Showing posts with label భారత్. Show all posts
Showing posts with label భారత్. Show all posts

Tuesday, 15 September 2020

మోత - మోత - మోత


కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు కాని, కాకి తన పిల్లను మోయడం ఎప్పుడైనా ఎవరైనా చూశారా?
సమస్తప్రాణికోటులకు చెందిన తల్లులు తమ తమ సంతానాన్ని ఎంతో కొంత కాలం గర్భంలో మోస్తారు. ఆ తరువాత కూడా, అంటే గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రాణులు తమ సంతానం స్వయంగా సంచరిస్తూ ఆహారాన్ని సంపాదించుకునే శక్తి వచ్చేవరకు వాటిని మోస్తూనే ఉంటాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే, తమ సంతానం తమ శత్రువుల నుండి తమంతట తాముగా కాపాడుకొనే స్థాయికి చేరుకునేంతవరకు స్వయంగా మోస్తూ కాపాడుతూ ఉంటాయి.
పాపం జింకలు, దున్నలు, గుఱ్ఱాలు, గోవులు, మేకలు, గొఱ్ఖెలు వంటి జంతువులు, చిలుకలు, పావురాలు, కోళ్లు వంటి పక్షులు తమ పిల్లలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయగలవు కాని, వాటిని ఎత్తుకొని దూరంగా పరుగెత్తడం వాటికి సాధ్యం కాదు. అందువల్లనే అవి అధికంగా వేటాడబడుతూ ఉంటాయి.
కోతి జాతికి చెందిన చింపాంజీలు, గొరిల్లాలు, ఉరాంగుటానులు, బబూనులు, మాండ్రిళ్లు, కొండముచ్చులు మొదలైన ప్రాణులన్నీ తమ పిల్లలను వీపుమీద మోస్తాయి.
మార్సూపియల్ జాతికి చెందిన కంగారూలు, వల్లబీలు తమ పిల్లలను తమ పొట్టలోని సంచిలో మోసుకొని తిరుగుతుంటాయి. ఇటువంటి జంతువులు దాదాపు 250 రకాలు ఉన్నాయి అంటారు.
పిల్లి జాతికి చెందిన పిల్లి, పులి, సింహం, చిరుత అన్నీ తమ పిల్లలను నోటితో మోస్తాయి.
నీటిలో ఈదే పక్షులు ఈదేటపుడు తమ పిల్లలను వీపుపై మోస్తాయి.
చీమలను చెదలను ఆహారంగా తీసుకునే అలుగులు కూడా తమ పిల్లలను వీపుపై మోస్తాయి.
కొన్ని రకాల కప్పలు కూడా తమ పిల్లలను వీపుపై మోస్తాయి.
సాలీడు పురుగులు, తేళ్లు కూడా తమ పిల్లలను వీపుమీద మోస్తూ ఉంటాయి.
పిల్లి వేరు ఎలుక వేరు అని భావిస్తామేమో కాని, పిల్లలకు తల్లులుగా ప్రేమనందించే విషయంలో రెండూ సమానమే. ఎలుకలు కూడా తమ పిల్లలను నోటకరచుకొని మోస్తాయి.
ఈ విధంగా తమ తమ పిల్లలను ప్రేమతో మోసే ప్రాణులు ఈ ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నాయి.
అయితే,
ఇవన్నీ ఒక ఎత్తు, మనిషి వేరొక ఎత్తు.
సాధారణంగా మిగిలిన ప్రాణులను మోసేవి వాటివాటి తల్లులే కాని తండ్రులు కాదు. కాని, మానవజాతిలో తండ్రులు కూడా తమ సంతానాన్ని ఎత్తుకుంటారు. కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు, పిల్లల్ని ముద్దు చేస్తూ బంధువులు స్నేహితులు కూడా ఎత్తుకుంటారు. ఇలా ఎత్తు కొనడాన్ని మోత అనరు. ఆ పదాన్ని ఆ సందర్భంలో ఉపయోగిస్తే అవమానకరంగా కూడా భావిస్తారు. ఎత్తు కొనడం అనే పదాన్ని మాత్రం ప్రేమకు ఆప్యాయతకు చిహ్నంగా భావిస్తారు.
అయితే మనిషి ప్రేమ హద్దులు లేనిది. అతడు ప్రేమ కొద్దీ కేవలం తన సంతానాన్ని మాత్రమే కాదు, ఇతర జాతుల సంతానాన్ని కూడా ఎత్తుకుంటాడు. చిన్న పిల్లలు కూడా ఎంతో ప్రేమతో పిల్లి పిల్లలను, కుక్క పిల్లలను, మేక పిల్లలను, పక్షి పిల్లలను, ఎత్తుకుంటారు.
ఆవుదూడలకు పందిపిల్లలకు మధ్యలో తేడాను పెద్దవారు గ్రహించగలరేమో గానీ పిల్లలు మాత్రం ఆ రెండింటినీ సమానంగానే ముద్దు చేస్తారు.
అది మనిషి ప్రత్యేకత.
అయితే, తల్లిదండ్రులు అయినా స్నేహితులైనా, చుట్టాలైనా తమరి పిల్లలనైైనా, ఇంకెవరి పిల్లలనైనా కొంత వయసు వరకు మాత్రమే వారిని ఎత్తుకుంటారు. ఆ తరువాత కూడా వారిని ఎత్తుకుంటే చూసేవారికి కూడా వింతగానే ఉంటుంది. ఒక ఇరవై యేండ్ల పిల్లవాడిని తల్లిదండ్రులు ఎత్తుకొనడం మనం ఊహించగలమా? ఎప్పుడైనా ఎక్కడైనా ఆ విధమైన దృశ్యం చూస్తే, మనం ఆ పిల్లవాడికి కాళ్లు సరిగా లేవు కాబోలు, అందువల్లనే అతడిని తల్లిదండ్రులు మోస్తున్నారు అని జాలి పడతాం.
( ఈ సందర్భంలో ఎత్తుకున్నారు అనుకోం. ఎత్తుకొనడం ప్రేమకు చిహ్నమైతే మోయడం అనే పదం అనివార్యమైన భారానికి చిహ్నంగా మనం భావిస్తాం.)
అలా కాదు, కాళ్లు సక్రమంగానే ఉన్నాయి, ఆ ఇరవైయేండ్ల పిల్లవాడు నడవ గలడు, అయినప్పటికీ కూడా వాళ్లు ప్రేమ కొద్దీ ఎత్తుకుంటున్నారు అని తెలిస్తే, మనకు సంబంధం లేకపోయినా, ఆ అతి ముద్దును మనం భరించలేం. వారు ఎత్తుకుంటున్నారు అని కూడా అనుకోం. వారు ఆ పిల్లవాడిని మోస్తున్నారు అనే పదమే ఉపయోగిస్తాం.
అయితే నాగరికత పెరుగుతున్న కొద్దీ కొందరు మనుషులు కూడా మోయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు. అయితే వారు కూడా అందరినీ మోయటం లేదు. (అందరినీ పక్షపాతం లేకుండా మోయాలి అని చెప్పడం నా ఉద్దేశం కూడా కాదు.) వారు కొన్ని కొన్ని వర్గాల వారిని మాత్రమే ప్రత్యేకించి మోస్తున్నారు. అందులో చాలమందికి నడక వచ్చు. నడక ఏమిటి? పరుగెత్తగలరు. యుద్ధాలు కూడా చేయగలరు. ఇతరులను వేటాడి చంపనూ గలరు. అయినా సరే, అటువంటివారిని కూడా రాజకీయనాయకులు తల్లిదండ్రులు కంటె మిన్నగా వారిని మోస్తున్నారు.
నిజం చెప్పాలంటే, వారు వారిని స్వయంగా మోయటం లేదు. ఇతరుల చేత బలవంతంగా మోయిస్తున్నారు. వారు స్వయంగా మోయాలి అంటే తమ సొంత జేబులోంచి ఖర్చు పెట్టాలి. కాని, ఇతరులు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే సొమ్మును యథేష్టంగా తీసుకుంటూ వారిని తరతరాలుగా మోస్తున్నారు.
మోయండయ్యా, మోయండి. ముందే చెప్పినట్లుగా, ప్రపంచంలో ప్రతి ప్రాణీ మోస్తుంది. కాని, అవసరమైనంత కాలమే మోస్తుంది. ఆ తరువాత ఆ మోతను దించుకుంటుంది. ఇక మీరే స్వయంగా బ్రతకవలసిన సమయం వచ్చిందంటుంది. కాని, మీరు వారిని ఒక పట్టాన దించేలా లేరే?
మహానగరాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చిన్నపిల్లలను మోస్తూ, వారిని చూపిస్తూ, వారికి ఆకలేస్తుంది బాబూ అని దీనంగా మాట్లాడుతూ చేయి చాపి అడుక్కునే వారికి, మీకు కాస్త తేడా ఉండాలి కదా? నిజానికి అదొక పెద్ద మాఫియా అని కూడా అంటారు.
ఈవిధంగా చేస్తూ, మీరే స్వయంగా అందరినీ మోస్తున్నట్లుగా కీర్తిని పొందుతున్నారు. కాని, నిజంగా మోస్తున్న జనాలకు మాత్రం చచ్చే చావుగా ఉంది.



 

Saturday, 16 May 2020

ప్రపంచం చూపు ఇండియా వైపు అంటున్న చైనా


జనరిక్ ఔషధాలను వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. కోవిద్ 19 వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్‌ను కనిపెట్టడంలో కూడా భారతదేశం కీలకమైన పాత్రను పోషించగలదని ప్రపంచ దేశాలన్నీ గట్టిగా నమ్ముతున్నాయి.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాతో గట్టి సంబంధాలు కలిగిన ఒక ప్రముఖ చైనా న్యూస్ పేపరు ఇండియా ఫార్మాసూటికల్ శక్తిని గూర్చి ఈ మధ్యనే ఇలా వ్రాసింది -
"భారతదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిరంగాన్ని పరిశీలిస్తే ఆ దేశం యొక్క ప్రగతిశీలత అర్థమవుతుంది. ఔషధాలను అభివృద్ధి చేసేందుకుగాను భారతదేశంలో శాస్త్రీయ పరిశోధనలు చాల బలంగా జరుగుతున్నాయి. జనరిక్ ఔషధాలు మరియు వ్యాక్సిన్ల తయారీలోను, ఉత్పత్తిలోను ప్రపంచంలోని అగ్రగామి దేశాలలో భారత్ ఒకటి. ఈ విధంగా వ్యాక్సిన్ ను స్వయంగా అభివృద్ధి చేసుకుని ఉత్పత్తి చేసే శక్తి గలిగిన భారతదేశం, ఇతరుల సహాయం లేకుండా తనకు తానుగానే కోవిద్ 19 పై పోరాటం చేయగలదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ, వ్యాక్సిన్ కు తమ దేశంలోనే చాలా డిమాండ్ ఉన్నప్పటికీ, అతి తక్కువ కాలంలోనే వ్యాక్సీన్ సాధించగల సామర్థ్యం భారతదేశం సొంతం. అటువంటి సామర్థ్యం ప్రపంచంలో మరే దేశానికీ లేదు. ఈ సందర్భంలో అంతర్జాతీయ గ్లోబల్ వ్యాక్సిన్ ఇండస్ట్రియల్ గొలుసుకు తన సహకారాన్ని అందించడంలో భారతదేశం ప్రముఖమైన పాత్రలను పోషించగలదని మేము హృదయపూర్వకంగా నమ్ముతున్నాము."
ఈవిధంగా, ఇంతగా ఒక చైనా పత్రిక భారత దేశాన్ని ప్రశంసించడమా? ఏమిటి కారణం?
దాని జిత్తులు దానికి ఉన్నాయి.
కరోనా రోగంపై పోరాటంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆర్థికంగా లాభ పడుతున్నది కేవలం చైనా మాత్రమే కాదని, వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు అమ్మడం ద్వారా భారతదేశం కూడా విపరీతంగా లాభపడుతుందని ప్రపంచానికి చాటి చెప్పడమే దాని ఉద్దేశం.
నిజానికి అనేక శతాబ్దాలుగా భారతదేశం యొక్క ఔషధాల తయారీ మరియు ఉత్పత్తి సామర్థ్యం చైనాకు తెలిసినంతగా బహుశః మరే ఇతర దేశానికీ తెలియదు.
తమ చైనా దేశంలో కంటె మెరుగైన ఆరోగ్యాన్నిభారతదేశంలో చవకగా పొందవచ్చుననే ఆశతో తమ దేశానికి వైద్యం కోసం వచ్చిన అనేక మంది చైనీయుల ప్రాణాలను భారతదేశం కాపాడింది.
ఈ నిజాన్ని అదే చైనా న్యూస్ పేపర్ ఒప్పుకుంది కూడా. కాలేయానికి సంబంధించిన జబ్బులను, క్యాన్సర్ జబ్బును నయం చేసుకొనేందుకు తగిన చికిత్స కోసం, ఔషధాల కోసం భారతదేశానికి వెడుతున్న చైనీయుల సంఖ్య రాను రాను మరింతగా పెరుగుతూ ఉన్నదని ఒప్పుకుంది.
ఈ విధంగా చైనీయులు భారతదేశం వైపు ఆకర్షింపబడడానికి కారణం కేవలం భారతదేశంలో వైద్య సేవలు తక్కువ ధరలకు లభించడం మాత్రమే కాదని, అవి చాల ఉన్నత స్థాయికి చెందినవై ఉండటం కూడా కారణమేనని ఒప్పుకున్నారు.
చైనాలో ఒకానొక శస్త్రచికిత్స జరుగుతున్నపుడు రక్తాన్ని ఎక్కిస్తున్న సమయంలో ఒక చైనా రోగి హెపటైటిస్-సి రోగానికి గురికావడాన్ని ఆ పత్రిక ప్రస్తావించింది. ఇక చైనాలో లాభం లేదని ఆమె మంచి వైద్యం కోసం భారతదేశం పోవడానికి నిశ్చయించుకొన్నది.
అలా భారతదేశానికి రావడానికి ముందే ఆమెకు లివర్ ఫైబ్రోసిస్ వ్యాధి మధ్యమస్థాయిలో ఉన్నది. అది సిర్రోసిస్ కు లేదా లివర్ క్యాన్సర్ కు దారితీసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అయినప్పటికి స్వదేశమైన చైనా దేశంలో చికిత్స చాలా ఖరీదైనది మాత్రమే కాక కనీసం సత్ఫలితాలను కూడా ఇవ్వకపోవడంతో ఆమె మెరుగైన వైద్యంకోసం భారతదేశానికి పోవాలని నిశ్చయించుకుంది.
అటువంటి స్థితిలోనే చివరకు ఆమె భారతదేశానికి వచ్చింది. భారతదేశపు వైద్యుల అంకితభావం, ప్రైవేటు వైద్యశాలల్లోని పరిశుభ్రత ఆమెకు ఎంతగానో నచ్చాయి. చైనాలో క్రిిక్కిరిసి పోయి ఉండే వైద్యశాల మాదిరిగా కాకుండా, భారతదేశపు ప్రైవేటు వైద్యశాలలు పరిశుభ్రమైన హోటళ్లలా ఉన్నాయి.
చవకైన భారతదేశపు ఔషధాలను చైనాకు స్మగుల్ చేసేందుకు చైనీయులు గతంలో ఏ విధంగా ప్రయత్నించారో కూడా ఆ పత్రిక వెల్లడించింది.
నిజమే.
గత అనేక సంవత్సరాలుగా భారత దేశం ఉన్నతస్థాయి ఔషధాలను అభివృద్ధి పరచి అందించడం ద్వారా, ప్రైవేటు రంగంలో అద్భుతమైన వైద్య వ్యవస్థను సృష్టించడం ద్వారా ప్రపంచానికి తన సేవలను నిశ్శబ్దంగా అందిస్తూ వస్తోంది.
BCG, మంప్స్, పోలియో, న్యూమోనియా, రూబెల్లా, మెనింజైటిస్, మీజిల్స్, ఇంకా అటువంటి అనేకవిధాలైన రోగాలకు తగిన మోతాదులో వ్యాక్సిన్లను తయారు చేయగల వివిధ సంస్థలకు భారతదేశం నిలయంగా మారింది.
ప్రస్తుతం కోవిడ్ 19 కు వ్యాక్సీన్ కనిపెట్టేందుకు ఒక అరడజను భారతదేశవైద్యసంస్థలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
Serum ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ సంస్థలలో ఒకటి.
తయారు చేసిన డోసుల సంఖ్య పరంగా చూసినా, లేదా అవి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోయిన సంఖ్య పరంగా చూసినా ప్రపంచంలోకెల్లా వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన అతి పెద్ద సంస్థ ఇదే.
ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 165 వివిధ దేశాలకు దాదాపు 20 రకాల వ్యాక్సిన్లను అందిస్తోంది.
ఈ విధంగా భారతదేశపు ఘనతను గుర్తించిన ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు యావత్ప్రపంచం ఒక్కటై పోరాటం చేస్తున్న ఈ సందర్భంలో కూడా భారతదేశం తమకు తగిన ఔషధాన్ని తయారుచేసి అందించగలదని ఆశిస్తున్నాయి.
వ్యాక్సీన్ ను ఎవరు కనిపెట్టినప్పటికీ, ఎక్కడ కనిపెట్టినప్పటికీ అది త్వరగా జరగాలని, సమస్తప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆశిద్దాం.
వీడియో - కరోలినా గోస్వామి

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...