Showing posts with label Krishna. Show all posts
Showing posts with label Krishna. Show all posts

Friday, 20 March 2020

అలిపిరిలో ఫణిమర్దనుడు




కశ్యపమహర్షికి ప్రియమైన భార్యలు ఇద్దరు. కద్రువ, వినత. ఇద్దరికీ పరస్పరమాత్సర్యం ఎక్కువ. ఒకసారి కద్రువ ఒకానొక పందెంలో తన కుమారులైన సర్పాల సహాయంతో వినతను మోసం చేసి తనకు దాసిగా చేసుకుంది. వైనతేయుడు కూడా (వినత కుమారుడైన గరుత్మంతుడు కూడా) ఆ కద్రువకు, కాద్రవేయులకు (కద్రువ కుమారులైన సర్పాలకు) దాసుడై వారు చెప్పిన ప్రతి పని చేయవలసి వచ్చేది.

ఇలా కాదు, మమ్మల్ని దాస్యం నుండి విడిచిపెట్టాలంటే మీకేం కావాలో చెప్పండి అన్నాడు గరుత్మంతుడు.

అమృతం తీసుకురా వదిలి పెడతాం అన్నారు సర్పాలు. గరుత్మంతుడు ఇంద్రుని ఓడించి వారికి అమృతం తెచ్చి ఇచ్చాడు. తనను, తన తల్లిని దాస్యం నుండి విడిపించుకున్నాడు. అయితే సర్పాలు అమృతం త్రాగకముందే ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. తనకు సహకరించినందుకు వరమిస్తానన్నాడు. అయితే నన్ను ఇంతకాలం ఏడిపించిన సర్పాలే నాకు ఆహారం కావాలన్నాడు గరుత్మంతుడు. తథాస్తు అన్నాడు ఇంద్రుడు.

ఆ విషయం తెలిసి సర్పాలన్నీ భయపడి రమణకద్వీపానికి పారిపోయాయి. అయినా గరుత్మంతుడు వాటిని వదలలేదు. అపుడు సర్పాలు గరుత్మంతుని వేడుకున్నాయి. తమ్ముడూ, మీ సోదరులమైన మమ్మల్ని చంపకు. మానవులు మాకు భయపడి మేము వారిని ఏమీ చేయకుండా ఉండేందుకు గాను ఆహారం సమర్పిస్తూ ఉంటారు. అందులో నీకు కూడా భాగమిస్తాం. అది స్వీకరించి మమ్మల్ని వదిలి పెట్టు అన్నారు. గొడవ ఎందుకులెమ్మని గరుత్మంతుడు సరేనన్నాడు.

అయితే సర్పాలన్నిటిలో కాళియునికి కాస్త బలగర్వం ఎక్కువ. ఒకరోజు గరుత్మంతునికి భాగం పెట్టకుండా తానే మొత్తం ఆహారం భుజించేశాడు. దాంతో గరుత్మంతుడు కోపగించి "వీని తలలు చీరి చెండాడి భోగంబు చించి వైచి ప్రాణములఁ బాపి వచ్చెద" అని విజృంభించాడు. కాళియుడు ధైర్యంగానే ఎదిరించాడు గాని, అప్పటికి గాని తన బలం గరుత్మంతుని ముందు ఎందుకూ కొరగానిది అని తెలిసిరాలేదు.

వెంటనే పాకిపోయి కాళింది మడుగు చేరాడు. ఆపత్కాలంలో వాలినుండి ఆత్మరక్షణకోసం సుగ్రీవునికి ఋశ్యమూకం దొరికినట్టు కాళియుడికి కాళింది మడుగు దొరికింది. కాళింది మడుగులోని జీవాలకు హాని చేస్తే గరుత్మంతుడు మరణిస్తాడు అని సౌభరి ముని శాపం ఉన్నది. ఆ విధంగా కాళియుడు యుక్తితో చావు తప్పించుకున్నాడు. గరుత్మంతుడు ఊరకున్నాడు.

ఆ తరువాత కాళియుడు కాళింది మడుగులో విజృంభించాడు. మడుగులోని సమస్తజలాన్ని విషమయం చేశాడు. దానిపైనుండి పక్షులు ఎగిరితే అందులో పడి చచ్చేవి. దాని మీదనుండి వచ్చిన గాలి సోకితే గట్టున దూరంగా ఉండే జీవులు కూడా చచ్చిపడవలసిందే! ఈ వ్యవహారం తమ పశువులకు, తమ మిత్రులకు ప్రమాదకరంగా పరిణమించే సరికి కృష్ణుడు ఈ సంగతేమిటో తేల్చేయాలనుకున్నాడు.

కటి చేలంబు బిగించి పింఛమునఁ జక్కం గొప్పు బంధించి దోస్తటసంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి తత్కుటశాఖాగ్రముమీఁదనుండి యురికెన్ గోపాలసింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానంబనూనంబుగన్.

కాళియుడికి కోపం వచ్చింది.
"బాలుండొక్కఁడు వీఁడు నా మడుఁగు విభ్రాంతోచ్చలత్కీర్ణ కల్లోలంబై కలఁగం జరించె నిట నే లోనుంటఁ జూడండు మత్కీలాభీలవిశాలదుస్సహవిషాగ్నిజ్వాలలన్ భస్మమై కూలంజేసెద నేడు నా కోపంబు దీపింపగన్"
అనుకున్నాడట.

చూడండి.
అదే పొగరంటే.
అది మామూలు పొగరు కాదు.
దానిని తల పొగరు అంటారు.

బలవంతుడైన శత్రువుకు భయపడి తలదాచుకొనేందుకు వచ్చినవాడు, ఆ మడుగు చొచ్చిన వాడు, ఆ మడుగులో మొదటినుండి ఉన్న మిగిలిన ప్రాణులతో స్నేహంగా ఉండక, అన్నిటినీ హతమార్చి, దురాక్రమణ చేసి, ఇపుడు నా మడుఁగు నా మడుఁగు అని రక్షకుడైన కృష్ణునిపైనే దౌర్జన్యం చేయబూనుకున్నాడు. ఆ తలపొగరు ఒక్క తలది కాదు. అది నూరు తలల పొగరు!

కాళియుడు నూరుతలలతోనూ బాలకృష్ణుని కరిచాడు. పెనవేసుకున్నాడు. ఒడ్డున చూస్తున్న వారందరూ భయభ్రాంతులైనారు. అయ్యయ్యో అని ఆర్తనాదాలు చేశారు.

ఆపై కృష్ణుని విజృంభణం మొదలైంది. కాళియుని తలలపై నృత్యం చేశాడు. కాళింది కెరటాల ఘోషలు మృదంగరావాలైనాయి. "మహితకాళియఫణిఫణామండపమున నళినలోచనవిఖ్యాతనర్తకుండు నిత్యనైపుణ్యమునఁ బేర్చి నృత్యమాడె" నట!

ఆ దెబ్బకు ఆ ఫణి (పాము) పడగలు బెండుపడిపోయాయి. యొండొండ ముఖంబుల రక్తమాంసంబులుమియ వచ్చాయి. కన్నుల విషంబు వెలిగ్రక్కబడింది. పాము ఉక్కు చెడింది. చిక్కింది. దిక్కులు చూచింది. కంఠగతప్రాణమైంది.

"బాలుఁడు మత్ఫణాశతము భగ్నముగా వెసఁ ద్రొక్కియాడెడిన్" అని భావించాడు.

అంతలోనే తటాలున కాస్త తెలివి తళుక్కుమంది.
మామూలు బాలుడు ఇంతటి పని చేయగలడా?

"ఈతడు సర్వచరాచరభూతేశుండైన పరమపురుషుండు" అని తెలుసుకున్నాడు.

ఇంతలో కాళియుని భార్యలు ఏడుస్తున్న తమ పిల్లలను వెంటేసుకుని వచ్చారు.

"క్రూరాత్ముని దండించుట క్రూరత్వము గాదు సాధుగుణము గుణాఢ్యా" అని కృష్ణుని ప్రశంసించారు.

చివరకు తమ భర్తను క్షమించమన్నారు. "చాలున్ నీ పదతాండవంబు పతిభిక్షంబెట్టి రక్షింపవే!" అని వేడుకున్నారు.

కాళియుడు కూడా శరణువేడాడు. "మనిచెదేనియు మన్నించి మనుపు నన్ను నిగ్రహించెదవేనియు నిగ్రహింపుమింక సర్వేశ్వరా" నన్నేమి చేసినా నీ యిష్టము" అనేశాడు.

"చూడు నాయనా! గోవులు, మనుషులు ఈ మడుగులో నీరు త్రాగుతూ ఉంటారు. ఇక్కడ నువ్వు ఉండటానికి వీల్లేదు. నువ్వు, నీ బంధువులు, మీ మీ భార్యాబిడ్డలతో సహా, ఈ మడుగును వదిలి సముద్రానికి పొండి. నీవును నీ బాంధవులును, నీ వనితలు సుతులుఁ జనుఁడు నేఁడంబుధికిన్" అని ఆజ్ఞాపించాడు.

అపుడు కాళియునికి తాను చేసిన పాత తప్పులు గుర్తుకొచ్చాయి. కాళింది మడుగులోనే తన ప్రతాపమంతా. బయటకు అడుగు పెడితే తక్షణమే గరుత్మంతుడు చీల్చి చెండాడేస్తాడు. ఇక్కడే ఉంటానంటే కృష్ణుడు దండిస్తాడు. తన మూర్ఖత్వం వల్ల, నూరు తలకాయలనిండా ఉన్న పొగరుల వల్ల, తాను సర్వస్థలభ్రష్టుడనైనానని తెలిసివచ్చింది పాపం.

కృష్ణుడు అతడి ఆలోచనను గ్రహించాడు. చిరునవ్వు నవ్వాడు. "భయపడకు కాళియా, నీ పడగలపై నా పాదముద్రలను చూసి గరుత్మంతుడు నీ జోలికి రాడు పో - మత్పదాబ్జలాంఛనములు నీ తలనుంటఁ జూచి యా పక్షిరాజు నిన్నుఁ బట్టఁడింక" అని వరమిచ్చాడు.

కాళియుడు సంతోషించి పుత్రమిత్రకళత్రసమేతంగా కృష్ణునికి ప్రదక్షిణలు చేసి నమస్కరించి సముద్రానికి తరలిపోయాడు.

కాళింది మరలా సుధావారిం బొలు పారె నెల్లవారికిఁ బ్రియమై.

అదీ కథ.
)()()()()(

ఈ ఫోటో చూశారా?
ఫణిందమనుడు. ఫణిమర్దనుడు. "ఫొణి"ని సముద్రంలోనికి తరిమిన జగన్నాథుడు.

ఈ బాలుడు మత్ఫణాశతమును భగ్నము చేయుచున్నాడని కాళియుడు భావించాడు కదా? మరి నూరు పడగలేవీ? ఒకటే పడగను శిల్పి చిత్రీకరించాడు.

కృష్ణుడెపుడూ అంతేనని ఆ శిల్పి భావించాడో ఏమో.

మరోసారి "కరసహస్రంబుల కండూతి వాయు నుపాయంబును లేద యీ భరము నెట్లోర్తున్నుమానాయకా? యుద్ధం చేయాలనే నా వేయిచేతుల తీట ఎపుడు తీరుతుందో అని సరదాపడిన బాణాసురుని వేయిచేతులలో ఓ నాలుగింటిని వదిలేసి మిగిలిన తొమ్మిన్నూట తొంబైయారు చేతులు నరకలేదా అదే కృష్ణుడు?

అట్లే, కాళియుని నూరు తలకాయల పొగరు దించేసి, ఒక తలకాయను అట్లే వదిలేసి ఉంటాడని ఆ శిల్పిగారి ఉద్దేశమేమో.
)()()()(

ఈ కథలు సాంకేతికమనిపిస్తూ ఉంటాయి. కశ్యపుడు అంటే ఒక paternal gene పేరు, కద్రువ వినత అనేవి maternal genes పేర్లు కావచ్చు. రామాయణభారతాలలో ఈ కశ్యపుడు సమస్తజీవజాలనికీ (జంతువులకు, పక్షలకు, చెట్లకు, మనుషులకు కూడా) మూలబీజమనే సిద్ధాంతం కనిపిస్తుంది.

కశ్యపునికి ఇంకా చాలమంది భార్యలున్నారు. ఉదాహరణకు దితి, అదితి. వారి నడుమ కూడా మాత్సర్యమున్నదట. వారి సంతానమే దైత్యులు (రాక్షసులు), అదైత్యులు (దేవతలు) అంటారు. రాక్షసులు దేవతలు అనేవి ప్రాణుల స్వభావాన్ని నిర్దేశించే మూలపదార్థాలు అయ్యుండవచ్చు. క్షీరసాగరమంటే మనస్సు అని, చెడుతలంపులు విషమని, మంచి తలంపులు అమృతమని చెప్పడం తెలిసిన విషయమే. కాబట్టి, దేవతలు రాక్షసులు అనేవి ప్రాణుల స్వభావాన్ని నిర్దేశించే వివిధ హార్మోన్లకు పెట్టిన సాంకేతికనామాలు అయ్యుండవచ్చు. దితి అదితి అనేవి ఆ హార్మోన్లను ఉత్పాదన చేసే glands అయ్యుండవచ్చేమో!

కాబట్టి, సమస్తప్రాణులన్నిటికీ paternal gene సమానమే అయినా maternal gene మాత్రం భిన్నమనిపిస్తుంది. కాబట్టి, కశ్యప దితి అదితి కద్రువ వినత అనేవి సాంకేతిక నామాలే తప్ప మనుషుల పేర్లు కాకపోవచ్చును. ఒక సిద్ధాంతాన్ని కథలా చెబితే కలకాలం గుర్తుంచుకుంటారని ఇలా చెప్పారేమో అనిపిస్తుంది.

అలాగే కాళియుని కథ, అది విషపూరితమైన జలావరణాన్ని మనిషి కాపాడుకున్న కథ కావచ్చును.

ఎన్ని వేలయేండ్లనాటివో ఈ కథలు! ఉన్నతమైన చదువు కొందరికే పరిమితం కావడం, వారు కూడా కాలక్రమేణా ఇతరసంస్కృతుల సమ్మేళనంతో ఆనువంశికమైన చదువులను, విజ్ఞానాన్ని కోల్పోవడం, ఈ కథలను మతానికి అంటగట్టడం, పుక్కిటి పురాణాలు అని గేలి చేయడం, విదేశీయుల చేతిలో మనకు కలిగిన పరాజయానికి మనం వివశులమై, ఆత్మన్యూనతాభావంచేత నిలువెల్లా ఆక్రమింపబడి మన కథలను, మన పురాణాలను మనమే వెక్కిరించుకొనడం ప్రారంభమైంది. ఈ పతనం ఇప్పటికి మరింత వేగమౌతోందే తప్ప ఆగటం లేదు.

చిటారు కొమ్మన మిఠాయిపొట్లమంటే తేనె గూడు కాదు. ఇటువంటి జ్ఞానఫలమే! చూడనివారికి అది దక్కదు. ప్రయత్నం చేయనివారికి అది దక్కదు. ప్రయత్నం చేసినా పొట్టిచేతులవారికి దక్కదు. శాఖాగ్రానికి చేరుకున్నా, అందుకోలేక అక్కడనుండి పతనం చెందేవారికి అది దక్కదు. కష్టించి పైకెక్కగలిగి, చాల జాగ్రత్తలు కలిగిన వారికే అది దక్కేది!

అందని ద్రాక్షలు పుల్లన అని వెక్కిరించే గుంటనక్కలకు వాటి అనుచరులకు ఈ లోకంలో కొదవ లేదు.
)()()()(

ఈ శిల్పం అలిపిరిలో గరుడవిగ్రహానికి అనతి దూరంలో ఉన్న లక్ష్మీనారాయణస్వామివారి ఆలయంలోనిది.

Thursday, 2 January 2020

గర్వకారణం 1

వనవాసం ముగిసింది.
అజ్ఞాతవాసం ముగిసింది.
సంధిప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అయినా దుర్యోధనుడికి యుద్ధం తప్పదని ముందే తెలుసును. పాండవులు ఎట్టి పరిస్థితులలోనూ సుఖపడరాదని, పాండవుల రాజ్యాన్ని పాండవులకు తిరిగి ఇవ్వాలనే సద్బుద్ధి తనకు లేదని అతడికి ముందే తెలుసు కదా? పాండవులు తన చేతిలో ఓడిపోతారని అతనికి గట్టి నమ్మకం.
అయినప్పటికీ సంజయుడు చెప్పిన ఒక్క మాట ధృతరాష్ట్రుడిని బాగా కలవరపెట్టింది.
एकतो वा जगत् कृत्स्नम्
एकतो वा जनार्दनः।
सारतो जगतः कृत्स्नाद्
अतिरिक्तो जनार्दनः।।
ఒకవైపు సమస్తప్రపంచాన్ని పెట్టి, మరొకవైపున శ్రీకృష్ణుని ఒక్కని మాత్రం పెడితే, సమస్తప్రపంచం కంటే సారభూతుడైన శ్రీకృష్ణుడే ఎక్కువ.
సమస్తప్రపంచం = జన్మ+కులము+ధనము+సంపద+భూమి+విద్య+లోకజ్ఞానము+పుస్తకజ్ఞానము+సంబంధాలు+పరిచయాలు+స్నేహితులు+అభిమానాలు+అహంకారాలు+మమకారాలు+రాగాలు+ద్వేషాలు+సమస్తచరాచరాఖిలబ్రహ్మాండము
శ్రీకృష్ణుడు > సమస్తప్రపంచం
దాంతో ధృతరాష్ట్రుడు భయపడిపోయి,
दुर्योधन हृषीकेशं शरणं गच्छ केशवम्।
"నాయనా దుర్యోధనా, శ్రీకృష్ణుని శరణు కోరవయ్యా" అని చెప్పాడు.
శ్రీకృష్ణుని గొప్పతనం దుర్యోధనుడికి కూడా తెలుసు. అయినప్పటికీ,
भगवान् देवकीपुत्रः लोकांश्चेन्निहतिष्यति।
प्रवदन्नर्जुने सख्यं नाहं गच्छेऽद्य केशवम्।।
"ఆ దేవకీపుత్రుడు భగవంతుడే కావచ్చును. సమస్తలోకాలను సంహరించగలిగినవాడే కావచ్చును. అయినప్పటికీ, అతడు అర్జునుడితో స్నేహం చేసినంతకాలం నేను అతడి దగ్గరకు వెళ్లను" అన్నాడు.
కానీ దుర్యోధనుడికి తప్పలేదు.
సహాయం కోరి వెళ్లక తప్పలేదు.
ఈ శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడు?
ఎక్కడ ఆయనను పట్టుకోవాలి?
ద్వారకలో ఉంటాడని దుర్యోధనుడికి తెలుసు. అందువల్ల द्वारकामभ्ययात् पुरीम् - ద్వారకా నగరానికి వెళ్ళాడు.
అర్జునుడికి కూడా శ్రీకృష్ణుని సహాయం కావాలి. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ఆయనను ఎలా పట్టుకోవాలి? ఈ విషయం దుర్యోధనుడి కంటే అర్జునుడికే బాగా తెలుసు. 😊
దుర్యోధనుడు అర్జునుడు తన దగ్గరకు వచ్చేసరికి శ్రీకృష్ణుడు నిద్రిస్తున్నాడు. 
(నటిస్తున్నాడా? 😊). 
ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప నిద్రించే వారిని లేపడం ధర్మం కాదు. అందువల్ల వారిద్దరూ శ్రీకృష్ణుడు నిద్రలేచేంతవరకు ఎదురుచూడదలిచారు.
దుర్యోధనుడు శ్రీకృష్ణుని తల చెంత ఉన్న గొప్ప ఆసనంపై కూర్చున్నాడు. అర్జునుడు కృష్ణుని పాదాలచెంత చేతులు జోడించి వినయంగా నిలబడ్డాడు.
నిద్ర లేచిన వెంటనే కృష్ణుడు చూసింది ఎదురుగా ఉన్న అర్జునుని. 😊
प्रतिबुद्धः स वार्ष्णेयो ददर्शाग्रे किरीटिनम्।
తరువాత దుర్యోధనుని కూడా చూశాడు.
వారు వచ్చిన పని తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఇద్దరికీ సహాయం చేస్తానని చెప్పాడు.
साहाय्यमुभयोरेव करिष्यामि सुयोधन।
"నాతో సమానులై సహస్రసహస్రసంఖ్యాకులైన నా వీరసైనికులొకవైపు ఉంటారు, ఆయుధాన్ని పట్టకుండా, యుద్ధం చేయకుండా నేను ఒకవైపు ఉంటాను. మీరు చెరొక దానిని ఎంచుకోండి. అర్జునుడు చిన్నవాడు కాబట్టి మొదట ఎంచుకుంటాడు" అన్నాడు.
టాస్ ఓడి పోయిన క్రికెట్ జట్టు కెప్టెన్‌లా దుర్యోధనుడు డీలా పడిపోయాడు.
శ్రీకృష్ణుని గొప్పతనం తెలిసినప్పటికీ దుర్యోధనుడు మోహంలో పడిపోయాడు. "ఆయుధాలు పట్టకుండా యుద్ధం చేయకుండా తనవైపు శ్రీకృష్ణుడు ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి అనుకున్నాడు. మొదట కోరుకునే అవకాశం చిన్నవాడు అనే పేరిట అర్జునుడికి ఇచ్చాడు. వాడేమైనా తెలివితక్కువవాడా? ఖచ్చితంగా సహస్రసహస్ర సైనికులనే కోరుకుంటాడు" అని భావిస్తూ నిస్సహాయంగా పళ్ళు నూరుతున్నాడు.
కానీ దుర్యోధనుడికి సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తూ, అర్జునుడు తనకు శ్రీకృష్ణుడు ఒక్కడే కావాలన్నాడు.
अयुध्यमानं संग्रामे वरयामास केशवम्।
దుర్యోధనుడి ఆనందానికి అంతే లేదు.
संप्राप्य परमां मुदम्...
ఈ దెబ్బతో నాదే విజయం అని భావించాడు.
युद्धान्मेने जितं जयम्।
శ్రీకృష్ణుడు తాను తవ్వుకొన్న గోతిలో తానే పడ్డాడు అని ఆనందించాడు. టాస్ ఓడిపోయినప్పటికీ మ్యాచ్‌లో విజయం నాదే అనుకున్నాడు.
కానీ, అర్జునుడు ఏమిటి, అంతటి తిక్కోడు?
సహస్రసహస్రమహాయోధులను వదిలిపెట్టి, ఆయుధం పట్టుకొని యుద్ధం చేయను అన్న కృష్ణుని మాత్రమే ఎందుకు కోరుకున్నాడు?
ముందే అనుకున్నట్టుగా, ఈ విషయం దుర్యోధనుని కంటే అర్జునుడికే బాగా తెలుసు. 😊
यतः सत्यं यतो धर्मः
यतो ह्रीरार्जवं यतः।
ततो भवति गोविन्दः
यतः कृष्णस्ततो जयः।।
ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ హ్రీ ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ ఆర్జవం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది.
1 సత్యం = సత్యం
2 ధర్మం = ధర్మం
3 హ్రీ = ఎటువంటి పనుల వలన సత్యధర్మపరులైనవారికి క్షోభ కలుగుతుందో అటువంటి పనులను చేసేందుకు సిగ్గుపడటం, వెనుకాడటం.
4 ఆర్జవం = ఋజుత్వం. త్రికరణశుద్ధి. మనోవాక్కాయకర్మల సామాన్యము (సమానంగా ఉండేలా ప్రవర్తించటము)
ఈ నాలుగు గుణాలు ఎవరి దగ్గర ఉంటే శ్రీకృష్ణుడు వారి దగ్గర ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎవరి చెంత ఉంటే వారిదే జయం. 🙏
ఆ నాలుగు గుణాలు దుర్యోధనుని చెంత లేవు కాబట్టే అతడు కృష్ణుని సంతోషంగా వదులుకున్నాడు.
కానీ ఈ నాలుగు గుణాలు అర్జునునిలో పుష్కలంగా ఉండడం వల్ల అతడు శ్రీకృష్ణుని ఎంచుకున్నాడు.
ఈవిషయం తెలియక అందరూ పాండవపక్షపాతి అంటారు గాని, నిజానికి అతడు ధర్మపక్షపాతి.
అంతిమఫలితం అందరికీ తెలిసిందే.
దుర్యోధనుడు ఓడిపోయాడు.
పాండవులు విజయం సాధించారు.
యతో ధర్మః తతః కృష్ణః.
యతః కృష్ణః తతో జయః.
🌼🌼🌼
దేవుడంటే తనను వేలంపాటలో ఎవరు ఎక్కువకు పాడుకుంటే వారి టీముకు సేవలందించే IPL క్రికెటర్ లాంటివాడు కాదు.
తన చెంతకు వచ్చినవారి ఐశ్వర్యాన్ని, స్తోత్రాలను, హోదాను, ఆడంబరపూజలను కాక, వారి గుణాలను మెచ్చి ఆదరించే దేవదేవుడు మావాడై ఉండటం మా మతానికి నిస్సందేహంగా గర్వకారణం.

https://www.facebook.com/srinivasakrishna.patil/posts/2600595423394455


Tuesday, 18 September 2018

పరువు ఎవడబ్బ సొమ్ము?

అనగనగా ధ్రువసంధి అనే రాజు ఉండేవాడు. మహా ధర్మాత్ముడు. ఆయనకు ఇద్దరు భార్యలు. మనోరమ, లీలావతి. మనోరమ కొడుకు సుదర్శనుడు. లీలావతి కొడుకు శత్రుజిత్తు.
దురదృష్టం కొద్దీ ధ్రువసంధి అడవిలో సింహం బారిన పడి చనిపోయాడు. అపుడు రాజు ఎవరు కావాలని సుదర్శనుడి మాతామహుడు అయిన వీరసేనుడు, శత్రుజిత్తు మాతామహుడు అయిన యుధాజిత్తు గొడవ పడ్డారు. వీరసేనుడిని యుధాజిత్తు చంపేశాడు. దాంతో, మనోరమ సుదర్శనుడిని తీసుకుని అడవికి పారిపోయి, భరద్వాజమహర్షిని శరణు కోరింది. యుధాజిత్తు శత్రుశేషం ఉంచరాదని సుదర్శనుడిని చంపేందుకు భరద్వాజుని ఆశ్రమానికి వెళ్లాడు కాని, మహర్షి తపఃశక్తికి భయపడి ఏమీ చేయలేక ఊరుకున్నాడు.
తరువాత ఎప్పుడో కాశీరాజు తన కూతురైన శశికళకు స్వయంవరం ప్రకటించాడు. రాజులందరూ విచ్చేశారు. అన్నదమ్ములైన సుదర్శనుడు, శత్రుజిత్తు కూడా వచ్చారు. శశికళ సుదర్శనుడిని వరించింది.
దాంతో శివాలెత్తిపోయిన యుధాజిత్తు "శశికళ నా మనుమడిని కాకుండా అతడికి పోటీదారు అయిన అన్నను వరిస్తుందా? ఆమెకు ఎంత ధైర్యం? ఆ సుదర్శనుడిని చంపేసి ఆమెను శత్రుజిత్తుకు ఇచ్చి పెళ్లి చేస్తా" అంటూ యుద్ధానికి దిగాడు.

ఇలా ఒకే కులం, ఒకే తండ్రిబిడ్డలు అయిన అన్నదమ్ములలోనే ఒకరిని కాకుండా ఇంకొకరిని ఒక కన్య వరించింది కాబట్టి మా పరువు పోయింది అనుకునే తాతలు ఉండేవారు సుమా.
ఈ కథలో తరువాత ఏమైందని అడుగుతారా? శశికళ కోరుకున్న వరుడే దైవానుగ్రహంతో యుద్ధంలో గెలిచాడు లెండి.
ఇలాంటి కథలు, ఇంతకంటె రసవత్తరమైన కథలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. చాలా వరకు మనకు తెలిసినవే. అయినప్పటికీ సరదాగా మళ్లీ గుర్తు చేసుకునేందుకు చదవండి:

1 శ్రీకృష్ణుడు
విదర్భరాజపుత్రి అయిన రుక్మిణి కృష్ణుని ప్రేమించింది.కృష్ణునికి ఇవ్వవచ్చునని ఆమె తల్లిదండ్రులు, బంధువులు కూడా అనుకున్నారు.కాని, రుక్మిణి అన్న ఐన రుక్మికి మాత్రం అది ఇష్టం లేదు.అతడు జరాసంధుని ముఠాకు చెందినవాడు.అతడి మాటపై తన దోస్తు ఐన శిశుపాలుడికి ఇచ్చి చేద్దామనుకున్నాడు.రుక్మిణి తల్లిదండ్రులు నిస్సహాయులయ్యారు.
రుక్మిణి ఒక బ్రాహ్మణుని ద్వారా తన మనసును కృష్ణునికి తెలియజేసింది.కృష్ణుడు వచ్చి ఆమెను అందరి సమక్షంలోనూ ఎత్తుకుపోయాడు.
రుక్మి శిశుపాలుడు, జరాసంధుడు కృష్ణుని చంపాలని వెంటబడ్డారు. కృష్ణుడు వారందరినీ ఓడించి తరిమేశాడు.చేసేదేమీ లేక, సింహానికి దక్కాల్సిన సొమ్మును జింకలు కాజేసినట్టు మన రాజకన్యను ఆ గోపాలుడు ఎత్తుకుపోయి ధనుర్దారులమైన మన కీర్తిని వాడు నవ్వులపాలు చేశాడే అని తిట్టుకుంటూ ఊరట చెందారు పాపం. అందరిలోనూ తమ పరువు పోయిందని బాధపడిపోయారు.
अहो धिगस्मान् यश आत्तधन्वनां गौपैर्हृतं केसरिणां मृगैरिव।
(భాగవతం 10.ఉత్తరార్ధం 54.57)
అయితే జరాసంధుని భీముడు, శిశుపాలుని కృష్ణుడు కాలాంతరంలో హతమార్చిన తరువాత రుక్మిణి అన్న రుక్మి దారికి వచ్చాడు. తన కూతురు అయిన రుక్మవతిని రుక్మిణీకృష్ణుల కొడుకైన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుక్మిణీకృష్ణుల మనుమడైన అనిరుద్ధుడికి తన మనుమరాలైన రోచనను ఇచ్చాడు.

2 భీముడు
హిడింబుడు అనే రాక్షసుని చెల్లెలు హిడింబ.ఆమె అడవిలో భీముని చూడగానే ప్రేమించింది.తన అన్న క్రూరుడని మీ కుటుంబసభ్యులతో కలసి ఎక్కడకైనా దూరం పొమ్మని భీమునిహెచ్చరించింది.నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పింది.
ఇంతలో హిడింబుడు రానే వచ్చాడు. తన చెల్లెలి మనోభావాన్ని గ్రహించి, "వొసే హిడింబా! మన వంశానికి కళంకం తెస్తున్నావు. ఛీ ఛీ.
पूर्वेषां राक्षसेन्द्राणां सर्वेषामपयशस्विनी।“ (భారతం.1.152.18)
అన్నాడు.
ఆ హిడింబుడికి కూడా తన చెల్లెలు ఒక మానవమాత్రుణ్ణి వరించడం ఒక పరువుతక్కువ పనిగా అనిపించింది!
“ఉండు, మీ ఇద్దరినీ చంపి పారేస్తా చూడు" అంటూ భీముడి మీద పడ్డాడు. అయితే భీమసేనుడే అతడిని చంపిపారేశాడు.
ఆ తరువాత, హిడింబ ప్రేమను భీముడు తిరస్కరించాడు.“నీ అన్నను చంపిన పగతో మమ్మల్ని ఏమైనా చేయగలవు పో పో” అన్నాడు.అపుడు హిడింబ కుంతిని ధర్మరాజును శరణు వేడి, వారి ద్వారా భీముని ఒప్పించి పెండ్లి చేసుకుంది. వారి కుమారుడే ఘటోత్కచుడు అని అందరికీ తెలిసిన విషయమే కదా!

3 ద్రౌపది
పాండవులు లక్క ఇంట్లో చనిపోయారని అందరూ అనుకున్నారు.కాని, వారు తప్పించుకున్నారు. బ్రాహ్మణవేషం ధరించి పాంచాలరాజ్యంలో. ద్రౌపదీస్వయంవరసభను చేరుకున్నారు.
ఆ సభలో అందరూ మత్స్యయంత్రాన్ని ఛేదించడంలో విఫలమైన తరువాత బ్రాహ్మణవేషంలో ఉన్న అర్జునుడు ఆ పని చేశాడు. ద్రౌపది అతనిని వరించింది. ఇది చూసి అక్కడ ఉన్న రాజులు సహించలేకపోయారు. రాజులందరికీ ఇది తమ పరువుప్రతిష్ఠలకు ఒక సవాలుగా అనిపించింది.
“వీరుడైనవాడు ఏ కులానికి చెందినప్పటికీ వాడికి అందరూ సలాము చేయవలసినదే” అని ఒకప్పుడు గర్జించి చెప్పిన దుర్యోధనుడు కూడా ఉక్రోషంలో తాను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తానే విస్మరించాడు.
“ఈ కన్య (ద్రౌపది) ఒక క్షత్రియుని కాకుండా ఒక బ్రాహ్మణుని వరించినందుకు ఈమెను నిప్పుల్లో పడేసి మన దేశాలకు మనం పోదాం. ”अग्नावेनां परिक्षिप्य याम राष्ट्राणि पार्थिवाः। (భారతం 1.188.8) అని మిగిలిన రాజులతో పాటు మీదకు ఎగబడ్డాడు.
వారిని బ్రాహ్మణవేషాల్లోనే భీమార్జునులు అడ్డుకున్నారు. పెద్ద దొమ్మీ జరిగింది. యుద్ధంగా కూడా మారింది. వారిద్దరూ కలిసి ద్రౌపదిమీదకు పోబోయిన రాజులందరినీ చిత్తుచిత్తుగా ఓడించారు. మహా మహా కర్ణుడు కూడా అర్జునుని చేతిలో ఓడిపోయాడు. చేసేదేమీ లేక అందరూ నోరు మూసుకుని ఇంటికి పోయారు.
ద్రౌపది రక్షింపబడింది.

4 అర్జునుడు
తీర్థయాత్రలు చేస్తూ ద్వారకానగరానికి వచ్చిన అర్జునుడు, యాదవకన్య, శ్రీకృష్ణుని చెల్లెలు అయిన సుభద్రను చూసి ఇష్టపడ్డాడు.
సుభద్ర తనను వరిస్తుందో లేదో, యాదవులు ఆమెను తనకు ఇస్తారో లేదో అని అతడికి సందేహం కలిగింది. శ్రీకృష్ణునితో ఆ విషయం చర్చించి, అతడి ప్రోత్సాహం మీదట, అన్న అయిన ధర్మరాజు అనుమతిని కూడా పొందిన మీదట, సుభద్ర రేవతకపర్వతానికి వచ్చిన సందర్భం చూసుకుని ఎత్తుకుపోయాడు.
భోజులు, వృష్ణీయులు, అంధకులు అనే మూడు తెగల యాదవులకు అది చాల అవమానకరంగా తోచింది.
అన్నపానాలు కూడా మానివేసి అందరూ సమావేశమయ్యారు. “రథాలను సిద్దం చేయండిరా. ప్రాసాలను తీసుకురండిరా”
योजयध्वं रथानाशु प्रासानाहरतेति च। (భారతం 1.219.17)
అంటూ అర్జునుని దండించి సుభద్రను తిరిగి తీసుకుని వచ్చేందుకు సంసిద్ధులయ్యారు.
బలరాముని మండిపాటుకైతే హద్దులే లేవు. “భోజనం చేసిన కంచాన్నే విరగ్గొట్టే కులకళంకుడని తెలియక ఆ అర్జునుడిని శ్రీకృష్ణుడి మిత్రుడు కదా అని ఎంతగా గౌరవించాం!
न च सोऽर्हति पूजां तां दुर्बुद्धिः कुलपांसनः।
को हि तत्रैव भूक्त्वान्नं भाजनं भेत्तुमर्हति। (భారతం 1.219.26,27)
అసలు అర్జునుడు అపహరించింది సుభద్రను కాదు, తన మృత్యువునే సుమా! ఇటువంటి పని చేయడం ద్వారా నా తలమీద అర్జునుడు తన పాదం పెట్టినట్టు కాదా? ఆ అర్జునుడు జన్మించిన కౌరవవంశాన్ని ఈ భూమి మీదనే లేకుండా చేస్తాను.
अद्य निष्कौरवमेकः करिष्यामि वसुन्धराम्। (భారతం 1.219.31)”
అంటూ అవమానంతో కుతకుతలాడిపోయాడు. యాదవులందరూ బలరాముని సమర్థిస్తూ “పదండి పదండి” అంటూ రణనినాదాలు చేశారు.
వారికి ఇదొక పరువు సమస్య అయింది!
కాని, శ్రీకృష్ణుడు సుభద్రకు అర్జునుడు తగిన జోడీ అని, స్వయంవరంలో సుభద్ర తనను వరిస్తుందో లేదో అనే సంశయంతో అర్జునుడు ఆమెను ఎత్తుకువెళ్లి ఉంటాడని, అది క్షత్రియులకు అనుచితమైన పనేమీ కాదని నచ్చజెప్పి బలరాముని, మిగిలిన యాదవులను చల్లబరచాడు.
శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో యాదవులు సగౌరవంగా సుభద్రార్జునులను ద్వారకకు తిరిగి తీసుకుని వచ్చి, వారికి వివాహం చేశారు. కాలక్రమేణ వారిరువురికీ జన్మించిన అభిమన్యుడు యాదవులందరికీ ముద్దుల మేనల్లుడు కావడం తెలిసిందే.

5 సాంబుడు
జాంబవతీశ్రీకృష్ణుల కుమారుడు సాంబుడు. దుర్యోధనుని కూతురైన లక్ష్మణను ఇష్టపడ్డాడు. ఆమెను స్వయంవరసభనుండి ఎత్తుకుపోయాడు.
సాంబుడు చేసిన పనికి కౌరవులు ఆగ్రహంతో ఊగిపోయారు. “పట్టండిరా ఈ దుర్మార్గుడిని. మనం దయదలచి ఇచ్చిన భూమిని ఏలుకుంటున్న ఈ వృష్ణీయులు (యాదవులు) ఏమి చేస్తారో చూద్దాం.
बध्नीतेमं दुर्विनीतं किं करिष्यन्ति वृष्णयः।
येस्मत्प्रसादोपचितां दत्तां नो भुञ्जते महीम्।“ (భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)
అని మీదపడి బంధించారు.
యాదవులంటే వారికి చిన్నచూపు. వారు తమ పిల్లను చేసుకొనడం తమకు పరువు తక్కువగా కౌరవులు భావించారు!
ఈ విషయం తెలిసిన యాదవులు సాంబుడిని విడిపించుకునేందుకు యుద్ధసన్నద్ధులయ్యారు. కాని, బలరాముడు యాదవకౌరవవంశాలవారికి నడుమ కలహం వద్దని, శాంతిని కోరి ఉద్ధవుని రాయబారిగా పంపాడు. భీష్మాదివృద్ధులు ఎంత నచ్చజెప్పినా వినకుండా దుర్యోధనాదికౌరవులు మాత్రం అహంకారంతో మిడిసిపడ్డారు.
“ఆహా! కాలమహిమ కాకుంటే కాళ్ల దగ్గర పడి ఉండాల్సిన చెప్పులు కిరీటం ఉండవలసిన తలమీద ఉండగోరుతున్నాయి కదా?
अहो महच्चित्रमिदं कालगत्या दुरत्यया।
आरुरुक्षत्युपानद्वै शिरो मुकुटसेवितम्।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.24)
మన పాండురాజు వారి కుంతిని చేసుకున్నాడు. మన అర్జునుడు వారి సుభద్రను చేసుకున్నాడు. ఇలా కాస్త బంధుత్వం కలిసింది కదా అని మన ప్రక్కనే కూర్చునేందుకు సాహసిస్తున్నారు. వీరు మాకు చెప్పవచ్చారా?” అంటూ అహంకరించి బలరాముని మాటలను తిరస్కరించారు.
బలరాముడికి వొళ్లు మండింది. “ఏమిటేమిటీ? మేము చెప్పులమూ, వారేమో తలకాయలూనా?
उपानहः किल वयं स्वयं तु कुरवः शिरः।
(భాగవతం 10. ఉత్తరార్ధం 68.38)
ఈ రోజు భూమిమీద కౌరవులు లేకుండా చేస్తాను
अद्य निष्कौरवीं पृथ्वीं करिष्यामि। (భాగవతం 10. ఉత్తరార్ధం 68.3)”
అంటూ హస్తినాపురాన్ని తన హలంతో లాగి గంగలోనికి నూకేందుకు ఉద్యమించాడు. ఆ దెబ్బకు హస్తినాపురం ఊగిపోయింది. కౌరవులందరూ హడలిపోయి, సాంబుడిని, లక్ష్మణను బలరామునికి అప్పగించి, క్షమాపణలు కోరి, రక్షించమన్నారు. దయాళువైన బలరాముడు సరేనని, వారు సమర్పించిన కానుకలను, వధూవరులను వెంటబెట్టుకుని ద్వారకకు చేరుకున్నాడు.
గొడవ చల్లబడింది.

6 మధువు
రావణాసురుని పినతల్లి అనల. ఆమెకు కుంభీనసి అనే కూతురు ఉండేది. ఆమెను మధువు అనే ఒక రాక్షసుడు ఇష్టపడ్డాడు. పేరుకు రాక్షసుడే అయినా దేవతలకు మంచి మిత్రుడు.కాని,రావణాసురుని పట్ల భయంతో ఏమి చేయాలో తెలియక ఊరుకున్నాడు.
ఇలా ఉండగా ఒకసారి రావణాసురుడు జైత్రయాత్రకు వెళ్లాడు. యుద్ధోన్మాదంలో తన చెల్లెలైన శూర్పణఖకు భర్త అయిన విద్యుజ్జిహ్వుని కూడా గుర్తించలేక స్వయంగా నరికి చంపివేశాడు. శూర్పణఖ వచ్చి ఏడ్చి మొత్తుకుంటూ ఉంటే ఆమెను పోయి దండకారణ్యంలో సుఖంగా ఉండమని పంపించేశాడు రావణుడు.
వారు ఈ గొడవల్లో ఉండగా సమయం చూసుకుని మధువు కుంభీనసిని ఎత్తుకుపోయాడు.
రావణుడు విజయం సాధించి, వెనక్కు వస్తూ దారిలో కంటికి అందంగా కనబడిన రాజస్త్రీలను, ఋషిస్త్రీలను, గంధర్వస్త్రీలను,పన్నగస్త్రీలను, రాక్షసస్త్రీలను, అసురస్త్రీలను, మానుషస్త్రీలను, యక్షస్త్రీలను, దానవస్త్రీలను ఎవరి పట్లా ప్రత్యేకపక్షపాతం చూపకుండా అపహరించాడు. వారు వివాహితలా లేక అవివాహితులా అన్నది కూడా గమనించలేదు. తనకు అడ్డుపడిన వారి వారి బంధువులను యథేష్టంగా సంహరించాడు.
दर्शनीयां हि रक्षः कन्यां स्त्रीं वाऽथ पश्यति।
हत्वा बन्धुजनं तस्या विमाने तां रुरोध ह।। (రామాయణం7.24.2)
ఆ స్త్రీల విలాపంతో లంక ప్రతిధ్వనించిపోయింది. “ఒరే దుర్బుద్ధీ! నువు స్త్రీమూలంగానే నశిస్తావురా” स्त्रीकृतेनैव प्राप्स्यते दुर्मतिर्वधम्। (రామాయణం7.24.2)
అంటూ వారు శపించేశారు.
ఇంతలో మధువు తన చెల్లెలైన కుంభీనసిని ఎత్తుకుపోయాడన్న వార్త తెలిసింది. దానితో ఆ రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. లోకవిజేత అయిన తన చెల్లెలినే ఎవడో ఎత్తుకుపోతాడా? ఎంత ధైర్యం? మళ్లీ ఇక్కడ రావణాసురుడికి కూడా పరువు సమస్యే!
అతడి కళ్లు ఎర్రగా మారిపోయాయి. “వెంటనే రథం సిద్ధం చేయండిరా. రాక్షసవీరులు సిద్ధం కండిరా. మారణాయుధాలు పట్టుకుని బయల్దేరండిరా” అని గర్జిస్తూ మధుపురానికి దండయాత్ర చేశాడు.
అయితే అతడి చెల్లెలు కుంభీనసి వచ్చి అన్న కాళ్ల మీద పడి, “అన్నా, జరిగిందేదో జరిగిపోయింది. ఇపుడు నా భర్తను చంపి, నన్ను విధవను చేయవద్దు” అని వేడుకుంది.
రావణుడు కాసేపు ఆలోచించి, “సరే, నీమీద దయతో అతడిని నేను చంపబోవటం లేదు. నీ భర్త ఎక్కడ? త్వరగా రమ్మను. అతడితో కలసి, స్వర్గలోకాన్ని జయించేందుకు బయల్దేరుతాను” అన్నాడు.
क्व चासौ तव भर्ता वै मम शीघ्रं निवेद्यताम्।
सह तेन गमिष्यामि सुरलोकं जयावहे।। (రామాయణం 7.25.44,45)
మొత్తానికి అలా రాజీ కుదిరింది. తరువాత రావణుడు ఎత్తుకువచ్చిన స్త్రీల శాపం ఫలించి సీత కారణంగా రాముడి చేతిలో చనిపోయాడు.
అయితే రావణుడి బావ అయిన మధువుమహాశివభక్తుడు. మహా ధర్మాత్ముడు. జనరంజకంగా పరిపాలన చేశాడు.కాని, ఆ కుంభీనసీమధువుల కుమారుడైన లవణాసురుడికి మాత్రం మేనమామ అయిన రావణాసురుడి బుద్ధులు వచ్చాయి. వాడు పెట్టే బాధలను సహించలేక మునులు రాముడికి మొర పెట్టుకున్నారు. శత్రుఘ్నుడు రాముని ఆజ్ఞను పొంది ఆ లవణాసురుడిని సంహరించాడు.
***

ఈ విధంగా తమ కుటుంబానికి చెందిన స్త్రీని ఎవడో తమ అనుమతి లేకుండా పెండ్లాడడం అనేది ఎంతటివారికైనా ఇజ్జత్ కా సవాల్. అది ఒక మానసికమైన పీడ.
కురువంశంవారు తమ కన్యను ఎత్తుకుపోయారని యాదవులు మండిపడ్డారు. యాదవులు తమ కన్యను ఎత్తుకుపోయారని కురువంశంవారు కుతకుతలాడిపోయారు. రాక్షసులు తమ స్త్రీని ఎత్తుకుపోయారని మానవులు వగచారు. మనిషి మా కన్యను వరిస్తాడా అని రాక్షసులు కోపగించుకున్నారు. ఎవరూ తక్కువ తినలేదు.

పరువు ఎవడబ్బ సొమ్ము? ఎవరికి ఆ పరువు బరువు?

అయితే ఈ కథలన్నిటిలోనూ గమనించవలసింది ఏమిటంటే –

ప్రతిచోటా బలవంతులే గెలిచారు.
ఓడినవారు చాలావరకు రాజీకొచ్చారు.
అప్పుడైనా ఇప్పుడైనా జరిగేది అదే.

కాబట్టి, ఇప్పటి ఆశావహులు ఎవరైనా సరే, స్వయంగా తమకు తగినంత బలం లేకుండా, బలవంతుల ఇష్టం లేనిదే బలవంతుల కన్యల జోలికి పోరాదు. బలం అంటే ఆరోజుల్లో పరాక్రమం అయ్యుండవచ్చు. ఈరోజుల్లో ధనం, పలుకుబడి కూడా.

బలవంతుడు మరొక బలవంతుడినే ఇష్టపడతాడు, అతడితోనే రాజీ పడతాడు. ప్రపంచమంతటా ఇదే సహజం.

అంతే కాదు, బలవంతుడు అర్హత కలిగిన వినయవంతుడిని కూడా ఇష్టపడతాడు. శుక్రాచార్యులవారు తన కూతురును క్షత్రియుడైనప్పటికీ వినయవంతుడైన యయాతిరాజుకు సంతోషంగా ఇచ్చి పెళ్లి చేశాడు.

అంతేగాని, చెత్త చెత్త సినిమాలలో చూపినట్టు పోకిరీతనంతో బలవంతుల జోలికి పోయి భంగపడకండి, సమాజంలో అందరినీ మాకు న్యాయం చేయండి అంటూ దేబిరించకండి.

బలమా? అర్హతతో కూడిన వినయమా?
ఏదో ఒకటి ఎంచుకోండి.

కాబట్టి, ఓ ఆశావహులారా! ఈ రెండిటిలో ఏదో ఒకటి లేకుండా పనికిమాలిన సాహసాలు చేసి, దానికి తగిన ప్రతిఫలం అనుభవించి, మీ సమస్య తప్ప మరో సమస్య సమాజంలో మరేమీ లేనట్టు ఊరికే గగ్గోలు పుట్టించడాలు మానుకోండి.

Tuesday, 4 September 2018

హే కృష్ణా! గోవులకు మాత్రమే శుభమస్తా? గేదెలకు వద్దా? (2)




“నాయనా, చాల కాలం క్రితమే మంచి బుద్ధిని అందరికీ ప్రసాదించాను.  కాని, దానిని ఇపుడు అందరూ అపార్థం చేసుకుంటున్నారు.”

“ఏమిటి ఆ బుద్ధి స్వామీ?”

గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యమ్.

“.....”

“ఏమి నాయనా ముఖం విచిత్రంగా పెట్టావు?”

“అది కాదు స్వామిన్, గోవులు బ్రాహ్మణులకు మాత్రం శుభం కలిగితే చాలా? గేదెలకు మేకలకు శుభం వద్దా?  క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇలా మిగిలినవారికి శుభం కలుగవద్దా?  చాల అన్యాయం స్వామిన్!”

“నాయనా!  ఎంత బుద్ధిహీనమైన మాట పలికావు!  ఆ సుభాషితం నీకు అర్థం కావాలంటే నీకు మరి కాస్త బుద్ధిని ప్రసాదించాల్సిందే!”

“అయ్యో!  స్వామిన్!  అపరాధాన్ని క్షమించండి.  శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నమ్.”

“గోవు అనేది ఇక్కడ ఒక జాతి కాదు, మానవేతరసర్వప్రాణులకూ అది సంకేతాత్మకంగా వాడబడింది.  అంతే.   గోవులకు శుభం కలగాలి అంటే – గేదెలు, మేకలు, గొర్రెలు, చెవులపిల్లులు, చీమలు చెదలతో సహా అన్ని ప్రాణులకూ శుభం కలగాలి అని అర్థం.  అలాగే బ్రాహ్మణులు అనే పదం సమస్తమానవజాతులకూ శుభాన్ని కోరేవారికి సంకేతాత్మకంగా వాడబడిన పదం.”

“స్వామీ అర్థం కాలేదు.”

“సరే, అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు?”

“చతుర్వర్ణాలలోనూ ప్రథముడు.  అగ్రజన్ముడు.” 

“అగ్రజన్ముడు అంటే?”

“అగ్రే జన్మ యస్య సః.  అందరికంటే ముందు పుట్టినవాడు.”

“అందరికంటె ముందు తాను ఎందుకు జన్మించాడో అర్థం చేసుకున్నవాడు కాదా?”

“అవును స్వామీ, అలా కూడా అర్థం చేసుకోవచ్చు.”

“వచ్చు కాదయ్యా, చేసుకో.”

“సరే స్వామీ!”

“బ్రాహ్మణుల ప్రాథమికవిధులు ఏమిటి?” 

“అధ్యయన-అధ్యాపనాలు, యజన-యాజనాలూ, దానాదానాలు”.

“వాటిలో ప్రధానమైనవి ఏమిటి?”

“అధ్యయన-అధ్యాపనాలు”

“వాటిని చేసేవారు బ్రాహ్మణులే కదా?”

“అవును స్వామిన్!”

“అటువంటి బ్రాహ్మణులు ఎక్కడ ఉన్నారు?”

“అదేమిటి స్వామీ?  మునుపు ఉన్నంతమంది ఉన్నారో లేదో కాని, ఇప్పటికీ చాలామంది ఉన్నారు కదా?”

“నా మాటను వ్యతిరేకార్థంలో గ్రహించకు. అలాంటివారు  లేరు అని నేను చెప్పడం లేదయ్యా!   వారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నాను.”

“దేశమంతా ఉన్నారు స్వామిన్!”

“ప్రపంచమంతా ఉన్నారు అని అంటాను నేను.”

“అవును స్వామీ, ‘సముద్రం దాటి వెళ్లరాదు’ అనే చాదస్తపుభావాన్ని దాటుకుని బ్రాహ్మణులు ప్రపంచమంతా వ్యాపించి స్థిరపడ్డారు.”

“నాయనా!  చాదస్తమా కాదా అనేది కాదు, ఇక్కడనుండి వెళ్లినవారిలో కొందరు మాత్రమే కాదు, ప్రపంచంలో చాల చోట్ల బ్రాహ్మణులు నా అనుగ్రహంతో ఉద్భవించారు.”

“అదేమిటి స్వామీ?”

“అధ్యయన-అధ్యాపనాలు చేసేవారు ప్రపంచమంతా జన్మించారు అంటున్నాను.”

“అంటే సైంటిస్టులు, టీచర్లా స్వామీ?”

“అవును!”

“అదేమిటి స్వామీ? అధ్యయనం అంటే ఇక్కడ వేదాధ్యయనం అని అర్థం కదా?”

“నాయనా, తెగేవరకూ లాగుతావా?  వేదం అంటే అర్థం ఏమిటి?”

వేదయతీతి వేదః – తెలియజేస్తుంది కాబట్టి వేదం.  అది అపౌరుషేయశాస్త్రజ్ఞానం.”

“కదా? వేదాలు ఎన్ని?”

“నాలుగు.”

“మరి ‘అనంతా వై వేదాః’ (తైత్తిరీయబ్రాహ్మణం 3.10)  అనే వేదవాక్కుకు అర్థం ఏమిటి?

“వేదాలు అనంతాలు అని అర్థం.” 

“మరి వేదాలు నాలుగే అంటున్నావేమిటి?”

“స్వామిన్!  పరీక్షిస్తున్నారా?  వేదాలు నాలుగే అంటే – వేదశబ్దంతో వ్యవహరింపబడే గ్రంథసమూహాలు నాలుగే అని అర్థం.  అనంతా వై వేదాః’ అనే చోట జ్ఞానం అనంతం అనే అర్థం వస్తుంది.”

“బాగా చెప్పావయ్యా!  మరి ఆ అనంతజ్ఞానమూ నాలుగు వేదాలలో ఉందా?”

“సాంకేతికంగా దాగి ఉంది స్వామీ!” 

“నువ్వు కూడా వేదంలో ఉన్నావా?”

“నేను అంటే ఏమిటో వేదంలో వివరింపబడి ఉంది స్వామీ!”

“నువ్వు ఏమిటో వేదంలో వివరింపబడి ఉంది.  కాని, నువ్వుగా వ్యవహరింపబడుతున్న నువ్వు ఇపుడు వేదంలో ఉన్నావా, లేక నా ఎదుట ఉన్నావా?”

“అర్థం కాలేదు స్వామీ!”

{చిరునవ్వు} “మరి?  మరీ తెలివికి పోయి సమాధానాలు చెబితే సంధింపబడే ప్రతిప్రశ్నకు సమాధానం చెప్పే సామర్థ్యం కూడా ఉండాలి మరి!”

“తప్పైంది స్వామీ!”

“చెబుతా విను!  సృష్టిరహస్యాలను అధ్యయనం చేసే ప్రతివాడూ, వాటిని సక్రమవినియోగం చేసేందుకు ఇతరులను ప్రేరేపించే ప్రతివాడూ బ్రాహ్మణుడే!  


వారు భారతదేశంలోనూ ఉన్నారు, ప్రాక్పాశ్చాత్యప్రపంచమంతటా కూడా వ్యాపించి ఉన్నారు.  
వినాశనాన్ని ఏ విధంగా ఆపవచ్చునో అందరూ అధ్యయనం చేస్తున్నారు.  ప్రపంచానికి తెలియజేస్తున్నారు.  
వారి కార్యకలాపాలను కూడా భారతీయులు అధ్యయన-అధ్యాపనాలుగా ఆదరించి  ఆచరించాల్సిన అవసరం ఉంది.”




“అది కాదు స్వామిన్, మీరు ఇపుడు ఇచ్చిన ఆదేశం ఉందే?  అది 

ఏతద్దేశప్రసూతస్య
సకాశాదగ్రజన్మనః
స్వం స్వం చరిత్రం శిక్షేరన్
పృథివ్యాం సర్వమానవాః।। 

అని చెప్పే  స్మృతివాక్యానికి విరుద్ధంగా ఉన్నది కదా మరి?”

“ఏమయ్యా?  నువు ఇపుడు చేసింది దాంభికమైన వాదన (hypocritical argument) అని నీకు అనిపించటం లేదా?”

“అదేమిటి స్వామీ, అంత మాట అనేశారు?”

“కాదా మరి?  ఆ పాశ్చాత్యులు ఇచ్చిన విద్యను అనుసరించి బస్సులు, కార్లు, నౌకలు, విమానాలు తయారుచేసుకుని వాటిమీద మీరు ప్రయాణం చేయటం లేదా?  వారి విద్యను గ్రహించి, మీ స్మార్ట్ ఫోన్లనూ కంప్యూటర్లనూ వాడుకొనటం లేదా?  ఇలా ఒకపక్క వారి అధ్యయనఫలితాలనుండి ఆవిష్కరింపబడిన ఎన్నెన్నో విద్యలను, వాటి ప్రయోజనాలను నిస్సంకోచంగా గ్రహించి, నిరభ్యంతరంగా వాడుకుంటున్నారే?  అప్పుడు అడ్డు రాలేదా, నువ్వు చెప్పిన ఈ స్మృతివాక్యం?  వాటిని ఎలా స్వీకరించారో, అలాగే ఇపుడు నువు నివేదించిన ప్రపంచవినాశకసమస్యల విషయంలో కూడా వారి అధ్యయనాల ఫలితాలను గ్రహించి  తత్ప్రకారంగా నడుచుకోండి అని నేను చెప్పినపుడు మాత్రం మీ ఆభిజాత్యం కొద్దీ చటుక్కున గుర్తొచ్చిందేం ఆ స్మృతివాక్యం?”

“చిత్తం స్వామీ!”

“చిత్తం గిత్తం కాదు!  
భారతీయేతరులు అనగానే, మీలో చాలామందికి ఒకరకమైన వైమనస్యం ఉండటం గమనించాను.  
అలాగే మరి కొందరిలో భారతీయేతరులు ఏమి చెప్పినా గొప్పే, ప్రపంచంలో కెల్లా పనికిమాలినవారు మాత్రం భారతీయులే అనే భయంకరమైన ఆత్మన్యూనతాభావం కూడా ఉంది.   
నాయనా!  గొప్పవారు భారతీయులలోనూ ఉన్నారు, ఇతరులలో కూడా ఉన్నారు.  అందరూ నావారే!  వారి పట్ల వైముఖ్యం తగ్గించుకోండి.  అలాగే, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకోండి.  
వసుధైకకుటుంబకమ్’ అనే భావన అందరిలోనూ వర్ధిల్లాలి!

“స్వామీ, మీ ఆదేశం శిరోధార్యం!”

“నేను చెప్పానని కాదు, నువ్వు స్వయంగా ఉదాహరించిన స్మృతిలోనే మరొకచోట ఉన్న ఉదాత్తమైన మరొక విషయాన్ని విస్మరించావు.  నీ ఆవేశంవల్ల వివేకాన్ని కోల్పోతున్నావు.  

విషాదప్యమృతం గ్రాహ్యం
బాలాదపి సుభాషితమ్
అమిత్రాదపి సద్వృత్తం
అమేధ్యాదాపి కాంచనమ్।।

దొరికితే, విషం నుండి కూడా అమృతం గ్రహించు.  పిల్లవాడు చెప్పినా మంచిమాటను గ్రహించు.  శత్రువులోనైనా మంచిగుణం ఉంటే గ్రహించు. అమేధ్యంలో ఉన్నప్పటికీ, బంగారాన్ని గ్రహించు అని ఎంతో స్పష్టంగా చెప్పారు కదా మన స్మృతికారులు?

మరి, వారి ఆదేశాలప్రకారం మనదేశపు బ్రాహ్మణులలాగానే లోకసంక్షేమం కోరి సదుపదేశం చేసే భారతీయేతరబ్రాహ్మణుల మాటలను మీరు ఎందుకు ఆదరించరు?  వారి మాటలను నిర్లక్ష్యం చేయడం మీ అహంకారం కాదా? 

ప్రపంచంలో ఎవరో ఎవరిపట్లనో జాతివివక్ష (Racism) చూపుతారని విమర్శిస్తూ ఉంటారే?  మరి ఈవిధమైన మీ ప్రవర్తన మాట ఏమిటి?  ఇది మాత్రం Racism కాదా?”  

“నిజమే స్వామీ!  కళ్లు తెరిపిస్తున్నారు.”   

“గత నలబై సంవత్సరాలలో ప్రపంచంలోని అడవుల్లో నలబై శాతం నాశనమయ్యాయి.  తెలుసా?”

“విన్నాను, చదివాను స్వామీ!”

“ఆ విషయం భారతీయేతరబ్రాహ్మణుల అధ్యయనం వల్ల తెలిసినదే!”

“అవునా స్వామిన్!”

“అవును!  ప్రపంచమంతా అలా అడవులను నరికి ఏమి చేస్తున్నారో తెలుసునా?”

“తెలియదు స్వామిన్!”

“ఆ నశించిన అరణ్యప్రాంతంలో అత్యధికశాతాన్ని పంటపొలాలుగా మార్చుతున్నారు.”

“పెరుగుతున్న ప్రపంచజనాభా ఆహార-అవసరాలను తీర్చటానికా స్వామీ?

“కాదు, అక్కడ సోయాబీన్ పంటను పండిస్తున్నారు.  లక్షలాది సంఖ్యలో ఉన్న గోవులకు మేతగా వాటిని ఉపయోగిస్తున్నారు.’’

“ఓ!  గోజాతి అభివృద్ధికి అడవులను నరుకుతున్నారా?  వారి పిచ్చితనం కాకపోతే, అలా ఎందుకు స్వామీ?  అడవుల్లోనే వాటిని స్వేచ్చగా తిరగనిస్తే వాటి తిండిని అవే తింటాయి కదా?  ఆ మనుషులకు పంటలు పండించడం, కోసి ఆవులకు మేతగా వెయ్యడం - ఇంత  శ్రమ ఎందుకు?”

“నాయనా!  ఆ గోవులు వారు ప్రేమతోనో భూతదయతోనో పెంచుకుంటున్నవి ఏమీ కాదు.  వారు వేసిన మేత మేసి ఆ గోవులు బలంగా ఎదిగాక, వాటిని నరికి, తమ ఆహారంగా మార్చుకుంటున్నారు.”

“.....”

“నాయనా!  దిగ్భ్రాంతి చెందావా?”

“అ... అవును స్వామిన్!”

“ఎందుకు దిగ్భ్రాంతి?”

“అదేమిటి స్వామీ?  భారతీయులు భక్తితో పూజించుకుంటున్న గోజాతికి అక్కడ అంతటి దురవస్థ కలిగిందని తెలిస్తే దిగ్భ్రాంతి కలుగదా?”

“ఓహో!  వారు గోవుల బదులు మేకలనో గొర్రెలనో పందులనో అలా పోషించి వాటిని చంపి తింటూ ఉంటె  నీకు అంతటి దిగ్భ్రాంతి కలిగేది కాదన్నమాటేగా?”

“నా ఉద్దేశం అది కాదు స్వామీ!”

“మరేది?”

“ఇప్పుడేగా అధ్యయనం అధ్యాపనం చేస్తున్న ఆ భారతీయేతరులు కూడా బ్రాహ్మణులే అని మెచ్చుకున్నారు?  మరి ఇంతటి క్రూరకర్మలు చేసేవారికి అటువంటి మెప్పుకోలు ఏమిటని?”

“నాయనా!  బ్రాహ్మణులు అనేది మెప్పుకోలు పదమూ కాదు, శూద్రుడు చండాలుడు అనేవి తిట్లూ శాపనార్థాలు కూడా కావు.  ఆయా జనాలు చేసే ఆయా వృత్తులను బట్టి, వారి గుణాలను బట్టి ఆ పదాలు ఒకప్పుడు వాడబడ్డాయి.  అన్ని రకాల వృత్తులవారూ ఈ ప్రపంచానికి అవసరమే!  కాని, మీరు మీమీ అభిరుచులకొద్దీ  కొన్ని వృత్తులను ఉత్తమమైనవాటిగానూ, కొన్నిటిని నీచమైనవాటిగానూ పరిగణించి, ఆయా పదాలను ప్రశంసార్థకంగానూ నిందార్థకంగానూ వాడుతున్నారు.  చివరకు ఆ పదాలను నేను వాడినా, మీరు భావిస్తున్న అర్థంలోనే నేను కూడా వాడుతున్నట్లు అనుకుంటున్నారు.  ఇది ఏమీ బాగులేదు.”

“క్షమించండి స్వామిన్!”

“సరే, నాయనా! నువ్వన్నట్టు ఆ క్రూరకర్మలు చేస్తున్నవారు, నేను చెప్పిన ఆ పాశ్చాత్యబ్రాహ్మణులు ఒక్కరే కారు!  వారూ వీరూ వేరు వేరు.”

“కొంత కొంత అర్థం అవుతోంది స్వామిన్!”

“ఏమి అర్థమైందో చెప్పు?”

“బ్రాహ్మణ – అనే పదం సంకుచితార్థంలో వాడబడలేదు.  విద్యావంతులు జ్ఞానులు అనే అర్థంలో వాడబడింది.  విద్యావంతులు జ్ఞానులు ఎవరైనా బ్రాహ్మణులే!”

“కొంతవరకు బాగానే ఉంది.  కాని, విద్య అంటే కేవలం పుస్తకజ్ఞానం కాదు, అది అనుభవసిద్ధమైన జ్ఞానం.  నిత్యసత్యం.  విద్యావంతులంటే చదువుకున్నామని సర్టిఫికేట్ కలిగినవారు కాదు, తాము నేర్చిన జ్ఞానం ఏ విధంగా అవసరమో, ఎంతవరకు ఆచరణయోగ్యమో తెలిసినవారు.  అలాగే, ప్రపంచశ్రేయస్సును కలిగించే తమ జ్ఞానాన్ని తరువాతతరాలవారికి నిస్స్వార్థంగా అందజేసేవారు వారు.  వారు బ్రాహ్మణులు అంటే!  కాబట్టి బ్రాహ్మణ అనే పదం జన్మవాచకంగా కాదు, గుణవాచకంగా వాడబడింది అని అర్థం చేసుకో.  అలాంటివారు ఇపుడు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నారు.”

“అవును.  అర్థమైంది స్వామీ, అటువంటి గుణసంపన్నులైన బ్రాహ్మణులకు శుభం కలగాలి అని కోరడంలో తప్పు లేదు.  అలా కోరుకుంటే మిగిలినవారికి శుభం కలగకూడదు అనే దురర్థం లేదు.   ఎందుకంటే, వారికి శుభం కలిగితే అది సమస్తలోకానికి కూడా వారు శుభం కలిగించే పనులనే చేస్తారు.”

“బాగుంది.  మరి గోవులకు మాత్రమే శుభమా?  మిగిలిన జంతువులకు శుభం వద్దా అని కూడా వగచినట్టున్నావు?”

“క్షమించండి స్వామీ!  అది కూడా ఇప్పుడు అర్థం అయింది!”

“ఏమిటి అర్థమైంది?”

“గేదెలు, మేకలు, గొర్రెలు, లాగానే గోవులు కూడా సాధుజంతువులే కదా స్వామిన్!  వీటన్నిటిలోనూ సులభంగా మచ్చికయ్యేవి గోవులే!  అవి తమ యజమానులను ఎంతగానో ప్రేమిస్తాయి.  తమ యజమానులకు ఇష్టమైనవారిని కూడా అవి గ్రహిస్తాయి.  గేదెలు దారితప్పిపోతే మళ్లీ తమ యజమానిని వెతుక్కుంటూ రావడం జరుగుతుందో లేదో!  గోవులు మాత్రం యజమానితో తమ వేరుబాటును సహించలేక వెనక్కు వస్తాయి.  మేకలు గొర్రెలు కూడా దారి తప్పితే వెనక్కు రాకపోవచ్చు.  అందుకే కాపరులు వాటిని వెనక్కు మళ్లించుకొనడం కోసం కుక్కలను పెంచుతారని అందరికీ తెలిసిన విషయమే.  ఈరకంగా యజమానులకు అత్యంతసన్నిహితంగా ప్రేమాస్పదంగా ఉండే గోవులను  సకలమానవేతరప్రాణులకూ ప్రతినిధులుగా పరిగణించి వాటికి శుభం కలగాలని కోరుకొనడంలో తప్పేమీ లేదు!

{చిరునవ్వు}

“ఏమి స్వామీ, తప్పు చెప్పానా?”

“నువ్వు జంతుప్రవర్తనశాస్త్రంలో ఏమైనా పరిశోధన చేసి ఉంటావా అని ఆలోచిస్తున్నాను!” 

“అయ్యో, అదేమీ లేదు స్వామిన్!”

“పోనీ, నువ్వంటున్నట్టు, యజమానులను ప్రేమించడం, ఎక్కడా తప్పిపోకుండా వెనక్కు తిరిగిరావడమే మంచి జంతువుకు ఉండాల్సిన ప్రధానలక్షణం అనుకుందాం.  అప్పుడు రక్షణార్హమైనదని నువు సిఫారసు చేస్తున్న గోవు కంటే ఒక కుక్కకు ఆ లక్షణాలు మరింత అధికంగా ఉన్నాయి కదా?”

“అయ్యో, నేను సిఫారసు చేయడమేమిటి స్వామీ?”

“అయితే సిఫారసు చేయటం లేదా?”

“స్వామీ, గోవు ఏ విధంగా రక్షణార్హమైనదో, మిగిలిన జంతువులు కూడా అలాగే రక్షణార్హమైనవి అని నా అభిప్రాయం.”

“మరి, ఇంతసేపు గోవు మిగిలిన జంతువుల కంటె ఏ విధంగా గొప్పది అనే విషయంలో నాకు బోలెడంత వివరణ ఇచ్చావే?”

“అంటే, అప్పటివారు ఎందుకు ఆవుకు అంత ప్రాధాన్యతను ఇచ్చారో ఊహించే ప్రయత్నం చేశాను స్వామిన్!”

“ఆవు కాదు నాయనా!  గోవు!  గోవు!”

“ఆవు కాదు, గోవు?  అదేమిటి స్వామిన్?”

“నువు చేస్తున్న చిన్నపొరబాటును సరిదిద్దాను.”

“ఓ!  అర్థమైంది స్వామీ!  మీరు చిన్న చిన్న మాటలతో నాకు మరింత మరింత చక్కగా సరైన అర్థం స్ఫురించేలా చేస్తున్నారు!”

“ఇపుడు కొత్తగా అర్థమైంది ఏముంది?”

“నిఘంటువు ప్రకారం గోవు అంటే ఆవు మాత్రమే కాదు, ఎద్దు కూడా!”

“అయితే ఏమిటి?”

“అంటే, గోవు మనుషులకు బహుళార్థకంగా ఉపయోగపడుతుంది.  ఆవు రూపంలో మంచి పోషకాహారమైన పాలను ఇస్తుంది.  ఎద్దు రూపంలో పొలం దున్ని పంటలు పండించుకునేందుకు ఉపయోగపడుతుంది.  ఆ రోజుల్లో మనుషులు ఎవరి మీదా ఆధారపడకుండా హాయిగా స్వతంత్రంగా బ్రతికేందుకు కొన్నిఆవులు, కొన్ని ఎద్దులు ఉంటే చాలు.  కాబట్టి, ఆ రెండింటినీ గోవు అనే శబ్దంలో ఇమిడ్చి, వాటికి శుభం కలగాలని అన్నారు.  అవి చక్కగా ఉంటే సమస్తమానవాళి వాటి తోడ్పాటుతో సుఖంగా బ్రతకవచ్చునని దాని అంతరార్థం!”

{చిరునవ్వు}

గోభిస్తుల్యం న పశ్యామి
ధనం కించిదిహాచ్యుత
గావో లక్ష్మ్యాః సదా మూలం
గోషు పాప్మా న విద్యతే।।

[గోవులతో సమానమైన ధనం వేరే ఏమీ లేదు, గోవులు సంపదలకు మూలం] అని మహర్షులు అందుకే అన్నారు కదా స్వామిన్!”

“నువ్వు ఉటంకించిన శ్లోకంలో ఆ చివరిపాదానికి అర్థం చెప్పలేదేమి నాయనా?”

“గోవులయందు పాపము లేదు అని అర్థం!”

“అంటే?”

“గోవులు పవిత్రమైనవి.”

“నీ ముఖం!  ఈరోజుల్లో సంపదను సృష్టిస్తాం అంటూ మీ మానవులు ఏమి చేస్తున్నారో తెలుసు కదా? సృష్టించడానికి వారేమైనా బ్రహ్మదేవుడితో సమానులా?  వారుచేస్తున్నది సృష్టి కానే కాదు, తమ చర్యలతో వారు సృష్టివినాశనం చేస్తున్నారు. నువ్వే చెప్పావుగా?  వారు దారుణాతిదారుణంగా పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ సమస్తజీవావరణాన్ని కూడా సమూలంగా నాశనం చేస్తున్నారు.  అది మహాపాపం.  కాని, గోవులను తోడుగా చేసుకుని ఉన్నదానితో సంతృప్తి చెందుతూ బ్రతకడం వలన అటువంటి పాపం చేయవలసిన అవసరం ఉండదు.  అదీ ఆ చివరిపాదానికి వివరణ!”

“అంటే?  మానవులు తమ మేధాసంపత్తితో సృష్టించిన సమస్తవిజ్ఞానమయప్రపంచాన్నీ వదులుకుని, మరలా చరిత్రపూర్వయుగాలకు పోయి గోవులను పెంచుకుంటూ పొలం దున్నుకుంటూ బ్రతకమంటున్నారా స్వామీ?”

“ఎందుకు నాయనా అంత ఆవేశం?”

“మరేమిటి స్వామీ, మీరు అభివృద్ధినిరోధకుల్లా, ప్రాతచాదస్తపు భావాలకు సరిక్రొత్త ప్రతినిధులకు మల్లే మాట్లాడుతున్నారే?

“నాయనా, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు?  నువ్వేమన్నావ్ మొదట?  మేకలు గొర్రెలు, గేదెలు ఆవులు అన్నీ సాధుజంతువులే అని అన్నావు కదా?”

“అవును స్వామీ, అన్నాను!  అందులో తప్పేముంది?”

“మరి జింకలు, చిలుకలు కోతులు క్రూరజంతువులా?”

“అయ్యో, నా భావం అది కాదు స్వామీ!”

“మరి ఆ జంతువులు మీ పొలాలమీద పడితే మీరు ఎందుకు తరిమేస్తారు?”

“.....”

“చెప్పవయ్యా?  మొగమాటమెందుకు?”

“... అంటే,  స్వామీ... అవన్నీ మా పంటలను తినేస్తే మేము తినడానికి ఇంకేముంటుంది?  మేము కూడా బ్రతకాలి కదా?”

“వాటిని అదుపుచేయడానికి పులులున్నాయి, గ్రద్దలున్నాయి, పాములున్నాయి కదా?  మీరెందుకు వాటి జోలికి పోతున్నారు?”

“అవి అడవిలో ఉండకుండా మా పొలాల్లోనికి వస్తున్నాయి కదా స్వామీ?”

“అవి అడవి జంతువులా?”

“అంతేగదా స్వామీ?”

“అవి అడవుల్లో బ్రతకడానికి ఏమున్నాయ్?”

“గడ్డి ఉంటుంది, పండ్ల చెట్లు ఉంటాయి.”

“అడవులంటూ ఉంటే నువ్వు చెప్పినవన్నీ ఉంటాయి.  అసలు అడవులనేవే లేకుండా మీరు తుడిచిపెట్టేస్తున్నారు గదయ్యా?”

“.....”

“ఇప్పుడు చెప్పు!  మేకలు, గొర్రెలు, గేదెలకు శుభమస్తు వద్దా అని గోల గోల చేశావే?  మరి ఆ జింకలకు, చిలుకలకు, కోతులకు మాత్రం శుభమస్తు వద్దా? ఎందుకు ఇంతటి పక్షపాతం?  అని నేను మీ మనుషులను అడుగుతున్నాను.”

“తప్పే స్వామీ!”

“మీకు ఉపయోగపడేవి ఏవి ఉన్నా, వాటికి శుభమస్తు, మీకు అవసరం లేదు అనుకున్నవాటికి వాటి ఖర్మ అస్తు! – ఇదేగా మీ మానవుల స్వభావం?”

“మా ఆలోచనలలోని తప్పును గ్రహించాను స్వామీ!”

“నాయనా!  ప్రాచీనభారతీయమహర్షులు ఇప్పటివారిలా సంకుచితభావాలు కలిగినవారు కారు. మేము మాత్రమే బాగుండాలి, మిగిలినవాళ్లు ఏమైపోయినా మాకు అనవసరం’ అని భావించలేదు.  

స్వస్తి ప్రజాభ్యః’ [ప్రజలందరకూ శుభం కలగాలి] – అనేది వారి అసలైన ఆకాంక్ష.  ఆ ఆకాంక్ష నెరవేరడానికి మార్గాన్ని సూచిస్తూ – ‘పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః’ [రాజులు భూమిని న్యాయమైన మార్గంలో పరిపాలింతురుగాక!] అని చెప్పారు.  

తరువాత - ‘లోకాః సమస్తాః సుఖినో భవంతు’ [సమస్తచరాచరప్రాణులూ సుఖాన్ని అనుభవించాలి] అని ఆకాంక్షించారు.  ఆ ఆకాంక్ష నెరవేరాలంటే మార్గం ఏమిటి?  దాన్ని సూచిస్తూ ‘గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం’ అని చెప్పారు. 

అలా అనడంలోని అంతరార్థం ఏమిటో మనం ఇంతసేపు మాట్లాడుకున్న మాటలను బట్టి నీకు అర్థం  అయ్యుంటుంది.  

“అర్థమైంది స్వామీ!”

“అదే సందర్భంలో – ‘కాలే వర్షతు పర్జన్యః’ [మేఘాలు సకాలంలో సక్రమంగా వర్షించాలి] ‘పృథివీ సస్యశాలినీ’ [భూమి అంతటా వృక్షజాతులు, ధాన్యజాతులు వర్ధిల్లాలి]  దేశోయం క్షోభరహితః' [దేశము ఏ రకమైన సంక్షోభాలకూ లోనుకాకుండా ఉండాలి]  'సజ్జనాః సంతు నిర్భయాః' [మంచివారికి భయం కలుగకుండా ఉండాలి]  అనే ఆకాంక్షలు కూడా చెప్పబడ్డాయి కదా?  

ఇలా అందరికీ శుభం, అందరికీ సుఖం కలగాలని జాగ్రత్తగా ఆలోచించి చూస్తే ఆమాత్రం ఈమాత్రం చదువుకున్న ప్రతి ఒక్కరికీ కూడా అర్థమయ్యేంత సులువుగా ఈ వాక్యాలు ఉంటే, గోవులకేనా శుభం? గేదెలకు శుభం వద్దా?  బ్రాహ్మణులకేనా శుభం?  బ్రాహ్మణేతరులకు శుభం వద్దా? అంటూ అల్లరి చేస్తావేమయ్యా?”

“తప్పు తెలుసుకున్నాను స్వామిన్!”

“శుభమస్తు.”

“మరొక్క సందేహం ఉండిపోయింది స్వామిన్!”

"ఏమిటది?"

“మానవాళి ఆర్జించిన ఈ అపారసాంకేతికవిజ్ఞానం ఉందే? దీన్ని వదిలేసుకుని, గోవులను వెంటేసుకుని వ్యవసాయం చేసుకొనడం మాత్రమేనా ప్రపంచవినాశనం జరగకుండా ఉండేందుకు ఉన్న ఏకైక మార్గం?”

“నాయనా!  ఇంతసేపు నేను చెప్పింది ఏమిటి?  

ఉత్తిష్ఠత.  జాగ్రత.  ప్రాప్య వరాన్ నిబోధత.  
[లే.  మేలుకో.  ఉత్తములైన ఆచార్యులను చేరుకో.  తెలుసుకో.]  

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినః తత్త్వదర్శినః।। 

[జ్ఞానులు, తత్త్వం తెలిసిన వారు అయిన గురువులకోసం అన్వేషించు.  వారిని గౌరవించు.  వారితో చర్చలు చేయి.  వారికి సహకరించు.  వారు నీకు కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు.  ఆ విధంగా తెలుసుకో.]”

“మీకన్నా జ్ఞానులు, తత్త్వం తెలిసినవారు ఇంకెవరున్నారు స్వామీ?”

“సంవత్సరానికి ఓ కృష్ణాష్టమి నాడు తప్ప మరెప్పుడూ నేను గుర్తుకురాను కదా నీకు?  ఇంకేమిటయ్యా నువ్వు నాతో చర్చలు చేసేది?”

“అంతమాట అనకండి స్వామిన్!”

“సరే, మార్గాంతరం మరోమారు చూద్దాంలే.  
లోకాః సమస్తాః సుఖినో భవంతు.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...