Showing posts with label Subhashita. Show all posts
Showing posts with label Subhashita. Show all posts

Thursday, 19 March 2020

దండం దశగుణం భవేత్




దండం దశగుణం భవేత్ అట. అంటే దండం పది రకాలుగా ఉపయోగపడుతుంది అని సాందర్భికమైన అర్థం.
ఇక్కడ దండం అంటే తెలుగులో దణ్ణం - నమస్కారం - వందనం కాదు. దండం అంటే కఱ్ఱ అని అర్థం.
వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో సహా నమస్కారం చేయడం వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో మరెప్పుడైనా చూద్దాం.
#దండం వల్ల కలిగే పది ఉపయోగాలు ఇవి -
విశ్వామిత్రాహిపశుషు
కర్దమేషు జలేషు చ।
అంధే తామసి వార్ధక్యే
దండం దశగుణం భవేత్॥
సాధారణంగా కర్ర రైతు చేతిలో ఉంటుంది. అది అతనికి పది విధాలుగా ఉపయోగపడుతుంది.
విశ్వామిత్రాహిపశుషు అనేది సప్తమీవిభక్త్యంతమైన సమాసం. వి/శ్వా/అమిత్ర/అహి/పశుషు అని విడదీసుకోవాలి. విడిగా ఉన్నా మిగిలిన పదాలన్నీ కూడా సప్తమ్యంతాలే.
1 వి = అంటే విహంగమము. పక్షి. పక్షులను తరిమేందుకు కర్ర ఉపయోగపడుతుంది.
2 శ్వా = శ్వానము. కుక్క. కుక్కలను అదిలించేందుకు కర్ర ఉపయోగపడుతుంది.
3 అమిత్ర = శత్రువు. దొంగ. రైతుకు తన పంటను అనుసరించే దొంగే శత్రువు కదా? ఆ దొంగలతో పోరాటానికి కర్ర ఉపయోగపడుతుంది.
4 అహి = పాము. పంట ఇంటికి చేరే వరకు రాత్రనక పగలనక కాపలా కాయాలి. హఠాత్తుగా ఏ రాత్రి పూటో ఏ పామో మీదకు వస్తే ఆత్మరక్షణకు కర్ర ఉపయోగపడుతుంది.
5 పశు = పశువులు. మేకలు గొఱ్ఱెలు ఆవులు దూడలు పంట మేయవస్తే తోలేందుకు కర్ర ఉపయోగపడుతుంది.
6 కర్దమ = బురదనేల. బురదనేలల్లో జారిపోకుండా నిలదొక్కుకుని నడిచేందుకు కర్ర ఉపయోగపడుతుంది. వరి పండించేటపుడు రైతు పొలమంతా బురదనేలే కదా?
7 జల = నీరు. నీటితో నిండిన సెలయేళ్లను దాటేటపుడు నీరు ఎంత లోతు ఉందో, నీటి అడుగున ఎక్కడ రాళ్లు ఉన్నాయో, ఎక్కడ ఇసుక ఉందో తెలుసుకుని ముందడుగు వేసేందుకు కర్ర ఉపయోగపడుతుంది.
8 అంధ = గుడ్డివాడు. గుడ్డివానికి కర్ర దాదాపు కన్నుల్లాగే ఉపయోగపడుతుంది.
9 తమస్ = అంధకారం. కళ్లు కనబడని చీకటిలో కళ్లున్నవానికి గుడ్డివానికి తేడా ఉండదు. అలాంటి సమయాలలో కర్ర కొండంత ధైర్యం ఇవ్వడంతో పాటు చక్కగా ఉపయోగపడుతుంది.
10 వార్ధక్య = ముసలితనం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు క్షీణించడమే ముసలితనం. ఆ సమయంలో కర్ర అదనపు సంచారశక్తిని కలిగించడంలో ఉపయోగపడుతుంది.
ఈ విధంగా దండం దశగుణమన్న మాట. ఈ శ్లోకం ఆంధ్రదేశంలో ప్రసిద్ధమైనది. Naresh Kandula మహోదయా, ఉత్తరాదిలో ఈ శ్లోకానికి పాఠాంతరముంది.
విశ్వామిత్రే చ వార్ధక్యే
రాత్రావప్సు చ కర్దమే।
అంధే సర్పే చ క్రీడాయాం
దండం దశగుణం భవేత్॥
ఇందులో కూడా సప్తమ్యంతపదాలే ఉన్నాయి.
1 వి
2 శ్వా
3 అమిత్ర
4 వార్ధక్య
5 రాత్రి
6 అప్సు = నీళ్లయందు
7 కర్దమ
8 అంధ
9 సర్ప
10 క్రీడా
తెలుగువారి దశగుణాల జాబితాను, ఉత్తరాదివారి దశగుణాల జాబితాను పోల్చి చూడండి. దాదాపు అంతా సమానంగా ఉన్నప్పటికీ చిన్న తేడా ఉంది. ఆ తేడాను కనిపెట్టిన వారికి దండాన్ని సక్రమంగా ఉపయోగించినంత ఫలం లభిస్తుంది.
Chenna Kesava Reddy Madduri మహోదయా, మీరు దండం దశగుణం అని సంతోషపడడమే గాని, ఈ రెండు జాబితాలలో ఏ ఒక్కదానిలోనూ అధ్యాపకుని చేతికి దండం ఇవ్వబడలేదు చూశారా? మన Radha Manduva మేడం గారైతే ఎంత సంతోషపడతారో!
దశకంఠః అంటే రావణాసురుడు.
దశ కంఠాః యస్య సః - దశ కంఠములు ఎవరికి కలవో అతడు అని విగ్రహవాక్యం. బహువ్రీహిసమాసం.
అలాగే, ఈ సందర్భంలో దశగుణం అంటే దండం (కర్ర). దశ గుణాః యస్మిన్ తత్ - దశ గుణములు (ఉపయోగములు) దేనియందు కలవో అది అని విగ్రహవాక్యం. లేదా దశ గుణాః యస్మాత్ తత్ - దశ గుణములు దేనివలన కలుగునో అది అని కూడా చెప్పవచ్చును.
విగ్రహం ఎలా చెప్పినా ఇది బహువ్రీహిసమాసమే.

Tuesday, 26 March 2019

సంతృప్తి లేని రాజు


డా|| పాటీలు శ్రీనివాసకృష్ణ

          పూర్వం సదయుడు అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి విమలుడు అనే కుమారుడు ఉండేవాడు.  ఒక సమయం వచ్చేసరికి, సదయుడు తనకు వార్ధక్యం వచ్చిందని అర్థం చేసుకుని, విమలుడు రాజ్యపరిపాలనకు సమర్థుడు అని భావించి, అతడికి పట్టాభిషేకం చేశాడు.  పిమ్మట రాజధానికి దూరంగా, ఒక వనంలో తపస్సు చేసుకుంటూ నివసించసాగాడు. తన కుమారుని రాజ్యపాలనావిశేషాలను గూర్చిన సమాచారం ఎప్పటికప్పుడు అతనికి తెలుస్తూనే ఉండేది.

          తాను నేర్చిన మంచి విద్యల ప్రభావం వలన విమలుని పాలన మొదట సక్రమంగానే ఉండింది.  కాని, అతడి చుట్టూ క్రమంగా కొందరు దుష్టమంత్రులు చేరారు.  అసంతుష్టో ద్విజో నష్టః, సంతుష్టస్తు మహీపతిః” (సంతృప్తి లేని ద్విజుడు నశిస్తాడు, సంతృప్తి కలిగిన రాజు నశిస్తాడు) అని పెద్దలు చెప్పిన సుభాషితాన్ని అతనికి చెప్పి, “రాజు తనకున్నదానితోనే సంతృప్తి చెందితే నశించిపోతాడు, అందువల్ల మరింత అధికంగా సంపదలను పొందేందుకు ప్రయత్నించాలిఅని ఉపదేశించారు.

          దానితో విమలుడు తన రాజ్యాన్ని విస్తరించాలని భావించాడు.  అందుకు పెద్ద సైన్యం అవసరం.  ఆ సైన్యాన్ని పోషించేందుకు పెద్ద మొత్తంలో ధనం అవసరం.  అందువల్ల, ధనాన్ని సేకరించేందుకు గాను ప్రజలపై క్రొత్త క్రొత్త పన్నులు విధించి, వసూలు చేయసాగాడు.  ప్రజలలో రాజుపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.

          ఇది తెలుసుకున్న సదయుడు ఆందోళన పడి, తన కుమారుని రమ్మని కబురు చేశాడు.  విమలుడు అడవికి వెళ్లి తన తండ్రిని కలుసుకున్నాడు.  తన కుమారుని ఉద్దేశాన్ని కనుగొని, సదయుడు విచారం వ్యక్తం చేశాడు. 

          “నాయనా, పరాక్రమం చూపడం, యుద్ధం చేయడం క్షత్రియధర్మమే.  నేను కాదనను.  కాని, సాధారణపరిస్థితులలో స్వదేశాన్ని కాపాడుకొనేందుకు యుద్ధం చేయడం మాత్రమే ధర్మం.  అసాధారణపరిస్థితులు కూడా అప్పుడప్పుడు తలెత్తుతాయి.  ఇతరరాజులు అధర్మపరులైనపుడు ధర్మరక్షణకు గాను వారిపై యుద్ధం ప్రకటించవచ్చు.  విదేశాలలో రాజు క్రూరుడై, ప్రజాసంక్షోభకారకుడు అయినపుడు, ఆ ప్రజలను సంరక్షించేందుకు దండయాత్ర చేయవచ్చు.  లేదా, సువిశాలమైన దేశంలో, ఆయా రాజ్యాల రాజులు నిష్కారణంగా కలహించుకుంటూ అలజడులు రేకెత్తిస్తున్నపుడు, వారినందరినీ అదుపులో ఉంచేందుకుగాను అశ్వమేథం వంటి యాగాలు కూడా చేయవచ్చును.  కాని, ఇటువంటి కారణాలు ఏమీ లేకుండా, స్వయంగా నువే, దురాశతో, ఇతరదేశాలమీదకు దండెత్తి ఆక్రమింపజూడటం అధర్మం.  నువు బలవంతుడవైనందువల్ల గాని, కాలం అనుకూలించినందువల్ల గాని, తాత్కాలికంగా గెలిచినప్పటికీ, చిరకాలంపాటు ఆ రాజ్యాన్ని నిలబెట్టుకోలేవుఅని నచ్చజెప్పజూశాడు.
     
          “మరి, సంతృప్తి కలిగిన రాజు నశిస్తాడుఅని పెద్దలు చెప్పిన మాట అసత్యమా?” అని విమలుడు తండ్రిని ప్రశ్నించాడు.

          “అసత్యం కాదు, నిజమే!

          “మరి, యుద్ధానికి పోవద్దని మీరు నన్ను ఎందుకు వారిస్తున్నారు?”

          “నాయనా!  రాజు, రాజ్యసంపాదనవిషయంలో సంతృప్తిని కలిగి ఉండాలి.  దానివల్ల హాని లేదు.  అందువల్లనే, పాండవులు తమకు మొత్తం రాజ్యం అవసరం లేదని, ఐదు ఊళ్లు ఇచ్చినా చాలని దుర్యోధనునికి సందేశం పంపించారు.  అంతవరకు ధర్మం.  కాని, అసంతృప్తి కలిగిన దుర్యోధనుడు మాత్రం సూదిమొన మోపినంత భూమిని కూడా ఇవ్వనని తిరస్కరించాడు.  అది అధర్మం.  చివరకు సంతృప్తి కలిగిన పాండవులే జయించారు.  తనకున్న మహాసామ్రాజ్యంలో, కేవలం ఐదు ఊళ్లు తక్కువైనప్పటికీ తట్టుకోలేని అసంతృప్తిని కలిగిన దుర్యోధనుడు మాత్రం తన మిత్రులతో సహా నశించాడు కదా?” అని చెప్పాడు సదయుడు.

          “నిజమే నాన్నగారూ!  కాని, ఓవైపు ఆ సుభాషితం నిజమే అని మీరు చెప్పారు.  మరోవైపు, వాస్తవంగా ఆ సుభాషితంలో చెప్పబడి ఉన్నదానికి విరుద్ధంగా జరిగిందని కూడా మీరే ఉదాహరణ చూపుతున్నారు.  ఇపుడు, ఈ రెండిటిలో నేను దేనిని గ్రహించి ఆచరించాలి?” అని విమలుడు ప్రశ్నించాడు.

          “నాయనా!  సుభాషితంలో చెప్పబడినదీ నిజమే, కౌరవపాండవుల కథ కూడా నిజమే!  కాని, ఆ సుభాషితాన్ని మనం తప్పుగా అర్థం చేసుకొనడం వల్ల, ‘ఇక్కడ వైరుద్ధ్యం ఉన్నది కదాఅని సంశయం కలుగుతుంది. 

రాజుకు సంతృప్తి ఉండరాదుఅనేది ఆ సుభాషితం యొక్క ఆశయం.  ‘ఏవిషయంలో అటువంటి సంతృప్తి ఉండరాదు?’ – అంటే – ‘నేను నా ప్రజలను ధర్మంలో నడిపిస్తున్నాను కదా, ఇక నేను చేయవలసిన పనులేమీ లేవుఅని రాజు సంతృప్తిని చెందరాదు అని భావించాలి.  ఎందువల్లనంటే, ఆ ధర్మాన్ని దారి తప్పించే శక్తులు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూ ఉంటాయి.  రాజు అప్రమత్తంగా ఉంటూ వాటినుండి ప్రజలను కాపాడుతూ ఉండాలి.  ‘నా ప్రజలకు దొంగలనుండి రక్షణ కల్పించాను, అగ్నిప్రమాదాలనుండి రక్షణ కల్పించాను, ఈతిబాధలనుండి రక్షణ కల్పించాను.  కనుక, ఇంతకంటె నేను చేయవలసిన గొప్ప పనులేమీ లేవుఅని రాజు సంతృప్తిని చెందరాదు.  

ఆ రాజు ప్రజలను కామక్రోధాది-అరిషడ్వర్గాల నుండి కూడా కాపాడుకోవాలి.  ఎందుకంటే, ఆ శత్రువుల దాడికి గురైనవారు జీవితంలో సుఖపడలేరు.  మిగిలిన శత్రువులు ఒక జన్మకు మాత్రమే పరిమితమౌతారేమో గాని, ఈ అంతర్గతశత్రువులు మాత్రం జన్మజన్మలకూ వదలకుండా వేధిస్తూనే ఉంటారు.  ఆ శత్రువులనుండి ప్రజలను కాపాడడానికి ఒకటే మార్గం.  వారందరికీ చక్కని ఆధ్యాత్మవిద్యను  అందించాలి.  ప్రజలందరూ తమ తమ శక్తిసామర్థ్యాలు, అభిరుచులమేరకు వివిధవృత్తినైపుణ్యాలను సంపాదించేందుకు, పెంపొందించుకొనేందుకు, తదనుగుణంగా జీవనోపాధిని పొందేందుకు తగిన ఏర్పాట్లను చేయడమే కాకుండా, వారిలో ఆధ్యాత్మికప్రవృత్తిని పెంపొందించేందుకు కూడా తగిన కార్యక్రమాలను చేపట్టాలి.  అత్యంతబలవంతమైన ఈ అంతఃశత్రువులను జయించిన వ్యక్తి అరిందమనుడు అని పిలువబడతాడు.   

నాయనా!  ఈ విధంగా, తన రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా జీవించేందుకు గాను, రాజు, ఎక్కడ ఎటువంటి లోటు జరుగుతుందో అనే భయంతో, తాను మాత్రం సంతృప్తి లేకుండా, నిత్యజాగరూకుడై ఉంటూ, పరిపాలన చేస్తూనే ఉండాలి.  ఇది ఆ సుభాషితం యొక్క అంతర్గతభావం.  అంతేగాని, తనకున్న రాజ్యభూభాగం చాలదనే అసంతృప్తిని చెందుతూ, ఇతరదేశాలమీదకు దండెత్తి, సంక్షోభం సృష్టించమని దాని అర్థం కాదుఅని సదయుడు వివరించాడు.

          విమలునికి చాల సంతోషం కలిగింది.  అతని సందేహాలన్నీ పటాపంచలైనాయి.  “తండ్రీ!  నాకు చక్కని ఉపదేశం చేసి, జ్ఞానోదయం కలిగించారు.  ఆ సుభాషితం యొక్క ఉదాత్తమైన భావాన్ని నేను మీ అనుగ్రహం ద్వారా చక్కగా గ్రహించాను.  మీ ఆజ్ఞతో, మీరు చెప్పిన విధంగా, సక్రమమైన పరిపాలనను ప్రజలకు అందిస్తూ, వారిని అన్నిరకాల అంతర్గతశత్రువులనుండి కాపాడేందుకు నా శాయశక్తులా ప్రయత్నం చేస్తానుఅని సదయునికి పాదాభివందనం చేశాడు.

          అప్పటినుండి విమలుని పాలన చాల చక్కగా కొనసాగింది.  ఆదర్శపరిపాలకునిగా, ధర్మప్రభువుగా అతడు గొప్ప కీర్తిని సంపాదించాడు.

          చదువు చాల విలువైనది.   అయితే, ‘తేభ్యః క్రియాపరాః శ్రేష్ఠాః’.  చదువుకుని, విషయజ్ఞానం పొందిన వారికంటె, దానిని సక్రమంగా ఆచరించేవారే శ్రేష్ఠులని స్మృతివచనం.  అయినప్పటికీ, సరిగా అర్థం చేసుకున్నపుడే సరియైన ఆచరణ సాధ్యమౌతుంది.  చదువుకున్న విషయం యొక్క సారాన్ని సరిగా తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ఆచరించేందుకు పూనుకుంటే వ్యతిరేకఫలాలు వస్తాయి.  అందువల్ల, గురుముఖతః విద్యను నేర్చుకొమ్మని మన పెద్దవారు చెబుతారు.  అందువల్ల, పరీక్షలో ఉత్తీర్ణులు కావడం కంటె, పాఠశాలలకు చక్కగా హాజరౌతూ, పాఠాలను శ్రద్ధతో వినడం చాల ముఖ్యం.

(ఈ వ్యాసంయథార్థభారతి - మార్చ్ నెల, 2019 సంచికలో ప్రచురింపబడింది.) 


Tuesday, 18 September 2018

పరువు ఎవడబ్బ సొమ్ము?

అనగనగా ధ్రువసంధి అనే రాజు ఉండేవాడు. మహా ధర్మాత్ముడు. ఆయనకు ఇద్దరు భార్యలు. మనోరమ, లీలావతి. మనోరమ కొడుకు సుదర్శనుడు. లీలావతి కొడుకు శత్రుజిత్తు.
దురదృష్టం కొద్దీ ధ్రువసంధి అడవిలో సింహం బారిన పడి చనిపోయాడు. అపుడు రాజు ఎవరు కావాలని సుదర్శనుడి మాతామహుడు అయిన వీరసేనుడు, శత్రుజిత్తు మాతామహుడు అయిన యుధాజిత్తు గొడవ పడ్డారు. వీరసేనుడిని యుధాజిత్తు చంపేశాడు. దాంతో, మనోరమ సుదర్శనుడిని తీసుకుని అడవికి పారిపోయి, భరద్వాజమహర్షిని శరణు కోరింది. యుధాజిత్తు శత్రుశేషం ఉంచరాదని సుదర్శనుడిని చంపేందుకు భరద్వాజుని ఆశ్రమానికి వెళ్లాడు కాని, మహర్షి తపఃశక్తికి భయపడి ఏమీ చేయలేక ఊరుకున్నాడు.
తరువాత ఎప్పుడో కాశీరాజు తన కూతురైన శశికళకు స్వయంవరం ప్రకటించాడు. రాజులందరూ విచ్చేశారు. అన్నదమ్ములైన సుదర్శనుడు, శత్రుజిత్తు కూడా వచ్చారు. శశికళ సుదర్శనుడిని వరించింది.
దాంతో శివాలెత్తిపోయిన యుధాజిత్తు "శశికళ నా మనుమడిని కాకుండా అతడికి పోటీదారు అయిన అన్నను వరిస్తుందా? ఆమెకు ఎంత ధైర్యం? ఆ సుదర్శనుడిని చంపేసి ఆమెను శత్రుజిత్తుకు ఇచ్చి పెళ్లి చేస్తా" అంటూ యుద్ధానికి దిగాడు.

ఇలా ఒకే కులం, ఒకే తండ్రిబిడ్డలు అయిన అన్నదమ్ములలోనే ఒకరిని కాకుండా ఇంకొకరిని ఒక కన్య వరించింది కాబట్టి మా పరువు పోయింది అనుకునే తాతలు ఉండేవారు సుమా.
ఈ కథలో తరువాత ఏమైందని అడుగుతారా? శశికళ కోరుకున్న వరుడే దైవానుగ్రహంతో యుద్ధంలో గెలిచాడు లెండి.
ఇలాంటి కథలు, ఇంతకంటె రసవత్తరమైన కథలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. చాలా వరకు మనకు తెలిసినవే. అయినప్పటికీ సరదాగా మళ్లీ గుర్తు చేసుకునేందుకు చదవండి:

1 శ్రీకృష్ణుడు
విదర్భరాజపుత్రి అయిన రుక్మిణి కృష్ణుని ప్రేమించింది.కృష్ణునికి ఇవ్వవచ్చునని ఆమె తల్లిదండ్రులు, బంధువులు కూడా అనుకున్నారు.కాని, రుక్మిణి అన్న ఐన రుక్మికి మాత్రం అది ఇష్టం లేదు.అతడు జరాసంధుని ముఠాకు చెందినవాడు.అతడి మాటపై తన దోస్తు ఐన శిశుపాలుడికి ఇచ్చి చేద్దామనుకున్నాడు.రుక్మిణి తల్లిదండ్రులు నిస్సహాయులయ్యారు.
రుక్మిణి ఒక బ్రాహ్మణుని ద్వారా తన మనసును కృష్ణునికి తెలియజేసింది.కృష్ణుడు వచ్చి ఆమెను అందరి సమక్షంలోనూ ఎత్తుకుపోయాడు.
రుక్మి శిశుపాలుడు, జరాసంధుడు కృష్ణుని చంపాలని వెంటబడ్డారు. కృష్ణుడు వారందరినీ ఓడించి తరిమేశాడు.చేసేదేమీ లేక, సింహానికి దక్కాల్సిన సొమ్మును జింకలు కాజేసినట్టు మన రాజకన్యను ఆ గోపాలుడు ఎత్తుకుపోయి ధనుర్దారులమైన మన కీర్తిని వాడు నవ్వులపాలు చేశాడే అని తిట్టుకుంటూ ఊరట చెందారు పాపం. అందరిలోనూ తమ పరువు పోయిందని బాధపడిపోయారు.
अहो धिगस्मान् यश आत्तधन्वनां गौपैर्हृतं केसरिणां मृगैरिव।
(భాగవతం 10.ఉత్తరార్ధం 54.57)
అయితే జరాసంధుని భీముడు, శిశుపాలుని కృష్ణుడు కాలాంతరంలో హతమార్చిన తరువాత రుక్మిణి అన్న రుక్మి దారికి వచ్చాడు. తన కూతురు అయిన రుక్మవతిని రుక్మిణీకృష్ణుల కొడుకైన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుక్మిణీకృష్ణుల మనుమడైన అనిరుద్ధుడికి తన మనుమరాలైన రోచనను ఇచ్చాడు.

2 భీముడు
హిడింబుడు అనే రాక్షసుని చెల్లెలు హిడింబ.ఆమె అడవిలో భీముని చూడగానే ప్రేమించింది.తన అన్న క్రూరుడని మీ కుటుంబసభ్యులతో కలసి ఎక్కడకైనా దూరం పొమ్మని భీమునిహెచ్చరించింది.నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పింది.
ఇంతలో హిడింబుడు రానే వచ్చాడు. తన చెల్లెలి మనోభావాన్ని గ్రహించి, "వొసే హిడింబా! మన వంశానికి కళంకం తెస్తున్నావు. ఛీ ఛీ.
पूर्वेषां राक्षसेन्द्राणां सर्वेषामपयशस्विनी।“ (భారతం.1.152.18)
అన్నాడు.
ఆ హిడింబుడికి కూడా తన చెల్లెలు ఒక మానవమాత్రుణ్ణి వరించడం ఒక పరువుతక్కువ పనిగా అనిపించింది!
“ఉండు, మీ ఇద్దరినీ చంపి పారేస్తా చూడు" అంటూ భీముడి మీద పడ్డాడు. అయితే భీమసేనుడే అతడిని చంపిపారేశాడు.
ఆ తరువాత, హిడింబ ప్రేమను భీముడు తిరస్కరించాడు.“నీ అన్నను చంపిన పగతో మమ్మల్ని ఏమైనా చేయగలవు పో పో” అన్నాడు.అపుడు హిడింబ కుంతిని ధర్మరాజును శరణు వేడి, వారి ద్వారా భీముని ఒప్పించి పెండ్లి చేసుకుంది. వారి కుమారుడే ఘటోత్కచుడు అని అందరికీ తెలిసిన విషయమే కదా!

3 ద్రౌపది
పాండవులు లక్క ఇంట్లో చనిపోయారని అందరూ అనుకున్నారు.కాని, వారు తప్పించుకున్నారు. బ్రాహ్మణవేషం ధరించి పాంచాలరాజ్యంలో. ద్రౌపదీస్వయంవరసభను చేరుకున్నారు.
ఆ సభలో అందరూ మత్స్యయంత్రాన్ని ఛేదించడంలో విఫలమైన తరువాత బ్రాహ్మణవేషంలో ఉన్న అర్జునుడు ఆ పని చేశాడు. ద్రౌపది అతనిని వరించింది. ఇది చూసి అక్కడ ఉన్న రాజులు సహించలేకపోయారు. రాజులందరికీ ఇది తమ పరువుప్రతిష్ఠలకు ఒక సవాలుగా అనిపించింది.
“వీరుడైనవాడు ఏ కులానికి చెందినప్పటికీ వాడికి అందరూ సలాము చేయవలసినదే” అని ఒకప్పుడు గర్జించి చెప్పిన దుర్యోధనుడు కూడా ఉక్రోషంలో తాను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తానే విస్మరించాడు.
“ఈ కన్య (ద్రౌపది) ఒక క్షత్రియుని కాకుండా ఒక బ్రాహ్మణుని వరించినందుకు ఈమెను నిప్పుల్లో పడేసి మన దేశాలకు మనం పోదాం. ”अग्नावेनां परिक्षिप्य याम राष्ट्राणि पार्थिवाः। (భారతం 1.188.8) అని మిగిలిన రాజులతో పాటు మీదకు ఎగబడ్డాడు.
వారిని బ్రాహ్మణవేషాల్లోనే భీమార్జునులు అడ్డుకున్నారు. పెద్ద దొమ్మీ జరిగింది. యుద్ధంగా కూడా మారింది. వారిద్దరూ కలిసి ద్రౌపదిమీదకు పోబోయిన రాజులందరినీ చిత్తుచిత్తుగా ఓడించారు. మహా మహా కర్ణుడు కూడా అర్జునుని చేతిలో ఓడిపోయాడు. చేసేదేమీ లేక అందరూ నోరు మూసుకుని ఇంటికి పోయారు.
ద్రౌపది రక్షింపబడింది.

4 అర్జునుడు
తీర్థయాత్రలు చేస్తూ ద్వారకానగరానికి వచ్చిన అర్జునుడు, యాదవకన్య, శ్రీకృష్ణుని చెల్లెలు అయిన సుభద్రను చూసి ఇష్టపడ్డాడు.
సుభద్ర తనను వరిస్తుందో లేదో, యాదవులు ఆమెను తనకు ఇస్తారో లేదో అని అతడికి సందేహం కలిగింది. శ్రీకృష్ణునితో ఆ విషయం చర్చించి, అతడి ప్రోత్సాహం మీదట, అన్న అయిన ధర్మరాజు అనుమతిని కూడా పొందిన మీదట, సుభద్ర రేవతకపర్వతానికి వచ్చిన సందర్భం చూసుకుని ఎత్తుకుపోయాడు.
భోజులు, వృష్ణీయులు, అంధకులు అనే మూడు తెగల యాదవులకు అది చాల అవమానకరంగా తోచింది.
అన్నపానాలు కూడా మానివేసి అందరూ సమావేశమయ్యారు. “రథాలను సిద్దం చేయండిరా. ప్రాసాలను తీసుకురండిరా”
योजयध्वं रथानाशु प्रासानाहरतेति च। (భారతం 1.219.17)
అంటూ అర్జునుని దండించి సుభద్రను తిరిగి తీసుకుని వచ్చేందుకు సంసిద్ధులయ్యారు.
బలరాముని మండిపాటుకైతే హద్దులే లేవు. “భోజనం చేసిన కంచాన్నే విరగ్గొట్టే కులకళంకుడని తెలియక ఆ అర్జునుడిని శ్రీకృష్ణుడి మిత్రుడు కదా అని ఎంతగా గౌరవించాం!
न च सोऽर्हति पूजां तां दुर्बुद्धिः कुलपांसनः।
को हि तत्रैव भूक्त्वान्नं भाजनं भेत्तुमर्हति। (భారతం 1.219.26,27)
అసలు అర్జునుడు అపహరించింది సుభద్రను కాదు, తన మృత్యువునే సుమా! ఇటువంటి పని చేయడం ద్వారా నా తలమీద అర్జునుడు తన పాదం పెట్టినట్టు కాదా? ఆ అర్జునుడు జన్మించిన కౌరవవంశాన్ని ఈ భూమి మీదనే లేకుండా చేస్తాను.
अद्य निष्कौरवमेकः करिष्यामि वसुन्धराम्। (భారతం 1.219.31)”
అంటూ అవమానంతో కుతకుతలాడిపోయాడు. యాదవులందరూ బలరాముని సమర్థిస్తూ “పదండి పదండి” అంటూ రణనినాదాలు చేశారు.
వారికి ఇదొక పరువు సమస్య అయింది!
కాని, శ్రీకృష్ణుడు సుభద్రకు అర్జునుడు తగిన జోడీ అని, స్వయంవరంలో సుభద్ర తనను వరిస్తుందో లేదో అనే సంశయంతో అర్జునుడు ఆమెను ఎత్తుకువెళ్లి ఉంటాడని, అది క్షత్రియులకు అనుచితమైన పనేమీ కాదని నచ్చజెప్పి బలరాముని, మిగిలిన యాదవులను చల్లబరచాడు.
శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో యాదవులు సగౌరవంగా సుభద్రార్జునులను ద్వారకకు తిరిగి తీసుకుని వచ్చి, వారికి వివాహం చేశారు. కాలక్రమేణ వారిరువురికీ జన్మించిన అభిమన్యుడు యాదవులందరికీ ముద్దుల మేనల్లుడు కావడం తెలిసిందే.

5 సాంబుడు
జాంబవతీశ్రీకృష్ణుల కుమారుడు సాంబుడు. దుర్యోధనుని కూతురైన లక్ష్మణను ఇష్టపడ్డాడు. ఆమెను స్వయంవరసభనుండి ఎత్తుకుపోయాడు.
సాంబుడు చేసిన పనికి కౌరవులు ఆగ్రహంతో ఊగిపోయారు. “పట్టండిరా ఈ దుర్మార్గుడిని. మనం దయదలచి ఇచ్చిన భూమిని ఏలుకుంటున్న ఈ వృష్ణీయులు (యాదవులు) ఏమి చేస్తారో చూద్దాం.
बध्नीतेमं दुर्विनीतं किं करिष्यन्ति वृष्णयः।
येस्मत्प्रसादोपचितां दत्तां नो भुञ्जते महीम्।“ (భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)
అని మీదపడి బంధించారు.
యాదవులంటే వారికి చిన్నచూపు. వారు తమ పిల్లను చేసుకొనడం తమకు పరువు తక్కువగా కౌరవులు భావించారు!
ఈ విషయం తెలిసిన యాదవులు సాంబుడిని విడిపించుకునేందుకు యుద్ధసన్నద్ధులయ్యారు. కాని, బలరాముడు యాదవకౌరవవంశాలవారికి నడుమ కలహం వద్దని, శాంతిని కోరి ఉద్ధవుని రాయబారిగా పంపాడు. భీష్మాదివృద్ధులు ఎంత నచ్చజెప్పినా వినకుండా దుర్యోధనాదికౌరవులు మాత్రం అహంకారంతో మిడిసిపడ్డారు.
“ఆహా! కాలమహిమ కాకుంటే కాళ్ల దగ్గర పడి ఉండాల్సిన చెప్పులు కిరీటం ఉండవలసిన తలమీద ఉండగోరుతున్నాయి కదా?
अहो महच्चित्रमिदं कालगत्या दुरत्यया।
आरुरुक्षत्युपानद्वै शिरो मुकुटसेवितम्।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.24)
మన పాండురాజు వారి కుంతిని చేసుకున్నాడు. మన అర్జునుడు వారి సుభద్రను చేసుకున్నాడు. ఇలా కాస్త బంధుత్వం కలిసింది కదా అని మన ప్రక్కనే కూర్చునేందుకు సాహసిస్తున్నారు. వీరు మాకు చెప్పవచ్చారా?” అంటూ అహంకరించి బలరాముని మాటలను తిరస్కరించారు.
బలరాముడికి వొళ్లు మండింది. “ఏమిటేమిటీ? మేము చెప్పులమూ, వారేమో తలకాయలూనా?
उपानहः किल वयं स्वयं तु कुरवः शिरः।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.38)
ఈ రోజు భూమిమీద కౌరవులు లేకుండా చేస్తాను
अद्य निष्कौरवीं पृथ्वीं करिष्यामि। (భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)”
అంటూ హస్తినాపురాన్ని తన హలంతో లాగి గంగలోనికి నూకేందుకు ఉద్యమించాడు. ఆ దెబ్బకు హస్తినాపురం ఊగిపోయింది. కౌరవులందరూ హడలిపోయి, సాంబుడిని, లక్ష్మణను బలరామునికి అప్పగించి, క్షమాపణలు కోరి, రక్షించమన్నారు. దయాళువైన బలరాముడు సరేనని, వారు సమర్పించిన కానుకలను, వధూవరులను వెంటబెట్టుకుని ద్వారకకు చేరుకున్నాడు.
గొడవ చల్లబడింది.

6 మధువు
రావణాసురుని పినతల్లి అనల. ఆమెకు కుంభీనసి అనే కూతురు ఉండేది. ఆమెను మధువు అనే ఒక రాక్షసుడు ఇష్టపడ్డాడు. పేరుకు రాక్షసుడే అయినా దేవతలకు మంచి మిత్రుడు.కాని,రావణాసురుని పట్ల భయంతో ఏమి చేయాలో తెలియక ఊరుకున్నాడు.
ఇలా ఉండగా ఒకసారి రావణాసురుడు జైత్రయాత్రకు వెళ్లాడు. యుద్ధోన్మాదంలో తన చెల్లెలైన శూర్పణఖకు భర్త అయిన విద్యుజ్జిహ్వుని కూడా గుర్తించలేక స్వయంగా నరికి చంపివేశాడు. శూర్పణఖ వచ్చి ఏడ్చి మొత్తుకుంటూ ఉంటే ఆమెను పోయి దండకారణ్యంలో సుఖంగా ఉండమని పంపించేశాడు రావణుడు.
వారు ఈ గొడవల్లో ఉండగా సమయం చూసుకుని మధువు కుంభీనసిని ఎత్తుకుపోయాడు.
రావణుడు విజయం సాధించి, వెనక్కు వస్తూ దారిలో కంటికి అందంగా కనబడిన రాజస్త్రీలను, ఋషిస్త్రీలను, గంధర్వస్త్రీలను,పన్నగస్త్రీలను, రాక్షసస్త్రీలను, అసురస్త్రీలను, మానుషస్త్రీలను, యక్షస్త్రీలను, దానవస్త్రీలను ఎవరి పట్లా ప్రత్యేకపక్షపాతం చూపకుండా అపహరించాడు. వారు వివాహితలా లేక అవివాహితులా అన్నది కూడా గమనించలేదు. తనకు అడ్డుపడిన వారి వారి బంధువులను యథేష్టంగా సంహరించాడు.
दर्शनीयां हि रक्षः कन्यां स्त्रीं वाऽथ पश्यति।
हत्वा बन्धुजनं तस्या विमाने तां रुरोध ह।। (రామాయణం7.24.2)
ఆ స్త్రీల విలాపంతో లంక ప్రతిధ్వనించిపోయింది. “ఒరే దుర్బుద్ధీ! నువు స్త్రీమూలంగానే నశిస్తావురా” स्त्रीकृतेनैव प्राप्स्यते दुर्मतिर्वधम्। (రామాయణం7.24.2)
అంటూ వారు శపించేశారు.
ఇంతలో మధువు తన చెల్లెలైన కుంభీనసిని ఎత్తుకుపోయాడన్న వార్త తెలిసింది. దానితో ఆ రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. లోకవిజేత అయిన తన చెల్లెలినే ఎవడో ఎత్తుకుపోతాడా? ఎంత ధైర్యం? మళ్లీ ఇక్కడ రావణాసురుడికి కూడా పరువు సమస్యే!
అతడి కళ్లు ఎర్రగా మారిపోయాయి. “వెంటనే రథం సిద్ధం చేయండిరా. రాక్షసవీరులు సిద్ధం కండిరా. మారణాయుధాలు పట్టుకుని బయల్దేరండిరా” అని గర్జిస్తూ మధుపురానికి దండయాత్ర చేశాడు.
అయితే అతడి చెల్లెలు కుంభీనసి వచ్చి అన్న కాళ్ల మీద పడి, “అన్నా, జరిగిందేదో జరిగిపోయింది. ఇపుడు నా భర్తను చంపి, నన్ను విధవను చేయవద్దు” అని వేడుకుంది.
రావణుడు కాసేపు ఆలోచించి, “సరే, నీమీద దయతో అతడిని నేను చంపబోవటం లేదు. నీ భర్త ఎక్కడ? త్వరగా రమ్మను. అతడితో కలసి, స్వర్గలోకాన్ని జయించేందుకు బయల్దేరుతాను” అన్నాడు.
क्व चासौ तव भर्ता वै मम शीघ्रं निवेद्यताम्।
सह तेन गमिष्यामि सुरलोकं जयावहे।। (రామాయణం 7.25.44,45)
మొత్తానికి అలా రాజీ కుదిరింది. తరువాత రావణుడు ఎత్తుకువచ్చిన స్త్రీల శాపం ఫలించి సీత కారణంగా రాముడి చేతిలో చనిపోయాడు.
అయితే రావణుడి బావ అయిన మధువుమహాశివభక్తుడు. మహా ధర్మాత్ముడు. జనరంజకంగా పరిపాలన చేశాడు.కాని, ఆ కుంభీనసీమధువుల కుమారుడైన లవణాసురుడికి మాత్రం మేనమామ అయిన రావణాసురుడి బుద్ధులు వచ్చాయి. వాడు పెట్టే బాధలను సహించలేక మునులు రాముడికి మొర పెట్టుకున్నారు. శత్రుఘ్నుడు రాముని ఆజ్ఞను పొంది ఆ లవణాసురుడిని సంహరించాడు.
***

ఈ విధంగా తమ కుటుంబానికి చెందిన స్త్రీని ఎవడో తమ అనుమతి లేకుండా పెండ్లాడడం అనేది ఎంతటివారికైనా ఇజ్జత్ కా సవాల్. అది ఒక మానసికమైన పీడ.
కురువంశంవారు తమ కన్యను ఎత్తుకుపోయారని యాదవులు మండిపడ్డారు. యాదవులు తమ కన్యను ఎత్తుకుపోయారని కురువంశంవారు కుతకుతలాడిపోయారు. రాక్షసులు తమ స్త్రీని ఎత్తుకుపోయారని మానవులు వగచారు. మనిషి మా కన్యను వరిస్తాడా అని రాక్షసులు కోపగించుకున్నారు. ఎవరూ తక్కువ తినలేదు.

పరువు ఎవడబ్బ సొమ్ము? ఎవరికి ఆ పరువు బరువు?

అయితే ఈ కథలన్నిటిలోనూ గమనించవలసింది ఏమిటంటే –

ప్రతిచోటా బలవంతులే గెలిచారు.
ఓడినవారు చాలావరకు రాజీకొచ్చారు.
అప్పుడైనా ఇప్పుడైనా జరిగేది అదే.

కాబట్టి, ఇప్పటి ఆశావహులు ఎవరైనా సరే, స్వయంగా తమకు తగినంత బలం లేకుండా, బలవంతుల ఇష్టం లేనిదే బలవంతుల కన్యల జోలికి పోరాదు. బలం అంటే ఆరోజుల్లో పరాక్రమం అయ్యుండవచ్చు. ఈరోజుల్లో ధనం, పలుకుబడి కూడా.

బలవంతుడు మరొక బలవంతుడినే ఇష్టపడతాడు, అతడితోనే రాజీ పడతాడు. ప్రపంచమంతటా ఇదే సహజం.

అంతే కాదు, బలవంతుడు అర్హత కలిగిన వినయవంతుడిని కూడా ఇష్టపడతాడు. శుక్రాచార్యులవారు తన కూతురును క్షత్రియుడైనప్పటికీ వినయవంతుడైన యయాతిరాజుకు సంతోషంగా ఇచ్చి పెళ్లి చేశాడు.

అంతేగాని, చెత్త చెత్త సినిమాలలో చూపినట్టు పోకిరీతనంతో బలవంతుల జోలికి పోయి భంగపడకండి, సమాజంలో అందరినీ మాకు న్యాయం చేయండి అంటూ దేబిరించకండి.

బలమా? అర్హతతో కూడిన వినయమా?
ఏదో ఒకటి ఎంచుకోండి.

కాబట్టి, ఓ ఆశావహులారా! ఈ రెండిటిలో ఏదో ఒకటి లేకుండా పనికిమాలిన సాహసాలు చేసి, దానికి తగిన ప్రతిఫలం అనుభవించి, మీ సమస్య తప్ప మరో సమస్య సమాజంలో మరేమీ లేనట్టు ఊరికే గగ్గోలు పుట్టించడాలు మానుకోండి.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...