Showing posts with label Love. Show all posts
Showing posts with label Love. Show all posts

Friday, 12 April 2019

ప్రజలు కోరుకున్న రాజలక్షణాలు


దశరథుడు ఒక సుప్రసిద్ధుడైన ఇక్ష్వాకువంశపు మహారాజు.  అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని, కోసలరాజ్యాన్ని ఆయన చాల కాలం పరిపాలించాడు.  ఆయన గొప్ప విద్యావంతుడు.  దేవదానవయుద్ధాలలో దేవతల పక్షాన యుద్ధం చేసి, వారికి ప్రీతిపాత్రుడైన మహావీరుడు.  వందలాది యజ్ఞాలను చేసినవాడు.  గొప్ప దానాలు చేసి అందరినీ సంతృప్తిపరచినవాడు.  దేవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం, విప్ర ఋణం, ఆత్మ ఋణం మొదలైన పంచఋణాల నుండి విముక్తుడైనవాడు.  తన పూర్వుల వలెనే ప్రజల శ్రేయస్సు కోరి, యథాశక్తి, ఎంతో జాగ్రత్తగా పరిపాలించినవాడు.  అరవైవేల సంవత్సరాలు అలా పరిపాలించిన తరువాత, ఆయన అలసిపోయాడు.  తన వారసుడైన రామునికి రాజ్యం అప్పగించి తాను విశ్రాంతి తీసుకొనదలిచాడు.  
ఒకనాడు ఆయన కొలువుదీర్చి, తన అభిమతాన్ని ప్రజలందరి సమక్షంలో వెల్లడించాడు.  ఆ మాటలను విని, ప్రజలందరూ హర్షించారు.  ఏకగ్రీవంగా తమ సమ్మతిని తెలియజేశారు.
రాముని పట్ల ప్రజలకున్న ఇష్టాన్ని తెలుసుకుని దశరథుడు  సంతోషపడినప్పటికీ, “ఎందువల్ల మీరు రాముని కోరుకుంటున్నారు?  నేను ధర్మానుగుణంగా రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఉన్నాను కదా?  నా పరిపాలన మీకు నచ్చలేదా?  రాముడు మీకు ఎందుకు ఇష్టమో చెప్పవలసింది” అని ప్రజలనే అడిగాడు.
అపుడు ప్రజలు తాము రాముని ఎందుకు ఇష్టపడ్డారో స్పష్టంగా చెప్పారు.  
“మహారాజా!  రాముడు గొప్ప విద్యావంతుడు.  గురువుల మెప్పుకు పాత్రుడైనవాడు. 
(సమ్యక్ విద్యావ్రతస్నాతః)  

అతడు పరిపాలనకు తగిన శిక్షణను చక్కగా పొందినవాడు.  (ద్విజైరభివినీతశ్చ)  

ధర్మం తెలిసినవాడు. (ధర్మజ్ఞః)  అందువలన ప్రజలలో ఎటువంటి వైషమ్యాలు తలెత్తకుండా, ఒకరి పనికి ఇంకొకరు అడ్డు తగలకుండా అన్ని వ్యవహారాలూ సక్రమంగా జరిగేటట్లు చూడగలడు.   ప్రజాజీవనం ప్రశాంతంగా సాగేటట్లు చేయగలడు.  

అతడు ధర్మానికి కట్టుబడినా, అర్థాన్ని (అంటే ఆర్ధికరంగాన్ని) నిర్లక్ష్యం చేసేవాడు కాదు.  అట్లని, అర్థానికి అధికప్రాధాన్యతను ఇచ్చి, ధర్మాన్ని తక్కువచేసేవాడు కాదు.  (ధర్మశ్చాపి శ్రియా సహ)
రాముడు ఎల్లపుడూ సత్యమే పలుకుతాడు.  (సత్యసంధః)  అందువల్ల, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు.  అవసరం కోసం అబద్ధమాడటం, అవసరం తీరిన తరువాత ముఖం చాటువేయటం వంటి దుర్గుణాలు ఆయనలో లేవు.
 
రాముడు సహజంగానే మంచివాడు.  (సత్పురుషః)   అందువల్ల అతనికి మంచి స్నేహితులు కూడా ఏర్పడతారు.  చెడ్డవారైనా అతడితో స్నేహం చేస్తే మంచివారౌతారు.

అతడు శీలవంతుడు (శీలవాన్).  లోకంలో మంచిపనులుగా ఏవి చెప్పబడతాయో వాటిని చేస్తాడు.  చెడ్డపనులుగా ఏవి చెప్పబడతాయో వాటిని ఎన్నడూ చేయడు.  

అతడు అసూయ లేనివాడు.  (అనసూయకః)  ఇతరులలో ఉండే సద్గుణాలను చూసి ఆనందిస్తాడు, అభినందిస్తాడే తప్ప, వారిలో తప్పులు ఎంచడు.  

అతడు చిన్న చిన్న తప్పులు చేసే వారిని క్షమించి, వారు మరలా అటువంటి తప్పులు చేయకుండా ఉండేందుకు సహకరిస్తాడు.  (క్షాంతః)  

అతడు కష్టాలలో ఉన్నవారిని ఓదార్చి, యథాశక్తి సహాయం చేస్తాడు.  (సాన్త్వయితా)  

అతడు గొప్ప మనఃస్థైర్యం కలిగినవాడు.  (స్థిరచిత్తః)  ఎన్ని కష్టాలు ఎదురైనా చలించని తత్త్వం కలిగినవాడు.  తనకుండే వైభవాలకు, తనకు లభించే విజయాలకు, ఒళ్లు మరచి పొంగిపోయేవాడు కాదు.  

అతడు ఇతరులు తనకు చేసిన సహాయాలను ఎన్నడూ మరచేవాడు కాదు.  (కృతజ్ఞః)     

అతడు ప్రజలందరితోనూ మంచిగా మాట్లాడతాడు (ప్రియవాదీ)  

ఎదుటివారు తనను పలకరిస్తే అపుడు బదులు పలుకుదామని ఎదురుచూడకుండా, తానే మొదట చిరునవ్వుతో వారిని పలుకరిస్తాడు.  (స్మితపూర్వాభిభాషీ
ఎంతటి సత్పురుషులైనప్పటికీ, అధికారం లభించిన తరువాత వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు.  కాని, రాముడు అటువంటి వాడు కాదు.  అతడు తన ఇంద్రియాలమీద సంపూర్ణమైన అదుపు సాధించినవాడు.  (విజితేన్ద్రియః)  అందువలన అన్ని రకాల వ్యసనాలకు, బలహీనతలకు దూరంగా ఉంటాడు.  

రాముడు అత్యంతసమర్థుడై, ఎంతటి భారాన్ని వహిస్తున్నప్పటికీ, గొప్ప సహనం కలిగినవాడు.  
(వసుధాయాః క్షమా)  

అతడు బుద్ధిలో బృహస్పతివంటివాడు.  (బుద్ధ్యా బృహస్పతేః తుల్యః)  అందువల్ల, ఇతరులు తనను తప్పు దారిలో నడిపేందుకు ప్రయత్నిస్తే, వివేకంతో అటువంటి వారిని దూరం పెట్టగలిగినవాడు.  

అతడు మహా పరాక్రమవంతుడు కూడా.  (వీర్యే సాక్షాత్ శచీపతేః)  అందువల్ల, ఎవ్వరూ అతడి మీద వత్తిడి తీసుకువచ్చి, తమకు అనుకూలమైన పనులు తప్పుదారిలో చేయించుకొనలేరు.  

తనకు వ్యతిరేకులైన వారిని విమర్శించేందుకు గాని, ఆడిపోసుకొనేందుకు అతడు ఆసక్తిని కనబరచడు, తన అమూల్యమైన సమయాన్ని ఆ విధంగా ఎన్నడూ వ్యర్థం చేసుకోడు. 
(న విగృహ్య కథారుచిః)   

తన పరిపాలనలో లోటుపాట్లను తెలుసుకొనేందుకు, వాటిని తొలగించుకునేందుకు, సరిదిద్దుకునేందుకు, తన పరిపాలన గాడి తప్పకుండా, మెరుగుగా, సక్రమంగా కొనసాగించేందుకు మేధావులు, పెద్దలు, పండితులు, అయినవారిని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ, వారి సలహాలను ఆదరిస్తూ, పాటిస్తూ ఉంటాడు. 
(బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానామ్ ఉపాసితా।)
 
పరిపాలనాభారం అనే నెపంతో అతడు ప్రజలకు దూరంగా ఉండడు.  ప్రజలతో సమావేశమై, వారు తన కుటుంబసభ్యులే అయినట్లు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఉంటాడు.  (పౌరాన్ స్వజనవత్ నిత్యం కుశలం పరిపృచ్ఛతి।)   

ప్రజలకు కష్టాలు కలిగినపుడు అతడు చాల బాధ పడతాడు.  వారు ఉత్సాహంతో పండుగ చేసుకుంటున్నపుడు ఒక ఇంటి పెద్ద పిల్లల ఆటలను చూసి ఆనందపడినట్లు సంతోషిస్తాడు.
(వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః।  
ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి।।)  

పక్షపాతరహితంగా అందరికీ శ్రేయస్సును చేకూర్చేందుకు ప్రయత్నిస్తాడు.  
(సమ్యగ్ యోక్తా శ్రేయసామ్)
రామునికి అసలు కోపమే రాదు.  అయినప్పటికీ, ప్రజలకు గాని, ధర్మానికి గాని ఎవరివల్లనైనా హాని కలిగితే అతనికి కోపం వస్తుంది.  రామునికి పక్షపాతం అనేది లేదు.  అయినప్పటికీ, ప్రజలకు గాని, ధర్మానికి గాని విశేషమైన ఉపకారం చేసినవారి పట్ల అతడికి అనుగ్రహం కలుగుతుంది.  అటువంటి రాముని కోపం గాని, అనుగ్రహం కాని ఎన్నడూ వృథా కావు.  
(నాస్య క్రోధః ప్రసాదశ్చ నిరర్థోऽస్తి కదాచన।)  

దండనార్హుడైనవానిని నియమం ప్రకారం, అంటే చట్టం ప్రకారం, దండించే తీరుతాడు.  నిర్దోషి పట్ల ఎన్నడూ కోపం చూపనే చూపడు.  (హన్త్యేవ నియమాద్ వధ్యాన్ అవధ్యే చ న కుప్యతి।)  అలాగే, తన అనుగ్రహానికి పాత్రుడైన వాడు మరింత మంచి పనులు చేసేందుకు ప్రేరణగా అతడికి సకల ప్రయోజనాలను చేకూరుస్తాడు. (యునక్త్యర్థైః ప్రహృష్టశ్చ తమసౌ యత్ర తుష్యతి।)      
అటువంటి రాముడికి సంపూర్ణమైన బలము, ఆరోగ్యము, ఆయుష్షు చేకూరాలని, రాష్ట్రంలోనూ రాజధానిలోనూ ప్రజలందరూ కోరుకుంటున్నారు.
(బలమారోగ్యమాయుశ్చ రామస్య విదితాత్మనః।  
ఆశంసతే జనస్సర్వో రాష్ట్రే పురవరే తథా।।)           
అందరూ ధనంతో శ్రీమంతులౌతారేమో గాని, రాముడు మాత్రం ఇటువంటి గుణాలతో కూడా శ్రీమంతుడైనవాడు.  అందువల్ల, ప్రజలు అతనిని తమ రాజుగా కోరుకుంటున్నారు.  (తమేవంగుణసంపన్నమ్ అకామయత మేదినీ।)     
ఈవిధంగా, స్వయంగా ప్రజలే, తాము రాముని ఎందుకు కోరుకుంటున్నామో తమకు ఎటువంటి పాలకుడు ఇష్టుడు అవుతాడో దశరథునికి వివరించారు.  దశరథుడు తన కుమారుని గుణగణాలను ప్రజల నోటినుండి విని “అహోऽస్మి పరమప్రీతః” అంటూ ఎంతగానో సంతోషపడ్డాడు.
ఆనాడైనా, ఈనాడైనా ఇటువంటి గుణాలు పాలకులకు ఎంతో ఆదర్శప్రాయమైనవి.  ఈ గుణాలను అలవరచుకునే పాలకులు, తప్పకుండా ప్రజల ప్రేమకు పాత్రులౌతారు అనడంలో సందేహం లేదు.

(పరాయి పాలకుల చెరనుండి విడివిడిన తరువాత. భారతదేశం ప్రజాస్వామ్యదేశంగా అవతరించింది అని చరిత్ర చెబుతుంది.  అంటే, ప్రజల అభిప్రాయం ప్రకారం పరిపాలన కొనసాగే దేశం అన్న మాట.  ఇది ఎంతో గొప్ప పద్ధతిగా ఈనాటి రాజకీయశాస్త్రజ్ఞులు కీర్తిస్తారు.  భారతదేశంలో ఇటువంటి ప్రజాస్వామ్యపు పద్ధతి రామాయణకాలంలోనే ఉన్నట్లుగా వాల్మీకిమహర్షి రచన ద్వారా తెలుస్తుంది.  దశరథుడు, అతని కుమారుడైన రాముడు ప్రజల అభిప్రాయానికి ఎంతో విలువనిచ్చేవారని రామాయణం వర్ణిస్తుంది.  ముఖ్యంగా, తమకు ఎటువంటి రాజు కావాలి అనే విషయంలో ఆనాటి ప్రజలు ఒక స్పష్టమైన, అందరికీ అంగీకారయోగ్యమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారని తెలుస్తుంది.  ఆ అభిప్రాయాలు ఆనాటికే కాదు, ఈనాటికి కూడా చక్కగా వర్తిస్తాయి.  ఎందువల్లనంటే, ఆ అభిప్రాయాలు రాజును నియంత కాకుండా ఆపుతాయి.  అవి సమాజంలో ధర్మాచరణకు, ధర్మరక్షణకు అనుకూలమైనవిగా కూడా ఉన్నాయి.  అవే ఈ వ్యాసంలో చెప్పబడ్డాయి.)

{ఈ వ్యాసం 2019 ఏప్రిల్ నెల, ఏర్పేడు వ్యాసాశ్రమం వారు ప్రచురించే యథార్థభారతి పత్రికలో ప్రచురింపబడింది.}

Saturday, 29 December 2018

కర్మయోగులు



చలికాలం...
పొద్దునే లేస్తే చంపేస్తాననే కాలం...

పొద్దు పొడిచినా ముసుగు తీసి బయట అడుగుపెట్టేందుకు భయపడే కాలం...
అడుగు పెడితే ముఖం చుట్టూ కోతి టోపీ గాని, మఫ్లర్ గాని అలంకారంయ్యే కాలం... ఓ పది నిమిషాలు ద్విచక్ర వాహనం నడిపితే చాలు వేళ్ళు కొంకర్లు పోయే కాలం... మన ప్రమేయం లేకుండానే, లయబద్ధంగా దంతసంగీతం పుట్టే కాలం... అరచేతులు ఖాళీగా ఉండక చంకల్లోకో ప్యాంటు జేబుల్లోకో దూరి దాక్కునే కాలం... సూర్యభగవానుడి కిరణకటాక్షాలకోసం అంతా ఆశగా ఎదురుచూసే కాలం... 

ఇంత భయంకరకాలంలో కూడా...
కొందరు తమ విధినిర్వహణలో గాని బ్రతుకు పోరాటంలో గాని ఏమరటం లేదు...

మనకు కనీసం ప్రొద్దున ఆరింటికల్లా పేపర్ అందాలంటే పేపర్ బాయ్ కనీసం మూడున్నరకల్లా లేచి పేపర్ సెంటర్ కు పరుగెత్తాలి. మనకు పాలు సరైన సమయానికి కావాలంటే పాలవాళ్ళు నాలుగింటికల్లా లేచి పాల ప్యాకెట్లు అందుకుని మనకోసం ఎదురు చూస్తూ కూర్చోవాలి. అదే సమయానికల్లా టీ కొట్టు వాళ్ళు తమ సరంజామాతో సిద్ధం అయిపోవాలి. ఏ రాత్రి పూట మనకు ఏ అవసరం రావచ్చునో అని ఆటోవాలాలు తమ ఆటో వెనుక సీట్లోనే రాత్రంతా నిద్రపోతూ పొద్దున్నే ఎవరైనా ఓ బాగ్ తోనో సూట్ కేసు తోనో కనబడితే చాలు, "స్టేషన్ కా అన్నా, బస్టాండ్ కా?" అని ఆశతో అడుగుతూ ఉండాలి. చీకటితోనే కూరగాయలు పళ్ళు వ్యాన్లలోనూ లారీలలోనూ వస్తే వాటిని దించి ఆయా దుకాణాలలోనికి చేర్చేందుకు కూలీలు, తోపుడు బళ్ళ వాళ్ళు, ఎద్దులబళ్ల వాళ్ళు సకాలంలో సంసిద్దంగా ఉండాలి. 

ఇందులో వింత ఏముంది? వారు బ్రతకడం కోసం ఆమాత్రం వారు చేయకూడదా? అని మనం అనుకోవచ్చు. తప్పేం లేదు.

కాని, మనం మన ఇంట్లో నాలుగు గోడల మధ్య వెచ్చగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వెన్నుపామును వంగదీసెంత చలిలో వారంతా మనకోసమే - మన అవసరాల కోసమే - మనకు సేవ చేసేందుకు మాత్రమే - వాళ్ళు పరుగెడుతూనే ఉన్నారు, ఎదురు చూస్తూనే ఉన్నారు, సిద్ధం అవుతూనే ఉన్నారు, ఆశతో అడుగుతూనే ఉన్నారు, సంసిద్ధంగానే ఉన్నారు. 

ఇక్కడ ఉదాహరించిన వారు కొందరు మాత్రమే, ఇలాంటి కర్మవీరులు ఇంకా ఎందరు అజ్ఞాతంగా ఉన్నారో?

వారు మన సోదరులు, వారు మన తోటి పౌరులు, వారు కూడా మనతో పాటు మన దేశ అదృష్ట దురదృష్టాలను పంచుకుంటున్న వారు, వారికి కూడా మనలాగే జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి. మనం వారి పట్ల జాలితోనో దయతోనో, ప్రేమతోనో లేక అత్మీయతతోనో వారి సేవలను వినియోగించుకుంటేనే వారికి సుఖం కలుగుతుంది. 

తీరిగ్గా పొద్దున్న పదింటికి తలుపులు తెరిచి జేబులు అదరగొట్టేంత ఖరీదుతో మన ఆదాయాన్ని దోచుకొనే రిలయన్స్ మార్టులకు, బిగ్ బజారులకు, స్పెన్సర్లకు, వాల్మార్టులకు మనం ఎగబడి వారి దగ్గరే ఎందుకు కొనాలి? వారు రిటైల్ ప్రైస్ మీద కాస్త తగ్గించి ఇస్తారు అని భ్రమ పెట్టుకోవద్దు, మన ఇంటి దగ్గర ఓ చిల్లర దుకాణం వాడి చెంతకు నిత్యం వెడుతూ ఉంటే మనం అడక్కుండానే వాళ్ళు మనకు ఖరీదు కాస్త తగ్గించి ఇవ్వడం మొదలు పెడతారు. చివరకు కూరగాయలు పళ్లు పత్రికలూ గ్రీటింగు కార్డులు కూడా ఆ మహా షాపులలోనే మనం కొనాలా? పోనీ అవేమైనా అక్కడ చవకగా ఉంటాయా అంటే, అదీ లేదు. మరెందుకు వాటిలో మనం అడుగు పెట్టడం? 

మనతో పాటు మన ఊరిలోనే ఉంటూ, మనం ఎప్పుడు వస్తామా లేక ఎప్పుడు పిలుస్తామా అని కాచుకు కూర్చున్న మన సోదరుల సేవలను వినియోగించుకుందాం. వారితో మన అనుబంధాన్ని పెంచుకుందాం. వారితో స్నేహంగా ఉందాం. 

మనం తినే తిండిని పండించింది మన డబ్బు కాదు, 
ఆ పని చేసింది వీరే! 
ఆ తిండిని ఆ పంట పండిన భూమి నుండి మన నోటి ముందుకు తెచ్చింది కూడా మన డబ్బు కాదు,  
ఇదుగో, ఆ తెచ్చింది మరలా వీరే! 

జాతీయ సంపద అంటే మన రిజర్వ్ బ్యాంకులో పేరుకుపోయి ఉన్న బంగారు నిల్వలు గాని, విదేశీ మారక ద్రవ్యం గాని కాదు. జాతీయ సంపద అంటే ఇదుగో, ఈ శ్రామికులే! 

వీరు లేకుంటే, మనం లేము. 
వీరు మన నుంచి అతి చిన్న ప్రతిఫలం మాత్రమే కోరుకునే కర్మ యోగులు! 

వారి సేవలను స్వీకరించడమే వారి పట్ల మనం చూపగలిగిన నిజమైన కృతజ్ఞత. మన శాస్త్రాలలో చెప్పిన సమాజ ఋణం తీర్చుకొనే పధ్ధతి ఇదే! 

వారికి కావలసిందల్లా...

కాసింత జాలి
కూసింత దయ
ఒకింత ప్రేమ 
కొంత ఆత్మీయత.

Saturday, 28 July 2018

నిర్వ్యాజమైన ప్రేమ

అవ్యాజమైన ప్రేమ? 
అదేమిటి? అలాంటిది ఎక్కడైనా ఉంటుందా?
వ్యాజము అంటే కారణం లేదా సాకు. 
నిష్కారణంగా మనం ఎవరినైనా ప్రేమిస్తామా?

అనగా అనగా యాజ్ఞవల్క్యమహర్షి. అబ్బో, ఆయన సామాన్యుడు కానే కాదు. సూర్యభగవానుని శిష్యుడు. శుక్లయజుర్వేదపు ఆవిర్భావానికి కారకుడు. జనకమహారాజుగారి వేదాంతసభలో హేమాహేమీలైన మహా మహా పండితులెందరినో వాదప్రతివాదాలలో చిత్తుచిత్తుగా ఓడించినవాడు. 

అటువంటి ఆయన ఒకరోజు గృహస్థాశ్రమం ముగించుకుని సన్న్యాసాశ్రమం స్వీకరిద్దామనే నిర్ణయానికొచ్చాడు. తన ఇద్దరు భార్యలకు తనకున్న ఆస్తి పంచి ఇచ్చి సన్న్యాసి అయ్యేందుకు వారి అనుమతి కోరాడు. 

కాత్యాయని అనే పేరు గలిగిన భార్య సరే అంది. కానీ మైత్రేయి అనే భార్య మాత్రం, "డబ్బుతో నిండిన ఈ మొత్తం భూమి నాకు స్వంతం అయితే నాకు అమృతత్వం (మోక్షం) వస్తుందా?" అని అడిగింది. అబ్బే, అలాంటి అవకాశం లేనే లేదు పొమ్మన్నాడు యాజ్ఞవల్క్యుడు. అయితే దేనివల్ల అటువంటి అమృతత్వం సిద్ధిస్తుందో అది నాకు ఉపదేశిస్తేనే మీరు సన్న్యాసం స్వీకరించేందుకు అనుమతి" అన్నది మైత్రేయి.

యాజ్ఞవల్క్యుడు చిరునవ్వు నవ్వాడు. "ఇందువల్లనే నీవు నాకు ప్రియమైన భార్యవు అయ్యావు" అని పలికి, ఉపదేశం మొదలు పెట్టాడు.

ఎందువల్ల ఆమె ప్రియమైన భార్య అయింది? ఊరికే కాదు. ఏదో కారణం వల్లనే. యాజ్ఞవల్క్యుడే స్వయంగా చెప్పాడు తన ఉపదేశంలో - 

न वा अरे जायायै कामाय जाया प्रिया भवति।
आत्मनस्तु कामाय जाया प्रिया भवति।
(बृहदारण्यकोपनिषद् 4.5)


"భార్యకోసం భార్య ఎప్పుడు ప్రియమైనది కాదు, 
తన కోసమే భార్య ప్రియమైనది అవుతుంది."

యాజ్ఞవల్క్యుని విషయంలో - అతనికి ఇష్టమైనది అమృతవిద్య (ఆత్మవిద్య). అటువంటి అమృతవిద్యను కోరినందువల్ల మైత్రేయి అతనికి ఇష్టురాలైంది. లేకుంటే కాత్యాయని లాగే ఒక సాధారణమైన భార్య అయ్యుండేది అన్నమాట.

ఆ విధంగా ఒక్క భార్య విషయంలో మాత్రమే కాదు, 

పుత్రుల కోసం పుత్రులు ఎవరికీ ఇష్టం కారుట. 
తనకోసమే పుత్రులు ఇష్టులౌతారట.
నిజమే కదా, చిన్నప్పుడు వారి ముద్దు మురిపాలు మనిషికి ముచ్చట గొలుపుతాయి కాబట్టి వారి పట్ల ప్రేమ ఉంటుంది. పెద్దయ్యాక ఆ పిల్లలు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే వారి మీద కోపం తారాస్థాయిలో ఉంటుంది.

ధనం కోసం ధనం ఎవరికీ ఇష్టం కాదుట. 
తనకోసమే (తనకు ఉపయోగపడుతుంది కాబట్టే) ధనం అంటే ఇష్టం ఉంటుందట. 

అలాగే - 
భార్యకు భర్త ఇష్టమైనా తనకోసమే తప్ప, భర్తకోసం కాదుట. 
బ్రాహ్మణులనైనా, క్షత్రియులనైనా, పశువులనైనా, లోకాన్నైనా, దేవతలనైనా, వేదాలనైనా, ఇలా ఎవరిని (లేదా) దేనిని ఇష్టపడినా తనకోసమే కానీ వారి కోసం (లేదా వాటికోసం) మాత్రం కానే కాదుట. 

కాబట్టి, 
ఏవైనా, ఎవరైనా, మనకు ఉపయోగపడితేనే అవి మనకు ప్రియమైనవి అవుతాయి అని నిర్మొహమాటంగా చెప్పేశాడు ఆయన. ఎవరిమీదనైనా దేనిమీదనైనా నిష్కారణమైన ప్రేమ అంటూ ఉండదు, ప్రేమ సకారణమే అంటున్నాడన్నమాట.

అరెరే, 
ఆయన అంత మాట అన్నాడని 
మనం ఎవరమూ ముఖాలు మాడ్చుకోనక్కర లేదు.
మనసును చిన్నబుచ్చుకోనక్కరలేదు.
భుజాలు తడుముకోనక్కర లేదు.

ఎందుకంటే 
ఆయన ప్రసంగం మానవుని స్వార్థబుద్ధి గురించి కాదు.
అమృతవిద్య గురించి కదా.
అందువల్ల ఆయన ధోరణిని కాస్త పరిశీలించి చూద్దాం.

"ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః" 
"అన్నిటినీ (అందరినీ) తనవలె ఎవడైతే చూడగలడో అతడే అసలైన పండితుడు" - అని శాస్త్రం.

అంటే - 
మనం మన పిల్లల్లో మనలను (ఆత్మను) చూసుకుంటున్నాం కాబట్టి వారు మనకు ఇష్టమౌతున్నారు. అంటే - ఆ క్షణంలో వారు వేరు, నేను వేరు అనే భావన మనలో ఉండదు - వారి విషయంలో దాదాపు అద్వైతసిద్ధి అన్నమాట. అదీ విషయం. 

ఈవిధంగా మన పిల్లలనే కాదు, ప్రపంచంలో అన్నింటినీ ఆత్మస్వరూపాలుగా గమనించగలగడమే ఆత్మవిద్య అంటే - అదీ మోక్షవిద్య అంటే - అదీ అమృతవిద్య అంటే. 

"ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యో మైత్రేయి"
(అరే ఓ మైత్రేయి, ఇటువంటి స్వరూపం గల ఆత్మదర్శనం చేసుకోవాలి, దానిని గూర్చి వినాలి, మననం చేసుకుంటూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి.) 

"ఆవిధమైన అభ్యాసంతో నీవు అమృతవిద్యను సాధించగలవు" అని యాజ్ఞవల్క్యమహర్షి మైత్రేయికి ఆమె కోరిన అమృతవిద్యను ఉపదేశించాడు. (ఈ సందర్భానికి అవసరమైన కొద్ది భాగం మాత్రమే నేను తీసుకున్నాను. పూర్తి ఉపదేశం తెలుసుకోవాలనుకుంటే మిత్రులు బృహదారణ్యకోపనిషద్ చదవగలరు.)

ఈ క్రింది చిత్రం చూడండి. తల్లి ఆవు తన బిడ్డకు పాలను ఇస్తోంది. కొంత దూరంతో తల్లి లేని దూడలు నిలబడి ఉన్నాయి. ఈ ఆవు వాటిని పిలిచి పాలు ఇవ్వడం లేదు. ఒకవేళ అవి చొరవగా వచ్చి పాలు త్రాగబోయినా ఈ ఆవు సరేనని వాటికి కూడా ఇస్తుందో లేక తిరస్కరిస్తుందో తెలియదు. 

అపుడపుడు ఆవు పందిపిల్లలకు కూడా పాలు ఇస్తున్న ఫోటోలు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఆవులు అమృతవిద్యను సాధించిన మహర్షులుగా భావించి మనం వాటికి నమస్కరించవలసిందే!

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...