Showing posts with label Donation. Show all posts
Showing posts with label Donation. Show all posts

Sunday, 22 March 2020

దానరాజు - ధర్మరాజు

ఈ కథను మీరు కూడా చిన్నపుడు వినే ఉంటారు. మహాభారతంలో ఎక్కడా లేని కథ. అయినా, జానపదులు సృష్టించిన కథ కాబట్టి, మాంచి రసవత్తరంగా ఉంటుంది.

ఒకసారి అర్జునునికి ఒక సందేహం వచ్చిందట.

"కృష్ణా కృష్ణా, మా అన్నను ధర్మరాజు అంటారు. కర్ణుని దానరాజు అంటారు ఈ ఇద్దరిలో ఏ రాజు గొప్ప?" అని అడిగాడు.

"కొన్ని రోజులు ఓపిక పట్టు అర్జునా. అవకాశం రాగానే నీకే ఆ విషయం ప్రత్యక్షంగా తెలిసేలా చేస్తాను" అని కృష్ణుడు చెప్పాడు.

ఎండా కాలం గడిచిపోయింది. వానాకాలం వచ్చింది. ధర్మరాజు రాజుగా ఉన్నాడు కాబట్టి, లోకమంతా మంచి వర్షాలు కురుస్తున్నాయి.

"అర్జునా, పద. వారిద్దరిలో ఎవరు గొప్ప రాజో ఇప్పుడే తెలుసుకుందాం" అని కృష్ణుడు అన్నాడు.

వారిద్దరూ తమను ఎవరూ గుర్తుపట్టకుండా బ్రాహ్మణుల వేషాలు వేసుకొని బయలుదేరారు. మొదటగా వారు ధర్మరాజు దగ్గరకు వెళ్లారు.

"రాజా రాజా, మేము ఒక గొప్ప యజ్ఞం చేయదలచుకున్నాము. అందుకుగాను వేయి మణుగులు గంధపుచెక్క కావాలి. దయచేసి ఇప్పించండి" అని కోరారు.

ధర్మరాజు ఆశ్చర్యపోయి, "వర్షాకాలంలో యజ్ఞాలు చేయడం ఏమిటి? పైగా వేయి మణుగుల గంధపు చెక్కను ఉపయోగించి చేయడమేమిటి? ఇటువంటి యజ్ఞాలను గూర్చి నేను ఎన్నడూ వినలేదే?" అన్నాడు.

"రాజా! అది ఒక రకమైన ప్రత్యేకయజ్ఞం" అని మాత్రమే వారు చెప్పారు.

ధర్మరాజు సరేనని, వేయి మణుగుల గంధపుచెక్క ఎక్కడ దొరికినా తీసుకురమ్మని తన భటులను పంపాడు.

వారు రాజ్యమంతా తిరిగివచ్చి, "మహారాజా! వేయి మణుగులేమిటి? పదివేల మణుగులైనా గంధపుచెక్కకు కొరత లేదు. కానీ ఇపుడు వర్షాకాలం కావడం వల్ల, అంతా తడిచిపోయి లభిస్తుంది. యజ్ఞానికి అవసరమైన పొడి గంధపు చెక్క మాత్రం ఎక్కడా ఒక్క మణుగు కూడా ప్రస్తుతం దొరకటం లేదు" అని విన్నవించారు.

అప్పుడు ధర్మరాజు ఆ బ్రాహ్మణులకు నమస్కారం చేసి, "మహాత్ములారా! మన్నించండి. మీరు వర్షాకాలంలో చేయరాని యజ్ఞాన్ని చేయదలపెట్టారు. అందువలన మీకు ఆ ప్రకృతి సహకరించేలా లేదు. దయచేసి వర్షాకాలం పూర్తి అయిన తరువాత మీరు యజ్ఞం చేయదలచుకుంటే, అపుడు మీ ఇంటికి నేను మీరడిగిన వేయి మణుగుల గంధపుచెక్క తో పాటు మిగిలిన యజ్ఞసంభారాలన్నీ పంపిస్తాను" అని అని వినయంగా పలికాడు.

అపుడు ఆ కపటబ్రాహ్మణవేషధారులు సరేనని చెప్పి అక్కడ నుండి నేరుగా కర్ణుని దగ్గరకు వెళ్లారు.

"రాజా రాజా, మేము ఒక గొప్ప యజ్ఞం చేయదలచుకున్నాము. అందుకుగాను వేయి మణుగులు గంధపుచెక్క కావాలి. దయచేసి ఇప్పించండి" అని కోరారు.

కర్ణుడు సరేనని, వేయి మణుగుల గంధపుచెక్క ఎక్కడ దొరికినా తీసుకురమ్మని తన భటులను పంపాడు.

వారు రాజ్యమంతా తిరిగివచ్చి, "రాజా! వేయి మణుగులేమిటి? పదివేల మణుగులైనా గంధపుచెక్కకు కొరత లేదు. కానీ ఇపుడు వర్షాకాలం కావడం వల్ల, అంతా తడిచిపోయి లభిస్తుంది. యజ్ఞానికి అవసరమైన పొడి గంధపు చెక్క మాత్రం ఎక్కడా ఒక్క మణుగు కూడా ప్రస్తుతం దొరకటం లేదు" అని విన్నవించారు.

కపటబ్రాహ్మణులు నిరాశగా ముఖం పెట్టారు. అది చూసి కర్ణుడు "అయ్యా! ఒక్క క్షణం ఆగండి. మీరు అడిగినది మీకు తప్పక ఇస్తాను" అని పలికాడు.

తరువాత తన భటులను పిలిచి, "భటులారా, భటులారా, నా ఇల్లు శ్రేష్ఠమైన గంధపు చెక్కతో నిర్మించబడింది. వెంటనే దీనిని పడగొట్టి ఈ బ్రాహ్మణులకు అవసరమైనంత గంధపు చెక్కను ఇచ్చి పంపండి" అని ఆజ్ఞాపించాడు.

అది విని అర్జునుడు ఆశ్చర్యపోయాడు.
"ఆహా! ఈ కర్ణుడు ఎంతటి దానతత్పరుడు!" అని భావించి అతడి పట్టుదలను మెచ్చుకున్నాడు.

ఇంతవరకు ఇది జానపదులు అల్లిన ఒక అందమైన కథ.

)))(((

ఇపుడు మనము ఈ కథను మరికొంత పొడిగిద్దాం.

"ఆహా! కృష్ణా! ఈ కర్ణుడు ఎంతటి దానతత్పరుడు!" అని అర్జునుడు పలికాడు.

"అయితే మీ అన్న అయిన ధర్మరాజు గొప్పవాడా లేక దానరాజు అయిన ఈ కర్ణుడు గొప్పవాడా? నీ సందేహం తొలగిపోయిందా?" అని కృష్ణుడు ప్రశ్నించాడు.

"నిస్సందేహంగా కర్ణుడే గొప్పవాడు కదా?" అని అర్జునుడు తన అభిప్రాయాన్ని తెలిపాడు.

"ఎందువల్ల?"

"బ్రాహ్మణుల కోరికను తీర్చడం కోసం కర్ణుడు తన సొంత ఇంటినే త్యాగం చేశాడు కదా?"

"అయ్యో అర్జునా! కర్ణుడు ఎంతటి విలాసపురుషుడు కాకుంటే తన ఇంటిని గంధపు చెక్కతో కట్టుకున్నాడు? సరే, అది అతడి ధనం, అతడి ఇష్టం. కానీ అతడి ఇంటిలో ఉండేది అతడొక్కడే కాదు. అతడి తల్లిదండ్రులు ఉంటారు. అతడి భార్యాబిడ్డలు ఉంటారు. అతడి పరివారజనం కూడా ఉంటారు. వీరందరికీ సరిపడిన ఆహారపదార్థాలు ఉంటాయి. వీరందరూ ఉపయోగించుకునే వస్త్రాలు పడకలు మొదలైనవి ఉంటాయి. వాటన్నింటినీ విస్మరించి, మంచి వర్షాకాలంలో ఇల్లు పడగొడితే వారందరి గతి ఏమిటి? ఇంటిలో ఉండే ఆ వస్తువులకు పదార్థాలకు రక్షణ ఏముంటుంది? బ్రాహ్మణుల కోరికను తీర్చడం కోసం, తాను దానరాజును అనిపించుకొనడం కోసం అంతమందిని ఇబ్బంది పెట్టడం ధర్మమేనా?" అని కృష్ణుడు అర్జునుని అడిగాడు.

అర్జునుడు ఆలోచనలో పడ్డాడు.

"అర్జునా! దేనిని గూర్చి ఆలోచిస్తున్నావు?"

"నీవు చెప్పిన విషయాన్ని గూర్చే బావా!"

"దానిని గూర్చి తరువాత ఆలోచిద్దువు గాని, ముందు దీనిని గూర్చి ఆలోచన చేయవయ్యా!"

"దేనిని గూర్చి బావా?"

"ఇల్లు పడగొట్టమని కర్ణుడు ఆజ్ఞాపించాడు కదా? ఇదిగో, భటులందరూ వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ, పలుగులు, పారలు, గునపాలు, తట్టలు తెచ్చుకున్నారు. కాసేపట్లో ఇంటిని పడగొట్టేస్తారు. అలా పడగొడుతూ ఉండగానే, ఇంటిని కట్టిన గంధపుచెక్క కూడా వర్షంలో తడిచి పోతుంది. అపుడు ఇలా తడిచిన గంధపు చెక్కను మనం మన యజ్ఞంలో ఎలా ఉపయోగించుకుంటాం?"

"అవును బావా! నిజమే!"

"కాబట్టి, ఏదో ఒక విధంగా దానం చేయాలి, దానరాజును అనిపించుకోవాలి అనే ఉద్దేశం అన్ని సందర్భాలలోనూ మంచిది కాదు. కాలధర్మాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి."

"నిజమే బావా! తెలిసింది."

"ఏమి తెలిసింది?"

"దానరాజుగా ఉండటం కంటే, ధర్మరాజుగా ఉండటం గొప్ప."

"శభాష్ అర్జునా!"

)))(((

ఈ విధంగా పొడిగించిన కథను, హఠాత్తుగా ముగిస్తే బాగుండదు. కాబట్టి,

కృష్ణార్జునులు తమ కపటబ్రాహ్మణవేషాలు విడిచి, తామెవరమో, ఎందుకు వచ్చామో కర్ణుడికి తెలియజేసి, తన ఇంటికి వచ్చి "ఇది కావాలి" అని ఎవరైనా నోరు తెరిచి కోరితే, "వారికి ఆ వస్తువును ఏ విధంగా అయినా ఇచ్చి తీరాలి" అనే అతడి పట్టుదలను మెచ్చుకొని, అతడు తన ఇల్లును పడగొట్టుకొనడం ఆపించి, వారిద్దరూ అతని ఇంట ఒక వారం రోజులపాటు హాయిగా ఆతిథ్యాన్ని స్వీకరించి బయలుదేరారు అని చెప్పడం బాగుంటుంది.

)))(((

అప్పట్లో అది గంధపు చెక్క.
ఇప్పట్లో ఇది ఇసుక.
ధర్మరాజు గొప్పవాడా?
దానరాజు గొప్పవాడా?
⚖️
మరో కథ అవసరమా?
పాత కథ చాలు కదా?

మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
26 అక్టోబర్, 2019
❇️✳️❇️✳️❇️✳️

Saturday, 28 July 2018

దాతా భవతి వా న వా -2

(దాతా భవతి వా న వా? - రెండవభాగం - Part -2)
దానయోగ్యమైనవి ఏమున్నాయి?
కాదేదీ దానానికనర్హం అన్న రీతిలో చాల ఉన్నాయి.
దాత ఒక మనిషే. గ్రహీత కూడా మనిషే.
కాబట్టి దాత వద్ద ఉన్నది అందరికీ కాకున్నా ఎవరో మరొకరికి తప్పక అవసరపడుతుంది కదా.

<><><><><><>
పుస్తకదానం -
<><><><><><>

మా చిన్నపుడు -
మేము పై తరగతికి ప్రమోట్ కాగానే, మా పాఠ్యపుస్తకాలను మా జూనియర్ విద్యార్థులకు ఇచ్చే పద్ధతి ఉండేది. అలాగే మా సీనియర్ల నుండి మేము అందుకొనేవాళ్లం. అలా మాకు దేవుడిచ్చిన అన్నల్లా మా సీనియర్లు ఉండేవారు. పాఠశాలలో మాకు ఎలాంటి సమస్య వచ్చినా మేము వారికి చెప్పేవాళ్లం. వాళ్లు పరిష్కరించేవాళ్లు. లేదా పరిష్కారమార్గం చూపేవారు.
ఈ రోజుల్లో అంతటి సుహృద్భావాలు తక్కువైపోయినై. పై తరగతికి ప్రమోట్ అయిన తరువాత పుస్తకాలను సెకండ్ హ్యాండ్ బుక్ షాప్ వాడికి ఎంతో కొంత మొత్తానికి అమ్మేస్తున్నారు. జూనియర్స్ కూడా ఇచ్చినా ఎవరూ తీసుకొనటం లేదు. అబ్బే, ప్రజల్లో దాతృత్వభావన తగ్గటం కాని, లేదా తీసుకొనడానికి మొహమాటం పెరగటం కాని అందుకు కారణాలు కానే కావు.
అసలు కారణం కార్పొరేట్ విద్యాలయాలు!
అవి తమ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను లేదా స్టడీ మెటీరియల్ ను బలవంతంగా అంటగడుతున్నాయి. వాటి ఖరీదును ముక్కు పిండి బలవంతంగా వసూలు చేస్తున్నాయి.
ఇలా ఒకప్పుడు Charity begins at Home అనే సూత్రం అమలౌతూ ఉండగా, క్రమక్రమంగా వ్యాపారసంస్థలు మన జీవనంలోనికి దూరి ఆ సుహృద్భావనలను నాశనం చేయడం మొదలైంది. "జీవితమంటే వ్యాపారం" అనే దుర్మార్గభావాలను అవి బలవంతంగా బాల్యంలోనే మెదళ్లలోనికి చొప్పిస్తున్నాయి.
ఏ విత్తనం వేస్తే ఆ పంట పండటం సహజమే కదా! సమాజమంతా వ్యాపారపంటలు పండటం ప్రారంభమైనాయి. ఇప్పటికీ అవే పండుతున్నాయి.
<><><><><><>

గ్యూటెన్బర్గ్ మహాశయుల పుణ్యమాని అచ్చొత్తే పద్ధతి వచ్చాక పుస్తకమనేది అందరికీ అందుబాటులోనికి వచ్చింది. కంప్యూటర్ వచ్చాక పుస్తకముద్రణ మరీ తేలికైంది. కాని, అంతకు ముందు పుస్తకాలంటే తాళపత్రాల కట్టలే కదా - ఓ గ్రంథాన్ని వాటిపై వ్రాసి దానం చేయడమంటే ఎంతటి సమయం పట్టేదో - అది ఎంత కష్టమైన విషయమో ఊహించుకొనగలిగినవారికే - పుస్తకదానంలోని మహత్త్వం అర్థమౌతుంది.
ఔదార్యవంతులైన ధనవంతులు కొందరు వ్రాతగాళ్లను పోషిస్తూ, వారితో వివిధగ్రంథాలను కాపీ చేయిస్తూ, విద్యాలయాలకు, విద్యార్థులకు దానం చేసేవారట. అటువంటి మహాత్ములకు మన భారతజాతి మొత్తం ఎప్పటికీ ఋణపడి ఉంటుంది.
ఎప్పటి రామాయణభారతాలు? ఎప్పటి వాల్మీకివ్యాసులు?
వారి స్వహస్తలిఖితగ్రంథాలు శిథిలం కాకుండా మన తరం వరకూ ఉంటాయని అనుకోలేం.
దేశవ్యాప్తంగా అటువంటి అద్భుతగ్రంథాలను రక్షించుకొనేందుకు ఎంతెంతమంది కృషి చేసి ఉంటారు?
తరతరాలుగా ఎప్పటికప్పుడు వాటికి కాపీలు వ్రాయిస్తూ,
వాటిని కూలంకషంగా అధ్యయనం చేసేవారికి దానం చేస్తూ, గ్రంథాలయాలలో భద్రం చేస్తూ ఉండిన మహాదాతలు ఎందరు ఉండి ఉంటారు?
అందుకే కదా -
మనవరకు ఆ మహర్షుల ఉదాత్తభావాలు వచ్చి చేరాయి?
భారతదేశమంతటా ఆ రామాయణమహాభారతాలు ప్రఖ్యాతి చెంది ఉన్నాయంటే తరతరాలుగా ఎంతమంది తమ జీవితకాలాలను కఠోరశ్రమకోర్చి ఆ పుస్తకాలనిర్మాణానికి వెచ్చించి ఉంటారు?
వారు, వారిని ఆదరించి పోషించిన అజ్ఞాతదాతలు మనకు నిత్యవంద్యులు. ప్రాతఃస్మరణీయులు.
మా గురువుగారు తమ డాక్టరేట్ థీసిస్ లో పేరు కూడా తెలియని ఇటువంటి మహాభానువులు ప్రతి ఒక్కరికి ఎంతో భక్తితో కృతజ్ఞతలు సమర్పించి ఉండడం చూశాను. అది వారి సంస్కారం!
పుస్తకంలో కవి హృదయం ఉంటుంది. ఒక పుస్తకం చదివామంటే ఆ కవితో నేరుగా భాషిస్తున్నట్టే. అతి ప్రాచీన కవులతో ఆనాటి విషయాల గురించి చాటింగ్ చేయాలంటే ఆయా కవుల పుస్తకాలను చదవడమే ఏకైకోపాయం. అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ చదవడమే - మనకు ఎన్ని సార్లు సందేహం వచ్చినా మనపై కోప్పడకుండా మళ్ళీ మళ్ళీ ప్రశాంతంగా చెప్పేది ఆ పుస్తకంలోని కవి మాత్రమే కదా!
అలాంటి పుస్తకాలను ప్రజలకు చేరువ చేయాలని #రాయలసీమ బిడ్డడైన శ్రీ #గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారు మహోద్ధృతంగా #గ్రంథాలయోద్యమంచేశారు. తత్ఫలితంగా ఈనాడు సామాన్యునికి కూడా చేరువలో గొప్ప పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
<><><><><><>

యుద్ధాలు లేని కాలమంటూ లేదు. భారతీయరాజుల నడుమ యుద్ధాలు జరిగేవి. కాని, వారెన్నడూ ఓడిపోయిన ప్రాంతానికి చెందిన ప్రజలను బాధించలేదు. గెలిచిన రాజునుండి ప్రజలు రక్షణ పొందుతూ వారికి పన్ను కట్టారు. కాబట్టి ఎందరు రాజులు మారినా ప్రజలు సుఖంగానే ఉన్నారు.
కాని, ఆవిధంగా "అయ్యో పాపం" అనే సెంటిమెంట్లవంటి "బలహీనతలేమీ" లేని విదేశీయులు భారతదేశంపై దండయాత్రలు మొదలుపెట్టాక ప్రజలను దోచుకొనడం మొదలుపెట్టారు. విశ్వవిద్యాలయాలపై పడి సంఖ్యాధికమైన పుస్తకాలను తగలబెట్టేశారు. అధ్యాపకులను, విద్యార్థులను ఊచకోత కోశారు.
ఆ కాలంలో ఎన్నెన్ని శాస్త్రాలు (sciences) మంటగలిసి పోయాయో! తరువాత యూరోపీయపాలకులు వచ్చాక కూడా ఎన్నెన్ని పుస్తకాలు మన గ్రంథాలయాలనుండి అపహరింపబడ్డాయో! భారతీయులు తేనెటీగల్లా శ్రమించి కూడబెట్టుకున్న జ్ఞానమకరందాన్ని విదేశీయులు ఎలుగ్గొడ్లలా వచ్చి నాశనం చేసినంత చేశారు, త్రాగినంత త్రాగారు, ఎత్తుకుపోయినంత ఎత్తుకుపోయారు.
అయినా, మనం ఈనాటికీ వాళ్లు కోహినూర్ ఎత్తుకుపోయారని ఏడుస్తాం. నెమలిసింహాసనం ఎత్తుకుపోయారని ఏడుస్తాం. అమరావతి స్థూపాన్ని పెళ్లగించుకు పోయారని ఏడుస్తాం. వాటిని మనకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తాం. అవి ఖచ్చితంగా విలువైనవే.
కాని, వాళ్లు నాశనం చేసిన శాస్త్రగ్రంథాలు మరింత విలువైనవి. వెలకట్టలేనివి. వాటికోసం ఎవ్వరూ ఏడవరు, వాటి విలువ తెలిసినవారు తప్ప!
ఇది ఇలా ఉండగా మరికొందరు తయారయ్యారు -
తమకు ఇష్టంలేని ఒకటి రెండు విషయాలు ఏదైనా ఒక పుస్తకంలో కనబడితే చాలు - ఆ పుస్తకం తగలబెట్టెయ్యండి అనే వాళ్ళు, ఆ పుస్తకాన్ని బహిష్కరించండి అనే వాళ్ళు, ఆ పుస్తకాలను జనజీవనస్రవంతి నుండి తప్పించాలి అనే వాళ్ళు..
ఈ మధ్యనే ఒకాయన భారతజాతి శీలాన్ని నిర్దేశించే రామాయణమహాభారతాలను భారతదేశ ప్రజలకు దూరం చేయాలంటూ రాగం అందుకున్నారు కూడా. 
<><><><><><>

వైజ్ఞానికంగా ఎంతో ముందున్న భారతీయులు దిగజారిపోవడం అప్పటినుండే ప్రారంభమైంది. ప్రోత్సహించే దాతలు కరువయ్యారు. విదేశీప్రభుత్వాలు స్థానికపరిశోధనలను ప్రోత్సహించడం అటుంచితే వెతికి వెతికి నాశనం కూడా చేశాయి.
అగ్గిపెట్టెలో పట్టేంతటి చీరను నేయగల నేతగాళ్ల వ్రేళ్లను బ్రిటిషువారు నిర్దాక్షిణ్యంగా నరికించారని అంటారు. పబ్లిగ్గా జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండకు ఏమాత్రం సిగ్గుపడని బ్రిటిషు వాళ్లు, అజ్ఞాతంగా ఇటువంటి క్రూరకృత్యాలను ఏమీ చేయించలేదు అంటే ఎవరూ నమ్మరు.
సరే, స్వాతంత్ర్యం వచ్చిన తరువాతనైనా భారతీయవైజ్ఞానిక పరిశోధనలు ముందుకు దూసుకుపోవడం లేదేమి అంటే -
ఒకటే కారణం -
శాస్త్రజ్ఞానమెపుడూ రిలే పరుగులాంటిది. సీనియర్ శాస్త్రవేత్తలు అందించిన జ్ఞానాన్ని జూనియర్లు అందుకొని, తాము కూడా దాని అభివృద్ధికి కృషి చేసి, తమ పరిశోధనఫలితాలను తమ జూనియర్లకు భద్రంగా అందించాలి.
కాని, మన దేశంలో సుదీర్ఘమైన విదేశీపాలన ఫలితంగా మన పూర్వవిజ్ఞానశాస్త్రవేత్తలతో మనకుండిన link తెగిపోయింది.
ఇంగ్లీషు మోజులో శాస్త్రభాష అయిన సంస్కృతాన్ని వదిలేశాం. సంస్కృతాన్ని నేర్చుకున్నవారు కూడా చాలమంది సంస్కృతమంటే కాళిదాసు, కొన్ని సుభాషితాలు, కొన్ని చమత్కారశ్లోకాలు, కొన్ని స్తోత్రాలు, కాస్త జ్యోతిషం - ఇలాంటివి మాత్రమే అనుకొని వాటిలో చెప్పుకోదగినంత పరిశ్రమ చేసి, ఈ జీవితానికిది చాలు అనుకుంటున్నారు.
కాలిపోయినవి కాలిపోగా, అపహరణకు గురైనవి పోగా, మిగిలిన శాస్త్రగ్రంథాలు ఇంకా తాళపత్రాల రూపంలోనే ఉన్నాయి. అవి కూడా దేవనాగరిలిపిలో ఉన్నవి తక్కువ. సంస్కృతమే అయినా రకరకాల లిపులలో ఉన్నాయి. వాటిలో కూడా, ఘుణాక్షరాలేవో వ్రాతగాని అక్షరాలేవో సరిగా గుర్తించాలంటే తలప్రాణం తోకకొస్తుంది. ఆ ప్రాచీన లిపులను నిర్దుష్టంగా చదవగలిగిన వారు అసలు దేశంలో ఉన్నారో లేరో అనిపిస్తుంది!
అయినా, వాటిని పరిశోధించేందుకు నిధులిచ్చే దాతలు లేరు. నేటి ప్రభుత్వాలకు పుష్కరాలనిర్వహణమీద ఉన్నంత శ్రద్ధ ఇటువంటి పనులలో లేదు.
కాబట్టి, విజ్ఞానశాస్త్రానికి భారతీయుల contribution ఏమీ లేదు అనుకుంటూ, మనలను మనం తక్కువ చేసుకుంటూ inferiority complex తో బ్రతకాల్సిందే మనం. అది మనం చేసుకున్న "ఖర్మ".
ఇపుడు మరింత బాగా అర్థమౌతుంది కదా, - "दाता भवति वा न वा - దాత అనేవాడొకడు ఉన్నాడో లేడో" - అనే కవిగారి మాటలోని ఆవేదన?
ఆవేదన కవికి మాత్రమే కాదుట, పుస్తకానికి కూడా ఉంటుందట -
అది ఆవేదనతో - "నాయనలారా, నన్ను నూనెనుండి, నీటినుండి రక్షించండి. నా కుట్లు ఊడి శిథిలం అయిపోకుండా కాపాడండి. దయచేసి మూర్ఖుని చేతికి ఇవ్వకండి" అని వేడుకుంటుందట పాపం.
తైలాద్రక్షేద్ జలాద్రక్షేద్ రక్షేచ్చిథిలబంధనాత్।
మూర్ఖహస్తే న దాతవ్యమ్ ఏవం వదతి పుస్తకమ్।।
కాబట్టి, పుస్తకదానం గొప్పదే - కానీ దాని గొప్పదనం అర్థం చేసుకోలేని వానికి చేరితే దానికి మరణమే గతి. తప్పదు - అక్కడ కాస్త జాగ్రత్త పడాలి అని పెద్దల మాట.
ఈరోజుల్లో డిజిటల్ పుస్తకాలు వచ్చాక రక్షణ కాస్త సులువైనట్లుగా అనిపిస్తోంది. కాని అందులో కూడా ఏవో కష్టనష్టాలు ఉండకపోవు. 

దాతా భవతి వా న వా - 1

(మొదటి భాగం - Part 1)
శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః।
వక్తా దశసహస్రేషు దాతా భవతి వా న వా।।

నూరుగురిలో ఒక శూరుడు పుడతాడు.
వేలమందిలో ఒక పండితుడు పుడతాడు.
పదివేలమందిలో ఒక వక్త పుడతాడు.
కాని దాత అనేవాడు ఒకడు పుడతాడో లేదో!

చూశారా?
సకలశుభలక్షణాలు కలిగినవారు కొందరైనా ఎంతో కొంత మొత్తంలో పుడుతున్నారు కాని దాత మాత్రం పుడతాడో లేడో అంటూ విచారం వ్యక్తం చేశాడో కవి. దాతలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నా సప్లై తక్కువగా ఉందని అర్థం కావట్లా పాపం?
దాత అనగానే ఎలాంటి మనిషిని ఊహిస్తాం ?
రోజూ ఓ శుభముహూర్తాన తన ఇంటి ముందు క్యూలో నిలబడిన పేదవాళ్లకు బట్టలు డబ్బులు పంచి, అమ్మా, అయ్యా, అదే చేత్తో మా ఇంట భోజనం చేసి వెళ్లండంటున్న ఓ మధురమందహాసముఖుడిని ఊహిస్తామా?
ఆఫీసులో తన ఏసీ ఛాంబర్లో కూర్చుని, ఎవరో ఆర్గనైజర్లు తన దగ్గరకు వచ్చి, తాము చేయబోతున్న ప్రజోపయోగకరమైన పని ఏదో చెప్పగానే, కన్విన్సైపోయి, వారు ఊహించనంత పెద్ద మొత్తానికి ఓ చెక్కు వ్రాసిచ్చే ఓ గొప్ప వ్యాపారవేత్తను ఊహిస్తామా?
ఊహ ఎలా ఉన్నా, దాత అనగానే, తన దగ్గర తన అవసరానికంటె ఎక్కువ ఉన్న వస్తువులనో లేక ధనాన్నో ఇతరులకు ఇచ్చేవాడని అనుకుంటాం కదా? ఎంత పెద్ద రిజర్వాయరైనా తన కడుపులో ఎన్ని నీళ్లని దాచుకోగలదు? వరద వస్తే వదిలేస్తుంది కదా? వదలకపోతే పగిలిపోతుంది కదా? ప్రాణం లేని రిజర్వాయర్ కు కూడా ఆమాత్రం జ్ఞానముంది కదా?
<><><><><><>
దానాలు ఎన్ని రకాలు?
సాత్త్వికదానం, రాజసికదానం, తామసికదానం అంటూ భగవద్గీత చెబుతుంది. (17-20,21,22)
ప్రతిఫలాపేక్షలేకుండా దేశకాలపాత్రోచితంగా చేసే దానం సాత్త్వికం.
ప్రతిఫలాన్ని ఆశిస్తూనో, బాధతోనో చేసే దానం రాజసం.
దేశకాలపాత్రౌచిత్యాలను ఎరుగకుండా తిరస్కారభావంతో చేసే దానం తామసం.
<><><><><><>

దానం ఎంత శ్రద్ధగా చేయాలో తైత్తిరీయోపనిషత్తు చెబుతుంది. 
(శిక్షావల్లి-ఏకాదశోऽనువాకః) 
శ్రద్ధయా దేయమ్ = 
ప్రేమపూర్వకంగా, ఆదరపూర్వకంగా, ఆలస్యం చేయకుండా, అవసరాన్ని గుర్తించి చేయాలి.
అశ్రద్ధయాऽదేయమ్ = 
బాధపడుతూ గాని, తిరస్కారభావంతో గాని, ఇవ్వరాదు. 
శ్రియా దేయమ్ = 
తన సంపదకు తగినట్లు ఇవ్వాలి. (సంపదకు మించి దానం చేయడం వద్దు అని కూడా అర్థం)
హ్రియా దేయమ్ = 
సంకోచిస్తూ దానం చేయాలి. (అయ్యో, నేను ఇస్తున్నది ఈయనకు సరిపోతుందో లేదో అని)
భియా దేయమ్ = 
భయంతో ఇవ్వాలి. (నా యజమాని అయిన భగవంతుడు నాకు ఇచ్చినది నేను ఇతరులకు ఇస్తున్నాను. ఇది భగవంతుని కార్యమే కాని, నా పని కాదు, ఇందులో లోపాలుంటే భగవంతునికి కోపం వస్తుందనే భయంతో ఇవ్వాలి)
సంవిదా దేయమ్ = 
స్వీకరించేవాని యోగ్యతకు తగినట్లు చేయాలి.
<><><><><><>
ఐదు కారణాలవల్ల దానాలు జరుగుతాయని వ్యాసమహాభారతం చెబుతుంది.
(అనుశాసనపర్వ-దానధర్మపర్వ- 138.5,6,7,8,9,10)

1 ఇహలోకంలో కీర్తిని పరలోకంలో సుఖాన్ని కోరి చేసే దానాలు. 
2 నేను ఇతని వల్ల మేలు పొందాను అనే కృతఙ్ఞతతోనో, లేదో ఇతని వల్ల నాకు రాబోయే కాలంలో మేలు కలుగుతుందనే భావంతోనో చేయబడే దానాలు.
3 వీనికి ఇవ్వకుంటే నాకు అపకారం చేస్తాడని భయపడి చేసే దానాలు.
4 వీడు నాకు ఆప్తుడు, కావలసినవాడు అని ప్రేమతో చేసే దానాలు. 
5 పాపం వీడు దీనుడు, అభిమానం వదులుకొని యాచిస్తున్నాడు, ఎంత చిన్నమొత్తం ఇచ్చినా దాంతోనే సంతోషపడతాడు అని జాలిపడి చేసే దానాలు.
<><><><><><>
దానాలు చేయడం వల్ల వివిధ పుణ్యలోకాలలో సుఖంగా ఉండవచ్చునని పురాణాలు ఉద్ఘోషిస్తూ ఆశపెట్టడం ఎందుకు - అంటే - దాతలను తయారుచేయడానికే! వాపీకూపతటాకాలయారామాదుల నిర్మాణం చేయించేవాడు కూడా దాతగానే పరిగణింపబడ్డాడు. కరువురోజుల్లో ప్రజలు అల్లలాడిపోతుంటే వారిని కూర్చోబెట్టి పోషించడం కాకుండా, వారితో చెఱువులు బావులను తవ్వించడం, దేవాలయాలను కట్టించడం వంటి పనుల ద్వారా ఆయా శ్రమజీవులకు, ఆయా వృత్తులను నమ్ముకొని బ్రతికేవారికి ఆవిధంగా జీవనభృతి కల్పించడమనేది - నిష్కారణదానంతో సమానమైన పుణ్యకార్యంగా గుర్తించబడింది.

దీన్ని మనం ఆధునికీకరించడానికి a planned social crisis management గా కూడా గుర్తించవచ్చు. అడవుల్లో తినడానికి ఏమీ దొరకనపుడు చిరుతపులులు ఊళ్లమీద పడి గొఱ్ఱెలు, మేకలు, దూడలు, కోళ్లు, కుక్కలను లాక్కుపోతుంటాయి కదా? అలాగే కరువు రోజుల్లో మంచి క్రమశిక్షణ కలిగిన ప్రజలు కూడా, ఆకలిబాధకు తట్టుకోలేక, తెగబడి, దొంగలుగా దోపిడీదార్లుగా మారే అవకాశం ఉంది. దానిని నివారించడానికి ఉత్తమమార్గం - ఆ కరువు రోజుల్లో వారికి పనికి ఆహారం పథకం ద్వారా జీవనోపాధిని చూపడమే. అందువల్ల ధనవంతులకు డబ్బు నష్టమైనా, శాశ్వతమైన కీర్తి లభిస్తుంది కదా!

కాని మన దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో కరువునివారణ అనేది కేవలం గవర్నమెంటు చేయవలసిన పనిగా ధనవంతులు తమ బాధ్యతలనుండి తప్పుకుంటున్నారు. కరువు లేనపుడు తమ సంపద పెరగడానికి ఉపయోగపడిన సామాన్యప్రజలు కరువు కాలంలో మోయరాని భారంగా కనపడడం అన్యాయం కదా? అందుకే - దాత అనేవాడు అసలు పుడతాడో లేడో అని ఒక సామాజికస్పృహ కలిగిన కవి వాపోయింది. 
<><><><><><>
సరే, అసలు దానయోగ్యమైనవి ఏమిటి? అంటే -
"కాదేదీ దానానికి అనర్హం" అన్నట్టు చాలానే ఉన్నాయి.
(ఇంకా ఉంది)

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...