Sunday 13 June 2021

 


ఓమ్మోవ్!

రాళ్లు రప్పలకు , బొమ్మలకు స్నానం చేయించి , పట్టుబట్టలు కట్టి , బంగారు నగలు పెట్టి పాలు, పండ్లు, టిఫినీలు తినిపిస్తే అది అజ్ఞానం అంటున్నావు. మెంటల్ అంటున్నావు. అది తప్పు అని చెప్పినా వినలేనంత మతోన్మాదపు మత్తు అంటున్నావు. మానసికదౌర్బల్యం అంటున్నావు. వెఱ్ఱి భక్తిని వీధుల్లో ప్రదర్శిస్తున్నారు అంటున్నావు.

సరే గాని, మీరు చెబుతున్న అటువంటి అజ్ఞానం గాని, మెంటల్ గాని, తప్పు గాని, మతోన్మాదపు మత్తు గాని, మానసికదౌర్బల్యం గాని, వెఱ్ఱిభక్తి గాని సమాజంలో ఎవరికైనా అపకారం చేసిందా? ప్రాక్టికల్ గా మాట్లాడండి. మాట్లాడే ముందు ఆలోచించండి.

అజ్ఞానం కొద్దీ పాలు పండ్లు టిఫినీలు రాళ్లు రప్పలకు పెడుతున్నారు అంటున్నారే? ఆ రాళ్లూ రప్పలు రోజుకు ఎన్నేసి టన్నులు మెక్కుతున్నాయి? నైవేద్యం పెట్టి ఆ తరువాత అవన్నీ ప్రసాదం అని భావిస్తూ శ్రద్ధగా తినేది జనాలేగా? వ్యర్థం అయ్యే ప్రక్రియ అందులో ఏముంది? అందులో మెంటల్ ఏముంది? మీ పనేదో మీరు చూసుకోక మీ జోలికి రాకుండా వారు చేసే పనిని తప్పు అని మీరు ఎందుకనాలి? సమస్తప్రపంచానికీ ఆహారాన్ని సమకూరుస్తున్న అలౌకికశక్తిని సింబాలిక్ గా పూజ పేరిట వారికి నచ్చిన పద్ధతిలో వారు గౌరవించుకుంటారు. అది మీ దృష్టిలో మతోన్మాదపు మత్తు ఎందుకైంది? పోనీ, అది మీరన్నట్టే మత్తు అనుకుందాం. ఆ మత్తులో వారు తిన్న ఆ ప్రసాదం వల్ల వారికి గాని, ప్రపంచానికి గాని జరిగిన హాని ఏమైనా ఉందా? లేదు కదా? మరి మీకేమిటి బాధ?

ఏమ్మా? వంటింట్లో డైరెక్టుగా వండుకుని తింటే మీ దృష్టిలో అది ప్రగతికాముకత అవుతుందా? లేకపోతే హోటల్ కు వెళ్లి ఆర్డర్ ఇచ్చి తింటే అది అభ్యుదయవాదమౌతుందా? ఈరోజు ప్రసాదం తిని, రేపు ఇంట్లో తిని, ఎల్లుండి హోటల్లో తినే మనుషులు ఎంతమంది లేరు? వాళ్లు మొదటి రోజు మతోన్మాదులు, రెండో రోజు ప్రగతి కాముకులు, మూడోరోజు అభ్యుదయవాదులా?

అట్లయితే సర్టిఫికేట్ల షాపు పెట్టుకోవచ్చు మీరు.

వోమ్మా?

కోట్లమంది తిండికి లేక ఏడుస్తున్నారు అని వాపోతున్నావు.
అది ఎవరి తప్పు?

పుష్కలంగా పంట పండినా, సరైన ధర ఇచ్చి కొనేవారు లేరని పంటను రైతులు మార్కెట్ లోనే దించేసి వెళ్ళిపోయిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి.

పండిన పంటను జాగ్రత్త చేసి అవసరం అయిన ప్రజలకు చేర్చలేని ప్రభుత్వాన్ని కాదా నువ్వు ప్రశ్నించాల్సింది? అవసరమైనంత పంటలు పండుతున్నా అధికధరలు ఉండటం వల్ల పేదప్రజలకు తిండిగింజలు దొరకటం లేదు.

ఇది వ్యాపారప్రపంచపు తప్పా లేక హిందూభక్తుల తప్పా?

ప్రతిదానికి ఇలా హిందూ భక్తులను ఎందుకమ్మా ఆడిపోసుకుంటావు? అట్లా రేట్లు పెరగడానికి వారా కారణం? వారిని తిట్టే మీది కాదా హిందూ-వ్యతిరేక-ఉన్మాదం?

ఇంకా ఏమన్నారు? - పక్కింట్లో అనారోగ్యంతో మనుషులు చచ్చినా పట్టించుకోరు అంటున్నారా?

ఎవరు పట్టించుకోవటం లేదమ్మా? దేవుడి భక్తులు పట్టించుకోవటం లేదు అని మీ ఉద్దేశమా? ఓ సారి తిరుపతికి రండి. అలిపిరి నుండి ఓసారి అలా దక్షిణం దిక్కుగా ఓ కిలోమీటరు దూరం పొండి. భక్తులు ఇచ్చిన ధనంతోనే నిర్మింపబడి ప్రతిరోజూ వేలాది రోగులకు స్వచ్ఛందంగా సేవలందిస్తూ ఉన్న స్వామివారి వైద్యశాలలు మీకు కనిపిస్తాయి. వారి అనారోగ్యాన్ని నయం చేసేందుకు శాయశక్తులా కృషిచేస్తున్న డాక్టర్లు కనిపిస్తారు. వారు కూడా భక్తశిఖామణులే మరి!

అలాగే, మీరు మీ కండ్లను డాక్టర్ దగ్గరకు పోయి చెకప్ చేయించుకుంటే మంచిది.

ఎందుకు అని అడగరేం? లక్షలు పెట్టి లడ్లను కొనడం ఒక్కటే మీకు కనిపిస్తోంది. ఆ పక్కనే వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ జరుగుతూ ఉంటే మీకు కనబడటం లేదు కదా? అందుకు.

హిందువులు తాము సంపాదించుకున్న డబ్బును పండుగల కోసం ఖర్చు పెడతారు, దానధర్మాలు చేస్తారు కాబట్టే వారి డబ్బులు బ్యాంకులలో మూలగకుండా బయటకు వచ్చి, మట్టిని బొమ్మ చేసేవారి చేతుల్లోను, ఆకులు గడ్డీ అమ్మేవారి చేతిలోనూ, కాగితాలతో గొడుగులు చేసి అమ్మేవారి చేతిలోనూ (వీరందరూ పేదవారే సుమా) పడుతుంది.

ఈ పండుగలు లేకుంటే సంపాదన ఉండే ప్రతి హిందువూ ఈ పాటికి కోటీశ్వరుడై ఉండేవాడు తెలుసా? హిందువంటే పండుగల పేరిట తన సంపదను అందరితో పంచుకునేవాడు సుమా.

అయినా, ఎందుకమ్మా మీకు హిందువుల మీద, హిందువుల దేవుళ్ల మీద, హిందువుల పండుగలు, ఆచారాల మీద ఇంత ద్వేషం?

భారతీయ సమాజంలో ఎక్కడ ఎటువంటి లోటు కనబడినా వెంటనే హిందూదేవుళ్ల మీద, హిందూ భక్తుల మీద తిట్ల దండకాలు అందుకోవాలని మీకు ఎవరు నేర్పించారమ్మా? ఎక్కడ మీ ట్రైనింగ్ సెంటర్?

ఒకవేళ నిజంగా తప్పు జరిగిందే అనుకోండి.
ఇది తప్పు అని చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది కదా?
మీరు స్కూల్లో టీచర్ అయ్యుంటే మీ స్టూడెంట్లు చదువు నేర్చుకొనడం అటుంచి వాళ్ళ మెదళ్ళు పూర్తిగా మొద్దుబారిపోయి ఉండేవి.

మీ సోదరులకు చెప్పినట్టు మృదువుగా ఇందువల్ల ఇది తప్పు అని చెప్పవచ్చు కదా? అంతే గాని మీరు మొదలు పెట్టీ పెట్టడమే మెంటల్ గాళ్లు అని అందుకుంటే మీది ఉన్మాదం కాకుండా పోతుందా?

ఆ విధంగా రెచ్చగొట్టి రాళ్లేయించుకుని చూశారా ఈ హిందువులు నిజంగా మతోన్మాదులే అని నిరూపిద్దామనా మీ తాపత్రయం?

విద్య అవసరం



ఒకవేళ మనం పశువులుగా పుట్టామనుకోండి, పశువులుగా బ్రతకాల్సిందే. మరో అవకాశం లేదు. కాని, కొందరు మనుషులున్నారే, మనుషులుగా పుట్టినా సరే, వేరే కొందరికి మనుషుల్లా బ్రతికే అవకాశం ఎందుకివ్వరు?

ఆహారనిద్రాభయమైథునాలు పశువులకూ మనుష్యులకూ సమానమేనట. అయితే వారిని వేరు చేసేది ధర్మమట. కాబట్టి ధర్మం చేసేవాడు మనిషి అయ్యాడట. ధర్మం తెలియనివి పశువులయ్యాయట.

ధర్మమన్నాం గదాని ఇప్పుడు మతగ్రంథాలలోనికి ఆధ్యాత్మికరంగాలలోనికి దూరి అదేమిటోనని విచికిత్స చేయవలసిన అవసరం లేదు. ధర్మమంటే ప్రాథమికంగా విధి. Duty. బాధ్యత వహించడం. Taking responsibility.

ఎవరైనా సరే, ఏది చేయగలరు? తమకు తెలిసిందే చేయగలరు. అయిదు నిమిషాలు మాట్లాడవయ్యా అంటే, నాకు తెలిసిన విషయాన్ని గూర్చే మాట్లాడగలను తప్ప, తెలియని విషయాలను గూర్చి ఏం మాట్లాడగలను?

ఈవిధంగా తెలియని విషయాన్ని గూర్చి కనీసం మాట్లాడడం కూడా సాధ్యం కాదే? మరి తెలియని విధిని Dutyని ఎలా నిర్వర్తించగలం? తెలియని బాధ్యతలను ఎలా వహించగలం?

ఇంటిలో మన విధులేమిటో బాధ్యతలేమిటో, అమ్మానాన్నాలు నేర్పించేస్తారు. మనముండే వీథిలో, ఇరుగుపొరుగుతో సఖ్యంగా ఉంటూ, ఇచ్చిపుచ్చుకుంటూ, అన్యోన్యసహకారంతో మనం ఎలా వ్యవహరించాలో కూడా చిన్నతనంనుండి నేర్చుకుంటూనే ఉంటాము. అయినా చిన్న చిన్న అపార్థాలు, తగవులు వస్తూనే ఉంటాయే?

ఇలాంటి పరిస్థితుల్లో, వీథులు దాటి, కాలనీలు దాటి, ఊర్లు, పట్టణాలు, నగరాలు, మండలాలు, తాలూకాలు, జిల్లాలు, రాష్ట్రాలు, రాజ్యాలు దాటి ఖండఖండాంతరాలలో విశాలంగా విస్తరించిన సమాజమున్నది కదా, ఈరోజుల్లో?

మరి, ఇంతటి విస్తృతమైన సమాజంలో మన విధులేమిటో, మన వ్యవహారవిధానం ఎలా ఉండాలో ఎవరో తెలిసినవారు పూనుకొని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్పాలి? పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వమే చెప్పాలి. మన విధులేమిటో మనకు చెప్పలేనిదానికి ప్రభుత్వమనే పేరెందుకు?

ప్రభుత్వం చెప్పలేక వేరెవరితోనో చెప్పించుకోండి పొండని చెప్పడం బాధ్యతారాహిత్యం.

చదువుయొక్క ప్రాథమికలక్ష్యం పౌరులకు తాము నిర్వర్తించవలసిన విధులను బాధ్యతలను తెలియజేయడం.

ఇక భాషాబోధన, లెక్కలు, సైన్సు, హిస్టరీ, ఇలాంటివన్నీ ఎందుకు నేర్పించాలి అంటే, ఆయా విధులను సక్రమంగా నిర్వర్తించడం కోసం అవసరమైన నైపుణ్యాలను అందించడం కోసం.

తమ పౌరులకు వారి విధులను బాధ్యతలను బాగా తెలియజేసి, వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు తగిన నైపుణ్యాలను పెంపొందింపజేసి ప్రశాంతమైన, ఆదర్శవంతమైన సమాజాలను నెలకొల్పడం ప్రభుత్వాల బాధ్యత. విద్యావ్యవస్థ ఉండవలసిన తీరు అది. (కాని, ఉన్నత వ్యక్తిత్వనిర్మాణబాధ్యతను గాలికొదిలి, నైతిక విలువలు లేని ఉద్యోగులను ఉత్పత్తి చేయడం మాత్రమే ప్రస్తుతవిద్యావ్యస్థ తన కర్తవ్యంగా భావిస్తోంది.)

అంతే కాదు, తమ (కాబోయే) పౌరులకు విద్యను అందించవలసిన ప్రాథమికబాధ్యతను ప్రభుత్వాలు నెమ్మది నెమ్మదిగా వదిలించుకుంటూ ఉన్నాయి.

ఈవిధంగా, ఒకవైపు ప్రభుత్వమే స్వయంగా తన ప్రధాన విధిని నిర్లక్ష్యం చేస్తూ తమ పౌరులు మాత్రం తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని కోరుకొనడం అత్యాశ కదా? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని ఒక సామెత ఉండనే ఉంది.

ప్రైవేటు వ్యక్తులకు ఆ బాధ్యత అప్పగించి చేతులు దులుపుకుంటే, వారు ప్రభుత్వానికో సమాజానికో ఆవసరమైన పౌరులను తయారు చేయరు. రకరకాల కార్పొరేట్ వ్యవస్థలకు అవసరమైన పౌరులను తయారు చేస్తారు. మీ విశ్వాసమూ మీ విధేయత ఆయా కార్పొరేట్ యజమానుల పట్లనే ఉండాలని, మీ జ్ఞానము, మీ నైపుణ్యము వారికే అంకితం చేయాలంటాయి.

మంచిదేగా, అవన్నీ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సమాజానికి ఉపయోగపడతాయి కదా అనుకోవచ్చు.

చక్కని విద్య, అమోఘమైన నైపుణ్యాలు కలిగిన పౌరులను కార్పొరేటు వ్యవస్థలు తమ గుప్పిట్లో పెట్టుకుంటాయి. సమాజం పట్ల, దేశం పట్ల వారికేమీ బాధ్యతలు లేవనిపిస్తాయి. కనీసం తమ ఇంటి బాధ్యతలు కూడా ప్రధానం కాదనిపిస్తాయి. ఇవన్నీ అతిశయోక్తులనిపిస్తున్నాయా?

ఉద్యోగనిర్వహణ ధర్మం పేరిట మన అనుంగుమిత్రుని పెళ్లికి మనం హాజరుకాలేక, వీడియో చాట్‌లో శుభాకాంక్షలు మాత్రం చెప్పి ఊరుకొనడం, మన చెల్లెలి పెళ్లి వ్యవహారాలను కూడా మనం దగ్గరుండి మొత్తం చూసుకోలేకపోవడం, పేరెంట్స్ మీటింగుకు రండి నాన్నా అని పిల్లలు పదే పదే చెప్పినా హాజరు కాలేకపోవడం, అనారోగ్యం పాలైన తల్లిదండ్రులను ఫోన్లలో పలకరించి, ఇప్పుడు రాలేను, ఆదివారం వస్తాను అని చెప్పడం, మన passion అయిన ఫొటోగ్రఫీ కళను పోషించుకొనేందుకు అతి ఖరీదైన కెమెరాను కొన్నప్పటికీ, దానిని ఉపయోగించుకునే తీరిక లేక మూలన పెట్టేసి, ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ధమౌతూ అది మన కంటబడినపుడు నిరాశతో మనసు మూలగడం - ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కార్పొరేటు బానిసల లక్షణాలు కావా?

తన ఇంటినే పట్టించుకొనే తీరిక లేనివాడు, ఇక సమాజం పట్ల ఏమాత్రం బాధ్యతను వహించగలడు? ఏ వరదలో ఏ భూకంపాలో వచ్చినపుడు ఏవో ముక్కూ మొహం తెలియని స్వచ్ఛందసంస్థలను మనఃస్ఫూర్తిగా నమ్మి, ఆన్‌లైన్‌లో తన వంతుగా కొంత సొమ్మును పంపి కొంత ఆశ్వాసన పొందడం తప్ప ఏమి చేయగలడు?

ఇలా బానిసలుగా మారేందుకు తగిన విద్య(?)ను మనం డబ్బులిచ్చి మరీ కొనుక్కొనవలసి రావడం దౌర్భాగ్యం కాక మరేమిటి?

ఓ ప్రభుత్వమా!

ఒక అందమైన బిల్డింగు, కొన్ని అందమైన గదులు, వాటిలో సౌకర్యవంతమైన కుర్చీలు, బల్లలు, మంచి వెంటిలేషను, (వీలైతే ఏసీ) ఒక గ్రౌండు, హడావుడిగా సిలబస్సు పూర్తి చేసి, రివిజన్ చేసి, పరీక్షలు పెట్టే కొన్ని యంత్రాలు, పరిశుభ్రమైన టాయిలెట్లు, ఇవన్నీ ఎంచక్కగా ఉంటే దానిని ఆదర్శ విద్యాలయమని అంటారా? విద్యార్జనమంటే నిజంగా మార్కులు, ర్యాంకులు మాత్రమేనా? ఈ ప్రైవేటు విద్యావ్యవస్థ విద్యార్థులను, తల్లిదండ్రులను, మేధావులను కూడా సమ్మోహపరచి, తప్పుదోవ పట్టిస్తూ ఉంటే కళ్లు మూసుకుని పాలు త్రాగుతూ ఉండడం నీకు సమంజసమేనా?

ప్రభుత్వవిద్యావ్యవస్థను ప్రజలు ఏనాడో నమ్మడం మానేశారు. సిగ్గనిపించడం లేదా?

(ఈ క్రింది ఫోటోలో ఈ మీడియావాడు కేవలం సగం నిజం మాత్రమే చెప్పి ఊరుకున్నాడు అనిపిస్తోంది. ఫీజు కట్టకపోతే దళితుల పిల్లలను మాత్రమే బహిష్కరిస్తారా? ఫీజు కట్టడం లేటయితే కులమతాలప్రసక్తి లేకుండా కార్పొరేట్ "విద్యాసంస్థలలో" జరిగే వేధింపులు ఈ మీడియా వాడికి తెలియవా? వీడికి కూడా తన విధులను గూర్చి సరైన ఎడ్యుకేషన్ లభించి ఉండదు.)

{ఎవడి మీద కోపమొస్తే వాణ్ణి పట్టుకొని మర్యాద లేకుండా వాడు, వీడు అనటం, వాణ్ణి వీణ్ణి అనే పదాలు ఉపయోగించడం కూడా, నాకు సరైన ఎడ్యుకేషన్ దొరకలేదు అనడానికి సూచన.}

క్లుప్తంగా -

బలహీనతలను తొలగించి, లోపాలను పరిష్కరించి, వీధిలోని పశువులకంటె మనలను ఉన్నతులుగా నిలిపేదే విద్య.

పరువు ఎవడబ్బ సొమ్ము


అనగనగా ధ్రువసంధి అనే రాజు ఉండేవాడు. మహా ధర్మాత్ముడు. ఆయనకు ఇద్దరు భార్యలు. మనోరమ, లీలావతి. మనోరమ కొడుకు సుదర్శనుడు. లీలావతి కొడుకు శత్రుజిత్తు.

దురదృష్టం కొద్దీ ధ్రువసంధి అడవిలో సింహం బారిన పడి చనిపోయాడు. అపుడు రాజు ఎవరు కావాలని సుదర్శనుడి మాతామహుడు అయిన వీరసేనుడు, శత్రుజిత్తు మాతామహుడు అయిన యుధాజిత్తు గొడవ పడ్డారు. వీరసేనుడిని యుధాజిత్తు చంపేశాడు. దాంతో, మనోరమ సుదర్శనుడిని తీసుకుని అడవికి పారిపోయి, భరద్వాజమహర్షిని శరణు కోరింది. యుధాజిత్తు శత్రుశేషం ఉంచరాదని సుదర్శనుడిని చంపేందుకు భరద్వాజుని ఆశ్రమానికి వెళ్లాడు కాని, మహర్షి తపఃశక్తికి భయపడి ఏమీ చేయలేక ఊరుకున్నాడు.

తరువాత ఎప్పుడో కాశీరాజు తన కూతురైన శశికళకు స్వయంవరం ప్రకటించాడు. రాజులందరూ విచ్చేశారు. అన్నదమ్ములైన సుదర్శనుడు, శత్రుజిత్తు కూడా వచ్చారు. శశికళ సుదర్శనుడిని వరించింది.

దాంతో శివాలెత్తిపోయిన యుధాజిత్తు "శశికళ నా మనుమడిని కాకుండా అతడికి పోటీదారు అయిన అన్నను వరిస్తుందా? ఆమెకు ఎంత ధైర్యం? ఆ సుదర్శనుడిని చంపేసి ఆమెను శత్రుజిత్తుకు ఇచ్చి పెళ్లి చేస్తా" అంటూ యుద్ధానికి దిగాడు.

ఇలా ఒకే కులం, ఒకే తండ్రిబిడ్డలు అయిన అన్నదమ్ములలోనే ఒకరిని కాకుండా ఇంకొకరిని ఒక కన్య వరించింది కాబట్టి మా పరువు పోయింది అనుకునే తాతలు ఉండేవారు సుమా.

ఈ కథలో తరువాత ఏమైందని అడుగుతారా? శశికళ కోరుకున్న వరుడే దైవానుగ్రహంతో యుద్ధంలో గెలిచాడు లెండి.

ఇలాంటి కథలు, ఇంతకంటె రసవత్తరమైన కథలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. చాలా వరకు మనకు తెలిసినవే. అయినప్పటికీ సరదాగా మళ్లీ గుర్తు చేసుకునేందుకు చదవండి:

1 శ్రీకృష్ణుడు

విదర్భరాజపుత్రి అయిన రుక్మిణి కృష్ణుని ప్రేమించింది. కృష్ణునికి ఇవ్వవచ్చునని ఆమె తల్లిదండ్రులు, బంధువులు కూడా అనుకున్నారు. కాని, రుక్మిణి అన్న ఐన రుక్మికి మాత్రం అది ఇష్టం లేదు. అతడు జరాసంధుని ముఠాకు చెందినవాడు. అతడి మాటపై తన దోస్తు ఐన శిశుపాలుడికి ఇచ్చి చేద్దామనుకున్నాడు. రుక్మిణి తల్లిదండ్రులు నిస్సహాయులయ్యారు.

రుక్మిణి ఒక బ్రాహ్మణుని ద్వారా తన మనసును కృష్ణునికి తెలియజేసింది. కృష్ణుడు వచ్చి ఆమెను అందరి సమక్షంలోనూ ఎత్తుకుపోయాడు.

రుక్మి శిశుపాలుడు, జరాసంధుడు కృష్ణుని చంపాలని వెంటబడ్డారు. కృష్ణుడు వారందరినీ ఓడించి తరిమేశాడు.
చేసేదేమీ లేక, సింహానికి దక్కాల్సిన సొమ్మును జింకలు కాజేసినట్టు మన రాజకన్యను ఆ గోపాలుడు ఎత్తుకుపోయి, ధనుర్దారులమైన మన కీర్తిని వాడు నవ్వులపాలు చేశాడే అని తిట్టుకుంటూ వారు ఊరట చెందారు పాపం. అందరిలోనూ తమ పరువు పోయిందని బాధపడిపోయారు.

अहो धिगस्मान् यश आत्तधन्वनां
गौपैर्हृतं केसरिणां मृगैरिव।
(భాగవతం 10.ఉత్తరార్ధం 54.57)

అయితే జరాసంధుని భీముడు, శిశుపాలుని కృష్ణుడు కాలాంతరంలో హతమార్చిన తరువాత, రుక్మిణి అన్న రుక్మి దారికి వచ్చాడు. తన కూతురు అయిన రుక్మవతిని రుక్మిణీకృష్ణుల కొడుకైన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుక్మిణీకృష్ణుల మనుమడైన అనిరుద్ధుడికి తన మనుమరాలైన రోచనను ఇచ్చాడు.

2 భీముడు

హిడింబుడు అనే రాక్షసుని చెల్లెలు హిడింబ. ఆమె అడవిలో భీముని చూడగానే ప్రేమించింది. తన అన్న క్రూరుడని మీ కుటుంబసభ్యులతో కలసి ఎక్కడకైనా దూరం పొమ్మని భీముని హెచ్చరించింది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పింది.

ఇంతలో హిడింబుడు రానే వచ్చాడు. తన చెల్లెలి మనోభావాన్ని గ్రహించి, "వొసే హిడింబా! మన వంశానికి కళంకం తెస్తున్నావు. ఛీ ఛీ.
पूर्वेषां राक्षसेन्द्राणां सर्वेषामपयशस्विनी।“
(భారతం.1.152.18) అన్నాడు. ఆ హిడింబుడికి కూడా తన చెల్లెలు ఒక మానవమాత్రుణ్ణి వరించడం ఒక పరువు తక్కువ పనిగా అనిపించింది!

“ఉండు, మీ ఇద్దరినీ చంపి పారేస్తా చూడు" అంటూ భీముడి మీద పడ్డాడు. అయితే భీమసేనుడే అతడిని చంపిపారేశాడు.

ఆ తరువాత, హిడింబ ప్రేమను భీముడు తిరస్కరించాడు. “నీ అన్నను చంపిన పగతో మమ్మల్ని ఏమైనా చేయగలవు దూరం పో పో” అన్నాడు. అపుడు హిడింబ కుంతిని ధర్మరాజును శరణు వేడి, వారి ద్వారా భీముని ఒప్పించి పెండ్లి చేసుకుంది. వారి కుమారుడే ఘటోత్కచుడు అని అందరికీ తెలిసిన విషయమే కదా!

3 ద్రౌపది

పాండవులు లక్క ఇంట్లో చనిపోయారని అందరూ అనుకున్నారు. కాని, వారు తప్పించుకున్నారు. బ్రాహ్మణవేషం ధరించి పాంచాలరాజ్యంలో ద్రౌపదీస్వయంవరసభను చేరుకున్నారు.

ఆ సభలో అందరూ మత్స్యయంత్రాన్ని ఛేదించడంలో విఫలమైన తరువాత బ్రాహ్మణవేషంలో ఉన్న అర్జునుడు ఆ పని చేశాడు. ద్రౌపది అతనిని వరించింది. ఇది చూసి అక్కడ ఉన్న రాజులు సహించలేకపోయారు. ఆ రాజులందరికీ ఇది తమ పరువుప్రతిష్ఠలకు సంబంధించి ఒక సవాలుగా అనిపించింది.

“వీరుడైనవాడు ఏ కులానికి చెందినప్పటికీ వాడికి అందరూ సలాము చేయవలసినదే” అని ఒకప్పుడు గర్జించి చెప్పిన దుర్యోధనుడు కూడా ఉక్రోషంలో తాను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తానే విస్మరించాడు.

“ఈ క్షత్రియకన్య (ద్రౌపది) ఒక క్షత్రియుని కాకుండా ఒక బ్రాహ్మణుని వరించినందుకు గాను ఈమెను నిప్పుల్లో పడేసి మన దేశాలకు మనం పోదాం. ”अग्नावेनां परिक्षिप्य याम राष्ट्राणि पार्थिवाः। (భారతం 1.188.😎 అని మిగిలిన రాజులతో పాటు మీదకు ఎగబడ్డాడు.

వారిని బ్రాహ్మణవేషాల్లోనే భీమార్జునులు అడ్డుకున్నారు. పెద్ద దొమ్మీ జరిగింది. యుద్ధంగా కూడా మారింది. వారిద్దరూ కలిసి ద్రౌపదిమీదకు పోబోయిన రాజులందరినీ చిత్తుచిత్తుగా ఓడించారు. మహా మహా కర్ణుడు కూడా అర్జునుని చేతిలో ఓడిపోయాడు. చేసేదేమీ లేక అందరూ నోరు మూసుకుని ఇంటికి పోయారు.

ద్రౌపది రక్షింపబడింది.

4 అర్జునుడు

తీర్థయాత్రలు చేస్తూ ద్వారకానగరానికి వచ్చిన అర్జునుడు, యాదవకన్య, శ్రీకృష్ణుని చెల్లెలు అయిన సుభద్రను చూసి ఇష్టపడ్డాడు.

సుభద్ర తనను వరిస్తుందో లేదో, యాదవులు ఆమెను తనకు ఇస్తారో లేదో అని అతడికి సందేహం కలిగింది.

శ్రీకృష్ణునితో ఆ విషయం చర్చించి, అతడి ప్రోత్సాహం మీదట, అన్న అయిన ధర్మరాజు అనుమతిని కూడా పొందిన మీదట, సుభద్ర రైవతకపర్వతానికి వచ్చిన సందర్భం చూసుకుని ఎత్తుకుపోయాడు.

భోజులు, వృష్ణీయులు, అంధకులు అనే మూడు తెగల యాదవులకు అది చాల అవమానకరంగా తోచింది.

అన్నపానాలు కూడా మానివేసి అందరూ సమావేశమయ్యారు. “రథాలను సిద్దం చేయండిరా. ప్రాసాలను తీసుకురండిరా”

योजयध्वं रथानाशु प्रासानाहरतेति च। (భారతం 1.219.17)

అంటూ అర్జునుని దండించి సుభద్రను తిరిగి తీసుకుని వచ్చేందుకు సంసిద్ధులయ్యారు.

బలరాముని మండిపాటుకైతే హద్దులే లేవు. “భోజనం చేసిన కంచాన్నే విరగ్గొట్టే కులకళంకుడని తెలియక ఆ అర్జునుడిని శ్రీకృష్ణుడి మిత్రుడు కదా అని ఎంతగా గౌరవించాం!

न च सोऽर्हति पूजां तां दुर्बुद्धिः कुलपांसनः।
को हि तत्रैव भूक्त्वान्नं भाजनं भेत्तुमर्हति। (భారతం 1.219.26,27)

అర్జునుడు అపహరించింది సుభద్రను కాదు, తన మృత్యువునే సుమా! ఇటువంటి పని చేయడం ద్వారా నా తలమీద అర్జునుడు తన పాదం పెట్టినట్టు కాదా? ఆ అర్జునుడు జన్మించిన కౌరవవంశాన్ని ఈ భూమి మీదనే లేకుండా చేస్తాను.

अद्य निष्कौरवमेकः करिष्यामि वसुन्धराम्। (భారతం 1.219.31)”

అంటూ అవమానంతో కుతకుతలాడిపోయాడు.

యాదవులందరూ బలరాముని సమర్థిస్తూ “పదండి పదండి” అంటూ రణనినాదాలు చేశారు.

వారికి ఇదొక పరువు సమస్య అయింది!

కాని, శ్రీకృష్ణుడు సుభద్రకు అర్జునుడు తగిన జోడీ అని, స్వయంవరంలో సుభద్ర తనను వరిస్తుందో లేదో అనే సంశయంతో అర్జునుడు ఆమెను ఎత్తుకువెళ్లి ఉంటాడని, అది క్షత్రియులకు అనుచితమైన పనేమీ కాదని నచ్చజెప్పి బలరాముని, మిగిలిన యాదవులను చల్లబరచాడు.

శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో యాదవులు సగౌరవంగా సుభద్రార్జునులను ద్వారకకు తిరిగి తీసుకుని వచ్చి, వారికి వివాహం చేశారు. కాలక్రమేణ వారిరువురికీ జన్మించిన అభిమన్యుడు యాదవులందరికీ ముద్దుల మేనల్లుడు కావడం తెలిసిందే.

5 సాంబుడు

జాంబవతీశ్రీకృష్ణుల కుమారుడు సాంబుడు. దుర్యోధనుని కూతురైన లక్ష్మణను ఇష్టపడ్డాడు. ఆమెను స్వయంవరసభనుండి ఎత్తుకుపోయాడు.

సాంబుడు చేసిన పనికి కౌరవులు ఆగ్రహంతో ఊగిపోయారు. “పట్టండిరా ఈ దుర్మార్గుడిని. మనం దయదలచి ఇచ్చిన భూమిని ఏలుకుంటున్న ఈ వృష్ణీయులు (యాదవులు) ఏమి చేస్తారో చూద్దాం.

बध्नीतेमं दुर्विनीतं किं करिष्यन्ति वृष्णयः।
येऽस्मत्प्रसादोपचितां दत्तां नो भुञ्जते महीम्।“
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)

అని మీదపడి బంధించారు.

యాదవులంటే వారికి చిన్నచూపు. వారు తమ పిల్లను చేసుకొనడం తమకు పరువు తక్కువగా కౌరవులు భావించారు!

ఈ విషయం తెలిసిన యాదవులు సాంబుడిని విడిపించుకునేందుకు యుద్ధసన్నద్ధులయ్యారు. కాని, బలరాముడు యాదవకౌరవవంశాలవారికి నడుమ కలహం వద్దని, శాంతిని కోరి ఉద్ధవుని రాయబారిగా పంపాడు.

భీష్మాదివృద్ధులు ఎంత నచ్చజెప్పినా వినకుండా దుర్యోధనాదికౌరవులు మాత్రం అహంకారంతో మిడిసిపడ్డారు.

“ఆహా! కాలమహిమ కాకుంటే, కాళ్ల దగ్గర పడి ఉండాల్సిన చెప్పులు కిరీటం ఉండవలసిన తలమీద ఉండగోరుతున్నాయి కదా?

अहो महच्चित्रमिदं कालगत्या दुरत्यया।
आरुरुक्षत्युपानद्वै शिरो मुकुटसेवितम्।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.24)

మన పాండురాజు వారి కుంతిని చేసుకున్నాడు. మన అర్జునుడు వారి సుభద్రను చేసుకున్నాడు. ఇలా కాస్త బంధుత్వం కలిసింది కదా అని మన ప్రక్కనే కూర్చునేందుకు సాహసిస్తున్నారు. వీరు మాకు చెప్పవచ్చారా?” అంటూ అహంకరించి బలరాముని మాటలను తిరస్కరించారు.

బలరాముడికి వొళ్లు మండింది.
“ఏమిటేమిటీ? మేము చెప్పులమూ, వారేమో తలకాయలూనా?

उपानहः किल वयं स्वयं तु कुरवः शिरः।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.38)

ఈ రోజు భూమిమీద కౌరవులు లేకుండా చేస్తాను.

अद्य निष्कौरवीं पृथ्वीं करिष्यामि। (భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)”

అంటూ హస్తినాపురాన్ని తన హలంతో లాగి గంగలోనికి నూకేందుకు ఉద్యమించాడు. ఆ దెబ్బకు హస్తినాపురం ఊగిపోయింది.

కౌరవులందరూ హడలిపోయి, సాంబుడిని, లక్ష్మణను బలరామునికి అప్పగించి, క్షమాపణలు కోరి, రక్షించమన్నారు.

దయాళువైన బలరాముడు సరేనని, వారు సమర్పించిన కానుకలను, వధూవరులను వెంటబెట్టుకుని ద్వారకకు చేరుకున్నాడు.

గొడవ చల్లబడింది.

6 మధువు

రావణాసురుని పినతల్లి అనల. ఆమెకు కుంభీనసి అనే కూతురు ఉండేది. ఆమెను మధువు అనే ఒక రాక్షసుడు ఇష్టపడ్డాడు. పేరుకు రాక్షసుడే అయినా దేవతలకు మంచి మిత్రుడు. కాని,రావణాసురుని పట్ల భయంతో ఏమి చేయాలో తెలియక ఊరుకున్నాడు.

ఇలా ఉండగా ఒకసారి రావణాసురుడు జైత్రయాత్రకు వెళ్లాడు. యుద్ధోన్మాదంలో తన చెల్లెలైన శూర్పణఖకు భర్త అయిన విద్యుజ్జిహ్వుని కూడా గుర్తించలేక స్వయంగా నరికి చంపివేశాడు. శూర్పణఖ వచ్చి ఏడ్చి మొత్తుకుంటూ ఉంటే ఆమెను పోయి దండకారణ్యంలో సుఖంగా ఉండమని పంపించేశాడు.

వారు ఈ గొడవల్లో ఉండగా సమయం చూసుకుని మధువు కుంభీనసిని ఎత్తుకుపోయాడు.

రావణుడు విజయం సాధించి, వెనక్కు వస్తూ దారిలో కంటికి అందంగా కనబడిన రాజస్త్రీలను, ఋషిస్త్రీలను, గంధర్వస్త్రీలను,పన్నగస్త్రీలను, రాక్షసస్త్రీలను, అసురస్త్రీలను, మానుషస్త్రీలను, యక్షస్త్రీలను, దానవస్త్రీలను ఎవరి పట్లా ప్రత్యేకపక్షపాతం చూపకుండా అందరినీ అపహరించాడు. వారు వివాహితలా లేక అవివాహితులా అన్నది కూడా గమనించలేదు. తనకు అడ్డుపడిన వారి వారి బంధువులను యథేష్టంగా సంహరించాడు.

दर्शनीयां हि रक्षः कन्यां स्त्रीं वाऽथ पश्यति।
हत्वा बन्धुजनं तस्या विमाने तां रुरोध ह।। (రామాయణం7.24.2)

ఆ స్త్రీల విలాపంతో లంక ప్రతిధ్వనించిపోయింది.
“ఒరే దుర్బుద్ధీ! నువు స్త్రీమూలంగానే నశిస్తావురా”

स्त्रीकृतेनैव प्राप्स्यते दुर्मतिर्वधम्। (రామాయణం7.24.2)

అంటూ వారు శపించేశారు.

ఇంతలో మధువు తన చెల్లెలైన కుంభీనసిని ఎత్తుకుపోయాడన్న వార్త తెలిసింది. దానితో ఆ రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. లోకవిజేత అయిన తన చెల్లెలినే ఎవడో ఎత్తుకుపోతాడా? ఎంత ధైర్యం?

మళ్లీ ఇక్కడ రావణాసురుడికి కూడా పరువు సమస్యే!

అతడి కళ్లు ఎర్రగా మారిపోయాయి. “వెంటనే రథం సిద్ధం చేయండిరా. రాక్షసవీరులు సిద్ధం కండిరా. మారణాయుధాలు పట్టుకుని బయల్దేరండిరా” అని గర్జిస్తూ మధుపురానికి దండయాత్ర చేశాడు.

అయితే అతడి చెల్లెలు కుంభీనసి వచ్చి అన్న కాళ్ల మీద పడి, “అన్నా, జరిగిందేదో జరిగిపోయింది. ఇపుడు నా భర్తను చంపి, నన్ను విధవను చేయవద్దు” అని వేడుకుంది.

రావణుడు కాసేపు ఆలోచించి, “సరే, నీమీద దయతో అతడిని నేను చంపబోవటం లేదు. నీ భర్త ఎక్కడ? త్వరగా రమ్మను. అతడితో కలసి, స్వర్గలోకాన్ని జయించేందుకు బయల్దేరుతాను” అన్నాడు.

क्व चासौ तव भर्ता वै मम शीघ्रं निवेद्यताम्।
सह तेन गमिष्यामि सुरलोकं जयावहे।। (రామాయణం 7.25.44,45)

మొత్తానికి అలా రాజీ కుదిరింది.

తరువాత రావణుడు ఎత్తుకువచ్చిన స్త్రీల శాపం ఫలించి సీత కారణంగా రాముడి చేతిలో చనిపోయాడు.

అయితే రావణుడి బావ అయిన మధువు మహాశివభక్తుడు. మహా ధర్మాత్ముడు. జనరంజకంగా పరిపాలన చేశాడు. కాని, ఆ కుంభీనసీమధువుల కుమారుడైన లవణాసురుడికి మాత్రం మేనమామ అయిన రావణాసురుడి బుద్ధులు వచ్చాయి. వాడు పెట్టే బాధలను సహించలేక మునులు రాముడికి మొర పెట్టుకున్నారు. శత్రుఘ్నుడు రాముని ఆజ్ఞను పొంది ఆ లవణాసురుడిని సంహరించాడు.
***

ఈ విధంగా తమ కుటుంబానికి చెందిన స్త్రీని ఎవడో తమ అనుమతి లేకుండా పెండ్లాడడం అనేది ఎంతటివారికైనా ఇజ్జత్ కా సవాల్. అది గృహస్థులకు ఒక మానసికమైన పీడ.

కురువంశంవారు తమ కన్యను ఎత్తుకుపోయారని యాదవులు మండిపడ్డారు. యాదవులు తమ కన్యను ఎత్తుకుపోయారని కురువంశంవారు కుతకుతలాడిపోయారు. రాక్షసులు తమ స్త్రీని ఎత్తుకుపోయారని మానవులు వగచారు. మనిషి మా కన్యను వరిస్తాడా అని రాక్షసులు కోపగించుకున్నారు.

ఎవరూ తక్కువ తినలేదు.

పరువు ఎవడబ్బ సొమ్ము? ఎవరికి ఆ పరువు బరువు?

అయితే ఈ కథలన్నిటిలోనూ గమనించవలసింది ఏమిటంటే –

ప్రతిచోటా బలవంతులే గెలిచారు. ఓడినవారు చాలావరకు రాజీకొచ్చారు. లేకపోతే చచ్చారు. అప్పుడైనా ఇప్పుడైనా జరిగేది అదే.

కాబట్టి, ఇప్పటి ఆశావహులు ఎవరైనా సరే, స్వయంగా తమకు తగినంత బలం లేకుండా, బలవంతుల ఇష్టం లేనిదే బలవంతుల కన్యల జోలికి పోరాదు. బలం అంటే ఆరోజుల్లో పరాక్రమం అయ్యుండవచ్చు. ఈరోజుల్లో ధనం, పలుకుబడి కూడా.

బలవంతుడు మరొక బలవంతుడినే ఇష్టపడతాడు, అతడితోనే రాజీ పడతాడు. ప్రపంచమంతటా ఇదే సహజం.

అంతే కాదు, బలవంతుడు అర్హత కలిగిన వినయవంతుడిని కూడా ఇష్టపడతాడు. శుక్రాచార్యులవారు తన కూతురును క్షత్రియుడైనప్పటికీ వినయవంతుడైన యయాతిరాజుకు సంతోషంగా ఇచ్చి పెళ్లి చేశాడు.

అంతేగాని, చెత్త చెత్త సినిమాలలో చూపినట్టు పోకిరీతనంతో బలవంతుల జోలికి పోయి భంగపడకండి, సమాజంలో అందరినీ మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి అంటూ దేబిరించకండి.

బలమా?
అర్హతతో కూడిన వినయమా?
ఏదో ఒకటి ఎంచుకోండి.

కాబట్టి, ఓ ఆశావహులారా! ఈ రెండిటిలో ఏ ఒక్కటీ లేకుండా పనికిమాలిన సాహసాలు చేసి, దానికి తగిన ప్రతిఫలం అనుభవించి, సమాజంలో గగ్గోలు పుట్టించడాలు మానుకోండి. 

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...