Showing posts with label Kalidasa. Show all posts
Showing posts with label Kalidasa. Show all posts

Thursday, 26 March 2020

కాళిదాసు స్వభావోక్తి



అది హిమవత్ పర్వతపంక్తులలో ఒక ప్రాంతం.  గంగానది పెద్దగా సడి చేయకుండా నెమ్మదిగా ప్రవహిస్తోంది.  ఆ ప్రవాహంలో పొడవాటి దేవదారువులు కాళ్ళు పెట్టి తడుస్తూ ఉన్నాయి.  అక్కడి పొదలలో సంచరిస్తున్న కస్తూరి మృగాల కారణంగా గాలి పరిమళభరితంగా ఉన్నది.  కిన్నరులు సన్నగా పాడుతున్న ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి.  ఆ ప్రాంతంలో చర్మవస్త్రుడు అయిన పరమేశ్వరుడు ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.

ప్రమథగణాలు విశ్రాంతిగా ఆటవిడుపుగా ఉన్నారు.  అక్కడ ఉన్న పూలను తమ సిగలలో తురుముకున్నారు.  వారు భూర్జత్వచాలను (బుజపత్తిరి పట్టలను) వస్త్రాలుగా ధరించారు.  మనశ్శిలాచూర్ణాన్ని ఒంటికి పూసుకున్నారు.  శిలాజతువులనడుమ బండరాళ్లపై కూర్చుని ఉన్నారు.

అప్పుడు, నందీశ్వరుని (వృషభం) చేష్టలను వర్ణిస్తూ కాళిదాసు వ్రాసిన ఈ శ్లోకం అతి రమణీయమైనది.

తుషారసఙ్ఘాతశిలాః ఖురాగ్రైః
సముల్లిఖన్ దర్పకలః కకుద్మాన్।
దృష్టః కథఞ్చిద్గవయైర్వివిగ్నైః
అసోఢసింహధ్వనిరున్ననాద॥
(కుమారసంభవమ్ 1.56)

ఆ మహావృషభం చలికాలంలో పేరుకుపోయి గడ్డకట్టిన మంచురాళ్లను తన గొరిౙలతో (కాలి గిట్టలతో) గోరాడుతూ ఉండగా ఎక్కడో దూరం నుండి సింహగర్జనలు వినిపించేసరికి సహించలేక (ఆమాత్రం శబ్దం నేను చేయలేనా అన్నట్టుగా) ఉన్నట్టుండి ఖణిల్లని రంకె వేసిందట.  అప్పుడు దాని మహాకారాన్ని, బలాన్ని చూసి, ఆ దగ్గరలో ఉన్న తక్కిన గవయవాలు (కొండెనుములు) అన్నీ భయనిర్విణ్ణములై నిశ్చేష్టములై పోయాయట.

(ననాద అనే క్రియాపదప్రయోగంతో ఆ ఎద్దు రంకెతో ఆ కొండలు కోనలు ప్రతిధ్వనించిపోయాయనే అర్థాన్ని కూడా కాళిదాసు నేరుగా చెప్పకపోయినా ధ్వనింపజేశాడు.)

(చలికాలంలో కడుపునిండా తిండి దొరకక అరణ్యాలలోను కొండలలోను తిరిగి తిరిగి అలసిపోయి నిస్సహాయంతో కోపంతో గర్జించిన సింహాలు నందీశ్వరుని రంకెకు ఒక్కసారిగా అదిరిపడి, చెవులు రిక్కించి, జూలు అల్లాడుతూ ఉండగా తమ తలలను ఒకింత పైకెత్తి, తమను తిరిగి సవాలు చేస్తున్నట్లు వినవచ్చిన దర్పంతో కూడిన ఆ మహానాదాన్ని చేసిన ఆ మహాసత్త్వం ఏమైయ్యుంటుందో అని కలత చెందుతూ, కళ్లను విప్పార్చి అటూ ఇటూ చూస్తున్న దృశ్యాన్ని ఊహించమని కాళిదాసు చెప్పినట్లు ఉంది కదా!)

ఉపమా కాళిదాసస్య అని అందరూ కీర్తిస్తారు.  కాని ఇంత చక్కని స్వభావోక్తిని కూడా కాళిదాసు ప్రయోగించగలడు!  'చారు యథావద్ వస్తువర్ణనమ్' అని స్వభావోక్తి అలంకారాన్ని ప్రఖ్యాతకాళిదాసవిమర్శకుడైన మల్లినాథులవారు నిర్వచించారు.  ఉన్నదానిని ఉన్నట్టుగా వర్ణించడం స్వభావోక్తి అట. 

కవయః కాళిదాసాద్యాః
కవయో వయమప్యమీ।
(కాళిదాసులాంటివాళ్లూ కవులే, మేమున్నూ కవులమే) ఆమాత్రం అందరూ వర్ణించగలరు కదా?  ఆగండాగండి.  ముందుగా 'చారు' అనే పదాన్ని చూడండి.  అది అన్నంలో కలుపుకు తినే పదార్థం కాదు.  చారు=అందమైన/సుందరమైన/రమణీయమైన/మనోహరమైన అని ఆ పదానికి అర్థం.  మనసును మురిపించే విధంగా, ఉన్నదానిని ఉన్నట్టు వర్ణించడం స్వభావోక్తి.

కాబట్టి,
పర్వతే పరమాణౌ చ
పదార్థత్వం తు విద్యతే॥
కాళిదాసూ కవే, నేను కూడా కవినే అనే వాళ్లకు,
పర్వతమూ ఒక పదార్థమే, పరమాణువూ ఒక పదార్థమే అని సమాధానం.

ఈ బొమ్మకు ఈ కథనానికి సంబంధం ఏమీ లేదే అనిపించిందా?  నాకు కూడా అలాగే అనిపించింది.  ఈ వర్ణనకు తగిన చిత్రం దొరుకుతుందా అని వెదికాను.  ఉహూ.  దొరకలేదు.  చిత్రకారులు కాళిదాసు కావ్యాలను చదవాలే కాని, వారి ప్రతిభను తట్టి లేపే ఎన్నో రమణీయవర్ణనలు వారికి లభిస్తాయి.

(ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఒక పక్క ప్రశాంతంగా నా పనేదో నేను చేసుకుంటూ ఉంటే మరోపక్క పై తరగతికి వారికి ప్రమోషన్ ఇస్తున్నట్లు వారి పాఠశాలనుండి సందేశం వచ్చేసరికి ఆనందం తట్టుకోలేక కేకలేస్తున్న పిల్లలను చూసి కుమారసంభవంలో కాళిదాసు వర్ణించిన నందీశ్వరుడు గుర్తుకొచ్చాడు.)

#Kalidasa #Kumarasambhava #Nandi

Friday, 20 March 2020

పరిమళించిన దానవత్వం

1
కాళిదాసు నిద్రకు ఉపక్రమిస్తూ ఉండగా ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినవచ్చింది. ఎవరై ఉంటారు ఈ రాత్రి పూట అనుకుంటూ అతడు వచ్చి తలుపు తెరిచాడు. బయట ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో సహా ఉన్నాడు.

ఆ వచ్చిన వాడు అతిథి అయి ఉంటాడు అని గ్రహించిన కాళిదాసు, అతడికి అతడి కుటుంబానికి అంత రాత్రిపూట కూడా మంచి భోజనం ఏర్పాటు చేశాడు.
ఆ తరువాత అతడిని "ఎవరయ్యా మీరు? ఇంత రాత్రిపూట నగరంలో ప్రవేశించారు?" అని అడిగాడు.
ఆ బ్రాహ్మణుడు దాదాపు కాళిదాసు పాదాల మీద పడినంత పని చేసి, "అయ్యా, నేను పేరుకు బ్రాహ్మణుడినే గాని, సంస్కృతం చదువుకున్నవాడిని కాను. ఇంతవరకు ఈనాడు పేపర్ లో ప్రూఫ్ దిద్దుతూ ఉండేవాడిని. ఈనాడు పేపర్ ను అందరూ నమ్మడం మానివేశాక, నా ఉద్యోగం పోయింది. దాంతో బ్రతుకుతెరువుకోసం దేశం మీద పడ్డాను. ధారానగరంలో భోజమహారాజు గొప్ప దాత అని విన్నాను. ఆశతో వచ్చాను. కానీ కవిత్వం రానివారిని, పాండిత్యం లేనివారిని అతడు ఆదరించడని తెలిసి వచ్చింది. అతడి రాజ్యంలో ఒక నేతగాడు, ఒక కూలి పని వాడు కూడా కవిత్వం చెప్పగలరని విన్నాను. అటువంటిది, భాష మీద ఎటువంటి పట్టులేని దూరదేశస్థుడనైన నన్ను అతడు ఆదరిస్తాడనే నమ్మకం లేదు. అందువల్ల అందరూ రాజదర్శనం కావాలంటే రాజానుగ్రహం పొందాలంటే కాళిదాసును ఆశ్రయించమని చెప్పారు. అందువల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. కనికరించండి" అని ప్రాధేయపడ్డాడు.
"సరేనయ్యా, నీకు సంస్కృతం రాకపోవచ్చును, కనీసం రామాయణ భారతాలైనా తెలుసునా?"
"ఆ! తెలుసునండి! రామాయణం అంటే రాముడు, భారతం అంటే భీముడు! అంతే కదండీ?"
"అంతే! అంతే!" అన్నాడు కాళిదాసు. "నేను మిమ్మల్ని రేపు రాజసభకు తీసుకొనిపోతాను. అక్కడ మిమ్మల్ని మహాపండితుడిగా పరిచయం చేస్తాను. మీరేమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండండి. రాజుగారు ఇచ్చింది పుచ్చుకుని వచ్చేయండి" అని చెప్పాడు.
సరేనన్నాడు ఆ బ్రాహ్మణుడు.
ఆ మరుసటి రోజు కాళిదాసు అతడిని సభలో మహాపండితుడుగా పరిచయం చేశాడు. కాళిదాసు మాట మీద ఉండే గౌరవం చేత అందరూ అతను నిజంగానే మహాపండితుడు అని భావించారు.
భోజరాజు వినయంగా ఆ పండితుని ఒక చిన్న ప్రశ్న వేశారు.
"పండితవర్యా! మా దేశంలో లంకాధిపతిని కొందరు "రావణుడు" అంటున్నారు కొంతమంది "రావనుడు" అంటున్నారు. ఏది సరైన పదమో చెప్పగలరా?" అని అడిగాడు.
కాళిదాసు ఆ దొంగపండితుని మౌనంగా ఉండమని సైగ చేశాడు. అయినా తన పాండిత్యాన్ని ప్రదర్శించే అవకాశం వచ్చేసరికి ఆ పండితుడు ఆగలేకపోయాడు. తన పాండిత్యాన్ని రాజుగారు గుర్తిస్తే తన స్థానం గల్లంతు అవుతుందేమోనని కాళిదాసు అసూయపడుతున్నాడని భావించాడు. అందువల్ల నోరుమూసుకొని ఉండలేక -
"రాభణుడు కదా?" అన్నాడు.
సభ అంతా అల్లకల్లోలం అయిపోయింది. అందరూ గుసగుసలాడుకుంటున్నారు. "రావణ" అనేది సరైన పదమా లేక "రావన" అనేది సరైన పదమా అని తేల్చుకోలేక పోతుంటే, మధ్యలో ఈ కొత్త పండితుడు వచ్చి "రాభణ" అనే కొత్త పదాన్ని పరిచయం చేశాడు!
భోజరాజుగారు కంగారుపడుతూ కాళిదాసు కేసి చూశాడు. కాళిదాసు ఇరుకులో పడ్డాడు. అతడు మహాపండితుడు అని చెప్పింది తానే కదా? ఇప్పుడు అతడు ఏమి వాగినా తానే సమర్థించాలి!
అందువల్ల తప్పనిసరిగా అతడిని సమర్థిస్తూ కాళిదాసు ఈ క్రింది శ్లోకం చదివాడు -
"భకారః కుంభకర్ణేఽస్తి భకారోఽస్తి విభీషణే।
కులశ్రేష్ఠే కులజ్యేష్ఠే భకారః కిం న విద్యతే॥

పెద్ద తమ్ముడైన కుంభకర్ణుని పేరులో భ అనే అక్షరం ఉన్నది. చిన్న తమ్ముడు అయిన విభీషణుని పేరులో కూడా భ అనే అక్షరం ఉన్నది. మరి కులశ్రేష్ఠుడు కులజ్యేష్ఠుడు అయిన అన్నకు రాభణుడు అని, పేరులో భ అనే అక్షరం ఎందుకు ఉండదు?" అన్నాడు.
దాంతో అంతటా హర్షధ్వానాలు చెలరేగాయి. భోజరాజు సంతోషించాడు. ఆ దొంగపండితునికి గొప్ప గొప్ప కానుకలు సమర్పించాడు.
***

2
దాంతో అతడు సంతోషం పట్టలేకపోయాడు. "మహారాజా! మీలో "దానవత్వం" పరిమళిస్తోంది" అన్నాడు.

ఆ మాట వినగానే మహారాజు నివ్వెరపోయాడు. సభ దిగ్భ్రాంతి చెందింది. కాళిదాసు చిరునవ్వు నవ్వాడు.
కాళిదాసు నవ్వాడు అంటే అందులో ఏదో పరమార్థం ఉందని అందరూ భావించారు. కాళిదాసా! ఈ మహా పండితుని మాటకు అర్థం ఏమిటి? అని అందరూ అడిగారు.
అప్పుడు కాళిదాసు ఈ క్రింది శ్లోకం చదివాడు.
బలినా దానవేంద్రేణ త్రైలోక్యమర్పితం పురా।
దాతృత్వం దానవత్వం చ సమార్థమభవత్తదా॥

"మహారాజా! పూర్వం బలి అనే పేరు గలిగిన దానవ శ్రేష్ఠుడైన మహారాజు ఉండేవాడు కదా? అతడు గొప్ప దానశీలుడు కదా? అతడు తన వీరత్వంతో ముల్లోకాలను జయించాడు కదా? మళ్లీ ఆ ముల్లోకాలనూ శ్రీ మహావిష్ణువుకు ఒక్క మాటతో అలవోకగా దానం చేసిన మహాదానవీరుడు కదా?
పూర్వం వేరు వేరు అర్థాలు కలిగిన దాతృత్వము, దానవత్వము అనే రెండు మాటలు అతడి గొప్పదనం వలన సమానార్థకాలు అయినాయి. మీరు కూడా ఆ దానవవీరుడైన బలి చక్రవర్తి అంతటి వీరులు, మహాదానశీలురు అని ఆ పండితుడు మీకు నిగూఢంగా చెప్పదలిచాడు. అంతే!" అని వివరించాడు.

యావత్సభ కరతాడనధ్వనులతో మారుమ్రోగిపోయింది. పండితుడికి మరిన్ని విలువైన కానుకలు లభించాయి.
***

ఈ క్రింది పేపర్ కటింగ్ మిత్రులు Naresh Kandula వారి పోస్టులోనిది. ఆయన మిత్రులు శ్రీ Raja Rao Vadrevu గారు సంపాదించినది. ఇద్దరికీ ధన్యవాదాలు.

ఇందులో ఒకటవ కథ (రాభణుడు) భోజప్రబంధంలోనిది. రెండవ కథ (దానవత్వం పరిమళించిన కథ) నేను కల్పించినది.

Monday, 23 July 2018

సర్వః సగంధేషు విశ్వసితి

ఫలకాలు చెప్పే పాఠాలు – 4
కాళిదాసమహాకవి శకుంతల నోట పలికించిన మాట...
“సగంధ” అనే పదానికి జ్ఞాతి అనే అర్థం చెబుతుంది వాచస్పత్యం.
“ప్రతి ఒక్కరూ తమవారినే విశ్వసిస్తారు.”
నిజమే కదా, అది సహజం.

It is an animal’s instinct.
Birds of the same feather flock together.
Like likes Like.

అది సరే, “తమవారు” అని ఎవరైనా సరే, కొందరిని ఎలా గుర్తుపడతారు?

ప్రాథమికంగా - తాము తినేటటువంటి తిండినే తినే వారిని తమవారని గుర్తుపడతారు...

అర్థం చేసుకొనేందుకు ఆధునికశిక్షణ పొందిన మన మనసు నిరాకరించినా అది చాలవరకు నిజం. 

విస్తారమైన ఆఫ్రికా అడవుల్లో నేషనల్ జాగ్రఫిక్ ఛానెల్ వాళ్ళు జంతువుల మీద తీసిన డాక్యుమెంటరీలు చూడండి...

చిన్నపాటి జింకలు ఒక చోట గడ్డిమేస్తూ ఉంటాయి. వాటికి పక్కనే మరింత పెద్ద కొమ్ముల జింకలు కూడా గడ్డిమేస్తూ ఉంటాయి. ఈ పక్క జీబ్రాలు మేస్తుంటాయి. ఆపక్క అడవి బర్రెలు, దున్నలు మేస్తుంటాయి. ఇవన్నీ వేరు వేరు జాతుల జంతువులు. అయినా ఒకదానిని చూసి మరొకటి భయపడవు. ఇంతలో అక్కడికి వీటన్నింటికన్నా బలమైన ఏనుగుల మంద వస్తుంది. వాటిని చూసి కూడా ఇవేవీ భయపడవు. మరికాసేపట్లో వీటన్నింటికన్నా పొడవైన జిరాఫీలు వస్తాయి. అప్పుడు కూడా ఇవేవీ భయపడవు. ఎందుకంటే, వీటన్నిటికీ ఆహారం సమానమైనదే. గడ్డి, ఆకులు, కొమ్మలు. 

ఇంతలో అక్కడికి ఒక చిన్న నక్క వచ్చిందనుకోండి...
అది కనబడకున్నా పొదలమాటున దాక్కున్నప్పటికీ దాని వాసన తగిలిన వెంటనే జింకలలో అలజడి ప్రారంభమౌతుంది. అవి ప్రశాంతంగా తినలేవు. కంగారుగా దిక్కులు చూస్తాయి. అటూ ఇటూ పరుగెడతాయి. అది సగంధమైనది (సమానమైన వాసన కలిగినది) కాదన్న మాట. సగంధ అనే పదాన్ని మనం ఇక్కడ ఇలా అర్థం చేసుకోవచ్చు.

సరే, ఎందుకు వాటికా భయం అంటే, ఆ నక్క ఆహారం గడ్డి కాదు, వాటికి ఉడతలు తొండేబిక్కలు దొరికితే సరే సరి, లేకుంటే తమలో ఒకదాన్ని ఆ నక్క లాక్కుపోయి పీక్కు తింటుందని ఆ జింకల భయం. ఏ చిరుతపులో వచ్చిందంటే ఇక జీబ్రాలకు బర్రెలకు కూడా భయమే. ఇక సింహాలమంద వచ్చిందంటే ఏకంగా జిరాఫీలు అడవిదున్నలు ఏనుగులలో కూడా భయం కలుగుతుంది. అవి గుంపులు గుంపులుగా దాడి చేస్తూ మొదట తమ చిన్నారులను, తమలోని బలహీనులను ఎత్తుకుపోతాయని వాటికి తెలుసు. సాధ్యమైనంతవరకు పారిపోయి తప్పుకునేందుకే అవి ప్రయత్నిస్తాయి. కొన్ని నిస్సహాయంగా వాటికి దొరికిపోతాయి. కొన్ని రోషంతో ఎదురు తిరిగి, వాటినే చంపేసిన సంఘటనలు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. 

సరే – ఈవిధంగా - ప్రాథమికంగా - తమకంటే భిన్నమైన ఆహారం కలిగినవాటిపై నమ్మకం కలిగి ఉండడం జంతువులలో కుదరదు. మనుషులలో కూడా పూర్వం ఇటువంటి మనస్తత్వం ఉండేదేమో. కాని, రాన్రాను అటువంటి జంతులక్షణాలు తగ్గి ఉంటాయి. 

కాని, ఇప్పటికి కూడా - తాము చేసేటటువంటి పనినే చేసేవారిని, తాము ధరించే దుస్తులవంటి దుస్తులనే ధరించేటటువంటివారిని, తమవంటి అలవాట్లే కలిగినవారిని, తాము పాటించేటటువంటి ఆచారాలనే పాటించేవారిని తమవారిగా మనుషులు సులువుగా నమ్మేస్తారు. వారిని తమ కులస్థులుగా, తమ మతస్థులుగా పరిగణించి వారితో సన్నిహితంగా మెలగడం చూస్తూనే ఉన్నాం. విద్య సార్వజనీనమై ఒకరి భాషను మరొకరు అర్థం చేసుకొనగలిగే స్థాయికి వచ్చాక మానవులందరూ సమానులేనన్న భావన బలపడింది. 

అయినప్పటికీ సమానమైన ఆలోచనలు కలిగినవారు, సమానమైన వ్యవహారాలు నడిపేవారు, సమానమైన కష్టనష్టాలు కలిగినవారు కులమతాల తేడా లేకుండా కలిసి ఒక సమూహంగా ఉండటం ఈ రోజుల్లో చూస్తున్నాము. ఇక్కడ కూడా మరొక అర్థంలో సగంధత కనిపిస్తోంది. ఇక్కడ గంధము అంటే – వాసన – అంటే - ఈ జన్మలోనో పూర్వజన్మలోనో అబ్బిన సంస్కారాలు కొందరిని పరస్పరం మిత్రులను చేస్తాయి అన్నమాట. 

మృగా మృగైః సంగమనువ్రజంతి.
గావశ్చ గోభిః తురగాస్తురంగైః।
మూర్ఖాశ్చ మూర్ఖైః సుధియః సుధీభిః
సమానశీలవ్యసనేన సఖ్యమ్।। 

జింకలు జింకల తోనే కలిసి తిరుగుతాయి. గోవులు గోవులతోనే కలిసి తిరుగుతాయి, గుఱ్ఱాలు గుఱ్ఱాలతోనే కలిసి తిరుగుతాయి. మూర్ఖులు మూర్ఖులతోనే కలిసి తిరుగుతారు. పండితులు పండితులతోనే కలిసి తిరుగుతారు. సమానశీలము, సమానమైన వ్యసనాలు (అంటే కష్టాలు, బాధలు కూడా) కలిగినవారి నడుమ స్నేహం ఏర్పడుతుంది అని పెద్దల మాట. 

“స వానరేంద్రో హృతరాజ్యదారః స రాఘవేంద్రో హృతరాజ్యదారః।
ఏవం తయోరధ్వని దైవయోగాత్ సమానశీలవ్యసనేషు సఖ్యమ్।।“


“ఆ వానరేంద్రుడికి ఆ రాఘవేంద్రుడికి నడుమ స్నేహం కలిసిందన్నా కారణం ఒకటే – వారిరువురి కష్టాలు సమానమైనవి కాబట్టే!” - అని ఒక కవి చమత్కరించాడు. ఇరువురూ రాజ్యం కోల్పోయారు, ఇరువురి భార్యలూ అపహరింపబడ్డారు కదా అంటాడాయన.

ఏదేమైనా, అప్పటికీ, ఇప్పటికీ మనవారు అనేవారిని మనం విశ్వసిస్తాం. 

భారతదేశంలో ఉంటున్నాడనే ఒకే ఒక్క కారణంగా పాకిస్తాన్ని పొగుడుతూ భారత్ ను సవాలు చేస్తున్నా ఓ ఫరూక్ అబ్దుల్లా గాడిని చూసీ చూడనట్టు వాడి మాటలు వినీ విన్నట్టు ఉంటున్నాం కదా. 

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...