Monday 23 July 2018

ఒట్టు!

అందుకే #చందమామ కథలు చదవమని చెప్పేది!

అనగనగా ఓ రాజు. తగూపడేవారందరికీ తీర్పు చెప్పేకి ఆయనకి సమయం సరిపోవట్లేదు. "ఎలారా బగువంతుడా" అనుకుంటాంటే ఒక మహర్షి వచ్చి ఒక పెద్ద గండ కత్తెర ఇచ్చినాడు.

"ఏమిటికిది మహర్షీ?" అంటే
"తగూపడేవాళ్లని కత్తెర మద్దెలో సేతులు పెట్టి పెమాణం సెయ్యమనండి, ఎవడు అబద్దమాడితే వాడి సెయ్యిని ఇది కత్తిరించేస్తాది" అన్న్యాడు.

దాని సంగతి జనాలకి తెలిసి అసెత్త పెమాణాలు సేసేకి బయపడినారు. అట్లా అదొచ్చినంక తగూలన్నీ ఆగిపొయినై. రాజు హాయిగా కంటినిండా నిద్రపోతుణ్ణ్యాడు.

అయినా ఒగు దినుము ఒగు తగువొచ్చ. 

"నేనీయప్పకి అప్పు ఇచ్చినా. తిరిగీమంటే ఇచ్చేసినా గదా అంటాడీయప్ప" అని మొదుటి పార్టీ అంటాడు.

"అవును, ఆయప్పకీయాల్సింది ఆయప్పకిచ్చేసినా" అంటాడు రెండో పార్టీ.

"ఇంగ లాబం లేదు కత్తిరి నడుమన సెయ్యి పెట్టి పెమాణం సెయ్యండిద్దరూ" అని రాజు ఆదేశమిచ్చినాడు.

ఒగుటోవాడు పెమాణం చేశ. సెయ్యి తెగక పాయ. 

ఇంకేమి, 
"ఉరే ‌రెండో పార్టీ! నువు చెప్పింది అబద్దము గదా? ఆయప్ప నుంచి తీసుకున్న అప్పు ఆయప్పకిస్తావా లేదా?" అని రాజు బెదిరిచ్చ.

"నేనిచ్చేసినా రాజా" అని రెండోపార్టీ మొత్తుకొన్న్యాడు.

"అట్లైతే నువు గూడా పెమాణం సేస్తావా మడి?"

"సేస్తా రాజా!"

"ఉరే రెండో పార్టీ! అన్నాయెంగా నీ సేతులు నరికిచ్చుకుంటావురా!" అనె రాజు జాలిపడి.

"నేనబద్దమాడితే గద రాజా నా సేతులు పొయ్యేది!" అనుకుంటా రెండోపార్టీ లేశ.

"రోంత ఈ కట్టి పట్టుకోప్పా" అని తన సేతికట్టిని మొదటి పార్టీకిచ్చి, కత్తిరి మద్దెలో సేతులు బెట్టి పెమాణం జేశ. "నేను ఈ మొదటిపార్టీకి బాకీ తీర్చేసినాను" అంజెప్ప్య. 

అయినా గాని కత్తిరి ఊరికే ఉండ్య. ఆయప్ప సేతులు కత్తిరీకప్యా. అందురూ ఆచ్చెర్యపాయిరి. 

"రెండు పార్టీలలో ఏదోక పార్టీ అబద్దమాడినట్లే గదా? మడి ఆ కత్తిరి మహిమ కలిగుంటే ఎవరో ఒకరి సేతుల్ని కత్తిరీయల్ల గదా? అట్లా గాలేదంటే ఈ 
కత్తిరిలో మహిమ లేకున్నెట్లే గదా?" అని రాజుకి మంత్రికి జనాలకీ అందరికీ అనుమానమొచ్చ. "మహర్షీ లేదు, మహిమా లేదు తీ, అంతా సుళ్లు" అనబట్రి.

ఈ సంగతి మహర్షికి తెలిశి దడాన వొచ్చిడిశ. రెండు పార్టీలని మళ్లీ పెమాణం చెయ్యమనె. వాళ్లు మళ్లీ అట్లే సేసిరి. అప్పుడా మహర్షి రెండో పార్టీ ఆయప్ప మొదటి పార్టీకిచ్చిన సేతికట్టి తీసుకుని ఇరగ్గొట్టమన్య. రాజబటులు యిరగ్గొట్రి. 

ఆ సేతికట్టి నడమన డొల్ల ఉండ్య. దాంట్లోంచి రెండోపార్టీ మొదటిపార్టీకీయాల్సిన బాకీ దుడ్లు కింద పడ్య. రాజూ మంత్రీ జనాలూ ఆచ్చెర్యపోయిరి. రెండోపార్టీ సిగ్గుతో తలకాయ వొంచుకొనె. 

"ఏమపా ఇప్పుడు మళ్లీ చేస్తావా పెమాణం?" అని అడిగినాడు మహర్షి రెండో పార్టీని. వాడు బయపడి మహర్షి కాళ్లమింద పడె.

మహర్షి సరేలెమ్మని "రాజా నా కత్తిరి నాకిస్తే నే కొండబోతా"ననె. 

"ఏమిటికి మహర్షీ అది మహిమ కలిగిందే కదా" అనె రాజు.

"దానికి మహిమ ఉణ్ణ్యాగాని ఏమి లాబం? మీ మనసుల్లో దానిమింద రోంతన్నా యిశ్వాసం లేకపాయ. ఇంక మీదగ్గర అది వుండేది పూరా దండగ" అంజెప్పి మహర్షి ఆ కత్తిరిని అట్లే కొండబాయ.

***
అదీ కథ!
***

కలియుగంలో కూడా రెండోపార్టీ లాంటి మనుషులు పుడతారు. అక్రమంగా తరతరాలకు సరిపడేంత సంపాదిస్తారు. కాని, రూపాయి కూడా మేము అక్రమంగా సంపాదించలేదు అని నిర్భయంగా దీపాలాపి "పెమాణాలు" సేస్తారు. వాళ్లకేమీ కాదా అని అమాయికులు ఆశ్చర్యపోరాదు.

వాళ్లు సంపాదిచ్చుకున్న భూములు బంగ్లాలు కానుకలు రకరకాల ప్రతిఫలాలు టెక్నికల్‌గా రూపాయి కాదు. మణుగుల కొద్దీ బంగారం, వజ్రాభరణాలు ఎట్సెట్రా ఎట్సెట్రా కూడా అంతే. ఒకవేళ భవిష్యత్తులో కోర్టులో న్యాయమూర్తులు వీటిని కూడా రూపాయలక్రిందే లెక్కేయాలి అని తీర్పు ఇచ్చినా అది అసత్యప్రమాణం కాబోదు. ఎందుకంటే అవన్నీ వారి బినామీల పేరిట ఉంటాయి గాని పెమాణం చేసినవారి పేరిట ఉండవు కాబట్టి.

ఈ నిజాలు నిరూపించడానికి ఇప్పుడు మహర్షులు లేరు. రెండోపార్టీ మనుషులకు అండగా మీడియా అధిపతులు మాత్రం ఉంటారు.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...