Saturday 28 July 2018

అరిగే అన్నం - చేరే పంట

1 जीर्णमन्नं प्रशंसीयात्।  జీర్ణమన్నం ప్రశంసీయాత్
2 सस्यं च गृहमागतम्।  సస్యం చ గృహమాగతమ్

1 మనం మెచ్చుకోవలసింది
చూడగానే నోట్లో నీళ్లూరించే వంటకాలను కాదు, తింటూ ఉన్నపుడు రసాలూరే భోజనాన్ని కూడా కాదు. 
తిన్న తరువాత ఎటువంటి గడబిడ చేయకుండా చక్కగా జీర్ణమై దేహానికి చక్కని బలాన్ని, ముఖానికి మంచి తేజస్సును కలిగించే అన్నాన్ని మనం మెచ్చుకోవాలి.

2 మనం మెచ్చుకోవలసింది 
కనులవిందుగా విరగకాచిన పంటలను కాదు, కోసి నూర్చి తూర్పారబోసి కుప్పలు బెట్టిన ధాన్యరాసులను కూడా కాదు.
మూటలకో గిన్నెలకో ఎత్తి మన ఇంటికి తెచ్చుకున్న గింజలు మాత్రమే మనవి. వాటిని మనం మనసారా మెచ్చుకోవాలి.

ఇదీ పైనున్న రెండు వాక్యాలకు చిన్న వివరణ.
మన పూర్వుల అనుభవసిద్ధమైన వాక్యాలు.

మొదటి వాక్యాన్ని అనుభవజ్ఞుడైన ఒక వైద్యుడు ఇంకా బాగా వివరించగలడు.

రెండవ వాక్యాన్ని డక్కామొక్కీలు తిన్న రైతు మరింత బాగా వివరించగలడు.
***

మనకు ఆ మాటలు అంత రుచించకపోవచ్చు.
మన స్వభావమే అంత.

మనం సహజంగానే అల్పసంతోషులం.
ఎంతో ఎక్కువగా ఆశిస్తాం.
అంతే కాదు,
మనకు తొందర ఎక్కువ.
మనకున్నంత సహనం వేరెవరికీ లేదు.

ఇవ్వేంటి, ఇవన్నీ పరస్పరవ్యతిరేకవాక్యాలు  కదాని తెలివైనవారెవరూ తికమకపడరు. మన జనాలంతటి స్థితప్రజ్ఞులు ప్రపంచంలో మరెక్కడా కానరారు.
***

మనం ఆడిన ప్రతి మ్యాచ్ గెలవాలని ఆశిస్తాం.
కాని, ఓడిపోయినా పరవాలేదు,
టెండూల్కర్ సెంచురీ కొడితే ఆనందిస్తాం.

మన టీమ్ వల్డ్ కప్ గెలవాలని గుడులకెళ్లి పూజలు చేస్తాం.
కాని, ఫైనల్లో చిత్తుగా ఓడిపోయినా పరవాలేదు.
పాకిస్తాన్ మీద గెలిస్తే చాలు పండుగ చేసుకుంటాం.

మన దేశం అభివృద్ధిలో అమెరికా ఐరోపాలను మించాలంటాం.
కాని, ఆశ్రితులకు మాత్రమే కాంట్రాక్టులిచ్చినా పరవాలేదు.
అడ్డమైన వాగ్దానాలు చేసి మన నాయకుడు గెలిస్తే చాలంటాం.
****

ప్రతియేటా ఎమ్సెట్లోనూ ఐఐటీజీలోనూ ఎవరో ఒకరికి ర్యాంకులొస్తూనే ఉంటాయి. కాని, ఆయా విద్యాసంస్థలు ఆ ర్యాంకులు సాధించినవారొక్కరే, ఇప్పుడిప్పుడే చంద్రమండలం మీద అంగారక గ్రహం మీద మొట్టమొదట కాలు పెట్టి తిరిగొచ్చారన్నంత హడావుడి చేస్తాయి. ఆ తరువాత వారేం చదువుతారో, ఎలా చదువుతారో, చదివి మిగిలినవారికంటె భిన్నంగా ఏం సాధిస్తారో, వారి తెలివితేటలను దేశానికి ఎటువంటి ప్రయోజనం కలిగించేందుకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలో - ఎవ్వరూ పట్టించుకోరు.

మన పీయంగారు మేకినిండియా నినాదాన్ని తప్ప దానికి అవసరమైన ఒక విధానాన్ని ఇచ్చినట్టు కానరాదు.

మన సీయంలాంటి వారైతే "ఈ మనిషి మేడినిండియానా? ఛీ, ఛీ, పనికిరానెదవ! వీడి రిజ్యూమేను చించి బుట్టలో పడేయండ్రా. మనం అమరావతిని కట్టుకుందాం, సింగపూర్ జపాన్ చైనావోళ్లనిట్టా పిలవండే" అంటారు.

అలా మనవి ర్యాంకుల్ని చూసి ఆనందించే మొహాలే గాని, ఆ ర్యాంకర్లను ఉపయోగించుకొనే మొహాలు కావు. మరింత గట్టిగా చెప్పాలంటే గెలిచిన కోడినీ ఓడిన కోడినీ ఊళ్లో ఉండే మొత్తం కోళ్లనీ కలిపి ఒకే బుట్ట క్రింద కప్పెట్టే మొహాలు.
***

ఇపుడు వెంకయ్యగారు ఉపరాష్ట్రపతి అయ్యారు. మనవాళ్లు షరా మామూలుగా అదేదో పెద్ద ర్యాంక్ అని నమ్మింపజూస్తున్నారు. పౌరసన్మానాలూ ఫోటో సెషన్లు మాజోరుగా చేయిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ర్యాంకర్ గారు తరువాత రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా ఎలా ఉపయోగపడగలరో గాని, గవర్మెంటునుండి ఆ సన్మానం బిల్లులు వసూలు చేసేవారికి ఆ బిల్లుల్ని చెల్లించేవారికి మాత్రం ప్రస్తుతం బలేగా ఉపయోగపడుతున్నారు.

ఈయన మన రాష్ట్రప్రజలకు జీర్ణమయ్యే అన్నం కాదు, ఇంటికొచ్చే పంటా కాదు అనేది అందరికీ స్పష్టం.

అలా కాదు,
లాభనష్టాలప్రసక్తి లేకుండా పెద్దోళ్లని గౌరవించాలి కదా అంటే సరే అలాగే కానివ్వండి, ఎన్టీయార్ కు తన మామ అయ్యే అవకాశమిచ్చి గౌరవించిన వారిని మించి ఎవరున్నారు మర్యాదస్థులు మన దేశంలో?

ఆయనే స్వయంగా తన మిత్రులకు (బీజేపీకి) జీర్ణం కాని అన్నం.
ఆయనే స్వయంగా ఖర్జూరనాయుడింటికి చేరని పంట.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...