Saturday 28 July 2018

నిర్వ్యాజమైన ప్రేమ

అవ్యాజమైన ప్రేమ? 
అదేమిటి? అలాంటిది ఎక్కడైనా ఉంటుందా?
వ్యాజము అంటే కారణం లేదా సాకు. 
నిష్కారణంగా మనం ఎవరినైనా ప్రేమిస్తామా?

అనగా అనగా యాజ్ఞవల్క్యమహర్షి. అబ్బో, ఆయన సామాన్యుడు కానే కాదు. సూర్యభగవానుని శిష్యుడు. శుక్లయజుర్వేదపు ఆవిర్భావానికి కారకుడు. జనకమహారాజుగారి వేదాంతసభలో హేమాహేమీలైన మహా మహా పండితులెందరినో వాదప్రతివాదాలలో చిత్తుచిత్తుగా ఓడించినవాడు. 

అటువంటి ఆయన ఒకరోజు గృహస్థాశ్రమం ముగించుకుని సన్న్యాసాశ్రమం స్వీకరిద్దామనే నిర్ణయానికొచ్చాడు. తన ఇద్దరు భార్యలకు తనకున్న ఆస్తి పంచి ఇచ్చి సన్న్యాసి అయ్యేందుకు వారి అనుమతి కోరాడు. 

కాత్యాయని అనే పేరు గలిగిన భార్య సరే అంది. కానీ మైత్రేయి అనే భార్య మాత్రం, "డబ్బుతో నిండిన ఈ మొత్తం భూమి నాకు స్వంతం అయితే నాకు అమృతత్వం (మోక్షం) వస్తుందా?" అని అడిగింది. అబ్బే, అలాంటి అవకాశం లేనే లేదు పొమ్మన్నాడు యాజ్ఞవల్క్యుడు. అయితే దేనివల్ల అటువంటి అమృతత్వం సిద్ధిస్తుందో అది నాకు ఉపదేశిస్తేనే మీరు సన్న్యాసం స్వీకరించేందుకు అనుమతి" అన్నది మైత్రేయి.

యాజ్ఞవల్క్యుడు చిరునవ్వు నవ్వాడు. "ఇందువల్లనే నీవు నాకు ప్రియమైన భార్యవు అయ్యావు" అని పలికి, ఉపదేశం మొదలు పెట్టాడు.

ఎందువల్ల ఆమె ప్రియమైన భార్య అయింది? ఊరికే కాదు. ఏదో కారణం వల్లనే. యాజ్ఞవల్క్యుడే స్వయంగా చెప్పాడు తన ఉపదేశంలో - 

न वा अरे जायायै कामाय जाया प्रिया भवति।
आत्मनस्तु कामाय जाया प्रिया भवति।
(बृहदारण्यकोपनिषद् 4.5)


"భార్యకోసం భార్య ఎప్పుడు ప్రియమైనది కాదు, 
తన కోసమే భార్య ప్రియమైనది అవుతుంది."

యాజ్ఞవల్క్యుని విషయంలో - అతనికి ఇష్టమైనది అమృతవిద్య (ఆత్మవిద్య). అటువంటి అమృతవిద్యను కోరినందువల్ల మైత్రేయి అతనికి ఇష్టురాలైంది. లేకుంటే కాత్యాయని లాగే ఒక సాధారణమైన భార్య అయ్యుండేది అన్నమాట.

ఆ విధంగా ఒక్క భార్య విషయంలో మాత్రమే కాదు, 

పుత్రుల కోసం పుత్రులు ఎవరికీ ఇష్టం కారుట. 
తనకోసమే పుత్రులు ఇష్టులౌతారట.
నిజమే కదా, చిన్నప్పుడు వారి ముద్దు మురిపాలు మనిషికి ముచ్చట గొలుపుతాయి కాబట్టి వారి పట్ల ప్రేమ ఉంటుంది. పెద్దయ్యాక ఆ పిల్లలు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే వారి మీద కోపం తారాస్థాయిలో ఉంటుంది.

ధనం కోసం ధనం ఎవరికీ ఇష్టం కాదుట. 
తనకోసమే (తనకు ఉపయోగపడుతుంది కాబట్టే) ధనం అంటే ఇష్టం ఉంటుందట. 

అలాగే - 
భార్యకు భర్త ఇష్టమైనా తనకోసమే తప్ప, భర్తకోసం కాదుట. 
బ్రాహ్మణులనైనా, క్షత్రియులనైనా, పశువులనైనా, లోకాన్నైనా, దేవతలనైనా, వేదాలనైనా, ఇలా ఎవరిని (లేదా) దేనిని ఇష్టపడినా తనకోసమే కానీ వారి కోసం (లేదా వాటికోసం) మాత్రం కానే కాదుట. 

కాబట్టి, 
ఏవైనా, ఎవరైనా, మనకు ఉపయోగపడితేనే అవి మనకు ప్రియమైనవి అవుతాయి అని నిర్మొహమాటంగా చెప్పేశాడు ఆయన. ఎవరిమీదనైనా దేనిమీదనైనా నిష్కారణమైన ప్రేమ అంటూ ఉండదు, ప్రేమ సకారణమే అంటున్నాడన్నమాట.

అరెరే, 
ఆయన అంత మాట అన్నాడని 
మనం ఎవరమూ ముఖాలు మాడ్చుకోనక్కర లేదు.
మనసును చిన్నబుచ్చుకోనక్కరలేదు.
భుజాలు తడుముకోనక్కర లేదు.

ఎందుకంటే 
ఆయన ప్రసంగం మానవుని స్వార్థబుద్ధి గురించి కాదు.
అమృతవిద్య గురించి కదా.
అందువల్ల ఆయన ధోరణిని కాస్త పరిశీలించి చూద్దాం.

"ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః" 
"అన్నిటినీ (అందరినీ) తనవలె ఎవడైతే చూడగలడో అతడే అసలైన పండితుడు" - అని శాస్త్రం.

అంటే - 
మనం మన పిల్లల్లో మనలను (ఆత్మను) చూసుకుంటున్నాం కాబట్టి వారు మనకు ఇష్టమౌతున్నారు. అంటే - ఆ క్షణంలో వారు వేరు, నేను వేరు అనే భావన మనలో ఉండదు - వారి విషయంలో దాదాపు అద్వైతసిద్ధి అన్నమాట. అదీ విషయం. 

ఈవిధంగా మన పిల్లలనే కాదు, ప్రపంచంలో అన్నింటినీ ఆత్మస్వరూపాలుగా గమనించగలగడమే ఆత్మవిద్య అంటే - అదీ మోక్షవిద్య అంటే - అదీ అమృతవిద్య అంటే. 

"ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యో మైత్రేయి"
(అరే ఓ మైత్రేయి, ఇటువంటి స్వరూపం గల ఆత్మదర్శనం చేసుకోవాలి, దానిని గూర్చి వినాలి, మననం చేసుకుంటూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి.) 

"ఆవిధమైన అభ్యాసంతో నీవు అమృతవిద్యను సాధించగలవు" అని యాజ్ఞవల్క్యమహర్షి మైత్రేయికి ఆమె కోరిన అమృతవిద్యను ఉపదేశించాడు. (ఈ సందర్భానికి అవసరమైన కొద్ది భాగం మాత్రమే నేను తీసుకున్నాను. పూర్తి ఉపదేశం తెలుసుకోవాలనుకుంటే మిత్రులు బృహదారణ్యకోపనిషద్ చదవగలరు.)

ఈ క్రింది చిత్రం చూడండి. తల్లి ఆవు తన బిడ్డకు పాలను ఇస్తోంది. కొంత దూరంతో తల్లి లేని దూడలు నిలబడి ఉన్నాయి. ఈ ఆవు వాటిని పిలిచి పాలు ఇవ్వడం లేదు. ఒకవేళ అవి చొరవగా వచ్చి పాలు త్రాగబోయినా ఈ ఆవు సరేనని వాటికి కూడా ఇస్తుందో లేక తిరస్కరిస్తుందో తెలియదు. 

అపుడపుడు ఆవు పందిపిల్లలకు కూడా పాలు ఇస్తున్న ఫోటోలు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఆవులు అమృతవిద్యను సాధించిన మహర్షులుగా భావించి మనం వాటికి నమస్కరించవలసిందే!

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...