Sunday 5 December 2021

దేశమంతా అర్జునులు ఉన్నారు. ఒకే ఒక్క కృష్ణుడు కావలెను.


 


1 అర్జునవిషాదయోగం

నాటి అర్జునుడి మానసికపరిస్థితిని చూస్తుంటే నేటి భారతీయుల మానసికపరిస్థితి గుర్తుకు వస్తోంది.

అవతలివాడి జోలికి పోకుండా తమ దారిన తాము బ్రతుకుదామనుకున్నప్పటికీ ఆ అవతలివాడు తమ ఉనికిని కూడా సహించలేకపోతున్నాడు అని తెలుసును.

బాల్యంలోనే తమ బలాన్ని (భీముడిని/ఐక్యతను) ఓర్వలేక, ఆ అవతలివాడు కపటంతో స్నేహం నటిస్తూనే విషం పెట్టి చంపజూశాడు అని తెలుసును.

తాము ప్రజల అభిమానాన్ని చూరగొంటూ ఉంటే సహించలేక ఆ అవతలివాడు రాజధానినుండి తమను వెళ్లగొట్టి వేరొకచోట తమను తమ తల్లితో సహా సజీవదహనం చేసేందుకు దారుణమైన ప్రయత్నం చేశారని తెలుసును.

తమ పౌరుషంతో దిగ్విజయం చేసి సార్వభౌములైనప్పటికీ ఏమాత్రం గర్వాన్ని ప్రదర్శించకుండా ఆ అవతలివాడిపై సహజమైన అతి సౌమ్యమైన సౌభ్రాతృత్వం కనబరచినప్పటికీ వాడు తమపై అసూయపడి, మయా ద్యూతంలో తమ సమస్తసంపదలను తమ రాజ్యాన్ని కాజేశారని తెలుసును.

సభలో అందరిముందూ తమ ధర్మపత్నిని ఆ అవతలివాడు విచక్షణారహితంగా అవమానం పాలు చేయాలని ప్రయత్నించిందీ తెలుసును.

ఆ అవతలివాడు తమను అడవులపాలు చేసింది చాలక తాము అడవిలో పడుతున్న అగచాట్లను కళ్లారా చూసి ఆనందించేందుకు, తమకు ఏమాత్రం అపరిచితం కాని వైభవాన్ని తమకే చూపి తమలో ఈర్ష్యను రాజేయాలనే ఉద్దేశంతో ఘోషయాత్ర పేరిట చేసిన దుస్సాహసం తెలుసును.

తాము అడవిలో ఉన్నప్పటికీ తమను వేలాదిమంది పండితవరేణ్యులు ఆశ్రయించి అండగా ఉండటం ఆ అవతలివాడు సహించలేక, తమను దూర్వాసమహర్షి శాపానికి గురిచేయాలని విఫలయత్నం చేసిన విషయం కూడా తెలుసును.

మహాసార్వభౌమపదవిని అలంకరించిన తమ పెద్దన్నతోబాటు, మహాసమ్రాజ్ఞిగా పదవీశోభితురాలై ఉండిన తమ ధర్మపత్నితో పాటుగా తమను అజ్ఞాతవాసంలోనికి నెట్టి, కఠినమైన సేవకవృత్తిని అవలంబించవలసి వలసి వచ్చేట్లు చేశాడని కూడా తెలుసును.

పరిస్థితులకు తలవొగ్గి, ఆ అవతలివాడు విధించిన సమస్తనియమాలను తు చ తప్పకుండా పాటించినా చివరకు ఆ అవతలివాడు తమ వంతు వచ్చేసరికి ఆ నియమాలను ఉల్లంఘించి తమకు తమ రాజ్యాన్ని అప్పగించకుండా సూది మొన మోపినంత భూమిని కూడా ఇవ్వను పొమ్మన్నది కూడా తెలుసును.

తాము ఇపుడు యుద్ధానికి దిగినది తమ వంతు రాజ్యాన్ని సాధించుకునేేందుకేనని కూడా తెలుసును.

అయినా సరే,
అయినా సరే,

స్వయంగా మహావీరుడైనప్పటికీ, సమస్తకౌరవసైన్యాన్ని ఒక్క పాశుపతంతో క్షణకాలంలో భస్మీపటలం చేయగలిగిన మహాశక్తిమంతుడై ఉన్నప్పటికీ, తమను జీవితాంతం సంతోషంతో ఉండనివ్వకుండా దుఃఖసముద్రంలో ముంచదలచినవాడు, వీలైతే తమను సమూలంగా అంతం చేసేందుకు సర్వవిధప్రయత్నాలను అలుపెరగకుండా చేసిన ఆ అవతలివాడు ఎవడో కాదు, స్వయానా తమ సోదరుడే అని, అతడితో నేను యుద్ధం చేయడమా? వద్దు, యుద్ధం చేయను అని భావించడం ఆనాడు ఒక్క అర్జునుడికే చెల్లింది. అది అర్జునవిషాదం.

వీళ్లందరూ ఎవరు? నావాళ్లే కదా? నాతో కలసి ఇదే దేశంలో బ్రతుకుతున్నవాళ్లే కదా? వీరు నా పట్ల ఎంతటి శత్రుత్వం కనబరుస్తూ ఎన్ని విధాలుగా తమను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నా వీరిపట్ల నేను శత్రుత్వం వహించలేను అని భావించడం ఈనాడు కేవలం భారతీయులకే చెల్లింది. ఇది సమస్తభారతీయవిషాదం.

చివరకు అర్జునుడి విషాదం ఎంతవరకు వచ్చిందంటే,
"ఏతాన్న హన్తుమిచ్ఛామి
ఘ్నతోఽపి మధుసూదన" (గీత1.35)
"వీరి చేతిలో నేను చంపబడినా నాకు సమ్మతమే గాని, నేను మాత్రం వారిని చంపదలచుకోను" అనేంతవరకు వచ్చింది.

ఆ అవతలివాడు తమకు ఎన్ని అపకారాలు చేసినా, తమ పట్ల ఎన్ని అపరాధాలు పౌనఃపున్యంగా చేసినా, చివరకు పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని ప్రోగు చేసుకుని సమస్త ఆయుధాలు ధరించి, దయాదాక్షిణ్యాలు లేకుండా ఆ మరుసటి క్షణంలోనే తమను క్రూరాతిక్రూరంగా చంపడానికి సంసిద్ధంమై ఉరకలు వేస్తూ ఉన్నప్పటికీ, వారిని స్వజనం (నావారు) గా భావించి వారి పట్ల కనికరమే కనబరచడం అర్జునుడికే చెల్లింది.

స్వజనం హి కథం హత్వా
సుఖినః స్యామ మాధవ (గీత1.37)

"మనవారిని మనమే చంపుకుని మనం ఎలా సుఖంగా ఉండగలం కృష్ణా?" అని ప్రశ్నించాడు.

ఆ అవతలివారు కాశ్మీరంలోను, బెంగాల్లోను, కేరళలోను నరమేధం చేశారు. చేస్తున్నారు. అమాయికులైన పాల్ఘర్ సాధువులను తలలు పగులగొట్టి చంపేశారు. దేవాలయాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేయాలని తమవారికి పిలుపునిస్తున్నారు. లవ్ జిహాద్ పేరిట తెగబడుతున్నారు. భైంసాను తగులబెట్టారు. పండుగలను, ఆచారాలను అవహేళను చేస్తున్నారు. ఆచారవంతులను మూర్ఖులని అవహేళన చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో అకృత్యాలు చేశారు. పదిహేను నిమిషాల్లో ముగించేస్తాం అని తమ ఉద్దేశాన్ని స్పష్టంగా బయటపెట్టుకున్నారు. అయినా వీరంతా నావారు అనుకొనడం ఈనాడు భారతీయులకే చెల్లింది.

కృష్ణా, వీరిని చంపడం మహాపాపం.
అహో బత మహత్పాపం (గీత1.45)

నేను ఏ మాత్రం స్పందించను. నేను ఆయుధం ధరించను. వారందరూ కత్తులు పట్టి నన్ను చంపినా సరే, అదే నాకు క్షేమం.
యది మామ్ అప్రతీకారమ్
అశస్త్రం శస్త్రపాణయః।
ధార్తరాష్ట్రా రణే హన్యుః
తన్మే క్షేమతరం భవేత్।। (గీత1.46)
అని భావించడం విషాదం కాక మరేమిటి?

అది విషాదం ఎందుకైంది?
విషమ్ అత్తి (విషమును తింటుంది) కాబట్టి విషాదమైంది. విషం తినడమంటే ఏమిటి? చావును కోరి తెచ్చుకోవడం అన్న మాట. ఆత్మహత్య అన్న మాట. అర్జునుడు ఆత్మహత్యకు పూనుకున్నట్టే లెక్క. అది అధర్మం.

ఎందువల్ల అధర్మం?
అర్జునుడు క్షత్రియుడు. ధర్మరక్షణకోసం, ప్రజారక్షణకోసం యుద్ధం చేయటం, అవసరమైతే యుద్ధంలో ప్రాణాలర్పించడం క్షత్రియధర్మం. తన ధర్మాన్ని వదిలి, నేను యుద్ధం చేయను అనడం అధర్మమే కదా.

ఇంతవరకు భగవద్గీతలో మొదటి అధ్యాయం.

అందువల్లనే కృష్ణుడు అర్జునుడి మానసిక పరిస్థితిని కశ్మలం అన్నాడు. క్లైబ్యం అన్నాడు. నీది క్షద్రమైన హృదయదౌర్బల్యం అన్నాడు. అనార్యజుష్టమన్నాడు. అస్వర్గ్యమన్నాడు. అకీర్తికరమన్నాడు. ఓ పెద్ద ప్రజ్ఞావాదాలు మాట్లాడుతున్నావే? అన్నాడు. (ఇది రెండవ అధ్యాయంలో - మరుసటి పోస్టులో చూద్దాం)

భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ (గీత 4 3) - "అర్జునా, నువు నా భక్తుడవు కాబట్టి, స్నేహితుడవు కాబట్టి, ఎంతో రహస్యమైన ఈ యోగాన్ని నేను నీకు చెబుతున్నాను" అంటూ వివరించడం మొదలుపెట్టాడు.

ఎంతో చర్చ జరిగిన పిమ్మట అర్జునుడికి మోహం తొలగిపోయింది. తన ధర్మం పట్ల చాల స్పష్టమైన అవగాహన కలిగింది. కృష్ణా, నేను నీ మాట వింటాను అంటూ ధర్మయుద్ధానికి సిద్ధమయ్యాడు. (ఇది పద్దెనిమిదవ అధ్యాయం చివర)

ఈ విధంగా విషాదం వదిలించుకున్నవారికే విజయం లభిస్తుంది. భగవద్గీతకు అటువంటి విషాదాన్ని వదిలించే శక్తి ఉన్నది. భగవంతుడై గీతను బోధించగల ఆచార్యుల అవసరం ఉన్నది. అందువల్ల భగవద్గీతాపఠనాన్ని అలవరచుకొమ్మని భారతీయులందరినీ ప్రోత్సహిద్ధాం. భగవద్గీతాసారాన్ని మరింతగా మన జీవితాలకు సమన్వయం చేసుకునేట్లు చేయగల జగద్గురువు కృష్ణుడు ఆచార్యుల రూపంలో అవతరించుగాక.

దేశమంతా అర్జునులు ఉన్నారు.
ఒకే ఒక్క కృష్ణుడు కావలెను.

~మార్గశీర్షశుక్లతృతీయా, ప్లవః~

Saturday 4 December 2021

మాసానాం మార్గశీర్షోఽహమ్

కాలోఽస్మి - (గీత 11.32)

నేను కాలస్వరూపుడను. మహాకాలుడను.

అహమేవాక్షయః కాలః (గీత 10.33)
మొదలు మధ్యము తుది లేని ఆదిమధ్యాంతరహితుడను అని భగవంతుడు స్వయంగా తనను గూర్చి తాను తెలియజేశాడు.

అటువంటి అనంతుని అచ్యుతుని కొలవటం మనకు సాధ్యమయ్యే పనేనా?

గోవింద గోవింద అని కొలువవో మనసా అని అన్నమయ్య అంటే ఏ స్కేలుతో కొలవాలి అంటూ యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకురాలు ఒకావిడ తన క్లాసులో విద్యార్థులముందు అవహేళన చేస్తూ మాట్లాడుతుందట.

ఎంతటి అనంతుడైనా భగవంతుని కొలవడం సాధ్యమే. ఎలా కొలవాలో స్వయంగా ఆయనే మనకు తెలియజేశాడు.

పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్యా ప్రయచ్ఛతి।
తదహం భక్త్యుపహృతమ్
అశ్నామి ప్రయతాత్మనః।।
(గీత 9.26)

ఒక ఆకు, ఒక పూవు, ఒక పండు లేదా ఇన్ని నీళ్లైనా సరే నాకు ఎవరు భక్తితో సమర్పించినా దానిని నేను ప్రీతితో స్వీకరిస్తాను అని సాక్షాత్తు భగవంతుడే తనను కొలిచే పరికరాలను పేర్కొన్నాడు.

సత్యభామ తన అహంకారం కొద్దీ సకలైశ్వర్యాలతో భగవంతుని కొలిచి అతనిని తన స్వంతం చేసుకుందామంటే అది ఆమెకు అసాధ్యమైపోయింది. రుక్మిణమ్మ భక్తితో చిన్న తులసి ఆకు వేసి ఆమాత్రంతోనే అతడిని కొలిచేసిన కథ ఆబాలగోపాలానికి తెలిసిన కథే కదా?

కాబట్టి, భగవంతుని కొలిచే సాధనం లేదా స్కేలు భక్తి.

కొలుచుట అంటే బట్టల షాపులో సేల్స్ మన్ మీటరు బద్దతో బట్టలను కొలవటం వంటిది కాదని ఆ అవహేళన చేసిన ఆ మూర్ఖశిఖామణికి తెలియకపోదు. అడవిలో పుట్టి అడవిలో పెరిగిన కణ్ణప్పకు ఉన్నంత జ్ఞానం కూడా ఆవిడకు లేకపోయింది.

సరే.
భగవంతుడు అంతటి అనంతకాలస్వరూపుడైనా, మనలను అనుగ్రహించడం కోసం మనకు అందుబాటులోనే ఉంటాడు.

భారతదేశంలో ఏటా సరాసరి 110 మిలియన్ టన్నుల వరి పండుతుంది. అందులో మనకు కావలసింది ఎంత? మనలో ఒకొక్కరం సంవత్సరానికి కనీసం 50 కిలోగ్రాములైనా గట్టిగా తినగలమా?

అలాగే, నిర్వికారము నిర్గుణము నిరంజనము అయిన భగవంతుని అనంతస్వరూపం అవగాహన చేసుకొనడం మనకు అంత సులువు కాదు.

అందువల్ల ఆయనే స్వయంగా అనేక ఉపాయాలతో మనకు చేరువ అవుతాడు. ఈరోజు కార్తిక-అమావాస్య. రేపటినుండి ఆయన మార్గశిరమాసరూపంలో మన చెంతకు వచ్చి నెలరోజులు ఉంటాడు. మాసానాం మార్గశీర్షోఽహం (గీత 10.35) అని స్వయంగా ప్రకటించాడు.

మరి మన చెంతకు కోరి వస్తున్న భగవంతుని మనం ఎలా కొలిచేది? ముందే అనుకున్నాం కదా? భక్తితో ఎవరు ఎలా కొలిచినా ఆయన అనుగ్రహిస్తాడు.

పోనీ కొంత వివరంగా తెలుసుకోవాలంటే భగవద్గీత తొమ్మిదవ అధ్యాయాన్ని (రాజవిద్యా రాజగుహ్యయోగాన్ని) చదివితే అర్థమౌతుంది.

అసలు కేవలం తొమ్మిదవ అధ్యాయం మాత్రమే ఎందుకు? ఈ ప్లవనామసంవత్సర మార్గశిరమాసంలో మనం రోజుకో అధ్యాయం చొప్పున పద్దెనిమిది రోజుల్లో భగవద్గీతను సంపూర్ణంగా అర్థసహితంగా చదివేద్దామా? నెలలో ముప్పై రోజులుంటాయి కదా? పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది అధ్యాయాలు చదివేస్తే తక్కిన రోజుల్లో ఏం చేయాలి అనుకోవద్దు. మరలా రివిజన్ చేసేద్దాం.

మార్గశీర్షశుక్ల-ఏకాదశినాడు పరమపవిత్రమైన గీతాజయంతి కూడా వస్తుంది. గీత తక్కిన పుస్తకాలవంటిది కాదు. భగవంతుడు స్వయంగా తన నోట పలికినది. అందుకనే ఇది భగవద్గీత అయింది. అర్జునుని నిమిత్తకారణంగా మార్చుకుని సమస్తమానవాళిశ్రేయస్సును కోరి ఆయన బోధించినది.

మన పుట్టిన రోజున మనకోసం మన మిత్రుడు ఏదైనా బహుమతిని ఇస్తే దానిని సంతోషంతో స్వీకరిస్తాం. ఆ బహుమతి పొట్లంలో ఏముందో చూడాలనే కుతూహలంతో బయట రంగురంగుల పేపరును గబ గబా చించేసి మరీ చూసి ఆనందిస్తాం కదా?

మరి మన జీవితాంతం ఉపయోగపడే బహుమతిగా భగవంతుడు స్వయంగా ప్రసాదించిన భగవద్గీతరూపంలోని ఉపదేశాన్ని మనం ఇంకా ఎంతకాలం పాటు పుస్తకాల పేజీల్లో మాత్రమే దాచుకుంటాం?

రేపు చదువుదాం ఎల్లుండి చదువుదాం అని ఇంకా ఎంతకాలం వాయిదాలు వేసుకుంటూ పోదాం? తీరిక దొరకటం లేదు అనే మాటను కాసేపు పక్కన పెడదాం. మనకు ఒక సామెత ఉండనే ఉంది. సముద్రంలో అలలు తగ్గిన తరువాత స్నానం చేద్దామనుకుంటే మన జన్మలో మనం సముద్రస్నానం చేయలేం. కాబట్టి ఎన్ని అలలున్నా స్నానం చేసేయాలంతే.

భగవద్గీత మన జ్ఞానసంపద. మన ఆధ్యాత్మికసంపద. మన తాతతండ్రులందరూ అనుభవించిన మహాభాగ్యసంపద. వారసత్వంగా మనకు సంక్రమించిన పైతృకమైన ఆస్తి. అందువల్ల భగవద్గీతను చదవడం మన హక్కు. ఆ హక్కును మనం ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోరాదు. అంతే కాదు, మన తరువాత తరాల వారికి కూడా ఈ సంపదను అందించే బాధ్యత మనకున్నది.

చదివితే మనకు ఏమొస్తుంది? ఏమిటి లాభం?
దానికి సమాధానం కూడా మనకు గీతలోనే దొరుకుతుంది.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన। (గీత 2.47)
నీవు నీ పనిని చేయడం మీదనే శ్రద్ధ చూపు. ఫలితం నాకు వదిలెయ్.
అని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. అర్జునుడంతటివాడే అతని మాటను నమ్మాడు. తాను చేయవలసిన పనిని చేశాడు. మనం కూడా సంపూర్ణవిశ్వాసంతో అలాగే చేద్దాం.

యత్ర యోగేశ్వరః కృష్ణః
యత్ర పార్థో ధనుర్ధరః।
తత్ర శ్రీర్విజయో భూతిః
ధ్రువా నీతిర్మతిర్మమ।। 

https://www.facebook.com/srinivasakrishna.patil/posts/4536826569771321

Friday 5 November 2021

శివోఽహమ్


 

శివోఽహమ్

శివః+అహమ్ అనే రెండు పదాల కలయిక వలన శివోఽహమ్ అనే సంధి ఏర్పడుతుంది. అంటే నేను శివుడను అని అర్థం.
చాల చిన్నపదం కదా? పలికేందుకు ఒక సెకను సమయం కూడా పట్టదు కదా? కాని, అలా పలికే అర్హత మనకు ఉన్నదా?
శివము అంటే కల్యాణము, మంగళము, (శుభము) సుఖము, మోక్షము,, శ్రేయస్సు అని అర్థాలున్నాయి. . ఇవన్నీ ఆ దేవదేవునిలో ఉంటాయి కాబట్టి ఇతడు శివుడు.
ఇంకా అణిమాదులైన అష్టసిద్ధులు శేరతే - అవతిష్ఠంతే - ఇతనియందు ఉంటాయి కాబట్టి ఇతడు శివుడు.
ఇంత తెలిసిన తరువాత కూడా మనం శివోఽహమ్ (నేను శివుడను) అనుకోగలమా?
}}}{{{
అత్యంతసారవంతమైన సుక్షేత్రం ఉన్నదనుకోండి - అక్కడ ఎటువంటి విత్తనం వేసినా ఏపుగా బలంగా పెరుగుతుంది.
ఎడారిలో ఖర్జూరం వంటి ఎడారి మొక్కలు మాత్రమే పెరుగుతాయి కాని, అక్కడ రసభరితమైన మంచి మామిడి తోట వేద్దామనుకుంటే అది వృథాప్రయాస కదా. అది ఎడారిభూముల లక్షణం. అందుకు మనం ఎడారిని నిందించడం వలన ప్రయోజనం లేదు.
అలాగే సుక్షేత్రాలలో విషవృక్షపు విత్తనం నాటినా అది బలంగా ఎదుగుతుంది. ఆ విషవృక్షాల పుష్పాలు అతిరమణీయమైన రంగులతో కన్నులను ఆకర్షిస్తూ ఉంటాయి. వాటి ఫలాలు సుమధురసౌరభాలను వెదజల్లుతూ సమస్తప్రాణులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ రంగులకు సౌరభాలకు ఆశపడి తమ చెెంతకు వచ్చే ప్రతి మనిషినీ, జంతువును. పక్షినీ, కీటకాన్నీ అవి తమ విషంతో నిర్దాక్షిణ్యంగా చంపేసి తాము మరింత బలంగా ఎదిగేందుకు ఎరువుగా మార్చుకుంటాయి.
అయితే తత్కారణంగా మనం ఆ క్షేత్రాన్ని తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందువల్లనంటే అక్కడ అమృతఫలబీజం నాటినా నిస్సందేహంగా చక్కగా పెరుగుతుంది.
కాబట్టి, సుక్షేత్రనింద చేయరాదు.
సృష్టి ఆవిధంగా జరిగింది మరి.
)))(((
మరి మనం చేయవలసిన పనులు ఏమిటి?
1 విషవృక్షాలను ఖండిస్తూ, విషవృక్షబీజాలను నశింపజేయడం.
2 అమృతబీజాలను నాటుతూ, సంరక్షించుకుంటూ ఉండటం.
3 పై రెండు పనులనూ సమన్వయం చేయడం.
మనలో కొందరకు విషవృక్షాలను ఖండించడంలో నేర్పు ఉండవచ్చు కాని, అమృతబీజాలను నాటడం చేతకాకపోవచ్చును.
అలాగే కొందరకు అమృతబీజావాపనంలో చక్కని నైపుణ్యం ఉండవచ్చును కాని చేత గొడ్డలి ధరించి విషవృక్షాలను ఖండించేంత బలం లేకపోవచ్చును.
అలాగే కొందరు రెండుపనులలోనూ సమర్థులై ఉండవచ్చును.
ఈ రెండుపనులలోనూ నేర్పరులైన వారి నడుమ చక్కని సమన్వయం అవసరం. లేకుంటే ఎంత ఖండించినా విషవృక్షాలు మరలా తలెత్తవచ్చు. అందువల్ల ఖండించిన వెంటనే అక్కడ అమృతబీజాలను తప్పక నాటేయాలి. అందువల్ల సమన్వయం చేయడంలో నేర్పరులైన వారు ఎంతైనా అవసరం. అప్పుడే సుక్షేత్రాలన్నిటా సమస్తప్రాణిసుఖకరములూ సమస్తజీవానందదాయకములూ అయిన అమృతఫలవృక్షాలు విస్తరిస్తాయి.
అదీ జరగవలసిన పని.
)))(((
భారతీయులు శివోఽహమ్ అనుకోవచ్చు. ఎందుకంటే శివునిలో ఉండే ఒక లక్షణం మనలో కూడా ఉన్నది. ఈ పరమశివుడు మంచి చెడ్డ అనే భేేదం లేకుండా అందరినీ ఆదరించేస్తాడు. దేవతలైనా అదే ప్రేమ, రాక్షసులైనా అంతే ప్రేమ ఆయనకు.
చెప్పేదేమి, మన భారతీయులు కూడా ఇలాంటివారే. అచ్చం శివుడిలాంటివారే. చెడ్డవారు మన దరి చేరి స్నేహం చేస్తే వారిని కూడా ఆత్మీయులుగా భావించేస్తాం. అప్పుడు మంచివారిని కూడా మన శత్రువులుగా భావించి వారిమీద పగను పెంచుకుంటాం. అలాగే ముందుగా మంచివారే మన చెంత చేరితే మంచిని గూర్చి మంచి అవగాహను పెంచుకుంటాం. చెడును దరిజేరనియ్యం.
ఇటువంటి లక్షణం మన బలహీనత, బలం కూడా. సృష్టి అలా జరిగింది. ఎవరినీ నిందించవలసిన పని లేదు. జరగవలసింది కృషి.
)))(((
అయితే శివుడిలో మరో లక్షణం కూడా ఉన్నది.
విషం వల్ల లోకాలకు ఆపద కలగనివ్వకుండా ఆయన దానిని మ్రింగివేసి తన కంఠంలో దాచుకుని శ్రీకంఠుడయ్యాడు. గరళకంఠుడన్నా విషకంఠుడన్నా అవి నిందావాచకపదాలనిపిస్తాయి కాని ఆయన నిజానికి శ్రీకంఠుడు. ఎందుకంటే విషం కూడా ఆయన కంఠానికి ఒక ఆభరణంలా మారి మంచి శోభను కలిగించింది కాబట్టి!
ఆవిధంగా ఆయన విషాన్ని లోపలనే అణచివేసి అగాధసాగారాంతరాళంలో దాగివున్న అమృతం పైకి వచ్చేందుకు అనుమతించాడు.
ఈ రెండు పనులనే కదా, మనం ఈ సందర్భంలో
1 విషవృక్షఖండనం అని,
2 అమృతబీజావాపనం అని
అంటున్నాము.
ఈ రెండు పనులనూ విజయవంతంగా చేయగలిగితే మనకు శివోఽహమ్ అనుకునే అర్హత లభిస్తుంది.
ఆ అర్హతకోసం ఆయా రంగాలలో ఆయా పనులలో నైపుణ్యం ఉన్నవారు పరస్పరసమన్వయంతో పని చేయవలసిన ఆవశ్యకత ప్రస్తుతం మన భారతదేశంలో చాల బలంగా, ఉన్నది.
సర్వేఽత్ర సుఖినః సంతు
సర్వే సంతు నిరామయాః।
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్।।
అంటూ సమస్తవిశ్వశాంతిని కోరుకునే సనాతనధర్మమే అమృతబీజం. విషవృక్షాలను నేర్పుగా ఖండించి అమృతబీజాలను నాటడమే భారతీయులందరి కర్తవ్యం.
అందుకు శివుడే మనకు ఆదర్శం కాబట్టి, శివోఽహమ్।।
।।కార్తికశుక్లప్రతిపత్, ప్లవః।।

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...