Saturday 28 July 2018

దాతా భవతి వా న వా -2

(దాతా భవతి వా న వా? - రెండవభాగం - Part -2)
దానయోగ్యమైనవి ఏమున్నాయి?
కాదేదీ దానానికనర్హం అన్న రీతిలో చాల ఉన్నాయి.
దాత ఒక మనిషే. గ్రహీత కూడా మనిషే.
కాబట్టి దాత వద్ద ఉన్నది అందరికీ కాకున్నా ఎవరో మరొకరికి తప్పక అవసరపడుతుంది కదా.

<><><><><><>
పుస్తకదానం -
<><><><><><>

మా చిన్నపుడు -
మేము పై తరగతికి ప్రమోట్ కాగానే, మా పాఠ్యపుస్తకాలను మా జూనియర్ విద్యార్థులకు ఇచ్చే పద్ధతి ఉండేది. అలాగే మా సీనియర్ల నుండి మేము అందుకొనేవాళ్లం. అలా మాకు దేవుడిచ్చిన అన్నల్లా మా సీనియర్లు ఉండేవారు. పాఠశాలలో మాకు ఎలాంటి సమస్య వచ్చినా మేము వారికి చెప్పేవాళ్లం. వాళ్లు పరిష్కరించేవాళ్లు. లేదా పరిష్కారమార్గం చూపేవారు.
ఈ రోజుల్లో అంతటి సుహృద్భావాలు తక్కువైపోయినై. పై తరగతికి ప్రమోట్ అయిన తరువాత పుస్తకాలను సెకండ్ హ్యాండ్ బుక్ షాప్ వాడికి ఎంతో కొంత మొత్తానికి అమ్మేస్తున్నారు. జూనియర్స్ కూడా ఇచ్చినా ఎవరూ తీసుకొనటం లేదు. అబ్బే, ప్రజల్లో దాతృత్వభావన తగ్గటం కాని, లేదా తీసుకొనడానికి మొహమాటం పెరగటం కాని అందుకు కారణాలు కానే కావు.
అసలు కారణం కార్పొరేట్ విద్యాలయాలు!
అవి తమ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను లేదా స్టడీ మెటీరియల్ ను బలవంతంగా అంటగడుతున్నాయి. వాటి ఖరీదును ముక్కు పిండి బలవంతంగా వసూలు చేస్తున్నాయి.
ఇలా ఒకప్పుడు Charity begins at Home అనే సూత్రం అమలౌతూ ఉండగా, క్రమక్రమంగా వ్యాపారసంస్థలు మన జీవనంలోనికి దూరి ఆ సుహృద్భావనలను నాశనం చేయడం మొదలైంది. "జీవితమంటే వ్యాపారం" అనే దుర్మార్గభావాలను అవి బలవంతంగా బాల్యంలోనే మెదళ్లలోనికి చొప్పిస్తున్నాయి.
ఏ విత్తనం వేస్తే ఆ పంట పండటం సహజమే కదా! సమాజమంతా వ్యాపారపంటలు పండటం ప్రారంభమైనాయి. ఇప్పటికీ అవే పండుతున్నాయి.
<><><><><><>

గ్యూటెన్బర్గ్ మహాశయుల పుణ్యమాని అచ్చొత్తే పద్ధతి వచ్చాక పుస్తకమనేది అందరికీ అందుబాటులోనికి వచ్చింది. కంప్యూటర్ వచ్చాక పుస్తకముద్రణ మరీ తేలికైంది. కాని, అంతకు ముందు పుస్తకాలంటే తాళపత్రాల కట్టలే కదా - ఓ గ్రంథాన్ని వాటిపై వ్రాసి దానం చేయడమంటే ఎంతటి సమయం పట్టేదో - అది ఎంత కష్టమైన విషయమో ఊహించుకొనగలిగినవారికే - పుస్తకదానంలోని మహత్త్వం అర్థమౌతుంది.
ఔదార్యవంతులైన ధనవంతులు కొందరు వ్రాతగాళ్లను పోషిస్తూ, వారితో వివిధగ్రంథాలను కాపీ చేయిస్తూ, విద్యాలయాలకు, విద్యార్థులకు దానం చేసేవారట. అటువంటి మహాత్ములకు మన భారతజాతి మొత్తం ఎప్పటికీ ఋణపడి ఉంటుంది.
ఎప్పటి రామాయణభారతాలు? ఎప్పటి వాల్మీకివ్యాసులు?
వారి స్వహస్తలిఖితగ్రంథాలు శిథిలం కాకుండా మన తరం వరకూ ఉంటాయని అనుకోలేం.
దేశవ్యాప్తంగా అటువంటి అద్భుతగ్రంథాలను రక్షించుకొనేందుకు ఎంతెంతమంది కృషి చేసి ఉంటారు?
తరతరాలుగా ఎప్పటికప్పుడు వాటికి కాపీలు వ్రాయిస్తూ,
వాటిని కూలంకషంగా అధ్యయనం చేసేవారికి దానం చేస్తూ, గ్రంథాలయాలలో భద్రం చేస్తూ ఉండిన మహాదాతలు ఎందరు ఉండి ఉంటారు?
అందుకే కదా -
మనవరకు ఆ మహర్షుల ఉదాత్తభావాలు వచ్చి చేరాయి?
భారతదేశమంతటా ఆ రామాయణమహాభారతాలు ప్రఖ్యాతి చెంది ఉన్నాయంటే తరతరాలుగా ఎంతమంది తమ జీవితకాలాలను కఠోరశ్రమకోర్చి ఆ పుస్తకాలనిర్మాణానికి వెచ్చించి ఉంటారు?
వారు, వారిని ఆదరించి పోషించిన అజ్ఞాతదాతలు మనకు నిత్యవంద్యులు. ప్రాతఃస్మరణీయులు.
మా గురువుగారు తమ డాక్టరేట్ థీసిస్ లో పేరు కూడా తెలియని ఇటువంటి మహాభానువులు ప్రతి ఒక్కరికి ఎంతో భక్తితో కృతజ్ఞతలు సమర్పించి ఉండడం చూశాను. అది వారి సంస్కారం!
పుస్తకంలో కవి హృదయం ఉంటుంది. ఒక పుస్తకం చదివామంటే ఆ కవితో నేరుగా భాషిస్తున్నట్టే. అతి ప్రాచీన కవులతో ఆనాటి విషయాల గురించి చాటింగ్ చేయాలంటే ఆయా కవుల పుస్తకాలను చదవడమే ఏకైకోపాయం. అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ చదవడమే - మనకు ఎన్ని సార్లు సందేహం వచ్చినా మనపై కోప్పడకుండా మళ్ళీ మళ్ళీ ప్రశాంతంగా చెప్పేది ఆ పుస్తకంలోని కవి మాత్రమే కదా!
అలాంటి పుస్తకాలను ప్రజలకు చేరువ చేయాలని #రాయలసీమ బిడ్డడైన శ్రీ #గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారు మహోద్ధృతంగా #గ్రంథాలయోద్యమంచేశారు. తత్ఫలితంగా ఈనాడు సామాన్యునికి కూడా చేరువలో గొప్ప పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
<><><><><><>

యుద్ధాలు లేని కాలమంటూ లేదు. భారతీయరాజుల నడుమ యుద్ధాలు జరిగేవి. కాని, వారెన్నడూ ఓడిపోయిన ప్రాంతానికి చెందిన ప్రజలను బాధించలేదు. గెలిచిన రాజునుండి ప్రజలు రక్షణ పొందుతూ వారికి పన్ను కట్టారు. కాబట్టి ఎందరు రాజులు మారినా ప్రజలు సుఖంగానే ఉన్నారు.
కాని, ఆవిధంగా "అయ్యో పాపం" అనే సెంటిమెంట్లవంటి "బలహీనతలేమీ" లేని విదేశీయులు భారతదేశంపై దండయాత్రలు మొదలుపెట్టాక ప్రజలను దోచుకొనడం మొదలుపెట్టారు. విశ్వవిద్యాలయాలపై పడి సంఖ్యాధికమైన పుస్తకాలను తగలబెట్టేశారు. అధ్యాపకులను, విద్యార్థులను ఊచకోత కోశారు.
ఆ కాలంలో ఎన్నెన్ని శాస్త్రాలు (sciences) మంటగలిసి పోయాయో! తరువాత యూరోపీయపాలకులు వచ్చాక కూడా ఎన్నెన్ని పుస్తకాలు మన గ్రంథాలయాలనుండి అపహరింపబడ్డాయో! భారతీయులు తేనెటీగల్లా శ్రమించి కూడబెట్టుకున్న జ్ఞానమకరందాన్ని విదేశీయులు ఎలుగ్గొడ్లలా వచ్చి నాశనం చేసినంత చేశారు, త్రాగినంత త్రాగారు, ఎత్తుకుపోయినంత ఎత్తుకుపోయారు.
అయినా, మనం ఈనాటికీ వాళ్లు కోహినూర్ ఎత్తుకుపోయారని ఏడుస్తాం. నెమలిసింహాసనం ఎత్తుకుపోయారని ఏడుస్తాం. అమరావతి స్థూపాన్ని పెళ్లగించుకు పోయారని ఏడుస్తాం. వాటిని మనకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తాం. అవి ఖచ్చితంగా విలువైనవే.
కాని, వాళ్లు నాశనం చేసిన శాస్త్రగ్రంథాలు మరింత విలువైనవి. వెలకట్టలేనివి. వాటికోసం ఎవ్వరూ ఏడవరు, వాటి విలువ తెలిసినవారు తప్ప!
ఇది ఇలా ఉండగా మరికొందరు తయారయ్యారు -
తమకు ఇష్టంలేని ఒకటి రెండు విషయాలు ఏదైనా ఒక పుస్తకంలో కనబడితే చాలు - ఆ పుస్తకం తగలబెట్టెయ్యండి అనే వాళ్ళు, ఆ పుస్తకాన్ని బహిష్కరించండి అనే వాళ్ళు, ఆ పుస్తకాలను జనజీవనస్రవంతి నుండి తప్పించాలి అనే వాళ్ళు..
ఈ మధ్యనే ఒకాయన భారతజాతి శీలాన్ని నిర్దేశించే రామాయణమహాభారతాలను భారతదేశ ప్రజలకు దూరం చేయాలంటూ రాగం అందుకున్నారు కూడా. 
<><><><><><>

వైజ్ఞానికంగా ఎంతో ముందున్న భారతీయులు దిగజారిపోవడం అప్పటినుండే ప్రారంభమైంది. ప్రోత్సహించే దాతలు కరువయ్యారు. విదేశీప్రభుత్వాలు స్థానికపరిశోధనలను ప్రోత్సహించడం అటుంచితే వెతికి వెతికి నాశనం కూడా చేశాయి.
అగ్గిపెట్టెలో పట్టేంతటి చీరను నేయగల నేతగాళ్ల వ్రేళ్లను బ్రిటిషువారు నిర్దాక్షిణ్యంగా నరికించారని అంటారు. పబ్లిగ్గా జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండకు ఏమాత్రం సిగ్గుపడని బ్రిటిషు వాళ్లు, అజ్ఞాతంగా ఇటువంటి క్రూరకృత్యాలను ఏమీ చేయించలేదు అంటే ఎవరూ నమ్మరు.
సరే, స్వాతంత్ర్యం వచ్చిన తరువాతనైనా భారతీయవైజ్ఞానిక పరిశోధనలు ముందుకు దూసుకుపోవడం లేదేమి అంటే -
ఒకటే కారణం -
శాస్త్రజ్ఞానమెపుడూ రిలే పరుగులాంటిది. సీనియర్ శాస్త్రవేత్తలు అందించిన జ్ఞానాన్ని జూనియర్లు అందుకొని, తాము కూడా దాని అభివృద్ధికి కృషి చేసి, తమ పరిశోధనఫలితాలను తమ జూనియర్లకు భద్రంగా అందించాలి.
కాని, మన దేశంలో సుదీర్ఘమైన విదేశీపాలన ఫలితంగా మన పూర్వవిజ్ఞానశాస్త్రవేత్తలతో మనకుండిన link తెగిపోయింది.
ఇంగ్లీషు మోజులో శాస్త్రభాష అయిన సంస్కృతాన్ని వదిలేశాం. సంస్కృతాన్ని నేర్చుకున్నవారు కూడా చాలమంది సంస్కృతమంటే కాళిదాసు, కొన్ని సుభాషితాలు, కొన్ని చమత్కారశ్లోకాలు, కొన్ని స్తోత్రాలు, కాస్త జ్యోతిషం - ఇలాంటివి మాత్రమే అనుకొని వాటిలో చెప్పుకోదగినంత పరిశ్రమ చేసి, ఈ జీవితానికిది చాలు అనుకుంటున్నారు.
కాలిపోయినవి కాలిపోగా, అపహరణకు గురైనవి పోగా, మిగిలిన శాస్త్రగ్రంథాలు ఇంకా తాళపత్రాల రూపంలోనే ఉన్నాయి. అవి కూడా దేవనాగరిలిపిలో ఉన్నవి తక్కువ. సంస్కృతమే అయినా రకరకాల లిపులలో ఉన్నాయి. వాటిలో కూడా, ఘుణాక్షరాలేవో వ్రాతగాని అక్షరాలేవో సరిగా గుర్తించాలంటే తలప్రాణం తోకకొస్తుంది. ఆ ప్రాచీన లిపులను నిర్దుష్టంగా చదవగలిగిన వారు అసలు దేశంలో ఉన్నారో లేరో అనిపిస్తుంది!
అయినా, వాటిని పరిశోధించేందుకు నిధులిచ్చే దాతలు లేరు. నేటి ప్రభుత్వాలకు పుష్కరాలనిర్వహణమీద ఉన్నంత శ్రద్ధ ఇటువంటి పనులలో లేదు.
కాబట్టి, విజ్ఞానశాస్త్రానికి భారతీయుల contribution ఏమీ లేదు అనుకుంటూ, మనలను మనం తక్కువ చేసుకుంటూ inferiority complex తో బ్రతకాల్సిందే మనం. అది మనం చేసుకున్న "ఖర్మ".
ఇపుడు మరింత బాగా అర్థమౌతుంది కదా, - "दाता भवति वा न वा - దాత అనేవాడొకడు ఉన్నాడో లేడో" - అనే కవిగారి మాటలోని ఆవేదన?
ఆవేదన కవికి మాత్రమే కాదుట, పుస్తకానికి కూడా ఉంటుందట -
అది ఆవేదనతో - "నాయనలారా, నన్ను నూనెనుండి, నీటినుండి రక్షించండి. నా కుట్లు ఊడి శిథిలం అయిపోకుండా కాపాడండి. దయచేసి మూర్ఖుని చేతికి ఇవ్వకండి" అని వేడుకుంటుందట పాపం.
తైలాద్రక్షేద్ జలాద్రక్షేద్ రక్షేచ్చిథిలబంధనాత్।
మూర్ఖహస్తే న దాతవ్యమ్ ఏవం వదతి పుస్తకమ్।।
కాబట్టి, పుస్తకదానం గొప్పదే - కానీ దాని గొప్పదనం అర్థం చేసుకోలేని వానికి చేరితే దానికి మరణమే గతి. తప్పదు - అక్కడ కాస్త జాగ్రత్త పడాలి అని పెద్దల మాట.
ఈరోజుల్లో డిజిటల్ పుస్తకాలు వచ్చాక రక్షణ కాస్త సులువైనట్లుగా అనిపిస్తోంది. కాని అందులో కూడా ఏవో కష్టనష్టాలు ఉండకపోవు. 

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...