Wednesday 8 August 2018

శాశ్వతం ఏది?

అనగా అనగా...
సృంజయుడు అని ఒకానొక రాజు ఉండేవాడు. అతడు మిక్కిలి వినయవంతుడు. పండితులను, బ్రాహ్మణులను శ్రద్ధగా సేవించుకొనేవాడు.
ఆయన శ్రద్ధకు మెచ్చిన నారదమహర్షులవారు "నాయనా! ఏమి వరం కావాలో కోరుకో" అని అడిగారు.
సృంజయుడు సంబరపడి - "దేవర్షీ, నాకొక కుమారుడు కలగాలి. అతడి మలమూత్రాలు, ఉమ్మి, చెమట కూడా స్వర్ణమయంగా ఉండాలి" అని కోరుకున్నాడు.
నారదమహర్షులవారు "తథాస్తు" అన్నారు.
అనంతరం రాజుకు అటువంటి కుమారుడు కలిగాడు.
రాజుగారి దశ తిరిగిపోయింది.
తన ఇంటిని, ఇంటి గచ్చును, మంచాలను, కంచాలను కూడా బంగారుమయంగా చేసుకున్నాడు.
అతడు చేసే బంగారు దానాలకు అంతులేకుండా పోయింది.
ఆ రాజకుమారుని అందరూ "సువర్ణష్ఠీవి" అని పిలవసాగారు.
ఉన్నట్టుండి ఒకరోజు కొందరు దొంగలు అతనిని ఎత్తుకుపోయారు. బంగారం కోసం అతని శరీరాన్ని చీల్చి చూశారు. ఏ బంగారమూ దొరకలేదు. బంగారమంటి రాజకుమారుడు మాత్రం చచ్చిపోయాడు. తన కొడుకుకు పట్టిన దుర్గతిని చూసి రాజు ఎంతగానో కుమిలి కుమిలి ఏడ్చాడు.
అపుడు నారదమహర్షులవారు అక్కడకు వచ్చారు.
"ఏమయ్యా రాజా! అందరిలాంటి కొడుకును కోరుకున్నావు కాదు, నీ దురాశ వల్లనే నీ కొడుకుకు ఈ దుర్గతి పట్టింది, నీకు శోకం మిగిలింది." అన్నారు.
"డబ్బు శాశ్వతం కాదు,
డబ్బు వలన శాశ్వతత్వం కూడా కలుగదయ్యా!" అన్నారు.
కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు.
***
(1)
"మరున్మహారాజు శంకరభగవానుడి దయ వల్ల బంగారు కొండను పొందాడు. దానితో అతడు అనేక యజ్ఞాలు చేసి గొప్ప గొప్ప దానాలు చేశాడు. అయినా అతడు శాశ్వతంగా ఉండలేకపోయాడు. నువ్వు , నీ కొడుకు ఆ మరున్మహారాజు కంటే గొప్పవాళ్ళు కాదుగా?"
(2)
"సుహోత్రమహారాజు ఎంతటి వాడంటే అతని పాలనలో మేఘాలు బంగారు వర్షం కురిపించేవి. బంగారు నదులు ప్రవహించేవి. అందులో బంగారు చేపలు బంగారు మొసళ్ళు ఉండేవి. అయినా అతడు శాశ్వతంగా ఉండలేకపోయాడు. నువ్వు ,నీ కొడుకు ఆ సుహోత్రమహారాజు కంటే గొప్పవాళ్ళు కాదుగా?"
(3)
"శిబిచక్రవర్తి తెలుసా? ఒక పావురాన్ని డేగ బారినుండి కాపాడడం కోసం తన తోడనే కోసి ఇచ్చిన మహానుభావుడు. శివుడు అతని దానశీలానికి మెచ్చి అతనికి తరగని సంపద ఉండేలా అనుగ్రహించాడు. అయినా అతడు శాశ్వతంగా ఉండలేకపోయాడు. నువ్వు , నీ కొడుకు ఆ శిబిచక్రవర్తి కంటే గొప్పవాళ్ళు కాదుగా?"
(4)
"భగీరథుడు, దిలీపుడు, మాంధాత, యయాతి, శ్రీరాముడు, అంబరీషుడు, శశబిందుడు, గయుడు, రంతిదేవుడు, శకుంతలాదుష్యంతుల తనయుడు అయిన భరతుడు, పృథు చక్రవర్తి - వీళ్లందరి గురించి విన్నావా?
వారు చేసిన ఘనకార్యాలను గూర్చి మాత్రమే కాదు,
వారి మహాసంపదను గూర్చి విన్నావా?
అలాగే, వారు తమ ప్రజలకు చేసిన మహోపకారాలను గూర్చి తెలుసుకున్నావా?
వారిని తరతరాలుగా ప్రజలు గుర్తుంచుకుని పొగుడుతున్నారు అని నీకు తెలుసునా?
అయినా వీరెవ్వరూ కూడా శాశ్వతంగా ఉండలేకపోయారు.
నువ్వు, నీ కొడుకు ఆ మహా మహా చక్రవర్తులకంటే పెద్ద గొప్పవాళ్ళా?"
నారదమహర్షులవారి మాటలు విన్నాక సృంజయ మహారాజుకు నోట మాట రాలేదు.
"నేను చెప్పింది అర్థమైందా మహారాజా?" అని రెట్టించి అడిగారు నారదమహర్షులవారు.
"అర్థమైంది దేవర్షీ! ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు, ఏదీ శాశ్వతం కాదు, ఏదో కావాలని, మరేదో పోయిందని ఏడవడం కంటే ప్రజలకు మంచి చేస్తూ జీవించడమే రాజుకు పరమధర్మం, ప్రథమకర్తవ్యం" అన్నాడు సృంజయమహారాజు.
"చక్కగా గ్రహించావు రాజా!" అన్నారు నారదమహర్షులవారు తృప్తిగా.
***
కురుక్షేత్రంలో అభిమన్యుడు వీరమరణం పొందాక గోలుగోలున ఏడుస్తున్న ధర్మరాజుకు ఈ కథను చెప్పింది వ్యాసమహర్షులవారు. అపుడు ధర్మరాజు కూడా -
"అర్థమైంది తాతగారూ! ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు, ఏదీ శాశ్వతం కాదు, ఏదో కావాలని, మరేదో పోయిందని ఏడవడం కంటే ప్రజలకు మంచి చేస్తూ జీవించడమే రాజుకు పరమధర్మం, ప్రథమకర్తవ్యం" అని అన్నాడు.
(మహాభారతం - ద్రోణపర్వంలోని కథ ఇది.)
***
ఇలా ఆనాడు తమకు తగని ఆలోచనలు చేసే రాజులకు కొందరు జ్ఞానులైన వారు హితబోధతో పాటు కర్తవ్యోపదేశం చేసేవారు. స్వతః గా వినయవంతులు అయిన ఆ రాజులు వాటిని శిరసా వహించేవారు.
***
ఈనాడు కూడా "మేము శాశ్వతంగా ఉంటాం" అని కలలు కనే రాజులున్నారు. కానీ, "నీ కోరికలు తీరేవి కావు" అంటూ నిక్కచ్చిగా చెప్పగల నారదుడు, వ్యాసుడు వంటి హితబోధకులూ ఎక్కడా లేరు.
హితవు చెప్పబోతే శారీరకంగానో మానసికంగానో దాడి చేసే రాజుగారి అనుచరగణాలకు భయపడి నిశ్శబ్దంగా ఉంటారు. అందువల్ల ఆ రాజులు తమ కోరిక తప్పక నెరవేరుతుందని భ్రమతో ఎటువంటి పనులను చేసేందుకైనా తెగిస్తూ ఉంటారు కూడా.
"మేము ఫలానా ఫలానా వ్యక్తిని సలహాదారుగా నియమించుకున్నాం" అని కొందరి మెప్పు కోసం వోట్ల కోసం అటువంటి రాజులు మభ్యపెడుతూ ఉంటారు. కానీ వారిని ఎన్నడూ సలహా అడిగేదీ ఉండదు, వారికి జీతం ఇచ్చేదీ ఉండదు.
పాపం, ఒక్క పూట దుష్టశక్తుల దృష్టి తగిలిన పాపానికి "రాజుగారి సలహాదారు"లనే మిథ్యాబిరుదును పొంది కొందరు నిర్దోషులు మాత్రం నిందాపాత్రులుగా మిగిలిపోతుంటారు.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...