Showing posts with label Bhagavata. Show all posts
Showing posts with label Bhagavata. Show all posts

Friday, 20 March 2020

అలిపిరిలో ఫణిమర్దనుడు




కశ్యపమహర్షికి ప్రియమైన భార్యలు ఇద్దరు. కద్రువ, వినత. ఇద్దరికీ పరస్పరమాత్సర్యం ఎక్కువ. ఒకసారి కద్రువ ఒకానొక పందెంలో తన కుమారులైన సర్పాల సహాయంతో వినతను మోసం చేసి తనకు దాసిగా చేసుకుంది. వైనతేయుడు కూడా (వినత కుమారుడైన గరుత్మంతుడు కూడా) ఆ కద్రువకు, కాద్రవేయులకు (కద్రువ కుమారులైన సర్పాలకు) దాసుడై వారు చెప్పిన ప్రతి పని చేయవలసి వచ్చేది.

ఇలా కాదు, మమ్మల్ని దాస్యం నుండి విడిచిపెట్టాలంటే మీకేం కావాలో చెప్పండి అన్నాడు గరుత్మంతుడు.

అమృతం తీసుకురా వదిలి పెడతాం అన్నారు సర్పాలు. గరుత్మంతుడు ఇంద్రుని ఓడించి వారికి అమృతం తెచ్చి ఇచ్చాడు. తనను, తన తల్లిని దాస్యం నుండి విడిపించుకున్నాడు. అయితే సర్పాలు అమృతం త్రాగకముందే ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. తనకు సహకరించినందుకు వరమిస్తానన్నాడు. అయితే నన్ను ఇంతకాలం ఏడిపించిన సర్పాలే నాకు ఆహారం కావాలన్నాడు గరుత్మంతుడు. తథాస్తు అన్నాడు ఇంద్రుడు.

ఆ విషయం తెలిసి సర్పాలన్నీ భయపడి రమణకద్వీపానికి పారిపోయాయి. అయినా గరుత్మంతుడు వాటిని వదలలేదు. అపుడు సర్పాలు గరుత్మంతుని వేడుకున్నాయి. తమ్ముడూ, మీ సోదరులమైన మమ్మల్ని చంపకు. మానవులు మాకు భయపడి మేము వారిని ఏమీ చేయకుండా ఉండేందుకు గాను ఆహారం సమర్పిస్తూ ఉంటారు. అందులో నీకు కూడా భాగమిస్తాం. అది స్వీకరించి మమ్మల్ని వదిలి పెట్టు అన్నారు. గొడవ ఎందుకులెమ్మని గరుత్మంతుడు సరేనన్నాడు.

అయితే సర్పాలన్నిటిలో కాళియునికి కాస్త బలగర్వం ఎక్కువ. ఒకరోజు గరుత్మంతునికి భాగం పెట్టకుండా తానే మొత్తం ఆహారం భుజించేశాడు. దాంతో గరుత్మంతుడు కోపగించి "వీని తలలు చీరి చెండాడి భోగంబు చించి వైచి ప్రాణములఁ బాపి వచ్చెద" అని విజృంభించాడు. కాళియుడు ధైర్యంగానే ఎదిరించాడు గాని, అప్పటికి గాని తన బలం గరుత్మంతుని ముందు ఎందుకూ కొరగానిది అని తెలిసిరాలేదు.

వెంటనే పాకిపోయి కాళింది మడుగు చేరాడు. ఆపత్కాలంలో వాలినుండి ఆత్మరక్షణకోసం సుగ్రీవునికి ఋశ్యమూకం దొరికినట్టు కాళియుడికి కాళింది మడుగు దొరికింది. కాళింది మడుగులోని జీవాలకు హాని చేస్తే గరుత్మంతుడు మరణిస్తాడు అని సౌభరి ముని శాపం ఉన్నది. ఆ విధంగా కాళియుడు యుక్తితో చావు తప్పించుకున్నాడు. గరుత్మంతుడు ఊరకున్నాడు.

ఆ తరువాత కాళియుడు కాళింది మడుగులో విజృంభించాడు. మడుగులోని సమస్తజలాన్ని విషమయం చేశాడు. దానిపైనుండి పక్షులు ఎగిరితే అందులో పడి చచ్చేవి. దాని మీదనుండి వచ్చిన గాలి సోకితే గట్టున దూరంగా ఉండే జీవులు కూడా చచ్చిపడవలసిందే! ఈ వ్యవహారం తమ పశువులకు, తమ మిత్రులకు ప్రమాదకరంగా పరిణమించే సరికి కృష్ణుడు ఈ సంగతేమిటో తేల్చేయాలనుకున్నాడు.

కటి చేలంబు బిగించి పింఛమునఁ జక్కం గొప్పు బంధించి దోస్తటసంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి తత్కుటశాఖాగ్రముమీఁదనుండి యురికెన్ గోపాలసింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానంబనూనంబుగన్.

కాళియుడికి కోపం వచ్చింది.
"బాలుండొక్కఁడు వీఁడు నా మడుఁగు విభ్రాంతోచ్చలత్కీర్ణ కల్లోలంబై కలఁగం జరించె నిట నే లోనుంటఁ జూడండు మత్కీలాభీలవిశాలదుస్సహవిషాగ్నిజ్వాలలన్ భస్మమై కూలంజేసెద నేడు నా కోపంబు దీపింపగన్"
అనుకున్నాడట.

చూడండి.
అదే పొగరంటే.
అది మామూలు పొగరు కాదు.
దానిని తల పొగరు అంటారు.

బలవంతుడైన శత్రువుకు భయపడి తలదాచుకొనేందుకు వచ్చినవాడు, ఆ మడుగు చొచ్చిన వాడు, ఆ మడుగులో మొదటినుండి ఉన్న మిగిలిన ప్రాణులతో స్నేహంగా ఉండక, అన్నిటినీ హతమార్చి, దురాక్రమణ చేసి, ఇపుడు నా మడుఁగు నా మడుఁగు అని రక్షకుడైన కృష్ణునిపైనే దౌర్జన్యం చేయబూనుకున్నాడు. ఆ తలపొగరు ఒక్క తలది కాదు. అది నూరు తలల పొగరు!

కాళియుడు నూరుతలలతోనూ బాలకృష్ణుని కరిచాడు. పెనవేసుకున్నాడు. ఒడ్డున చూస్తున్న వారందరూ భయభ్రాంతులైనారు. అయ్యయ్యో అని ఆర్తనాదాలు చేశారు.

ఆపై కృష్ణుని విజృంభణం మొదలైంది. కాళియుని తలలపై నృత్యం చేశాడు. కాళింది కెరటాల ఘోషలు మృదంగరావాలైనాయి. "మహితకాళియఫణిఫణామండపమున నళినలోచనవిఖ్యాతనర్తకుండు నిత్యనైపుణ్యమునఁ బేర్చి నృత్యమాడె" నట!

ఆ దెబ్బకు ఆ ఫణి (పాము) పడగలు బెండుపడిపోయాయి. యొండొండ ముఖంబుల రక్తమాంసంబులుమియ వచ్చాయి. కన్నుల విషంబు వెలిగ్రక్కబడింది. పాము ఉక్కు చెడింది. చిక్కింది. దిక్కులు చూచింది. కంఠగతప్రాణమైంది.

"బాలుఁడు మత్ఫణాశతము భగ్నముగా వెసఁ ద్రొక్కియాడెడిన్" అని భావించాడు.

అంతలోనే తటాలున కాస్త తెలివి తళుక్కుమంది.
మామూలు బాలుడు ఇంతటి పని చేయగలడా?

"ఈతడు సర్వచరాచరభూతేశుండైన పరమపురుషుండు" అని తెలుసుకున్నాడు.

ఇంతలో కాళియుని భార్యలు ఏడుస్తున్న తమ పిల్లలను వెంటేసుకుని వచ్చారు.

"క్రూరాత్ముని దండించుట క్రూరత్వము గాదు సాధుగుణము గుణాఢ్యా" అని కృష్ణుని ప్రశంసించారు.

చివరకు తమ భర్తను క్షమించమన్నారు. "చాలున్ నీ పదతాండవంబు పతిభిక్షంబెట్టి రక్షింపవే!" అని వేడుకున్నారు.

కాళియుడు కూడా శరణువేడాడు. "మనిచెదేనియు మన్నించి మనుపు నన్ను నిగ్రహించెదవేనియు నిగ్రహింపుమింక సర్వేశ్వరా" నన్నేమి చేసినా నీ యిష్టము" అనేశాడు.

"చూడు నాయనా! గోవులు, మనుషులు ఈ మడుగులో నీరు త్రాగుతూ ఉంటారు. ఇక్కడ నువ్వు ఉండటానికి వీల్లేదు. నువ్వు, నీ బంధువులు, మీ మీ భార్యాబిడ్డలతో సహా, ఈ మడుగును వదిలి సముద్రానికి పొండి. నీవును నీ బాంధవులును, నీ వనితలు సుతులుఁ జనుఁడు నేఁడంబుధికిన్" అని ఆజ్ఞాపించాడు.

అపుడు కాళియునికి తాను చేసిన పాత తప్పులు గుర్తుకొచ్చాయి. కాళింది మడుగులోనే తన ప్రతాపమంతా. బయటకు అడుగు పెడితే తక్షణమే గరుత్మంతుడు చీల్చి చెండాడేస్తాడు. ఇక్కడే ఉంటానంటే కృష్ణుడు దండిస్తాడు. తన మూర్ఖత్వం వల్ల, నూరు తలకాయలనిండా ఉన్న పొగరుల వల్ల, తాను సర్వస్థలభ్రష్టుడనైనానని తెలిసివచ్చింది పాపం.

కృష్ణుడు అతడి ఆలోచనను గ్రహించాడు. చిరునవ్వు నవ్వాడు. "భయపడకు కాళియా, నీ పడగలపై నా పాదముద్రలను చూసి గరుత్మంతుడు నీ జోలికి రాడు పో - మత్పదాబ్జలాంఛనములు నీ తలనుంటఁ జూచి యా పక్షిరాజు నిన్నుఁ బట్టఁడింక" అని వరమిచ్చాడు.

కాళియుడు సంతోషించి పుత్రమిత్రకళత్రసమేతంగా కృష్ణునికి ప్రదక్షిణలు చేసి నమస్కరించి సముద్రానికి తరలిపోయాడు.

కాళింది మరలా సుధావారిం బొలు పారె నెల్లవారికిఁ బ్రియమై.

అదీ కథ.
)()()()()(

ఈ ఫోటో చూశారా?
ఫణిందమనుడు. ఫణిమర్దనుడు. "ఫొణి"ని సముద్రంలోనికి తరిమిన జగన్నాథుడు.

ఈ బాలుడు మత్ఫణాశతమును భగ్నము చేయుచున్నాడని కాళియుడు భావించాడు కదా? మరి నూరు పడగలేవీ? ఒకటే పడగను శిల్పి చిత్రీకరించాడు.

కృష్ణుడెపుడూ అంతేనని ఆ శిల్పి భావించాడో ఏమో.

మరోసారి "కరసహస్రంబుల కండూతి వాయు నుపాయంబును లేద యీ భరము నెట్లోర్తున్నుమానాయకా? యుద్ధం చేయాలనే నా వేయిచేతుల తీట ఎపుడు తీరుతుందో అని సరదాపడిన బాణాసురుని వేయిచేతులలో ఓ నాలుగింటిని వదిలేసి మిగిలిన తొమ్మిన్నూట తొంబైయారు చేతులు నరకలేదా అదే కృష్ణుడు?

అట్లే, కాళియుని నూరు తలకాయల పొగరు దించేసి, ఒక తలకాయను అట్లే వదిలేసి ఉంటాడని ఆ శిల్పిగారి ఉద్దేశమేమో.
)()()()(

ఈ కథలు సాంకేతికమనిపిస్తూ ఉంటాయి. కశ్యపుడు అంటే ఒక paternal gene పేరు, కద్రువ వినత అనేవి maternal genes పేర్లు కావచ్చు. రామాయణభారతాలలో ఈ కశ్యపుడు సమస్తజీవజాలనికీ (జంతువులకు, పక్షలకు, చెట్లకు, మనుషులకు కూడా) మూలబీజమనే సిద్ధాంతం కనిపిస్తుంది.

కశ్యపునికి ఇంకా చాలమంది భార్యలున్నారు. ఉదాహరణకు దితి, అదితి. వారి నడుమ కూడా మాత్సర్యమున్నదట. వారి సంతానమే దైత్యులు (రాక్షసులు), అదైత్యులు (దేవతలు) అంటారు. రాక్షసులు దేవతలు అనేవి ప్రాణుల స్వభావాన్ని నిర్దేశించే మూలపదార్థాలు అయ్యుండవచ్చు. క్షీరసాగరమంటే మనస్సు అని, చెడుతలంపులు విషమని, మంచి తలంపులు అమృతమని చెప్పడం తెలిసిన విషయమే. కాబట్టి, దేవతలు రాక్షసులు అనేవి ప్రాణుల స్వభావాన్ని నిర్దేశించే వివిధ హార్మోన్లకు పెట్టిన సాంకేతికనామాలు అయ్యుండవచ్చు. దితి అదితి అనేవి ఆ హార్మోన్లను ఉత్పాదన చేసే glands అయ్యుండవచ్చేమో!

కాబట్టి, సమస్తప్రాణులన్నిటికీ paternal gene సమానమే అయినా maternal gene మాత్రం భిన్నమనిపిస్తుంది. కాబట్టి, కశ్యప దితి అదితి కద్రువ వినత అనేవి సాంకేతిక నామాలే తప్ప మనుషుల పేర్లు కాకపోవచ్చును. ఒక సిద్ధాంతాన్ని కథలా చెబితే కలకాలం గుర్తుంచుకుంటారని ఇలా చెప్పారేమో అనిపిస్తుంది.

అలాగే కాళియుని కథ, అది విషపూరితమైన జలావరణాన్ని మనిషి కాపాడుకున్న కథ కావచ్చును.

ఎన్ని వేలయేండ్లనాటివో ఈ కథలు! ఉన్నతమైన చదువు కొందరికే పరిమితం కావడం, వారు కూడా కాలక్రమేణా ఇతరసంస్కృతుల సమ్మేళనంతో ఆనువంశికమైన చదువులను, విజ్ఞానాన్ని కోల్పోవడం, ఈ కథలను మతానికి అంటగట్టడం, పుక్కిటి పురాణాలు అని గేలి చేయడం, విదేశీయుల చేతిలో మనకు కలిగిన పరాజయానికి మనం వివశులమై, ఆత్మన్యూనతాభావంచేత నిలువెల్లా ఆక్రమింపబడి మన కథలను, మన పురాణాలను మనమే వెక్కిరించుకొనడం ప్రారంభమైంది. ఈ పతనం ఇప్పటికి మరింత వేగమౌతోందే తప్ప ఆగటం లేదు.

చిటారు కొమ్మన మిఠాయిపొట్లమంటే తేనె గూడు కాదు. ఇటువంటి జ్ఞానఫలమే! చూడనివారికి అది దక్కదు. ప్రయత్నం చేయనివారికి అది దక్కదు. ప్రయత్నం చేసినా పొట్టిచేతులవారికి దక్కదు. శాఖాగ్రానికి చేరుకున్నా, అందుకోలేక అక్కడనుండి పతనం చెందేవారికి అది దక్కదు. కష్టించి పైకెక్కగలిగి, చాల జాగ్రత్తలు కలిగిన వారికే అది దక్కేది!

అందని ద్రాక్షలు పుల్లన అని వెక్కిరించే గుంటనక్కలకు వాటి అనుచరులకు ఈ లోకంలో కొదవ లేదు.
)()()()(

ఈ శిల్పం అలిపిరిలో గరుడవిగ్రహానికి అనతి దూరంలో ఉన్న లక్ష్మీనారాయణస్వామివారి ఆలయంలోనిది.

Wednesday, 19 December 2018

యాదవులంటే ఎవరు?



మహా కోపిష్టి అయిన దూర్వాసమహర్షి కూడా తాను పొందిన సేవలకు ఆనందించి "నాయనలారా ఏ వరం కావాలో కోరుకోండి" అని అడిగితే - "మహర్షీ! మా రాజ్యాధికారం శాశ్వతం కావాలని దీవించండి" అని నోరారా కమ్మని కోరికను కోరుకోవచ్చుగా ఆ కౌరవులు? అబ్బే! వాళ్లు అంతటి సౌజన్యవంతులైతే ఇక అంతటి మహాభారతం కొనసాగేదేనా? దురదృష్టవశాత్తు వాళ్లకు తాము బాగుపడటం కన్నా పక్కవాడు చెడిపోవటమే ఇష్టం.
అందుకనే "అడవిలో ఉన్న పాండవులు భోజనం ముగించిన తరువాత, వారి చెంతకు వెళ్లి ఆతిథ్యం కోరండి" అంటూ ఉసిగొలిపారు. ఆవేళకు సరైన ఆతిథ్యం ఇవ్వడం కష్టమని, దాంతో దుర్వాసుడు ఆగ్రహించి పాండవులను శపించేస్తాడని ఆ కౌరవులు తెలివిగా పన్నిన కుట్ర అది. ఆ పన్నాగం పారినట్లే అనిపించింది. పాండవులు నిజంగానే చిక్కుల్లో పడ్డారు. వారు మహాప్రతాపవంతులే. మహా మేధావులే. కాని, వారి ప్రతాపాలు తెలివితేటలు ఎందుకూ కొరగాని కాలం అలా వచ్చేసింది.
ఆ సమయంలో ధర్మపత్నీసమేతులైన పాండవులు మనసారా ధ్యానించింది ఒక యాదవుని. యాదవవంశశిరోమణి అయిన శ్రీకృష్ణుడు వారి సమస్యను చిటికెలో పరిష్కరించేశాడు.
ఇలా తమ స్వార్థం కొద్దీ ఎవరో ఎవర్నో మరెవరిమీదకో రెచ్చగొట్టి పంపే అల్పబుద్ధులు ఆకాలంలోనే కాదు, ఈకాలంలో కూడా ఉన్నారు. పేర్లు మారి ఉండవచ్చు గాని, ఆ కుళ్లుబుద్ధులు క్రూరబుద్ధులు మాత్రం సమసిపోలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యాదవులు ఈ రోజుల్లో "మేము మా వంశం" అంటూ తొడగొట్టేవారికంటే ఎంతో ఘనమైన చరిత్ర కలిగినవారు.
సరే, శ్రీకృష్ణుడు కోరి కోరి ఎంచుకొని పుట్టిన యాదవవంశచరిత్ర పురాణాలప్రకారం - ఇదుగో -  ఇక్కడ - మిత్రులకోసం:

(ఈ క్రింది వ్యాసం మునుపు ఏసియా నెట్ న్యూస్ లో ప్రచురింపబడింది.)

పురాణాలలో యాదవుల సంక్షిప్తఘనచరిత్ర  
రఘువంశం వారికి రాఘవులు అని ఏవిధంగా వ్యవహారమో, అదే విధంగా యదువంశం వారికి యాదవులు అని వ్యవహారం.
 యదువు తల్లి దేవయాని.  ఆమె మృతసంజీవనీవిద్య ను కనుగొన్న భృగువంశీయుడైన  శుక్రాచార్యుని కుమార్తె.  యదువు తండ్రి యయాతి.  ఆయన చంద్రవంశానికి చెందిన సుక్షత్రియుడు.  యదువు తాతగారు నహుషుడు.  ఆయన  దేవలోకంలో ఇంద్రపదవిని అధిష్ఠించిన ఘనచరిత్ర కలవాడు.  
 యదువు సోదరుడు అనువు.  అతని వంశంలో పుట్టినవాడే శిబి చక్రవర్తి.  ఒక పావురాన్ని గ్రద్దబారినుండి కాపాడేందుకు తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇచ్చిన మహాదాత.  అతని సంతానం బలి.   అతనికి ఆరుగురు పుత్రులు.  అంగుడు,  వంగుడు,  కళింగుడు,  సుహ్ముడు, పుండ్రుడు, ఆంధ్రుడు.  వారందరూ మహావీరులు.  తమతమ పేర్ల పేరిట భారతదేశం తూర్పు  ప్రాంతాలలో రాజ్యాలను ఏర్పరచుకున్నారు.  
 అంగరాజు పుత్రుడు రోమపాదమహారాజు.   అతడు రాముని తండ్రి అయిన దశరథమహారాజుకు మంచి మిత్రుడు.  దశరథుని కూతురైన శాంతను దత్తపుత్రికగా స్వీకరించి ఆమెను ఋష్యశృఙ్గ మహర్షికి ఇచ్చి వివాహం చేసినవాడు.  ఆ  ఋష్యశృఙ్గ మహర్షి పుత్రకామేష్టి చేయడంవలననే దశరథునికి రామలక్ష్మణభరతశత్రుఘ్నులు జన్మించారు.
 యయాతి తన రాజ్యంలో దక్షిణభాగానికి యదువును ప్రభువుగా చేశాడు.  ఆ యదువుకు సహస్రజిత్తు,  క్రోష్టుడు, నలుడు రిపుడు అని నలుగురు కొడుకులు.  ఈ నలుగురు, ఆ నలుగురి కొడుకులు, వారి మనుమలు, మునిమనుమలు, ఇలా వారి వంశంలోని తరతరాలన్నిటికీ యాదవులు అని పేరు.
 సరే, అందులో సహస్రజిత్తు కుమారుడు శతజిత్తు.  అతని కుమారుడు హైహయుడు.  వీరందరూ ఆకాలంలో మహావీరులైన క్షత్రియులు.  హైహయవంశంలోనే కార్తవీర్యార్జునుడు జన్మించాడు.  అతడు దత్తాత్రేయుని భక్తుడు.  మహాయోగి.  మహాపండితుడు.  తరగని సంపద కలిగినవాడు.  అసంఖ్యాకమైన యజ్ఞయాగాదులను చేసి గొప్ప దానాలు చేసిన మహాదాత.  అంతేకాదు, తనపై పోరాటానికి దిగిన రావణాసురుని పట్టుకుని అతనిని పిల్లకోతిలా ఆడించిన మహాబలుడు.  అయితే అంతటి వాడు కూడా విధి వక్రించి జమదగ్నిమహర్షి ధేనువును ఆశించి దానిని బలవంతంగా లాక్కుని పోయాడు. దానితో పరశురాముడు ఆగ్రహించి కార్తవీర్యుని చంపేశాడు.  అప్పటినుండి అతని వంశం నామమాత్రావశిష్టం అయిపోయింది.  
 యదువు రెండవ కుమారుడు క్రోష్టుడు కదా - అతడు, అతని సంతానం తరతరాలుగా గొప్పగా రాజ్యాలనేలుతూ వచ్చారు.     వారిలో శశబిందు మహారాజు ఆరోజులలోనే విమానాలలో విహరించిన చరిత్ర కలవాడు.  సప్తద్వీపాధిపతిగా పేరుగాంచినవాడు.  ఆయన మునిమనుమలలో ఒకడు విదర్భుడు.  విదర్భుని మనుమలలో ఒకడైన చేది తన పేరుమీద ఒక రాజ్యాన్ని ఆరభించినవాడు. విదర్భుని మరొక కుమారుడైన క్రతుని మునిమునిమానులలో ఒకడు సాత్వతుడు.  అతని కుమారుడైన మహాభోజుని కుమారులందరూ భోజరాజులుగా పిలువబడ్డారు.  సాత్వతుని మరొక కుమారుడు వృష్ణి.  ఈ వృష్ణికి మునిమునిమనుమడు సాత్యకి.  ఇతడు మహాభారతంలోని అర్జునునికి శిష్యుడు.   వృష్ణికి మరొక కుమారుడైన యుధాజిత్తు వంశంలో కొన్ని తరాల తరువాతి వాడే మనకు వినాయకచవితి కథలో వినవచ్చే శ్యమంతకమణి సత్రాజిత్తు.  ఆయన కూతురే సత్యభామ.  
 సాత్వతుని మరొక కుమారుడు అంధకుడు.  ఆయనకు ఇద్దరు కుమారులు.  దేవకుడు, ఉగ్రసేనుడు.  దేవకుని కూతురే వసుదేవుని భార్య, భగవంతుని గర్భాన మోసి కన్న ధన్యురాలు దేవకి.  ఉగ్రసేనుని కుమారుడే మేనల్లుళ్ళను క్రూరంగా చంపదలచిన కంసుడు.  
 యుధాజిత్తు తన మనుమడికి తన తాతగారిపేరే పెట్టుకున్నాడు - వృష్ణి.  అతనికి చిత్రరథుడు అనే కుమారుడు.  అతని మనుమడు శూరుడు.  ఆ శూరునికి మారిష అనే భార్య.   వారి పుత్రుడే వసుదేవుడు.  దేవదేవుని కన్నతండ్రి.  వ్రేపల్లెలో గోపాలకుడైన నందునికి ప్రాణమిత్రుడు.  తన మిత్రుని భార్య అయిన యశోదకు జగన్మోహనమూర్తి అయిన తన కుమారుని పెంచే భాగ్యం కలిగించినవాడు.  
 ఆ వసుదేవునికి ఐదుగురు చెల్లెండ్రు.  అందులో ఒకరు పృథ.  ఆమెను కుంతిభోజుడు పెంచుకున్నాడు.  ఆమె స్వయంవరంలో పాండురాజును వరించింది.  వారి సంతానమే ధర్మరాజభీమార్జునులు.  పాండవులు.  రెండవ చెల్లెలు శ్రుతదేవి.  కరూషదేశాధిపతి  అయిన వృద్ధశర్మ ఆమె భర్త.  వారి కుమారుడే దంతవక్త్రుడు.  కృష్ణునితో విరోధించి హతమార్చబడ్డాడు.  మూడవచెల్లెలు శ్రుతకీర్తి.  ఆమె కేకయరాజైన ధృష్టకేతువును వివాహమాడి సంవర్ధనుడు మొదలైన మహావీరులను కన్నది.  నాల్గవచెల్లి రాజాధిదేవి.  ఆమె అవంతిమహారాజైన జయసేనుని వివాహమాడింది.  ఆమె కూతురు మిత్రవింద.  ఆమె శ్రీకృష్ణుని అష్టమహిషులలో ఒకరు.  రాజాధిదేవి కుమారులు మహావీరులైన విందానువిందులు.  దురదృష్టవశాత్తు వారు కురుక్షేత్రంలో దుర్యోధనుని తరపున పోరాడవలసివచ్చింది.  
 దుర్యోధనుడు మొదలైన వారు పాండవులకు పెదనాన్న కొడుకులైతే, ఈ విందానువిందులు పినతల్లి కుమారులన్నమాట.  విధివశాత్తు వీరు యుద్ధంలో అర్జునుని చేతిలో మరణించారు.  వసుదేవుని ఐదవ చెల్లి శ్రుతశ్రవ.  ఆమె చేదిరాజైన  దమఘోషుని వివాహమాడింది.  వారి కుమారుడే శిశుపాలుడు.  కంసుడి మామ అయిన జరాసంధుడికి ఇతడు అనుంగు అనుచరుడిగా వ్యవహరించాడు.  రుక్మిణిని ఇతడిని ఇచ్చి చేద్దాం అనుకుంటే రుక్మిణికి అది ఇష్టం లేక శ్రీకృష్ణునికి రాయబారం పంపడం, శ్రీకృష్ణుడు ఆమెను అపహరించి తెచ్చి పెండ్లి చేసుకొనడం తెలిసిందే.  మేనత్తకు ఇచ్చిన మాట ప్రకారం ఈ శిశుపాలుడు చేసిన నూరు తప్పులను సహించిన శ్రీకృష్ణుడు ధర్మజుని రాజసూయయాగం ముగింపుసభలో శిశుపాలుని అనుచితమైన ఔద్ధత్యాన్ని సహించలేక హతమార్చేశాడు.  
 ఈవిధంగా యదువంశంలో పుట్టడం వల్ల శ్రీకృష్ణుడు యాదవుడని, వృష్ణి వంశంలో పుట్టడం వల్ల వృష్ణివంశప్రదీపకుడని, వార్ష్ణేయుడని, శూరుని మనుమడు కావడంవల్ల శౌరి అని పిలవబడ్డాడు.  
 తన చెల్లెలు సుభద్రను తన ప్రియమిత్రుడు, మేనత్తకొడుకు అయిన అర్జునునికి ఇచ్చి పెళ్లి చేశాడు.  తన అల్లుడైన కంసుని చంపాడనే కోపంతో జరాసంధుడు పదే పదే మధురమీదకు దండయాత్రకు వస్తూంటే సముద్రమధ్యంలో ద్వారక అనే జలదుర్గాన్ని నిర్మింపజేసి యాదవులను కాపాడాడు.  భీముని చేత ఆ జరాసంధుని చంపించేశాడు.  
 కలియుగంలో అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడబోయే జనాలకు భగవద్గీత అనే జ్ఞానదీపాన్ని వెలిగించాడు.  భూభారాన్ని తగ్గించేందుకే అవతరించిన మహానుభావుడు కాబట్టి కురుక్షేత్రయుద్ధం జరిపించి ధర్మానికి పట్టాభిషేకం చేశాడు.  యుద్ధం ముగిసిన తరువాత  మదోన్మత్తులైన తన యాదవులను గమనించి వారి సంఖ్యను కూడా తగ్గించాలని భావించాడు.  
 ఫలితంగా మునుల శాపం.  యాదవులలో ముసలం జన్మించింది. పరస్పరకలహాలతో యాదవులు నశించారు.  శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు.  ఆ పిమ్మటనే కలియుగం ప్రారంభం అయింది.  పాండవులు హస్తినాపురానికి తమ మనుమడైన పరీక్షిత్తును, ఇంద్రప్రస్థానికి శ్రీకృష్ణుని మనుమడైన యాదవవంశాంకురం అయిన వజ్రుడిని రాజులుగా అభిషేకించి తమ మహాప్రస్థానాన్ని ప్రారంభించారు.  
 ఇంతటి ఘనచరిత్ర కలిగిన యాదవులు ఇప్పటికీ భారతదేశంలో తమదైన ప్రాముఖ్యతను చాటుకుంటూ చిరంజీవులై ఉన్నారు.  

Tuesday, 18 September 2018

పరువు ఎవడబ్బ సొమ్ము?

అనగనగా ధ్రువసంధి అనే రాజు ఉండేవాడు. మహా ధర్మాత్ముడు. ఆయనకు ఇద్దరు భార్యలు. మనోరమ, లీలావతి. మనోరమ కొడుకు సుదర్శనుడు. లీలావతి కొడుకు శత్రుజిత్తు.
దురదృష్టం కొద్దీ ధ్రువసంధి అడవిలో సింహం బారిన పడి చనిపోయాడు. అపుడు రాజు ఎవరు కావాలని సుదర్శనుడి మాతామహుడు అయిన వీరసేనుడు, శత్రుజిత్తు మాతామహుడు అయిన యుధాజిత్తు గొడవ పడ్డారు. వీరసేనుడిని యుధాజిత్తు చంపేశాడు. దాంతో, మనోరమ సుదర్శనుడిని తీసుకుని అడవికి పారిపోయి, భరద్వాజమహర్షిని శరణు కోరింది. యుధాజిత్తు శత్రుశేషం ఉంచరాదని సుదర్శనుడిని చంపేందుకు భరద్వాజుని ఆశ్రమానికి వెళ్లాడు కాని, మహర్షి తపఃశక్తికి భయపడి ఏమీ చేయలేక ఊరుకున్నాడు.
తరువాత ఎప్పుడో కాశీరాజు తన కూతురైన శశికళకు స్వయంవరం ప్రకటించాడు. రాజులందరూ విచ్చేశారు. అన్నదమ్ములైన సుదర్శనుడు, శత్రుజిత్తు కూడా వచ్చారు. శశికళ సుదర్శనుడిని వరించింది.
దాంతో శివాలెత్తిపోయిన యుధాజిత్తు "శశికళ నా మనుమడిని కాకుండా అతడికి పోటీదారు అయిన అన్నను వరిస్తుందా? ఆమెకు ఎంత ధైర్యం? ఆ సుదర్శనుడిని చంపేసి ఆమెను శత్రుజిత్తుకు ఇచ్చి పెళ్లి చేస్తా" అంటూ యుద్ధానికి దిగాడు.

ఇలా ఒకే కులం, ఒకే తండ్రిబిడ్డలు అయిన అన్నదమ్ములలోనే ఒకరిని కాకుండా ఇంకొకరిని ఒక కన్య వరించింది కాబట్టి మా పరువు పోయింది అనుకునే తాతలు ఉండేవారు సుమా.
ఈ కథలో తరువాత ఏమైందని అడుగుతారా? శశికళ కోరుకున్న వరుడే దైవానుగ్రహంతో యుద్ధంలో గెలిచాడు లెండి.
ఇలాంటి కథలు, ఇంతకంటె రసవత్తరమైన కథలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. చాలా వరకు మనకు తెలిసినవే. అయినప్పటికీ సరదాగా మళ్లీ గుర్తు చేసుకునేందుకు చదవండి:

1 శ్రీకృష్ణుడు
విదర్భరాజపుత్రి అయిన రుక్మిణి కృష్ణుని ప్రేమించింది.కృష్ణునికి ఇవ్వవచ్చునని ఆమె తల్లిదండ్రులు, బంధువులు కూడా అనుకున్నారు.కాని, రుక్మిణి అన్న ఐన రుక్మికి మాత్రం అది ఇష్టం లేదు.అతడు జరాసంధుని ముఠాకు చెందినవాడు.అతడి మాటపై తన దోస్తు ఐన శిశుపాలుడికి ఇచ్చి చేద్దామనుకున్నాడు.రుక్మిణి తల్లిదండ్రులు నిస్సహాయులయ్యారు.
రుక్మిణి ఒక బ్రాహ్మణుని ద్వారా తన మనసును కృష్ణునికి తెలియజేసింది.కృష్ణుడు వచ్చి ఆమెను అందరి సమక్షంలోనూ ఎత్తుకుపోయాడు.
రుక్మి శిశుపాలుడు, జరాసంధుడు కృష్ణుని చంపాలని వెంటబడ్డారు. కృష్ణుడు వారందరినీ ఓడించి తరిమేశాడు.చేసేదేమీ లేక, సింహానికి దక్కాల్సిన సొమ్మును జింకలు కాజేసినట్టు మన రాజకన్యను ఆ గోపాలుడు ఎత్తుకుపోయి ధనుర్దారులమైన మన కీర్తిని వాడు నవ్వులపాలు చేశాడే అని తిట్టుకుంటూ ఊరట చెందారు పాపం. అందరిలోనూ తమ పరువు పోయిందని బాధపడిపోయారు.
अहो धिगस्मान् यश आत्तधन्वनां गौपैर्हृतं केसरिणां मृगैरिव।
(భాగవతం 10.ఉత్తరార్ధం 54.57)
అయితే జరాసంధుని భీముడు, శిశుపాలుని కృష్ణుడు కాలాంతరంలో హతమార్చిన తరువాత రుక్మిణి అన్న రుక్మి దారికి వచ్చాడు. తన కూతురు అయిన రుక్మవతిని రుక్మిణీకృష్ణుల కొడుకైన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుక్మిణీకృష్ణుల మనుమడైన అనిరుద్ధుడికి తన మనుమరాలైన రోచనను ఇచ్చాడు.

2 భీముడు
హిడింబుడు అనే రాక్షసుని చెల్లెలు హిడింబ.ఆమె అడవిలో భీముని చూడగానే ప్రేమించింది.తన అన్న క్రూరుడని మీ కుటుంబసభ్యులతో కలసి ఎక్కడకైనా దూరం పొమ్మని భీమునిహెచ్చరించింది.నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పింది.
ఇంతలో హిడింబుడు రానే వచ్చాడు. తన చెల్లెలి మనోభావాన్ని గ్రహించి, "వొసే హిడింబా! మన వంశానికి కళంకం తెస్తున్నావు. ఛీ ఛీ.
पूर्वेषां राक्षसेन्द्राणां सर्वेषामपयशस्विनी।“ (భారతం.1.152.18)
అన్నాడు.
ఆ హిడింబుడికి కూడా తన చెల్లెలు ఒక మానవమాత్రుణ్ణి వరించడం ఒక పరువుతక్కువ పనిగా అనిపించింది!
“ఉండు, మీ ఇద్దరినీ చంపి పారేస్తా చూడు" అంటూ భీముడి మీద పడ్డాడు. అయితే భీమసేనుడే అతడిని చంపిపారేశాడు.
ఆ తరువాత, హిడింబ ప్రేమను భీముడు తిరస్కరించాడు.“నీ అన్నను చంపిన పగతో మమ్మల్ని ఏమైనా చేయగలవు పో పో” అన్నాడు.అపుడు హిడింబ కుంతిని ధర్మరాజును శరణు వేడి, వారి ద్వారా భీముని ఒప్పించి పెండ్లి చేసుకుంది. వారి కుమారుడే ఘటోత్కచుడు అని అందరికీ తెలిసిన విషయమే కదా!

3 ద్రౌపది
పాండవులు లక్క ఇంట్లో చనిపోయారని అందరూ అనుకున్నారు.కాని, వారు తప్పించుకున్నారు. బ్రాహ్మణవేషం ధరించి పాంచాలరాజ్యంలో. ద్రౌపదీస్వయంవరసభను చేరుకున్నారు.
ఆ సభలో అందరూ మత్స్యయంత్రాన్ని ఛేదించడంలో విఫలమైన తరువాత బ్రాహ్మణవేషంలో ఉన్న అర్జునుడు ఆ పని చేశాడు. ద్రౌపది అతనిని వరించింది. ఇది చూసి అక్కడ ఉన్న రాజులు సహించలేకపోయారు. రాజులందరికీ ఇది తమ పరువుప్రతిష్ఠలకు ఒక సవాలుగా అనిపించింది.
“వీరుడైనవాడు ఏ కులానికి చెందినప్పటికీ వాడికి అందరూ సలాము చేయవలసినదే” అని ఒకప్పుడు గర్జించి చెప్పిన దుర్యోధనుడు కూడా ఉక్రోషంలో తాను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తానే విస్మరించాడు.
“ఈ కన్య (ద్రౌపది) ఒక క్షత్రియుని కాకుండా ఒక బ్రాహ్మణుని వరించినందుకు ఈమెను నిప్పుల్లో పడేసి మన దేశాలకు మనం పోదాం. ”अग्नावेनां परिक्षिप्य याम राष्ट्राणि पार्थिवाः। (భారతం 1.188.8) అని మిగిలిన రాజులతో పాటు మీదకు ఎగబడ్డాడు.
వారిని బ్రాహ్మణవేషాల్లోనే భీమార్జునులు అడ్డుకున్నారు. పెద్ద దొమ్మీ జరిగింది. యుద్ధంగా కూడా మారింది. వారిద్దరూ కలిసి ద్రౌపదిమీదకు పోబోయిన రాజులందరినీ చిత్తుచిత్తుగా ఓడించారు. మహా మహా కర్ణుడు కూడా అర్జునుని చేతిలో ఓడిపోయాడు. చేసేదేమీ లేక అందరూ నోరు మూసుకుని ఇంటికి పోయారు.
ద్రౌపది రక్షింపబడింది.

4 అర్జునుడు
తీర్థయాత్రలు చేస్తూ ద్వారకానగరానికి వచ్చిన అర్జునుడు, యాదవకన్య, శ్రీకృష్ణుని చెల్లెలు అయిన సుభద్రను చూసి ఇష్టపడ్డాడు.
సుభద్ర తనను వరిస్తుందో లేదో, యాదవులు ఆమెను తనకు ఇస్తారో లేదో అని అతడికి సందేహం కలిగింది. శ్రీకృష్ణునితో ఆ విషయం చర్చించి, అతడి ప్రోత్సాహం మీదట, అన్న అయిన ధర్మరాజు అనుమతిని కూడా పొందిన మీదట, సుభద్ర రేవతకపర్వతానికి వచ్చిన సందర్భం చూసుకుని ఎత్తుకుపోయాడు.
భోజులు, వృష్ణీయులు, అంధకులు అనే మూడు తెగల యాదవులకు అది చాల అవమానకరంగా తోచింది.
అన్నపానాలు కూడా మానివేసి అందరూ సమావేశమయ్యారు. “రథాలను సిద్దం చేయండిరా. ప్రాసాలను తీసుకురండిరా”
योजयध्वं रथानाशु प्रासानाहरतेति च। (భారతం 1.219.17)
అంటూ అర్జునుని దండించి సుభద్రను తిరిగి తీసుకుని వచ్చేందుకు సంసిద్ధులయ్యారు.
బలరాముని మండిపాటుకైతే హద్దులే లేవు. “భోజనం చేసిన కంచాన్నే విరగ్గొట్టే కులకళంకుడని తెలియక ఆ అర్జునుడిని శ్రీకృష్ణుడి మిత్రుడు కదా అని ఎంతగా గౌరవించాం!
न च सोऽर्हति पूजां तां दुर्बुद्धिः कुलपांसनः।
को हि तत्रैव भूक्त्वान्नं भाजनं भेत्तुमर्हति। (భారతం 1.219.26,27)
అసలు అర్జునుడు అపహరించింది సుభద్రను కాదు, తన మృత్యువునే సుమా! ఇటువంటి పని చేయడం ద్వారా నా తలమీద అర్జునుడు తన పాదం పెట్టినట్టు కాదా? ఆ అర్జునుడు జన్మించిన కౌరవవంశాన్ని ఈ భూమి మీదనే లేకుండా చేస్తాను.
अद्य निष्कौरवमेकः करिष्यामि वसुन्धराम्। (భారతం 1.219.31)”
అంటూ అవమానంతో కుతకుతలాడిపోయాడు. యాదవులందరూ బలరాముని సమర్థిస్తూ “పదండి పదండి” అంటూ రణనినాదాలు చేశారు.
వారికి ఇదొక పరువు సమస్య అయింది!
కాని, శ్రీకృష్ణుడు సుభద్రకు అర్జునుడు తగిన జోడీ అని, స్వయంవరంలో సుభద్ర తనను వరిస్తుందో లేదో అనే సంశయంతో అర్జునుడు ఆమెను ఎత్తుకువెళ్లి ఉంటాడని, అది క్షత్రియులకు అనుచితమైన పనేమీ కాదని నచ్చజెప్పి బలరాముని, మిగిలిన యాదవులను చల్లబరచాడు.
శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో యాదవులు సగౌరవంగా సుభద్రార్జునులను ద్వారకకు తిరిగి తీసుకుని వచ్చి, వారికి వివాహం చేశారు. కాలక్రమేణ వారిరువురికీ జన్మించిన అభిమన్యుడు యాదవులందరికీ ముద్దుల మేనల్లుడు కావడం తెలిసిందే.

5 సాంబుడు
జాంబవతీశ్రీకృష్ణుల కుమారుడు సాంబుడు. దుర్యోధనుని కూతురైన లక్ష్మణను ఇష్టపడ్డాడు. ఆమెను స్వయంవరసభనుండి ఎత్తుకుపోయాడు.
సాంబుడు చేసిన పనికి కౌరవులు ఆగ్రహంతో ఊగిపోయారు. “పట్టండిరా ఈ దుర్మార్గుడిని. మనం దయదలచి ఇచ్చిన భూమిని ఏలుకుంటున్న ఈ వృష్ణీయులు (యాదవులు) ఏమి చేస్తారో చూద్దాం.
बध्नीतेमं दुर्विनीतं किं करिष्यन्ति वृष्णयः।
येस्मत्प्रसादोपचितां दत्तां नो भुञ्जते महीम्।“ (భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)
అని మీదపడి బంధించారు.
యాదవులంటే వారికి చిన్నచూపు. వారు తమ పిల్లను చేసుకొనడం తమకు పరువు తక్కువగా కౌరవులు భావించారు!
ఈ విషయం తెలిసిన యాదవులు సాంబుడిని విడిపించుకునేందుకు యుద్ధసన్నద్ధులయ్యారు. కాని, బలరాముడు యాదవకౌరవవంశాలవారికి నడుమ కలహం వద్దని, శాంతిని కోరి ఉద్ధవుని రాయబారిగా పంపాడు. భీష్మాదివృద్ధులు ఎంత నచ్చజెప్పినా వినకుండా దుర్యోధనాదికౌరవులు మాత్రం అహంకారంతో మిడిసిపడ్డారు.
“ఆహా! కాలమహిమ కాకుంటే కాళ్ల దగ్గర పడి ఉండాల్సిన చెప్పులు కిరీటం ఉండవలసిన తలమీద ఉండగోరుతున్నాయి కదా?
अहो महच्चित्रमिदं कालगत्या दुरत्यया।
आरुरुक्षत्युपानद्वै शिरो मुकुटसेवितम्।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.24)
మన పాండురాజు వారి కుంతిని చేసుకున్నాడు. మన అర్జునుడు వారి సుభద్రను చేసుకున్నాడు. ఇలా కాస్త బంధుత్వం కలిసింది కదా అని మన ప్రక్కనే కూర్చునేందుకు సాహసిస్తున్నారు. వీరు మాకు చెప్పవచ్చారా?” అంటూ అహంకరించి బలరాముని మాటలను తిరస్కరించారు.
బలరాముడికి వొళ్లు మండింది. “ఏమిటేమిటీ? మేము చెప్పులమూ, వారేమో తలకాయలూనా?
उपानहः किल वयं स्वयं तु कुरवः शिरः।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.38)
ఈ రోజు భూమిమీద కౌరవులు లేకుండా చేస్తాను
अद्य निष्कौरवीं पृथ्वीं करिष्यामि। (భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)”
అంటూ హస్తినాపురాన్ని తన హలంతో లాగి గంగలోనికి నూకేందుకు ఉద్యమించాడు. ఆ దెబ్బకు హస్తినాపురం ఊగిపోయింది. కౌరవులందరూ హడలిపోయి, సాంబుడిని, లక్ష్మణను బలరామునికి అప్పగించి, క్షమాపణలు కోరి, రక్షించమన్నారు. దయాళువైన బలరాముడు సరేనని, వారు సమర్పించిన కానుకలను, వధూవరులను వెంటబెట్టుకుని ద్వారకకు చేరుకున్నాడు.
గొడవ చల్లబడింది.

6 మధువు
రావణాసురుని పినతల్లి అనల. ఆమెకు కుంభీనసి అనే కూతురు ఉండేది. ఆమెను మధువు అనే ఒక రాక్షసుడు ఇష్టపడ్డాడు. పేరుకు రాక్షసుడే అయినా దేవతలకు మంచి మిత్రుడు.కాని,రావణాసురుని పట్ల భయంతో ఏమి చేయాలో తెలియక ఊరుకున్నాడు.
ఇలా ఉండగా ఒకసారి రావణాసురుడు జైత్రయాత్రకు వెళ్లాడు. యుద్ధోన్మాదంలో తన చెల్లెలైన శూర్పణఖకు భర్త అయిన విద్యుజ్జిహ్వుని కూడా గుర్తించలేక స్వయంగా నరికి చంపివేశాడు. శూర్పణఖ వచ్చి ఏడ్చి మొత్తుకుంటూ ఉంటే ఆమెను పోయి దండకారణ్యంలో సుఖంగా ఉండమని పంపించేశాడు రావణుడు.
వారు ఈ గొడవల్లో ఉండగా సమయం చూసుకుని మధువు కుంభీనసిని ఎత్తుకుపోయాడు.
రావణుడు విజయం సాధించి, వెనక్కు వస్తూ దారిలో కంటికి అందంగా కనబడిన రాజస్త్రీలను, ఋషిస్త్రీలను, గంధర్వస్త్రీలను,పన్నగస్త్రీలను, రాక్షసస్త్రీలను, అసురస్త్రీలను, మానుషస్త్రీలను, యక్షస్త్రీలను, దానవస్త్రీలను ఎవరి పట్లా ప్రత్యేకపక్షపాతం చూపకుండా అపహరించాడు. వారు వివాహితలా లేక అవివాహితులా అన్నది కూడా గమనించలేదు. తనకు అడ్డుపడిన వారి వారి బంధువులను యథేష్టంగా సంహరించాడు.
दर्शनीयां हि रक्षः कन्यां स्त्रीं वाऽथ पश्यति।
हत्वा बन्धुजनं तस्या विमाने तां रुरोध ह।। (రామాయణం7.24.2)
ఆ స్త్రీల విలాపంతో లంక ప్రతిధ్వనించిపోయింది. “ఒరే దుర్బుద్ధీ! నువు స్త్రీమూలంగానే నశిస్తావురా” स्त्रीकृतेनैव प्राप्स्यते दुर्मतिर्वधम्। (రామాయణం7.24.2)
అంటూ వారు శపించేశారు.
ఇంతలో మధువు తన చెల్లెలైన కుంభీనసిని ఎత్తుకుపోయాడన్న వార్త తెలిసింది. దానితో ఆ రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. లోకవిజేత అయిన తన చెల్లెలినే ఎవడో ఎత్తుకుపోతాడా? ఎంత ధైర్యం? మళ్లీ ఇక్కడ రావణాసురుడికి కూడా పరువు సమస్యే!
అతడి కళ్లు ఎర్రగా మారిపోయాయి. “వెంటనే రథం సిద్ధం చేయండిరా. రాక్షసవీరులు సిద్ధం కండిరా. మారణాయుధాలు పట్టుకుని బయల్దేరండిరా” అని గర్జిస్తూ మధుపురానికి దండయాత్ర చేశాడు.
అయితే అతడి చెల్లెలు కుంభీనసి వచ్చి అన్న కాళ్ల మీద పడి, “అన్నా, జరిగిందేదో జరిగిపోయింది. ఇపుడు నా భర్తను చంపి, నన్ను విధవను చేయవద్దు” అని వేడుకుంది.
రావణుడు కాసేపు ఆలోచించి, “సరే, నీమీద దయతో అతడిని నేను చంపబోవటం లేదు. నీ భర్త ఎక్కడ? త్వరగా రమ్మను. అతడితో కలసి, స్వర్గలోకాన్ని జయించేందుకు బయల్దేరుతాను” అన్నాడు.
क्व चासौ तव भर्ता वै मम शीघ्रं निवेद्यताम्।
सह तेन गमिष्यामि सुरलोकं जयावहे।। (రామాయణం 7.25.44,45)
మొత్తానికి అలా రాజీ కుదిరింది. తరువాత రావణుడు ఎత్తుకువచ్చిన స్త్రీల శాపం ఫలించి సీత కారణంగా రాముడి చేతిలో చనిపోయాడు.
అయితే రావణుడి బావ అయిన మధువుమహాశివభక్తుడు. మహా ధర్మాత్ముడు. జనరంజకంగా పరిపాలన చేశాడు.కాని, ఆ కుంభీనసీమధువుల కుమారుడైన లవణాసురుడికి మాత్రం మేనమామ అయిన రావణాసురుడి బుద్ధులు వచ్చాయి. వాడు పెట్టే బాధలను సహించలేక మునులు రాముడికి మొర పెట్టుకున్నారు. శత్రుఘ్నుడు రాముని ఆజ్ఞను పొంది ఆ లవణాసురుడిని సంహరించాడు.
***

ఈ విధంగా తమ కుటుంబానికి చెందిన స్త్రీని ఎవడో తమ అనుమతి లేకుండా పెండ్లాడడం అనేది ఎంతటివారికైనా ఇజ్జత్ కా సవాల్. అది ఒక మానసికమైన పీడ.
కురువంశంవారు తమ కన్యను ఎత్తుకుపోయారని యాదవులు మండిపడ్డారు. యాదవులు తమ కన్యను ఎత్తుకుపోయారని కురువంశంవారు కుతకుతలాడిపోయారు. రాక్షసులు తమ స్త్రీని ఎత్తుకుపోయారని మానవులు వగచారు. మనిషి మా కన్యను వరిస్తాడా అని రాక్షసులు కోపగించుకున్నారు. ఎవరూ తక్కువ తినలేదు.

పరువు ఎవడబ్బ సొమ్ము? ఎవరికి ఆ పరువు బరువు?

అయితే ఈ కథలన్నిటిలోనూ గమనించవలసింది ఏమిటంటే –

ప్రతిచోటా బలవంతులే గెలిచారు.
ఓడినవారు చాలావరకు రాజీకొచ్చారు.
అప్పుడైనా ఇప్పుడైనా జరిగేది అదే.

కాబట్టి, ఇప్పటి ఆశావహులు ఎవరైనా సరే, స్వయంగా తమకు తగినంత బలం లేకుండా, బలవంతుల ఇష్టం లేనిదే బలవంతుల కన్యల జోలికి పోరాదు. బలం అంటే ఆరోజుల్లో పరాక్రమం అయ్యుండవచ్చు. ఈరోజుల్లో ధనం, పలుకుబడి కూడా.

బలవంతుడు మరొక బలవంతుడినే ఇష్టపడతాడు, అతడితోనే రాజీ పడతాడు. ప్రపంచమంతటా ఇదే సహజం.

అంతే కాదు, బలవంతుడు అర్హత కలిగిన వినయవంతుడిని కూడా ఇష్టపడతాడు. శుక్రాచార్యులవారు తన కూతురును క్షత్రియుడైనప్పటికీ వినయవంతుడైన యయాతిరాజుకు సంతోషంగా ఇచ్చి పెళ్లి చేశాడు.

అంతేగాని, చెత్త చెత్త సినిమాలలో చూపినట్టు పోకిరీతనంతో బలవంతుల జోలికి పోయి భంగపడకండి, సమాజంలో అందరినీ మాకు న్యాయం చేయండి అంటూ దేబిరించకండి.

బలమా? అర్హతతో కూడిన వినయమా?
ఏదో ఒకటి ఎంచుకోండి.

కాబట్టి, ఓ ఆశావహులారా! ఈ రెండిటిలో ఏదో ఒకటి లేకుండా పనికిమాలిన సాహసాలు చేసి, దానికి తగిన ప్రతిఫలం అనుభవించి, మీ సమస్య తప్ప మరో సమస్య సమాజంలో మరేమీ లేనట్టు ఊరికే గగ్గోలు పుట్టించడాలు మానుకోండి.

Saturday, 28 July 2018

దాతా భవతి వా న వా -2

(దాతా భవతి వా న వా? - రెండవభాగం - Part -2)
దానయోగ్యమైనవి ఏమున్నాయి?
కాదేదీ దానానికనర్హం అన్న రీతిలో చాల ఉన్నాయి.
దాత ఒక మనిషే. గ్రహీత కూడా మనిషే.
కాబట్టి దాత వద్ద ఉన్నది అందరికీ కాకున్నా ఎవరో మరొకరికి తప్పక అవసరపడుతుంది కదా.

<><><><><><>
పుస్తకదానం -
<><><><><><>

మా చిన్నపుడు -
మేము పై తరగతికి ప్రమోట్ కాగానే, మా పాఠ్యపుస్తకాలను మా జూనియర్ విద్యార్థులకు ఇచ్చే పద్ధతి ఉండేది. అలాగే మా సీనియర్ల నుండి మేము అందుకొనేవాళ్లం. అలా మాకు దేవుడిచ్చిన అన్నల్లా మా సీనియర్లు ఉండేవారు. పాఠశాలలో మాకు ఎలాంటి సమస్య వచ్చినా మేము వారికి చెప్పేవాళ్లం. వాళ్లు పరిష్కరించేవాళ్లు. లేదా పరిష్కారమార్గం చూపేవారు.
ఈ రోజుల్లో అంతటి సుహృద్భావాలు తక్కువైపోయినై. పై తరగతికి ప్రమోట్ అయిన తరువాత పుస్తకాలను సెకండ్ హ్యాండ్ బుక్ షాప్ వాడికి ఎంతో కొంత మొత్తానికి అమ్మేస్తున్నారు. జూనియర్స్ కూడా ఇచ్చినా ఎవరూ తీసుకొనటం లేదు. అబ్బే, ప్రజల్లో దాతృత్వభావన తగ్గటం కాని, లేదా తీసుకొనడానికి మొహమాటం పెరగటం కాని అందుకు కారణాలు కానే కావు.
అసలు కారణం కార్పొరేట్ విద్యాలయాలు!
అవి తమ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను లేదా స్టడీ మెటీరియల్ ను బలవంతంగా అంటగడుతున్నాయి. వాటి ఖరీదును ముక్కు పిండి బలవంతంగా వసూలు చేస్తున్నాయి.
ఇలా ఒకప్పుడు Charity begins at Home అనే సూత్రం అమలౌతూ ఉండగా, క్రమక్రమంగా వ్యాపారసంస్థలు మన జీవనంలోనికి దూరి ఆ సుహృద్భావనలను నాశనం చేయడం మొదలైంది. "జీవితమంటే వ్యాపారం" అనే దుర్మార్గభావాలను అవి బలవంతంగా బాల్యంలోనే మెదళ్లలోనికి చొప్పిస్తున్నాయి.
ఏ విత్తనం వేస్తే ఆ పంట పండటం సహజమే కదా! సమాజమంతా వ్యాపారపంటలు పండటం ప్రారంభమైనాయి. ఇప్పటికీ అవే పండుతున్నాయి.
<><><><><><>

గ్యూటెన్బర్గ్ మహాశయుల పుణ్యమాని అచ్చొత్తే పద్ధతి వచ్చాక పుస్తకమనేది అందరికీ అందుబాటులోనికి వచ్చింది. కంప్యూటర్ వచ్చాక పుస్తకముద్రణ మరీ తేలికైంది. కాని, అంతకు ముందు పుస్తకాలంటే తాళపత్రాల కట్టలే కదా - ఓ గ్రంథాన్ని వాటిపై వ్రాసి దానం చేయడమంటే ఎంతటి సమయం పట్టేదో - అది ఎంత కష్టమైన విషయమో ఊహించుకొనగలిగినవారికే - పుస్తకదానంలోని మహత్త్వం అర్థమౌతుంది.
ఔదార్యవంతులైన ధనవంతులు కొందరు వ్రాతగాళ్లను పోషిస్తూ, వారితో వివిధగ్రంథాలను కాపీ చేయిస్తూ, విద్యాలయాలకు, విద్యార్థులకు దానం చేసేవారట. అటువంటి మహాత్ములకు మన భారతజాతి మొత్తం ఎప్పటికీ ఋణపడి ఉంటుంది.
ఎప్పటి రామాయణభారతాలు? ఎప్పటి వాల్మీకివ్యాసులు?
వారి స్వహస్తలిఖితగ్రంథాలు శిథిలం కాకుండా మన తరం వరకూ ఉంటాయని అనుకోలేం.
దేశవ్యాప్తంగా అటువంటి అద్భుతగ్రంథాలను రక్షించుకొనేందుకు ఎంతెంతమంది కృషి చేసి ఉంటారు?
తరతరాలుగా ఎప్పటికప్పుడు వాటికి కాపీలు వ్రాయిస్తూ,
వాటిని కూలంకషంగా అధ్యయనం చేసేవారికి దానం చేస్తూ, గ్రంథాలయాలలో భద్రం చేస్తూ ఉండిన మహాదాతలు ఎందరు ఉండి ఉంటారు?
అందుకే కదా -
మనవరకు ఆ మహర్షుల ఉదాత్తభావాలు వచ్చి చేరాయి?
భారతదేశమంతటా ఆ రామాయణమహాభారతాలు ప్రఖ్యాతి చెంది ఉన్నాయంటే తరతరాలుగా ఎంతమంది తమ జీవితకాలాలను కఠోరశ్రమకోర్చి ఆ పుస్తకాలనిర్మాణానికి వెచ్చించి ఉంటారు?
వారు, వారిని ఆదరించి పోషించిన అజ్ఞాతదాతలు మనకు నిత్యవంద్యులు. ప్రాతఃస్మరణీయులు.
మా గురువుగారు తమ డాక్టరేట్ థీసిస్ లో పేరు కూడా తెలియని ఇటువంటి మహాభానువులు ప్రతి ఒక్కరికి ఎంతో భక్తితో కృతజ్ఞతలు సమర్పించి ఉండడం చూశాను. అది వారి సంస్కారం!
పుస్తకంలో కవి హృదయం ఉంటుంది. ఒక పుస్తకం చదివామంటే ఆ కవితో నేరుగా భాషిస్తున్నట్టే. అతి ప్రాచీన కవులతో ఆనాటి విషయాల గురించి చాటింగ్ చేయాలంటే ఆయా కవుల పుస్తకాలను చదవడమే ఏకైకోపాయం. అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ చదవడమే - మనకు ఎన్ని సార్లు సందేహం వచ్చినా మనపై కోప్పడకుండా మళ్ళీ మళ్ళీ ప్రశాంతంగా చెప్పేది ఆ పుస్తకంలోని కవి మాత్రమే కదా!
అలాంటి పుస్తకాలను ప్రజలకు చేరువ చేయాలని #రాయలసీమ బిడ్డడైన శ్రీ #గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారు మహోద్ధృతంగా #గ్రంథాలయోద్యమంచేశారు. తత్ఫలితంగా ఈనాడు సామాన్యునికి కూడా చేరువలో గొప్ప పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
<><><><><><>

యుద్ధాలు లేని కాలమంటూ లేదు. భారతీయరాజుల నడుమ యుద్ధాలు జరిగేవి. కాని, వారెన్నడూ ఓడిపోయిన ప్రాంతానికి చెందిన ప్రజలను బాధించలేదు. గెలిచిన రాజునుండి ప్రజలు రక్షణ పొందుతూ వారికి పన్ను కట్టారు. కాబట్టి ఎందరు రాజులు మారినా ప్రజలు సుఖంగానే ఉన్నారు.
కాని, ఆవిధంగా "అయ్యో పాపం" అనే సెంటిమెంట్లవంటి "బలహీనతలేమీ" లేని విదేశీయులు భారతదేశంపై దండయాత్రలు మొదలుపెట్టాక ప్రజలను దోచుకొనడం మొదలుపెట్టారు. విశ్వవిద్యాలయాలపై పడి సంఖ్యాధికమైన పుస్తకాలను తగలబెట్టేశారు. అధ్యాపకులను, విద్యార్థులను ఊచకోత కోశారు.
ఆ కాలంలో ఎన్నెన్ని శాస్త్రాలు (sciences) మంటగలిసి పోయాయో! తరువాత యూరోపీయపాలకులు వచ్చాక కూడా ఎన్నెన్ని పుస్తకాలు మన గ్రంథాలయాలనుండి అపహరింపబడ్డాయో! భారతీయులు తేనెటీగల్లా శ్రమించి కూడబెట్టుకున్న జ్ఞానమకరందాన్ని విదేశీయులు ఎలుగ్గొడ్లలా వచ్చి నాశనం చేసినంత చేశారు, త్రాగినంత త్రాగారు, ఎత్తుకుపోయినంత ఎత్తుకుపోయారు.
అయినా, మనం ఈనాటికీ వాళ్లు కోహినూర్ ఎత్తుకుపోయారని ఏడుస్తాం. నెమలిసింహాసనం ఎత్తుకుపోయారని ఏడుస్తాం. అమరావతి స్థూపాన్ని పెళ్లగించుకు పోయారని ఏడుస్తాం. వాటిని మనకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తాం. అవి ఖచ్చితంగా విలువైనవే.
కాని, వాళ్లు నాశనం చేసిన శాస్త్రగ్రంథాలు మరింత విలువైనవి. వెలకట్టలేనివి. వాటికోసం ఎవ్వరూ ఏడవరు, వాటి విలువ తెలిసినవారు తప్ప!
ఇది ఇలా ఉండగా మరికొందరు తయారయ్యారు -
తమకు ఇష్టంలేని ఒకటి రెండు విషయాలు ఏదైనా ఒక పుస్తకంలో కనబడితే చాలు - ఆ పుస్తకం తగలబెట్టెయ్యండి అనే వాళ్ళు, ఆ పుస్తకాన్ని బహిష్కరించండి అనే వాళ్ళు, ఆ పుస్తకాలను జనజీవనస్రవంతి నుండి తప్పించాలి అనే వాళ్ళు..
ఈ మధ్యనే ఒకాయన భారతజాతి శీలాన్ని నిర్దేశించే రామాయణమహాభారతాలను భారతదేశ ప్రజలకు దూరం చేయాలంటూ రాగం అందుకున్నారు కూడా. 
<><><><><><>

వైజ్ఞానికంగా ఎంతో ముందున్న భారతీయులు దిగజారిపోవడం అప్పటినుండే ప్రారంభమైంది. ప్రోత్సహించే దాతలు కరువయ్యారు. విదేశీప్రభుత్వాలు స్థానికపరిశోధనలను ప్రోత్సహించడం అటుంచితే వెతికి వెతికి నాశనం కూడా చేశాయి.
అగ్గిపెట్టెలో పట్టేంతటి చీరను నేయగల నేతగాళ్ల వ్రేళ్లను బ్రిటిషువారు నిర్దాక్షిణ్యంగా నరికించారని అంటారు. పబ్లిగ్గా జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండకు ఏమాత్రం సిగ్గుపడని బ్రిటిషు వాళ్లు, అజ్ఞాతంగా ఇటువంటి క్రూరకృత్యాలను ఏమీ చేయించలేదు అంటే ఎవరూ నమ్మరు.
సరే, స్వాతంత్ర్యం వచ్చిన తరువాతనైనా భారతీయవైజ్ఞానిక పరిశోధనలు ముందుకు దూసుకుపోవడం లేదేమి అంటే -
ఒకటే కారణం -
శాస్త్రజ్ఞానమెపుడూ రిలే పరుగులాంటిది. సీనియర్ శాస్త్రవేత్తలు అందించిన జ్ఞానాన్ని జూనియర్లు అందుకొని, తాము కూడా దాని అభివృద్ధికి కృషి చేసి, తమ పరిశోధనఫలితాలను తమ జూనియర్లకు భద్రంగా అందించాలి.
కాని, మన దేశంలో సుదీర్ఘమైన విదేశీపాలన ఫలితంగా మన పూర్వవిజ్ఞానశాస్త్రవేత్తలతో మనకుండిన link తెగిపోయింది.
ఇంగ్లీషు మోజులో శాస్త్రభాష అయిన సంస్కృతాన్ని వదిలేశాం. సంస్కృతాన్ని నేర్చుకున్నవారు కూడా చాలమంది సంస్కృతమంటే కాళిదాసు, కొన్ని సుభాషితాలు, కొన్ని చమత్కారశ్లోకాలు, కొన్ని స్తోత్రాలు, కాస్త జ్యోతిషం - ఇలాంటివి మాత్రమే అనుకొని వాటిలో చెప్పుకోదగినంత పరిశ్రమ చేసి, ఈ జీవితానికిది చాలు అనుకుంటున్నారు.
కాలిపోయినవి కాలిపోగా, అపహరణకు గురైనవి పోగా, మిగిలిన శాస్త్రగ్రంథాలు ఇంకా తాళపత్రాల రూపంలోనే ఉన్నాయి. అవి కూడా దేవనాగరిలిపిలో ఉన్నవి తక్కువ. సంస్కృతమే అయినా రకరకాల లిపులలో ఉన్నాయి. వాటిలో కూడా, ఘుణాక్షరాలేవో వ్రాతగాని అక్షరాలేవో సరిగా గుర్తించాలంటే తలప్రాణం తోకకొస్తుంది. ఆ ప్రాచీన లిపులను నిర్దుష్టంగా చదవగలిగిన వారు అసలు దేశంలో ఉన్నారో లేరో అనిపిస్తుంది!
అయినా, వాటిని పరిశోధించేందుకు నిధులిచ్చే దాతలు లేరు. నేటి ప్రభుత్వాలకు పుష్కరాలనిర్వహణమీద ఉన్నంత శ్రద్ధ ఇటువంటి పనులలో లేదు.
కాబట్టి, విజ్ఞానశాస్త్రానికి భారతీయుల contribution ఏమీ లేదు అనుకుంటూ, మనలను మనం తక్కువ చేసుకుంటూ inferiority complex తో బ్రతకాల్సిందే మనం. అది మనం చేసుకున్న "ఖర్మ".
ఇపుడు మరింత బాగా అర్థమౌతుంది కదా, - "दाता भवति वा न वा - దాత అనేవాడొకడు ఉన్నాడో లేడో" - అనే కవిగారి మాటలోని ఆవేదన?
ఆవేదన కవికి మాత్రమే కాదుట, పుస్తకానికి కూడా ఉంటుందట -
అది ఆవేదనతో - "నాయనలారా, నన్ను నూనెనుండి, నీటినుండి రక్షించండి. నా కుట్లు ఊడి శిథిలం అయిపోకుండా కాపాడండి. దయచేసి మూర్ఖుని చేతికి ఇవ్వకండి" అని వేడుకుంటుందట పాపం.
తైలాద్రక్షేద్ జలాద్రక్షేద్ రక్షేచ్చిథిలబంధనాత్।
మూర్ఖహస్తే న దాతవ్యమ్ ఏవం వదతి పుస్తకమ్।।
కాబట్టి, పుస్తకదానం గొప్పదే - కానీ దాని గొప్పదనం అర్థం చేసుకోలేని వానికి చేరితే దానికి మరణమే గతి. తప్పదు - అక్కడ కాస్త జాగ్రత్త పడాలి అని పెద్దల మాట.
ఈరోజుల్లో డిజిటల్ పుస్తకాలు వచ్చాక రక్షణ కాస్త సులువైనట్లుగా అనిపిస్తోంది. కాని అందులో కూడా ఏవో కష్టనష్టాలు ఉండకపోవు. 

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...