Showing posts with label Emotion. Show all posts
Showing posts with label Emotion. Show all posts

Monday, 17 December 2018

అభ్యంతరాలు ఎదురైనా సంస్కృతప్రచారం ఆపకండి.

18-04-2017 నాడు ఫేస్ బుక్ లో నేను వ్రాసిన పోస్టు ఇది.

)))(((
#హిందూపురంలోని సోదరీసోదరులారా!
#సంస్కృతం మాట్లాడటం చాలా సులువు!
పదిరోజుల పాటు రోజుకు కేవలం రెండు గంటలు కేటాయించగలరా?
నేను మాట్లాడటం నేర్చుకున్నది ఒక్క వారంరోజుల్లోనే! 
మీరు నాకంటే త్వరగా నేర్చుకోగలరు! నాకంటే బాగా మాట్లాడగలరు!
#సంస్కృతభారతి వారి బోధనప్రణాళిక అటువంటిది!
***
సంస్కృత భారతి సంస్థ వారు సంస్కృతాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు నడుం బిగించి దశాబ్దాలు దాటారు. మన దేశంలో కొన్ని లక్షలమంది ఇపుడు సంస్కృతం మాట్లాడుతున్నారు. సంస్కృతం మృతభాష అని వెక్కిరించినవారు, అభిప్రాయపడినవారు పాపం, ఇపుడు తెల్లబోయి చూస్తున్నారు.
***
(ఎప్పుడు?)
2017 వ సంవత్సరం మే నెల 9 వ తేదీనుండి ఒక పది రోజులు.
(అర్హులు ఎవరు?)
12 సంవత్సరాలు నిండిన ఆడా మగా చిన్నా పెద్దా ఎవరైనా సరే!
(ఎక్కడ?)
అనంతపురం జిల్లా - హిందూపురంలో - నింకంపల్లి రోడ్డు - కంచి కామాక్షీ కళ్యాణ మంటపం వెనుక -
(ఎవరిని సంప్రదించాలి?)
డాక్టర్ పోతరాజు త్రిశూలపాణి, అనంతపురం - 94400 06439
డాక్టర్ కె కె వి శర్మ, అనంతపురం - 94403 61342
శ్రీ జి నాగేంద్ర, హిందూపురం - 96660 02100
శ్రీమతి పేరా సుధాస్రవంతి, హిందూపురం - 98665 55689
(శుల్కం - అంటే ఫీజు ఎంత?)
డబ్బు రూపేణా వస్తు రూపేణా మీరు ఏమీ ఇవ్వనవసరం లేదు.
మీ శ్రద్ధ, మీ ఆసక్తి, మీరు నేర్చుకున్నదాన్ని అవసరమైనపుడు ఇతరులకు నేర్పే ఓర్పు ఉంటే చాలు.
***
సరే, ఆ విధంగా ఒక పది రోజులు నేర్పించి మళ్ళీ మాదారిన మమ్మల్ని వదిలేస్తారా అని ముందే ఒక అభిప్రాయానికి రాకండి.
1 ప్రతివారం ఒక రోజు ఒక గంటపాటు సమావేశమై మరిన్ని నైపుణ్యాలను సంతరించుకొనేందుకు గాను - సాప్తాహిక సమ్మేళనం - ఉంటుంది.
2 మీకు ఉత్సాహం ఉంటే - మీరే స్వయంగా 3 - 10 సంవత్సరాల పిల్లలకు బాలసంస్కృతకేంద్రాలు నిర్వహించడానికి తగిన ప్రోత్సాహం శిక్షణ ఇస్తారు.
ఇంకా ఆసక్తి ఉన్నవాళ్లు ఉంటే -
3 సంస్కృతం ద్వారా భగవద్గీతను అధ్యయనం చేసేందుకు గీతాశిక్షణ కేంద్రం ప్రారంభిస్తారు.
4 & 5 & 6 మీరు సంస్కృతంలో నైపుణ్యాన్ని సాధిస్తున్న కొద్దీ మరింతగా నేర్చుకునేందుకు రకరకాల ప్రణాళికలు ఉన్నాయి. సంస్కృతభారతి వారు మీ తోబుట్టువుల్లా మీకు తోడ్పడతారు.
***
#రాయలసీమలో దాదాపు మన ఇంటి ముంగిట మనకు లభిస్తున్న ఈ చక్కని అవకాశాన్ని జారిపోకుండా అందిపుచ్చుకుందాం. మన సోదరీసోదరులు మరో పదిమందికి కూడా ఈ విషయాన్ని తెలియజేద్దాం!
#జైరాయలసీమ
#జైసంస్కృతం

)))(((
దానికి అరుణ్ విరసం గారు తమ అభ్యంతరం తెలియజేసిన విధం ఇది.

Arun Virasam హిందూపురం ప్రజలకు నేర్పవలసింది సంస్కృతం కాదు
తాగునీరు లేకపోయినా బతకాగలిగే నేర్పు.ప్రజల మౌళికావసరాలు పట్టించుకోకుండా ఎమ్ చేసినా ప్రచారం వస్తుందేమో గాని,ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు.కూడుపెట్టే చదువు చెప్పండి.
అన్నీ ఉండి, తీరికావున్నవాళ్ళు సంస్కృతం నేర్చుకోవచ్చు,అరబ్,ఫ్రెంచి భాషలు నేర్వవచ్చు,, బతుకుతెరువుకోసం,పిల్లల్ని,పెద్దల్ని ఊర్లో వదలి వలపోతున్న వాళ్ళ విషయం ఆలోచించండి,

)))(((
ఆయన అభ్యంతరానికి నేను చెప్పిన సమాధానం ఇది.

श्रीनिवास कृष्णः Arun Virasam మహోదయా! 
మీరన్నది నిజం! ప్రశంసనీయం! తక్షణమాచరణీయం! 
సంస్కృతం లేకుండా జీవితాంతం బ్రతకవచ్చునేమో గాని, త్రాగునీరు లేకుండా ఒక్కరోజు కూడా బ్రతికే పరిస్థితి లేదు!


అయితే, కొన్ని విషయాలు చెప్పవలసి ఉంది.
ప్రపంచం వైవిధ్యభరితమైనది. ప్రతిదానికీ ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. మనకు ఎక్కువ అవసరమైనదాన్ని ఎక్కువగా ఆదరించి అక్కరలేనిదాన్ని తక్కువచేయడం మానవనైజం. మీరు కూడా చేస్తున్నది అదే. మీ మాటలకు అర్థం అదే. 

కాని, మనమేం చేసినా మామిడి చెట్టు మామిడికాయల్నే ఇస్తుంది, కొబ్బరి చెట్టు కొబ్బరికాయల్నే కాస్తుంది. అడివిలోనూ మానససరోవరంలోనూ వొయ్యారాలు పోయే నెమళ్లనూ హంసలనూ తన్ని తరిమేసి కోళ్లూ గొర్లూ పెంచుకొందాం, మనకు ఆకలేసినపుడు వాటిని కోసుకు తినొచ్చు అని ఎవరికైనా ఆలోచన వస్తే నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే క్షుద్బాధ ఎంత భయంకరమైనదో నాకు తెలుసు కాబట్టి. అలాగని ఎవరికో పనికిరామనే బెంగతో నెమళ్లు కోళ్లు కాలేవు, హంసలు గొర్లు కాలేవు. అంత ఆకలేస్తే నెమళ్లనూ హంసలనూ పట్టుకొని అలాగే తినేసినా అవి ఏమీ చేయలేవు కూడా. పాపం కవులూ భావుకులూ వాటిని ఎంతెంతగా పొగిడినప్పటికీ, after all అవి కూడా, అమాయికప్ప్రాణులే కదా!

అలాగే ఇక్కడ సంస్కృతం కాస్తో కూస్తో చదువుకున్నవారు కూడా అలాగే ఉన్నారు. వారికి తెలిసిన విద్యను వారు బోధిస్తున్నారు. వారు ఎవరినీ సహాయం యాచించటం లేదు. ముందే చెప్పాను కదా? చక్కగా ఎదిగిన మామిడి చెట్టు మామిడి కాయలను ఇతరులకోసం ఎలా కాస్తుందో, అలాగే వారు తమకు తెలిసిన సంస్కారవిద్యాఫలాలను తాము అందిస్తున్నారు.

అన్నీ ఉండి తీరిక ఉన్నవాళ్లు మాత్రమే సంస్కృతం నేర్చుకోవాలి అని మీరు శాసిస్తున్నారు. పోనీ అలాగే కానివ్వండి. అటువంటి వాళ్లనే రానివ్వండి. ఎటువంటి వాళ్లు వచ్చినా వాళ్లు నేర్పిస్తారు.

కూడు పెట్టే చదువులు చెప్పండి అంటున్నారు. కూడు పెడుతుందో లేదో? ఏం పెట్టినా పెట్టకున్నా వారు సంస్కృతం సంస్కారం తప్ప మరొకటి మరొకటి నేర్పలేరు. మార్కెట్లో డిమాండు ఉన్నా లేకున్నా, రేటు ఆకాశాన్ని తాకినా, పాతాళంలోనికి కుంగినా ఓ టమోటా మొక్క టమోటాకాయలే కాస్తుంది గాని, రేగు కాయల్ని, నేరేడుకాయల్ని మరొక మరొక ఆపిల్ కాయల్ని ద్రాక్షలనూ కాయలేదు. 

మరోమాట. సంస్కృతభారతివారు ప్రచారం కోసం ఇలాంటి పని చేయటం లేదు. హిందూపురంలో మాత్రమే చేయటం లేదు. తమ కర్తవ్యం అని భావించి వారు చేస్తున్న పనుల వల్ల ప్రజలకు ఏమైనా ఒరుగుతుందో లేదో - అది ప్రజలే తేల్చుకుంటారు.

పిల్లల్ని పెద్దల్ని ఊళ్లో వదలి వలసపోతున్న వాళ్ల విషయం చూడండి అంటున్నారు. మంచి విషయమే. కాని, సంస్కృతభారతి వారు కోటీశ్వరులేం కాదు అందరినీ పోషించడానికి. అవన్నీ చూసుకోవలసింది ప్రభుత్వాలు. సంస్కృతభారతి రాజకీయసంస్థ కాదు. సంస్కృతప్రేమికుల సంస్థ. వారు చేయగలిగింది మాత్రమే వారు చేయగలరు. మీరు చేయగలిగింది మీరు చేయండి. లేదా వారిని కలుపుకుంటే ఫలానా ప్రజాప్రయోజనకరమైన పనిని చేయగలం అనుకుంటే వారితో ఆ విషయం ప్రస్తావించి, ఒప్పించి చేసేందుకు ప్రయత్నించండి.

ధన్యవాదాలు

Saturday, 28 July 2018

కులము - పౌరుషము


తన కుమారుడు యుద్ధరంగంలో చనిపోయాడని మాట యుధిష్ఠిరుని నోట విన్నవెంటనే ద్రోణాచార్యులకు జీవితేచ్ఛ పోయింది. యుద్ధమధ్యంలో శస్త్రత్యాగం చేసి యోగాసనంలో కూర్చున్నాడు. ఇదే అదనుగా భావించి ధృష్టద్యుమ్నుడు ఆయన రథం మీదకు కుప్పించి దూకి అతని శిరోజాలను పట్టుకుని ఒక్క కత్తివేటుతో తలను మొండెం నుండి వేరు చేశాడు.

పాండవకౌరవపక్షాలు రెండూ ఈ చర్యను చూసి దిగ్భ్రాంతి చెందాయి. ఆచార్యుని మరణానికి ఎంతో ఖేదం చెందాయి. ఒక్క కర్ణుడే మిగిలిన అందరికంటె భిన్నంగా ఆలోచించాడు. 

"నా మిత్రుడైన దుర్యోధనుడు ఎంతో నమ్మకంతో ఈ ద్రోణాచార్యుని తన సమస్తసైన్యానికి నాయకుడిగా నియమిస్తే అతడు తన మహారాజుకు విజయం కలిగేలా యుద్ధం చేయవలసింది పోయి, తన కొడుకు చనిపోయాడనేసరికి యుద్ధం మానేసి చేతులారా చావు కొనితెచ్చుకున్నాడు. ఈ విధంగా అతడు స్వామిద్రోహి" అని అతడు మనసారా నమ్మాడు. 

మరోవైపు ఆ ఘోరం జరిగిన సమయానికి అక్కడ లేని అశ్వత్థామకు ఈ విషయం తెలిసింది. ప్రాణప్రదుడైన తండ్రిని కోల్పోయిన తీరని దుఃఖం ఒకవైపు, తండ్రిని అన్యాయంగా చంపిన ఆ దుర్మార్గుడైన ధృష్టద్యుమ్నుని మట్టుపెట్టాలన్న తీవ్రప్రతీకారేచ్ఛ మరొకవైపు. తన తండ్రి గారు అవమానకరమైన రీతిలో మరణించడానికి కారణమైన పాండవ మత్స్య పాంచాల మాగధాది క్షత్రియాపసదుల పాలిటి పరశురాముడయ్యేందుకు పరమ క్రోధంతో ఉద్యుక్తుడయ్యాడు. 

అటువంటి తన మేనల్లునికి దుర్యోధనుడు కౌరవసేనాధిపత్యం ప్రసాదించగలడని కృపాచార్యులు ఆశించారు. కానీ, భీష్మద్రోణుల తరువాత కౌరవసేనాధిపత్యానికి మరొక పోటీదారుడు కర్ణుడు ఉన్నాడు. 

అతడు మహారాజైన దుర్యోధనుడికి ప్రియమిత్రుడు. పైగా రాజసమక్షంలో ద్రోణాచార్యుని మీద లేని పోని నిందలు వేస్తూ ఉన్నాడు. ద్రోణుడి బుద్ధి మంచిది కాదని, ఆసంగతిని బాల్యంలోనే కనుగొన్న ద్రుపదుడు అతనిని తన చెంత ఉంచుకోకుండా తరిమేశాడని ఇలా ఏమేమో చెబుతూ అతని మనసు విరిచేసి, అతనికి ద్రోణుడి పట్ల కృతజ్ఞతాభావం కానీ, గౌరవభావం కానీ లేకుండా చేశాడు. 

ఆ దుర్యోధనుడి సమక్షంలోనే కర్ణాశ్వత్థామల సంవాదం ఇలా జరిగింది:

అశ్వత్థామ) 
రాజా ఇక నిశ్చింతగా నిద్రపోదువు గాని. ఈ రోజు భూమి కృష్ణుడు, పాండవులు లేకుండా అయిపోతుంది.

కర్ణుడు) 
చెప్పడం సులువే. చేయడమే కష్టం. నువ్వు చెప్పిన పనిని చేయగలిగినవారు కౌరవసైన్యంలో చాలామంది ఉన్నారులే. (నీకంత శ్రమవద్దు.) 

అశ్వత్థామ) 
అంగరాజా, తండ్రి పోయిన దుఃఖంలో అలా అన్నానే గాని, ఇతరవీరులను అవమానించడం నా ఉద్దేశం కాదు.

కర్ణుడు) 
ఓయీ మూఢా! దుఃఖంతో ఉంటే కన్నీరు వదలాలి, కోపం వస్తే యుద్ధరంగంలోకి ఉరకాలి. అంతే గాని, ఇటువంటి ప్రగల్భాలు పలుకరాదు.

అశ్వత్థామ) 
ఒరే రాధాగర్భభారభూతుడా! సూతాపసదుడా! నువ్వా నాకు ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో చెప్పేది? నీలా నేనెప్పుడూ యుద్ధరంగంనుండి పారిపోయి రాలేదే? నా ఆయుధం నీ ఆయుధంలా గురుశాపం పొంది నిర్వీర్యం కాలేదే? నీలా స్తోత్రపాఠాలు పలికే సూతకులంలో నేను పుట్టలేదే? కాబట్టి, నా క్షుద్రశత్రువులు నాకు చేసిన అపకారానికి నేను ప్రతీకారాన్ని అశ్రువులతో కాదు, అస్త్రంతోనే చేస్తాను.

కర్ణుడు) 
ఒరే వాచాలుడా! నా ఆయుధం నిర్వీర్యమో, సవీర్యమో గాని, నేనెప్పుడూ నీ తండ్రిలా ఆయుధాన్ని యుద్ధరంగంలో పక్కన పెట్టలేదు సుమా. 

మరొకటి కూడా చెబుతున్నాను. నేను సూతుడినా సూతపుత్రుడినా, ఎవరైతే నేమయ్యా? दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम्। ఒరే, నేను ఏ కులంలో పుడితేనేమిరా, పుట్టించింది ఆ భగవంతుడు. అందువల్ల నా పుట్టుకకు అతడే బాధ్యుడు. కానీ, పౌరుషం ఉన్నదే, అది మాత్రం నేను సంపాదించుకున్నది. అది నాకు పుష్కలంగా ఉన్నదిరా"
***
***

ఇలా ఎవరైనా (సకారణంగానో లేక నిష్కారణంగానో) ఒక వ్యక్తిని ఆక్షేపిస్తే ఆ వ్యక్తి కోపగించుకుని తనను ఆక్షేపించిన వ్యక్తిని కులం పేరుతో తూలనాడడం ఈనాటి మాట కాదు. 

ఈ వాగ్వాదం జరిగింది భట్టనారాయణమహాకవి వ్రాసిన వేణీసంహారం అనే నాటకంలో. ఆయన మనకు దాదాపు పదకొండువందల సంవత్సరాల పూర్వీకుడు. ఆనాటికే ఇటువంటి ఆక్షేపణలు తూలనాడడాలు ఉన్నాయన్న మాటేగా?
***

కానీ ఆ తిట్లు కాసేపు పక్కన పెడితే చూడండి, అశ్వత్థామ వినయం: 

"నేను దుఃఖంలో ఏదో అన్నానే గాని, ఇతరవీరులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు" అన్నాడు. 

అంటే, "నేనొక్కడే వీరుడిని కాను, నావంటి వీరులు ఇంకా చాలామంది ఉన్నారు." అని స్వయంగా అంతటి మహావీరుడై ఉండి కూడా వినమ్రతను కనబరిచాడు. 
***

కాని, ఈనాడు ముఖానికి రంగులు పూసుకుని కెమెరా ముందు తైతక్కలాడే ఒక మనిషి కూడా, 

మా పుట్టుకే వేరు, మా బ్రీడే వారు, మా వంటి వంశం లేదు, మాకు సాటి పోటీ ఎవరూ రాలేరు 

అని వాగుతుంటే భరించవలసి ఖర్మ పట్టింది మనకు. 

అలాంటి వారికి కర్ణుడు ఆనాడే ఒక జవాబు చెప్పాడు:


" - దైవాయత్తం కులే జన్మ మదాయత్తం తు పౌరుషమ్ -
నేను ఫలానా కులంలో పుట్టడం అనేది దైవం చేతిలో ఉంది. 
కానీ, 
పౌరుషం నిరూపించుకొనడం మాత్రం ఖచ్చితంగా నా చేతిలో ఉంది." 
***

అలాగే జరుగుతుంది. 
అలా జరిగిందని ఇతిహాసమూ చెప్పింది, 
చరిత్ర కూడా అలా జరగడాన్ని చాలాసార్లు ప్రత్యక్షసాక్షిగా చూసింది.

- ఎవ్వరూ తక్కువ వాళ్లు కారు -


బ్రహ్మవంశసముద్భూతుడైన ఉత్తానపాదుడు అనే ఒకానొక మహారాజు ఉండేవాడు. ఆయనకు సునీతి సురుచి అని ఇద్దరు భార్యలు ఉండేవారు. సునీతి కుమారుడు ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు.

ఉత్తానపాదునికి తన చిన్న భార్య అయిన సురుచి అంటే ప్రీతి ఎక్కువ. ఓ రోజు ఆయన ఉత్తముని ఒడిలో కూర్చుండబెట్టుకుని లాలిస్తున్నాడు. ఇంతలో అక్కడికి ధ్రువుడు వచ్చాడు. తాను కూడా తండ్రి ఒడిలో ఎక్కాలని ఆశ పడ్డాడు. కాని, సునీతి అడ్డుపడింది.

“ఒరే అబ్బాయీ, నువు రాజపుత్రుడవే కావచ్చు. కాని, నువు నా కడుపున పుట్టలేదు, కాబట్టి, తండ్రి ఒడిలో కూర్చోవాలనే నీకోరిక దుర్లభం పొమ్మం”ది.

న వత్స నృపతేర్ధిష్ణ్యం భవానారోఢుమర్హసి।
న గృహీతో మయా యత్త్వం కుక్షావపి నృపాత్మజః।।
నూనం వేద భవాన్ యస్య దుర్లభేऽర్థే మనోరథః।।
(శ్రీమద్భాగవతం.4.8.11-12)

“అంతగా తండ్రి ఒడిలో కూర్చోవాలని ఉన్నా, రాజసింహాసనం కోరుకుంటున్నా, నువు ఒక పని చెయ్. నువు పురుషోత్తముని ఆరాధించు, అతని అనుగ్రహంతోనే మరలా నువు నా కడుపున పుట్టు.” అని అహంకారంతో పలికింది.

పసివాడైన ధ్రువుడు కఱ్ఱదెబ్బ తిన్న పాములా రోషంతో బుసలు కొట్టాడు. తరువాత తన నిస్సహాయత తెలుసుకొని పెద్దగా రోదించాడు. సునీత కూడా ఈ విషయం తెలుసుకుని చాల బాధపడింది. కుఱ్ఱవానికి కర్తవ్యం బోధించింది.

ఆతిష్ఠ తత్తాత విమత్సరస్త్వమ్, ఉక్తం సమాత్రాపి యదవ్యలీకమ్।
(శ్రీమద్భాగవతం.4.8.19)

“నాయనా, ఆమె నీకు సవతి తల్లి అయినప్పటికీ, పురుషోత్తముని ఆరాధించమని నీకు సరైన మార్గనిర్దేశనమే చేసింది. కాబట్టి, ఆమెపై ద్వేషం పెట్టుకోక, ఆ పనిని చెయ్.” అన్నది.

ధ్రువుడు అలాగే చేశాడు. దయాళువైన నారదమహర్షి చెప్పిన ప్రకారం అద్భుతమైన తపస్సు చేశాడు. భగవంతుడు ఆ తపస్సును మెచ్చి ప్రత్యక్షమై ఆ ధ్రువుడు మనసులో కోరుకున్నదానిని మాత్రమే కాక, అంతకంటె ఉన్నతమైన స్థానాన్ని కూడా ప్రసాదించాడు.

ధ్రువుడు తండ్రి ఒడిని, సింహాసనాన్ని మాత్రమే పొందడం కాకుండా ద్రువమైన (స్థిరమైన) నక్షత్రమై నిలిచాడు.

ఇది, అందరికీ తెలిసిన ఒక సుప్రసిద్ధమైన కథ. ధ్రువుడు ఒక బాలభక్తుడని, పిల్లలందరూ అటువంటి భక్తిని కలిగి ఉండాలని బోధించి ఊరుకొనడంతో ఈ కథను పెద్దలందరూ కంచికి పంపేస్తారు. కాని ఆమాత్రంతో వదలిపెట్దదగిన కథా ఇది?
*

ఆనాడు ఉత్తానపాదుడికి ధ్రువుడు, ఉత్తముడు ఇద్దరూ సమానులే. ఐనప్పటికీ, తన మీద ఉత్తానపాదుడికి ఉన్న ప్రీతిని గ్రహించిన సురుచి న్యాయమైన ధ్రువుని కోరికను తిరస్కరించింది.

భగవంతుని దృష్టిలో బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు అనబడే వారందరూ సమానులే. (నేడు దళితులు అని పిలువబడుతున్నవారు కూడా శూద్రులే.)

కాని, కొందరు పైన చెప్పిన కథలో సురుచిలా అహంకరించి, “నువు మా ఇంట పుట్టలేదు కాబట్టి, నీకు ఫలానా పని చేసే అర్హత లేదు పో, ఫలానా మోక్షం వచ్చే దారి లేదు పో” అని అన్నారనుకోండి.

ప్రస్తుతసమాజంలో అలా అనిపించుకుంటే ఇతరులకు రోషం రావడం సహజమే - పసివాడైన ధ్రువుడికి సవతి తల్లి మాటలకు రోషం వచ్చినట్టు.

కాని, అలా అన్నంతమాత్రాన ధ్రువుడు రాజకుమారుడు కాకుండా పోలేదు. అలాగే, కూడా అటువంటి మాటను అనిపించుకున్నంత మాత్రాన ఇతరుల దివ్యత్వానికి వచ్చే లోటేమీ లేదు. అన్నవారు కూడా అలా అనేసి లేని గొప్పతనాన్ని తెచ్చుకున్నదీ లేదు.

నీకు అర్హత లేదు అని ధ్రువుడితో పలికిన సురుచిది ఎంతటి అజ్ఞానమో నీకు జ్ఞానార్హత లేదు, మోక్షార్హత లేదు అని బోధించేవారిది కూడా అంతే అజ్ఞానం.

“నీ పట్ల కఠినమైన మాటలు మాట్లాడిన ఆమె పట్ల ద్వేషం పెంచుకోకు” అన్న సునీతి ఉపదేశం ధ్రువునికి మాత్రమే కాదు, నేడు తిరస్కరణకు గురి అవుతున్నవారికి కూడా అంతే అవసరం.

పూర్వకాలంలో కూడా మాంసాన్ని అమ్మి జీవించే కులంలో కూడా ధర్మవ్యాధుడు అనే అసామాన్య జ్ఞాని ఉన్నాడని మహాభారతం చెప్పింది. బోయవాడై పుట్టిన కణ్ణప్ప కూడా భక్తావతంసుడయ్యాడని సాక్షాత్తు శంకరాచార్యులంతటి వారే శివానందలహరిలో సాక్ష్యం చెప్పారు.

కాబట్టి, “మనిషి పుట్టుక ఎక్కడ జరిగినా, అది అతడి జ్ఞానసాధనకు గాని, ఉన్నతస్థానసాధనకు గాని ఎటువంటి అడ్డంకి కాబోదు” అని ధ్రువుని కథ ద్వారా తెలిపి శ్రీమద్భాగవతపురాణం మనకు స్ఫూర్తిని ఇస్తుంది.

నేడు మన రాజ్యాంగం అందరూ సమానులే అంటుంది. ఉన్నతస్థానానికి చేరేందుకు అందరికీ అవకాశాలను ఇస్తోంది. ధ్రువునిలా పట్టుదల కలిగినవారు ఎవరైనా తమ అద్భుతకృషితో తాము కోరిన స్థానాన్ని పొందవచ్చు అనడంలో సందేహం లేదు.

జన్మ చేత గాని, బలం చేత గాని, ధనం చేత గాని, అహంకారాన్ని పొంది ఇతరులను తిరస్కరించేవారికి మన పురాణాలు ఇటువంటి గుణపాఠాలను చెబుతూ ఉంటాయి. ఇలా మనకు ఆత్మవిశ్వాసం కలిగించడం మన మతం గొప్పదనం!

Monday, 23 July 2018

సర్వః సగంధేషు విశ్వసితి

ఫలకాలు చెప్పే పాఠాలు – 4
కాళిదాసమహాకవి శకుంతల నోట పలికించిన మాట...
“సగంధ” అనే పదానికి జ్ఞాతి అనే అర్థం చెబుతుంది వాచస్పత్యం.
“ప్రతి ఒక్కరూ తమవారినే విశ్వసిస్తారు.”
నిజమే కదా, అది సహజం.

It is an animal’s instinct.
Birds of the same feather flock together.
Like likes Like.

అది సరే, “తమవారు” అని ఎవరైనా సరే, కొందరిని ఎలా గుర్తుపడతారు?

ప్రాథమికంగా - తాము తినేటటువంటి తిండినే తినే వారిని తమవారని గుర్తుపడతారు...

అర్థం చేసుకొనేందుకు ఆధునికశిక్షణ పొందిన మన మనసు నిరాకరించినా అది చాలవరకు నిజం. 

విస్తారమైన ఆఫ్రికా అడవుల్లో నేషనల్ జాగ్రఫిక్ ఛానెల్ వాళ్ళు జంతువుల మీద తీసిన డాక్యుమెంటరీలు చూడండి...

చిన్నపాటి జింకలు ఒక చోట గడ్డిమేస్తూ ఉంటాయి. వాటికి పక్కనే మరింత పెద్ద కొమ్ముల జింకలు కూడా గడ్డిమేస్తూ ఉంటాయి. ఈ పక్క జీబ్రాలు మేస్తుంటాయి. ఆపక్క అడవి బర్రెలు, దున్నలు మేస్తుంటాయి. ఇవన్నీ వేరు వేరు జాతుల జంతువులు. అయినా ఒకదానిని చూసి మరొకటి భయపడవు. ఇంతలో అక్కడికి వీటన్నింటికన్నా బలమైన ఏనుగుల మంద వస్తుంది. వాటిని చూసి కూడా ఇవేవీ భయపడవు. మరికాసేపట్లో వీటన్నింటికన్నా పొడవైన జిరాఫీలు వస్తాయి. అప్పుడు కూడా ఇవేవీ భయపడవు. ఎందుకంటే, వీటన్నిటికీ ఆహారం సమానమైనదే. గడ్డి, ఆకులు, కొమ్మలు. 

ఇంతలో అక్కడికి ఒక చిన్న నక్క వచ్చిందనుకోండి...
అది కనబడకున్నా పొదలమాటున దాక్కున్నప్పటికీ దాని వాసన తగిలిన వెంటనే జింకలలో అలజడి ప్రారంభమౌతుంది. అవి ప్రశాంతంగా తినలేవు. కంగారుగా దిక్కులు చూస్తాయి. అటూ ఇటూ పరుగెడతాయి. అది సగంధమైనది (సమానమైన వాసన కలిగినది) కాదన్న మాట. సగంధ అనే పదాన్ని మనం ఇక్కడ ఇలా అర్థం చేసుకోవచ్చు.

సరే, ఎందుకు వాటికా భయం అంటే, ఆ నక్క ఆహారం గడ్డి కాదు, వాటికి ఉడతలు తొండేబిక్కలు దొరికితే సరే సరి, లేకుంటే తమలో ఒకదాన్ని ఆ నక్క లాక్కుపోయి పీక్కు తింటుందని ఆ జింకల భయం. ఏ చిరుతపులో వచ్చిందంటే ఇక జీబ్రాలకు బర్రెలకు కూడా భయమే. ఇక సింహాలమంద వచ్చిందంటే ఏకంగా జిరాఫీలు అడవిదున్నలు ఏనుగులలో కూడా భయం కలుగుతుంది. అవి గుంపులు గుంపులుగా దాడి చేస్తూ మొదట తమ చిన్నారులను, తమలోని బలహీనులను ఎత్తుకుపోతాయని వాటికి తెలుసు. సాధ్యమైనంతవరకు పారిపోయి తప్పుకునేందుకే అవి ప్రయత్నిస్తాయి. కొన్ని నిస్సహాయంగా వాటికి దొరికిపోతాయి. కొన్ని రోషంతో ఎదురు తిరిగి, వాటినే చంపేసిన సంఘటనలు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. 

సరే – ఈవిధంగా - ప్రాథమికంగా - తమకంటే భిన్నమైన ఆహారం కలిగినవాటిపై నమ్మకం కలిగి ఉండడం జంతువులలో కుదరదు. మనుషులలో కూడా పూర్వం ఇటువంటి మనస్తత్వం ఉండేదేమో. కాని, రాన్రాను అటువంటి జంతులక్షణాలు తగ్గి ఉంటాయి. 

కాని, ఇప్పటికి కూడా - తాము చేసేటటువంటి పనినే చేసేవారిని, తాము ధరించే దుస్తులవంటి దుస్తులనే ధరించేటటువంటివారిని, తమవంటి అలవాట్లే కలిగినవారిని, తాము పాటించేటటువంటి ఆచారాలనే పాటించేవారిని తమవారిగా మనుషులు సులువుగా నమ్మేస్తారు. వారిని తమ కులస్థులుగా, తమ మతస్థులుగా పరిగణించి వారితో సన్నిహితంగా మెలగడం చూస్తూనే ఉన్నాం. విద్య సార్వజనీనమై ఒకరి భాషను మరొకరు అర్థం చేసుకొనగలిగే స్థాయికి వచ్చాక మానవులందరూ సమానులేనన్న భావన బలపడింది. 

అయినప్పటికీ సమానమైన ఆలోచనలు కలిగినవారు, సమానమైన వ్యవహారాలు నడిపేవారు, సమానమైన కష్టనష్టాలు కలిగినవారు కులమతాల తేడా లేకుండా కలిసి ఒక సమూహంగా ఉండటం ఈ రోజుల్లో చూస్తున్నాము. ఇక్కడ కూడా మరొక అర్థంలో సగంధత కనిపిస్తోంది. ఇక్కడ గంధము అంటే – వాసన – అంటే - ఈ జన్మలోనో పూర్వజన్మలోనో అబ్బిన సంస్కారాలు కొందరిని పరస్పరం మిత్రులను చేస్తాయి అన్నమాట. 

మృగా మృగైః సంగమనువ్రజంతి.
గావశ్చ గోభిః తురగాస్తురంగైః।
మూర్ఖాశ్చ మూర్ఖైః సుధియః సుధీభిః
సమానశీలవ్యసనేన సఖ్యమ్।। 

జింకలు జింకల తోనే కలిసి తిరుగుతాయి. గోవులు గోవులతోనే కలిసి తిరుగుతాయి, గుఱ్ఱాలు గుఱ్ఱాలతోనే కలిసి తిరుగుతాయి. మూర్ఖులు మూర్ఖులతోనే కలిసి తిరుగుతారు. పండితులు పండితులతోనే కలిసి తిరుగుతారు. సమానశీలము, సమానమైన వ్యసనాలు (అంటే కష్టాలు, బాధలు కూడా) కలిగినవారి నడుమ స్నేహం ఏర్పడుతుంది అని పెద్దల మాట. 

“స వానరేంద్రో హృతరాజ్యదారః స రాఘవేంద్రో హృతరాజ్యదారః।
ఏవం తయోరధ్వని దైవయోగాత్ సమానశీలవ్యసనేషు సఖ్యమ్।।“


“ఆ వానరేంద్రుడికి ఆ రాఘవేంద్రుడికి నడుమ స్నేహం కలిసిందన్నా కారణం ఒకటే – వారిరువురి కష్టాలు సమానమైనవి కాబట్టే!” - అని ఒక కవి చమత్కరించాడు. ఇరువురూ రాజ్యం కోల్పోయారు, ఇరువురి భార్యలూ అపహరింపబడ్డారు కదా అంటాడాయన.

ఏదేమైనా, అప్పటికీ, ఇప్పటికీ మనవారు అనేవారిని మనం విశ్వసిస్తాం. 

భారతదేశంలో ఉంటున్నాడనే ఒకే ఒక్క కారణంగా పాకిస్తాన్ని పొగుడుతూ భారత్ ను సవాలు చేస్తున్నా ఓ ఫరూక్ అబ్దుల్లా గాడిని చూసీ చూడనట్టు వాడి మాటలు వినీ విన్నట్టు ఉంటున్నాం కదా. 

ఒట్టు!

అందుకే #చందమామ కథలు చదవమని చెప్పేది!

అనగనగా ఓ రాజు. తగూపడేవారందరికీ తీర్పు చెప్పేకి ఆయనకి సమయం సరిపోవట్లేదు. "ఎలారా బగువంతుడా" అనుకుంటాంటే ఒక మహర్షి వచ్చి ఒక పెద్ద గండ కత్తెర ఇచ్చినాడు.

"ఏమిటికిది మహర్షీ?" అంటే
"తగూపడేవాళ్లని కత్తెర మద్దెలో సేతులు పెట్టి పెమాణం సెయ్యమనండి, ఎవడు అబద్దమాడితే వాడి సెయ్యిని ఇది కత్తిరించేస్తాది" అన్న్యాడు.

దాని సంగతి జనాలకి తెలిసి అసెత్త పెమాణాలు సేసేకి బయపడినారు. అట్లా అదొచ్చినంక తగూలన్నీ ఆగిపొయినై. రాజు హాయిగా కంటినిండా నిద్రపోతుణ్ణ్యాడు.

అయినా ఒగు దినుము ఒగు తగువొచ్చ. 

"నేనీయప్పకి అప్పు ఇచ్చినా. తిరిగీమంటే ఇచ్చేసినా గదా అంటాడీయప్ప" అని మొదుటి పార్టీ అంటాడు.

"అవును, ఆయప్పకీయాల్సింది ఆయప్పకిచ్చేసినా" అంటాడు రెండో పార్టీ.

"ఇంగ లాబం లేదు కత్తిరి నడుమన సెయ్యి పెట్టి పెమాణం సెయ్యండిద్దరూ" అని రాజు ఆదేశమిచ్చినాడు.

ఒగుటోవాడు పెమాణం చేశ. సెయ్యి తెగక పాయ. 

ఇంకేమి, 
"ఉరే ‌రెండో పార్టీ! నువు చెప్పింది అబద్దము గదా? ఆయప్ప నుంచి తీసుకున్న అప్పు ఆయప్పకిస్తావా లేదా?" అని రాజు బెదిరిచ్చ.

"నేనిచ్చేసినా రాజా" అని రెండోపార్టీ మొత్తుకొన్న్యాడు.

"అట్లైతే నువు గూడా పెమాణం సేస్తావా మడి?"

"సేస్తా రాజా!"

"ఉరే రెండో పార్టీ! అన్నాయెంగా నీ సేతులు నరికిచ్చుకుంటావురా!" అనె రాజు జాలిపడి.

"నేనబద్దమాడితే గద రాజా నా సేతులు పొయ్యేది!" అనుకుంటా రెండోపార్టీ లేశ.

"రోంత ఈ కట్టి పట్టుకోప్పా" అని తన సేతికట్టిని మొదటి పార్టీకిచ్చి, కత్తిరి మద్దెలో సేతులు బెట్టి పెమాణం జేశ. "నేను ఈ మొదటిపార్టీకి బాకీ తీర్చేసినాను" అంజెప్ప్య. 

అయినా గాని కత్తిరి ఊరికే ఉండ్య. ఆయప్ప సేతులు కత్తిరీకప్యా. అందురూ ఆచ్చెర్యపాయిరి. 

"రెండు పార్టీలలో ఏదోక పార్టీ అబద్దమాడినట్లే గదా? మడి ఆ కత్తిరి మహిమ కలిగుంటే ఎవరో ఒకరి సేతుల్ని కత్తిరీయల్ల గదా? అట్లా గాలేదంటే ఈ 
కత్తిరిలో మహిమ లేకున్నెట్లే గదా?" అని రాజుకి మంత్రికి జనాలకీ అందరికీ అనుమానమొచ్చ. "మహర్షీ లేదు, మహిమా లేదు తీ, అంతా సుళ్లు" అనబట్రి.

ఈ సంగతి మహర్షికి తెలిశి దడాన వొచ్చిడిశ. రెండు పార్టీలని మళ్లీ పెమాణం చెయ్యమనె. వాళ్లు మళ్లీ అట్లే సేసిరి. అప్పుడా మహర్షి రెండో పార్టీ ఆయప్ప మొదటి పార్టీకిచ్చిన సేతికట్టి తీసుకుని ఇరగ్గొట్టమన్య. రాజబటులు యిరగ్గొట్రి. 

ఆ సేతికట్టి నడమన డొల్ల ఉండ్య. దాంట్లోంచి రెండోపార్టీ మొదటిపార్టీకీయాల్సిన బాకీ దుడ్లు కింద పడ్య. రాజూ మంత్రీ జనాలూ ఆచ్చెర్యపోయిరి. రెండోపార్టీ సిగ్గుతో తలకాయ వొంచుకొనె. 

"ఏమపా ఇప్పుడు మళ్లీ చేస్తావా పెమాణం?" అని అడిగినాడు మహర్షి రెండో పార్టీని. వాడు బయపడి మహర్షి కాళ్లమింద పడె.

మహర్షి సరేలెమ్మని "రాజా నా కత్తిరి నాకిస్తే నే కొండబోతా"ననె. 

"ఏమిటికి మహర్షీ అది మహిమ కలిగిందే కదా" అనె రాజు.

"దానికి మహిమ ఉణ్ణ్యాగాని ఏమి లాబం? మీ మనసుల్లో దానిమింద రోంతన్నా యిశ్వాసం లేకపాయ. ఇంక మీదగ్గర అది వుండేది పూరా దండగ" అంజెప్పి మహర్షి ఆ కత్తిరిని అట్లే కొండబాయ.

***
అదీ కథ!
***

కలియుగంలో కూడా రెండోపార్టీ లాంటి మనుషులు పుడతారు. అక్రమంగా తరతరాలకు సరిపడేంత సంపాదిస్తారు. కాని, రూపాయి కూడా మేము అక్రమంగా సంపాదించలేదు అని నిర్భయంగా దీపాలాపి "పెమాణాలు" సేస్తారు. వాళ్లకేమీ కాదా అని అమాయికులు ఆశ్చర్యపోరాదు.

వాళ్లు సంపాదిచ్చుకున్న భూములు బంగ్లాలు కానుకలు రకరకాల ప్రతిఫలాలు టెక్నికల్‌గా రూపాయి కాదు. మణుగుల కొద్దీ బంగారం, వజ్రాభరణాలు ఎట్సెట్రా ఎట్సెట్రా కూడా అంతే. ఒకవేళ భవిష్యత్తులో కోర్టులో న్యాయమూర్తులు వీటిని కూడా రూపాయలక్రిందే లెక్కేయాలి అని తీర్పు ఇచ్చినా అది అసత్యప్రమాణం కాబోదు. ఎందుకంటే అవన్నీ వారి బినామీల పేరిట ఉంటాయి గాని పెమాణం చేసినవారి పేరిట ఉండవు కాబట్టి.

ఈ నిజాలు నిరూపించడానికి ఇప్పుడు మహర్షులు లేరు. రెండోపార్టీ మనుషులకు అండగా మీడియా అధిపతులు మాత్రం ఉంటారు.

పిచ్చుకలు



ఈ పిచ్చుకలకు అద్దాలంటే ఎంత మోజో!

అద్దంలో కనబడేది ముద్దు ముద్దుగా తమ ప్రతిబింబాలలేనని తెలుసుకొని తమను తాము ముద్దుపెట్టుకొనేందుకే అద్దాలను టక టకామంటూ ముక్కులతో పొడుస్తుంటాయనుకుంటాను.

కాదేమో, అద్దంలో కనిపించేది శత్రువు అనుకొని దాన్ని చీల్చి చెండాడాలనే కసితో అద్దాన్ని అలా పొడుస్తుంటాయి అనిపిస్తూ ఉంటుంది ఇంకోసారి. అలా కాదులే, ఈ పిచికలు మరీ బావిలోకి దూకిన సింహమంత మూర్ఖమైనవి కాదు, బొత్తిగా అమాయికప్ప్రాణులు.

సందు కనిపిస్తే చాలు, వాసాల్లో గోడల్లో గూళ్లు కట్టేసి సంతానం కనేస్తాయి. ఏమిటీ గడ్డీ గాదం, రెట్టలూ అని ఏమాత్రం విసుక్కోని పల్లెటూరి జనాలే వీటికి మిత్రులు, రక్షకులు.

ఇంటిముందు కాళ్లు కడుక్కునే బండల ఎగుడుదిగుళ్లలో నిలిచిన నీటిలోనే మునకలేస్తూ రెక్కలతో నీటిని విదిలిస్తూ మొయ్యి కడుకునే శుచిగల ప్రాణులు. మొక్కలకు నీళ్లు పోస్తే అవి భూమిలోనికి ఇంకిపోకముందే ఆత్రంగా వచ్చి ఆ నీటిని గ్రోలే అల్ప ప్రాణులు. ఇంటి ముందర కట్ట మీద కుసోని పిల్లోళ్లు బొరుగులూ పప్పూ బెల్లాలూ తింటూంటే మరి మాకో అన్నట్టు వారి దగ్గరకొచ్చి వారు పెట్టేదంతా నున్నగా ఆరగించే బాల్యమిత్రులు.

ఇవి ఎప్పుడూ పార్లమెంటు సభ్యుల్లాగా గోలగోలగా అరుస్తాయి కాని, వీటి కిచకిచ శబ్దాలు ఆ పార్లమెంటు సభ్యుల అరుపుల్లా విద్వేషపూరితాలు, అసభ్యాలు, అసూయాసహితాలు, అర్థరహితాలు ఎంతమాత్రం కావు. ఇవి వెల్‌లోకి చొరబడి పనికిమాలిన నినాదాలు చేయకుండా కరెంటు తీగలమీద బుద్ధిగా వరుసగా కూర్చుని తమ సంఖ్యాబలాన్ని ప్రదర్శిస్తాయి కూడా. అందుకే ఎక్కడైనా ప్రయోజనరహితమైన ధ్యేయరహితమైన అల్లరి జరిగితే #కాకిగోల అంటారే గాని, పిచ్చికల గోల అని ఎవ్వరూ అనరు.

పల్లెటూరి ఇండ్లలో నిలువుటద్దాలుండగా మనుషులున్నారనే భయం కూడా లేకుండా గుంపులు గుంపులుగా వచ్చి ఆ అద్దాలముందు అవి చేస్తూ ఉండిన రకరకాల విన్యాసాలు నాకు ఆనందకరమైన జ్ఞాపకాలు.

ఏ ఊరిలో పిచ్చుకలు ఉన్నాయో, ఆ వూరిలో ధాన్యసంపదకు కొదవ లేదు అని అర్థం. దేశంలో ప్రతి గ్రామంలోనూ పిచ్చుకలు మందలు మందలుగా ఉండాలని కోరుకుందాం.

వేసవి రాబోతోంది.
ఇంటి బయటనో, మేడ మీదనో ఒక మట్టి పాత్రనో లేదా మరో అల్యూమినియం పాత్రనో పెట్టి ప్రతిరోజూ ఆ పాత్రలో నీళ్లు పోస్తూ ఈ పక్షిజాతుల పట్ల మన మైత్రీభావాన్ని ప్రకటిద్దాం.

పిల్లలు కాకమ్మ పిచికమ్మ కథలను తరతరాలుగా వింటూనే ఉండాలి!

రసికుడు - నీరసికుడు

“హనుమంతుడు రసికుడు” అన్నారు మిత్రుడు ఒకాయన తన ఫేస్ బుక్ గోడపై.

కొందరు మెచ్చుకున్నారు – కొందరు నొచ్చుకున్నారు – ఆ మిత్రుని మాటల్లో చెప్పాలంటే – కొందరు తిట్టిపోశారు.

వారి వారి ప్రతిస్పందనలు వారు “రసిక” అనే పదాన్ని అర్థం చేసుకున్న పద్ధతిని బట్టి ఉన్నాయి. 


“రసికుడు” అనే పదం తప్పుడు పదం ఏమీ కాదు. రసాస్వాదన చేయగలిగినవాడు అని అర్థం. కాని, తెలుగు సినిమాలు చాలా పదాలను దుర్వినియోగం చేసినట్టుగానే “రసికుడు” అనే పదాన్ని కూడా దుర్వినియోగం చేశాయి. శృంగారలోలుడు అనే అర్థాన్ని ప్రేక్షకుల మెదళ్లలో కూరి కూరి వదిలాయి.

శృంగారంలో మాత్రం తప్పు ఏముంది? 
నవరసాలను పేర్కొనే శ్లోకంలో శృంగారానికే మొదటి స్థానం ఇచ్చారు.

శృంగారహాస్యకరుణరౌద్రవీరభయానకాః.
బీభత్సాద్భుతశాంతాశ్చ నవ నాట్యే రసాః స్మృతాః. – అన్నారు.

మహాకావ్యాలలో అంగిరసాలుగా ఉండదగినవి - శృంగారము లేదా వీరము. మిగిలినవి అంగరసాలు మాత్రమే అనేశారు పెద్ద పెద్ద సాహిత్యశాస్త్రవేత్తలు కూడా. కాబట్టి, శృంగారపురుషుడై ఉండటం తప్పేమీ కాదు.

కాని, అదే సాహిత్యశాస్త్రవేత్తలు రసాభాసలను కూడా పేర్కొన్నారు. అంటే అవి రసం లాగా అనిపిస్తాయేమో కాని, నిజానికి రసాలు కావు అని అర్థం. 

వీరరసం ప్రధానమైనదే – కాని పడకగదిలో కూర్చుని “ఆ శత్రువును ఇలా ఎదుర్కోవాలి, ఈ శత్రువును ఇలా దునుమాడాలి” అని వీరాలాపాలు చేస్తే అది రసాభాస. 

అలాగే శృంగారరసం కూడా ప్రధానమైనదే – కాని, యుద్ధరంగంలో విజృంభించవలసిన వేళ ప్రియురాలి చెంతకు చేరి సరససల్లాపాలు ఆడాలనిపిస్తే మాత్రం అది రసాభాస.

శత్రువును పరాభవిస్తే – అది వీరరసం. కాని, గౌరవింపదగిన పెద్దలను పరాభవిస్తే అక్కడ వీరరసాభాస మాత్రమే. అక్కడ ఆ పని చేసినవాడిమీద జుగుప్స కలుగుతుంది. అంటే అది బీభత్సరసం ఔతుంది.

సీతారాముల మధ్యనో రాధాకృష్ణుల మధ్యనో ఉన్న అనురాగాన్ని వర్ణిస్తే అది శృంగారరసం అవుతుంది. ఆ శృంగారం కూడా రెండు రకాలు. విప్రలంభశృంగారం అని, సంయోగశృంగారం అని. ఎడబాటులో ఉన్నపుడు – విప్రలంభం, పరస్పరసముఖత ఉన్నపుడు సంయోగం అన్నమాట. 

భవభూతి వ్రాసిన ఉత్తరరామచరితంలో సీతారాముల నడుమ విప్రలంభశృంగారం దేదీప్యమానమైనది.

సంయోగశృంగారవర్ణనలు కలిగిన కావ్యాలకు కూడా కొదవ లేదు. 

ఇట్లా కేవలం శృంగారాన్ని మాత్రమే కాదు, నవరసాలను చక్కగా పండించిన కావ్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. 

రసాభాస కాకుండా వాటిని సర్వజనమనోరంజకంగా నడిపిన కవులను భర్తృహరి ప్రశంసించాడు కూడా.

“జయంతి తే సుకృతినో
రససిద్ధాః కవీశ్వరాః,
నాస్తి యేషాం యశఃకాయే
జరామరణజంభయమ్” - అన్నాడు. 

ఈ నవరసాలన్నీ యథాయోగ్యంగా భారతీయులచేత ఆదరింపబడ్డాయి. కాబట్టి, భారతీయులు రసహృదయులే (రసికులే) కాని నీరసహృదయులు కారు. అందులో సందేహం అక్కరలేదు, అసహ్యించుకొనదగినది కూడా ఏమీ లేదు.

కాని, 
రసికత్వం ఉండవలసింది కేవలం కవులలోనే కాదు, చదివే పాఠకులలో కూడా ఉండాలి. అప్పుడే ఆ కవిత్వానికి రాణింపు. అప్పుడే ఆ కవిత్వానికి మెప్పుకోలు. 

“ఓ చతురాననుడా! మిగిలిన కష్టాలను వందలకు వందలుగా, యథేష్టంగా, మా నుదుటన వ్రాసుకో, సహిస్తాము. కాని, సమయసంగతిసందర్భాలను పట్టించుకోకుండా మా కవిత్వాన్ని అపార్థం చేసుకొనేవారికి, లేదా ఏమాత్రం అర్థం చేసుకోలేని నీరసహృదయులకు మా కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యం మాత్రం మా నుదుటన వ్రాయబోకయ్యా" – అని కవులు బ్రహ్మను పరిపరివిధాల వేడుకున్నారట.

"ఇతరతాపశతాని యదృచ్ఛయా విలిఖ
తాని సహే చతురానన.
అరసికేషు కవిత్వనివేదనం శిరసి
మా లిఖ మా లిఖ మా లిఖ."

ఇలా ఎందుకు వేడుకొనడం అంటే – 
ఈ నీరసహృదయులు చక్కని కవిత్వానికి కూడా వంకలు పెడతారు. అపహాస్యం చేస్తారు. విపరీతార్థాలను కల్పిస్తారు. అలా చేసి, ఆయా కవుల పట్ల, కవిత్వం పట్ల విముఖత్వం కలిగించినా పరవాలేదు. 

కాని, 
ఈ అరసికులు ఆయా కావ్యాలలో ఉన్నతాదర్శాలకు ప్రతీకగా తాము నిలిపిన పాత్రల పట్ల కూడా వైముఖ్యం కలిగిస్తారు. అందుకని.

భారతీయకావ్యశాస్త్రసంప్రదాయంలో అందరి చేత ఎంతగానో గౌరవింపబడే అభినవగుప్తాచార్యులు అని ఒకానొక మహాపండితుడు (క్రీస్తుశకం 950 సం.) ఉన్నారు. ఆయన సహృదయుడు అనే పదం వాడారు. సహృదయుడు అంటే కవితో సమానమైన హృదయం కలిగినవాడు – అంటే – కవి హృదయాన్ని అర్థం చేసుకొనగలిగిన వాడు అని అర్థం. అతడే రసికుడు. అంటే - కవిహృదయాన్ని అర్థం చేసుకొనలేని వాడు నీరసికుడు అన్నమాట!

"సీతను వెదుకుతూ రావణుని అంతఃపురానికి వెళ్లిన హనుమంతుడు అక్కడ నిద్రావస్థలో ఉన్నటువంటి, చెదిరిన వస్త్రాభరణాలతో ఉన్నటువంటి యువతులను చూశాడు" అన్నంతవరకు ఏ ఇబ్బంది లేదు. అందులో అసహజం అయినది ఏమీ లేదు. 

కాని, 
అక్కడ హనుమంతుని కూడా అతి సామాన్యుడైన ఒక చంచలహృదయునిగా భావించి “ఆహా! ఎంతటి లక్కీ ఫెలో రా!” “ఆహా ఎంతటి రసికుడురా!” అని పాఠకులు కామెంట్లు చేస్తే మాత్రం నిస్సందేహంగా అది వారి నీరసికత్వమే.

ఆ సమయంలో రాముని కార్యం పూర్తి చేయాలి అనే సుస్థిరమైన ధ్యేయం తప్ప మరేమీ హనుమంతుని మనసులో లేదు. 

సీతకోసం బయలుదేరిన హనుమంతునికి దారిలో మైనాకుడు ఎదురై విశ్రాంతి తీసుకోమన్నాడు. హనుమంతుడు నిరాకరించాడు. నాగమాత సరమ తన నోటిలోనికి ప్రవేశించకుండా హనుమంతుడు ముందుకు పోలేడని సవాలు చేసింది. హనుమంతుడు చాకచక్యంగా ఆమె నోటిలోనికి ప్రవేశించి కూడా సురక్షితంగా బయటకు వచ్చాడు. తనను ఆహారంగా చేసుకోదలచిన సింహికను భుజబలంతో నిర్జించాడు. లంకిణిని ఒక్క పిడికిటిపోటుతో పడగొట్టాడు. లంకలో ఎవరి కంటనైనా పడితే పని చెడిపోతుందని భావించి అంగుష్ఠమాత్రుడై సంచరిస్తూ సీతను వెదుకుతున్నాడు. అదే ప్రయత్నంలో రావణుని అంతఃపురంలో కూడా వెదికాడు. అక్కడ పైన చెప్పినట్లు వివిధ అవస్థలలో నిద్రిస్తున్న స్త్రీలను చూశాడు. అయినా అతని మనస్సులో ఎటువంటి వికారమూ కలుగలేదు. వీరెవరూ సీత కాదు అని నిశ్చయించుకుని తన అన్వేషణను కొనసాగించాడు. ఇన్ని పనులు చేస్తూ కూడా అతడు తన అలసటను, ఆకలిదప్పులను ఏమాత్రం లెక్కచేయలేదు. 

ఇంతవరకు, ఈ విధంగా హనుమంతుని కార్యసాధకత్వాన్ని పాఠకుల మనసులో ముద్రవేయడానికి వాల్మీకిమహర్షి సుందరకాండలో 11 సర్గలను, 621 శ్లోకాలను వెచ్చించి, గొప్ప ప్రయత్నం చేశాడు.

కాని, ఆ మహాకవి ప్రయత్నాలకు చెదగొడుతూ, ఆ ప్రయత్నాలను చెడగొడుతూ, ఆయన ఉద్దేశ్యానికి వ్యతిరేకంగా “రావణాంతఃపురంలో ఆ విధంగా ఉన్న స్త్రీలను చూసిన హనుమంతుడు రసికుడే (శృంగారపురుషుడే) సుమా” అని వ్యాఖ్యానిస్తే మాత్రం వెగటు పుడుతుంది. 

మహోన్నతమైన హనుమంతుని వ్యక్తిత్వాన్ని విస్మరించి, అతనికి లేని దోషాన్ని ఆపాదించడంవల్ల హాస్యరసం పుట్టదు. జుగుప్స అనేది స్థాయిభావంగా కలిగిన బీభత్సరసం పుడుతుంది.

ఆహా, అలాగేం కాదు, కవి హృదయాన్ని నేను అర్థం చేసుకున్నాను, అక్కడ ప్రతిపాదింపబడింది శృంగారరసమే తప్ప వీరరసం కాదు అని దబాయించే అవకాశం కూడా ఉంది. 

కాని, ఏ రసాన్నైనా వ్యక్తపరిచే కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని అనుభావాలు అంటారు. “అనుభావో వికారస్తు భావసంసూచనాత్మకః” – అని దశరూపకం అనే గ్రంథంలో ధనంజయాచార్యులు (క్రీస్తుశకం 975 సం.) చెప్పారు. 

తాత్కాలికమైన నిశ్చేష్టత, తాను ఉన్న పరిసరాలను విస్మరించడం, పులకింతలు, స్వేదం, ముఖకవళికలలో మార్పు, దొంగచూపులు, మాటల్లో తడబాటు – ఇటువంటివి అన్నమాట. 

సుందరకాండలో ఆ స్త్రీలను చూసిన హనుమంతుడిలో ఇటువంటి వికారభావాలు ఏమీ కలుగలేదు. అలాగే, శృంగారరసాన్ని సూచించే కొన్ని సంచారి భావాలు – హర్షము, ఈర్ష్య, మోహము – వంటివి కూడా హనుమంతునిలో ఈషణ్మాత్రం కలుగలేదు. అందువల్ల అక్కడ హనుమంతుడు శృంగారపురుషుడు అని చెప్పడం సమంజసం కాదు. 

వీరిలో సీత లేదు అని నిశ్చయించుకుని, మరెక్కడ ఉందో వెతకాలి అని భావిస్తూ తక్షణమే అక్కడనుండి వెడలిపోయాడు. కాబట్టి, ఇక్కడ కూడా హనుమంతుని కార్యసాధకత్వమే – ఎటువంటి ఆటంకాలకూ లొంగని ఉత్సాహమే – కవి చేత ప్రతిపాదించబడింది. అదే వీరరసం. 

ఇలా కవిహృదయాన్ని అర్థం చేసుకోకుండా, మాకు తెలిసిందే రసం అంటే - మా ఇంట్లో, కిటికీలు మూసిన గదిలో వెలుతురు లేకపోవడానికి కారణం ఆ సూర్యుడే అని నిందించినట్లు ఉంటుంది.

అందుకే ఇలాంటివారికి కవిత్వం వినిపించే దౌర్భాగ్యం మా నుదుటన వ్రాయకు దేవుడోయ్ అని ఆ కవులు మొత్తుకున్నది.

మనకుడబ్బు అవసరమే, అలాగే చెప్పులు కూడా అవసరమే. కాని, దేనిని ఎక్కడ పెట్టాలో దానిని అక్కడే పెట్టాలి. ఇంటి బయట చెప్పుల స్టాండులో డబ్బూ నగలూ పెట్టం. అలాగే, బ్యాంకులో లాకర్ తీసుకొని అందులో మన చెప్పులు దాచుకోం. నాకు ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది అని వీధిలో ఎగ్జిబిషన్ పెట్టం. అలాగే చెప్పులను జేబులో పెట్టుకుని తిరగం. 

ఈ విధంగా ప్రతిదానికి నిర్దేశింపబడిన లోకరీతి ఒకటి ఉంటుంది. దానినే ఔచిత్యం అంటారు. దానినే మర్యాద (హద్దు) అంటారు. ఔచిత్యంపాటించకుంటే లోకంలో నవ్వులపాలు అవుతారు. మర్యాద పాటించకుంటే లోకం ఆ మనిషిని దూరంగా పెట్టే ప్రమాదం ఉంది.

కాబట్టి, శృంగారరసాన్ని ఆస్వాదించేందుకు తగిన కావ్యాలు బోలెడున్నాయి. అక్కడ నిరభ్యంతరంగా ఆస్వాదించుకోవచ్చు.  కృష్ణుడు నాయకుడుగా కలిగిన ఒక శృంగారకావ్యాన్ని చూపి చూశారా కృష్ణుడు ఎంతటి రసికుడో? అంటే ఏ గొడవా ఉండదు. కాని, యుద్ధరంగంలో అర్జునునికి భగవద్గీతను బోధించే కృష్ణునిలో శృంగారపురుషత్వం చూస్తే అది రసాభాస.  అలా చూసేవాడు తింగరివాడు. 

అలాగే, సుందరకాండలో హనుమంతుని లోకోత్తర-ఉత్సాహాన్ని – అంటే వీరరసాన్ని – కవి ప్రతిపాదిస్తూ ఉండగా అక్కడ ఆ వీరరసాన్ని ఆస్వాదించకుండా హనుమంతుడిని శృంగారపురుషుడని కామెంటు చేయడం వల్ల రసాభాస జరగక మానదు. అదే జరిగింది కూడా.

కాబట్టి మనం కవిహృదయాన్ని తెలుసుకుని రసికులం అవుదాం – కవి హృదయాన్ని పెడదారి పట్టించి నీరసికులం కాకుండా ఉందాం. 

ఇదంతా మా మిత్రుని పోస్టులో, కామెంట్లలో పెట్టదగినంత చిన్న విషయం కాదు కాబట్టి, నా గోడ మీద ప్రత్యేకమైన పోస్టుగా వ్రాయవలసి వచ్చింది.

ఇతి శమ్.

No offending Comments Please...

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...