Wednesday 30 December 2020

ఒకరికి భాష రాకపోతే వేరొకరికి తిప్పలు

 


19వ శతాబ్దం నాటి కథ -

చెన్న పట్టణంలో ఒకానొక హూణప్రభువు ఉండేవాడు. అతడు ఇంగ్లీషుభాషను తప్ప వేరొక భాషను ఎరుగడు. అందువల్ల అతడు స్థానికభాష తెలిసిన ఒక దుబాసీని తన దగ్గర నియమించుకున్నాడు.
ఒకరోజు కొందరు సంప్రదాయ నృత్యకళాకారులు అతని చెంతకు వచ్చి, తమ వంశాదికం తెలుపుకుని, అతని సమక్షంలో సర్వాత్మనా నర్తించి తమ కౌశలాన్ని వ్యక్తపరిచారు.
దానితో ఆ ప్రభువు చాల సంతోషించి తన దుబాసీని పిలిచి, వీరికి పది రూపాయలను ఇవ్వమని ఆదేశించాడు. ఆ దుబాసీ సరేనని, వారిని తన ఇంటికి తీసుకుని పోయి, వారికి ఒక రూపాయిని ఇచ్చి ఇక పొమ్మన్నాడు.
తాము అంతగా శ్రమించి చేసిన నృత్యానికి ఇంతటి అల్పపారితోషికం దక్కిందే అని వారు చాల బాధపడ్డారు. ఈ దుబాసి తమను మోసం చేసి ఉండవచ్చునా అని అనుమానించారు.
అపుడు వారు తిరిగి ఆ ప్రభువు దగ్గరకు వెళ్లారు. దుబాసీ తమకు ఇచ్చిన రూపాయిని అతనికి చూపారు. మాకు దుబాసీ ఇంతమాత్రమే ఇచ్చాడని నివేదించారు.
ఆ ప్రభువుకు వారి భాష అర్థం కాలేదు. అందువలన దుబాసీని రప్పించి, వీరేం చెబుతున్నారో అడిగి తెలుసుకో అని అతడిని ఆదేశించాడు.
అపుడు దుబాసీ ప్రభువును ఉద్దేశించి "అయ్యా, మీరిచ్చిన పదిరూపాయలలో ఈ రూపాయినాణెం చెల్లనిది. దీని మీద దొంగముద్ర ఉన్నది. అందువల్ల, ఈ రూపాయిని తీసుకుని, మరొక రూపాయిని ఇప్పించవలసినది అని వీరు అడుగుతున్నారు" అని నివేదించాడు.
అది వినేసరికి ఆ ప్రభుపుకు చాల కోపం వచ్చింది. ఆ నృత్యకళాకారులను తన్ని తరిమేశాడు.
అందువలన, ఏ జనాలైనా తాము నివసిస్తూ ఉన్నటువంటి దేశభాషను తెలుసుకొనకపోతే ఇతరుల మాటలను నమ్మి, ఆ దేశప్రజలకు అన్యాయం చేస్తారు.
***)))(((***
శ్రీమాన్ వేంకటరామశాస్త్రిగారు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థులు సంస్కృతం త్వరగా, చక్కగా నేర్చుకునేందుకు వీలుగా "కథాశతకమ్" అనే చిన్న పుస్తకాన్ని వ్రాశారు. అందులో 27 వ కథకు ఇది నా అనువాదం. సంస్కృతకథ ఫొటోలో ఉన్నది.
***)))(((***
పాలకులు ప్రభువులు ఎంతటివారైనా తాము నివసిస్తూ ఉన్నటువంటి దేశభాషను (స్థానికభాషను) నేర్చుకోవాలని, లేకుంటే ఆ ప్రాంతపు ప్రజలకు తీరని అన్యాయం కలుగుతుందనే ప్రబోధం ఇది.
అయితే ఈనాటి పాలకులు మాత్రం, తమ కోసం దేశప్రజలందరూ మాతృభాషను వదలిపెట్టి పరాయిభాషలను నేర్చుకోవాలని హుకం జారీ చేస్తున్నారు. పైగా, అలా పరాయి భాషను నేర్చుకోకపోతే రేపటికి మీకు కూటికి గుడ్డకు కరువౌతుందని, మీకు జీవనోపాధి లభించదు అని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.
మన అజ్ఞానం, మన దురాశ, మన దౌర్భాగ్యం, మన పిరికితనం, మన బానిస మనస్తత్త్వం మాత్రమే మన మాతృభాష అంతరించబోయేందుకు కారణాలు.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...