Thursday 2 January 2020

గర్వకారణం 1

వనవాసం ముగిసింది.
అజ్ఞాతవాసం ముగిసింది.
సంధిప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అయినా దుర్యోధనుడికి యుద్ధం తప్పదని ముందే తెలుసును. పాండవులు ఎట్టి పరిస్థితులలోనూ సుఖపడరాదని, పాండవుల రాజ్యాన్ని పాండవులకు తిరిగి ఇవ్వాలనే సద్బుద్ధి తనకు లేదని అతడికి ముందే తెలుసు కదా? పాండవులు తన చేతిలో ఓడిపోతారని అతనికి గట్టి నమ్మకం.
అయినప్పటికీ సంజయుడు చెప్పిన ఒక్క మాట ధృతరాష్ట్రుడిని బాగా కలవరపెట్టింది.
एकतो वा जगत् कृत्स्नम्
एकतो वा जनार्दनः।
सारतो जगतः कृत्स्नाद्
अतिरिक्तो जनार्दनः।।
ఒకవైపు సమస్తప్రపంచాన్ని పెట్టి, మరొకవైపున శ్రీకృష్ణుని ఒక్కని మాత్రం పెడితే, సమస్తప్రపంచం కంటే సారభూతుడైన శ్రీకృష్ణుడే ఎక్కువ.
సమస్తప్రపంచం = జన్మ+కులము+ధనము+సంపద+భూమి+విద్య+లోకజ్ఞానము+పుస్తకజ్ఞానము+సంబంధాలు+పరిచయాలు+స్నేహితులు+అభిమానాలు+అహంకారాలు+మమకారాలు+రాగాలు+ద్వేషాలు+సమస్తచరాచరాఖిలబ్రహ్మాండము
శ్రీకృష్ణుడు > సమస్తప్రపంచం
దాంతో ధృతరాష్ట్రుడు భయపడిపోయి,
दुर्योधन हृषीकेशं शरणं गच्छ केशवम्।
"నాయనా దుర్యోధనా, శ్రీకృష్ణుని శరణు కోరవయ్యా" అని చెప్పాడు.
శ్రీకృష్ణుని గొప్పతనం దుర్యోధనుడికి కూడా తెలుసు. అయినప్పటికీ,
भगवान् देवकीपुत्रः लोकांश्चेन्निहतिष्यति।
प्रवदन्नर्जुने सख्यं नाहं गच्छेऽद्य केशवम्।।
"ఆ దేవకీపుత్రుడు భగవంతుడే కావచ్చును. సమస్తలోకాలను సంహరించగలిగినవాడే కావచ్చును. అయినప్పటికీ, అతడు అర్జునుడితో స్నేహం చేసినంతకాలం నేను అతడి దగ్గరకు వెళ్లను" అన్నాడు.
కానీ దుర్యోధనుడికి తప్పలేదు.
సహాయం కోరి వెళ్లక తప్పలేదు.
ఈ శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడు?
ఎక్కడ ఆయనను పట్టుకోవాలి?
ద్వారకలో ఉంటాడని దుర్యోధనుడికి తెలుసు. అందువల్ల द्वारकामभ्ययात् पुरीम् - ద్వారకా నగరానికి వెళ్ళాడు.
అర్జునుడికి కూడా శ్రీకృష్ణుని సహాయం కావాలి. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ఆయనను ఎలా పట్టుకోవాలి? ఈ విషయం దుర్యోధనుడి కంటే అర్జునుడికే బాగా తెలుసు. 😊
దుర్యోధనుడు అర్జునుడు తన దగ్గరకు వచ్చేసరికి శ్రీకృష్ణుడు నిద్రిస్తున్నాడు. 
(నటిస్తున్నాడా? 😊). 
ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప నిద్రించే వారిని లేపడం ధర్మం కాదు. అందువల్ల వారిద్దరూ శ్రీకృష్ణుడు నిద్రలేచేంతవరకు ఎదురుచూడదలిచారు.
దుర్యోధనుడు శ్రీకృష్ణుని తల చెంత ఉన్న గొప్ప ఆసనంపై కూర్చున్నాడు. అర్జునుడు కృష్ణుని పాదాలచెంత చేతులు జోడించి వినయంగా నిలబడ్డాడు.
నిద్ర లేచిన వెంటనే కృష్ణుడు చూసింది ఎదురుగా ఉన్న అర్జునుని. 😊
प्रतिबुद्धः स वार्ष्णेयो ददर्शाग्रे किरीटिनम्।
తరువాత దుర్యోధనుని కూడా చూశాడు.
వారు వచ్చిన పని తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఇద్దరికీ సహాయం చేస్తానని చెప్పాడు.
साहाय्यमुभयोरेव करिष्यामि सुयोधन।
"నాతో సమానులై సహస్రసహస్రసంఖ్యాకులైన నా వీరసైనికులొకవైపు ఉంటారు, ఆయుధాన్ని పట్టకుండా, యుద్ధం చేయకుండా నేను ఒకవైపు ఉంటాను. మీరు చెరొక దానిని ఎంచుకోండి. అర్జునుడు చిన్నవాడు కాబట్టి మొదట ఎంచుకుంటాడు" అన్నాడు.
టాస్ ఓడి పోయిన క్రికెట్ జట్టు కెప్టెన్‌లా దుర్యోధనుడు డీలా పడిపోయాడు.
శ్రీకృష్ణుని గొప్పతనం తెలిసినప్పటికీ దుర్యోధనుడు మోహంలో పడిపోయాడు. "ఆయుధాలు పట్టకుండా యుద్ధం చేయకుండా తనవైపు శ్రీకృష్ణుడు ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి అనుకున్నాడు. మొదట కోరుకునే అవకాశం చిన్నవాడు అనే పేరిట అర్జునుడికి ఇచ్చాడు. వాడేమైనా తెలివితక్కువవాడా? ఖచ్చితంగా సహస్రసహస్ర సైనికులనే కోరుకుంటాడు" అని భావిస్తూ నిస్సహాయంగా పళ్ళు నూరుతున్నాడు.
కానీ దుర్యోధనుడికి సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తూ, అర్జునుడు తనకు శ్రీకృష్ణుడు ఒక్కడే కావాలన్నాడు.
अयुध्यमानं संग्रामे वरयामास केशवम्।
దుర్యోధనుడి ఆనందానికి అంతే లేదు.
संप्राप्य परमां मुदम्...
ఈ దెబ్బతో నాదే విజయం అని భావించాడు.
युद्धान्मेने जितं जयम्।
శ్రీకృష్ణుడు తాను తవ్వుకొన్న గోతిలో తానే పడ్డాడు అని ఆనందించాడు. టాస్ ఓడిపోయినప్పటికీ మ్యాచ్‌లో విజయం నాదే అనుకున్నాడు.
కానీ, అర్జునుడు ఏమిటి, అంతటి తిక్కోడు?
సహస్రసహస్రమహాయోధులను వదిలిపెట్టి, ఆయుధం పట్టుకొని యుద్ధం చేయను అన్న కృష్ణుని మాత్రమే ఎందుకు కోరుకున్నాడు?
ముందే అనుకున్నట్టుగా, ఈ విషయం దుర్యోధనుని కంటే అర్జునుడికే బాగా తెలుసు. 😊
यतः सत्यं यतो धर्मः
यतो ह्रीरार्जवं यतः।
ततो भवति गोविन्दः
यतः कृष्णस्ततो जयः।।
ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ హ్రీ ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ ఆర్జవం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది.
1 సత్యం = సత్యం
2 ధర్మం = ధర్మం
3 హ్రీ = ఎటువంటి పనుల వలన సత్యధర్మపరులైనవారికి క్షోభ కలుగుతుందో అటువంటి పనులను చేసేందుకు సిగ్గుపడటం, వెనుకాడటం.
4 ఆర్జవం = ఋజుత్వం. త్రికరణశుద్ధి. మనోవాక్కాయకర్మల సామాన్యము (సమానంగా ఉండేలా ప్రవర్తించటము)
ఈ నాలుగు గుణాలు ఎవరి దగ్గర ఉంటే శ్రీకృష్ణుడు వారి దగ్గర ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎవరి చెంత ఉంటే వారిదే జయం. 🙏
ఆ నాలుగు గుణాలు దుర్యోధనుని చెంత లేవు కాబట్టే అతడు కృష్ణుని సంతోషంగా వదులుకున్నాడు.
కానీ ఈ నాలుగు గుణాలు అర్జునునిలో పుష్కలంగా ఉండడం వల్ల అతడు శ్రీకృష్ణుని ఎంచుకున్నాడు.
ఈవిషయం తెలియక అందరూ పాండవపక్షపాతి అంటారు గాని, నిజానికి అతడు ధర్మపక్షపాతి.
అంతిమఫలితం అందరికీ తెలిసిందే.
దుర్యోధనుడు ఓడిపోయాడు.
పాండవులు విజయం సాధించారు.
యతో ధర్మః తతః కృష్ణః.
యతః కృష్ణః తతో జయః.
🌼🌼🌼
దేవుడంటే తనను వేలంపాటలో ఎవరు ఎక్కువకు పాడుకుంటే వారి టీముకు సేవలందించే IPL క్రికెటర్ లాంటివాడు కాదు.
తన చెంతకు వచ్చినవారి ఐశ్వర్యాన్ని, స్తోత్రాలను, హోదాను, ఆడంబరపూజలను కాక, వారి గుణాలను మెచ్చి ఆదరించే దేవదేవుడు మావాడై ఉండటం మా మతానికి నిస్సందేహంగా గర్వకారణం.

https://www.facebook.com/srinivasakrishna.patil/posts/2600595423394455


No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...