Showing posts with label రామాయణం. Show all posts
Showing posts with label రామాయణం. Show all posts

Saturday, 7 August 2021

విశ్వామిత్రుడు యజ్ఞం ఎందుకు చేసినట్టు?

 విశ్వామిత్రమహర్షులవారు అయోధ్యకు వేంచేశారు. దశరథమహారాజు ఎదురేగి ఆయనకు స్వాగతం పలికాడు. “మహర్షీ, మీ రాక మాకు ఎడారిలో వర్షం కురిసినంత ఆనందం కలిగించింది. మీరు ఏమి కోరి వచ్చారో తెలుపవలసింది. మీ పని నెరవేరుతుందో లేదోనని బెంగ పెట్టుకొనవద్దు. కర్తా చాహమశేషేణ - మీ పనులు నేను సంపూర్ణంగా నెరవేర్చి పెడతాను”. అని వినమ్రుడై పలికాడు.

"దశరథమహారాజా, నేనొక యజ్ఞం చేస్తున్నానయ్యా. దానికి కామరూపులైన ఇద్దరు రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు. వారిని అడ్డుకుని శిక్షించాలి. నీ కుమారుడైన రాముని నాతో పంపవయ్యా" అని విశ్వామిత్రుడు అడిగాడు.

దశరథుడు భయపడ్డాడు. “ఉహుహు. నా రాముడు పసివాడు. రాజీవలోచనుడు. రాక్షసులతో యుద్ధం చేయలేడు. నా అక్షౌహిణీసైన్యంతో నేనే వచ్చి పోరాడుతాను. బాలం మే తనయం బ్రహ్మన్ నైవ దాస్యామి పుత్త్రకమ్. రాముణ్ణి నేను పంపను.”

"ఏమయ్యా, పని చేసి పెడతానని మొదట వాగ్దానం ఇప్పుడు మాట తప్పుతున్నావ్? సరే, సుఖంగా ఉండు. వెళ్లి వస్తా" అంటూ విశ్వామిత్రుడు అలిగేసరికి అందరూ భయపడ్డారు.

వసిష్ఠమహర్షి కలుగజేసుకుని నచ్చజెప్పాడు. చివరకు దశరథుడు ఒప్పుకున్నాడు. విశ్వామిత్రునికి రామునితో పాటు లక్ష్మణుని కూడా అప్పజెప్పాడు. గురుశిష్యులు ప్రయాణమైనారు. విశ్వామిత్రుడు వారికి బల అతిబల మంత్రాలనిచ్చాడు. వాటి ప్రభావం వలన వారికి అలసట, ఆకలిదప్పులు ఉండవు. రాక్షసులు వారిని దొంగదెబ్బ తీయలేరు.

దారిలో గంగానదీతీరాన వారు ఒకనాడు ధనధాన్యాలతో తులతూగి, తాటక అనే ఘోరరాక్షసి పీడవలన భయంకరారణ్యంగా మారిన మలదకరూశప్రాంతాలను చూశారు. ఆమెచేత చంపబడిన వారు చంపబడగా, మిగిలిన జనాలు ఆ దేశాన్ని వదిలి పారిపోయారు.

"రామా, అయ్యో స్త్రీ కదా అని జాలిపడకుండా క్రూరురాలైన ఆమెను నీవు సంహరించి, ప్రజలకు రక్షణ చేకూర్చాలయ్యా. రాజ్యభారనియుక్తానామ్ ఏష ధర్మః సనాతనః. రాజ్యభారాన్ని వహించేవారికి ఇది సనాతనమైన ధర్మం" అని విశ్వామిత్రుడు హితం చెప్పాడు.

రామలక్ష్మణులు తాటకను వధించారు. విశ్వామిత్రుడు సంతోషించి రామునికి అనేకమైన దివ్యాస్త్రాలను, వాటి ఉపసంహారమంత్రాలతో సహా ఉపదేశించాడు.
రాముడు వాటిని సంగ్రహించి, మహర్షులవారి ఆనతిపై వాటిని లక్ష్మణునికి తాను స్వయంగా ఉపదేశించాడు.

అన్నదమ్ముల రక్షణలో విశ్వామిత్రుని యాగం నిర్విఘ్నంగా జరిగింది. తాటక కుమారుడైన మారీచుని దూరంగా పడగొట్టారు. అతడి జతగాడైన సుబాహుని హతమార్చారు.

యజ్ఞపరిసమాప్తితో దిక్కులన్నిటా ఈతిబాధలు తొలగిపోయాయి. అథ యజ్ఞసమాప్తే తు విశ్వామిత్రో మహామునిః నిరీతికా దిశో దృష్ట్వా... అని వాల్మీకి వర్ణించాడు.

అంటే, విశ్వామిత్రుడు స్వార్థం కోసమో స్వర్గమో మరొకటో కోరి యజ్ఞం చేయలేదు. ఈతిబాధలను తొలగించటానికి యజ్ఞం చేశాడు. ఏమిటా ఈతిబాధలు?

శ్లో “అతివృష్టి రనావృష్టి ర్మూషకా శ్శలభాః ఖగాః.
అత్యాసన్నాశ్చరాజానః షడేతా ఈతయ స్స్మృతాః"

ఈతిబాధలు ఆరు రకాలు. 1అతివృష్టి 2అనావృష్టి 3మూషకాలు, 4శలభాలు, 5పక్షులు, 6రాజుగారికి అతి అభిమానులు. వీటివలన ప్రజలు పడే బాధలు ఇంతింతనరానివి. అందువలన వాటిని తొలగించదలచి విశ్వామిత్రుడు యజ్ఞం చేశాడు.

1 అతివృష్టి అంటే అవసరమైనదానికన్న ఎక్కువ వర్షం కురియడం.

2 అనావృష్టి అంటే అవసరమైనదానికన్న తక్కువ వర్షం కురియడం.

3 పంటలను సర్వనాశనం చేసేంతగా ఎలుకల సంతతి పెరగడం.

4 పంటలను సర్వనాశనం చేసేంతగా మిడతలదండ్లు దాడి చేయడం.

5 పంటలను సర్వనాశనం చేసేంతగా పక్షులసంతతి పెరగడం.

6 అతి సమీపంలో ఉన్న పాలకులు (మా రాజుదే రాజ్యమని సామాన్యప్రజలను పీడించే ఆ రాజుగారి అనుచరుల ఆగడాలు అని అర్థం చేసుకొనవచ్చు.)




ఈ ఆరింటిని ఈతిబాధలంటారు. వాటిని అరికట్టడం కోసమే విశ్వామిత్రుని యజ్ఞం జరిగింది. అయితే విశ్వామిత్రుని ప్రవర్తనలో ఈనాటి సమాజానికి సరిపోయే మరికొన్ని అంశాలను మనం గమనించవలసి ఉంది.

పాతతరం మనుషులు (దశరథుని వంటివారు) ఎప్పుడూ ధర్మసంరక్షణకు ముందుకు వస్తారు. కాని, తమ సంతానాన్ని ధర్మరక్షణకు పంపేందుకు జంకుతున్నారు. అటువంటి జంకుగొంకులు మాని, క్రొత్తతరానికి ధర్మరక్షణబాధ్యతను అప్పగించవలసిన బాధ్యత వారికుంది.

ధర్మరక్షణబాధ్యతను మునులు స్వయంగా చేపట్టగలరు. కాని, యుద్ధం చేయటం మునుల ధర్మం కాదు. వారు యుద్ధం చేస్తుంటే భోగభాగ్యాలను అనుభవిస్తూ తింటూ కూర్చొనడం సమాజానికి సిగ్గుచేటు. అందువల్ల, మీ యుద్ధం మీరే చేయండి అని వారి కర్మకు వారిని వదిలిపెట్టకూడదు. వారిని రక్షించే బాధ్యతను క్షత్రియులు చేపట్టాలి.

అలాగని, మునులు అన్నిటినీ విడిచి ముక్కుమూసుకుని తపస్సును చేస్తూ కూర్చోరాదు. శక్తిమంతులైన క్షత్రియులను తయారుచేసి, వారికి తగిన అస్త్రశస్త్రసంపత్తిని చేకూర్చే బాధ్యత వారిదే.

ఈతిబాధలను తొలగించగల శాస్త్రపరిజ్ఞానాన్ని పెంపొందించుకొనే బాధ్యత మునులదే. వారి శాస్త్రపరిశోధనలకు, పరిశోధనాఫలితాలను సమాజానికి ఉపయోగపడేలా చూసే బాధ్యత క్షత్రియులది.

స్త్రీలు సమాజంలో రక్షార్హులు. నిజమే. కాని, ఆడవారిలో కూడా కొందరు పరమక్రూరురాళ్లుండే అవకాశముంది. కాని, వారు బలగర్వితులై ప్రజలను పీడిస్తూ ఉంటే అటువంటివారు కూడా తప్పక దండనార్హులే.

సుందుడు, తాటకాసుందుల కుమారుడైన మారీచుడు, వారితో బాటు సుబాహుడు రాక్షసరాజైన రావణాసురుని అనుచరులు. ప్రజలను పీడించడమే వారి పని. బహుశః ప్రజలను పీడించే ఈతిబాధలను సృష్టించడం కూడా వీరు పని గట్టుకుని చేస్తుంటారు. (నేటి బయో వార్ లా) సుందుని అగస్త్యముని సంహరించాడనే కోపంతో అతని భార్య అయిన తాటక కూడా జనాల మీద పగబట్టి పీడించడం మొదలుపెట్టింది. రాజుగారి అండ చూసుకుని పేట్రేగిపోయే ఈ విధమైన క్రూరులు కూడా ఈతులలోనికే వస్తారు.

విశ్వామిత్రుడు వారిని కూడా అణచేందుకు తగిన శిక్షణను రామలక్ష్మణులకు ఇచ్చాడు.

స్వచక్రం పరచక్రం చ సప్తైతా ఈతయః స్మృతాః అని కొందరంటారు.  స్వదేశంలో కలిగే బాధలు స్వచక్రం, బయటదేశపు పాలకులవలన కలిగేవి పరచక్రం అన్నమాట. అంటే పాకిస్థాన్, చైనా వంటి దేశాల దుందుడుకు చేష్టలు, ఉగ్రవాదచర్యలు వంటివి.

స్వచక్రాలను సాధ్యమైనంత త్వరగా అణచివేయాలి. పరచక్రాలను సరైన సమయం వచ్చేదాకా ఎదురు చూసి, సరైన మిత్రులను సమకూర్చుకుని చావుదెబ్బ కొట్టాలి.

అరణ్యవాసకాలంలోనే మునులు రామునికి రావణాసురుని అనుచరులవల్ల తమకు కలుగుతున్న బాధలను గూర్చి మొరపెట్టుకున్నారు. రాముడు తొందరపడలేదు. వారికి రక్షణ కల్పిస్తూ వచ్చాడే తప్ప వెంటనే రావణుని మీదకు దండెత్తి పోలేదు. దండెత్తటానికి సరైన కారణం దొరకగానే మొదట రావణాసురుని మిత్రుడైన వాలిని అణచివేసి, తనకు సంపూర్ణంగా సహకరించగల సుగ్రీవునితో స్నేహం చేసి అటుపిమ్మట దండయాత్ర చేసి రావణుని పూర్తిగా అణచివేశాడు.

అదీ రామునికి విశ్వామిత్రుడు నేర్పిన యుద్ధనీతి. ఆనాడు దశరథుడు చిన్నపిల్లవాడని రాముడిని పంపకుంటే, విశ్వామిత్రునికి తగిన శిష్యుడు దొరకకుంటే ఇప్పటికీ రావణరాజ్యం నడుస్తూ ఉండేదేమో.

ఇప్పుడు కూడా మన దేశానికి విశ్వామిత్రుల అవసరం ఉంది. తమ పుత్రులను విశ్వామిత్రుని శిష్యరికానికి పంపే దశరథమహారాజుల అవసరం ఉంది. విశ్వామిత్రయజ్ఞం అవసరమైనపుడల్లా జరిగితే గాని, ప్రపంచం సురక్షితంగా ఉండే అవకాశం లేదు. 

Previously posted here:
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/2953553781431949

Wednesday, 1 April 2020

రాముని మనసులోని కోరిక


1 శ్రీరాముడు విజయం సాధించాడు.


రావణసంహారం జరిగింది.
దిక్కులన్నీ ప్రసన్నమైనాయి.
లోకాలన్నీ హర్షించాయి.
మహేంద్రుని ఆనందానికి మేర లేకుండా పోయింది.
′′రామా! లోకోపకారివైన నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది. నీకు మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు. *ప్రీతియుక్తాః స్మ తేన త్వం బ్రూహి యన్మనసేచ్ఛతి. దానిని తీరుస్తాను′′ అన్నాడు.
రాముడు అందుకు చాల ఆనందపడి,
′′సురేశ్వరా! నీకు నా పట్ల ప్రీతి కలిగితే నేనడిగిన దానిని తప్పక చేయాలి. *తే సర్వే జీవితం ప్రాప్య సముత్తిష్ఠంతు వానరాః - యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఈ వానరులందరినీ తిరిగి బ్రతకాలి. కేవలం బ్రతకడమే కాదు, *నీరుజో నిర్వ్రణాంశ్చైవ సంపన్నబలపౌరుషాన్ - వీరికి గాయాలన్నీ నయమై పోవాలి. పూర్వం వలె బలపరాక్రమసంపన్నులై, ఆరోగ్యవంతులుగా వర్ధిల్లాలి. అంతే కాదు, *అకాలే చాఽపి ముఖ్యాని మూలాని చ ఫలాని చ నద్యశ్చ విమలాస్తత్ర తిష్ఠేయుర్యత్ర వానరాః – ఈ వానరులు ఎక్కడ ఉంటే అక్కడ వీరికి ముఖ్యాహారమైన దుంపలు, పండ్లు పుష్కలంగా లభించాలి. వీరున్న చోట నదులలో నిర్మలమైన నీరు ప్రవహించాలి′′ అని కోరుకున్నాడు.
మహేంద్రుడు చాల సంతోషించి, ′*మహానయం వరస్తాత! తస్మాదేతద్భవిష్యతి - నాయనా! నీవు చాల గొప్ప వరం అడిగావు. నీవు కోరినది తప్పకుండా జరుగుతుంది′′ అని వరం ఇచ్చేశాడు.
అపుడు మరణించిన వానరులందరూ నిద్రనుండి లేచినట్లు లేచారట. *తతః సముత్థితాః సర్వే సుప్త్వేవ హరిపుంగవాః। అందరూ ఎంతో ఆనందించారు.
2 శ్రీరాముడు అయోధ్యకు వేంచేసే దారిలో ఉన్నాడు.
ఈ విషయం ఎక్కడో ప్రయాగదగ్గర ఉన్న భరద్వాజమహర్షికి కూడా తెలిసిపోయింది. ′′అయ్యో! బలే తిక్క రాముడులే ఈయన! అంతటి మహేంద్రుడే దిగివచ్చి వరమిస్తా కోరుకోమంటే తనకోసం కాక తనవారికోసం కోరుకున్నాడే! సరే, రాముడు అయోధ్యకు తిరిగిపోయే దారిలో నా ఆశ్రమం మీదుగానే కదా పోవలసింది! అప్పుడు ఆయనకు నేను ఇంకో వరమిస్తాను′′ అని భావించాడు.
అనుకున్నట్టుగానే తన ఆశ్రమం దగ్గరకు రాముడు రాగానే, అతడిని నిలేసి ఆపేశాడు. ′′ఏమయ్యా రామా! లోకసంరక్షకుడవైన నీకు దేవతలంతటివారే వరాలిచ్చారటనే, *అహమప్యత్ర తే దద్మి వరం శస్త్రభృతాం వర - మరి నా వంతుగా నేను కూడా ఇస్తాను. కోరుకో మరి!′′ అన్నాడు.
రాముడు ఆనందించి, ′′మహాప్రసాదం స్వామీ!′′ అన్నాడు.
′′*అకాలే ఫలినో వృక్షాః సర్వే చాఽపి మధుస్రవాః।
ఫలాన్యమృతకల్పాని బహూని వివిధాని చ।।′′
′′మహామునీ, కాలం కాకపోయినప్పటికీ (సమస్త ఋతువులలోనూ) రకరకాల వృక్షాలు బాగా ఫలించాలి. వాటి పండ్లన్నీ తేనెలూరుతూ అమృతంతో సమానంగా ఉండాలి′′ అని కోరుకున్నాడు.
ఆ మాటలు విని, భరద్వాజమహర్షి ఎంతో సంతోషపడ్డాడు. ′′అయ్యో తిక్క రామా! రెండవసారి కూడా అలాగే అడిగావా? నీకోసం నీవు ఏమీ కోరుకోవుగదయ్యా! అన్నీ నిన్ను నమ్మినవారి కోసమే కోరుకుంటావు గదయ్యా! అయినా, మా పిచ్చి కాకుంటే, మా ముచ్చటను తీర్చడానికి నువు వరాలను కోరుకున్నావు గాని, నీకు మేము వరాలిచ్చేంతటివారమా?′′ అని రాముని పలు విధాల స్తుతించాడు.
అంతటి నిరాడంబరుడైన ఆశ్రితమహావత్సలుడైన రాముని అనుగ్రహం మనపై నిత్యం వర్షించుగాక!
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ।
దేశోఽయం క్షోభరహితో బ్రాహ్మణాః సన్తు నిర్భయాః।।

Tuesday, 18 September 2018

పరువు ఎవడబ్బ సొమ్ము?

అనగనగా ధ్రువసంధి అనే రాజు ఉండేవాడు. మహా ధర్మాత్ముడు. ఆయనకు ఇద్దరు భార్యలు. మనోరమ, లీలావతి. మనోరమ కొడుకు సుదర్శనుడు. లీలావతి కొడుకు శత్రుజిత్తు.
దురదృష్టం కొద్దీ ధ్రువసంధి అడవిలో సింహం బారిన పడి చనిపోయాడు. అపుడు రాజు ఎవరు కావాలని సుదర్శనుడి మాతామహుడు అయిన వీరసేనుడు, శత్రుజిత్తు మాతామహుడు అయిన యుధాజిత్తు గొడవ పడ్డారు. వీరసేనుడిని యుధాజిత్తు చంపేశాడు. దాంతో, మనోరమ సుదర్శనుడిని తీసుకుని అడవికి పారిపోయి, భరద్వాజమహర్షిని శరణు కోరింది. యుధాజిత్తు శత్రుశేషం ఉంచరాదని సుదర్శనుడిని చంపేందుకు భరద్వాజుని ఆశ్రమానికి వెళ్లాడు కాని, మహర్షి తపఃశక్తికి భయపడి ఏమీ చేయలేక ఊరుకున్నాడు.
తరువాత ఎప్పుడో కాశీరాజు తన కూతురైన శశికళకు స్వయంవరం ప్రకటించాడు. రాజులందరూ విచ్చేశారు. అన్నదమ్ములైన సుదర్శనుడు, శత్రుజిత్తు కూడా వచ్చారు. శశికళ సుదర్శనుడిని వరించింది.
దాంతో శివాలెత్తిపోయిన యుధాజిత్తు "శశికళ నా మనుమడిని కాకుండా అతడికి పోటీదారు అయిన అన్నను వరిస్తుందా? ఆమెకు ఎంత ధైర్యం? ఆ సుదర్శనుడిని చంపేసి ఆమెను శత్రుజిత్తుకు ఇచ్చి పెళ్లి చేస్తా" అంటూ యుద్ధానికి దిగాడు.

ఇలా ఒకే కులం, ఒకే తండ్రిబిడ్డలు అయిన అన్నదమ్ములలోనే ఒకరిని కాకుండా ఇంకొకరిని ఒక కన్య వరించింది కాబట్టి మా పరువు పోయింది అనుకునే తాతలు ఉండేవారు సుమా.
ఈ కథలో తరువాత ఏమైందని అడుగుతారా? శశికళ కోరుకున్న వరుడే దైవానుగ్రహంతో యుద్ధంలో గెలిచాడు లెండి.
ఇలాంటి కథలు, ఇంతకంటె రసవత్తరమైన కథలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. చాలా వరకు మనకు తెలిసినవే. అయినప్పటికీ సరదాగా మళ్లీ గుర్తు చేసుకునేందుకు చదవండి:

1 శ్రీకృష్ణుడు
విదర్భరాజపుత్రి అయిన రుక్మిణి కృష్ణుని ప్రేమించింది.కృష్ణునికి ఇవ్వవచ్చునని ఆమె తల్లిదండ్రులు, బంధువులు కూడా అనుకున్నారు.కాని, రుక్మిణి అన్న ఐన రుక్మికి మాత్రం అది ఇష్టం లేదు.అతడు జరాసంధుని ముఠాకు చెందినవాడు.అతడి మాటపై తన దోస్తు ఐన శిశుపాలుడికి ఇచ్చి చేద్దామనుకున్నాడు.రుక్మిణి తల్లిదండ్రులు నిస్సహాయులయ్యారు.
రుక్మిణి ఒక బ్రాహ్మణుని ద్వారా తన మనసును కృష్ణునికి తెలియజేసింది.కృష్ణుడు వచ్చి ఆమెను అందరి సమక్షంలోనూ ఎత్తుకుపోయాడు.
రుక్మి శిశుపాలుడు, జరాసంధుడు కృష్ణుని చంపాలని వెంటబడ్డారు. కృష్ణుడు వారందరినీ ఓడించి తరిమేశాడు.చేసేదేమీ లేక, సింహానికి దక్కాల్సిన సొమ్మును జింకలు కాజేసినట్టు మన రాజకన్యను ఆ గోపాలుడు ఎత్తుకుపోయి ధనుర్దారులమైన మన కీర్తిని వాడు నవ్వులపాలు చేశాడే అని తిట్టుకుంటూ ఊరట చెందారు పాపం. అందరిలోనూ తమ పరువు పోయిందని బాధపడిపోయారు.
अहो धिगस्मान् यश आत्तधन्वनां गौपैर्हृतं केसरिणां मृगैरिव।
(భాగవతం 10.ఉత్తరార్ధం 54.57)
అయితే జరాసంధుని భీముడు, శిశుపాలుని కృష్ణుడు కాలాంతరంలో హతమార్చిన తరువాత రుక్మిణి అన్న రుక్మి దారికి వచ్చాడు. తన కూతురు అయిన రుక్మవతిని రుక్మిణీకృష్ణుల కొడుకైన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుక్మిణీకృష్ణుల మనుమడైన అనిరుద్ధుడికి తన మనుమరాలైన రోచనను ఇచ్చాడు.

2 భీముడు
హిడింబుడు అనే రాక్షసుని చెల్లెలు హిడింబ.ఆమె అడవిలో భీముని చూడగానే ప్రేమించింది.తన అన్న క్రూరుడని మీ కుటుంబసభ్యులతో కలసి ఎక్కడకైనా దూరం పొమ్మని భీమునిహెచ్చరించింది.నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పింది.
ఇంతలో హిడింబుడు రానే వచ్చాడు. తన చెల్లెలి మనోభావాన్ని గ్రహించి, "వొసే హిడింబా! మన వంశానికి కళంకం తెస్తున్నావు. ఛీ ఛీ.
पूर्वेषां राक्षसेन्द्राणां सर्वेषामपयशस्विनी।“ (భారతం.1.152.18)
అన్నాడు.
ఆ హిడింబుడికి కూడా తన చెల్లెలు ఒక మానవమాత్రుణ్ణి వరించడం ఒక పరువుతక్కువ పనిగా అనిపించింది!
“ఉండు, మీ ఇద్దరినీ చంపి పారేస్తా చూడు" అంటూ భీముడి మీద పడ్డాడు. అయితే భీమసేనుడే అతడిని చంపిపారేశాడు.
ఆ తరువాత, హిడింబ ప్రేమను భీముడు తిరస్కరించాడు.“నీ అన్నను చంపిన పగతో మమ్మల్ని ఏమైనా చేయగలవు పో పో” అన్నాడు.అపుడు హిడింబ కుంతిని ధర్మరాజును శరణు వేడి, వారి ద్వారా భీముని ఒప్పించి పెండ్లి చేసుకుంది. వారి కుమారుడే ఘటోత్కచుడు అని అందరికీ తెలిసిన విషయమే కదా!

3 ద్రౌపది
పాండవులు లక్క ఇంట్లో చనిపోయారని అందరూ అనుకున్నారు.కాని, వారు తప్పించుకున్నారు. బ్రాహ్మణవేషం ధరించి పాంచాలరాజ్యంలో. ద్రౌపదీస్వయంవరసభను చేరుకున్నారు.
ఆ సభలో అందరూ మత్స్యయంత్రాన్ని ఛేదించడంలో విఫలమైన తరువాత బ్రాహ్మణవేషంలో ఉన్న అర్జునుడు ఆ పని చేశాడు. ద్రౌపది అతనిని వరించింది. ఇది చూసి అక్కడ ఉన్న రాజులు సహించలేకపోయారు. రాజులందరికీ ఇది తమ పరువుప్రతిష్ఠలకు ఒక సవాలుగా అనిపించింది.
“వీరుడైనవాడు ఏ కులానికి చెందినప్పటికీ వాడికి అందరూ సలాము చేయవలసినదే” అని ఒకప్పుడు గర్జించి చెప్పిన దుర్యోధనుడు కూడా ఉక్రోషంలో తాను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తానే విస్మరించాడు.
“ఈ కన్య (ద్రౌపది) ఒక క్షత్రియుని కాకుండా ఒక బ్రాహ్మణుని వరించినందుకు ఈమెను నిప్పుల్లో పడేసి మన దేశాలకు మనం పోదాం. ”अग्नावेनां परिक्षिप्य याम राष्ट्राणि पार्थिवाः। (భారతం 1.188.8) అని మిగిలిన రాజులతో పాటు మీదకు ఎగబడ్డాడు.
వారిని బ్రాహ్మణవేషాల్లోనే భీమార్జునులు అడ్డుకున్నారు. పెద్ద దొమ్మీ జరిగింది. యుద్ధంగా కూడా మారింది. వారిద్దరూ కలిసి ద్రౌపదిమీదకు పోబోయిన రాజులందరినీ చిత్తుచిత్తుగా ఓడించారు. మహా మహా కర్ణుడు కూడా అర్జునుని చేతిలో ఓడిపోయాడు. చేసేదేమీ లేక అందరూ నోరు మూసుకుని ఇంటికి పోయారు.
ద్రౌపది రక్షింపబడింది.

4 అర్జునుడు
తీర్థయాత్రలు చేస్తూ ద్వారకానగరానికి వచ్చిన అర్జునుడు, యాదవకన్య, శ్రీకృష్ణుని చెల్లెలు అయిన సుభద్రను చూసి ఇష్టపడ్డాడు.
సుభద్ర తనను వరిస్తుందో లేదో, యాదవులు ఆమెను తనకు ఇస్తారో లేదో అని అతడికి సందేహం కలిగింది. శ్రీకృష్ణునితో ఆ విషయం చర్చించి, అతడి ప్రోత్సాహం మీదట, అన్న అయిన ధర్మరాజు అనుమతిని కూడా పొందిన మీదట, సుభద్ర రేవతకపర్వతానికి వచ్చిన సందర్భం చూసుకుని ఎత్తుకుపోయాడు.
భోజులు, వృష్ణీయులు, అంధకులు అనే మూడు తెగల యాదవులకు అది చాల అవమానకరంగా తోచింది.
అన్నపానాలు కూడా మానివేసి అందరూ సమావేశమయ్యారు. “రథాలను సిద్దం చేయండిరా. ప్రాసాలను తీసుకురండిరా”
योजयध्वं रथानाशु प्रासानाहरतेति च। (భారతం 1.219.17)
అంటూ అర్జునుని దండించి సుభద్రను తిరిగి తీసుకుని వచ్చేందుకు సంసిద్ధులయ్యారు.
బలరాముని మండిపాటుకైతే హద్దులే లేవు. “భోజనం చేసిన కంచాన్నే విరగ్గొట్టే కులకళంకుడని తెలియక ఆ అర్జునుడిని శ్రీకృష్ణుడి మిత్రుడు కదా అని ఎంతగా గౌరవించాం!
न च सोऽर्हति पूजां तां दुर्बुद्धिः कुलपांसनः।
को हि तत्रैव भूक्त्वान्नं भाजनं भेत्तुमर्हति। (భారతం 1.219.26,27)
అసలు అర్జునుడు అపహరించింది సుభద్రను కాదు, తన మృత్యువునే సుమా! ఇటువంటి పని చేయడం ద్వారా నా తలమీద అర్జునుడు తన పాదం పెట్టినట్టు కాదా? ఆ అర్జునుడు జన్మించిన కౌరవవంశాన్ని ఈ భూమి మీదనే లేకుండా చేస్తాను.
अद्य निष्कौरवमेकः करिष्यामि वसुन्धराम्। (భారతం 1.219.31)”
అంటూ అవమానంతో కుతకుతలాడిపోయాడు. యాదవులందరూ బలరాముని సమర్థిస్తూ “పదండి పదండి” అంటూ రణనినాదాలు చేశారు.
వారికి ఇదొక పరువు సమస్య అయింది!
కాని, శ్రీకృష్ణుడు సుభద్రకు అర్జునుడు తగిన జోడీ అని, స్వయంవరంలో సుభద్ర తనను వరిస్తుందో లేదో అనే సంశయంతో అర్జునుడు ఆమెను ఎత్తుకువెళ్లి ఉంటాడని, అది క్షత్రియులకు అనుచితమైన పనేమీ కాదని నచ్చజెప్పి బలరాముని, మిగిలిన యాదవులను చల్లబరచాడు.
శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో యాదవులు సగౌరవంగా సుభద్రార్జునులను ద్వారకకు తిరిగి తీసుకుని వచ్చి, వారికి వివాహం చేశారు. కాలక్రమేణ వారిరువురికీ జన్మించిన అభిమన్యుడు యాదవులందరికీ ముద్దుల మేనల్లుడు కావడం తెలిసిందే.

5 సాంబుడు
జాంబవతీశ్రీకృష్ణుల కుమారుడు సాంబుడు. దుర్యోధనుని కూతురైన లక్ష్మణను ఇష్టపడ్డాడు. ఆమెను స్వయంవరసభనుండి ఎత్తుకుపోయాడు.
సాంబుడు చేసిన పనికి కౌరవులు ఆగ్రహంతో ఊగిపోయారు. “పట్టండిరా ఈ దుర్మార్గుడిని. మనం దయదలచి ఇచ్చిన భూమిని ఏలుకుంటున్న ఈ వృష్ణీయులు (యాదవులు) ఏమి చేస్తారో చూద్దాం.
बध्नीतेमं दुर्विनीतं किं करिष्यन्ति वृष्णयः।
येस्मत्प्रसादोपचितां दत्तां नो भुञ्जते महीम्।“ (భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)
అని మీదపడి బంధించారు.
యాదవులంటే వారికి చిన్నచూపు. వారు తమ పిల్లను చేసుకొనడం తమకు పరువు తక్కువగా కౌరవులు భావించారు!
ఈ విషయం తెలిసిన యాదవులు సాంబుడిని విడిపించుకునేందుకు యుద్ధసన్నద్ధులయ్యారు. కాని, బలరాముడు యాదవకౌరవవంశాలవారికి నడుమ కలహం వద్దని, శాంతిని కోరి ఉద్ధవుని రాయబారిగా పంపాడు. భీష్మాదివృద్ధులు ఎంత నచ్చజెప్పినా వినకుండా దుర్యోధనాదికౌరవులు మాత్రం అహంకారంతో మిడిసిపడ్డారు.
“ఆహా! కాలమహిమ కాకుంటే కాళ్ల దగ్గర పడి ఉండాల్సిన చెప్పులు కిరీటం ఉండవలసిన తలమీద ఉండగోరుతున్నాయి కదా?
अहो महच्चित्रमिदं कालगत्या दुरत्यया।
आरुरुक्षत्युपानद्वै शिरो मुकुटसेवितम्।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.24)
మన పాండురాజు వారి కుంతిని చేసుకున్నాడు. మన అర్జునుడు వారి సుభద్రను చేసుకున్నాడు. ఇలా కాస్త బంధుత్వం కలిసింది కదా అని మన ప్రక్కనే కూర్చునేందుకు సాహసిస్తున్నారు. వీరు మాకు చెప్పవచ్చారా?” అంటూ అహంకరించి బలరాముని మాటలను తిరస్కరించారు.
బలరాముడికి వొళ్లు మండింది. “ఏమిటేమిటీ? మేము చెప్పులమూ, వారేమో తలకాయలూనా?
उपानहः किल वयं स्वयं तु कुरवः शिरः।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.38)
ఈ రోజు భూమిమీద కౌరవులు లేకుండా చేస్తాను
अद्य निष्कौरवीं पृथ्वीं करिष्यामि। (భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)”
అంటూ హస్తినాపురాన్ని తన హలంతో లాగి గంగలోనికి నూకేందుకు ఉద్యమించాడు. ఆ దెబ్బకు హస్తినాపురం ఊగిపోయింది. కౌరవులందరూ హడలిపోయి, సాంబుడిని, లక్ష్మణను బలరామునికి అప్పగించి, క్షమాపణలు కోరి, రక్షించమన్నారు. దయాళువైన బలరాముడు సరేనని, వారు సమర్పించిన కానుకలను, వధూవరులను వెంటబెట్టుకుని ద్వారకకు చేరుకున్నాడు.
గొడవ చల్లబడింది.

6 మధువు
రావణాసురుని పినతల్లి అనల. ఆమెకు కుంభీనసి అనే కూతురు ఉండేది. ఆమెను మధువు అనే ఒక రాక్షసుడు ఇష్టపడ్డాడు. పేరుకు రాక్షసుడే అయినా దేవతలకు మంచి మిత్రుడు.కాని,రావణాసురుని పట్ల భయంతో ఏమి చేయాలో తెలియక ఊరుకున్నాడు.
ఇలా ఉండగా ఒకసారి రావణాసురుడు జైత్రయాత్రకు వెళ్లాడు. యుద్ధోన్మాదంలో తన చెల్లెలైన శూర్పణఖకు భర్త అయిన విద్యుజ్జిహ్వుని కూడా గుర్తించలేక స్వయంగా నరికి చంపివేశాడు. శూర్పణఖ వచ్చి ఏడ్చి మొత్తుకుంటూ ఉంటే ఆమెను పోయి దండకారణ్యంలో సుఖంగా ఉండమని పంపించేశాడు రావణుడు.
వారు ఈ గొడవల్లో ఉండగా సమయం చూసుకుని మధువు కుంభీనసిని ఎత్తుకుపోయాడు.
రావణుడు విజయం సాధించి, వెనక్కు వస్తూ దారిలో కంటికి అందంగా కనబడిన రాజస్త్రీలను, ఋషిస్త్రీలను, గంధర్వస్త్రీలను,పన్నగస్త్రీలను, రాక్షసస్త్రీలను, అసురస్త్రీలను, మానుషస్త్రీలను, యక్షస్త్రీలను, దానవస్త్రీలను ఎవరి పట్లా ప్రత్యేకపక్షపాతం చూపకుండా అపహరించాడు. వారు వివాహితలా లేక అవివాహితులా అన్నది కూడా గమనించలేదు. తనకు అడ్డుపడిన వారి వారి బంధువులను యథేష్టంగా సంహరించాడు.
दर्शनीयां हि रक्षः कन्यां स्त्रीं वाऽथ पश्यति।
हत्वा बन्धुजनं तस्या विमाने तां रुरोध ह।। (రామాయణం7.24.2)
ఆ స్త్రీల విలాపంతో లంక ప్రతిధ్వనించిపోయింది. “ఒరే దుర్బుద్ధీ! నువు స్త్రీమూలంగానే నశిస్తావురా” स्त्रीकृतेनैव प्राप्स्यते दुर्मतिर्वधम्। (రామాయణం7.24.2)
అంటూ వారు శపించేశారు.
ఇంతలో మధువు తన చెల్లెలైన కుంభీనసిని ఎత్తుకుపోయాడన్న వార్త తెలిసింది. దానితో ఆ రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. లోకవిజేత అయిన తన చెల్లెలినే ఎవడో ఎత్తుకుపోతాడా? ఎంత ధైర్యం? మళ్లీ ఇక్కడ రావణాసురుడికి కూడా పరువు సమస్యే!
అతడి కళ్లు ఎర్రగా మారిపోయాయి. “వెంటనే రథం సిద్ధం చేయండిరా. రాక్షసవీరులు సిద్ధం కండిరా. మారణాయుధాలు పట్టుకుని బయల్దేరండిరా” అని గర్జిస్తూ మధుపురానికి దండయాత్ర చేశాడు.
అయితే అతడి చెల్లెలు కుంభీనసి వచ్చి అన్న కాళ్ల మీద పడి, “అన్నా, జరిగిందేదో జరిగిపోయింది. ఇపుడు నా భర్తను చంపి, నన్ను విధవను చేయవద్దు” అని వేడుకుంది.
రావణుడు కాసేపు ఆలోచించి, “సరే, నీమీద దయతో అతడిని నేను చంపబోవటం లేదు. నీ భర్త ఎక్కడ? త్వరగా రమ్మను. అతడితో కలసి, స్వర్గలోకాన్ని జయించేందుకు బయల్దేరుతాను” అన్నాడు.
क्व चासौ तव भर्ता वै मम शीघ्रं निवेद्यताम्।
सह तेन गमिष्यामि सुरलोकं जयावहे।। (రామాయణం 7.25.44,45)
మొత్తానికి అలా రాజీ కుదిరింది. తరువాత రావణుడు ఎత్తుకువచ్చిన స్త్రీల శాపం ఫలించి సీత కారణంగా రాముడి చేతిలో చనిపోయాడు.
అయితే రావణుడి బావ అయిన మధువుమహాశివభక్తుడు. మహా ధర్మాత్ముడు. జనరంజకంగా పరిపాలన చేశాడు.కాని, ఆ కుంభీనసీమధువుల కుమారుడైన లవణాసురుడికి మాత్రం మేనమామ అయిన రావణాసురుడి బుద్ధులు వచ్చాయి. వాడు పెట్టే బాధలను సహించలేక మునులు రాముడికి మొర పెట్టుకున్నారు. శత్రుఘ్నుడు రాముని ఆజ్ఞను పొంది ఆ లవణాసురుడిని సంహరించాడు.
***

ఈ విధంగా తమ కుటుంబానికి చెందిన స్త్రీని ఎవడో తమ అనుమతి లేకుండా పెండ్లాడడం అనేది ఎంతటివారికైనా ఇజ్జత్ కా సవాల్. అది ఒక మానసికమైన పీడ.
కురువంశంవారు తమ కన్యను ఎత్తుకుపోయారని యాదవులు మండిపడ్డారు. యాదవులు తమ కన్యను ఎత్తుకుపోయారని కురువంశంవారు కుతకుతలాడిపోయారు. రాక్షసులు తమ స్త్రీని ఎత్తుకుపోయారని మానవులు వగచారు. మనిషి మా కన్యను వరిస్తాడా అని రాక్షసులు కోపగించుకున్నారు. ఎవరూ తక్కువ తినలేదు.

పరువు ఎవడబ్బ సొమ్ము? ఎవరికి ఆ పరువు బరువు?

అయితే ఈ కథలన్నిటిలోనూ గమనించవలసింది ఏమిటంటే –

ప్రతిచోటా బలవంతులే గెలిచారు.
ఓడినవారు చాలావరకు రాజీకొచ్చారు.
అప్పుడైనా ఇప్పుడైనా జరిగేది అదే.

కాబట్టి, ఇప్పటి ఆశావహులు ఎవరైనా సరే, స్వయంగా తమకు తగినంత బలం లేకుండా, బలవంతుల ఇష్టం లేనిదే బలవంతుల కన్యల జోలికి పోరాదు. బలం అంటే ఆరోజుల్లో పరాక్రమం అయ్యుండవచ్చు. ఈరోజుల్లో ధనం, పలుకుబడి కూడా.

బలవంతుడు మరొక బలవంతుడినే ఇష్టపడతాడు, అతడితోనే రాజీ పడతాడు. ప్రపంచమంతటా ఇదే సహజం.

అంతే కాదు, బలవంతుడు అర్హత కలిగిన వినయవంతుడిని కూడా ఇష్టపడతాడు. శుక్రాచార్యులవారు తన కూతురును క్షత్రియుడైనప్పటికీ వినయవంతుడైన యయాతిరాజుకు సంతోషంగా ఇచ్చి పెళ్లి చేశాడు.

అంతేగాని, చెత్త చెత్త సినిమాలలో చూపినట్టు పోకిరీతనంతో బలవంతుల జోలికి పోయి భంగపడకండి, సమాజంలో అందరినీ మాకు న్యాయం చేయండి అంటూ దేబిరించకండి.

బలమా? అర్హతతో కూడిన వినయమా?
ఏదో ఒకటి ఎంచుకోండి.

కాబట్టి, ఓ ఆశావహులారా! ఈ రెండిటిలో ఏదో ఒకటి లేకుండా పనికిమాలిన సాహసాలు చేసి, దానికి తగిన ప్రతిఫలం అనుభవించి, మీ సమస్య తప్ప మరో సమస్య సమాజంలో మరేమీ లేనట్టు ఊరికే గగ్గోలు పుట్టించడాలు మానుకోండి.

Friday, 20 July 2018

రాముడు నిజంగా పితృవాక్యపాలకుడేనా?

అదెప్పుడో - త్రేతాయుగం. 
వసంతకాలం ఆరంభమైంది. చైత్రమాసం. శుక్లపక్షం. పునర్వసునక్షత్రయుక్తమైన దినం.

శ్రీరాముడు తన సోదరుడైన లక్ష్మణునితోను, ఇతర మిత్రులతోనూ కలిసి ఉల్లాసంగా మాటలాడుతున్నాడు. ఇంతలో దశరథమహారాజుకు ఎంతో విశ్వాసపాత్రుడైన సుమంత్రుడు అక్కడకు విచ్చేశాడు. "రామా! మీ తండ్రిగారు వెంటనే నిన్ను తన చెంతకు రమ్మని ఆదేశించారు" అని పలికాడు. రాముడు తక్షణమే అతని వెంట బయలు దేరి వెళ్ళాడు.

నాలుగు దిక్కుల నుండి విచ్చేసిన రాజుల నడుమ దశరథ మహారాజు కొలువు దీరి ఉండగా రాముడు ఆ సభలో ప్రవేశించాడు. రాముని చూడగానే సభలో ఉన్న పౌరజానపదులు, రాజులు అందరూ జయజయధ్వానాలు చేశారు. అప్పటికే దశరథుడు రాముని పట్టాభిషేకవిషయంలో ఏకగ్రీవంగా ప్రజామోదాన్ని పొంది ఉన్నాడనే విషయం రామునికి ఇంకా తెలియదు. తనకు పాదాభివందనం చేసిన రాముని దశరథుడు తనివి తీరనట్టు చూస్తూ, "నాయనా, నీవు పుష్యమీ నక్షత్రయుక్తమైన రేపటి రోజున యువరాజపట్టాభిషిక్తుడవు కావాలి. ప్రజలను రంజింపజేస్తూ భూమిని పాలించాలి." అని పలికాడు. శ్రీరాముడు తండ్రి మాటను అంగీకరించి, ఆయనకు నమస్కరించి, తన నివాసభవనానికి వెళ్ళాడు.

దశరథునికి తన అంతః పురానికి చేరగానే మరలా ఒకసారి రాముని చూడాలనిపించింది. మరలా సుమంత్రునితో కబురు పంపగా రాముడు మరలా వచ్చాడు. "నాయనా! ప్రజలందరూ నిన్నే తమ రాజుగా కోరుకుంటున్నారు. అందువల్ల నిన్ను యువరాజుగా అభిషేకిస్తాను. నాయనా! నా మనసు మారక ముందే, రేపే ఆ శుభకార్యం జరగాలి. "చలా హి ప్రాణినాం మతిః" - ప్రాణుల బుద్ధి చంచలమైనది అని అంటారు కదా!" అన్నాడు. రాముడు సరేనన్నాడు.

అక్కడనుండి బయలు దేరి తల్లి ఆశీస్సులను అందుకున్నాడు. వశిష్ఠమహర్షి చెప్పిన ప్రకారంగా సీతాసమేతుడై వ్రతదీక్షితుడు అయ్యాడు. మరుసటి రోజు ఉదయమే చక్కని వస్త్రాభరణాలను ధరించి రాముడు సిద్ధంగా ఉండగా మరలా సుమంత్రుడు వచ్చాడు. "కైకేయీసమేతుడై ఉన్న మీ తండ్రి మిమ్మల్ని చూడగోరుతున్నాడు. ఆలస్యం చేయక వెంటనే వెళ్ళవయ్యా రామయ్యా" అన్నాడు.

రాముడు మహానందభరితుడై బయలుదేరాడు. అక్కడ కైకేయీ మందిరంలో దీనముఖంతో ఉన్న తండ్రిని రాముడు చూశాడు. పినతల్లికి, తండ్రికి నమస్కరించాడు. తండ్రి "రామా!" అని మాత్రమే తండ్రి పలికాడు. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. రాముని సూటిగా చూడలేకపోయాడు. అతనితో నోరు విప్పి మాటలాడలేకపోయాడు. అతని మనసులో ఏదో అపరాధభావం.

తండ్రి పరిస్థితి రామునికి కంగారును కలిగించింది. "అమ్మా! ఎందుకు నాన్నగారు నాతో మాట్లాడటం లేదు? నావల్ల ఏదైనా తప్పు జరిగిందా?"

అతోషయన్ మహారాజమ్ అకుర్వన్ వా పితుర్వచః।
ముహూర్తమపి నేచ్చేయం జీవితుం కుపితే నృపే।।
(రామాయణం 2.18.15)

"మహారాజైన నాన్నగారిని సంతోషపెట్టకుండా, ఆయన చెప్పిన మాటను పాటించకుండా ఆయన కోపానికి గురై ఒక్క ముహూర్తకాలం కూడా బ్రతకడానికి నేను ఇష్టపడను" అని ప్రక్కనే ఉన్న పినతల్లి కైకేయిని తండ్రి దీనస్థితికి కారణం అడిగాడు.

"నాయనా! మీ తండ్రి మునుపు నాకొక వరం ఇచ్చి ఉన్నాడు. నేను దానిని తీర్చమని ఇప్పుడు అడిగాను. దానిని నెరవేర్చితే నీవు ఏమనుకుంటావో అనే భయంతో నీతో మాట్లాడటం లేదు. రాజు నీకు చెప్పదలచుకున్నది నీకు ఇష్టమనిపించినా కష్టమనిపించినా తప్పక చేస్తానని మాట ఇస్తే నేనే నీకు చెబుతాను" అన్నది కైకేయి.

అందుకు రాముడు -
"కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్ణాభిభాషతే" (2.18.30)
అమ్మా! తప్పక చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాముడు రెండువిధాల మాటలాడడు. రాజు, తండ్రి అయిన ఆయన మాటపై నిప్పులో దూకడానికైనా, విషం త్రాగడానికైనా, సముద్రంలో మునిగిపోవడానికైనా నేను సిద్ధమే. మహారాజు మనసులోని మాట నాకు చెప్పండి." అన్నాడు.

"రామా! భరతునికి పట్టాభిషేకం జరగాలని, నీవు వెంటనే దండకారణ్యానికి వెళ్లి అక్కడ పద్నాల్గు సంవత్సరాలు గడపాలని నేను రాజుగారిని కోరాను.

ఏతత్ కురు నరేంద్రస్య వచనం రఘునందన।
సత్యేన మహతా తాత తారయస్వ నరేశ్వరమ్।।
(రామాయణం 2.18.40)

మీ నాన్నగారి మాటను నిలబెట్టాలనుకుంటే నువ్వు వెంటనే బయలుదేరు" అన్నది కైకేయి.

వెంటనే రాముడు -
"ఏవమస్తు గమిష్యామి వనం వస్తుం అహంత్వితః।
జటాజినధరో రాజ్ఞః ప్రతిజ్ఞామనుపాలయన్।।
(రామాయణం 2.19.2)

"సరే, ఇదిగో రాజుగారి ప్రతిజ్ఞ (వరమిస్తానని నీకిచ్చిన మాట) మేరకు జటలను, జింకచర్మాన్ని ధరించి అడవిలో నివసించడానికి బయలుదేరుతున్నాను" అంటూ పెద్దగా కాలహరణం చేయకుండా బయలుదేరాడు.
***********
ఇదీ జరిగిన కథ - కానీ,

"ఓ రామా! నువ్వు పట్టాభిషేకం చేసుకో" అని దశరథుడు రామునితో నేరుగా చెప్పిన మాట నిజం. కానీ, ఆయన అదే నోటితో "ఓ రామా! నీవు అడవికి పో" అంటూ నేరుగా చెప్పలేదుగా?" కైకేయి దుర్బుద్ధితో తన మనసులో ఉన్న మాటను చెప్పేసి, అదే నీ తండ్రి మనసులోని మాట. దాన్ని పాటించు అన్నంత మాత్రాన సరే అంటూ పౌరుషంతో రాముడు రాజ్యాభిషేకం వదులుకొని అడవికి అలా వెళ్లిపోవడం సమంజసమేనా?"

ఆవిధంగా తండ్రి తనతో చెప్పని మాటను పట్టుకుని రాముడు అడవికి పోతే అతనికి "పితృవాక్యపరిపాలకుడు" అనే బిరుదు ఎందుకు వచ్చింది? అసలా బిరుదును అతనికి తగిలించిందెవరు? అని కొందరు సోదరులకు పెద్ద సందేహమే వచ్చింది.

వారి సందేహానికి నాకు తోచిన సమాధానం ఇది -



"ఓ రామా! నువ్వు పట్టాభిషేకం చేసుకో" అని దశరథుడు రామునితో నేరుగా చెప్పిన మాట నిజం. కానీఆయన అదే నోటితో "ఓ రామా! నీవు అడవికి పో" అంటూ నేరుగా చెప్పలేదుగా?"

"కైకేయి దుర్బుద్ధితో తన మనసులో ఉన్న మాటను చెప్పేసిఅదే నీ తండ్రి మనసులోని మాట. దాన్ని పాటించు అన్నంత మాత్రాన సరే అంటూ పౌరుషంతో రాముడు రాజ్యాభిషేకం వదులుకొని అడవికి అలా వెళ్లిపోవడం సమంజసమేనా?"

"దశరథుడు నోరెత్తి అడవికి పోవయ్యా అని రాముడికి చెప్పనే లేదు కదా?  మరి అలా చెప్పించుకోకుండానే బయలుదేరి అడవికి వెళ్లిపోయిన రాముడికి  "పితృవాక్యపరిపాలకుడు" అనే బిరుదు ఎందుకు వచ్చింది?  అసలా బిరుదును అతనికి తగిలించిందెవరు?" అని కొందరు సోదరులకు పెద్ద సందేహమే వచ్చింది
**********
**********
తన ఆశ్రమానికి విచ్చేసిన నారదమహర్షిని చూసేసరికి వాల్మీకికి పరమానందం కలిగింది.    నారదుడు గొప్ప తపస్సంపన్నుడు.  స్వాధ్యాయతత్పరుడు.  మహావాగ్మి.  తన సందేహాలను అలవోకగా తీర్చగలిగిన దిట్ట. 

వచ్చిన నారదునికి అతిథి పూజ చేసిన తరువాతవాల్మీకి పదహారు గొప్ప గుణాలను పేర్కొని,  తన సమకాలికులలో ఆ గుణాలన్నింటిని కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు.  "లేకనేమయ్యా?  ఉన్నాడుగా రాముడు?" అంటూ నారదుడు రాముని గూర్చి సంక్షిప్తంగా చెప్పాడు. 

ఆ సందర్భంలో వాల్మీకి అడిగిన గుణాలలో ఒకటి - "చారిత్రేణ యుక్తత్వం " - (చారిత్రతను కలిగి ఉండటం)  అంటే - తన వంశానికి చెందిన వారు మునుపు పాటించిన సదాచారాలు తానూ కూడా పాటించడం అని అర్థం.  రాముడికి అటువంటి గుణం ఉన్నది అని నారదుడు వాల్మీకికి నొక్కి చెప్పాడు.  రాముని పూర్వీకుల సదాచారాలలో ఒకటి ఏమంటే - ఆడిన మాటను తప్పకపోవటం (వాగ్దానభంగం చేయకపోవటం) అనేది.      

రాముని తండ్రి అయిన దశరథుడు కూడా ఇదే విధంగా తన పూర్వీకుల పద్ధతిని అనుసరించి, ఆడిన మాటను ఎన్నడూ తప్పకుండా హుందాగా జీవితాన్ని గడిపిన వాడే.  కానీవయసులో బాగా పెద్దవాడయ్యాక వాగ్దానభంగానికి పాల్పడవలసిన దురవస్థ రెండుసార్లు పట్టింది.   వింత ఏమిటంటే - అతని ఆ బలహీనతకు కారణం అతని పెద్ద కుమారుడు రాముడే!  
**********
**********

(1)
ఒకనాడు దశరథుడు తన గురువులతోనుబంధువులతోనుకూర్చుని ముచ్చటలాడుతున్నాడు.  రామలక్ష్మణభరతశత్రుఘ్నులకు పెళ్లి చేయవలసిన వయసు వచ్చింది కదావారికి తగిన కన్యలు ఎక్కడున్నారు అని చర్చలు జరుగుతున్నాయి.  ఆ సమయంలో విశ్వామిత్రమహర్షి అక్కడకు వేంచేశారు.  దశరథుడు ఆ మహర్షి పాదాలమీద వాలిస్వాగతం పలికి, -

"బ్రూహి యత్ ప్రార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి।
కార్యస్య న విమర్శం చ గన్తుమర్హసి కౌశిక।।  (రామాయణం  1.18.54&56)

స్వామీమీరు వచ్చిన పని ఏమిటి?  నేను తప్పక ఆ పనిని నెరవేరుస్తాను.  ఆ పని నెరవేరుతుందో లేదో అని సందేహం పెట్టుకోకుండా అడగండి."  అని ధారాళంగా మాట ఇచ్చేశాడు.  విశ్వామిత్రుడు "ఓ రాజా!  రాక్షసులబారినుండి నా యజ్ఞాన్ని రక్షించేందుకు గాను నీ కుమారుడైన శ్రీరాముని నాతో పంపవయ్యా" అని అడిగాడు.

ఆ మాటతో దశరథుడు కలవరపడిపోయాడు.  అంతవరకు రాముడికి పెళ్లీడు వచ్చిందని బంధువులతో మాట్లాడిన ఆయన హఠాత్తుగా అదంతా మరచి పోయి - "నా రాముడు బాలుడు స్వామీవాడు ఇంకా ఏ విద్యలను పూర్తి చేసింది కూడా లేదురాక్షసులు ఎంతటి బలవంతులో కూడా ఎరుగని వాడురాముడు వద్దులెండినేనే స్వయంగా మీ యజ్ఞాన్ని రక్షించడానికి వస్తాను. ఎన్నెన్నో కష్టాలు పడిన తరువాత నేను బాగా ముసలివాడిని అయ్యాక పుట్టక పుట్టక పుట్టిన నలుసు వాడు.  దాచేసి వాడిని తీసుకు వెళ్ళకండి."

బాలో హ్యకృతవిద్యశ్చ న చ వేత్తి బలాబలమ్।
అహం తత్రాగమిష్యామి న రామం నేతుమర్హసి।।
షష్ఠిర్వర్షసహస్రాణి మమ  జాతస్య కౌశిక।
దుఃఖేనోత్పాదితశ్చాయం న రామం నేతుమర్హసి।। (రామాయణం  1.20.6-10)

అంటూ ముందు దీనంగా బ్రతిమాలాడుకున్నాడు.  అయినప్పటికీ విశ్వామిత్రుడు సరేనని మాట్లాడకపోయేసరికి - "బాలం మే తనయం బ్రహ్మన్నైవ దాస్యామి పుత్రకమ్  (1.20.24) స్వామీనా పిల్లవాణ్ణినా కొడుకునునా పుత్రుడిని నీతో పంపను పోవయ్యా" అంటూ మొండికేశాడు. 

దానితో విశ్వామిత్రునికి  కోపం వచ్చింది. 
"పూర్వమర్థం ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్ఛసి।
రాఘవాణామయుక్తోSయం కులస్యాస్య విపర్యయః।।" (రామాయణం 1.21.2)

"ఏమయ్యా  దశరథా?  మొదట నేను అడిగినది ఇస్తానని మాట ఇచ్చి ఇప్పుడు కాదంటున్నావే?  మీ రాఘవవంశానికి ఇది ఎంతమాత్రం తగని పని కదా?" అన్నాడు.  "సరేలేఅలాగే కానీ!" అంటూ వెళ్ళిపోబోయాడు.  కానీఇంతలో రాజగురువైన వసిష్ఠుడు కలగజేసుకుని, "రాజా!  ముల్లోకాల్లోనూ ధర్మాత్ముడవని మంచి పేరు తెచ్చుకున్నావు. ఇప్పుడు ఇలా ఆడిన మాట తప్పి అధర్మం చేసి వంశానికి మచ్చ తెచ్చే పని చేయవద్దు" అంటూ దశరథునికి ఎలాగో నచ్చజెప్పి  విశ్వామిత్రుడి వెంట రాముని పంపించగలిగాడు.

దాంతో ఆడిన మాటను నిలబెట్టుకోలేని పరిస్థితినుండి దశరథుడు బయటపడ్డాడు.  మొదటిసారి ఎలాగో గండం గట్టెక్కేసింది.  కానీ రెండోసారి మళ్ళీ అటువంటి పరిస్థితి దాపురించింది.  ఈసారి అంత సులువైన పరిష్కారం లభించే అవకాశం కాదు.  ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఏమి చేయదలచుకున్నా ఇచ్చిన మాట తప్పినట్టయ్యే వింత పరిస్థితులలో చిక్కుకున్నాడు. 
**********
**********

(2)
ప్రజలందరూ రాముడు రాజు కావాలని కోరుకున్నారు.  దశరథుడు రాముని పిలిపించి "రామా! రేపు నీకు యువరాజపట్టాభిషేకం జరుపబోతున్నాను.  నీవు గురువులు చెప్పిన విధంగా సిద్ధమైపో" అని చెప్పాడు. (అలా రామునికి మాట ఇచ్చేశాడు)

ఈ శుభవార్తను విని కైకేయి సంతోషపడుతుందేమో అని దశరథుడు అనుకున్నాడు.  కానీఆమె మాత్రం రాముని పద్నాల్గు సంవత్సరాలపాటు అడవికి పంపితన కొడుకైన భరతునికి పట్టాభిషేకం జరపమని కోరింది.  శంబరమహాసురునితో యుద్ధం చేస్తూ దశరథుడు గాయపడినపుడు కైకేయి అతనిని కాపాడింది.  ఆ సందర్భంలో దశరథుడు సంతోషించి కైకేయికి రెండు వరాలను ఇస్తానన్నాడు.  ఆమె తనకు అవసరమైనపుడు ఆ వరాలను కోరుకుంటానని అన్నది.  దశరథుడు సరేనన్నాడు.  కైకేయి ఆ సందర్భాన్ని గుర్తు చేసిఅపుడు ఇచ్చిన మాటను ఇపుడు నిలబెట్టుకొమ్మని అడిగింది.  ఆ విధంగా నీ వంశమర్యాదనునీ శీలాన్నినిలబెట్టుకొనినీ జన్మకు సార్థకత చేకూర్చుకొమ్మని అన్నది.

కులం చ శీలం చ హి రక్ష జన్మ చ। (2.11.30)

 ఇటువంటి పరిస్థితిని ఎన్నడూ ఊహించని దశరథుడు ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు.  ఇరుకులో పడ్డాడు.  కైకేయి కి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు గాను రాముని అడవికి పొమ్మంటే రాముడు మారు మాటాడక అడవికి నిశ్చయంగా పోతాడు.  ఆ నమ్మకం అతనికి ఉంది. 

నాలం ద్వితీయో వచనం పుత్రో మాం ప్రతిభాషితుమ్।
స వనం ప్రవ్రజేత్యుక్తో బాఢమిత్యేవ వక్ష్యతి।। (రామాయణం - 2.12.86)

కానీపొమ్మంటే పోతాడు కదా సమస్య ఏముంది అని, "పోవయ్యా రామా" అనే రెండు పదాలు పలికితే "నిన్ను యువరాజును చేస్తాను" అని రామునికి తాను ఇచ్చిన మాట తప్పినట్టవుతుంది.  అలాగని కైకేయి కోరినట్టు రాముని పంపకపోతే కైకేయికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది.  ఆవిధంగా దశరథుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే చిక్కులో పడ్డాడు.   రాముడు కానీకైకేయి కానీ ఎవరో ఒకరు వెనుకకు తగ్గితే తనకు ఆడిన మాట తప్పిన పాపం తప్పుతుంది.

నిజానికి రాముని అడవికి పంపడం అతనికి మనసులో ఎంత మాత్రం సమ్మతం కూడా కాదు.  అందువల్ల అతడు అటువంటి కోరికను కోరవద్దని కైకేయిని బ్రతిమాలాడాడు.  కోపగించుకున్నాడు.  శపించాడు.  రాముడు అడవికి వెళ్ళిపోతే తాను బ్రతకబోనని నిజం చెప్పాడు.  చివరకు ఆమె  కాళ్ళు పట్టుకుంటానని కూడా అన్నాడు.
స్పృశామి పాదావపి తే ప్రసీద మే। (2.12.114) 

అయినప్పటికీ ఆమె ఎంత మాత్రం వెనుకకు తగ్గకుండాఅతి కఠినంగా, "నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం రాముని అడవికి పంపకపోతే నీ ముందే నేను ప్రాణాలను వదిలేస్తాను" అని బెదిరించింది.
సమయం చ మమాద్యేమం యది త్వం న కరిష్యసి।
అగ్రతస్తే పరిత్యక్తా పరిత్యక్ష్యామి జీవితమ్।। (2.14.10)

ఇక దశరథునికి గత్యంతరం లేకపోయింది.  తన మాటను నిలబెట్టేందుకు రాముడొక్కడే సమర్థుడు.  అతనికి కబురు పంపించాడు.  వెంటనే రాముడు వచ్చాడు.  కానీనిర్దోషి అయిన అతనిని తన కారణంగా అడవులకు పంపించేందుకు మనసొప్పని దశరథుడు "రామా" అని ఒక్క మాట పలికి  మరేమీ  మాటాడలేకచివరకు అతనిని సూటిగా కూడా చూడలేకకళ్లనీళ్లు పెట్టుకొని ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు.

తాను తండ్రిపట్ల ఏమైనా తప్పు చేశానేమో అని మథనపడిన రామునితో కైకేయి దశరథుడు తనకు ఇచ్చిన వరాలను పేర్కొని,  అలా ఇచ్చేందుకు గల కారణాలను కూడా వివరించితండ్రిమాటను నిలబెట్టేందుకు గాను నువ్వు ఆవిధంగా ఆచరించవలసి ఉన్నది" అని చెప్పింది.
ఏతత్ కురు నరేంద్రస్య వచనం రఘునందన।
సత్యేన మహతా తాత తారయస్వ నరేశ్వరమ్।। (రామాయణం 2.18.40)

తండ్రికి తనపై గల ప్రేమ శ్రీరామునికి సంపూర్ణంగా తెలుసు.  ఆ ప్రేమతోనే తనను వెళ్ళమని చెప్పలేకపోతున్నాడని గ్రహించాడు.  మునుపు విశ్వామిత్రుడు అడిగినపుడు కూడా తనమీద ప్రేమకొద్దీ తనను అతనితో పంపలేక వంశాచారాన్ని భగ్నపరచే సాహసం చేసిన విషయం రాముడు ఇంకా మరచిపోలేదు.  ఎలాగో గురువైన వసిష్ఠుని వల్ల ఆ ఆపద గడిచింది.  తాను ఆనాడు బాలుడు.  కానిఈనాడు సమర్థుడైన యువకుడు.  తండ్రి మాటను నిలబెట్టవలసిన బాధ్యత తనమీద ఉన్నది.  అది గ్రహించుకున్న స్థితప్రజ్ఞుడు రాముడు అడవులకు వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు.

దండకారణ్యమేషోSహమితో గచ్చామి సత్వరః।
అనుక్తోప్యత్ర భవతా భవత్యా వచనాదహమ్।
వనే వత్స్యామి విజనే వర్షాణీహ చతుర్దశ।। (రామాయణం 2.19.11&23)

"అమ్మాఇదిగో,  నేను వెంటనే దండకారణ్యానికి బయలుదేరుతున్నాను.  తండ్రి గారు నేరుగా చెప్పకపోయినా మీ మాట మేరకు (మీకిచ్చిన మాట మేరకు)  అక్కడ పద్నాలుగు సంవత్సరాలు నివసిస్తాను."  అని తండ్రి ముందే చెప్పి బయలుదేరాడు. 
**********
**********
ఈ విధంగా తండ్రి తనను స్వయంగా అడవికి పొమ్మని ఆజ్ఞాపించకున్నా - పినతల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు రాముడు అడవికి బయలుదేరడం ఖచ్చితంగా  పితృవాక్యపరిపాలనమే!  ఈ మాటను అన్నది నేను కాదుమరెవరో ఒక మానవమాత్రుడు కూడా కాదువారు కూడా ఒకరిద్దరు కాదు.  ఎవరెవరు ఏయే సందర్భాలలో  అలా అన్నారో ఈ క్రిందన రామాయణశ్లోకాల సంఖ్యతో సహా చూడండి.  పేర్కొనబడిన ప్రతి శ్లోకానికి అర్థం లేదా భావం రాముడు పితృవాక్యపరిపాలకుడు అనే. 

1) మొదటగా నారదుడు వాల్మీకితో అన్నాడు:
స జగామ వనం వీరః ప్రతిజ్ఞామానుపాలయన్।
పితుర్వచననిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్।।  (రామాయణం 1.1.24)

2) బ్రహ్మ వాల్మీకితో ఈవిధంగా అన్నాడు:
వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాత్ శ్రుతమ్।
న తే వాగనృతా కావ్యే  కాచిదత్ర భవిష్యతి।।  (రామాయణం 1.2.32&35)

"ఓ వాల్మీకీనారదుడు నీకు ఎలా చెప్పాడో అలాగే ధీరుడైన రాముని కథను వ్రాయవయ్యా.  నీవు వ్రాసిన ఒక్క మాటకూడా అసత్యం కాజాలదు" అని బ్రహ్మ వరం ఇచ్చాడు.  కాబట్టి రాముడు పితృవాక్యపరిపాలకుడు అని నారదుడు అన్న మాట సత్యమని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వాల్మీకితో చెప్పినట్టే కదా?

3) లక్ష్మణుడు హనుమంతునితో ఇలా అన్నాడు:
పితుర్నిర్దేశపారగః ....
రాజ్యాద్భ్రష్టో  వనే వస్తుం మయా సార్థమిహాగతః।। (రామాయణం 4.4.8-10)

4) అంగదుడు జటాయువు సోదరుడైన సంపాతితో ఈవిధంగా అన్నాడు:
రామో దాశరథిః శ్రీమాన్ ప్రవిష్టో దండకావనమ్।
పితుర్నిర్దేశనిరతో  ధర్మ్యం పన్థానమాశ్రితః।।  (రామాయణం 4.57-58)

5) హనుమంతుడు అశోకవనంలో సీతమ్మకు తన ఉనికిని తెలియజేసేందుకు ముందు ఈ విధంగా శ్రీరాముని కీర్తించాడు:
తస్య సత్యాభిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః।
సభార్యః  సహా చ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనమ్।।  (రామాయణం 5.32.8)

6) హనుమంతుడు రావణుడితో కూడా అదే విషయం చెప్పాడు:
పితుర్నిర్దేశాన్నిష్క్రాంతః ప్రవిష్టో దండకావనమ్।।   (రామాయణం 5.51.5)

7) "పద్నాలుగేళ్ళు అడవిలో ఉంటాను"  అన్న మాటను రాముడు కూడా అంతే పట్టుదలతో నిలబెట్టుకున్నాడు.  తండ్రి చనిపోయిన తరువాతరాముని వెతుక్కుంటూ చిత్రకూటానికి వచ్చిన భరతుడుజాబాలివసిష్ఠుడు తదితరులు వనవాసం మానిఅయోధ్యకు తిరిగి వచ్చిపట్టాభిషేకం చేసుకొమ్మని రాముని ఎంతగా వత్తిడి చేసి చెప్పినప్పటికీ,
తేన పిత్రాssహమప్యత్ర నియుక్తః పురుషర్షభ।
చతుర్దశ వనే వాసం వర్షాణి వరదానికమ్।। (రామాయణం 2.107.7)
అంటూ నిర్ద్వంద్వంగా తండ్రి మాటను తాను నిలబెట్టవలసిన అవసరాన్ని నొక్కి చెప్పాడు.

8చివరకు స్వర్గస్థుడైన దశరథుడు కూడా అంగీకరించాడు!  అష్టావక్రుడు తన తండ్రిని తరింపజేసినట్లు నువ్వు నన్ను తరింపజేశావు నాయనా! అన్నాడట.  (6.119.17)  ఆ సందర్భంలో కైకేయి మిమ్మల్ని నిర్బంధించినందుకు మనసులో ఎటువంటి కోపం పెట్టుకోవద్దువారిని క్షమించమని రాముడు తండ్రిని కోరడంఆయన అంగీకరించడం కూడా జరిగింది. 
**********
**********

ఈ విధంగా కథ సుఖాంతం అయింది.
"పితృవాక్యపాలన" అనే ఒక ఆదర్శాన్ని గొప్ప గుణంగా శ్రీరాముని పాత్ర ద్వారా బ్రహ్మనారదుడువాల్మీకి కలసి ప్రజలకు ఆ విధంగా పరిచయం చేయదలచుకున్నారు.  కాబట్టివారి సంకల్పం తిరుగులేకుండా ప్రచారంలోనికి వచ్చేసింది. 

 ।।ఇతి శమ్।।

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...