Showing posts with label Upanishad. Show all posts
Showing posts with label Upanishad. Show all posts

Saturday, 16 July 2022

జనకసభ


                 పూర్వం విదేహరాజ్యాన్ని పరిపాలించే రాజులకు జనకుడు అనే నామాంతరం ఉండేది.  వారిలో ఒకానొక జనక మహారాజు ఒకసారి బహుదక్షిణం అనే పేరు కలిగిన గొప్ప యజ్ఞం చేశాడు.  ఆ యజ్ఞానికి నానా ప్రాంతాల నుండి అనేకమంది వేదపండితులు శాస్త్రపండితులు విచ్చేశారు.  వారిని, వారి అపరిమేయమైన వైదుష్యాన్ని గమనించిన జనకమహారాజు హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది.  ఆ సమయంలోనే అతడికి ఒక జిజ్ఞాస కూడా కలిగింది.  కో ను ఖలు అత్ర బ్రహ్మిష్ఠః?” (వీరందరిలోనూ అతి గొప్ప బ్రహ్మజ్ఞానము కలిగిన వారు ఎవరు?) అని.  కాని, ఆ మాటను నేరుగా ఆ విద్వత్పరిషత్తులోనే అడగటం మర్యాద కాదు.  అందువలన జనకమహారాజు ఒక ఉపాయం చేశాడు.

             తన గోశాలనుండి వేయి మంచి ఆవులను తెప్పించాడు.  ప్రతి ఆవుకు రెండు కొమ్ములు ఉంటాయి కదా.  ఒక్కొక్క కొమ్ముకు ఐదేసి పాదముల బంగారాన్ని కట్టించాడు.  తరువాత అక్కడ చేరిన విద్వత్పరిషత్తును ఉద్దేశించి, “మహాత్ములారా! యో వో యుష్మాకం బ్రహ్మిష్ఠః సః ఏతాః గాః ఉదజతామ్ (మీ అందరిలోనూ అతిశయించిన బ్రహ్మజ్ఞానం ఎవరికి కలదో, వారు ఈ ఆవులను తమ ఇంటికి తోలుకుపోవచ్చును.) అని ప్రకటించాడు.

             అప్పుడు అక్కడున్న వారు ఎవరూ నేనే అందరికంటే గొప్ప బ్రహ్మిష్టుడను అని చెప్పలేక మౌనంగా ఉండి పోయారు.

             అప్పుడు అక్కడున్న యాజ్ఞవల్క్యమహర్షి తన శిష్యుడిని పిలిచి, “ఏతాః సౌమ్య ఉదజ సామశ్రవా3 (సామశ్రవా, ఈ ఆవులను మన ఇంటికి తోలుకుపో నాయనా) అని చెప్పాడు.

             ఆ మాట విన్న పండితులందరికీ చాల కోపం వచ్చింది.  వారిలో అశ్వలుడు ఒకడు.  ఆయన జనక మహారాజు గారి యాజ్ఞికులలో హోత.  త్వం ను ఖలు నో యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠోసి?” (ఓ యాజ్ఞవల్క్యా, మన అందరిలోనూ నువ్వేనా అతి గొప్ప బ్రహ్మవేత్తవు?)  అని తీవ్రంగా అడిగాడు.

             మనలో ఎవరైతే అతి గొప్ప బ్రహ్మిష్ఠుడో అతడికి నా నమస్కారం.  నాకు ఆవుల అవసరం చాలా ఉన్నది.  అందుకనే నేను తోలుకుపోదామని అనుకున్నాను అని యాజ్ఞవల్క్యుడు మందహాసం చేశాడు.

             నీకు ఎంత అవసరం ఉన్నప్పటికీ, ఈ ఆవులు అతి గొప్ప బ్రహ్మవేత్త కోసం ఉద్దేశింపబడ్డాయి.  కాబట్టి మా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి నీవు ఆవులను తీసుకొని పోవచ్చును అని అశ్వలుడు సవాలు చేశాడు.

         యాజ్ఞవల్క్యుడు చిరునవ్వు నవ్వి, సరే ప్రశ్నించండి అని అడిగాడు.

         అశ్వలుడు యజ్ఞానికి, యజ్ఞము చేయించే విధానానికి, యజ్ఞం చేయించేవారికి సంబంధించిన అతి కఠినమైన ప్రశ్నలను వేశాడు.  యాజ్ఞవల్క్యుడు వాటికి అతి సులువుగా సమాధానం చెప్పాడు.  అశ్వలుడు యాజ్ఞవల్క్యుని సమాధానాలను ఆమోదించి, ఇక అడుగవలసిన ప్రశ్నలు తన వద్ద లేవని విరమించుకున్నాడు.

     అప్పుడు జరత్కారువంశీయుడైన కృతభాగుని పుత్రుడైన ఆర్తభాగుడు అనే మహర్షి ప్రశ్నించేందుకు పూనుకున్నాడు.  అతడు గ్రహములను గూర్చి అతిగ్రహములను గూర్చి అడిగిన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు చక్కగా సమాధానం చెప్పాడు.  (ఇక్కడ గ్రహములు అంటే planets కావు.  గ్రహించే వాటిని గ్రహములు అంటారు.). మరణించిన వ్యక్తి ఏమవుతాడు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాడు.  అప్పుడు యాజ్ఞవల్క్యుడు అజేయుడు అని గ్రహించిన ఆర్తభాగుడు మౌనం వహించాడు.

         అప్పుడు లహ్యుని కుమారుడైన భుజ్యుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు.  పారిక్షితుల స్థానాన్ని గూర్చి అతడు అడిగాడు.  (పారిక్షితులు అంటే అశ్వమేధయాగాన్ని చేసిన మహాత్ములు). యాజ్ఞవల్క్యుడు దానికి కూడా సరైన సమాధానం చెప్పాడు.  దాంతో భుజ్యుడు కూడా మౌనం వహించాడు. 

         అప్పుడు చక్రుని కుమారుడైన ఉషస్తి ప్రశ్నించేందుకు ముందుకు వచ్చాడు.  ఆత్మకు సంబంధించిన అతని ప్రశ్నకు కూడా యాజ్ఞవల్క్యుడు సులువుగా సమాధానం చెప్పాడు.  దాంతో ఉషస్తి కూడా తన ప్రయత్నాలను విరమించుకున్నాడు.

         అప్పుడు కుషీతకుని పుత్రుడైన కహోలుడు తన ప్రశ్నలను ప్రారంభించాడు.  అతడు కూడా ఆత్మను గురించి విభిన్నంగా ప్రశ్నించాడు.  యాజ్ఞవల్క్యునినుండి తనకు సరైన సమాధానం లభించడంతో మౌనం వహించాడు.

         అప్పుడు వచక్నుని కుమార్తె అయిన గార్గి తన ప్రశ్నలను ప్రారంభించింది.  వారి మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది -

 

గార్గి

ఒక వస్త్రం దారాలలో ఓత ప్రోతంగా ఎలా వ్యాపించి ఉన్నది కదా, ఆ విధంగా నీరు దేనిలో వ్యాపించి ఉన్నది?”

 

యాజ్ఞవల్క్యుడు

వాయువులో

 

గార్గి

వాయువు దేనిలో వ్యాపించి ఉన్నది?”

 

యాజ్ఞవల్క్యుడు

అంతరిక్షలోకాలలో

 

గార్గి

అంతరిక్షలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

గంధర్వలోకాలలో

 

గార్గి

గంధర్వలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి

 

యాజ్ఞవల్క్యుడు

ఆదిత్యలోకాలలో

 

గార్గి

ఆదిత్యలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

చంద్రలోకాలలో

 

గార్గి

చంద్రలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

నక్షత్రలోకాలలో

 

గార్గి

నక్షత్రలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

దేవలోకాలలో

 

గార్గి

దేవలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

ఇంద్ర లోకాలలో

 

గార్గి

ఇంద్రలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

ప్రజాపతిలోకాలలో

 

గార్గి

ప్రజాపతిలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

బ్రహ్మలోకాలలో

 

గార్గి

బ్రహ్మలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి?”

గార్గి ఆ ప్రశ్నను వేసేసరికి యాజ్ఞవల్క్యుడు ఆమెను కనికరం నిండిన దృష్టులతో చూశాడు.  ఓ గార్గీ, అతిప్రశ్నలను వేయకు. నీ తల ఊడి పడుతుంది అని హెచ్చరించాడు.

         (బ్రహ్మలోకం అనిర్వచనీయమని, అతీంద్రియమని, అవాఙ్మానసగోచరమని శాస్త్రం చెబుతుంది.  ఆ విధంగా కన్నులకు గాని, మనసుకు గాని ఇతర-ఇంద్రియాలకు గాని అందని విషయాన్ని గురించి ప్రశ్నించడాన్ని అతిప్రశ్న అంటారు.  ఎందుకంటే ఇంద్రియాలకు మనసుకు అందని దానిని ఎవరికి వారు స్వీయానుభవంతో తెలుసుకోవాలి.  బ్రహ్మలోకాలను గూర్చి తెలుసుకునేందుకు ఆ విధంగా ప్రయత్నించకుండా అవి ఎలా ఉంటాయి అవి ఎందులో ఉంటాయి అని ప్రశ్నించడమే ఈ సందర్భంలో అతి ప్రశ్న.  అంతేకాక, వేదవాక్కును మించిన ప్రమాణం లేదు.  దానిని పక్కకు త్రోసి అనుమానప్రమాణాన్ని ఆశ్రయించి అది వేదం కంటె గొప్పదనటం కూడా అతి.  ఆ విధంగా వేదాన్ని అతిక్రమించి అనుమానప్రమాణానికి అధికప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్రశ్నిస్తే అప్పుడు కూడా అది అతి ప్రశ్న అవుతుంది.)

         యాజ్ఞవల్క్యుడు అలా చెప్పేసరికి తన పొరపాటున గ్రహించిన గార్గి కూడా మౌనం వహించింది.

         అప్పుడు అరుణపుత్రుడైన ఉద్దాలకుడు ప్రశ్నించడం ప్రారంభించాడు.  ఓ యాజ్ఞవల్క్యా! నాకు సూత్రాత్మగా ఉన్న అంతర్యామిని గూర్చి తెలుసును. నీకు కూడా ఆ అంతర్యామి తెలిసినట్లయితే సరే.  కాని, అంతర్యామిని గూర్చి ఏమీ తెలియకుండా నీవు ఆవులను తీసుకువెళ్లదలిస్తే నీ తల ఊడి పడుతుంది అని హెచ్చరించాడు.  యాజ్ఞవల్క్యుడు అంతర్యామిని గురించి చక్కగా వివరించాడు.  సరైన సమాధానం లభించేసరికి ఉద్దాలకుడు మౌనం వహించాడు.

         అప్పుడు గార్గి మరలా నిలబడింది.  యాజ్ఞవల్క్యుని మరొకసారి ప్రశ్నించేందుకు పండితసభ అనుమతిని కోరింది.  ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పగలిగితే ఇక ఈ సభలో ఎవరూ యాజ్ఞవల్క్యుని ఓడించలేరు.  అటువంటి ప్రశ్న వేసేందుకు మీ అనుమతిని కోరుతున్నాను అని వినయంగా అడిగింది. సభ అందుకు అనుమతినిచ్చింది.  అప్పుడు గార్గి ఈ విధంగా సవాలు చేసింది. 

            ఓ యాజ్ఞవల్క్యా, నేను వేయబోయే ప్రశ్న ధనుస్సును ఎక్కు పెట్టి సంధింపబడి విడుదలకాబోతున్న పదునైన బాణం వంటి ప్రశ్న.  నీ దగ్గర సమాధానం ఉందా?” అని అడిగింది.




             యాజ్ఞవల్క్యుడు మందహాసం చేసి "వెంటనే ప్రయోగించవమ్మా నీ బాణాన్ని" అన్నాడు. 

ద్యు లోకానికి పైన, పృథ్వీలోకానికి క్రిందన, ఏది వ్యాపించి ఉన్నదో, ఈ ధ్యావాపృథ్వీలోకాలకు నడుమ ఏది ఉన్నదో, దేనికి భూతము భవము భవిష్యత్తు (Past, Present, Future) అనేవి ఉండవో, అయ్యది దేనిలో ఓతప్రోతంగా వ్యాపించి ఉన్నది?”

         ఈ విధంగా గార్గి అడిగిన ప్రశ్నను విని అందరూ దిగ్భ్రాంతి చెందారు.  అసలు ఆ ప్రశ్నలోని విషయం కూడా ఊహకు అందదు.  ఇక దానికి సమాధానం ఎవరు చెప్పగలరు అనుకున్నారు.  మునుపు గార్గి వేసిన ప్రశ్న మాటలకు అందనిదైనందున అతి ప్రశ్న అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.  కాని, ఇప్పుడు గార్గి తన మాటలతో వర్ణించినందువలన అది అతి ప్రశ్న కాజాలదు.  యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం వచ్చింది.

         అయితే ఆ విద్వత్పరిషత్తులోని మిగిలిన విద్వాంసులందరూ వేరు, యాజ్ఞవల్క్యుడు వేరు.  అతడికి గార్గి వేసిన ప్రశ్న కరతలామలకంలా అనిపించింది. 

         ఓ గార్గీ, అది ఆకాశంలో వ్యాపించి ఉన్నది అని యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాడు. 

     సభ నిశ్చేష్టమై నిశ్శబ్దంగా మారిపోయింది.  గార్గి మ్రాన్పడిపోయింది.  తన ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు అంత సులువుగా సమాధానం చెబుతాడని ఆమె ఊహించనేలేదు.  నిజానికి ఆమె అడిగినది ఊహాతీతమైన పరబ్రహ్మ గురించి.  పరబ్రహ్మ వర్ణింప వీలుకానిది. కాబట్టి, యాజ్ఞవల్క్యుడు మౌనం వహించాలి.  గార్గి అడిగినది అతిప్రశ్న కాకపోయినప్పటికీ, సమాధానం చెప్పలేక మౌనం వహిస్తే, ఆమె ప్రశ్నకు సమాధానం నావద్ద లేదని యాజ్ఞవల్క్యుడు తన పరాజయాన్ని అంగీకరించినట్లే.  అందువల్ల గార్గి చాల తెలివిగా యాజ్ఞవల్క్యుని ఇరుకున పెడదామని ఆ విధంగా ప్రశ్నించింది.  కాని, ఆమె తన ప్రశ్నలో ఒక పొరపాటు చేసింది.  ద్యావాపృథ్వీలోకాలు అని ఆమె ఉచ్చరించడంతో అవి కేవలం భౌతిక పదార్థాలు మాత్రమే అయినాయి.  అందువల్ల అవి ఆకాశంలో ఉంటాయని యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాడు.  ఆ సమాధానం లౌకికంగానూ శాస్త్రీయంగాను కూడా సత్యమే.  మొదటి సారి నీవు అడిగినది అతిప్రశ్న అయితే రెండవసారి నీవు అడిగిన ప్రశ్న అతి సాధారణమైన ప్రశ్న అన్నట్లుగా యాజ్ఞవల్క్యుడు తేల్చేశాడు.  అంతే కాదు, ఆకాశం కంటె కూడా నీవడగదలుచుకున్న పరబ్రహ్మ మరింత గొప్పది అని పరోక్షంగా తగిన సమాధానం కూడా సూచించాడు.  (తస్మాద్వా ఏతస్మాదాత్మనః ఆకాశః సంభూతః అని తైత్తిరీయవాక్కు.)

         తెల్లబోయిన గార్గి కాసేపటికి తేరుకుని, “ఆ ఆకాశం దేనిలో వ్యాపించి ఉన్నది?” అని అడిగింది.  దానిని అక్షరం అంటారు (అక్షరం = క్షరము కానిది = నాశనం లేనిది) అని యాజ్ఞవల్క్యుడు చెప్పి, దాని స్వరూపం వర్ణింప వీలులేనిది కాబట్టి, నేతి (న+ఇతి) వాదం ప్రకారం సమాధానం చెప్పాడు.  (ఆ అక్షరస్వరూపం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇలా ఉండదు అంటూ వర్ణించాడు.). అటువంటి అక్షరంలో ఈ ఆకాశం వ్యాపించి ఉన్నది అని చెప్పాడు.  గార్గికి తగిన సమాధానం లభించింది.  ఆమె పన్నిన ఉచ్చులో యాజ్ఞవల్క్యుడు ఇరుకున పడలేదు.  తామరతూడు ఏనుగును బంధించలేదు కదా.

ఆ సమాధానం విన్న గార్గి వినమ్రురాలయింది. యాజ్ఞవల్క్యునికి సవినయం నమస్కారం చేసింది.  వినీతులు ఎంతటి జిగీషులైనప్పటికీ, మహాత్ముల చెంత వారి సహజస్వభావం పెల్లుబుకుతూనే ఉంటుంది కదా. అయ్యా పండితులారా! మీరు కూడా ఈయనకు నమస్కారం చేసి, ఈయన మనలో అతి గొప్ప బ్రహ్మవేత్త అని అంగీకరించండి.  సత్యాన్ని అంగీకరిస్తే అది మనకు విజయమే కాని పరాజయం కాదు. మీరెవరు ఈయనను జయింపలేరు అని సభలోని విద్వాంసులతో హితవు పలికింది.

         అయితే గార్గి మాటలను శాకల్యుడు సహించలేకపోయాడు.  తాను కూడా ప్రశ్నించి యాజ్ఞవల్క్యుని పరీక్షిద్దామని ముందుకు వచ్చాడు.

 

శాకల్యుడు

వైశ్వదేవంలో దేవతల సంఖ్య ఎంత?”

 

యాజ్ఞవల్క్యుడు

3306 మంది

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

33 మంది

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఆరుగురు

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ముగ్గురు

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఇద్దరు

 

శాకల్యుడు

సరే, ఎంత మంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఒకటిన్నర మంది

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఒక్కరు

 ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు తాను చెప్పిన ఆయా దేవతల సంఖ్యలను గురించి కూడా చక్కగా వివరించాడు.

         అయినప్పటికీ శాకల్యుడు శాంతించలేదు.  ఏ విధంగానైనా యాజ్ఞవల్క్యుడిని జయించాలనే కోరికతో ప్రశ్న మీద ప్రశ్నలను అడుగుతూ పోయాడు.  (సత్యాన్ని తెలుసుకోవాలని కోరికతో కాకుండా, తనకు సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని ఎంతమాత్రం ప్రతిపాదించకుండా, కేవలం తన ప్రత్యర్థి మాటలను నిరాధారంగా నిష్కారణంగా అసూయతో ఖండిస్తూ వాదించడాన్ని వితండవాదం అంటారు.).

         చివరకు శాకల్యుని దురాగ్రహాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు, ఓ శాకల్యా, నీకు సమాధానం తెలియని ప్రశ్నను నన్ను అడుగవద్దు.  సమాధానం తెలియకుండా నన్ను ప్రశ్నించినట్లయితే నీ తల తెగిపడుతుంది అని హెచ్చరించాడు.  అయినప్పటికీ, శాకల్యుడు తనకు సమాధానం తెలియని ప్రశ్నను అడిగేశాడు.  దాంతో శాకల్యుని తల అందరి సమక్షంలోను తెగి క్రింద పడింది.

      అప్పుడు యాజ్ఞవల్క్యుడు, సభను ఉద్దేశించి, “అయ్యా, మీలో ఇంకా ఎవరెవరు ఏమేమి ప్రశ్నలను అడగదలుచుకున్నారో విడివిడిగా అడగవచ్చు.  లేదా అందరూ కలిసి ఒకే ప్రశ్నను వేయవచ్చు.  నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నాను అని పలికాడు.

         అప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. 

       అప్పుడు యాజ్ఞవల్క్యుడే స్వయంగా పండితపరిషత్తును ఉద్దేశించి ప్రశ్నించాడు.  ఆత్మ అనే పురుషుని వృక్షంతో పోల్చి చెప్పి, చెట్టును వేళ్లతో సహా విత్తనంతో సహా నాశనం చేస్తే ఆ చెట్టు మరల మొలకెత్తదు.  కాని, మన ముందే మరణించి, శరీరం కాల్చివేయబడినప్పటికీ, ఆ వ్యక్తి మరలా జన్మిస్తాడు. (ధ్రువం జన్మ మృతస్య అని శాస్త్రం)  కో న్వేయం జనయేత్ పునః?  (మరణించిన వ్యక్తిని మరలా పుట్టేట్లుగా చేస్తున్న ఆ శక్తి ఏమిటి?) అని అడిగాడు.

     ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు.  యాజ్ఞవల్క్యుడు సభకు నమస్కరించి, ఆవులను తోలుకొని పోయాడు. 

విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్దాతుః పరాయణం తిష్ఠమానస్య తద్విద ఇతి – అని బృహదారణ్యకోపనిషత్తు ఆ శక్తిని గూర్చి చెబుతుంది.  ఆ శక్తి పేరు విజ్ఞానం.  ఆ శక్తి పేరు ఆనందం.  ఆ శక్తి పేరు బ్రహ్మ.  అదే పరమగతి.

 

ఇతి శమ్

Wednesday, 31 July 2019

Isa Vasyam Idam Sarvam


।।ईशा वास्यम् इदम् सर्वम्।।

ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्।
तेन त्यक्तेन भुञ्जीथाः मा गृधः कस्यस्विद्धनम्।।
The above Shloka is the very first one in Isavasyopanishad.The meaning of the shloka is this – “Whatever is present in this world; that should be filled with the Lord.  (It means - One should be able to see the Lord in everyone and everything.)  You have to protect yourself by sacrificing it.  (Or, you have to nurse yourself by what that is given to you by him.)  You should never hanker after the wealth of anybody.

The word यत्किञ्च makes us understand that the existent world is completely filled with various things.  They may be even opposites of one another.  For example, both good and bad are included in them.  Still, without any partiality, we must consider that both of them are filled with the Lord. Even a piece of sandal wood starts emitting bad smell when it is kept in the water for a long time.  Yet, when we take it out of the water and start rubbing it against a stone, it starts releasing its original sweet fragrance.  Originally, the water is pure and the sandal wood is also fragrant.  But their attachment for a long time caused a bad smell. Similarly, some people may appear bad due to their attachment with various other things. Yet, every person and everything has a distinctive and divine soul inside.  That divinity belongs to the Lord.  The words ईशा वस्यमिदं सर्वम् very strongly proclaim this truth.

The words तेन त्यक्तेन भुञ्जीथाः make us understand that one should sacrifice such attachment and live comfortably.  If you develop attachment with just one person or one thing, then, it means that you are ignoring the law of the omnipresence of the Lord.  When the law is violated, you deserve punishment in the form of grief etc.  Therefore, if you wish to be away from the punishment, you need to sacrifice.  You need to detach yourself from the remaining.  That is a way of protecting yourself.

The words कस्यस्विद्धनम् do not simply mean the wealth of others but they mean one’s own wealth as well.  So, one should not develop a desire to accumulate the wealth in excess of his needs.  These words remind us the “Yamas” of Yoga – “Asteya and Aparigraha”.

However, one may wonder as how to detach oneself from the remaining world.  He may even feel that death alone can detach a person from the world.  The Shastra gives answer to such doubts and thoughts:  One should wish to live for hundred years; doing the activities which are accepted by the Shastras.  If you live so, your life is called as detached life and you are not considered for punishment.” – So, there is no need to die to detach oneself from the world.  Living a simple life prescribed by Shastras makes you free from grief.  According to the wish of the Lord, we should live a life span of hundred years. Another way of practicing detachment is, doing the prescribed activities without any expectation of personal benefit.

The people who do not lead such pious life are equal to the people who commit suicide.  Such people will be punished even after their death.  They will be in the dark and blind world of ignorance.  They will take birth as Rakshasas. (Those who consider sense-pleasures are the highest things to be achieved in one’s life.)

So, one should help oneself by finding God in everything and in oneself.  So, the practitioner must practice to find himself in all the living creatures and all the living creatures in him.  Then, he never feels insecurity.  Then, he will be free from all the illusions and grief. The real practitioner can practically experience satisfaction when some other creature is satisfied.   The knowledge of this is called “Vidya.”

However, mere Vidya does not make a person free from every grief.  Similarly mere action of showing mercy on the creatures etc; (Avidya) does not make a person free from his grief.  A person with both correct knowledge and sincere action alone can attain Moksha.  (Freedom from grief)
So, we must desire to find (learn and practice) both Satya (Knowledge) and Dharma (Action) from the Sun (Independent realization) by removing the golden cover (attractive and pleasant activities for self).

हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्।
तत्त्वं पूषन् अपावृणु सत्यधर्माय दृष्टये।।

Friday, 5 April 2019

వికారి ఉగాది శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలు.
వికారి-నామ-సంవత్సర-శుభాకాంక్షలు.
వికారి అనే పేరు విని
ఏమిటిది అని ఎవరూ ముఖం చిట్లించుకొనవలసిన పని లేదు.
అదేమీ చెడ్డ పేరు కానే కాదు.
ధనము కలిగినవాడు ధని.
బలము కలిగినవాడు బలి. (బలిచక్రవర్తి తెలుసుగా)
చక్రము కలిగినవాడు చక్రి (విష్ణువు)
శూలము కలిగిన వాడు శూలి (శివుడు)
హస్తము అంటే తొండము కలిగినది హస్తి. (అంటే ఏనుగు)
అదే పరంపరలో వికారము కలిగినది/కలిగినవాడు వికారి అన్న మాట.
మరి వికారము అనేది చెడ్డపేరు కాదా?
కాదు.
ఆకారము అనే పదాన్ని ఆకృతి అని కూడా అంటాము.
అలాగే, వికారము అనే పదాన్ని వికృతి అని కూడా అంటాము.
వికృతి అనగానే తెలుగు వ్యాకరణంలో ప్రకృతి – వికృతులు గుర్తుకు వచ్చాయా? రథము అనే ప్రకృతి పదానికి అరదము అనే పదం వికృతి. బ్రహ్మ అనే ప్రకృతి పదానికి బొమ్మ అనే పదం వికృతి. విష్ణువు అనే ప్రకృతిపదానికి వెన్నుడు అనే పదం వికృతి. ఇలా చాలానే చదువుకున్నాం కదా? ఈ విధంగా వికృతిపదాలు ప్రకృతి నుండి వచ్చినవే తప్ప, వేరే కావు. కాని, ఇది భాషకు సంబంధించిన ప్రకృతి-వికృతి సంబంధం.
దర్శనశాస్త్రాన్ని అనుసరించి ఈ కనిపిస్తున్న, మన తర్కానికి గాని, మన ఊహకు గాని అందుతున్న ఈ సమస్తవిశ్వము కూడా వికృతే! దీనికి మూలమైన ప్రకృతి మన కంటికి కూడా కనబడదు. “మూలప్రకృతిరవికృతిః. మహదాద్యాః ప్రకృతివికృతయః సప్త. షోడశకస్తు వికారః.” అని సాంఖ్యకారికలలో (3) ఈశ్వరకృష్ణుడు చెబుతాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి అంటే వేరొకదాని పుట్టుకకు ఆధారభూమిగా ఉండేది. వికృతి అంటే, వేరొకదానినుండి ఉద్భవించేది. ప్రకృతివికృతులు అంటే, తాము స్వయంగా వేరొకదానినుండి పుడుతూ మరొకదాని పుట్టుకకు కారణమయ్యేవి అన్నమాట.
అటువంటి మూలప్రకృతి (కేవల ప్రకృతి) ఒక్కటే ఉందట.
ప్రకృతివికృతులు ఏడు ఉన్నాయట.
కేవలవికృతులు పదహారు ఉన్నాయట.
కేవలవికృతులు పదహారు అన్నారు కదా?
ఆ వికృతులు ఏమిటో తెలుసా?
అందులో మొట్టమొదటిది మనస్సు.
తరువాత, కన్ను ముక్కు చెవి వంటి జ్ఞానేంద్రియాలు ఐదు,
కాళ్లు చేతులు వంటి కర్మేంద్రియాలు ఐదు,
భూమి, గాలి, నీరు వంటి పంచభూతాలు ఐదు.
(1+5+5+5=16)
అర్థమైందా?
ఈ మనస్సు, ఈ పంచభూతాలు, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, ఈ పంచకర్మేంద్రియాలు – ఇవన్నీ వికృతులు. అంటే వికారాలు. ఈ వికారాలతో తయారైనదే శరీరం. ఈ వికారాలు కలిగినది వికారి. అంటే ఎవరు? మనమే. కాబట్టి, వికారి నామ సంవత్సరం అంటే మన సంవత్సరమే.
సరే, ఇంతకీ మనం ఎవరం?
ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఉంది. ఆరుణి అని ఒక గొప్ప జ్ఞాని ఉన్నాడు. అతడికి శ్వేతకేతువు అని ఒక కుమారుడు ఉన్నాడు. అతడు గురుకులానికి వెళ్లి విద్యాభాసం చేసి వచ్చాడు. అపుడు వారి నడుమ ఒక గొప్ప సంభాషణ జరిగింది.
"నాయనా శ్వేతకేతూ, ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అవుతుందో దానిని నువు తెలుసుకున్నావా?”
శ్వేతకేతువుకు ఆశ్చర్యం కలిగింది.
“లేదు నాన్నగారూ, అదేమిటో చెప్పండి” అని అడిగాడు.
అపుడు ఆరుణి చక్కగా వివరించి చెప్పాడు –
యథా సోమ్య, ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్। వాచారంభణం వికారో నామధేయో మృత్తికేత్యేవ సత్యమ్।।’ (ఛాందోగ్యం 6.1.4)
కుండ, మూకుడు, కడవ, తొట్టి వంటి వస్తువులు తయారు అవుతున్నాయి. అవన్నీ మట్టితోనే తయారు అవుతున్నాయి. అదే మట్టితో రాజు బొమ్మ, రాణి బొమ్మ, గుర్రం బొమ్మ, ఏనుగు బొమ్మ, తయారు అవుతున్నాయి. వాటి ఆకారాలు వేరు, వాటి పేర్లు వేరు. వాటి ఉపయోగాలు కూడా వేరే. అయినప్పటికీ వాటి మూలపదార్థం ఒకటే. అదే మట్టి. కాబట్టి, ఆ మట్టి స్వభావాన్ని తెలుసుకుంటే, దానితో చేయబడిన, చేయబడుతున్న, చేయబడబోతున్న సమస్తవస్తువులను గూర్చి సమగ్రంగా తెలుసుకున్నట్టే” అని చెప్పాడు ఆరుణి.
ఆ వస్తువులన్నీ వికారాలు.
వాటికి ఆ మట్టి మూలపదార్థం.
ఈ వికారాలన్నీ కూడా మట్టిముద్దకంటె అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
అయినప్పటికీ, ఆ వికారాల ఆయుష్కాలం తీరినతరువాత అవి నెమ్మదిగా కలసిపోయేది తమ మూలపదార్ధంలోనికే. (అయితే ఆ మట్టి కూడా, మూలప్రకృతి నుండి పుట్టుకొచ్చిన వికారమే అని మరచిపోరాదు.)
అలాగే, ఉంగరము, గొలుసు, కంకణము మొదలైన నగలన్నీవికారాలు.
వాటికి బంగారం మూలపదార్థం.
ఒక పెద్ద మఱ్ఱి చెట్టు ఉంది. దానికి విశాలంగా విస్తరించిన బోలెడు కొమ్మలున్నాయి. బోలెడు ఊడలు ఉన్నాయి. లెక్కపెట్టడం మొదలు పెడితే మనకు ఆయాసం కలిగించేంత సంఖ్యలో ఆకులు ఉన్నాయి. పండ్లు ఉన్నాయి. పండ్లలో విత్తనాలు ఉన్నాయి. ఇవన్నీ వికారాలు. ఆ విత్తనాలలో మళ్లీ ఇంత పెద్ద మఱ్ఱి చెట్లు అనేకం దాక్కుని ఉన్నాయి. ఆ విత్తనాలలో ఆ మఱ్ఱిచెట్లను మనం చూడలేము. ఐనప్పటికీ, అవి ఉన్నమాట సత్యం. అవి ఆ విత్తనాలలో అత్యంత సూక్ష్మపదార్థరూపంలో దాక్కుని ఉన్నాయి. ఆ సూక్ష్మాతిసూక్ష్మమైన పదార్థమే మూలప్రకృతి అని చెప్పవచ్చు. అది క్రమంగా కాలానుగుణంగా విస్తరిస్తుంది. అయితే, తనంత తానుగా విస్తరించే శక్తి దానికి లేదు. చైతన్యంతో కలసినపుడే అది అలా విస్తరిస్తుంది.
అలాగే ఈ సమస్తవిశ్వం కూడా వికారం. ఇది తనంత తానుగా విస్తరించలేదు. దీనికి మూలం మూలప్రకృతి. ఆ మూలప్రకృతి కూడా చైతన్యంతో కలసినపుడు విశ్వంగా విస్తరిస్తుంది. ఆ చైతన్యపదార్థాన్ని సాంఖ్య దర్శనంలో పురుషుడు అంటారు. (ఇక్కడ పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు.)
మనం ఎవరం అని అనే ప్రశ్నకు సమాధానం అదే.
మనం పురుషులం.
చైతన్యస్వరూపులం.
(పైన చెప్పినట్లుగా ఇక్కడ ఆడ-మగ అనే తేడాలు లేవు. పురుష అనేది చైతన్యపదార్థానికి ఒక సాంకేతికనామం మాత్రమే.) మనం వికారాలు కలిగి ఉండడం చేత మాత్రమే మనం వికారి అనబడతాము.
ఆరుణి చెప్పిన కథలో వలె, మన నామరూపాలు కూడా వికారాలే.
నన్ను నేను శ్రీనివాసులు అనే పేరుతో పరిచయం చేసుకున్నాను కాబట్టి, మీరందరూ నన్ను ఆ పేరుతో పిలుస్తున్నారు. మొదట్లోనే నా పేరు వేంకటేశులు అనో రామయ్య అనో చెప్పుంటే, మీరు నన్ను అదే పేరుతోనే పిలిచేవారు కదా? కాబట్టి, నామం వ్యావహారికసత్యమే తప్ప, పారమార్థికంగా అసత్యం అని తెలుస్తోంది. అవునా?
అలాగే, నా తిండిని బట్టి నా రూపం, అంటే ఒడ్డు, పొడుగు, బరువు మొదలైనవి ఉంటాయి. నేను నివసించే ప్రదేశాన్ని బట్టి నా రంగు ఉంటుంది. ఈవిధంగా, రూపం కూడా వ్యావహారికసత్యమే తప్ప, పారమార్థికసత్యం కాదు అని తెలుస్తోంది కదా?
నా మనస్సు కూడా వ్యావహారికమే. నా మనసు ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి, నేను ఈ ప్రదేశం గురించే ఆలోచిస్తాను. ఇక్కడ మంచి జరిగితే సంతోషిస్తాను. ఇక్కడ బాగులేదు అనుకుంటే బాధపడతాను. నా మనస్సు ఇక్కడ కాకుండా ఎక్కడో పసిఫిక్ సముద్రంలో ఒక అందమైన దీవిలో ఉందనుకోండి. అక్కడి సుఖాలను అక్కడి బాధలను మాత్రమే నా మనస్సు అనుభవిస్తుంది. కాబట్టి, మనం సుఖాలు, బాధలు అనుకుంటున్నవి అన్నీ కూడా మన మనసు పడుతున్న వికారాలే. అవి కూడా వ్యావహారికసత్యాలే కాని, పారమార్థికసత్యాలు కావు.
మనకు ఇన్ని వికారాలు ఉన్నాయి కదా, అందుకే మనం వికారి అయినాము. ఇటువంటి రకరకాల వికారాలు వదులుకోగలిగితే, మనం మనంగా, (శుద్ధచైతన్యస్వరూపంగా) ఉంటాము అనేది సాంఖ్యదర్శనశాస్త్రం చెబుతుంది. మోక్షం అంటే అదే అని వారు చెబుతారు.
అయితే, మోక్షం కావాలంటే, ముందు మనం వికారి అని తెలుసుకోవాలి. అప్పుడే, మన వికారాలు ఏమిటో మనం తెలుసుకొనగలం. అవి తెలిస్తేనే, వాటిని వదిలించుకొనేందుకు ప్రయత్నించగలం. చైతన్యస్వరూపులం కాగలం.
వికారము అనే పదాన్ని కురూపత్వము అనే అర్థంలో కూడా వాడుతారు.
వికారి అంటే కురూపి (సౌందర్యవిహీనుడు) అన్నమాట.
"ఓ పార్వతీ! శివుడు విరూపాక్షుడు కదా? కాబట్టి వికారి కదా? మరి అటువంటివాడిని ఎందుకు నువు ఇష్టపడ్డావు?" అని అడిగితే పార్వతికి కోపం వచ్చింది. తగిన సమాధానం చెప్పింది. అలా అడిగినవాడు స్వయంగా మారువేషం వేసుకొచ్చిన శివుడే అనుకోండి. ఆ ముచ్చటలు కాళిదాసుని కుమారసంభవంలో ఉన్నాయి. ఎప్పుడైనా ఆ మాటలు ఒకసారి చూద్దాం.
మానవులు ఏమైనా తక్కువ తిన్నారా?
భౌతికంగా వికారులైనవారిని చూసి నవ్వే మానసికవికారులు కూడా ఉంటారు.
జనకమహారాజు సభలో ప్రవేశించిన అష్టావక్రమహర్షిని చూసి అక్కడ ఉన్న పండితులు నవ్వారట. అపుడు, అష్టావక్రుడు కూడా నవ్వాడట. "మేము నవ్వితే దానికి ఒక అర్థం ఉంది, మరి నువ్వెందుకయ్యా నవ్వావు?" అని వారు అడిగారట.
కండ్లు ఉండవలసిన స్థానంలో ముక్కు, ముక్కు ఉండవలసిన స్థానంలో చెవులు, - ఇలా ఉంటే అది వికారం కదా? అలాగే, ఈ సభలో ఉన్న వికారాన్ని చూసి నవ్వాను అన్నాడట అష్టావక్రుడు.
ఈ సభలో నీకేమి వికారం కనిపించింది? అని వారు అడిగారట. క్షత్రియుల దృష్టి ఆయుధాల ఉంటుంది. పండితుల దృష్టి శాస్త్రజ్ఞానం మీద ఉంటుంది. కాని, ఇక్కడున్న వారు నా శాస్త్రజ్ఞానాన్ని చూడలేకపోయారు. కేవలం నా చర్మాన్ని చూసి నవ్వారు. అందుకని వారు చర్మకారులే. పండితాసనాలలో పండితులు ఉండాలి. కాని, ఈ సభలో అక్కడ చర్మకారులు కూర్చున్నారు. అందువల్ల, ఈ సభ నాకు వికారంగా కనబడింది. అందువల్ల నవ్వాను పొమ్మన్నాడు అష్టావక్రుడు.
దాంతో అందరికీ బుద్ధి వచ్చిందట. అష్టావక్రునికి అందరూ క్షమాపణలు చెప్పుకున్నారు. (ఇక్కడ చర్మకారుడు అనేది వెక్కిరింపు మాట కాదు. కన్ను ఉండవలసిన చోట ముక్కు ఉంది అన్నామనుకోండి. అది ముక్కును వెక్కిరించినట్టు కాదు కదా?)
ఒడిషా బెంగాలు ప్రజలు ‘వ’ అనే అక్షరాన్ని ‘బ’ అని పలుకుతారు. వంగదేశాన్ని బంగదేశం అంటారు. రవీంద్ర అనకుండా రబీంద్ర అంటారు. అలాగే వారు 'వికారి' అనే పదాన్ని 'బికారి' అని పలుకుతారేమో. అపుడు అర్థం మారిపోదా? ఆయా ప్రాంతంలో పలుకుబడి అలాగే ఉంటుంది కాబట్టి, అర్థం మారిపోదు.
సరే, ఇంతకూ మన భాషలో బికారి అంటే ఏమిటి? బికారి అంటే బిచ్చగాడు, ఇల్లూవాకిలీ లేని వాడు, అనాథ, పేదవాడు అనే నానార్థాలలో మన తెలుగువారు ఆ పదాన్ని వాడుతూ ఉంటారు.
కాని, నిజానికి బే-కార్ అనే రెండు పదాల కలయిక అది. ‘బేషరతు’ అంటే షరతులు లేకుండా అనే అర్థం మనకు తెలుసు కదా? అలాగే, ‘బేకార్’ అంటే పనిలేనివాడు అని అర్థం. అంటే, చేయడానికి పని లేనివాడు అని అర్థం కాదు. వాడిని నిరుద్యోగి అని కాస్త మర్యాదగా పిలుస్తారు. బేకార్ అనేది ఒకరకంగా తిట్టు. చేయడానికి పని ఉన్నప్పటికీ, చేయకుండా జులాయిగా తిరిగేవాడిని అలా తిడతారు.
నిరుద్యోగులకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పే మన రాజకీయనాయకులకు ఈ తేడా తెలిస్తే బాగుంటుంది అని ఆశిద్దాం.
భౌతికమైన వికారాల కంటె, మనోవికారాలు చాల శక్తిమంతమైనవి. ప్రేమ, కరుణ, వాత్సల్యము, మొదలైనవి కూడా శాస్త్రం ప్రకారం మనోవికారాలే. అయినప్పటికీ, వ్యవహారంలో వాటిని మంచి వాటిగా పరిగణిస్తారు.
కాని, మరికొన్ని మనోవికారాలు చెడ్డవి అని వ్యవహారం. కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యాలు మనోవికారాలే. ఇవి తగుమాత్రంలో అందరికీ ఉంటాయి. సాధువులు మాత్రం మంచివని, చెడ్డవని తేడా చూపకుండా, సమస్తమనోవికారాలను వదిలించుకోవాలని ప్రయత్నిస్తారు.
మంచివైనా చెడ్డవైనా మితిమీరితే మాత్రం చాల ప్రమాదం. రాయలసీమలో ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే, "యేమిరా ఆ మనిషి శానా యికారాలు బడతా ఉండాడే?" అని అంటారు. అతి సర్వత్ర వర్జయేత్ అనే విషయం అందరికీ తెలిసిందే కదా?
ప్రేమ అనే మనోవికారం మంచిదని మనం అనుకుంటాం. కాని, దుర్యోధనుడి మీద ధృతరాష్ట్రుడు అతి ప్రేమ చూపినందువలన ఆ దుర్యోధనుడు ఎలా చెడిపోయాడో మహాభారతం చెప్పింది.
కామం అనే మనోవికారం చెడ్డదని మనం అనుకుంటాం. కాని, "ధర్మావిరుద్ధో భూతేషు కామోऽస్మి భరతర్షభ(ధర్మవిరుద్ధం కాని కామాన్ని నేనే అర్జునా) అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. గంగను స్వర్గం నుండి భూమికి దించాలి అనే కామంతో (కోరికతో) భగీరథుడు ఎంతో గొప్ప ప్రయత్నం చేసి, సఫలుడై, సమస్తప్రజలకు చాల మేలును చేకూర్చాడని రామాయణం వర్ణిస్తుంది.
ఈ రామాయణమహాభారతాలను మనం ఇతిహాసాలుగా పరిగణిస్తాము. అంటే చరిత్ర అన్నమాట. అయితే, పాశ్చాత్యులు వచ్చి వాటిని మైథాలజీ అనేశారు. అంటే కట్టుకథలు అని.
అస్తు. వారికైనా మనకైనా యద్భావం తద్భవతి.
అందువలన, వికారాలు స్వతః మంచివి అని చెడ్డవి అని ఉండవు. వాటితో మనం చేసే వ్యవహారాలను బట్టి అవి మంచివా చెడ్డవా అని లోకులు నిర్ణయించే పరిస్థితి వస్తుంది. అధికమాత్రంగా ఉన్నవాటిని మనం వదిలించుకోవాలి. మనం స్వయంగా అటువంటి వికారాలను వదిలించుకొనలేకుంటే రామదాసుని, హనుమంతుని త్రికరణశుద్ధిగా స్మరిద్దాం. ఆయన వదిలించగలడు. హనుమంతుడే ఎందుకు అంటే, హనుమంతుడే మరి! బురదగుంటలో పడినవాడిని పైకి లాగాలి అంటే, ఆ బురదగుంటలో లేకుండా బయట ఉన్నవారే శరణ్యం కదా, అలాగన్న మాట.
తులసీదాసమహాకవి హనుమాన్ చాలీసా మొదలుపెట్టే ముందు హనుమత్స్మరణం చేశాడు.
'బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవనకుమార
బల బుద్ధి బిద్యా దేహు మొహి హరహు కలేశ బికార'
(దోహా 2)
(ఓ పవనకుమారుడా! హనుమన్! నన్ను నేను ఒక తెలివితక్కువవాడిగా పరిగణించుకుని, నిన్ను స్మరిస్తూ శరణు వేడుతున్నాను. నాకు బలాన్ని, బుద్ధిని, విద్యను ప్రసాదించు. నా కష్టాలను, నా వికారాలను హరించు)
తులసీదాసు ప్రార్థన ఫలించింది. అతడు మహాకవులలో ఒకడుగా కీర్తింపబడ్డాడు. భక్తాగ్రగణ్యుడిగా పరిగణింపబడ్డాడు. ఆవిధంగా వికారాలను వదిలించగల శక్తి, ఆసక్తి రెండూ మెండుగా ఉన్న స్వామి హనుమంతుడు కదా, అందుకని అతనిని ప్రార్థించాలి. పైగా మరికొన్ని రోజులలో శ్రీరామనవమి కూడా రానుంది మరి!
క్రొత్త సంవత్సరం వేళ, మన ప్రార్థన కూడా తప్పక ఫలిస్తుంది.
ఈ వికారినామ సంవత్సరంలో వారికి, వీరికి అని కాకుండా, అందరికీ సకలశుభాలు ఆనందాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను.
డా. శ్రీనివాసకృష్ణ పాటిల్

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...