Showing posts with label Politics. Show all posts
Showing posts with label Politics. Show all posts

Sunday, 22 March 2020

దానరాజు - ధర్మరాజు

ఈ కథను మీరు కూడా చిన్నపుడు వినే ఉంటారు. మహాభారతంలో ఎక్కడా లేని కథ. అయినా, జానపదులు సృష్టించిన కథ కాబట్టి, మాంచి రసవత్తరంగా ఉంటుంది.

ఒకసారి అర్జునునికి ఒక సందేహం వచ్చిందట.

"కృష్ణా కృష్ణా, మా అన్నను ధర్మరాజు అంటారు. కర్ణుని దానరాజు అంటారు ఈ ఇద్దరిలో ఏ రాజు గొప్ప?" అని అడిగాడు.

"కొన్ని రోజులు ఓపిక పట్టు అర్జునా. అవకాశం రాగానే నీకే ఆ విషయం ప్రత్యక్షంగా తెలిసేలా చేస్తాను" అని కృష్ణుడు చెప్పాడు.

ఎండా కాలం గడిచిపోయింది. వానాకాలం వచ్చింది. ధర్మరాజు రాజుగా ఉన్నాడు కాబట్టి, లోకమంతా మంచి వర్షాలు కురుస్తున్నాయి.

"అర్జునా, పద. వారిద్దరిలో ఎవరు గొప్ప రాజో ఇప్పుడే తెలుసుకుందాం" అని కృష్ణుడు అన్నాడు.

వారిద్దరూ తమను ఎవరూ గుర్తుపట్టకుండా బ్రాహ్మణుల వేషాలు వేసుకొని బయలుదేరారు. మొదటగా వారు ధర్మరాజు దగ్గరకు వెళ్లారు.

"రాజా రాజా, మేము ఒక గొప్ప యజ్ఞం చేయదలచుకున్నాము. అందుకుగాను వేయి మణుగులు గంధపుచెక్క కావాలి. దయచేసి ఇప్పించండి" అని కోరారు.

ధర్మరాజు ఆశ్చర్యపోయి, "వర్షాకాలంలో యజ్ఞాలు చేయడం ఏమిటి? పైగా వేయి మణుగుల గంధపు చెక్కను ఉపయోగించి చేయడమేమిటి? ఇటువంటి యజ్ఞాలను గూర్చి నేను ఎన్నడూ వినలేదే?" అన్నాడు.

"రాజా! అది ఒక రకమైన ప్రత్యేకయజ్ఞం" అని మాత్రమే వారు చెప్పారు.

ధర్మరాజు సరేనని, వేయి మణుగుల గంధపుచెక్క ఎక్కడ దొరికినా తీసుకురమ్మని తన భటులను పంపాడు.

వారు రాజ్యమంతా తిరిగివచ్చి, "మహారాజా! వేయి మణుగులేమిటి? పదివేల మణుగులైనా గంధపుచెక్కకు కొరత లేదు. కానీ ఇపుడు వర్షాకాలం కావడం వల్ల, అంతా తడిచిపోయి లభిస్తుంది. యజ్ఞానికి అవసరమైన పొడి గంధపు చెక్క మాత్రం ఎక్కడా ఒక్క మణుగు కూడా ప్రస్తుతం దొరకటం లేదు" అని విన్నవించారు.

అప్పుడు ధర్మరాజు ఆ బ్రాహ్మణులకు నమస్కారం చేసి, "మహాత్ములారా! మన్నించండి. మీరు వర్షాకాలంలో చేయరాని యజ్ఞాన్ని చేయదలపెట్టారు. అందువలన మీకు ఆ ప్రకృతి సహకరించేలా లేదు. దయచేసి వర్షాకాలం పూర్తి అయిన తరువాత మీరు యజ్ఞం చేయదలచుకుంటే, అపుడు మీ ఇంటికి నేను మీరడిగిన వేయి మణుగుల గంధపుచెక్క తో పాటు మిగిలిన యజ్ఞసంభారాలన్నీ పంపిస్తాను" అని అని వినయంగా పలికాడు.

అపుడు ఆ కపటబ్రాహ్మణవేషధారులు సరేనని చెప్పి అక్కడ నుండి నేరుగా కర్ణుని దగ్గరకు వెళ్లారు.

"రాజా రాజా, మేము ఒక గొప్ప యజ్ఞం చేయదలచుకున్నాము. అందుకుగాను వేయి మణుగులు గంధపుచెక్క కావాలి. దయచేసి ఇప్పించండి" అని కోరారు.

కర్ణుడు సరేనని, వేయి మణుగుల గంధపుచెక్క ఎక్కడ దొరికినా తీసుకురమ్మని తన భటులను పంపాడు.

వారు రాజ్యమంతా తిరిగివచ్చి, "రాజా! వేయి మణుగులేమిటి? పదివేల మణుగులైనా గంధపుచెక్కకు కొరత లేదు. కానీ ఇపుడు వర్షాకాలం కావడం వల్ల, అంతా తడిచిపోయి లభిస్తుంది. యజ్ఞానికి అవసరమైన పొడి గంధపు చెక్క మాత్రం ఎక్కడా ఒక్క మణుగు కూడా ప్రస్తుతం దొరకటం లేదు" అని విన్నవించారు.

కపటబ్రాహ్మణులు నిరాశగా ముఖం పెట్టారు. అది చూసి కర్ణుడు "అయ్యా! ఒక్క క్షణం ఆగండి. మీరు అడిగినది మీకు తప్పక ఇస్తాను" అని పలికాడు.

తరువాత తన భటులను పిలిచి, "భటులారా, భటులారా, నా ఇల్లు శ్రేష్ఠమైన గంధపు చెక్కతో నిర్మించబడింది. వెంటనే దీనిని పడగొట్టి ఈ బ్రాహ్మణులకు అవసరమైనంత గంధపు చెక్కను ఇచ్చి పంపండి" అని ఆజ్ఞాపించాడు.

అది విని అర్జునుడు ఆశ్చర్యపోయాడు.
"ఆహా! ఈ కర్ణుడు ఎంతటి దానతత్పరుడు!" అని భావించి అతడి పట్టుదలను మెచ్చుకున్నాడు.

ఇంతవరకు ఇది జానపదులు అల్లిన ఒక అందమైన కథ.

)))(((

ఇపుడు మనము ఈ కథను మరికొంత పొడిగిద్దాం.

"ఆహా! కృష్ణా! ఈ కర్ణుడు ఎంతటి దానతత్పరుడు!" అని అర్జునుడు పలికాడు.

"అయితే మీ అన్న అయిన ధర్మరాజు గొప్పవాడా లేక దానరాజు అయిన ఈ కర్ణుడు గొప్పవాడా? నీ సందేహం తొలగిపోయిందా?" అని కృష్ణుడు ప్రశ్నించాడు.

"నిస్సందేహంగా కర్ణుడే గొప్పవాడు కదా?" అని అర్జునుడు తన అభిప్రాయాన్ని తెలిపాడు.

"ఎందువల్ల?"

"బ్రాహ్మణుల కోరికను తీర్చడం కోసం కర్ణుడు తన సొంత ఇంటినే త్యాగం చేశాడు కదా?"

"అయ్యో అర్జునా! కర్ణుడు ఎంతటి విలాసపురుషుడు కాకుంటే తన ఇంటిని గంధపు చెక్కతో కట్టుకున్నాడు? సరే, అది అతడి ధనం, అతడి ఇష్టం. కానీ అతడి ఇంటిలో ఉండేది అతడొక్కడే కాదు. అతడి తల్లిదండ్రులు ఉంటారు. అతడి భార్యాబిడ్డలు ఉంటారు. అతడి పరివారజనం కూడా ఉంటారు. వీరందరికీ సరిపడిన ఆహారపదార్థాలు ఉంటాయి. వీరందరూ ఉపయోగించుకునే వస్త్రాలు పడకలు మొదలైనవి ఉంటాయి. వాటన్నింటినీ విస్మరించి, మంచి వర్షాకాలంలో ఇల్లు పడగొడితే వారందరి గతి ఏమిటి? ఇంటిలో ఉండే ఆ వస్తువులకు పదార్థాలకు రక్షణ ఏముంటుంది? బ్రాహ్మణుల కోరికను తీర్చడం కోసం, తాను దానరాజును అనిపించుకొనడం కోసం అంతమందిని ఇబ్బంది పెట్టడం ధర్మమేనా?" అని కృష్ణుడు అర్జునుని అడిగాడు.

అర్జునుడు ఆలోచనలో పడ్డాడు.

"అర్జునా! దేనిని గూర్చి ఆలోచిస్తున్నావు?"

"నీవు చెప్పిన విషయాన్ని గూర్చే బావా!"

"దానిని గూర్చి తరువాత ఆలోచిద్దువు గాని, ముందు దీనిని గూర్చి ఆలోచన చేయవయ్యా!"

"దేనిని గూర్చి బావా?"

"ఇల్లు పడగొట్టమని కర్ణుడు ఆజ్ఞాపించాడు కదా? ఇదిగో, భటులందరూ వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ, పలుగులు, పారలు, గునపాలు, తట్టలు తెచ్చుకున్నారు. కాసేపట్లో ఇంటిని పడగొట్టేస్తారు. అలా పడగొడుతూ ఉండగానే, ఇంటిని కట్టిన గంధపుచెక్క కూడా వర్షంలో తడిచి పోతుంది. అపుడు ఇలా తడిచిన గంధపు చెక్కను మనం మన యజ్ఞంలో ఎలా ఉపయోగించుకుంటాం?"

"అవును బావా! నిజమే!"

"కాబట్టి, ఏదో ఒక విధంగా దానం చేయాలి, దానరాజును అనిపించుకోవాలి అనే ఉద్దేశం అన్ని సందర్భాలలోనూ మంచిది కాదు. కాలధర్మాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి."

"నిజమే బావా! తెలిసింది."

"ఏమి తెలిసింది?"

"దానరాజుగా ఉండటం కంటే, ధర్మరాజుగా ఉండటం గొప్ప."

"శభాష్ అర్జునా!"

)))(((

ఈ విధంగా పొడిగించిన కథను, హఠాత్తుగా ముగిస్తే బాగుండదు. కాబట్టి,

కృష్ణార్జునులు తమ కపటబ్రాహ్మణవేషాలు విడిచి, తామెవరమో, ఎందుకు వచ్చామో కర్ణుడికి తెలియజేసి, తన ఇంటికి వచ్చి "ఇది కావాలి" అని ఎవరైనా నోరు తెరిచి కోరితే, "వారికి ఆ వస్తువును ఏ విధంగా అయినా ఇచ్చి తీరాలి" అనే అతడి పట్టుదలను మెచ్చుకొని, అతడు తన ఇల్లును పడగొట్టుకొనడం ఆపించి, వారిద్దరూ అతని ఇంట ఒక వారం రోజులపాటు హాయిగా ఆతిథ్యాన్ని స్వీకరించి బయలుదేరారు అని చెప్పడం బాగుంటుంది.

)))(((

అప్పట్లో అది గంధపు చెక్క.
ఇప్పట్లో ఇది ఇసుక.
ధర్మరాజు గొప్పవాడా?
దానరాజు గొప్పవాడా?
⚖️
మరో కథ అవసరమా?
పాత కథ చాలు కదా?

మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
26 అక్టోబర్, 2019
❇️✳️❇️✳️❇️✳️

Friday, 29 March 2019

మామా అల్లుళ్ల సవాల్

By శ్రీనివాసకృష్ణ
***

టేబుల్ మీద వైబ్రేషన్.
వెంటనే ఫోను లోనుంచి పాట.
కల యిదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే.
చూస్తే ఏదో అన్ నోన్ నంబర్.
*
😎
హలో? ఎవరదీ?
🤥
అల్లుడూ, నేను!
😎
ఎవరు? గొత్తు చిక్కలే?
🤥
నేను అల్లుడూ, మీ సెంద్రాలు మామని!
😎
ఓ! మామా! మీరా! ఎన్నాళ్లైంది మీరు ఫోన్ చేసి! బాగున్నారా?
🤥
నేను చేయకపోతేనేం? నువే చేయచ్చుగా అల్లుడూ?
😎
2014లో మీరు గెలిచినాక ఫోన్ నంబర్ తో సహా అన్నీ మార్చిపారేశారు. ఎలా చేసేది మామా?
🤥
అంటే, మా సెక్యూరిటీ ఆఫీసరు అలా మార్చమని సలహా ఇచ్చారులే అల్లుడూ. నీకు కొత్త నంబరు ఇవ్వడం మర్చిపోయాను.
😎
ఆ తరువాత మళ్లీ 2019లోనే గుర్తొచ్చానా మామా?
🤥
అంతమాట అనకు అల్లుడూ!
😎
సరేలే మామా! చెప్పండి, ఏమిటి విశేషాలు?
🤥
ఏమీ లేదల్లుడూ! నిద్ర పట్టక ఫోన్ చేశాను. అంతే.
😎
నిజంగా అంతేనా మామా? 😄
🤥
నిజమే అల్లుడూ, అరె, అలా ఎందుకు నవ్వుతావు?
😎
మరి కొన్ని రోజుల్లో కురుక్షేత్రయుద్ధం ప్రారంభం కానుండగా ధృతరాష్ట్రుడు కూడా విదురుడితో ఇదే మాట అన్నాడు మామా. అది గుర్తుకు వచ్చింది.
🤥
ఏమన్నాడు?
😎
"విదురా విదురా, నాకు నిద్ర పట్టటం లేదు, నా మనశ్శాంతి కోసం కొన్ని మంచి మాటలు చెప్పవయ్యా" అన్నాడు.
🤥
మరి విదురుడు ఏం చెప్పాడు?
😎
అభియుక్తం బలవతా దుర్బలం హీనసాధనమ్।
హృతస్వం కామినం చోరమ్ ఆవిశంతి ప్రజాగరాః।।
🤥
ఏమీ అర్థం కాలేదు అల్లుడూ.
😎
"బలవంతుడితో పెట్టుకున్న వాడికీ, గెలిచేందుకు ఎటువంటి సాధనాలూ లేని బలహీనుడికీ, సొమ్ము పోగొట్టుకున్నవాడికీ, కాముకుడికీ, దొంగకూ నిద్ర పట్టదు" అని అర్థం మామా.
🤥
అంటే నువ్వు కూడా నన్ను దొంగ అంటావా అల్లుడూ?
😎
అది కాదు మామా! నీకు మోడీ డబ్బులు ఇచ్చాడు. అభివృద్ధి చేసుకో అన్నాడు. లెక్కలు చెప్పమన్నాడు. చెప్పాలి కదా? చెబితే సరిపాయె కదా? ఆ కత ఆనాడే ముగిసిపోతా ఉండె కదా? ఆమాత్రం దానికి నువ్వు ఆయప్పని నానా తిట్లు తిట్టి, తెగతెంపులు చేసుకుంటివి కదా? పైగా అదేదో పెద్ద ఘనకార్యమన్నట్లు, లెక్కలు చెప్పకుండా తప్పిచ్చుకొనేది నీకు తప్ప ఇంకెవడికీ చేతకాని పెతాపం అన్నట్లు రాధాకృష్ణ రామోజీ రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి మొదటి పేజీల్లో ప్రజలకు చాటింపు చాటింపు వేసి పెట్టినారు కదా? అట్లా ఏ పిచ్చోడైనా నేను దొంగని నేను దొంగని అని సొంత పేపర్లలో రాపిచ్చుకుంటాడా? ఆ విధంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ అందరికీ బ్రెయిన్ వాష్ చేసి నేను దొంగను అని ఎందుకు రాపించుకున్నావో నాకు ఇప్పటికీ అర్థం కాదు మామా! మీ సెంద్రాలు మామ దొంగ అటగా? రోజూ వాళ్ల పేపర్లలోనే రాస్తున్నారు అని జనాలు నన్ను మొహం మీదనే అడుగుతూ ఉంటే మొహం యాడ బెట్టుకోవాల్నో నాకు అర్థం కాలే!
🤥
కేంద్రంలో సోనియాను ఎదిరిచ్చిన మొనగాడు జగన్ అని అందరూ ఆ పిల్లోన్ని పొగడతా ఉంటే, కేంద్రంలో మోడీని ఎదిరిచ్చిన చంద్రబాబు అని నేను కూడా అనిపిచ్చుకుందామని అట్లా రాపిచ్చుకున్న్యాను అల్లుడూ!
😎
అదా అసలు సంగతి! 😅😂🤣 పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్ల అయింది కద మామా నీ కత!
🤥
అదేంటి అల్లుడూ అట్లా అంటివి?
😎
కాదా మామా? జగన్ ఎదిరిచ్చినాడు అంటే దానికో లెక్క ఉంది. తన పదవులకు రాజీనామా చేసినాడు. అన్ని పార్టీలకు ఒంటరిగా ఎదురొడ్డి నిలిచి, ఐదులక్షల మెజారిటీ తెచ్చుకున్నాడు. తప్పుడు కేసులు పెట్టి రిమాండులో వేసి పదహారు నెలలు బయటి ప్రపంచంంలో అడుగు పెట్టనివ్వక పోయినా అదరలేదు, బెదరలేదు. ఆ తరువాత ఆ కేసులన్నీ ఒకొక్కటీ తప్పుడు కేసులని, కేవలం దురుద్దేశంతో పెట్టినవనీ తేలిపోతున్నాయి. అతడిని మీరు దొంగ అన్నారు. పొగరు అన్నారు. దురాశ అన్నారు. అధికారలాలస అన్నారు. ఐదేళ్ల నుండి మీరు, మీ మీడియా, మీరు చెప్పిన ప్రతిదాన్నీ గుడ్డిగా నమ్మే మీ పార్టీకార్యకర్తలు, మీ సోషల్ మీడియా సైన్యము, ఇంకాా మిగిలిన మీ మిత్ర పార్టీలు, మీ శత్రు పార్టీలు, మీ పార్ట్ నర్లు ఎంతలా అపహాస్యం చేస్తూ అవమానించినా, అతడు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ధైర్యం కోల్పోలేదు. పోరాడుతున్నాడు. ఈరోజు మీకు నిద్రపట్టకుండా చేశాడు.
🤥
అల్లుడూ, అక్కడితో ఆపు. నా శత్రువును నా ముందే పొగడుతావా?
😎
పొగుడుతున్నానా? జనాలందరూ ఏమనుకుంటున్నారో చెబుతున్నాను. సరేలే మామా! నీ శత్రువును నీముందే తిట్టేవాళ్లు ఎప్పుడూ నీ పక్కనే ఉంటారు. వాళ్లతో మాటాడుకో. ఫోన్ పెట్టేస్తాను.
🤥
అల్లుడూ, ఆగాగు! మరి నా పోరాటం గురించి చెప్పవా?
😎
నీ మీడియా మొత్తం నువ్వు ఎందుకు లెక్కలు చెప్పాలని నీ తరపున పోరాడిందిగా? కొత్తగా నేను చెప్పేదేముంది?
🤥
అయినా, నేను మంచి పనులు చేశానుగా అల్లుడూ?
😎
ఏమి చేశావు?
🤥
ఎన్టీయార్ వైద్యశ్రీ...
😎
ఆరోగ్యశ్రీ పేరు మార్చావు. అంతేగా? పోనీ అదైనా సరిగా చేశావా? బిల్లులు కట్టడం మానేసి డాక్టర్లందరి చేత తిట్లు తిన్నావు. 108 అంటే అందరికీ రాజశేఖర రెడ్డి గుర్తుకు వస్తాడని ఆ వాహనాలన్నిటినీ మూలబడేశావు.
🤥
అన్న క్యాంటీన్ పెట్టించాగా?
😎
భోజనం ఖర్చు ఎనబై రూపాయలు కదా?
🤥
అదేంటి అల్లుడూ? జనాల దగ్గర్నుండి ఐదు రూపాయలే తీసుకుంటున్నాం కదా? మిగిలిన సొమ్ము ప్రభుత్వమే భరిస్తుంది కదా?
😎
అవును. ప్రభుత్వమే ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఆ క్యాంటీన్లు నడిపే మీ పార్టీ వాళ్లకి ఇస్తుంది. ప్రభుత్వం దగ్గరున్నది మీ సొంత సొమ్మా? డైరెక్టుగా ఇస్తే తిడతారు కాబట్టి ఇండైరెక్టుగా ఇప్పిస్తున్నావు.
🤥
ఇండ్లు కట్టిచ్చినాం కదా?
😎
ఎవరికీ? మీ పనులన్నీ చేసిపెట్టే మీ పార్టీ కార్యకర్తలకా? పైగా ఆ ఇండ్ల గుంపులకు దేవాన్షు కాలనీ లాంటి పేర్లా? అసలు అవన్నీ కేంద్రం ఇచ్చిన నిధులతో కట్టినవి కదా? ఆ మాట యాడా చెప్పరేం? పైగా అసలు వాళ్లు నిధులే ఇవ్వలేదు అంటూ అల్లరి అల్లరి చేస్తారా? పెట్టే చేయికి వాత పెట్టి తప్పు వారిదే అంటారా? ఏమిటి మామా ఈ వయసులో మీకు ఈ ఆకతాయితనం?
🤥
అన్నిటిలోనూ ఇలా తప్పు పడితే ఎలా అల్లుడూ?
😎
అదేంటి మామా? నేను తప్పు అని ఎప్పుడన్నాను? జరుగుతున్న విషయం చెప్పగానే మీరు చేస్తున్నది తప్పు అని మీ అంతరాత్మే మీతో పలికించింది.
🤥
అమరావతి కడుతున్నాగా? పోలవరం కడుతున్నాగా?
😎
ఎందుకులే మామా గ్రాఫిక్కులు? కట్టి చూపించు. నీ మంచి కోరి చెబుతున్నాను. అప్పుడు మాటాడుకుందాం. ఇప్పుడే మాట్లాడ్డం మొదలు పెడితే నువ్వు జన్మలో మళ్లీ నిద్ర పోలేవు.
🤥
అయితే కట్టి చూపిస్తా. మళ్లీ బాబు రావాలి అని అందరికీ చెప్పు అల్లుడూ. వస్తేనే కదా కట్టేది?
😎
నేను చెబితే జనాలు వింటారా మామా? వినేట్టు ఉంటే ఈ ఐదేండ్లు నాకు ఫోన్ చేయకుండా వదిలేసేవాడివేనా మామా?
🤥
అల్లుడూ, సరైన సమయం చూసి వెన్నుపోటు పొడుస్తున్నావు కదా?
😎
నువ్వు యాడున్నావు, నేను యాడున్నాను మామా పొడిసేకి? ఇట్లా మాటలు నాతో మాట్లాడొద్దు. ఫోన్ పెట్టేయ్.
🤥
అల్లుడూ, ఐదేండ్లు గడిసినంక ఫోన్ జేసినా. మాట్లాడతా ఉంటే ఫోన్ పెట్టేస్తా అనడం నీకు న్యాయమా?
😎
సరే, చెప్పు మామా!
🤥
మీ రాయలసీమ చివరి గ్రామానికి నీరు పారిచ్చినా. అదైనా చెబుతావా పోనీ?
😎
చివరిగ్రామానికి నీరిచ్చినా అనే ప్రచారం చేసుకొనడం కోసం మధ్యలో వేలాది గ్రామాలను ఎందుకు వదిలేశారు మామా? సెంటు పూసుకుని, అదే స్నానమంటే నమ్మడానికి మా రాయలసీమ జనాలు ఏమైనా పిచ్చోళ్లా? వాళ్లకు కండ్లు లేవా? నేను చెబితే నమ్మేయడానికి?
🤥
రాయలసీమ వాళ్లు నమ్మొద్దు లేబా. కోస్తా వాండ్లు నమ్ముతారుగా? వాళ్లు అవన్నీ యాడ చూసొచ్చినారు? నిజమే అనుకుంటారు.
😎
రాయలసీమలో నీరు పారితే కోస్తా వాళ్లు చూడలేరు. కాని, పోలవరం పూర్తి అయిందో లేదో కోస్తా వాళ్లకు తెలియదా? కోస్తా వాళ్లు ఏమైనా పిచ్చోళ్లా? వాళ్లకు కండ్లు లేవా? నేను చెబితే నమ్మేయడానికి?
🤥
అల్లుడూ, నీకు రాజకీయాలు తెలియవు, చెబితే అర్థం చేసుకోవు. రాయలసీమలో పూర్తి అయిందని కోస్తా వాళ్లకు చెప్పాల. కోస్తాలో ఐపోవచ్చిందని రాయలసీమలో చెప్పాల.
😎
అవన్నీ చెప్పడానికి నీకు రామోజీ ఉన్నాడు, రాధాకృష్ణ ఉన్నాడు. మధ్యలో నేనెందుకు మామా, బక్క ప్రాణాన్ని? పైగా ఇలాంటివన్నీమీ ఎన్నికల ప్రకటనలలో జనాలను కొట్టించి కొట్టించి మరీ చెప్పిస్తున్నావటగా మామా? అలా ప్రకటనలలో మీవాళ్లు జనాలను కొడుతుంటే అందరికీ చింతమనేని గుర్తొస్తున్నాడంట.
🤥
అల్లుడూ, ఎన్నికల ప్రకటనలు బాగులేవా అయితే?
😎
మాకు ప్రాంతీయ భేదాలు లేవు అని ప్రకటనలలో ఎందుకు చెప్పించుకున్నారు మామా? యాడో తునిలో రైలు తగలబెడితే, రాయలసీమనుండి గూండాలు వచ్చి తగలబెట్టినారు అని అప్పుడు చెప్పినావే? అది అందరికీ గుర్తొచ్చింది. మాకు కులభేదాలు లేవు అని ఎందుకు చెప్పించుకున్నారు మామా? ఎస్సీ ఎస్టీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మీరన్నది అందరికీ గుర్తుకొచ్చింది. న్యాయమూర్తులుగా బీసీలు ఉండడానికి తగరు అని మీరన్నది అందరికీ గుర్తుకు వచ్చింది. పార్టీలకు అతీతంగా అందరికీ మేలు చేస్తామని ఎందుకు చెప్పించుకున్నారు మామా? స్వయంగా గౌరు చరితమ్మ వచ్చి అడిగితే నువ్వు ఇంకో పార్టీ కాబట్టి నేను పని చేయను పో అని మీరే స్వయంగా చెప్పుకున్నారు. ఇంకా...
🤥
అల్లుడూ, చాలు, చాలు, ఇంక ఆపు. నేనేదో బుద్ధి తక్కువై నీకు ఐదేండ్లపాటు ఫోన్ చేయలేదే అనుకో? నువ్వైనా స్వయంగా రావచ్చు కదా? మామా నువ్విట్లా తప్పులు చేస్తున్నావు అని ముందే చెప్పొచ్చు కదా?
😎
అంత మాట అనకు మామా. నీకు ప్రేమలు లేకపోవచ్చు గాని, నాకు ఉండవా మామా? వచ్చినా మామా, నేను వచ్చినా. మిమ్మల్ని ఈ కండ్లతో ఒక్కసారి చూసిపోదామని వచ్చినా. కాని, అప్పుడు మీరు దేశాభివృద్ధి కోసం చాలా బిజీ బిజీగా ప్రపంచమంతా స్పెషల్ ఫ్లైట్ లలో తిరుగుతూ ఉన్నారు మామా. మొదటి సారి వస్తే మీరు సింగపూర్ వెళ్లారట. రెండో సారి వస్తే చైనా జపాన్ వెళ్లారట. మూడోసారి వస్తే కజకస్తాన్ వెళ్లారట. నాలుగోసారి వస్తే టర్కీ వెళ్లారట. ఐదోసారి వస్తే లండన్ వెళ్లారట. ఆరోసారి వస్తే దావోస్ వెళ్లారట. ఏడోసారి వస్తే ...
🤥
అల్లుడూ ఆపేయ్. ఆపేయ్. చాలు. చాలు లిస్టు చదవకు.
😎
సరే మామా. కాని, ఇది గమనించారా మామా? మీరు తిరిగిన దేశాల లిస్టు చెబితే నాకు అలసట వచ్చింది, చివరకు మీకే చిరాకు వేసింది. ఇన్ని దేశాలు తిరిగారు కదా, ఆ అభివృద్ధి ఏదీ? ఎక్కడా కనబడటం లేదే? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు మామా.
🤥
జనాలు ఆశ్చర్యపోతున్నారా? శభాష్. ఇంత సేపటికి ఒక్క మంచి మాట చెప్పావ్.
😎
జనాలు ఆశ్చర్యపోతున్నారు అంటే మీకు సంతోషం కలిగిందా మామా? మీకు అలా అర్థమైందా మామా? అయితే జనాలు ఆశ్చర్యపోతున్న విషయాలు మీకు మరి కొన్ని చెప్పనా?
🤥
చెప్పు అల్లుడూ, నేను అందుకోసమేగా ఫోన్ చేసింది. నీ ఫీడ్ బ్యాక్ కోసం!
😎
మీరు ప్రతియేటా వైజాగ్ లో పెట్టుబడుల సమ్మేళనాలు నిర్వహించారు కదా? ఏటేటా కనీసం పదిలక్షలకోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేవారు కదా? మరి, ఈ ఐదేండ్లకాలంలో యాభైలక్షల కోట్ల పెట్టుబడులు రావాలి కదా? కనీసం కోటికొక ఉద్యోగం వచ్చినా యాభైలక్షలమందికి ఉద్యోగాలు రావాలి కదా? అవన్నీ యాడ వచ్చినాయ్? ఎవరికొచ్చినాయ్? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు మామా!
🤥
వెరీ గుడ్. కోస్తాలో వచ్చినాయని రాయలసీమ వాళ్లకి చెబుదాం, రాయలసీమలో వచ్చినాయని కోస్తాలో వాళ్లకి చెబుదాం. ఇంకా?
😎
పెనుగొండలో కియా కియా అనుకుంటూ ఆమధ్య హడావుడి చేశారు. ఆ తరువాత చడీ చప్పుడు లేదు. ఆ కియా కంపెనీ కార్లు యాడ్యాడా రోడ్ల మీద కానరావటం లేదు ఏమైందబ్బా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు మామా.
🤥
వెరీ గుడ్. అక్కడ తయారు అవుతున్న కార్లన్నీ ఒక్కటి కూడా మిగలకుండా విదేశాలకు ఎగుమతి అయిపోతున్నాయని అందరికీ చెప్పుకోవచ్చు. ఇంకా?
😎
మామా. నువ్వు సూపర్ మామా. నువ్వు చాణక్యుడివి మామా. నువ్వు మాకియవెల్లీవి మామా. నువ్వు అది మామా. నువ్వు ఇది మామా. సంక్షోభాలనుండి అవకాశాలను అందిపుచ్చుకోవాలని మీరు ఎప్పుడూ చెబుతూ ఉంటారే, అది ఎలా సాధ్యం అని నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని మామా. అది ఎలానో నాకు ఇప్పుడే కొద్దికొద్దిగా తెలుస్తోంది మామా. మీలాంటి మహాత్ములతో మాటలాడితే వేరే చదువులు ఎందుకు మామా? ఈ ఐదేండ్లలో మీరు ఎంతో ఎదిగిపోయారు మామా. ఈ ఐదేండ్లు మీతో మాట్లాడకుండా దూరంగా ఉండడం వల్ల, నేను ఎంతటి మేధావి యొక్క సాన్నిహిత్యాన్ని కోల్పోయానో, మరెంతటి విజ్ఞానాన్ని కోల్పోయానో తలచుకుంటూ ఉంటే నా కండ్లలో నీళ్లు తిరుగుతున్నాయి మామా. కనిపిస్తున్నాయా మామా?
🤥
ఫోన్లో ఎట్లా కనబడతాయిరా బడుద్దాయ్?
😎
నేను కాస్త పొగిడేసరికి నాకు అల్లుడు స్థానం నుంచి బడుద్దాయ్ స్థానానికి ప్రమోషన్ ఇచ్చేశావా మామా?
🤥
సరే సరే, తరువాత ఏడుద్దువు గాని, ఇంకా? జనాలు ఆశ్చర్యపోతున్న విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా?
😎
ఉంకొక్కటుంది మామా. మీరు సత్య నాదెండ్లను మైక్రోసాఫ్ట్ సీయీవో గా చేశారు. సింధు చేత ఒలింపిక్ మెడల్ గెలిపించారు. అబ్దుల్ కలాం ను, అలెగ్జాండర్ ను రాష్ట్రపతులుగా చేశారు. అప్పుడు వాజ్ పాయిని, రీసెంటుగా మోడీని ప్రైం మినిస్టర్లుగా చేశారు. కుమారస్వామిని కర్ణాటక ముఖ్యమంత్రిగా చేశారు. జగన్ ను కనీసం ప్రతిపక్షనేతగా అయినా చేశారు, ఇంతమందికి ఇంత ఉపకారం చేసిన మీరు, మీ కొడుకును మాత్రం మాట్లాడ్డం కూడా చేతకానివాడిగా ఎందుకు తయారు చేసి వదిలేశారని జనాలు ఆశ్చర్యపోతున్నారు మామా.
🤥
*******
😎
మామా?
🤥
*******
😎
హలో హలో, మామా, ఏడుస్తున్నావా మామా?
🤥
నోర్ముయ్. నేను ఏడవడమేంది? ఫోన్లో నీకేమైనా కనిపించిందా?
😎
వెక్కిళ్లు వినిపిస్తున్నాయి మామా! అందుకని అలా అనుకున్నాను. చూడండి పాపం, మీ గొంతు కూడా బొంగురు పోయింది!
🤥
నోర్ముయ్ వెధవా. ఆ వినుకొండ వీడియో చూసినతరువాత నేను నిద్రపట్టక చస్తూ నీకు ఫోన్ చేస్తే, ఓదార్చవలసింది పోయి, వెక్కిరిస్తావా?
😎
ఓదార్పా? మీకు ఓదార్పు ఇష్టమేనా మామా? మీరు ఓదార్పును వెక్కిరిస్తూ ఆమధ్య ఉపన్యాసాలిచ్చేవారు కదా?
😡😠
ఏయ్? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? ఏం తమషాలుగా ఉందా నీకు? నేను తలచుకుంటే నువ్వు యాడుంటావో తెలుసా నీకు? నాతో పెట్టుకోకు. ఫినిష్ చేసేస్తా.
😰
స స స సార్.... మి మి మి మీరు... మీరు మా మామ అనుకున్నా సార్. లేకపోతే నాకు అంత ధైర్యం యాడిది సార్.
😡😠
పెట్టేయ్‌రా ఫోను.
*
ఠక్కున పెట్టేశా.
ఇంకా గుండెలు గుబగుబలాడుతున్నాయి.
ఇంతలోనే మళ్లీ వైబ్రేషన్.
మళ్లీ ఫోను మ్రోగింది.
మళ్లీ పాట వచ్చింది.
భయపడుతూనే ఫోన్ ఎత్తా.
మళ్లీ మా మామే.
*
🤥
అల్లుడూ?
(గొంతు చాల మృదువుగా ఉంది.)
😰
ఆ మామా... సారీ... సారీ.... సారీ సార్. అలవాటైపోయి పొరబాట్న మామా అనేశా సార్.
🤥
సరే అల్లుడూ, మన సంభాషణను నువ్వు రికార్డు చెయ్యలేదు కదా?
😰
లేదు మామా. సారీ సార్, లేదు సార్.
🤥
జాగ్రత్త. చూసుకో. రికార్డు అయి ఉంటే డిలీట్ చేసేయ్. అందరికీ మంచిది.
😰
సరే మా.. సారీ, సరే సార్. తప్పకుండా సార్.
🤥
ఒకే. (ఫోన్ కట్టైంది.)
*
మా మామ సారీ, సారు, నాకు కొత్త ఐడియా ఇచ్చాడు. మా సంభాషణ ఆటో రికార్డు ఏమైనా అయిందా అని చూశాను.
కాలేదు.
నా దురదృష్టం.
నాకు కల వచ్చిందనుకుంటారు.
నాకు కాల్ వచ్చిందంటే నిజమని ఎవరూ నమ్మరు.
పోన్లే.
గతం గతః.
ఎవరు నమ్మితేనేం, నమ్మకపోతేనేం?
జరిగేది జరిగి తీరుతుంది.
😷😷😷

Saturday, 28 July 2018

శ్రీకృష్ణుడితో ఇంటర్వ్యూ - 2

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ:
((రెండవ భాగం))

ప్రశ్న 13
మీ మాటలు వింటే ధర్మరాజు మీద మీకు కాస్త కోపం ఉన్నట్టుందే?

కృష్ణుడు:
ఎందుకు ఉండదూ? ఎలాగో కష్టపడి యుద్ధాన్నంతా ఓ కొలిక్కి తెచ్చామా? దాదాపు దుర్యోధనుడొక్కడే మిగిలిపోయాడు. మడుగులో దాక్కున్నాడు. అతడిని యుక్తిగా ఏదో ఒక రకంగా బయటకు రప్పించాము. ఈలోగా ధర్మరాజు - "ఓయ్ దుర్యోధనా! మా పాండవులు ఐదుగురిలో ఎవరో ఒకరిని ఎంచుకో. వారితో నీకు నచ్చిన ఆయుధంతో యుద్ధం చేసి గెలు చూద్దాం. ఏ ఒక్కర్ని గెలిచినా మొత్తం రాజ్యాన్ని నీకే ఇచ్చేస్తాను" అనేశాడు. అపుడు నాకు ఎంత కోపం వచ్చిందో!

ప్రశ్న 14
అయినా, దుర్యోధనుడు మంచివాడు, నిజాయితీపరుడు కదా! అందుకే ఏ సహదేవుడినో ఎంచుకుని ఓడించకుండా తనకు తగిన జోడీ అని భీముడిని ఎంచుకున్నాడు! లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది?

కృష్ణుడు:
దుర్యోధనుడికి నిజాయితీనా? ఆ మాత్రం నిజాయితీ ఉంటే పాండవులు అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన వెంటనే వారి రాజ్యాన్ని వారికి ఇచ్చి ఉండాల్సింది.

సరే, ప్రస్తుతానికి వస్తే, ధర్మరాజు సవాలును స్వీకరించి మీరన్నట్టు ఏ సహదేవుడినో ఎంచుకొని గదతో పడగొట్టి రాజ్యాన్ని సంపాదించేవాడే. కానీ, అతడు అలా చేయకపోవడానికి కారణం నిజాయితీ కాదు, మంచితనం కూడా కాదు, అలా చేస్తే అతడి పిరికితనానికి, కక్కుర్తితనానికి జనాలు నవ్వుకొనేవారు. వెక్కిరించేవారు. అభిమానధనుడని పేరుపొందిన దుర్యోధనుడికి అటువంటి అవహేళన చావుకంటే దుర్భరం. జనాల మాటలు వినలేక గుండెలు పగిలి చచ్చుండేవాడు.

అలాగని అతడు భీముడిని కూడా తన ప్రత్యర్థిగా ఎంచుకోలేదు. "మీలోనే ఎవరైనా రండి, మీలోనే ఎవరైనా రండి, మట్టి కరిపించేస్తా, సవాల్!" అంటూ ప్రగల్భాలు పలికాడు. ఆ మాటల్లో ఏ నకులుడో సహదేవుడో రాకపోతారా అనే ఆశ కూడా ఉంది. వారంతట వారే వచ్చి తన చేతిలో చస్తే అది తన తప్పుగా ఎవరూ భావించలేరు కదా? తనకు అటు రాజ్యమూ వస్తుంది, ఇటు అవహేళన చేసేవారు కూడా ఎవరూ ఉండరు అనే దురాశ అతడిది. కానీ పాపం, అతడి ఆశ చెల్లలేదు. అతడు చేసిన సవాలును భీముడే స్వీకరించి ముందుకొచ్చి అతడిని మట్టికరిపించాడు.

ప్రశ్న 15
అసలు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది మీరే అని చాలమంది అంటారు?

కృష్ణుడు:
దుర్యోధనుడు భీముడికి విషం పెట్టినపుడు, ఆ భీముడికి కాళ్ళు చేతులు కట్టేసి నీటిలోని తోసి చంపదలచినపుడు నేను చాల చిన్నపిల్లవాడిని.

అప్పటికి నేను ఇంకా యశోదానందుల బిడ్డడిననే అనుకుంటూ ఉన్నాను. అప్పటికి కుంతి మా అత్త అని తెలియదు. పాండవులు మా బావలు అని తెలియదు. మధురానగరిలో రాజకీయాలు కూడా తెలియవు, కంసుడు నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని కూడా తెలియదు. ఏదో అమాయికంగా ఆవులు కాచుకుంటూ, మిగిలిన పిల్లలతో ఆడుకుంటూ, మా జోలికి వచ్చిన చిన్న చిన్న పాములను కాలితో తొక్కేసి తరిమేస్తూ - ఇలా బయటి ప్రపంచం తెలియకుండా కాలం గడిపేవాడిని. అలాంటి నేను ఆ సమయంలో హస్తినాపురానికి వచ్చి భీముడికి విషం పెట్టమని దుర్యోధనుడికి చెప్పానా?

ఏమయ్యా, ఇది శకునిని అడగవలసిన ప్రశ్న కదా, నన్ను అడుగుతున్నారేమిటి?

ప్రశ్న 16
అలా కాదు, మీరు తలచుకుని ఉంటే అసలు యుద్ధానికి కారణమైన జూదమే జరగకుండా ఆపగలిగి ఉండేవారు కదా?

కృష్ణుడు:
ఆ సమయంలో మా యాదవులమీద కక్షగట్టిన సాళ్వరాజు, సౌభరి అనే విమానాన్ని ఎక్కి వచ్చి ద్వారకమీద దాడి చేశాడు. నేను మా వారితో కలసి వాడితో యుద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్నాను. అదే సమయంలో ఇక్కడ జూదం జరిగింది. లేకుంటే నేను పిలవకున్నా ఈ జూదానికి వచ్చేవాడినే, జూదం జరగకుండా చూసేవాడినే.

ప్రశ్న 17
కాదు, కౌరవులు పాండవులు జూదమాడుతూ ఉండగా మీరు ద్వారకలో 'విన్నావా యశోదమ్మా' అనే ఒక నృత్యరూపకాన్ని చూస్తూ మైమరచి ఉన్నారు కదా?

కృష్ణుడు:
ఏమయ్యా? మాయాబజార్ సినిమాకు నువ్వు వీరాభిమానివిలా ఉన్నావే? మాయాబజార్ ఒక కల్పితకథ. అసలు మా అన్న బలరామునికి శశిరేఖ అనే కూతురే లేదు. పాండవుల వనవాసకాలంలో సుభద్రాభిమన్యులు పూర్తిగా
ద్వారకలోనే నివసించారు. దేవకాంత, అతిసౌమ్యురాలూ అయిన మా వదిన రేవతిగారిని తుచ్ఛమైన డబ్బుకు ఆశపడే సామాన్యస్త్రీగా చిత్రీకరించారే? సరే, లోకం ఇలా ఉంటుంది సుమా అని జానపదులకు అర్థమయేలా చెప్పేందుకు ఈరకమైన సినిమా తీశారులే అని జాలిపడి మేము ఊరుకున్నాము.

ప్రశ్న 18
కానీ, మీరు ఎక్కడో దూరాన ఉన్నప్పటికీ, ద్రౌపదికి పరాభవం కలుగకుండా కాపాడారు కదా? అంత చేసిన వారు అదే చేత్తో దూరం నుండే జూదాన్ని ఎందుకు ఆపలేకపోయారు?

కృష్ణుడు:
ఎందుకు ఆపలేదు? ధృతరాష్ట్రుడి మనసులో భయం పుట్టించాను. ద్రౌపదికి వరాలు ఇచ్చే మిషతో జూదంలో పాండవులు ఓడిపోయినదంతా తిరిగి వారికి ఇప్పించాను. అంతా సవ్యంగానే ఉండింది.

ఈలోగా రెండోసారి కూడా జూదానికి పిలుపు వచ్చింది. ధర్మరాజు తగుదునమ్మా అని మళ్ళీ వెళ్ళాడు. రెండోసారి పన్నెండేళ్ల వనవాసము, ఒక యేడు అజ్ఞాతవాసము అనే నియమంతో మళ్ళీ పందెంలో ఓడిపోయాడు.

ఇలా ఎన్ని సార్లు భక్తులను దేవుడు కాపాడాలి? కష్టం అనుభవిస్తేనే గాని సుఖం విలువ తెలియదు. అందుకని రెండోసారి నేను కాపాడే ప్రయత్నం చేయలేదు. పైగా రెండో సారి కూడా అడ్డం తగిలి ఉంటే "తప్పులు చేసిన ప్రతిసారీ దేవుడొచ్చి కాపాడతాడు" అనే మానసికదౌర్బల్యం జనాలందరికీ కలిగేది. అది ప్రమాదకరం. "అసలు తప్పులే చేయకుండా ఉండాలి" అనే ఆదర్శం ప్రచారం కావాలి. అందుకే రెండో సారి ఊరుకున్నాను.

ప్రశ్న 19
కానీ మీకు తరువాతనైనా పాండవులను గట్టెక్కించే శ్రమ తప్పలేదు కదా?

కృష్ణుడు:
నిజమే. కానీ, ఎంత శక్తిమంతులు అయినా పొరపాట్లు చేస్తే కష్టపడవలసి ఉంటుంది సుమా అనే భయం అందరికీ ఉండాలంటే ఆ మాత్రం శ్రమ పడక తప్పదు.

ప్రశ్న 20
కానీ, మీరు ఆనాడు అలా ఊరుకొనడం వల్లనే కదా, యుద్ధం సంభవించింది?

కృష్ణుడు:
దీనికి నేను ముందే సమాధానం చెప్పాను. క్షత్రియుడు కోరుకునేది ఇటువంటి మరణాన్నే. తెలిసి కూడా అధర్మంవైపు నిలబడిన వారు మరణించారు. ధర్మం కోసం ప్రాణాలర్పించినవారు ధన్యులయ్యారు.

ప్రశ్న 21
క్షత్రియులు అలా మరణిస్తే మంచిదని మీరంటున్నారు. కాని, ఆ మరణించిన వీరుల కుటుంబాలలో ఎంతటి సంక్షోభం కలిగి ఉంటుందో కదా!

కృష్ణుడు:
మీ ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ ఈ విషయం దగ్గరకే వచ్చి ఆగుతున్నాయి. ఆవు వ్యాసంలాగా. (నవ్వులు) అసలు భగవద్గీతలో అర్జునుడి విషాదం కూడా ఇదే కదా!

క్షత్రియులు అంటేనే ప్రాణాలకు తెగించి ఉండే జాతి అని ఇంతకు ముందే చెప్పాను. అసలు ఏ వృత్తికి చెందినవాడైనా, ఇంటి బయటకు వెళ్లినవాడు మరలా ఇంటికి క్షేమంగా తిరిగి రాగలడని ఎవరైనా హామీ ఇవ్వగలరా? క్షత్రియవృత్తిని అవలంబించిన వారిలో ఈ ప్రమాదశాతం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ కుటుంబం వారు చిన్నతనం నుండి ఆ సంక్షోభానికి సిద్ధపడి బ్రతికేలా మానసికమైన సన్నద్ధత ఉంటుంది.

నాటి సమాజం నేటి సమాజం వంటిది కాదు, వారి కుటుంబానికి మంచి గౌరవమర్యాదలు ఉంటాయి. ఆ యోధుల కుటుంబాలకు రాజుల అండదండలు ఉంటాయి. వారికి ఆర్థికసంక్షోభం ఉండే సమస్య లేదు. అయితే మనిషి లేకపోవడం అనే కొరతను ఎవరూ తీర్చలేరు. కానీ, క్షత్రియజాతికి గుండెనిబ్బరం జన్మతః సిద్ధిస్తుంది.

సుఖదుఃఖాలు శాశ్వతాలు కావు. "ధర్మ ఏకో హి నిశ్చలః." ధర్మం ఒకటే శాశ్వతమైనది. కాబట్టి, నేటి మనుషులను, నేటి సమాజాన్ని చూసిన కళ్ళతో నాటి మనుషులను, నాటి సమాజాన్ని అంచనా వేయకండి. మళ్ళీ ఇటువంటి ప్రశ్నను వేస్తే మీదగ్గర అడగడానికి మరే ప్రశ్నలూ లేవనుకుని ఇంటర్వ్యూ ను ఇంతటితో ముగిద్దాము.

ప్రశ్న 22
స్వామీ, స్వామీ, కోప్పడకండి. మరో రెండు మూడు ప్రశ్నలున్నాయి.
మరి యుద్ధంలో అబద్ధమాడమని మీరు ధర్మరాజుకు చెప్పారా లేదా? అది తప్పు కాదా? గదాయుద్ధంలో దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టమని భీముడికి చెప్పారా లేదా? అది తప్పు కదా?

కృష్ణుడు:
అవునయ్యా. అవును ధర్మరాజుకు, భీముడికి నేను అలా చెప్పిన మాట నిజమే. అసలు నా అవతారరహస్యాలలో అది ఒకటి.

కలియుగంలో దురాచారులెందరెందరో భారతానికి వస్తారు. వారు చేసే ప్రతి వెధవ పనిని కప్పిపుచ్చుకుంటూ భారతీయులు చేసే ప్రతిపనినీ తప్పు పడుతూ ఉంటారు. వారు చంపితే వీరత్వం అంటారు. వారికి ఎదురుతిరిగి భారతీయులు చంపితే క్రూరత్వం అంటారు. ఈరకంగా వారు తప్పు చేస్తే ఆనాటి అవసరం అలా చేయించింది అంటారు. భారతీయులు తప్పనిసరై అలా చేయబోతే నానా యాగీ చేస్తారు. భారతీయులు ఏమి చేయాలో తెలియని ధర్మసంకటంలో ఇరుక్కుని నిస్సహాయులౌతారు. వారికి నేను కర్తవ్యం బోధించదలచాను.

మాయాచారో మాయయా బాధితవ్యః.
సాధ్వాచారో సాధునా ప్రత్యుపేయః..

మాయగాళ్లని మాయతోనే కొట్టాలి.
మంచివారితో మంచిగానే వ్యవహరించాలి.

ఇలా స్వయంగా నేను చెప్పినప్పటికీ నిజంగా అలా మాయ చేసి దెబ్బ కొట్టవచ్చునా అని వెనుకంజ వేస్తూ పిరికివాళ్ళనిపించుకొనేంత వెర్రి వాజమ్మలు కలియుగభారతీయులు. అందుకే వారికి ఆదర్శంగా స్వయంగా నేనే కురుక్షేత్రయుద్ధంలో అలా చేసి చూపించవలసి వచ్చింది. ఈ కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం అబద్ధమాడినా పరవాలేదు. నియమం తప్పినా పరవాలేదు. అటువంటి సందర్భాలలో తప్పొప్పులు ఏమి చేసినా నాకు వదిలిపెట్టండి, కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించండి అని చెప్పదలిచాను.

ప్రశ్న 23
ధన్యులం స్వామీ, ధన్యులం. మీ ఉపదేశాన్ని భారతీయులందరూ సక్రమంగా గ్రహిస్తే వారికి ఇక తిరుగు ఉండదు. కాని, మీకు పక్షపాతం దేనికి స్వామీ, ఒకవైపు "సర్వత్ర సమదర్శనః" అంటారు. కానీ అంత గొప్ప భగవద్గీతను అర్జునుడికి మాత్రమే బోధించారు.

కృష్ణుడు:
అయ్యో పిచ్చోడా, నేను వేరు, అర్జునుడు వేరు అనుకుంటున్నావా?

यो2हं तमर्जुनं विद्धि, यो2र्जुनः सोहमेव तु।
నేనెవరిననుకుంటున్నావో ఆ నన్ను అర్జునుడనే తెలుసుకో.
ఇతడు అర్జునుడు అని ఎవరిని గూర్చి అనుకుంటున్నావో అతడు నేనేనని తెలుసుకో.

భగవద్గీతను నాకు నేనే బోధించుకున్నా. అది నా ఆత్మప్రబోధం.

ప్రశ్న 24
శ్రీకృష్ణా, నమో నమః. నమో నమః. పరమానందం. పరమానందం.
కానీ, మేము మీరన్నట్టే సామాన్యులం కదా స్వామీ, మీరు ఆ భగవద్గీతను దుర్యోధనుడికి చెప్పి ఉంటే యుద్ధం ఉండేది కాదేమోనని మా ఆశ.

"भक्तो2सि मे सखा चेति रहस्यम् एतदुत्तमम्"

అంటూ అర్జునుడికి మాత్రమే చెప్పారు కదా.

కృష్ణుడు:
(నవ్వులు) ఏమయ్యా తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా?

రాయబారానికి వెళ్ళినపుడు నేను మంచి మాటలు చెప్పనే లేదంటావా? దుర్యోధనుడు కాస్త ఓపికగా విని ఉంటే ఆ భగవద్గీతను అప్పుడే చెప్పి ఉండేవాడినేమో? కానీ, నా మాటలు వినే ఓపిక ఆయనకెక్కడిది? ఆయన నా మాటలు వినకుండా తన మిత్రుల మాటలు విన్నాడు. నన్నే బంధించే ప్రయత్నం చేశాడు.

అప్పుడు కూడా సభామధ్యంలో నా విశ్వరూపం ప్రదర్శించాను. భయపడ్డాడు కానీ అర్థం చేసుకోలేకపోయాడు. తరువాత నన్ను ఇంద్రజాలం చేసే గారడీ వాడినంటూ హేళన చేశాడు.

"యద్భావం తద్భవతి" అని వినలేదా?
"యే యథా మామ్ ప్రపద్యన్తే తాన్ తథైవ భజామ్యహమ్"
(భగవద్గీత 4.11)

నన్ను గూర్చి ఎవరు ఏమనుకుంటే నేను వారికి అలాగే కనిపిస్తాను. అనిపిస్తాను. నువ్వేమనుకుంటావో నీ యిష్టం.

ప్రశ్న 25
స్వామీ, మీ మాటలు నాకు అయోమయం కలిగిస్తున్నాయి. ఒకవైపు అన్నీ చేసే భగవంతుడిని నేనే అంటారు. మరో వైపు నీ భావన ఎలా ఉందో అలాగే జరుగుతుంది అంటారు.  అందుకనే అర్జునుడిలా నేను నిన్ను అదే విధంగా ఆశ్రయిస్తున్నాను.

కార్పణ్యదోషోప హతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః.
యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే2హం శాధి మాం త్వాం ప్రపన్నమ్.

కృష్ణుడు:
ఇది ప్రశ్నలా లేదే?

*****
ఉపసంహారం:
******
అలా ఇంటర్వ్యూ అర్ధాంతరంగా ముగిసిపోయింది.

ఇంటర్వ్యూ చేసేటపుడు ఎదుట ఉన్నవారు ప్రఖ్యాతి చెందిన వ్యక్తి అయితే అతడిని అయోమయంలో పడేస్తూ అతడి చేత వివాదాస్పదవ్యాఖ్యలు చేయిస్తూ అతడికి తెలియకుండా అతడి మాటల మీద ప్రజాభిప్రాయం కోరుతూ, రాచి రంపాన పెట్టడమే ఇంటర్వ్యూ అని కదా ఈరోజుల్లో భావం?

కానీ, అలా చేస్తూ చేస్తూ అతని మాటలు బలేగా నచ్చేసి అతనికి భక్తుడైపోయి నువ్వే నాకు దిక్కంటే ఆ ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారం అవుతున్నప్పటికీ కట్ చెప్పాల్సిందే కదా?

అలా నేను చేస్తున్న/చేసిన ఇంటర్వ్యూ మధ్యలో ఆగిపోవలసి వచ్చిందన్న మాట. అయినప్పటికీ ఆయననుండి సాధ్యమైనన్ని ఎక్కువ విషయాలను రాబట్టాననే భావిస్తున్నాను.

ఈ ఇంటర్వ్యూ చదివినవారికి, విన్నవారికి, కన్నవారికి అందరికీ నిశ్చితమైన శ్రేయస్సు కలుగుగాక!

ఇంటర్వ్యూ రెండవ భాగం కూడా శ్రీకృష్ణార్పణమస్తు.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...