Showing posts with label భరద్వాజ. Show all posts
Showing posts with label భరద్వాజ. Show all posts

Wednesday, 1 April 2020

రాముని మనసులోని కోరిక


1 శ్రీరాముడు విజయం సాధించాడు.


రావణసంహారం జరిగింది.
దిక్కులన్నీ ప్రసన్నమైనాయి.
లోకాలన్నీ హర్షించాయి.
మహేంద్రుని ఆనందానికి మేర లేకుండా పోయింది.
′′రామా! లోకోపకారివైన నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది. నీకు మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు. *ప్రీతియుక్తాః స్మ తేన త్వం బ్రూహి యన్మనసేచ్ఛతి. దానిని తీరుస్తాను′′ అన్నాడు.
రాముడు అందుకు చాల ఆనందపడి,
′′సురేశ్వరా! నీకు నా పట్ల ప్రీతి కలిగితే నేనడిగిన దానిని తప్పక చేయాలి. *తే సర్వే జీవితం ప్రాప్య సముత్తిష్ఠంతు వానరాః - యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఈ వానరులందరినీ తిరిగి బ్రతకాలి. కేవలం బ్రతకడమే కాదు, *నీరుజో నిర్వ్రణాంశ్చైవ సంపన్నబలపౌరుషాన్ - వీరికి గాయాలన్నీ నయమై పోవాలి. పూర్వం వలె బలపరాక్రమసంపన్నులై, ఆరోగ్యవంతులుగా వర్ధిల్లాలి. అంతే కాదు, *అకాలే చాఽపి ముఖ్యాని మూలాని చ ఫలాని చ నద్యశ్చ విమలాస్తత్ర తిష్ఠేయుర్యత్ర వానరాః – ఈ వానరులు ఎక్కడ ఉంటే అక్కడ వీరికి ముఖ్యాహారమైన దుంపలు, పండ్లు పుష్కలంగా లభించాలి. వీరున్న చోట నదులలో నిర్మలమైన నీరు ప్రవహించాలి′′ అని కోరుకున్నాడు.
మహేంద్రుడు చాల సంతోషించి, ′*మహానయం వరస్తాత! తస్మాదేతద్భవిష్యతి - నాయనా! నీవు చాల గొప్ప వరం అడిగావు. నీవు కోరినది తప్పకుండా జరుగుతుంది′′ అని వరం ఇచ్చేశాడు.
అపుడు మరణించిన వానరులందరూ నిద్రనుండి లేచినట్లు లేచారట. *తతః సముత్థితాః సర్వే సుప్త్వేవ హరిపుంగవాః। అందరూ ఎంతో ఆనందించారు.
2 శ్రీరాముడు అయోధ్యకు వేంచేసే దారిలో ఉన్నాడు.
ఈ విషయం ఎక్కడో ప్రయాగదగ్గర ఉన్న భరద్వాజమహర్షికి కూడా తెలిసిపోయింది. ′′అయ్యో! బలే తిక్క రాముడులే ఈయన! అంతటి మహేంద్రుడే దిగివచ్చి వరమిస్తా కోరుకోమంటే తనకోసం కాక తనవారికోసం కోరుకున్నాడే! సరే, రాముడు అయోధ్యకు తిరిగిపోయే దారిలో నా ఆశ్రమం మీదుగానే కదా పోవలసింది! అప్పుడు ఆయనకు నేను ఇంకో వరమిస్తాను′′ అని భావించాడు.
అనుకున్నట్టుగానే తన ఆశ్రమం దగ్గరకు రాముడు రాగానే, అతడిని నిలేసి ఆపేశాడు. ′′ఏమయ్యా రామా! లోకసంరక్షకుడవైన నీకు దేవతలంతటివారే వరాలిచ్చారటనే, *అహమప్యత్ర తే దద్మి వరం శస్త్రభృతాం వర - మరి నా వంతుగా నేను కూడా ఇస్తాను. కోరుకో మరి!′′ అన్నాడు.
రాముడు ఆనందించి, ′′మహాప్రసాదం స్వామీ!′′ అన్నాడు.
′′*అకాలే ఫలినో వృక్షాః సర్వే చాఽపి మధుస్రవాః।
ఫలాన్యమృతకల్పాని బహూని వివిధాని చ।।′′
′′మహామునీ, కాలం కాకపోయినప్పటికీ (సమస్త ఋతువులలోనూ) రకరకాల వృక్షాలు బాగా ఫలించాలి. వాటి పండ్లన్నీ తేనెలూరుతూ అమృతంతో సమానంగా ఉండాలి′′ అని కోరుకున్నాడు.
ఆ మాటలు విని, భరద్వాజమహర్షి ఎంతో సంతోషపడ్డాడు. ′′అయ్యో తిక్క రామా! రెండవసారి కూడా అలాగే అడిగావా? నీకోసం నీవు ఏమీ కోరుకోవుగదయ్యా! అన్నీ నిన్ను నమ్మినవారి కోసమే కోరుకుంటావు గదయ్యా! అయినా, మా పిచ్చి కాకుంటే, మా ముచ్చటను తీర్చడానికి నువు వరాలను కోరుకున్నావు గాని, నీకు మేము వరాలిచ్చేంతటివారమా?′′ అని రాముని పలు విధాల స్తుతించాడు.
అంతటి నిరాడంబరుడైన ఆశ్రితమహావత్సలుడైన రాముని అనుగ్రహం మనపై నిత్యం వర్షించుగాక!
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ।
దేశోఽయం క్షోభరహితో బ్రాహ్మణాః సన్తు నిర్భయాః।।

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...