Showing posts with label Devotion. Show all posts
Showing posts with label Devotion. Show all posts

Sunday, 11 November 2018

బొంబాయి మెయిలు - సొరకాయల స్వామి

1902 వ సంవత్సరం.
ఖచ్చితంగా చెప్పాలంటే 06/08/1902 తేదీ.
మద్రాసు రైల్వే స్టేషన్.
ఉదయం 5:20 సమయం.

ఒకటవ నంబరు ప్లాట్‌ఫాం మీద బొంబాయి మెయిల్ ఉంది. అరక్కోణం, పుత్తూరు, రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్లుల మీదుగా బొబాయికి బయలు దేరడానికి ఇంకా అర్ధగంటకుపైగా సమయముంది. స్టీమ్ ఇంజన్ పక్కనుండి తెల్లని ఆవిరిపొగలు కక్కుతోంది.

జనాలు తండోపతండాలుగా ప్లాట్‌ఫాం మీద ఉన్నారు. వారెవరూ ప్రయాణీకులు కారు. అందరూ తమిళంలోనూ తెలుగులోనూ రెండుభాషలను మిశ్రం చేసి మాటాడేసుకుంటున్నారు. స్టేషన్‌మాస్టర్ అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ జనాల చేతుల్లో పూలదండలున్నాయి. పండ్లున్నాయి. ఎవరో ప్రముఖులు ఈరోజు ఈరైల్లో ప్రయాణం చేయబోతున్నారని అతనికి అర్థమైంది. ఎవరైయుంటారు? ఎవరికి వీడ్కోలు పలకటానికి వచ్చారు ఇంతమంది నేటివ్సు?

రైలు గార్డుకు టెన్షన్ వచ్చింది. ఆ ప్రముఖుడెవరో త్వరగా వచ్చేస్తే సమయానికి బయలుదేరొచ్చు. ఆయన సమయానికి రాకుండా, రైలు ఎక్కకుండా, రైలును బయలుదేరదీస్తే ఆ ప్రముఖుని ప్రయాణానికి ఇబ్బంది కలుగుతుంది! అలా చేస్తే పై అధికారులు తనను చీవాట్లు పెడతారు. ఆ ప్రముఖుని స్థాయి ఎంత గొప్పదైతే తనకు అంత దండన తప్పదు. ఆయన ఆంగ్లేయ అధికారి ఐతే ఉద్యోగం ఊడినా ఊడవచ్చు. ఆలస్యమైతే ఆయన వచ్చేంతవరకు రైలును ఇక్కడే నిలపవలసిందేనా?.... తన ఉద్యోగం మీద తనకే చిరాకు వేసింది గార్డుకు. ఇంజన్ డ్రైవర్ ఉద్యోగం చాల నయం! సిగ్నల్ ఇచ్చి, ఈల వేసి, పచ్చ జెండా ఊపితే నడుపుకు పోవడమే అతని వంతు. ఎందుకు నిలపలేదయ్యా అంటే గార్డ్ పొమ్మన్నాక బండి నడపాల్సిందే కదా అని నెపం అతడి మీద వేసి తప్పుకోవచ్చు. మరి గార్డు? ఇంతలో గార్డుకు తటాలున ఇంకొక ఆలోచన వచ్చింది. రైలు స్టేషన్‌లో ఉన్నంతకాలం స్టేషన్‌మాస్టర్‌దే బాధ్యత! ఆయన పొమ్మన్న తక్షణం నేను డ్రైవరును పొమ్మంటాను. నాదేం తప్పు ఉండదు అనుకున్నాడు.

స్టేషన్‌మాస్టరు కూడా ఆందోళనలోనే ఉన్నాడు. డ్రైవరు ఉద్యోగం గార్డు ఉద్యోగం ఎంతో నయమనుకుంటున్నాడు. కాకపోతే అతడి ఆందోళన కాస్త విభిన్నమైనది. అతడు జాతిరీత్యా తెల్లవాడు. అధికారులకోసం రైలును ఆపవచ్చునని అతడికి సూచనలున్నాయి. భారతీయుల్లో ఎంతటి ప్రముఖుడైనా రైలును ఒక్క క్షణం కూడా ఆపనవసరం లేదు... అందువల్ల ఆ విషయంలో భయం లేదు. కాని, అటువంటి అధికారి ఎవరూ ఆరోజు వస్తున్నట్టు తనకు ముందస్తు సమాచారం లేదు. అయినా, అతడొస్తాడని తెలిస్తే తన విచక్షణాధికారంతో ఆపేయవచ్చు. కాని తీరా ఆ వచ్చేది ఎవడో నల్లజాతి ప్రముఖుడైతే మాత్రం తాను తమవారందరిలోనూ నగుబాట్ల‌పాలు కావడం తథ్యం. ఆ మాట అటుంచితే, తన పై అధికారులు తనను డిస్మిస్ చేసిపారేస్తారు!

ఆందోళనలో ఉన్న స్టేషన్‌మాస్టరుకు క్రమంగా బుర్ర చురుకుగా మారింది. ఈరోజుకు అంత ప్రమాదం జరగకపోవచ్చు... వచ్చిన జనమందరూ నల్లవాళ్లు. నేటివ్సు. అందులో ధనవంతులే కాక చాలమంది సామాన్యజనం కూడా ఉన్నారు. ఇలాంటి వారెవరూ తెల్ల అధికారులకు వీడ్కోలు పలకడానికి రారు. కాబట్టి, రైలును సరైన సమయానికే బయలుదేరమనవచ్చు. గట్టిగా మాట్లాడితే ఐదు నిమిషాలు ముందుగా పంపేసినా అడిగేవారెవరూ ఉండరు. థాంక్ గాడ్! అతనిలో ఆందోళన కాస్త తగ్గింది. ఆసక్తి పెరిగింది.

మరి, ఇప్పుడెవరి కోసం వచ్చినట్టు ఇందరు జనాలు? కాస్త చిరాకు కూడా కలిగింది. ఆఫ్టరాల్, ఓ నల్లోడి కోసం ఇందరు జనాలా? మహారాష్ట్రంలో బాలగంగాధర తిలక్ లాంటి బ్లాక్ లీడర్ వస్తే ఇలా అపుడపుడు ఇలా జరుగుతూ ఉంటుందని విన్నాడు. అయినా రైల్వే అధికారులు ఆయనగూర్చి పట్టించుకోకుండా సిగ్నల్ ఇస్తారని, రైలును సరైన సమయానికి పంపి తమ డిగ్నిటీని కాపాడుకుంటారని వారి వీరోచితకృత్యాలు విన్నాడు. తనకు కూడా ఈరోజు అటువంటి వీరుల లిస్టులో చేరే సువర్ణావకాశం వచ్చినట్టుంది! అతడికి కాస్త ఆశ కలిగింది. అటువంటి డిగ్నిఫైడ్ మెరిట్ లిస్టులో ఉండేవారికి మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చిన దాఖలాలున్నాయి. కాస్త హుషారు కూడా పెరిగింది.

"హూ'జ్ కమింగ్? హూ ఆర్ దె వెయిటింగ్ ఫా?' అని తన అసిస్టెంట్‌లను దర్పంగా అడిగాడు. "స్వామి వస్తున్నాడని ఆ జనాలు మాటాడుకుంటున్నారు" అని చెప్పారు వారు.

"ష్వామీ? ఈజ్ ఇట్ వివేకానందష్వామీ? నో. నో. హీ ఈజ్ నో మో. దిస్ మస్ట్ బీ సమదా ష్వామీ. హూ కుడిట్ బీ?"

స్టేషన్ మాస్టర్‌కు అంతకు ముందుండిన భయమంతా క్షణంలో పోయింది. అంతే కాదు, కాస్త నిరాశ కూడా కలిగింది. నల్ల రాజకీయనాయకులను ఎదిరించి, తిరస్కరించి, అవమానిస్తే తమ వర్గంలో వచ్చేంతటి కీర్తిప్రతిష్ఠలు ఎవరో ఓ నల్లస్వామిని అవమానిస్తే రాదు. ఇలాంటి స్వాములను ఏం చేసినా తనకు ప్రమోషన్ రాదు! తన నోటి ముందరి కూడును ఎవరో తటాలున లాక్కున్నంత కోపం వచ్చింది అతనికి.

ఇంతలో - "స్వామి వచ్చాడు, స్వామి వచ్చాడు" అనే కలకలం వినిపించింది. ప్లాట్‌ఫాం మీద చెదురుమదురుగా ఉన్న జనాలందరూ ఆ స్వామి స్టేషన్‌లో అడుగుపెట్టినవైపు పరుగుతీశారు.

స్టేషన్‌మాస్టర్‌కు ఇదంతా మరింత చిరాకును తెప్పించింది. "దీజ్ బ్లడీ ష్వామీజా స్పాయిలింగ్ ద క్రౌడ్స్. దీజ్ బెగ్గర్సారాఫ్ నో యూజ్. దెయారెండార్సింగే డర్టీ రెలీజియన్ అండ్ మేకింగ్ ఆలాఫ్ యు షేమ్‌లెస్ బెగ్గార్స్" అంటూ తన అసిస్టెంట్లమీద గట్టిగా అరిచేశాడు. వారు నివ్వెరపోయారు. ఏమిటి ఈయనకు ఇంత అసహనం అనుకున్నారు. పాపం, వారికేం తెలుసు ఆయనలో జరిగిన అంతర్మథనం?

వారందరూ తనను తేరిపారచూస్తూండగా, "లెట్ ద ట్రైన్ స్టార్ట్ ఇమ్మీడియేట్లీ. లెట్ ద సిగ్నల్ బీ గివెన్. వైయార్యూ డిలేయింగ్? టైమీజ్ టైమ్. ఇట్ డజన్ట్ వెయిట్ ఫా ఎనిబడీ, హూ ఎవా ఎట్ మే బీ" అని గట్టిగా అరిచాడు స్టే. మా.

"సర్, షెడ్యూల్ ప్రకారం ఇంకా ఇరవైనిమిషాలుంది" అని చెప్పారు వారు విస్తుపోయి. స్టే. మా. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, " ఇట్సోకే, ఫాలో ద టైమ్" అన్నాడు.

"యెస్ సర్".

స్టేషన్ మాస్టర్ తన గదిలోనికి వెళ్లిపోయాడు. తన కుర్చీలో కూర్చున్నాడు. తన మానసికస్థితికి అతడికి భయం వేసింది. ఎందుకు తన నల్ల అనుచరులముందు తాను ఇలా అదుపు తప్పి ప్రవర్తించాడు? తన మాతృదేశమైన ఇంగ్లండుకు దూరంగా, ఈ నల్లదరిద్రుల దేశంలో బ్రతకడం తనకు ఇష్టంలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు ఇలా బయటపడిందా? ఈదేశంలో మంచి జీతం వస్తుంది. అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు ఉంది. తన పిల్లలకు మంచి విద్యనందించే బ్రిటిష్ స్కూళ్లు కూడా ఉన్నాయి. ఎదురు తిరగకుండా నమ్మకంగా పనిచేసిపెట్టే సేవకులున్నారు. రాజాలాంటి జీవితం. అయినా తనకెందుకు ఈ అసంతృప్తి? తాను తెల్లవాడినన్న అహంకారమే తన మానసికస్థితికి మూలబీజమా?

అతని గది తలుపులు మూసివున్నా, ప్లాట్‌ఫాం మీద జనాల కోలాహలం వినిపిస్తోంది. ఇంతలో రైలు కూత గట్టిగా వినిపించింది. గడియారం చూశాడు. సరిగ్గా ఆరు గంటలు. అతడు తనను చూసిన మరుక్షణం ఆ గడియారం గంటలు కొట్టడం ప్రారంభించింది. నిట్టూర్చాడు.

పది నిమిషాలు గడిచింది. అతని అసిస్టెంట్ తలుపు తట్టి లోనికి వచ్చాడు. "సర్! ఇంజన్ పాడయింది. రైలు కదలటం లేదు." అని చెప్పాడు.

"వాట్?" అని లేచాడు స్టే.మా. గబ గబా ఇంజన్ దగ్గరకు పోయాడు. "వాట్స్ ద ప్రాబ్లం?" అని డ్రైవర్లను అడిగాడు. తెలియటం లేదన్నారు వారు.

"ట్రయగైన్. టేకవే ద ట్రైన్ వాటెవా మే బీ ద కండిషనాఫ్ ద ఇంజన్"

ఆ మాట చెప్పాల్సివస్తే చెప్పాల్సింది ఇంజనీరే కాని, అతడు కాదు. ఆ మాట అన్నందుకు స్టే. మా.ని అరెస్టు చేసి కోర్టులో విచారించవచ్చు.

"నో నో" అన్నాడు ఇంజనీర్. "ఆఫీసర్! ఇంజన్ మారుద్దాం. ట్రైన్ హాజ్ టు రన్ ఎ వెరీ లాంంగ్ డిస్టెన్స్. ఇ'ట్ల్ బీ డేంజరస్ ఇఫ్ ఇట్స్ రాంగ్ విద్దిసింజన్".

"ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్"

మరొక ఇంజన్ వచ్చింది. పాత ఇంజన్‌ను పక్కకు లాగేశారు. కొత్త ఇంజన్‌ను తగిలించారు. అప్పటికే అర్ధగంట ఆలస్యమైంది. స్టేషన్ మాస్టర్ పచ్చ జెండా ఊపాడు. గార్డ్ కూడా విజిలేసి జెండా ఊపాడు. ప్లాట్‌ఫాం మీద జనాలు వెనక్కు జరిగి నిలుచున్నారు. రైలు కూత వేసింది. ఇంజన్ తెల్లని ఆవిర్లు చిమ్మింది. కాని, మళ్లీ అదే సమస్య వచ్చింది! ఇంజన్ కదలలేదు. డ్రైవర్లు గట్టి ప్రయత్నం చేశారు. ఇంజన్ ఒక్క లిప్తకాలం పైకి లేచి మళ్లీ పట్టాల మీద కూర్చుంది. ఆ క్షణకాలంలో పిస్టన్ కు అనుసంధానించబడివున్న చక్రాలు గిరగిరగిర తిరిగాయి. కాని, మొత్తానికి రైలు మాత్రం కదలలేదు.

"వాట్ ద హెల్లీజ్ హ్యాపెనింగ్?" స్టేషన్ మాస్టర్ కోపంగా అరిచాడు.

"డో'న్నో ఆఫీసర్!" అన్నాడు ఇంజనీర్. రైలు పెట్టెలకు అనుసంధానించేంతవరకు చక్కగా నడిచివచ్చిన ఇంజన్ హఠాత్తుగా ఇప్పుడెందుకు మొరాయిస్తోందో అతడికి అర్థం కావటంలేదు.

రైలుకు దూరం జరిగిన జనాలు మళ్లీ దగ్గరకు వచ్చారు. "దీజా ద మోస్ట్ ఇన్‌డిసిప్లిన్డ్ క్రౌడ్జాంద అర్త్! ఆస్క్ దెమ్ ఫస్ట్ టూ మూవవే ఫ్రం ద స్టేజ్షన్!" అని పెద్దగా గొంతెత్తి మళ్లీ అరిచాడు స్టే.మా.

జనాలెవరికీ అతడి అరుపులు పట్టలేదు. తమ ధోరణిలో తామున్నారు. ఇంతలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ తన పై ఆఫీసరు దగ్గరకు వచ్చాడు. "సర్! ట్రైన్‌లో సొరకాయల స్వామి ఉన్నారు. ఆయన శిష్యుడెవరో ఇంకా రాలేదట. అతడొచ్చేవరకు రైలు కదలదని శాసనం చేసి, తన చేతికర్రను రైలుకు నిలువుగా ఆనించి నొక్కిపట్టాడట! అందువల్ల రైలు కదలటం లేదని జనాలు అనుకుంటున్నారు" అని చెప్పాడు.

"యూ డర్టీ మైండ్! హవీజిట్ పాజిబుల్? డోం'టాక్ రబ్బిష్" అని కసురుకున్నాడు స్టే. మా.

ఇంజనీరు మరికాసేపు ప్రయత్నం చేసి చేతులెత్తేశాడు. " ఆఫీసర్! ఇంజన్‌లో ఎక్కడా ఏలోపమూ కనబడటం లేదు. చక్రాలు చక్కగా తిరగడం మీరు కూడా చూశారు. అయినా ఇంజన్ కదలటం లేదు. ఇంజన్ లాగలేనంత భారం వెనుకనున్న పెట్టెల్లో ఉండి ఉండాలి. అదే నిజమైన పక్షంలో ఎన్ని ఇంజన్లు మార్చినా ఇదే సమస్య మళ్లీ మళ్లీ వస్తుంది" అని చెప్పాడు.

స్టేషన్ మాస్టర్ నమ్మలేకపోయాడు. నాలుగువేల హార్స్‌పవర్‌తో కూడిన ఇంజన్ కేవలం మనుషులు మాత్రమే ఎక్కిన పది పెట్టెలను లాగలేకపోవటమా? పెట్టెలనుండి విడదీసి ఇంజన్‌ మాత్రం నడుస్తుందో లేదో నడిపిచూడమన్నాడు. అలాగే చేశారు. ఇంజన్ చక్కగా నడిచింది. స్టే. మా. దిగ్భ్రాంతి చెందాడు. ఒక్కసారి తన అసిస్టెంట్‌వైపు తేరిపారచూశాడు.

"వేరీజ్ ద ష్వామీ?"

తలకు రెండింతలున్న తలపాగా. తెల్లటి గడ్డం, మీసాలు. నుదుటన, గుండెల మీద, చేతులమీద వెడల్పాటి వైష్ణవనామాలు. భుజం మీద పాత బొంత, మొలకు ఓ గోచి గుడ్డ, చంకలో ఒక సొరకాయ డొప్ప, కన్నుల్లోనూ పెదవుల్లోనూ చల్లని మందహాసం. ప్రశాంతమైన వదనం. బక్కచిక్కి ఉన్నప్పటికీ, అమితమైన తేజస్సుతో వెలిగిపోతూ, రైలులో కూర్చుని, చేతిలో కఱ్ఱను నిలువుగా ఆనించి పట్టుకుని, జనాలతో మాట్లాడుతున్నాడు సొరకాయల స్వామి.

స్టేషన్‌మాస్టర్‌ రాగానే జనాలు ఆయనకు దారి ఇచ్చారు. స్వామికి అతడు భారతీయుల పద్ధతిలో నమస్కారం చేశాడు.

స్వామి చిరునవ్వు నవ్వాడు. "రా! రా! నీ కోసమే ఎదురు చూస్తున్నా" అన్నాడు. స్వామితో కోపంగా ఏమేమో మాట్లాడాలనుకున్న అతడు మళ్లీ నమస్కారం మాత్రం పెట్టి ఊరుకున్నాడు. "మరేం భయం లేదు, నీ చింతలన్నీ తీరిపోతాయి" అన్నాడు స్వామి. ఆ మాటలను ఎవరో అనువదించి చెప్పారు అతనికి. అతడు తలాడించి మళ్లీ నమస్కారం చేశాడు.

"ఏదో అడగాలని వచ్చావు. ఏమిటది?"

"ష్వామిజీ, ఆలార్ సేయింగ్ దట్ యు హావ్ స్టాప్డ్ ద ట్రైన్ ఫ్రం మూవింగ్. ప్లీజ్ రిలీవిట్ ష్వామిజీ".

"రైలును నేనే ఆపానని నిజంగా నువ్వనుకుంటున్నావా?"

"యెస్, ష్వామిజీ!"

సొరకాయలస్వామి చిరునవ్వు నవ్వాడు. నిలువుగా పట్టుకున్న కఱ్ఱను అడ్డంగా తిప్పి, సీటు మీద పెట్టాడు. "ఇప్పుడు కదులుతుంది పో!" అన్నాడు.

"థాంక్యూ ష్వామిజీ! పెర్మిట్ మి టు డు మై డ్యూటీ!" అని స్టేషన్‌మాస్టర్ మరొకసారి నమస్కారం చేసి గబ గబ రైలు దిగి ఇంజన్‌ దగ్గరకు వెళ్లాడు. జండా వూపి రైలును తీసుకుపొమ్మని డ్రైవర్లతో చెప్పాడు. గార్డ్ కూడా జండా వూపాడు. రైలు కదిలింది. అందరూ ఆశ్చర్యపోయారు. రైల్లో వెళ్లిపోతున్న స్వామికి మరోమారు నమస్కరించాడు స్టేషన్‌మాస్టర్.

రైలు ప్లాట్‌ఫాం వీడేదాకా ఆగి, తన అసిస్టెంటుతో, "హౌ అండ్ వై ద ష్వామీజీ ఫైనలీ అలౌడ్ ద ట్రైన్ టు మూవ్ వితౌట్ హిజ్ డిజైపుల్? "మరి ష్వామి తన శిష్యుడు రాకుండానే రైలును ఎలా, ఎందుకు కదలనిచ్చాడు?" అని అడిగాడు స్టే.మా.

"మీరే ఆ అజ్ఞాత శిష్యుడై ఉంటారు సర్. మీరు వచ్చిన తరువాతనేగా స్వామీజీ కఱ్ఱను తీసి పక్కన పెట్టారు?" అన్నాడు అసిస్టెంట్.

స్టేషన్‌మాస్టర్ దిగ్భ్రాంతి చెందాడు. తల తిప్పి చూశాడు. రైలు దూరంగా కూతవేస్తూ, పొగను ఎగజిమ్ముతూ పోతూవుంది. మరోసారి భక్తితో ఆ రైలువైపు తలవంచి నమస్కరించాడు.

Saturday, 28 July 2018

- ఎవ్వరూ తక్కువ వాళ్లు కారు -


బ్రహ్మవంశసముద్భూతుడైన ఉత్తానపాదుడు అనే ఒకానొక మహారాజు ఉండేవాడు. ఆయనకు సునీతి సురుచి అని ఇద్దరు భార్యలు ఉండేవారు. సునీతి కుమారుడు ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు.

ఉత్తానపాదునికి తన చిన్న భార్య అయిన సురుచి అంటే ప్రీతి ఎక్కువ. ఓ రోజు ఆయన ఉత్తముని ఒడిలో కూర్చుండబెట్టుకుని లాలిస్తున్నాడు. ఇంతలో అక్కడికి ధ్రువుడు వచ్చాడు. తాను కూడా తండ్రి ఒడిలో ఎక్కాలని ఆశ పడ్డాడు. కాని, సునీతి అడ్డుపడింది.

“ఒరే అబ్బాయీ, నువు రాజపుత్రుడవే కావచ్చు. కాని, నువు నా కడుపున పుట్టలేదు, కాబట్టి, తండ్రి ఒడిలో కూర్చోవాలనే నీకోరిక దుర్లభం పొమ్మం”ది.

న వత్స నృపతేర్ధిష్ణ్యం భవానారోఢుమర్హసి।
న గృహీతో మయా యత్త్వం కుక్షావపి నృపాత్మజః।।
నూనం వేద భవాన్ యస్య దుర్లభేऽర్థే మనోరథః।।
(శ్రీమద్భాగవతం.4.8.11-12)

“అంతగా తండ్రి ఒడిలో కూర్చోవాలని ఉన్నా, రాజసింహాసనం కోరుకుంటున్నా, నువు ఒక పని చెయ్. నువు పురుషోత్తముని ఆరాధించు, అతని అనుగ్రహంతోనే మరలా నువు నా కడుపున పుట్టు.” అని అహంకారంతో పలికింది.

పసివాడైన ధ్రువుడు కఱ్ఱదెబ్బ తిన్న పాములా రోషంతో బుసలు కొట్టాడు. తరువాత తన నిస్సహాయత తెలుసుకొని పెద్దగా రోదించాడు. సునీత కూడా ఈ విషయం తెలుసుకుని చాల బాధపడింది. కుఱ్ఱవానికి కర్తవ్యం బోధించింది.

ఆతిష్ఠ తత్తాత విమత్సరస్త్వమ్, ఉక్తం సమాత్రాపి యదవ్యలీకమ్।
(శ్రీమద్భాగవతం.4.8.19)

“నాయనా, ఆమె నీకు సవతి తల్లి అయినప్పటికీ, పురుషోత్తముని ఆరాధించమని నీకు సరైన మార్గనిర్దేశనమే చేసింది. కాబట్టి, ఆమెపై ద్వేషం పెట్టుకోక, ఆ పనిని చెయ్.” అన్నది.

ధ్రువుడు అలాగే చేశాడు. దయాళువైన నారదమహర్షి చెప్పిన ప్రకారం అద్భుతమైన తపస్సు చేశాడు. భగవంతుడు ఆ తపస్సును మెచ్చి ప్రత్యక్షమై ఆ ధ్రువుడు మనసులో కోరుకున్నదానిని మాత్రమే కాక, అంతకంటె ఉన్నతమైన స్థానాన్ని కూడా ప్రసాదించాడు.

ధ్రువుడు తండ్రి ఒడిని, సింహాసనాన్ని మాత్రమే పొందడం కాకుండా ద్రువమైన (స్థిరమైన) నక్షత్రమై నిలిచాడు.

ఇది, అందరికీ తెలిసిన ఒక సుప్రసిద్ధమైన కథ. ధ్రువుడు ఒక బాలభక్తుడని, పిల్లలందరూ అటువంటి భక్తిని కలిగి ఉండాలని బోధించి ఊరుకొనడంతో ఈ కథను పెద్దలందరూ కంచికి పంపేస్తారు. కాని ఆమాత్రంతో వదలిపెట్దదగిన కథా ఇది?
*

ఆనాడు ఉత్తానపాదుడికి ధ్రువుడు, ఉత్తముడు ఇద్దరూ సమానులే. ఐనప్పటికీ, తన మీద ఉత్తానపాదుడికి ఉన్న ప్రీతిని గ్రహించిన సురుచి న్యాయమైన ధ్రువుని కోరికను తిరస్కరించింది.

భగవంతుని దృష్టిలో బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు అనబడే వారందరూ సమానులే. (నేడు దళితులు అని పిలువబడుతున్నవారు కూడా శూద్రులే.)

కాని, కొందరు పైన చెప్పిన కథలో సురుచిలా అహంకరించి, “నువు మా ఇంట పుట్టలేదు కాబట్టి, నీకు ఫలానా పని చేసే అర్హత లేదు పో, ఫలానా మోక్షం వచ్చే దారి లేదు పో” అని అన్నారనుకోండి.

ప్రస్తుతసమాజంలో అలా అనిపించుకుంటే ఇతరులకు రోషం రావడం సహజమే - పసివాడైన ధ్రువుడికి సవతి తల్లి మాటలకు రోషం వచ్చినట్టు.

కాని, అలా అన్నంతమాత్రాన ధ్రువుడు రాజకుమారుడు కాకుండా పోలేదు. అలాగే, కూడా అటువంటి మాటను అనిపించుకున్నంత మాత్రాన ఇతరుల దివ్యత్వానికి వచ్చే లోటేమీ లేదు. అన్నవారు కూడా అలా అనేసి లేని గొప్పతనాన్ని తెచ్చుకున్నదీ లేదు.

నీకు అర్హత లేదు అని ధ్రువుడితో పలికిన సురుచిది ఎంతటి అజ్ఞానమో నీకు జ్ఞానార్హత లేదు, మోక్షార్హత లేదు అని బోధించేవారిది కూడా అంతే అజ్ఞానం.

“నీ పట్ల కఠినమైన మాటలు మాట్లాడిన ఆమె పట్ల ద్వేషం పెంచుకోకు” అన్న సునీతి ఉపదేశం ధ్రువునికి మాత్రమే కాదు, నేడు తిరస్కరణకు గురి అవుతున్నవారికి కూడా అంతే అవసరం.

పూర్వకాలంలో కూడా మాంసాన్ని అమ్మి జీవించే కులంలో కూడా ధర్మవ్యాధుడు అనే అసామాన్య జ్ఞాని ఉన్నాడని మహాభారతం చెప్పింది. బోయవాడై పుట్టిన కణ్ణప్ప కూడా భక్తావతంసుడయ్యాడని సాక్షాత్తు శంకరాచార్యులంతటి వారే శివానందలహరిలో సాక్ష్యం చెప్పారు.

కాబట్టి, “మనిషి పుట్టుక ఎక్కడ జరిగినా, అది అతడి జ్ఞానసాధనకు గాని, ఉన్నతస్థానసాధనకు గాని ఎటువంటి అడ్డంకి కాబోదు” అని ధ్రువుని కథ ద్వారా తెలిపి శ్రీమద్భాగవతపురాణం మనకు స్ఫూర్తిని ఇస్తుంది.

నేడు మన రాజ్యాంగం అందరూ సమానులే అంటుంది. ఉన్నతస్థానానికి చేరేందుకు అందరికీ అవకాశాలను ఇస్తోంది. ధ్రువునిలా పట్టుదల కలిగినవారు ఎవరైనా తమ అద్భుతకృషితో తాము కోరిన స్థానాన్ని పొందవచ్చు అనడంలో సందేహం లేదు.

జన్మ చేత గాని, బలం చేత గాని, ధనం చేత గాని, అహంకారాన్ని పొంది ఇతరులను తిరస్కరించేవారికి మన పురాణాలు ఇటువంటి గుణపాఠాలను చెబుతూ ఉంటాయి. ఇలా మనకు ఆత్మవిశ్వాసం కలిగించడం మన మతం గొప్పదనం!

Monday, 23 July 2018

నక్క ఉపవాసము

అనగా అనగా ఒక నక్క.
రోంత వయసు ముదురు నక్క.

ఆ నక్క ఒగు దినుము దినాముకట్లే ఆకలి తీర్చుకొనేకి తొండేబిక్కిల్ని, ఉడతలని యెదుకులాడుకుంటా బయలుదేర. దానికంటె ముందరే చిన్న నక్కలు వుషారు వుషారుగా వేటాడేసి కడుపు నింపుకుంటా కానొచ్చె. దీనికిమాత్రం తొండేబిక్కలు, ఉడతలు దొరక్కుండా తప్పిసుకుంటుండాయి. తన కండ్లముందురే కళ్లిచెట్టు బుడుముతాన బొక్కలోకి దూరి దాపెట్టుకున్న తొండేబిక్కిని ఎట్లైనా బయటికి యెల్లబీకల్లని మొన్ను తోగి తోగి దానికి మిగిలిన గోళ్లు కూడా సమిసిపాయ. తన చాటుమాల్నుండి చటుక్కున చెట్టుమిందికెగిరిన ఉడతని పండ్ల మధ్యన యిరికించుకోవల్లని దుంకితే దాని కోరలన్నీ మానులోకి ఇరుక్కుని అర్ధము యిరిగిపాయ.

ఇంత గోరుము జరిగినంక దాని బలమేమో దానికే అర్థమైపాయ. ఇంగ నాకి వయసైపాయరా, అందరితానా యేట్లాడి యేట్లాడి సంపాదిచ్చేది ఇంగ నాకి శాతకాదు అని తెలిసిపాయ. అది యిచారంగా బోయి అడివిలోన గుడికాడ కూకొనిడిశ. ఆ గుడితాన మనుషులు అపుడపుడు కోళ్లూ మేకలూ బలిచ్చి కోసుకుతింటాంటారు. అపుడు ఆడాడ యేమన్నా నేలబడింటే యేరుకుతినొచ్చు అని దాని ఆశ. కానీ, ఆ ఆశ కూడా నిరాశ ఐపాయ.

దావన బొయ్యే ఇంకో నక్క “ఏమిరా అల్లుడూ ఈడ ఇట్ల్నే మొగుము యేలాడదీసుకుని కూకునుండావు? ఈ పొద్దు తొలి ఏకాదశి, అందుకే ఈ పొద్దు ఎవరూ బలిచ్చేది లేదు, నీకు కడుపు నిండేదీ లేదు” అని జెప్పి దాని దోవకి అది బాయ.

కడుపాకలి తట్టుకోలాపుక ఆ నక్క ఇంగ బాగ ఏడిశిడిశ. ఇట్లా టైములో ఏమి చేయాల్నో నేను చదివిన రెండులక్షల పుస్తుకాలలో ఏ వొక్క పుస్తుకంలోనైనా ఉండునా అని బాగ ఆలోచన చేశ. అప్పుడుసగం చిరిగిన యెర్రట్ట పుస్తకంలో తాను చదివిన ఒగు విషయం దానికి నెప్పికొచ్చ.

ఏకాదశీ ఉపవాసవ్రతమాహాత్మ్యము! ఆ పొద్దు పూర్తిగా ఉపాసముంటే దండిగా పున్నెము వస్తాదంట. పున్నెము అంటే ఏమిడిదో దానికి రోంత రోంత తెలుసు. పిట్ట మాంసము, పుంజు మాంసము, మేక మాంసము – ఇవన్నీ కలిపి తింటే - అదీ పున్నెము అంటే! అంతకంటే గొప్ప పున్నెము ప్రపంచంలో యాడ్యాడా ఉండుదని ఆ పుస్తుకములాన ఘోస ఘోస పెట్టి ఉన్న్యారు. దానికి అవకాసము వచ్చింది గదాని, నక్కకి ఆ పొద్దు ఉపాసము ఉండాల్నని బుద్ది పుట్టిడిశ. యెట్లోగట్ల నెలకు రెండు దినాలు ఇట్ల ఉపాసముంటే ఇంక మిగిలిన దినాలన్నీ పున్న్యాలంటే పున్న్యాలు!

ఉపాసమున్నపుడు నీళ్లు దాగినా యేమీ వ్రతభంగం కాదని దానికి తెలుసును. దానికే దగ్గర్లో వుండిన యేటితాకి యెట్లో కాళ్లీడ్సుకుంటాబాయ. యేటి వొడ్డున అనుకోకుండా ఒక దృశ్యం చూసేతలికే దాని కండ్లు మిల మిల మెరిసిపాయ.

సన్న మేకపిల్ల వొగిటి ఆడ మే మే అని అర్సుకుంటా తిరుగుతాండాది. ఎట్ల్నో తప్పిపయినట్లుండాది. రాజుగారి తోటలోన మేతకు బోయి, రాణిగారి పూలచెట్లు మేత మేస్తూ, తోటమాలి కొట్టవస్తే తుర్రుమని కానొచ్చిన దిక్కులో పారి పారి వచ్చిన బుజ్జి మేక అదే! అట్లా దూరుం దూరుం పారి పారొచ్చి వాళ్లమ్మను కానకపాయ. అబుడు శాన బయమేసి నోటిలో ఉన్నశక్తినంతా ఉపయోగిచ్చి గొంతు వూడొచ్చేలా పిలుస్తాంటే అయ్యో పాపుమని యెవురికన్నా కనికరము బుట్టాల్సిందే!

పాపం ఆ బుజ్జి మేకపిల్ల రొంత సేపు ఆ యాకునీ ఈ యాకునీ వాసన జూస్తాది, అర్సతాది. రొంత ముందరకి పొయ్యి జూస్తాది, మళ్లీ యెనిక్కొచ్చి అర్సతాది. పొడుగాటి చెవుల్ని అట్లా ఇట్లా అల్లాడిచ్చుకుంటా తలకాయ తిప్పుతాది, అర్సతాది. రోంత సేపు వంకర టింకరగా అడ్డడ్డుము ఎగర్లాడతాది, అర్సతాది. రెండు గడ్డిపరకలు నముల్తాది, తలెత్తి మళ్లీ అర్సతాది. ఆడ ఒగ యెత్తైన రాయుంటే దాని మింద ముందరికాళ్లు పెట్టి నిలబడి తలకాయ అట్లా ఇట్లా తిప్పుకుంటా అమ్మ కనిపిస్తాదేమో అని దిక్కులు చూస్తాది, అర్సతాది. కాళ్లు నొచ్చుతాయేమో, రోంతసేపు నేలమీద పండుకుని ముకుము డొక్కలా పెట్టుకుంటాది. అంతలోనే, మళ్లీ పండుకుంటే పనులు జరగవని అంతరాత్మ ప్రబోధం జరిగినట్టు లేచి మళ్లీ అర్సతాది. పాపుము అది అట్లా అరిసేతప్పుడు సూడల్ల, నోట్లోంచి నాలుక రొవంత బయటకివచ్చి కానొస్తాది. మెడ ఎంత దూరుము సాచి అరిస్తే అంత దూరుము యినిపిస్తాది, అబుడుమా అమ్మ యాడున్నా పారి పారి నాతాకి వస్తాది అన్నట్ల ఆ సన్న మెడని ఇంత పొడుగు నీలిగిచ్చి నీలిగిచ్చి అర్సతాది. కండ్ల నిండా బయం బయం నింపుకుని అర్సతాది.

నక్క ఆ మేకపిల్లని చాటునుంచి దూరం నుంచి శానా సేపు సూసుకుంటా అట్ల్నే నిలబడినాది. వాళ్లమ్మ ఆడ్నే యాడ్నో వుంటాది, నేను తొందరపడి దాన్ని పట్టుకునేకి పోతే వాళ్లమ్మ వచ్చి నన్ను డొక్కలో కుమ్మి పారేస్తాది అని నక్క భయం నక్కది.
కాని, ఆ మేకపిల్ల యెంతసేపు అర్సినా వాళ్లమ్మ రాకపాయ. ఆర్సీ ఆర్సీ ఆ మేకపిల్ల అలిసిపాయ. నేలమింద పండుకుని ముకుము కడుపులాకి దూర్సుకునిడిశ.

శానాసేపైనా అది మళ్లీ లెయ్యకోకుండేది సూసి నక్క ఇదే మంచి అవకాశమురా దీన్ని పట్టుకునేకి అనుకునింది. మెల్లగా సప్పుడు కాకుండా దానిపక్క పొదల పక్కనే నక్కుకుంటా పాయ. వచ్చ, వచ్చ, దగ్గరకు వచ్చిడిశ! ఇంకా ఆడ్నే వుంది మేకపిల్ల. అమ్మే యెట్లోగట్ల నన్ని యెతుక్కుంటా వస్తాదిలే అనుకునిందో యేమో! అడివిలో గండాలు ఇట్లిట్లా వుంటాయని దానికి యేమి తెలుసు పాపుము?

నక్క ఊపిరి బిగబట్టుకున్య. రెండడుగులు ముందుకేసి ఒక్క దూకు దూకితే, ఇంగ ఆమేకపిల్ల తనదే! విందు భోజనమే! దేముడుండే స్వర్గానికి పోయినా కూడా అంత మంచి భోజనం యెవురూ పెట్టలాపురు అనిపించింది. ఒకటో అడుగు వేసింది. ఇంతలో గాలి వీచి, ఆకులు గలగలలాడినాయి. మేకపిల్ల తల యెత్తింది. నక్క చప్పున వంగి తలను భూమికి ఆనిచ్చిడిశ. పొద యెనుకనున్న ఆ నక్కను మేకపిల్ల కానక పాయ. కాని, యేమో అనుమానమొచ్చి అది అట్ల్నే లేసి నిలబడ. కాని, యాటికీ కదలకపాయ. అది తన దిక్కు చూడలేదని నక్క గమనిచ్చుకుని రెండో అడుగు ముందుకేశ. దాని దురదృష్టము, ఆడ గాలికి కొట్టుకొచ్చిన రెండు ఎండుటాకులు ఉండ్య. నక్క అడుగు పడగానే అవి కరకరమని శబ్దం చేసుకుంట యిరిగిపాయ. మేకపిల్ల చప్పున తలదిప్పి చూసిందీ, నక్కయెగిరి దానిమిందికి దుంకిందీ ఒకేసారి జరిగిపాయ.

కానీ, నక్క మేకపిల్ల మీద పడల్యా. నేలమీదనే పడింది. యేమిటికంటే, మేకపిల్ల దానికంటె ముందరే యెగిరి బండమీదకి దుంకింది. నక్కకి ఆశాభంగమైపాయ. మేకపిల్ల గూడా నక్కను కండ్లారా చూసిడిశ. అంతే! ఒక్కు క్షణుము గూడా ఆడ నిల్సుకోకుండా అట్ల్నే దుంకుకుంటా దుంకుకుంటా యేటిపక్కకి పార్య. నక్క ఆశ యిడిసిపెట్టలాపుక దాన్ని యెంటదరుముకుంట పాయ. యెదురుగ్గా పెద్ద సప్పుడు సేసుకుంటా జోరు జోరున పారుతున్న యేరుని చూసి మేకపిల్లకి బయమేసి పాయ. యెనిక్కి తిరిగేతలికే తనని పట్టుకునేకి పారి పారి వస్తుండిన నక్క కనబడ్య. అంతే! మేకపిల్ల ఇంకేమీ ఆలోచన చేయకుండా యెగిరి యేట్లోకి దుంకిడిశ.

అంతదంకన్నా పారి పారొచ్చిన నక్కకి దానెనికినే యేట్లోకి దుంకేకి దమ్ము లేకపాయ. అట్ల్నే దాన్ని తేరిపారజూసుకుంటా నిలబడుకొనిడిశ. బుజ్జి మేక యేట్లో బడి కొట్టుకుపోతా, అట్లా ఇట్లా కాళ్ళు అల్లాడిచ్చుకుంటా యెట్ల్నో మొత్తానికి అవతలి గడ్డకి పడ్య.

గడ్డకి పడినంక కడుపును అట్లా ఇట్లా అల్లాడిస్తే దాని బొచ్చునుండి నీళ్లన్నీ వానచినుకులా కట్ల టప టప రాలి పడ్య. అప్పుడది యెనిక్కి తిరిగి అవతలి గట్టున నిలబడిన నక్కను చూశ. నక్క గూడా దాన్ని సూసుకుంటానే ఉణ్ణింది. అప్పుడు బుజ్జిమేక ఒకసారి మెడ ముందుకు చాచి నాలుక కొంచెం బయటకు కనబడేలా మే మే అంటూ అరిచింది. ఆనెంక నక్క దిక్క తిరిగి చూడకుండా అరుసుకుంటా అట్ల్నే నడుసుకుంటా ఆదిక్క అట్లే పాయ.

నక్కకి మళ్లీ యేడుపొచ్చ. ఆ వొక్క క్షణం గాలి వీచకుండా ఉండివుంటే – ఆ వొక్క అడుగు తాను యెండిపోయిన ఆకుల మీద వేయకపోయి వుండివుంటే - ఈ పాటికి ఆ బుజ్జిమేక తన కడుపులో చేరి ఆకలి తీర్చి వుండేది! దేవుడు తనకు ఆ అవకాశం ఇవ్వలేదు!

దేవుడు అనుకునేతాలికే నక్కకు బిరీన నెప్పికొచ్చ... – తను సంకల్పించిన ఏకాదశీ ఉపవాసం గురించి. అరెరే! అనుకొన్య.

అవును సుమా! నేను దాని గూర్చి నేను మరిచే పోయినాను! ఈ పొద్దు నేను ఉపాసం ఉండాల్నని అనుకుంటి గదా! మరి ఈ మేక నాకు చిక్కింటే నాకు వ్రతభంగం అయితాండ కదా? అనుకుంది. పశ్చాత్తాపపడింది. నేను చేసింది తప్పే! అనుకునింది. లెంపలేసుకుంది. దేవుడికి క్షమాపణ చెప్పుకుంది. నువ్వే నాకు మేకను చిక్కకుండా చేసి నన్ను మహాపాపం నుండి కాపాడావని మెచ్చుకుంది. గుంజీలు తీసింది. నా బుద్ధిని యెప్పుడూ ఇట్లే సక్రమమార్గంలో నడిపిచ్చు తండ్రీ అనుకుంది. దాని మనసు తేలికపడింది. యెట్లో యేట్లో కాసిని నీళ్ళు గతికి, నెమ్మదిగా గుడి దగ్గరకు బయలుదేరింది.

ఇంతలో మళ్ళీ మే మే అని అరుపులు వినిపించాయి. వెంటనే గబా గబా పక్కనున్న గుట్టెక్కి చూసింది. మేకలమంద! అందులో ఒక మేక కంగారు కంగారుగా అటూ ఇటూ వెదుకుతోంది. బుజ్జిమేకవాళ్ల అమ్మ కాబోలు! నక్కకి నోట్లో నీళ్లు ఊరాయి. ఎన్ని మేకలు! ఎన్నెని మేకలురా దేవుడా! ఇన్ని మేకల్లో ఒక్కటైనా నాకు దొరక్కపోతుందా అనుకుంది. ఉపాసముంటానని దేముడికిచ్చిన మాట దానికి మళ్లీ మళ్లీ గుర్తుకొస్తోంది, పక్కనుండే పొదలో ముండ్లు మళ్లీ మళ్లీ గుచ్చుకుంటున్నాయి. హే, అంటూ ఆ ముండ్లను విదిలిచ్చుకుంటూ ఒక్కమేకనైనా ఎట్లా పట్టేది అని ఆలోచనలో పడింది.

దేవుడా, ఏకాదశి ఉపవాసం వదిలి రేపు ద్వాదశినాడు ఉపాసముంటాలే – ఎప్పుడు చేస్తే ఏముంది, ఉపాసం ఉపాసమే కదా! అని దేముడికి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది.

ఇంతలో హే హే అంటూ మనిషి గొంతు వినిపించింది. మెడ నిక్కించి చూసింది. మంద వెనుక చాలమంది కాపర్లు ఉన్నారు. వాళ్ల చేతుల్లో ఇంతింతలేసి దుడ్డుకఱ్ఱలు ఉన్నాయి. ఇంక నక్క అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేదు. దేముడా! ఇంక పోస్టుపోనుమెంట్లు లేవు. ఈపొద్దే నా ఏకాదశి ఉపవాసం కన్ఫాం చేసుకో అంటూ గుడిదిక్క పరుగులు తీశ.
***

((DISCLAIMER – ఈ కథ చదువుతున్నపుడు గాని, చదివిన తరువాత గాని, బుజ్జి మేకపిల్ల అంటే “రాజ్యసభ సీటు” అని ఎవరికైనా అనిపిస్తే నా బాధ్యత లేదు. ఏకాదశీ ఉపవాసం చేయడం అంటే “పార్టీ పెట్టి ప్రజాసేవ చేయడం” అనిపించినా సరే, నా తప్పు లేదు. నక్క ఎవరు అంటూ ఎవరూ నన్ను ప్రశ్నలు వేయవద్దు, మీ ఊహలకు నేను బాధ్యుడిని కాజాలను.))

తిల్లై కూతన్, తిరునీలకంఠర్

అది నటరాజస్వామి కొలువైన చిదంబరపుణ్యక్షేత్రంలో పవిత్రమైన శివగంగ కోనేరు.
స్థానికులు తమభాషలో స్వామిని తిల్లై కూతన్ అని పిలుచుకుంటారు. తిల్లై అనేది అక్కడి సముద్రతీరప్రాంతాలలో విరివిగా పెరిగే ఒకానొక చెట్టు. కూతన్ అంటే నృత్యాధిపతి. (తిల్లై నటరాజు అని అర్థం అన్నమాట)
ఆయన కొలువైన స్థానాన్ని వారు చిత్రాంబళం అంటారు. అంబళం అంటే రంగస్థలం లేదా దేవాలయం. చిత్ర అనే పదానికి విభిన్నమైన అర్థాలు ఉన్నాయి. అద్భుతమైనది, దివ్యమైనది, వర్ణమయమైనది, శోభస్కరమైనది, శుభంకరమైనది... ఇలా.
చిదంబళం అనేవారు కూడా ఉన్నారు. చిత్ + అంబళం అన్నమాట. చిత్ అంటే చైతన్యం అని అర్థం. సత్ + చిత్ + ఆనందం = సచ్చిదానందం అనే పదాల కలయికలో చిత్ ఇదే. చిదంబళం అంటే చైతన్యదేవాలయం అని అర్థం
స్వామివారి సహధర్మచారిణి పేరు శివగామి సుందరి. ఆమె ఆలయానికి ఎదురుగా ఉన్నదే ఈ శివగంగ కోనేరు.
***
పూర్వం చిదంబరంలో తిరునీలకంఠర్ అని ఒకాయన ఉండేవారు. ఆయన గొప్ప శివభక్తుడు. అంతటి ఆయన కూడా జితేంద్రియుడు కానందువల్ల, ఒకసారి ఒకానొక తప్పు చేశాడు. ఆ తప్పును అతని భార్య సహించలేకపోయింది. అతడు తన భార్యను అనునయించే ప్రయత్నం చేశాడు.
ఆ ప్రయత్నంలో తన భార్యను అతడు తాకే ప్రయత్నం చేయబోతే ఆమె "మీరు మమ్మల్ని అంటరాదు, తిల్లై కూతన్ స్వామి పేరిట ప్రమాణం" అనేసింది.
ఆమె నన్ను అంటరాదు అని ఏకవచనప్రయోగం చేయకుండా మమ్మల్ని అంటూ బహువచన ప్రయోగం చేసింది కాబట్టి, అతడు స్త్రీలెవరినీ తాకరాదు అని నిశ్చయించుకున్నాడు. నిండు యౌవనంలో ఉన్నపుడే అతడు బ్రహ్మచర్యదీక్షను స్వీకరించాడు. తన వృత్తిని తన శివుని తప్ప వేరెవరినీ మనసులో ఉంచుకోకుండా జీవితం గడిపాడు. అలాగని, భార్యను పోషించే తన ధర్మాన్ని మాత్రం అతడు విడిచిపెట్టలేదు. ఆమె కూడా శివభక్తితన్మయురాలైంది. క్రమంగా వారు ఇరువురూ వృద్ధులయ్యారు. శరీరంలో శక్తి క్షీణించింది.
శివగామీనటరాజులకు వారిపట్ల కరుణ కలిగింది. వారికి ఇహపరసౌఖ్యాలు కలుగజేయవలసిందిగా శివగామి నటరాజును కోరింది. సరేనన్నాడు ఆయన. 
ఒక శివయోగి వేషం ధరించి తిరునీలకంఠర్ ఇంటికి వచ్చాడు. అతని ఆతిథ్యం స్వీకరించిన తరువాత ఒక బంగారు భిక్షాపాత్రను అతని చేతికి ఇచ్చి, ఓయి నీలకంఠా, ఈ తీర్థయాత్రలకు పోతున్నాను, తిరిగి వచ్చిన తరువాత ఈ పాత్రను నీ దగ్గరనుండి తీసుకుంటాను, అంతవరకు నీవద్ద భద్రంగా దాచిపెట్టవలసింది" అని కోరాడు. సరేనన్నాడు నీలకంఠర్.
కొంతకాలం గడిచాక ఆ మాయాశివయోగి తిరిగివచ్చి, "ఏదీ, నీకిచ్చిన బంగారు పాత్రను నాకు తిరిగి ఇచ్చేసెయ్" అన్నాడు. నీలకంఠర్ తన ఇల్లంతా వెతికినా ఆ పాత్ర దొరకలేదు. అతడు శివయోగి కాళ్లమీద పడి, క్షమాపణ కోరాడు. ఆ పాత్రకు బదులుగా మరొక బంగారు పాత్రను ఇస్తానన్నాడు. కానీ, మాయాశివయోగి శాంతించాడు కాడు. నీవు శివభక్తుని వేషంలో ఉన్న ఒక దొంగవు అంటూ నిందించాడు.
నిజమైన శివభక్తుడు ఎన్నడూ దొంగ కాజాలడు అన్నాడు నీలకంఠర్. నీవు నిర్దోషివి అయితే శివుని సాక్షిగా ప్రమాణం చేయగలవా అని సవాలు చేశాడు మాయాశివయోగి. అలాగే, ఏమని ప్రమాణం చేయమంటారు అని నీలకంఠర్ అడిగాడు.
"నీవు నీ భార్య చేతిని పట్టుకుని తిల్లై కూతన్ శివగామి సుందరిల సమక్షంలో, శివగంగ కోనేరులో మునిగి బంగారు పాత్రను దొంగిలించలేదని చెప్పండి చూదాం" అన్నాడు మాయాశివయోగి.
ఒక కఠినమైన పరీక్ష ఎదురైంది నీలకంఠర్ కు. పూర్వం తిల్లై కూతన్ పేరిట తన భార్య చేసిన శపథం వల్ల తాను ఆమెను తాకరాదు. తాకితే స్వామివారిపట్ల ఘోరమైన అపరాధం చేసినట్లవుతుంది. కానీ, ఇపుడు ఆమె చేతిని పట్టుకుని తాను బంగారు పాత్రను దొంగిలించలేదని చెప్పి కోనేరులో మునిగి ప్రమాణం చేయకపోతే శివభక్తుడు దొంగ అనే అపవాదం వచ్చి పడుతుంది. ఏమి చేయాలో తెలియని విషాదంలో మునిగి కన్నీరు కార్చాడు నీలకంఠర్.
మాయాశివయోగి చిదంబరంలో పెద్దలందరినీ పిలిచి పెద్ద రచ్చ చేశాడు. వారందరూ వచ్చి, ఆ శివయోగి చెప్పినట్లే నీలకంఠర్ తన భార్య చేతిని పట్టుకుని ప్రమాణం చేయవలసిందేనని తీర్పు చెప్పారు. లేదంటే గ్రామబహిష్కరణ శిక్ష తప్పదని హెచ్చరించారు.
అపుడు ఇక మరణమే శరణం అని భావించిన అతనితో ఆయన భార్య ఒక ఉపాయం తెలిపింది. ఆ ఉపాయం ప్రకారం భార్యాభర్తలు ఇరువురు ఒక కఱ్ఱను ఇరువైపులా పట్టుకుని, మాయాశివయోగి చెప్పిన ప్రకారమే ప్రమాణం చేసి కోనేటిలో మునిగారు. వారు లేచి చూసేసరికి...
***
***
ఆశ్చర్యం!
దంపతులు ఇరువురూ నవయౌవనవంతులు అయ్యారు.
వారి వృద్ధత్వం ఎటుపోయిందో ఎవరూ ఎరుగరు. అక్కడ ఉన్న చిదంబరక్షేత్రప్రజలందరూ అది తమ తిల్లై కూతన్ చేసిన మాయ అని తెలుసుకున్నారు. హర హర మహాదేవ శంభో అనే వారి భక్తితన్మయధ్వనులతో క్షేత్రమంతా ప్రతిధ్వనించిపోయింది.
***
కాలక్రమేణా ఆ నీలకంఠర్ అరవై ముగ్గురు నాయన్మారులలో ప్రథముడిగా ఘనత వహించాడు. నాయన్మారులంటే ద్రవిడదేశానికి చెందిన పరమశివభక్తులు. ఇంద్రియలోలుడైన తన భక్తునికి ఇంద్రియవిజయం ప్రసాదించి అనుగ్రహించిన కూతన్ కథ ఇది.
***
ఇదిగో మిస్టర్ I Lie Yeah,
ఈ తిరునీలకంఠ నాయనారు బ్రాహ్మడు కాదు, కోమటోడు అంతకంటే కాదు, అచ్చమైన శూద్రుడు. అతడు కుంభకారుడు అంటే మొదట అర్థం కాక ఏడుస్తావు. అర్థమైతే అది సంస్కృతం అని ఏడుస్తావు. అందుకే అతడు కుమ్మరి కులంలో పుట్టినవాడు అని స్పష్టంగా చెబుతున్నాను.
ఈ కథ తెలుసుకున్న తరువాతనైనా,
"హిందూ దేవుళ్ళు తక్కువజాతి భక్తులను దూరంగా పెడతారు, యేసుక్రీస్తు, బుద్ధుడు మాత్రమే శూద్రులను చేరదీస్తారు" - అనే నీ వెధవ వాగుడు ఇక ఆపు.
హిందూ దేవుళ్ళు పరమ సెక్యులర్ దేవుళ్ళు. తమను తిట్టినవారికి కూడా మోక్షం ప్రసాదిస్తారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, శిశుపాలుడు వంటివారిని ఎరుగుదువా? వాళ్ళు ఎన్ని తిట్టినా సహించి తన చెంతకు చేర్చుకున్నవారు. వారిది కూడా భక్తేనని హిందూ దేవుళ్ళు భావిస్తారు. వాళ్ళది వైరభక్తి అట.
అలాగే, నీవు ద్వేషంతో వాగుతున్నా, అజ్ఞానంతో వాగుతున్నా, మొత్తానికి హిందూ దేవుళ్లను స్మరిస్తున్నావు. నీకు కూడా పుణ్యం వస్తుంది పో. అదీ మా మతపు గొప్పదనం.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...