Showing posts with label Development. Show all posts
Showing posts with label Development. Show all posts

Wednesday, 8 August 2018

శాశ్వతం ఏది?

అనగా అనగా...
సృంజయుడు అని ఒకానొక రాజు ఉండేవాడు. అతడు మిక్కిలి వినయవంతుడు. పండితులను, బ్రాహ్మణులను శ్రద్ధగా సేవించుకొనేవాడు.
ఆయన శ్రద్ధకు మెచ్చిన నారదమహర్షులవారు "నాయనా! ఏమి వరం కావాలో కోరుకో" అని అడిగారు.
సృంజయుడు సంబరపడి - "దేవర్షీ, నాకొక కుమారుడు కలగాలి. అతడి మలమూత్రాలు, ఉమ్మి, చెమట కూడా స్వర్ణమయంగా ఉండాలి" అని కోరుకున్నాడు.
నారదమహర్షులవారు "తథాస్తు" అన్నారు.
అనంతరం రాజుకు అటువంటి కుమారుడు కలిగాడు.
రాజుగారి దశ తిరిగిపోయింది.
తన ఇంటిని, ఇంటి గచ్చును, మంచాలను, కంచాలను కూడా బంగారుమయంగా చేసుకున్నాడు.
అతడు చేసే బంగారు దానాలకు అంతులేకుండా పోయింది.
ఆ రాజకుమారుని అందరూ "సువర్ణష్ఠీవి" అని పిలవసాగారు.
ఉన్నట్టుండి ఒకరోజు కొందరు దొంగలు అతనిని ఎత్తుకుపోయారు. బంగారం కోసం అతని శరీరాన్ని చీల్చి చూశారు. ఏ బంగారమూ దొరకలేదు. బంగారమంటి రాజకుమారుడు మాత్రం చచ్చిపోయాడు. తన కొడుకుకు పట్టిన దుర్గతిని చూసి రాజు ఎంతగానో కుమిలి కుమిలి ఏడ్చాడు.
అపుడు నారదమహర్షులవారు అక్కడకు వచ్చారు.
"ఏమయ్యా రాజా! అందరిలాంటి కొడుకును కోరుకున్నావు కాదు, నీ దురాశ వల్లనే నీ కొడుకుకు ఈ దుర్గతి పట్టింది, నీకు శోకం మిగిలింది." అన్నారు.
"డబ్బు శాశ్వతం కాదు,
డబ్బు వలన శాశ్వతత్వం కూడా కలుగదయ్యా!" అన్నారు.
కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు.
***
(1)
"మరున్మహారాజు శంకరభగవానుడి దయ వల్ల బంగారు కొండను పొందాడు. దానితో అతడు అనేక యజ్ఞాలు చేసి గొప్ప గొప్ప దానాలు చేశాడు. అయినా అతడు శాశ్వతంగా ఉండలేకపోయాడు. నువ్వు , నీ కొడుకు ఆ మరున్మహారాజు కంటే గొప్పవాళ్ళు కాదుగా?"
(2)
"సుహోత్రమహారాజు ఎంతటి వాడంటే అతని పాలనలో మేఘాలు బంగారు వర్షం కురిపించేవి. బంగారు నదులు ప్రవహించేవి. అందులో బంగారు చేపలు బంగారు మొసళ్ళు ఉండేవి. అయినా అతడు శాశ్వతంగా ఉండలేకపోయాడు. నువ్వు ,నీ కొడుకు ఆ సుహోత్రమహారాజు కంటే గొప్పవాళ్ళు కాదుగా?"
(3)
"శిబిచక్రవర్తి తెలుసా? ఒక పావురాన్ని డేగ బారినుండి కాపాడడం కోసం తన తోడనే కోసి ఇచ్చిన మహానుభావుడు. శివుడు అతని దానశీలానికి మెచ్చి అతనికి తరగని సంపద ఉండేలా అనుగ్రహించాడు. అయినా అతడు శాశ్వతంగా ఉండలేకపోయాడు. నువ్వు , నీ కొడుకు ఆ శిబిచక్రవర్తి కంటే గొప్పవాళ్ళు కాదుగా?"
(4)
"భగీరథుడు, దిలీపుడు, మాంధాత, యయాతి, శ్రీరాముడు, అంబరీషుడు, శశబిందుడు, గయుడు, రంతిదేవుడు, శకుంతలాదుష్యంతుల తనయుడు అయిన భరతుడు, పృథు చక్రవర్తి - వీళ్లందరి గురించి విన్నావా?
వారు చేసిన ఘనకార్యాలను గూర్చి మాత్రమే కాదు,
వారి మహాసంపదను గూర్చి విన్నావా?
అలాగే, వారు తమ ప్రజలకు చేసిన మహోపకారాలను గూర్చి తెలుసుకున్నావా?
వారిని తరతరాలుగా ప్రజలు గుర్తుంచుకుని పొగుడుతున్నారు అని నీకు తెలుసునా?
అయినా వీరెవ్వరూ కూడా శాశ్వతంగా ఉండలేకపోయారు.
నువ్వు, నీ కొడుకు ఆ మహా మహా చక్రవర్తులకంటే పెద్ద గొప్పవాళ్ళా?"
నారదమహర్షులవారి మాటలు విన్నాక సృంజయ మహారాజుకు నోట మాట రాలేదు.
"నేను చెప్పింది అర్థమైందా మహారాజా?" అని రెట్టించి అడిగారు నారదమహర్షులవారు.
"అర్థమైంది దేవర్షీ! ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు, ఏదీ శాశ్వతం కాదు, ఏదో కావాలని, మరేదో పోయిందని ఏడవడం కంటే ప్రజలకు మంచి చేస్తూ జీవించడమే రాజుకు పరమధర్మం, ప్రథమకర్తవ్యం" అన్నాడు సృంజయమహారాజు.
"చక్కగా గ్రహించావు రాజా!" అన్నారు నారదమహర్షులవారు తృప్తిగా.
***
కురుక్షేత్రంలో అభిమన్యుడు వీరమరణం పొందాక గోలుగోలున ఏడుస్తున్న ధర్మరాజుకు ఈ కథను చెప్పింది వ్యాసమహర్షులవారు. అపుడు ధర్మరాజు కూడా -
"అర్థమైంది తాతగారూ! ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు, ఏదీ శాశ్వతం కాదు, ఏదో కావాలని, మరేదో పోయిందని ఏడవడం కంటే ప్రజలకు మంచి చేస్తూ జీవించడమే రాజుకు పరమధర్మం, ప్రథమకర్తవ్యం" అని అన్నాడు.
(మహాభారతం - ద్రోణపర్వంలోని కథ ఇది.)
***
ఇలా ఆనాడు తమకు తగని ఆలోచనలు చేసే రాజులకు కొందరు జ్ఞానులైన వారు హితబోధతో పాటు కర్తవ్యోపదేశం చేసేవారు. స్వతః గా వినయవంతులు అయిన ఆ రాజులు వాటిని శిరసా వహించేవారు.
***
ఈనాడు కూడా "మేము శాశ్వతంగా ఉంటాం" అని కలలు కనే రాజులున్నారు. కానీ, "నీ కోరికలు తీరేవి కావు" అంటూ నిక్కచ్చిగా చెప్పగల నారదుడు, వ్యాసుడు వంటి హితబోధకులూ ఎక్కడా లేరు.
హితవు చెప్పబోతే శారీరకంగానో మానసికంగానో దాడి చేసే రాజుగారి అనుచరగణాలకు భయపడి నిశ్శబ్దంగా ఉంటారు. అందువల్ల ఆ రాజులు తమ కోరిక తప్పక నెరవేరుతుందని భ్రమతో ఎటువంటి పనులను చేసేందుకైనా తెగిస్తూ ఉంటారు కూడా.
"మేము ఫలానా ఫలానా వ్యక్తిని సలహాదారుగా నియమించుకున్నాం" అని కొందరి మెప్పు కోసం వోట్ల కోసం అటువంటి రాజులు మభ్యపెడుతూ ఉంటారు. కానీ వారిని ఎన్నడూ సలహా అడిగేదీ ఉండదు, వారికి జీతం ఇచ్చేదీ ఉండదు.
పాపం, ఒక్క పూట దుష్టశక్తుల దృష్టి తగిలిన పాపానికి "రాజుగారి సలహాదారు"లనే మిథ్యాబిరుదును పొంది కొందరు నిర్దోషులు మాత్రం నిందాపాత్రులుగా మిగిలిపోతుంటారు.

Friday, 9 December 2016

దేవో దుర్బలఘాతకః

అనగనగా ఓ దర్జీ ఉన్నాడట.

ఓరోజు ఓ పెద్దాయన ఒక మంచి గుడ్డ తెచ్చి, ఏమయ్యా దర్జీ దర్జీ, దీనితో నాకు ఓ చొక్కా కుట్టి పెట్టవయ్యా అని అడిగాడట. ఆ దర్జీ గుడ్డ కొలత చూసి, అబ్బే, ఇది మీకు సరిపోదండీ అన్నాడట. అదేమిటీ? అమ్మిన షాపువాడు సరిపోతుందని చెప్పి ఇచ్చాడే అన్నాడట ఆ పెద్దమనిషి. అయితే ఆ షాపువాడినే అడగండి కుట్టిపెట్టమని అని నిర్లక్ష్యంగా చెప్పాడట దర్జీ. 


కొద్ది రోజులయ్యాక ఆ పెద్దమనిషి ఆ చొక్కాను కుట్టించుకొని వేసుకొచ్చాడట. ఏమయ్యా చూశావా? నేను ఇంకో దర్జీని అడిగాను. అతడు నాకు చక్కగా కుట్టివ్వడమే కాకుండా తన అబ్బాయికి కూడా అదే గుడ్డతోనే చొక్కా కుట్టుకున్నాడు తెలుసా? అని చెప్పాడట.

అవునా? ఆ అబ్బాయి వయసు ఎంత అని అడిగాడట దర్జీ. ఐదేళ్లు అని చెప్పాడట పెద్దాయన. అదీ! అలా చెప్పండి! మా అబ్బాయికి ఇరవై ఏళ్ళు కదా? మరి సరిపోతుందని నేనెలా చెప్పగలను? అన్నాడట దర్జీ.
నేటి వ్యాపారస్థుల తంతు కూడా ఇలాగే ఉంటుంది.
<><><><><><>

తమకు ఎక్కువ లాభం ఏ ప్రోడక్ట్ మీద వస్తుందో, దానినే వ్యాపారస్థులు మార్కెట్ లో ప్రజలకు అందిస్తారు. అంతేగాని, వస్తువు మంచి చెడ్డలను వారు పట్టించుకోరు. ఫలానా కూల్ డ్రింకులో పురుగులమందు అవశేషాలు ఉంటున్నాయి అని వార్తలు వచ్చినా వారు కూల్ గా అమ్మేస్తూ ఉంటారు. ఫలానా నూడుల్స్ లో ఫలానా ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి అని ల్యాబోరేటరీ ఫలితాలు స్పష్టంగా చెప్పినా, తమకు అదేమీ తెలియనట్టు నటిస్తూ షాపునుండి ఆ వస్తువులను తొలగించే ప్రయత్నం ఏదీ చేయరు.

వినియోగదారుల్లో ఆందోళన బాగా పెరిగి నిరసన వ్యక్తం చేసినపుడో లేక ఏ ప్రభుత్వమో ఏ కోర్టో ఆ ప్రోడక్టును తొలగించమని ఆదేశమిస్తే అప్పుడు తప్పదు కాబట్టి మహా బాధ్యత కలిగి ఆ ఆజ్ఞను శిరసావహించేవారిలా ఆ ప్రోడక్టులను పక్కన పెడతారు. గొడవ సద్దు ముణిగిన తరువాత చల్లగా మళ్ళీ దానినే జనాలకు అంటగట్టడం ప్రారంభిస్తారు. వినియోగదారుల శ్రేయస్సు వారికేమీ అవసరం లేదు అనేది స్పష్టం.
<><><><><><>

అగ్రరాజ్యమైనా మార్పు లేదు, ఇదే తంతు!

1929లో ప్రపంచదేశాలలో - ముఖ్యంగా యూరోపియన్ దేశాలు & అమెరికాలో మహా - ఆర్థికమాంద్యం ప్రారంభమైంది. (దీనినే గ్రేట్ డిప్రెషన్ అంటారు).

అంటే వ్యాపారుల పెట్టుబడులకు తగినంత రాబడులు రాకపోవడం. వ్యాపారంలో వచ్చే లాభాలకంటే బ్యాంకు వడ్డీ రేట్లే అధికంగా ఉండటంతో అందరూ వ్యాపారం మానేసి బ్యాంకులోనే డిపాజిట్లు చేయడం మొదలు పెట్టారు. కానీ, సహజంగానే బ్యాంకు తనవద్ద లోన్లు తీసుకొనేవారు లేక, ఆదాయం దానికి కూడా సరిపోక తాను చెల్లించే వడ్డీ రేట్లు తగ్గించింది. దాంతో అందరూ బ్యాంకు నుండి డిపాజిట్లను వెనక్కు తీసుకొనడం మొదలు పెట్టారు. బ్యాంకులు దివాళా తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా అటు లాభాలు రావని వ్యాపారం చేసేవారు లేరు, బ్యాంకులు మూకుమ్మడిగా మూతపడే పరిస్థితులు వచ్చాయి. నిరుద్యోగం ఎక్కువైంది. దెబ్బకు గొప్ప గొప్ప దేశాలుగా పేరు మోసినవన్నీ, అమెరికాతో సహా పెద్ద పెద్ద దరిద్రుల దేశాలుగా మారిపోతున్నట్టు కనిపించింది.

1933 లో అమెరికాలో డెమొక్రాట్ అయిన రూజ్వెల్ట్ ప్రెసిడెంటు అయ్యాక, రేడియోలో తన ప్రసంగాలను ధారావాహికలుగా ప్రజలకు వినిపించి వారిలో భవిష్యత్తుమీద నమ్మకం రేకెత్తించాడు. కానీ, ఉద్యోగావకాశాలు కల్పించటం కంటే, ఆయన వ్యాపారాభివృద్ధికే చొరవ చూపాడు.

ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా? అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా అవసరాలకు మించి పండుతున్న గోధుమ పంటను లక్షలాది టన్నులు ఆయన నిర్దాక్షిణ్యంగా తగలబెట్టించాడు, సముద్రాలలో పారబోయించాడు. ఈ చర్య ద్వారా ఆయన సప్లై - డిమాండ్ - ధర సూత్రాన్ని స్థిరంగా అమలుపరచాలని సంకల్పించాడు. సహజంగానే, ఆహారపదార్థాల సప్లై తక్కువయ్యే సరికి డిమాండ్ పెరిగింది. రేటు కూడా పెరిగింది. వ్యాపారులు లాభపడ్డారు. నెమ్మదిగా ఆర్థికవ్యవస్థ కుదుట పడింది. కానీ, ధనవంతులు మాత్రమే ఆహారపదార్థాలు కొనుక్కోగలిగితే, పెద్దగా డబ్బులేనివారు పేదవారు మాత్రం తమ ప్రెసిడెంటు స్వయంగా సృష్టించిన ఈ కృత్రిమ కరువు దెబ్బకు ఆకలితో మల మల మాడిపోవలసి వచ్చింది. కానీ, వారి గోడు ఎవరికీ పట్టలేదు. ఏదేమైనా, ఇదేదో బావుందని యూరోపియన్ దేశాలు కూడా ఇలా చేతికందిన ఆహారపదార్థాలను తమ ప్రజల నోటికందకుండా నాశనం చేయడం ప్రారంభించాయి. ఫలితం కూడా కనిపించింది. ఆర్థికరంగాన్ని పైకెత్తేందుకు పేదల కడుపుపై కొట్టడం ఎంత క్రూరమైన చర్య!

ఇది చరిత్రలో మాయని పెద్ద మచ్చగా, కళంకంగా మిగిలిపోయేలా కనిపించింది. కానీ, ఇంతలో 1941 లో, జపాన్ అమెరికాకు చెందిన పెరల్ హార్బర్ మీద భయంకరంగా వైమానిక దాడి చేయడంతో అమెరికా తప్పనిసరిగా రెండవప్రపంచ యుద్ధంలో పాల్గొనవలసి వచ్చింది. ఆ సందర్బంగా దాదాపు 17 మిలియన్ల అమెరికన్లకు ఉద్యోగావకాశాలు లభించాయి. యుద్ధపరికరాలు నిర్మించే పరిశ్రమలలోనూ, దానికి అవసరమైన ఖనిజాదులను సేకరించే పరిశ్రమలలోనూ, సైనికులుగానూ - ఇలా. ఆ ఉద్యోగాలు రావడంతో, యుద్ధం అంటే ఇష్టం ఉన్నా లేకున్నా, ఆకలితో చచ్చిపోయే కంటే కడుపునిండా తింటూ, యుద్ధం చేస్తూ చచ్చిపోవడం మేలని అమెరికాలోని పేదజనమంతా పొలోమని మిలటరీలో చేరిపోయారు. అమెరికా సాయంతో మిత్రపక్షాలు యుద్ధం గెలిచాయి. 1945 April 30 తేదీన హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

మొత్తానికి గెలిచినప్పటికీ, యుద్ధం ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల, మళ్ళీ మాంద్యం విజృంభించే సూచనలు కనబడ్డాయి. దాన్ని అరికట్టడానికి ఫ్రీ మార్కెట్ కేపిటలిజం విధానాన్ని పరిచయం చేశారు. అసలు ఇందుకోసం రకరకాల కసరత్తులు యుద్ధం జరుగుతూ ఉండగానే ప్రారంభమయ్యాయి. 1944 జూలైలో, 730 మంది డెలిగేట్లతో, 44 మిత్రదేశాలు న్యూ హ్యామ్ప్ షైర్ నగరంలో సమావేశమయ్యాయి. దీన్నే బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అంటారు. ఆయా దేశాల మధ్య ఎగుమతులు దిగుమతుల సందర్బంగా సుంకాలు తక్కువగా విధించాలన్న ఒప్పందం అందులో ప్రధానమైన నిర్ణయం. ఈ ఒప్పందంలో అమెరికా చెప్పలేనంతగా లాభపడింది. మిగిలిన అన్ని దేశాలకు దాదాపు నాయకునిగా మారిపోయింది. (ఈ ఒప్పందంలోని అంశాలే కొన్ని చేర్పులు మార్పులతో ఆ తరువాత GATT అనే పేరుతో (General Agreement on Trade and Tariff) ప్రసిద్ధమయ్యాయి.

ఇదిలా ఉండగా హిట్లర్ మరణంతో ఆగిపోయిందనుకున్న ప్రపంచయుద్ధం జపాన్ విజృంభణతో ఆగేలా కనిపించలేదు. మిత్రదేశాలన్నీ తమ నాయకుడైన అమెరికా ఏం చేస్తుందని చూడసాగాయి. అమెరికా తన నాయకత్వాన్ని వదులుకుంటే వ్యాపారపరమైన అధికలాభాలను కోల్పోవలసి వస్తుంది. కానీ, జపాన్ ను అణచడం అంత సులువుగా కనిపించలేదు. దాంతో, అమెరికా సాంప్రదాయ యుద్ధాన్ని విడిచి, తెగబడి, హిరోషిమా నాగసాకిలను అణుబాంబులతో ధ్వంసం చేసి, జపాన్ దేశాన్ని పాదాక్రాంతం చేసుకుంది.

ఇలా, కేవలం వ్యాపార ఒప్పందాల రక్షణకోసం మహావిధ్వంసం జరిగింది! హిరోషిమాలో 150000 మంది, నాగసాకిలో 75000 మంది తక్షణమే మరణించారు. మరెంతమందో తరాలతరబడి అంతుతెలియని రోగాలతో జీవచ్ఛవాల్లా బ్రతికారు, ఇప్పటికీ కొందరు బ్రతికే ఉన్నారు.
<><><><><><>

ఆధునిక వ్యాపారం ఈ విధంగా పేదల పట్ల దయలేనిదిగా, క్రూరంగా మారి పోవడానికి మూలబీజం అక్కడే పడింది. ఆ విధ్వంసక బాంబుల ఫలితం అమెరికా తలరాతను సంపూర్ణంగా మార్చేసింది. ప్రపంచమంతా అది చెప్పినట్లల్లా విని తల ఆడించవలసిన రోజులు వచ్చాయి. సోవియట్ రష్యా ఉన్నంతవరకు అది కొంత అదుపులోనే ఉంది, రష్యా విచ్చిన్నం కాగానే దానికి మరి అడ్డూ అదుపూ లేకుండా పోయాయి. చమురు కోసం అది సృష్టించిన కల్లోలం చిన్నదేమీ కాదు. మధ్య ఆసియా దేశాల్లో పట్టు సంపాదించేందుకు గాను, ఆ దేశాల్లో పరస్పరకలహాలు రేపేందుకు గాను అది సృష్టించిన తీవ్రవాద భూతం ఇప్పుడు ప్రపంచపు అస్తిత్వానికే పెను ముప్పుగా పరిణమించింది. ఇవన్నీ అమెరికా వ్యాపారదాహంతో విచక్షణారహితంగా చేసిన తప్పిదాలకు మనం చెల్లిస్తున్న మూల్యాలు!
<><><><><><>

ఇటువంటి క్రూర వ్యాపార సంస్కృతి గ్లోబలైజేషన్ ముసుగులో నెమ్మదిగా 20 వ శతాబ్దపు చివరి దశకంలో భారత్ లోకి కూడా చొరబడింది. అప్పటినుండి భారత్ లో వ్యాపారులు పుట్టలు పుట్టలుగా మహామహా కోటీశ్వరులు కావడం మొదలు పెట్టారు. అతిథిదేవో భవ అని ఆశాసించే మన దేశంలో చివరకు మంచి నీళ్లను కూడా డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన రోజులు దాపురించాయి.

క్రమంగా వారి ప్రభావం భారత్ రాజకీయ వ్యస్థను శాసించడం మొదలు పెట్టింది. వ్యాపారుల డొనేషన్లు లేకుంటే పార్టీని నడిపించడమనే అతి ఖరీదైన పనిని ఎంతటి తెలివైనవాడైనా, ఎంతటి సమర్ధుడైనా, ఎంతటి గొప్ప ఆశయాలు ఉన్నవాడైనా డబ్బులేని వాడు చేయలేడు. ఈ వ్యాపారులు మీడియాను కొనేసి, దాని ద్వారా తమకు అనుకూలమైన రాజకీయ పార్టీలను నిత్యం ప్రశంసిస్తూ ప్రజల ఆలోచనలను ప్రభావితం చేస్తూ, ఎన్నికల ఫలితాలను దాదాపు వారే నిర్ణయిస్తున్నంత పని చేస్తున్నారు. ఇపుడు ఏ పార్టీయైనా వారు చెప్పినట్టు వింటేనే మనుగడలో ఉంటుంది, లేదా ధూళిలో కలిసిపోతుంది అన్నట్టు తయారైంది పరిస్థితి.

చివరకు పన్ను కట్టడంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో కనిపెట్టి ఎగ్గొట్టడంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు వ్యాపారస్తులు అందరూ సమబుద్ధులై ఉన్నారు. మనకు రసీదు ఇస్తున్న వ్యాపారులెంతమంది ఉన్నారు కనుక?
<><><><><><>

సరే, చరిత్రపుటలనుండి నేటి రోజుకు తిరిగి వద్దాం. ప్రస్తుతం అటువంటి వ్యాపారులు నగదు చలామణీ లేక, కొనుగోళ్లు జరగక ఇబ్బంది పడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. వారి మీద మనం ఏమాత్రం జాలి పడనవసరం లేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించి ధనస్వామ్యంగా మార్చిన ఘనత వారిది. వారికి ఏ ఇబ్బందులు ఉన్నా అవన్నీ తాత్కాలికమే, నగదు విరివిగా చలామణీలోనికి వస్తే వాళ్ళు రక్తబీజుల్లా మళ్ళీ విజృంభిస్తారు. సందేహం లేదు, కాబట్టి, ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నా చివరకు బాధలు అనుభవించేది బలి అయ్యేది ఎప్పటికీ మనమే! సామాన్యప్రజలమే!

अश्वं नैव गजं नैव व्याघ्रं नैव च नैव च।
अजापुत्रं बलिं दद्याद् देवो दुर्बलघातकः।।

చివరకు ఆ దేవుడు కూడా తనకు బలిగా బలమైన గుఱ్ఱాన్ని గాని, ఏనుగును గాని, పులిని గాని కోరడట. కోరేది పాపం అమాయకమైన మేకపిల్లనట! అయ్యయ్యో! దేవుడు కూడా బలహీనుణ్ణే దెబ్బకొడతాడు కానీ, బలవంతుల జోలికి పోడే అని, పాపం, ఓ సంస్కృత కవి ఎప్పుడో వాపోయాడు!

Tuesday, 6 December 2016

Sorry, Yours is a Wrong Call!

అనగనగా ఒక ముసలవ్వ.
ఆ అవ్వకు ఏడుగురు కొడుకులు.
పెద్ద కొడుకు సైన్యంలో ఉన్నాడు.
మిగిలిన ఆరుగురూ అవ్వను చూసుకుంటూ ఊళ్లోనే ఉన్నారు.
ఇలా ఉండగా ఒకసారి యుద్ధం వచ్చింది.
పెద్ద కొడుకు చనిపోయాడని వార్త వచ్చింది.
ఊళ్ళో అందరూ ఆమెపై సానుభూతి కురిపించారు.
ఆమె మాత్రం రెండో కొడుకును యుద్ధానికి పంపింది.
అతడు కూడా చనిపోయాడని వార్త వచ్చింది. ఊరంతా బాధ పడుతూ ఉంటే ఆమె మూడో కొడుకును యుద్ధానికి పంపింది. అతడు కూడా చనిపోయాడు. అపుడు నాలుగో కొడుకును పంపింది. అలా ఒకరొకరుగా ఆరుగురు కొడుకులు యుద్ధంలో చనిపోయారు. ఊర్లో జనాల బాధకు అంతే లేదు. కాని ఆ మొండి ముసలవ్వ అందరూ వద్దు, వద్దు అంటున్నా, చివరి కొడుకైనా నీకు తోడుగా ఉంటాడంటున్నా పట్టించుకోకుండా యుద్ధానికి పంపింది. చివరకు అతడు కూడా చనిపోయినట్టు తెలిసింది.
అప్పడు ఆ ముసలవ్వ ఏడవటం మొదలు పెట్టింది.
జనాలు ఆమెను పిచ్చిదాన్ని చూసినట్టు చూశారు. "వద్దు వద్దన్నా పంపించావు. ఇప్పుడు ఏడుస్తున్నావు. మిగిలిన ఆరుగురు చనిపోయినప్పుడు ఏడవలేదు. ఇప్పుడు ఏడో కొడుకు చనిపోయాక ఎందుకు ఏడుస్తావు?" అని అడిగారు.
అప్పుడు ఆ అవ్వ "నేను నా ఏడో కొడుకు చనిపోయినందుకు ఏడవటం లేదు, యుద్ధానికి పంపటానికి నాకు మరికొంతమంది కొడుకులు లేరే అని ఏడుస్తున్నాను" అని అన్నదట!
<><><><><><><>
<><><><><><><>
ఇది మా అవ్వ మాకు చెప్పిన కథ. చాల చాల చిన్నప్పుడు విన్నది.
అది విన్నపుడు నేను ఏడ్చి కన్నీళ్లు పెట్టింది నాకు ఇంకా గుర్తుంది.
ఈ కథ పెద్దైన తరువాత కూడా మరెక్కడో చదివాను. అవ్వ గుర్తుకు వచ్చింది. మళ్ళీ చదవకుండా ఉండి ఉంటే మరచి పోయి ఉండే వాడినేమో! ఇది వీరమాతృత్వాన్ని ప్రశంసించే కథ! అసలు ఈ కథ అలా ఎప్పటినుండి ప్రచారంలో ఉందో తెలియనే తెలియదు. ఈ కథను సృష్టించినదెవరో మరి! దేశం కోసం ప్రజలు తమ ప్రాణాలను ధారపోయాలని పరోక్షంగా చెప్పిన కథ అది. తప్పేముంది? చాల మంచి కథే!
<><><><><><><>
<><><><><><><>
పారిశ్రామికవిప్లవం వచ్చాక యూరోపియన్ దేశాలు తమ ఆయుధసంపత్తితో ప్రపంచదేశాల మీద పడ్డాయి. దొరికిన ప్రాంతాన్ని దొరికినట్టు ఆక్రమించుకొని అక్కడి జనాలను దాదాపు బానిసలుగా చేసుకొని, వ్యాపారము ధనార్జన మాత్రమే ప్రధాన లక్ష్యాలుగా ప్రజలమీద పెత్తనం చెలాయించాయి.
శతాబ్దాల తరబడి వారు దోచుకున్న ధనమే పెట్టుబడిగా పెట్టి ఆ దేశాలు ఇప్పటికీ ధనిక దేశాలుగా వెలిగిపోతున్నాయి. దాన్ని వాళ్ళు తమ దేశపు వ్యాపారులు చేసిన సంపద సృష్టి అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ సంపదలో అత్యధిక శాతం సృష్టింపబడింది వారి వారి వలస దేశాలలోనే తప్ప వారి దేశాలలో కాదు అన్నది చారిత్రక సత్యం.
ఆ వలస స్వాముల నిర్దాక్షిణ్యమైన భారీ దోపిడీకి అనాగరిక జాతులైన ఆఫ్రికన్ల నుండి గొప్ప నాగరికత కలిగిన భారతదేశం వరకూ అందరూ బాధితులే!
మనమే ఇంకా అదృష్టవంతులం! ఆఫ్రికన్లు చాలాకాలం పాటు బానిసలుగా సంతలో పశువుల్లా క్రయవిక్రయాలకు గురి అయ్యే వారు. ఆస్ట్రేలియా అమెరికా ఖండాలలో నేటివ్ లను దాదాపు సర్వనాశనం చేసి అవి తరతరాలుగా తమ జన్మభూముల్లా దర్జా ఒలకబోస్తున్న వారు ఒకనాటి యూరోపియన్లే కదా!
మనమీద కూడా జలియన్ వాలా బాగ్ వంటి దౌర్జన్యపూరిత మారణకాండలు జరిపినా జంకకుండా పోరాడి పోరాడి మొత్తానికి వారిని ఎలాగో తరిమేశామనిపించుకొని, స్వాతంత్ర్యం వంటి పదార్థాన్ని ఒకదాన్ని తెచ్చుకొని, మన కర్మ మనం అనుభవిస్తున్నాము. కుంటుతూ పడుతూ లేస్తూ మన పాట్లు ఏవో మనం పడుతున్నాము.
<><><><><><><>
<><><><><><><>
ఇలా ఒకనాడు పాశ్చాత్య దేశాల సంపద సృష్టికి ఇతోऽధికంగా ఉపయోగపడిన బానిసదేశాలు మాత్రం ఈనాడు పేదరికంతో మగ్గిపోతుండగా,
ఆ సంపదను సృష్టించుకున్న దేశాలు మాత్రం పెత్తనం చేసే బుద్ధులు ఇంకా పోనిచ్చుకోలేక, చమురు ఎగుమతి చేసే దేశాల గొడవలలో తల దూర్చి, వాటితో పెట్టుకుని, కొరివితో తల గోక్కునారు. గ్లోబల్ టెర్రరిజం అనే కొత్త సమస్యను సృష్టించారు. హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోలేక ఇపుడు అభద్రతా భావంతో, మునుపటి కంటే మరింత భయంకరమైన ఆయుధాలను సృష్టించుకుని భయం భయంగా గడిపేస్తున్నారు.
చమురు ఎగుమతి చేసే ఈ మధ్య ఆసియాదేశాలు తమ వ్యవహారాల్లో విదేశాలజోక్యాన్ని భరించలేక, వారిని తరిమివేయాలి అనుకొనడం మంచిదే. చాల సహజమైన ప్రతిక్రియే.
కాని, వారు ఆ ఉద్యమాన్ని పొరబాటున మతానికి అటాచ్ చేశారు.
అంతే! ఆ ఉద్యమం విద్యావంతుల చేజారిపోయింది. పడరాని వారి చేతుల్లో పడింది. ఆపైన అది కొమ్ములు విరవబడని మహోగ్ర మతోన్మాద ఉగ్రవాద భూతంగా తయారై, అడ్డూ అదుపూ లేక, అసలా ఉద్యమం ఎందుకు పుట్టిందో కూడా తెలియని మూర్ఖత్వంతో వారి వారి దేశాలకు ఎటువంటి హాని కూడా చేయని అమాయిక దేశాల మీద కూడా పడి సర్వ ప్రపంచానికి శత్రువుగా తయారైంది.
అందువల్ల ఆయా దేశాలలో ఇటువంటి తీవ్రవాద ఉద్యమాల మీద సదభిప్రాయం గాని ఆదరణ గాని పెద్దగా లేదు. ఇటువంటి ఉద్యమాల పట్ల సానుభూతి ఉన్నవారి సంఖ్య పెద్ద గొప్పగా ఏమీ లేదు.
అందువల్ల, భారత్ పాకిస్తాన్ వంటి దేశాలనుండి కూడా యువకులను ఆకర్షించి, ట్రైనింగ్ ఇచ్చి, తమ సంస్థలలో రిక్రూట్ చేసుకుని, తాము చేస్తున్న మారణహోమాలకు వారిని సమిధలుగా ఉపయోగించుకుంటూ, అలా ఉపయోగపడటం ఒక ఘనకార్యంగా చెబుతూ, వారిని అమరవీరులుగా కీర్తిస్తూ, జన్నత్ లో వారి స్థానం శాశ్వతంగా ఉంటుందని కురాన్ లో లేని కొత్త ప్రవచనాలను కూడా వీరే రాసేస్తూ, వాటినే బోధిస్తూ, అలజడి సృష్టిస్తున్నారు.
<><><><><><><>
<><><><><><><>
సరే, భారతదేశంలో కొందరు "మహా" నాయకులు పాశ్చాత్య దేశాలలో జరిగిన సంపద సృష్టి విధానాన్ని బాగా "స్టడీ" చేశారు!
అక్కడ యూరోప్ లో జరిగిన భయంకర సంపద సృష్టిని, తద్వారా అక్కడ ఆవిర్భవించిన "మహోన్నతసంస్కృతిని" తమ దేశాలలో కూడా సృష్టించి, ప్రచారం చేసి తాము కూడా లాభపడదాం అనుకుంటూ విజనరీలుగా దార్శనికులుగా తమను తాము ప్రమోట్ చేసుకున్నారు, చేసుకుంటున్నారు.
ఇపుడు చూడండి -
దేశంలో స్వదేశీ కార్పొరేట్ సంస్థలు విచ్చల విడిగా పెరుగుతున్నాయి.
విదేశీ వ్యాపార సంస్థలు భారత దేశంలోనికి కాలు మోపడానికి విరివిగా లక్షల కోట్ల రూపాయల విలువైన MOUలు కుదుర్చుకుంటున్నాయి(ట).
మరి ఈనాడు వారి వారి వ్యాపారాలకు చవకగా దొరికే కూలి మనుషులు కావాలి.
పోనీ, కూలి అనకుంటే జీతాలు అనుకోండి.
మనుషులు, మనుషులు, మనుషులు కావాలి.
సంపద సృష్టికి ప్రధానమైనవి - మానవ వనరులు - అట.
అవి విరివిగా కావాలి.
కాని, భారతదేశం అంతా మనుషులతో నిండిపోయి ఉన్నా, పనికి మనుషులు ఎవరూ దొరకటం లేదే?
రైతులకు కూలీలు దొరకటం లేదు.
ఇద్దరూ ఉద్యోగులే ఉన్న ఇంట్లో పనిమనిషి దొరకడం కూడా కష్టంగానే ఉంది.
అస్సలు దొరకరని కాదు, వారిని దొరికించుకొనేంత కూలీ నువ్వు ఇవ్వలేవు కాబట్టి దొరకరు.
లోకల్ గా ఉన్న భారతీయులకే దొరకని కూలీలు
ఇపుడు కొత్తగా వచ్చే విదేశీ కంపెనీలకు మాత్రం ఎలా దొరుకుతారు?
దొరకకపోతే విదేశీ కంపెనీలు రావు.
చవకగా దొరికే వేరే దేశాలకే పోతాయి.
అవి సోకాల్డ్ మహానాయకులు తమకు ఉందని ప్రచారం చేసుకొనే అదేదో రకం గ్రాఫిక్ విజన్ చూసి మురిసి పోయి, ఎగిరి గంతులేసుకుంటూ రావు కదా?
విజన్ను చూసి మురిసిపోయి వస్తాయి అని ఏ వెధవ అయినా అంటే ఈ సారి చెప్పుచ్చుకు కొట్టండి.
ఈ విషయం తనకు కూడా కాస్త అర్థమైన తరువాత, మన విజనరీ మహానాయకుడు పిల్లల్ని కనండహో, సాధ్యమైనంత ఎక్కువగా పిల్లల్ని కనండహో అని నెత్తి నోరు మొత్తుకుని చెబుతున్నాడు.
కొత్త దంపతులు అలాంటి మాటల మాయలో భ్రమిసి అలా కనేసేరు జాగ్రత్త!
ఇపుడు ఉన్నవారికే సరైన చదువులు చెప్పించ లేక,
సరైన వైద్య సదుపాయం కల్పించ లేక,
సరైన నివాసం చూపించ లేక,
సరైన ఉపాధి కూడా కల్పించలేని దుఃస్థితిలో ఉన్న ఈ విమనాడు (విజనరీ మహా నాయకుడు)
తన మాటను అమాయికంగా నమ్మేసి నవదంపతులు అధిక సంతానాన్ని కంటే,
ఇపుడువారికి సౌకర్యాలకంటె మరింత అధికంగా వారికి ఏమివ్వగలడు?
అప్పటికి ఈయన జవాబు చెప్పడానికి కూడా ఉండడు. ఆయన వారసులు ఈనాటి ఈయన మాటకి ఆనాడు బాధ్యత వహించరు.
ఆ అధిక సంతానానికి భవిష్యత్తులో కూలి ఉద్యోగాలు వచ్చినా అది అత్యంత గొప్ప విషయంగా, తాము సాధించిన ఘనకార్యంగా డప్పులు కొట్టుకుంటారు గుర్తు పెట్టుకోండి!
ఈరోజు ఈ మాటలు నమ్మి మోసపోతే, 2050 నాటికి "ఇంటికో కూలి ఉద్యోగపథకం" అనేది ఒక గొప్ప ఎన్నికల నినాదంగా రూపు దిద్దుకుంటుంది.
<><><><><><><>
<><><><><><><>
జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక రైతు కూడా ఈ విషయంలో మోసాన్ని అర్థం చేసుకోగలడు.
ఒక ఎకరా భూమిలో ఒక మనిషి పని చేస్తే
కాస్త పంట వస్తుంది.
ఇద్దరు పని చేస్తే,
మరి కొంత అధికంగా పండించగలరు.
ముగ్గురు పని చేస్తే,
మరీ ఎక్కువ రాకున్నా, కాస్త పెరగ వచ్చు.
నలుగురు పని చేస్తే,
ముగ్గురు కలసి పండించిన దానికంటే అధికంగా రాక పోవచ్చు.
ఇక ఐదో వాడు చేరితే?
అంత వరకూ వస్తున్న పంట కంటే తక్కువ వచ్చే ప్రమాదం ఉంది.
ఇలాంటి స్థితిలో ఆరో వాడు కూడా నేను సైతం అంటూ వస్తే?
పొలంలో మరింత పంట పండేది లేదు కాని, అంత వరకూ ఐదుమంది మూడు పూటలా, కడుపు నిండా తింటున్నా సరిపోయిన పంట, ఇపుడు ఆరోవాడికి సరిపోకపోవచ్చు.
దానికి తోడు ఏడో వాడు వస్తే?
పంట పండించే సంగతి మరచి, ఉన్న ఆహారాన్ని ఎవరెవరెవరు ఎన్తెన్తెంత పంచుకోవాలో గొడవలు మొదలౌతాయి.
వీళ్ళ గొడవల్లో వీళ్ళు ఉండగా ఎనిమిదో వాడు, తొమ్మిదో వాడు, పదో వాడు అంటూ అడ్డూ అదుపూ లేక జనాలు పుట్టుకొస్తూనే ఉంటే?
అప్పుడేమిటి పరిష్కారం?
పొలాన్ని రియల్ ఎస్టేట్ చేసి అమ్మేసుకుని తలాకింత పంచేసుకుంటే -
అపుడు చేతిలో కాస్త డబ్బులు ఆడుతాయి -
సరే, కాని, కడుపు నిండే పంట ఏదీ?
సింగపూరుకు, జపానుకు, చైనాకు రోజూ ఫ్లైట్లో వెళ్లి తినేసి వద్దామా?
ఉన్నదాంతో ప్రశాంతంగా ఉండక, అవసరమా ఇప్పుడా అధిక సంతానం గొడవలు, తలనెప్పులు?
<><><><><><><>
<><><><><><><>
ఇక్కడ మన భారతదేశమే ఆ పొలం!
ప్రజలే రైతులు!
పెరిగే జనాభాతో పాటు పొలం కూడా అదే దామాషాలో పెరిగే అవకాశం లేనే లేదు.
అది అందరికీ తెలుసు.
తెలియనట్టు నటించే వెధవలకు చెప్పుతో సన్మానం!
అధిక సంతానం వద్దు, ఆ మాటలకు మోసపోవద్దు!
<><><><><><><>
<><><><><><><>
అయినా, 


మొదట కథలో చెప్పినట్టు, ఆ ముసలమ్మలాగ మన దేశాన్ని రక్షించుకొనేందుకు వీరులైన సంతానాన్ని కన్నా అందులో ఒక గౌరవం ఉంటుంది కాని,

* దేశాన్ని మరలా ప్రచ్ఛన్నంగా దోచుకుపోయేందుకు వస్తున్న విదేశీకంపెనీలకు కూలీలుగా ఉండేందుకు,
* సినిమాజనాల కటౌట్లకు మేకలను బలి ఇచ్చి తలలు వేలాడదీసేందుకు, 

* సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని తమ నాయకుడు చేస్తున్న వెధవ పనులను వ్యతిరేకించిన వారిని అదేపనిగా తిడుతూ వేధించడానికి,
* క్రికెట్ మైదానాలలో ఫోర్లు సిక్సర్లకు కేరింతలు కొట్టి క్రికెట్ బోర్డుకు ఆదాయం తెచ్చి పెట్టే వనరులుగా మారేందుకు,
* ఆయా నాయకులు ఎన్నికల్లో వాగ్దానాలు చేస్తూ,  ఉచితంగా అదిస్తాం ఇదిస్తాం అంటే ఎగబడి వోట్లు వేసి  దేశభవిష్యత్తును ఆ పనికిమాలినవారి చేతుల్లో పెట్టేందుకు,
- జస్ట్, జస్ట్, ఇలాంటి పనులు చేసేందుకు సంతానాన్ని కనడంలో ఏమి గౌరవం ఉంటుంది విజనరీ గారు?

Shame on You, for Your Wrong Call.

శ్రీనివాసకృష్ణ   

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...