Thursday 26 March 2020

కాళిదాసు స్వభావోక్తి



అది హిమవత్ పర్వతపంక్తులలో ఒక ప్రాంతం.  గంగానది పెద్దగా సడి చేయకుండా నెమ్మదిగా ప్రవహిస్తోంది.  ఆ ప్రవాహంలో పొడవాటి దేవదారువులు కాళ్ళు పెట్టి తడుస్తూ ఉన్నాయి.  అక్కడి పొదలలో సంచరిస్తున్న కస్తూరి మృగాల కారణంగా గాలి పరిమళభరితంగా ఉన్నది.  కిన్నరులు సన్నగా పాడుతున్న ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి.  ఆ ప్రాంతంలో చర్మవస్త్రుడు అయిన పరమేశ్వరుడు ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.

ప్రమథగణాలు విశ్రాంతిగా ఆటవిడుపుగా ఉన్నారు.  అక్కడ ఉన్న పూలను తమ సిగలలో తురుముకున్నారు.  వారు భూర్జత్వచాలను (బుజపత్తిరి పట్టలను) వస్త్రాలుగా ధరించారు.  మనశ్శిలాచూర్ణాన్ని ఒంటికి పూసుకున్నారు.  శిలాజతువులనడుమ బండరాళ్లపై కూర్చుని ఉన్నారు.

అప్పుడు, నందీశ్వరుని (వృషభం) చేష్టలను వర్ణిస్తూ కాళిదాసు వ్రాసిన ఈ శ్లోకం అతి రమణీయమైనది.

తుషారసఙ్ఘాతశిలాః ఖురాగ్రైః
సముల్లిఖన్ దర్పకలః కకుద్మాన్।
దృష్టః కథఞ్చిద్గవయైర్వివిగ్నైః
అసోఢసింహధ్వనిరున్ననాద॥
(కుమారసంభవమ్ 1.56)

ఆ మహావృషభం చలికాలంలో పేరుకుపోయి గడ్డకట్టిన మంచురాళ్లను తన గొరిౙలతో (కాలి గిట్టలతో) గోరాడుతూ ఉండగా ఎక్కడో దూరం నుండి సింహగర్జనలు వినిపించేసరికి సహించలేక (ఆమాత్రం శబ్దం నేను చేయలేనా అన్నట్టుగా) ఉన్నట్టుండి ఖణిల్లని రంకె వేసిందట.  అప్పుడు దాని మహాకారాన్ని, బలాన్ని చూసి, ఆ దగ్గరలో ఉన్న తక్కిన గవయవాలు (కొండెనుములు) అన్నీ భయనిర్విణ్ణములై నిశ్చేష్టములై పోయాయట.

(ననాద అనే క్రియాపదప్రయోగంతో ఆ ఎద్దు రంకెతో ఆ కొండలు కోనలు ప్రతిధ్వనించిపోయాయనే అర్థాన్ని కూడా కాళిదాసు నేరుగా చెప్పకపోయినా ధ్వనింపజేశాడు.)

(చలికాలంలో కడుపునిండా తిండి దొరకక అరణ్యాలలోను కొండలలోను తిరిగి తిరిగి అలసిపోయి నిస్సహాయంతో కోపంతో గర్జించిన సింహాలు నందీశ్వరుని రంకెకు ఒక్కసారిగా అదిరిపడి, చెవులు రిక్కించి, జూలు అల్లాడుతూ ఉండగా తమ తలలను ఒకింత పైకెత్తి, తమను తిరిగి సవాలు చేస్తున్నట్లు వినవచ్చిన దర్పంతో కూడిన ఆ మహానాదాన్ని చేసిన ఆ మహాసత్త్వం ఏమైయ్యుంటుందో అని కలత చెందుతూ, కళ్లను విప్పార్చి అటూ ఇటూ చూస్తున్న దృశ్యాన్ని ఊహించమని కాళిదాసు చెప్పినట్లు ఉంది కదా!)

ఉపమా కాళిదాసస్య అని అందరూ కీర్తిస్తారు.  కాని ఇంత చక్కని స్వభావోక్తిని కూడా కాళిదాసు ప్రయోగించగలడు!  'చారు యథావద్ వస్తువర్ణనమ్' అని స్వభావోక్తి అలంకారాన్ని ప్రఖ్యాతకాళిదాసవిమర్శకుడైన మల్లినాథులవారు నిర్వచించారు.  ఉన్నదానిని ఉన్నట్టుగా వర్ణించడం స్వభావోక్తి అట. 

కవయః కాళిదాసాద్యాః
కవయో వయమప్యమీ।
(కాళిదాసులాంటివాళ్లూ కవులే, మేమున్నూ కవులమే) ఆమాత్రం అందరూ వర్ణించగలరు కదా?  ఆగండాగండి.  ముందుగా 'చారు' అనే పదాన్ని చూడండి.  అది అన్నంలో కలుపుకు తినే పదార్థం కాదు.  చారు=అందమైన/సుందరమైన/రమణీయమైన/మనోహరమైన అని ఆ పదానికి అర్థం.  మనసును మురిపించే విధంగా, ఉన్నదానిని ఉన్నట్టు వర్ణించడం స్వభావోక్తి.

కాబట్టి,
పర్వతే పరమాణౌ చ
పదార్థత్వం తు విద్యతే॥
కాళిదాసూ కవే, నేను కూడా కవినే అనే వాళ్లకు,
పర్వతమూ ఒక పదార్థమే, పరమాణువూ ఒక పదార్థమే అని సమాధానం.

ఈ బొమ్మకు ఈ కథనానికి సంబంధం ఏమీ లేదే అనిపించిందా?  నాకు కూడా అలాగే అనిపించింది.  ఈ వర్ణనకు తగిన చిత్రం దొరుకుతుందా అని వెదికాను.  ఉహూ.  దొరకలేదు.  చిత్రకారులు కాళిదాసు కావ్యాలను చదవాలే కాని, వారి ప్రతిభను తట్టి లేపే ఎన్నో రమణీయవర్ణనలు వారికి లభిస్తాయి.

(ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఒక పక్క ప్రశాంతంగా నా పనేదో నేను చేసుకుంటూ ఉంటే మరోపక్క పై తరగతికి వారికి ప్రమోషన్ ఇస్తున్నట్లు వారి పాఠశాలనుండి సందేశం వచ్చేసరికి ఆనందం తట్టుకోలేక కేకలేస్తున్న పిల్లలను చూసి కుమారసంభవంలో కాళిదాసు వర్ణించిన నందీశ్వరుడు గుర్తుకొచ్చాడు.)

#Kalidasa #Kumarasambhava #Nandi

Tuesday 24 March 2020

సెల్ఫ్ ఐసోలేషన్‌లో బీర్బల్




అక్బర్ తన రవీజల్‌ వుజారా (ముఖ్యమంత్రి) అయిన బీర్బల్ మాటకు ఎంతో విలువనిచ్చేవాడు.  

బీర్బల్ తెలివితేటలు కేవలం అక్బర్ చెంత మాత్రమే కాక మొగల్ సామ్రాజ్యం అంతటా ప్రఖ్యాతి గాంచాయి.  పాదుషా తరువాత పాదుషా అంతటి వాడిగా ప్రజలందరూ అతడిని గుర్తించి గౌరవించారు.

అయితే ఇది అక్బర్ గారి వ్యక్తిగత హల్లాకు (మంగలి) అయిన రజాక్‌కు నచ్చలేదు. బీర్బల్ వచ్చిన తరువాత అక్బర్ తన లొల్లాయి సలహాలను అంతగా పట్టించుకోకపోవడమే అందుకు కారణం.  

ఇటువంటి కడుపుసంకటం కేవలం రజాక్‌కు మాత్రమే కాదు.  అక్బర్ మహ్‌కమా‌ (సభ) లోని వారందరికీ కూడా ఉండింది.  వారందరూ  అక్బర్‌ను ప్రతిరోజూ కలిసే రజాకుతో కలిసి బీర్బల్ పీడను ఎలా వదిలించుకోవాలో బాగా ఆలోచన చేసి ఒక పథకం వేశారు.

ఆ పథకం ప్రకారం, 
ఒకరోజు రజాక్ సభకు వచ్చి "ఆలంపనా, ఆలంపనా, నాకు రాత్రి ఒక ముఖ్యమైన కల వచ్చింది" అని పాదుషాకు అందరిముందూ విన్నవించుకున్నాడు.



"అవునా?  ఏమిటా కల?"

"ఆలంపనా!  గతరాత్రి మీ అబ్బాజాన్ గారైన హుమయూన్ నా కలలోకి వచ్చారు."

అక్బర్ సంతోషపడ్డాడు.  "శభాష్!  నీ రాజభక్తి మెచ్చదగింది" అన్నాడు.

"కానీ, ఆలంపనా" అంటూ రజాక్ నసిగాడు.

అతడి ముఖాన్ని చూసిన అక్బర్‌కు అనుమానం వేసి,  "ఏమైంది రజాక్? మా అబ్బాజాన్‌కు ఏమైనా సమస్య వచ్చిందా?" అని అడిగాడు.

"జీ, ఆలంపనా" అన్నాడు రజాక్.  
"జన్నత్‌లో మీ అబ్బాజాన్ దిగులుతో ఉన్నారు.  తమకు ఇక్కడ  బీర్బల్ ఉన్నట్లుగా జన్నత్‌లో తనకు ఎవరూ సరైన సలహాదారు లేడని చాల బాధగా ఉన్నారు.  అందువలన వెంటనే బీర్బల్‌ను తన చెంతకు పంపి, ఇక్కడ మీరు వేరొకరిని చూసుకొనవలసిందిగా తమకు చెప్పమన్నారు" అని చెప్పేశాడు .

సభ నిండా హాహాకారాలు చెలరేగాయి.  "యా ఖుదా!  పాదుషా గారి అబ్బాజాన్‌కు ఎంత కష్టం వచ్చింది!" అని అందరూ ముక్తకంఠంతో విచారం వ్యక్తం చేశారు.

పాదుషా తన అబ్బాజాన్ మాటను తప్పక గౌరవించాలని అందరూ ఒత్తిడి చేశారు.

అక్బర్ బీర్బల్ వైపు చూశాడు. 



బీర్బల్ ఠక్కున లేచి నిలబడ్డాడు.  "జహాపనా!  ఈ సభలో మరెవ్వరికీ కలుగని అపురూపమైన అదృష్టం నాకు కలగడం నాకు ఎంతో ఖుషీకీ బాత్.  నేను తప్పకుండా జన్నత్‌కు పోయి మీ అబ్బాజాన్‌కు సలహాదారుగా ఉంటాను.  అయితే నా కుటుంబానికి వీడ్కోలు చెప్పేందుకు గాను నాకు ఒక వారం రోజుల వ్యవధిని ఇవ్వవలసింది" అని కోరాడు.

అక్బర్ అందుకు అంగీకరించాడు.  బీర్బల్ కుటుంబం యావజ్జీవితం సుఖంగా ఉండేందుకు తగినన్ని ధన కనక వస్తు వాహనాలను ముందుగానే ఇచ్చేశాడు.

ఈ వారం రోజులలో బీర్బల్ తన ఇంటి నుంచి పాదుషా తోటలోనికి రహస్యంగా ఒక భూసొరంగం తవ్వించాడు.  

వారం రోజుల తర్వాత తిరిగి వచ్చి, తోటలో ఒక స్థలాన్ని చూపి, "జహాపనా, మీ అబ్బాజాన్‌గారు నాకు కలలో కనబడి, ఇక్కడ నన్ను సజీవంగా పూడ్చిపెట్టమన్నారు.  అలా చేస్తే నేను నేరుగా జన్నత్‌కు చేరుకుంటానట" అని చెప్పాడు.

అక్బర్ అలాగే ఆ ప్రాంతంలో గొయ్యి తవ్వించి అందులో బీర్బల్‌ను దింపించాడు.  దాని పైన పలకలు వేసి అందమైన సమాధిని కట్టించేశాడు.

బీర్బల్ సొరంగం గుండా హాయిగా తన ఇంటికి చేరుకున్నాడు.  ఆరు నెలలు మరీ హాయిగా కడుపులో చల్ల కదలకుండా సెల్ఫ్ ఐసోలేషన్‌లో కాలం గడిపాడు.

తరువాత ఒక శుభముహూర్తాన అక్బర్ తన దర్బారులో ఉండగా విచ్చేశాడు.  ఇంత బారున జులపాలు, గడ్డం పెరిగి ఉన్న బీర్బల్‌ను ఎవరూ వెంటనే గుర్తుపట్టలేకపోయారు.

బీర్బల్ తనను తాను పరిచయం చేసుకునేసరికి గుర్తించిన అక్బర్ ఎంతో ఆనందపడ్డాడు.  

మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోయారు.   కుట్రదారులు భయపడ్డారు. 

బీర్బల్ సభలోని వారందరికీ జన్నత్ లోని అనేక విషయాలను కథలుకథలుగా చెప్పాడు.  బీర్బల్ జన్నత్‌కు వెళ్లి తిరిగి వచ్చాడు అనే విషయం అందరికీ ఖచ్చితంగా తెలిసిపోయింది.  

"బీర్బల్! ముందుగా ఈ విషయం చెప్పు - మా అబ్బాజాన్ గారు కులాసాగా ఉన్నారా?" అని పాదుషా అడిగాడు. 

"అంతా బాగానే ఉంది కానీ జహాపనా" అని బీర్బల్ నసుగుతూ రజాక్ వైపు ఒక చూపు చూశాడు.

ఆ చూపులో ఏం కనిపించిందో ఏమో గాని, రజాక్ నిలువెల్లా గజ గజ వణికి పోయాడు.




"చెప్పు బీర్బల్! అక్కడ మా అబ్బాజాన్ గారికి ఏదైనా ఇబ్బందిగా ఉన్నదా?"

"అవును జహాపనా!" అన్నాడు బీర్బల్, మునివేళ్ళతో తన గడ్డం నిమురుకుంటూ.  

"అదేమి జన్నతో గాని జహాపనా, అక్కడ  ఒక్క హల్లాకు (మంగలి) కూడా లేడు.  నేను కేవలం ఆరు నెలలు మాత్రమే జన్నతులో ఉన్నానా?  అయినా నా గడ్డం చూడండి, ఎంతగా పెరిగిపోయిందో!   అటువంటిది, ఇప్పటికే సంవత్సరాల తరబడి అబ్బాజాన్ గారు జన్నత్‌లో ఉంటూ ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకొని, మీ వ్యక్తిగత హల్లాకు అయిన రజాక్‌ను వెంటనే తన చెంతకు పంపమని మీకు చెప్పవలసిందిగా నాకు హుకం జారీ చేశారు" అని తాపీగా చెప్పాడు.

☠💀☠💀☠💀

ఆ తరువాత ఏమి జరిగిందో చదువరులే తమ తమ ఊహానుగుణంగా తెలుసుకొనగలరు.

🍎నీతి🍎
ఎంత కాలము సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నచో మనకు అంతగా బుద్ధిసూక్ష్మత పెరుగును.  కావున, సెల్ఫ్ ఐసొలేషన్ కాలమును దిగులు చెందక, సంతోషంగా, హాయిగా గడుపుదుము గాక!

Monday 23 March 2020

భాషలో కూడా DNA ఉంటుంది



ఒక ఆఫ్రికన్ జానపద కథ ఉంది.

ఒక అడవిలో బోయ అనే పిల్లవాడు ఉండేవాడు.  ఒక చిన్న గుడిసెలో అతడు తన తండ్రితోను తల్లితోను పిన్నితోను కలిసి ఉండేవాడు.  

ఆ పిన్ని  నిశ్శబ్దంగా ఉండే రకం కాదు.  ఆ పిల్లవాణ్ణి నిత్యం ఏదో ఒక వంక పెట్టి తిడుతూనే ఉండేది.  

ఒక రోజు బోయ పండ్లను ఏరుకురావడానికి అడవికి వెళ్ళాడు.   ఒక నది ఒడ్డున పండ్లను సేకరిస్తూ ఉండగా అతడికి ఒక వింత జంతువు కనిపించింది.  

బోయ అటువంటి జంతువును ఎన్నడూ చూసి ఎరుగడు.  దాంతో అది ఎటువంటి జంతువో అర్థం చేసుకోలేక భయపడి పండ్లను వదిలి పరుగు పెట్టాడు.  ఆ వింత జంతువు అతడి వెంట పడింది.  అది తన కంటే చాలా వేగంగా పరుగెట్టి తనను సమీపిస్తూ ఉండడంతో బోయ మరింత మరింత భయపడిపోయాడు.  తాను పరుగెత్తి తప్పించుకోలేనని అతడికి అర్థమైంది.  

దాంతో తానే ఆ జంతువును భయ పెడదామని అతడు తన దగ్గర ఉన్న ఒక చిన్నపాటి డప్పును వాయించడం మొదలుపెట్టాడు.  అప్పుడు విచిత్రంగా ఆ జంతువు కూడా పరుగును ఆపేసి నాట్యం చేయడం ప్రారంభించింది.  

బోయ డప్పును వాయిస్తూనే ఉన్నాడు.  ఆ జంతువు నాట్యం చేస్తూనే ఉంది.  డప్పును ఒక్కక్షణం అతడు ఆపి వేసేసరికి మీదకు వస్తోంది.  అందుకని అతను ఆపకుండా డప్పును వాయిస్తూనే ఉండిపోయాడు.  ఆ జంతువు కూడా అలా నాట్యం చేస్తూనే ఉంది.  

అలా సాయంత్రమై చీకటి పడేంతవరకు డప్పు మోగుతునే ఉంది. ఆ  జంతువు నాట్యం చేస్తూనే ఉంది.  పాపం నాట్యం చేసి చేసి అది బాగా అలసిపోయినట్లు కనిపించింది.  దాని కాళ్లు చేతులు నొప్పెడుతున్నట్లు తోచింది.  చాల ఆయాసపడుతోంది.  

బోయకు దాని మీద చాల జాలి కలిగింది.  ఒక్క క్షణం డప్పును మోగించడం ఆపేశాడు.  దాంతో అది బతుకుజీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది.

బోయ ఉత్త చేతులతో ఇంటికి వచ్చాడు.   పిన్ని కోపానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.  నోటికొచ్చినట్లు బోయను తిట్టి పోసింది.  బోయ ఆరోజు పండ్లు లేకుండా వచ్చినందుకు కారణం చెప్పాడు.  

"సరే గొడవ ఎందుకు?  మన పిల్లవాడు బోయ క్షేమంగా వచ్చాడు, అదే చాలు" అన్నాడు తండ్రి.

కానీ పిన్ని నమ్మలేదు.  "బోయ అబద్ధం చెపుతున్నాడు" అంటూ అరిచింది.  "రేపు వీడితోనే కలిసి అడవికి పోదాం.  ఈరోజు వచ్చిన జంతువు రేపు రాదా?  ఈ పిల్లవాడి మాటలు నిజమో అబద్ధమో అప్పుడు తేల్చుకుందాం" అన్నది.

ఆ మరుసటి రోజు అందరూ కలిసి అడవికి వెళ్ళారు.  ఆ జంతువు ఎక్కడా కనబడలేదు.  

"చూశారా? వీడు అబద్ధం చెప్పాడని నాకు ముందే తెలుసును" అంటూ పిన్ని అరిచింది.  

బోయ మౌనంగా నది ఒడ్డున పండ్లను ఏరడం ప్రారంభించాడు.  అంతే!  ఉన్నట్టుండి మరల ఎక్కడనుంచో ఆ వింత జంతువు వచ్చేసింది.  

బోయ గమనించే లోపలే అతడి పిన్నిని తల్లిని తండ్రిని కూడా మింగేసింది.  తరువాత బోయను కూడా మింగేద్దామని ప్రయత్నించింది.

కానీ బోయ ఒడుపుగా తప్పుకున్నాడు.  తన డప్పును తీసి వాయించడం మొదలు పెట్టాడు.  ఆ జంతువు మరల నాట్యం చేయడం ప్రారంభించింది.

బోయ డప్పు కొడుతూనే ఉన్నాడు.  ఆ జంతువు అలా నాట్యం చేస్తూనే ఉంది.  అలా చాలాకాలం జరిగాక జంతువు ఒకవైపు నాట్యం చేస్తూనే డప్పును మోగించడం ఆపమని బోయను ప్రాధేయపడింది.  

"మా అమ్మా నాన్నలను విడిచిపెట్టే దాకా నేను వాయిస్తోనే ఉంటాను" అని బోయ సమాధానం చెప్పాడు.  

చేసేదేమీ లేక ఆ జంతువు అతడి అమ్మానాన్నలను బయటకు కక్కేసింది.  



ఒప్పందం ప్రకారం బోయ డప్పును మోగించడం మానేశాడు.  ఆ జంతువు పారిపోవడం మొదలుపెట్టింది.  

అప్పుడు బోయ తల్లి "డప్పు మోతను ఆపవద్దు" అని చెప్పింది.  "మీ పిన్ని కూడా బయటకు రానీ" అని కోరింది.  

బోయకు అలా జరగడం ఇష్టం లేదు.  అయినప్పటికీ తల్లి కోరికను మన్నించి డప్పును మరలా మోగించడం మొదలుపెట్టాడు.  

ఆ జంతువు నీరసంగా నాట్యం చేయడం మొదలు పెట్టింది.  "మీ అమ్మానాన్నలను తిరిగి ఇచ్చేశానుగా? మరలా ఎందుకు వాయిస్తున్నావు?" అని అడిగింది.

"మా పిన్నిని కూడా నువ్వు పొట్టన పెట్టుకున్నావు కదా? ఆమెను కూడా విడిచిపెట్టు" అని సమాధానం చెప్పాడు బోయ.

చేసేదేమీ లేక ఆ జంతువు ఆమె పిన్నిని కూడా బయటకు కక్కేసింది.

బోయ మోగించడం ఆపేశాడు.  అప్పుడా జంతువు బ్రతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది.  

తరువాత అందరూ కావలసినన్ని పండ్లను ఏరుకొని ఇంటికి తిరిగి వచ్చేశారు.  

ఆ తరువాత ఇన్ని ఇంకెప్పుడు బోయను తిట్టలేదు. అతడిని జీవితాంతం తల్లిదండ్రుల కంటే ఎంతో ప్రేమతో దయతో చూసుకుంది.  
🍎🍎🍎🍎🍎🍎

ఇదీ కథ.

సరే, ఇందులో బోయ అనే పదాన్ని Boje అని వ్రాస్తారు.  దాన్ని మనం బోజే అని పలుకరాదు.  బోయ అని పలకాలిట. (నిజానికి భోజ అనే ప్రకృతిపదానికి బోయ అనేది వికృతిరూపం అని కొన్ని వాదనలు తెలుగుదేశంలో కూడా ఉన్నాయి.  చాల ఆశ్చర్యం కదూ?)   దక్షిణాఫ్రికా క్రికెట్ టీములో ఒకప్పుడు నికీ బోయె అనే ఒక ఆటగాడు ఉండేవాడు.   బోయ అది జర్మన్ పదమట.  దానికి అర్థం ఒక తాడుకు (మోకుకు) కట్టబడి నీళ్లలో తేలుతున్న కర్ర (కొయ్య మొద్దు) అని అర్థమట.  ఈ పదానికి లాటిన్ మూలాలు కూడా ఉన్నాయంటారు.

ఆఫ్రికాలో స్థిరపడిన యూరోప్ తెల్లజాతివారికి బోయర్లని పేరు.  (Boers)  బోయర్ అంటే యోధుడట.  వారు స్థానికులైన ఆటవిక-ఆఫ్రికన్లనుండి ఆ పేరును సంగ్రహించి ఉండవచ్చు. ఇంగ్లండ్ పెత్తనాన్ని సహించలేక వారు చేసిన యుద్ధాలకు ఆంగ్లో-బోయర్ యుద్ధాలంటారు.  

ఇంగ్లీషులో buoy అని వ్రాస్తారు.  పడవలు/నౌకలు కొట్టుకుపోకుండా ఆపే బోయకట్టె అని‌ ఆ పదానికి అర్థం.  విశాఖపట్నంలో పోర్టు దగ్గర వేంకటేశ్వరుని గుడినుండి స్టీమరులో సాగరదుర్గ గుడికి పోయేటపుడు హార్బరు కాలువలో ఈ విధమైన buoy లు కనిపిస్తాయి.



ఆ పదం నుండే buoyant అనే విశేషణం పుట్టుకొచ్చింది.  తేలికపరిచేది/తేలికైనది, ఉత్సాహపరిచేది/ఉత్సాహపూరితమైనది అనే అర్థంలో ఆ పదాన్ని వాడుతారు.  లైఫ్‌బాయ్ సబ్బు ప్రకటన గుర్తుందా?

సరే, మన తెలుగుదేశంలో కూడా బోయ అనే పదం వ్యవహారంలో ఉంది.  జంతువులను వేటాడి జీవించే ఆటవికుడు అనే అర్థంలో వాడుతాం.  దేశ జనాభా పెరిగి నాగరకత (నగరజీవనం) ప్రబలుతున్న కొద్దీ అడవులు నశించిపోతున్నకొద్దీ బోయలు కూడా క్రమంగా నాగరకులైనారు.  ఈనాటికి కూడా వారు భారతదేశమంతటా సమాజంలో అవిభాజ్యంగా ఉన్నారు.  

మాండలిక పదకోశం బోయ అనే పదానికి బెస్తవారు, మత్స్యకారులు అనే అర్థాన్ని కూడా చెబుతోంది.  పడవలు లేకుండా బెస్తవారిని ఎలా ఊహించగలం?  కాబట్టి, బోయలు ఒకప్పుడు చక్కని నౌకలను తయారు చేయగలిగిన పరిజ్ఞానాన్ని (technology) కలిగి ఉండేవారని అర్థం చేసుకోవచ్చు.

రామాయణంలో కూడా అందుకు సాక్ష్యముంది.  ఆటవికుడైన బోయడు ఒకాయన రామునికి ప్రాణమివ్వగల మిత్రుడు.  గుర్తొచ్చిందా?  అతడి పేరు గుహుడు.  నిషాదరాజు (బోయల రాజు)  అతడికి ఐదువందల యుద్ధ నౌకలు ఉండేవట.  (చిన్న పడవలు కావు.)  ఒకొక్క నౌకలో నూరేసి కైవర్తయోధులు (బోయజాతికి చెందిన సైనికులు) ఉండేవారట.  వారు గొప్ప ధనుర్ధారులు కూడా.  వారు అడవులలో పనిబడినవారికి దగ్గరుండి దారి చూపేవారు.  రాముని మాత్రమే కాక, భరతుని సైన్యాన్ని సైతం గంగానదిని దాటించి చిత్రకూటంలో ఉన్న రాముని చెంతకు భరతుని తీసుకుపోయింది వారే.



అంతవరకు ఎందుకు?  స్వయంగా వందే వాల్మీకికోకిలమ్ అని మనం పూజించే మహర్షి పూర్వాశ్రమంలో బోయవాడని, ఋష్యనుగ్రహంతో తారకమంత్రం గ్రహించి తత్ప్రభావం వలన పరమభాగవతుడైనాడని ఐతిహ్యముంది కదా?




మనం పరమపూజ్యంగా భావించే భగవద్గీతను మహాభారతమనే ఇతిహాసపేటికలో భద్రపరచి మనకందించిన వ్యాసమహర్షి ఒక బోయకన్య (మత్స్యకన్య) అయిన సత్యవతి కుమారుడే కదా?  సత్యవతి తండ్రికి దాశరాజు అని వ్యవహారం.  ఆయన కూడా తన జాతికి ఒక రాజే.  నీ కూతురైన సత్యవతిని నాకు రాణిగా ఇవ్వమని శంతనుమహారాజు ఆయనను ప్రాధేయపడ్డాడు.  భీష్మప్రతిజ్ఞ జరిగిన తరువాతగాని, ఆమెను శంతనుడు తన రాణిగా చేసుకొనలేకపోయాడు.  ఆమె ఉపరిచరుడనే వసువు కుమార్తె అట.




అనుమానం రాకూడదు గాని, గంగపుత్రుడైన దేవవ్రతుడు (భీష్ముడు) పూర్వం ఒక బోస్ (వసు/వసువు) కదా?  (చూడండి - వసు>బసు>బోసు>బోష>బోజ>బోయ అంటూ దేశాంతరాల ఉచ్చారణలో మార్పు కలిగే అవకాశం ఉండవచ్చేమో.)  గంగపుత్రుడు అంటే మరలా మత్స్యకారుడే, బెస్తవాడే.

రామాయణకాలానికే బోయనాయకులు చిన్నపాటి రాజ్యాలు ఏలేవారని, తమ సైన్యంతో మహారాజులకు అవసరమైనపుడు తోడ్పడేవారని తెలుస్తోంది.   తెలుగుదేశాలలో వారి నివాసాలను కొట్టం అనేవారు.  తూర్పు చాళుక్యుల శాసనాలలో బోయ అనే ఇంటిపేరు కలిగిన బ్రాహ్మణుల ప్రసక్తి ఉన్నదంటారు.  

గ్రామనాయకుడు అనే అర్థం కలిగిన భోజ అనే పదం బోయగా మారిందని కొందరి వాదన.  కుంతిదేవిని పెంచుకున్నది భోజుడే.  కాళిదాసును పోషించిన భోజరాజు కథలు ప్రసిద్ధాలు.  మహాభారతకాలం నాటికి విదర్భరాజులకు భోజులు అని వ్యవహారం.  రుక్మిణి భోజకన్య.  ఆమె శ్రీకృష్ణుని పట్టపురాణి.  ఆమెను కృష్ణుడు ఎత్తుకొచ్చి మరీ పెండ్లి చేసుకున్నాడు.  వివాహవయస్సు వచ్చినప్పటికీ చాలకాలం పెళ్లికాని కన్యకలకు ఆ రుక్మిణీకల్యాణఘట్టాన్ని వింటే వెంటనే వివాహయోగం కలుగుతుందని తత్పఠన/శ్రవణఫలానుకీర్తనం కూడా చేస్తారు.



కాళహస్తిలో తన దైవమైన శివుని కంటె ఎత్తైన కొండపై వెలసిన కణ్ణప్ప కూడా బోయడే కదా?

ఆహా!
ఈ బోయ అనే పదం "ఆటవిక" అనే అర్థంలో భారత-ఆఫ్రికాదేశాలలోను, "మత్స్యకార/నావిక" అనే అర్థంలో భారత-యూరోపు దేశాలలోను ఉండడం గమనిస్తే DNA అనేది మనుషుల శరీరాలలోనే కాక భాషలలో కూడా ఉంటుందని తెలుస్తోంది కదా?


Sunday 22 March 2020

దానరాజు - ధర్మరాజు

ఈ కథను మీరు కూడా చిన్నపుడు వినే ఉంటారు. మహాభారతంలో ఎక్కడా లేని కథ. అయినా, జానపదులు సృష్టించిన కథ కాబట్టి, మాంచి రసవత్తరంగా ఉంటుంది.

ఒకసారి అర్జునునికి ఒక సందేహం వచ్చిందట.

"కృష్ణా కృష్ణా, మా అన్నను ధర్మరాజు అంటారు. కర్ణుని దానరాజు అంటారు ఈ ఇద్దరిలో ఏ రాజు గొప్ప?" అని అడిగాడు.

"కొన్ని రోజులు ఓపిక పట్టు అర్జునా. అవకాశం రాగానే నీకే ఆ విషయం ప్రత్యక్షంగా తెలిసేలా చేస్తాను" అని కృష్ణుడు చెప్పాడు.

ఎండా కాలం గడిచిపోయింది. వానాకాలం వచ్చింది. ధర్మరాజు రాజుగా ఉన్నాడు కాబట్టి, లోకమంతా మంచి వర్షాలు కురుస్తున్నాయి.

"అర్జునా, పద. వారిద్దరిలో ఎవరు గొప్ప రాజో ఇప్పుడే తెలుసుకుందాం" అని కృష్ణుడు అన్నాడు.

వారిద్దరూ తమను ఎవరూ గుర్తుపట్టకుండా బ్రాహ్మణుల వేషాలు వేసుకొని బయలుదేరారు. మొదటగా వారు ధర్మరాజు దగ్గరకు వెళ్లారు.

"రాజా రాజా, మేము ఒక గొప్ప యజ్ఞం చేయదలచుకున్నాము. అందుకుగాను వేయి మణుగులు గంధపుచెక్క కావాలి. దయచేసి ఇప్పించండి" అని కోరారు.

ధర్మరాజు ఆశ్చర్యపోయి, "వర్షాకాలంలో యజ్ఞాలు చేయడం ఏమిటి? పైగా వేయి మణుగుల గంధపు చెక్కను ఉపయోగించి చేయడమేమిటి? ఇటువంటి యజ్ఞాలను గూర్చి నేను ఎన్నడూ వినలేదే?" అన్నాడు.

"రాజా! అది ఒక రకమైన ప్రత్యేకయజ్ఞం" అని మాత్రమే వారు చెప్పారు.

ధర్మరాజు సరేనని, వేయి మణుగుల గంధపుచెక్క ఎక్కడ దొరికినా తీసుకురమ్మని తన భటులను పంపాడు.

వారు రాజ్యమంతా తిరిగివచ్చి, "మహారాజా! వేయి మణుగులేమిటి? పదివేల మణుగులైనా గంధపుచెక్కకు కొరత లేదు. కానీ ఇపుడు వర్షాకాలం కావడం వల్ల, అంతా తడిచిపోయి లభిస్తుంది. యజ్ఞానికి అవసరమైన పొడి గంధపు చెక్క మాత్రం ఎక్కడా ఒక్క మణుగు కూడా ప్రస్తుతం దొరకటం లేదు" అని విన్నవించారు.

అప్పుడు ధర్మరాజు ఆ బ్రాహ్మణులకు నమస్కారం చేసి, "మహాత్ములారా! మన్నించండి. మీరు వర్షాకాలంలో చేయరాని యజ్ఞాన్ని చేయదలపెట్టారు. అందువలన మీకు ఆ ప్రకృతి సహకరించేలా లేదు. దయచేసి వర్షాకాలం పూర్తి అయిన తరువాత మీరు యజ్ఞం చేయదలచుకుంటే, అపుడు మీ ఇంటికి నేను మీరడిగిన వేయి మణుగుల గంధపుచెక్క తో పాటు మిగిలిన యజ్ఞసంభారాలన్నీ పంపిస్తాను" అని అని వినయంగా పలికాడు.

అపుడు ఆ కపటబ్రాహ్మణవేషధారులు సరేనని చెప్పి అక్కడ నుండి నేరుగా కర్ణుని దగ్గరకు వెళ్లారు.

"రాజా రాజా, మేము ఒక గొప్ప యజ్ఞం చేయదలచుకున్నాము. అందుకుగాను వేయి మణుగులు గంధపుచెక్క కావాలి. దయచేసి ఇప్పించండి" అని కోరారు.

కర్ణుడు సరేనని, వేయి మణుగుల గంధపుచెక్క ఎక్కడ దొరికినా తీసుకురమ్మని తన భటులను పంపాడు.

వారు రాజ్యమంతా తిరిగివచ్చి, "రాజా! వేయి మణుగులేమిటి? పదివేల మణుగులైనా గంధపుచెక్కకు కొరత లేదు. కానీ ఇపుడు వర్షాకాలం కావడం వల్ల, అంతా తడిచిపోయి లభిస్తుంది. యజ్ఞానికి అవసరమైన పొడి గంధపు చెక్క మాత్రం ఎక్కడా ఒక్క మణుగు కూడా ప్రస్తుతం దొరకటం లేదు" అని విన్నవించారు.

కపటబ్రాహ్మణులు నిరాశగా ముఖం పెట్టారు. అది చూసి కర్ణుడు "అయ్యా! ఒక్క క్షణం ఆగండి. మీరు అడిగినది మీకు తప్పక ఇస్తాను" అని పలికాడు.

తరువాత తన భటులను పిలిచి, "భటులారా, భటులారా, నా ఇల్లు శ్రేష్ఠమైన గంధపు చెక్కతో నిర్మించబడింది. వెంటనే దీనిని పడగొట్టి ఈ బ్రాహ్మణులకు అవసరమైనంత గంధపు చెక్కను ఇచ్చి పంపండి" అని ఆజ్ఞాపించాడు.

అది విని అర్జునుడు ఆశ్చర్యపోయాడు.
"ఆహా! ఈ కర్ణుడు ఎంతటి దానతత్పరుడు!" అని భావించి అతడి పట్టుదలను మెచ్చుకున్నాడు.

ఇంతవరకు ఇది జానపదులు అల్లిన ఒక అందమైన కథ.

)))(((

ఇపుడు మనము ఈ కథను మరికొంత పొడిగిద్దాం.

"ఆహా! కృష్ణా! ఈ కర్ణుడు ఎంతటి దానతత్పరుడు!" అని అర్జునుడు పలికాడు.

"అయితే మీ అన్న అయిన ధర్మరాజు గొప్పవాడా లేక దానరాజు అయిన ఈ కర్ణుడు గొప్పవాడా? నీ సందేహం తొలగిపోయిందా?" అని కృష్ణుడు ప్రశ్నించాడు.

"నిస్సందేహంగా కర్ణుడే గొప్పవాడు కదా?" అని అర్జునుడు తన అభిప్రాయాన్ని తెలిపాడు.

"ఎందువల్ల?"

"బ్రాహ్మణుల కోరికను తీర్చడం కోసం కర్ణుడు తన సొంత ఇంటినే త్యాగం చేశాడు కదా?"

"అయ్యో అర్జునా! కర్ణుడు ఎంతటి విలాసపురుషుడు కాకుంటే తన ఇంటిని గంధపు చెక్కతో కట్టుకున్నాడు? సరే, అది అతడి ధనం, అతడి ఇష్టం. కానీ అతడి ఇంటిలో ఉండేది అతడొక్కడే కాదు. అతడి తల్లిదండ్రులు ఉంటారు. అతడి భార్యాబిడ్డలు ఉంటారు. అతడి పరివారజనం కూడా ఉంటారు. వీరందరికీ సరిపడిన ఆహారపదార్థాలు ఉంటాయి. వీరందరూ ఉపయోగించుకునే వస్త్రాలు పడకలు మొదలైనవి ఉంటాయి. వాటన్నింటినీ విస్మరించి, మంచి వర్షాకాలంలో ఇల్లు పడగొడితే వారందరి గతి ఏమిటి? ఇంటిలో ఉండే ఆ వస్తువులకు పదార్థాలకు రక్షణ ఏముంటుంది? బ్రాహ్మణుల కోరికను తీర్చడం కోసం, తాను దానరాజును అనిపించుకొనడం కోసం అంతమందిని ఇబ్బంది పెట్టడం ధర్మమేనా?" అని కృష్ణుడు అర్జునుని అడిగాడు.

అర్జునుడు ఆలోచనలో పడ్డాడు.

"అర్జునా! దేనిని గూర్చి ఆలోచిస్తున్నావు?"

"నీవు చెప్పిన విషయాన్ని గూర్చే బావా!"

"దానిని గూర్చి తరువాత ఆలోచిద్దువు గాని, ముందు దీనిని గూర్చి ఆలోచన చేయవయ్యా!"

"దేనిని గూర్చి బావా?"

"ఇల్లు పడగొట్టమని కర్ణుడు ఆజ్ఞాపించాడు కదా? ఇదిగో, భటులందరూ వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ, పలుగులు, పారలు, గునపాలు, తట్టలు తెచ్చుకున్నారు. కాసేపట్లో ఇంటిని పడగొట్టేస్తారు. అలా పడగొడుతూ ఉండగానే, ఇంటిని కట్టిన గంధపుచెక్క కూడా వర్షంలో తడిచి పోతుంది. అపుడు ఇలా తడిచిన గంధపు చెక్కను మనం మన యజ్ఞంలో ఎలా ఉపయోగించుకుంటాం?"

"అవును బావా! నిజమే!"

"కాబట్టి, ఏదో ఒక విధంగా దానం చేయాలి, దానరాజును అనిపించుకోవాలి అనే ఉద్దేశం అన్ని సందర్భాలలోనూ మంచిది కాదు. కాలధర్మాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి."

"నిజమే బావా! తెలిసింది."

"ఏమి తెలిసింది?"

"దానరాజుగా ఉండటం కంటే, ధర్మరాజుగా ఉండటం గొప్ప."

"శభాష్ అర్జునా!"

)))(((

ఈ విధంగా పొడిగించిన కథను, హఠాత్తుగా ముగిస్తే బాగుండదు. కాబట్టి,

కృష్ణార్జునులు తమ కపటబ్రాహ్మణవేషాలు విడిచి, తామెవరమో, ఎందుకు వచ్చామో కర్ణుడికి తెలియజేసి, తన ఇంటికి వచ్చి "ఇది కావాలి" అని ఎవరైనా నోరు తెరిచి కోరితే, "వారికి ఆ వస్తువును ఏ విధంగా అయినా ఇచ్చి తీరాలి" అనే అతడి పట్టుదలను మెచ్చుకొని, అతడు తన ఇల్లును పడగొట్టుకొనడం ఆపించి, వారిద్దరూ అతని ఇంట ఒక వారం రోజులపాటు హాయిగా ఆతిథ్యాన్ని స్వీకరించి బయలుదేరారు అని చెప్పడం బాగుంటుంది.

)))(((

అప్పట్లో అది గంధపు చెక్క.
ఇప్పట్లో ఇది ఇసుక.
ధర్మరాజు గొప్పవాడా?
దానరాజు గొప్పవాడా?
⚖️
మరో కథ అవసరమా?
పాత కథ చాలు కదా?

మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
26 అక్టోబర్, 2019
❇️✳️❇️✳️❇️✳️

Friday 20 March 2020

సెక్షన్ 497


28, సెప్టెంబరు, 2018 నాటి లేఖ -

పాపం ఆనాటి మనువుకు జాగ్రత్త మరీ ఎక్కువ. స్త్రీలను సంరక్షించే బాధ్యతను ఏకంగా ముగ్గురికి అప్పగించాడు.


1 పితా రక్షతికౌమారే
2 భర్తా రక్షతి యౌవనే
3 పుత్రో రక్షతి వార్ధక్యే

చిన్నతనంలో తండ్రి, యౌవనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు రక్షించాలి, వారు తమ తమ బాధ్యతలను తప్పించుకొనేందుకు వీలు లేదు అని గట్టిగా చెప్పాడు.

అయితే కొందరు అభ్యుదయవాదులకు ఆ మనువాదం నచ్చలేదు. ఎందుకంటే పై మూడు లైన్లు చెప్పిన తరువాత చివర మనువు ఒక మాట అన్నాడుట.

"న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి"

దాంతో వీరు వీరంగం వేశారు. వాడెవాడు అసలు ఆ మాట చెప్పడానికి? "ఆడది ఎప్పుడు బానిస కాదు, ఆమెకు ఇల్లొక ఖైదు కాదు" అంటూ నినాదాలు చేశారు.

పాపం మనువు ఉద్దేశమే వేరు,
"రక్షణవిషయంలో నువ్వే స్వతంత్రంగా ఉండమని స్త్రీని వదిలిపెట్టకండి, ఈ ముగ్గురూ (తండ్రి+భర్త+కొడుకు) ఆమెను కంటికి రెప్పలా కాచుకోవాలి" అని మనువు వారిని స్పష్టంగా ఆదేశించాడు.

కాని, విదేశీ చదువులు మరీ ఎక్కువ చదివేసుకుని, స్వదేశీ చదువులు బొత్తిగా అబ్బని ఘోర అభ్యుదయవాదులు ఆ మాటలను విడివిడిగా పొడిపొడిగా ముక్కముక్కలుగా వాయిదా పద్ధతుల్లో చదివి - {(రాముని+తోక+పివరుడు) అన్నట్టు} తమకు తోచిన బీభత్సమైన అర్థాన్ని అడ్డదిడ్డంగా వ్యాఖ్యానించి తమ అజ్ఞానంతో అల్లకల్లోలం సృష్టించివేశారు.

భారతదేశంలో మొదటనుండి స్త్రీకి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఉండేవి అనేందుకు బోలెడన్ని ఆధారాలు ఉన్నాయి. వారు కూడా చదువుకున్నారు. వారు కూడా సభల్లో పాల్గొన్నారు. వారు కూడా శాసనాలు చేశారు. అయితే విదేశీదండయాత్రికులు భారతదేశంపై విచ్చలవిడిగా పడిన కాలంలో, దేశసంపదనే కాక స్త్రీలను కూడా అపహరించుకుపోతున్న భయానకపరిస్థితుల్లో స్త్రీల రక్షణకోసం ప్రతివారి ఇండ్లలోనూ కొన్ని కఠినమైన నిబంధనలు ఏర్పడి ఉండవచ్చు. దాన్నే కూర్మరక్షణన్యాయం అంటారు. అయితే, తాత్కాలికమనుకున్న ఆ నిబంధనలు శతాబ్దాలతరబడి విదేశీయుల పాలన కొనసాగడంతో శాశ్వత-ఆచారాలు అని భ్రమపడేంతగాా మారిపోయి ఉండవచ్చు.

కాని, విదేశీపాలన అంతం అయిన తరువాత, మరలా స్త్రీలు కరడుగట్టిన ఆచారాలనుండి క్రమక్రమంగా బయటకు రావడం, దానిని భారతీయసమాజం ఆమోదించడం సహజంగానే జరిగింది. ఇపుడు స్త్రీలు లేని రంగమంటూ లేనే లేదు.

శత్రువునుండి రక్షణకోసం తాబేలు తన తలను, కాళ్లను లోనికి లాగుకుని, దాక్కుని, శత్రువు దూరమైన తరువాత మళ్లీ ఆ తలను, కాళ్లను బయటకు తెచ్చుకుని మళ్లీ తన గమనం సాగిస్తుంది. భారతీయస్త్రీసమాజం విషయంలో కూడా అదే జరుగుతోంది.

అయితే శత్రువులు వెళ్లిపోయారు గానీ, శత్రువుల ఆదర్శాలు మాత్రం ఇంకా విశృంఖలంగానే కొనసాగుతున్నాయి. స్త్రీలకు రక్షణ మాత్రం ఇప్పటికీ సమస్యగానే మిగిలింది.

ఇప్పుడనే కాదు,
స్త్రీసంరక్షణ పూర్వకాలంలో కూడా ఒక సమస్యగానే ఉండేది.

ఒకసారి "నన్ను పెళ్లి చేసుకోండని" విశ్వామిత్రుని మేనత్తలను వాయుదేవుడు అడిగాడట. కాని, - "అబ్బో, ఎంత గొప్ప దేవుడు మమ్మల్ని ఇష్టపడ్డాడు" అని వారు ఎగిరి గంతులేసి పెళ్లిచేసుకోలేదు. "మా తండ్రి గారు మమ్మల్ని ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తే వారినే చేసుకుంటాము" అని స్పష్టం చేశారు.

यस्य नो दास्यति पिता स नो भर्ता भविष्यति।
(రామాయణం.1.32.22)

వాయుదేవుడికి కోపం వచ్చి వాళ్లను కురూపులుగా మార్చాడట. మరీ ఈరోజుల్లో ఆసిడ్ దాడులు చేసినట్టన్న మాట. తరువాత వారి తండ్రి కుశనాభుడు వారిని బ్రహ్మదత్తుడు అనే యోగ్యుడికి ఇచ్చి పెళ్లి చేశాక వారికి సహజస్వరూపం కలిగిందట.

అలాగే మరోసారి పాండవులు ఆహారం తెచ్చేందుకు పోగా అరణ్యంలోని ఆశ్రమంలో ద్రౌపది ఒంటరిగా ఉండటం చూసి కౌరవుల చెల్లెలి భర్త అయిన సైంధవుడు ఆమెను ఎత్తుకుపోయాడు. పాండవులు వాణ్ణి పట్టి, గుండు కొట్టి వదిలి పెట్టారు. ఇంకోసారి కీచకుడు వెంటపడితే భీముడు వాడిని ఉపాయంగా నర్తనశాలకు రప్పించి చంపి పడేశాడు.

ఇలా తండ్రిగా కుశనాభుడు తన కుమార్తెలను, భర్తలుగా పాండవులు తమ ధర్మపత్నిని కాపాడుకున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను కాపాడుకున్న శ్రమణకుమారుడి కథ తెలియని వారు ఎవరూ ఉండరు. ఇటువంటి కథలు చెప్పాలంటే ఇంకా ఉన్నాయి.

అంతేకాదు, స్వాభావికంగానో, చాపల్యంతోనో కొందరు స్త్రీలు స్వతంత్రించి చేసిన పనులు వారికి చాల ఇబ్బందిని కలిగించిన కథలు కూడా ఉన్నాయి. శకుంతల, కుంతి మొదలైనవారు ఎదుర్కొన్న నిందలు, పడిన కష్టాలు, తెలిసినవే.

అందుకే మనువు చాదస్తం కొద్దీ "న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి" అని ప్రతిపాదించి, అభ్యుదయవాదులనుండి తిట్లు తిన్నాడు పాపం.

చాదస్తం అని ఎందుకు అంటున్నానంటే, ఆయన స్త్రీలను రక్షించడానికి నామినేట్ చేసినవారిలో ఎంతమంది తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు గనుక?

తనకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసిన తక్షణమే స్వయంగా అబార్షన్ కు రంగం సిద్ధం చేస్తున్న కొందరు తండ్రులు ఉన్నారు.

కట్నం అడిగినంత ఇవ్వలేదని, తన వ్యసనాలకు అడ్డు తగులుతోందని, కట్టుకున్న భార్యను నిలువునా కిరసనాయిలు పోసి తగలేసిన కొందరు భర్తల కథలు వింటూ ఉంటాం.

ఇక పుత్రుల సంగతి చెప్పనే అక్కరలేదు. తల్లి భారమని ఎక్కడో తెలియని ఊర్లో, బస్టాండులోనో లేదా ఏకంగా స్మశానంలోనో వదిలించుకుని వచ్చే కొందరు గొప్ప కొడుకుల ఘనకార్యాలను గూర్చి వింటూనే ఉన్నాం.

మనువు నియమించిన ఈ ముగ్గురూ సంపూర్ణంగా విఫలమైన సందర్భాలలో కోర్టే స్త్రీలకు రక్షణగా నిలిచింది.

అందువల్ల,
కోర్టాయ నమః।
కోర్టుదేవతాయై నమః।
కోర్టుజడ్జయే నమః।।

కాని, ఓ సామెత ఉంది.
"రాను రాను రాజుగుఱ్ఱం గాడిదయ్యింది."

అలా తయారైంది.

ఎప్పుడూ ఆడవాళ్లను కాపాడి కాపాడి బోరుకొట్టిందేమో. ఇప్పుడు మగవాళ్లను కాపాడేందుకు సిద్ధమైంది ఈ కోర్టు.

అంటే, కీచకుడికి శిక్ష పడదన్నమాట. ఎందుకంటే, ఆ కీచకుడు నన్ను ఆ ద్రౌపదే స్వయంగా నర్తనశాలకు రమ్మంది, ద్రౌపది సమ్మతితోనే నేను అక్కడకు వెళ్లాను అని కోర్టుకు చెప్పి తన నేరం లేదని నిరూపించుకుంటాడు. భీముడు పిచ్చి మొహం వేసుకుని నిలబడాలి!

అయోవ్, కోర్టూ,
నేరం వేరు. తప్పు వేరు.

నేరం - అంటే
కోర్టు శిక్ష వేయదగినది.

తప్పు - అంటే
కోర్టు వేసే శిక్షలతో సంబంధం లేకుండా తప్పు.

ఓ కోర్టూ,
ఇది నేరం కాదు అని చెప్పావు సరే,
కాని ఇది తప్పు కాదు అని మాత్రం ఎప్పుడూ చెప్పకు.
అలా చెబితే నీ ఉనికికే ముప్పు వస్తుంది జాగ్రత్త.
 — disagrees with Supreme Court Judgments.



సుగ్రీవుడు తెచ్చిన న్యూస్ పేపర్లు




అనగా అనగా రావణాసురుడు.

బ్రహ్మనుగూర్చి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోవయ్యా అంటే - దేవ, దానవ, గంధర్వ, యక్ష, రక్షః, సుర, అసుర, కిన్నర, కింపురుష, నాగ, పశు, పక్ష్యాదులు - వీరిలో నేను ఎవరిచేతిలోనూ చావకూడదు అని ఒక స్వతంత్రబలప్రతిపత్తిని కోరుకున్నాడు.

సరే, నీ చావు నువ్వే చావు అని బ్రహ్మ అతడు కోరుకున్న స్వతంత్రబలప్రతిపత్తిని వరంగా ఇచ్చేశాడు.

అపుడు అతడి పక్కన అతడి మేనమామ ప్రహస్తుడు చేరి స్వతంత్రబలప్రతిపత్తిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సలహాలు ఇవ్వడం మొదలు పెట్టాడు.

ఆ సలహాను అనుసరించి, రావణాసురుడు లంకనుండి తన సోదరుడైన కుబేరుడిని అతని అనుచరులను తరిమి వేశాడు. లంక నాకు ఎలాగో నీకు కూడా అలాగే, మనం అందరమూ కలసి లంకలో హాయిగా జీవిద్దాం అని కుబేరుడు నచ్చజెప్పినా కూడా వినలేదు. తరిమేశాడు. వెళ్ళని వారిని చంపేశాడు.

ఆ తరువాత రావణాసురుడు తన మేనమామ అదుపు తప్పిపోయాడు.  కాని ఆ మేనమామ ఊహించిన దానికంటె ఎక్కువగా విజృంభించి అందరినీ చావగొట్టటం మొదలుపెట్టాడు. బ్రహ్మ అతడికి స్వతంత్రబలప్రతిపత్తిని ఇచ్చాడు అని అందరూ అతడిని ఏమీ చేయలేక ఊరుకున్నారు.

రావణాసురుడి దురాగతాలు మరీ ఎక్కువ అయ్యాయి. రాజకన్యలను ఎత్తుకొచ్చాడు. ఋషికన్యలను ఎత్తుకొచ్చాడు. గంధర్వ కన్యలను ఎత్తుకొచ్చాడు. దేవకన్యలను ఎత్తుకొచ్చాడు. నాగకన్యలను ఎత్తుకొచ్చాడు. యక్షకన్యలను ఎత్తుకొచ్చాడు. ఇలా కంటికి అందంగా కనిపించిన ప్రతివారినీ ఎత్తుకొచ్చాడు.

బ్రహ్మ ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తి ప్రభావంతో అతడిని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. లంకలో జనాలకు ఇది చాల గొప్ప విషయంలా అనిపించింది. అలా చేయడం లంకారాజ్యానికి ఒక హక్కు అని వారికి అనిపించే స్థాయికి వారిని రావణుడు తీసుకుపోయాడు. అలా చేయడం తప్పు అని చెప్పే విభీషణుడు లాంటి వారు ఉన్నా, వారి గొంతు వినబడకుండా నొక్కేశారు.

ఒకసారి రావణాసురుడు రాముని భార్య అయిన సీతను గూర్చి విన్నాడు. తన స్వతంత్రబలప్రతిపత్తి విషయం రాముడికి కూడా తెలిసే ఉంటుంది, నన్ను ఏమీ చేయలేడు అనుకుని, సీతమ్మను కూడా ఎత్తుకొచ్చేశాడు. సీతమ్మ "ఉరే ఇది తప్పురా వెధవా, రాముడికి ఈ విషయం తెలిస్తే చంపేస్తాడురా" అన్నది.

"ఓ సీతా, రాజ్యం పోగొట్టుకున్న రాముడి గూర్చి ఇంకా ఆలోచన ఎందుకు? ప్రపంచంలోకెల్లా అందమైన నా లంకలో ప్రపంచంలోకెల్లా ఐశ్వర్యవంతుడనైన నా అండన నీవు బ్రతుకు" అన్నాడు రావణుడు. అసలు నిన్ను ఎత్తుకురావడం రాక్షసధర్మం. నా జన్మహక్కు పొమ్మన్నాడు.

అప్పుడు కూడా లంకాజనాలు రావణాసురుడు చేసిన పనిని మెచ్చుకున్నారు. లంక పరువునిలబెట్టాడు అని జేజేలు కొట్టే స్థాయిలో ఉన్నారు.

ఇంతలో రాముడికి సీత ఎక్కడ ఉందో తెలిసింది. దండెత్తి వచ్చాడు. లంకలో జనాలు గగ్గోలు పెట్టారు. రాముడు అలా రావడానికి వీల్లేదు అన్నారు.

మరి సీతను ఎందుకు ఎత్తుకొచ్చాడు రావణుడు? అని అడిగితే -

మరి హనుమంతుడు వచ్చి మా లంకను తగలబెట్టచ్చా? అని ఎదురు ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు.

రాముడు లంకకు వంతెన కట్టడం తప్పని, అలా కడితే బ్రహ్మ ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తికి భంగం కలిగించినట్టే అని వాదించడం మొదలు పెట్టారు.

"హనుమంతుడు వచ్చి అశోకవనం ధ్వంసం చేశాడు. అది తప్పు" అన్నారు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేస్తే హనుమంతుడు దాన్ని విడిపించుకుపోయి బ్రహ్మకు అవమానం చేశాడు, ఆ విధంగా లంక ప్రజల మనోభావాలను గాయపరిచాడు" అన్నారు.

ఈ లోపల లంక బయట ఉన్న రాక్షససమర్థకులు కొందరు నోరు విప్పి నినాదాలు చేయడం మొదలు పెట్టారు.

రాముడు శూర్పణఖ ముక్కు కోయడం తప్పు అన్నారు. ఖరదూషణులను చంపడం తప్పు అన్నారు. అసలు రాముడు దండకారణ్యానికి రావడమే పెద్ద తప్పు అన్నారు.

రాముడు తాటకను చంపడం తప్పు అన్నారు. రాముడు బంగారు లేడిని చంపడం తప్పు అన్నారు. విశ్వామిత్రుడి యజ్ఞాన్ని కాపాడడానికి రాముడు రావడం తప్పున్నర తప్పు, అలా చేయడం లంక ప్రజలను రెచ్చగొట్టడమే అన్నారు.

ఈవిధంగా రాముడు ఇన్ని తప్పులు చేయడం వల్లనే రాక్షసులు మరింత మరింతగా రెచ్చిపోయారు అని, ఈవిధంగా రాముడి వల్లనే మనుషులకు రాక్షసులకు మధ్యలో సత్సంబంధాలు అన్నీ బెడిసి కొట్టాయని అన్నారు.

అందువల్ల, మనుషులకు రాక్షసులకు మరలా మంచి సంబంధాలను నెలకొల్పే సత్సంకల్పంతోనే రావణుడు సీతను ఎత్తుకు రావలసి వచ్చింది అని, అందులో తప్పేమీ లేదని వాదించడం మొదలుపెట్టారు.

రావణాసురుడు ఎత్తుకొచ్చింది ఒక్క సీతనే కాదు కదా?  అంతకు ముందు కూడా చాలా మంది స్త్రీలనే ఎత్తుకు వచ్చాడు కదా, మరి ఆ స్త్రీలకు సంబంధించిన వారందరూ నిశ్శబ్దంగా ఊరికినే ఉండగా ఒక్క రాముడే ఎందుకు దండెత్తి వచ్చాడు?  ఊరుకున్న వాళ్లందరికీ న్యాయం తెలియదా?  ధర్మం తెలియదా? నఈ రాముడు మాత్రమే పెద్ద న్యాయం ధర్మం తెలిసిన పోటుగాడా? అని దుమ్మెత్తి పోయడం మొదలు పెట్టారు.

బ్రహ్మ గారు రావణాసురుడికి ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తిని భంగం చేయడానికి వీల్లేదు అని, అసలు రాముడిని సృష్టించినది కూడా బ్రహ్మేనని, సకలలోకాలనూ సృష్టించిన ఆ బ్రహ్మగారికంటే నిన్న గాక మొన్న పుట్టిన రాముడికి ఎక్కువ తెలుసా? అని ఏకి పారేయడం మొదలు పెట్టారు.

ఏ పరిస్థితులలో బ్రహ్మ అటువంటి ప్రతిపత్తిని రావణాసురుడికి ఇచ్చాడో కూడా తెలుసుకోలేక రాముడు దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నాడని అన్నారు.

లంక చుట్టూ తన సైన్యాన్ని నిలిపి, లంకానగరం మీద బాణాలు ఎక్కుపెట్టి, సీతను తిరిగి ఇమ్మని అడగడం ఏరకం ప్రజాస్వామ్యమని తీవ్రంగా ప్రశ్నించారు. ఈ విధంగా రాముడు దౌర్జన్యం చేస్తే, లంకకు ఒక రావణాసురుడు కాదు, ఇంటింటా ఒక రావణాసురుడు వెలుస్తాడు జాగ్రత్త అన్నారు.  ఆ రావణాసురుల పుట్టుకకు రాముడే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఇదంతా రాక్షసజాతి మీద రాముడు నిష్కారణంగా పగబట్టి చేస్తున్న దౌర్జన్యమే తప్ప మరొకటి కాదన్నారు.

రాముడికి రాజ్యవ్యామోహం ఎక్కువని, అందువల్లనే వాలిని చంపాడని ఆరోపించారు. మూర్ఖులైన వానరులు దాన్ని అర్థం చేసుకోలేక అతడిని ఫాలో అవుతున్నారని అన్నారు. రాముడితో చేతులు కలిపి వాలికి ద్రోహం చేసిన సుగ్రీవుడు, చివరకు తాను కూడా అదే గతిని పొందుతాడని అన్నారు.

రాముడిని దగ్గరగా చూసిన కైకేయికి రాముడి స్వభావం బాగానే తెలుసునని, అందువల్లనే అడవికి పంపించేసిందని అన్నారు. ఒక ఆడది గెంటించి వేస్తే దిక్కులేక అడవిలో పడ్డ రాముడు, లంక జోలికి పోతే రాక్షసులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

భరతుడు వచ్చి బ్రతిమాలినా రాముడు అయోధ్యకు వెనుతిరిగి పోకుండా ఉండటం రాక్షసులను రెచ్చగొట్టడం కోసమే తప్ప వేరు కాదన్నారు. నిజానికి అది దశరథుడి కొడుకులందరూ కలిసి ఆడిన నాటకమన్నారు.

విభీషణుడు లంకాద్రోహి అని, అతడివల్ల లంక సర్వనాశనం అవుతుందని, యుద్ధం ముగిసిన తరువాత రాముడు విభీషణుడిని, సుగ్రీవుడిని కూడా చంపేసి, ఇద్దరి రాజ్యాన్ని తానే ఆక్రమిస్తాడని, అయితే అప్పటికి తమకు జరిగిన మోసం తెలుసుకొనేందుకు రాక్షసులు, వానరులు ఎవరూ మిగిలి ఉండరని జోస్యాలు చెప్పడం మొదలు పెట్టారు. ఇలా నానా శాపనార్థాలు పెట్టారు.

బ్రహ్మగారు ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తికి వీరందరూ వ్యతిరేకులని, రాక్షసజాతి ఔన్నత్యాన్ని తట్టుకోలేక అందరూ ఇలా కుమ్మక్కు అయి, లంక మీదకు దండెత్తి వచ్చారని అన్నారు.

ఆయా న్యూస్ పేపర్లలో పడిన ఈ వార్తలను సుగ్రీవుడు తీసుకొచ్చి రాముడికి చూపించాడు. అన్నీ చదివిన రాముడు చిన్న చిరునవ్వు నవ్వి, వాటిని పక్కన పడేసి, సుగ్రీవా, నువ్వు టైం ట్రావెల్ చేసి, రెండు యుగాలు ముందుకు పోయి ఈ పేపర్లు పట్టుకొచ్చినట్టున్నావు. అప్పుడు ఎంత ధర్మమైన విషయానికి కూడా కొందరు ఆలోచనాశూన్యులు, కార్యశూన్యులు ఇలాగే గొడవలు చేస్తారు. జస్ట్ ఇగ్నోర్ ఇట్. లెట్స్’ డూ వాట్ వీ హావ్ టు డూ’ అన్నాడు.

తరువాత జరగాల్సిందేదో జరిగింది. ఏమి జరిగిందో అందరికీ తెలుసు. సుగ్రీవుడు, విభీషణుడు, రాముడు హాయిగా ధర్మబద్ధంగా ఎవరి రాజ్యాలువాళ్లు పరిపాలించుకున్నారని ఎవరికి తెలియదో వారు చేతులు ఎత్తవచ్చు. లంక మాత్రం స్వతంత్రబలప్రతిపత్తి పీడను వదిలించుకుని స్వేచ్చగా బ్రతికింది.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...