Showing posts with label Language. Show all posts
Showing posts with label Language. Show all posts

Wednesday, 30 December 2020

ఒకరికి భాష రాకపోతే వేరొకరికి తిప్పలు

 


19వ శతాబ్దం నాటి కథ -

చెన్న పట్టణంలో ఒకానొక హూణప్రభువు ఉండేవాడు. అతడు ఇంగ్లీషుభాషను తప్ప వేరొక భాషను ఎరుగడు. అందువల్ల అతడు స్థానికభాష తెలిసిన ఒక దుబాసీని తన దగ్గర నియమించుకున్నాడు.
ఒకరోజు కొందరు సంప్రదాయ నృత్యకళాకారులు అతని చెంతకు వచ్చి, తమ వంశాదికం తెలుపుకుని, అతని సమక్షంలో సర్వాత్మనా నర్తించి తమ కౌశలాన్ని వ్యక్తపరిచారు.
దానితో ఆ ప్రభువు చాల సంతోషించి తన దుబాసీని పిలిచి, వీరికి పది రూపాయలను ఇవ్వమని ఆదేశించాడు. ఆ దుబాసీ సరేనని, వారిని తన ఇంటికి తీసుకుని పోయి, వారికి ఒక రూపాయిని ఇచ్చి ఇక పొమ్మన్నాడు.
తాము అంతగా శ్రమించి చేసిన నృత్యానికి ఇంతటి అల్పపారితోషికం దక్కిందే అని వారు చాల బాధపడ్డారు. ఈ దుబాసి తమను మోసం చేసి ఉండవచ్చునా అని అనుమానించారు.
అపుడు వారు తిరిగి ఆ ప్రభువు దగ్గరకు వెళ్లారు. దుబాసీ తమకు ఇచ్చిన రూపాయిని అతనికి చూపారు. మాకు దుబాసీ ఇంతమాత్రమే ఇచ్చాడని నివేదించారు.
ఆ ప్రభువుకు వారి భాష అర్థం కాలేదు. అందువలన దుబాసీని రప్పించి, వీరేం చెబుతున్నారో అడిగి తెలుసుకో అని అతడిని ఆదేశించాడు.
అపుడు దుబాసీ ప్రభువును ఉద్దేశించి "అయ్యా, మీరిచ్చిన పదిరూపాయలలో ఈ రూపాయినాణెం చెల్లనిది. దీని మీద దొంగముద్ర ఉన్నది. అందువల్ల, ఈ రూపాయిని తీసుకుని, మరొక రూపాయిని ఇప్పించవలసినది అని వీరు అడుగుతున్నారు" అని నివేదించాడు.
అది వినేసరికి ఆ ప్రభుపుకు చాల కోపం వచ్చింది. ఆ నృత్యకళాకారులను తన్ని తరిమేశాడు.
అందువలన, ఏ జనాలైనా తాము నివసిస్తూ ఉన్నటువంటి దేశభాషను తెలుసుకొనకపోతే ఇతరుల మాటలను నమ్మి, ఆ దేశప్రజలకు అన్యాయం చేస్తారు.
***)))(((***
శ్రీమాన్ వేంకటరామశాస్త్రిగారు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థులు సంస్కృతం త్వరగా, చక్కగా నేర్చుకునేందుకు వీలుగా "కథాశతకమ్" అనే చిన్న పుస్తకాన్ని వ్రాశారు. అందులో 27 వ కథకు ఇది నా అనువాదం. సంస్కృతకథ ఫొటోలో ఉన్నది.
***)))(((***
పాలకులు ప్రభువులు ఎంతటివారైనా తాము నివసిస్తూ ఉన్నటువంటి దేశభాషను (స్థానికభాషను) నేర్చుకోవాలని, లేకుంటే ఆ ప్రాంతపు ప్రజలకు తీరని అన్యాయం కలుగుతుందనే ప్రబోధం ఇది.
అయితే ఈనాటి పాలకులు మాత్రం, తమ కోసం దేశప్రజలందరూ మాతృభాషను వదలిపెట్టి పరాయిభాషలను నేర్చుకోవాలని హుకం జారీ చేస్తున్నారు. పైగా, అలా పరాయి భాషను నేర్చుకోకపోతే రేపటికి మీకు కూటికి గుడ్డకు కరువౌతుందని, మీకు జీవనోపాధి లభించదు అని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.
మన అజ్ఞానం, మన దురాశ, మన దౌర్భాగ్యం, మన పిరికితనం, మన బానిస మనస్తత్త్వం మాత్రమే మన మాతృభాష అంతరించబోయేందుకు కారణాలు.

Monday, 23 March 2020

భాషలో కూడా DNA ఉంటుంది



ఒక ఆఫ్రికన్ జానపద కథ ఉంది.

ఒక అడవిలో బోయ అనే పిల్లవాడు ఉండేవాడు.  ఒక చిన్న గుడిసెలో అతడు తన తండ్రితోను తల్లితోను పిన్నితోను కలిసి ఉండేవాడు.  

ఆ పిన్ని  నిశ్శబ్దంగా ఉండే రకం కాదు.  ఆ పిల్లవాణ్ణి నిత్యం ఏదో ఒక వంక పెట్టి తిడుతూనే ఉండేది.  

ఒక రోజు బోయ పండ్లను ఏరుకురావడానికి అడవికి వెళ్ళాడు.   ఒక నది ఒడ్డున పండ్లను సేకరిస్తూ ఉండగా అతడికి ఒక వింత జంతువు కనిపించింది.  

బోయ అటువంటి జంతువును ఎన్నడూ చూసి ఎరుగడు.  దాంతో అది ఎటువంటి జంతువో అర్థం చేసుకోలేక భయపడి పండ్లను వదిలి పరుగు పెట్టాడు.  ఆ వింత జంతువు అతడి వెంట పడింది.  అది తన కంటే చాలా వేగంగా పరుగెట్టి తనను సమీపిస్తూ ఉండడంతో బోయ మరింత మరింత భయపడిపోయాడు.  తాను పరుగెత్తి తప్పించుకోలేనని అతడికి అర్థమైంది.  

దాంతో తానే ఆ జంతువును భయ పెడదామని అతడు తన దగ్గర ఉన్న ఒక చిన్నపాటి డప్పును వాయించడం మొదలుపెట్టాడు.  అప్పుడు విచిత్రంగా ఆ జంతువు కూడా పరుగును ఆపేసి నాట్యం చేయడం ప్రారంభించింది.  

బోయ డప్పును వాయిస్తూనే ఉన్నాడు.  ఆ జంతువు నాట్యం చేస్తూనే ఉంది.  డప్పును ఒక్కక్షణం అతడు ఆపి వేసేసరికి మీదకు వస్తోంది.  అందుకని అతను ఆపకుండా డప్పును వాయిస్తూనే ఉండిపోయాడు.  ఆ జంతువు కూడా అలా నాట్యం చేస్తూనే ఉంది.  

అలా సాయంత్రమై చీకటి పడేంతవరకు డప్పు మోగుతునే ఉంది. ఆ  జంతువు నాట్యం చేస్తూనే ఉంది.  పాపం నాట్యం చేసి చేసి అది బాగా అలసిపోయినట్లు కనిపించింది.  దాని కాళ్లు చేతులు నొప్పెడుతున్నట్లు తోచింది.  చాల ఆయాసపడుతోంది.  

బోయకు దాని మీద చాల జాలి కలిగింది.  ఒక్క క్షణం డప్పును మోగించడం ఆపేశాడు.  దాంతో అది బతుకుజీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది.

బోయ ఉత్త చేతులతో ఇంటికి వచ్చాడు.   పిన్ని కోపానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.  నోటికొచ్చినట్లు బోయను తిట్టి పోసింది.  బోయ ఆరోజు పండ్లు లేకుండా వచ్చినందుకు కారణం చెప్పాడు.  

"సరే గొడవ ఎందుకు?  మన పిల్లవాడు బోయ క్షేమంగా వచ్చాడు, అదే చాలు" అన్నాడు తండ్రి.

కానీ పిన్ని నమ్మలేదు.  "బోయ అబద్ధం చెపుతున్నాడు" అంటూ అరిచింది.  "రేపు వీడితోనే కలిసి అడవికి పోదాం.  ఈరోజు వచ్చిన జంతువు రేపు రాదా?  ఈ పిల్లవాడి మాటలు నిజమో అబద్ధమో అప్పుడు తేల్చుకుందాం" అన్నది.

ఆ మరుసటి రోజు అందరూ కలిసి అడవికి వెళ్ళారు.  ఆ జంతువు ఎక్కడా కనబడలేదు.  

"చూశారా? వీడు అబద్ధం చెప్పాడని నాకు ముందే తెలుసును" అంటూ పిన్ని అరిచింది.  

బోయ మౌనంగా నది ఒడ్డున పండ్లను ఏరడం ప్రారంభించాడు.  అంతే!  ఉన్నట్టుండి మరల ఎక్కడనుంచో ఆ వింత జంతువు వచ్చేసింది.  

బోయ గమనించే లోపలే అతడి పిన్నిని తల్లిని తండ్రిని కూడా మింగేసింది.  తరువాత బోయను కూడా మింగేద్దామని ప్రయత్నించింది.

కానీ బోయ ఒడుపుగా తప్పుకున్నాడు.  తన డప్పును తీసి వాయించడం మొదలు పెట్టాడు.  ఆ జంతువు మరల నాట్యం చేయడం ప్రారంభించింది.

బోయ డప్పు కొడుతూనే ఉన్నాడు.  ఆ జంతువు అలా నాట్యం చేస్తూనే ఉంది.  అలా చాలాకాలం జరిగాక జంతువు ఒకవైపు నాట్యం చేస్తూనే డప్పును మోగించడం ఆపమని బోయను ప్రాధేయపడింది.  

"మా అమ్మా నాన్నలను విడిచిపెట్టే దాకా నేను వాయిస్తోనే ఉంటాను" అని బోయ సమాధానం చెప్పాడు.  

చేసేదేమీ లేక ఆ జంతువు అతడి అమ్మానాన్నలను బయటకు కక్కేసింది.  



ఒప్పందం ప్రకారం బోయ డప్పును మోగించడం మానేశాడు.  ఆ జంతువు పారిపోవడం మొదలుపెట్టింది.  

అప్పుడు బోయ తల్లి "డప్పు మోతను ఆపవద్దు" అని చెప్పింది.  "మీ పిన్ని కూడా బయటకు రానీ" అని కోరింది.  

బోయకు అలా జరగడం ఇష్టం లేదు.  అయినప్పటికీ తల్లి కోరికను మన్నించి డప్పును మరలా మోగించడం మొదలుపెట్టాడు.  

ఆ జంతువు నీరసంగా నాట్యం చేయడం మొదలు పెట్టింది.  "మీ అమ్మానాన్నలను తిరిగి ఇచ్చేశానుగా? మరలా ఎందుకు వాయిస్తున్నావు?" అని అడిగింది.

"మా పిన్నిని కూడా నువ్వు పొట్టన పెట్టుకున్నావు కదా? ఆమెను కూడా విడిచిపెట్టు" అని సమాధానం చెప్పాడు బోయ.

చేసేదేమీ లేక ఆ జంతువు ఆమె పిన్నిని కూడా బయటకు కక్కేసింది.

బోయ మోగించడం ఆపేశాడు.  అప్పుడా జంతువు బ్రతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది.  

తరువాత అందరూ కావలసినన్ని పండ్లను ఏరుకొని ఇంటికి తిరిగి వచ్చేశారు.  

ఆ తరువాత ఇన్ని ఇంకెప్పుడు బోయను తిట్టలేదు. అతడిని జీవితాంతం తల్లిదండ్రుల కంటే ఎంతో ప్రేమతో దయతో చూసుకుంది.  
🍎🍎🍎🍎🍎🍎

ఇదీ కథ.

సరే, ఇందులో బోయ అనే పదాన్ని Boje అని వ్రాస్తారు.  దాన్ని మనం బోజే అని పలుకరాదు.  బోయ అని పలకాలిట. (నిజానికి భోజ అనే ప్రకృతిపదానికి బోయ అనేది వికృతిరూపం అని కొన్ని వాదనలు తెలుగుదేశంలో కూడా ఉన్నాయి.  చాల ఆశ్చర్యం కదూ?)   దక్షిణాఫ్రికా క్రికెట్ టీములో ఒకప్పుడు నికీ బోయె అనే ఒక ఆటగాడు ఉండేవాడు.   బోయ అది జర్మన్ పదమట.  దానికి అర్థం ఒక తాడుకు (మోకుకు) కట్టబడి నీళ్లలో తేలుతున్న కర్ర (కొయ్య మొద్దు) అని అర్థమట.  ఈ పదానికి లాటిన్ మూలాలు కూడా ఉన్నాయంటారు.

ఆఫ్రికాలో స్థిరపడిన యూరోప్ తెల్లజాతివారికి బోయర్లని పేరు.  (Boers)  బోయర్ అంటే యోధుడట.  వారు స్థానికులైన ఆటవిక-ఆఫ్రికన్లనుండి ఆ పేరును సంగ్రహించి ఉండవచ్చు. ఇంగ్లండ్ పెత్తనాన్ని సహించలేక వారు చేసిన యుద్ధాలకు ఆంగ్లో-బోయర్ యుద్ధాలంటారు.  

ఇంగ్లీషులో buoy అని వ్రాస్తారు.  పడవలు/నౌకలు కొట్టుకుపోకుండా ఆపే బోయకట్టె అని‌ ఆ పదానికి అర్థం.  విశాఖపట్నంలో పోర్టు దగ్గర వేంకటేశ్వరుని గుడినుండి స్టీమరులో సాగరదుర్గ గుడికి పోయేటపుడు హార్బరు కాలువలో ఈ విధమైన buoy లు కనిపిస్తాయి.



ఆ పదం నుండే buoyant అనే విశేషణం పుట్టుకొచ్చింది.  తేలికపరిచేది/తేలికైనది, ఉత్సాహపరిచేది/ఉత్సాహపూరితమైనది అనే అర్థంలో ఆ పదాన్ని వాడుతారు.  లైఫ్‌బాయ్ సబ్బు ప్రకటన గుర్తుందా?

సరే, మన తెలుగుదేశంలో కూడా బోయ అనే పదం వ్యవహారంలో ఉంది.  జంతువులను వేటాడి జీవించే ఆటవికుడు అనే అర్థంలో వాడుతాం.  దేశ జనాభా పెరిగి నాగరకత (నగరజీవనం) ప్రబలుతున్న కొద్దీ అడవులు నశించిపోతున్నకొద్దీ బోయలు కూడా క్రమంగా నాగరకులైనారు.  ఈనాటికి కూడా వారు భారతదేశమంతటా సమాజంలో అవిభాజ్యంగా ఉన్నారు.  

మాండలిక పదకోశం బోయ అనే పదానికి బెస్తవారు, మత్స్యకారులు అనే అర్థాన్ని కూడా చెబుతోంది.  పడవలు లేకుండా బెస్తవారిని ఎలా ఊహించగలం?  కాబట్టి, బోయలు ఒకప్పుడు చక్కని నౌకలను తయారు చేయగలిగిన పరిజ్ఞానాన్ని (technology) కలిగి ఉండేవారని అర్థం చేసుకోవచ్చు.

రామాయణంలో కూడా అందుకు సాక్ష్యముంది.  ఆటవికుడైన బోయడు ఒకాయన రామునికి ప్రాణమివ్వగల మిత్రుడు.  గుర్తొచ్చిందా?  అతడి పేరు గుహుడు.  నిషాదరాజు (బోయల రాజు)  అతడికి ఐదువందల యుద్ధ నౌకలు ఉండేవట.  (చిన్న పడవలు కావు.)  ఒకొక్క నౌకలో నూరేసి కైవర్తయోధులు (బోయజాతికి చెందిన సైనికులు) ఉండేవారట.  వారు గొప్ప ధనుర్ధారులు కూడా.  వారు అడవులలో పనిబడినవారికి దగ్గరుండి దారి చూపేవారు.  రాముని మాత్రమే కాక, భరతుని సైన్యాన్ని సైతం గంగానదిని దాటించి చిత్రకూటంలో ఉన్న రాముని చెంతకు భరతుని తీసుకుపోయింది వారే.



అంతవరకు ఎందుకు?  స్వయంగా వందే వాల్మీకికోకిలమ్ అని మనం పూజించే మహర్షి పూర్వాశ్రమంలో బోయవాడని, ఋష్యనుగ్రహంతో తారకమంత్రం గ్రహించి తత్ప్రభావం వలన పరమభాగవతుడైనాడని ఐతిహ్యముంది కదా?




మనం పరమపూజ్యంగా భావించే భగవద్గీతను మహాభారతమనే ఇతిహాసపేటికలో భద్రపరచి మనకందించిన వ్యాసమహర్షి ఒక బోయకన్య (మత్స్యకన్య) అయిన సత్యవతి కుమారుడే కదా?  సత్యవతి తండ్రికి దాశరాజు అని వ్యవహారం.  ఆయన కూడా తన జాతికి ఒక రాజే.  నీ కూతురైన సత్యవతిని నాకు రాణిగా ఇవ్వమని శంతనుమహారాజు ఆయనను ప్రాధేయపడ్డాడు.  భీష్మప్రతిజ్ఞ జరిగిన తరువాతగాని, ఆమెను శంతనుడు తన రాణిగా చేసుకొనలేకపోయాడు.  ఆమె ఉపరిచరుడనే వసువు కుమార్తె అట.




అనుమానం రాకూడదు గాని, గంగపుత్రుడైన దేవవ్రతుడు (భీష్ముడు) పూర్వం ఒక బోస్ (వసు/వసువు) కదా?  (చూడండి - వసు>బసు>బోసు>బోష>బోజ>బోయ అంటూ దేశాంతరాల ఉచ్చారణలో మార్పు కలిగే అవకాశం ఉండవచ్చేమో.)  గంగపుత్రుడు అంటే మరలా మత్స్యకారుడే, బెస్తవాడే.

రామాయణకాలానికే బోయనాయకులు చిన్నపాటి రాజ్యాలు ఏలేవారని, తమ సైన్యంతో మహారాజులకు అవసరమైనపుడు తోడ్పడేవారని తెలుస్తోంది.   తెలుగుదేశాలలో వారి నివాసాలను కొట్టం అనేవారు.  తూర్పు చాళుక్యుల శాసనాలలో బోయ అనే ఇంటిపేరు కలిగిన బ్రాహ్మణుల ప్రసక్తి ఉన్నదంటారు.  

గ్రామనాయకుడు అనే అర్థం కలిగిన భోజ అనే పదం బోయగా మారిందని కొందరి వాదన.  కుంతిదేవిని పెంచుకున్నది భోజుడే.  కాళిదాసును పోషించిన భోజరాజు కథలు ప్రసిద్ధాలు.  మహాభారతకాలం నాటికి విదర్భరాజులకు భోజులు అని వ్యవహారం.  రుక్మిణి భోజకన్య.  ఆమె శ్రీకృష్ణుని పట్టపురాణి.  ఆమెను కృష్ణుడు ఎత్తుకొచ్చి మరీ పెండ్లి చేసుకున్నాడు.  వివాహవయస్సు వచ్చినప్పటికీ చాలకాలం పెళ్లికాని కన్యకలకు ఆ రుక్మిణీకల్యాణఘట్టాన్ని వింటే వెంటనే వివాహయోగం కలుగుతుందని తత్పఠన/శ్రవణఫలానుకీర్తనం కూడా చేస్తారు.



కాళహస్తిలో తన దైవమైన శివుని కంటె ఎత్తైన కొండపై వెలసిన కణ్ణప్ప కూడా బోయడే కదా?

ఆహా!
ఈ బోయ అనే పదం "ఆటవిక" అనే అర్థంలో భారత-ఆఫ్రికాదేశాలలోను, "మత్స్యకార/నావిక" అనే అర్థంలో భారత-యూరోపు దేశాలలోను ఉండడం గమనిస్తే DNA అనేది మనుషుల శరీరాలలోనే కాక భాషలలో కూడా ఉంటుందని తెలుస్తోంది కదా?


Thursday, 20 December 2018

అడవిలో అన్యభాష

మనుషుల నడుమ Communication గొప్పేమిట్ట?
అసలు తన తోటి ప్రాణికి సమాచారాన్ని అందజేయలేని జీవజాతి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. మనం జడపదార్థాలుగా పరిగణించే వృక్షజాతులనడుమ కూడా సమాచారవినిమయం జరుగుతుందని జీవశాస్త్రవేత్తలు అంటున్నారు.
తల్లి చిరుత వేటాడినంత చలాకీగా పిల్లచిరుత కూడా వేటాడటం నేర్చుకోగలదు. తండ్రి గ్రద్ద ఎగిరినంత ఎత్తులకు పిల్ల గ్రద్దలు కూడా ఎగురగలవు. మునుపటి తరం పెలికన్లు, ఫ్లెమింగోలలాగానే మరుసటి తరం కూడా ఖండఖండాంతరాలు దాటి వలసలు, రాకపోకలు చేయగలవు.
అయితే
కొన్ని వందల వేల తరాలకు మునుపటి జీవప్రపంచం ఎలా ఉందో అది ఈనాటికీ అలాగే ఉండిపోయింది. జీవప్రపంచంలో మనిషి తన పూర్వీకులకంటె ఎంతగానో అభివృద్ధి చెందాడు. అది మానవజాతికి వరమా శాపమా అనే విషయంలో అనేకమంది అనేకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు.
ఆ విషయం కాసేపు పక్కనుంచితే, మనిషి అభివృద్ధికి మూలకారణాలలో భాష కూడా ఒకటి అనేది నిర్వివాదాస్పదవిషయాలలో ఒకటి. ఒక తరం తమ విజ్ఞానాన్ని మరుసటితరానికి అందించడం భాషవల్లనే సాధ్యమైంది. అదే క్రమాభివృద్ధికి పునాది అంటారు. సరే, ప్రపంచంలో అసంఖ్యాకమైన భాషలున్నాయి. అందులో - ఒక భాషలో కమ్యూనికేట్ చేయగలిగినవారు మాత్రమే అభివృద్ధి చెందుతారు మిగిలిన భాషలలో కమ్యూనికేట్ చేయగలిగినవారు వెనుకబడిపోతారు అనే భావన వ్యాపించడం, దానిని కొందరు రాజకీయకారణాలతోనూ కొందరు వ్యాపారకారణాలతోనూ సమర్థించడం జరుగుతోంది.
మన ఆంధ్రమంత్రి మరికొంత ముందుచూపు కలిగినవారు పాపం! ఆంధ్రులు తమ మాతృభాషను దాని ఖర్మకు దాన్ని వదిలి ఇంగ్లీషుభాషను దత్తమాతృభాషగా స్వీకరిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నంత సీరియస్ గా ఒక జీవో జారీచేశారు. మళ్లీ ఏమైందో వెనక్కు తీసుకున్నామని చెప్పారు గాని, ఇలా తలచుకున్న తక్షణమే గాని, జీవోలు జారీ అయిన మరుక్షణమే గాని భాషను మార్చుకోగల శక్తి మనిషికి తప్ప మరే జంతువుకూ లేదు! దాన్ని అభివృద్ధిచెందినవారి భాషలో adaptability అంటారట!
Existence కోసం Struggle చేయడం ప్రకృతిసహజం.
Struggle చేయడం కోసమే Existence ఉందని దబాయించి నిరూపించడం అధికారదర్పం!
ఓ జంతుప్రపంచపు అధికారదర్పం ఎలా ఉంటుందో ఈ క్రింది వ్యాసం చదివి మీ అభిప్రాయాన్ని చెప్పండి: 

1
 అనగనగా ఒక అడవి.
ఆ అడవినిండా రకరకాలజంతువులు, రకరకాల పక్షులు.
దానికి ఒక సింహం రాజు.
ఉన్నట్టుండి ఆ రాజుగారికి తన ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో తెలుసుకుందామనిపించింది.  నిజాలు తెలుసుకొనేసరికి ఆ రాజుగారికి తన ప్రజలమీద అమితమైన జాలి కలిగింది. 
 తనలా అవేమీ కూడా ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి తినటం లేదు!  కోతులు ఏవో దొరికిన పండ్లను తింటున్నాయి.  పక్షులు గింజలను ఏరుకొని తింటున్నాయి.  వడ్రంగి పిట్టైతే మరీ ఘోరంగా చెట్టులో అంగుళమంగుళం వెతికి పురుగులు పట్టి తింటోంది.  వేగంగా పరుగెత్తగలిగిన లేళ్లు, మంచి బలం కలిగిన కారెనుబోతులు సైతం గడ్డి మేస్తున్నాయి!  తేనెటీగలైతే ఎంతో శ్రమకోర్చి పూవు పూవూ తిరిగి మకరందాన్ని సేకరిస్తున్నాయి.  నక్కలు తొండేబిక్కలకోసం అడవంతా గాలిస్తున్నాయి!  తోడేండ్లు కుందేండ్ల వెనుక పారి పారి సొమ్మసిల్లి పోతున్నాయి.  చిరుతలకు తమను తిప్పలాడించే జింకలను పట్టుకొనేసరికి తల ప్రాణం తోకకొస్తోంది!  ఇలా వివిధవర్గాలకు చెందిన తన  ప్రజల కష్టాలను తెలుసుకున్న సింహరాజుగారి కళ్లనుండి దుఃఖాశ్రువులు జలజలకారాయి.
 అవన్నీ తనలాగా ఏనుగు కుంభస్థలాన్ని ఎందుకు తినలేకపోతున్నాయని ఆలోచించింది.  మేధోమథనం చేయగా చేయగా దానికి ఒకటే తట్టింది!  తాను గర్జించగలదు!  తన గర్జనకే గజరాజులు బెంబేలెత్తిపోతాయి.  మానసికంగా బలహీనపడతాయి.  ఏదో కాస్త నామ్ కే వాస్తే ప్రతిఘటన కనబరచినా, సులువుగానే లొంగిపోతాయి.  కాని, అడవిలో ఉన్న మిగిలిన జంతువులు పక్షులు తనలాగా గర్జించలేవు.  అందువల్ల వాటికి ఏనుగులు లొంగవు.  అవి లొంగటం లేదు కాబట్టి అవన్నీ గత్యంతరం లేక ఏనుగుకుంభస్థలాలనే శ్రేష్టమైన ఆహారాన్ని వదులుకొని వేరే ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి!
 ఇలా సమస్యకు మూలకారణం మిగిలిన జంతువులు సింహంలా గర్జించలేకపోవడమే అని తేలిపోయాక, అయితే ఈ సమస్యను పరిష్కరించేదెలా అని మరలా మేధోమథనం జరిగింది.  చివరకు  సమాధానం దొరికింది.  వెంటనే జంతువులన్నీ అర్జెంటుగా,  సింహంలా గర్జించడం నేర్చుకోవాలని సింహం జీవో పాస్ చేసింది.  ఇప్పటికే గర్జిస్తూ ఉన్నవి తమ గర్జనను కంటిన్యూ చేసుకోవచ్చునని, అలా కానిపక్షంలో జూన్ నుండి సింహగర్జనను మాత్రమే నేర్చుకొని తీరాలని, ఇదంతా అడవిజంతువుల శ్రేయస్సు కోసమే, ఉన్నతమైన బ్రతుకుతెరువుకోసమేనని,  దయచేసి ఈవిషయంలో రాజకీయాలు చేయవద్దని సింహం కోరింది.
 2
 సింహగర్జన జీవో పట్ల అడవిలో సహజంగానే కలకలం రేగింది.  సింహరాజుగారికి ప్రజల పట్ల ఉన్న అవ్యాజమైన ప్రేమకు, ఆ ప్రజల అభివృద్ధికి పాటుపడడంలో ఆయనకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆయన వందిమాగధులు ఆయనను పరిపరివిధముల పొగిడారు.  "అడవిలో అందరూ సింహగర్జనలు మాత్రమే చేస్తే, రకరకాల జంతుజలాల నోట సహజంగా ఉండే శబ్దవైవిధ్యం నశించిపోదా?  ఈ సింహగర్జన జీవో అరణ్యసంస్కృతి అనే మహావృక్షానికి గొడ్డలిపెట్టు" అంటూ కొన్ని ప్రకృతిప్రేమికులైన జంతువులు పక్షులు వాపోయాయి. 
 "నన్ను కమ్మని పాటలు పాడడం మానేసి గర్జించమంటే ఎట్లా?" అని కోకిల కన్నీళ్లు పెట్టుకుంటే "నిజమే!  కోకిల పాటలు లేకుంటే మన అడవిలోనికి వసంతకాలం వచ్చినట్టు ఎలా తెలుసుకొనేది?" అని కొన్ని పక్షులు జంతువులు దాన్ని "అమాయికంగా" సమర్థించాయి.  "నోరు మూసుకోండి!  వసంతమైతే ఏమిటి, చలికాలమైతే ఏమిటి?  మనకు కడుపునిండడం ముఖ్యం గాని, ఏ కాలమైతే మనకెందుకు?" అని మరికొన్ని వాటిని కసిరి నోరుమూయించాయి.
 తాము సింహగర్జన నేర్చుకుంటే ఇకమీదట తొండేబిక్కల బొక్కలను తోడక్కరలేదని, తాము కూడా ఏనుగు కుంభస్థలాన్ని తినొచ్చని నక్కలన్నీ సంబరపడి సింహగర్జన జీవోకు బేషరతుగా మద్దతు ప్రకటించాయి.  దానిని వ్యతిరేకించిన జంతువులపై విరుచుకు పడ్డాయి.  అభివృద్ధివ్యతిరేకులంటూ దుయ్యబట్టాయి.  నక్కల వాదన సమంజసమనిపించి వాటికి తోడేళ్లు చిరుతలు తోడయ్యాయి.
 కుందేళ్లు, జింకలు వంటి గడ్డితినే జంతువులన్నీ ఒక సంఘంగా ఏర్పడి సింహగర్జన జీవోకు తమ సంఘీభావం తెలిపాయి.  ఈ జీవోవల్ల తమను వేటాడే జంతువులకు ఆహారప్రత్యామ్నాయం లభిస్తుందని,  అందువల్ల తమ జాతులకు భద్రత ఏర్పడుతుందని,  ఆ రకంగా తాము అభివృద్ధి చెందగలమని చెప్పి, సింహరాజుగారికి పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశాయి.
 పక్షులు కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని తమకు ఈ జీవో ఎంతవరకు అనుకూలం అని చర్చించుకున్నాయి.  సింహరాజుగారి తరపున సమావేశానికి హాజరైన పదునుముక్కు గ్రద్దమంత్రి మాట్లాడుతూ, "ఇకమీదట పక్షిజాతులు నానాకూతలు కూసి ఎవరికీ లోకువ కానవసరం లేదని, సింహగర్జనను నేర్చుకుంటే ఏ అడవికి పోయినా అందరూ గౌరవిస్తారని" నచ్చజెప్పడంతో జీవోకు పక్షుల మద్దతు కూడా లభించింది.
 3
 మరోవైపు ఏనుగులు కూడా అత్యవసరసమావేశం ఏర్పాటు చేసుకున్నాయి.  సింహగర్జన జీవో వెనుక అసలు ఉద్దేశం తమ జాతికి సింహంతో ఉన్న జాతివైరం తప్ప మరొకటి  కారణం కాదని  అభిప్రాయపడ్డాయి.  అడవిలో ఉండే సమస్త జంతుజాలానికి తమ కుంభస్థలపు మాంసమే శ్రేష్ఠాహారమని చెప్పడం అశాస్త్రీయమని, ప్రకృతివిరుద్ధమని, భూమిమీద నడిచే జంతువులన్నిటిలోనూ అతి బలవంతమైన జాతిగా పేరు గడించిన తమపై తక్కిన జంతువులన్నింటినీ మూకుమ్మడిదాడికి ప్రేరేపించే విధంగా జీవో తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.  తమలో ఎవరమైనా ఎప్పుడైనా సింహానికి లొంగితే, దాని గర్జనకు భయపడి కానే కాదని, ఆ సింహంలో ఉండే సత్తాకు మాత్రమే లొంగామని, తాము ఆత్మరక్షణకు పూనుకున్నపుడు దాడికి దిగిన ఎన్నో సింహాలను తమ కాళ్లక్రింద మట్టగించి చంపేసిన సంఘటనలున్నాయని గుర్తు తెచ్చుకున్నాయి.  ఏనుగులే శ్రేష్ఠమైన ఆహారమని చెబుతున్న సింహాలకు కూడా ఆ ఆహారం నిత్యం అందుబాటులో ఉండదని,  అది అటుంచితే  సింహం గర్జిస్తే కొన్ని పిరికి జంతువులు మహా అయితే భయపడతాయేమో కాని లొంగిపోవని, అవి అంత సులువుగా  లొంగిపోయేమాటే గనుక నిజమైతే, జింకలను ఎనుబోతులను వేటాడేందుకు కూడా సింహాలు గుంపులు గుంపులుగా ఎందుకుపోతాయని ప్రశ్నించుకున్నాయి.  ఈనిజాలను అడవిజంతువులన్నటికీ తెలియజేయవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి.
 ఏనుగుల తిరుగుబాటును సింహాలు సహించలేకపోయాయి.  అడవిలో లభించే ఆహారం అడవిజంతువుల ఉమ్మడి సొత్తని, కాని, ఏనుగులు మిగిలిన ఏ జంతువుతో పోల్చినా అత్యధికంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయని, అలా తినడాన్ని అక్రమాహారంగా పరిగణించాలని, ఏనుగుల అక్రమాహారం వల్ల అడవి నాశనం కానున్నదని,  త్వరలోనే అడవిలోని జంతువులకు ఆహారపు కొఱత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, అలా ఆ ఏనుగులు అక్రమంగా తిన్న ఆహారాన్ని తమ కుంభస్థలాల్లో దాచుకున్నాయని, అందువల్ల వాటిని బద్దలుగొట్టి అడవిజంతువులన్నటికీ  పంచేందుకు కృతనిశ్చయులమై ఉన్నామని, ఆ ఉద్దేశంతోనే ఏనుగుల భరతం పట్టేందుకు సింహగర్జన జీవో తెచ్చామని, ఎవరూ ఏనుగుల దుష్ప్రచారాన్ని కల్లబొల్లి ఏడుపులను నమ్మవద్దని సింహాలు ప్రకటించాయి. 
 ఒకవైపు రాజకీయం చేయకండని కోరుతూ స్వయంగా రాజకీయం చేస్తారా అని ఏనుగులు మండిపడ్డాయి. 
4
సింహగర్జన జీవో జారీ అయి చాలా కాలమైంది.  జంతువులు పక్షులు సింహగర్జనను అంత సులువుగా నేర్చుకోలేకపోతున్నాయి.  కాని అనుకరణనిపుణులైన చిలుకలు మైనాలు కొంతవరకు నేర్చుకున్నాయి. సింహరాజుగారు సభలో ఒకసారి ఏదో విషయం అడిగితే అవి సింహగర్జనతోనే బదులు చెప్పాయి.  అది వాటి పొగరని సింహానికి కోపం వచ్చింది.  మిగిలిన జంతువులన్నీ తమలాగే గర్జించడం నేర్చుకుంటే తమ ప్రత్యేకత ఇంకేముంటుందని సింహాలన్నీ సింహరాజుకు మొరపెట్టుకున్నాయి. 
 సింహరాజు నవ్వి,
 "ఉరే అమాయికుల్లారా!  అసలు ఏ జంతువైనా తమ స్వంతభాషను వదిలి పరాయి భాషను మాట్లాడగలదా?  అలాంటివన్నీ మనిషనే వింత జంతువొకటే చేయగలదు.   సింహాసనం మీద ఉన్న నేను ఏదో చేస్తున్నానని అందరికీ అనిపించాలి.  మన ప్రత్యర్థులు మహా అవినీతిపరులని, మన పనులకు వారు అడ్డుపడుతున్నారని దుష్ప్రచారం చేయడానికి మాత్రమే ఈ హడావుడి" అని చిద్విలాసంగా  చెప్పాడు.
(ఈ నా వ్యాసం మునుపు ఏసియానెట్ న్యూస్ లో ప్రచురింపబడింది.)

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...