Showing posts with label Arjuna. Show all posts
Showing posts with label Arjuna. Show all posts

Thursday, 2 January 2020

గర్వకారణం 1

వనవాసం ముగిసింది.
అజ్ఞాతవాసం ముగిసింది.
సంధిప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అయినా దుర్యోధనుడికి యుద్ధం తప్పదని ముందే తెలుసును. పాండవులు ఎట్టి పరిస్థితులలోనూ సుఖపడరాదని, పాండవుల రాజ్యాన్ని పాండవులకు తిరిగి ఇవ్వాలనే సద్బుద్ధి తనకు లేదని అతడికి ముందే తెలుసు కదా? పాండవులు తన చేతిలో ఓడిపోతారని అతనికి గట్టి నమ్మకం.
అయినప్పటికీ సంజయుడు చెప్పిన ఒక్క మాట ధృతరాష్ట్రుడిని బాగా కలవరపెట్టింది.
एकतो वा जगत् कृत्स्नम्
एकतो वा जनार्दनः।
सारतो जगतः कृत्स्नाद्
अतिरिक्तो जनार्दनः।।
ఒకవైపు సమస్తప్రపంచాన్ని పెట్టి, మరొకవైపున శ్రీకృష్ణుని ఒక్కని మాత్రం పెడితే, సమస్తప్రపంచం కంటే సారభూతుడైన శ్రీకృష్ణుడే ఎక్కువ.
సమస్తప్రపంచం = జన్మ+కులము+ధనము+సంపద+భూమి+విద్య+లోకజ్ఞానము+పుస్తకజ్ఞానము+సంబంధాలు+పరిచయాలు+స్నేహితులు+అభిమానాలు+అహంకారాలు+మమకారాలు+రాగాలు+ద్వేషాలు+సమస్తచరాచరాఖిలబ్రహ్మాండము
శ్రీకృష్ణుడు > సమస్తప్రపంచం
దాంతో ధృతరాష్ట్రుడు భయపడిపోయి,
दुर्योधन हृषीकेशं शरणं गच्छ केशवम्।
"నాయనా దుర్యోధనా, శ్రీకృష్ణుని శరణు కోరవయ్యా" అని చెప్పాడు.
శ్రీకృష్ణుని గొప్పతనం దుర్యోధనుడికి కూడా తెలుసు. అయినప్పటికీ,
भगवान् देवकीपुत्रः लोकांश्चेन्निहतिष्यति।
प्रवदन्नर्जुने सख्यं नाहं गच्छेऽद्य केशवम्।।
"ఆ దేవకీపుత్రుడు భగవంతుడే కావచ్చును. సమస్తలోకాలను సంహరించగలిగినవాడే కావచ్చును. అయినప్పటికీ, అతడు అర్జునుడితో స్నేహం చేసినంతకాలం నేను అతడి దగ్గరకు వెళ్లను" అన్నాడు.
కానీ దుర్యోధనుడికి తప్పలేదు.
సహాయం కోరి వెళ్లక తప్పలేదు.
ఈ శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడు?
ఎక్కడ ఆయనను పట్టుకోవాలి?
ద్వారకలో ఉంటాడని దుర్యోధనుడికి తెలుసు. అందువల్ల द्वारकामभ्ययात् पुरीम् - ద్వారకా నగరానికి వెళ్ళాడు.
అర్జునుడికి కూడా శ్రీకృష్ణుని సహాయం కావాలి. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ఆయనను ఎలా పట్టుకోవాలి? ఈ విషయం దుర్యోధనుడి కంటే అర్జునుడికే బాగా తెలుసు. 😊
దుర్యోధనుడు అర్జునుడు తన దగ్గరకు వచ్చేసరికి శ్రీకృష్ణుడు నిద్రిస్తున్నాడు. 
(నటిస్తున్నాడా? 😊). 
ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప నిద్రించే వారిని లేపడం ధర్మం కాదు. అందువల్ల వారిద్దరూ శ్రీకృష్ణుడు నిద్రలేచేంతవరకు ఎదురుచూడదలిచారు.
దుర్యోధనుడు శ్రీకృష్ణుని తల చెంత ఉన్న గొప్ప ఆసనంపై కూర్చున్నాడు. అర్జునుడు కృష్ణుని పాదాలచెంత చేతులు జోడించి వినయంగా నిలబడ్డాడు.
నిద్ర లేచిన వెంటనే కృష్ణుడు చూసింది ఎదురుగా ఉన్న అర్జునుని. 😊
प्रतिबुद्धः स वार्ष्णेयो ददर्शाग्रे किरीटिनम्।
తరువాత దుర్యోధనుని కూడా చూశాడు.
వారు వచ్చిన పని తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఇద్దరికీ సహాయం చేస్తానని చెప్పాడు.
साहाय्यमुभयोरेव करिष्यामि सुयोधन।
"నాతో సమానులై సహస్రసహస్రసంఖ్యాకులైన నా వీరసైనికులొకవైపు ఉంటారు, ఆయుధాన్ని పట్టకుండా, యుద్ధం చేయకుండా నేను ఒకవైపు ఉంటాను. మీరు చెరొక దానిని ఎంచుకోండి. అర్జునుడు చిన్నవాడు కాబట్టి మొదట ఎంచుకుంటాడు" అన్నాడు.
టాస్ ఓడి పోయిన క్రికెట్ జట్టు కెప్టెన్‌లా దుర్యోధనుడు డీలా పడిపోయాడు.
శ్రీకృష్ణుని గొప్పతనం తెలిసినప్పటికీ దుర్యోధనుడు మోహంలో పడిపోయాడు. "ఆయుధాలు పట్టకుండా యుద్ధం చేయకుండా తనవైపు శ్రీకృష్ణుడు ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి అనుకున్నాడు. మొదట కోరుకునే అవకాశం చిన్నవాడు అనే పేరిట అర్జునుడికి ఇచ్చాడు. వాడేమైనా తెలివితక్కువవాడా? ఖచ్చితంగా సహస్రసహస్ర సైనికులనే కోరుకుంటాడు" అని భావిస్తూ నిస్సహాయంగా పళ్ళు నూరుతున్నాడు.
కానీ దుర్యోధనుడికి సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తూ, అర్జునుడు తనకు శ్రీకృష్ణుడు ఒక్కడే కావాలన్నాడు.
अयुध्यमानं संग्रामे वरयामास केशवम्।
దుర్యోధనుడి ఆనందానికి అంతే లేదు.
संप्राप्य परमां मुदम्...
ఈ దెబ్బతో నాదే విజయం అని భావించాడు.
युद्धान्मेने जितं जयम्।
శ్రీకృష్ణుడు తాను తవ్వుకొన్న గోతిలో తానే పడ్డాడు అని ఆనందించాడు. టాస్ ఓడిపోయినప్పటికీ మ్యాచ్‌లో విజయం నాదే అనుకున్నాడు.
కానీ, అర్జునుడు ఏమిటి, అంతటి తిక్కోడు?
సహస్రసహస్రమహాయోధులను వదిలిపెట్టి, ఆయుధం పట్టుకొని యుద్ధం చేయను అన్న కృష్ణుని మాత్రమే ఎందుకు కోరుకున్నాడు?
ముందే అనుకున్నట్టుగా, ఈ విషయం దుర్యోధనుని కంటే అర్జునుడికే బాగా తెలుసు. 😊
यतः सत्यं यतो धर्मः
यतो ह्रीरार्जवं यतः।
ततो भवति गोविन्दः
यतः कृष्णस्ततो जयः।।
ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ హ్రీ ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ ఆర్జవం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది.
1 సత్యం = సత్యం
2 ధర్మం = ధర్మం
3 హ్రీ = ఎటువంటి పనుల వలన సత్యధర్మపరులైనవారికి క్షోభ కలుగుతుందో అటువంటి పనులను చేసేందుకు సిగ్గుపడటం, వెనుకాడటం.
4 ఆర్జవం = ఋజుత్వం. త్రికరణశుద్ధి. మనోవాక్కాయకర్మల సామాన్యము (సమానంగా ఉండేలా ప్రవర్తించటము)
ఈ నాలుగు గుణాలు ఎవరి దగ్గర ఉంటే శ్రీకృష్ణుడు వారి దగ్గర ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎవరి చెంత ఉంటే వారిదే జయం. 🙏
ఆ నాలుగు గుణాలు దుర్యోధనుని చెంత లేవు కాబట్టే అతడు కృష్ణుని సంతోషంగా వదులుకున్నాడు.
కానీ ఈ నాలుగు గుణాలు అర్జునునిలో పుష్కలంగా ఉండడం వల్ల అతడు శ్రీకృష్ణుని ఎంచుకున్నాడు.
ఈవిషయం తెలియక అందరూ పాండవపక్షపాతి అంటారు గాని, నిజానికి అతడు ధర్మపక్షపాతి.
అంతిమఫలితం అందరికీ తెలిసిందే.
దుర్యోధనుడు ఓడిపోయాడు.
పాండవులు విజయం సాధించారు.
యతో ధర్మః తతః కృష్ణః.
యతః కృష్ణః తతో జయః.
🌼🌼🌼
దేవుడంటే తనను వేలంపాటలో ఎవరు ఎక్కువకు పాడుకుంటే వారి టీముకు సేవలందించే IPL క్రికెటర్ లాంటివాడు కాదు.
తన చెంతకు వచ్చినవారి ఐశ్వర్యాన్ని, స్తోత్రాలను, హోదాను, ఆడంబరపూజలను కాక, వారి గుణాలను మెచ్చి ఆదరించే దేవదేవుడు మావాడై ఉండటం మా మతానికి నిస్సందేహంగా గర్వకారణం.

https://www.facebook.com/srinivasakrishna.patil/posts/2600595423394455


Tuesday, 18 September 2018

పరువు ఎవడబ్బ సొమ్ము?

అనగనగా ధ్రువసంధి అనే రాజు ఉండేవాడు. మహా ధర్మాత్ముడు. ఆయనకు ఇద్దరు భార్యలు. మనోరమ, లీలావతి. మనోరమ కొడుకు సుదర్శనుడు. లీలావతి కొడుకు శత్రుజిత్తు.
దురదృష్టం కొద్దీ ధ్రువసంధి అడవిలో సింహం బారిన పడి చనిపోయాడు. అపుడు రాజు ఎవరు కావాలని సుదర్శనుడి మాతామహుడు అయిన వీరసేనుడు, శత్రుజిత్తు మాతామహుడు అయిన యుధాజిత్తు గొడవ పడ్డారు. వీరసేనుడిని యుధాజిత్తు చంపేశాడు. దాంతో, మనోరమ సుదర్శనుడిని తీసుకుని అడవికి పారిపోయి, భరద్వాజమహర్షిని శరణు కోరింది. యుధాజిత్తు శత్రుశేషం ఉంచరాదని సుదర్శనుడిని చంపేందుకు భరద్వాజుని ఆశ్రమానికి వెళ్లాడు కాని, మహర్షి తపఃశక్తికి భయపడి ఏమీ చేయలేక ఊరుకున్నాడు.
తరువాత ఎప్పుడో కాశీరాజు తన కూతురైన శశికళకు స్వయంవరం ప్రకటించాడు. రాజులందరూ విచ్చేశారు. అన్నదమ్ములైన సుదర్శనుడు, శత్రుజిత్తు కూడా వచ్చారు. శశికళ సుదర్శనుడిని వరించింది.
దాంతో శివాలెత్తిపోయిన యుధాజిత్తు "శశికళ నా మనుమడిని కాకుండా అతడికి పోటీదారు అయిన అన్నను వరిస్తుందా? ఆమెకు ఎంత ధైర్యం? ఆ సుదర్శనుడిని చంపేసి ఆమెను శత్రుజిత్తుకు ఇచ్చి పెళ్లి చేస్తా" అంటూ యుద్ధానికి దిగాడు.

ఇలా ఒకే కులం, ఒకే తండ్రిబిడ్డలు అయిన అన్నదమ్ములలోనే ఒకరిని కాకుండా ఇంకొకరిని ఒక కన్య వరించింది కాబట్టి మా పరువు పోయింది అనుకునే తాతలు ఉండేవారు సుమా.
ఈ కథలో తరువాత ఏమైందని అడుగుతారా? శశికళ కోరుకున్న వరుడే దైవానుగ్రహంతో యుద్ధంలో గెలిచాడు లెండి.
ఇలాంటి కథలు, ఇంతకంటె రసవత్తరమైన కథలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. చాలా వరకు మనకు తెలిసినవే. అయినప్పటికీ సరదాగా మళ్లీ గుర్తు చేసుకునేందుకు చదవండి:

1 శ్రీకృష్ణుడు
విదర్భరాజపుత్రి అయిన రుక్మిణి కృష్ణుని ప్రేమించింది.కృష్ణునికి ఇవ్వవచ్చునని ఆమె తల్లిదండ్రులు, బంధువులు కూడా అనుకున్నారు.కాని, రుక్మిణి అన్న ఐన రుక్మికి మాత్రం అది ఇష్టం లేదు.అతడు జరాసంధుని ముఠాకు చెందినవాడు.అతడి మాటపై తన దోస్తు ఐన శిశుపాలుడికి ఇచ్చి చేద్దామనుకున్నాడు.రుక్మిణి తల్లిదండ్రులు నిస్సహాయులయ్యారు.
రుక్మిణి ఒక బ్రాహ్మణుని ద్వారా తన మనసును కృష్ణునికి తెలియజేసింది.కృష్ణుడు వచ్చి ఆమెను అందరి సమక్షంలోనూ ఎత్తుకుపోయాడు.
రుక్మి శిశుపాలుడు, జరాసంధుడు కృష్ణుని చంపాలని వెంటబడ్డారు. కృష్ణుడు వారందరినీ ఓడించి తరిమేశాడు.చేసేదేమీ లేక, సింహానికి దక్కాల్సిన సొమ్మును జింకలు కాజేసినట్టు మన రాజకన్యను ఆ గోపాలుడు ఎత్తుకుపోయి ధనుర్దారులమైన మన కీర్తిని వాడు నవ్వులపాలు చేశాడే అని తిట్టుకుంటూ ఊరట చెందారు పాపం. అందరిలోనూ తమ పరువు పోయిందని బాధపడిపోయారు.
अहो धिगस्मान् यश आत्तधन्वनां गौपैर्हृतं केसरिणां मृगैरिव।
(భాగవతం 10.ఉత్తరార్ధం 54.57)
అయితే జరాసంధుని భీముడు, శిశుపాలుని కృష్ణుడు కాలాంతరంలో హతమార్చిన తరువాత రుక్మిణి అన్న రుక్మి దారికి వచ్చాడు. తన కూతురు అయిన రుక్మవతిని రుక్మిణీకృష్ణుల కొడుకైన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుక్మిణీకృష్ణుల మనుమడైన అనిరుద్ధుడికి తన మనుమరాలైన రోచనను ఇచ్చాడు.

2 భీముడు
హిడింబుడు అనే రాక్షసుని చెల్లెలు హిడింబ.ఆమె అడవిలో భీముని చూడగానే ప్రేమించింది.తన అన్న క్రూరుడని మీ కుటుంబసభ్యులతో కలసి ఎక్కడకైనా దూరం పొమ్మని భీమునిహెచ్చరించింది.నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పింది.
ఇంతలో హిడింబుడు రానే వచ్చాడు. తన చెల్లెలి మనోభావాన్ని గ్రహించి, "వొసే హిడింబా! మన వంశానికి కళంకం తెస్తున్నావు. ఛీ ఛీ.
पूर्वेषां राक्षसेन्द्राणां सर्वेषामपयशस्विनी।“ (భారతం.1.152.18)
అన్నాడు.
ఆ హిడింబుడికి కూడా తన చెల్లెలు ఒక మానవమాత్రుణ్ణి వరించడం ఒక పరువుతక్కువ పనిగా అనిపించింది!
“ఉండు, మీ ఇద్దరినీ చంపి పారేస్తా చూడు" అంటూ భీముడి మీద పడ్డాడు. అయితే భీమసేనుడే అతడిని చంపిపారేశాడు.
ఆ తరువాత, హిడింబ ప్రేమను భీముడు తిరస్కరించాడు.“నీ అన్నను చంపిన పగతో మమ్మల్ని ఏమైనా చేయగలవు పో పో” అన్నాడు.అపుడు హిడింబ కుంతిని ధర్మరాజును శరణు వేడి, వారి ద్వారా భీముని ఒప్పించి పెండ్లి చేసుకుంది. వారి కుమారుడే ఘటోత్కచుడు అని అందరికీ తెలిసిన విషయమే కదా!

3 ద్రౌపది
పాండవులు లక్క ఇంట్లో చనిపోయారని అందరూ అనుకున్నారు.కాని, వారు తప్పించుకున్నారు. బ్రాహ్మణవేషం ధరించి పాంచాలరాజ్యంలో. ద్రౌపదీస్వయంవరసభను చేరుకున్నారు.
ఆ సభలో అందరూ మత్స్యయంత్రాన్ని ఛేదించడంలో విఫలమైన తరువాత బ్రాహ్మణవేషంలో ఉన్న అర్జునుడు ఆ పని చేశాడు. ద్రౌపది అతనిని వరించింది. ఇది చూసి అక్కడ ఉన్న రాజులు సహించలేకపోయారు. రాజులందరికీ ఇది తమ పరువుప్రతిష్ఠలకు ఒక సవాలుగా అనిపించింది.
“వీరుడైనవాడు ఏ కులానికి చెందినప్పటికీ వాడికి అందరూ సలాము చేయవలసినదే” అని ఒకప్పుడు గర్జించి చెప్పిన దుర్యోధనుడు కూడా ఉక్రోషంలో తాను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తానే విస్మరించాడు.
“ఈ కన్య (ద్రౌపది) ఒక క్షత్రియుని కాకుండా ఒక బ్రాహ్మణుని వరించినందుకు ఈమెను నిప్పుల్లో పడేసి మన దేశాలకు మనం పోదాం. ”अग्नावेनां परिक्षिप्य याम राष्ट्राणि पार्थिवाः। (భారతం 1.188.8) అని మిగిలిన రాజులతో పాటు మీదకు ఎగబడ్డాడు.
వారిని బ్రాహ్మణవేషాల్లోనే భీమార్జునులు అడ్డుకున్నారు. పెద్ద దొమ్మీ జరిగింది. యుద్ధంగా కూడా మారింది. వారిద్దరూ కలిసి ద్రౌపదిమీదకు పోబోయిన రాజులందరినీ చిత్తుచిత్తుగా ఓడించారు. మహా మహా కర్ణుడు కూడా అర్జునుని చేతిలో ఓడిపోయాడు. చేసేదేమీ లేక అందరూ నోరు మూసుకుని ఇంటికి పోయారు.
ద్రౌపది రక్షింపబడింది.

4 అర్జునుడు
తీర్థయాత్రలు చేస్తూ ద్వారకానగరానికి వచ్చిన అర్జునుడు, యాదవకన్య, శ్రీకృష్ణుని చెల్లెలు అయిన సుభద్రను చూసి ఇష్టపడ్డాడు.
సుభద్ర తనను వరిస్తుందో లేదో, యాదవులు ఆమెను తనకు ఇస్తారో లేదో అని అతడికి సందేహం కలిగింది. శ్రీకృష్ణునితో ఆ విషయం చర్చించి, అతడి ప్రోత్సాహం మీదట, అన్న అయిన ధర్మరాజు అనుమతిని కూడా పొందిన మీదట, సుభద్ర రేవతకపర్వతానికి వచ్చిన సందర్భం చూసుకుని ఎత్తుకుపోయాడు.
భోజులు, వృష్ణీయులు, అంధకులు అనే మూడు తెగల యాదవులకు అది చాల అవమానకరంగా తోచింది.
అన్నపానాలు కూడా మానివేసి అందరూ సమావేశమయ్యారు. “రథాలను సిద్దం చేయండిరా. ప్రాసాలను తీసుకురండిరా”
योजयध्वं रथानाशु प्रासानाहरतेति च। (భారతం 1.219.17)
అంటూ అర్జునుని దండించి సుభద్రను తిరిగి తీసుకుని వచ్చేందుకు సంసిద్ధులయ్యారు.
బలరాముని మండిపాటుకైతే హద్దులే లేవు. “భోజనం చేసిన కంచాన్నే విరగ్గొట్టే కులకళంకుడని తెలియక ఆ అర్జునుడిని శ్రీకృష్ణుడి మిత్రుడు కదా అని ఎంతగా గౌరవించాం!
न च सोऽर्हति पूजां तां दुर्बुद्धिः कुलपांसनः।
को हि तत्रैव भूक्त्वान्नं भाजनं भेत्तुमर्हति। (భారతం 1.219.26,27)
అసలు అర్జునుడు అపహరించింది సుభద్రను కాదు, తన మృత్యువునే సుమా! ఇటువంటి పని చేయడం ద్వారా నా తలమీద అర్జునుడు తన పాదం పెట్టినట్టు కాదా? ఆ అర్జునుడు జన్మించిన కౌరవవంశాన్ని ఈ భూమి మీదనే లేకుండా చేస్తాను.
अद्य निष्कौरवमेकः करिष्यामि वसुन्धराम्। (భారతం 1.219.31)”
అంటూ అవమానంతో కుతకుతలాడిపోయాడు. యాదవులందరూ బలరాముని సమర్థిస్తూ “పదండి పదండి” అంటూ రణనినాదాలు చేశారు.
వారికి ఇదొక పరువు సమస్య అయింది!
కాని, శ్రీకృష్ణుడు సుభద్రకు అర్జునుడు తగిన జోడీ అని, స్వయంవరంలో సుభద్ర తనను వరిస్తుందో లేదో అనే సంశయంతో అర్జునుడు ఆమెను ఎత్తుకువెళ్లి ఉంటాడని, అది క్షత్రియులకు అనుచితమైన పనేమీ కాదని నచ్చజెప్పి బలరాముని, మిగిలిన యాదవులను చల్లబరచాడు.
శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో యాదవులు సగౌరవంగా సుభద్రార్జునులను ద్వారకకు తిరిగి తీసుకుని వచ్చి, వారికి వివాహం చేశారు. కాలక్రమేణ వారిరువురికీ జన్మించిన అభిమన్యుడు యాదవులందరికీ ముద్దుల మేనల్లుడు కావడం తెలిసిందే.

5 సాంబుడు
జాంబవతీశ్రీకృష్ణుల కుమారుడు సాంబుడు. దుర్యోధనుని కూతురైన లక్ష్మణను ఇష్టపడ్డాడు. ఆమెను స్వయంవరసభనుండి ఎత్తుకుపోయాడు.
సాంబుడు చేసిన పనికి కౌరవులు ఆగ్రహంతో ఊగిపోయారు. “పట్టండిరా ఈ దుర్మార్గుడిని. మనం దయదలచి ఇచ్చిన భూమిని ఏలుకుంటున్న ఈ వృష్ణీయులు (యాదవులు) ఏమి చేస్తారో చూద్దాం.
बध्नीतेमं दुर्विनीतं किं करिष्यन्ति वृष्णयः।
येस्मत्प्रसादोपचितां दत्तां नो भुञ्जते महीम्।“ (భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)
అని మీదపడి బంధించారు.
యాదవులంటే వారికి చిన్నచూపు. వారు తమ పిల్లను చేసుకొనడం తమకు పరువు తక్కువగా కౌరవులు భావించారు!
ఈ విషయం తెలిసిన యాదవులు సాంబుడిని విడిపించుకునేందుకు యుద్ధసన్నద్ధులయ్యారు. కాని, బలరాముడు యాదవకౌరవవంశాలవారికి నడుమ కలహం వద్దని, శాంతిని కోరి ఉద్ధవుని రాయబారిగా పంపాడు. భీష్మాదివృద్ధులు ఎంత నచ్చజెప్పినా వినకుండా దుర్యోధనాదికౌరవులు మాత్రం అహంకారంతో మిడిసిపడ్డారు.
“ఆహా! కాలమహిమ కాకుంటే కాళ్ల దగ్గర పడి ఉండాల్సిన చెప్పులు కిరీటం ఉండవలసిన తలమీద ఉండగోరుతున్నాయి కదా?
अहो महच्चित्रमिदं कालगत्या दुरत्यया।
आरुरुक्षत्युपानद्वै शिरो मुकुटसेवितम्।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.24)
మన పాండురాజు వారి కుంతిని చేసుకున్నాడు. మన అర్జునుడు వారి సుభద్రను చేసుకున్నాడు. ఇలా కాస్త బంధుత్వం కలిసింది కదా అని మన ప్రక్కనే కూర్చునేందుకు సాహసిస్తున్నారు. వీరు మాకు చెప్పవచ్చారా?” అంటూ అహంకరించి బలరాముని మాటలను తిరస్కరించారు.
బలరాముడికి వొళ్లు మండింది. “ఏమిటేమిటీ? మేము చెప్పులమూ, వారేమో తలకాయలూనా?
उपानहः किल वयं स्वयं तु कुरवः शिरः।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.38)
ఈ రోజు భూమిమీద కౌరవులు లేకుండా చేస్తాను
अद्य निष्कौरवीं पृथ्वीं करिष्यामि। (భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)”
అంటూ హస్తినాపురాన్ని తన హలంతో లాగి గంగలోనికి నూకేందుకు ఉద్యమించాడు. ఆ దెబ్బకు హస్తినాపురం ఊగిపోయింది. కౌరవులందరూ హడలిపోయి, సాంబుడిని, లక్ష్మణను బలరామునికి అప్పగించి, క్షమాపణలు కోరి, రక్షించమన్నారు. దయాళువైన బలరాముడు సరేనని, వారు సమర్పించిన కానుకలను, వధూవరులను వెంటబెట్టుకుని ద్వారకకు చేరుకున్నాడు.
గొడవ చల్లబడింది.

6 మధువు
రావణాసురుని పినతల్లి అనల. ఆమెకు కుంభీనసి అనే కూతురు ఉండేది. ఆమెను మధువు అనే ఒక రాక్షసుడు ఇష్టపడ్డాడు. పేరుకు రాక్షసుడే అయినా దేవతలకు మంచి మిత్రుడు.కాని,రావణాసురుని పట్ల భయంతో ఏమి చేయాలో తెలియక ఊరుకున్నాడు.
ఇలా ఉండగా ఒకసారి రావణాసురుడు జైత్రయాత్రకు వెళ్లాడు. యుద్ధోన్మాదంలో తన చెల్లెలైన శూర్పణఖకు భర్త అయిన విద్యుజ్జిహ్వుని కూడా గుర్తించలేక స్వయంగా నరికి చంపివేశాడు. శూర్పణఖ వచ్చి ఏడ్చి మొత్తుకుంటూ ఉంటే ఆమెను పోయి దండకారణ్యంలో సుఖంగా ఉండమని పంపించేశాడు రావణుడు.
వారు ఈ గొడవల్లో ఉండగా సమయం చూసుకుని మధువు కుంభీనసిని ఎత్తుకుపోయాడు.
రావణుడు విజయం సాధించి, వెనక్కు వస్తూ దారిలో కంటికి అందంగా కనబడిన రాజస్త్రీలను, ఋషిస్త్రీలను, గంధర్వస్త్రీలను,పన్నగస్త్రీలను, రాక్షసస్త్రీలను, అసురస్త్రీలను, మానుషస్త్రీలను, యక్షస్త్రీలను, దానవస్త్రీలను ఎవరి పట్లా ప్రత్యేకపక్షపాతం చూపకుండా అపహరించాడు. వారు వివాహితలా లేక అవివాహితులా అన్నది కూడా గమనించలేదు. తనకు అడ్డుపడిన వారి వారి బంధువులను యథేష్టంగా సంహరించాడు.
दर्शनीयां हि रक्षः कन्यां स्त्रीं वाऽथ पश्यति।
हत्वा बन्धुजनं तस्या विमाने तां रुरोध ह।। (రామాయణం7.24.2)
ఆ స్త్రీల విలాపంతో లంక ప్రతిధ్వనించిపోయింది. “ఒరే దుర్బుద్ధీ! నువు స్త్రీమూలంగానే నశిస్తావురా” स्त्रीकृतेनैव प्राप्स्यते दुर्मतिर्वधम्। (రామాయణం7.24.2)
అంటూ వారు శపించేశారు.
ఇంతలో మధువు తన చెల్లెలైన కుంభీనసిని ఎత్తుకుపోయాడన్న వార్త తెలిసింది. దానితో ఆ రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. లోకవిజేత అయిన తన చెల్లెలినే ఎవడో ఎత్తుకుపోతాడా? ఎంత ధైర్యం? మళ్లీ ఇక్కడ రావణాసురుడికి కూడా పరువు సమస్యే!
అతడి కళ్లు ఎర్రగా మారిపోయాయి. “వెంటనే రథం సిద్ధం చేయండిరా. రాక్షసవీరులు సిద్ధం కండిరా. మారణాయుధాలు పట్టుకుని బయల్దేరండిరా” అని గర్జిస్తూ మధుపురానికి దండయాత్ర చేశాడు.
అయితే అతడి చెల్లెలు కుంభీనసి వచ్చి అన్న కాళ్ల మీద పడి, “అన్నా, జరిగిందేదో జరిగిపోయింది. ఇపుడు నా భర్తను చంపి, నన్ను విధవను చేయవద్దు” అని వేడుకుంది.
రావణుడు కాసేపు ఆలోచించి, “సరే, నీమీద దయతో అతడిని నేను చంపబోవటం లేదు. నీ భర్త ఎక్కడ? త్వరగా రమ్మను. అతడితో కలసి, స్వర్గలోకాన్ని జయించేందుకు బయల్దేరుతాను” అన్నాడు.
क्व चासौ तव भर्ता वै मम शीघ्रं निवेद्यताम्।
सह तेन गमिष्यामि सुरलोकं जयावहे।। (రామాయణం 7.25.44,45)
మొత్తానికి అలా రాజీ కుదిరింది. తరువాత రావణుడు ఎత్తుకువచ్చిన స్త్రీల శాపం ఫలించి సీత కారణంగా రాముడి చేతిలో చనిపోయాడు.
అయితే రావణుడి బావ అయిన మధువుమహాశివభక్తుడు. మహా ధర్మాత్ముడు. జనరంజకంగా పరిపాలన చేశాడు.కాని, ఆ కుంభీనసీమధువుల కుమారుడైన లవణాసురుడికి మాత్రం మేనమామ అయిన రావణాసురుడి బుద్ధులు వచ్చాయి. వాడు పెట్టే బాధలను సహించలేక మునులు రాముడికి మొర పెట్టుకున్నారు. శత్రుఘ్నుడు రాముని ఆజ్ఞను పొంది ఆ లవణాసురుడిని సంహరించాడు.
***

ఈ విధంగా తమ కుటుంబానికి చెందిన స్త్రీని ఎవడో తమ అనుమతి లేకుండా పెండ్లాడడం అనేది ఎంతటివారికైనా ఇజ్జత్ కా సవాల్. అది ఒక మానసికమైన పీడ.
కురువంశంవారు తమ కన్యను ఎత్తుకుపోయారని యాదవులు మండిపడ్డారు. యాదవులు తమ కన్యను ఎత్తుకుపోయారని కురువంశంవారు కుతకుతలాడిపోయారు. రాక్షసులు తమ స్త్రీని ఎత్తుకుపోయారని మానవులు వగచారు. మనిషి మా కన్యను వరిస్తాడా అని రాక్షసులు కోపగించుకున్నారు. ఎవరూ తక్కువ తినలేదు.

పరువు ఎవడబ్బ సొమ్ము? ఎవరికి ఆ పరువు బరువు?

అయితే ఈ కథలన్నిటిలోనూ గమనించవలసింది ఏమిటంటే –

ప్రతిచోటా బలవంతులే గెలిచారు.
ఓడినవారు చాలావరకు రాజీకొచ్చారు.
అప్పుడైనా ఇప్పుడైనా జరిగేది అదే.

కాబట్టి, ఇప్పటి ఆశావహులు ఎవరైనా సరే, స్వయంగా తమకు తగినంత బలం లేకుండా, బలవంతుల ఇష్టం లేనిదే బలవంతుల కన్యల జోలికి పోరాదు. బలం అంటే ఆరోజుల్లో పరాక్రమం అయ్యుండవచ్చు. ఈరోజుల్లో ధనం, పలుకుబడి కూడా.

బలవంతుడు మరొక బలవంతుడినే ఇష్టపడతాడు, అతడితోనే రాజీ పడతాడు. ప్రపంచమంతటా ఇదే సహజం.

అంతే కాదు, బలవంతుడు అర్హత కలిగిన వినయవంతుడిని కూడా ఇష్టపడతాడు. శుక్రాచార్యులవారు తన కూతురును క్షత్రియుడైనప్పటికీ వినయవంతుడైన యయాతిరాజుకు సంతోషంగా ఇచ్చి పెళ్లి చేశాడు.

అంతేగాని, చెత్త చెత్త సినిమాలలో చూపినట్టు పోకిరీతనంతో బలవంతుల జోలికి పోయి భంగపడకండి, సమాజంలో అందరినీ మాకు న్యాయం చేయండి అంటూ దేబిరించకండి.

బలమా? అర్హతతో కూడిన వినయమా?
ఏదో ఒకటి ఎంచుకోండి.

కాబట్టి, ఓ ఆశావహులారా! ఈ రెండిటిలో ఏదో ఒకటి లేకుండా పనికిమాలిన సాహసాలు చేసి, దానికి తగిన ప్రతిఫలం అనుభవించి, మీ సమస్య తప్ప మరో సమస్య సమాజంలో మరేమీ లేనట్టు ఊరికే గగ్గోలు పుట్టించడాలు మానుకోండి.

Saturday, 28 July 2018

శ్రీకృష్ణుడితో ఇంటర్వ్యూ - 2

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ:
((రెండవ భాగం))

ప్రశ్న 13
మీ మాటలు వింటే ధర్మరాజు మీద మీకు కాస్త కోపం ఉన్నట్టుందే?

కృష్ణుడు:
ఎందుకు ఉండదూ? ఎలాగో కష్టపడి యుద్ధాన్నంతా ఓ కొలిక్కి తెచ్చామా? దాదాపు దుర్యోధనుడొక్కడే మిగిలిపోయాడు. మడుగులో దాక్కున్నాడు. అతడిని యుక్తిగా ఏదో ఒక రకంగా బయటకు రప్పించాము. ఈలోగా ధర్మరాజు - "ఓయ్ దుర్యోధనా! మా పాండవులు ఐదుగురిలో ఎవరో ఒకరిని ఎంచుకో. వారితో నీకు నచ్చిన ఆయుధంతో యుద్ధం చేసి గెలు చూద్దాం. ఏ ఒక్కర్ని గెలిచినా మొత్తం రాజ్యాన్ని నీకే ఇచ్చేస్తాను" అనేశాడు. అపుడు నాకు ఎంత కోపం వచ్చిందో!

ప్రశ్న 14
అయినా, దుర్యోధనుడు మంచివాడు, నిజాయితీపరుడు కదా! అందుకే ఏ సహదేవుడినో ఎంచుకుని ఓడించకుండా తనకు తగిన జోడీ అని భీముడిని ఎంచుకున్నాడు! లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది?

కృష్ణుడు:
దుర్యోధనుడికి నిజాయితీనా? ఆ మాత్రం నిజాయితీ ఉంటే పాండవులు అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన వెంటనే వారి రాజ్యాన్ని వారికి ఇచ్చి ఉండాల్సింది.

సరే, ప్రస్తుతానికి వస్తే, ధర్మరాజు సవాలును స్వీకరించి మీరన్నట్టు ఏ సహదేవుడినో ఎంచుకొని గదతో పడగొట్టి రాజ్యాన్ని సంపాదించేవాడే. కానీ, అతడు అలా చేయకపోవడానికి కారణం నిజాయితీ కాదు, మంచితనం కూడా కాదు, అలా చేస్తే అతడి పిరికితనానికి, కక్కుర్తితనానికి జనాలు నవ్వుకొనేవారు. వెక్కిరించేవారు. అభిమానధనుడని పేరుపొందిన దుర్యోధనుడికి అటువంటి అవహేళన చావుకంటే దుర్భరం. జనాల మాటలు వినలేక గుండెలు పగిలి చచ్చుండేవాడు.

అలాగని అతడు భీముడిని కూడా తన ప్రత్యర్థిగా ఎంచుకోలేదు. "మీలోనే ఎవరైనా రండి, మీలోనే ఎవరైనా రండి, మట్టి కరిపించేస్తా, సవాల్!" అంటూ ప్రగల్భాలు పలికాడు. ఆ మాటల్లో ఏ నకులుడో సహదేవుడో రాకపోతారా అనే ఆశ కూడా ఉంది. వారంతట వారే వచ్చి తన చేతిలో చస్తే అది తన తప్పుగా ఎవరూ భావించలేరు కదా? తనకు అటు రాజ్యమూ వస్తుంది, ఇటు అవహేళన చేసేవారు కూడా ఎవరూ ఉండరు అనే దురాశ అతడిది. కానీ పాపం, అతడి ఆశ చెల్లలేదు. అతడు చేసిన సవాలును భీముడే స్వీకరించి ముందుకొచ్చి అతడిని మట్టికరిపించాడు.

ప్రశ్న 15
అసలు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది మీరే అని చాలమంది అంటారు?

కృష్ణుడు:
దుర్యోధనుడు భీముడికి విషం పెట్టినపుడు, ఆ భీముడికి కాళ్ళు చేతులు కట్టేసి నీటిలోని తోసి చంపదలచినపుడు నేను చాల చిన్నపిల్లవాడిని.

అప్పటికి నేను ఇంకా యశోదానందుల బిడ్డడిననే అనుకుంటూ ఉన్నాను. అప్పటికి కుంతి మా అత్త అని తెలియదు. పాండవులు మా బావలు అని తెలియదు. మధురానగరిలో రాజకీయాలు కూడా తెలియవు, కంసుడు నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని కూడా తెలియదు. ఏదో అమాయికంగా ఆవులు కాచుకుంటూ, మిగిలిన పిల్లలతో ఆడుకుంటూ, మా జోలికి వచ్చిన చిన్న చిన్న పాములను కాలితో తొక్కేసి తరిమేస్తూ - ఇలా బయటి ప్రపంచం తెలియకుండా కాలం గడిపేవాడిని. అలాంటి నేను ఆ సమయంలో హస్తినాపురానికి వచ్చి భీముడికి విషం పెట్టమని దుర్యోధనుడికి చెప్పానా?

ఏమయ్యా, ఇది శకునిని అడగవలసిన ప్రశ్న కదా, నన్ను అడుగుతున్నారేమిటి?

ప్రశ్న 16
అలా కాదు, మీరు తలచుకుని ఉంటే అసలు యుద్ధానికి కారణమైన జూదమే జరగకుండా ఆపగలిగి ఉండేవారు కదా?

కృష్ణుడు:
ఆ సమయంలో మా యాదవులమీద కక్షగట్టిన సాళ్వరాజు, సౌభరి అనే విమానాన్ని ఎక్కి వచ్చి ద్వారకమీద దాడి చేశాడు. నేను మా వారితో కలసి వాడితో యుద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్నాను. అదే సమయంలో ఇక్కడ జూదం జరిగింది. లేకుంటే నేను పిలవకున్నా ఈ జూదానికి వచ్చేవాడినే, జూదం జరగకుండా చూసేవాడినే.

ప్రశ్న 17
కాదు, కౌరవులు పాండవులు జూదమాడుతూ ఉండగా మీరు ద్వారకలో 'విన్నావా యశోదమ్మా' అనే ఒక నృత్యరూపకాన్ని చూస్తూ మైమరచి ఉన్నారు కదా?

కృష్ణుడు:
ఏమయ్యా? మాయాబజార్ సినిమాకు నువ్వు వీరాభిమానివిలా ఉన్నావే? మాయాబజార్ ఒక కల్పితకథ. అసలు మా అన్న బలరామునికి శశిరేఖ అనే కూతురే లేదు. పాండవుల వనవాసకాలంలో సుభద్రాభిమన్యులు పూర్తిగా
ద్వారకలోనే నివసించారు. దేవకాంత, అతిసౌమ్యురాలూ అయిన మా వదిన రేవతిగారిని తుచ్ఛమైన డబ్బుకు ఆశపడే సామాన్యస్త్రీగా చిత్రీకరించారే? సరే, లోకం ఇలా ఉంటుంది సుమా అని జానపదులకు అర్థమయేలా చెప్పేందుకు ఈరకమైన సినిమా తీశారులే అని జాలిపడి మేము ఊరుకున్నాము.

ప్రశ్న 18
కానీ, మీరు ఎక్కడో దూరాన ఉన్నప్పటికీ, ద్రౌపదికి పరాభవం కలుగకుండా కాపాడారు కదా? అంత చేసిన వారు అదే చేత్తో దూరం నుండే జూదాన్ని ఎందుకు ఆపలేకపోయారు?

కృష్ణుడు:
ఎందుకు ఆపలేదు? ధృతరాష్ట్రుడి మనసులో భయం పుట్టించాను. ద్రౌపదికి వరాలు ఇచ్చే మిషతో జూదంలో పాండవులు ఓడిపోయినదంతా తిరిగి వారికి ఇప్పించాను. అంతా సవ్యంగానే ఉండింది.

ఈలోగా రెండోసారి కూడా జూదానికి పిలుపు వచ్చింది. ధర్మరాజు తగుదునమ్మా అని మళ్ళీ వెళ్ళాడు. రెండోసారి పన్నెండేళ్ల వనవాసము, ఒక యేడు అజ్ఞాతవాసము అనే నియమంతో మళ్ళీ పందెంలో ఓడిపోయాడు.

ఇలా ఎన్ని సార్లు భక్తులను దేవుడు కాపాడాలి? కష్టం అనుభవిస్తేనే గాని సుఖం విలువ తెలియదు. అందుకని రెండోసారి నేను కాపాడే ప్రయత్నం చేయలేదు. పైగా రెండో సారి కూడా అడ్డం తగిలి ఉంటే "తప్పులు చేసిన ప్రతిసారీ దేవుడొచ్చి కాపాడతాడు" అనే మానసికదౌర్బల్యం జనాలందరికీ కలిగేది. అది ప్రమాదకరం. "అసలు తప్పులే చేయకుండా ఉండాలి" అనే ఆదర్శం ప్రచారం కావాలి. అందుకే రెండో సారి ఊరుకున్నాను.

ప్రశ్న 19
కానీ మీకు తరువాతనైనా పాండవులను గట్టెక్కించే శ్రమ తప్పలేదు కదా?

కృష్ణుడు:
నిజమే. కానీ, ఎంత శక్తిమంతులు అయినా పొరపాట్లు చేస్తే కష్టపడవలసి ఉంటుంది సుమా అనే భయం అందరికీ ఉండాలంటే ఆ మాత్రం శ్రమ పడక తప్పదు.

ప్రశ్న 20
కానీ, మీరు ఆనాడు అలా ఊరుకొనడం వల్లనే కదా, యుద్ధం సంభవించింది?

కృష్ణుడు:
దీనికి నేను ముందే సమాధానం చెప్పాను. క్షత్రియుడు కోరుకునేది ఇటువంటి మరణాన్నే. తెలిసి కూడా అధర్మంవైపు నిలబడిన వారు మరణించారు. ధర్మం కోసం ప్రాణాలర్పించినవారు ధన్యులయ్యారు.

ప్రశ్న 21
క్షత్రియులు అలా మరణిస్తే మంచిదని మీరంటున్నారు. కాని, ఆ మరణించిన వీరుల కుటుంబాలలో ఎంతటి సంక్షోభం కలిగి ఉంటుందో కదా!

కృష్ణుడు:
మీ ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ ఈ విషయం దగ్గరకే వచ్చి ఆగుతున్నాయి. ఆవు వ్యాసంలాగా. (నవ్వులు) అసలు భగవద్గీతలో అర్జునుడి విషాదం కూడా ఇదే కదా!

క్షత్రియులు అంటేనే ప్రాణాలకు తెగించి ఉండే జాతి అని ఇంతకు ముందే చెప్పాను. అసలు ఏ వృత్తికి చెందినవాడైనా, ఇంటి బయటకు వెళ్లినవాడు మరలా ఇంటికి క్షేమంగా తిరిగి రాగలడని ఎవరైనా హామీ ఇవ్వగలరా? క్షత్రియవృత్తిని అవలంబించిన వారిలో ఈ ప్రమాదశాతం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ కుటుంబం వారు చిన్నతనం నుండి ఆ సంక్షోభానికి సిద్ధపడి బ్రతికేలా మానసికమైన సన్నద్ధత ఉంటుంది.

నాటి సమాజం నేటి సమాజం వంటిది కాదు, వారి కుటుంబానికి మంచి గౌరవమర్యాదలు ఉంటాయి. ఆ యోధుల కుటుంబాలకు రాజుల అండదండలు ఉంటాయి. వారికి ఆర్థికసంక్షోభం ఉండే సమస్య లేదు. అయితే మనిషి లేకపోవడం అనే కొరతను ఎవరూ తీర్చలేరు. కానీ, క్షత్రియజాతికి గుండెనిబ్బరం జన్మతః సిద్ధిస్తుంది.

సుఖదుఃఖాలు శాశ్వతాలు కావు. "ధర్మ ఏకో హి నిశ్చలః." ధర్మం ఒకటే శాశ్వతమైనది. కాబట్టి, నేటి మనుషులను, నేటి సమాజాన్ని చూసిన కళ్ళతో నాటి మనుషులను, నాటి సమాజాన్ని అంచనా వేయకండి. మళ్ళీ ఇటువంటి ప్రశ్నను వేస్తే మీదగ్గర అడగడానికి మరే ప్రశ్నలూ లేవనుకుని ఇంటర్వ్యూ ను ఇంతటితో ముగిద్దాము.

ప్రశ్న 22
స్వామీ, స్వామీ, కోప్పడకండి. మరో రెండు మూడు ప్రశ్నలున్నాయి.
మరి యుద్ధంలో అబద్ధమాడమని మీరు ధర్మరాజుకు చెప్పారా లేదా? అది తప్పు కాదా? గదాయుద్ధంలో దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టమని భీముడికి చెప్పారా లేదా? అది తప్పు కదా?

కృష్ణుడు:
అవునయ్యా. అవును ధర్మరాజుకు, భీముడికి నేను అలా చెప్పిన మాట నిజమే. అసలు నా అవతారరహస్యాలలో అది ఒకటి.

కలియుగంలో దురాచారులెందరెందరో భారతానికి వస్తారు. వారు చేసే ప్రతి వెధవ పనిని కప్పిపుచ్చుకుంటూ భారతీయులు చేసే ప్రతిపనినీ తప్పు పడుతూ ఉంటారు. వారు చంపితే వీరత్వం అంటారు. వారికి ఎదురుతిరిగి భారతీయులు చంపితే క్రూరత్వం అంటారు. ఈరకంగా వారు తప్పు చేస్తే ఆనాటి అవసరం అలా చేయించింది అంటారు. భారతీయులు తప్పనిసరై అలా చేయబోతే నానా యాగీ చేస్తారు. భారతీయులు ఏమి చేయాలో తెలియని ధర్మసంకటంలో ఇరుక్కుని నిస్సహాయులౌతారు. వారికి నేను కర్తవ్యం బోధించదలచాను.

మాయాచారో మాయయా బాధితవ్యః.
సాధ్వాచారో సాధునా ప్రత్యుపేయః..

మాయగాళ్లని మాయతోనే కొట్టాలి.
మంచివారితో మంచిగానే వ్యవహరించాలి.

ఇలా స్వయంగా నేను చెప్పినప్పటికీ నిజంగా అలా మాయ చేసి దెబ్బ కొట్టవచ్చునా అని వెనుకంజ వేస్తూ పిరికివాళ్ళనిపించుకొనేంత వెర్రి వాజమ్మలు కలియుగభారతీయులు. అందుకే వారికి ఆదర్శంగా స్వయంగా నేనే కురుక్షేత్రయుద్ధంలో అలా చేసి చూపించవలసి వచ్చింది. ఈ కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం అబద్ధమాడినా పరవాలేదు. నియమం తప్పినా పరవాలేదు. అటువంటి సందర్భాలలో తప్పొప్పులు ఏమి చేసినా నాకు వదిలిపెట్టండి, కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించండి అని చెప్పదలిచాను.

ప్రశ్న 23
ధన్యులం స్వామీ, ధన్యులం. మీ ఉపదేశాన్ని భారతీయులందరూ సక్రమంగా గ్రహిస్తే వారికి ఇక తిరుగు ఉండదు. కాని, మీకు పక్షపాతం దేనికి స్వామీ, ఒకవైపు "సర్వత్ర సమదర్శనః" అంటారు. కానీ అంత గొప్ప భగవద్గీతను అర్జునుడికి మాత్రమే బోధించారు.

కృష్ణుడు:
అయ్యో పిచ్చోడా, నేను వేరు, అర్జునుడు వేరు అనుకుంటున్నావా?

यो2हं तमर्जुनं विद्धि, यो2र्जुनः सोहमेव तु।
నేనెవరిననుకుంటున్నావో ఆ నన్ను అర్జునుడనే తెలుసుకో.
ఇతడు అర్జునుడు అని ఎవరిని గూర్చి అనుకుంటున్నావో అతడు నేనేనని తెలుసుకో.

భగవద్గీతను నాకు నేనే బోధించుకున్నా. అది నా ఆత్మప్రబోధం.

ప్రశ్న 24
శ్రీకృష్ణా, నమో నమః. నమో నమః. పరమానందం. పరమానందం.
కానీ, మేము మీరన్నట్టే సామాన్యులం కదా స్వామీ, మీరు ఆ భగవద్గీతను దుర్యోధనుడికి చెప్పి ఉంటే యుద్ధం ఉండేది కాదేమోనని మా ఆశ.

"भक्तो2सि मे सखा चेति रहस्यम् एतदुत्तमम्"

అంటూ అర్జునుడికి మాత్రమే చెప్పారు కదా.

కృష్ణుడు:
(నవ్వులు) ఏమయ్యా తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా?

రాయబారానికి వెళ్ళినపుడు నేను మంచి మాటలు చెప్పనే లేదంటావా? దుర్యోధనుడు కాస్త ఓపికగా విని ఉంటే ఆ భగవద్గీతను అప్పుడే చెప్పి ఉండేవాడినేమో? కానీ, నా మాటలు వినే ఓపిక ఆయనకెక్కడిది? ఆయన నా మాటలు వినకుండా తన మిత్రుల మాటలు విన్నాడు. నన్నే బంధించే ప్రయత్నం చేశాడు.

అప్పుడు కూడా సభామధ్యంలో నా విశ్వరూపం ప్రదర్శించాను. భయపడ్డాడు కానీ అర్థం చేసుకోలేకపోయాడు. తరువాత నన్ను ఇంద్రజాలం చేసే గారడీ వాడినంటూ హేళన చేశాడు.

"యద్భావం తద్భవతి" అని వినలేదా?
"యే యథా మామ్ ప్రపద్యన్తే తాన్ తథైవ భజామ్యహమ్"
(భగవద్గీత 4.11)

నన్ను గూర్చి ఎవరు ఏమనుకుంటే నేను వారికి అలాగే కనిపిస్తాను. అనిపిస్తాను. నువ్వేమనుకుంటావో నీ యిష్టం.

ప్రశ్న 25
స్వామీ, మీ మాటలు నాకు అయోమయం కలిగిస్తున్నాయి. ఒకవైపు అన్నీ చేసే భగవంతుడిని నేనే అంటారు. మరో వైపు నీ భావన ఎలా ఉందో అలాగే జరుగుతుంది అంటారు.  అందుకనే అర్జునుడిలా నేను నిన్ను అదే విధంగా ఆశ్రయిస్తున్నాను.

కార్పణ్యదోషోప హతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః.
యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే2హం శాధి మాం త్వాం ప్రపన్నమ్.

కృష్ణుడు:
ఇది ప్రశ్నలా లేదే?

*****
ఉపసంహారం:
******
అలా ఇంటర్వ్యూ అర్ధాంతరంగా ముగిసిపోయింది.

ఇంటర్వ్యూ చేసేటపుడు ఎదుట ఉన్నవారు ప్రఖ్యాతి చెందిన వ్యక్తి అయితే అతడిని అయోమయంలో పడేస్తూ అతడి చేత వివాదాస్పదవ్యాఖ్యలు చేయిస్తూ అతడికి తెలియకుండా అతడి మాటల మీద ప్రజాభిప్రాయం కోరుతూ, రాచి రంపాన పెట్టడమే ఇంటర్వ్యూ అని కదా ఈరోజుల్లో భావం?

కానీ, అలా చేస్తూ చేస్తూ అతని మాటలు బలేగా నచ్చేసి అతనికి భక్తుడైపోయి నువ్వే నాకు దిక్కంటే ఆ ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారం అవుతున్నప్పటికీ కట్ చెప్పాల్సిందే కదా?

అలా నేను చేస్తున్న/చేసిన ఇంటర్వ్యూ మధ్యలో ఆగిపోవలసి వచ్చిందన్న మాట. అయినప్పటికీ ఆయననుండి సాధ్యమైనన్ని ఎక్కువ విషయాలను రాబట్టాననే భావిస్తున్నాను.

ఈ ఇంటర్వ్యూ చదివినవారికి, విన్నవారికి, కన్నవారికి అందరికీ నిశ్చితమైన శ్రేయస్సు కలుగుగాక!

ఇంటర్వ్యూ రెండవ భాగం కూడా శ్రీకృష్ణార్పణమస్తు.

శ్రీకృష్ణునితో ఇంటర్వ్యూ 1

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ:
((మొదటి భాగం)) 

ప్రస్తావన:
అరిందమనుడి బుఱ్ఱ నిండా ప్రశ్నలే ప్రశ్నలు. 
ఒకోసారి అర్ధరాత్రి పూట కూడా నిద్రనుండి లేపి మరీ ప్రశ్నలు వేస్తుంటాడు. వాడికి అందరు దేవుళ్లకంటే కృష్ణుడంటేనే ఎక్కువ ఇష్టం. రేపటి దినాన కృష్ణాష్టమికి హరే రామ హరే కృష్ణ గుడికి పోదాం అని చెబుతూ చెబుతూ వాడు నన్ను నిన్న సాయంత్రం అడిగిన ప్రశ్న ఇదీ -

"అప్పన్నా, కృష్ణుడికి ఎవరంటే అందరికంటే ఇష్టం?"

వెంటనే సమాధానం చెప్పాను: "అర్జునుడంటే ఇష్టం."

"మరి".. అని మొదలుపెట్టాడు వాడు. (పాచికలు జూదం అనే పదాలు వాడికి ఇంకా అలవాటు పడలేదు. చేతితో వాటిని వేస్తున్నట్టు అభినయిస్తూ) "ఇలా ఇలా వేసి ఆడుతాడే... వాడు ఇష్టమని ఆ సినిమాలో చెప్పాడు కదా?" అని అడిగాడు.

మాయాబజార్ సినిమాలో శకుని ఇష్టమని చెప్పించిన విషయం గూర్చి అడుగుతున్నాడని కాసేపటికి అర్థమైంది.

"సినిమాలో తీసి చూపించేవన్నీ నిజం కావు" అని చెప్పాను. ఈలోగా వాడి నేస్తం ఎవడో పిలిచేసరికి ఆడుకోవాలంటూ పారిపోయాడు.

లాభం లేదు,
కొన్ని కొన్ని విషయాలు నేరుగా కృష్ణుడినే అడిగి కన్ ఫామ్ చేసుకోవాలని నిశ్చయించుకుని

"కృష్ణా ఇంటర్వ్యూ ఇస్తావా" అని అడిగాను.

ఓ వైపు ప్రపంచమంతా ఈరోజు ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటున్నా, నా కోరికను మన్నించి ఆయన "సరే" అని అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఈ ఇంటర్వ్యూ ను ఈ రోజు మీముందుకు తేగలిగాను.

***
ఇంటర్వ్యూ మొదలు:
***

ప్రశ్న 1
స్వామీ, కృష్ణా, మీకు సూటిగా ఒక ప్రశ్న. మీకు అందరికంటే ఎవరు ఇష్టం?

కృష్ణుడు:
నువ్వే చెప్పావు గదయ్యా అరిందమనుడికి. మళ్ళీ సందేహం ఎందుకు? నాకు అర్జునుడంటేనే అందరికంటే ఇష్టం.

ప్రశ్న 2
అర్జునుడిలో ఏమి చూసి అంతగా ఇష్టపడ్డారు?

కృష్ణుడు:
అర్జునుడిలో ఉండే సుగుణాలు ఒకటా రెండా?

అర్జునుడి ఆత్మవిశ్వాసం మొదటి కారణం. "నేను కోరిన గురుదక్షిణ ఎవరు ఇస్తారు?" అని గురువు అడిగితే చిన్నతనంకొద్దీ మిగిలిన రాజకుమారులు అందరూ అదేమిటో అని భయపడిన క్షణాన అర్జునుడు ఒక్కడే "నేనిస్తాను" అని ధైర్యంగా చేయి ఎత్తాడు.

క్షత్రియుడిగా పరాక్రమవంతుడు కావడం తన లక్ష్యంగా భావించి అందుకు అహర్నిశలు శ్రమించే అతడి దీక్ష అనితరసాధ్యం. చిన్నతనంలో రాత్రులు చీకట్లో కూడా బాణాలు వేస్తూ అభ్యాసం చేసినా, గొప్ప తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రం సాధించినా అతడికతడే సాటి.

మహా ప్రతాపవంతుడిని అనే గర్వం మనసులో లేకుండా తన చేత ఓడిన వారి పట్ల కూడా అతడు ప్రదర్శించే సౌమ్యత చాలదూ అతడిని మహానుభావుడు అనడానికి? ఆ మాటలకు ముగ్ధుడైపోయి కాదూ, ద్రుపదుడు అర్జునుడికి ఇవ్వడానికి తనకో కూతురు ఉంటే బాగుండుననుకున్నది?

విజయం సాధించాక ఒళ్ళు మరచి విశృంఖలంగా ప్రవర్తించేవారిని చూస్తాం కానీ, అటువంటి ఆనందంలో కూడా సదాచారాన్ని మరువని అతడి నడవడికను పొగడకుండా ఎలా ఉండగలం? "అర్జునా! ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకున్నావు కాబట్టి, ఆమెను నువ్వు పెళ్లాడు” అని ధర్మరాజు అంటే, ఎగిరి గంతేసి పెళ్లి చేసుకోకుండా, "అన్నా, నాకంటే పెద్దవారు మీరు భీమన్న ఉన్నారు కదా, మీ ఇద్దరికీ అయిన తరువాతే నా పెళ్లి" అని చెప్పడం అందరికీ సాధ్యమా? చివరకు తల్లి అయిన కుంతి మాటపై ద్రౌపదిని అన్నదమ్ములందరూ పెళ్ళాడడం వేరే విషయం.

ప్రపంచం తల్లక్రిందులైనా ఒక నియమానికి కట్టుబడి ఉండటం అతనిలో తప్ప వేరెవరిలో చూడగలం? మిగిలిన పాండవులందరూ ఇంద్రప్రస్థంలో హాయిగా రాజభోగాలు అనుభవిస్తూ ఉండగా నియమానికి స్వచ్ఛందంగా కట్టుబడి అతడు పన్నెండు సంవత్సరాలు తీర్థయాత్రలు చేయడం సామాన్యమైన విషయమా?

అర్జునుడికి ఉన్నంతటి ఆత్మనిగ్రహశక్తి వేరెవరికీ లేదు. అంతటి అప్సరస, సాక్షాత్తు ఊర్వశి అతడిపై మరులుగొని వస్తే, "అమ్మా నీవు నాకు తల్లివంటి దానివి" అని పాదాభివందనం చేశాడు కదా?

ఇలా ఇంకా ఇంకా చాలా చెప్పగలను. కానీ ప్రస్తుతానికి ఇవి చాలు.

ప్రశ్న 3
మరి అర్జునుడు అంతటి గుణవంతుడే అయితే - తన గురువు గారైన ద్రోణుడికి ద్రుపదుడు శత్రువు కదా? అటువంటి ఆయన కూతురును పెళ్ళాడి ఎందుకు అతనికి ఎందుకు బంధువు అయ్యాడు?

కృష్ణుడు:
ద్రోణుడు ద్రుపదునితో సంధి కుదుర్చుకున్నాడు కదా. ద్రుపదుడికి దక్షిణపాంచాలరాజ్యం ఇచ్చి, ఉత్తరాన ఉన్న అహిచ్ఛత్రనగరం తన స్వాధీనంలో ఉండేట్టు ఒప్పందం చేసుకున్నారు కదా? ఇక శత్రుత్వం లేదని ద్రోణుడే స్వయంగా ద్రుపదుడితో అన్నాడు కదా? ద్రుపదుడితో బంధుత్వం పెట్టుకుంటే అతడి మనసులో తన గురువుపై ఉన్న ఏ కొద్ది ద్వేషమైనా సమసిపోతుందని భావించాడు. తప్పేముంది?

ప్రశ్న 4
మరి అర్జునుడు గురువుగారి మీదనే బాణాలు వేసిన మాట అబద్ధమా?

కృష్ణుడు:
మీలాంటి వారు భవిష్యత్తులో ఇలా ఆక్షేపిస్తారనే కాబోలు, సభలో పెద్దలందరి ఎదుటా ద్రోణుడు అర్జునుడిని ఒక ప్రత్యేకమైన గురుదక్షిణ కోరాడు. యుద్ధరంగంలో స్వయంగా గురువైన తానే ఎదురైనప్పటికీ వెనుకంజ వేయకుండా యుద్ధం చేయమని అడిగాడు.

आचार्यदक्षिणां देहि ज्ञातिग्रामस्य पश्यतः।
युद्धे2हं प्रतियोद्धव्यो युध्यमानस्त्वयानघ।।
(మహాభారతం.1.138.13&14)

అందుకని అర్జునుడు గురువుగారిమీద బాణాలు వేసి గురుదక్షిణ చెల్లించవలసి వచ్చింది. సరేనా?

ప్రశ్న 5
మరి తాతగారైన భీష్ముడిమీద బాణాలు వేయడం తప్పు కాదా?

కృష్ణుడు:
అయ్యా, మీరు మామూలు మనుషులు. అందువల్ల మామూలుగానే ఆలోచిస్తున్నారు. కాని, భీష్ముడు అర్జునుడు క్షత్రియులు. వారికి సంబంధించి యుద్ధం అనేది పెళ్ళివంటి శుభకార్యం. బాణాలు తగిలి పడిపోయిన భీష్ముడు తన వద్దకు దుర్యోధనుడు పంపగా వచ్చిన శస్త్రవైద్యులను వద్దని రాజులందరితోనూ ఏమన్నాడో తెలుసునా?

"క్షత్రియుడు మంచాన పడి రోగాలతో చనిపోవడం అనుచితం. యుద్ధరంగాన అస్త్రవిద్ధుడై చనిపోవడమే క్షత్రియునికి అత్యుత్తమమరణం".

అలా అర్జునుడు తన తాతగారి కోరికను నెరవేర్చినవాడయ్యాడు సుమా.

ప్రశ్న 6
పక్షపాతం లేకుండా చెప్పండి - కర్ణుడు గొప్పా, అర్జునుడు గొప్పా?

కృష్ణుడు:
వారిద్దరినీ పోల్చి చూడాలనే బుద్ధి జనాలకు ఎందుకు పుట్టింది? వారిద్దరూ యుద్ధంలో పరస్పర ప్రత్యర్థులు కాబట్టి. కాబట్టి, గెలిచినవాడే గొప్ప. అర్జునుడు కర్ణుడిని ఉత్తరగోగ్రహణసమయంలో ఓడించాడు. రెండోసారి నేరుగా కురుక్షేత్రంలో ఓడించాడు.

అసలు అర్జునుడిదాకా ఎందుకు? కర్ణుడు భీముడి చేతిలో ఓడిపోయాడు. అభిమన్యుడి చేతిలో ఓడిపోయాడు. సాత్యకి చేతిలో ఓడిపోయాడు. కానీ, వారందరూ "ఈ కర్ణుడు అర్జునుడిచేతిలోనే చావాలి తప్ప మా చేతిలో కాదు" అని వదిలేయబట్టి బ్రతికిపోయాడు.

అటువంటి మొహమాటాలేమీ లేని ఘటోత్కచుడు దాదాపు కర్ణుని చంపేసేవాడే.
అందుకని ఆ ఆపత్సమయంలో కర్ణుడు అర్జునుడిని చంపడం కోసం దాచుకున్న ఇంద్రుడిచ్చిన మహాశక్తిని ఘటోత్కచుడిపై విసిరేసి మొత్తానికి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బ్రతికి బయటపడ్డాడు.

ప్రశ్న 7
కానీ, ఇంద్రుడు కర్ణుని కవచం లాగేసి శక్తిహీనుణ్ణి చేసేసిన తరువాత కదా, వీరందరి చేతిలో కర్ణుడు ఓడింది?

కృష్ణుడు:
సరే, కాసేపు అలాగే అనుకుందాం.

కానీ, ఘోషయాత్ర సమయంలో కర్ణుడు అర్జునుని శిష్యుడైన చిత్రసేనుని చేతిలో చిత్తుగా ఓడిపోయి జాడ కూడా తెలియకుండా పారిపోయాడు కదా. దానికేమంటారు?

ఈ కర్ణుడు తన నూత్న యౌవనసమయంలోనే తనతో ద్వంద్వయుద్ధం చేయమని అర్జునుడిని సవాలు చేశాడు కదా, కానీ, ఆ మరుసటి రోజే దుర్యోధనుడితోనూ, మిగిలిన కౌరవులతోనూ కలసి ద్రుపదుడి మీద యుద్ధానికి పోయి చిత్తుగా తన్నులు తిని పారిపోలేదా?

ఈ రెండు సందర్భాలలోనూ అతడి ఒంటి మీద సహజకవచకుండలాలు ఉన్నాయి కదా? అవి ఉండడం వల్ల అతడు ఏమాత్రం గెలిచాడేమిటి?

ప్రశ్న 8
మరి కర్ణుడికి గురుశాపం ఉంది కదా?

కృష్ణుడు:
అది అతడు చేతులారా చేసుకున్న పని. దానికి ఎవడు ఏం చేయగలడు? ఈ విషయంలో అర్జునుడికి ఏమి సంబంధం ఉంది? అర్జునుడు స్వయంగా పరశురాముడి చెంతకు వెళ్లి "అయ్యా, దయచేసి కర్ణుడికి శాపం ఇవ్వండి" అని కోరి ఉంటే మీరు తప్పు పట్టవచ్చు.

"సచిన్ టెండూల్కర్ రన్ అవుట్ కాకుండా ఉంటే అతడు సెంచరీ చేసేవాడు, మ్యాచ్ గెలిపించేవాడు" అని మీరు బాధపడితే ఎంత అసంబద్ధమో, ఇపుడు ఈ గురుశాపప్రస్తావన వంటివి అంతే అసంబద్ధం.

ప్రశ్న 9
యుద్ధంలో రథం క్రుంగి పోయి నేల మీద ఉన్న కర్ణుడి మీదకు బాణం వేయమని మీరు అర్జునుడిని ప్రోత్సహించలేదా? అది ధర్మమేనా?

కృష్ణుడు:
ఇప్పుడు మీరే కాదు, సాక్షాత్తు కర్ణుడు కూడా నన్ను ఆ సమయంలో ఇదే మాట అడిగాడు. అపుడు నేను కూడా ఆ కర్ణుడిని అడిగాను -

ఏమయ్యా కర్ణా? "పాండవులు వానవాసాన్ని అజ్ఞాతవాసాన్ని నియమం ప్రకారం ముగించారు కాబట్టి, వారి రాజ్యం వారికి ఇచ్చేయడం ధర్మం" అని నువు దుర్యోధనుడికి ఆ సమయంలో ధర్మాన్ని ఎందుకు గుర్తు చేయలేదు?

భీముడికి విషం పెట్టినపుడు అది అధర్మం అని నీ మిత్రుడికి ఎందుకు చెప్పలేదు?

పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చివేసే ప్రయత్నం అధర్మం అని ఎందుకు చెప్పలేదు?

ద్రౌపదిని నిండుసభలో దుశ్శాసనుడు, మీ ప్రాణమిత్రుడైన దుర్యోధనుడు పరాభవించినపుడు, నువ్వు ఆనందంతో కేరింతలు కొట్టినప్పుడు ఈ ధర్మం ఎందుకు గుర్తుకురాలేదు?

అభిమన్యుడు ఒంటరిగా యుద్ధం చేస్తూ నీలాగే నేలమీద ఉన్నపుడు, అయ్యో అతడు బాలుడు కదా, నిరాయుధుడై ఉన్నాడు కదా అనే కనికరం కూడా లేకుండా ఆరుగురు అతిరథులు అతడిపై విరుచుకుపడి నిర్దాక్షిణ్యంగా చంపేశారు కదా?  ఆ ఆరుగురిలో నువ్వు కూడా ఒకడివి కదా? ఆ సమయంలో అది అధర్మం అని ఎందుకు గుర్తుకు రాలేదు తమరికి?" అని అడిగాను.

ఆవిధంగా నేనడిగిన ప్రశ్నలలో కర్ణుడు ఏ ఒక్కదానికైనా సరైన సమాధానం చెప్పి ఉంటే, "అర్జునా! కాసేపు ఆగు, కర్ణుడు యుద్ధానికి సిద్ధమైన తరువాత బాణాలు వేద్దువు గాని" అని అర్జునుడిని ఆపి ఉండేవాడిని. మీకు ఈ ప్రశ్న వేసే శ్రమ తప్పి ఉండేది.

ప్రశ్న 10
శల్యుడు కర్ణుడిని నిరుత్సాహపరిచాడు కదా?

కృష్ణుడు:
అసలు పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి వస్తున్న శల్యుడిని మాయలతో వశపరచుకుని తన పక్షాన యుద్ధం చేయడానికి ఒప్పించుకున్న దుర్యోధనుడిని అడగండి ఈ మాట. శత్రువు వేలుతో శత్రువు కంటినే పొడవాలని దుర్యోధనుడు అలాంటి ఎత్తు వేశాడు. అదే యుక్తిని ధర్మరాజు అమలు పరిస్తే తప్పు పడతారెందుకు?

ప్రశ్న 11
మీరు కూడా కర్ణుడిని పాండవపక్షానికి రప్పించేందుకు ప్రయత్నించారు కదా?

కృష్ణుడు:
కర్ణుడు పాండవపక్షంలో చేరి ఉంటే యుద్ధం జరుగదు కదా అనే ఆశతో అలా చేశాను. అయినా, ప్రయత్నించడంలో తప్పేమిటి? దుర్యోధనుడు ఏకంగా నన్నే తన పక్షాన యుద్ధం చేయమని కోరేందుకు రాలేదా?

ప్రశ్న 12
అలా ప్రయత్నించినపుడు ద్రౌపది కర్ణుడిని ఆరవ భర్తగా స్వీకరిస్తుందని ఆశ పెట్టారట కదా?

కృష్ణుడు:
ఎవరు అలా చెప్పిన నీచుడు? మీ తెలుగువాళ్లు పరమచెత్త సినిమాలు తీసి అందులో నా పాత్రధారి చేత అటువంటి నీచపు మాటలు పలికించారని విన్నాను. నిజానికి కర్ణుడు పాండవుల పక్షానికి వస్తే అతడు రాజు అవుతాడని 
నేను చెప్పానే కానీ, ద్రౌపది గురించి అలా మాట్లాడే అధికారం నాకెక్కడిది? ఆ సమయంలో జరిగింది జూదమూ కాదు, ద్రౌపదిని తాకట్టు పెట్టేందుకు నేను ధర్మరాజునూ కాదు.

ప్రశ్న 13
మీ మాటలు వింటే ధర్మరాజు మీద మీకు కాస్త కోపం ఉన్నట్టుందే?

కృష్ణుడు:
(అందుకు సమాధానంగా ఏమని ఉంటాడు ఊహించగలరా? ఇంకా కృష్ణుని ఎలాగైనా ఇరికిద్దామని, ఎన్నో సందేహాస్పదమైన విషయాలకు ఆయన నోటిమీదుగానే సమాధానాలను రాబడదామని ప్రయత్నించాను. ఆ మిగిలిన ఇంటర్వ్యూ ను ఈరోజే రెండో భాగంలో చదవండి)

ఇంటర్వ్యూ మొదటి భాగం శ్రీకృష్ణార్పణమస్తు.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...