత్రులను చేస్తాయి అన్నమాట. 

మృగా మృగైః సంగమనువ్రజంతి.
గావశ్చ గోభిః తురగాస్తురంగైః।
మూర్ఖాశ్చ మూర్ఖైః సుధియః సుధీభిః
సమానశీలవ్యసనేన సఖ్యమ్।। 

జింకలు జింకల తోనే కలిసి తిరుగుతాయి. గోవులు గోవులతోనే కలిసి తిరుగుతాయి, గుఱ్ఱాలు గుఱ్ఱాలతోనే కలిసి తిరుగుతాయి. మూర్ఖులు మూర్ఖులతోనే కలిసి తిరుగుతారు. పండితులు పండితులతోనే కలిసి తిరుగుతారు. సమానశీలము, సమానమైన వ్యసనాలు (అంటే కష్టాలు, బాధలు కూడా) కలిగినవారి నడుమ స్నేహం ఏర్పడుతుంది అని పెద్దల మాట. 

“స వానరేంద్రో హృతరాజ్యదారః స రాఘవేంద్రో హృతరాజ్యదారః।
ఏవం తయోరధ్వని దైవయోగాత్ సమానశీలవ్యసనేషు సఖ్యమ్।।“


“ఆ వానరేంద్రుడికి ఆ రాఘవేంద్రుడికి నడుమ స్నేహం కలిసిందన్నా కారణం ఒకటే – వారిరువురి కష్టాలు సమానమైనవి కాబట్టే!” - అని ఒక కవి చమత్కరించాడు. ఇరువురూ రాజ్యం కోల్పోయారు, ఇరువురి భార్యలూ అపహరింపబడ్డారు కదా అంటాడాయన.

ఏదేమైనా, అప్పటికీ, ఇప్పటికీ మనవారు అనేవారిని మనం విశ్వసిస్తాం. 

భారతదేశంలో ఉంటున్నాడనే ఒకే ఒక్క కారణంగా పాకిస్తాన్ని పొగుడుతూ భారత్ ను సవాలు చేస్తున్నా ఓ ఫరూక్ అబ్దుల్లా గాడిని చూసీ చూడనట్టు వాడి మాటలు వినీ విన్నట్టు ఉంటున్నాం కదా. 

ఒట్టు!

అందుకే #చందమామ కథలు చదవమని చెప్పేది!

అనగనగా ఓ రాజు. తగూపడేవారందరికీ తీర్పు చెప్పేకి ఆయనకి సమయం సరిపోవట్లేదు. "ఎలారా బగువంతుడా" అనుకుంటాంటే ఒక మహర్షి వచ్చి ఒక పెద్ద గండ కత్తెర ఇచ్చినాడు.

"ఏమిటికిది మహర్షీ?" అంటే
"తగూపడేవాళ్లని కత్తెర మద్దెలో సేతులు పెట్టి పెమాణం సెయ్యమనండి, ఎవడు అబద్దమాడితే వాడి సెయ్యిని ఇది కత్తిరించేస్తాది" అన్న్యాడు.

దాని సంగతి జనాలకి తెలిసి అసెత్త పెమాణాలు సేసేకి బయపడినారు. అట్లా అదొచ్చినంక తగూలన్నీ ఆగిపొయినై. రాజు హాయిగా కంటినిండా నిద్రపోతుణ్ణ్యాడు.

అయినా ఒగు దినుము ఒగు తగువొచ్చ. 

"నేనీయప్పకి అప్పు ఇచ్చినా. తిరిగీమంటే ఇచ్చేసినా గదా అంటాడీయప్ప" అని మొదుటి పార్టీ అంటాడు.

"అవును, ఆయప్పకీయాల్సింది ఆయప్పకిచ్చేసినా" అంటాడు రెండో పార్టీ.

"ఇంగ లాబం లేదు కత్తిరి నడుమన సెయ్యి పెట్టి పెమాణం సెయ్యండిద్దరూ" అని రాజు ఆదేశమిచ్చినాడు.

ఒగుటోవాడు పెమాణం చేశ. సెయ్యి తెగక పాయ. 

ఇంకేమి, 
"ఉరే ‌రెండో పార్టీ! నువు చెప్పింది అబద్దము గదా? ఆయప్ప నుంచి తీసుకున్న అప్పు ఆయప్పకిస్తావా లేదా?" అని రాజు బెదిరిచ్చ.

"నేనిచ్చేసినా రాజా" అని రెండోపార్టీ మొత్తుకొన్న్యాడు.

"అట్లైతే నువు గూడా పెమాణం సేస్తావా మడి?"

"సేస్తా రాజా!"

"ఉరే రెండో పార్టీ! అన్నాయెంగా నీ సేతులు నరికిచ్చుకుంటావురా!" అనె రాజు జాలిపడి.

"నేనబద్దమాడితే గద రాజా నా సేతులు పొయ్యేది!" అనుకుంటా రెండోపార్టీ లేశ.

"రోంత ఈ కట్టి పట్టుకోప్పా" అని తన సేతికట్టిని మొదటి పార్టీకిచ్చి, కత్తిరి మద్దెలో సేతులు బెట్టి పెమాణం జేశ. "నేను ఈ మొదటిపార్టీకి బాకీ తీర్చేసినాను" అంజెప్ప్య. 

అయినా గాని కత్తిరి ఊరికే ఉండ్య. ఆయప్ప సేతులు కత్తిరీకప్యా. అందురూ ఆచ్చెర్యపాయిరి. 

"రెండు పార్టీలలో ఏదోక పార్టీ అబద్దమాడినట్లే గదా? మడి ఆ కత్తిరి మహిమ కలిగుంటే ఎవరో ఒకరి సేతుల్ని కత్తిరీయల్ల గదా? అట్లా గాలేదంటే ఈ 
కత్తిరిలో మహిమ లేకున్నెట్లే గదా?" అని రాజుకి మంత్రికి జనాలకీ అందరికీ అనుమానమొచ్చ. "మహర్షీ లేదు, మహిమా లేదు తీ, అంతా సుళ్లు" అనబట్రి.

ఈ సంగతి మహర్షికి తెలిశి దడాన వొచ్చిడిశ. రెండు పార్టీలని మళ్లీ పెమాణం చెయ్యమనె. వాళ్లు మళ్లీ అట్లే సేసిరి. అప్పుడా మహర్షి రెండో పార్టీ ఆయప్ప మొదటి పార్టీకిచ్చిన సేతికట్టి తీసుకుని ఇరగ్గొట్టమన్య. రాజబటులు యిరగ్గొట్రి. 

ఆ సేతికట్టి నడమన డొల్ల ఉండ్య. దాంట్లోంచి రెండోపార్టీ మొదటిపార్టీకీయాల్సిన బాకీ దుడ్లు కింద పడ్య. రాజూ మంత్రీ జనాలూ ఆచ్చెర్యపోయిరి. రెండోపార్టీ సిగ్గుతో తలకాయ వొంచుకొనె. 

"ఏమపా ఇప్పుడు మళ్లీ చేస్తావా పెమాణం?" అని అడిగినాడు మహర్షి రెండో పార్టీని. వాడు బయపడి మహర్షి కాళ్లమింద పడె.

మహర్షి సరేలెమ్మని "రాజా నా కత్తిరి నాకిస్తే నే కొండబోతా"ననె. 

"ఏమిటికి మహర్షీ అది మహిమ కలిగిందే కదా" అనె రాజు.

"దానికి మహిమ ఉణ్ణ్యాగాని ఏమి లాబం? మీ మనసుల్లో దానిమింద రోంతన్నా యిశ్వాసం లేకపాయ. ఇంక మీదగ్గర అది వుండేది పూరా దండగ" అంజెప్పి మహర్షి ఆ కత్తిరిని అట్లే కొండబాయ.

***
అదీ కథ!
***

కలియుగంలో కూడా రెండోపార్టీ లాంటి మనుషులు పుడతారు. అక్రమంగా తరతరాలకు సరిపడేంత సంపాదిస్తారు. కాని, రూపాయి కూడా మేము అక్రమంగా సంపాదించలేదు అని నిర్భయంగా దీపాలాపి "పెమాణాలు" సేస్తారు. వాళ్లకేమీ కాదా అని అమాయికులు ఆశ్చర్యపోరాదు.

వాళ్లు సంపాదిచ్చుకున్న భూములు బంగ్లాలు కానుకలు రకరకాల ప్రతిఫలాలు టెక్నికల్‌గా రూపాయి కాదు. మణుగుల కొద్దీ బంగారం, వజ్రాభరణాలు ఎట్సెట్రా ఎట్సెట్రా కూడా అంతే. ఒకవేళ భవిష్యత్తులో కోర్టులో న్యాయమూర్తులు వీటిని కూడా రూపాయలక్రిందే లెక్కేయాలి అని తీర్పు ఇచ్చినా అది అసత్యప్రమాణం కాబోదు. ఎందుకంటే అవన్నీ వారి బినామీల పేరిట ఉంటాయి గాని పెమాణం చేసినవారి పేరిట ఉండవు కాబట్టి.

ఈ నిజాలు నిరూపించడానికి ఇప్పుడు మహర్షులు లేరు. రెండోపార్టీ మనుషులకు అండగా మీడియా అధిపతులు మాత్రం ఉంటారు.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...