Showing posts with label Idol worship. Show all posts
Showing posts with label Idol worship. Show all posts

Tuesday, 27 March 2018

వ్యక్తి ఆరాధన

***
వ్యక్తి అనేది ఒక స్త్రీలింగపదం. 
పృథగాత్మ అని అమరకోశం అర్థం చెబుతుంది. అంటే - ఒక పదార్ధం నుండి మరొక పదార్థాన్ని వేరుగా చూపే విశేషమే వ్యక్తి. వ్యక్తము అయినది వ్యక్తి అనే భావంలో స్పష్టత అనే అర్థం కూడా ఉన్నది. 

మానవుని స్వభావము మానవత్వము. 
పశువు స్వభావము పశుత్వము. 
అలాగే, వ్యక్తి స్వభావము వ్యక్తిత్వము. 

అంటే, ఒక మనిషిని (అనుకుందాము) వేరొకమనిషి నుండి వేరు చేసి చూపే ప్రత్యేకస్వభావమే వ్యక్తిత్వము.

వేరు చేయడం అంటే ఇక్కడ దురర్థం ఏమీ లేదు. 
ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకత ఉంటుంది. 
అలా ఉండకపోతే అసలు ఓ మనిషిని మనం గుర్తు పట్టలేము. 

ఓ బియ్యపు గింజను చూపి బియ్యం బస్తాలో పడేసి, కలిపేసి, ఏదీ, ఇపుడు చూపించిన బియ్యపు గింజను తిరిగి చూపమంటే చూపగలమా? చూపలేము కదా? అంటే, వాటికంటూ ఒక వ్యక్తిత్వం లేదు అని అర్థం అన్నమాట. 

శారీరకంగానూ, మానసికంగానూ, ఆలోచనల ప్రకారంగానూ, నడవడిక ప్రకారంగాను, సంస్కృతిపరంగాను, నేర్చుకున్న విద్యల ప్రభావం వల్లను, పెరిగిన ప్రాంతం వల్లను, వివిధ అవగాహనలవల్లను - ఇలా మనిషి అనేకరకాలుగా ప్రభావితుడై తనకంటూ ఒక ప్రత్యేకతను ఒక స్వభావాన్ని సంతరించుకుంటాడు. అది అతడి వ్యక్తిత్వం. అది సాంఘికంగా ఆమోదయోగ్యం కావచ్చు, కాకపోవచ్చు కూడా. కాబట్టి వ్యక్తి అంటే మనిషి కాదు, వ్యక్తిత్వమే.
***

ఇక ఆరాధన అనే పదం. దీనికి వాచస్పత్యనిఘంటువు ప్రకారం 1సంసిద్ధి 2సాధన 3సంతోషపరచడం 4సేవించడం అనే అర్థాలు ఉన్నాయి.

భగవదారాధన అనే పదం తీసుకుంటే - భగవంతుని సిద్ధింపజేసుకొనటం, భగవంతుని సాధించటం, భగవంతుని సంతోషపరచడం లేదా భగవంతుని సేవించడం అనే అర్థాలు వస్తాయన్నమాట.
***

ఇపుడు వ్యక్తి ఆరాధన అంటే ఏమిటో అర్థమైంది కదా?
వ్యక్తిత్వాన్ని సిద్ధింపజేసుకొనడం, 
వ్యక్తిత్వాన్ని సాధించడం.
వ్యక్తిత్వంతో సంతోషపరచడం, (& సంతోషపడడం) 
వ్యక్తిత్వాన్ని సేవించడం.
***

వాల్మీకి రాముడిని ఆరాధించి అతని చరిత్రను రామాయణంగా మనకు అందించాడు. రాముడు ఒక మనిషిగా పుట్టాడు. కానీ, అతని వ్యక్తిత్వానికి ఆకర్షింపబడి, అతనిని ఘనంగా కీర్తించిన వాల్మీకి అతడిని దేవుడిగా మార్చేశాడు! 

కాని, వాల్మీకి గుడ్డిగా రాముని పట్ల "వ్యక్తి ఆరాధన" కనబరచిన దాఖలాలు లేవు. తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుడిని పట్టుకుని - "నా సమకాలికులలో... 

1గుణవంతుడు 2వీరుడు 3ధర్మం తెలిసినవాడు 4కృతఙ్ఞతకలిగినవాడు 5సత్యవంతుడు 6దృఢవ్రతుడు 7మంచి నడవడిక కలిగినవాడు 8అన్ని ప్రాణుల పట్ల దయకలిగినవాడు 9విద్వాంసుడు 10సమర్థుడు 11దర్శనమాత్రంతో ఆహ్లాదం కలిగించేవాడు 12ఆత్మవంతుడు, 13కోపాన్ని జయించినవాడు 14 తేజస్వి 15అసూయలేనివాడు 16రోషం కలిగితే దేవతలను కూడా భయపెట్టగలిగినవాడు 

ఇన్ని గుణాలు కలిగినవాడు ఎవడున్నాడని" అడిగి, అవన్నీ కలిగినవాడు రాముడని నారదుడు చెప్పగా, తనకు సృష్టికర్త ప్రసాదించిన జ్ఞానంతో నారదుని మాటలు నిజమేనని తెలుసుకుని, అప్పుడు రామాయణ రచన చేశాడు.

అదీ వ్యక్తి ఆరాధన. 

అర్జునినితో సహా పాండవులు అందరూ శ్రీకృష్ణుని ఆరాధించారు. పాండవుల ప్రతి అభ్యుదయంలోనూ శ్రీకృష్ణుని పాత్ర సుస్పష్టంగా ఉన్నది. అతడు తమకు దూరమైనపుడు... 

"మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్, మన విభుడు, గురుడు, దేవర, మనలను దిగనాడి చనియె మనుజాధీశా!"

అని ఎంతగానో శోకించారు. అతడు లేని లోకంలో బ్రతకడం దుర్భరంగా తోచి రాజ్యాన్ని సంపదలను వదలుకొని మహాప్రస్థానానికి బయలుదేరారు.

అదీ వ్యక్తి ఆరాధన. 

అయితే ఒక్క విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తమ ఆరాధకులైన వాల్మీకిని గాని పాండవులను గాని వారు ఆరాధించిన వ్యక్తులు ఎన్నడూ అసంతృప్తికి గురిచేయలేదు. వారి నమ్మకానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. 

ముందుగానే చెప్పినట్టు, వారు చేసినది వ్యక్తి ఆరాధన అని మనం అంటున్నా, నిజానికది ఆ వ్యక్తులలో ఉన్న గుణాల ఆరాధన. అదే వ్యక్తిత్వ ఆరాధన కూడా.

ఈవిధంగా మహామహులే వ్యక్తి ఆరాధన చేశారు. తప్పేమీ లేదు. వ్యక్తి ఆరాధనను మన సంస్కృతి నిరుత్సాహపరచదు. అలాగని ప్రోత్సహించదు కూడా. ఎందుకంటే మనం ఆరాధింపబూనుకున్న వ్యక్తులు సరైనవారు కాకపోతే, తత్ఫలితంగా మంచిదైన మన వ్యక్తిత్వాన్ని కూడా బలవంతంగా చంపుకొనవలసి వస్తుంది. 

తనకు ఆశ్రయం కల్పించాడన్న ఒకే ఒక్క కారణంగా కర్ణుడు దుర్యోధనుని కోసం తనదైన వ్యక్తిత్వాన్ని చంపుకొనవలసి వచ్చింది. దుర్యోధనుడి వ్యక్తిత్వాన్నే తన వ్యక్తిత్వంగా స్వీకరించి దుష్టచతుష్టయంలో ఒకడిగా మిగిలిపోవలసి వచ్చింది.
***

ఈ విషయాలపై కుప్పలు తెప్పలుగా బోలెడన్ని ఉదాహరణలను ఇవ్వవచ్చు. కాని, అన్నం ఉడికిందని తెలుసుకొనేందుకు ఒకటి రెండు మెతుకులు చాలు కదా?

నేటి కాలంలో సర్వసుగుణాలూ మూర్తీభవించిన వ్యక్తి ఎవరూ లేరు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని సుగుణాలు ఉన్నాయి, కొన్ని దుర్గుణాలు కూడా ఉన్నాయి. సంపూర్ణ వ్యక్తి ఆరాధనకు తగినవారు ఎవరూ లేరు. ఉన్నారనే భ్రమలు కూడా ఎవరికీ లేవు. 

కాబట్టి హంసైర్యథా క్షీరమివామ్బుమధ్యే అన్నట్టు - నీటిని వదిలి పాలను స్వీకరించే రాజహంసల మాదిరి ఆయా వ్యక్తులలో సుగుణాలను మెచ్చుకుంటూ, దుర్గుణాలను ఖండిస్తూ తామరాకుపై నీటిబొట్టులా ఉండటమే మనం ఈనాడు చేయగలిగింది. 

అది మాత్రం ఎందుకని మౌనం ఆచరిస్తే మరీ మంచిది. మౌనం సర్వార్థసాధకం అవునో కాదో గాని, మౌనం మునేర్లక్షణం అనే మాట ప్రకారం, అది మునుల లక్షణం.

Monday, 26 December 2016

చెప్పండయ్యా చెప్పండి సమాజాన్ని ఉద్ధరించండి (6)

చెప్పండయ్యా చెప్పండి
సమాజాన్ని ఉద్ధరించండి
(6)


"ఆబ్రహ్మకీటజననీ"
లలితాసహస్రనామాలలో నాకు అన్నిటికంటె బాగా నచ్చిన పేరు ఇదే!
బ్రహ్మ మొదలుకొని ఓ కీటకం వరకు అందరూ ఆమె సంతానమట! 
<><><><><><>

భారతీయుల విగ్రహారాధన ప్రతీకాత్మకమైనదని, ఊహాతీతమైన దైవానికి నామరూపాలనాపాదించి కొలవడం భారతీయుల ఆరాధనపద్ధతుల్లో ఒకటని ఈ పేరు నిశ్చప్రచంగా మనకు సూచిస్తుంది.

అందరికీ తల్లి అయిన ఆ దేవతకు మనుషుల్లాగ ఒక ముఖము ఒక నోరు రెండు కళ్లు రెండు చేతులు రెండు కాళ్లు పెట్టి ఒక ఆకారాన్ని ఒక పేరును కల్పించి కొలవడం ఎటువంటిదంటే, ఒక మ్యాపును చూపించి ఇదే భారతదేశం అని బోధించడం వంటిది. 

ఆ మ్యాపును బాగా అర్థం చేసుకున్నవాడు దేశంలో ఎక్కడనుండి ఎక్కడకైనా సులువుగా ప్రయాణించగలడు. 

ఆ మ్యాపును దగ్గరగా పెట్టుకుంటే పొరపాటున దారి తప్పినా మరలా సరైన దారిని కనుక్కోవచ్చు. 

దిక్కులు దూరం etc. తెలుసుకొనేందుకు ఉపయోగపడే దిక్సూచి టెలిస్కోపు వంటి సాధనాలే భక్తి ధ్యానం పూజలు మొదలైనవి. ఆయా instruments దగ్గరున్నా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనివారికి అవి కేవలం బరువు దండగనిపించవచ్చు. వాటిని పారేసి పోదామనుకుంటారు. వాటి ప్రయోజనము ఉపయోగము ఒక్కసారైనా తెలుసుకున్నవారికి వాటి విలువ మరింతగా తెలుస్తుంది.

దేశమంతా ప్రత్యక్షంగా తెలిసినవారికి మరిక మ్యాపులు వంటివి అవసరం లేవు. అందుకే సన్న్యాసులకు సంధ్యావందనాదులు అవసరం లేదని శాస్త్రము చెప్పాయి కూడా. కాని క్రొత్తగా explore చేద్దామని బయలుదేరిన వారికి రకరకాల సాధనకు (సాధనాలు) అవసరపడతాయి. 

రాత్రి ఓ బస్సో రైలో ఎక్కి హాయిగా కళ్లు మూసుకుని నిద్ర పోయి, పొద్దున మళ్లీ కళ్లు తెరిచేసరికి గమ్యస్థానంలో ఉంటాం కదా మరెందుకిక మ్యాపులూ గీపులూ అనేవారున్నారు. వారు ధన్యులనే సమాధానం. ఆశ్రయించిన శిష్యులను అనుగ్రహించి సాక్షాత్తుగా దైవానుభూతిని కలిగించే సద్గురువులను గూర్చి వింటూ ఉంటాం కదా? ఆయా వాహనాల డ్రైవర్లు కూడా అలాంటివారే అనుకుందాం. :-) 

కాని ఆ సద్గురువులైనా ఆ డ్రైవర్లైనా తమకు తెలియని క్రొత్త తత్త్వానికో క్రొత్త గమ్యానికో చేర్చాలంటే మరలా ఈ మ్యాపులను, మైలురాళ్లను, ఊరి పేర్లు దిక్కులను సూచించే బోర్డులను జాగ్రత్తగా చూసుకుంటూ అవి సూచిస్తున్నట్లు పోవలసిందే! 

క్రొత్త కారులో జోరుజోరుగా వెళ్లేవారు కూడా ఈ మధ్య GPRS చెప్పినట్టు పోతున్నారు కదా! విమానాల్లోనూ విలాసనౌకల్లోనూ ఖండాంతరాలు దాటిపోయేవారికి ఇటువంటి సాధనాలు మరింత మరింత అవసరం.
<><><><><><>

కాబట్టి భారతీయుల విగ్రహారాధన అనేది సులువుగా దైవతత్త్వాన్ని అవగాహన చేసుకొని ఆ పరమార్థాన్ని త్వరగా అందుకొనేందుకు చేసే ప్రయత్నమే గాని మూర్ఖత్వం కాదు. విగ్రహాలను ధ్వంసం చేసి దేవుని ధ్వంసం చేశామని అహంకరించినవారు ~ మ్యాపును చింపేసి దేశాన్ని నాశనం చేశామనుకొనేవారికంటే పెద్ద తెలివైనవారు కారు. ఒక మ్యాపును చింపేస్తే మరో వంద మ్యాపులను తయారుచేసుకోవచ్చు.

కాని విగ్రహంలో మాత్రమే దేవుడున్నాడని కొలిచేవారు కూడా దేశాన్ని గాలికొదిలి మ్యాపుకు దండాలు పెట్టేవారికంటె పెద్ద గొప్పవాళ్లేం కాదు.
<><><><><><>

దేశం ఎక్కడ ఉంది? అని విచికిత్స చేస్తామా? 
మన ఇంట్లో దేశం ఉంది.
మన వీధిలో దేశం ఉంది.
మన కాలనీలో దేశముంది. 
మన ఊరిలో దేశముంది.
మన నియోజకవర్గంలో దేశముంది.
మన జిల్లాలో దేశముంది.
మన రాష్ట్రంలో దేశముంది.
......
ఇలా అనుకొనడం పిచ్చి కదా?
వీటిలో దేశముండడమేమిటి?
దేశంలోనే కదా ఇవన్నీ ఉన్నాయి?
......
దేశం దేశమంతటా ఉంది.
కదా?
......
అలాగే 
దేవుడెక్కడున్నాడు అని విచికిత్స చేసినా ఇదే పద్ధతి.
ఆ దేవుడు చెట్టులోనూ ఉన్నాడు.
పుట్టలోనూ ఉన్నాడు.
కొండలోనూ ఉన్నాడు.
విగ్రహంగా మారిన బండలోనూ ఉన్నాడు.
ప్రతి మనిషిలోనూ ఉన్నాడు 
అని ఏదో అర్థం చేసుకోలేని చిన్న పిల్లలకు చెప్పాలి.
కాని,
అసలు ఆ దేవునిలోనే ఈ చరాచరప్రపంచం ఉందనేది అసలు నిజం.
......
అనుభవైకవేద్యమని శాస్త్రాలు ఘోషించే అంతు తెలియని ఆ అవ్యయతత్త్వానికి ఈ విధంగా దేవుడు అని లింగవచనవిభక్తులు చేర్చడం, రూపాదులు కల్పించడం ఎటువంటిదంటే - గణితశాస్త్రంలో తెలుసుకొనవలసిన విషయాన్ని మొదటగా - X అనుకొనుము అంటూ చెప్పే పద్ధతి వంటిది మాత్రమే.
.......
1 నుండి మొదలు పెట్టి అనంతంగా ఎన్ని సంఖ్యలు చెప్పినా ప్రతి సంఖ్యలోనూ 1 అనే సంఖ్య ఉండి తీరుతుంది. ఎన్ని 1 లు కలిస్తే అంత పెద్దసంఖ్యగా మనం పరిగణిస్తాం కదా? కాబట్టి సంఖ్యాశాస్త్రంలో 1 సర్వాంతర్యామి.

అలాగే ఈ అంతు తెలియని విశ్వంలో "దేవ" అనే తత్త్వం సర్వాంతర్యామి.

ఆ దేవతత్త్వంలో అమ్మతనం కూడా ఒక అంశం.
అమ్మతనం మనను కడుపున మోసి కన్నతల్లిలో ఉంది. జత చేసిన ఫోటోలో చూపినట్లు - ఆ గాడిదలోనూ ఉంది, కోతిలోనూ ఉంది, ఆవులోనూ ఉంది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే అని తెలుసుగా? అటువంటి అమ్మతనం సర్వాంతర్యామిగా ఉంది. అందుకే అమ్మతనాన్ని దేవతానామాల్లో చేర్చారు పెద్దలు. 

ఆబ్రహ్మకీటజననీ - బ్రహ్మ మొదలుకొని కీటకం వరకూ అందరికీ - మనందరికీ - తల్లి అయిన - ఆమెకు నమస్కారాలు.

<><><><><><>
కాబట్టి, 
ఊసుపోని కబుర్లాపి
నిజతత్త్వాన్ని ప్రజలకు బోధించండి స్వాములూ! 
మన సంస్కృతి మీద సరైన అవగాహనను కల్పించండి! 
మన సదాచారాలను జనాలు సగర్వంగా పాటించేలా కువిమర్శలు చేసే వారి నోళ్లను జనాలే స్వయంగా మూయించగలిగేలా జ్ఞానబోధ చేయండి.

చెప్పండయ్యా చెప్పండి.
సమాజాన్ని ఉద్ధరించండి.
<><><><><><>

అందరికీ Mothers Day సందర్భంగా శుభాకాంక్షలు.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...