Thursday 14 February 2019

కాశ్మీరం కోసం ఆర్టికల్ 370 ని రద్దు చేయాలి.

పాక్ ప్రభుత్వానికి ఉగ్రవాదమూకలపై అదుపు లేదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. పాక్ ప్రభుత్వంతో చర్చలు జరిపితే ఉగ్రవాదం తగ్గుతుందనుకొనడం మన భ్రమ. అనేకానేక భారతప్రభుత్వాలు చాల చొరవ చేశాయి. కాని, అది తగ్గినట్టు ఎక్కడా జాడ లేదు.

బలవంతుడు తనకంటె బలవంతుడికే భయపడతాడు. అమెరికా లాడెన్‌ను హతం చేసి తన ఆధిపత్యాన్ని చాటడం ఒక ఉదాహరణ మాత్రమే.

వారు కాశ్మీరం పాకిస్తాన్ కు చెందాలని కోరుతున్నారు. వారితో చర్చలు చేస్తే వారు అడిగేది అదే. అది మనం ఇచ్చే సమస్య లేదు, వారు ఉగ్రవాదం ఆపేది లేదు.

కాబట్టి, వారి ఉగ్రవాదాన్ని ఆపేందుకు ప్రయత్నించవలసింది మనమే. నిజమే, కాని, ప్రస్తుత పరిస్థితులు పాకిస్తాన్ పై యుద్ధాన్ని ప్రకటించడానికి మనకు తగినంత అనుకూలంగా లేవు.

పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎన్నుకొనేది పాకిస్తాన్ ప్రజలే అయినా, అంతటితో వారి ప్రమేయం ముగిసిపోతుంది. అక్కడ ప్రధానమంత్రి పేరుకు మాత్రమే ప్రభుత్వాధినేత. భారత్‌లో నిన్న పులవామాలో జరిగిన సంఘటనకు మమ్మల్ని తప్పు పట్టవద్దు, అని భుజాలు తడుముకుంటూ వారి విదేశాంగశాఖ తక్షణమే ఒక లేఖను జారీ చేసింది కూడా.

ఈవిధంగా భారత్ లో ఉగ్రవాదం మేము చేస్తున్న పని కాదు, మామీద యుద్ధమేమిటి అని పాకిస్తాన్ వాళ్లు అంతర్జాతీయస్థాయిలో గొంతు ఎత్తుతారు. అచ్చం, ఇపుడు చంద్రబాబు తన అవినీతిని, తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఢిల్లీకి పోయి అరుస్తున్నట్లుగా.

అందరూ ఉగ్రవాదాన్ని ఒక ఫార్మాలిటీ కోసం అంతర్జాతీయంగా ఖండించేవారే కాని, యుద్ధం అంటూ వస్తే, మనకు సంపూర్ణసహకారం అందించే వారు ఎవరో ఎందరో అనేది సందేహాస్పదం. అందువల్ల, మనం గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, చిరకాలం పాటు మన సామాజిక ఆర్థిక పరిస్థితులను ఛిన్నాభిన్నం చేసే ప్రత్యక్షయుద్ధం కంటె మరొక వ్యూహాన్ని అమలు పరచవలసిన అవసరం ఉంది.

భారతీయులు ఎప్పటినుండో కోరుతున్నట్టు, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని అందించే ఆర్టికల్ 370 ని రద్దు చేసి, భారతదేశంలోని మిగిలిన ఏ రాష్ట్రంలోనైనా మనకు స్వేచ్ఛగా నివసించే హక్కు ఉన్నట్టు కాశ్మీర్‌లో కూడా నివసించే హక్కు, అక్కడ భూమిని, ఇతర స్థిరాస్తులను కొనే హక్కు, అక్కడ శాశ్వతనివాసం ఏర్పరచుకునే హక్కు భారతీయులందరికీ కల్పించాలి. అందుకు బలమైన ఏర్పాట్లు చేయాలి.

అప్పుడు కాశ్మీరు నాయకులు తిరుగుబాటు చేస్తారు. వారిని నిర్బంధించవలసి రావచ్చు. అల్లర్లు రేగుతాయి. ప్రారంభంలో ఉగ్రవాదం మరింత తీవ్రతను సంతరించుకున్నట్టు కనిపిస్తుందేమో కూడా. ప్రభుత్వం వాటిని తీవ్రంగా అణచివేయాలి. అంతర్జాతీయమైన వత్తిడులు వస్తాయి. కాని, భారత్ కు సంబంధించి, ఇది తమ అంతర్గతమైన సమస్య. వివిధరాష్ట్రాలనుండి భారతీయులు కాశ్మీరానికి వెళ్లి స్థిరపడుతున్నకొద్దీ క్రమంగా శాంతిభద్రతలు చేకూరుతాయి. దీనికి దీర్ఘకాలం పట్టవచ్చు గాక. కాని, ఇంతకు మించిన పరిష్కారం లేదు.

1989 లో తియానన్మెన్ స్క్వేర్ లో చైనా ప్రభుత్వం తన స్వంత పౌరులపై దాడి చేసి 10000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నది. అప్పుడు అంతర్జాతీయంగా రేగిన గగ్గోలు అసామాన్యమైనది. కాని, చైనా ప్రభుత్వం ఎవ్వరినీ లెక్క చేయలేదు.

భారతప్రభుత్వం తీవ్రవాదుల మీద అంతటి తీవ్రమైన చర్యలు తీసుకుంటే తప్పు ఏమీ లేదు. ప్రభుత్వం పిరికిది కాకుంటే తక్షణమే ఇటువంటి పనిని చేసి తీరాలి.

ఒక ప్రాంతంలో తమ జనాభాను బాగా పెంచుకొనడం, తరువాత ఆ ప్రాంతం తమదే అనడం, తమకు అచ్చంగా ఇచ్చేయాలి అనడం ఆ ఉగ్రవాదుల దీర్ఘకాలికవ్యూహం. అందువల్ల ముల్లును ముల్లుతోనే తీయాలి అనే వ్యూహం అనుసరిస్తూ, ఆర్టికిల్ 370 ని రద్దు చేయడం ఒక బలమైన చర్య.

కాశ్మీరచరిత్ర రాజకీయంగానూ, సాహిత్యరంగంలోనూ, కళారంగంలోనూ అవినాభావంగా భారతీయసంస్కృతితో ముడిపడి ఉంది. దానిని సమగ్రభారతంలో ప్రచారం చేయాలి. గత వంద ఏళ్లుగా జరుగుతున్నది మాత్రమే అసలైన కాశ్మీరచరిత్ర అయినట్టు, అంతకు ముందు కాశ్మీర్‌కు ఒక అస్తిత్వమనేదే లేనట్టు కుహనాచరిత్రకారులు చిత్రీకరిస్తూ ఉండడాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అక్కడ అశాంతికి కారణం పాకిస్తాన్ ప్రభుత్వపు రహస్యచర్యలే అనేది అందరికీ స్పష్టంగా అవగాహన కలిగేలా చక్కని ప్రచారం చేయాలి.

దాదాపు భారతభూభాగం మొత్తం తమదే అన్నట్టుగా, భారతీయులు తమను అన్యాయం చేసి ఏదో కొంతభాగం మాత్రమే తమకు ఇస్తున్నట్టుగా పాకిస్తాన్‌లో విద్యార్థులకు చిత్రపటాలు వేసి మరీ నూరి పోస్తున్నారు.

మనం మాత్రం కనీసం కాశ్మీరు కూడా మనదే అని గట్టిగా చెప్పకుండా చర్చలు చర్చలు అంటూ శతాబ్దాలతరబడి ఆ సూత్రాన్ని తెంచేయకుండా ఆలస్యం చేస్తూ ఉంటే, మన తరువాత తరాల మన వారసులకు కూడా కాశ్మీరం మనది కాదేమో అని సందేహం కలిగి తీరుతుంది.

బలవంతుడు బలవంతుని గౌరవిస్తాడు. మూర్ఖుడు భయపడతాడు. ఉగ్రవాదులు మూర్ఖులు. తనకు ఎక్కడో జన్నత్ లో ఏదో లభిస్తుందని ఇక్కడ నరకం సృష్టించడం మూర్ఖత్వం మాత్రమే.

{2019/ఫిబ్రవరి/14 నాడు కాశ్మీరంలోని పులవామాలో భారతసైనిక పటాలంపై ఒక మతమౌఢ్యపు ఆత్మాహుతికారుడు దాడి చేసి 44 మంది భారతవీరజవానుల మృతికి కారకుడైనాడు.} 

Wednesday 13 February 2019

రురుడు - ప్రమద్వర (1)

“సౌర్యాయణీ, పూర్వాహ్నికాలు ముగిశాయా? వస్తావా నాతో పాటు?”
“ముగిశాయి, ఎక్కడికి రమ్మంటున్నావు రురూ?”
“తాతపాదులవారు స్థూలకేశమహర్షివారి చెంతకు పోయి వారి ఆశీర్వాదాన్ని గైకొని రమ్మన్నారు.”
“ఆహా! మహతాం దర్శనం పుణ్యం, తత్పాదస్పర్శనం పాపనాశకం కదా? తప్పక వస్తాను.”
“పాపనాశనం ఏమిటోయ్? నువ్వేమి పాపాలు చేశావని?”
“ఇంతకాలం వారిని చూడకపోవడమే నేను చేసిన పాపం.”
రురువు నవ్వాడు. “సరే, పద.”
<><><>
ఆ ఋషికుమారులిరువురూ స్థూలకేశమహర్షి ఆశ్రమానికి వెళ్లారు, ఆయన ఆశీర్వాదం గైకొని, తమ ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు. ఎత్తైన చెట్లనడుమ కాలిబాటలో వారి ప్రయాణం సాగుతోంది.
“ఆహా! సౌర్యాయణా! ఈ ఆరణ్యకసౌందర్యం చూడు! ఎన్నెన్ని వర్ణాల పూవులో!”
“అవును రురూ!”
“ఎంతటి ఘ్రాణప్రమోదకాలైన ఘనపరీమాళాలను ఇవి వెదజల్లుతున్నాయో!”
“అవును!”
“ఎంతటి ఆహ్లాదకరమైన చిరుగాలులు మేనును తాకుతున్నాయో చూడు! మందాకినీతరంగాలపై నుండి వస్తున్న ఈ గాలులు అనుష్ణాలు, నాతి శీతలాలు, తగిలిన వెంటనే రోమాంచం కలిగించుతున్నాయి కదా?”
సౌర్యాయణి ఆశ్చర్యంగా చూశాడు. “రురూ! ఏమిటీ వివశత్వం? ఏమైంది ఈ రోజు నీకు?”
“ఏమో! చూడు! మందపవనాలు అల్లలాడిస్తూ ఉంటే పూలనుండి మకరందపు బిందువులు వచ్చి ముఖం మీద పడుతున్నాయి. వాటి మాధుర్యం వల్ల కలిగిన మత్తులో నా మాటలు తడబడుతున్నాయి అంటావా?”
“రురూ! జితేంద్రియుడవని గురువులందరూ నిను గూర్చి గొప్పగా చెప్పుకుంటారే? చ్యవనమహర్షులవారి ప్రపౌత్రుడవు, ప్రమతిమహాత్ముల కుమారుడవు, స్వయంగా మహాతపస్వివి, నీకు ఈ వికారభావాలు పుడుతున్నాయేమయా?”
“ఏమో, తెలియడం లేదు, నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. నాహమస్మి వశే మమ. ఈ ప్రాంతంలో అజేయమైన ఏదో మాయ లేదు కదా?”
“ఏమో! నీ పరిస్థితి చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. బహుధా శ్రేయసే, మనం ఈ క్రొత్త మార్గంలో కాకుండా, మునుపు మనకు తెలిసిన మార్గంలోనే పోదాం పద!”
“అరె! సౌర్యాయణీ, విను! ఆ మధురకలకలనాదాలు! ఏ పక్షులు ఎటువంటి మధురఫలాలు తిన్నాయో, ఆ మహిమతోనే అవి అంతటి శ్రవణపర్వాలైన శబ్దాలను చేస్తున్నాయి సుమా! పద! ఒక్కసారి ఆ పక్షులు ఎలా ఉంటాయో చూసి వద్దాం!”
“రురూ! నువ్వు పూర్తిగా పరవశుడవైపోతున్నావు. నువు ధరించిన కృష్ణాజినమే నిను శబ్దలోలుడిని చేస్తోందా ఏమి? క్షణకాలం నీవెవరవో, నీ ప్రవృత్తి ఎలా ఉండాలో గుర్తుంచుకో! పద! వెనుదిరిగుదాం!”
“ఒక్కసారి ఆ పక్షులను చూస్తాను సౌర్యాయణీ! వాటి పలుకులను మరొక్కమారు తనివితీరా వింటాను!”
“పక్షులు మన ఆశ్రమం నిండా ఉన్నాయి కదా రురూ! అక్కడకు వెళ్లిన తరువాత విందువు గానిలే!”
“నిజమే, అనేకమైన పక్షులు ఉన్నాయి. కాని, ఇంతటి మనోహరమైన శబ్దాలు మాత్రం అశ్రుతపూర్వాలు. ఆ పక్షులు ఎలా ఉంటాయో చూద్దాం పద” అంటూ సౌర్యాయణి కోసం ఎదురుచూడకుండా ఆ శబ్దాలు వినిపించినవైపు నడిచాడు రురువు.
సౌర్యాయణి విధి లేక అనుసరించాడు.
కాసేపు గడిచాక తన కన్నులను తానే నమ్మలేకపోయాడు రురువు. అవి పక్షుల శబ్దాలు కావు, అక్కడ ఒక పుష్పవనం ఉన్నది. అక్కడ ఒక జగదేకసుందరి తన స్నేహితురాండ్రతో కలసి పుష్పాపచయనం చేస్తూ మాటాడుతోంది. ఆమెను చూసి రురువు విభ్రాంతచిత్తుడై పోయాడు. అనిమేషుడైపోయాడు. స్తంభీభూతశరీరుడైపోయాడు.
సౌర్యాయణి మిత్రుని అవస్థ చూసి కంగారు పడి, “రురూ, రురూ!” అంటూ భుజంపై చేయి వేసి కదిపాడు.
ఆ శబ్దానికి ఆ యువతులందరూ తమ దృష్టిని మళ్లించి ఆ ఇద్దరు ఋషికుమారులను చూశారు. అందులో ఒక ఋషికుమారుడు నిర్నిమేషంగా తమలో ఒకరిని చూస్తూ ఉండటం గమనించారు.  ఇంతలో వారిలో ఒక యువతి ముందుకు వచ్చింది.
“ఋషికుమారులారా! స్వాగతం. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి” అంటూ పలికింది.
రురువు ముందుకు అడుగు వేశాడు. సౌర్యాయణి అతడి చేతిని పట్టుకుని ఆపివేశాడు.
“అమ్మా, క్షమించండి! మీరున్న ప్రాంతానికి తెలియక వచ్చాము. మీ అందరికీ నమస్కారాలు. ఇక వెళ్లి వస్తాము” అన్నాడు.
రురువు చేతిని పట్టుకుని లాగుకుంటూ వెళ్లిపోతున్నాడు. రురువు మాటిమాటికీ వెనుదిరిగి తన మనసును అమాంతం ఆకర్షించిన ఆ యువతిని చూస్తున్నాడు.
“రురూ! నువు నీ వంశానికి తగని పని చేస్తున్నావయ్యా! గురువులు చెప్పిన పాఠాలను స్మరించుకో! ఈ మోహం నీకు తగదు! ఆనందమనే అలలపైన తేలియాడవలసిన నీ మనోనౌకకు ప్రేమ అనే చిల్లు పడితే దుఃఖమనే గభీరమైన సముద్రంలో మునిగిపోతుందయ్యా! దానితో పాటు నువు కూడా మునిగి పోతావు. త్వరగా మన ఆశ్రమానికి మనం పోదాం పద! సర్వమనోవికారాలకూ అది భైషజ్యస్థానం!” అంటూ సౌర్యాయణి మిత్రుడికి నచ్చజెపుతూ లాగుకొని పోతున్నాడు.
ఇంతలో ఒక యువతి పరుగుపరుగున తమ చెంతకు రావడం గమనించాడు రురువు. 
“వారికి మన సహాయం అవసరమైనట్టు ఉంది. ఒక్క క్షణం ఆగు మిత్రమా!” అన్నాడు.
ఆమాట విని సౌర్యాయణి ఆగాడు.
పరుగెత్తుకు వచ్చిన ఆ యువతి రురువు చేతిలో ఒక కెందామారను ఉంచింది. “స్వామీ, మీకు మా చెలి ప్రమద్వర ప్రేమపూర్వకంగా ఈ కానుకను ఇచ్చి రమ్మంది” అని చెప్పింది. సౌర్యాయణి చేతిలో కొన్ని ఫలాలను ఉంచి, “స్వామీ, సోదరసమానులైన మీకు మా చెలి ప్రమద్వర భక్తిపూర్వకంగా ఈ కానుకను ఇవ్వమని కోరింది” అంటూ చెప్పింది.
“ప్రమద్వర ఎవరు?” అని అడిగాడు సౌర్యాయణి.
అది తాను కూడా స్వయంగా అడుగుదామనుకున్న ప్రశ్న కాబట్టి, రురువు కూడా సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
“స్వామీ, మీ మిత్రులు అనిమిషులై ఎవరిని చూస్తున్నారో, ఆమెయే ప్రమద్వర. స్థూలకేశమహర్షులవారి కుమార్తె.”
తన మిత్రుని చాంచల్యం వారికి కూడా విదితమైనందుకు సౌర్యాయణి సిగ్గుపడ్డాడు. “మా అపరాధానికి మన్నించండి. ఈవైపున మీరు ఉంటారని తెలియక ప్రమాదవశాత్తు వచ్చేశాము.”
“లేదు స్వామీ, మీ దర్శనం మాకు భాగ్యవశాత్తు కలిగిందని భావిస్తున్నాము. మీరు దయతో మా ఆతిథ్యాన్ని అంగీకరిస్తే మేము మరింత భాగ్యవంతులమని భావిస్తాము.”
“అమ్మా, మీకు మేము ఆదరపాత్రులమైనందుకు మిక్కిలి ధన్యులమైనాము. మీ స్నేహితురాలి తండ్రిగారి ఆశీస్సులను, వారి ఆతిథ్యాన్ని కూడా పొంది, మేము మా ఆశ్రమానికి మరలిపోతున్నాము. ఆలస్యమైతే సాయాహ్నికాలకు ఆటంకాలు కలుగవచ్చు. మన్నించండి.” అంటూ సౌర్యాయణి రురువు భుజం తట్టాడు, కదలమని సూచిస్తూ.
అప్పటికీ రురువు దూరంగా ఉన్న ప్రమద్వరవైపు పదే పదే చూస్తూ, అనిష్టంగానే కదిలాడు.
ఇంతలో ఆ యువతి చొరవ చేసి, “స్వామీ, కనీసం మీ పరిచయభాగ్యమైనా మాకు కలుగనివ్వండి” అని అడిగింది.
అయితే, అంతవరకూ ఎంతో సహనంతో మాట్లాడిన సౌర్యాయణికి చప్పున కోపం వచ్చింది. పెదవులు కంపించిపోతూ ఉండగా, “ఏమమ్మా? మా మిత్రుడిని ఇంతటితో వదిలిపెట్టదా మీ ప్రమద్వర? మా అపరాధానికి మేము క్షమాపణలు చెప్పాము కదా? అయినా ఎందుకు ఇలా మమ్మల్ని వేధిస్తారు?” అన్నాడు.
ఋషికుమారుని కోపానికి ఆ యువతి చిగురుటాకులా వణికిపోయింది. మరొక్క మాట కూడా అధికంగా మాట్లాడకుండా తలవంచి, నమస్కరించి, చప్పుడు చేయకుండా వెనుదిరిగిపోయింది.
ఇంత జరిగినప్పటికీ, ఆవైపే చూస్తున్న రురువును చూసి సౌర్యాయణికి మరింత కోపం వచ్చింది.
“ఏమయ్యా రురూ? నువు చదువుకున్న శాస్త్రాలను నువే అవమానపరుస్తున్నావు. నువు చేసిన తపస్సునంతా నువే వ్యర్థం చేసుకుంటున్నావు. నీ కఠోరనియమాలకూ వ్రతాలకూ నువే చెల్లుచీటీ వ్రాస్తున్నావు. నీ బ్రహ్మచర్యానికి నువే నిప్పు పెట్టుకుంటున్నావు. నీతో పాటు బయలుదేరినపుడు మా రురువు బాగానే ఉన్నాడే? మరి ఇపుడు ఎందుకు ఇలా మారిపోయాడు? నువు పక్కనే ఉండి కూడా ఎందుకు అలా జరగనిచ్చావు?” అని మీ తండ్రి అడిగితే నన్నేమి సమాధానం చెప్పమంటావు? పద పద. ఇక వెనుదిరిగి చూడకు. చూశావో, నువు నన్ను హత్య చేసినట్టే భావిస్తాను” అంటూ సౌర్యాయణి రురువును గద్దిస్తూ చర చరా అక్కడినుండి లాగుకుని పోయాడు.

Wednesday 6 February 2019

దేవుడు ఎందుకు కనబడటం లేదు?


దేవుడు ఎందుకు కనబడటం లేదు?

శ్రీకాంతుడు పదకొండు ఏండ్ల పిల్లవాడు. ఆరవతరగతి చదువుతున్నాడు. బడికి సంక్రాంతి సెలవులు ఇస్తే స్వగ్రామానికి వెళ్ళాడు. రెండు మూడు రోజుల పాటు తన తోటి పిల్లలతో కలసి గ్రామం చుట్టుపక్కల ఉండే కొండలు, కోనలు, తోటలు తిరిగాడు. పండుగ మూడు రోజులు ఎంతో హాయిగా సంతోషంగా హుషారుగా గడిపేశాడు. సెలవులు మరికొద్ది రోజులు ఉన్నాయి. అపుడు కుటుంబం అంతా కొంత దూరంలో ఉన్న తమ ఇలవేల్పు గుడికి ఎద్దులబండిలో వెడదామని అనుకున్నారు.

కాని, శ్రీకాంతుడు మాత్రం “నేను రాను” అన్నాడు.

“ఎందుకు?” అని అడిగితే, ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం అందరినీ నిర్ఘాంతపరచింది.

“నాకు దేవుడి మీద నమ్మకం లేదు. దేవుడు లేడు”

శ్రీకాంతుడి తాతగారు నవ్వేశారు. “సరే, ముందు మీరు వెళ్లండి! మేము నెమ్మదిగా నడుచుకుని వస్తాము” అని మిగిలిన అందరినీ పంపేశారు.

“రారా కాంతూ, మనం కూడా నెమ్మదిగా నడుచుకుంటూ పోదాం అక్కడికి” అన్నారు.

కాని, మళ్లీ అదే సమాధానం చెప్పాడు శ్రీకాంతుడు.

“సరే, అడవిలో ఏటి ఒడ్డున ఆ గుడి ఉంది. హాయిగా ఇసుకలో ఆడుకోవచ్చు కదా! అందుకైనా పోదాం పద” అన్నారు తాతగారు.

మొత్తానికి తాతామనుమళ్లు నడుచుకుంటూ బయలుదేరారు.

“దేవుడు లేడని ఎందుకు అనుకుంటున్నావు కాంతూ?” అని అడిగారు తాతగారు.

పిల్లవాడు వెంటనే బదులు చెప్పాడు – “ఉంటే కనబడాలి కదా, అదిగో – ఆ రాయిలాగా, ఆ చెట్టు లాగా, ఆ కొండలాగా? అవి ఉన్నాయి కాబట్టి కనబడుతున్నాయి. దేవుడు లేడు కాబట్టి కనబడటం లేదు” అనేశాడు.

“ఏదైనా కనబడకుంటే లేనట్టేనా? నీకు ఇపుడు అమ్మా నాన్నా కనబడటం లేదు, మనకంటే ముందే బండిలో వెళ్లిపోయారు. దూరంగా ఉండటం వలన కనబడటం లేదు. అందువల్ల వారు లేరంటావా మరి?”

“వారిని ఇప్పుడు చూడలేకపోతున్నా. కాని, రోజూ చూస్తూనే ఉన్నాను కదా?”

“ఎవరెస్టు శిఖరాన్ని ఒక్కసారి కూడా నువు చూడలేదు కదా? మరి అది కూడా లేదంటావా?”

“నేను చూడలేదు, నిజమే, కాని, దానిని చూసినవారు, ఫోటోలతో సహా అందరికీ చూపించారు కదా?”

తాత నవ్వాడు. “కాంతూ, నువు మీ నాన్నను చూశావు. మీ నాన్నకు నాన్న అయిన నన్ను చూస్తున్నావు. కాని, నాకు నాన్న అయిన మీ ముత్తాతను చూశావా? లేదు కదా? మరి ఆయన కూడా లేరు అనగలవా?”

“ముత్తాత కాలంలో ముత్తాత ఉన్నాడు తాతగారూ, నేను కాదనటం లేదు. కాని, ఇప్పుడు లేడు కాబట్టి, కనబడటం లేదు. కాని, దేవుడు అలా కాదు కదా, ఆయన అంతటా ఉన్నాడు అంటారు. ఆయన ఎప్పుడూ ఉన్నాడు అంటారు. మరి కనబడాలి కదా?”

తన మనుమడు తాను ఊహించిన దానికన్నా తెలివైనవాడు అని తాతగారికి అర్థమైంది. ఆయనకు సంతోషం కూడా కలిగింది. చిన్నతనంలోనే దేవుడి అస్తిత్వాన్ని గూర్చి తర్కంతో కూడిన ఆలోచన చేస్తున్నాడు. సరైన మార్గదర్శనం చేసేవారు ఉంటే ఇటువంటివారు భారతీయతను, సంస్కృతిని తరతరాలుగా చాటగలరు, నిలబెట్టగలరు.

“నాయనా, ఉన్న వస్తువు కూడా కనబడకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. మన పెద్దవాళ్లు చెప్పారు. వింటావా మరి?”

“సరే తాతగారూ!”

“అతిదూరాత్ సామీప్యాత్
ఇంద్రియఘాతాత్ మనోऽనవస్థాత్।
సౌక్ష్మ్యాత్ వ్యవధానాభిభవాత్
సమానాభిహారాచ్చ।।”

“అంటే ఏమిటి తాతగారూ?”

“అదేమంటే, కంటికి బాగా దూరంగా ఉండటం వల్ల, ఉన్న వస్తువు కూడా మనకు కనిపించదు. మన వూరికి తిరుపతి దూరంగా ఉన్నది కదా, అందువల్ల కనిపించదు. అలాగే, కంటికి మరీ దగ్గరగా ఉన్న వస్తువు కూడా కనిపించదు. నీ ముఖం నీకే కనబడదు, అద్దంలో చూసుకుంటే తప్ప! అవునా?”

“అవును తాతగారూ!”

“అలాగే, కంటికి ఏదైనా దెబ్బ తగిలినపుడు, కంటి రోగం ఉన్నపుడు కూడా, ఉన్న వస్తువు కనిపించదు. చూడు, మీ అవ్వ కండ్లద్దాలు పెట్టుకుంటే తప్ప పుస్తకం చదవలేదు.”

“అవును తాతగారూ!”

“సరే, మనం ఇప్పటికి చెరువు కట్ట మీద ఇంత దూరం నడుచుకుని చివరకు వచ్చేశాము కదా, కట్టకు ఇటువైపున వేప చెట్లు, చింత చెట్లు బోలెడు ఉన్నాయి కదా? ఏవి ఎన్ని ఉన్నాయో చెప్పగలవా?”

“చెప్పలేను తాతగారూ!”

“అంటే, నువు వాటిని చూడలేదా?”

“చూశాను తాతగారూ!”

“మరి ఎందుకు చెప్పలేవు?”

“ఎందుకంటే, నేను వాటిని చూస్తూనే ఉన్నప్పటికీ, మీ మాటలను శ్రద్ధగా వింటున్నాను తప్ప, అవి ఎన్నెన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అనే శ్రద్ధ నాకు కలగలేదు కాబట్టి”

“అవును కదా? అలాగే, దేవుడు ఉన్నప్పటికీ, మనకు శ్రద్ధాసక్తులు లేకుంటే మనం ఆ దేవుని నిజస్వరూపాన్ని గ్రహించలేము. ఒప్పుకుంటావా?”

శ్రీకాంతుడు కాసేపు ఆలోచించాడు. “మీరు చెబుతుంటే నిజమే అనిపిస్తోంది తాతగారూ!”

తాతగారు నవ్వారు. “ఇంకా చెబుతాను చూడు. ఒక వస్తువు ఉన్నప్పటికీ, సూక్ష్మంగా ఉంటే చూడలేము. నువ్వు సైన్సు విద్యార్థివే కదా, మన చుట్టూ ఉన్న వాతావరణంలో సూక్ష్మజీవులు ఉన్నాయి అని తెలిసినవాడివే కదా, మనకు అవి కనబడటం లేదు కదా?”

“నిజమే తాతగారూ, అవి మన కంటికి కనబడనంత చిన్నవి కాబట్టి కనబడటం లేదు.”

“కాంతూ, మన శరీరంలో గుండె ఉంది కదా? అది నీకు కనబడుతుందా?”

“కనబడటం లేదు తాతగారూ!”

“ఎందువల్ల కనబడటం లేదు?”

“చర్మం వెనుక ఉంది కదా, అందువల్ల కనబడటం లేదు.”

“అంటే, ఏదైనా అడ్డం ఉంటే కనబడదు. కదా?”

“అవును!”

“నక్షత్రాలు ఉన్నాయి కదా?”

“ఉన్నాయి.”

“మరి, అవి ఇప్పుడు ఎందుకు కనబడటం లేదు?”

“పగలు కాబట్టి.”

“అదేమిటి? రాత్రి పూట కంటే, పగటి పూట మనం మరింత బాగా చూడగలం కదా?”

“అంటే, సూర్యుడు నక్షత్రాలకంటే ఎక్కువ కాంతితో ప్రకాశిస్తాడు. అందువల్ల, ఆయన కాంతి ముందు ఇంకేవీ కనబడవు.”

“పోనీ, సూర్యుణ్ణి అయినా నేరుగా చూడగలవా?”

“ఎలా సాధ్యం? అంత కాంతిని చూస్తే మన కళ్లు తట్టుకోలేవు!”

“కాంతూ! నువ్వెప్పుడైనా గురివింద గింజలను చూశావా?”

“చూశాను తాతగారూ!”

“ఇదుగో! ఈ చెట్టుకు కాశాయి చూడు!” అంటూ తాతగారు, దారిలో ఒక పొదలో ఉన్న గురువింద చెట్టుకు ఉన్న కొన్ని కాయలను కోసి దానిలోనుండి ఎరుపు నలుపు రంగులలో ఉన్న గురివింద గింజలను అరచేతిలో పెట్టుకున్నాడు.

“కాంతూ, ఇందులో ఒక గింజను తీసుకో!”

శ్రీకాంతుడు ఒకదానిని తీసుకున్నాడు. “ఎంత నునుపుగా ఉందో!” అన్నాడు.

“సరే, చూశావుగా! ఇక ఆ గింజను మళ్లీ నా అరచేతిలో పెట్టు!”

శ్రీకాంతుడు అలాగే చేశాడు. తాతగారు తన రెండు అరచేతులనూ దగ్గరగా చేర్చి లోపల ఉన్న గింజలను కాసేపు అల్లాడించి మళ్లీ తెరిచి ఆ గింజలను చూపించాడు.

“ఏదీ? నువ్వు ఇంతకు ముందు ఒక గింజను చేతిలో పట్టుకుని చూశావే? మళ్లీ అదే గింజను బయటకు తీసి చూపించు?” అని అడిగాడు.

శ్రీకాంతుడు ఆశ్చర్యపోయాడు. “అదెలా సాధ్యం తాతగారూ? అన్నీ ఒకేవిధంగా ఉన్నాయి కదా? ‘నేను చేతిలోకి తీసుకుని చూసింది ఇదే’ అని ఎలా గుర్తు పట్టగలను?” అని అడిగాడు.

తాతగారు నవ్వారు. “చూశావా నాయనా! మన కండ్లు ఎంతో గొప్పవి అనుకుంటాం. కాని, వీటికి ఎన్నెన్ని పరిమితులు అంటే లిమిటేషన్స్ ఉన్నాయో అర్థం చేసుకున్నావా? అందువల్ల ఇటువంటి అల్పమైన శక్తి కలిగిన కండ్లతో అపరిమితమైన శక్తి కలిగిన దేవుడిని చూడడం సాధ్యమా?” అని అడిగాడు.

శ్రీకాంతుడు కాసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత, “తాతగారూ, మీరు ఇపుడు చెప్పింది అంతా బాగా అర్థమైంది” అని చెప్పాడు చిరునవ్వులు చిందిస్తూ.

గుడికి వచ్చి, శ్రద్ధగా పూజలో పాల్గొంటున్న శ్రీకాంతుడిని చూసి, “నడచి వచ్చేటపుడు తాతగారు ఏమి మంత్రం వేశారో” అని అందరూ ఆశ్చర్యపడినప్పటికీ, చాల సంతోషపడ్డారు.
***



యథార్థభారతి (జనవరి, 2019) సంచికలో ప్రచురింపబడిన నా కథ.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...