Showing posts with label శ్రీనివాస కృష్ణ. Show all posts
Showing posts with label శ్రీనివాస కృష్ణ. Show all posts

Thursday, 2 September 2021

విజృంభిస్తున్న చార్వాకులు!


 చర్వణం అంటే నమలడం. అంటే తినడం. కడుపునింపుకొనడం (అనుభవించడం) మాత్రమే జీవితలక్ష్యమని, మిగిలినవన్నీ మనిషికి అనవసరమనీ భావించేవారు చార్వాకులు.
చారు వాక్ అనే రెండు పదాలనుండి చార్వాక అనే పదం వచ్చిందని కొందరు పండితులు అంటారు. చారు అంటే అందమైనది లేదా మనసును ఆకర్షించేది అని అర్థం. వాక్కు అంటే మాట అని అర్థం.
చార్వాకుల మాటలు, వారి బోధనలు పామరుల మనస్సులను ఇట్టే ఆకర్షించేవట. ఎందుకు ఆకర్షించవు? ఇప్పట్లో మన రాజకీయనాయకులు చేసే వాగ్దానాలు కూడా ఆనాటి చార్వాకుల మాటల మాదిరిగానే ఉండ్ల్యా?
వారి జీవితవిధానానికి ఈ క్రింది ఉదాహరణ ఒక మచ్చు మాత్రమే.
ఋణం కృత్వా ఘృతం పిబేత్!
భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః?
అప్పు చేసి నెయ్యి త్రాగాలి.
(అప్పు చేసి పప్పుకూడు అని తెలుగులో)
శరీరం కాలిపోయాక మళ్లీ వచ్చేదెలా?
అంటే మనం కష్టపడి సంపాదించి అనుభవించాలి అనే కాన్సెప్టును వీరు అంగీకరించరు. పుట్టడమనేది వీరికి సంబంధించి ఒక ఆకస్మికపరిణామం. ఒక ఆక్సిడెంట్. అంతే. పుట్టిన తరువాత జీవితాన్ని అనుభవించి వదిలేయాలి అంటారు. కాని సంపాదన ఉంటే కాని జీవితాన్ని ఆనందించడం సాధ్యం కాదు. సంపాదన కోసం శ్రమిస్తే అందువల్ల ఆనందం ఏముంది, కష్టం తప్ప? అని వీరి అభిప్రాయం. అందువల్ల కష్టపడకుండా, అప్పులు చేయాలి, అనుభవించాలి అంటారు.
కాని, ఆనాడైనా ఈనాడైనా భారతీయులందరికీ అప్పు అంటే చచ్చేంత భయం. అప్పు చేయడం ఎంత సులువో తిరిగి ఆ అప్పును తీర్చడం అంత కష్టం కదా. అప్పును తీసుకున్న తరువాత ఎలాగైనా తీర్చివేయవలసిందే. ఋణం తీర్చుకొనడం అనేది భారతీయులకు ఒక పవిత్రమైన భావన. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా తాను ఋణపడ్డానని, వారిని సంతోషపెట్టడం ద్వారా ఆ ఋణం తీర్చుకోవాలని భావిస్తారు. అటువంటిది ఎవరో పరాయి వ్యక్తుల దగ్గరనుండి ఋణం తీసుకుంటే తిరిగి ఆ ఋణం తీర్చకపోవడమనేది మహాపాపమని భావిస్తారు. ఋణం తీర్చకుండా మరణిస్తే మరుసటి జన్మలో కూడా ఆ ఋణభారం తమ నెత్తిన కొండగా మారి పడుతుందని, కాబట్టి అప్పు తీసుకున్న జన్మలోనే ఆ అప్పును తిరిగి చెల్లించేయాలని తాపత్రయపడతారు. ఒక వ్యక్తి అప్పు తీర్చకుండానే మరణిస్తే, ఆ వ్యక్తి కుమారుడు తన తండ్రి చేసిన అప్పును తీర్చడం తన బాధ్యతగా భావించి తీర్చడానికే ప్రయత్నిస్తాడు.
సర్వేషామపి శౌచానామ్ అర్థశౌచం పరం స్మృతమ్ - అని పెద్దల మాట. శౌచమంటే కేవలం పళ్లు తోమడం స్నానం చేయడం మడి బట్టలు కట్టడం మాత్రమే కాదు, ఆర్థికవిషయాలలో కూడా పవిత్రంగా ఉండాలి. నిజానికి అదే అన్నిటిలోనూ నిజమైన, అతి గొప్పదైన శౌచం (పవిత్రత) అని నైతికశాసనం కూడా చేశారు.
అలాంటి భారతీయసామాజికభావన మీద చార్వాకులు తిరుగుబాటు చేశారు. అప్పు చేసి చచ్చేేంతవరకూ అనుభవించడమే జీవితపరమార్థమని, తిరిగి అప్పు తీర్చే బాధ్యతను నెత్తిమీద పెట్టుకోవద్దని, పునర్జన్మ అనేది, పునర్జన్మలో మరలా ఋణభారం అనేది వట్టి పనికిమాలిన అబద్ధపు మాటలని ప్రచారం చేశారు.
అదిగో - సరిగ్గా అక్కడే - పునర్జన్మ అనేది బూటకం అని, బాధ్యతారాహిత్యమే జీవితసారాంశమని చార్వాకులు అన్నారు కదా. అక్కడే పామరజనాలకు చార్వాకులు పిచ్చిపిచ్చిగా నచ్చేశారు. వేలం వెర్రిగా వారి బోధనలను అనుసరించారు.
సామాజికజీవనం వారి బాధ్యతారాహిత్యంతో అస్తవ్యస్తమైంది. తల్లిదండ్రుల పట్ల పిల్లలకు బాధ్యత లేదు. పిల్లల పట్ల తల్లిదండ్రులకు బాధ్యత లేదు. భార్యాభర్తల నడుమ అనుబంధం పరస్పరబాధ్యత అనే ప్రశ్న లేదు. యజమానినుండి జీతం తీసుకొనడమే తప్ప ఆ యజమాని చెప్పిన పనులు చేయవలసిన బాధ్యత తనకు లేదని ఉద్యోగులు భావించారు. వ్యవసాయం చేయవలసిన బాధ్యత లేదని, ఎవడో పండించిన పంటను ఎత్తుకుపోయి అనుభవించడంలో తప్పు లేదనే భావాలు ప్రబలిపోయాయి. అనేక తరాలుగా మలచబడ్డ ఒక సామాజికవ్యవస్థ వీరి ఆగడాలవలన ఛిన్నాభిన్నమైపోయింది.
స్వర్గమూ లేదు, నరకమూ, లేదు, పునర్జన్మ లేదు, సృష్టించే దేవుడూ లేడు, దండించే యముడూ లేడు, అసలు శరీరం కంటె వేరుగా ఆత్మ అనేది లేనే లేదు. కాబట్టి దేనికీ మనం భయపడవలసిన అవసరం లేదు, Boys, Let us just Enjoy ourselves అనే మూకలు తయారైనాయి. అదిగో - ఆ సమయంలోనే ఆ చార్వాకులకు ఆ చార్వాకుల అనుయాయులకు నాస్తికులు అని పేరు వచ్చింది.
అస్తి అంటే ఉన్నది అని అర్థం. ఆత్మ అనేది ఉన్నది, పునర్జన్మ ఉన్నది అనేవారు ఆస్తికులు.
నాస్తి (న + అస్తి) అంటే లేదు అని అర్థం. ఆత్మ అనేది లేదు, పునర్జన్మ అనేది లేదు అనేవారు నాస్తికులు.
వేదాలు ఆత్మ ఉన్నదని, కర్మానుసారం పునర్జన్మ ఉంటుందని చెబుతాయి కాబట్టి, పాణిని నాస్తికుడు అంటే వేదనిందకుడు (వేదాలను తిరస్కరించేవాడు నాస్తికుడు) అని నిర్వచనం చేశాడు.
కాని, క్రమంగా చాలమంది ఈ చార్వాకుల నాస్తికభావాల వలన సమాజానికి కలిగే నష్టమేమిటో స్వీయానుభవాల వలన తెలుసుకున్నారు. బాధ్యతారాహిత్యం వలన దుఃఖమే తప్ప సుఖం అనేది ఎండమావిలో నీటివంటిది అని గ్రహించారు. తాము మారారు. మారని వారిని దూరంగా ఉంచారు. (అది వెలివేయడం అనండి, బహిష్కరణ అనండి.) నాస్తికులు నిందాపాత్రులైనారు. అప్పటినుండే నాస్తిక అనే పదం వెక్కిరింతకు గురైంది. నాస్తికులను వారి చేష్టలను, వారి బాధ్యతారాహిత్యాన్ని అసహ్యించుకొనడం అప్పటినుండే ప్రారంభమైంది.
(అసహ్యించుకొనడం అనే పదానికి hate అనే ఇంగ్లీషు పదాన్ని ఉపయోగించి అనువాదం చేస్తుంటారు. కాని అసహ్యము అంటే ద్వేషించడం కాదు. సహింపరానిది అని అర్ధం. ఎండాకాలంలో ఎండ కూడా మనకు అసహ్యమే. అంటే మనం సహించలేనిదే. అంటే మనం ఎండ ధాటికి తాళలేమని, ఎండకు తట్టుకోలేమని అర్థం. అంతే కాని ఎండను ద్వేషిస్తున్నామని అర్థం కాదు. సంస్కృతాన్ని నిష్కారణంగా ద్వేషించే కొందరు మిడిమిడి జ్ఞానపు తెలుగు పండితులు (!!!) అసహ్యమంటే ద్వేషించడమే అని భావిస్తూ, తాము పెంచుకున్న భావదారిద్ర్యాన్నంతా తమ జీవితచరిత్రల రూపంలో కూడా వెలిగ్రక్కుతూ ఉంటారు.)

సరే, మొత్తానికి అప్పట్లోనే ప్రజలు వారి ప్రభావంనుండి బయటపడడానికి, సభ్యసమాజంగా మరలా రూపు దిద్దుకొనడానికి చాల కాలం పట్టింది. అలా చార్వాకులు లేదా నాస్తికులు ఒకప్పుడు భారతీయసమాజంలో ఒక వెలుగు వెలిగారు. (తమ స్వార్థం కోసం సమాజాన్ని ఆటవికసమాజంగా మార్చేశారు.)
ఇదిగో, మరలా ఈ రోజుల్లో ఆ చార్వాకులు లేదా నాస్తికులు మరలా విజృంభించేందుకు, సమాజాన్ని మరలా అల్లకల్లోలం చేసేందుకు ఈవిధంగా సంసిద్ధులౌతున్నారు.
ఇప్పటికే నాయకులనే ముసుగులో కొందరు చార్వాకులు అప్పులు చేసిన వారు మరలా కట్టనవసరం లేదని ఋణమాఫీ పేరిట జనాలను ఆకట్టుకొనడం మొదలు పెట్టారు. శ్రమించకుండా అప్పనంగా వచ్చే సొమ్మును పామరజనాలకు బాగా రుచి చూపించారు. సోమరిపోతుల సైన్యాలను సృష్టించారు. క్రొత్త క్రొత్త పన్నులను కనిపెడుతున్నారు. కష్టించి పని చేసేవారి కష్టార్జితాన్ని యథేష్టంగా దోచేస్తున్నారు. తమ సోమరిసైన్యాలకు పంచి పెట్టి పోషిస్తున్నారు.
భారతీయసమాజవ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకలించి నాశనం చేయడమే వారి లక్ష్యం.
ఆ నాయకకుటుంబమంతా ఇదే తమ ఏకైకలక్ష్యంగా అధికారాన్ని కూడా సంపాదించి ఇప్పటికే సగం సమాజాన్ని చెడగొట్టింది. వారి అజెండా అమలు కావాలంటే వారికి ఐదేళ్ల వ్యవధి సరిపోదు. మళ్లీ మళ్లీ అధికారానికి రావలసిన అవసరం ఉంది. అందుకే ఇరవైయేళ్ల అధికారం, ముప్పైయేళ్ల అధికారం అంటూ కలవరిస్తుంటాడా నాయకుడు. వారికి మనం ఆ అవకాశం ఎంతమాత్రం ఇవ్వరాదు.
వారి నుండి ఉచితంగా అందుతున్న తాయిలాలకు ఆశపడి, వారి ఆశయాలకు అనుగుణంగా ఇదుగో ఈ ప్రొఫెట్ జీయం మోజెస్ లాంటివారు బహిరంగంగానే అప్పులను రద్దు చేయించేస్తానంటూ ఆరాధనలంటూ వెర్రి మొర్రి ఆరాధనలు కూడా మొదలు పెట్టారు.
వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు
చీడపురుగు చేరి చెట్టు చెరచు.
కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా
విశ్వదాభిరామ వినుర వేమ
అని వేమన చెప్పిన మాటలు మనం స్మరించుకుని, ఇలాంటి నాస్తికుల గోముఖవ్యాఘ్రపు బోధనలనుండి మనవారు అనుకున్నవారిని జాగ్రత్తగా కాపాడుకుందాం.

Saturday, 7 August 2021

విశ్వామిత్రుడు యజ్ఞం ఎందుకు చేసినట్టు?

 విశ్వామిత్రమహర్షులవారు అయోధ్యకు వేంచేశారు. దశరథమహారాజు ఎదురేగి ఆయనకు స్వాగతం పలికాడు. “మహర్షీ, మీ రాక మాకు ఎడారిలో వర్షం కురిసినంత ఆనందం కలిగించింది. మీరు ఏమి కోరి వచ్చారో తెలుపవలసింది. మీ పని నెరవేరుతుందో లేదోనని బెంగ పెట్టుకొనవద్దు. కర్తా చాహమశేషేణ - మీ పనులు నేను సంపూర్ణంగా నెరవేర్చి పెడతాను”. అని వినమ్రుడై పలికాడు.

"దశరథమహారాజా, నేనొక యజ్ఞం చేస్తున్నానయ్యా. దానికి కామరూపులైన ఇద్దరు రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు. వారిని అడ్డుకుని శిక్షించాలి. నీ కుమారుడైన రాముని నాతో పంపవయ్యా" అని విశ్వామిత్రుడు అడిగాడు.

దశరథుడు భయపడ్డాడు. “ఉహుహు. నా రాముడు పసివాడు. రాజీవలోచనుడు. రాక్షసులతో యుద్ధం చేయలేడు. నా అక్షౌహిణీసైన్యంతో నేనే వచ్చి పోరాడుతాను. బాలం మే తనయం బ్రహ్మన్ నైవ దాస్యామి పుత్త్రకమ్. రాముణ్ణి నేను పంపను.”

"ఏమయ్యా, పని చేసి పెడతానని మొదట వాగ్దానం ఇప్పుడు మాట తప్పుతున్నావ్? సరే, సుఖంగా ఉండు. వెళ్లి వస్తా" అంటూ విశ్వామిత్రుడు అలిగేసరికి అందరూ భయపడ్డారు.

వసిష్ఠమహర్షి కలుగజేసుకుని నచ్చజెప్పాడు. చివరకు దశరథుడు ఒప్పుకున్నాడు. విశ్వామిత్రునికి రామునితో పాటు లక్ష్మణుని కూడా అప్పజెప్పాడు. గురుశిష్యులు ప్రయాణమైనారు. విశ్వామిత్రుడు వారికి బల అతిబల మంత్రాలనిచ్చాడు. వాటి ప్రభావం వలన వారికి అలసట, ఆకలిదప్పులు ఉండవు. రాక్షసులు వారిని దొంగదెబ్బ తీయలేరు.

దారిలో గంగానదీతీరాన వారు ఒకనాడు ధనధాన్యాలతో తులతూగి, తాటక అనే ఘోరరాక్షసి పీడవలన భయంకరారణ్యంగా మారిన మలదకరూశప్రాంతాలను చూశారు. ఆమెచేత చంపబడిన వారు చంపబడగా, మిగిలిన జనాలు ఆ దేశాన్ని వదిలి పారిపోయారు.

"రామా, అయ్యో స్త్రీ కదా అని జాలిపడకుండా క్రూరురాలైన ఆమెను నీవు సంహరించి, ప్రజలకు రక్షణ చేకూర్చాలయ్యా. రాజ్యభారనియుక్తానామ్ ఏష ధర్మః సనాతనః. రాజ్యభారాన్ని వహించేవారికి ఇది సనాతనమైన ధర్మం" అని విశ్వామిత్రుడు హితం చెప్పాడు.

రామలక్ష్మణులు తాటకను వధించారు. విశ్వామిత్రుడు సంతోషించి రామునికి అనేకమైన దివ్యాస్త్రాలను, వాటి ఉపసంహారమంత్రాలతో సహా ఉపదేశించాడు.
రాముడు వాటిని సంగ్రహించి, మహర్షులవారి ఆనతిపై వాటిని లక్ష్మణునికి తాను స్వయంగా ఉపదేశించాడు.

అన్నదమ్ముల రక్షణలో విశ్వామిత్రుని యాగం నిర్విఘ్నంగా జరిగింది. తాటక కుమారుడైన మారీచుని దూరంగా పడగొట్టారు. అతడి జతగాడైన సుబాహుని హతమార్చారు.

యజ్ఞపరిసమాప్తితో దిక్కులన్నిటా ఈతిబాధలు తొలగిపోయాయి. అథ యజ్ఞసమాప్తే తు విశ్వామిత్రో మహామునిః నిరీతికా దిశో దృష్ట్వా... అని వాల్మీకి వర్ణించాడు.

అంటే, విశ్వామిత్రుడు స్వార్థం కోసమో స్వర్గమో మరొకటో కోరి యజ్ఞం చేయలేదు. ఈతిబాధలను తొలగించటానికి యజ్ఞం చేశాడు. ఏమిటా ఈతిబాధలు?

శ్లో “అతివృష్టి రనావృష్టి ర్మూషకా శ్శలభాః ఖగాః.
అత్యాసన్నాశ్చరాజానః షడేతా ఈతయ స్స్మృతాః"

ఈతిబాధలు ఆరు రకాలు. 1అతివృష్టి 2అనావృష్టి 3మూషకాలు, 4శలభాలు, 5పక్షులు, 6రాజుగారికి అతి అభిమానులు. వీటివలన ప్రజలు పడే బాధలు ఇంతింతనరానివి. అందువలన వాటిని తొలగించదలచి విశ్వామిత్రుడు యజ్ఞం చేశాడు.

1 అతివృష్టి అంటే అవసరమైనదానికన్న ఎక్కువ వర్షం కురియడం.

2 అనావృష్టి అంటే అవసరమైనదానికన్న తక్కువ వర్షం కురియడం.

3 పంటలను సర్వనాశనం చేసేంతగా ఎలుకల సంతతి పెరగడం.

4 పంటలను సర్వనాశనం చేసేంతగా మిడతలదండ్లు దాడి చేయడం.

5 పంటలను సర్వనాశనం చేసేంతగా పక్షులసంతతి పెరగడం.

6 అతి సమీపంలో ఉన్న పాలకులు (మా రాజుదే రాజ్యమని సామాన్యప్రజలను పీడించే ఆ రాజుగారి అనుచరుల ఆగడాలు అని అర్థం చేసుకొనవచ్చు.)




ఈ ఆరింటిని ఈతిబాధలంటారు. వాటిని అరికట్టడం కోసమే విశ్వామిత్రుని యజ్ఞం జరిగింది. అయితే విశ్వామిత్రుని ప్రవర్తనలో ఈనాటి సమాజానికి సరిపోయే మరికొన్ని అంశాలను మనం గమనించవలసి ఉంది.

పాతతరం మనుషులు (దశరథుని వంటివారు) ఎప్పుడూ ధర్మసంరక్షణకు ముందుకు వస్తారు. కాని, తమ సంతానాన్ని ధర్మరక్షణకు పంపేందుకు జంకుతున్నారు. అటువంటి జంకుగొంకులు మాని, క్రొత్తతరానికి ధర్మరక్షణబాధ్యతను అప్పగించవలసిన బాధ్యత వారికుంది.

ధర్మరక్షణబాధ్యతను మునులు స్వయంగా చేపట్టగలరు. కాని, యుద్ధం చేయటం మునుల ధర్మం కాదు. వారు యుద్ధం చేస్తుంటే భోగభాగ్యాలను అనుభవిస్తూ తింటూ కూర్చొనడం సమాజానికి సిగ్గుచేటు. అందువల్ల, మీ యుద్ధం మీరే చేయండి అని వారి కర్మకు వారిని వదిలిపెట్టకూడదు. వారిని రక్షించే బాధ్యతను క్షత్రియులు చేపట్టాలి.

అలాగని, మునులు అన్నిటినీ విడిచి ముక్కుమూసుకుని తపస్సును చేస్తూ కూర్చోరాదు. శక్తిమంతులైన క్షత్రియులను తయారుచేసి, వారికి తగిన అస్త్రశస్త్రసంపత్తిని చేకూర్చే బాధ్యత వారిదే.

ఈతిబాధలను తొలగించగల శాస్త్రపరిజ్ఞానాన్ని పెంపొందించుకొనే బాధ్యత మునులదే. వారి శాస్త్రపరిశోధనలకు, పరిశోధనాఫలితాలను సమాజానికి ఉపయోగపడేలా చూసే బాధ్యత క్షత్రియులది.

స్త్రీలు సమాజంలో రక్షార్హులు. నిజమే. కాని, ఆడవారిలో కూడా కొందరు పరమక్రూరురాళ్లుండే అవకాశముంది. కాని, వారు బలగర్వితులై ప్రజలను పీడిస్తూ ఉంటే అటువంటివారు కూడా తప్పక దండనార్హులే.

సుందుడు, తాటకాసుందుల కుమారుడైన మారీచుడు, వారితో బాటు సుబాహుడు రాక్షసరాజైన రావణాసురుని అనుచరులు. ప్రజలను పీడించడమే వారి పని. బహుశః ప్రజలను పీడించే ఈతిబాధలను సృష్టించడం కూడా వీరు పని గట్టుకుని చేస్తుంటారు. (నేటి బయో వార్ లా) సుందుని అగస్త్యముని సంహరించాడనే కోపంతో అతని భార్య అయిన తాటక కూడా జనాల మీద పగబట్టి పీడించడం మొదలుపెట్టింది. రాజుగారి అండ చూసుకుని పేట్రేగిపోయే ఈ విధమైన క్రూరులు కూడా ఈతులలోనికే వస్తారు.

విశ్వామిత్రుడు వారిని కూడా అణచేందుకు తగిన శిక్షణను రామలక్ష్మణులకు ఇచ్చాడు.

స్వచక్రం పరచక్రం చ సప్తైతా ఈతయః స్మృతాః అని కొందరంటారు.  స్వదేశంలో కలిగే బాధలు స్వచక్రం, బయటదేశపు పాలకులవలన కలిగేవి పరచక్రం అన్నమాట. అంటే పాకిస్థాన్, చైనా వంటి దేశాల దుందుడుకు చేష్టలు, ఉగ్రవాదచర్యలు వంటివి.

స్వచక్రాలను సాధ్యమైనంత త్వరగా అణచివేయాలి. పరచక్రాలను సరైన సమయం వచ్చేదాకా ఎదురు చూసి, సరైన మిత్రులను సమకూర్చుకుని చావుదెబ్బ కొట్టాలి.

అరణ్యవాసకాలంలోనే మునులు రామునికి రావణాసురుని అనుచరులవల్ల తమకు కలుగుతున్న బాధలను గూర్చి మొరపెట్టుకున్నారు. రాముడు తొందరపడలేదు. వారికి రక్షణ కల్పిస్తూ వచ్చాడే తప్ప వెంటనే రావణుని మీదకు దండెత్తి పోలేదు. దండెత్తటానికి సరైన కారణం దొరకగానే మొదట రావణాసురుని మిత్రుడైన వాలిని అణచివేసి, తనకు సంపూర్ణంగా సహకరించగల సుగ్రీవునితో స్నేహం చేసి అటుపిమ్మట దండయాత్ర చేసి రావణుని పూర్తిగా అణచివేశాడు.

అదీ రామునికి విశ్వామిత్రుడు నేర్పిన యుద్ధనీతి. ఆనాడు దశరథుడు చిన్నపిల్లవాడని రాముడిని పంపకుంటే, విశ్వామిత్రునికి తగిన శిష్యుడు దొరకకుంటే ఇప్పటికీ రావణరాజ్యం నడుస్తూ ఉండేదేమో.

ఇప్పుడు కూడా మన దేశానికి విశ్వామిత్రుల అవసరం ఉంది. తమ పుత్రులను విశ్వామిత్రుని శిష్యరికానికి పంపే దశరథమహారాజుల అవసరం ఉంది. విశ్వామిత్రయజ్ఞం అవసరమైనపుడల్లా జరిగితే గాని, ప్రపంచం సురక్షితంగా ఉండే అవకాశం లేదు. 

Previously posted here:
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/2953553781431949


 తొలిజామున చిరునవ్వుతో వికసించిన ఈ చిన్ని పూవు సొగసు చూడండి.


బహువర్ణరంజితమై విరాజిల్లే ఈ అద్భుతప్రపంచం పుట్టంధునికి కనబడదు, దాన్ని ఎంతగా వర్ణించి వర్ణించి చెప్పినా అతడికి అర్థం కాదు. అతడికి జలపాతపు హోరు వినిపిస్తుందే తప్ప జలపాతం కనిపించే అవకాశం లేదు.

సుమధురమైన వివిధసంగీతధ్వనులను, ప్రాకృతికశబ్దమాధుర్యాలను ఒక చెవిటి వాడు ఎంతమాత్రం వినలేడు. కోకిలను చూస్తాడు, నెమలిని కూడా చూస్తాడు, వాటి వర్ణాలను తప్ప వాటి గళాలను గ్రహించలేడు. కచేరీలో పాడుతున్న బాలమురళీకృష్ణకు, పని చెడగొట్టిన నౌకరును తిడుతున్న యజమానికి నడుమ పెద్ద తేడా లేదని అతనికి అనిపించవచ్చు. స్వరాలెన్నో తెలియని మనం కూడా శ్రుతిలయలను గ్రహించి ఆనందిస్తాం. ఆరోహణలను అవరోహణలను విని తన్మయులమవుతాం. వాటిని గూర్చి ఎంత చెప్పినా ఆ చెవిటివానికి అర్థం కాదు.

ప్రతి జ్ఞానానికి ఒక ఇంద్రియం సహకరించాలి.
వర్ణజ్ఞానానికి కన్నులు కావాలి. శబ్దజ్ఞానానికి చెవులు కావాలి. స్పర్శజ్ఞానానికి చర్మం కావాలి. రుచిని గ్రహించేందుకు నాలుక కావాలి. వాసనను తెలుసుకొనేందుకు ముక్కు కావాలి. ఇవన్నీ ఉంటే చాలదు. వీటన్నిటిని సమన్వయించేందుకు మనసు కావాలి. ఆ మనసు రోగగ్రస్తం కాకుండా, దారి తప్పకుండా మన స్వాధీనంలో ఉంటే భౌతికవిజ్ఞానమంతా మన సొత్తు కాగలదు.

నా భాష సులువని నాకు అనిపించేందుకు కారణం నా మనసు. లెక్కలు కష్టమని అనిపించేందుకు కారణం కూడా నా మనసే. అంత మాత్రాన భాష గొప్పదని, గణితం కొరకరాని కొయ్య అని నేను నిర్ణయిస్తే అది నా మూర్ఖత్వం.

మన జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, మనసుకు కూడా పరిమితమైన శక్తులు మాత్రమే ఉంటాయి. నా కండ్లు ఎంత బాగా చూడగలిగినా గోడ అవతల ఏముందో చూడలేవు. నేను ఎంత బలవంతుడినైనా కొండను ఎత్తలేను. నా కాళ్లు చేతులు ఎంత పొడుగైనా నేను సముద్రం ఈదలేను.

అంత మాత్రాన గోడకు ఇవతల కనిపించింది మాత్రమే సత్యమని, గోడ అవతల ఏమీ లేదని, నేను ఎత్తగలిగిన నా కంచమే ఉపయోగకరమైనదని, నేను ఎత్తలేని ఆ కొండ పనికి మాలినదని, నేను ఈదగలిగిన పంట కాలువ ప్రాణప్రదాయిని అని, నేను ఈదలేని ఈ సముద్రం నీరు పంటకు పనికిరాదని - ఇలా వాటిని నిందించడం మన అజ్ఞానానికి చిహ్నం. సంపూర్ణమైన అజ్ఞానానికి ఇవన్నీ గట్టి నిదర్శనాలు.

అలాగే, సైన్సు పేరిట మనకు అర్థమైంది కాబట్టి అది గొప్పదని, శాస్త్రం పేరిట ఉన్నది మనకు అర్థం కాలేదు కాబట్టి అది పనికిమాలినదని తీర్మానాలు చేయడం కూడా అజ్ఞానమే. పరిపూర్ణమైన అజ్ఞానమే. అజ్ఞానం అనే పదాన్ని మించి దాన్ని వర్ణించడానికి ఇంకో పదమేదైనా ఉంటే, అది కూడాను.

నేనెత్తగలిగిన కేజీ బరువును చీమ ఎత్తలేదు కాబట్టి, తేనెటీగ మోయలేదు కాబట్టి, చీమలను, తేనెటీగలను అల్పప్రాణులు అని నేను అనవచ్చు. కాని, అవి అదృశ్యమైన రోజుకు నేను అంతరించిపోయే రోజుకు పెద్ద దూరం ఉండదు.

నూరేండ్లు తదేకధ్యానంతో అధ్యయనం చేసినా ఒకే ఒక్క branch of science ను అవగాహన చేసుకొనడం కూడా ఒక మనిషికి సాధ్యం కాదు. కాని, ఆ మనిషి తాను సమస్తవిజ్ఞానాన్ని, సమస్త శాస్త్రాలను, ఔపోసన పట్టినట్లుగా, ఇదే గొప్పది, ఇదే పనికివచ్చేది, అది మాత్రం పనికిమాలినది అని పెదరాయుడిలా తీర్పులివ్వడం ఉంది చూశారూ? అది కూడా సంపూర్ణమైన అఖండమైన అజ్ఞానమని నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను.

Previously posted at
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/2390853931035273

Friday, 6 August 2021

ఆర్యులు - దస్యువులు

 


అత్యంతప్రాచీనకాలంలోనే ఆర్యులు తమ జీవనవిధానంలో సాధించిన ప్రగతిని, వారి విజ్ఞానవైభవాన్ని ప్రపంచమంతా గుర్తించింది, వేనోళ్ల కొనియాడింది.

అంతే! యూరోపియన్ సమాజం ఉలిక్కిపడింది. తాము కాలనీగా మార్చుకున్న దేశం సాంస్కృతికంగా తమకంటె గొప్పదని, అక్కడి ప్రజలు తమకంటె గొప్పదైన ఉదారమైన వైభవోపేతమైన అతిప్రాచీనమైన మహానాగరికతకు వారసులు అని ఒప్పుకునేందుకు వారికి ఏమాత్రం మనసొప్పలేదు.
అందువల్ల ఒక దొంగ చరిత్రను సృష్టించి ప్రపంచానికి బోధించడం మొదలు పెట్టారు. మధ్య-ఆసియాలో ఆర్యజాతి ఒకటి ఉండేదని, ఆ జాతికి చెందిన జనాలు తూర్పున ఉన్న భారతదేశానికి పోయి అక్కడ స్థానికులైన దస్యులను జయించి రాజ్యాలు స్థాపించారని, ఆ ఆర్యులే వేదాలు వ్రాశారని, భారతీయనాగరికత అంతా ఆర్యనాగరికత అని భారతీయుల గొప్పదనం అంటూ ఏమీ లేదని పాఠ్యపుస్తకాలలో చేర్చి పాఠాలు నేర్పుతూ, భారతీయులలో తరతరాలకు సరిపడా ఆత్మన్యూనతభావాన్ని కూరి కూరి పెట్టారు.
అందువల్లనే ఈనాటికి కూడా మనవాళ్లు ఆ విదేశీయుల విజ్ఞానం లేకుంటే మనం పశుప్రాయులుగా బ్రతికేవారమని భ్రమపడుతూ మనసులోనే వారికి పాదాక్రాంతులై, వారు మన దేశాన్ని వదిలి ఏనాడో వెళ్లిపోయినా, వారికి మానసబానిసలై జీవిస్తూ, వారు చెప్పిన మాటే వేదవాక్కని, వారిలాగ బ్రతకాలని, వారు ముద్ర వేస్తేనే ఏదైనా సత్యమౌతుందని, వారి భాష నేర్చుకుంటేనే తమ బ్రతుకు ధన్యమైపోతుందని, వారి నడత నేర్చుకుని వారిని అనుకరిస్తేనే తమ బ్రతుకు సార్థకమౌతుందని కలలు గంటూ ఇతరులను కూడా తమలాగే నమ్మింపజూడడం మనం గమనిస్తూనే ఉన్నాం.
కాని, మన గ్రంథాలను చదువుతూ ఉంటే ఆర్య అనే పదాన్ని మనవారు గుణవాచకంగా ఉపయోగించారనే విషయం స్పష్టంగా అవగాహనకు వస్తుంది.
శ్రీకృష్ణుడు కౌరవపాండవుల మధ్యలో సంధికోసం హస్తినాపురం వచ్చినపుడు పాండవుల తల్లి, తన మేనత్త అయిన కుంతీదేవి ఆశీస్సులు కోరి ఆమెను కలిశాడు. అపుడు కుంతీదేవి తన కోడలైన ద్రౌపదికి, తన కుమారులకు కౌరవుల వలన కలిగిన అవమానాలను, కష్టాలను, దుఃఖాలను స్మరించింది. దుర్యోధనాదులను అనార్యులని నిందించింది.
అంతే కాదు, ద్రౌపదీవస్త్రాపరహణం జరుగుతుండగా అక్కడ అవాక్కులై నిలిచిన ధృతరాష్ట్ర-బాహ్లిక-కృపృ-సోమదత్త-భీష్మ-ద్రోణాదులందరినీ ఆమె అనార్యబుద్ధితో నిలిచినవారుగానే పరిగణించేసింది. ఆ సభలో అందుకు అభ్యంతరం తెలిపిన విదురుడు ఒక్కడే ఆర్యుడని భావిస్తున్నానని చెప్పింది.
"వృత్తేన హి భవత్యార్యః, న ధనేన న విద్యయా"
(ఉద్యోగపర్వం 90.53)
"ఓ కృష్ణా, పెద్ద ఎత్తున ధనాన్ని (రాజ్యాన్ని, అధికారాన్ని కూడా) సంపాదించినంత మాత్రాన, లేదా గొప్ప గొప్ప శాస్త్రాలు చదివి మహా మేధావి అనిపించుకున్నంత మాత్రాన ఒక మనిషిని మనం ఆర్యుడు అని పిలువలేము. కేవలం శీలం (మంచి నడవడిక) చేతనే ఏ మనిషి అయినా ఆర్యశబ్దవాచ్యుడు కాగలడు"
అని కుంతీదేవి ఆర్యశబ్దనిర్వచనం చేసింది. కృష్ణుడు అవునంటూ ఆమోదముద్ర వేశాడు.
కాబట్టి, ఆర్య అనేది గుణాన్ని తెలిపే పదం. ఒక జాతిని గూర్చి చెప్పేది కానే కాదు.
అలాగే, వసిష్ఠస్మృతి కూడా ఆర్యపదాన్ని నిర్వచించింది.
కర్తవ్యమాచరన్ కామమ్, అకర్తవ్యమనాచరన్।
తిష్ఠతి ప్రకృతాచారే స వా ఆర్య ఇతి స్మృతః।।
ఏ మనిషి తనకు అప్పజెప్పిన కర్తవ్యాన్ని లేదా సమాజం చేత శాస్త్రాల చేత మంచివని అంగీకరించబడిన పనులను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటాడో, అలాగే ఆ సమాజం, ఆ శాస్త్రాల చేత చేయరానివని చెప్పబడిన పనుల జోలికి పోకుండా ఉంటాడో, తాను ఉన్న సమాజంలోని ఆచారాలకు కట్టుబడి ఉంటాడో అతడు ఆర్యుడు. (కామమ్ అనే పదానికి ఇక్కడ ఇష్టపూర్వకంగా, మనఃస్ఫూర్తిగా, చక్కగా, సంపూర్ణంగా అని అర్థం)
అంటే, సమాజానికి హితం కలిగించేవాడు, సమాజానికి ఎంత మాత్రం హాని కలిగించనివాడు, అనూచానంగా పరంపరగా వస్తున్న సదాచారాలను గౌరవించేవాడు ఆర్యుడు అని వసిష్ఠస్మృతి అభిప్రాయం.
ఈ నిర్వచనాల ప్రకారం ఆర్యశబ్దం ఒక జాతిని సూచించటం లేదని, కేవలం మనిషిలోని సద్గుణాలను మాత్రం సూచిస్తోందని తెలుస్తోంది.
ఆ ఆర్యులకు దస్యులకు యుద్ధం జరిగిన మాట వాస్తవమే. అయితే దస్యులు అంటే స్థానికులు అని అర్థం కాదు.
దస్యులు అంటే - దస్యంతి ఇతి దస్యవః - నాశనం చేసే స్వభావం కలవారు కాబట్టి వారిని దస్యులు అన్నారు.
అంటే పురాణకాలంలో మునుల యజ్ఞయాగాదులను ధ్వంసం చేసి, వారిని చంపివేసిన హిరణ్యకశిపుడు, రావణుడు వంటి వారు దస్యులు. అలాగే చరిత్రలో మన దేశం పైకి దండెత్తి, మన దేవాలయాలను కూలగొట్టి అపారమైన సంపదను దోచినవారు, మన గ్రంథాలయాలను తగులబెట్టినవారు, మన స్త్రీలను అపహరించినవారు వీరందరూ కూడా దస్యులే.
ఆ దస్యువులే అసురులు. దేవాసురులు ఒకే తండ్రి కన్నబిడ్డలన్న మాట నిజమే. కాని, మేము మాత్రమే ఉండాలి, మేము చెప్పినదే జరగాలి, మేము చెప్పినట్లే అందరూ నడచుకోవాలి, అని అందరినీ బెదిరించడం, అందుకు అంగీకరించకపోతే వారిని అన్ని విధాలుగా హింసించడం, సంహరించడం, తరిమివేయడం, వారి సంపదను స్వాధీనం చేసుకొనడం, ఇవన్నీ అసురుల పనులు.
ఈ దేవాసురసంగ్రామం భారతదేశంలో నిత్యం జరుగుతూనే ఉంది. నిన్న గాక మొన్న పాకిస్థానంలో గణపతిమందిరాన్ని వారు దగ్ధం చేసిన విషయం స్మరించండి.
కాబట్టి. భారతదేశంలో మొదటినుండి ఉన్నది ఆర్యులే. అనార్యులు మాత్రమే ఈ దేశం మీదకు దండెత్తి వచ్చారు. ఇక్కడి సదాచారాలను నాశనం చేశారు. చేస్తూనే ఉన్నారు. మరలా ఓ భయంకరమైన యుద్ధం అనివార్యంగా జరిగి తీరుతుంది. అజ్ఞానం కొద్దీ అటువంటి అనార్యబుద్ధులను మన అన్నదమ్ములలో కూడా కొందరు సమర్థిస్తున్నారు.
కాని, అనివార్యమైన కొత్త తరం దేవాసురయుద్ధం మొదలయ్యేసరికి ఏ పక్షంలో ఉండాలో వారు స్పష్టంగా ముందే తేల్చుకుంటే మంచిది. చివరకు గెలిచేది ధర్మమే గాని. బలం, ధనం కాదు. దుర్యోధనుడి 11 అక్షౌహిణీల సైన్యం ధర్మరాజు 7 అక్షౌహిణీల చేతిలో చిత్తైనాయి. శతాధికులైన కౌరవులు పంచపాండవుల చెేతిలో మన్ను గరచారు.
యతో ధర్మః తతో జయః।
ధర్మం ఏ పక్షాన ఉంటుందో ఆ పక్షమే గెలుస్తుంది.
ధర్మో రక్షతి రక్షితః।
ధర్మం ఎవరి చేత కాపాడబడుతుందో వారిని ఆ ధర్మమే రక్షిస్తుంది.

Friday, 2 October 2020

ప్లాస్టిక్ ను తినే పురుగు

 


వ్యాక్స్ వామ్స్ అని పిలువబడే ఈ పురుగులు ప్లాస్టిక్ను తినేస్తాయి అని, దానిని ఒక ఉపయోగకరమైన రసాయనపదార్థంగా మార్చేస్తాయి అని అంటున్నారు.

ప్లాస్టిక్ త్వరగా నశించేది కాదని, మన ఇల్లైన భూగోళంపై భూమ్మీద, నీటిలోనూ గాలిలోనూ కూడా శతాబ్దాల తరబడి నిలిచిపోతుందని, అది పర్యావరణాన్ని దెబ్బ తీస్తుందని, మనుషులు, ఇతరజంతుజాలం దాని వలన క్రమంగా నశిస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతూ వస్తున్నారు.  అయినప్పటికీ, వర్తమానమే తప్ప భవిష్యత్తు పట్ల బాధ్యత లేని మనుషులు ఆ మాటలను ఎంత మాత్రం పట్టించుకోకుండా ప్లాస్టిక్ ను వాడుతూనే ఉన్నారు.  అందువల్ల ప్లాస్టిక్ ను నిషేధించడమే సరైన చర్య అని ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రపంచమంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. 

అయితే ప్లాస్టిక్ వ్యాపారులు మాత్రం ఇటువంటి ప్రచారాలు ఆందోళనలు తమ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి మాత్రమే జరుగుతున్నాయని పోటీగా ఎదురు ప్రచారం చేస్తున్నారు.  ప్లాస్టిక్ సంచుల బదులు కాగితం సంచులు వాడితే వాటి కోసం చెట్లను పెద్ద ఎత్తున నరకవలసి ఉంటుందని, దానివల్ల మాత్రం పర్యావరణం దెబ్బతినదా అని ప్రశ్నిస్తున్నారు.  ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా గాజును వాడితే ఆ గాజు కూడా పర్యావరణంలో అంత త్వరగా కలిసిపోయేది కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు.  ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా రకరకాలో లోహాలను వాడితే వాటిని భూమినుండి బయటకు తీసుకురావడం కోసం గనులు తొలచవలసి ఉంటుందని, దానివలన పర్యావరణ హాని కలుగదా అని ప్రశ్నిస్తున్నారు. 

ఇప్పుడు క్రొత్తగా ఈ వ్యాక్స్ వామ్స్ అనేవి ప్లాస్టిక్ ని తింటాయని, ప్లాస్టిక్ వ్యర్థాలను అవి అదుపుచేయగలవని,  అందువలన ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం కూడదని, మిగిలిన పదార్థాలలాగానే ప్లాస్టిక్ ను కూడా స్వేచ్ఛగా, నిరభ్యంతరంగా ఇకమీదట ఉత్పత్తి చేయవచ్చునని వారు వాదిస్తున్నారు.

అసలు ఏమిటి ఈ వ్యాక్స్ వామ్స్?

ఇది చిమ్మట (moth) జాతికి చెందినది.  దీని జీవితచక్రం సీతాకోకచిలుక లాగానే, గుడ్డు - లార్వా - కకూన్ - రెక్కల పురుగు అనే దశలలో గడుస్తుంది. 

వీటిని మనం మైనం తినే పురుగులు అని వ్యవహరించవచ్చు.  తేనెటీగలు తన గూడును మైనంతో నిర్మించుకుంటాయి.  ఆ మైనం కూడా పాలిమర్ అని ప్లాస్టిక్ తరగతికి చెందినది.   ఈ వ్యాక్స్ వామ్స్ అని పిలువబడుతున్న పురుగులు ఆ మైనాన్ని తిని బ్రతుకుతాయి. 

అందువల్ల ఆ పురుగులు ప్లాస్టిక్ ను కూడా తినగలవా అని కోణంలో కొన్ని పరిశోధనలు జరిగాయి. 

 

ఫ్రెడరిక్ ఆ బెట్రోచ్చిని అనే శాస్త్రజ్ఞురాలి నాయకత్వంలో ఈ విధమైన పరిశోధనలు జరిగాయి.  ఆమె స్పెయిన్ దేశస్థురాలు.  యూనివర్సిటీ ఆఫ్ కాంటబ్రియాలో జీవశాస్త్రజ్ఞురాలు. 

అయితే ఈ పరిశోధనకు బీజభూతమైన సంఘటన ప్రయత్నపూర్వకంగా కాకుండా, ఆకస్మికంగా జరిగింది.  ఆమె తన తోటలో తేనె వ్యవసాయం చేస్తుంది.  ఒకసారి ఆమె తోటలోని తేనెగూడులలో ఉన్న కొన్ని మైనం పురుగులను తీసి ఒక ప్లాస్టిక్ సంచి మీద పెట్టడం జరిగింది.  ఒక గంట తరువాత చూస్తే ఆ ప్లాస్టిక్ సంచులకు రంధ్రాలు ఉన్నాయట. 

మనమైతే ఎందుకలా రంధ్రాలు పడ్డాయి అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోము.  ఎందువల్లనంటే మన దృష్టిలో ప్లాస్టిక్ ఒక వ్యర్థపదార్థం.  దానిని వాడుకోవడం పూర్తి అయిన తర్వాత దానిని మనం ఒక చెత్త బుట్టలో నిర్లక్ష్యంగా విసిరేస్తాం.  అంతే.  దానికి రంధ్రాలు పడినా, పడకపోయినా మనకు అనవసరం.  అసలు దానిని మనం పట్టించుకోం.  మన దృష్టి అంతవరకే. 

అయితే బెట్రోచ్చిని జీవశాస్త్రజ్ఞురాలు.  ఆమెది పరిశోధనాదృష్టి.  హఠాత్తుగా ప్లాస్టిక్ కు ఎందువల్ల కన్నాలు పడ్డాయి అనే కోణంలో ఆమె ఆలోచన చేసింది.  మైనం పురుగు లార్వా ప్లాస్టిక్ ను తినడం వల్ల ఈ విధమైన రంధ్రాలు ఏర్పడ్డాయి అని ఆమె తెలుసుకున్నది.  ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  ప్లాస్టిక్ ను తినే పురుగులు ఉన్నాయి అని ఆమె ఆ విధంగా కనుగొన్నది.

అప్పుడు ఆమె తన తోటి శాస్త్రజ్ఞులు అయిన బొంబెల్లి, క్రిస్టఫర్ హొయెలతో కలసి మరింత జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలించడం మొదలు పెట్టింది. 

వారు నూరు మైనం పురుగులను వారు ఒక పాలితిన్ ప్లాస్టిక్ బ్యాగు మీద వదిలిపెట్టారు.  తెల్లవారేలోగా ఆ పురుగులన్నీ కలసి 92 మిల్లీగ్రాముల ప్లాస్టిక్ ను తినేశాయి.  పరిశోధన మరింత ముందుకు సాగింది.

కేవలం బ్రతికి ఉన్న పురుగులు మాత్రమే ప్లాస్టిక్ ను తినడం ద్వారా ప్లాస్టిక్ ను నాశనం చేయగలవా లేక ఆ పురుగుల శరీరగతకణాలు కూడా ప్లాస్టిక్ ను నాశనం చేయగలవా అనే కోణంలో కూడా వారు పరిశోధనలు చేశారు.  వారి పరిశోధన విజయవంతమైంది.  చనిపోయిన పురుగుల అవశేషాలను కూడా ప్లాస్టిక్ మీద ఉంచితే ఆ ప్లాస్టిక్ నశిస్తుంది అని వారు తెలుసుకున్నారు.  కాలుష్యంతో కునారిల్లిపోతున్న ప్రపంచానికి ఇది ఎంతో శుభవార్త. 

ఆ మైనం పురుగులలోని ఎంజైములు ప్లాస్టిక్ పదార్థమైన polyethylene ను ethylene glycol అనే రసాయనపదార్థంగా మారుస్తున్నాయి అట.  ఆ రసాయనపదార్థాన్ని ఒక వస్తువు గడ్డకట్టకుండా వాడుతుంటారు.    (హిమాలయాలలో ఉండే మన సైనికులకు ఈ రసాయన పదార్థం చక్కగా ఉపయోగపడుతుంది కదా?)

ఆ ఎంజైములు ఏమిటో, వాటి స్వభావం ఎటువంటిదో తెలుసుకుంటే ఆ ఎంజైములు కేవలం మైనం పురుగులలో మాత్రమే లభిస్తాయా లేక ఇతరత్రా కూడా లభిస్తాయా అనే విషయం అర్థం చేసుకోవచ్చు.  తద్వారా వాటిని తగిన మొత్తంలో ఉత్పత్తి చేయడం ద్వారా త్వరగా పర్యావరణంలో కలిసిపోయే విధంగా ప్లాస్టిక్ ను తయారు చేయవచ్చు అని ఆశిస్తున్నారు.

స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు కూడా వేరొక రకమయిన బ్యాక్టీరియా  ethylene terepthalate  అనే ప్లాస్టిక్ ను నాశనం చేయగలవని కనుగొన్నారట.

ఈ విధంగా ప్లాస్టిక్ ను నాశనం చేయగలిగిన అటువంటి పురుగులు కీటకాలు మనకు తెలియనివి ఇంకా చాలా ఉండవచ్చునని, ఇంకా చాలా పరిశోధనలు జరగవలసి ఉంది అని శాస్త్రజ్ఞులు అంటున్నారు.

అయితే ఒక పదార్థం నాశనం కావడం అనేది నిజానికి జరగదు.  అది వేరొక పదార్థంగా మార్చబడుతుంది.  అంతే.  అందువలన, ప్లాస్టిక్ నాశనమై వేరొక పదార్థంగా మారినప్పుడు అది మానవాళికి, అనేక జీవరాసులతో కూడిన పర్యావరణానికి ఎంతవరకు హాని కలగకుండా ఉంటుంది అనే దానిని బట్టి ఈ పరిశోధనలు ముందుకు సాగుతాయి.   మనకు ఒక పరిష్కారమార్గాన్ని సూచిస్తాయి.  ఆయా బ్యాక్టీరియా ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ కంటే మరింత ప్రమాదకరమైన పదార్థాన్ని ఉత్పత్తి చేస్తే మనం పెనం నుంచి పొయ్యిలోకి పడ్డట్టే.  అటువంటప్పుడు ఆ పరిశోధనలు ఇక ముందుకు సాగవు.  పైపెచ్చు ఆ బ్యాక్టీరియా ప్లాస్టిక్ జోలికి పోకుండా కాపాడుకోవలసిన ఎటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. 

అంతే కాదు, ఈ మైనం పురుగులు ప్లాస్టిక్ ను నాశనం చేస్తాయి ఆ విధంగా మనకు ఉపకారం చేస్తాయి అనే దృష్టితో మనం ఈ పురుగులను ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తి చేయడానికి పూనుకుంటే, కాలక్రమేణ అవి ప్రపంచంలో ఉండే ప్లాస్టిక్ మొత్తాన్ని తినేసి సంఖ్యాపరంగా చివరకు మనుషులకు ప్రమాదాన్ని కలిగించే స్థాయికి చేరుకుంటాయి అని భయం కూడా కలగవచ్చు. 

అయితే ఆ భయం అవసరం లేదు.  ఎందువల్లనంటే ఈ పురుగులకు లెక్కలేనన్ని పక్షులు సహజశత్రువులు.  (అంటే రకరకాల పక్షులకు ఇవి సహజమైన ఆహారం.)  ఈ పురుగులను చేపలు పట్టే గేలానికి ఎరగా  వాడుతూ ఉంటారు.  పైగా ఇవి మంచి ప్రోటీన్లు కలిగి ఉంటాయట. అందువల్ల కొన్ని దేశాలలో వీటిని వేయించి బొరుగులు తిన్నట్టు తింటూ ఉంటారట. 

ప్రస్తుతం ప్రపంచంలో సంవత్సరానికి 300 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థంగా భూమిని ఆక్రమించుకుంటూ ఉంది.  8 మిలియన్ టన్నుల వ్యర్థమైన ప్లాస్టిక్ సముద్రాలలో కలుస్తూ ఉంది. 

మనం తినే తిండిలోను, మనం పీల్చేగాలిలోను కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని, అవి క్రమక్రమంగా మన శరీరంలో ప్రవేశిస్తున్నాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.  అందువలన మనుషులలో పునరుత్పత్తిసామర్థ్యం తగ్గిపోతుందని, స్థూలకాయం పెరిగిపోతుందని, గుండె జబ్బులు అధికమవుతాయని, పిల్లల్లో ఎదుగుదల సమస్య ఏర్పడుతుందని చెబుతున్నారు.

అందువల్ల, ప్లాస్టిక్ ను నాశనం చేసే ఇటువంటి మైనం పురుగులు, వాటిలో ఉండే ఎంజైములు, అటువంటి బ్యాక్టీరియా మనిషికి మిత్రులు.  మనం మిత్రులను కాపాడితే ఆ మిత్రులు మనలను కాపాడగలవు.

ధర్మో రక్షతి రక్షితః.

Tuesday, 15 September 2020

మోత - మోత - మోత


కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు కాని, కాకి తన పిల్లను మోయడం ఎప్పుడైనా ఎవరైనా చూశారా?
సమస్తప్రాణికోటులకు చెందిన తల్లులు తమ తమ సంతానాన్ని ఎంతో కొంత కాలం గర్భంలో మోస్తారు. ఆ తరువాత కూడా, అంటే గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రాణులు తమ సంతానం స్వయంగా సంచరిస్తూ ఆహారాన్ని సంపాదించుకునే శక్తి వచ్చేవరకు వాటిని మోస్తూనే ఉంటాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే, తమ సంతానం తమ శత్రువుల నుండి తమంతట తాముగా కాపాడుకొనే స్థాయికి చేరుకునేంతవరకు స్వయంగా మోస్తూ కాపాడుతూ ఉంటాయి.
పాపం జింకలు, దున్నలు, గుఱ్ఱాలు, గోవులు, మేకలు, గొఱ్ఖెలు వంటి జంతువులు, చిలుకలు, పావురాలు, కోళ్లు వంటి పక్షులు తమ పిల్లలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయగలవు కాని, వాటిని ఎత్తుకొని దూరంగా పరుగెత్తడం వాటికి సాధ్యం కాదు. అందువల్లనే అవి అధికంగా వేటాడబడుతూ ఉంటాయి.
కోతి జాతికి చెందిన చింపాంజీలు, గొరిల్లాలు, ఉరాంగుటానులు, బబూనులు, మాండ్రిళ్లు, కొండముచ్చులు మొదలైన ప్రాణులన్నీ తమ పిల్లలను వీపుమీద మోస్తాయి.
మార్సూపియల్ జాతికి చెందిన కంగారూలు, వల్లబీలు తమ పిల్లలను తమ పొట్టలోని సంచిలో మోసుకొని తిరుగుతుంటాయి. ఇటువంటి జంతువులు దాదాపు 250 రకాలు ఉన్నాయి అంటారు.
పిల్లి జాతికి చెందిన పిల్లి, పులి, సింహం, చిరుత అన్నీ తమ పిల్లలను నోటితో మోస్తాయి.
నీటిలో ఈదే పక్షులు ఈదేటపుడు తమ పిల్లలను వీపుపై మోస్తాయి.
చీమలను చెదలను ఆహారంగా తీసుకునే అలుగులు కూడా తమ పిల్లలను వీపుపై మోస్తాయి.
కొన్ని రకాల కప్పలు కూడా తమ పిల్లలను వీపుపై మోస్తాయి.
సాలీడు పురుగులు, తేళ్లు కూడా తమ పిల్లలను వీపుమీద మోస్తూ ఉంటాయి.
పిల్లి వేరు ఎలుక వేరు అని భావిస్తామేమో కాని, పిల్లలకు తల్లులుగా ప్రేమనందించే విషయంలో రెండూ సమానమే. ఎలుకలు కూడా తమ పిల్లలను నోటకరచుకొని మోస్తాయి.
ఈ విధంగా తమ తమ పిల్లలను ప్రేమతో మోసే ప్రాణులు ఈ ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నాయి.
అయితే,
ఇవన్నీ ఒక ఎత్తు, మనిషి వేరొక ఎత్తు.
సాధారణంగా మిగిలిన ప్రాణులను మోసేవి వాటివాటి తల్లులే కాని తండ్రులు కాదు. కాని, మానవజాతిలో తండ్రులు కూడా తమ సంతానాన్ని ఎత్తుకుంటారు. కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు, పిల్లల్ని ముద్దు చేస్తూ బంధువులు స్నేహితులు కూడా ఎత్తుకుంటారు. ఇలా ఎత్తు కొనడాన్ని మోత అనరు. ఆ పదాన్ని ఆ సందర్భంలో ఉపయోగిస్తే అవమానకరంగా కూడా భావిస్తారు. ఎత్తు కొనడం అనే పదాన్ని మాత్రం ప్రేమకు ఆప్యాయతకు చిహ్నంగా భావిస్తారు.
అయితే మనిషి ప్రేమ హద్దులు లేనిది. అతడు ప్రేమ కొద్దీ కేవలం తన సంతానాన్ని మాత్రమే కాదు, ఇతర జాతుల సంతానాన్ని కూడా ఎత్తుకుంటాడు. చిన్న పిల్లలు కూడా ఎంతో ప్రేమతో పిల్లి పిల్లలను, కుక్క పిల్లలను, మేక పిల్లలను, పక్షి పిల్లలను, ఎత్తుకుంటారు.
ఆవుదూడలకు పందిపిల్లలకు మధ్యలో తేడాను పెద్దవారు గ్రహించగలరేమో గానీ పిల్లలు మాత్రం ఆ రెండింటినీ సమానంగానే ముద్దు చేస్తారు.
అది మనిషి ప్రత్యేకత.
అయితే, తల్లిదండ్రులు అయినా స్నేహితులైనా, చుట్టాలైనా తమరి పిల్లలనైైనా, ఇంకెవరి పిల్లలనైనా కొంత వయసు వరకు మాత్రమే వారిని ఎత్తుకుంటారు. ఆ తరువాత కూడా వారిని ఎత్తుకుంటే చూసేవారికి కూడా వింతగానే ఉంటుంది. ఒక ఇరవై యేండ్ల పిల్లవాడిని తల్లిదండ్రులు ఎత్తుకొనడం మనం ఊహించగలమా? ఎప్పుడైనా ఎక్కడైనా ఆ విధమైన దృశ్యం చూస్తే, మనం ఆ పిల్లవాడికి కాళ్లు సరిగా లేవు కాబోలు, అందువల్లనే అతడిని తల్లిదండ్రులు మోస్తున్నారు అని జాలి పడతాం.
( ఈ సందర్భంలో ఎత్తుకున్నారు అనుకోం. ఎత్తుకొనడం ప్రేమకు చిహ్నమైతే మోయడం అనే పదం అనివార్యమైన భారానికి చిహ్నంగా మనం భావిస్తాం.)
అలా కాదు, కాళ్లు సక్రమంగానే ఉన్నాయి, ఆ ఇరవైయేండ్ల పిల్లవాడు నడవ గలడు, అయినప్పటికీ కూడా వాళ్లు ప్రేమ కొద్దీ ఎత్తుకుంటున్నారు అని తెలిస్తే, మనకు సంబంధం లేకపోయినా, ఆ అతి ముద్దును మనం భరించలేం. వారు ఎత్తుకుంటున్నారు అని కూడా అనుకోం. వారు ఆ పిల్లవాడిని మోస్తున్నారు అనే పదమే ఉపయోగిస్తాం.
అయితే నాగరికత పెరుగుతున్న కొద్దీ కొందరు మనుషులు కూడా మోయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు. అయితే వారు కూడా అందరినీ మోయటం లేదు. (అందరినీ పక్షపాతం లేకుండా మోయాలి అని చెప్పడం నా ఉద్దేశం కూడా కాదు.) వారు కొన్ని కొన్ని వర్గాల వారిని మాత్రమే ప్రత్యేకించి మోస్తున్నారు. అందులో చాలమందికి నడక వచ్చు. నడక ఏమిటి? పరుగెత్తగలరు. యుద్ధాలు కూడా చేయగలరు. ఇతరులను వేటాడి చంపనూ గలరు. అయినా సరే, అటువంటివారిని కూడా రాజకీయనాయకులు తల్లిదండ్రులు కంటె మిన్నగా వారిని మోస్తున్నారు.
నిజం చెప్పాలంటే, వారు వారిని స్వయంగా మోయటం లేదు. ఇతరుల చేత బలవంతంగా మోయిస్తున్నారు. వారు స్వయంగా మోయాలి అంటే తమ సొంత జేబులోంచి ఖర్చు పెట్టాలి. కాని, ఇతరులు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే సొమ్మును యథేష్టంగా తీసుకుంటూ వారిని తరతరాలుగా మోస్తున్నారు.
మోయండయ్యా, మోయండి. ముందే చెప్పినట్లుగా, ప్రపంచంలో ప్రతి ప్రాణీ మోస్తుంది. కాని, అవసరమైనంత కాలమే మోస్తుంది. ఆ తరువాత ఆ మోతను దించుకుంటుంది. ఇక మీరే స్వయంగా బ్రతకవలసిన సమయం వచ్చిందంటుంది. కాని, మీరు వారిని ఒక పట్టాన దించేలా లేరే?
మహానగరాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చిన్నపిల్లలను మోస్తూ, వారిని చూపిస్తూ, వారికి ఆకలేస్తుంది బాబూ అని దీనంగా మాట్లాడుతూ చేయి చాపి అడుక్కునే వారికి, మీకు కాస్త తేడా ఉండాలి కదా? నిజానికి అదొక పెద్ద మాఫియా అని కూడా అంటారు.
ఈవిధంగా చేస్తూ, మీరే స్వయంగా అందరినీ మోస్తున్నట్లుగా కీర్తిని పొందుతున్నారు. కాని, నిజంగా మోస్తున్న జనాలకు మాత్రం చచ్చే చావుగా ఉంది.



 

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...