Saturday 28 July 2018

- ఎవ్వరూ తక్కువ వాళ్లు కారు -


బ్రహ్మవంశసముద్భూతుడైన ఉత్తానపాదుడు అనే ఒకానొక మహారాజు ఉండేవాడు. ఆయనకు సునీతి సురుచి అని ఇద్దరు భార్యలు ఉండేవారు. సునీతి కుమారుడు ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు.

ఉత్తానపాదునికి తన చిన్న భార్య అయిన సురుచి అంటే ప్రీతి ఎక్కువ. ఓ రోజు ఆయన ఉత్తముని ఒడిలో కూర్చుండబెట్టుకుని లాలిస్తున్నాడు. ఇంతలో అక్కడికి ధ్రువుడు వచ్చాడు. తాను కూడా తండ్రి ఒడిలో ఎక్కాలని ఆశ పడ్డాడు. కాని, సునీతి అడ్డుపడింది.

“ఒరే అబ్బాయీ, నువు రాజపుత్రుడవే కావచ్చు. కాని, నువు నా కడుపున పుట్టలేదు, కాబట్టి, తండ్రి ఒడిలో కూర్చోవాలనే నీకోరిక దుర్లభం పొమ్మం”ది.

న వత్స నృపతేర్ధిష్ణ్యం భవానారోఢుమర్హసి।
న గృహీతో మయా యత్త్వం కుక్షావపి నృపాత్మజః।।
నూనం వేద భవాన్ యస్య దుర్లభేऽర్థే మనోరథః।।
(శ్రీమద్భాగవతం.4.8.11-12)

“అంతగా తండ్రి ఒడిలో కూర్చోవాలని ఉన్నా, రాజసింహాసనం కోరుకుంటున్నా, నువు ఒక పని చెయ్. నువు పురుషోత్తముని ఆరాధించు, అతని అనుగ్రహంతోనే మరలా నువు నా కడుపున పుట్టు.” అని అహంకారంతో పలికింది.

పసివాడైన ధ్రువుడు కఱ్ఱదెబ్బ తిన్న పాములా రోషంతో బుసలు కొట్టాడు. తరువాత తన నిస్సహాయత తెలుసుకొని పెద్దగా రోదించాడు. సునీత కూడా ఈ విషయం తెలుసుకుని చాల బాధపడింది. కుఱ్ఱవానికి కర్తవ్యం బోధించింది.

ఆతిష్ఠ తత్తాత విమత్సరస్త్వమ్, ఉక్తం సమాత్రాపి యదవ్యలీకమ్।
(శ్రీమద్భాగవతం.4.8.19)

“నాయనా, ఆమె నీకు సవతి తల్లి అయినప్పటికీ, పురుషోత్తముని ఆరాధించమని నీకు సరైన మార్గనిర్దేశనమే చేసింది. కాబట్టి, ఆమెపై ద్వేషం పెట్టుకోక, ఆ పనిని చెయ్.” అన్నది.

ధ్రువుడు అలాగే చేశాడు. దయాళువైన నారదమహర్షి చెప్పిన ప్రకారం అద్భుతమైన తపస్సు చేశాడు. భగవంతుడు ఆ తపస్సును మెచ్చి ప్రత్యక్షమై ఆ ధ్రువుడు మనసులో కోరుకున్నదానిని మాత్రమే కాక, అంతకంటె ఉన్నతమైన స్థానాన్ని కూడా ప్రసాదించాడు.

ధ్రువుడు తండ్రి ఒడిని, సింహాసనాన్ని మాత్రమే పొందడం కాకుండా ద్రువమైన (స్థిరమైన) నక్షత్రమై నిలిచాడు.

ఇది, అందరికీ తెలిసిన ఒక సుప్రసిద్ధమైన కథ. ధ్రువుడు ఒక బాలభక్తుడని, పిల్లలందరూ అటువంటి భక్తిని కలిగి ఉండాలని బోధించి ఊరుకొనడంతో ఈ కథను పెద్దలందరూ కంచికి పంపేస్తారు. కాని ఆమాత్రంతో వదలిపెట్దదగిన కథా ఇది?
*

ఆనాడు ఉత్తానపాదుడికి ధ్రువుడు, ఉత్తముడు ఇద్దరూ సమానులే. ఐనప్పటికీ, తన మీద ఉత్తానపాదుడికి ఉన్న ప్రీతిని గ్రహించిన సురుచి న్యాయమైన ధ్రువుని కోరికను తిరస్కరించింది.

భగవంతుని దృష్టిలో బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు అనబడే వారందరూ సమానులే. (నేడు దళితులు అని పిలువబడుతున్నవారు కూడా శూద్రులే.)

కాని, కొందరు పైన చెప్పిన కథలో సురుచిలా అహంకరించి, “నువు మా ఇంట పుట్టలేదు కాబట్టి, నీకు ఫలానా పని చేసే అర్హత లేదు పో, ఫలానా మోక్షం వచ్చే దారి లేదు పో” అని అన్నారనుకోండి.

ప్రస్తుతసమాజంలో అలా అనిపించుకుంటే ఇతరులకు రోషం రావడం సహజమే - పసివాడైన ధ్రువుడికి సవతి తల్లి మాటలకు రోషం వచ్చినట్టు.

కాని, అలా అన్నంతమాత్రాన ధ్రువుడు రాజకుమారుడు కాకుండా పోలేదు. అలాగే, కూడా అటువంటి మాటను అనిపించుకున్నంత మాత్రాన ఇతరుల దివ్యత్వానికి వచ్చే లోటేమీ లేదు. అన్నవారు కూడా అలా అనేసి లేని గొప్పతనాన్ని తెచ్చుకున్నదీ లేదు.

నీకు అర్హత లేదు అని ధ్రువుడితో పలికిన సురుచిది ఎంతటి అజ్ఞానమో నీకు జ్ఞానార్హత లేదు, మోక్షార్హత లేదు అని బోధించేవారిది కూడా అంతే అజ్ఞానం.

“నీ పట్ల కఠినమైన మాటలు మాట్లాడిన ఆమె పట్ల ద్వేషం పెంచుకోకు” అన్న సునీతి ఉపదేశం ధ్రువునికి మాత్రమే కాదు, నేడు తిరస్కరణకు గురి అవుతున్నవారికి కూడా అంతే అవసరం.

పూర్వకాలంలో కూడా మాంసాన్ని అమ్మి జీవించే కులంలో కూడా ధర్మవ్యాధుడు అనే అసామాన్య జ్ఞాని ఉన్నాడని మహాభారతం చెప్పింది. బోయవాడై పుట్టిన కణ్ణప్ప కూడా భక్తావతంసుడయ్యాడని సాక్షాత్తు శంకరాచార్యులంతటి వారే శివానందలహరిలో సాక్ష్యం చెప్పారు.

కాబట్టి, “మనిషి పుట్టుక ఎక్కడ జరిగినా, అది అతడి జ్ఞానసాధనకు గాని, ఉన్నతస్థానసాధనకు గాని ఎటువంటి అడ్డంకి కాబోదు” అని ధ్రువుని కథ ద్వారా తెలిపి శ్రీమద్భాగవతపురాణం మనకు స్ఫూర్తిని ఇస్తుంది.

నేడు మన రాజ్యాంగం అందరూ సమానులే అంటుంది. ఉన్నతస్థానానికి చేరేందుకు అందరికీ అవకాశాలను ఇస్తోంది. ధ్రువునిలా పట్టుదల కలిగినవారు ఎవరైనా తమ అద్భుతకృషితో తాము కోరిన స్థానాన్ని పొందవచ్చు అనడంలో సందేహం లేదు.

జన్మ చేత గాని, బలం చేత గాని, ధనం చేత గాని, అహంకారాన్ని పొంది ఇతరులను తిరస్కరించేవారికి మన పురాణాలు ఇటువంటి గుణపాఠాలను చెబుతూ ఉంటాయి. ఇలా మనకు ఆత్మవిశ్వాసం కలిగించడం మన మతం గొప్పదనం!

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...