Showing posts with label Story. Show all posts
Showing posts with label Story. Show all posts

Saturday, 16 July 2022

జనకసభ


                 పూర్వం విదేహరాజ్యాన్ని పరిపాలించే రాజులకు జనకుడు అనే నామాంతరం ఉండేది.  వారిలో ఒకానొక జనక మహారాజు ఒకసారి బహుదక్షిణం అనే పేరు కలిగిన గొప్ప యజ్ఞం చేశాడు.  ఆ యజ్ఞానికి నానా ప్రాంతాల నుండి అనేకమంది వేదపండితులు శాస్త్రపండితులు విచ్చేశారు.  వారిని, వారి అపరిమేయమైన వైదుష్యాన్ని గమనించిన జనకమహారాజు హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది.  ఆ సమయంలోనే అతడికి ఒక జిజ్ఞాస కూడా కలిగింది.  కో ను ఖలు అత్ర బ్రహ్మిష్ఠః?” (వీరందరిలోనూ అతి గొప్ప బ్రహ్మజ్ఞానము కలిగిన వారు ఎవరు?) అని.  కాని, ఆ మాటను నేరుగా ఆ విద్వత్పరిషత్తులోనే అడగటం మర్యాద కాదు.  అందువలన జనకమహారాజు ఒక ఉపాయం చేశాడు.

             తన గోశాలనుండి వేయి మంచి ఆవులను తెప్పించాడు.  ప్రతి ఆవుకు రెండు కొమ్ములు ఉంటాయి కదా.  ఒక్కొక్క కొమ్ముకు ఐదేసి పాదముల బంగారాన్ని కట్టించాడు.  తరువాత అక్కడ చేరిన విద్వత్పరిషత్తును ఉద్దేశించి, “మహాత్ములారా! యో వో యుష్మాకం బ్రహ్మిష్ఠః సః ఏతాః గాః ఉదజతామ్ (మీ అందరిలోనూ అతిశయించిన బ్రహ్మజ్ఞానం ఎవరికి కలదో, వారు ఈ ఆవులను తమ ఇంటికి తోలుకుపోవచ్చును.) అని ప్రకటించాడు.

             అప్పుడు అక్కడున్న వారు ఎవరూ నేనే అందరికంటే గొప్ప బ్రహ్మిష్టుడను అని చెప్పలేక మౌనంగా ఉండి పోయారు.

             అప్పుడు అక్కడున్న యాజ్ఞవల్క్యమహర్షి తన శిష్యుడిని పిలిచి, “ఏతాః సౌమ్య ఉదజ సామశ్రవా3 (సామశ్రవా, ఈ ఆవులను మన ఇంటికి తోలుకుపో నాయనా) అని చెప్పాడు.

             ఆ మాట విన్న పండితులందరికీ చాల కోపం వచ్చింది.  వారిలో అశ్వలుడు ఒకడు.  ఆయన జనక మహారాజు గారి యాజ్ఞికులలో హోత.  త్వం ను ఖలు నో యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠోసి?” (ఓ యాజ్ఞవల్క్యా, మన అందరిలోనూ నువ్వేనా అతి గొప్ప బ్రహ్మవేత్తవు?)  అని తీవ్రంగా అడిగాడు.

             మనలో ఎవరైతే అతి గొప్ప బ్రహ్మిష్ఠుడో అతడికి నా నమస్కారం.  నాకు ఆవుల అవసరం చాలా ఉన్నది.  అందుకనే నేను తోలుకుపోదామని అనుకున్నాను అని యాజ్ఞవల్క్యుడు మందహాసం చేశాడు.

             నీకు ఎంత అవసరం ఉన్నప్పటికీ, ఈ ఆవులు అతి గొప్ప బ్రహ్మవేత్త కోసం ఉద్దేశింపబడ్డాయి.  కాబట్టి మా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి నీవు ఆవులను తీసుకొని పోవచ్చును అని అశ్వలుడు సవాలు చేశాడు.

         యాజ్ఞవల్క్యుడు చిరునవ్వు నవ్వి, సరే ప్రశ్నించండి అని అడిగాడు.

         అశ్వలుడు యజ్ఞానికి, యజ్ఞము చేయించే విధానానికి, యజ్ఞం చేయించేవారికి సంబంధించిన అతి కఠినమైన ప్రశ్నలను వేశాడు.  యాజ్ఞవల్క్యుడు వాటికి అతి సులువుగా సమాధానం చెప్పాడు.  అశ్వలుడు యాజ్ఞవల్క్యుని సమాధానాలను ఆమోదించి, ఇక అడుగవలసిన ప్రశ్నలు తన వద్ద లేవని విరమించుకున్నాడు.

     అప్పుడు జరత్కారువంశీయుడైన కృతభాగుని పుత్రుడైన ఆర్తభాగుడు అనే మహర్షి ప్రశ్నించేందుకు పూనుకున్నాడు.  అతడు గ్రహములను గూర్చి అతిగ్రహములను గూర్చి అడిగిన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు చక్కగా సమాధానం చెప్పాడు.  (ఇక్కడ గ్రహములు అంటే planets కావు.  గ్రహించే వాటిని గ్రహములు అంటారు.). మరణించిన వ్యక్తి ఏమవుతాడు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాడు.  అప్పుడు యాజ్ఞవల్క్యుడు అజేయుడు అని గ్రహించిన ఆర్తభాగుడు మౌనం వహించాడు.

         అప్పుడు లహ్యుని కుమారుడైన భుజ్యుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు.  పారిక్షితుల స్థానాన్ని గూర్చి అతడు అడిగాడు.  (పారిక్షితులు అంటే అశ్వమేధయాగాన్ని చేసిన మహాత్ములు). యాజ్ఞవల్క్యుడు దానికి కూడా సరైన సమాధానం చెప్పాడు.  దాంతో భుజ్యుడు కూడా మౌనం వహించాడు. 

         అప్పుడు చక్రుని కుమారుడైన ఉషస్తి ప్రశ్నించేందుకు ముందుకు వచ్చాడు.  ఆత్మకు సంబంధించిన అతని ప్రశ్నకు కూడా యాజ్ఞవల్క్యుడు సులువుగా సమాధానం చెప్పాడు.  దాంతో ఉషస్తి కూడా తన ప్రయత్నాలను విరమించుకున్నాడు.

         అప్పుడు కుషీతకుని పుత్రుడైన కహోలుడు తన ప్రశ్నలను ప్రారంభించాడు.  అతడు కూడా ఆత్మను గురించి విభిన్నంగా ప్రశ్నించాడు.  యాజ్ఞవల్క్యునినుండి తనకు సరైన సమాధానం లభించడంతో మౌనం వహించాడు.

         అప్పుడు వచక్నుని కుమార్తె అయిన గార్గి తన ప్రశ్నలను ప్రారంభించింది.  వారి మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది -

 

గార్గి

ఒక వస్త్రం దారాలలో ఓత ప్రోతంగా ఎలా వ్యాపించి ఉన్నది కదా, ఆ విధంగా నీరు దేనిలో వ్యాపించి ఉన్నది?”

 

యాజ్ఞవల్క్యుడు

వాయువులో

 

గార్గి

వాయువు దేనిలో వ్యాపించి ఉన్నది?”

 

యాజ్ఞవల్క్యుడు

అంతరిక్షలోకాలలో

 

గార్గి

అంతరిక్షలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

గంధర్వలోకాలలో

 

గార్గి

గంధర్వలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి

 

యాజ్ఞవల్క్యుడు

ఆదిత్యలోకాలలో

 

గార్గి

ఆదిత్యలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

చంద్రలోకాలలో

 

గార్గి

చంద్రలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

నక్షత్రలోకాలలో

 

గార్గి

నక్షత్రలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

దేవలోకాలలో

 

గార్గి

దేవలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

ఇంద్ర లోకాలలో

 

గార్గి

ఇంద్రలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

ప్రజాపతిలోకాలలో

 

గార్గి

ప్రజాపతిలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

బ్రహ్మలోకాలలో

 

గార్గి

బ్రహ్మలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి?”

గార్గి ఆ ప్రశ్నను వేసేసరికి యాజ్ఞవల్క్యుడు ఆమెను కనికరం నిండిన దృష్టులతో చూశాడు.  ఓ గార్గీ, అతిప్రశ్నలను వేయకు. నీ తల ఊడి పడుతుంది అని హెచ్చరించాడు.

         (బ్రహ్మలోకం అనిర్వచనీయమని, అతీంద్రియమని, అవాఙ్మానసగోచరమని శాస్త్రం చెబుతుంది.  ఆ విధంగా కన్నులకు గాని, మనసుకు గాని ఇతర-ఇంద్రియాలకు గాని అందని విషయాన్ని గురించి ప్రశ్నించడాన్ని అతిప్రశ్న అంటారు.  ఎందుకంటే ఇంద్రియాలకు మనసుకు అందని దానిని ఎవరికి వారు స్వీయానుభవంతో తెలుసుకోవాలి.  బ్రహ్మలోకాలను గూర్చి తెలుసుకునేందుకు ఆ విధంగా ప్రయత్నించకుండా అవి ఎలా ఉంటాయి అవి ఎందులో ఉంటాయి అని ప్రశ్నించడమే ఈ సందర్భంలో అతి ప్రశ్న.  అంతేకాక, వేదవాక్కును మించిన ప్రమాణం లేదు.  దానిని పక్కకు త్రోసి అనుమానప్రమాణాన్ని ఆశ్రయించి అది వేదం కంటె గొప్పదనటం కూడా అతి.  ఆ విధంగా వేదాన్ని అతిక్రమించి అనుమానప్రమాణానికి అధికప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్రశ్నిస్తే అప్పుడు కూడా అది అతి ప్రశ్న అవుతుంది.)

         యాజ్ఞవల్క్యుడు అలా చెప్పేసరికి తన పొరపాటున గ్రహించిన గార్గి కూడా మౌనం వహించింది.

         అప్పుడు అరుణపుత్రుడైన ఉద్దాలకుడు ప్రశ్నించడం ప్రారంభించాడు.  ఓ యాజ్ఞవల్క్యా! నాకు సూత్రాత్మగా ఉన్న అంతర్యామిని గూర్చి తెలుసును. నీకు కూడా ఆ అంతర్యామి తెలిసినట్లయితే సరే.  కాని, అంతర్యామిని గూర్చి ఏమీ తెలియకుండా నీవు ఆవులను తీసుకువెళ్లదలిస్తే నీ తల ఊడి పడుతుంది అని హెచ్చరించాడు.  యాజ్ఞవల్క్యుడు అంతర్యామిని గురించి చక్కగా వివరించాడు.  సరైన సమాధానం లభించేసరికి ఉద్దాలకుడు మౌనం వహించాడు.

         అప్పుడు గార్గి మరలా నిలబడింది.  యాజ్ఞవల్క్యుని మరొకసారి ప్రశ్నించేందుకు పండితసభ అనుమతిని కోరింది.  ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పగలిగితే ఇక ఈ సభలో ఎవరూ యాజ్ఞవల్క్యుని ఓడించలేరు.  అటువంటి ప్రశ్న వేసేందుకు మీ అనుమతిని కోరుతున్నాను అని వినయంగా అడిగింది. సభ అందుకు అనుమతినిచ్చింది.  అప్పుడు గార్గి ఈ విధంగా సవాలు చేసింది. 

            ఓ యాజ్ఞవల్క్యా, నేను వేయబోయే ప్రశ్న ధనుస్సును ఎక్కు పెట్టి సంధింపబడి విడుదలకాబోతున్న పదునైన బాణం వంటి ప్రశ్న.  నీ దగ్గర సమాధానం ఉందా?” అని అడిగింది.




             యాజ్ఞవల్క్యుడు మందహాసం చేసి "వెంటనే ప్రయోగించవమ్మా నీ బాణాన్ని" అన్నాడు. 

ద్యు లోకానికి పైన, పృథ్వీలోకానికి క్రిందన, ఏది వ్యాపించి ఉన్నదో, ఈ ధ్యావాపృథ్వీలోకాలకు నడుమ ఏది ఉన్నదో, దేనికి భూతము భవము భవిష్యత్తు (Past, Present, Future) అనేవి ఉండవో, అయ్యది దేనిలో ఓతప్రోతంగా వ్యాపించి ఉన్నది?”

         ఈ విధంగా గార్గి అడిగిన ప్రశ్నను విని అందరూ దిగ్భ్రాంతి చెందారు.  అసలు ఆ ప్రశ్నలోని విషయం కూడా ఊహకు అందదు.  ఇక దానికి సమాధానం ఎవరు చెప్పగలరు అనుకున్నారు.  మునుపు గార్గి వేసిన ప్రశ్న మాటలకు అందనిదైనందున అతి ప్రశ్న అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.  కాని, ఇప్పుడు గార్గి తన మాటలతో వర్ణించినందువలన అది అతి ప్రశ్న కాజాలదు.  యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం వచ్చింది.

         అయితే ఆ విద్వత్పరిషత్తులోని మిగిలిన విద్వాంసులందరూ వేరు, యాజ్ఞవల్క్యుడు వేరు.  అతడికి గార్గి వేసిన ప్రశ్న కరతలామలకంలా అనిపించింది. 

         ఓ గార్గీ, అది ఆకాశంలో వ్యాపించి ఉన్నది అని యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాడు. 

     సభ నిశ్చేష్టమై నిశ్శబ్దంగా మారిపోయింది.  గార్గి మ్రాన్పడిపోయింది.  తన ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు అంత సులువుగా సమాధానం చెబుతాడని ఆమె ఊహించనేలేదు.  నిజానికి ఆమె అడిగినది ఊహాతీతమైన పరబ్రహ్మ గురించి.  పరబ్రహ్మ వర్ణింప వీలుకానిది. కాబట్టి, యాజ్ఞవల్క్యుడు మౌనం వహించాలి.  గార్గి అడిగినది అతిప్రశ్న కాకపోయినప్పటికీ, సమాధానం చెప్పలేక మౌనం వహిస్తే, ఆమె ప్రశ్నకు సమాధానం నావద్ద లేదని యాజ్ఞవల్క్యుడు తన పరాజయాన్ని అంగీకరించినట్లే.  అందువల్ల గార్గి చాల తెలివిగా యాజ్ఞవల్క్యుని ఇరుకున పెడదామని ఆ విధంగా ప్రశ్నించింది.  కాని, ఆమె తన ప్రశ్నలో ఒక పొరపాటు చేసింది.  ద్యావాపృథ్వీలోకాలు అని ఆమె ఉచ్చరించడంతో అవి కేవలం భౌతిక పదార్థాలు మాత్రమే అయినాయి.  అందువల్ల అవి ఆకాశంలో ఉంటాయని యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాడు.  ఆ సమాధానం లౌకికంగానూ శాస్త్రీయంగాను కూడా సత్యమే.  మొదటి సారి నీవు అడిగినది అతిప్రశ్న అయితే రెండవసారి నీవు అడిగిన ప్రశ్న అతి సాధారణమైన ప్రశ్న అన్నట్లుగా యాజ్ఞవల్క్యుడు తేల్చేశాడు.  అంతే కాదు, ఆకాశం కంటె కూడా నీవడగదలుచుకున్న పరబ్రహ్మ మరింత గొప్పది అని పరోక్షంగా తగిన సమాధానం కూడా సూచించాడు.  (తస్మాద్వా ఏతస్మాదాత్మనః ఆకాశః సంభూతః అని తైత్తిరీయవాక్కు.)

         తెల్లబోయిన గార్గి కాసేపటికి తేరుకుని, “ఆ ఆకాశం దేనిలో వ్యాపించి ఉన్నది?” అని అడిగింది.  దానిని అక్షరం అంటారు (అక్షరం = క్షరము కానిది = నాశనం లేనిది) అని యాజ్ఞవల్క్యుడు చెప్పి, దాని స్వరూపం వర్ణింప వీలులేనిది కాబట్టి, నేతి (న+ఇతి) వాదం ప్రకారం సమాధానం చెప్పాడు.  (ఆ అక్షరస్వరూపం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇలా ఉండదు అంటూ వర్ణించాడు.). అటువంటి అక్షరంలో ఈ ఆకాశం వ్యాపించి ఉన్నది అని చెప్పాడు.  గార్గికి తగిన సమాధానం లభించింది.  ఆమె పన్నిన ఉచ్చులో యాజ్ఞవల్క్యుడు ఇరుకున పడలేదు.  తామరతూడు ఏనుగును బంధించలేదు కదా.

ఆ సమాధానం విన్న గార్గి వినమ్రురాలయింది. యాజ్ఞవల్క్యునికి సవినయం నమస్కారం చేసింది.  వినీతులు ఎంతటి జిగీషులైనప్పటికీ, మహాత్ముల చెంత వారి సహజస్వభావం పెల్లుబుకుతూనే ఉంటుంది కదా. అయ్యా పండితులారా! మీరు కూడా ఈయనకు నమస్కారం చేసి, ఈయన మనలో అతి గొప్ప బ్రహ్మవేత్త అని అంగీకరించండి.  సత్యాన్ని అంగీకరిస్తే అది మనకు విజయమే కాని పరాజయం కాదు. మీరెవరు ఈయనను జయింపలేరు అని సభలోని విద్వాంసులతో హితవు పలికింది.

         అయితే గార్గి మాటలను శాకల్యుడు సహించలేకపోయాడు.  తాను కూడా ప్రశ్నించి యాజ్ఞవల్క్యుని పరీక్షిద్దామని ముందుకు వచ్చాడు.

 

శాకల్యుడు

వైశ్వదేవంలో దేవతల సంఖ్య ఎంత?”

 

యాజ్ఞవల్క్యుడు

3306 మంది

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

33 మంది

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఆరుగురు

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ముగ్గురు

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఇద్దరు

 

శాకల్యుడు

సరే, ఎంత మంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఒకటిన్నర మంది

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఒక్కరు

 ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు తాను చెప్పిన ఆయా దేవతల సంఖ్యలను గురించి కూడా చక్కగా వివరించాడు.

         అయినప్పటికీ శాకల్యుడు శాంతించలేదు.  ఏ విధంగానైనా యాజ్ఞవల్క్యుడిని జయించాలనే కోరికతో ప్రశ్న మీద ప్రశ్నలను అడుగుతూ పోయాడు.  (సత్యాన్ని తెలుసుకోవాలని కోరికతో కాకుండా, తనకు సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని ఎంతమాత్రం ప్రతిపాదించకుండా, కేవలం తన ప్రత్యర్థి మాటలను నిరాధారంగా నిష్కారణంగా అసూయతో ఖండిస్తూ వాదించడాన్ని వితండవాదం అంటారు.).

         చివరకు శాకల్యుని దురాగ్రహాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు, ఓ శాకల్యా, నీకు సమాధానం తెలియని ప్రశ్నను నన్ను అడుగవద్దు.  సమాధానం తెలియకుండా నన్ను ప్రశ్నించినట్లయితే నీ తల తెగిపడుతుంది అని హెచ్చరించాడు.  అయినప్పటికీ, శాకల్యుడు తనకు సమాధానం తెలియని ప్రశ్నను అడిగేశాడు.  దాంతో శాకల్యుని తల అందరి సమక్షంలోను తెగి క్రింద పడింది.

      అప్పుడు యాజ్ఞవల్క్యుడు, సభను ఉద్దేశించి, “అయ్యా, మీలో ఇంకా ఎవరెవరు ఏమేమి ప్రశ్నలను అడగదలుచుకున్నారో విడివిడిగా అడగవచ్చు.  లేదా అందరూ కలిసి ఒకే ప్రశ్నను వేయవచ్చు.  నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నాను అని పలికాడు.

         అప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. 

       అప్పుడు యాజ్ఞవల్క్యుడే స్వయంగా పండితపరిషత్తును ఉద్దేశించి ప్రశ్నించాడు.  ఆత్మ అనే పురుషుని వృక్షంతో పోల్చి చెప్పి, చెట్టును వేళ్లతో సహా విత్తనంతో సహా నాశనం చేస్తే ఆ చెట్టు మరల మొలకెత్తదు.  కాని, మన ముందే మరణించి, శరీరం కాల్చివేయబడినప్పటికీ, ఆ వ్యక్తి మరలా జన్మిస్తాడు. (ధ్రువం జన్మ మృతస్య అని శాస్త్రం)  కో న్వేయం జనయేత్ పునః?  (మరణించిన వ్యక్తిని మరలా పుట్టేట్లుగా చేస్తున్న ఆ శక్తి ఏమిటి?) అని అడిగాడు.

     ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు.  యాజ్ఞవల్క్యుడు సభకు నమస్కరించి, ఆవులను తోలుకొని పోయాడు. 

విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్దాతుః పరాయణం తిష్ఠమానస్య తద్విద ఇతి – అని బృహదారణ్యకోపనిషత్తు ఆ శక్తిని గూర్చి చెబుతుంది.  ఆ శక్తి పేరు విజ్ఞానం.  ఆ శక్తి పేరు ఆనందం.  ఆ శక్తి పేరు బ్రహ్మ.  అదే పరమగతి.

 

ఇతి శమ్

Wednesday, 30 December 2020

ఒకరికి భాష రాకపోతే వేరొకరికి తిప్పలు

 


19వ శతాబ్దం నాటి కథ -

చెన్న పట్టణంలో ఒకానొక హూణప్రభువు ఉండేవాడు. అతడు ఇంగ్లీషుభాషను తప్ప వేరొక భాషను ఎరుగడు. అందువల్ల అతడు స్థానికభాష తెలిసిన ఒక దుబాసీని తన దగ్గర నియమించుకున్నాడు.
ఒకరోజు కొందరు సంప్రదాయ నృత్యకళాకారులు అతని చెంతకు వచ్చి, తమ వంశాదికం తెలుపుకుని, అతని సమక్షంలో సర్వాత్మనా నర్తించి తమ కౌశలాన్ని వ్యక్తపరిచారు.
దానితో ఆ ప్రభువు చాల సంతోషించి తన దుబాసీని పిలిచి, వీరికి పది రూపాయలను ఇవ్వమని ఆదేశించాడు. ఆ దుబాసీ సరేనని, వారిని తన ఇంటికి తీసుకుని పోయి, వారికి ఒక రూపాయిని ఇచ్చి ఇక పొమ్మన్నాడు.
తాము అంతగా శ్రమించి చేసిన నృత్యానికి ఇంతటి అల్పపారితోషికం దక్కిందే అని వారు చాల బాధపడ్డారు. ఈ దుబాసి తమను మోసం చేసి ఉండవచ్చునా అని అనుమానించారు.
అపుడు వారు తిరిగి ఆ ప్రభువు దగ్గరకు వెళ్లారు. దుబాసీ తమకు ఇచ్చిన రూపాయిని అతనికి చూపారు. మాకు దుబాసీ ఇంతమాత్రమే ఇచ్చాడని నివేదించారు.
ఆ ప్రభువుకు వారి భాష అర్థం కాలేదు. అందువలన దుబాసీని రప్పించి, వీరేం చెబుతున్నారో అడిగి తెలుసుకో అని అతడిని ఆదేశించాడు.
అపుడు దుబాసీ ప్రభువును ఉద్దేశించి "అయ్యా, మీరిచ్చిన పదిరూపాయలలో ఈ రూపాయినాణెం చెల్లనిది. దీని మీద దొంగముద్ర ఉన్నది. అందువల్ల, ఈ రూపాయిని తీసుకుని, మరొక రూపాయిని ఇప్పించవలసినది అని వీరు అడుగుతున్నారు" అని నివేదించాడు.
అది వినేసరికి ఆ ప్రభుపుకు చాల కోపం వచ్చింది. ఆ నృత్యకళాకారులను తన్ని తరిమేశాడు.
అందువలన, ఏ జనాలైనా తాము నివసిస్తూ ఉన్నటువంటి దేశభాషను తెలుసుకొనకపోతే ఇతరుల మాటలను నమ్మి, ఆ దేశప్రజలకు అన్యాయం చేస్తారు.
***)))(((***
శ్రీమాన్ వేంకటరామశాస్త్రిగారు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థులు సంస్కృతం త్వరగా, చక్కగా నేర్చుకునేందుకు వీలుగా "కథాశతకమ్" అనే చిన్న పుస్తకాన్ని వ్రాశారు. అందులో 27 వ కథకు ఇది నా అనువాదం. సంస్కృతకథ ఫొటోలో ఉన్నది.
***)))(((***
పాలకులు ప్రభువులు ఎంతటివారైనా తాము నివసిస్తూ ఉన్నటువంటి దేశభాషను (స్థానికభాషను) నేర్చుకోవాలని, లేకుంటే ఆ ప్రాంతపు ప్రజలకు తీరని అన్యాయం కలుగుతుందనే ప్రబోధం ఇది.
అయితే ఈనాటి పాలకులు మాత్రం, తమ కోసం దేశప్రజలందరూ మాతృభాషను వదలిపెట్టి పరాయిభాషలను నేర్చుకోవాలని హుకం జారీ చేస్తున్నారు. పైగా, అలా పరాయి భాషను నేర్చుకోకపోతే రేపటికి మీకు కూటికి గుడ్డకు కరువౌతుందని, మీకు జీవనోపాధి లభించదు అని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.
మన అజ్ఞానం, మన దురాశ, మన దౌర్భాగ్యం, మన పిరికితనం, మన బానిస మనస్తత్త్వం మాత్రమే మన మాతృభాష అంతరించబోయేందుకు కారణాలు.

Sunday, 30 December 2018

ఇచ్చట కళ్లు నెత్తికెక్కితే దించబడును (రెండవ భాగం)

ఇచ్చట కళ్లు నెత్తికెక్కితే దించబడును
((రెండవ భాగం))

ఓం శివాయ నమః
ఓం స్దాణవే నమః
ఓం ప్రభవే నమః
ఓం భీమాయ నమః
ఓం ప్రవరాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరాయ నమః

అంటూ నత్కీరుడు మట్టితో తాను చేసిన శివలింగం ముందు పూజలో లీనమై ఉన్నాడు.
యక్షిణి తన తంత్రాన్ని మొదలు పెట్టింది.

చెట్టు మీద నుండి ఒక ఆకు రాలి శివలింగం ప్రక్కనే పడింది.
వెంటనే, అది ఒక పక్షిగా మారిపోయింది. 
టప టప మని రెక్కలాడించూకుంటూ ఎగిరిపోయింది.
నత్కీరుడు ఆ వింత చూశాడు. 
కాని పట్టించుకోలేదు.

ఇంతలో చెట్టుమీద నుండి మరొక ఆకు రాలి తటాకంలోని నీటిలో పడింది.
వెంటనే అది చేపగా మారి విలాసంగా మొప్పలను తోకను ఊపుకుంటూ ఈత కొట్టసాగింది.
నత్కీరుడు ఈ వింతను కూడా చూశాడు.
కాని అతని ఏకాగ్రత చెక్కు చెదరలేదు.

చెట్టుమీద నుండి ఆకులు రాలి పడుతూనే ఉన్నాయి.
రకరకాల పక్షులుగా రంగురంగుల చేపలుగా మారిపోతున్నాయి.
వాటిని పట్టించుకోకుండా నత్కీరుని పూజ కొనసాగుతోంది.
దాదాపు ముగింపుకొచ్చేసింది.
పూజ ముగిసేలోపు ఎలాగైనా అతని ఏకాగ్రతను చెడగొట్టి తీరాలనుకుంది యక్షిణి.

ఈసారి ఆకు రాలి సగం నేలపైన సగం నీటిలోను పడింది.
నేలపైన పడిన సగం పక్షిగా మారింది.
నీటిలో పడిన సగం చేపగా మారింది.
పక్షి ఆకాశంలోనికి ఎగిరేందుకు రెక్కలు కొట్టుకుంటూ ప్రయత్నం చేయసాగింది. 
చేప నీటిలోనికి పోయేందుకు బలంగా ప్రయత్నిస్తోంది.
ఇదంతా నత్కీరుడి కంట బడింది. 
అతడు విభ్రాంతుడైపోయాడు.
అతని చిత్తంలో కాసేపు శివుడు విస్మరణకు గురి అయ్యాడు.
నోటినుంచి అంతవరకు మధురంగా లయబద్ధంగా వినిపిస్తున్న శివనామస్మరణ ఆగిపోయింది.
చూపులు శివుని నుండి ప్రక్కకు మళ్లాయి. 
తదేకంగా ఆ పక్షి,చేపల గుంజులాటను చూడసాగాడు.

ఆ వ్యవధి సరిపోయింది యక్షిణికి.
చెట్టుమీదనుండి కుప్పించి నేలపైకి దూకింది.
నత్కీరుణ్ణి ఒడిసి పట్టుకుంది.
ఓరి దొంగభక్తుడా అంటూ వికటాట్టహాసం చేసింది.
అతణ్ణి నేరుగా తన కొండగుహకు తీసుకొనిపోయి ఒక చెరలో పడేసింది.
శుభ్రంగా స్నానం చేసి వస్తానంటూ వెళ్లిపోయింది.

ఆ చెరలో అప్పటికే చాలమంది బందీలు ఉన్నారు.
వారు తమలో చేరిన నత్కీరుణ్ణి చూశారు.
కొందరు అతడిని చూడగానే హృదయవిదారకంగా ఏడవసాగారు.
మరి కొందరు అతడిని నిందించసాగారు.

నత్కీరుడు వారిని దీనంగా చూశాడు.
"నేను కూడా మీలాంటి అభాగ్యుడినే కదా?
నన్ను మీలో ఒకడిగా భావించకుండా ఎందుకు తిడుతున్నారు?"
అని అడిగాడు.

"మేము ఇప్పటికే 99 మంది ఉన్నాము. 
ఈ యక్షిణి నూరు మందిని పోగేసి కాని తినదు. 
నువు నూరో వాడివి ఇప్పుడు వచ్చావు. 
నీ రాక వల్ల మా అందరికీ చావు మూడింది" 
అన్నారు వారు.

"సరే, ఇపుడు ఏడిస్తే ఏం ప్రయోజనం?
తప్పించుకొనే ప్రయత్నం చేద్దాం" 
అన్నాడు నత్కీరుడు.

"మేము కూడా ప్రయత్నాలు చేశాము. 
ఒక్క సారి ఈ యక్షిణికి దొరికితే మన జాడ అండపిండబ్రహ్మాండాల్లో ఎక్కడున్నా తెలుసుకోగలదు. 
మేము తప్పించుకుని ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి మళ్లీ ఇక్కడ పడేసింది."
అని వాళ్లు మళ్లీ ఏడ్చారు.

నత్కీరుడు వారిని ఓదార్చి కుమారస్వామిని ప్రార్థించాడు. ఆయన వెంటనే దిగివచ్చి యక్షిణి బారినుండి వారిని కాపాడాడు. 
అందరూ కుమారస్వామిని పూజించి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. 

కాని నత్కీరుడు మాత్రం ఆయనను వదలలేదు.
తన పొగరుబోతుతనాన్ని, వదరుబోతుతనాన్ని, 
వాటివల్ల తనకు కలిగిన దుర్గతిని విన్నవించుకుని 
"స్వామీ, కైలాసానికి చేరే మార్గోపదేశం చేయవయ్యా" 
అంటూ వేడుకున్నాడు.

ఆయన నవ్వేసి 
"ఏమయ్యా నత్కీరా, 
కైలాసం ఉత్తరాన మాత్రమే ఉందని 
నువు కూడా ఒక పామరుడిలా భ్రమపడుతున్నావే! 
దక్షిణాన కూడా ఒక కైలాసం ఉన్నది. 
అదే శ్రీకాళహస్తి. 
దానిని దర్శించుకో" అని ఉపదేశించాడు.

నత్కీరుడు అలాగే చేసి తన కుష్టు రోగం నుండి విముక్తుడయ్యాడు. 
•○●□•○●□•○●□

నత్కీరుడు ఎంతెంతో నయం!
అందుకే ఆయనను శాపంతో (మాటలతో) బుద్ధి చెప్పి వదిలేశారు.

కాని, 
పొగరు తలకెక్కిన పరమధూర్తులు మరి కొందరు ఉన్నారు.
ప్రసిద్ధులే! 
celebrities & legends మరి!
మాటలతో హెచ్చరించినంత మాత్రాన నెమ్మదించే బ్యాచ్ కాదు వారు.
•○●□•○●□•○●□

నూరుమంది కౌరవులకు ఒక చెల్లెలు.
ఆమె పేరు దుశ్శల. 
ఆమె భర్త పెద్ద సుశీలుడేం కాదు.
అతని పేరు జయద్రథుడు.
సైంధవుడనే పేరుతో బాగా తెలిసినవాడు.
కౌరవపాండవులకు వివాహసంబంధం ద్వారా బావమరది అయ్యాడు.

వాడొకసారి అరణ్యంలో ప్రయాణిస్తూ ద్రౌపదిని చూశాడు.
అతడు ఫలానా అని తెలుసుకున్న ద్రౌపది "రా అన్నా భోంచేసి వెడుదువు గాని. మీ బావలు కూడా కాసేపట్లో తిరిగివస్తారు" అంటూ ఆహ్వానించింది.
పాండవులు లేరని తెలుసుకొనేసరికి ఆ పిరికి వెధవకు హఠాత్తుగా నెత్తిమీద కొమ్ములు మొలిచాయి. 
వావివరుసలు గాలికి వదిలేశాడు. 

పాండవులను వదిలేసి తనతో వస్తే ఆమెను రాణిని చేస్తానంటూ "ఆఫర్" ఇచ్చాడు.
ఆమె ఛీ పోరా వెధవా అనేసరికి వాడు ఆమెను బలవంతంగా ఎత్తుకుపోయాడు.
కాని అరణ్యం దాటే లోపులే పాండవులకు దొరికిపోయాడు.
భీముడు ఒక్క పిడికిలి పోటుతో వాడి తలను పగలగొట్టే లోగా ధర్మరాజు అడ్డుపడి "నాయనా ఈ వెధవను చంపి మన చెల్లెలు దుశ్శలను విధవను చేయకురా" అంటూ వాడిని కాపాడాడు.

వాడికి తలనిండా పిలకలుండేట్టు బుఱ్ఱ గొరిగి పంపేశారు.
ఆ వెధవ అప్పటికైనా బుద్ధి తెచ్చుకునింది లేదు.

తపస్సుతో శివుడిని మెప్పించి పాండవులను ఓడించేంత బలం కావాలన్నాడు.
శివుడు అప్పటికే అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చి నీవు అజేయుడవై ఉంటావు అని వరం ఇచ్చి ఉన్నాడు.
పైగా ఆ దుర్మార్గుడిని ఎంకరేజ్ చేయదలచుకోలేదు.

అందువల్ల "ఓరయ్య నీవు ఎన్ని జన్మలెత్తినా అర్జునుణ్ణేం చేయలేవు. 
కానీ నీ జన్మలో ఒకసారికి మిగిలిన నలుగురిని ఓడించగలవులే" 
అని మాట ఇచ్చి పంపాడు.
ఆ వరంతో వాడు యుద్ధంలో అభిమన్యుడి చావుకు కారణమయ్యాడు.

ఆ విషయం తెలుసుకుని క్రోధాగ్నిజ్వాలాముఖుడైన అర్జునుడు వాడిని మరుసటి రోజు సాయంత్రంలోగా చంపకుంటే గాండీవంతో సహా నేనే స్వయంగా అగ్నిప్రవేశం చేస్తా అని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు.

అపుడు పాండవవీరులు ప్రచండంగా పెడబొబ్బలు పెట్టారట. 
భూమి కంపించిందట.
ఉల్కలు రాలి పడ్డాయట!
దూతఘటోత్కచంలో భాసుడు ఆ ఘట్టాన్ని వర్ణించిన తీరు అద్భుతం!

మరుసటి రోజు అర్జునుణ్ణి ఆపగల శక్తి ఎవరికీ లేకపోయింది. 
ఎవరూ కని విని ఎరుగని రీతిలో విజృంభించాడు. 
అడ్డుకున్నవారినందరినీ ఊచకోత కోశాడు.
జయద్రథుణ్ణి నిర్దాక్షిణ్యంగా వధించాడు.

జయద్రథుడి కండకావరానికి పడవలసిన శిక్షను ధర్మరాజు రద్దు చేయలేదు. 
శిక్ష ఆనాడే ఖరారైంది. 
కాని ఆ శిక్ష సమంజసమే అని అందరూ భావించేంతవరకూ కేవలం పోస్ట్ పోన్ చేశాడంతే!
•○●□•○●□•○●□

పాండవులు అజ్ఞాతంలోనికి ప్రవేశించేముందు పరమేశ్వరిని పూజించారు. 
ఆమె స్త్రీరూపంలోని శివశక్తి. 
తప్పక తన భక్తులను కాపాడుతుంది.

సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదిని కీచకుడు చూశాడు.
ఆమెను తన దగ్గరకు పంపమని సిగ్గు ఎగ్గు లేకుండా స్వయంగా తన సోదరినే అడిగాడు.
అతని నీచత్వానికి అతని సోదరే భయభ్రాంతురాలైంది.

వాడు బాగా తాగేసి ఉన్నాడు.
నిరాకరించిన సైరంధ్రిని వదలకుండా వెంటబడ్డాడు.
సాక్షాత్తు రాజసభలోనే అందరి ఎదుట ఆమెను క్రింద పడేసి కాళ్లతో తన్నాడు. 
"నాపేరు సింహబలుడు. నన్నెవడూ ఏం చేయలేడు" అని వికటాట్టహాసం చేశాడు.

రాజుగారు కూడా భయపడి పోయారు.
గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్నారు.
కీచకుడనే ప్రభుత్వేతరశక్తిని అరికట్టలేక
నిస్సహాయంగా నిశ్చేష్టులై పోయారు.

మొత్తానికి రాజుగారి చేతగానితనం అందరికీ తెలిసిపోయింది.
కాని ఆ పాపాత్ముడు ఫలితం అనుభవించాల్సిందే.
చట్టాన్ని ధర్మమే స్వయంగా తన అదుపులోనికి తీసుకుంది.
తాత్కాలికంగానే...

ఫలితం -
ఆ రోజు రాత్రి కీచకుడు రక్తపు ముద్దగా మారిపోయాడు. 
వాడి తల వాడి పొట్టలో కుక్కబడింది. 
వాడి కాళ్లు చేతులు ఖండఖండాలుగా చేయబడి వాడి మొండెంలో ఎక్కడెక్కడ కూరుకుపోయి ఉన్నాయో ఎవడికీ అర్థం కాలేదు.
మహా ఘోరమైన చావు చచ్చాడు.

చూసిన ప్రతి ఒక్కరు తమ జన్మజన్మలకు సరిపడేంతగా భయపడి వణికిపోయారు.
కీచకుని తమ్ములైన ఉపకీచకులు తప్ప.
వారు కాదన్న అమ్మాయి మొహంపై ఆసిడ్ పోసే బ్యాచ్ లాంటివారు.
వారు సైరంధ్రిని ఎత్తుకుపోయి తమ అన్న శవంతో పాటు కాల్చేద్దాం అనుకున్నారు.

అంతే!
ఆ మరుసటి రోజే వాళ్ల శవాలు కనీసం పోస్ట్ మార్టంకు కూడా నోచుకోకుండా తమ అన్నశవంతో బాటు తగలబడి పోయాయి. వారందరికీ ఆ శిక్ష విధించిన శక్తి ఎవరిదో తెలియని వాళ్లెవరూ లేరు.
•○●□•○●□•○●□

అంతేనా? 
సీతను అపహరించిన రావణుడికి,
ద్రౌపదిని తన తొడపై కూర్చొమ్మన్న డిక్టేటర్ తొడల దుర్యధనుడికి,
ఆమె జుత్తును, కొంగును లాగిన దుశ్శాసనుడికి,
ఇలా కళ్లు నెత్తికెక్కిన ప్రతి వెధవకు 
వారు చేసిన వెధవ పనులకు ఆయా కాలాల్లో తగిన శిక్ష పడింది.
•○●□•○●□•○●□

సందేహం అక్కరలేదు.
ఇంద్రుడికీ శిక్ష పడింది.
ఉపేంద్రావతారుడికీ శిక్ష పడింది.
(దయ చేసి అవేమిటో వివరించమని నన్ను అడగకండి.
ఎవరికి వారే స్వయంగా తెలుసుకుంటే మంచిది. )
•○●□•○●□•○●□

ఇలా ఆయా సందర్భాల్లో
పురాణాలు మనకు మార్గదర్శనం చేస్తున్నాయి. 
కర్తవ్యబోధన చేస్తున్నాయి. 
ఇలాంటిలాంటి సందర్భాలలో మీరు ఈవిధంగా ప్రవర్తించాలి 
అని పదే పదే చెబుతున్నాయి. 
పైన పేర్కొన్నవి కేవలం ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే.

పురాణాలు కేవలం పెద్ద వయసులో పారాయణ చేసుకొనే గ్రంథాలు అని భావించడంలోనే భారతజాతి పతనానికి మూలబీజాలు ఉన్నాయి.

అలాంటి పురాణాలకు కొందరు కుట్రదారులు మతమనే గాఢమైన ముద్ర వేసేసరికి అన్నీ తెలుసుకొనగల తెలివి కలిగిన కొందరికి వాటిలో కేవలం డొల్లతనమే కనిపిస్తోంది. 
"పైపొట్టు లేకుండా బియ్యం గింజ మొలకెత్తదు."

ఈ మనుషులు - 
వారి ఆభిజాత్యం ఎంత గొప్పదైనా, 
వారి విద్య ఎంతటి మహోన్నతమైనదైనా,
వారు ఎంతటి పరాక్రమవంతులైనా, 
వారు ఎంతటి ఐశ్వర్యసంపన్నులైనా,
వారు ఎంతటి దివ్యాంశసంభూతులైనా, 
అక్కడక్కడ వారిలో కనిపించే లోపాలను 
దాచకుండా బయటపెట్టిన పురాణాల నిజాయితీ 
కొందరికి మెచ్చదగిందిగా కనబడకపోవటం దురదృష్టం.

అన్యాయాలు జరిగాయి.
అక్రమాలు జరిగాయి.
నిజమే.
అలా నిజాలు బయటపెట్టడం వల్ల పురాణాల విలువ తగ్గిపోతుందా?

మానవుడిగా పుట్టినవారిలో 100% మహాపురుషుడు లేడని, 
అంతగా కావాలంటే 99.99 తో సరిపెట్టుకొనవలసిందే 
అని అవి విస్పష్టంగా తెలియజెబుతూంటే వాటిని ఎందుకు తప్పు బట్టడం?
అవి మన పూర్వీకులకు సంబంధించిన బోలెడన్ని కేస్ స్టడీలు 
మనకు అందిస్తున్నాయి. 

వాటిని బట్టి 
మనం స్వీకరించదగినవి ఇవి, 
తిరస్కరించదగినవి ఇవి 
అనే విచక్షణ జ్ఞానం మనకు ఉండి తీరాలి.

నీటిని విడిచి పాలను గ్రహించే రాజహంసల్లా
మనుషులుండాలని
ఆయా వ్యక్తులలోని
ఈయీ సుగుణాలను గ్రహిద్దాం.
ఈయీ దుర్గుణాలను పరిహరిద్దాం 
అని గ్రహించి
పరమహంస స్థాయికి చేరుకోవాలని
పురాణేతిహాసాలు ఆశిస్తున్నాయి.

కాదు కాదు, 
కానే కాదు, 
వాటికి ఫలానా మతానికి చెందినవి అనే ముద్ర ఉంది కాబట్టి 
అవి నాకు ఏ మాత్రం సంబంధం లేనివి.

అని సెక్యులర్ మతం వహించి దూరం చేసుకుంటే 
వ్యక్తిగతంగా ఆయా మనుషుల ఇష్టం. 
సామూహికంగా దేశానికి నష్టం! 
•○●□•○●□•○●□

నాకు సంబంధించి దేవుడొకడే. 
అతని నామరూపాలు ఆయా దేశకాలాల్లో వేరు వేరుగా ఉండవచ్చు గాక!
అన్ని నామరూపాలు నాకిష్టమే. 
ఆయన సర్వవ్యాపి.

అయినా, 
శివరాత్రి నాడు దక్షిణకైలాసమైన శ్రీకాళహస్తికి పోవాలనే పట్టుదలకు పోకుండా తిరుమల వేంకటనాథుని దర్శనాన్ని మా కుటుంబసభ్యులందరం చేసుకున్నాం. 
నాస్తి కోsపి భేదః.
•○●□•○●□•○●□

నాకు ఎవరి పిల్లలైనా ఇష్టమే. 
కాని మా పిల్లలు మా ఇంట్లో పెరగడమే న్యాయం.
వారు వేరొకరి ఇంట్లో పెరగాలని నేను కోరుకోను. 
కాని 
ఇతరుల పిల్లలు కూడా మా ఇంటికొచ్చి మా పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు.
మా పిల్లలు కూడా తమ స్నేహితుల ఇళ్లకు వెళ్లి ఆడుకుని వస్తారు.

ఉమ్మడి కుటుంబాల వంటి ఇళ్లు ఉంటే 
అంతటా నిర్వ్యాజమైన ప్రేమ లభిస్తూ ఉంటే 
ఎవరు ఎక్కడ పెరిగినా ఆనందమే!
వారి స్నేహం అలా నిత్యం కొనసాగుతూ ఉండాలని నా కోరిక.
•○●□•○●□•○●□

అందరికీ శుభాకాంక్షలు.
సర్వే జనాః సుఖినో భవంతు.
సర్వే దుష్టాః దండితాః భవంతు.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...