Showing posts with label Life. Show all posts
Showing posts with label Life. Show all posts

Wednesday, 8 August 2018

శాశ్వతం ఏది?

అనగా అనగా...
సృంజయుడు అని ఒకానొక రాజు ఉండేవాడు. అతడు మిక్కిలి వినయవంతుడు. పండితులను, బ్రాహ్మణులను శ్రద్ధగా సేవించుకొనేవాడు.
ఆయన శ్రద్ధకు మెచ్చిన నారదమహర్షులవారు "నాయనా! ఏమి వరం కావాలో కోరుకో" అని అడిగారు.
సృంజయుడు సంబరపడి - "దేవర్షీ, నాకొక కుమారుడు కలగాలి. అతడి మలమూత్రాలు, ఉమ్మి, చెమట కూడా స్వర్ణమయంగా ఉండాలి" అని కోరుకున్నాడు.
నారదమహర్షులవారు "తథాస్తు" అన్నారు.
అనంతరం రాజుకు అటువంటి కుమారుడు కలిగాడు.
రాజుగారి దశ తిరిగిపోయింది.
తన ఇంటిని, ఇంటి గచ్చును, మంచాలను, కంచాలను కూడా బంగారుమయంగా చేసుకున్నాడు.
అతడు చేసే బంగారు దానాలకు అంతులేకుండా పోయింది.
ఆ రాజకుమారుని అందరూ "సువర్ణష్ఠీవి" అని పిలవసాగారు.
ఉన్నట్టుండి ఒకరోజు కొందరు దొంగలు అతనిని ఎత్తుకుపోయారు. బంగారం కోసం అతని శరీరాన్ని చీల్చి చూశారు. ఏ బంగారమూ దొరకలేదు. బంగారమంటి రాజకుమారుడు మాత్రం చచ్చిపోయాడు. తన కొడుకుకు పట్టిన దుర్గతిని చూసి రాజు ఎంతగానో కుమిలి కుమిలి ఏడ్చాడు.
అపుడు నారదమహర్షులవారు అక్కడకు వచ్చారు.
"ఏమయ్యా రాజా! అందరిలాంటి కొడుకును కోరుకున్నావు కాదు, నీ దురాశ వల్లనే నీ కొడుకుకు ఈ దుర్గతి పట్టింది, నీకు శోకం మిగిలింది." అన్నారు.
"డబ్బు శాశ్వతం కాదు,
డబ్బు వలన శాశ్వతత్వం కూడా కలుగదయ్యా!" అన్నారు.
కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు.
***
(1)
"మరున్మహారాజు శంకరభగవానుడి దయ వల్ల బంగారు కొండను పొందాడు. దానితో అతడు అనేక యజ్ఞాలు చేసి గొప్ప గొప్ప దానాలు చేశాడు. అయినా అతడు శాశ్వతంగా ఉండలేకపోయాడు. నువ్వు , నీ కొడుకు ఆ మరున్మహారాజు కంటే గొప్పవాళ్ళు కాదుగా?"
(2)
"సుహోత్రమహారాజు ఎంతటి వాడంటే అతని పాలనలో మేఘాలు బంగారు వర్షం కురిపించేవి. బంగారు నదులు ప్రవహించేవి. అందులో బంగారు చేపలు బంగారు మొసళ్ళు ఉండేవి. అయినా అతడు శాశ్వతంగా ఉండలేకపోయాడు. నువ్వు ,నీ కొడుకు ఆ సుహోత్రమహారాజు కంటే గొప్పవాళ్ళు కాదుగా?"
(3)
"శిబిచక్రవర్తి తెలుసా? ఒక పావురాన్ని డేగ బారినుండి కాపాడడం కోసం తన తోడనే కోసి ఇచ్చిన మహానుభావుడు. శివుడు అతని దానశీలానికి మెచ్చి అతనికి తరగని సంపద ఉండేలా అనుగ్రహించాడు. అయినా అతడు శాశ్వతంగా ఉండలేకపోయాడు. నువ్వు , నీ కొడుకు ఆ శిబిచక్రవర్తి కంటే గొప్పవాళ్ళు కాదుగా?"
(4)
"భగీరథుడు, దిలీపుడు, మాంధాత, యయాతి, శ్రీరాముడు, అంబరీషుడు, శశబిందుడు, గయుడు, రంతిదేవుడు, శకుంతలాదుష్యంతుల తనయుడు అయిన భరతుడు, పృథు చక్రవర్తి - వీళ్లందరి గురించి విన్నావా?
వారు చేసిన ఘనకార్యాలను గూర్చి మాత్రమే కాదు,
వారి మహాసంపదను గూర్చి విన్నావా?
అలాగే, వారు తమ ప్రజలకు చేసిన మహోపకారాలను గూర్చి తెలుసుకున్నావా?
వారిని తరతరాలుగా ప్రజలు గుర్తుంచుకుని పొగుడుతున్నారు అని నీకు తెలుసునా?
అయినా వీరెవ్వరూ కూడా శాశ్వతంగా ఉండలేకపోయారు.
నువ్వు, నీ కొడుకు ఆ మహా మహా చక్రవర్తులకంటే పెద్ద గొప్పవాళ్ళా?"
నారదమహర్షులవారి మాటలు విన్నాక సృంజయ మహారాజుకు నోట మాట రాలేదు.
"నేను చెప్పింది అర్థమైందా మహారాజా?" అని రెట్టించి అడిగారు నారదమహర్షులవారు.
"అర్థమైంది దేవర్షీ! ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు, ఏదీ శాశ్వతం కాదు, ఏదో కావాలని, మరేదో పోయిందని ఏడవడం కంటే ప్రజలకు మంచి చేస్తూ జీవించడమే రాజుకు పరమధర్మం, ప్రథమకర్తవ్యం" అన్నాడు సృంజయమహారాజు.
"చక్కగా గ్రహించావు రాజా!" అన్నారు నారదమహర్షులవారు తృప్తిగా.
***
కురుక్షేత్రంలో అభిమన్యుడు వీరమరణం పొందాక గోలుగోలున ఏడుస్తున్న ధర్మరాజుకు ఈ కథను చెప్పింది వ్యాసమహర్షులవారు. అపుడు ధర్మరాజు కూడా -
"అర్థమైంది తాతగారూ! ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు, ఏదీ శాశ్వతం కాదు, ఏదో కావాలని, మరేదో పోయిందని ఏడవడం కంటే ప్రజలకు మంచి చేస్తూ జీవించడమే రాజుకు పరమధర్మం, ప్రథమకర్తవ్యం" అని అన్నాడు.
(మహాభారతం - ద్రోణపర్వంలోని కథ ఇది.)
***
ఇలా ఆనాడు తమకు తగని ఆలోచనలు చేసే రాజులకు కొందరు జ్ఞానులైన వారు హితబోధతో పాటు కర్తవ్యోపదేశం చేసేవారు. స్వతః గా వినయవంతులు అయిన ఆ రాజులు వాటిని శిరసా వహించేవారు.
***
ఈనాడు కూడా "మేము శాశ్వతంగా ఉంటాం" అని కలలు కనే రాజులున్నారు. కానీ, "నీ కోరికలు తీరేవి కావు" అంటూ నిక్కచ్చిగా చెప్పగల నారదుడు, వ్యాసుడు వంటి హితబోధకులూ ఎక్కడా లేరు.
హితవు చెప్పబోతే శారీరకంగానో మానసికంగానో దాడి చేసే రాజుగారి అనుచరగణాలకు భయపడి నిశ్శబ్దంగా ఉంటారు. అందువల్ల ఆ రాజులు తమ కోరిక తప్పక నెరవేరుతుందని భ్రమతో ఎటువంటి పనులను చేసేందుకైనా తెగిస్తూ ఉంటారు కూడా.
"మేము ఫలానా ఫలానా వ్యక్తిని సలహాదారుగా నియమించుకున్నాం" అని కొందరి మెప్పు కోసం వోట్ల కోసం అటువంటి రాజులు మభ్యపెడుతూ ఉంటారు. కానీ వారిని ఎన్నడూ సలహా అడిగేదీ ఉండదు, వారికి జీతం ఇచ్చేదీ ఉండదు.
పాపం, ఒక్క పూట దుష్టశక్తుల దృష్టి తగిలిన పాపానికి "రాజుగారి సలహాదారు"లనే మిథ్యాబిరుదును పొంది కొందరు నిర్దోషులు మాత్రం నిందాపాత్రులుగా మిగిలిపోతుంటారు.

Monday, 23 July 2018

నక్క ఉపవాసము

అనగా అనగా ఒక నక్క.
రోంత వయసు ముదురు నక్క.

ఆ నక్క ఒగు దినుము దినాముకట్లే ఆకలి తీర్చుకొనేకి తొండేబిక్కిల్ని, ఉడతలని యెదుకులాడుకుంటా బయలుదేర. దానికంటె ముందరే చిన్న నక్కలు వుషారు వుషారుగా వేటాడేసి కడుపు నింపుకుంటా కానొచ్చె. దీనికిమాత్రం తొండేబిక్కలు, ఉడతలు దొరక్కుండా తప్పిసుకుంటుండాయి. తన కండ్లముందురే కళ్లిచెట్టు బుడుముతాన బొక్కలోకి దూరి దాపెట్టుకున్న తొండేబిక్కిని ఎట్లైనా బయటికి యెల్లబీకల్లని మొన్ను తోగి తోగి దానికి మిగిలిన గోళ్లు కూడా సమిసిపాయ. తన చాటుమాల్నుండి చటుక్కున చెట్టుమిందికెగిరిన ఉడతని పండ్ల మధ్యన యిరికించుకోవల్లని దుంకితే దాని కోరలన్నీ మానులోకి ఇరుక్కుని అర్ధము యిరిగిపాయ.

ఇంత గోరుము జరిగినంక దాని బలమేమో దానికే అర్థమైపాయ. ఇంగ నాకి వయసైపాయరా, అందరితానా యేట్లాడి యేట్లాడి సంపాదిచ్చేది ఇంగ నాకి శాతకాదు అని తెలిసిపాయ. అది యిచారంగా బోయి అడివిలోన గుడికాడ కూకొనిడిశ. ఆ గుడితాన మనుషులు అపుడపుడు కోళ్లూ మేకలూ బలిచ్చి కోసుకుతింటాంటారు. అపుడు ఆడాడ యేమన్నా నేలబడింటే యేరుకుతినొచ్చు అని దాని ఆశ. కానీ, ఆ ఆశ కూడా నిరాశ ఐపాయ.

దావన బొయ్యే ఇంకో నక్క “ఏమిరా అల్లుడూ ఈడ ఇట్ల్నే మొగుము యేలాడదీసుకుని కూకునుండావు? ఈ పొద్దు తొలి ఏకాదశి, అందుకే ఈ పొద్దు ఎవరూ బలిచ్చేది లేదు, నీకు కడుపు నిండేదీ లేదు” అని జెప్పి దాని దోవకి అది బాయ.

కడుపాకలి తట్టుకోలాపుక ఆ నక్క ఇంగ బాగ ఏడిశిడిశ. ఇట్లా టైములో ఏమి చేయాల్నో నేను చదివిన రెండులక్షల పుస్తుకాలలో ఏ వొక్క పుస్తుకంలోనైనా ఉండునా అని బాగ ఆలోచన చేశ. అప్పుడుసగం చిరిగిన యెర్రట్ట పుస్తకంలో తాను చదివిన ఒగు విషయం దానికి నెప్పికొచ్చ.

ఏకాదశీ ఉపవాసవ్రతమాహాత్మ్యము! ఆ పొద్దు పూర్తిగా ఉపాసముంటే దండిగా పున్నెము వస్తాదంట. పున్నెము అంటే ఏమిడిదో దానికి రోంత రోంత తెలుసు. పిట్ట మాంసము, పుంజు మాంసము, మేక మాంసము – ఇవన్నీ కలిపి తింటే - అదీ పున్నెము అంటే! అంతకంటే గొప్ప పున్నెము ప్రపంచంలో యాడ్యాడా ఉండుదని ఆ పుస్తుకములాన ఘోస ఘోస పెట్టి ఉన్న్యారు. దానికి అవకాసము వచ్చింది గదాని, నక్కకి ఆ పొద్దు ఉపాసము ఉండాల్నని బుద్ది పుట్టిడిశ. యెట్లోగట్ల నెలకు రెండు దినాలు ఇట్ల ఉపాసముంటే ఇంక మిగిలిన దినాలన్నీ పున్న్యాలంటే పున్న్యాలు!

ఉపాసమున్నపుడు నీళ్లు దాగినా యేమీ వ్రతభంగం కాదని దానికి తెలుసును. దానికే దగ్గర్లో వుండిన యేటితాకి యెట్లో కాళ్లీడ్సుకుంటాబాయ. యేటి వొడ్డున అనుకోకుండా ఒక దృశ్యం చూసేతలికే దాని కండ్లు మిల మిల మెరిసిపాయ.

సన్న మేకపిల్ల వొగిటి ఆడ మే మే అని అర్సుకుంటా తిరుగుతాండాది. ఎట్ల్నో తప్పిపయినట్లుండాది. రాజుగారి తోటలోన మేతకు బోయి, రాణిగారి పూలచెట్లు మేత మేస్తూ, తోటమాలి కొట్టవస్తే తుర్రుమని కానొచ్చిన దిక్కులో పారి పారి వచ్చిన బుజ్జి మేక అదే! అట్లా దూరుం దూరుం పారి పారొచ్చి వాళ్లమ్మను కానకపాయ. అబుడు శాన బయమేసి నోటిలో ఉన్నశక్తినంతా ఉపయోగిచ్చి గొంతు వూడొచ్చేలా పిలుస్తాంటే అయ్యో పాపుమని యెవురికన్నా కనికరము బుట్టాల్సిందే!

పాపం ఆ బుజ్జి మేకపిల్ల రొంత సేపు ఆ యాకునీ ఈ యాకునీ వాసన జూస్తాది, అర్సతాది. రొంత ముందరకి పొయ్యి జూస్తాది, మళ్లీ యెనిక్కొచ్చి అర్సతాది. పొడుగాటి చెవుల్ని అట్లా ఇట్లా అల్లాడిచ్చుకుంటా తలకాయ తిప్పుతాది, అర్సతాది. రోంత సేపు వంకర టింకరగా అడ్డడ్డుము ఎగర్లాడతాది, అర్సతాది. రెండు గడ్డిపరకలు నముల్తాది, తలెత్తి మళ్లీ అర్సతాది. ఆడ ఒగ యెత్తైన రాయుంటే దాని మింద ముందరికాళ్లు పెట్టి నిలబడి తలకాయ అట్లా ఇట్లా తిప్పుకుంటా అమ్మ కనిపిస్తాదేమో అని దిక్కులు చూస్తాది, అర్సతాది. కాళ్లు నొచ్చుతాయేమో, రోంతసేపు నేలమీద పండుకుని ముకుము డొక్కలా పెట్టుకుంటాది. అంతలోనే, మళ్లీ పండుకుంటే పనులు జరగవని అంతరాత్మ ప్రబోధం జరిగినట్టు లేచి మళ్లీ అర్సతాది. పాపుము అది అట్లా అరిసేతప్పుడు సూడల్ల, నోట్లోంచి నాలుక రొవంత బయటకివచ్చి కానొస్తాది. మెడ ఎంత దూరుము సాచి అరిస్తే అంత దూరుము యినిపిస్తాది, అబుడుమా అమ్మ యాడున్నా పారి పారి నాతాకి వస్తాది అన్నట్ల ఆ సన్న మెడని ఇంత పొడుగు నీలిగిచ్చి నీలిగిచ్చి అర్సతాది. కండ్ల నిండా బయం బయం నింపుకుని అర్సతాది.

నక్క ఆ మేకపిల్లని చాటునుంచి దూరం నుంచి శానా సేపు సూసుకుంటా అట్ల్నే నిలబడినాది. వాళ్లమ్మ ఆడ్నే యాడ్నో వుంటాది, నేను తొందరపడి దాన్ని పట్టుకునేకి పోతే వాళ్లమ్మ వచ్చి నన్ను డొక్కలో కుమ్మి పారేస్తాది అని నక్క భయం నక్కది.
కాని, ఆ మేకపిల్ల యెంతసేపు అర్సినా వాళ్లమ్మ రాకపాయ. ఆర్సీ ఆర్సీ ఆ మేకపిల్ల అలిసిపాయ. నేలమింద పండుకుని ముకుము కడుపులాకి దూర్సుకునిడిశ.

శానాసేపైనా అది మళ్లీ లెయ్యకోకుండేది సూసి నక్క ఇదే మంచి అవకాశమురా దీన్ని పట్టుకునేకి అనుకునింది. మెల్లగా సప్పుడు కాకుండా దానిపక్క పొదల పక్కనే నక్కుకుంటా పాయ. వచ్చ, వచ్చ, దగ్గరకు వచ్చిడిశ! ఇంకా ఆడ్నే వుంది మేకపిల్ల. అమ్మే యెట్లోగట్ల నన్ని యెతుక్కుంటా వస్తాదిలే అనుకునిందో యేమో! అడివిలో గండాలు ఇట్లిట్లా వుంటాయని దానికి యేమి తెలుసు పాపుము?

నక్క ఊపిరి బిగబట్టుకున్య. రెండడుగులు ముందుకేసి ఒక్క దూకు దూకితే, ఇంగ ఆమేకపిల్ల తనదే! విందు భోజనమే! దేముడుండే స్వర్గానికి పోయినా కూడా అంత మంచి భోజనం యెవురూ పెట్టలాపురు అనిపించింది. ఒకటో అడుగు వేసింది. ఇంతలో గాలి వీచి, ఆకులు గలగలలాడినాయి. మేకపిల్ల తల యెత్తింది. నక్క చప్పున వంగి తలను భూమికి ఆనిచ్చిడిశ. పొద యెనుకనున్న ఆ నక్కను మేకపిల్ల కానక పాయ. కాని, యేమో అనుమానమొచ్చి అది అట్ల్నే లేసి నిలబడ. కాని, యాటికీ కదలకపాయ. అది తన దిక్కు చూడలేదని నక్క గమనిచ్చుకుని రెండో అడుగు ముందుకేశ. దాని దురదృష్టము, ఆడ గాలికి కొట్టుకొచ్చిన రెండు ఎండుటాకులు ఉండ్య. నక్క అడుగు పడగానే అవి కరకరమని శబ్దం చేసుకుంట యిరిగిపాయ. మేకపిల్ల చప్పున తలదిప్పి చూసిందీ, నక్కయెగిరి దానిమిందికి దుంకిందీ ఒకేసారి జరిగిపాయ.

కానీ, నక్క మేకపిల్ల మీద పడల్యా. నేలమీదనే పడింది. యేమిటికంటే, మేకపిల్ల దానికంటె ముందరే యెగిరి బండమీదకి దుంకింది. నక్కకి ఆశాభంగమైపాయ. మేకపిల్ల గూడా నక్కను కండ్లారా చూసిడిశ. అంతే! ఒక్కు క్షణుము గూడా ఆడ నిల్సుకోకుండా అట్ల్నే దుంకుకుంటా దుంకుకుంటా యేటిపక్కకి పార్య. నక్క ఆశ యిడిసిపెట్టలాపుక దాన్ని యెంటదరుముకుంట పాయ. యెదురుగ్గా పెద్ద సప్పుడు సేసుకుంటా జోరు జోరున పారుతున్న యేరుని చూసి మేకపిల్లకి బయమేసి పాయ. యెనిక్కి తిరిగేతలికే తనని పట్టుకునేకి పారి పారి వస్తుండిన నక్క కనబడ్య. అంతే! మేకపిల్ల ఇంకేమీ ఆలోచన చేయకుండా యెగిరి యేట్లోకి దుంకిడిశ.

అంతదంకన్నా పారి పారొచ్చిన నక్కకి దానెనికినే యేట్లోకి దుంకేకి దమ్ము లేకపాయ. అట్ల్నే దాన్ని తేరిపారజూసుకుంటా నిలబడుకొనిడిశ. బుజ్జి మేక యేట్లో బడి కొట్టుకుపోతా, అట్లా ఇట్లా కాళ్ళు అల్లాడిచ్చుకుంటా యెట్ల్నో మొత్తానికి అవతలి గడ్డకి పడ్య.

గడ్డకి పడినంక కడుపును అట్లా ఇట్లా అల్లాడిస్తే దాని బొచ్చునుండి నీళ్లన్నీ వానచినుకులా కట్ల టప టప రాలి పడ్య. అప్పుడది యెనిక్కి తిరిగి అవతలి గట్టున నిలబడిన నక్కను చూశ. నక్క గూడా దాన్ని సూసుకుంటానే ఉణ్ణింది. అప్పుడు బుజ్జిమేక ఒకసారి మెడ ముందుకు చాచి నాలుక కొంచెం బయటకు కనబడేలా మే మే అంటూ అరిచింది. ఆనెంక నక్క దిక్క తిరిగి చూడకుండా అరుసుకుంటా అట్ల్నే నడుసుకుంటా ఆదిక్క అట్లే పాయ.

నక్కకి మళ్లీ యేడుపొచ్చ. ఆ వొక్క క్షణం గాలి వీచకుండా ఉండివుంటే – ఆ వొక్క అడుగు తాను యెండిపోయిన ఆకుల మీద వేయకపోయి వుండివుంటే - ఈ పాటికి ఆ బుజ్జిమేక తన కడుపులో చేరి ఆకలి తీర్చి వుండేది! దేవుడు తనకు ఆ అవకాశం ఇవ్వలేదు!

దేవుడు అనుకునేతాలికే నక్కకు బిరీన నెప్పికొచ్చ... – తను సంకల్పించిన ఏకాదశీ ఉపవాసం గురించి. అరెరే! అనుకొన్య.

అవును సుమా! నేను దాని గూర్చి నేను మరిచే పోయినాను! ఈ పొద్దు నేను ఉపాసం ఉండాల్నని అనుకుంటి గదా! మరి ఈ మేక నాకు చిక్కింటే నాకు వ్రతభంగం అయితాండ కదా? అనుకుంది. పశ్చాత్తాపపడింది. నేను చేసింది తప్పే! అనుకునింది. లెంపలేసుకుంది. దేవుడికి క్షమాపణ చెప్పుకుంది. నువ్వే నాకు మేకను చిక్కకుండా చేసి నన్ను మహాపాపం నుండి కాపాడావని మెచ్చుకుంది. గుంజీలు తీసింది. నా బుద్ధిని యెప్పుడూ ఇట్లే సక్రమమార్గంలో నడిపిచ్చు తండ్రీ అనుకుంది. దాని మనసు తేలికపడింది. యెట్లో యేట్లో కాసిని నీళ్ళు గతికి, నెమ్మదిగా గుడి దగ్గరకు బయలుదేరింది.

ఇంతలో మళ్ళీ మే మే అని అరుపులు వినిపించాయి. వెంటనే గబా గబా పక్కనున్న గుట్టెక్కి చూసింది. మేకలమంద! అందులో ఒక మేక కంగారు కంగారుగా అటూ ఇటూ వెదుకుతోంది. బుజ్జిమేకవాళ్ల అమ్మ కాబోలు! నక్కకి నోట్లో నీళ్లు ఊరాయి. ఎన్ని మేకలు! ఎన్నెని మేకలురా దేవుడా! ఇన్ని మేకల్లో ఒక్కటైనా నాకు దొరక్కపోతుందా అనుకుంది. ఉపాసముంటానని దేముడికిచ్చిన మాట దానికి మళ్లీ మళ్లీ గుర్తుకొస్తోంది, పక్కనుండే పొదలో ముండ్లు మళ్లీ మళ్లీ గుచ్చుకుంటున్నాయి. హే, అంటూ ఆ ముండ్లను విదిలిచ్చుకుంటూ ఒక్కమేకనైనా ఎట్లా పట్టేది అని ఆలోచనలో పడింది.

దేవుడా, ఏకాదశి ఉపవాసం వదిలి రేపు ద్వాదశినాడు ఉపాసముంటాలే – ఎప్పుడు చేస్తే ఏముంది, ఉపాసం ఉపాసమే కదా! అని దేముడికి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది.

ఇంతలో హే హే అంటూ మనిషి గొంతు వినిపించింది. మెడ నిక్కించి చూసింది. మంద వెనుక చాలమంది కాపర్లు ఉన్నారు. వాళ్ల చేతుల్లో ఇంతింతలేసి దుడ్డుకఱ్ఱలు ఉన్నాయి. ఇంక నక్క అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేదు. దేముడా! ఇంక పోస్టుపోనుమెంట్లు లేవు. ఈపొద్దే నా ఏకాదశి ఉపవాసం కన్ఫాం చేసుకో అంటూ గుడిదిక్క పరుగులు తీశ.
***

((DISCLAIMER – ఈ కథ చదువుతున్నపుడు గాని, చదివిన తరువాత గాని, బుజ్జి మేకపిల్ల అంటే “రాజ్యసభ సీటు” అని ఎవరికైనా అనిపిస్తే నా బాధ్యత లేదు. ఏకాదశీ ఉపవాసం చేయడం అంటే “పార్టీ పెట్టి ప్రజాసేవ చేయడం” అనిపించినా సరే, నా తప్పు లేదు. నక్క ఎవరు అంటూ ఎవరూ నన్ను ప్రశ్నలు వేయవద్దు, మీ ఊహలకు నేను బాధ్యుడిని కాజాలను.))

సర్వః సగంధేషు విశ్వసితి

ఫలకాలు చెప్పే పాఠాలు – 4
కాళిదాసమహాకవి శకుంతల నోట పలికించిన మాట...
“సగంధ” అనే పదానికి జ్ఞాతి అనే అర్థం చెబుతుంది వాచస్పత్యం.
“ప్రతి ఒక్కరూ తమవారినే విశ్వసిస్తారు.”
నిజమే కదా, అది సహజం.

It is an animal’s instinct.
Birds of the same feather flock together.
Like likes Like.

అది సరే, “తమవారు” అని ఎవరైనా సరే, కొందరిని ఎలా గుర్తుపడతారు?

ప్రాథమికంగా - తాము తినేటటువంటి తిండినే తినే వారిని తమవారని గుర్తుపడతారు...

అర్థం చేసుకొనేందుకు ఆధునికశిక్షణ పొందిన మన మనసు నిరాకరించినా అది చాలవరకు నిజం. 

విస్తారమైన ఆఫ్రికా అడవుల్లో నేషనల్ జాగ్రఫిక్ ఛానెల్ వాళ్ళు జంతువుల మీద తీసిన డాక్యుమెంటరీలు చూడండి...

చిన్నపాటి జింకలు ఒక చోట గడ్డిమేస్తూ ఉంటాయి. వాటికి పక్కనే మరింత పెద్ద కొమ్ముల జింకలు కూడా గడ్డిమేస్తూ ఉంటాయి. ఈ పక్క జీబ్రాలు మేస్తుంటాయి. ఆపక్క అడవి బర్రెలు, దున్నలు మేస్తుంటాయి. ఇవన్నీ వేరు వేరు జాతుల జంతువులు. అయినా ఒకదానిని చూసి మరొకటి భయపడవు. ఇంతలో అక్కడికి వీటన్నింటికన్నా బలమైన ఏనుగుల మంద వస్తుంది. వాటిని చూసి కూడా ఇవేవీ భయపడవు. మరికాసేపట్లో వీటన్నింటికన్నా పొడవైన జిరాఫీలు వస్తాయి. అప్పుడు కూడా ఇవేవీ భయపడవు. ఎందుకంటే, వీటన్నిటికీ ఆహారం సమానమైనదే. గడ్డి, ఆకులు, కొమ్మలు. 

ఇంతలో అక్కడికి ఒక చిన్న నక్క వచ్చిందనుకోండి...
అది కనబడకున్నా పొదలమాటున దాక్కున్నప్పటికీ దాని వాసన తగిలిన వెంటనే జింకలలో అలజడి ప్రారంభమౌతుంది. అవి ప్రశాంతంగా తినలేవు. కంగారుగా దిక్కులు చూస్తాయి. అటూ ఇటూ పరుగెడతాయి. అది సగంధమైనది (సమానమైన వాసన కలిగినది) కాదన్న మాట. సగంధ అనే పదాన్ని మనం ఇక్కడ ఇలా అర్థం చేసుకోవచ్చు.

సరే, ఎందుకు వాటికా భయం అంటే, ఆ నక్క ఆహారం గడ్డి కాదు, వాటికి ఉడతలు తొండేబిక్కలు దొరికితే సరే సరి, లేకుంటే తమలో ఒకదాన్ని ఆ నక్క లాక్కుపోయి పీక్కు తింటుందని ఆ జింకల భయం. ఏ చిరుతపులో వచ్చిందంటే ఇక జీబ్రాలకు బర్రెలకు కూడా భయమే. ఇక సింహాలమంద వచ్చిందంటే ఏకంగా జిరాఫీలు అడవిదున్నలు ఏనుగులలో కూడా భయం కలుగుతుంది. అవి గుంపులు గుంపులుగా దాడి చేస్తూ మొదట తమ చిన్నారులను, తమలోని బలహీనులను ఎత్తుకుపోతాయని వాటికి తెలుసు. సాధ్యమైనంతవరకు పారిపోయి తప్పుకునేందుకే అవి ప్రయత్నిస్తాయి. కొన్ని నిస్సహాయంగా వాటికి దొరికిపోతాయి. కొన్ని రోషంతో ఎదురు తిరిగి, వాటినే చంపేసిన సంఘటనలు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. 

సరే – ఈవిధంగా - ప్రాథమికంగా - తమకంటే భిన్నమైన ఆహారం కలిగినవాటిపై నమ్మకం కలిగి ఉండడం జంతువులలో కుదరదు. మనుషులలో కూడా పూర్వం ఇటువంటి మనస్తత్వం ఉండేదేమో. కాని, రాన్రాను అటువంటి జంతులక్షణాలు తగ్గి ఉంటాయి. 

కాని, ఇప్పటికి కూడా - తాము చేసేటటువంటి పనినే చేసేవారిని, తాము ధరించే దుస్తులవంటి దుస్తులనే ధరించేటటువంటివారిని, తమవంటి అలవాట్లే కలిగినవారిని, తాము పాటించేటటువంటి ఆచారాలనే పాటించేవారిని తమవారిగా మనుషులు సులువుగా నమ్మేస్తారు. వారిని తమ కులస్థులుగా, తమ మతస్థులుగా పరిగణించి వారితో సన్నిహితంగా మెలగడం చూస్తూనే ఉన్నాం. విద్య సార్వజనీనమై ఒకరి భాషను మరొకరు అర్థం చేసుకొనగలిగే స్థాయికి వచ్చాక మానవులందరూ సమానులేనన్న భావన బలపడింది. 

అయినప్పటికీ సమానమైన ఆలోచనలు కలిగినవారు, సమానమైన వ్యవహారాలు నడిపేవారు, సమానమైన కష్టనష్టాలు కలిగినవారు కులమతాల తేడా లేకుండా కలిసి ఒక సమూహంగా ఉండటం ఈ రోజుల్లో చూస్తున్నాము. ఇక్కడ కూడా మరొక అర్థంలో సగంధత కనిపిస్తోంది. ఇక్కడ గంధము అంటే – వాసన – అంటే - ఈ జన్మలోనో పూర్వజన్మలోనో అబ్బిన సంస్కారాలు కొందరిని పరస్పరం మిత్రులను చేస్తాయి అన్నమాట. 

మృగా మృగైః సంగమనువ్రజంతి.
గావశ్చ గోభిః తురగాస్తురంగైః।
మూర్ఖాశ్చ మూర్ఖైః సుధియః సుధీభిః
సమానశీలవ్యసనేన సఖ్యమ్।। 

జింకలు జింకల తోనే కలిసి తిరుగుతాయి. గోవులు గోవులతోనే కలిసి తిరుగుతాయి, గుఱ్ఱాలు గుఱ్ఱాలతోనే కలిసి తిరుగుతాయి. మూర్ఖులు మూర్ఖులతోనే కలిసి తిరుగుతారు. పండితులు పండితులతోనే కలిసి తిరుగుతారు. సమానశీలము, సమానమైన వ్యసనాలు (అంటే కష్టాలు, బాధలు కూడా) కలిగినవారి నడుమ స్నేహం ఏర్పడుతుంది అని పెద్దల మాట. 

“స వానరేంద్రో హృతరాజ్యదారః స రాఘవేంద్రో హృతరాజ్యదారః।
ఏవం తయోరధ్వని దైవయోగాత్ సమానశీలవ్యసనేషు సఖ్యమ్।।“


“ఆ వానరేంద్రుడికి ఆ రాఘవేంద్రుడికి నడుమ స్నేహం కలిసిందన్నా కారణం ఒకటే – వారిరువురి కష్టాలు సమానమైనవి కాబట్టే!” - అని ఒక కవి చమత్కరించాడు. ఇరువురూ రాజ్యం కోల్పోయారు, ఇరువురి భార్యలూ అపహరింపబడ్డారు కదా అంటాడాయన.

ఏదేమైనా, అప్పటికీ, ఇప్పటికీ మనవారు అనేవారిని మనం విశ్వసిస్తాం. 

భారతదేశంలో ఉంటున్నాడనే ఒకే ఒక్క కారణంగా పాకిస్తాన్ని పొగుడుతూ భారత్ ను సవాలు చేస్తున్నా ఓ ఫరూక్ అబ్దుల్లా గాడిని చూసీ చూడనట్టు వాడి మాటలు వినీ విన్నట్టు ఉంటున్నాం కదా. 

పిచ్చుకలు



ఈ పిచ్చుకలకు అద్దాలంటే ఎంత మోజో!

అద్దంలో కనబడేది ముద్దు ముద్దుగా తమ ప్రతిబింబాలలేనని తెలుసుకొని తమను తాము ముద్దుపెట్టుకొనేందుకే అద్దాలను టక టకామంటూ ముక్కులతో పొడుస్తుంటాయనుకుంటాను.

కాదేమో, అద్దంలో కనిపించేది శత్రువు అనుకొని దాన్ని చీల్చి చెండాడాలనే కసితో అద్దాన్ని అలా పొడుస్తుంటాయి అనిపిస్తూ ఉంటుంది ఇంకోసారి. అలా కాదులే, ఈ పిచికలు మరీ బావిలోకి దూకిన సింహమంత మూర్ఖమైనవి కాదు, బొత్తిగా అమాయికప్ప్రాణులు.

సందు కనిపిస్తే చాలు, వాసాల్లో గోడల్లో గూళ్లు కట్టేసి సంతానం కనేస్తాయి. ఏమిటీ గడ్డీ గాదం, రెట్టలూ అని ఏమాత్రం విసుక్కోని పల్లెటూరి జనాలే వీటికి మిత్రులు, రక్షకులు.

ఇంటిముందు కాళ్లు కడుక్కునే బండల ఎగుడుదిగుళ్లలో నిలిచిన నీటిలోనే మునకలేస్తూ రెక్కలతో నీటిని విదిలిస్తూ మొయ్యి కడుకునే శుచిగల ప్రాణులు. మొక్కలకు నీళ్లు పోస్తే అవి భూమిలోనికి ఇంకిపోకముందే ఆత్రంగా వచ్చి ఆ నీటిని గ్రోలే అల్ప ప్రాణులు. ఇంటి ముందర కట్ట మీద కుసోని పిల్లోళ్లు బొరుగులూ పప్పూ బెల్లాలూ తింటూంటే మరి మాకో అన్నట్టు వారి దగ్గరకొచ్చి వారు పెట్టేదంతా నున్నగా ఆరగించే బాల్యమిత్రులు.

ఇవి ఎప్పుడూ పార్లమెంటు సభ్యుల్లాగా గోలగోలగా అరుస్తాయి కాని, వీటి కిచకిచ శబ్దాలు ఆ పార్లమెంటు సభ్యుల అరుపుల్లా విద్వేషపూరితాలు, అసభ్యాలు, అసూయాసహితాలు, అర్థరహితాలు ఎంతమాత్రం కావు. ఇవి వెల్‌లోకి చొరబడి పనికిమాలిన నినాదాలు చేయకుండా కరెంటు తీగలమీద బుద్ధిగా వరుసగా కూర్చుని తమ సంఖ్యాబలాన్ని ప్రదర్శిస్తాయి కూడా. అందుకే ఎక్కడైనా ప్రయోజనరహితమైన ధ్యేయరహితమైన అల్లరి జరిగితే #కాకిగోల అంటారే గాని, పిచ్చికల గోల అని ఎవ్వరూ అనరు.

పల్లెటూరి ఇండ్లలో నిలువుటద్దాలుండగా మనుషులున్నారనే భయం కూడా లేకుండా గుంపులు గుంపులుగా వచ్చి ఆ అద్దాలముందు అవి చేస్తూ ఉండిన రకరకాల విన్యాసాలు నాకు ఆనందకరమైన జ్ఞాపకాలు.

ఏ ఊరిలో పిచ్చుకలు ఉన్నాయో, ఆ వూరిలో ధాన్యసంపదకు కొదవ లేదు అని అర్థం. దేశంలో ప్రతి గ్రామంలోనూ పిచ్చుకలు మందలు మందలుగా ఉండాలని కోరుకుందాం.

వేసవి రాబోతోంది.
ఇంటి బయటనో, మేడ మీదనో ఒక మట్టి పాత్రనో లేదా మరో అల్యూమినియం పాత్రనో పెట్టి ప్రతిరోజూ ఆ పాత్రలో నీళ్లు పోస్తూ ఈ పక్షిజాతుల పట్ల మన మైత్రీభావాన్ని ప్రకటిద్దాం.

పిల్లలు కాకమ్మ పిచికమ్మ కథలను తరతరాలుగా వింటూనే ఉండాలి!

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...