Showing posts with label Reason. Show all posts
Showing posts with label Reason. Show all posts

Wednesday, 6 February 2019

దేవుడు ఎందుకు కనబడటం లేదు?


దేవుడు ఎందుకు కనబడటం లేదు?

శ్రీకాంతుడు పదకొండు ఏండ్ల పిల్లవాడు. ఆరవతరగతి చదువుతున్నాడు. బడికి సంక్రాంతి సెలవులు ఇస్తే స్వగ్రామానికి వెళ్ళాడు. రెండు మూడు రోజుల పాటు తన తోటి పిల్లలతో కలసి గ్రామం చుట్టుపక్కల ఉండే కొండలు, కోనలు, తోటలు తిరిగాడు. పండుగ మూడు రోజులు ఎంతో హాయిగా సంతోషంగా హుషారుగా గడిపేశాడు. సెలవులు మరికొద్ది రోజులు ఉన్నాయి. అపుడు కుటుంబం అంతా కొంత దూరంలో ఉన్న తమ ఇలవేల్పు గుడికి ఎద్దులబండిలో వెడదామని అనుకున్నారు.

కాని, శ్రీకాంతుడు మాత్రం “నేను రాను” అన్నాడు.

“ఎందుకు?” అని అడిగితే, ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం అందరినీ నిర్ఘాంతపరచింది.

“నాకు దేవుడి మీద నమ్మకం లేదు. దేవుడు లేడు”

శ్రీకాంతుడి తాతగారు నవ్వేశారు. “సరే, ముందు మీరు వెళ్లండి! మేము నెమ్మదిగా నడుచుకుని వస్తాము” అని మిగిలిన అందరినీ పంపేశారు.

“రారా కాంతూ, మనం కూడా నెమ్మదిగా నడుచుకుంటూ పోదాం అక్కడికి” అన్నారు.

కాని, మళ్లీ అదే సమాధానం చెప్పాడు శ్రీకాంతుడు.

“సరే, అడవిలో ఏటి ఒడ్డున ఆ గుడి ఉంది. హాయిగా ఇసుకలో ఆడుకోవచ్చు కదా! అందుకైనా పోదాం పద” అన్నారు తాతగారు.

మొత్తానికి తాతామనుమళ్లు నడుచుకుంటూ బయలుదేరారు.

“దేవుడు లేడని ఎందుకు అనుకుంటున్నావు కాంతూ?” అని అడిగారు తాతగారు.

పిల్లవాడు వెంటనే బదులు చెప్పాడు – “ఉంటే కనబడాలి కదా, అదిగో – ఆ రాయిలాగా, ఆ చెట్టు లాగా, ఆ కొండలాగా? అవి ఉన్నాయి కాబట్టి కనబడుతున్నాయి. దేవుడు లేడు కాబట్టి కనబడటం లేదు” అనేశాడు.

“ఏదైనా కనబడకుంటే లేనట్టేనా? నీకు ఇపుడు అమ్మా నాన్నా కనబడటం లేదు, మనకంటే ముందే బండిలో వెళ్లిపోయారు. దూరంగా ఉండటం వలన కనబడటం లేదు. అందువల్ల వారు లేరంటావా మరి?”

“వారిని ఇప్పుడు చూడలేకపోతున్నా. కాని, రోజూ చూస్తూనే ఉన్నాను కదా?”

“ఎవరెస్టు శిఖరాన్ని ఒక్కసారి కూడా నువు చూడలేదు కదా? మరి అది కూడా లేదంటావా?”

“నేను చూడలేదు, నిజమే, కాని, దానిని చూసినవారు, ఫోటోలతో సహా అందరికీ చూపించారు కదా?”

తాత నవ్వాడు. “కాంతూ, నువు మీ నాన్నను చూశావు. మీ నాన్నకు నాన్న అయిన నన్ను చూస్తున్నావు. కాని, నాకు నాన్న అయిన మీ ముత్తాతను చూశావా? లేదు కదా? మరి ఆయన కూడా లేరు అనగలవా?”

“ముత్తాత కాలంలో ముత్తాత ఉన్నాడు తాతగారూ, నేను కాదనటం లేదు. కాని, ఇప్పుడు లేడు కాబట్టి, కనబడటం లేదు. కాని, దేవుడు అలా కాదు కదా, ఆయన అంతటా ఉన్నాడు అంటారు. ఆయన ఎప్పుడూ ఉన్నాడు అంటారు. మరి కనబడాలి కదా?”

తన మనుమడు తాను ఊహించిన దానికన్నా తెలివైనవాడు అని తాతగారికి అర్థమైంది. ఆయనకు సంతోషం కూడా కలిగింది. చిన్నతనంలోనే దేవుడి అస్తిత్వాన్ని గూర్చి తర్కంతో కూడిన ఆలోచన చేస్తున్నాడు. సరైన మార్గదర్శనం చేసేవారు ఉంటే ఇటువంటివారు భారతీయతను, సంస్కృతిని తరతరాలుగా చాటగలరు, నిలబెట్టగలరు.

“నాయనా, ఉన్న వస్తువు కూడా కనబడకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. మన పెద్దవాళ్లు చెప్పారు. వింటావా మరి?”

“సరే తాతగారూ!”

“అతిదూరాత్ సామీప్యాత్
ఇంద్రియఘాతాత్ మనోऽనవస్థాత్।
సౌక్ష్మ్యాత్ వ్యవధానాభిభవాత్
సమానాభిహారాచ్చ।।”

“అంటే ఏమిటి తాతగారూ?”

“అదేమంటే, కంటికి బాగా దూరంగా ఉండటం వల్ల, ఉన్న వస్తువు కూడా మనకు కనిపించదు. మన వూరికి తిరుపతి దూరంగా ఉన్నది కదా, అందువల్ల కనిపించదు. అలాగే, కంటికి మరీ దగ్గరగా ఉన్న వస్తువు కూడా కనిపించదు. నీ ముఖం నీకే కనబడదు, అద్దంలో చూసుకుంటే తప్ప! అవునా?”

“అవును తాతగారూ!”

“అలాగే, కంటికి ఏదైనా దెబ్బ తగిలినపుడు, కంటి రోగం ఉన్నపుడు కూడా, ఉన్న వస్తువు కనిపించదు. చూడు, మీ అవ్వ కండ్లద్దాలు పెట్టుకుంటే తప్ప పుస్తకం చదవలేదు.”

“అవును తాతగారూ!”

“సరే, మనం ఇప్పటికి చెరువు కట్ట మీద ఇంత దూరం నడుచుకుని చివరకు వచ్చేశాము కదా, కట్టకు ఇటువైపున వేప చెట్లు, చింత చెట్లు బోలెడు ఉన్నాయి కదా? ఏవి ఎన్ని ఉన్నాయో చెప్పగలవా?”

“చెప్పలేను తాతగారూ!”

“అంటే, నువు వాటిని చూడలేదా?”

“చూశాను తాతగారూ!”

“మరి ఎందుకు చెప్పలేవు?”

“ఎందుకంటే, నేను వాటిని చూస్తూనే ఉన్నప్పటికీ, మీ మాటలను శ్రద్ధగా వింటున్నాను తప్ప, అవి ఎన్నెన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అనే శ్రద్ధ నాకు కలగలేదు కాబట్టి”

“అవును కదా? అలాగే, దేవుడు ఉన్నప్పటికీ, మనకు శ్రద్ధాసక్తులు లేకుంటే మనం ఆ దేవుని నిజస్వరూపాన్ని గ్రహించలేము. ఒప్పుకుంటావా?”

శ్రీకాంతుడు కాసేపు ఆలోచించాడు. “మీరు చెబుతుంటే నిజమే అనిపిస్తోంది తాతగారూ!”

తాతగారు నవ్వారు. “ఇంకా చెబుతాను చూడు. ఒక వస్తువు ఉన్నప్పటికీ, సూక్ష్మంగా ఉంటే చూడలేము. నువ్వు సైన్సు విద్యార్థివే కదా, మన చుట్టూ ఉన్న వాతావరణంలో సూక్ష్మజీవులు ఉన్నాయి అని తెలిసినవాడివే కదా, మనకు అవి కనబడటం లేదు కదా?”

“నిజమే తాతగారూ, అవి మన కంటికి కనబడనంత చిన్నవి కాబట్టి కనబడటం లేదు.”

“కాంతూ, మన శరీరంలో గుండె ఉంది కదా? అది నీకు కనబడుతుందా?”

“కనబడటం లేదు తాతగారూ!”

“ఎందువల్ల కనబడటం లేదు?”

“చర్మం వెనుక ఉంది కదా, అందువల్ల కనబడటం లేదు.”

“అంటే, ఏదైనా అడ్డం ఉంటే కనబడదు. కదా?”

“అవును!”

“నక్షత్రాలు ఉన్నాయి కదా?”

“ఉన్నాయి.”

“మరి, అవి ఇప్పుడు ఎందుకు కనబడటం లేదు?”

“పగలు కాబట్టి.”

“అదేమిటి? రాత్రి పూట కంటే, పగటి పూట మనం మరింత బాగా చూడగలం కదా?”

“అంటే, సూర్యుడు నక్షత్రాలకంటే ఎక్కువ కాంతితో ప్రకాశిస్తాడు. అందువల్ల, ఆయన కాంతి ముందు ఇంకేవీ కనబడవు.”

“పోనీ, సూర్యుణ్ణి అయినా నేరుగా చూడగలవా?”

“ఎలా సాధ్యం? అంత కాంతిని చూస్తే మన కళ్లు తట్టుకోలేవు!”

“కాంతూ! నువ్వెప్పుడైనా గురివింద గింజలను చూశావా?”

“చూశాను తాతగారూ!”

“ఇదుగో! ఈ చెట్టుకు కాశాయి చూడు!” అంటూ తాతగారు, దారిలో ఒక పొదలో ఉన్న గురువింద చెట్టుకు ఉన్న కొన్ని కాయలను కోసి దానిలోనుండి ఎరుపు నలుపు రంగులలో ఉన్న గురివింద గింజలను అరచేతిలో పెట్టుకున్నాడు.

“కాంతూ, ఇందులో ఒక గింజను తీసుకో!”

శ్రీకాంతుడు ఒకదానిని తీసుకున్నాడు. “ఎంత నునుపుగా ఉందో!” అన్నాడు.

“సరే, చూశావుగా! ఇక ఆ గింజను మళ్లీ నా అరచేతిలో పెట్టు!”

శ్రీకాంతుడు అలాగే చేశాడు. తాతగారు తన రెండు అరచేతులనూ దగ్గరగా చేర్చి లోపల ఉన్న గింజలను కాసేపు అల్లాడించి మళ్లీ తెరిచి ఆ గింజలను చూపించాడు.

“ఏదీ? నువ్వు ఇంతకు ముందు ఒక గింజను చేతిలో పట్టుకుని చూశావే? మళ్లీ అదే గింజను బయటకు తీసి చూపించు?” అని అడిగాడు.

శ్రీకాంతుడు ఆశ్చర్యపోయాడు. “అదెలా సాధ్యం తాతగారూ? అన్నీ ఒకేవిధంగా ఉన్నాయి కదా? ‘నేను చేతిలోకి తీసుకుని చూసింది ఇదే’ అని ఎలా గుర్తు పట్టగలను?” అని అడిగాడు.

తాతగారు నవ్వారు. “చూశావా నాయనా! మన కండ్లు ఎంతో గొప్పవి అనుకుంటాం. కాని, వీటికి ఎన్నెన్ని పరిమితులు అంటే లిమిటేషన్స్ ఉన్నాయో అర్థం చేసుకున్నావా? అందువల్ల ఇటువంటి అల్పమైన శక్తి కలిగిన కండ్లతో అపరిమితమైన శక్తి కలిగిన దేవుడిని చూడడం సాధ్యమా?” అని అడిగాడు.

శ్రీకాంతుడు కాసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత, “తాతగారూ, మీరు ఇపుడు చెప్పింది అంతా బాగా అర్థమైంది” అని చెప్పాడు చిరునవ్వులు చిందిస్తూ.

గుడికి వచ్చి, శ్రద్ధగా పూజలో పాల్గొంటున్న శ్రీకాంతుడిని చూసి, “నడచి వచ్చేటపుడు తాతగారు ఏమి మంత్రం వేశారో” అని అందరూ ఆశ్చర్యపడినప్పటికీ, చాల సంతోషపడ్డారు.
***



యథార్థభారతి (జనవరి, 2019) సంచికలో ప్రచురింపబడిన నా కథ.

Saturday, 14 April 2018

తనదాకా వస్తే కానీ


సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారు.  సీతను అపహరించజూచిన విరాధుని రామలక్ష్మణులు సంహరించారు.  శరభంగమహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు.  అక్కడ వానప్రస్థులైన వైఖానస-వాలఖిల్యాది మునులు అనేకులు రాముని సందర్శించారు.
शरभङ्गाश्रमे रामम् अभिजग्मुश्च तापसाः। (రామాయణం.3.6.6)
నాయనా, మేము దుంపలను ఫలాలను మాత్రమే భుజిస్తూ మా ధర్మాలను మేము నిర్వర్తిస్తూ ఉన్నాము.  శాస్త్రం ప్రకారం మా ధర్మఫలంలో నాల్గవభాగం మమ్మల్ని రక్షించే ప్రభువుకు చెందుతుంది.     
तत्र राज्ञश्चतुर्भागः प्रजा धर्मेण रक्षतः। (రామాయణం.3.6.14)
“కాబట్టి మా తపోధనంలో నాల్గవభాగం (25%)  మేము మీకు పన్ను కడుతున్నట్టే లెక్క.   ప్రజల ఆదాయం నుండి కనీసం ఆరవభాగం (17%) పన్నుగా స్వీకరించి కూడా ఆ ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడని ప్రభువుకు గొప్ప అధర్మం కలుగుతుంది”.
अधर्मस्तु महांस्तात भवेत्तस्य महीपतेः।
यो हरेद्बलिषड्भागं न च रक्षति पुत्रवत्।।  (రామాయణం.3.6.11)
అంటూ స్పష్టం చేశారు.  ముందరి కాళ్ళకు బంధం వేశారు.  అప్పుడు తమ బాధలను చెప్పుకున్నారు –
“రామా!  రాక్షసులు చాలామంది మునులను నిష్కారణంగా చంపేశారు.  ఇదుగో, వారి శరీరాలు దగ్గరలోనే పడి ఉన్నాయి.  వచ్చి చూడు”.
एहि पश्य शरीराणि मुनीनां भावितात्मनाम्।
हतानां राक्षसैर्घोरैः बहूनां बहुधा वने।। (రామాయణం.3.6.16)
“మేము నిన్ను శరణు కోరుతున్నాము.  ఓ వీరుడా!  నీవు తప్ప మాకు మరో దిక్కు లేదు.  మమ్మల్ని ఆ రాక్షసుల బారినుండి కాపాడు”.
రాముడు ఆ మాటలను విని ఆవేదన చెందాడు.
“అయ్యలారా!  మీరు నన్ను ఈ విధంగా వేడుకొనడం తగదు.  మీ మాటలు నాకు ఆజ్ఞగా భావిస్తాను.  మీ మాటపై ఎవరి జోలికీ పోని తపస్వులకు శత్రువులైన రాక్షసులను యుద్ధంలో చంపదలచుకున్నాను” అని మాట ఇచ్చాడు.
नैवमर्हथ मां वक्तुम् आज्ञप्तोऽहं तपस्विनाम्। (రామాయణం.3.6.21)
तपस्विनां रणे शत्रून् हन्तुमिच्छामि राक्षसान्।  (రామాయణం.3.6.25)
తరువాత సీతారామలక్ష్మణులు మరలా అరణ్యంలో సంచారం ప్రారంభించారు.  ఆ సందర్భంలో సీతమ్మ రాముని ఒక మాట అడిగింది.
“ఓ రాఘవా!  వినా వైరం రౌద్రతా (ఎటువంటి వ్యక్తిగతశత్రుత్వం లేకపోయినప్పటికీ వేరొకరిని చంపబూనడం) ఎంతవరకు సమంజసం?  దండకారణ్యంలో ఉన్న రాక్షసులతో ఎటువంటి శత్రుత్వమూ నీకు లేదు.  వారిని నీవు నిష్కారణంగా సంహరించడం నాకు ఇష్టం లేదు.
बुद्धिर्वैरं विना हन्तुं राक्षसान् दण्डकाश्रितान्।
अपराधं विना हन्तुं लोकान् वीर न कामये।।(రామాయణం.3.9.25)
“మనం ఇప్పుడు వనవాసం చేస్తున్నాం.  కాబట్టి తపస్సు మాత్రమే చేసుకోవాలి.  మళ్ళీ అయోధ్యకు వెళ్లి మీరు రాజు ఐన తరువాత మరలా క్షత్రియధర్మం పాటించుదురు గాని.
देशधर्मस्तु पूज्यताम्। (రామాయణం.3.9.28) 
भवेस्त्वं निरतो मुनिः। (రామాయణం.3.9.28)
पुनर्गत्वा त्वयोध्यायां क्षत्त्रधर्मं चरिष्यसि। (రామాయణం.3.9.28)
{అంతవరకు రాక్షసులతో యుద్ధం గిద్ధం అనే మాటలు పక్కన పెట్టండి}”
అని స్పష్టంగా చెప్పింది.
రాముడు సీతమ్మకు తగిన సమాధానమే చెప్పాడు –
हितमुक्तं त्वया देवि त्वयैवोक्तमिदं वचः।
क्षत्त्रियैर्धार्यते चापो नार्तशब्दो भवेदिति।। (రామాయణం.3.10.3/4)
“ఓ దేవీ!  ఇంతకు మునుపు నువ్వే నాతో ఒకసారి ఒక మంచి మాట చెప్పావు గుర్తుందా?  ఆర్త శబ్దం వినబడకుండా ఉండేందుకే క్షత్రియులు ధనుస్సును (ఆయుధాన్ని) ధరిస్తారు అని?” అన్నాడు.
“నీవు తప్ప మాకు వేరే దిక్కు ఎవరూ లేరు అని ఆ మునులు నాతో మొర పెట్టుకున్నారు.  వారి ఆర్తిని క్షత్రియుడనైన నేను దూరం చేయకుండా ఎలా ఉండగలను?  అందువల్లనే వారిని కాపాడతానని మాట ఇచ్చాను.  ఇపుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎలా ఉండను?  నా ప్రాణాన్నైనా వదులుకుంటాను.  నిన్నూ, లక్ష్మణుడిని కూడా  వదులుకుంటాను గాని, ఇచ్చిన మాటను మాత్రం వదులుకోలేను”.
अप्यहं जीवितं जह्यां
त्वां वा सीते सलक्ष्मणाम्
न तु प्रतिज्ञां संश्रुत्य। (రామాయణం.3.10.19)
“అసలు వారు నన్ను అడగకున్నా వారిని కాపాడటం నా కర్తవ్యం.  ఇక మాట ఇచ్చిన తరువాత మరొకవిధంగా నేను చేయలేను” అంటూ స్పష్టంగా చెప్పాడు.
||
తనదాకా వస్తే కానీ
||
అనంతరకాలంలో శూర్పణఖ సీతమీద దాడికి దిగబోయింది.  లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపించాడు.  ఆమె తన సోదరులైన ఖరదూషణత్రిశిరులను రామలక్ష్మణుల మీదికి ఉసిగొలిపింది.  రాముడు వారిని వారి పద్నాలుగు వేలమంది అనుచరులతో సహా చంపేశాడు.  అపుడు సీత భయం తొలగి ఆనందించింది.
बभूव हृष्टा जनकात्मजा। (రామాయణం.3.30.41)
ధర్మాధర్మాలు ఎలాగున్నా, తన అనుచరులను చంపినందుకు రావణుడు రామునిపై ప్రతీకారం తీర్చుకోదలిచాడు. 
కాని, “ఓ రావణా!  నువు రాముని యుద్ధంలో జయించలేవు”
न हि रामो दशग्रीव शक्यो जेतुं त्वया युधि।  (రామాయణం.3.31.27)
అని అకంపనుడు స్పష్టంగా చెప్పిన మీదట, రామునితో నేరుగా తలపడే దమ్ము రావణుడికి లేకపోయింది.  కాని, అదే అకంపనుడు రావణుడికి మరో ఉపాయం చెప్పాడు.
तस्यापहर भार्यां त्वं प्रमथ्य तु महावने।
सीतया रहितः कामी रामो हास्यति जीवितम्।। (రామాయణం.3.31.31)
“రావణా!  రాముని ఎలాగైనా మోసం చేసి, అతని భార్య ఐన సీతను ఎత్తుకొచ్చేయ్.  కామాత్ముడైన రాముడు సీత లేకపోయేసరికి ప్రాణాలు వదిలేస్తాడు’’ అని చెప్పాడు.
రావణుడికి ఆ మాట నచ్చింది. 
अरोचयत तद्वाक्यं रावणो राक्षसाधिपः। (రామాయణం.3.31.32)
చివరకు రావణుడు అలాగే చేశాడు. మారీచుడితో కలసి మాయను పన్ని, సీతను ఎత్తుకొచ్చేశాడు.  వారి పన్నాగం దాదాపు ఫలించినట్టే అనిపించింది.  సీత కనబడకపోయేసరికి రాముడికి మతి పోయినంత పనైంది.  పాపం ఏడిచాడు.  సీత ఏదీ ఏదీ అని కనిపించిన చెట్టు పుట్టలను అడిగాడు.  పక్షులను జంతువులను అడిగాడు.  ఆమె ఎటువంటి బాధలు పడుతోందో అని వగచాడు.  కానీ, ఆ బాధ త్వరలోనే కోపంగా మారింది.
సీతను ఎత్తుకుపోయింది వీరే అని ఎవరిమీదనైనా అనుమానం వస్తే వారిమీదకు కోపంతో ఉరకబోయాడు.  నన్ను చేతగానివాడని భావిస్తున్నారేమో!
निर्वीर्य इति मन्यन्ते नूनं माम्। (రామాయణం.3.64.57)
“సీత క్షేమంగా ఉండకపోతే నా బాణాలతో ముల్లోకాలకూ మర్యాదలు లేకుండా చేస్తాను.  (సరిహద్దులనేవి లేకుండా ధ్వంసం చేసి పారేస్తాను.)” అనేంతవరకూ పోయాడు.
निर्मर्यादान् इमान् लोकान् करिष्याम्यद्य सायकैः। (రామాయణం.3.64.71)
చివరకు తన కోపాన్ని సక్రమమైన మార్గంలోనికి మలిచాడు.  సుగ్రీవునితో స్నేహం చేశాడు.  అతడు పోగొట్టుకున్న రాజ్యం అతనికి వచ్చేలా చేశాడు.  హనుమంతుడు సీతమ్మ ఎక్కడ ఉన్నదో వెతుకుతూ లంకకు చేరుకున్నాడు.  అశోకవనంలో ఆమెను చూశాడు.  “తల్లీ, నువు నాతో వస్తే నిన్ను రాముని వద్దకు చేరుస్తాను” అన్నాడు.
కాని, సీతమ్మ అందుకు ఒప్పుకోలేదు.  “అలా కాదు” అన్నది.
यदि रामो दशग्रीवम् इह हत्वा सबान्धवम्।
मामितो गृह्य  गच्छेत तत् तस्य सदृशं भवेत्।। (రామాయణం.3.37.64)
“రాముడు స్వయంగా వచ్చి, ఈ రావణాసురుడిని అతడి బంధువులందరితో సహా చంపి, నన్ను సగౌరవంగా ఇక్కడినుండి తీసుకుని పోతే అది అతని బలపరాక్రమాలకు తగిన విధంగా ఉంటుంది” అన్నది.

చివరకు రామునికి అంతపని చేయక తప్పలేదు.  అందుకే, తనదాకా వస్తే గాని, ఒక ఆదర్శంలో ఔచిత్యం తెలియదని పెద్దలు అంటారు.
{భక్తులకు గమనిక – ఈ సందర్భంలో సీతమ్మ వారిని సాధారణ మానవస్త్రీ గా మాత్రమే పరిగణించి ఈ వ్యాసము వ్రాయడమైనది.) 


Monday, 26 March 2018

వాలి అభినివేశం - రాముని సంయమనం



వాలిసుగ్రీవుల అంతిమయుద్ధం ప్రారంభమైంది.
*
తౌ భీమబలవిక్రాన్తౌ సుపర్ణసమవేగినౌ  ఇద్దరూ భయంకరమైన బలపరాక్రమాలు కలిగినవారు.  గరుత్మంతునితో సమానమైన వేగం కలిగినవారు.  ఘోరవపుషౌ ఉన్నతమైన భీకరమైన శరీరాలు కలిగినవారు.  అటువంటి వారిద్దరూ అన్నదమ్ములు.  అన్నదమ్ములై పుట్టి ఒకరినొకరు చంపుకోవాలి అన్నంత కక్ష వారిలో ఎందుకు పెరిగింది?  ప్రపంచంలో ఎక్కడైనా పరస్పరం కలహించుకునే సోదరులు కనిపిస్తే వారిని వాలిసుగ్రీవులు అని పోల్చేంత వైరం వీరి మధ్యలో ఎందుకు కలిగింది?
}}}{{{
ఒకప్పుడు వానరరాజ్యమైన కిష్కింధకు వాలి రాజుగా, సుగ్రీవుడు యువరాజుగా ఉండేవారు.  అలా ఉండగా ఒకసారి మాయావి అనే దానవుడు వాలిని యుద్ధానికి రమ్మని సవాలు చేసి, తీరా అతడు వచ్చేసరికి, భయపడి పారిపోయాడు.  వాణ్ణి వదలనంటూ వాలి వెంటబడ్డాడు.  సుగ్రీవుడు అన్నకు తోడుగా అనుసరించాడు.  మాయావి పారిపోయి ఒక బిలంలో దూరిపోయాడు.  “సుగ్రీవా, నువ్వు ఇక్కడే ఉండు, వాణ్ణి చంపిగాని బయటకు రానుఅని వాలి ఆ బిలంలోనికి దూరి వెళ్లాడు.
అలా మాయావిని చంపేందుకు తాను బిలంలో దూరినపుడు బయట ఉండిన సుగ్రీవుడు, తనను మళ్లీ బయటకు రానివ్వకుండా బిలానికి పెద్ద బండరాయిని అడ్డుగా మూసి, స్వయంగా తానే రాజయ్యేందుకు కుట్ర పన్నాడని వాలి ఆరోపణ.  సంవత్సరం పాటు ఎదురు చూశాక బిలం నుండి బయటకు రక్తప్రవాహం రావడం చూసేసరికి, అన్న ఆక్రందనలు వినబడేసరికి, మహావీరుడైన తన అన్ననే చంపగలిగిన మాయావినుండి తమ రాజ్యానికి కూడా ప్రమాదం రాగలదని శంకించి, ఆ మాయావి మరలా బిలం నుండి బయటకు రాకూడదనే ఉద్దేశంతో బిలాన్ని మూసివేశానని సుగ్రీవుని సంజాయిషీ. సరే, వాలి మాయావిని చంపేసి, తరువాత ఆ బిలానికి అడ్డుగా ఉంచిన రాయిని పగులగొట్టి తిరిగి వచ్చేసరికి సుగ్రీవుడు రాజుగా ఉన్నాడు.  నిజానికి అన్నను నిగ్రహించి రాజు కావాలనే ఆశ ఉండి ఉంటే సుగ్రీవునికి ఆ సమయంలో తగినంత సామర్థ్యం ఉండింది.  కాని, అప్పటికి అన్న అనే గౌరవం మెండుగా ఉండడంవల్ల సుగ్రీవుడికి అటువంటి తలంపే పుట్టలేదు.
{నిగ్రహేపి సమర్థస్య న ప్రావర్తత బుద్ధిః భ్రాతుర్గౌరవయంత్రితా. (రామాయణం ౪.౯.౨౩)}
తప్పైంది అన్నా, మరలా నువే రాజువు కా అన్నా.  త్వమేవ రాజా మానార్హఃఅని వాలి పాదాల చెంత తల పెట్టి ప్రణమిల్లాడు సుగ్రీవుడు.  {బలాదస్మి సమాగమ్య మన్త్రిభిః పురవాసిభిః రాజభావే నియుక్తోహం శూన్యదేశజిగీషయా (రా.౪.౧౦.౧౦)} రాజపదవి ఖాళీగా ఉంటే ఆ రాజ్యాన్ని జయించాలనే కోర్కె శత్రువులకు పుడుతుంది.  అందువల్ల మంత్రులు, పురజనులు కలిసి నన్ను రాజుగా బలవంతంగా నియమించారు.  (కేవలం ఆ కారణం వల్లనే నేను కూడా అంగీకరించవలసి వచ్చింది)అని సవినయంగా వివరించాడు.
అయినా వాలి క్రోధం చల్లారలేదు.  సుగ్రీవుని చంపదలిచాడు.  {స మాం జిఘాంసుః(రా.౪.౪౬.౧౦)}  సుగ్రీవుడు తన రాజ్యాన్ని తీసుకొనడం మాత్రమే ఆ కోపానికి కారణంకాదు.  వేరే మరొక కారణం ఉంది.  అన్నదమ్ములు చనిపోతే వారి భార్యలను స్వీకరించడం ఆ వానరజాతుల్లో సహజం.  ఆ పద్ధతిలో, వాలి చనిపోయాడు అనే తలంపుతో అతని భార్య ఐన తారను సుగ్రీవుడు తన భార్యగా సంగ్రహించాడు.  మరలా అదొక్కటే కారణం కాదు, వాలికి సుగ్రీవుని భార్య అయిన రుమ మీద కన్ను ఉంది.  కాబట్టి, వాలి రుమను పొందాలంటే సుగ్రీవుడు చావాలి.  అందువల్ల, సుగ్రీవుని చంపడమే మంచిదని వాలి భావించాడు.  సుగ్రీవుడు ప్రాణాలు దక్కించుకొనేందుకు పారిపోయాడు.  అయినా వాలి వదలలేదు.  వెంటబడి తరిమాడు.  {తతోహం వాలినా ప్రధావితః. (రా.౪.౪౬.౧౨)}  సుగ్రీవుడు ఎక్కెక్కడకు వెళ్లినా అక్కడకు తరుముకుంటూ వెళ్లాడు.  చివరకు శాపకారణంగా, వాలి అడుగుపెట్ట సాహసించలేని మతంగమహర్షి ఆశ్రమం కలిగిన ఋష్యమూకపర్వతంపై సుగ్రీవుడు తలదాచుకున్నాడు.  ఆ విధంగా ఎలాగో తప్పించుకున్నాడు.  ఇంకా బ్రతికే ఉన్నాడు.  కాని, వాలి అధికారమదంతో రుమను బలాత్కారంగా తన భార్యగా గ్రహించాడు.  సుగ్రీవుని ఏదో ఒక విధంగా చంపించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.  ఈవిధంగా సుగ్రీవుడు తన రాజ్యాన్ని అన్యాయంగా అపహరించాడు అనేది వాలికి కేవలం ఒక సాకు మాత్రమే.  అసలైన కారణం తమ్ముని భార్య మీద వ్యామోహం.
ఆ సమయంలో సుగ్రీవునికి శ్రీరాముడు మిత్రునిగా లభించాడు.  వాలి చేసిన అధర్మాన్ని, సుగ్రీవుని భయాన్ని శ్రీరాముడు అర్థం చేసుకున్నాడు.  “రామా!  నాకు మేలు చేకూర్చడానికి ఈరోజే వాలిని చంపెయ్”  {తమద్యైవ ప్రియార్థం మే వాలినం జహి కాకుత్స్థ (రా.౪.౧౨.౧౧)} అని, ఎన్నో కఠినమైన కష్టాలను అనుభవించిన ఉద్వేగంతో సుగ్రీవుడు రాముని కోరాడు. 
సరే, నువే స్వయంగా మీ అన్నను యుద్ధానికి పిలిచి చంపేసెయ్.  నీకు చేతగాని పక్షంలో నేను చంపేస్తాఅన్నాడు రాముడు.
అలా మొదలైంది వాలిసుగ్రీవుల అంతిమయుద్ధం.
}}}{{{
తర్జయానౌ పరస్పరం ఇద్దరూఒకరినొకరు బెదిరించుకుంటూ, నిన్ను అలా చంపుతా, ఇలా చంపుతా అని పరస్పరం ఆవేశంతో సవాళ్లు విసురుకుంటూ, “వృక్షైః సశాఖైః శిఖరైః వజ్రకోటినిభైర్నఖైః ముష్టిభిర్జానుభిః పద్భిః బాహుభిశ్చ పునః పునః” - చెట్లను పీకి చావబాదుకుంటూ, గండశిలలను ఎత్తి విసురుకుంటూ,  పదునైన గోళ్లతో చీల్చుకుంటూ, పిడికిళ్లతో పొడుచుకుంటూ, మోకాళ్లతో కుమ్ముకుంటూ, ఎగిసి కాళ్లతో తన్నుకుంటూ, అరచేతులతో చరచుకుంటూ, ఎదుటివాడిని చేతుల్లో బంధించి నొక్కి చంపేయాలంటూ ప్రాణాలకు తెగించి యుద్ధం చేశారు.  ఇద్దరి శరీరాలూ రక్తం వోడుతున్నాయి.  ఇలా చిరకాలం పోరాడిన పిమ్మట – “వాలినా భగ్నదర్పస్తు సుగ్రీవో మంద విక్రమః” – వాలి చేతిలో సుగ్రీవునికి గర్వభంగమై అతని పరాక్రమం సన్నగిల్లింది.  
రాముని సహాయం కోసం దిక్కులు చూడటం మొదలు పెట్టాడు.  వాలిసుగ్రీవులు ఉభయులూ రూపంలో ఒకే విధంగా ఉన్నప్పటికీ, గజపుష్పమాలనుధరించిన సుగ్రీవుడిని రాముడు గుర్తుపట్టగలిగాడు.



సుగ్రీవునికి తన సహాయం అవసరమైందని గ్రహించి, శ్రీరాముడు వెంటనే తన కోదండానికి శరసంధానం చేశాడు.  ప్రళయకాలభీకరమైన ఆ బాణం తగిలి ఇంద్రధ్వజంలా వాలి కూలిపోయాడు.  అంత పెద్ద దెబ్బతిన్నప్పటికీ, శక్రదత్తా వరా మాలా దధార హరిముఖ్యస్య ప్రాణాన్” – ఇంద్రుడు ఇచ్చిన మాల ధరించి ఉండడం వల్ల వాలి ప్రాణాలు వెంటనే పోలేదు.
అపుడు రామలక్ష్మణులు ఇద్దరూ తన చెంతకు రావడం చూచి, వాలి రాముడిని చాల పరుషంగా నిందించాడు.


నువ్వు ఓ రాజకుమారుడివి.  గొప్ప వంశంలో పుట్టినవాడివి.  ధర్మం చదువుకున్న వాడివి.  బలవంతుడివి. నువ్వు కరుణ కలిగినవాడివని, ప్రజలకు హితం చేసేవాడివని అందరూ నీగురించి చెబుతూ ఉంటారు.  కాని, నేను వేరొకరితో యుద్ధం చేస్తూ ఉండగా నన్ను ఎందుకు ఇలా బాణంతో కొట్టావు?  నా భార్య తార నన్ను హెచ్చరించినా నేను కాలవశుడనై ఆమె మాటలను ఖాతరు చేయక సుగ్రీవుడితో యుద్ధానికి వచ్చాను.  ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము, సహనము, ధర్మాచారణము, అపరాధులను దండించడము ఇవి రాజలక్షణాలు కదా?  మరి నన్ను ఎందుకు బాణంతో కొట్టావు?  నీవు అధర్మపరుడవు.  పాపాలను చేసే వాడవు.  గడ్డి చేత మూయబడి బయటకు కనబడని బావి వంటి వాడవు.  నీకు గాని, నీ ప్రాంతానికి గాని ఎటువంటి హానినీ నేను చేయలేదు.  నన్ను ఎందుకు కొట్టావు?  సాధారణంగా భూమి కోసమో డబ్బు కోసమో రాజు యుద్ధం చేస్తాడు.  కాని, నేను పండ్లూ దుంపలూ తింటూ అడవుల్లో తిరిగే వానరుడిని.  నన్ను ఎందుకు కొట్టావు?  నిరపరాధినైన నన్ను ఎందుకు కొట్టావు?  నా చర్మం గాని, నా రోమాలు గాని, నా ఎముకలు గాని, నీకు ఉపయోగపడవే?  మరి ఎందుకు కొట్టావు?  నా మాంసం నీకు తినరానిది.  మరి ఎందుకు కొట్టావు?  నేను యుద్ధంలో దుర్జయుడను.  నాతో నేరుగా యుద్ధానికి దిగి ఉంటే ఈపాటికి యముడిని చూసి ఉండేవాడివి.  సుగ్రీవుడిని బదులు ముందు నన్నేఅడిగి ఉంటే రావణాసురుడిని చావబాది, వాడి గొంతుకు తాడు కట్టి ఇగ్గుకొచ్చి నీకు అప్పగించేవాడిని.  సీతను ఎక్కడ దాచి ఉన్నా నీకు తెచ్చి ఇచ్చి ఉండేవాడిని.కాని, సుగ్రీవుడికి మేలు చేయడం కోసం నీవు నన్ను చంపదలిచావు.  అది అనుచితం.  సమాధానం చెప్పుఅంటూ ఆక్రోశించాడు.
}}}{{{
రాముడు వాలికి తగిన సమాధానం ఇచ్చాడు.  అవేమిటో తెలుసుకొనే ముందు,  వాలి మాటలలోనే మనకు తెలిసిపోయే కొన్ని నిజాలను పరిశీలిద్దాం.
1         రాముడు ఎవరో, అతడు ఎంతటి శక్తివంతుడో, అతడు ఎటువంటివాడని అందరూ భావిస్తున్నారో కర్ణాకర్ణిగా వాలికి ఖచ్చితంగా ముందే తెలుసు.
2         రావణాసురుడి ద్వారా ఆ రాముడికి ఎటువంటి అపకారం జరిగిందో కూడా తెలుసు.
3         రాముడు తన తమ్ముడైన సుగ్రీవుడితో స్నేహం చేశాడని తెలుసు.
4         అటువంటి పరిస్థితులలో సుగ్రీవుడితో యుద్ధం చేస్తే తనకు ప్రమాదం పొంచి వుంటుందని కూడా తెలుసును.
ఇప్పుడు చూద్దాం, ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ వాలి చేసిన పొరపాట్లు ఏమిటో
రామసుగ్రీవుల స్నేహం గూర్చి తెలుసుకున్నప్పటికీ వాలి కలవరపడలేదు.  ఆ రాముడు సత్త్వవంతుడు, తేజస్వి,(రా.౪.౧౭.౧౪) జితోత్సాహుడు, సమయజ్ఞుడు (రా.౪.౧౭.౧౬) అని తెలిసినప్పటికీ, అటువంటివాడు సుగ్రీవుడితో స్నేహం చేశాడే,  అందువల్ల సుగ్రీవుని బలం పెరిగింది కదాని భయపడలేదు.  ఆ రాముడు సానుక్రోశుడు (రా.౪.౧౭.౧౬) అంటే తనను ఆశ్రయించినవారి దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేవాడు (కాబట్టి, సుగ్రీవుని దుఃఖాన్ని పోగొట్టేందుకుగాను తనను అణచివేసేందుకు ప్రయత్నం చేస్తాడు) అని తెలిసినా తూష్ణీంభావం వహించాడు.  తన బలంపై వాలికి అపారమైన నమ్మకం.  ఎవడినైనా నేను ఓడించగలను అని అతివిశ్వాసంతో ప్రతిక్రియారహితుడై ఉండిపోయాడు.  అది ఉత్తమమైన రాజనీతి కాదు.  అది సంపూర్ణంగా అతడి నిర్లక్ష్యం.  వేరొక బలవంతుడు ఉంటే అతడిని వెంటనే నిగ్రహించాలి.  లేదా, అతడితో స్నేహమైనా చేయాలి.  అతడితో స్నేహం ఇష్టం లేకుంటే అతడి శత్రువుతోనైనా స్నేహం చేయాలి.  అది చక్కని రాజనీతి.  కాని, వాలి ఇవేమీ చేయలేదు. బలవంతుడైన రామునితో మైత్రికి ప్రయత్నం చేయలేదు.  కనీసం రామసుగ్రీవుల మధ్య భేదం కల్పించేందుకు కూడా సంకల్పించలేదు.  సరే, ఆ రకంగా వాలి నిర్లక్ష్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నాడు కాబట్టి, అతడిని ఎవరూ దెబ్బ కొట్టరాదు అని ఎవరైనా అంటే, అంతకంటె మూర్ఖత్వం మరొకటి లేదు.
సరేనండి, వాలి రాముడితో మైత్రికి ప్రయత్నించలేదు, మరి కనీసం రాముడైనా సుగ్రీవుని కంటె బలవంతుడైన వాలితోనే స్నేహం చేసి ఉండవచ్చు కదా?  అని సందేహం రావచ్చు.  స్వయంగా వాలే రాముడిని అడిగాడు –“ఏమయ్యా రామా?  నీ తెలివి తక్కువతనం కొద్దీ సీతను రావణుడు ఎత్తుకుపోయాడు.  అప్పుడు మరింత తెలివితక్కువగా, “నాకు సహాయం చేయవయ్యాఅని బలహీనుడైన సుగ్రీవుడిని అడిగావు.  కాని, ఆ సహాయమేదో నన్నే ముందు ఎందుకు అడగలేక పోయావు?  అడిగి ఉంటే నేను అట్లా చేద్దున్, ఇట్లా చేద్దున్ కదాఅని అన్నాడు.  కాని, రాముడు ఆ పని ఎందుకు చేయలేదో చూద్దాం.
వాలికి రావణాసురుడు స్నేహితుడు.  వారేదో అల్లాటప్పా స్నేహితులు కారు, “నీతో చిరకాలం ప్రగాఢమైత్రిని కోరుతున్నాను.  నా రాజ్యం, నా భోగసంపదలు, నా వస్త్రాభరణాలు, నా భోజనాదులు ఇకమీదట అవిభక్తంగా మన ఇరువురివీఅని రావణుడు పలికిన పిమ్మట, అగ్నిసాక్షిగా వారిద్దరూ అన్నదమ్ములవంటి స్నేహితులైనారు. (రా.౭.౩౪.౪౦-౪౨)  అటువంటి వాలికి స్నేహితుడైన రావణుడివల్లనే రాముడికి అపకారం జరిగింది.  మరి అగ్నిసాక్షిగా చేసుకున్న ఆ స్నేహపు ఒప్పందం ప్రకారం, వాలి తన చిరకాలమిత్రుడైన రావణుడికే తోడ్పడతాడు గాని, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి,  క్రొత్తవాడైన తనకు ఎలా సహాయం చేస్తాడని రాముడు భావించడం సహజం.
అంతే కాదు, రావణుడు సీతను అపహరించినట్టే, వాలి కూడా తన తమ్ముని భార్యను అపహరించాడు.  ఈ విధంగా రావణుడు, వాలి, ఇరువురూ ఒకే రకమైన తప్పు చేశారు.  ఇటువంటి పరిస్థితులలో రాముడు తన స్వార్థం కోసం వాలితో స్నేహం చేసి, రావణుడిని మాత్రం చంపుతాడా? – ఆ రకమైన ద్వంద్వనీతిని లోకం హర్షింఛి ఉండేదా?  “ఓ రామా!  నీతో స్నేహం చేశాడని, నీకు సహాయం చేశాడని, తప్పు చేసినవాలిని క్షమించేస్తావా?  అదే తప్పు చేసిన రావణాసురుడిని మాత్రం పరాయివాడని చంపేస్తావా?  ఇదే రకమైన ధర్మం రామా?”  అని లోకం దుమ్మెత్తి పోసేది కాదా?
ఈ వానరసోదరులలో సుగ్రీవుడు బలహీనుడు, వాలి బలవంతుడు అనే విషయం రాముడికి తెలియనిది కాదు.  కాని, వాలితో స్నేహం చేస్తే నా పని సులువుగా ఐపోతుందేమో అనే ప్రలోభానికి రాముడు లొంగిపోలేదు.  ధర్మం తెలిసినవాడే కాక, దానిని చక్కగా ఆచరించేవాడు కూడా కాబట్టి, వాలిని వదిలి, సుగ్రీవుడితోనే స్నేహం చేశాడు.  అపరాధిని శిక్షించాడు.  ఇటువంటి చక్కని స్థిరమైన రాజనీతిని, ధర్మాన్ని పాటించిన రాముడిని, “నువ్వు కామాత్ముడివి, నువ్వు చంచలస్వభావం గలవాడివి, ధర్మవిచక్షణ లేనివాడివిఅని వాలి నిందించడం హాస్యాస్పదం కాదా?
అంతేకాదు, “నేను నిరపరాధిని, నేను అకిల్బిషుడిని, నేను ఉదాసీనుడిని” (రా.౪.౧౭.౨౨,౩౩,౪౪) అని వాలి పదే పదే రామునిముందు తనను గూర్చి చాటుకున్నాడు.  అటువంటి చాటువులు ఎన్ని సార్లు పలికినప్పటికీ, అపరాధి నిరపరాధి ఐపోడు.  సుగ్రీవుడి పట్ల వాలి తప్పు చేసినప్పటికీ, అది తప్పు కాదని, నేను చేసింది ధర్మమేనని అతడు దబాయించాడు.  కిష్కింధలో అతని ప్రాపు గోరి, అతని ప్రక్కనుండే మంత్రులు కూడా అవును ప్రభూ!  మీరు చేసిన దానిలో తప్పేమీ లేదుఅని వంత పాడి పాడి, అతడి తప్పుడు అభిప్రాయానికి బలం కలిగించి ఉంటారు.  అంతమాత్రాన తప్పు ఒప్పై పోదు. కాని, ధర్మాధర్మాలు ఏమిటో క్షుణ్ణంగా ఎరిగిన రాముడి ముందు వాలి దబాయింపులు చెల్లలేదు.  అందువల్లనే రాముడు ఓ వాలీ,నీది వానర చాపల్యం.  నీ మంత్రులు కూడా అలాంటివారే”  (రా.౧౮.౧౬) అని అన్నాడు.
వాలి ఎందుకు అపరాధి అయినాడో ముందర చెప్పిన కథలోనే చూశాం.
1 క్షమించమని శత్రువు కోరినా క్షమించాలి అనేది ఆనాటి రాజనీతి.  కాని, తన స్వంత తమ్ముడైన సుగ్రీవుడు క్షమించమని కోరి పాదాక్రాంతుడైనా, వాలి అతడిని చంపబూనుకున్నాడు. (రా.౪.౯.౨౬)
2 యుద్ధం చేయకుండా పారిపోయేవాడిని వెంట తరిమి చంపడం రాజధర్మానికి విరుద్ధం.  కాని, తనను సవాలు చేసిన మాయావిని వాలి వెంటాడి వెంటాడి చంపడంలోనే అతడి క్రూరత్వం తెలుస్తుంది. అలాగే, సుగ్రీవుడు ఎటు పారిపోయినా, అతడిని చంపివేసే ఉద్దేశంతోనే, వాలి నాలుగు దిక్కులలోనూ దేశదేశాంతరాలకు తరుముకుంటూ పోయాడు.  (రా.౪.౪౬.సర్గ)  మొత్తానికి మతంగాశ్రమప్రాంతంలో వాలి అడుగు పెట్టలేడు కాబట్టి సుగ్రీవుడు బ్రతికిపోయాడు.  వాలి కోపం తాత్కాలిమైనది అయ్యుంటే అర్థం చేసుకొనదగినదే.  కాని, చాలకాలం గడిచినప్పటికి, అతడు సుగ్రీవుని చంపించే ప్రయత్నాలు మానలేదు.  కాబట్టి, తన ప్రాణరక్షణకోసం వాలిని చంపాలి అని సుగ్రీవుడు భావించడంలో గాని, అందుకు రాముని సహాయం కోరడంలో గాని తప్పు లేదు.
3 రాజధర్మం కాపాడడమే కాని, అపహరించడం కాదు.  కాని, తమ్ముడు బ్రతికి ఉండగానే వాలి తన తమ్ముడి భార్యను అపహరించాడు.  (రా.౪.౧౮.౧౮)  అది అధర్మమని రాముడు స్పష్టంగా చెప్పాడు.
{ఔరసీం భగినీం వాపి భార్యాం వాప్యానుజస్య యః|
ప్రచరేత నరః కామాత్ తస్య దండో వధః స్మృతః||}      
కూతురు పట్ల, సోదరి పట్ల, తమ్ముని భార్య పట్ల ఏ నరుడు కామంతో వ్యవహరిస్తాడో అతడికి మరణమే సరియైన దండనం.
ఈ విధంగా వాలి రాజధర్మాన్ని అతిక్రమించాడు.  భ్రాతృధర్మాన్ని కూడా అతిక్రమించాడు. కాబట్టి, నూటికి నూరు శాతం అపరాధి.  దండన తప్పదు.  కాని, నేరుగా దండన విధించడమేనా?  అతడు మారేందుకు ఒక అవకాశం ఇచ్చి ఉండాలి కదా అని ఎవరైనా అనవచ్చు.
సామదానభేదదండోపాయాలు అని నాలుగు ఉన్నాయి.  అపరాధిని నిగ్రహించడానికి అవి నాలుగు మార్గాలు.  వాలి సామోపాయానికి లోబడేవాడైతే తార మంచి మాటలు చెప్పినపుడైనా శాంతించి, తమ్మునితో రాజీకి వచ్చి ఉండేవాడు.  కాని, అలా జరగలేదు.  దానోపాయానికి లోబడేవాడైతే, “అన్నా, రాజ్యం నీదే, నేను నీ దాసుడిగా ఉంటానుఅని సుగ్రీవుడు అన్నపుడే మెత్తబడి ఉండేవాడు.  కాని, అలా జరగలేదు.  భేదోపాయానికి లోబడేవాడైతే రామసుగ్రీవుల స్నేహం సంగతి తెలిసినపుడైనా పరాయివారి జోక్యం వద్దు, మన మధ్య కలహం కూడా వద్దు తమ్ముడూ, కలిసివుందాం రాఅంటూ రాయబారం పంపించి ఉండేవాడు.  కాని, తన బలం పట్ల మితిమీరిన నమ్మకంతో, అతడు రాముని బలాన్ని కూడా తక్కువ అంచనా వేశాడు.  ఏ రాయబారమూ లేదు.  ఈవిధంగా, వాలిపట్ల ఈ సామదానభేదాలు ఏమీ ప్రభావం చూపలేకపోయాయి.  అతడిలో ఎటువంటి మార్పును కలిగించలేకపోయాయి.  వాలిలో ఏ కోశానా కనీసం పశ్చాత్తాపమైనా లేకపోయింది.  కాబట్టి, ఇక మిగిలింది దండోపాయమే.  ఈ విధంగా రాముడికి వాలిని దండించడం తప్ప మరో మార్గం లేకపోయింది.  అంతే కాదు, తన మిత్రుడికి కలిగిన ఆపదను తొలగించడం, అతడిని రక్షించడం మిత్రధర్మం.  రాజధర్మంలో అది అతి సహజం.  “వాలి బ్రతికి వుండగా సుగ్రీవునికి రక్షణ లేదుఅని తేలిపోయిన తరువాతనే, రాముడు వాలిని దండించబూనుకున్నాడు.
ఇక, ఆ దండన ఎలా ఉండాలి అనేది నిశ్చయించవలసినది అపరాధి కాదు.  దండధరుడే ఆ దండం ఎలా విధించాలి, ఎప్పుడు విధించాలి అని తేల్చుకుంటాడు.  తానే స్వయంగా చంపాలా, వేరొకరి చేత చంపించాలా,  ఆ అపరాధిని ముందు నుంచి చంపాలా, వెనుక నుంచి చంపాలా, పదిమందితో ముట్టడించి చంపాలా, తల నరికి చంపాలా, ఉరి తీసి చంపాలా అనేది దండధరుని ఇష్టం.  కాబట్టి, రాముడు తనకు పెద్ద క్లేశకరం కాని పద్ధతిలో వాలిని దండించాడు.
కాబట్టి, సూటిగా చెప్పాలంటేరాముడు వాలితో యుద్ధం చేయలేదు.  యుద్ధం చేస్తేనే ముందునుండి యుద్ధం, వెనుకనుండి యుద్ధం అనే ప్రశ్నలు రావాలి.  ఒక రాజు, ఒక మదాంధుడైన అపరాధిని దండించాడు.  ఇక్కడ అంతకంటె జరిగింది మరేమీ లేదు. 
}}}{{{
ఇక వాలి -  తనకు విధించిన దండనకు అసలు కారణాన్ని విస్మరించి, అందరితోనూ విస్మరింపజేయిస్తూ, అసందర్భమైన ధర్మపన్నాలు చాల వల్లించాడు.
మాంసం కోసం చంపదగిన జంతువులలో వానరం లేదే?”  అని వాలి రాముడిని అడిగాడు.  నిజమే, రాముడు చర్మం కోసమో, లేక మాంసం కోసమో వాలిని చంపలేదు.  రాజు ధర్మాన్ని రక్షించే ఉద్దేశంతో దుర్మార్గుడిని చంపుతాడే తప్ప, అతగాడి మాంసం తినడం కోసం కాదు.
కాని, అసలు వాలి ఆ ప్రశ్నను అడిగిన ఉద్దేశమే వేరు.  నేను నిరపరాధిని అని అతడు పైకి ఎంత దబాయించినా, తమ్ముని భార్యను తాను అపహరించడం తప్పు అని అతనికి అంతరాంతరాలలో తెలుసు. అతడంటే భయం వున్న కిష్కింధలో, అతడి వాదన చెల్లుబాటు అవుతుందేమో గాని, ధర్మజ్ఞుడైన రాముడి ముందు ఆ వాదన చెల్లదని అతనికి స్పష్టంగా తెలుసు.  అందువల్ల, “నరుడెవరైనా అటువంటి తప్పు చేస్తే అతడికి ధర్మశాస్త్రం ప్రకారం మరణదండన విధించాలి కాని, ఆ ధర్మశాస్త్రం జంతువులమైన, వానరులమైన మా పట్ల చెల్లదు కదా?” అనే మెలిక పెట్టదలిచాడు. 
కాని, రాముడి వద్ద ఆ ప్రశ్నకు కూడా సమాధానం ఉన్నది వానరులలో కూడా, బ్రతికి ఉన్న వాడి భార్య జోలికి మరొక వానరుడు పోకూడదు.  కాని, వాలి అటువంటి తప్పు చేశాడు.  అందువల్లనే, “ఓ వానరా!  అని సంబోధించి, నువు వానరుల కట్టుబాటునే ఉల్లంఘించినందువల్ల దండన విధించాను”  (రా.౪.౧౮.౧౯,౨౦) అని స్పష్టం చేశాడు.
నన్ను చంపింది రాజ్యం కోసమా డబ్బుకోసమా?” అని వాలి రాముడిని అడిగాడు.  రాజు ఆ రెండింటి కోసమే ఎవరినైనా చంపుతాడు అనుకొనడం తప్పు.  ఆపదలో ఉన్న తన స్నేహితుడిని కాపాడుకొనేందుకు కూడా రాజు అతడి శత్రువును చంపడం సహజం.
రాజహంతకుడు, గోబ్రాహ్మణహంతకుడు, మిత్రద్రోహి, గురుద్రోహి నరకానికి పోతారుఅని వాలి శాపనార్థాలు పెట్టాడు.  కాని, రాముడు అటువంటి పనులేమీ చేయలేదు.  రాముడి చేత వాలి దండనకు గురి అయ్యాడే తప్ప హత్యకు గురి కాలేదు.  ఈ సందర్భంలో ద్రోహులలోని రకాలను గురించి ప్రస్తావించిన వాలి, తాను చేసిన భ్రాతృద్రోహాన్ని గూర్చి మాట మాత్రమైనా ప్రస్తావించలేదు.  తనకు అపరిచితుడైన రాముడు అడిగితే, అగ్నిసాక్షిగా తన మిత్రుడైన రావణాసురుడిని బాగా తన్ని సీతను తెచ్చేవాడిని అని అన్నాడు. అలాచేస్తే రావణుడికి తాను మిత్రద్రోహం చేసినట్లే అవుతుందని కూడా అనిపించలేదు. 
అసలు నేను నీకు ఏమి అపకారం చేశానని నన్ను చంపావు?” అని అడిగాడు.  అపరాధి ఎవరి పట్ల తప్పు చేసినా, అ తప్పును అతడు చేశాడని ఋజువైతే న్యాయాధికారి అతడికి దండన విధిస్తాడు. అది అతడి విధి.  అతడి ధర్మం. అంతే గాని, అపరాధి పట్ల ఏదో దురుద్దేశం మనసులో పెట్టుకుని దండన విధించినట్లు కాదు.  కాని, “నీకేం అపకారం చేశానని నాకు దండన విధించావు?” అని ఎవరైనా అపరాధి ఆవేశంతో ఒక న్యాయాధికారిని ప్రశ్నిస్తే అది హాస్యాస్పదంగా ఉంటుంది.
సరే, ఇవన్నీ ధర్మవిచారణకు సంబంధించిన విషయాలు.  వాలి చేసిన వాదనలలో ఔచిత్యం ఏమీ లేదని తేలిపోయింది.
ఈరకంగా తన వాదనలు ధర్మానికి గాని, తర్కానికి గాని నిలబడేవి కావని స్వయంగా వాలికి కూడా తెలుసు.  అందువల్ల, “బలవంతుడు ఏమి చేసినా సరైనదే” – అనే సార్వత్రికప్రకృతిన్యాయాన్ని పైకి తీశాడు.  అదే మరొక రకంగా చెప్పాలంటే అరణ్యన్యాయం.  బలమైన పులి బలహీనమైన జింకను చంపేస్తుంది.  ఇది న్యాయమా కాదా అని అడవిలోని జంతువులేవీ విచారణకు కూర్చోవు.  బలమైన జంతువు ఏమైనా చేస్తుంది. మిగిలిన బలహీనజంతువులు ఆ కాసేపు కంగారుపడి అటూ యిటూ పరుగెత్తినా, ఆ తరువాత, ఆ సంఘటనను మరచిపోయి, తమ బ్రతుకుతెరువులో తాము నిమగ్నమైపోతాయి.
అటువంటి అడవిలో పుట్టి పెరిగిన నేను, ఒక బలమైన అడవి జంతువును మాత్రమే అని వాదిస్తే, ఆ రకంగా నేను చేసిన పని జంతుసహజమైనది, అందువల్ల సమంజసమైనదేనంటూ సమర్థించుకోవచ్చునుఅని భావించిన వాలి, “ఓ రామా!  నువ్వు నన్ను వెనుకనుండి కొట్టావు గాని, నాతో నేరుగా తలపడి ఉంటే ఈపాటికి యముడిని చూసి ఉండేవాడివిఅన్నాడు భీకరంగా, తన చివరి వాదనగా తన దేహబలాన్ని ఘనంగా చాటుకుంటూ.
రాముడు ఆ మాటలను కూడా చిరునవ్వుతో కొట్టి పడేశాడు.  వాలి ఆ విధంగా తనను తాను ధర్మానికి లోబడే సామాజికునిగా కాక, అరణ్యన్యాయాన్ని అపేక్షిస్తున్నఅడవి జంతువును అని పరోక్షంగా ప్రకటించుకోగానే  – “బలమైన అడవి జంతువులను, అవి ఏమరుపాటుగా ఉన్నప్పటికీ, చాటునుండి వేటాడటం క్షత్రియులకు సహజమే, అందులో దోషమేమీ కాదుఅని తేల్చేశాడు.
{విధ్యంతి విముఖాంశ్చాపి న చ దోషోత్ర విద్యతే|”  (రా.౪.౧౮.౪౧)}
[కొందరు ఈ సందర్భంగా ఇంద్రుడు వాలికి ప్రసాదించిన ఒక హారాన్ని గూర్చి, ప్రస్తావిస్తారు.  వాల్మీకి రామాయణంలో కూడా ఆ హారం ప్రస్తావించబడింది.  దానిని ఎవరైనా ధరిస్తే, అతడు యుద్ధం చేసేటపుడు ఎదుట నిలిచినా ప్రత్యర్థిలోని శక్తిని అది అమాంతం లాగేస్తుంది అంటూ దాని గూర్చి చెబుతారు.  కాని, ఆ కథను గూర్చిన చర్చ ఇక్కడ చేయటం లేదు.]
}}}{{{
ఇంత జరిగాక, వాలికి మరే రకమైన వాదనా మిగలలేదు.  తన వాదనలన్నిటికీ రాముని వద్దనుండి ధర్మబద్ధమైన రీతిలో సమాధానాలు దొరికాయి.  చివరకు తాను చేసింది తప్పు అని గ్రహించాడు. తనను చంపడంలో రాముడు ఎటువంటి తప్పునూ చేయలేదని అంగీకరించాడు.
{న దోషం రాఘవే దధ్యౌ ధర్మేధిగత నిశ్చయః|” (రా.౪.౧౮.౪౬)}
అంతే కాదు,
నువ్వు చెప్పినది సరైనదే రామా!అన్నాడు.  “నేను నిన్ను బాధిస్తూ పలకడం పొరబాటేఅన్నాడు.
{యత్ త్వమాత్థ నరశ్రేష్ఠ!  తదేవం నాత్ర సంశయః| (రా.౪.౧౮.౪౭)}
{తదయుక్తం మయా పూర్వం ప్రమాదాదుక్తమప్రియమ్| (రా.౪.౧౮.౪౮)}
ఓ ధర్మాత్ముడా!  నన్నుఆదరించుఅని శరణువేడాడు.
{మాం ధర్మజ్ఞ పరిపాలయ! (రా.౪.౧౮.౫౦)}
అతడికి ప్రేమాస్పదులైన వారెవరికీ ఎటువంటి హాని జరుగదని, వారందరూ కూడా మునుపటిలాగానే సుఖంగా ఉంటారని సుగ్రీవుడి తరపునరాముడు వాలికి అభయం ప్రసాదించాడు.(రా.౪.౧౮.౬౭)
}}}{{{
చివరలో వాలి మరొక రహస్యం కూడా చెప్పాడు– “ఓ రామా!  నా భార్య అయిన తార సుగ్రీవుడితో యుద్ధం వద్దు అని నన్ను వారిస్తూ ఉన్నప్పటికీ, నీ చేతిలో చావు కోరే నేను వచ్చాను”.  (రా.౪.౧౮.౬౦)
{త్వత్తోహం వధమాకాంక్షన్ వార్యమాణోపి తారయా|
సుగ్రీవేణ సహ భ్రాత్రా ద్వంద్వయుద్ధముపాగతః||}    
ముందే అనుకున్నట్టు నేను నిరపరాధిని అని పైకి ఎంతగా దబాయించినా, వాలికి తన అంతరాంతరాలలో తాను అపరాధిని అని తెలుసు.  అందువల్లనే ధర్మాత్ముడని పేరుపొందిన రాముడి చేతిలో దండన అనుభవించాలని రహస్యంగా కోరుకుని ఉండవచ్చు.  బానే వుంది.  మరి, ఆవిధంగా చావాలని వచ్చినవాడు తన కోరిక నెరవేరితే హాయిగా చచ్చిపోవాలి గాని, రాముడిని అన్ని రకాలుగా తిట్టడం ఎందుకు అని సందేహం రాదా?
వస్తుంది, ఎందుకు రాదు?
యోగశాస్త్రంలో అభినివేశం అని పరిభాషాపదం ఉన్నది.  అది పంచక్లేశాలలో ఒకటి.  దాని ప్రభావమే వాలి రాముడితో చేసిన వాదనలు.
కాని, వాలి దూషణలకు రాముడు కోపం తెచ్చుకోలేదు.  సంయమనం కలిగి ప్రశాంతంగా సమాధానాలు చెప్పాడు.   సంయమం అనేది కూడా యోగశాస్రపు పారిభాషికపదమే.  సంయమం కలిగినవాని ప్రజ్ఞ అమోఘమైనదని కూడా యోగ శాస్త్రం చెబుతుంది.  తత్ఫలితంగా అపరాధి తన దోషం తెలుసుకున్నాడు.
ఓ రామా! నీబాణం దెబ్బ తీవ్రంగా తగలగానే నాకు చిత్తక్లేశం కలిగింది.  దాంతో అభినివేశం పెచ్చరిల్లి నిన్ను దూషించాను.  నన్ను క్షమించు.అని తెలివి వచ్చిన తరువాత వాలి స్వయంగా చెప్పాడు.  (రా.౪.౧౮.౬౯)
{శరాభితప్తేన విచేతసా మయా ప్రదూషితస్త్వం యదజానతా ప్రభో|
ఇదం మహేన్ద్రోపమ భీమవిక్రమ ప్రసాదితస్త్వం క్షమ మే నరేశ్వర||}
ఈ విధంగా వాలి అభినివేశం, రాముని సంయమనం మూలకంగా మనకు రామాయణంలో ఈ అద్భుతమైన ఘట్టం లభించింది.
}}}{{{
అందరికీ శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు.
శ్రీరాముని అనుగ్రహం చేత యావజ్జనులు సమస్తక్లేశదూరులై సంయమనం కలిగి, సుఖసంతోషాలతో వర్ధిల్లుదురు గాక!
{*సర్వమిదం యేన ప్రసాదితం మచ్ఛరణ్యాయ తస్మై శ్రీరామాయ పునః సద్యః సమర్ప్యతే*}


సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...