Showing posts with label Siva. Show all posts
Showing posts with label Siva. Show all posts

Thursday, 26 March 2020

కాళిదాసు స్వభావోక్తి



అది హిమవత్ పర్వతపంక్తులలో ఒక ప్రాంతం.  గంగానది పెద్దగా సడి చేయకుండా నెమ్మదిగా ప్రవహిస్తోంది.  ఆ ప్రవాహంలో పొడవాటి దేవదారువులు కాళ్ళు పెట్టి తడుస్తూ ఉన్నాయి.  అక్కడి పొదలలో సంచరిస్తున్న కస్తూరి మృగాల కారణంగా గాలి పరిమళభరితంగా ఉన్నది.  కిన్నరులు సన్నగా పాడుతున్న ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి.  ఆ ప్రాంతంలో చర్మవస్త్రుడు అయిన పరమేశ్వరుడు ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.

ప్రమథగణాలు విశ్రాంతిగా ఆటవిడుపుగా ఉన్నారు.  అక్కడ ఉన్న పూలను తమ సిగలలో తురుముకున్నారు.  వారు భూర్జత్వచాలను (బుజపత్తిరి పట్టలను) వస్త్రాలుగా ధరించారు.  మనశ్శిలాచూర్ణాన్ని ఒంటికి పూసుకున్నారు.  శిలాజతువులనడుమ బండరాళ్లపై కూర్చుని ఉన్నారు.

అప్పుడు, నందీశ్వరుని (వృషభం) చేష్టలను వర్ణిస్తూ కాళిదాసు వ్రాసిన ఈ శ్లోకం అతి రమణీయమైనది.

తుషారసఙ్ఘాతశిలాః ఖురాగ్రైః
సముల్లిఖన్ దర్పకలః కకుద్మాన్।
దృష్టః కథఞ్చిద్గవయైర్వివిగ్నైః
అసోఢసింహధ్వనిరున్ననాద॥
(కుమారసంభవమ్ 1.56)

ఆ మహావృషభం చలికాలంలో పేరుకుపోయి గడ్డకట్టిన మంచురాళ్లను తన గొరిౙలతో (కాలి గిట్టలతో) గోరాడుతూ ఉండగా ఎక్కడో దూరం నుండి సింహగర్జనలు వినిపించేసరికి సహించలేక (ఆమాత్రం శబ్దం నేను చేయలేనా అన్నట్టుగా) ఉన్నట్టుండి ఖణిల్లని రంకె వేసిందట.  అప్పుడు దాని మహాకారాన్ని, బలాన్ని చూసి, ఆ దగ్గరలో ఉన్న తక్కిన గవయవాలు (కొండెనుములు) అన్నీ భయనిర్విణ్ణములై నిశ్చేష్టములై పోయాయట.

(ననాద అనే క్రియాపదప్రయోగంతో ఆ ఎద్దు రంకెతో ఆ కొండలు కోనలు ప్రతిధ్వనించిపోయాయనే అర్థాన్ని కూడా కాళిదాసు నేరుగా చెప్పకపోయినా ధ్వనింపజేశాడు.)

(చలికాలంలో కడుపునిండా తిండి దొరకక అరణ్యాలలోను కొండలలోను తిరిగి తిరిగి అలసిపోయి నిస్సహాయంతో కోపంతో గర్జించిన సింహాలు నందీశ్వరుని రంకెకు ఒక్కసారిగా అదిరిపడి, చెవులు రిక్కించి, జూలు అల్లాడుతూ ఉండగా తమ తలలను ఒకింత పైకెత్తి, తమను తిరిగి సవాలు చేస్తున్నట్లు వినవచ్చిన దర్పంతో కూడిన ఆ మహానాదాన్ని చేసిన ఆ మహాసత్త్వం ఏమైయ్యుంటుందో అని కలత చెందుతూ, కళ్లను విప్పార్చి అటూ ఇటూ చూస్తున్న దృశ్యాన్ని ఊహించమని కాళిదాసు చెప్పినట్లు ఉంది కదా!)

ఉపమా కాళిదాసస్య అని అందరూ కీర్తిస్తారు.  కాని ఇంత చక్కని స్వభావోక్తిని కూడా కాళిదాసు ప్రయోగించగలడు!  'చారు యథావద్ వస్తువర్ణనమ్' అని స్వభావోక్తి అలంకారాన్ని ప్రఖ్యాతకాళిదాసవిమర్శకుడైన మల్లినాథులవారు నిర్వచించారు.  ఉన్నదానిని ఉన్నట్టుగా వర్ణించడం స్వభావోక్తి అట. 

కవయః కాళిదాసాద్యాః
కవయో వయమప్యమీ।
(కాళిదాసులాంటివాళ్లూ కవులే, మేమున్నూ కవులమే) ఆమాత్రం అందరూ వర్ణించగలరు కదా?  ఆగండాగండి.  ముందుగా 'చారు' అనే పదాన్ని చూడండి.  అది అన్నంలో కలుపుకు తినే పదార్థం కాదు.  చారు=అందమైన/సుందరమైన/రమణీయమైన/మనోహరమైన అని ఆ పదానికి అర్థం.  మనసును మురిపించే విధంగా, ఉన్నదానిని ఉన్నట్టు వర్ణించడం స్వభావోక్తి.

కాబట్టి,
పర్వతే పరమాణౌ చ
పదార్థత్వం తు విద్యతే॥
కాళిదాసూ కవే, నేను కూడా కవినే అనే వాళ్లకు,
పర్వతమూ ఒక పదార్థమే, పరమాణువూ ఒక పదార్థమే అని సమాధానం.

ఈ బొమ్మకు ఈ కథనానికి సంబంధం ఏమీ లేదే అనిపించిందా?  నాకు కూడా అలాగే అనిపించింది.  ఈ వర్ణనకు తగిన చిత్రం దొరుకుతుందా అని వెదికాను.  ఉహూ.  దొరకలేదు.  చిత్రకారులు కాళిదాసు కావ్యాలను చదవాలే కాని, వారి ప్రతిభను తట్టి లేపే ఎన్నో రమణీయవర్ణనలు వారికి లభిస్తాయి.

(ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఒక పక్క ప్రశాంతంగా నా పనేదో నేను చేసుకుంటూ ఉంటే మరోపక్క పై తరగతికి వారికి ప్రమోషన్ ఇస్తున్నట్లు వారి పాఠశాలనుండి సందేశం వచ్చేసరికి ఆనందం తట్టుకోలేక కేకలేస్తున్న పిల్లలను చూసి కుమారసంభవంలో కాళిదాసు వర్ణించిన నందీశ్వరుడు గుర్తుకొచ్చాడు.)

#Kalidasa #Kumarasambhava #Nandi

Friday, 5 April 2019

వికారి ఉగాది శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలు.
వికారి-నామ-సంవత్సర-శుభాకాంక్షలు.
వికారి అనే పేరు విని
ఏమిటిది అని ఎవరూ ముఖం చిట్లించుకొనవలసిన పని లేదు.
అదేమీ చెడ్డ పేరు కానే కాదు.
ధనము కలిగినవాడు ధని.
బలము కలిగినవాడు బలి. (బలిచక్రవర్తి తెలుసుగా)
చక్రము కలిగినవాడు చక్రి (విష్ణువు)
శూలము కలిగిన వాడు శూలి (శివుడు)
హస్తము అంటే తొండము కలిగినది హస్తి. (అంటే ఏనుగు)
అదే పరంపరలో వికారము కలిగినది/కలిగినవాడు వికారి అన్న మాట.
మరి వికారము అనేది చెడ్డపేరు కాదా?
కాదు.
ఆకారము అనే పదాన్ని ఆకృతి అని కూడా అంటాము.
అలాగే, వికారము అనే పదాన్ని వికృతి అని కూడా అంటాము.
వికృతి అనగానే తెలుగు వ్యాకరణంలో ప్రకృతి – వికృతులు గుర్తుకు వచ్చాయా? రథము అనే ప్రకృతి పదానికి అరదము అనే పదం వికృతి. బ్రహ్మ అనే ప్రకృతి పదానికి బొమ్మ అనే పదం వికృతి. విష్ణువు అనే ప్రకృతిపదానికి వెన్నుడు అనే పదం వికృతి. ఇలా చాలానే చదువుకున్నాం కదా? ఈ విధంగా వికృతిపదాలు ప్రకృతి నుండి వచ్చినవే తప్ప, వేరే కావు. కాని, ఇది భాషకు సంబంధించిన ప్రకృతి-వికృతి సంబంధం.
దర్శనశాస్త్రాన్ని అనుసరించి ఈ కనిపిస్తున్న, మన తర్కానికి గాని, మన ఊహకు గాని అందుతున్న ఈ సమస్తవిశ్వము కూడా వికృతే! దీనికి మూలమైన ప్రకృతి మన కంటికి కూడా కనబడదు. “మూలప్రకృతిరవికృతిః. మహదాద్యాః ప్రకృతివికృతయః సప్త. షోడశకస్తు వికారః.” అని సాంఖ్యకారికలలో (3) ఈశ్వరకృష్ణుడు చెబుతాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి అంటే వేరొకదాని పుట్టుకకు ఆధారభూమిగా ఉండేది. వికృతి అంటే, వేరొకదానినుండి ఉద్భవించేది. ప్రకృతివికృతులు అంటే, తాము స్వయంగా వేరొకదానినుండి పుడుతూ మరొకదాని పుట్టుకకు కారణమయ్యేవి అన్నమాట.
అటువంటి మూలప్రకృతి (కేవల ప్రకృతి) ఒక్కటే ఉందట.
ప్రకృతివికృతులు ఏడు ఉన్నాయట.
కేవలవికృతులు పదహారు ఉన్నాయట.
కేవలవికృతులు పదహారు అన్నారు కదా?
ఆ వికృతులు ఏమిటో తెలుసా?
అందులో మొట్టమొదటిది మనస్సు.
తరువాత, కన్ను ముక్కు చెవి వంటి జ్ఞానేంద్రియాలు ఐదు,
కాళ్లు చేతులు వంటి కర్మేంద్రియాలు ఐదు,
భూమి, గాలి, నీరు వంటి పంచభూతాలు ఐదు.
(1+5+5+5=16)
అర్థమైందా?
ఈ మనస్సు, ఈ పంచభూతాలు, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, ఈ పంచకర్మేంద్రియాలు – ఇవన్నీ వికృతులు. అంటే వికారాలు. ఈ వికారాలతో తయారైనదే శరీరం. ఈ వికారాలు కలిగినది వికారి. అంటే ఎవరు? మనమే. కాబట్టి, వికారి నామ సంవత్సరం అంటే మన సంవత్సరమే.
సరే, ఇంతకీ మనం ఎవరం?
ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఉంది. ఆరుణి అని ఒక గొప్ప జ్ఞాని ఉన్నాడు. అతడికి శ్వేతకేతువు అని ఒక కుమారుడు ఉన్నాడు. అతడు గురుకులానికి వెళ్లి విద్యాభాసం చేసి వచ్చాడు. అపుడు వారి నడుమ ఒక గొప్ప సంభాషణ జరిగింది.
"నాయనా శ్వేతకేతూ, ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అవుతుందో దానిని నువు తెలుసుకున్నావా?”
శ్వేతకేతువుకు ఆశ్చర్యం కలిగింది.
“లేదు నాన్నగారూ, అదేమిటో చెప్పండి” అని అడిగాడు.
అపుడు ఆరుణి చక్కగా వివరించి చెప్పాడు –
యథా సోమ్య, ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్। వాచారంభణం వికారో నామధేయో మృత్తికేత్యేవ సత్యమ్।।’ (ఛాందోగ్యం 6.1.4)
కుండ, మూకుడు, కడవ, తొట్టి వంటి వస్తువులు తయారు అవుతున్నాయి. అవన్నీ మట్టితోనే తయారు అవుతున్నాయి. అదే మట్టితో రాజు బొమ్మ, రాణి బొమ్మ, గుర్రం బొమ్మ, ఏనుగు బొమ్మ, తయారు అవుతున్నాయి. వాటి ఆకారాలు వేరు, వాటి పేర్లు వేరు. వాటి ఉపయోగాలు కూడా వేరే. అయినప్పటికీ వాటి మూలపదార్థం ఒకటే. అదే మట్టి. కాబట్టి, ఆ మట్టి స్వభావాన్ని తెలుసుకుంటే, దానితో చేయబడిన, చేయబడుతున్న, చేయబడబోతున్న సమస్తవస్తువులను గూర్చి సమగ్రంగా తెలుసుకున్నట్టే” అని చెప్పాడు ఆరుణి.
ఆ వస్తువులన్నీ వికారాలు.
వాటికి ఆ మట్టి మూలపదార్థం.
ఈ వికారాలన్నీ కూడా మట్టిముద్దకంటె అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
అయినప్పటికీ, ఆ వికారాల ఆయుష్కాలం తీరినతరువాత అవి నెమ్మదిగా కలసిపోయేది తమ మూలపదార్ధంలోనికే. (అయితే ఆ మట్టి కూడా, మూలప్రకృతి నుండి పుట్టుకొచ్చిన వికారమే అని మరచిపోరాదు.)
అలాగే, ఉంగరము, గొలుసు, కంకణము మొదలైన నగలన్నీవికారాలు.
వాటికి బంగారం మూలపదార్థం.
ఒక పెద్ద మఱ్ఱి చెట్టు ఉంది. దానికి విశాలంగా విస్తరించిన బోలెడు కొమ్మలున్నాయి. బోలెడు ఊడలు ఉన్నాయి. లెక్కపెట్టడం మొదలు పెడితే మనకు ఆయాసం కలిగించేంత సంఖ్యలో ఆకులు ఉన్నాయి. పండ్లు ఉన్నాయి. పండ్లలో విత్తనాలు ఉన్నాయి. ఇవన్నీ వికారాలు. ఆ విత్తనాలలో మళ్లీ ఇంత పెద్ద మఱ్ఱి చెట్లు అనేకం దాక్కుని ఉన్నాయి. ఆ విత్తనాలలో ఆ మఱ్ఱిచెట్లను మనం చూడలేము. ఐనప్పటికీ, అవి ఉన్నమాట సత్యం. అవి ఆ విత్తనాలలో అత్యంత సూక్ష్మపదార్థరూపంలో దాక్కుని ఉన్నాయి. ఆ సూక్ష్మాతిసూక్ష్మమైన పదార్థమే మూలప్రకృతి అని చెప్పవచ్చు. అది క్రమంగా కాలానుగుణంగా విస్తరిస్తుంది. అయితే, తనంత తానుగా విస్తరించే శక్తి దానికి లేదు. చైతన్యంతో కలసినపుడే అది అలా విస్తరిస్తుంది.
అలాగే ఈ సమస్తవిశ్వం కూడా వికారం. ఇది తనంత తానుగా విస్తరించలేదు. దీనికి మూలం మూలప్రకృతి. ఆ మూలప్రకృతి కూడా చైతన్యంతో కలసినపుడు విశ్వంగా విస్తరిస్తుంది. ఆ చైతన్యపదార్థాన్ని సాంఖ్య దర్శనంలో పురుషుడు అంటారు. (ఇక్కడ పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు.)
మనం ఎవరం అని అనే ప్రశ్నకు సమాధానం అదే.
మనం పురుషులం.
చైతన్యస్వరూపులం.
(పైన చెప్పినట్లుగా ఇక్కడ ఆడ-మగ అనే తేడాలు లేవు. పురుష అనేది చైతన్యపదార్థానికి ఒక సాంకేతికనామం మాత్రమే.) మనం వికారాలు కలిగి ఉండడం చేత మాత్రమే మనం వికారి అనబడతాము.
ఆరుణి చెప్పిన కథలో వలె, మన నామరూపాలు కూడా వికారాలే.
నన్ను నేను శ్రీనివాసులు అనే పేరుతో పరిచయం చేసుకున్నాను కాబట్టి, మీరందరూ నన్ను ఆ పేరుతో పిలుస్తున్నారు. మొదట్లోనే నా పేరు వేంకటేశులు అనో రామయ్య అనో చెప్పుంటే, మీరు నన్ను అదే పేరుతోనే పిలిచేవారు కదా? కాబట్టి, నామం వ్యావహారికసత్యమే తప్ప, పారమార్థికంగా అసత్యం అని తెలుస్తోంది. అవునా?
అలాగే, నా తిండిని బట్టి నా రూపం, అంటే ఒడ్డు, పొడుగు, బరువు మొదలైనవి ఉంటాయి. నేను నివసించే ప్రదేశాన్ని బట్టి నా రంగు ఉంటుంది. ఈవిధంగా, రూపం కూడా వ్యావహారికసత్యమే తప్ప, పారమార్థికసత్యం కాదు అని తెలుస్తోంది కదా?
నా మనస్సు కూడా వ్యావహారికమే. నా మనసు ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి, నేను ఈ ప్రదేశం గురించే ఆలోచిస్తాను. ఇక్కడ మంచి జరిగితే సంతోషిస్తాను. ఇక్కడ బాగులేదు అనుకుంటే బాధపడతాను. నా మనస్సు ఇక్కడ కాకుండా ఎక్కడో పసిఫిక్ సముద్రంలో ఒక అందమైన దీవిలో ఉందనుకోండి. అక్కడి సుఖాలను అక్కడి బాధలను మాత్రమే నా మనస్సు అనుభవిస్తుంది. కాబట్టి, మనం సుఖాలు, బాధలు అనుకుంటున్నవి అన్నీ కూడా మన మనసు పడుతున్న వికారాలే. అవి కూడా వ్యావహారికసత్యాలే కాని, పారమార్థికసత్యాలు కావు.
మనకు ఇన్ని వికారాలు ఉన్నాయి కదా, అందుకే మనం వికారి అయినాము. ఇటువంటి రకరకాల వికారాలు వదులుకోగలిగితే, మనం మనంగా, (శుద్ధచైతన్యస్వరూపంగా) ఉంటాము అనేది సాంఖ్యదర్శనశాస్త్రం చెబుతుంది. మోక్షం అంటే అదే అని వారు చెబుతారు.
అయితే, మోక్షం కావాలంటే, ముందు మనం వికారి అని తెలుసుకోవాలి. అప్పుడే, మన వికారాలు ఏమిటో మనం తెలుసుకొనగలం. అవి తెలిస్తేనే, వాటిని వదిలించుకొనేందుకు ప్రయత్నించగలం. చైతన్యస్వరూపులం కాగలం.
వికారము అనే పదాన్ని కురూపత్వము అనే అర్థంలో కూడా వాడుతారు.
వికారి అంటే కురూపి (సౌందర్యవిహీనుడు) అన్నమాట.
"ఓ పార్వతీ! శివుడు విరూపాక్షుడు కదా? కాబట్టి వికారి కదా? మరి అటువంటివాడిని ఎందుకు నువు ఇష్టపడ్డావు?" అని అడిగితే పార్వతికి కోపం వచ్చింది. తగిన సమాధానం చెప్పింది. అలా అడిగినవాడు స్వయంగా మారువేషం వేసుకొచ్చిన శివుడే అనుకోండి. ఆ ముచ్చటలు కాళిదాసుని కుమారసంభవంలో ఉన్నాయి. ఎప్పుడైనా ఆ మాటలు ఒకసారి చూద్దాం.
మానవులు ఏమైనా తక్కువ తిన్నారా?
భౌతికంగా వికారులైనవారిని చూసి నవ్వే మానసికవికారులు కూడా ఉంటారు.
జనకమహారాజు సభలో ప్రవేశించిన అష్టావక్రమహర్షిని చూసి అక్కడ ఉన్న పండితులు నవ్వారట. అపుడు, అష్టావక్రుడు కూడా నవ్వాడట. "మేము నవ్వితే దానికి ఒక అర్థం ఉంది, మరి నువ్వెందుకయ్యా నవ్వావు?" అని వారు అడిగారట.
కండ్లు ఉండవలసిన స్థానంలో ముక్కు, ముక్కు ఉండవలసిన స్థానంలో చెవులు, - ఇలా ఉంటే అది వికారం కదా? అలాగే, ఈ సభలో ఉన్న వికారాన్ని చూసి నవ్వాను అన్నాడట అష్టావక్రుడు.
ఈ సభలో నీకేమి వికారం కనిపించింది? అని వారు అడిగారట. క్షత్రియుల దృష్టి ఆయుధాల ఉంటుంది. పండితుల దృష్టి శాస్త్రజ్ఞానం మీద ఉంటుంది. కాని, ఇక్కడున్న వారు నా శాస్త్రజ్ఞానాన్ని చూడలేకపోయారు. కేవలం నా చర్మాన్ని చూసి నవ్వారు. అందుకని వారు చర్మకారులే. పండితాసనాలలో పండితులు ఉండాలి. కాని, ఈ సభలో అక్కడ చర్మకారులు కూర్చున్నారు. అందువల్ల, ఈ సభ నాకు వికారంగా కనబడింది. అందువల్ల నవ్వాను పొమ్మన్నాడు అష్టావక్రుడు.
దాంతో అందరికీ బుద్ధి వచ్చిందట. అష్టావక్రునికి అందరూ క్షమాపణలు చెప్పుకున్నారు. (ఇక్కడ చర్మకారుడు అనేది వెక్కిరింపు మాట కాదు. కన్ను ఉండవలసిన చోట ముక్కు ఉంది అన్నామనుకోండి. అది ముక్కును వెక్కిరించినట్టు కాదు కదా?)
ఒడిషా బెంగాలు ప్రజలు ‘వ’ అనే అక్షరాన్ని ‘బ’ అని పలుకుతారు. వంగదేశాన్ని బంగదేశం అంటారు. రవీంద్ర అనకుండా రబీంద్ర అంటారు. అలాగే వారు 'వికారి' అనే పదాన్ని 'బికారి' అని పలుకుతారేమో. అపుడు అర్థం మారిపోదా? ఆయా ప్రాంతంలో పలుకుబడి అలాగే ఉంటుంది కాబట్టి, అర్థం మారిపోదు.
సరే, ఇంతకూ మన భాషలో బికారి అంటే ఏమిటి? బికారి అంటే బిచ్చగాడు, ఇల్లూవాకిలీ లేని వాడు, అనాథ, పేదవాడు అనే నానార్థాలలో మన తెలుగువారు ఆ పదాన్ని వాడుతూ ఉంటారు.
కాని, నిజానికి బే-కార్ అనే రెండు పదాల కలయిక అది. ‘బేషరతు’ అంటే షరతులు లేకుండా అనే అర్థం మనకు తెలుసు కదా? అలాగే, ‘బేకార్’ అంటే పనిలేనివాడు అని అర్థం. అంటే, చేయడానికి పని లేనివాడు అని అర్థం కాదు. వాడిని నిరుద్యోగి అని కాస్త మర్యాదగా పిలుస్తారు. బేకార్ అనేది ఒకరకంగా తిట్టు. చేయడానికి పని ఉన్నప్పటికీ, చేయకుండా జులాయిగా తిరిగేవాడిని అలా తిడతారు.
నిరుద్యోగులకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పే మన రాజకీయనాయకులకు ఈ తేడా తెలిస్తే బాగుంటుంది అని ఆశిద్దాం.
భౌతికమైన వికారాల కంటె, మనోవికారాలు చాల శక్తిమంతమైనవి. ప్రేమ, కరుణ, వాత్సల్యము, మొదలైనవి కూడా శాస్త్రం ప్రకారం మనోవికారాలే. అయినప్పటికీ, వ్యవహారంలో వాటిని మంచి వాటిగా పరిగణిస్తారు.
కాని, మరికొన్ని మనోవికారాలు చెడ్డవి అని వ్యవహారం. కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యాలు మనోవికారాలే. ఇవి తగుమాత్రంలో అందరికీ ఉంటాయి. సాధువులు మాత్రం మంచివని, చెడ్డవని తేడా చూపకుండా, సమస్తమనోవికారాలను వదిలించుకోవాలని ప్రయత్నిస్తారు.
మంచివైనా చెడ్డవైనా మితిమీరితే మాత్రం చాల ప్రమాదం. రాయలసీమలో ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే, "యేమిరా ఆ మనిషి శానా యికారాలు బడతా ఉండాడే?" అని అంటారు. అతి సర్వత్ర వర్జయేత్ అనే విషయం అందరికీ తెలిసిందే కదా?
ప్రేమ అనే మనోవికారం మంచిదని మనం అనుకుంటాం. కాని, దుర్యోధనుడి మీద ధృతరాష్ట్రుడు అతి ప్రేమ చూపినందువలన ఆ దుర్యోధనుడు ఎలా చెడిపోయాడో మహాభారతం చెప్పింది.
కామం అనే మనోవికారం చెడ్డదని మనం అనుకుంటాం. కాని, "ధర్మావిరుద్ధో భూతేషు కామోऽస్మి భరతర్షభ(ధర్మవిరుద్ధం కాని కామాన్ని నేనే అర్జునా) అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. గంగను స్వర్గం నుండి భూమికి దించాలి అనే కామంతో (కోరికతో) భగీరథుడు ఎంతో గొప్ప ప్రయత్నం చేసి, సఫలుడై, సమస్తప్రజలకు చాల మేలును చేకూర్చాడని రామాయణం వర్ణిస్తుంది.
ఈ రామాయణమహాభారతాలను మనం ఇతిహాసాలుగా పరిగణిస్తాము. అంటే చరిత్ర అన్నమాట. అయితే, పాశ్చాత్యులు వచ్చి వాటిని మైథాలజీ అనేశారు. అంటే కట్టుకథలు అని.
అస్తు. వారికైనా మనకైనా యద్భావం తద్భవతి.
అందువలన, వికారాలు స్వతః మంచివి అని చెడ్డవి అని ఉండవు. వాటితో మనం చేసే వ్యవహారాలను బట్టి అవి మంచివా చెడ్డవా అని లోకులు నిర్ణయించే పరిస్థితి వస్తుంది. అధికమాత్రంగా ఉన్నవాటిని మనం వదిలించుకోవాలి. మనం స్వయంగా అటువంటి వికారాలను వదిలించుకొనలేకుంటే రామదాసుని, హనుమంతుని త్రికరణశుద్ధిగా స్మరిద్దాం. ఆయన వదిలించగలడు. హనుమంతుడే ఎందుకు అంటే, హనుమంతుడే మరి! బురదగుంటలో పడినవాడిని పైకి లాగాలి అంటే, ఆ బురదగుంటలో లేకుండా బయట ఉన్నవారే శరణ్యం కదా, అలాగన్న మాట.
తులసీదాసమహాకవి హనుమాన్ చాలీసా మొదలుపెట్టే ముందు హనుమత్స్మరణం చేశాడు.
'బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవనకుమార
బల బుద్ధి బిద్యా దేహు మొహి హరహు కలేశ బికార'
(దోహా 2)
(ఓ పవనకుమారుడా! హనుమన్! నన్ను నేను ఒక తెలివితక్కువవాడిగా పరిగణించుకుని, నిన్ను స్మరిస్తూ శరణు వేడుతున్నాను. నాకు బలాన్ని, బుద్ధిని, విద్యను ప్రసాదించు. నా కష్టాలను, నా వికారాలను హరించు)
తులసీదాసు ప్రార్థన ఫలించింది. అతడు మహాకవులలో ఒకడుగా కీర్తింపబడ్డాడు. భక్తాగ్రగణ్యుడిగా పరిగణింపబడ్డాడు. ఆవిధంగా వికారాలను వదిలించగల శక్తి, ఆసక్తి రెండూ మెండుగా ఉన్న స్వామి హనుమంతుడు కదా, అందుకని అతనిని ప్రార్థించాలి. పైగా మరికొన్ని రోజులలో శ్రీరామనవమి కూడా రానుంది మరి!
క్రొత్త సంవత్సరం వేళ, మన ప్రార్థన కూడా తప్పక ఫలిస్తుంది.
ఈ వికారినామ సంవత్సరంలో వారికి, వీరికి అని కాకుండా, అందరికీ సకలశుభాలు ఆనందాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను.
డా. శ్రీనివాసకృష్ణ పాటిల్

Sunday, 30 December 2018

ఇచ్చట కళ్లు నెత్తికెక్కితే దించబడును (రెండవ భాగం)

ఇచ్చట కళ్లు నెత్తికెక్కితే దించబడును
((రెండవ భాగం))

ఓం శివాయ నమః
ఓం స్దాణవే నమః
ఓం ప్రభవే నమః
ఓం భీమాయ నమః
ఓం ప్రవరాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరాయ నమః

అంటూ నత్కీరుడు మట్టితో తాను చేసిన శివలింగం ముందు పూజలో లీనమై ఉన్నాడు.
యక్షిణి తన తంత్రాన్ని మొదలు పెట్టింది.

చెట్టు మీద నుండి ఒక ఆకు రాలి శివలింగం ప్రక్కనే పడింది.
వెంటనే, అది ఒక పక్షిగా మారిపోయింది. 
టప టప మని రెక్కలాడించూకుంటూ ఎగిరిపోయింది.
నత్కీరుడు ఆ వింత చూశాడు. 
కాని పట్టించుకోలేదు.

ఇంతలో చెట్టుమీద నుండి మరొక ఆకు రాలి తటాకంలోని నీటిలో పడింది.
వెంటనే అది చేపగా మారి విలాసంగా మొప్పలను తోకను ఊపుకుంటూ ఈత కొట్టసాగింది.
నత్కీరుడు ఈ వింతను కూడా చూశాడు.
కాని అతని ఏకాగ్రత చెక్కు చెదరలేదు.

చెట్టుమీద నుండి ఆకులు రాలి పడుతూనే ఉన్నాయి.
రకరకాల పక్షులుగా రంగురంగుల చేపలుగా మారిపోతున్నాయి.
వాటిని పట్టించుకోకుండా నత్కీరుని పూజ కొనసాగుతోంది.
దాదాపు ముగింపుకొచ్చేసింది.
పూజ ముగిసేలోపు ఎలాగైనా అతని ఏకాగ్రతను చెడగొట్టి తీరాలనుకుంది యక్షిణి.

ఈసారి ఆకు రాలి సగం నేలపైన సగం నీటిలోను పడింది.
నేలపైన పడిన సగం పక్షిగా మారింది.
నీటిలో పడిన సగం చేపగా మారింది.
పక్షి ఆకాశంలోనికి ఎగిరేందుకు రెక్కలు కొట్టుకుంటూ ప్రయత్నం చేయసాగింది. 
చేప నీటిలోనికి పోయేందుకు బలంగా ప్రయత్నిస్తోంది.
ఇదంతా నత్కీరుడి కంట బడింది. 
అతడు విభ్రాంతుడైపోయాడు.
అతని చిత్తంలో కాసేపు శివుడు విస్మరణకు గురి అయ్యాడు.
నోటినుంచి అంతవరకు మధురంగా లయబద్ధంగా వినిపిస్తున్న శివనామస్మరణ ఆగిపోయింది.
చూపులు శివుని నుండి ప్రక్కకు మళ్లాయి. 
తదేకంగా ఆ పక్షి,చేపల గుంజులాటను చూడసాగాడు.

ఆ వ్యవధి సరిపోయింది యక్షిణికి.
చెట్టుమీదనుండి కుప్పించి నేలపైకి దూకింది.
నత్కీరుణ్ణి ఒడిసి పట్టుకుంది.
ఓరి దొంగభక్తుడా అంటూ వికటాట్టహాసం చేసింది.
అతణ్ణి నేరుగా తన కొండగుహకు తీసుకొనిపోయి ఒక చెరలో పడేసింది.
శుభ్రంగా స్నానం చేసి వస్తానంటూ వెళ్లిపోయింది.

ఆ చెరలో అప్పటికే చాలమంది బందీలు ఉన్నారు.
వారు తమలో చేరిన నత్కీరుణ్ణి చూశారు.
కొందరు అతడిని చూడగానే హృదయవిదారకంగా ఏడవసాగారు.
మరి కొందరు అతడిని నిందించసాగారు.

నత్కీరుడు వారిని దీనంగా చూశాడు.
"నేను కూడా మీలాంటి అభాగ్యుడినే కదా?
నన్ను మీలో ఒకడిగా భావించకుండా ఎందుకు తిడుతున్నారు?"
అని అడిగాడు.

"మేము ఇప్పటికే 99 మంది ఉన్నాము. 
ఈ యక్షిణి నూరు మందిని పోగేసి కాని తినదు. 
నువు నూరో వాడివి ఇప్పుడు వచ్చావు. 
నీ రాక వల్ల మా అందరికీ చావు మూడింది" 
అన్నారు వారు.

"సరే, ఇపుడు ఏడిస్తే ఏం ప్రయోజనం?
తప్పించుకొనే ప్రయత్నం చేద్దాం" 
అన్నాడు నత్కీరుడు.

"మేము కూడా ప్రయత్నాలు చేశాము. 
ఒక్క సారి ఈ యక్షిణికి దొరికితే మన జాడ అండపిండబ్రహ్మాండాల్లో ఎక్కడున్నా తెలుసుకోగలదు. 
మేము తప్పించుకుని ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి మళ్లీ ఇక్కడ పడేసింది."
అని వాళ్లు మళ్లీ ఏడ్చారు.

నత్కీరుడు వారిని ఓదార్చి కుమారస్వామిని ప్రార్థించాడు. ఆయన వెంటనే దిగివచ్చి యక్షిణి బారినుండి వారిని కాపాడాడు. 
అందరూ కుమారస్వామిని పూజించి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. 

కాని నత్కీరుడు మాత్రం ఆయనను వదలలేదు.
తన పొగరుబోతుతనాన్ని, వదరుబోతుతనాన్ని, 
వాటివల్ల తనకు కలిగిన దుర్గతిని విన్నవించుకుని 
"స్వామీ, కైలాసానికి చేరే మార్గోపదేశం చేయవయ్యా" 
అంటూ వేడుకున్నాడు.

ఆయన నవ్వేసి 
"ఏమయ్యా నత్కీరా, 
కైలాసం ఉత్తరాన మాత్రమే ఉందని 
నువు కూడా ఒక పామరుడిలా భ్రమపడుతున్నావే! 
దక్షిణాన కూడా ఒక కైలాసం ఉన్నది. 
అదే శ్రీకాళహస్తి. 
దానిని దర్శించుకో" అని ఉపదేశించాడు.

నత్కీరుడు అలాగే చేసి తన కుష్టు రోగం నుండి విముక్తుడయ్యాడు. 
•○●□•○●□•○●□

నత్కీరుడు ఎంతెంతో నయం!
అందుకే ఆయనను శాపంతో (మాటలతో) బుద్ధి చెప్పి వదిలేశారు.

కాని, 
పొగరు తలకెక్కిన పరమధూర్తులు మరి కొందరు ఉన్నారు.
ప్రసిద్ధులే! 
celebrities & legends మరి!
మాటలతో హెచ్చరించినంత మాత్రాన నెమ్మదించే బ్యాచ్ కాదు వారు.
•○●□•○●□•○●□

నూరుమంది కౌరవులకు ఒక చెల్లెలు.
ఆమె పేరు దుశ్శల. 
ఆమె భర్త పెద్ద సుశీలుడేం కాదు.
అతని పేరు జయద్రథుడు.
సైంధవుడనే పేరుతో బాగా తెలిసినవాడు.
కౌరవపాండవులకు వివాహసంబంధం ద్వారా బావమరది అయ్యాడు.

వాడొకసారి అరణ్యంలో ప్రయాణిస్తూ ద్రౌపదిని చూశాడు.
అతడు ఫలానా అని తెలుసుకున్న ద్రౌపది "రా అన్నా భోంచేసి వెడుదువు గాని. మీ బావలు కూడా కాసేపట్లో తిరిగివస్తారు" అంటూ ఆహ్వానించింది.
పాండవులు లేరని తెలుసుకొనేసరికి ఆ పిరికి వెధవకు హఠాత్తుగా నెత్తిమీద కొమ్ములు మొలిచాయి. 
వావివరుసలు గాలికి వదిలేశాడు. 

పాండవులను వదిలేసి తనతో వస్తే ఆమెను రాణిని చేస్తానంటూ "ఆఫర్" ఇచ్చాడు.
ఆమె ఛీ పోరా వెధవా అనేసరికి వాడు ఆమెను బలవంతంగా ఎత్తుకుపోయాడు.
కాని అరణ్యం దాటే లోపులే పాండవులకు దొరికిపోయాడు.
భీముడు ఒక్క పిడికిలి పోటుతో వాడి తలను పగలగొట్టే లోగా ధర్మరాజు అడ్డుపడి "నాయనా ఈ వెధవను చంపి మన చెల్లెలు దుశ్శలను విధవను చేయకురా" అంటూ వాడిని కాపాడాడు.

వాడికి తలనిండా పిలకలుండేట్టు బుఱ్ఱ గొరిగి పంపేశారు.
ఆ వెధవ అప్పటికైనా బుద్ధి తెచ్చుకునింది లేదు.

తపస్సుతో శివుడిని మెప్పించి పాండవులను ఓడించేంత బలం కావాలన్నాడు.
శివుడు అప్పటికే అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చి నీవు అజేయుడవై ఉంటావు అని వరం ఇచ్చి ఉన్నాడు.
పైగా ఆ దుర్మార్గుడిని ఎంకరేజ్ చేయదలచుకోలేదు.

అందువల్ల "ఓరయ్య నీవు ఎన్ని జన్మలెత్తినా అర్జునుణ్ణేం చేయలేవు. 
కానీ నీ జన్మలో ఒకసారికి మిగిలిన నలుగురిని ఓడించగలవులే" 
అని మాట ఇచ్చి పంపాడు.
ఆ వరంతో వాడు యుద్ధంలో అభిమన్యుడి చావుకు కారణమయ్యాడు.

ఆ విషయం తెలుసుకుని క్రోధాగ్నిజ్వాలాముఖుడైన అర్జునుడు వాడిని మరుసటి రోజు సాయంత్రంలోగా చంపకుంటే గాండీవంతో సహా నేనే స్వయంగా అగ్నిప్రవేశం చేస్తా అని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు.

అపుడు పాండవవీరులు ప్రచండంగా పెడబొబ్బలు పెట్టారట. 
భూమి కంపించిందట.
ఉల్కలు రాలి పడ్డాయట!
దూతఘటోత్కచంలో భాసుడు ఆ ఘట్టాన్ని వర్ణించిన తీరు అద్భుతం!

మరుసటి రోజు అర్జునుణ్ణి ఆపగల శక్తి ఎవరికీ లేకపోయింది. 
ఎవరూ కని విని ఎరుగని రీతిలో విజృంభించాడు. 
అడ్డుకున్నవారినందరినీ ఊచకోత కోశాడు.
జయద్రథుణ్ణి నిర్దాక్షిణ్యంగా వధించాడు.

జయద్రథుడి కండకావరానికి పడవలసిన శిక్షను ధర్మరాజు రద్దు చేయలేదు. 
శిక్ష ఆనాడే ఖరారైంది. 
కాని ఆ శిక్ష సమంజసమే అని అందరూ భావించేంతవరకూ కేవలం పోస్ట్ పోన్ చేశాడంతే!
•○●□•○●□•○●□

పాండవులు అజ్ఞాతంలోనికి ప్రవేశించేముందు పరమేశ్వరిని పూజించారు. 
ఆమె స్త్రీరూపంలోని శివశక్తి. 
తప్పక తన భక్తులను కాపాడుతుంది.

సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదిని కీచకుడు చూశాడు.
ఆమెను తన దగ్గరకు పంపమని సిగ్గు ఎగ్గు లేకుండా స్వయంగా తన సోదరినే అడిగాడు.
అతని నీచత్వానికి అతని సోదరే భయభ్రాంతురాలైంది.

వాడు బాగా తాగేసి ఉన్నాడు.
నిరాకరించిన సైరంధ్రిని వదలకుండా వెంటబడ్డాడు.
సాక్షాత్తు రాజసభలోనే అందరి ఎదుట ఆమెను క్రింద పడేసి కాళ్లతో తన్నాడు. 
"నాపేరు సింహబలుడు. నన్నెవడూ ఏం చేయలేడు" అని వికటాట్టహాసం చేశాడు.

రాజుగారు కూడా భయపడి పోయారు.
గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్నారు.
కీచకుడనే ప్రభుత్వేతరశక్తిని అరికట్టలేక
నిస్సహాయంగా నిశ్చేష్టులై పోయారు.

మొత్తానికి రాజుగారి చేతగానితనం అందరికీ తెలిసిపోయింది.
కాని ఆ పాపాత్ముడు ఫలితం అనుభవించాల్సిందే.
చట్టాన్ని ధర్మమే స్వయంగా తన అదుపులోనికి తీసుకుంది.
తాత్కాలికంగానే...

ఫలితం -
ఆ రోజు రాత్రి కీచకుడు రక్తపు ముద్దగా మారిపోయాడు. 
వాడి తల వాడి పొట్టలో కుక్కబడింది. 
వాడి కాళ్లు చేతులు ఖండఖండాలుగా చేయబడి వాడి మొండెంలో ఎక్కడెక్కడ కూరుకుపోయి ఉన్నాయో ఎవడికీ అర్థం కాలేదు.
మహా ఘోరమైన చావు చచ్చాడు.

చూసిన ప్రతి ఒక్కరు తమ జన్మజన్మలకు సరిపడేంతగా భయపడి వణికిపోయారు.
కీచకుని తమ్ములైన ఉపకీచకులు తప్ప.
వారు కాదన్న అమ్మాయి మొహంపై ఆసిడ్ పోసే బ్యాచ్ లాంటివారు.
వారు సైరంధ్రిని ఎత్తుకుపోయి తమ అన్న శవంతో పాటు కాల్చేద్దాం అనుకున్నారు.

అంతే!
ఆ మరుసటి రోజే వాళ్ల శవాలు కనీసం పోస్ట్ మార్టంకు కూడా నోచుకోకుండా తమ అన్నశవంతో బాటు తగలబడి పోయాయి. వారందరికీ ఆ శిక్ష విధించిన శక్తి ఎవరిదో తెలియని వాళ్లెవరూ లేరు.
•○●□•○●□•○●□

అంతేనా? 
సీతను అపహరించిన రావణుడికి,
ద్రౌపదిని తన తొడపై కూర్చొమ్మన్న డిక్టేటర్ తొడల దుర్యధనుడికి,
ఆమె జుత్తును, కొంగును లాగిన దుశ్శాసనుడికి,
ఇలా కళ్లు నెత్తికెక్కిన ప్రతి వెధవకు 
వారు చేసిన వెధవ పనులకు ఆయా కాలాల్లో తగిన శిక్ష పడింది.
•○●□•○●□•○●□

సందేహం అక్కరలేదు.
ఇంద్రుడికీ శిక్ష పడింది.
ఉపేంద్రావతారుడికీ శిక్ష పడింది.
(దయ చేసి అవేమిటో వివరించమని నన్ను అడగకండి.
ఎవరికి వారే స్వయంగా తెలుసుకుంటే మంచిది. )
•○●□•○●□•○●□

ఇలా ఆయా సందర్భాల్లో
పురాణాలు మనకు మార్గదర్శనం చేస్తున్నాయి. 
కర్తవ్యబోధన చేస్తున్నాయి. 
ఇలాంటిలాంటి సందర్భాలలో మీరు ఈవిధంగా ప్రవర్తించాలి 
అని పదే పదే చెబుతున్నాయి. 
పైన పేర్కొన్నవి కేవలం ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే.

పురాణాలు కేవలం పెద్ద వయసులో పారాయణ చేసుకొనే గ్రంథాలు అని భావించడంలోనే భారతజాతి పతనానికి మూలబీజాలు ఉన్నాయి.

అలాంటి పురాణాలకు కొందరు కుట్రదారులు మతమనే గాఢమైన ముద్ర వేసేసరికి అన్నీ తెలుసుకొనగల తెలివి కలిగిన కొందరికి వాటిలో కేవలం డొల్లతనమే కనిపిస్తోంది. 
"పైపొట్టు లేకుండా బియ్యం గింజ మొలకెత్తదు."

ఈ మనుషులు - 
వారి ఆభిజాత్యం ఎంత గొప్పదైనా, 
వారి విద్య ఎంతటి మహోన్నతమైనదైనా,
వారు ఎంతటి పరాక్రమవంతులైనా, 
వారు ఎంతటి ఐశ్వర్యసంపన్నులైనా,
వారు ఎంతటి దివ్యాంశసంభూతులైనా, 
అక్కడక్కడ వారిలో కనిపించే లోపాలను 
దాచకుండా బయటపెట్టిన పురాణాల నిజాయితీ 
కొందరికి మెచ్చదగిందిగా కనబడకపోవటం దురదృష్టం.

అన్యాయాలు జరిగాయి.
అక్రమాలు జరిగాయి.
నిజమే.
అలా నిజాలు బయటపెట్టడం వల్ల పురాణాల విలువ తగ్గిపోతుందా?

మానవుడిగా పుట్టినవారిలో 100% మహాపురుషుడు లేడని, 
అంతగా కావాలంటే 99.99 తో సరిపెట్టుకొనవలసిందే 
అని అవి విస్పష్టంగా తెలియజెబుతూంటే వాటిని ఎందుకు తప్పు బట్టడం?
అవి మన పూర్వీకులకు సంబంధించిన బోలెడన్ని కేస్ స్టడీలు 
మనకు అందిస్తున్నాయి. 

వాటిని బట్టి 
మనం స్వీకరించదగినవి ఇవి, 
తిరస్కరించదగినవి ఇవి 
అనే విచక్షణ జ్ఞానం మనకు ఉండి తీరాలి.

నీటిని విడిచి పాలను గ్రహించే రాజహంసల్లా
మనుషులుండాలని
ఆయా వ్యక్తులలోని
ఈయీ సుగుణాలను గ్రహిద్దాం.
ఈయీ దుర్గుణాలను పరిహరిద్దాం 
అని గ్రహించి
పరమహంస స్థాయికి చేరుకోవాలని
పురాణేతిహాసాలు ఆశిస్తున్నాయి.

కాదు కాదు, 
కానే కాదు, 
వాటికి ఫలానా మతానికి చెందినవి అనే ముద్ర ఉంది కాబట్టి 
అవి నాకు ఏ మాత్రం సంబంధం లేనివి.

అని సెక్యులర్ మతం వహించి దూరం చేసుకుంటే 
వ్యక్తిగతంగా ఆయా మనుషుల ఇష్టం. 
సామూహికంగా దేశానికి నష్టం! 
•○●□•○●□•○●□

నాకు సంబంధించి దేవుడొకడే. 
అతని నామరూపాలు ఆయా దేశకాలాల్లో వేరు వేరుగా ఉండవచ్చు గాక!
అన్ని నామరూపాలు నాకిష్టమే. 
ఆయన సర్వవ్యాపి.

అయినా, 
శివరాత్రి నాడు దక్షిణకైలాసమైన శ్రీకాళహస్తికి పోవాలనే పట్టుదలకు పోకుండా తిరుమల వేంకటనాథుని దర్శనాన్ని మా కుటుంబసభ్యులందరం చేసుకున్నాం. 
నాస్తి కోsపి భేదః.
•○●□•○●□•○●□

నాకు ఎవరి పిల్లలైనా ఇష్టమే. 
కాని మా పిల్లలు మా ఇంట్లో పెరగడమే న్యాయం.
వారు వేరొకరి ఇంట్లో పెరగాలని నేను కోరుకోను. 
కాని 
ఇతరుల పిల్లలు కూడా మా ఇంటికొచ్చి మా పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు.
మా పిల్లలు కూడా తమ స్నేహితుల ఇళ్లకు వెళ్లి ఆడుకుని వస్తారు.

ఉమ్మడి కుటుంబాల వంటి ఇళ్లు ఉంటే 
అంతటా నిర్వ్యాజమైన ప్రేమ లభిస్తూ ఉంటే 
ఎవరు ఎక్కడ పెరిగినా ఆనందమే!
వారి స్నేహం అలా నిత్యం కొనసాగుతూ ఉండాలని నా కోరిక.
•○●□•○●□•○●□

అందరికీ శుభాకాంక్షలు.
సర్వే జనాః సుఖినో భవంతు.
సర్వే దుష్టాః దండితాః భవంతు.

ఇచ్చట కళ్లు నెత్తికెక్కితే దించబడును (మొదటి భాగం)

ఇచ్చట కళ్లు నెత్తికెక్కితే దించబడును
((మొదటి భాగం))

స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి వల్కులకేల కల్గెనో యతులిత మాధురీమహిమ?

అని శ్రీకృష్ణదేవరాయలు తన ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేయగా తెనాలి రామలింగడు దొరికిందే అవకాశమని దిగ్గున లేచి, వికటమైన సమాధానంతో తన వికటకవిత్వాన్ని నిరూపించుకున్నాడని తెలుసు కదా?
•○●□•○●□•○●□

((ఇంత వరకు చదివిన వారికి ముందస్తు క్షమాపణలతో ఒక చిన్న విన్నపం:
చదవబోయే మాటల్లో ఒక వాక్యానికి మరో వాక్యానికి గాని - ఒక పేరాకు మరో పేరాకు గాని సంబంధమేమిటనే చింతలను విడిచి ముందుకు సాగగలరు -అని.))
•○●□•○●□•○●□

రామలింగడి కళ్లు నెత్తికెక్కాయని అపుడెవరూ అనుకోలేదు. చివరకు ధూర్జటి కూడా నవ్వుకుని ఉంటాడు.
కాని కైపెక్కిన ఒక కలియుగ కీచకుడు చేసిన వెధవపనిని
నెత్తి పైకెక్కి నిజాన్ని రికార్డు చేసి చూపిన కళ్లను (సిసి కెమెరాలను) దించేసి వంచేసే (వమ్ము చేసే) ప్రయత్నాలు తెగ జోరుగా కొనసాగుతున్నాయి. 
తెలుగు రాష్ట్రాలు విడిపోయినా పరస్పరసహకారం కొనసాగాలని చేసిన తీర్మానం ఇంచక్కా అమలవుతూ ఉంటే మనసు పులకరించని వాడు పాపాత్ముడన్న మాట!

బాలుడని పేరు కలిగిన వారందరికీ బాలల మనస్తత్వమే ఉంటుందనుకొనే వారే నిజమైన బాలలని బాలయ్య గారు కూడా తన కళ్లు నెత్తికెక్కించుకుని మరీ నిరూపించారు.
నెత్తికెక్కిన కళ్లను దింపేవారెవరు ఏ కాలంలోనూ లేరా? 
•○●□•○●□•○●□

తమిళనాట "నక్కీరన్" అని ఒక పత్రిక. 
"గోపాల్" అనే ఆయన అనుకుంటా - దానికి అధిపతి.

తమిళంలో నక్కీరన్ అంటారు.
తెలుగులో నత్కీరుడు అందాం.

నత్కీరుడు మనసా వాచా కర్మణా గొప్ప శివభక్తుడు.
అబ్బో, గజ మొండివాడు. 
తప్పు ఎవడు చేసినా తప్పే అనేవాడు. 
అంతవరకూ బాగానే ఉంది.
ఆమాత్రం అందరూ ఒప్పుకుంటారు.

కాని ఈ నత్కీరుడు వెతికి వెతికి తప్పులు పట్టేవాడు. 
అతడు పాండ్యమహారాజు ఆస్థానకవి. 
అతడు తప్పు లేదంటేనే ఎవరికైనా పనులౌతాయి.
అందువల్ల రాజుగారి దగ్గర ఎవరి పనులూ కావటం లేదు.
సమస్యలు రాజుగారి వరకు రావటం లేదు.
పేదవారి గోడు రాజుగారికి వినబడటం లేదు.
విన్నపాలు చేసుకుందామనే వారి ఆర్తి రాజుగారికి కనబడటం లేదు.
జనాలందరూ నెత్తికెక్కిన వీడి కళ్లు ఎవరు దించుతారా, ఎప్పుడు దించుతారా అని దేవుడి మీద భారం వేసి కూర్చున్నారు.
శివభక్తుడి జోలికి వెళ్లేందుకు మిగిలిన దేవతలందరూ భయపడ్డారు.
ఎప్పుడోకప్పుడు, కనీసం సాక్షాత్తు ఆ శివుడి పనులే ఆగిపోయినపుడు, ఆ శివుడే దిగివచ్చి వీడి కళ్లను నెత్తిమీదనుంచి దించుతాడు అనుకున్నారు.
ఆ సమయం రానే వచ్చింది.
•○●□•○●□•○●□

అలా ఉండగా ఓసారి పెద్ద కరువొచ్చింది.
జనాలందరూ ఊళ్లొదిలి వలసపోతున్నారు.
ఆ ఊళ్లో గుడికొచ్చేందుకు ఎవరూ మిగల్లేదు. 
పూజారి తన పెళ్లాం బిడ్డల ఆకలిని చూసి తట్టుకోలేక తాను కూడా వలస పోయేందుకు అనుమతినిమ్మని శివుని అడిగాడు.

"నేనో పద్యం వ్రాసిస్తా. అది రాజు గారి దగ్గరకు తీసుకుపోయి చదువు. రాజుగారు మెచ్చుకుని నిన్ను పోషిస్తారు" అని శివుడు ఓ పద్యం వ్రాసిచ్చాడు.
పూజారి రాజసభకు ఎలాగో కష్టపడి వెళ్లాడు.
పద్యం చదివాడు. 
రాజుగారు సంతోషపడ్డారు.
కాని మన నత్కీరుడు అభ్యంతరం చెప్పాడు.

"తప్పిది, చెప్పరాదు, కవితాసమయంబున కొప్పుగాదు, నీ విప్పగిదిన్ రచింపదగునే?" అంటూ - ఈనాటి భాషలో చెప్పాలంటే - "అడ్డుపుల్ల వేశాడు".
పూజారి నిజం చెప్పేశాడు. 
"ఠఠ్! శివుడైతే పెద్ద గొప్పా? తప్పు తప్పే" పొమ్మన్నాడు నత్కీరుడు.

పూజారి వెళ్లి శివుడికి ఫిర్యాదు చేశాడు. 
దాంతో శివుడే స్వయంగా రాజసభకు విచ్చేశాడు.

"నత్కీరుండూరకె తప్పు బట్టెనట? 
యేదీ? లక్షణంబో? యలంకారంబో? పదబంధమో? రసమొ? చక్కంజెప్పుడీ తప్పునన్."
అని మాజోరుగా అడిగాడు.

"స్త్రీకేశాలకు సహజమైన సుగంధం ఎక్కడైనా ఉంటుందా? 
కాని నువ్వలా పద్యం చెప్పావు. 
అందుకే తప్పు" అన్నాడు నత్కీరుడు.

పార్వతీదేవి కేశాలకు సహజసుగంధం ఉంటుంది అన్నాడు శివుడు.
ఓపక్క చెబుతున్నది సాక్షాత్తు శివుడే.
తన ఆరాధ్యదైవమే!
అయినా ఏమాత్రం తగ్గలేదు నత్కీరుడు.

"అలా అయితే ఈ కవిత్వం మీ లోకంలో చెల్లుతుంది గాని మా లోకంలో చెల్లదు" పొమ్మన్నాడు.
ఓర్నీ! 
శివుడు లేని లోకమంటూ ఒకటుందా?
నత్కీరుడికంటూ ఒక ప్రత్యేక లోకం ఉందా?
ఆ లోకంలో సర్వాంతర్యామి అయిన శివుడికి స్థానం లేదా?
మూర్ఖత్వానికైనా ఒక హద్దు ఉండవద్దా?

శివుడికి ఒళ్లు మండింది. 
కుష్టురోగివైపో అని శపించేశాడు.
అప్పటికి నత్కీరుడి కళ్లు నెత్తిమీదనుండి క్రిందకు దిగాయి.

క్షమించమని కాళ్లబడ్డాడు. 
పాపం బోళాశంకరుడు! 
జాలి పడ్డాడు.
"కైలాసదర్శనం చేసుకో. రోగం కుదురుతుంది" 
అని ఉపాయం చెప్పాడు.
•○●□•○●□•○●□

నత్కీరుడు హడలిపోయాడు.
దక్షిణంలో ఉండే నేనెక్కడ? 
ఉత్తరాన ఉన్న కైలాసమెక్కడ?

ఎన్ని మహానదుల్ వనములెన్ని గిరీంద్రములెన్ని బోయవీ
ళ్లెన్ని మృగంబులెన్ని జనహీనములైన పథంబులెన్ని నే
నెన్నియు దాటి యే కరణినీశ్వరు శైలము చూడబోయెదన్?
గన్నది కాదు విన్నయది కాని, సదాశివ! యేమి సేయుదున్?

అని విచారంతో ఉత్తరదిశగా తన ప్రయాణం ప్రారంభించాడు.
నడుస్తూ నడుస్తూ క్రమంగా ఒక నిర్మలమైన తటాకం చెంతకు చేరుకున్నాడు. 
తటాకం ఒడ్డున శివపూజకు కూర్చున్నాడు.

తటాకం ఒడ్డున ఒక చెట్టుంది. 
ఆ చెట్టు మీద ఒక యక్షిణి ఉంది.
ఆమె నరమాంసభక్షిణి.
కాని ఆమెకు కూడా ఒక నీతి ఉంది.
మహాశివభక్తుల్ని ఆమె తినదు. 
క్రింద నత్కీరుడు శివపూజ చేస్తున్నాడు. 
వాణ్ణి తినరాదు. 
కాని పూజలో ఏదైనా లోపం కనిపిస్తే అమాంతం మింగేయవచ్చు.
కాబట్టి నత్కీరుడి ఏకాగ్రతను చెడగొట్టి పట్టుకుందామని ఆ యక్షిణి ఒక మంచి ప్లాను వేసింది.
•○●□•○●□•○●□

((మిగిలిన కథ రెండో భాగంలో చదవండి.))
అంత వరకు ఇదిగో హోం వర్కు:
1. ప్రస్తుతం మన దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎవరెవరి కళ్లు నెత్తికెక్కి ఉన్నవో లిస్టు వ్రాసుకొనుము. ఎలా ఎక్కి ఉన్నవో కూడా స్వయముగా వివరించుకొనుము.
(గమనిక: హోం వర్కు చేయని వారికి ఈ కథను చదివిన ఫలితము సిద్ధింపదు)

Monday, 23 July 2018

తిల్లై కూతన్, తిరునీలకంఠర్

అది నటరాజస్వామి కొలువైన చిదంబరపుణ్యక్షేత్రంలో పవిత్రమైన శివగంగ కోనేరు.
స్థానికులు తమభాషలో స్వామిని తిల్లై కూతన్ అని పిలుచుకుంటారు. తిల్లై అనేది అక్కడి సముద్రతీరప్రాంతాలలో విరివిగా పెరిగే ఒకానొక చెట్టు. కూతన్ అంటే నృత్యాధిపతి. (తిల్లై నటరాజు అని అర్థం అన్నమాట)
ఆయన కొలువైన స్థానాన్ని వారు చిత్రాంబళం అంటారు. అంబళం అంటే రంగస్థలం లేదా దేవాలయం. చిత్ర అనే పదానికి విభిన్నమైన అర్థాలు ఉన్నాయి. అద్భుతమైనది, దివ్యమైనది, వర్ణమయమైనది, శోభస్కరమైనది, శుభంకరమైనది... ఇలా.
చిదంబళం అనేవారు కూడా ఉన్నారు. చిత్ + అంబళం అన్నమాట. చిత్ అంటే చైతన్యం అని అర్థం. సత్ + చిత్ + ఆనందం = సచ్చిదానందం అనే పదాల కలయికలో చిత్ ఇదే. చిదంబళం అంటే చైతన్యదేవాలయం అని అర్థం
స్వామివారి సహధర్మచారిణి పేరు శివగామి సుందరి. ఆమె ఆలయానికి ఎదురుగా ఉన్నదే ఈ శివగంగ కోనేరు.
***
పూర్వం చిదంబరంలో తిరునీలకంఠర్ అని ఒకాయన ఉండేవారు. ఆయన గొప్ప శివభక్తుడు. అంతటి ఆయన కూడా జితేంద్రియుడు కానందువల్ల, ఒకసారి ఒకానొక తప్పు చేశాడు. ఆ తప్పును అతని భార్య సహించలేకపోయింది. అతడు తన భార్యను అనునయించే ప్రయత్నం చేశాడు.
ఆ ప్రయత్నంలో తన భార్యను అతడు తాకే ప్రయత్నం చేయబోతే ఆమె "మీరు మమ్మల్ని అంటరాదు, తిల్లై కూతన్ స్వామి పేరిట ప్రమాణం" అనేసింది.
ఆమె నన్ను అంటరాదు అని ఏకవచనప్రయోగం చేయకుండా మమ్మల్ని అంటూ బహువచన ప్రయోగం చేసింది కాబట్టి, అతడు స్త్రీలెవరినీ తాకరాదు అని నిశ్చయించుకున్నాడు. నిండు యౌవనంలో ఉన్నపుడే అతడు బ్రహ్మచర్యదీక్షను స్వీకరించాడు. తన వృత్తిని తన శివుని తప్ప వేరెవరినీ మనసులో ఉంచుకోకుండా జీవితం గడిపాడు. అలాగని, భార్యను పోషించే తన ధర్మాన్ని మాత్రం అతడు విడిచిపెట్టలేదు. ఆమె కూడా శివభక్తితన్మయురాలైంది. క్రమంగా వారు ఇరువురూ వృద్ధులయ్యారు. శరీరంలో శక్తి క్షీణించింది.
శివగామీనటరాజులకు వారిపట్ల కరుణ కలిగింది. వారికి ఇహపరసౌఖ్యాలు కలుగజేయవలసిందిగా శివగామి నటరాజును కోరింది. సరేనన్నాడు ఆయన. 
ఒక శివయోగి వేషం ధరించి తిరునీలకంఠర్ ఇంటికి వచ్చాడు. అతని ఆతిథ్యం స్వీకరించిన తరువాత ఒక బంగారు భిక్షాపాత్రను అతని చేతికి ఇచ్చి, ఓయి నీలకంఠా, ఈ తీర్థయాత్రలకు పోతున్నాను, తిరిగి వచ్చిన తరువాత ఈ పాత్రను నీ దగ్గరనుండి తీసుకుంటాను, అంతవరకు నీవద్ద భద్రంగా దాచిపెట్టవలసింది" అని కోరాడు. సరేనన్నాడు నీలకంఠర్.
కొంతకాలం గడిచాక ఆ మాయాశివయోగి తిరిగివచ్చి, "ఏదీ, నీకిచ్చిన బంగారు పాత్రను నాకు తిరిగి ఇచ్చేసెయ్" అన్నాడు. నీలకంఠర్ తన ఇల్లంతా వెతికినా ఆ పాత్ర దొరకలేదు. అతడు శివయోగి కాళ్లమీద పడి, క్షమాపణ కోరాడు. ఆ పాత్రకు బదులుగా మరొక బంగారు పాత్రను ఇస్తానన్నాడు. కానీ, మాయాశివయోగి శాంతించాడు కాడు. నీవు శివభక్తుని వేషంలో ఉన్న ఒక దొంగవు అంటూ నిందించాడు.
నిజమైన శివభక్తుడు ఎన్నడూ దొంగ కాజాలడు అన్నాడు నీలకంఠర్. నీవు నిర్దోషివి అయితే శివుని సాక్షిగా ప్రమాణం చేయగలవా అని సవాలు చేశాడు మాయాశివయోగి. అలాగే, ఏమని ప్రమాణం చేయమంటారు అని నీలకంఠర్ అడిగాడు.
"నీవు నీ భార్య చేతిని పట్టుకుని తిల్లై కూతన్ శివగామి సుందరిల సమక్షంలో, శివగంగ కోనేరులో మునిగి బంగారు పాత్రను దొంగిలించలేదని చెప్పండి చూదాం" అన్నాడు మాయాశివయోగి.
ఒక కఠినమైన పరీక్ష ఎదురైంది నీలకంఠర్ కు. పూర్వం తిల్లై కూతన్ పేరిట తన భార్య చేసిన శపథం వల్ల తాను ఆమెను తాకరాదు. తాకితే స్వామివారిపట్ల ఘోరమైన అపరాధం చేసినట్లవుతుంది. కానీ, ఇపుడు ఆమె చేతిని పట్టుకుని తాను బంగారు పాత్రను దొంగిలించలేదని చెప్పి కోనేరులో మునిగి ప్రమాణం చేయకపోతే శివభక్తుడు దొంగ అనే అపవాదం వచ్చి పడుతుంది. ఏమి చేయాలో తెలియని విషాదంలో మునిగి కన్నీరు కార్చాడు నీలకంఠర్.
మాయాశివయోగి చిదంబరంలో పెద్దలందరినీ పిలిచి పెద్ద రచ్చ చేశాడు. వారందరూ వచ్చి, ఆ శివయోగి చెప్పినట్లే నీలకంఠర్ తన భార్య చేతిని పట్టుకుని ప్రమాణం చేయవలసిందేనని తీర్పు చెప్పారు. లేదంటే గ్రామబహిష్కరణ శిక్ష తప్పదని హెచ్చరించారు.
అపుడు ఇక మరణమే శరణం అని భావించిన అతనితో ఆయన భార్య ఒక ఉపాయం తెలిపింది. ఆ ఉపాయం ప్రకారం భార్యాభర్తలు ఇరువురు ఒక కఱ్ఱను ఇరువైపులా పట్టుకుని, మాయాశివయోగి చెప్పిన ప్రకారమే ప్రమాణం చేసి కోనేటిలో మునిగారు. వారు లేచి చూసేసరికి...
***
***
ఆశ్చర్యం!
దంపతులు ఇరువురూ నవయౌవనవంతులు అయ్యారు.
వారి వృద్ధత్వం ఎటుపోయిందో ఎవరూ ఎరుగరు. అక్కడ ఉన్న చిదంబరక్షేత్రప్రజలందరూ అది తమ తిల్లై కూతన్ చేసిన మాయ అని తెలుసుకున్నారు. హర హర మహాదేవ శంభో అనే వారి భక్తితన్మయధ్వనులతో క్షేత్రమంతా ప్రతిధ్వనించిపోయింది.
***
కాలక్రమేణా ఆ నీలకంఠర్ అరవై ముగ్గురు నాయన్మారులలో ప్రథముడిగా ఘనత వహించాడు. నాయన్మారులంటే ద్రవిడదేశానికి చెందిన పరమశివభక్తులు. ఇంద్రియలోలుడైన తన భక్తునికి ఇంద్రియవిజయం ప్రసాదించి అనుగ్రహించిన కూతన్ కథ ఇది.
***
ఇదిగో మిస్టర్ I Lie Yeah,
ఈ తిరునీలకంఠ నాయనారు బ్రాహ్మడు కాదు, కోమటోడు అంతకంటే కాదు, అచ్చమైన శూద్రుడు. అతడు కుంభకారుడు అంటే మొదట అర్థం కాక ఏడుస్తావు. అర్థమైతే అది సంస్కృతం అని ఏడుస్తావు. అందుకే అతడు కుమ్మరి కులంలో పుట్టినవాడు అని స్పష్టంగా చెబుతున్నాను.
ఈ కథ తెలుసుకున్న తరువాతనైనా,
"హిందూ దేవుళ్ళు తక్కువజాతి భక్తులను దూరంగా పెడతారు, యేసుక్రీస్తు, బుద్ధుడు మాత్రమే శూద్రులను చేరదీస్తారు" - అనే నీ వెధవ వాగుడు ఇక ఆపు.
హిందూ దేవుళ్ళు పరమ సెక్యులర్ దేవుళ్ళు. తమను తిట్టినవారికి కూడా మోక్షం ప్రసాదిస్తారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, శిశుపాలుడు వంటివారిని ఎరుగుదువా? వాళ్ళు ఎన్ని తిట్టినా సహించి తన చెంతకు చేర్చుకున్నవారు. వారిది కూడా భక్తేనని హిందూ దేవుళ్ళు భావిస్తారు. వాళ్ళది వైరభక్తి అట.
అలాగే, నీవు ద్వేషంతో వాగుతున్నా, అజ్ఞానంతో వాగుతున్నా, మొత్తానికి హిందూ దేవుళ్లను స్మరిస్తున్నావు. నీకు కూడా పుణ్యం వస్తుంది పో. అదీ మా మతపు గొప్పదనం.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...