Monday 26 December 2016

చెప్పండయ్యా చెప్పండి సమాజాన్ని ఉద్ధరించండి (6)

చెప్పండయ్యా చెప్పండి
సమాజాన్ని ఉద్ధరించండి
(6)


"ఆబ్రహ్మకీటజననీ"
లలితాసహస్రనామాలలో నాకు అన్నిటికంటె బాగా నచ్చిన పేరు ఇదే!
బ్రహ్మ మొదలుకొని ఓ కీటకం వరకు అందరూ ఆమె సంతానమట! 
<><><><><><>

భారతీయుల విగ్రహారాధన ప్రతీకాత్మకమైనదని, ఊహాతీతమైన దైవానికి నామరూపాలనాపాదించి కొలవడం భారతీయుల ఆరాధనపద్ధతుల్లో ఒకటని ఈ పేరు నిశ్చప్రచంగా మనకు సూచిస్తుంది.

అందరికీ తల్లి అయిన ఆ దేవతకు మనుషుల్లాగ ఒక ముఖము ఒక నోరు రెండు కళ్లు రెండు చేతులు రెండు కాళ్లు పెట్టి ఒక ఆకారాన్ని ఒక పేరును కల్పించి కొలవడం ఎటువంటిదంటే, ఒక మ్యాపును చూపించి ఇదే భారతదేశం అని బోధించడం వంటిది. 

ఆ మ్యాపును బాగా అర్థం చేసుకున్నవాడు దేశంలో ఎక్కడనుండి ఎక్కడకైనా సులువుగా ప్రయాణించగలడు. 

ఆ మ్యాపును దగ్గరగా పెట్టుకుంటే పొరపాటున దారి తప్పినా మరలా సరైన దారిని కనుక్కోవచ్చు. 

దిక్కులు దూరం etc. తెలుసుకొనేందుకు ఉపయోగపడే దిక్సూచి టెలిస్కోపు వంటి సాధనాలే భక్తి ధ్యానం పూజలు మొదలైనవి. ఆయా instruments దగ్గరున్నా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనివారికి అవి కేవలం బరువు దండగనిపించవచ్చు. వాటిని పారేసి పోదామనుకుంటారు. వాటి ప్రయోజనము ఉపయోగము ఒక్కసారైనా తెలుసుకున్నవారికి వాటి విలువ మరింతగా తెలుస్తుంది.

దేశమంతా ప్రత్యక్షంగా తెలిసినవారికి మరిక మ్యాపులు వంటివి అవసరం లేవు. అందుకే సన్న్యాసులకు సంధ్యావందనాదులు అవసరం లేదని శాస్త్రము చెప్పాయి కూడా. కాని క్రొత్తగా explore చేద్దామని బయలుదేరిన వారికి రకరకాల సాధనకు (సాధనాలు) అవసరపడతాయి. 

రాత్రి ఓ బస్సో రైలో ఎక్కి హాయిగా కళ్లు మూసుకుని నిద్ర పోయి, పొద్దున మళ్లీ కళ్లు తెరిచేసరికి గమ్యస్థానంలో ఉంటాం కదా మరెందుకిక మ్యాపులూ గీపులూ అనేవారున్నారు. వారు ధన్యులనే సమాధానం. ఆశ్రయించిన శిష్యులను అనుగ్రహించి సాక్షాత్తుగా దైవానుభూతిని కలిగించే సద్గురువులను గూర్చి వింటూ ఉంటాం కదా? ఆయా వాహనాల డ్రైవర్లు కూడా అలాంటివారే అనుకుందాం. :-) 

కాని ఆ సద్గురువులైనా ఆ డ్రైవర్లైనా తమకు తెలియని క్రొత్త తత్త్వానికో క్రొత్త గమ్యానికో చేర్చాలంటే మరలా ఈ మ్యాపులను, మైలురాళ్లను, ఊరి పేర్లు దిక్కులను సూచించే బోర్డులను జాగ్రత్తగా చూసుకుంటూ అవి సూచిస్తున్నట్లు పోవలసిందే! 

క్రొత్త కారులో జోరుజోరుగా వెళ్లేవారు కూడా ఈ మధ్య GPRS చెప్పినట్టు పోతున్నారు కదా! విమానాల్లోనూ విలాసనౌకల్లోనూ ఖండాంతరాలు దాటిపోయేవారికి ఇటువంటి సాధనాలు మరింత మరింత అవసరం.
<><><><><><>

కాబట్టి భారతీయుల విగ్రహారాధన అనేది సులువుగా దైవతత్త్వాన్ని అవగాహన చేసుకొని ఆ పరమార్థాన్ని త్వరగా అందుకొనేందుకు చేసే ప్రయత్నమే గాని మూర్ఖత్వం కాదు. విగ్రహాలను ధ్వంసం చేసి దేవుని ధ్వంసం చేశామని అహంకరించినవారు ~ మ్యాపును చింపేసి దేశాన్ని నాశనం చేశామనుకొనేవారికంటే పెద్ద తెలివైనవారు కారు. ఒక మ్యాపును చింపేస్తే మరో వంద మ్యాపులను తయారుచేసుకోవచ్చు.

కాని విగ్రహంలో మాత్రమే దేవుడున్నాడని కొలిచేవారు కూడా దేశాన్ని గాలికొదిలి మ్యాపుకు దండాలు పెట్టేవారికంటె పెద్ద గొప్పవాళ్లేం కాదు.
<><><><><><>

దేశం ఎక్కడ ఉంది? అని విచికిత్స చేస్తామా? 
మన ఇంట్లో దేశం ఉంది.
మన వీధిలో దేశం ఉంది.
మన కాలనీలో దేశముంది. 
మన ఊరిలో దేశముంది.
మన నియోజకవర్గంలో దేశముంది.
మన జిల్లాలో దేశముంది.
మన రాష్ట్రంలో దేశముంది.
......
ఇలా అనుకొనడం పిచ్చి కదా?
వీటిలో దేశముండడమేమిటి?
దేశంలోనే కదా ఇవన్నీ ఉన్నాయి?
......
దేశం దేశమంతటా ఉంది.
కదా?
......
అలాగే 
దేవుడెక్కడున్నాడు అని విచికిత్స చేసినా ఇదే పద్ధతి.
ఆ దేవుడు చెట్టులోనూ ఉన్నాడు.
పుట్టలోనూ ఉన్నాడు.
కొండలోనూ ఉన్నాడు.
విగ్రహంగా మారిన బండలోనూ ఉన్నాడు.
ప్రతి మనిషిలోనూ ఉన్నాడు 
అని ఏదో అర్థం చేసుకోలేని చిన్న పిల్లలకు చెప్పాలి.
కాని,
అసలు ఆ దేవునిలోనే ఈ చరాచరప్రపంచం ఉందనేది అసలు నిజం.
......
అనుభవైకవేద్యమని శాస్త్రాలు ఘోషించే అంతు తెలియని ఆ అవ్యయతత్త్వానికి ఈ విధంగా దేవుడు అని లింగవచనవిభక్తులు చేర్చడం, రూపాదులు కల్పించడం ఎటువంటిదంటే - గణితశాస్త్రంలో తెలుసుకొనవలసిన విషయాన్ని మొదటగా - X అనుకొనుము అంటూ చెప్పే పద్ధతి వంటిది మాత్రమే.
.......
1 నుండి మొదలు పెట్టి అనంతంగా ఎన్ని సంఖ్యలు చెప్పినా ప్రతి సంఖ్యలోనూ 1 అనే సంఖ్య ఉండి తీరుతుంది. ఎన్ని 1 లు కలిస్తే అంత పెద్దసంఖ్యగా మనం పరిగణిస్తాం కదా? కాబట్టి సంఖ్యాశాస్త్రంలో 1 సర్వాంతర్యామి.

అలాగే ఈ అంతు తెలియని విశ్వంలో "దేవ" అనే తత్త్వం సర్వాంతర్యామి.

ఆ దేవతత్త్వంలో అమ్మతనం కూడా ఒక అంశం.
అమ్మతనం మనను కడుపున మోసి కన్నతల్లిలో ఉంది. జత చేసిన ఫోటోలో చూపినట్లు - ఆ గాడిదలోనూ ఉంది, కోతిలోనూ ఉంది, ఆవులోనూ ఉంది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే అని తెలుసుగా? అటువంటి అమ్మతనం సర్వాంతర్యామిగా ఉంది. అందుకే అమ్మతనాన్ని దేవతానామాల్లో చేర్చారు పెద్దలు. 

ఆబ్రహ్మకీటజననీ - బ్రహ్మ మొదలుకొని కీటకం వరకూ అందరికీ - మనందరికీ - తల్లి అయిన - ఆమెకు నమస్కారాలు.

<><><><><><>
కాబట్టి, 
ఊసుపోని కబుర్లాపి
నిజతత్త్వాన్ని ప్రజలకు బోధించండి స్వాములూ! 
మన సంస్కృతి మీద సరైన అవగాహనను కల్పించండి! 
మన సదాచారాలను జనాలు సగర్వంగా పాటించేలా కువిమర్శలు చేసే వారి నోళ్లను జనాలే స్వయంగా మూయించగలిగేలా జ్ఞానబోధ చేయండి.

చెప్పండయ్యా చెప్పండి.
సమాజాన్ని ఉద్ధరించండి.
<><><><><><>

అందరికీ Mothers Day సందర్భంగా శుభాకాంక్షలు.

మహాభారతంలో కులవివక్ష - చిన్న సమీక్ష


।।జయ గణేశ।।

వ్యాసవిరచితా గణేశలిఖితా
మహాభారతే దివ్యకథా...

కౌరవపాండవసంగరమథితా 
నైవ క్లిష్టా న చ కఠినా...

అని సంస్కృతభారతి శిక్షకులు నేర్పిస్తూ ఉంటే పిల్లలు వారిని అనుకరిస్తూ మధురంగా పాడుతూ ఉండటాన్ని చూడడం, వినడం ఓ అద్భుతమైన అనుభవం. సంస్కృతం మాట్లాడటం కష్టమైన విషయమేమీ కాదని ప్రబోధిస్తూ, సంస్కృతవాఙ్మయాన్ని స్మరించుకొనే ఓ గీతంలో ఒక భాగమది.

మహాభారతాన్ని దివ్యకథగా భావించడం మహాభారతం ఆవిర్భవించిన కాలం నాటినుండి ఉన్న విషయమే. కాని భారతీయులు ఇతిహాసంగా పేర్కొన్న భారతాన్ని విదేశీయులు మతగ్రంథంగా గుర్తించడం - దానిలో కనిపించే ప్రతివిషయాన్ని అనుమానాస్పదంగా చూడటం - అవమానించటం - వారికి మానసికతత్త్వానికి వారసులుగా తయారైన కొందరు భారతీయులు కూడా మహాభారతాన్ని గూర్చి అలాగే మాట్లాడటం గత కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది.

అందులో భాగంగా ఒక నింద ఇది -

కులం - వర్ణం అనేవి అసమానవిధానాలట.
కులవివక్షకు అవమానాలకు పునాదులు అక్కడే ఉన్నాయిట.
కులవివక్షకు పాండవులు ప్రతినిధులట.
ఆ కులవివక్షను ప్రతిఘటించిన వర్గానికి నాయకుడు సుయోధనుడుట.
ఇటువంటి కథలను కలిగిన మహాభారతం వంటి మతగ్రంథాల ప్రాశస్త్యం నశించాలిట.
ఈ నింద వేసినది శ్రీ మల్లెపల్లె లక్ష్మయ్యగారు.
(సాక్షి పత్రికలో - 1/9/2016 నాడు ప్రశ్నిస్తే ప్రతినాయకుడే కదా అనే శీర్షికతో ప్రచురింపబడింది.)

<><><><><><><>

నిజానికి కులవ్యవస్థ లేదా వర్ణవ్యవస్థ అనేది అతి ప్రాచీనకాలంలోనే భారతీయులు ఏర్పరచుకున్న ఒక అద్భుతమైన Division of Labour Policy. అది సక్రమంగా ఉన్నంతకాలం భారతదేశం అద్భుతంగా వెలుగొందింది. అయితే కాలక్రమేణా ఈ వ్యవస్థ కొందరు అహంకారుల వల్ల దుర్వినియోగపరచబడి భారతదేశపు ఔన్నత్యం పతనం కావడానికి మూలమైంది అనడంలో సందేహం లేదు. కాని అందుకు మహాభారతాన్ని నిందించడం తగదు.

<><><><><><>

సూతపుత్రుడైనందువల్ల కర్ణునికి క్షత్రియునితో పోటీపడే అవకాశం లేదంటూ భీష్ముడు అడ్డుపడ్డాడని శ్రీ లక్ష్మయ్యగారు పేర్కొన్నారు.

కాని అడ్డుపడింది భీష్ముడు కాదు. కృపాచార్యుడు. సరే - అసలు ఆ సందర్భంలో జరిగింది పోటీలు కానే కావు - ధార్తరాష్ట్రులు పాండవులు తమ తమ యుద్ధవిద్యలలో తగినంత ప్రావీణ్యం సంపాదించారని వారు నేర్చిన విద్యలను ప్రదర్శించే అవకాశం ఇవ్వమని ద్రోణాచార్యులవారు కోరడం జరిగింది.

రాజన్ సంప్రాప్తవిద్యాస్తే కుమారాః కురుసత్తమ!
తే దర్శయేయుః స్వాం శిక్షాం రాజన్ననుమతే తవ!!
(మహాభారతం-ఆదిపర్వణి-సంభవపర్వం- 133.3)

అలా రాజకుమారుల విద్యాప్రదర్శనకోసం మాత్రమే ఏర్పాట్లు జరిగాయి. అర్జునుడు ప్రదర్శించిన విద్యలను చూసి దుర్యోధనాదులు తప్ప అంతా సంతోషించారు. మెచ్చుకున్నారు. ఈలోగా కర్ణుడు ప్రవేశించి "ఓయ్ అర్జునా! నువు జనాలముందు చేసినవన్నీ నేనూ చేయగలను, అంతకంటె ఇంకా ఎక్కువగానే చేయగలను. అందువల్ల నువు నేను గొప్పవాడినని గర్వపడకు" అన్నాడు.

పార్థ యత్ తే కృతం కర్మ విశేషవదహం తతః!
కరిష్యే పశ్యతాం నౄణాం మాऽऽత్మనా విస్మయం గతః!!
(మ.భా.-ఆది-సంభవ- 135.9)

అది an unprovoked insult to Arjuna.

సరే, ద్రోణుని అనుమతి పొంది కర్ణుడు తన విద్యను ప్రదర్శించిన మీదట దుర్యోధనుడు అతనిని తెగ మెచ్చుకున్నాడు. అపుడు అతనిని కర్ణుడు కోరిన వరం ఇది:

ద్వంద్వయుద్ధం చ పార్థేన కర్తుమిచ్ఛామ్యహం ప్రభో!
("ఓ ప్రభూ! అర్జునునితో నేను ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకుంటున్నాను")
(మ.భా.-ఆది-సంభవ- 135.15)

అర్జునునితో ద్వంద్వయుద్ధానికి గురువైన ద్రోణుని అనుమతిని గాని, మహారాజైన ధృతరాష్ట్రుని అనుమతిని గాని కోరకుండా కనీసం తన ప్రత్యర్థి అయిన అర్జునుని ఓ మాట కూడా అడగకుండా, "ప్రభూ" అని సంబోధిస్తూ సాక్షాత్తు దుర్యోధనుని అనుమతిని కోరడంతోనే కర్ణుని కుటిలత్వం తెలుస్తుంది. సరే, దుర్యోధనుడేం తక్కువ తినలేదు.

దుర్హృదాం కురు సర్వేషాం మూర్ధ్ని పాదమరిందమ!
("ఓ కర్ణా! నా శత్రువులందరి తలపై కాలు పెట్టి తొక్కేసెయ్")
(మ.భా.-ఆది-సంభవ.135.16)
అన్నాడు.

దుర్యోధనుని అండ చూసుకుని రెచ్చిపోయాడు కర్ణుడు.
"అర్జునా! నీ గురువు సమక్షంలోనే నేను నా బాణాలతో నీ తలను తెగేస్తాను" అన్నాడు.

గురోః సమక్షం యావత్ తే హరామ్యద్య శిరః శరైః!
(మ.భా.-ఆది-సంభవ- 135.20)

అపుడు ద్రోణుడు అనుమతినివ్వగా అర్జునుడు తన సోదరుల సమాశ్లేషలతో అభినందనలందుకుని ద్వంద్వయుద్ధానికి సిద్ధమయ్యాడు.

తతో ద్రోణాభ్యనుజ్ఞాతః పార్థః పరపురంజయః!
భ్రాతృభిస్త్వరయాऽऽశ్లిష్టో రణాయోపజగామ తమ్!!
(మ.భా.-ఆది-సంభవ- 135.21)

ధృతరాష్ట్రపుత్రులు కర్ణుని వెనుక నిలబడ్డారు.
ద్రోణభీష్మాదులు అర్జునుని వెనుక నిలబడ్డారు.
ప్రజలందరూ రెండు పక్షాలుగా చీలిపోయారు.

ద్విధా రంగః సమభవత్.
(మ.భా.-ఆది-సంభవ- 135.27)

అంతా ఉద్రిక్తంగా మారిపోయింది.
విద్యాప్రదర్శనవేదిక కాస్త భీకరరణరంగంగా మారే పరిస్ధితి దాపురించింది.

అపుడు కృపాచార్యుడు ద్వంద్వయుద్ధంలో పాటించే ఆచారం ప్రకారం, యోధులు తమ తమ పితృవంశాలను ప్రకటించమని కోరాడు.

దానితో తాను సూతపుత్రుడనని చెప్పుకొనేందుకు కర్ణుడు సిగ్గుపడితే, అపుడు దుర్యోధనుడు చొరవ తీసుకుని గొప్పరాజవంశంలో పుట్టిన వాడు, శూరుడు, సేనాపతి క్షత్రియులు కావడానికి శాస్త్రప్రకారం అర్హులని తెలిపాడు. శభాష్! నిజంగా గొప్ప మాటే కదా!

ఆచార్య త్రివిధా యోనీ రాజ్ఞాం శాస్త్రవినిశ్చయే!
సత్కులీనశ్చ శూరశ్చ యశ్చ సేనాం ప్రకర్షతి!!
(మ.భా.-ఆది-సంభవ- 135.35)

అదే చొరవతో
"రాజు కానివాడితో అర్జునుడు పోరాడనన్న పక్షంలో కర్ణుని అంగదేశానికి రాజుగా అభిషేకిస్తున్నాను" అన్నాడు.

యద్యయం ఫాల్గుణో యుద్ధే నారాజ్ఞా యోద్ధుమిచ్ఛతి!
తస్మాదేషోऽఙ్గవిషయే మయా రాజ్యేऽభిషిచ్యతే!!
(మ.భా.ఆది-సంభవ- 135.36)

<><><><><><>

క్షత్రియుడు క్షత్రియునితోనే యుద్ధం చేయాలన్నది ఆరోజుల్లో నియమం. ఎందుకంటే యుద్ధవిద్యలలో సుశిక్షితుడైన క్షత్రియునితో ఒక మామూలు వ్యక్తి తలపడితే అతడు అన్యాయంగా ఖర్చైపోతాడని, అలా జరగరాదని ముందు జాగ్రత్తచర్యగా అటువంటి నియమాలను ఏర్పరిచారు.

కాని, కర్ణుడు తాను కూడా మహావీరుడినని అంతకు ముందే నిరూపించుకున్నాడు కదా - ఇంకా వంశమూ కులమూ అంటూ నియమాలు మాట్లాడాలా అంటే - నియమాలను నియమాలుగానే చూడాలని సమాధానం.

మన ఇండియన్ క్రికెట్ టీము, అమెరికా క్రికెట్ టీము ఆహ్వానించింది కదా అని అమెరికాకు వెళ్లి ఐదు టెస్టుమ్యాచుల సిరీస్ ఆడిందే అనుకోండి. ఇండియా మొత్తం ఐదు మ్యాచులనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయడం గ్యారంటీ. పోనీ అలా గెలిచాక గెలిచేశాం చూశారా అని ఇండియా గొప్పలు చెప్పుకోబోతే ప్రపంచంలో టెస్ట్ మ్యాచులాడే ప్రతి దేశంలోనూ ఇండియా నవ్వులపాలౌతుంది. ఎందుకంటే అమెరికా టీముకు ఒక టెస్ట్ మ్యాచ్ ను ఆడగల స్థాయి ఉన్న టీముగా ICC గుర్తింపు లేదు. ఆ గుర్తింపు అంత సులువుగా వచ్చేది కాదు. మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్ కూడా అలాంటి గుర్తింపు కోసం చాల కష్టపడింది. గుర్తింపు పొందిన చాలాకాలం వరకు బంగ్లాదేశ్ తో మ్యాచ్ అంటే అందరికీ నవ్వులాటగానే ఉండేది.

కాబట్టి, గుర్తింపు లేని టీములతో ఆడి గెలిచిన గెలుపును ఎవరూ గెలుపుగా భావించరు. అలాంటి టీములతో ఆడి వంద కాదు కదా, రెండువందల సెంచరీలు చేసినా ఎవరూ పట్టించుకోరు. వెయ్యి కాదు, రెండువేల వికెట్లు పడగొట్టినా ఆ లెక్క రికార్డులకెక్కదు. కాబట్టి అటువంటి టీములతో సరదాగా ఎగ్జిబిషన్ మ్యాచులాడడం వేరు, సీరియస్ గా టెస్ట్ మ్యాచులాడడం వేరు. ఎవడో అమెరికన్ బౌలరొకడు ఓడ ఎగ్జిబిషన్ మ్యాచులో ఐదు వికెట్లు పడగొట్టినంత మాత్రానికే అతడు టెస్ట్ మ్యాచ్ లో అదే స్థాయి ఆటను ప్రదర్శించి తన టీమ్ గెలిపిస్తాడని భావించలేము. ఒకవేళ అనధికారికంగా అమెరికా టీముతో టెస్ట్ మ్యాచ్ జరిగిందే అనుకుందాం. ఇండియా గెలిస్తే అది అసలొక వార్త అని అనుకునేవారు కూడా ఉండరు. అమెరికాకు పరాభవం పొందిన బాధ కూడా ఉండదు. కాని, పొరపాటున అమెరికా గనుక గెలిస్తే అదో సంచలనవార్త. ఇండియాకు తలవంపులు. కాబట్టి గెలిచినా ఓడినా అమెరికన్ క్రికెట్ టీముకు ఎటువంటి నష్టమూ లేదు. అందుకే పోటీ ఎప్పుడైనా సమవుజ్జీల నడుమ జరగాలి అనేది. ఇండియన్ ఫుట్ బాల్ టీము జర్మనీ టీమ్ తో ఆడి ఓడిపోయిందంటే మనం ఏమాత్రం బాధపడం కదా!

సరిగ్గా కర్ణుడి పరిస్థితి కూడా అదే. గెలిచాడంటే అర్జునుని ఓడించిన కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. తానే ఓడితే - అవతల ఉన్నది మహావీరుడు అర్జునుడు కదా - గెలుపు అంత సులువు కాదులే - అన్న ఓదార్పు దక్కుతుంది. కనీసం అర్జునుని ధైర్యంగా ఎదిరించిన మొనగాడన్న పేరు మిగులుతుంది. కాని అర్జునునికి అలా కాదు - గెలిస్తే ఆ సూతపుత్రుని ఓ సుక్షత్రియుడు గెలవడం పెద్ద గొప్పా అనేస్తారందరూ. ఓడితే మాత్రం అతడు చాల తలవంపులు ఎదుర్కొనవలసి వస్తుంది.

<><><><><><>

మొత్తానికి దుర్యోధనుడు కర్ణునికి "రాజు" అనే గౌరవాన్ని కల్పించగలిగాడు కాని bad light కారణంగా కర్ణార్జునయుద్ధం జరగలేదు.

పాండవులందరిలోనూ భీముడొక్కడే వాచాలుడు. "ఒరే సూతపుత్రా! నీకు అర్జునుని చేతిలో యుద్ధంలో చచ్చే అర్హత కూడా లేదురా!" అని కర్ణుడిని ఉద్దేశించి అన్న మాట నిజం. దాంతో దుర్యోధనుడు మహా ఆవేశంగా భీమునికి నిజంగా గొప్ప సమాధానమే చెప్పాడు. కాని అది పరోక్షంగా దుర్యోధనుని దుష్టచేష్టను నిరసిస్తూ భీముడు పలికిన మాట. అబ్బే - అది కర్ణుని రాజును చేయటం కాదు. అంతకు ముందు భీమునికి అత్యంతప్రియమైన సూతుడిని (రథసారథిని) దుర్యోధనుడు తన బాల్యంలోనే గొంతు పిసికి చంపేసి ఉన్నాడు. అదీ అతని భయంకరదుష్టచేష్ట!

సారథిం చాస్య దయితమపహస్తేన జఘ్నివాన్!
(మ.భా.-ఆది-సంభవ- 28.36)

అందువల్ల దుర్యోధనుడు కర్ణుని పక్షాన నిలిచాడంటే అందుకు కారణం తాను శత్రువులుగా భావిస్తున్న పాండవులను చంపేసేటందుకు అతడు తనకు తోడ్పడతాడనే స్వార్థం తప్ప అతడు మల్లెపల్లె లక్ష్మయ్యగారో లేక అంబేద్కర్ గారో భావిస్తున్నట్టు 'కులరహితసమాజాన్ని కాంక్షించిన ఓ స్వాప్నికుడు' కానే కాదు.

పైగా పాండవులకే ఈ కులమనే పట్టింపులు ఏమీ లేనట్లు మహాభారతం చెబుతుంది. వారు ఏకచక్రపురంనుండి ద్రౌపదీస్వయంవరానికి బ్రాహ్మణవేషంలో వచ్చారు. పాంచాలరాజధానికి చేరి, అక్కడ ఒక కుమ్మరి ఇంట బస చేశారు. బ్రాహ్మణవృత్తిని అవలంబించి అక్కడ భిక్షాటన చేసేవారు.

కుంభకారస్య శాలాయాం నివాసం చక్రిరే తదా!
తత్ర భైక్ష్యం సమాజహ్రుర్బ్రాహ్మణీం వృత్తిమాశ్రితాః!!
(మ.భా.-ఆదిపర్వం-స్వయంవరపర్వం- 184.6,7)

అంటే బ్రాహ్మణులు ఎటువంటి inhibitions లేకుండా శూద్రుల ఇండ్లలో అతిథులుగా ఉండేవారని స్పష్టంగా అర్థమౌతోంది కదా? అది ఎవరికీ అభ్యంతరకరంగా తోచలేదు. ద్రౌపదిని అర్జునుడు స్వయంవరంలో గెలుచుకున్నాక ఆమెను నేరుగా తీసుకువెళ్లింది ఆ కుమ్మరి ఇంటికే. వారు పాండవులే అని గ్రహించిన బలరామకృష్ణులు వారిని వెతుకుతూ చేరుకున్నది కూడా ఆ కుమ్మరి ఇంటికే. (ఆదిపర్వం - స్వయంవరపర్వం - 190 అధ్యాయం) చెల్లెలిని బావలను కలుసుకొనేందుకు ధృష్టద్యుమ్నుడు వెళ్లింది ఆ కుమ్మరి ఇంటికే. ద్రౌపది వివాహవిషయం గూర్చి మాటలాడేందుకు ద్రుపదుని పురోహితుడు వెళ్లింది ఆ కుమ్మరి ఇంటికే.

దీనిని బట్టి మహాభారతకాలంలో శూద్రులంటే ఇతరకులాలకో లేదా వర్ణాలకో ఎలాంటి చిన్నచూపు లేదని బల్ల గుద్ది గట్టిగా చెప్పవచ్చు. కొండొకచో అది కనిపించిన చోట ఆయా వ్యక్తుల వైయక్తిక దోషాలే తప్ప లోకాచారం కానే కాదు.

దాసీపుత్రుడైన విదురుని భీష్ముడు ధృతరాష్ట్రపాండురాజులతో సమానంగా విద్యాబుద్ధులు నేర్పించి కన్నకొడుకులా ప్రేమతో సాకాడు.

ధృతరాష్ట్రశ్చ పాండుశ్చ విదురశ్చ మహామతిః!
జన్మప్రభృతి భీష్మేణ పుత్రవత్ పరిపాలితాః!!
(మ.భా.-ఆది-సంభవ- 108.17)

ఆ విదురుడంటే దుర్యోధనునికి నిత్యం ద్వేషం. కాని పాండవులు అతనిని ధృతరాష్ట్రుని తమ తండ్రిని గౌరవించినట్టు గౌరవించేవారు. శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్లినపుడు రాజరాజైన దుర్యోధనుని ఆతిథ్యాన్ని నిరాకరించి శూద్రుడైన విదురుని ఇంట బస చేసి అతని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. (ఉద్యోగపర్వం - భగవద్యానపర్వం - 91 అధ్యాయం)

ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి.
అసలు గట్టిగా చెప్పాలంటే ఇన్నేసి ఉదాహరణలు అనవసరం -

నైమిశారణ్యంలో శౌనకమహర్షి పన్నెండు సంవత్సరాల సత్రయాగం చేస్తూ ఉండగా అక్కడకు రోమహర్షణుని కుమారుడైన ఉగ్రశ్రవుడు వచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్న బ్రహ్మర్షులందరూ (సాధారణ ఋషులు, మహర్షులు మాత్రమే కాదు, ఏకంగా బ్రహ్మర్షులే) - ఆయన చుట్టూ చేరి, అతడు చెప్పగా మహాభారతకథను శ్రద్ధగా విన్నారు. (ఆదిపర్వం - అనుక్రమణిక పర్వం)

ఆ రోమహర్షణుడు, ఉగ్రశ్రవుడూ సూతవంశానికి చెందినవారు. అంటే శూద్రులు. ఆనాడు బ్రహ్మర్షులే ఒక శూద్రుని ఆదరించి అతని ద్వారా వ్యాసుని భారతం విన్నారని మహాభారతం మొట్టమొదటి పర్వం మొట్టమొదటి అధ్యాయంలోనే స్పష్టంగా ఉంది.

అలాంటి మహాభారతాన్ని ఏమాత్రం చదవకుండా నిందించడం మీకు తగునా ఓ మల్లెపల్లె లక్ష్మయ్యగారూ? మీరు చేసిన నిందలు ఇంకా ఉన్నాయి. సమయాన్ని బట్టి మీకు సమాధానం ఇవ్వగలవాడను.
ధన్యవాదాలు.

ॐ సర్వం శ్రీగణేశార్పణమస్తు 卐



Friday 9 December 2016

దేవో దుర్బలఘాతకః

అనగనగా ఓ దర్జీ ఉన్నాడట.

ఓరోజు ఓ పెద్దాయన ఒక మంచి గుడ్డ తెచ్చి, ఏమయ్యా దర్జీ దర్జీ, దీనితో నాకు ఓ చొక్కా కుట్టి పెట్టవయ్యా అని అడిగాడట. ఆ దర్జీ గుడ్డ కొలత చూసి, అబ్బే, ఇది మీకు సరిపోదండీ అన్నాడట. అదేమిటీ? అమ్మిన షాపువాడు సరిపోతుందని చెప్పి ఇచ్చాడే అన్నాడట ఆ పెద్దమనిషి. అయితే ఆ షాపువాడినే అడగండి కుట్టిపెట్టమని అని నిర్లక్ష్యంగా చెప్పాడట దర్జీ. 


కొద్ది రోజులయ్యాక ఆ పెద్దమనిషి ఆ చొక్కాను కుట్టించుకొని వేసుకొచ్చాడట. ఏమయ్యా చూశావా? నేను ఇంకో దర్జీని అడిగాను. అతడు నాకు చక్కగా కుట్టివ్వడమే కాకుండా తన అబ్బాయికి కూడా అదే గుడ్డతోనే చొక్కా కుట్టుకున్నాడు తెలుసా? అని చెప్పాడట.

అవునా? ఆ అబ్బాయి వయసు ఎంత అని అడిగాడట దర్జీ. ఐదేళ్లు అని చెప్పాడట పెద్దాయన. అదీ! అలా చెప్పండి! మా అబ్బాయికి ఇరవై ఏళ్ళు కదా? మరి సరిపోతుందని నేనెలా చెప్పగలను? అన్నాడట దర్జీ.
నేటి వ్యాపారస్థుల తంతు కూడా ఇలాగే ఉంటుంది.
<><><><><><>

తమకు ఎక్కువ లాభం ఏ ప్రోడక్ట్ మీద వస్తుందో, దానినే వ్యాపారస్థులు మార్కెట్ లో ప్రజలకు అందిస్తారు. అంతేగాని, వస్తువు మంచి చెడ్డలను వారు పట్టించుకోరు. ఫలానా కూల్ డ్రింకులో పురుగులమందు అవశేషాలు ఉంటున్నాయి అని వార్తలు వచ్చినా వారు కూల్ గా అమ్మేస్తూ ఉంటారు. ఫలానా నూడుల్స్ లో ఫలానా ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి అని ల్యాబోరేటరీ ఫలితాలు స్పష్టంగా చెప్పినా, తమకు అదేమీ తెలియనట్టు నటిస్తూ షాపునుండి ఆ వస్తువులను తొలగించే ప్రయత్నం ఏదీ చేయరు.

వినియోగదారుల్లో ఆందోళన బాగా పెరిగి నిరసన వ్యక్తం చేసినపుడో లేక ఏ ప్రభుత్వమో ఏ కోర్టో ఆ ప్రోడక్టును తొలగించమని ఆదేశమిస్తే అప్పుడు తప్పదు కాబట్టి మహా బాధ్యత కలిగి ఆ ఆజ్ఞను శిరసావహించేవారిలా ఆ ప్రోడక్టులను పక్కన పెడతారు. గొడవ సద్దు ముణిగిన తరువాత చల్లగా మళ్ళీ దానినే జనాలకు అంటగట్టడం ప్రారంభిస్తారు. వినియోగదారుల శ్రేయస్సు వారికేమీ అవసరం లేదు అనేది స్పష్టం.
<><><><><><>

అగ్రరాజ్యమైనా మార్పు లేదు, ఇదే తంతు!

1929లో ప్రపంచదేశాలలో - ముఖ్యంగా యూరోపియన్ దేశాలు & అమెరికాలో మహా - ఆర్థికమాంద్యం ప్రారంభమైంది. (దీనినే గ్రేట్ డిప్రెషన్ అంటారు).

అంటే వ్యాపారుల పెట్టుబడులకు తగినంత రాబడులు రాకపోవడం. వ్యాపారంలో వచ్చే లాభాలకంటే బ్యాంకు వడ్డీ రేట్లే అధికంగా ఉండటంతో అందరూ వ్యాపారం మానేసి బ్యాంకులోనే డిపాజిట్లు చేయడం మొదలు పెట్టారు. కానీ, సహజంగానే బ్యాంకు తనవద్ద లోన్లు తీసుకొనేవారు లేక, ఆదాయం దానికి కూడా సరిపోక తాను చెల్లించే వడ్డీ రేట్లు తగ్గించింది. దాంతో అందరూ బ్యాంకు నుండి డిపాజిట్లను వెనక్కు తీసుకొనడం మొదలు పెట్టారు. బ్యాంకులు దివాళా తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా అటు లాభాలు రావని వ్యాపారం చేసేవారు లేరు, బ్యాంకులు మూకుమ్మడిగా మూతపడే పరిస్థితులు వచ్చాయి. నిరుద్యోగం ఎక్కువైంది. దెబ్బకు గొప్ప గొప్ప దేశాలుగా పేరు మోసినవన్నీ, అమెరికాతో సహా పెద్ద పెద్ద దరిద్రుల దేశాలుగా మారిపోతున్నట్టు కనిపించింది.

1933 లో అమెరికాలో డెమొక్రాట్ అయిన రూజ్వెల్ట్ ప్రెసిడెంటు అయ్యాక, రేడియోలో తన ప్రసంగాలను ధారావాహికలుగా ప్రజలకు వినిపించి వారిలో భవిష్యత్తుమీద నమ్మకం రేకెత్తించాడు. కానీ, ఉద్యోగావకాశాలు కల్పించటం కంటే, ఆయన వ్యాపారాభివృద్ధికే చొరవ చూపాడు.

ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా? అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా అవసరాలకు మించి పండుతున్న గోధుమ పంటను లక్షలాది టన్నులు ఆయన నిర్దాక్షిణ్యంగా తగలబెట్టించాడు, సముద్రాలలో పారబోయించాడు. ఈ చర్య ద్వారా ఆయన సప్లై - డిమాండ్ - ధర సూత్రాన్ని స్థిరంగా అమలుపరచాలని సంకల్పించాడు. సహజంగానే, ఆహారపదార్థాల సప్లై తక్కువయ్యే సరికి డిమాండ్ పెరిగింది. రేటు కూడా పెరిగింది. వ్యాపారులు లాభపడ్డారు. నెమ్మదిగా ఆర్థికవ్యవస్థ కుదుట పడింది. కానీ, ధనవంతులు మాత్రమే ఆహారపదార్థాలు కొనుక్కోగలిగితే, పెద్దగా డబ్బులేనివారు పేదవారు మాత్రం తమ ప్రెసిడెంటు స్వయంగా సృష్టించిన ఈ కృత్రిమ కరువు దెబ్బకు ఆకలితో మల మల మాడిపోవలసి వచ్చింది. కానీ, వారి గోడు ఎవరికీ పట్టలేదు. ఏదేమైనా, ఇదేదో బావుందని యూరోపియన్ దేశాలు కూడా ఇలా చేతికందిన ఆహారపదార్థాలను తమ ప్రజల నోటికందకుండా నాశనం చేయడం ప్రారంభించాయి. ఫలితం కూడా కనిపించింది. ఆర్థికరంగాన్ని పైకెత్తేందుకు పేదల కడుపుపై కొట్టడం ఎంత క్రూరమైన చర్య!

ఇది చరిత్రలో మాయని పెద్ద మచ్చగా, కళంకంగా మిగిలిపోయేలా కనిపించింది. కానీ, ఇంతలో 1941 లో, జపాన్ అమెరికాకు చెందిన పెరల్ హార్బర్ మీద భయంకరంగా వైమానిక దాడి చేయడంతో అమెరికా తప్పనిసరిగా రెండవప్రపంచ యుద్ధంలో పాల్గొనవలసి వచ్చింది. ఆ సందర్బంగా దాదాపు 17 మిలియన్ల అమెరికన్లకు ఉద్యోగావకాశాలు లభించాయి. యుద్ధపరికరాలు నిర్మించే పరిశ్రమలలోనూ, దానికి అవసరమైన ఖనిజాదులను సేకరించే పరిశ్రమలలోనూ, సైనికులుగానూ - ఇలా. ఆ ఉద్యోగాలు రావడంతో, యుద్ధం అంటే ఇష్టం ఉన్నా లేకున్నా, ఆకలితో చచ్చిపోయే కంటే కడుపునిండా తింటూ, యుద్ధం చేస్తూ చచ్చిపోవడం మేలని అమెరికాలోని పేదజనమంతా పొలోమని మిలటరీలో చేరిపోయారు. అమెరికా సాయంతో మిత్రపక్షాలు యుద్ధం గెలిచాయి. 1945 April 30 తేదీన హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

మొత్తానికి గెలిచినప్పటికీ, యుద్ధం ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల, మళ్ళీ మాంద్యం విజృంభించే సూచనలు కనబడ్డాయి. దాన్ని అరికట్టడానికి ఫ్రీ మార్కెట్ కేపిటలిజం విధానాన్ని పరిచయం చేశారు. అసలు ఇందుకోసం రకరకాల కసరత్తులు యుద్ధం జరుగుతూ ఉండగానే ప్రారంభమయ్యాయి. 1944 జూలైలో, 730 మంది డెలిగేట్లతో, 44 మిత్రదేశాలు న్యూ హ్యామ్ప్ షైర్ నగరంలో సమావేశమయ్యాయి. దీన్నే బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అంటారు. ఆయా దేశాల మధ్య ఎగుమతులు దిగుమతుల సందర్బంగా సుంకాలు తక్కువగా విధించాలన్న ఒప్పందం అందులో ప్రధానమైన నిర్ణయం. ఈ ఒప్పందంలో అమెరికా చెప్పలేనంతగా లాభపడింది. మిగిలిన అన్ని దేశాలకు దాదాపు నాయకునిగా మారిపోయింది. (ఈ ఒప్పందంలోని అంశాలే కొన్ని చేర్పులు మార్పులతో ఆ తరువాత GATT అనే పేరుతో (General Agreement on Trade and Tariff) ప్రసిద్ధమయ్యాయి.

ఇదిలా ఉండగా హిట్లర్ మరణంతో ఆగిపోయిందనుకున్న ప్రపంచయుద్ధం జపాన్ విజృంభణతో ఆగేలా కనిపించలేదు. మిత్రదేశాలన్నీ తమ నాయకుడైన అమెరికా ఏం చేస్తుందని చూడసాగాయి. అమెరికా తన నాయకత్వాన్ని వదులుకుంటే వ్యాపారపరమైన అధికలాభాలను కోల్పోవలసి వస్తుంది. కానీ, జపాన్ ను అణచడం అంత సులువుగా కనిపించలేదు. దాంతో, అమెరికా సాంప్రదాయ యుద్ధాన్ని విడిచి, తెగబడి, హిరోషిమా నాగసాకిలను అణుబాంబులతో ధ్వంసం చేసి, జపాన్ దేశాన్ని పాదాక్రాంతం చేసుకుంది.

ఇలా, కేవలం వ్యాపార ఒప్పందాల రక్షణకోసం మహావిధ్వంసం జరిగింది! హిరోషిమాలో 150000 మంది, నాగసాకిలో 75000 మంది తక్షణమే మరణించారు. మరెంతమందో తరాలతరబడి అంతుతెలియని రోగాలతో జీవచ్ఛవాల్లా బ్రతికారు, ఇప్పటికీ కొందరు బ్రతికే ఉన్నారు.
<><><><><><>

ఆధునిక వ్యాపారం ఈ విధంగా పేదల పట్ల దయలేనిదిగా, క్రూరంగా మారి పోవడానికి మూలబీజం అక్కడే పడింది. ఆ విధ్వంసక బాంబుల ఫలితం అమెరికా తలరాతను సంపూర్ణంగా మార్చేసింది. ప్రపంచమంతా అది చెప్పినట్లల్లా విని తల ఆడించవలసిన రోజులు వచ్చాయి. సోవియట్ రష్యా ఉన్నంతవరకు అది కొంత అదుపులోనే ఉంది, రష్యా విచ్చిన్నం కాగానే దానికి మరి అడ్డూ అదుపూ లేకుండా పోయాయి. చమురు కోసం అది సృష్టించిన కల్లోలం చిన్నదేమీ కాదు. మధ్య ఆసియా దేశాల్లో పట్టు సంపాదించేందుకు గాను, ఆ దేశాల్లో పరస్పరకలహాలు రేపేందుకు గాను అది సృష్టించిన తీవ్రవాద భూతం ఇప్పుడు ప్రపంచపు అస్తిత్వానికే పెను ముప్పుగా పరిణమించింది. ఇవన్నీ అమెరికా వ్యాపారదాహంతో విచక్షణారహితంగా చేసిన తప్పిదాలకు మనం చెల్లిస్తున్న మూల్యాలు!
<><><><><><>

ఇటువంటి క్రూర వ్యాపార సంస్కృతి గ్లోబలైజేషన్ ముసుగులో నెమ్మదిగా 20 వ శతాబ్దపు చివరి దశకంలో భారత్ లోకి కూడా చొరబడింది. అప్పటినుండి భారత్ లో వ్యాపారులు పుట్టలు పుట్టలుగా మహామహా కోటీశ్వరులు కావడం మొదలు పెట్టారు. అతిథిదేవో భవ అని ఆశాసించే మన దేశంలో చివరకు మంచి నీళ్లను కూడా డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన రోజులు దాపురించాయి.

క్రమంగా వారి ప్రభావం భారత్ రాజకీయ వ్యస్థను శాసించడం మొదలు పెట్టింది. వ్యాపారుల డొనేషన్లు లేకుంటే పార్టీని నడిపించడమనే అతి ఖరీదైన పనిని ఎంతటి తెలివైనవాడైనా, ఎంతటి సమర్ధుడైనా, ఎంతటి గొప్ప ఆశయాలు ఉన్నవాడైనా డబ్బులేని వాడు చేయలేడు. ఈ వ్యాపారులు మీడియాను కొనేసి, దాని ద్వారా తమకు అనుకూలమైన రాజకీయ పార్టీలను నిత్యం ప్రశంసిస్తూ ప్రజల ఆలోచనలను ప్రభావితం చేస్తూ, ఎన్నికల ఫలితాలను దాదాపు వారే నిర్ణయిస్తున్నంత పని చేస్తున్నారు. ఇపుడు ఏ పార్టీయైనా వారు చెప్పినట్టు వింటేనే మనుగడలో ఉంటుంది, లేదా ధూళిలో కలిసిపోతుంది అన్నట్టు తయారైంది పరిస్థితి.

చివరకు పన్ను కట్టడంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో కనిపెట్టి ఎగ్గొట్టడంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు వ్యాపారస్తులు అందరూ సమబుద్ధులై ఉన్నారు. మనకు రసీదు ఇస్తున్న వ్యాపారులెంతమంది ఉన్నారు కనుక?
<><><><><><>

సరే, చరిత్రపుటలనుండి నేటి రోజుకు తిరిగి వద్దాం. ప్రస్తుతం అటువంటి వ్యాపారులు నగదు చలామణీ లేక, కొనుగోళ్లు జరగక ఇబ్బంది పడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. వారి మీద మనం ఏమాత్రం జాలి పడనవసరం లేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించి ధనస్వామ్యంగా మార్చిన ఘనత వారిది. వారికి ఏ ఇబ్బందులు ఉన్నా అవన్నీ తాత్కాలికమే, నగదు విరివిగా చలామణీలోనికి వస్తే వాళ్ళు రక్తబీజుల్లా మళ్ళీ విజృంభిస్తారు. సందేహం లేదు, కాబట్టి, ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నా చివరకు బాధలు అనుభవించేది బలి అయ్యేది ఎప్పటికీ మనమే! సామాన్యప్రజలమే!

अश्वं नैव गजं नैव व्याघ्रं नैव च नैव च।
अजापुत्रं बलिं दद्याद् देवो दुर्बलघातकः।।

చివరకు ఆ దేవుడు కూడా తనకు బలిగా బలమైన గుఱ్ఱాన్ని గాని, ఏనుగును గాని, పులిని గాని కోరడట. కోరేది పాపం అమాయకమైన మేకపిల్లనట! అయ్యయ్యో! దేవుడు కూడా బలహీనుణ్ణే దెబ్బకొడతాడు కానీ, బలవంతుల జోలికి పోడే అని, పాపం, ఓ సంస్కృత కవి ఎప్పుడో వాపోయాడు!

Wednesday 7 December 2016

గాలితో యుద్ధం


క్రీ.శ. 19 వ శతాబ్దం చివరి దశకం.

చెన్నై. (అప్పట్లో మద్రాస్)
******************



అమెరికాలో చికాగోలో World Religion Congress జరుగుతుందని The Hindu లో వార్త వచ్చింది.
చెన్నైలో spiritually elite people అందరూ అక్కడికి హిందూధర్మప్రతినిధిగా ఎవరిని పంపాలి అని తర్జనభర్జనలు పడుతున్నారు. ధర్మమంటే ఏమిటో, దాన్ని ఔన్నత్యమేమిటో ఎలుగెత్తి చాటగలవారు చాలామంది ఉన్నారు. కాని, వెళ్లేది పాశ్చాత్యప్రపంచం కాబట్టి, ఇంగ్లీషులో చెప్పగలిగినవారు కావాలి. దానికి కూడా సమస్య లేదు. ఇంగ్లీషు అద్భుతంగా వచ్చినవారు చాలామంది ఉన్నారు. కాని, అమెరికా వెళ్లాలంటే సముద్రం దాటి వెళ్లాలి. ఆర్యావర్తము, యజ్ఞియదేశము అంటూ మనువు పేర్కొన్న భారతదేశాన్ని విడిచిపోయేందుకు సంశయిస్తున్నారు., 

1 మనువు భారతానికి ఆవలిదేశాన్ని మ్లేచ్ఛదేశమంటారన్నాడే కాని, ఎవరూ దేశం విడిచిపోవడాన్ని నిషేధించలేదు. 

2 ద్విజులు భారతదేశాన్ని ప్రయత్నపూర్వకంగా ఆశ్రయించాలని మాత్రం చెప్పాడు. 
అక్కడికి ఆయన ఊరుకుంటే బాగుండేది. 
ఎవరికీ ఏ భయమూ ఉండేది కాదు. కాని, 

3 శూద్రులు మాత్రం వృత్తిని వెతుక్కుంటూ మ్లేచ్ఛదేశాలకు కూడా స్వేచ్ఛగా పోవచ్చునని చెప్పాడు.

((Note: 1: మనువును వ్యతిరేకించేవారెవరూ ఆయన శూద్రులకు ఇంతటి నిరభ్యంతరమైన స్వేచ్ఛ ఉందంటూ పేర్కొన్నాడనే విషయాన్ని పొరపాటున కూడా చెప్పరు. సరే, ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం.)) 

సరే, వెనక్కొస్తే, పైన పేర్కొన్న మూడవవిషయం వల్ల ఉపనయనార్హత, వేదాధ్యయనార్హత కలిగిన ద్విజులందరూ దేశం దాటితే మాకు ద్విజకులభ్రష్టత (కర్మభ్రష్టత) తో పాటు శూద్రత్వం ప్రాప్తిస్తుంది అని భయపడే అవసరమొచ్చింది. కాని, అప్పటికి దేశం దాటి అమెరికాకు వెళ్లి అక్కడ హిందూధర్మపు గొప్పదనాన్ని చాటవలసిన అవసరముంది., ఎవరిని పంపించాలి? ఎవరు ద్విజత్వాన్ని వదులుకొని శూద్రత్వాన్ని కోరుకుంటారు? పిల్లి మెడలో నేను గంటను కడతానని ఏ ఎలుక ధైర్యంగా ముందుకొస్తుంది? అని తటపటాయిస్తున్నారు.

((Note: 2 : ద్విజులు సంధ్యావందనాది నిత్యకర్మలను విధిగా చేసితీరాలి. అలా చేస్తే పుణ్యమేమీ రాదు. కాని, చేయకపోతే మాత్రం పాపం వస్తుంది. నిత్యకర్మలను భారతభూభాగంలోనే చేయాలి. భారతభూమి బయట చేస్తే దానికి విలువ లేదు. అందువల్ల భారతం దాటితే కర్మభ్రష్టత్వం కలుగుతుంది. అలా కర్మభ్రష్టత కలగడం వలన ద్విజజాతిభ్రష్టులౌతారు... అనేది కారణం.))

((Note: 3 : భ్రష్టుడు అనేది నీచాతినీచమైన తిట్టు అని భ్రమించేవారు చాలమంది ఉన్నారు. కాని, అదేమి తిట్టు కాదు. భ్రష్టత్వమంటే జారిపోవడం, లేదా కోల్పోవడం. అంతేకాని, చెడిపోవడం కాదు.))

((Note: 4 :నిజానికి హిందువులు సముద్రం దాటి సుదూరప్రాచ్యదేశాలతో వాణిజ్యం చేయడం ఎన్నడో ప్రారంభమైంది. దక్షిణదేశక్షత్రియులు సముద్రపు ఆవలిభూముల్లో తమ రాజ్యాలను స్థాపించి పరిపాలన సాగించారని కూడా చరిత్ర చెబుతుంది.))

పాపం, అలా చెన్నై పండితులు ఆందోళనలో ఉండగా, వారికి ఒక ఆశాకిరణం కనిపించింది. ఆ కిరణమే వివేకానందుడు. అప్పటికి ఆయన భారతపర్యటన చేస్తూ చెన్నైకి వచ్చి ఉన్నాడు. ఇంగ్లీషులో అనర్గళంగా ప్రసంగించగల నేర్పరిగా, భారతీయ తత్త్వసామాజికశాస్త్రాలలో మహా దిట్టగా, ప్రపంచచరిత్రను ఔపోసనపట్టిన మేధావిగా అప్పటికే ఆయన గొప్ప ఖ్యాతిని గాంచి ఉన్నాడు. ఆయనతో కాస్త చనువు ఏర్పడ్డాక ఈ చెన్నైవాసులు ఆయనను హిందూధర్మప్రతినిధిగా అమెరికాకు వెళ్లమని అభ్యర్థించారు. 

((Note: 5: వివేకానందుడు సన్న్యాసి. సన్న్యాసికి కులమనేది ఉండదు. వారు ఎటువంటి నిత్యకర్మలను చేయవలసిన అవసరం లేదు. అందువల్ల భ్రష్టత్వమనేది వారికి ఉండే అవకాశం లేదు.))

కాని, వివేకానందుడు మొదట పెద్దగా ఆసక్తిని కనబరచలేదు. కాని, ఆయన సముద్రం ఒడ్డున ఉండగా ఆయన గురువైన శ్రీరామకృష్ణపరమహంస సముద్రజలాలపై నిలబడి, పదే పదే రమ్మంటూ సైగలు చేస్తున్నట్టు తోచిందట. దాంతో తనను తన గురువు సముద్రం దాటి విదేశాలకు వెళ్లవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నట్టు వివేకానందుడు భావించాడు. గురుపత్ని అయిన శ్రీశారదాదేవి నుండి కూడా అనుమతి లభించేసరికి ఆయన హిందూ ప్రతినిధిగా అమెరికాకు వెళ్లేందుకు సుముఖుడయ్యాడు.

ఆతరువాత జరిగినదంతా చరిత్ర.

హిందూప్రతినిధిగా వెళ్లిన ఆయన భారతీయ ఆధ్యాత్మికవైభవాన్ని, సాంస్కృతికౌన్నత్యాన్ని సమస్తప్రపంచదేశాల ప్రతినిధులముందు ఘనంగా చాటి చెప్పారు. ఆయన విదేశగమనంతో భారతదేశం పట్ల పాశ్చాత్యదేశాలవారికుండే దృక్పథం మారింది. చిన్నచూపు చూడడం మాని, కాస్త గౌరవం చూపడం ప్రారంభమైంది. భారత్ నుండి ద్విజజాతులు కాస్త స్వేచ్ఛగా పాశ్చాత్యదేశాలకు వెళ్లడం ప్రారంభమైంది. అలా వెళ్లినవారిలో శ్రీనివాస రామానుజన్, గాంధీ, రవీంద్రనాథ టాగోర్ వంటి ప్రముఖద్విజులున్నారు. వారు మళ్లీ వెనుకకొచ్చారు గాని, అందరూ వారిలా వెనక్కురాలేదు. అలా భారత్ నుండి క్రమంగా ద్విజజాతుల వలస ప్రారంభమైంది.

క్రమంగా 20 వ శతాబ్దంలోనే ద్విజులందరికీ విదేశగమనంలో తప్పేమీ లేదని భావించే మానసికపరివర్తన కలిగింది. 21 వ శతాబ్దంలో అసలు విదేశగమనమే తమ జన్మకు పరమార్థమన్నట్టు కష్టిస్తున్నారు, అనుకున్నది సాధిస్తున్నారు. నిత్యకర్మాచరణకు, స్వాధ్యాయానికి license వంటిదైన ఉపనయనాన్ని పెళ్లిముందు జరిగే మొక్కుబడి తంతుగా మార్చేశారు. విదేశాలలోనే సర్వపాశ్చాత్యవిద్యలు నేర్చి, అక్కడే ఉద్యోగం చేస్తూ, కేవలం పెళ్లి కోసం ఓ నెలరోజులు సెలవు పెట్టి, అప్పుడే విమానం దిగివచ్చిన ద్విజుడు కూడా ఆజన్మవిరక్తునిలా నటిస్తూ కాశీకి పోయి సన్న్యాసం స్వీకరిస్తానని ఉత్తుత్తి బెట్టు చేస్తాడు. ఏమీ వెళ్లడని తెలిసికూడా పెళ్లికూతురి సోదరుడు ఆయనను బ్రతిమలాడి పెళ్లిపీటలమీదకు తెస్తాడు. పెళ్లవుతుంది. కొద్దిరోజులయ్యాక గృహస్థుడైన ద్విజుడు తన వధువుతో సహా విదేశాలకు ఎగిరిపోతున్నాడు. 

(పోనీ, ఇక్కడ మనువుగారి గౌరవార్థం "మనువాడిన ద్విజుడు" అందామా?) 

కర్మభ్రష్టత, ద్విజత్వభ్రష్టత - 
ఇలాంటి కాలం చెల్లిన చాదస్తపు మాటలు, భయాలేమీ ఇప్పుడెవరికీ లేవు.
ఎవ్వరూ మనుస్మృతిని చదవటం లేదు, 
చదివినా ఆయన చెప్పిన ప్రతివిషయాన్నీ ఎవరూ పాటించటం కూడా లేదు. పాపం, మనువు!

ద్విజులందరూ మరచిపోయిన ఆ మనువును కొందరు మాత్రం తమ మనుగడ కోసం గుర్తు చేసుకొంటూ "మనువాదం నశించాలి, మనువాదులు ఖబడ్దార్" అంటూ ఉండడం చూస్తే, వారు తమ కత్తులతో కసికసిగా గాలిని చీల్చి చెండాడుతున్న మహావీరులనిపిస్తూ ఉంటుంది.

పాపం, రాబోయే రోజుల్లో చదివేవారెవరూ లేరని మనుస్మృతిని పబ్లిషర్లెవరూ ముద్రించడానికి ఇష్టపడరు. కాని తగలబెట్టడానికి మాకు ఇన్ని కాపీలు కావాలని, మనువాదవ్యతిరేకులమని చెప్పుకొనేవారు ఆర్డరిచ్చి ప్రింట్ చేయిస్తూ ఉంటారు.

Tuesday 6 December 2016

Sorry, Yours is a Wrong Call!

అనగనగా ఒక ముసలవ్వ.
ఆ అవ్వకు ఏడుగురు కొడుకులు.
పెద్ద కొడుకు సైన్యంలో ఉన్నాడు.
మిగిలిన ఆరుగురూ అవ్వను చూసుకుంటూ ఊళ్లోనే ఉన్నారు.
ఇలా ఉండగా ఒకసారి యుద్ధం వచ్చింది.
పెద్ద కొడుకు చనిపోయాడని వార్త వచ్చింది.
ఊళ్ళో అందరూ ఆమెపై సానుభూతి కురిపించారు.
ఆమె మాత్రం రెండో కొడుకును యుద్ధానికి పంపింది.
అతడు కూడా చనిపోయాడని వార్త వచ్చింది. ఊరంతా బాధ పడుతూ ఉంటే ఆమె మూడో కొడుకును యుద్ధానికి పంపింది. అతడు కూడా చనిపోయాడు. అపుడు నాలుగో కొడుకును పంపింది. అలా ఒకరొకరుగా ఆరుగురు కొడుకులు యుద్ధంలో చనిపోయారు. ఊర్లో జనాల బాధకు అంతే లేదు. కాని ఆ మొండి ముసలవ్వ అందరూ వద్దు, వద్దు అంటున్నా, చివరి కొడుకైనా నీకు తోడుగా ఉంటాడంటున్నా పట్టించుకోకుండా యుద్ధానికి పంపింది. చివరకు అతడు కూడా చనిపోయినట్టు తెలిసింది.
అప్పడు ఆ ముసలవ్వ ఏడవటం మొదలు పెట్టింది.
జనాలు ఆమెను పిచ్చిదాన్ని చూసినట్టు చూశారు. "వద్దు వద్దన్నా పంపించావు. ఇప్పుడు ఏడుస్తున్నావు. మిగిలిన ఆరుగురు చనిపోయినప్పుడు ఏడవలేదు. ఇప్పుడు ఏడో కొడుకు చనిపోయాక ఎందుకు ఏడుస్తావు?" అని అడిగారు.
అప్పుడు ఆ అవ్వ "నేను నా ఏడో కొడుకు చనిపోయినందుకు ఏడవటం లేదు, యుద్ధానికి పంపటానికి నాకు మరికొంతమంది కొడుకులు లేరే అని ఏడుస్తున్నాను" అని అన్నదట!
<><><><><><><>
<><><><><><><>
ఇది మా అవ్వ మాకు చెప్పిన కథ. చాల చాల చిన్నప్పుడు విన్నది.
అది విన్నపుడు నేను ఏడ్చి కన్నీళ్లు పెట్టింది నాకు ఇంకా గుర్తుంది.
ఈ కథ పెద్దైన తరువాత కూడా మరెక్కడో చదివాను. అవ్వ గుర్తుకు వచ్చింది. మళ్ళీ చదవకుండా ఉండి ఉంటే మరచి పోయి ఉండే వాడినేమో! ఇది వీరమాతృత్వాన్ని ప్రశంసించే కథ! అసలు ఈ కథ అలా ఎప్పటినుండి ప్రచారంలో ఉందో తెలియనే తెలియదు. ఈ కథను సృష్టించినదెవరో మరి! దేశం కోసం ప్రజలు తమ ప్రాణాలను ధారపోయాలని పరోక్షంగా చెప్పిన కథ అది. తప్పేముంది? చాల మంచి కథే!
<><><><><><><>
<><><><><><><>
పారిశ్రామికవిప్లవం వచ్చాక యూరోపియన్ దేశాలు తమ ఆయుధసంపత్తితో ప్రపంచదేశాల మీద పడ్డాయి. దొరికిన ప్రాంతాన్ని దొరికినట్టు ఆక్రమించుకొని అక్కడి జనాలను దాదాపు బానిసలుగా చేసుకొని, వ్యాపారము ధనార్జన మాత్రమే ప్రధాన లక్ష్యాలుగా ప్రజలమీద పెత్తనం చెలాయించాయి.
శతాబ్దాల తరబడి వారు దోచుకున్న ధనమే పెట్టుబడిగా పెట్టి ఆ దేశాలు ఇప్పటికీ ధనిక దేశాలుగా వెలిగిపోతున్నాయి. దాన్ని వాళ్ళు తమ దేశపు వ్యాపారులు చేసిన సంపద సృష్టి అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ సంపదలో అత్యధిక శాతం సృష్టింపబడింది వారి వారి వలస దేశాలలోనే తప్ప వారి దేశాలలో కాదు అన్నది చారిత్రక సత్యం.
ఆ వలస స్వాముల నిర్దాక్షిణ్యమైన భారీ దోపిడీకి అనాగరిక జాతులైన ఆఫ్రికన్ల నుండి గొప్ప నాగరికత కలిగిన భారతదేశం వరకూ అందరూ బాధితులే!
మనమే ఇంకా అదృష్టవంతులం! ఆఫ్రికన్లు చాలాకాలం పాటు బానిసలుగా సంతలో పశువుల్లా క్రయవిక్రయాలకు గురి అయ్యే వారు. ఆస్ట్రేలియా అమెరికా ఖండాలలో నేటివ్ లను దాదాపు సర్వనాశనం చేసి అవి తరతరాలుగా తమ జన్మభూముల్లా దర్జా ఒలకబోస్తున్న వారు ఒకనాటి యూరోపియన్లే కదా!
మనమీద కూడా జలియన్ వాలా బాగ్ వంటి దౌర్జన్యపూరిత మారణకాండలు జరిపినా జంకకుండా పోరాడి పోరాడి మొత్తానికి వారిని ఎలాగో తరిమేశామనిపించుకొని, స్వాతంత్ర్యం వంటి పదార్థాన్ని ఒకదాన్ని తెచ్చుకొని, మన కర్మ మనం అనుభవిస్తున్నాము. కుంటుతూ పడుతూ లేస్తూ మన పాట్లు ఏవో మనం పడుతున్నాము.
<><><><><><><>
<><><><><><><>
ఇలా ఒకనాడు పాశ్చాత్య దేశాల సంపద సృష్టికి ఇతోऽధికంగా ఉపయోగపడిన బానిసదేశాలు మాత్రం ఈనాడు పేదరికంతో మగ్గిపోతుండగా,
ఆ సంపదను సృష్టించుకున్న దేశాలు మాత్రం పెత్తనం చేసే బుద్ధులు ఇంకా పోనిచ్చుకోలేక, చమురు ఎగుమతి చేసే దేశాల గొడవలలో తల దూర్చి, వాటితో పెట్టుకుని, కొరివితో తల గోక్కునారు. గ్లోబల్ టెర్రరిజం అనే కొత్త సమస్యను సృష్టించారు. హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోలేక ఇపుడు అభద్రతా భావంతో, మునుపటి కంటే మరింత భయంకరమైన ఆయుధాలను సృష్టించుకుని భయం భయంగా గడిపేస్తున్నారు.
చమురు ఎగుమతి చేసే ఈ మధ్య ఆసియాదేశాలు తమ వ్యవహారాల్లో విదేశాలజోక్యాన్ని భరించలేక, వారిని తరిమివేయాలి అనుకొనడం మంచిదే. చాల సహజమైన ప్రతిక్రియే.
కాని, వారు ఆ ఉద్యమాన్ని పొరబాటున మతానికి అటాచ్ చేశారు.
అంతే! ఆ ఉద్యమం విద్యావంతుల చేజారిపోయింది. పడరాని వారి చేతుల్లో పడింది. ఆపైన అది కొమ్ములు విరవబడని మహోగ్ర మతోన్మాద ఉగ్రవాద భూతంగా తయారై, అడ్డూ అదుపూ లేక, అసలా ఉద్యమం ఎందుకు పుట్టిందో కూడా తెలియని మూర్ఖత్వంతో వారి వారి దేశాలకు ఎటువంటి హాని కూడా చేయని అమాయిక దేశాల మీద కూడా పడి సర్వ ప్రపంచానికి శత్రువుగా తయారైంది.
అందువల్ల ఆయా దేశాలలో ఇటువంటి తీవ్రవాద ఉద్యమాల మీద సదభిప్రాయం గాని ఆదరణ గాని పెద్దగా లేదు. ఇటువంటి ఉద్యమాల పట్ల సానుభూతి ఉన్నవారి సంఖ్య పెద్ద గొప్పగా ఏమీ లేదు.
అందువల్ల, భారత్ పాకిస్తాన్ వంటి దేశాలనుండి కూడా యువకులను ఆకర్షించి, ట్రైనింగ్ ఇచ్చి, తమ సంస్థలలో రిక్రూట్ చేసుకుని, తాము చేస్తున్న మారణహోమాలకు వారిని సమిధలుగా ఉపయోగించుకుంటూ, అలా ఉపయోగపడటం ఒక ఘనకార్యంగా చెబుతూ, వారిని అమరవీరులుగా కీర్తిస్తూ, జన్నత్ లో వారి స్థానం శాశ్వతంగా ఉంటుందని కురాన్ లో లేని కొత్త ప్రవచనాలను కూడా వీరే రాసేస్తూ, వాటినే బోధిస్తూ, అలజడి సృష్టిస్తున్నారు.
<><><><><><><>
<><><><><><><>
సరే, భారతదేశంలో కొందరు "మహా" నాయకులు పాశ్చాత్య దేశాలలో జరిగిన సంపద సృష్టి విధానాన్ని బాగా "స్టడీ" చేశారు!
అక్కడ యూరోప్ లో జరిగిన భయంకర సంపద సృష్టిని, తద్వారా అక్కడ ఆవిర్భవించిన "మహోన్నతసంస్కృతిని" తమ దేశాలలో కూడా సృష్టించి, ప్రచారం చేసి తాము కూడా లాభపడదాం అనుకుంటూ విజనరీలుగా దార్శనికులుగా తమను తాము ప్రమోట్ చేసుకున్నారు, చేసుకుంటున్నారు.
ఇపుడు చూడండి -
దేశంలో స్వదేశీ కార్పొరేట్ సంస్థలు విచ్చల విడిగా పెరుగుతున్నాయి.
విదేశీ వ్యాపార సంస్థలు భారత దేశంలోనికి కాలు మోపడానికి విరివిగా లక్షల కోట్ల రూపాయల విలువైన MOUలు కుదుర్చుకుంటున్నాయి(ట).
మరి ఈనాడు వారి వారి వ్యాపారాలకు చవకగా దొరికే కూలి మనుషులు కావాలి.
పోనీ, కూలి అనకుంటే జీతాలు అనుకోండి.
మనుషులు, మనుషులు, మనుషులు కావాలి.
సంపద సృష్టికి ప్రధానమైనవి - మానవ వనరులు - అట.
అవి విరివిగా కావాలి.
కాని, భారతదేశం అంతా మనుషులతో నిండిపోయి ఉన్నా, పనికి మనుషులు ఎవరూ దొరకటం లేదే?
రైతులకు కూలీలు దొరకటం లేదు.
ఇద్దరూ ఉద్యోగులే ఉన్న ఇంట్లో పనిమనిషి దొరకడం కూడా కష్టంగానే ఉంది.
అస్సలు దొరకరని కాదు, వారిని దొరికించుకొనేంత కూలీ నువ్వు ఇవ్వలేవు కాబట్టి దొరకరు.
లోకల్ గా ఉన్న భారతీయులకే దొరకని కూలీలు
ఇపుడు కొత్తగా వచ్చే విదేశీ కంపెనీలకు మాత్రం ఎలా దొరుకుతారు?
దొరకకపోతే విదేశీ కంపెనీలు రావు.
చవకగా దొరికే వేరే దేశాలకే పోతాయి.
అవి సోకాల్డ్ మహానాయకులు తమకు ఉందని ప్రచారం చేసుకొనే అదేదో రకం గ్రాఫిక్ విజన్ చూసి మురిసి పోయి, ఎగిరి గంతులేసుకుంటూ రావు కదా?
విజన్ను చూసి మురిసిపోయి వస్తాయి అని ఏ వెధవ అయినా అంటే ఈ సారి చెప్పుచ్చుకు కొట్టండి.
ఈ విషయం తనకు కూడా కాస్త అర్థమైన తరువాత, మన విజనరీ మహానాయకుడు పిల్లల్ని కనండహో, సాధ్యమైనంత ఎక్కువగా పిల్లల్ని కనండహో అని నెత్తి నోరు మొత్తుకుని చెబుతున్నాడు.
కొత్త దంపతులు అలాంటి మాటల మాయలో భ్రమిసి అలా కనేసేరు జాగ్రత్త!
ఇపుడు ఉన్నవారికే సరైన చదువులు చెప్పించ లేక,
సరైన వైద్య సదుపాయం కల్పించ లేక,
సరైన నివాసం చూపించ లేక,
సరైన ఉపాధి కూడా కల్పించలేని దుఃస్థితిలో ఉన్న ఈ విమనాడు (విజనరీ మహా నాయకుడు)
తన మాటను అమాయికంగా నమ్మేసి నవదంపతులు అధిక సంతానాన్ని కంటే,
ఇపుడువారికి సౌకర్యాలకంటె మరింత అధికంగా వారికి ఏమివ్వగలడు?
అప్పటికి ఈయన జవాబు చెప్పడానికి కూడా ఉండడు. ఆయన వారసులు ఈనాటి ఈయన మాటకి ఆనాడు బాధ్యత వహించరు.
ఆ అధిక సంతానానికి భవిష్యత్తులో కూలి ఉద్యోగాలు వచ్చినా అది అత్యంత గొప్ప విషయంగా, తాము సాధించిన ఘనకార్యంగా డప్పులు కొట్టుకుంటారు గుర్తు పెట్టుకోండి!
ఈరోజు ఈ మాటలు నమ్మి మోసపోతే, 2050 నాటికి "ఇంటికో కూలి ఉద్యోగపథకం" అనేది ఒక గొప్ప ఎన్నికల నినాదంగా రూపు దిద్దుకుంటుంది.
<><><><><><><>
<><><><><><><>
జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక రైతు కూడా ఈ విషయంలో మోసాన్ని అర్థం చేసుకోగలడు.
ఒక ఎకరా భూమిలో ఒక మనిషి పని చేస్తే
కాస్త పంట వస్తుంది.
ఇద్దరు పని చేస్తే,
మరి కొంత అధికంగా పండించగలరు.
ముగ్గురు పని చేస్తే,
మరీ ఎక్కువ రాకున్నా, కాస్త పెరగ వచ్చు.
నలుగురు పని చేస్తే,
ముగ్గురు కలసి పండించిన దానికంటే అధికంగా రాక పోవచ్చు.
ఇక ఐదో వాడు చేరితే?
అంత వరకూ వస్తున్న పంట కంటే తక్కువ వచ్చే ప్రమాదం ఉంది.
ఇలాంటి స్థితిలో ఆరో వాడు కూడా నేను సైతం అంటూ వస్తే?
పొలంలో మరింత పంట పండేది లేదు కాని, అంత వరకూ ఐదుమంది మూడు పూటలా, కడుపు నిండా తింటున్నా సరిపోయిన పంట, ఇపుడు ఆరోవాడికి సరిపోకపోవచ్చు.
దానికి తోడు ఏడో వాడు వస్తే?
పంట పండించే సంగతి మరచి, ఉన్న ఆహారాన్ని ఎవరెవరెవరు ఎన్తెన్తెంత పంచుకోవాలో గొడవలు మొదలౌతాయి.
వీళ్ళ గొడవల్లో వీళ్ళు ఉండగా ఎనిమిదో వాడు, తొమ్మిదో వాడు, పదో వాడు అంటూ అడ్డూ అదుపూ లేక జనాలు పుట్టుకొస్తూనే ఉంటే?
అప్పుడేమిటి పరిష్కారం?
పొలాన్ని రియల్ ఎస్టేట్ చేసి అమ్మేసుకుని తలాకింత పంచేసుకుంటే -
అపుడు చేతిలో కాస్త డబ్బులు ఆడుతాయి -
సరే, కాని, కడుపు నిండే పంట ఏదీ?
సింగపూరుకు, జపానుకు, చైనాకు రోజూ ఫ్లైట్లో వెళ్లి తినేసి వద్దామా?
ఉన్నదాంతో ప్రశాంతంగా ఉండక, అవసరమా ఇప్పుడా అధిక సంతానం గొడవలు, తలనెప్పులు?
<><><><><><><>
<><><><><><><>
ఇక్కడ మన భారతదేశమే ఆ పొలం!
ప్రజలే రైతులు!
పెరిగే జనాభాతో పాటు పొలం కూడా అదే దామాషాలో పెరిగే అవకాశం లేనే లేదు.
అది అందరికీ తెలుసు.
తెలియనట్టు నటించే వెధవలకు చెప్పుతో సన్మానం!
అధిక సంతానం వద్దు, ఆ మాటలకు మోసపోవద్దు!
<><><><><><><>
<><><><><><><>
అయినా, 


మొదట కథలో చెప్పినట్టు, ఆ ముసలమ్మలాగ మన దేశాన్ని రక్షించుకొనేందుకు వీరులైన సంతానాన్ని కన్నా అందులో ఒక గౌరవం ఉంటుంది కాని,

* దేశాన్ని మరలా ప్రచ్ఛన్నంగా దోచుకుపోయేందుకు వస్తున్న విదేశీకంపెనీలకు కూలీలుగా ఉండేందుకు,
* సినిమాజనాల కటౌట్లకు మేకలను బలి ఇచ్చి తలలు వేలాడదీసేందుకు, 

* సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని తమ నాయకుడు చేస్తున్న వెధవ పనులను వ్యతిరేకించిన వారిని అదేపనిగా తిడుతూ వేధించడానికి,
* క్రికెట్ మైదానాలలో ఫోర్లు సిక్సర్లకు కేరింతలు కొట్టి క్రికెట్ బోర్డుకు ఆదాయం తెచ్చి పెట్టే వనరులుగా మారేందుకు,
* ఆయా నాయకులు ఎన్నికల్లో వాగ్దానాలు చేస్తూ,  ఉచితంగా అదిస్తాం ఇదిస్తాం అంటే ఎగబడి వోట్లు వేసి  దేశభవిష్యత్తును ఆ పనికిమాలినవారి చేతుల్లో పెట్టేందుకు,
- జస్ట్, జస్ట్, ఇలాంటి పనులు చేసేందుకు సంతానాన్ని కనడంలో ఏమి గౌరవం ఉంటుంది విజనరీ గారు?

Shame on You, for Your Wrong Call.

శ్రీనివాసకృష్ణ   

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...