Showing posts with label Debate. Show all posts
Showing posts with label Debate. Show all posts

Saturday, 16 July 2022

జనకసభ


                 పూర్వం విదేహరాజ్యాన్ని పరిపాలించే రాజులకు జనకుడు అనే నామాంతరం ఉండేది.  వారిలో ఒకానొక జనక మహారాజు ఒకసారి బహుదక్షిణం అనే పేరు కలిగిన గొప్ప యజ్ఞం చేశాడు.  ఆ యజ్ఞానికి నానా ప్రాంతాల నుండి అనేకమంది వేదపండితులు శాస్త్రపండితులు విచ్చేశారు.  వారిని, వారి అపరిమేయమైన వైదుష్యాన్ని గమనించిన జనకమహారాజు హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది.  ఆ సమయంలోనే అతడికి ఒక జిజ్ఞాస కూడా కలిగింది.  కో ను ఖలు అత్ర బ్రహ్మిష్ఠః?” (వీరందరిలోనూ అతి గొప్ప బ్రహ్మజ్ఞానము కలిగిన వారు ఎవరు?) అని.  కాని, ఆ మాటను నేరుగా ఆ విద్వత్పరిషత్తులోనే అడగటం మర్యాద కాదు.  అందువలన జనకమహారాజు ఒక ఉపాయం చేశాడు.

             తన గోశాలనుండి వేయి మంచి ఆవులను తెప్పించాడు.  ప్రతి ఆవుకు రెండు కొమ్ములు ఉంటాయి కదా.  ఒక్కొక్క కొమ్ముకు ఐదేసి పాదముల బంగారాన్ని కట్టించాడు.  తరువాత అక్కడ చేరిన విద్వత్పరిషత్తును ఉద్దేశించి, “మహాత్ములారా! యో వో యుష్మాకం బ్రహ్మిష్ఠః సః ఏతాః గాః ఉదజతామ్ (మీ అందరిలోనూ అతిశయించిన బ్రహ్మజ్ఞానం ఎవరికి కలదో, వారు ఈ ఆవులను తమ ఇంటికి తోలుకుపోవచ్చును.) అని ప్రకటించాడు.

             అప్పుడు అక్కడున్న వారు ఎవరూ నేనే అందరికంటే గొప్ప బ్రహ్మిష్టుడను అని చెప్పలేక మౌనంగా ఉండి పోయారు.

             అప్పుడు అక్కడున్న యాజ్ఞవల్క్యమహర్షి తన శిష్యుడిని పిలిచి, “ఏతాః సౌమ్య ఉదజ సామశ్రవా3 (సామశ్రవా, ఈ ఆవులను మన ఇంటికి తోలుకుపో నాయనా) అని చెప్పాడు.

             ఆ మాట విన్న పండితులందరికీ చాల కోపం వచ్చింది.  వారిలో అశ్వలుడు ఒకడు.  ఆయన జనక మహారాజు గారి యాజ్ఞికులలో హోత.  త్వం ను ఖలు నో యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠోసి?” (ఓ యాజ్ఞవల్క్యా, మన అందరిలోనూ నువ్వేనా అతి గొప్ప బ్రహ్మవేత్తవు?)  అని తీవ్రంగా అడిగాడు.

             మనలో ఎవరైతే అతి గొప్ప బ్రహ్మిష్ఠుడో అతడికి నా నమస్కారం.  నాకు ఆవుల అవసరం చాలా ఉన్నది.  అందుకనే నేను తోలుకుపోదామని అనుకున్నాను అని యాజ్ఞవల్క్యుడు మందహాసం చేశాడు.

             నీకు ఎంత అవసరం ఉన్నప్పటికీ, ఈ ఆవులు అతి గొప్ప బ్రహ్మవేత్త కోసం ఉద్దేశింపబడ్డాయి.  కాబట్టి మా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి నీవు ఆవులను తీసుకొని పోవచ్చును అని అశ్వలుడు సవాలు చేశాడు.

         యాజ్ఞవల్క్యుడు చిరునవ్వు నవ్వి, సరే ప్రశ్నించండి అని అడిగాడు.

         అశ్వలుడు యజ్ఞానికి, యజ్ఞము చేయించే విధానానికి, యజ్ఞం చేయించేవారికి సంబంధించిన అతి కఠినమైన ప్రశ్నలను వేశాడు.  యాజ్ఞవల్క్యుడు వాటికి అతి సులువుగా సమాధానం చెప్పాడు.  అశ్వలుడు యాజ్ఞవల్క్యుని సమాధానాలను ఆమోదించి, ఇక అడుగవలసిన ప్రశ్నలు తన వద్ద లేవని విరమించుకున్నాడు.

     అప్పుడు జరత్కారువంశీయుడైన కృతభాగుని పుత్రుడైన ఆర్తభాగుడు అనే మహర్షి ప్రశ్నించేందుకు పూనుకున్నాడు.  అతడు గ్రహములను గూర్చి అతిగ్రహములను గూర్చి అడిగిన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు చక్కగా సమాధానం చెప్పాడు.  (ఇక్కడ గ్రహములు అంటే planets కావు.  గ్రహించే వాటిని గ్రహములు అంటారు.). మరణించిన వ్యక్తి ఏమవుతాడు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాడు.  అప్పుడు యాజ్ఞవల్క్యుడు అజేయుడు అని గ్రహించిన ఆర్తభాగుడు మౌనం వహించాడు.

         అప్పుడు లహ్యుని కుమారుడైన భుజ్యుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు.  పారిక్షితుల స్థానాన్ని గూర్చి అతడు అడిగాడు.  (పారిక్షితులు అంటే అశ్వమేధయాగాన్ని చేసిన మహాత్ములు). యాజ్ఞవల్క్యుడు దానికి కూడా సరైన సమాధానం చెప్పాడు.  దాంతో భుజ్యుడు కూడా మౌనం వహించాడు. 

         అప్పుడు చక్రుని కుమారుడైన ఉషస్తి ప్రశ్నించేందుకు ముందుకు వచ్చాడు.  ఆత్మకు సంబంధించిన అతని ప్రశ్నకు కూడా యాజ్ఞవల్క్యుడు సులువుగా సమాధానం చెప్పాడు.  దాంతో ఉషస్తి కూడా తన ప్రయత్నాలను విరమించుకున్నాడు.

         అప్పుడు కుషీతకుని పుత్రుడైన కహోలుడు తన ప్రశ్నలను ప్రారంభించాడు.  అతడు కూడా ఆత్మను గురించి విభిన్నంగా ప్రశ్నించాడు.  యాజ్ఞవల్క్యునినుండి తనకు సరైన సమాధానం లభించడంతో మౌనం వహించాడు.

         అప్పుడు వచక్నుని కుమార్తె అయిన గార్గి తన ప్రశ్నలను ప్రారంభించింది.  వారి మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది -

 

గార్గి

ఒక వస్త్రం దారాలలో ఓత ప్రోతంగా ఎలా వ్యాపించి ఉన్నది కదా, ఆ విధంగా నీరు దేనిలో వ్యాపించి ఉన్నది?”

 

యాజ్ఞవల్క్యుడు

వాయువులో

 

గార్గి

వాయువు దేనిలో వ్యాపించి ఉన్నది?”

 

యాజ్ఞవల్క్యుడు

అంతరిక్షలోకాలలో

 

గార్గి

అంతరిక్షలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

గంధర్వలోకాలలో

 

గార్గి

గంధర్వలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి

 

యాజ్ఞవల్క్యుడు

ఆదిత్యలోకాలలో

 

గార్గి

ఆదిత్యలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

చంద్రలోకాలలో

 

గార్గి

చంద్రలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

నక్షత్రలోకాలలో

 

గార్గి

నక్షత్రలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

దేవలోకాలలో

 

గార్గి

దేవలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

ఇంద్ర లోకాలలో

 

గార్గి

ఇంద్రలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

ప్రజాపతిలోకాలలో

 

గార్గి

ప్రజాపతిలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

బ్రహ్మలోకాలలో

 

గార్గి

బ్రహ్మలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి?”

గార్గి ఆ ప్రశ్నను వేసేసరికి యాజ్ఞవల్క్యుడు ఆమెను కనికరం నిండిన దృష్టులతో చూశాడు.  ఓ గార్గీ, అతిప్రశ్నలను వేయకు. నీ తల ఊడి పడుతుంది అని హెచ్చరించాడు.

         (బ్రహ్మలోకం అనిర్వచనీయమని, అతీంద్రియమని, అవాఙ్మానసగోచరమని శాస్త్రం చెబుతుంది.  ఆ విధంగా కన్నులకు గాని, మనసుకు గాని ఇతర-ఇంద్రియాలకు గాని అందని విషయాన్ని గురించి ప్రశ్నించడాన్ని అతిప్రశ్న అంటారు.  ఎందుకంటే ఇంద్రియాలకు మనసుకు అందని దానిని ఎవరికి వారు స్వీయానుభవంతో తెలుసుకోవాలి.  బ్రహ్మలోకాలను గూర్చి తెలుసుకునేందుకు ఆ విధంగా ప్రయత్నించకుండా అవి ఎలా ఉంటాయి అవి ఎందులో ఉంటాయి అని ప్రశ్నించడమే ఈ సందర్భంలో అతి ప్రశ్న.  అంతేకాక, వేదవాక్కును మించిన ప్రమాణం లేదు.  దానిని పక్కకు త్రోసి అనుమానప్రమాణాన్ని ఆశ్రయించి అది వేదం కంటె గొప్పదనటం కూడా అతి.  ఆ విధంగా వేదాన్ని అతిక్రమించి అనుమానప్రమాణానికి అధికప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్రశ్నిస్తే అప్పుడు కూడా అది అతి ప్రశ్న అవుతుంది.)

         యాజ్ఞవల్క్యుడు అలా చెప్పేసరికి తన పొరపాటున గ్రహించిన గార్గి కూడా మౌనం వహించింది.

         అప్పుడు అరుణపుత్రుడైన ఉద్దాలకుడు ప్రశ్నించడం ప్రారంభించాడు.  ఓ యాజ్ఞవల్క్యా! నాకు సూత్రాత్మగా ఉన్న అంతర్యామిని గూర్చి తెలుసును. నీకు కూడా ఆ అంతర్యామి తెలిసినట్లయితే సరే.  కాని, అంతర్యామిని గూర్చి ఏమీ తెలియకుండా నీవు ఆవులను తీసుకువెళ్లదలిస్తే నీ తల ఊడి పడుతుంది అని హెచ్చరించాడు.  యాజ్ఞవల్క్యుడు అంతర్యామిని గురించి చక్కగా వివరించాడు.  సరైన సమాధానం లభించేసరికి ఉద్దాలకుడు మౌనం వహించాడు.

         అప్పుడు గార్గి మరలా నిలబడింది.  యాజ్ఞవల్క్యుని మరొకసారి ప్రశ్నించేందుకు పండితసభ అనుమతిని కోరింది.  ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పగలిగితే ఇక ఈ సభలో ఎవరూ యాజ్ఞవల్క్యుని ఓడించలేరు.  అటువంటి ప్రశ్న వేసేందుకు మీ అనుమతిని కోరుతున్నాను అని వినయంగా అడిగింది. సభ అందుకు అనుమతినిచ్చింది.  అప్పుడు గార్గి ఈ విధంగా సవాలు చేసింది. 

            ఓ యాజ్ఞవల్క్యా, నేను వేయబోయే ప్రశ్న ధనుస్సును ఎక్కు పెట్టి సంధింపబడి విడుదలకాబోతున్న పదునైన బాణం వంటి ప్రశ్న.  నీ దగ్గర సమాధానం ఉందా?” అని అడిగింది.




             యాజ్ఞవల్క్యుడు మందహాసం చేసి "వెంటనే ప్రయోగించవమ్మా నీ బాణాన్ని" అన్నాడు. 

ద్యు లోకానికి పైన, పృథ్వీలోకానికి క్రిందన, ఏది వ్యాపించి ఉన్నదో, ఈ ధ్యావాపృథ్వీలోకాలకు నడుమ ఏది ఉన్నదో, దేనికి భూతము భవము భవిష్యత్తు (Past, Present, Future) అనేవి ఉండవో, అయ్యది దేనిలో ఓతప్రోతంగా వ్యాపించి ఉన్నది?”

         ఈ విధంగా గార్గి అడిగిన ప్రశ్నను విని అందరూ దిగ్భ్రాంతి చెందారు.  అసలు ఆ ప్రశ్నలోని విషయం కూడా ఊహకు అందదు.  ఇక దానికి సమాధానం ఎవరు చెప్పగలరు అనుకున్నారు.  మునుపు గార్గి వేసిన ప్రశ్న మాటలకు అందనిదైనందున అతి ప్రశ్న అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.  కాని, ఇప్పుడు గార్గి తన మాటలతో వర్ణించినందువలన అది అతి ప్రశ్న కాజాలదు.  యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం వచ్చింది.

         అయితే ఆ విద్వత్పరిషత్తులోని మిగిలిన విద్వాంసులందరూ వేరు, యాజ్ఞవల్క్యుడు వేరు.  అతడికి గార్గి వేసిన ప్రశ్న కరతలామలకంలా అనిపించింది. 

         ఓ గార్గీ, అది ఆకాశంలో వ్యాపించి ఉన్నది అని యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాడు. 

     సభ నిశ్చేష్టమై నిశ్శబ్దంగా మారిపోయింది.  గార్గి మ్రాన్పడిపోయింది.  తన ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు అంత సులువుగా సమాధానం చెబుతాడని ఆమె ఊహించనేలేదు.  నిజానికి ఆమె అడిగినది ఊహాతీతమైన పరబ్రహ్మ గురించి.  పరబ్రహ్మ వర్ణింప వీలుకానిది. కాబట్టి, యాజ్ఞవల్క్యుడు మౌనం వహించాలి.  గార్గి అడిగినది అతిప్రశ్న కాకపోయినప్పటికీ, సమాధానం చెప్పలేక మౌనం వహిస్తే, ఆమె ప్రశ్నకు సమాధానం నావద్ద లేదని యాజ్ఞవల్క్యుడు తన పరాజయాన్ని అంగీకరించినట్లే.  అందువల్ల గార్గి చాల తెలివిగా యాజ్ఞవల్క్యుని ఇరుకున పెడదామని ఆ విధంగా ప్రశ్నించింది.  కాని, ఆమె తన ప్రశ్నలో ఒక పొరపాటు చేసింది.  ద్యావాపృథ్వీలోకాలు అని ఆమె ఉచ్చరించడంతో అవి కేవలం భౌతిక పదార్థాలు మాత్రమే అయినాయి.  అందువల్ల అవి ఆకాశంలో ఉంటాయని యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాడు.  ఆ సమాధానం లౌకికంగానూ శాస్త్రీయంగాను కూడా సత్యమే.  మొదటి సారి నీవు అడిగినది అతిప్రశ్న అయితే రెండవసారి నీవు అడిగిన ప్రశ్న అతి సాధారణమైన ప్రశ్న అన్నట్లుగా యాజ్ఞవల్క్యుడు తేల్చేశాడు.  అంతే కాదు, ఆకాశం కంటె కూడా నీవడగదలుచుకున్న పరబ్రహ్మ మరింత గొప్పది అని పరోక్షంగా తగిన సమాధానం కూడా సూచించాడు.  (తస్మాద్వా ఏతస్మాదాత్మనః ఆకాశః సంభూతః అని తైత్తిరీయవాక్కు.)

         తెల్లబోయిన గార్గి కాసేపటికి తేరుకుని, “ఆ ఆకాశం దేనిలో వ్యాపించి ఉన్నది?” అని అడిగింది.  దానిని అక్షరం అంటారు (అక్షరం = క్షరము కానిది = నాశనం లేనిది) అని యాజ్ఞవల్క్యుడు చెప్పి, దాని స్వరూపం వర్ణింప వీలులేనిది కాబట్టి, నేతి (న+ఇతి) వాదం ప్రకారం సమాధానం చెప్పాడు.  (ఆ అక్షరస్వరూపం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇలా ఉండదు అంటూ వర్ణించాడు.). అటువంటి అక్షరంలో ఈ ఆకాశం వ్యాపించి ఉన్నది అని చెప్పాడు.  గార్గికి తగిన సమాధానం లభించింది.  ఆమె పన్నిన ఉచ్చులో యాజ్ఞవల్క్యుడు ఇరుకున పడలేదు.  తామరతూడు ఏనుగును బంధించలేదు కదా.

ఆ సమాధానం విన్న గార్గి వినమ్రురాలయింది. యాజ్ఞవల్క్యునికి సవినయం నమస్కారం చేసింది.  వినీతులు ఎంతటి జిగీషులైనప్పటికీ, మహాత్ముల చెంత వారి సహజస్వభావం పెల్లుబుకుతూనే ఉంటుంది కదా. అయ్యా పండితులారా! మీరు కూడా ఈయనకు నమస్కారం చేసి, ఈయన మనలో అతి గొప్ప బ్రహ్మవేత్త అని అంగీకరించండి.  సత్యాన్ని అంగీకరిస్తే అది మనకు విజయమే కాని పరాజయం కాదు. మీరెవరు ఈయనను జయింపలేరు అని సభలోని విద్వాంసులతో హితవు పలికింది.

         అయితే గార్గి మాటలను శాకల్యుడు సహించలేకపోయాడు.  తాను కూడా ప్రశ్నించి యాజ్ఞవల్క్యుని పరీక్షిద్దామని ముందుకు వచ్చాడు.

 

శాకల్యుడు

వైశ్వదేవంలో దేవతల సంఖ్య ఎంత?”

 

యాజ్ఞవల్క్యుడు

3306 మంది

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

33 మంది

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఆరుగురు

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ముగ్గురు

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఇద్దరు

 

శాకల్యుడు

సరే, ఎంత మంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఒకటిన్నర మంది

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఒక్కరు

 ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు తాను చెప్పిన ఆయా దేవతల సంఖ్యలను గురించి కూడా చక్కగా వివరించాడు.

         అయినప్పటికీ శాకల్యుడు శాంతించలేదు.  ఏ విధంగానైనా యాజ్ఞవల్క్యుడిని జయించాలనే కోరికతో ప్రశ్న మీద ప్రశ్నలను అడుగుతూ పోయాడు.  (సత్యాన్ని తెలుసుకోవాలని కోరికతో కాకుండా, తనకు సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని ఎంతమాత్రం ప్రతిపాదించకుండా, కేవలం తన ప్రత్యర్థి మాటలను నిరాధారంగా నిష్కారణంగా అసూయతో ఖండిస్తూ వాదించడాన్ని వితండవాదం అంటారు.).

         చివరకు శాకల్యుని దురాగ్రహాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు, ఓ శాకల్యా, నీకు సమాధానం తెలియని ప్రశ్నను నన్ను అడుగవద్దు.  సమాధానం తెలియకుండా నన్ను ప్రశ్నించినట్లయితే నీ తల తెగిపడుతుంది అని హెచ్చరించాడు.  అయినప్పటికీ, శాకల్యుడు తనకు సమాధానం తెలియని ప్రశ్నను అడిగేశాడు.  దాంతో శాకల్యుని తల అందరి సమక్షంలోను తెగి క్రింద పడింది.

      అప్పుడు యాజ్ఞవల్క్యుడు, సభను ఉద్దేశించి, “అయ్యా, మీలో ఇంకా ఎవరెవరు ఏమేమి ప్రశ్నలను అడగదలుచుకున్నారో విడివిడిగా అడగవచ్చు.  లేదా అందరూ కలిసి ఒకే ప్రశ్నను వేయవచ్చు.  నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నాను అని పలికాడు.

         అప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. 

       అప్పుడు యాజ్ఞవల్క్యుడే స్వయంగా పండితపరిషత్తును ఉద్దేశించి ప్రశ్నించాడు.  ఆత్మ అనే పురుషుని వృక్షంతో పోల్చి చెప్పి, చెట్టును వేళ్లతో సహా విత్తనంతో సహా నాశనం చేస్తే ఆ చెట్టు మరల మొలకెత్తదు.  కాని, మన ముందే మరణించి, శరీరం కాల్చివేయబడినప్పటికీ, ఆ వ్యక్తి మరలా జన్మిస్తాడు. (ధ్రువం జన్మ మృతస్య అని శాస్త్రం)  కో న్వేయం జనయేత్ పునః?  (మరణించిన వ్యక్తిని మరలా పుట్టేట్లుగా చేస్తున్న ఆ శక్తి ఏమిటి?) అని అడిగాడు.

     ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు.  యాజ్ఞవల్క్యుడు సభకు నమస్కరించి, ఆవులను తోలుకొని పోయాడు. 

విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్దాతుః పరాయణం తిష్ఠమానస్య తద్విద ఇతి – అని బృహదారణ్యకోపనిషత్తు ఆ శక్తిని గూర్చి చెబుతుంది.  ఆ శక్తి పేరు విజ్ఞానం.  ఆ శక్తి పేరు ఆనందం.  ఆ శక్తి పేరు బ్రహ్మ.  అదే పరమగతి.

 

ఇతి శమ్

Friday, 3 April 2020

నీతో విభేదిస్తున్నాను తిరుమలా




నీతో విభేదిస్తున్నాను తిరుమలా.

కొవ్వొత్తులు వెలిగించమని మోదీ చెబితే తప్పేముందో నాకు అర్థం కాలేదు.

దేశంలోని ప్రజలందరూ సుదీర్ఘమైన లాక్ డౌన్ ఆవశ్యకతను అర్థం చేసుకున్న మాట నిజమే. కాని, అది ఆలస్యంగా ప్రకటించారని కొందరు, అది తమ మతానికి విరుద్ధమంటూ కొందరు రకరకాల అభిప్రాయాలను నిరసన వ్యక్తం చేశారు. ట్రోల్ చేశారు. నిరసనలు చేశారు. తిట్టారు.

అవును. మూర్ఖభక్తులు ఉన్నారు. చప్పట్లు కొట్టమంటే అత్యుత్సాహంతో రోడ్డెక్కి గందరగోళం సృష్టించారు. ఫలితంగా తిట్లు తిన్నారు. ఏం చేస్తాం? అనాదిగా ఇటువంటి కణ్ణప్పలు మన సమాజంలో సహజంగానే ఒక భాగం. మనం వారి మధ్యలో ఉన్నాము. ఇప్పుడు ఆయన కొవ్వొత్తులు వెలిగించమన్నారు. మునుపు తిట్లు తిన్న అనుభవంతో ఇప్పుడు ఎలా చేస్తారో చూడవలసి ఉంది.

మరి కొందరు మేధావులు ఊహించినట్లు మోదీ కొవ్వొత్తులు వెలిగించమంటే ఆయన కరోనాపై పోరాటంలో అలసిపోయి ఇక నాకు చేతకాదని చేతులెత్తేసి రాజీనామా చేస్తున్నట్లు కానే కాదు.

క్రింద ఒక ఫోటో ఇస్తున్నాను చూడు. ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ ప్రజలకు కరోనా సోకిన కేసులు సరాసరి 146 ఉన్నాయి. కాని, 138 మిలియన్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యంత జనసమ్మర్దం కలిగిన మన దేశంలో 1 మిలియన్ ప్రజలలో సరాసరి కేసుల సంఖ్య కేవలం 1.82 గా ఉన్నదంటే అది ఎంతటి గొప్ప Crisis/Disaster Management ఊహించు. అదే ఫోటోలో మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలలో కేసుల సరాసరిని గమనించు. దేశమంతటా ఆపత్కాలంలో తనకు పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయంతో మోదీ చేస్తున్న పోరాటంలోని సమర్థత అర్థమౌతుంది. చూశారా నా ఘనత అని మోదీ చెప్పుకోలేదు. దాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు.

మన ప్రజలకు సహనం చాల ఎక్కువ. కాని, ఆలోచన తక్కువ. ఇంతటి కష్టకాలంలో కూడా నిత్యావసరాలకు కొఱత లేదు. కొందరికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురైనా వెంటనే తగిన చర్యలు తీసుకొనడం జరిగింది. కాని, పనిగట్టుకుని వ్యాధిని వ్యాపింపజేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని తెలియడంతో ఏదో తెలియని ఆందోళనలో భయగ్రస్తులై ఉన్నారు. ఆ శక్తులను నిందిస్తే ప్రపంచప్రళయం వచ్చి సర్వనాశనం జరుగుతుంది కాబట్టి, ఎవరిని తిడితే బాగుంటుందని ప్రత్యామ్నాయం కోసం గాఢంగా ఎదురు చూస్తున్నారు. మోదీ దొరికాడు.

రామభక్తులు భారతీయులు కాజాలరు అని వివాదం రాజేయడానికి ఒక ఒవైసీ ప్రయత్నించాడు. కానీ జనాలు అతనిని చూసీ చూడనట్లు వదిలేశారు. మోదీ కొవ్వొత్తులు వెలిగించమన్నా మీద పడి తిడుతున్నారు. కొవ్వొత్తులే కదా వెలిగించమన్నది? కాని ఆయనేదో కత్తులు తీసుకుని ఎవరినో నరకమన్నంత ఘోరమైన ప్రసంగం చేసినట్లుగా భావించి ఎందుకు ఆయన మీద విరుచుకుపడుతున్నారు? ఎవడికి వాడు మహాకథకుడైై రకరకాల పిచ్చి ఊహలను సృష్టించి, అదే మోదీ ఉద్దేశమని ఆయనకు అంటగడుతున్నారు.

భారతీయత పట్ల మనసు నిండా ద్వేషం ఉంటే దాని గొప్పతనం పట్ల అసూయ ఉంటే ఎవరు ఏమన్నా దానిని ద్వేషించడం వెక్కిరించడం మనకు అలవాటైంది.

స్వచ్ఛభారత్ అంటే నవ్వారు. పరిశుభ్రత గొప్పతనం తెలుసుకోలేని లేదా చెప్పలేని మేధావులు దేశానికి ఎందుకు పనికొస్తారు?

యోగం అంటే నవ్వారు. ప్రపంచంలో ఉండే ప్రతివస్తువూ తన ఇంట్లో ఉండవలసిందే అని భావించే ఆశపోతుజనాలకు దాని గొప్పతనం ఎలా అర్థమౌతుంది?

ఇప్పుడు తన ప్రసంగంలో ఆయన ప్రజలకు ధైర్యం చెప్పారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేశమంతా నిజాముద్దీన్ తబ్లిగీ జమాత్ కారణంగా ఒక వర్గంపట్ల ద్వేషాన్ని పెంటుకుంటూ ఉంటే ఆ టాపిక్ ను డైవర్ట్ చేయడానికి, ప్రజలలో కాస్త శాంతియుతభావాన్ని పెపొందించడానికి (కనీసం తన మాటను మన్నించేవారిలోనైనా) ఆయన అలా చెప్పినట్లు నాకు అనిపించింది.

భారతదేశానికి ఆర్థికమాంద్యం వస్తుందనే నీ ఆందోళన అర్ధం చేసుకొనదగిందే. కాని, ప్రజలంటూ క్షేమంగా ఉంటే ఆ తరువాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు.

కొవ్వొత్తులు వెలిగించడం పాపకార్యమని, అది వెనుకబాటుతనానికి నిదర్శనమని, అలా చేస్తే నవ్వులపాలౌతామని ఎవరైనా భావిస్తే వారు నిరభ్యంతరంగా మానేయవచ్చు. పోలీసులు తలుపు తట్టి అరే నువ్వు ఎందుకు వెలిగించలేదురా అని వారిని బెదిరిస్తారు అనుకోను.

ఎవరి ఇంట్లోనైనా కొవ్వొత్తులు లేకుంటే వెలిగించడం మానేయండి. దానికోసం బయటకు వెళ్లి ప్రమాదంలో ఇరుక్కోకండి అని మాత్రం చెబుదాం. 

Friday, 20 March 2020

తెలుగు మీడియం - ఇంగ్లీషు మీడియం


ఈ క్రింది పళ్లెంలో ఏదో ఒక రకమైన దానిని మాత్రమే మీరు తీసుకోవాలి అని షరతు పెడితే మీరు దేనిని తీసుకుంటారు? 😊

ఒక భాష యొక్క అభివృద్ధి సాధారణంగా ఈ క్రింది వాటిపై ఆధారపడి ఉంటుంది.

1 ఒక భావాన్ని ఇతరులకు స్పష్టంగా తెలియజేయ గలగడం.

2 నిత్య జీవనంలో దైనందినవ్యవహారాలకు ఆటంకం కలిగించక పోవటం.

3 ఒకవైపు ఇతరభాషలకు చెందిన పదాలను స్వాయత్తీకరించుకుంటూనే మరొకవైపు తన ప్రత్యేకతను నిలుపుకొనడం.

4 వినేవారు, పలికేవారు ఉండటం.

5 వ్రాసేవారు, చదివేవారు ఉండటం.

6 తనకంటూ ఒక భూభాగాన్ని కలిగి ఉంటూ అందరిచేత ఆదరింపబడటం.

ఇందులో తెలుగుకు వచ్చిన కొరత ఏమిటి? అన్నీ పుష్కలంగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏమిటి? తెలుగును దోషిగా నిరూపించేందుకు వారు చేస్తున్న ఆరోపణలు ఏమిటి?

ఆరోపణ 1
ఉద్యోగాలు చేసేవారికి తెలుగు పనికిరాదు.

సమాధానం -
ఎంత మంది ఉద్యోగులు ప్రతిరోజు తమ కార్యకలాపాలలో ఇంగ్లీషును వినియోగిస్తున్నారు? ఏ ప్రభుత్వ సంస్థకు వెళ్లిన ఏ ప్రైవేటు సంస్థకు వెళ్లిన అక్కడ అ ఉద్యోగులు పరస్పరం తెలుగు మాట్లాడుకుంటూ ఉండటం వినిపిస్తుంది. వారి చెంతకు వచ్చిన వినియోగదారులు కూడా తెలుగు మాట్లాడుతూనే ఉంటారు. వారితో ఆయా సంస్థల ఉద్యోగులు కూడా తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు. విశాఖపట్నం విజయవాడ వంటి నగరాలలోనే గాక శ్రీకాకుళం చిత్తూరు వంటి పట్టణాల్లోనే గాక, మండలాలలోను గ్రామాలలోను కూడా తెలుగు నిత్యం మాట్లాడబడుతుంది. తెలుగు అవసరం ఉన్నచోట తెలుగు పనికిరాదు అనడం ఋజువులు లేని ఆరోపణ.

ఆరోపణ 2
విదేశీ కంపెనీలలోను, కార్పొరేట్ సంస్థలలోను, ఇంగ్లీషు తప్పనిసరి. కాబట్టి తెలుగు అవసరం అక్కడ ఉండదు.

సమాధానం -
సాధారణంగా ప్రతి పెద్ద సంస్థలోనూ పై స్థాయి, మధ్య స్థాయి, క్రింది స్థాయి ఉద్యోగులు ఉంటారు. పైస్థాయి వారు సాధారణంగా పెట్టుబడిదారులై ఉంటారు. వారు మన రాష్ట్రానికే చెందిన తెలుగువారై ఉంటే ఇటువంటి ఇబ్బంది ఉండదు. అయితే వారు మన ప్రభుత్వాలు ఎర్ర తివాచీ పరచడం వల్ల వచ్చిన ఇతర రాష్ట్రాల వారు లేదా ఇతర దేశాలవారు అయి ఉంటే వారికి తెలుగు రాదు కాబట్టి వారు ఇంగ్లీషులో మాట్లాడతారు. వారితో మధ్యస్థాయి వారు కూడా ఇంగ్లీషు మాట్లాడతారు. అయితే క్రింది స్థాయి వారికి ఇంగ్లీషుతో పనేమీ ఉండదు. మధ్యస్థాయి వారు క్రింది స్థాయి వారితో మాట్లాడేది తెలుగే. పైస్థాయి వారి సంఖ్య, మధ్యస్థాయి వారి సంఖ్య కలిపినప్పటికీ క్రింది స్థాయి ఉద్యోగుల సంఖ్యలో సాధారణంగా 25 శాతం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఎంతటి విదేశీ సంస్థ అయిన ఎంతటి కార్పొరేట్ సంస్థ అయిన తెలుగు మాట్లాడే ఉద్యోగులకు పనులలో చక్కటి నైపుణ్యం ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్ భాష అవసరం లేదు.

ఆరోపణ 3
అయితే మమ్మల్ని ఎప్పటికీ క్రింది స్థాయి ఉద్యోగులుగానే ఉండమంటారా? మధ్యస్థాయి ఉద్యోగులుగా, పై స్థాయి ఉద్యోగులుగా ఎదగవద్దు అంటారా?

సమాధానం -
ఇది ఒక సెంటిమెంటు. ఇది ఒక ఎమోషనల్ స్థాయిభావం. ప్రభుత్వాధిపతి తన ప్రత్యర్థుల నోరు మూయించడానికి కూడా ఇదే పాయింటును వాడుకున్నాడు. ఇదొక బ్రహ్మాస్త్రం. దీనిమీద ఏ విధంగా సమాధానం చెప్పినా అది తమకు వ్యతిరేకం అని ప్రజలు భావించే ప్రమాదం ఉన్నది.

అయ్యా, ఎన్ని యుగాలు మారినా, యంత్రాలు చేయలేని పనిని మనిషి చేయవలసిందే. ఆ పనులు ఈరోజు మీరు చేయవచ్చు రేపు నేను చేయవచ్చు మర్నాడు మరొకడు చేయవచ్చు. మనుషులు మారుతారు తప్ప, ఆ చేసే పనులు లేకుంటే మాత్రం సమాజం నడవదు.

అందరూ ఇంగ్లీషు మాత్రమే మాట్లాడే ఇంగ్లీషు దేశాలలో కూడా ఈ పనులు చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా పైస్థాయి మధ్యస్థాయి క్రింది స్థాయి అనే విభజన ఉన్నది. ఒక్కొక్కప్పుడు పైస్థాయి వాడికంటే అద్భుతమైన ఇంగ్లీషు మాట్లాడగలిగిన వారు క్రింది స్థాయిలో కూడా ఉంటారు కానీ వారు క్రింది స్థాయి మనుషులు చేయవలసిన పనులు చేస్తారు. ఇటువంటి తేడాలు కేవలం మన దేశంలో మాత్రమే ఉన్నట్లు ఇతర దేశాలలో మనుషులంతా సుఖపడి పోతున్నారని భావించవద్దు.

అందువల్ల, ఇక్కడ సమస్య డబ్బు ఉండడం లేదా డబ్బు లేకపోవడం మాత్రమే గాని, భాషాసమస్య కాదు.

డబ్బు ఉన్న వారందరూ కూడా పెట్టుబడిదారులు కాలేరు. వారికి భాష కంటే కూడా ముఖ్యంగా కావలసింది ధైర్యము చొరవ అనుభవము. అవి లేని వాడు అంత ఇంగ్లీషు నేర్చినా ఉపయోగం లేదు. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఆ ధైర్యము చొరవ అనుభవము వస్తాయన్నది భ్రమ. నిజానికి అటువంటి ధైర్యము చొరవ అనుభవము ఉన్నవారికి ఇంగ్లీష్ తనంతట తానుగా వచ్చి ఊడిగం చేస్తుంది.

ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని విఫలమైనవారు ఉన్నారు. తెలుగు మీడియంలో చదువుకొని ఘనవిజయాలను సాధించిన వారు కూడా ఉన్నారు.

ఇంగ్లీషు నేర్చిన వారందరూ ఉన్నతస్థాయికి చేరుకుంటారు అనుకుంటే ఇంగ్లీషు ట్యూషన్లు చెప్పుకుంటూ దీనంగా బ్రతుకుతున్న ఇంగ్లీషుపంతులు గార్లు మన ముందే కనబడుతున్నారు. మరి వారిని ఇంగ్లీషు ఎందుకు ఉన్నత స్థాయికి చేర్చలేకపోయింది?

"ఎవరు ఎటువంటి పనిని చేసినా అందరినీ సమానంగా గౌరవించాలి" అంటూ "డిగ్నిటీ ఆఫ్ లేబర్" పేరిట ఒకప్పుడు వినిపిస్తూ ఉండిన మాటలు ఇప్పుడు వినబడటం లేదు.

అయినప్పటికీ, మీరు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న కొద్దీ, ముందు చెప్పినట్లుగానే మీకు అవసరమైన ఇంగ్లీష్ తనంతట తానుగా వచ్చి మీకు సేవ చేసుకుంటుంది. చిన్నతనం నుండి ఆయా భాషలతో పరిచయం లేకపోయినా ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనులు చేసుకుంటున్న వారికి ఆయా ప్రాంతీయ భాషలు చాలా సులువుగా రావడం మనం చూస్తూనే ఉన్నాం కదా ఇంగ్లీష్ కూడా దీనికి మినహాయింపు కాదు. అదేమీ పిస్తా కాదు. అందువల్ల మనం మన మాతృభాషను వదిలి చిన్నతనం నుండే మనది కాని ఇంగ్లీషును నేర్చుకుంటూ నములుతూ మింగుతూ జీర్ణం చేసుకొనవలసిన అవసరం లేదు.

ఈ విషయం మన అభినవ మెకాలే అయిన ముఖ్యమంత్రి గారితో సహా మహా మహా మేధావులైన వారికి అందరికీ తెలుసు. కానీ ఏవో రహస్య ప్రయోజనాలను ఆశించి వారు అతి దుర్మార్గమైన చర్యకు పూనుకుంటున్నారు.

(నాగాలాండ్ లో నాగాప్రజల మాతృభాషను చంపేసి ఇంగ్లీషును ప్రవేశపెట్టి, ఇంగ్లీషును బోధించేందుకు క్రిస్టియన్ మిషనరీలను అనుమతించి, దాదాపు నాగ ప్రజలందరినీ క్రిస్టియన్లుగా మార్చి వేశారు. ఇప్పుడు నాగాలాండ్ భారతదేశం నుండి విడిపోవాలని, ప్రత్యేకదేశం కావాలని కోరుతున్నారు. ఇక్కడ కూడా అలా జరగదని నమ్మకం ఏమిటి?)

అపోహ -
ఇంగ్లీషు పెద్ద పిస్తా.

సమాధానం -
😆😂🤣
అలాగే అనుకుందాం. కానీ పిస్తా వల్ల అదనపు లాభం ఏమిటి? పిస్తాను రుచి చూసిన వారందరికీ దాని గూర్చి బాగా తెలుసు. దానికంటే గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు పువ్వు గింజలే మంచి రుచిగా ఉంటాయి. మన చెనిక్కాయలతో పోలిస్తే రంగు రుచి పోషక పదార్థాలలో కూడా పిస్తా దిగదుడుపే. అమ్మ చేసిపెట్టే శనగ గుగ్గిళ్ళ ముందు ఈ పిస్తా బలాదూర్ కాదా? మన రాయదుర్గం కొండలమీద విరివిగా దొరికే తీయని సీతాఫలాలు తిన్న తరువాత ఒక పిస్తా గింజను నోట్లో పెట్టి కొరికితే, దానంత చేదుగా మరే ఇతర పదార్థమూ ఉండదు. మన చక్కరకేళి మన అమృతపాణి తిన్న తరువాత పిస్తా గింజను చూస్తేనే రోత పుడుతుంది. మామిడి పండ్లను, జామ పండ్లను నేరేడు పండ్లను తిన్న తరువాత మళ్లీ పిస్తా అవసరమా? పనసతొనలను పనస గింజలను తిన్నంత ఆనందంగా మనం పిస్తా గింజలను తినగలమా?

పిస్తాను తినడం హోదాకు చిహ్నంగా ఎవరైనా భావిస్తే దాన్ని మన భాషలో వగలు పోవడం అంటారు. అసలు పైన చెప్పినవేమీ తినకుండా, కేవలం పిస్తా గింజలను మాత్రమే తిని బ్రతుకుతున్నవారు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా?


తెలుగు మీడియం తప్పేముంది?



అయ్యా ముఖ్యమంత్రి గారూ,

మొదట్లో నిర్బంధపు ఇంగ్లీషు మీడియం నిర్ణయాన్ని ప్రశ్నించేవారు ఎవరైనా సరే, వారందరినీ పేదవారికి శత్రువులుగా చిత్రీకరించారు.

ఇపుడు ప్రశ్నించేవారిని సాక్షాత్తు మీకు (ముఖ్యమంత్రికి) శత్రువులుగా కూడా ప్రకటించేశారా?

అయ్యా, అంతటి ఆగ్రహం ఎందుకు? మేము మీకు వోటు వేసిన వాళ్లము. ఆంధ్రప్రదేశ్ పౌరులము. మీ ప్రజలము. మేము ముఖ్యమంత్రి అభ్యర్థులము కాము. మీకు పోటీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని పార్టీ పెట్టుకుని కూర్చున్నవాళ్లము కాము.

తెలుగు మా మాతృభాష. మీరు మాకు పరిచయం కాకముందే ఈ భాషతో చక్కని పరిచయాన్ని మేము కలిగి ఉన్నాము. అందువలన, మా భాషకు తగిన స్థానం కోసం మేము అడుగుతాము. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. దేశద్రోహం కాదు, రాజద్రోహం కూడా కాదు కదా?

100% ప్రభుత్వ ఉద్యోగాలన్నిటినీ తెలుగులో నాలుగు ప్రావీణ్యాలను (1 వినడం, 2 మాట్లాడటం 3 చదవటం 4 వ్రాయడం) కలిగిన వారికే ఇస్తామని మొదట వాగ్దానం చేయండి. మేము మీ ప్రయోగానికి కొంతకాలం సహకరిస్తాము. అంగీకరిస్తాము.

మీ నిర్బంధపు ఇంగ్లీషు మీడియం ప్రయోగం 100% సఫలమౌతుంది అనే నమ్మకం మీకు ఉన్నదా? అది ఆవిధంగా సఫలమౌతుంది అని నిరూపించేందుకు మీకు ఎంతకాలం కావాలి?

తెలుగు ఒక సబ్జెక్టుగా కొనసాగుతుంది కాబట్టి తెలుగు అందరికీ వస్తుంది అంటున్నారు.

లెక్కలు కూడా ఒక సబ్జెక్టుగా కొనసాగుతుంది కదా? మరి అందరూ లెక్కలలో శ్రీనివాస రామానుజన్ లంతటివారైపోతున్నారా?

సోషల్ స్టడీస్ కూడా ఒక సబ్జెక్టుగా ఉంటోంది కదా? మరి అందరూ తలపండిన రాజకీయవేత్తలు గాని, ఆర్థికవేత్తలుగాని అయిపోతున్నారా?

సైన్సు కూడా ఒక సబ్జెక్టుగా ఉంటోంది కదా? మరి అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతున్నారా?

ఇంగ్లీషు కూడా ఒక సబ్జెక్టుగా ఉంటోంది కదా? వారందరూ షేక్స్‌పియర్లు ఎందుకు కారు?

ఎవరికి ఏ సబ్జెక్టులో అభిరుచి కలుగుతుందో వారు ఆ సబ్జెక్టులో భాషాతీతంగా ఎదగగలరు. అది మీకు తెలియని విషయమా?

మీరు చిన్నతనం నుండి పాలిటిక్స్ అనే సబ్జెక్టు చదవడం వల్లనే ఈ రోజు ముఖ్యమంత్రి కాగలిగారా?

పోనీ, మీరు ఈ రాష్ట్రంలోని అత్యున్నతస్థానమైన ముఖ్యమంత్రి పదవిని అలంకరించారంటే అందుకు కారణం మీకు ఇంగ్లీషు రావడం మాత్రమేనా?

రావాలి జగన్ కావాలి జగన్ అనే పాటను జనాలు ఇంగ్లీషులో విన్నారా?

మీరు చేసిన సుదీర్ఘ పాదయాత్రలో మీరు ప్రజలతో ఇంగ్లీషులో మాట్లాడారా?

మీరు చేసిన ఉపన్యాసాలన్నీ ఇంగ్లీషులోనే చేశారా?

మీరు ముఖ్యమంత్రి అనే అత్యున్నత స్థానానికి ఎదగడానికి మీకు తోడ్పడింది మీ శ్రమ, మీ పట్టుదల, మీ ఓర్పు, మీ దీక్ష. మీ తపన.

మేము వీటిని చూసి మీకు వోట్లు వేశామే గాని, మీరు ఇంగ్లీషు భాషలో ఆయా ఛానెళ్లవారికి ఇచ్చిన ఇంటర్వ్యూలను చూసి కాదు.

అటువంటి శ్రమ, పట్టుదల, ఓర్పు, దీక్ష, తపన ఒక విద్యార్థికి నిజంగా ఉంటే అతడు ఒక గొప్ప డాక్టర్ కావడానికి గాని, ఒక గొప్ప ఇంజనీరు కావడానికి గాని, ఒక గొప్ప మేనేజర్ కావడానికి గాని, ఒక గొప్ప ఆఫీసర్ కావడానికి గాని, ఇంగ్లీషు భాష అనేది నిజంగా ఒక అడ్డంకి అవుతుందా? శ్రమించని వాడికి అసలు ఉన్నత స్థానం పొందే హక్కు ఉందా?

విద్యార్థుల వెనుకబాటుతనానికి చాలా కారణాలున్నాయి.

1.1 అలసత్వం.
సోమరితనం. రేపు చదువుతాను, ఎల్లుండి చదువుతాను అంటూ వాయిదాలు వేస్తూ పోవడం. ఇలాంటి విద్యార్థులు చదువులో రాణించకపోతే అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పా?

1.2 గర్వం.
నేను చాల తెలివైనవాడిని, ఒకటి రెండు క్లాసులకు హాజరు కాకపోయినా స్వంతంగా చదువుకోగలను, పరీక్షలకు నెలరోజుల ముందు చదివితే పికప్ చేయగలను వంటి అతివిశ్వాసం. ఇలాంటి విద్యార్థులు విఫలమైతే అది చిన్నప్పుడు చదివిన తెలుగు మీడియం తప్పా?

1.3 వ్యామోహం.
కొందరికి సినిమా వ్యామోహం. కొందరికి సినిమా నటులమీద వ్యామోహం. కొందరికి రాజకీయనాయకుల పట్ల వ్యామోహం. కొందరికి క్రికెట్ వ్యామోహం. కొందరికి ప్రేమ వ్యామోహం. కొందరికి సోషల్ మీడియా వ్యామోహం. ఇలాంటి విద్యార్థులు విఫలమైతే అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పా?

1.4 చపలత్వం.
కొందరు విద్యార్థులకు ఏకాగ్రత ఉండదు. కాసేపు చదువుకుంటారు. కాసేపు టీవీ చూస్తారు. కాసేపు రోడ్డు మీద పడి తిరుగుతారు. కాసేపు మిత్రులతో ముచ్చట్లు వేస్తారు. కాసేపు ఇంటి పనులు చేస్తారు. వీరు చదువులో రాణించకపోతే అది చిన్నప్పుడు చదివిన తెలుగు మీడియం తప్పా?

1.5 అనాసక్తి.
ప్రతి విద్యార్థి కేవలం సాంకేతికమైన చదువుల కోసమే పుట్టలేదు. కేవలం ఉద్యోగాలు చేయడానికి మాత్రమే పుట్టలేదు. అతడు మంచి సంగీతకారుడు కావచ్చు. గొప్ప ఆటగాడు కావచ్చు. గొప్ప కవి కావచ్చు. రచయిత కావచ్చు. గొప్ప చిత్రకారుడు కావచ్చు. వాళ్ల మనసు తమకు ఇష్టమైన రంగాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. వారిని తీసుకొచ్చి డాక్టర్లుగా ఇంజనీర్లుగా చేస్తామంటూ కాలేజీలలో పడేస్తే, వారికి ఉండే అనాసక్తి వల్ల చదువులో రాణించలేక పోవచ్చు. అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.

1.6 స్వార్థం.
ఒకప్పుడు చక్కగా చదువుకునే ఒక విద్యార్థి, అంత గొప్పగా చదవలేని తన తోటి విద్యార్థులకు ఒక సబ్జెక్టును గురించి వివరించి చెప్పడం, వాటిని గూర్చి చర్చించడం, వారి సందేహాలకు సమాధానం చెప్పడం చేసేవాడు. ఇటువంటివన్నీ మునుపు జరిగేవి. కానీ, ప్రస్తుతం అనారోగ్యకరమైన పోటీ ఉంది. ర్యాంకుల పేరిట రూపొందించబడిన విద్యావిధానం, విద్యార్థులలో వేలం వెర్రిని పెంచడం వలన, ఆ విద్యార్థులు తమ జ్ఞానాన్ని తోటి విద్యార్థులతో పంచుకొనలేకపోతున్నారు. ఇది కూడా చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.

1.7 తప్పుడు మార్గదర్శనం
"ఫలానా సబ్జెక్టు చాలా సులువు, ఒక్కరోజులో, ఓవర్ నైట్ దానిని చదివేసి పరీక్ష పాస్ అయిపోవచ్చు అని కొందరు సీనియర్లు చెబుతుంటారు. మరొక సబ్జెక్టు భూతం. దానిని రాత్రింబగళ్లు ఎంత చదివినా అది అర్థం అయి చావదు. దాంట్లో యావరేజ్ మార్కులు తెచ్చుకొని పాస్ అయిపోతే చాలు". ఇటువంటి మాటల వల్ల జూనియర్ విద్యార్థి ప్రభావితం అవుతూ ఉంటాడు. ఒక్కసారి ఆమాటలు మనసులోకి ఎక్కితే అవి ఒక పట్టాన వదలవు. ఇది కూడా చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం వలన వచ్చే సమస్య కాదు.

పైన చెప్పినవన్నీ విద్యార్థుల యొక్క దోషాలు. ఇప్పుడు అధ్యాపకుల దోషాలను చూడండి.

2.1 ప్రిపరేషన్ లేకపోవడం.
ఒక విషయం ఒక అధ్యాపకునికి చాలా అలా అభిమానపాత్రమైన విషయమై ఉంటుంది. ఈ సబ్జెక్టును మా సారు కళ్ళు మూసుకుని చెప్పగలరు అని విద్యార్థులలో పేరు ఉంటుంది అటువంటి మాటలకు పొంగిపోయి అధ్యాపకుడు ఆ విషయంపై మరింత పరిశోధన చేయడం గాని మరిన్ని కొత్త విషయాలు చెబుదామని గాని ప్రయత్నం చేయడు. ఇది కూడా విద్యార్థి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం దోషం కాదు.

2.2 విషయం దాటవేయడం
కొందరు మంచి తెలివైన విద్యార్థులు ఉంటారు. వారు ప్రశ్నించడం మొదలు పెడితే కొందరు అధ్యాపకులు భయపడతారు కూడా. అందువల్ల వారు అటువంటి విద్యార్థులకు తమ క్లాసులో మాట్లాడే అవకాశం ఇవ్వరు. "ఈ విషయం తర్వాత డిస్కస్ చేద్దాం ఇప్పుడు పాఠం కొనసాగనివ్వు" అని అని సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తారు. ఆ తర్వాత అంటే ఏ తర్వాత? ఆ సందర్భం మళ్లీ రాకపోవచ్చు. ఇది కూడా విద్యార్థి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.

2.3 పాఠానికి సంబంధం లేని విషయాలను ప్రస్తావించడం.
కొందరు అధ్యాపకులకు కేవలం విద్యార్హత ఉంటుంది. కాని, వారికి సబ్జెక్టుపై అవగాహన ఉండదు. క్లాసుకు వచ్చి పాఠానికి అవసరమైన విషయాలు చెప్పడం మాని విద్యార్థులతో పోసుకోలు కబుర్లు చెబుతూ వారిని కవ్విస్తూ నవ్విస్తూ ఆ రోజు క్లాసు అయిపోయింది అనిపిస్తారు. ఇటువంటి వారికి విద్యార్థులలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుంది. మేనేజ్‌మెంటుకు ఆ విషయం తెలిసి కూడా, అటువంటి వారు మరుసటి సంవత్సరం తమ సంస్థలోనికి అడ్మిషన్లు తీసుకురాగలిగిన సమర్థులుగా భావించి వారిని కొనసాగిస్తూ ఉంటారు. ఇటువంటి వారి క్లాసులలో విద్యార్థులకు సబ్జెక్టు రాకపోతే అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.

2.4 అధ్యాపకవృత్తిపై ప్రేమ లేకపోవడం.
కొందరు అధ్యాపకులు తాము తమ తోటి విద్యార్థుల వలె ఇంజనీర్లుగా డాక్టర్లుగా జీవితంలో "సెటిల్" కాలేక పోయామని నిత్యం చింతిస్తూనే ఉంటారు. వారు కేవలం మొక్కుబడిగా మాత్రమే పాఠాలు చెబుతారు. అది అర్థం అయిన వారికి అర్థమైనంత. అర్థం కాకపోతే విద్యార్థులు తమ చిన్నతనంలో చదివిన తెలుగు మీడియం తప్పు కాదు.

2.5 విద్యార్థులకు ఆదర్శంగా నిలబడలేక పోవడం.
ఒక అధ్యాపకుడు తన ప్రవర్తనలో గాని చదువుపై ప్రేమలో గాని తన విద్యార్థులకు ఆదర్శంగా ఉండవలసిన అవసరం ఉన్నది. అతడు ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్నవాడైతే విద్యార్థులు అంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు. అతడికి సబ్జెక్టుపై ఎంత అవగాహన, ఎంత ప్రేమ ఉంటుందో, అదంతా అతడి పాఠాలలో ప్రతిఫలిస్తుంది. అప్పుడు విద్యార్థులకు కూడా ఆ సబ్జెక్టుపై అంతటి ప్రేమాభిమానాలు, అంతటి ఆసక్తి కలుగుతాయి. అధ్యాపకుడు ఆ విధంగా లేకపోతే, విద్యార్థికి నిజంగా నష్టమే. అది చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకొనడం వల్ల జరిగిన తప్పు కాదు.

ఇంకా, దోషాలు కేవలం విద్యార్థులలో అధ్యాపకులలో మాత్రమే కాదు, ఆయా విద్యాసంస్థల యొక్క యజమానులలో కూడా ఉంటాయి.

3.1 తల్లిదండ్రుల మెప్పు కోసం ప్రయత్నించడం.
సంస్థల యొక్క మనుగడ విద్యార్థుల చేరికపై ఉంటుంది. అది తల్లిదండ్రుల యొక్క చేతిలో ఉంటుంది. ఆ తల్లిదండ్రుల నమ్మకాన్ని పొందటం ఆ సంస్థలకు చాలా అవసరం. అందువల్ల తల్లిదండ్రుల గొంతెమ్మ కోరికలు అన్నిటినీ వారు చేతనైనంత వరకు ఆమోదించవలసి ఉంటుంది. వారి కోరికలను సంతృప్తి పరిచేందుకు వీరు అధికప్రాధాన్యతను ఇస్తూ, విద్యార్థులకు పాఠాలు ఎలా చెప్పాలి అనేదానిపై స్వతంత్ర నిర్ణయాలను తీసుకొనలేకపోతున్నారు. చివరగా నష్టం కలిగేది విద్యార్థులకే. ఇది తెలుగు మీడియం వలన జరిగే తప్పు కాదు.

3.2 అధ్యాపకులను నియంత్రించడం.
మేము మీ పిల్లలను "ఇంత" చక్కగా చూసుకుంటాము అని తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన తరువాత ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు అధ్యాపకులకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాయి. ఆలస్యంగా వచ్చినా వారిని ఏమీ అనకండి. హోంవర్క్ చేయకపోయినా రేపు చేసి తీసుకురమ్మని చెప్పండి కానీ కోపపడవద్దు. క్లాసులో ఎవరైనా అల్లరి చేసినా మాట్లాడిన మాకు చెప్పండి గాని, వారిని క్లాసులో నిలబెట్టడం వంటి చిన్న చిన్న శిక్షలు కూడా వేయకండి - ఇలా. ఇలా ఐతే ఎలా? ఇది తెలుగు మీడియం వలన జరిగే తప్పు కాదు.

3.3 అధ్యాపకులను ఇతర పనులకు వినియోగించుకోవడం.
కొన్ని యాజమాన్యాలు తమ అధ్యాపకులను అడ్మిషన్లు తీసుకువచ్చేందుకు పంపిస్తూ ఉంటారు. మరికొందరు అధ్యాపకులను మీడియాతో మాట్లాడేందుకు వినియోగిస్తూ ఉంటారు. మరికొందరు అధ్యాపకులను తమ వాణిజ్య ప్రకటనలను రూపొందించవలసినదిగా కోరుతుంటారు. ఇటువంటి పనులు నిత్యం చేస్తూ ఉంటే చివరకు తమ అసలు పని అయిన విద్యాబోధన కంటే ఈ పనులే ముఖ్యమని వారు భావించేలా చేస్తారు. అందువలన విద్యార్థులకే నష్టం. ఇది తెలుగు మీడియం వలన జరిగే తప్పు కాదు.

3.4 కొందరు అధ్యాపకులను వదులుకోలేకపోవడం.
ముందు చెప్పినట్లుగా కొందరు అధ్యాపకులు క్లాసులో పిల్లలను నవ్వించడం కవ్వించడం చేస్తే వారికి చాల అభిమానపాత్రులైన అధ్యాపకులుగా మారుతారు. (!). వారి వలన మన సంస్థకు ఆకర్షణ పెరిగే మాట నిజమే. అయినప్పటికీ వారు సక్రమంగా పాఠాలు చెప్పలేక పోవడం వలన విద్యలో నాణ్యత లోపిస్తుంది. కానీ అటువంటివారికి విద్యార్థులను ఆకర్షించే శక్తి ఉండటం వలన విద్యాసంస్థలు వారిని వదులుకోలేవు. అందువల్ల విద్యార్థులకు నష్టం. ఇది తెలుగు మీడియం వల్ల జరిగే తప్పు కాదు.

ఈ విధంగా విద్యావ్యవస్థలలో ఎన్నెన్నో లోపాలు ఉన్నాయి. ఎందరెందరిలోనూ ఉన్నాయి. వాటినన్నింటినీ పక్కన పడేసి, వారందరూ నిర్దోషులని, అమాయికులని భావిస్తూ, విద్యార్థులు చదువులో రాణించలేక పోవడానికి ఏకైక కారణం తెలుగు మీడియం మాత్రమే అని, దానిని బలిపశువుగా మార్చి, దానిని గిలెటిన్ యంత్రంలో పెట్టి తల నరికే శిక్ష వేయడం దారుణం.

అయ్యా ముఖ్యమంత్రివర్యా,

విద్యార్థులందరూ తమ తప్పులను తెలుసుకొని, వాటిని సరిదిద్దుకొని, నాలా శ్రమించండి, నాలా ఉన్నత స్థానాన్ని పొందండి అని మీరు విద్యార్థులకు సందేశం ఇవ్వండి.

ఆ విధంగా శ్రమించే విద్యార్థులకు తగిన సమస్త సౌకర్యాలను ఇవ్వండి. అధ్యాపకుల కోసం తరచు సెమినార్లనునిర్వహించండి. సక్రమంగా పాఠాలను చెప్పమని వారికి ప్రబోధించండి. వారి సమస్యలను తీర్చండి. యాజమాన్యాలకు ఏమైనా చిక్కులు ఉంటే వాటిని పరిష్కరించండి. అపుడు అందరూ హర్షిస్తారు. అందరూ సహకరిస్తారు.

అంతే గాని, తప్పులన్నిటినీ కేవలం తెలుగు మీడియం వల్ల జరుగుతున్న తప్పులుగా చిత్రీకరించడం మీ స్థాయిలో ఉన్నవారికి తగదు.

మీరు తెలుగు మీడియాన్ని రద్దు చేయడంపై ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని మీకు శత్రువులుగా భావించడం మీకు మీ ప్రజలకు కూడా శ్రేయస్కరం కాదు.

21 నవంబరునెల, 2019 సంవత్సరం నాటి  లేఖ

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...