Saturday 28 July 2018

కులము - పౌరుషము


తన కుమారుడు యుద్ధరంగంలో చనిపోయాడని మాట యుధిష్ఠిరుని నోట విన్నవెంటనే ద్రోణాచార్యులకు జీవితేచ్ఛ పోయింది. యుద్ధమధ్యంలో శస్త్రత్యాగం చేసి యోగాసనంలో కూర్చున్నాడు. ఇదే అదనుగా భావించి ధృష్టద్యుమ్నుడు ఆయన రథం మీదకు కుప్పించి దూకి అతని శిరోజాలను పట్టుకుని ఒక్క కత్తివేటుతో తలను మొండెం నుండి వేరు చేశాడు.

పాండవకౌరవపక్షాలు రెండూ ఈ చర్యను చూసి దిగ్భ్రాంతి చెందాయి. ఆచార్యుని మరణానికి ఎంతో ఖేదం చెందాయి. ఒక్క కర్ణుడే మిగిలిన అందరికంటె భిన్నంగా ఆలోచించాడు. 

"నా మిత్రుడైన దుర్యోధనుడు ఎంతో నమ్మకంతో ఈ ద్రోణాచార్యుని తన సమస్తసైన్యానికి నాయకుడిగా నియమిస్తే అతడు తన మహారాజుకు విజయం కలిగేలా యుద్ధం చేయవలసింది పోయి, తన కొడుకు చనిపోయాడనేసరికి యుద్ధం మానేసి చేతులారా చావు కొనితెచ్చుకున్నాడు. ఈ విధంగా అతడు స్వామిద్రోహి" అని అతడు మనసారా నమ్మాడు. 

మరోవైపు ఆ ఘోరం జరిగిన సమయానికి అక్కడ లేని అశ్వత్థామకు ఈ విషయం తెలిసింది. ప్రాణప్రదుడైన తండ్రిని కోల్పోయిన తీరని దుఃఖం ఒకవైపు, తండ్రిని అన్యాయంగా చంపిన ఆ దుర్మార్గుడైన ధృష్టద్యుమ్నుని మట్టుపెట్టాలన్న తీవ్రప్రతీకారేచ్ఛ మరొకవైపు. తన తండ్రి గారు అవమానకరమైన రీతిలో మరణించడానికి కారణమైన పాండవ మత్స్య పాంచాల మాగధాది క్షత్రియాపసదుల పాలిటి పరశురాముడయ్యేందుకు పరమ క్రోధంతో ఉద్యుక్తుడయ్యాడు. 

అటువంటి తన మేనల్లునికి దుర్యోధనుడు కౌరవసేనాధిపత్యం ప్రసాదించగలడని కృపాచార్యులు ఆశించారు. కానీ, భీష్మద్రోణుల తరువాత కౌరవసేనాధిపత్యానికి మరొక పోటీదారుడు కర్ణుడు ఉన్నాడు. 

అతడు మహారాజైన దుర్యోధనుడికి ప్రియమిత్రుడు. పైగా రాజసమక్షంలో ద్రోణాచార్యుని మీద లేని పోని నిందలు వేస్తూ ఉన్నాడు. ద్రోణుడి బుద్ధి మంచిది కాదని, ఆసంగతిని బాల్యంలోనే కనుగొన్న ద్రుపదుడు అతనిని తన చెంత ఉంచుకోకుండా తరిమేశాడని ఇలా ఏమేమో చెబుతూ అతని మనసు విరిచేసి, అతనికి ద్రోణుడి పట్ల కృతజ్ఞతాభావం కానీ, గౌరవభావం కానీ లేకుండా చేశాడు. 

ఆ దుర్యోధనుడి సమక్షంలోనే కర్ణాశ్వత్థామల సంవాదం ఇలా జరిగింది:

అశ్వత్థామ) 
రాజా ఇక నిశ్చింతగా నిద్రపోదువు గాని. ఈ రోజు భూమి కృష్ణుడు, పాండవులు లేకుండా అయిపోతుంది.

కర్ణుడు) 
చెప్పడం సులువే. చేయడమే కష్టం. నువ్వు చెప్పిన పనిని చేయగలిగినవారు కౌరవసైన్యంలో చాలామంది ఉన్నారులే. (నీకంత శ్రమవద్దు.) 

అశ్వత్థామ) 
అంగరాజా, తండ్రి పోయిన దుఃఖంలో అలా అన్నానే గాని, ఇతరవీరులను అవమానించడం నా ఉద్దేశం కాదు.

కర్ణుడు) 
ఓయీ మూఢా! దుఃఖంతో ఉంటే కన్నీరు వదలాలి, కోపం వస్తే యుద్ధరంగంలోకి ఉరకాలి. అంతే గాని, ఇటువంటి ప్రగల్భాలు పలుకరాదు.

అశ్వత్థామ) 
ఒరే రాధాగర్భభారభూతుడా! సూతాపసదుడా! నువ్వా నాకు ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో చెప్పేది? నీలా నేనెప్పుడూ యుద్ధరంగంనుండి పారిపోయి రాలేదే? నా ఆయుధం నీ ఆయుధంలా గురుశాపం పొంది నిర్వీర్యం కాలేదే? నీలా స్తోత్రపాఠాలు పలికే సూతకులంలో నేను పుట్టలేదే? కాబట్టి, నా క్షుద్రశత్రువులు నాకు చేసిన అపకారానికి నేను ప్రతీకారాన్ని అశ్రువులతో కాదు, అస్త్రంతోనే చేస్తాను.

కర్ణుడు) 
ఒరే వాచాలుడా! నా ఆయుధం నిర్వీర్యమో, సవీర్యమో గాని, నేనెప్పుడూ నీ తండ్రిలా ఆయుధాన్ని యుద్ధరంగంలో పక్కన పెట్టలేదు సుమా. 

మరొకటి కూడా చెబుతున్నాను. నేను సూతుడినా సూతపుత్రుడినా, ఎవరైతే నేమయ్యా? दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम्। ఒరే, నేను ఏ కులంలో పుడితేనేమిరా, పుట్టించింది ఆ భగవంతుడు. అందువల్ల నా పుట్టుకకు అతడే బాధ్యుడు. కానీ, పౌరుషం ఉన్నదే, అది మాత్రం నేను సంపాదించుకున్నది. అది నాకు పుష్కలంగా ఉన్నదిరా"
***
***

ఇలా ఎవరైనా (సకారణంగానో లేక నిష్కారణంగానో) ఒక వ్యక్తిని ఆక్షేపిస్తే ఆ వ్యక్తి కోపగించుకుని తనను ఆక్షేపించిన వ్యక్తిని కులం పేరుతో తూలనాడడం ఈనాటి మాట కాదు. 

ఈ వాగ్వాదం జరిగింది భట్టనారాయణమహాకవి వ్రాసిన వేణీసంహారం అనే నాటకంలో. ఆయన మనకు దాదాపు పదకొండువందల సంవత్సరాల పూర్వీకుడు. ఆనాటికే ఇటువంటి ఆక్షేపణలు తూలనాడడాలు ఉన్నాయన్న మాటేగా?
***

కానీ ఆ తిట్లు కాసేపు పక్కన పెడితే చూడండి, అశ్వత్థామ వినయం: 

"నేను దుఃఖంలో ఏదో అన్నానే గాని, ఇతరవీరులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు" అన్నాడు. 

అంటే, "నేనొక్కడే వీరుడిని కాను, నావంటి వీరులు ఇంకా చాలామంది ఉన్నారు." అని స్వయంగా అంతటి మహావీరుడై ఉండి కూడా వినమ్రతను కనబరిచాడు. 
***

కాని, ఈనాడు ముఖానికి రంగులు పూసుకుని కెమెరా ముందు తైతక్కలాడే ఒక మనిషి కూడా, 

మా పుట్టుకే వేరు, మా బ్రీడే వారు, మా వంటి వంశం లేదు, మాకు సాటి పోటీ ఎవరూ రాలేరు 

అని వాగుతుంటే భరించవలసి ఖర్మ పట్టింది మనకు. 

అలాంటి వారికి కర్ణుడు ఆనాడే ఒక జవాబు చెప్పాడు:


" - దైవాయత్తం కులే జన్మ మదాయత్తం తు పౌరుషమ్ -
నేను ఫలానా కులంలో పుట్టడం అనేది దైవం చేతిలో ఉంది. 
కానీ, 
పౌరుషం నిరూపించుకొనడం మాత్రం ఖచ్చితంగా నా చేతిలో ఉంది." 
***

అలాగే జరుగుతుంది. 
అలా జరిగిందని ఇతిహాసమూ చెప్పింది, 
చరిత్ర కూడా అలా జరగడాన్ని చాలాసార్లు ప్రత్యక్షసాక్షిగా చూసింది.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...