Wednesday 30 December 2020

ఒకరికి భాష రాకపోతే వేరొకరికి తిప్పలు

 


19వ శతాబ్దం నాటి కథ -

చెన్న పట్టణంలో ఒకానొక హూణప్రభువు ఉండేవాడు. అతడు ఇంగ్లీషుభాషను తప్ప వేరొక భాషను ఎరుగడు. అందువల్ల అతడు స్థానికభాష తెలిసిన ఒక దుబాసీని తన దగ్గర నియమించుకున్నాడు.
ఒకరోజు కొందరు సంప్రదాయ నృత్యకళాకారులు అతని చెంతకు వచ్చి, తమ వంశాదికం తెలుపుకుని, అతని సమక్షంలో సర్వాత్మనా నర్తించి తమ కౌశలాన్ని వ్యక్తపరిచారు.
దానితో ఆ ప్రభువు చాల సంతోషించి తన దుబాసీని పిలిచి, వీరికి పది రూపాయలను ఇవ్వమని ఆదేశించాడు. ఆ దుబాసీ సరేనని, వారిని తన ఇంటికి తీసుకుని పోయి, వారికి ఒక రూపాయిని ఇచ్చి ఇక పొమ్మన్నాడు.
తాము అంతగా శ్రమించి చేసిన నృత్యానికి ఇంతటి అల్పపారితోషికం దక్కిందే అని వారు చాల బాధపడ్డారు. ఈ దుబాసి తమను మోసం చేసి ఉండవచ్చునా అని అనుమానించారు.
అపుడు వారు తిరిగి ఆ ప్రభువు దగ్గరకు వెళ్లారు. దుబాసీ తమకు ఇచ్చిన రూపాయిని అతనికి చూపారు. మాకు దుబాసీ ఇంతమాత్రమే ఇచ్చాడని నివేదించారు.
ఆ ప్రభువుకు వారి భాష అర్థం కాలేదు. అందువలన దుబాసీని రప్పించి, వీరేం చెబుతున్నారో అడిగి తెలుసుకో అని అతడిని ఆదేశించాడు.
అపుడు దుబాసీ ప్రభువును ఉద్దేశించి "అయ్యా, మీరిచ్చిన పదిరూపాయలలో ఈ రూపాయినాణెం చెల్లనిది. దీని మీద దొంగముద్ర ఉన్నది. అందువల్ల, ఈ రూపాయిని తీసుకుని, మరొక రూపాయిని ఇప్పించవలసినది అని వీరు అడుగుతున్నారు" అని నివేదించాడు.
అది వినేసరికి ఆ ప్రభుపుకు చాల కోపం వచ్చింది. ఆ నృత్యకళాకారులను తన్ని తరిమేశాడు.
అందువలన, ఏ జనాలైనా తాము నివసిస్తూ ఉన్నటువంటి దేశభాషను తెలుసుకొనకపోతే ఇతరుల మాటలను నమ్మి, ఆ దేశప్రజలకు అన్యాయం చేస్తారు.
***)))(((***
శ్రీమాన్ వేంకటరామశాస్త్రిగారు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థులు సంస్కృతం త్వరగా, చక్కగా నేర్చుకునేందుకు వీలుగా "కథాశతకమ్" అనే చిన్న పుస్తకాన్ని వ్రాశారు. అందులో 27 వ కథకు ఇది నా అనువాదం. సంస్కృతకథ ఫొటోలో ఉన్నది.
***)))(((***
పాలకులు ప్రభువులు ఎంతటివారైనా తాము నివసిస్తూ ఉన్నటువంటి దేశభాషను (స్థానికభాషను) నేర్చుకోవాలని, లేకుంటే ఆ ప్రాంతపు ప్రజలకు తీరని అన్యాయం కలుగుతుందనే ప్రబోధం ఇది.
అయితే ఈనాటి పాలకులు మాత్రం, తమ కోసం దేశప్రజలందరూ మాతృభాషను వదలిపెట్టి పరాయిభాషలను నేర్చుకోవాలని హుకం జారీ చేస్తున్నారు. పైగా, అలా పరాయి భాషను నేర్చుకోకపోతే రేపటికి మీకు కూటికి గుడ్డకు కరువౌతుందని, మీకు జీవనోపాధి లభించదు అని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.
మన అజ్ఞానం, మన దురాశ, మన దౌర్భాగ్యం, మన పిరికితనం, మన బానిస మనస్తత్త్వం మాత్రమే మన మాతృభాష అంతరించబోయేందుకు కారణాలు.



నిన్న ఈ ఫొటోలోని విషయాన్నిపట్టుకుని కొందరు నోటికొచ్చినట్టు తిట్టిపోశారని, అవహేళన చేశారని, ద్వేషాన్ని వెళ్లగక్కారని మీరు ఎందుకు బాధపడతారు Sesha Murthy P మహోదయా?

అసలు వారి frustration ను మనం కూడా కాస్త అర్థం చేసుకోవాలి కదా?
వారంతా కూడా తమ పిల్లలు పుట్టిన దగ్గరనుంచి వారికి వేదం నేర్పించే గురువు ఎవరా ఎక్కడున్నారా ఎక్కడున్నారా అని తీవ్రంగా అన్వేషిస్తున్నారు.
ఈ వేదవిద్య అనేది
కాంపిటీటివ్ పరీక్షలు వ్రాసి ఉద్యోగాలు సంపాదించడానికి గాని, కార్పొరేట్ సంస్థలలో ఆఫీసర్లుగా సీయీవోలుగా ఎదగడానికి గాని, ధనం బాగా సంపాదించడానికి గాని ఎంతమాత్రం ఉపయోగపడే విద్య కాదనే విషయంలో వారికి సంపూర్ణమైన అవగాహన ఉన్నది.
అయినప్పటికీ తమ పిల్లలు చక్కగా గుండు కొట్టించుకుని, పిలక పెట్టుకుని, ఈ వేదవిద్యను అభ్యసించాలని, తమ తమ వంశాలను పావనం చేయాలని, ఉద్ధరించాలని వీరికి చిరకాలవాంఛ.
వీరంతా తమ పిల్లలకు చిన్నపుడే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అంటూ తమదైన మంత్రదీక్షను ఇచ్చారు.
చిన్నపుడే ఈ సద్గుణాలను వారికి నూరిపోశారు. గురువుల చెంత, తోటి బ్రహ్మచారుల చెంత మసలుకోవవసిన పద్ధతులను, తగిన వినయవిధేయతలను చక్కగా నేర్పారు.
తమ ఇంటిలో రాజసికమైన, తామసికమైన సమస్త ఆహారపదార్థాలను పరిత్యజించి కేవలం సాత్త్వికమైన ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ తమ పిల్లలకు కూడా అదే అలవాటు చేశారు.
తమకు లేని అలవాట్లు తమ పిల్లలకు మాత్రం ఎలా అబ్బుతాయని ఇంటిలో సూర్యోదయాత్ పూర్వమే లేచి, స్నానాదులు, జపతపాదులు చేస్తున్నారు. నిత్యార్చనలు చేస్తున్నారు. అష్టోత్తరాలు, శతోత్తరాలు, సహస్రనామావళులు ఉభయసంధ్యలలోనూ వారి ఇండ్లలో పారాయణ చేయబడుతూ ఉంటాయి.
పండుగలలోను, పర్వదినాలలోను వారి ఇంట ఉపవాసాదివ్రతాలు నియమం తప్పక చేస్తుంటారు. దేవునికి నైవేద్యం జరుగనిదే వారు నీటిని కూడా పానేచ్ఛతో తమ నోట తాకరు.
వివిధవేదపండితులను, శాస్త్రపండితులను తమ ఇంటికి పిలిచి వివిధపురుషార్థదాయకాలైన విషయాలను, వివిధశాస్త్ర విషయాలను చర్చించి, తమ సందేహాలను తీర్చుకుని, వారిని తమకున్నదానితోనే సత్కరిస్తూ ఉన్నారు.
తాము మాట్లాడే మాటలే తమ పిల్లలు కూడా నేర్చుకుంటారనే ఇంగితజ్ఞానం కలిగినవారై తమ తమ ఇండ్లలో చక్కటి వాక్ సంయమాన్ని పాటిస్తున్నారు.
భవిష్యత్తులో తమ పిల్లలు నిరాశపడకుండా, వేదవిద్య యొక్క అంతిమలక్ష్యం మోక్షమే గాని, ధనసంపాదన కానే కాదని వారికి చక్కని అవగాహనను కలిగించారు.
గురుకులంలో కనీసం పన్నెండేళ్లపాటు నివసించడానికి తగిన శిక్షణను తమ పిల్లలకు ఇచ్చి వారిని భౌతికంగా మానసికంగా సంసిద్ధులను చేశారు.
గురుకులమంటే హాస్టల్ కాదని వారికి తెలుసు. తమ పిల్లలు ఎటువంటి గురుశుశ్రూష చేయడానికి అయినా వారు సమ్మతించి ఉన్నారు. గురుకులంనుండి సమావర్తనం జరిగిన తరువాత తమ పిల్లలు జీవితాంతం తమ గురువు నేర్పిన విద్యను స్వాధ్యాయంగా స్వీకరించి నిరంతరమైన అధ్యయనం చేయాలని, చేస్తారని కూడా వారు ఆశిస్తున్నారు.
నీ వేదవిద్యతో నీవు ఏమి సంపాదిస్తావు? మా బిడ్డను ఏమి పోషిస్తావు అంటూ భవిష్యత్తులో తమ సొంత బంధువులు కూడా ఆ వేదవిద్యను అభ్యసించేవారికి తమ పిల్లను ఇవ్వడానికి ఇష్టపడరని తెలిసి కూడా తమ పిల్లలకు వేదవిద్యను నేర్పేందుకే బద్ధకంకణులై ఉన్నారు. ఇలా వారు ఎంతటి త్యాగానికి సిద్దపడ్డారో తెలుసుకోండి.
అంతే కాదు, వంశపారంపర్యంగా, తరతరాలుగా వేదవిద్యను వీరే కర్రలు, కత్తులు కటారులు పట్టుకుని కాపలా కాస్తూ రక్షిస్తూ వస్తున్నారు కూడా. అందువల్ల వేదం ఎవరు నేర్చుకున్నా మా తరువాతనే నేర్చుకోవాలి అనే వీరి కోరిక సమంజసమైనదే కదా?
ఈవిధంగా తమ పిల్లలను వేదవిద్యాసంపన్నులుగా తీర్చిదిద్దడానికి వీరు ఇన్నేసి ఆశలను పెట్టుకుని ఉంటే, ఉన్నట్టుండి ఈయనెవరో బ్రాహ్మణ బ్రహ్మచారులు కావలెను అని, వారికి వేదం నేర్పుతాము అని అంటే వీరికి ఎంతటి నిరాశ, ఎంతటి ఫ్రస్ట్రేషన్ వస్తుందో ఊహించండి.
ఇక్కడ బ్రహ్మచారులు అంటే విద్యార్థులు అని, బ్రహ్మచర్యము అంటే విద్యార్థి దశ (student hood) అని వివరించినప్పటికీ వారు బోలెడన్ని వెకిలి కామెంట్లు గుమ్మరించారంటే వారి ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి చేరుకుందో గమనించి మనం విచారించాలే గాని, తిరిగి కోప్పడరాదు.
పుట్టుకతో అర్హత అనేది రావడం కాదు, పెంపకంతో అర్హత వస్తుంది అన్నా సరే, అర్థం చేసుకోలేని ఒక ఆత్మానం మేధావీమన్యమానుడు అర్థం పర్థం లేని పిచ్చివాగుడు వాగాడంటే దానికి కూడా కారణం ఆ ఫ్రస్ట్రేషనే కదా మహోదయా?
ఆకలితో నకనకలాడూతూ కంచం పట్టుకుని చాల సేపటినుంచి ఓర్పుగా కాసుకుని కూర్చుని ఉండగా వారి కంచంలో పంచభక్ష్యపరమాన్నాలు వడ్డించకపోతే వారికి కోపం రాదా మరి?
అందువల్ల వారి కోపంలో కూడా న్యాయముంది మహోదయా. మీరు కూడా కోపగించుకోకండి. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే వారు తమ వాక్సంయమాన్ని కోల్పోయి నోటికొచ్చినట్టు తిడుతున్నారు. సంవత్సరాలపాటు కష్టపడి అణచుకున్న వారి రాగద్వేషాలు ఒక్కసారిగా ఉప్పొంగడం వలన అంత దారుణంగా అవహేళన చేస్తున్నారు.
అందువల్ల, అంతటి నియమనిష్ఠాగరిష్ఠులను అంతగా నిరాశపరచిన తప్పు మనదే కావడం వల్ల, మనం కాస్త చూసీ చూడనట్టుండాలి.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...