Showing posts with label Garutman. Show all posts
Showing posts with label Garutman. Show all posts

Friday, 20 March 2020

అలిపిరిలో ఫణిమర్దనుడు




కశ్యపమహర్షికి ప్రియమైన భార్యలు ఇద్దరు. కద్రువ, వినత. ఇద్దరికీ పరస్పరమాత్సర్యం ఎక్కువ. ఒకసారి కద్రువ ఒకానొక పందెంలో తన కుమారులైన సర్పాల సహాయంతో వినతను మోసం చేసి తనకు దాసిగా చేసుకుంది. వైనతేయుడు కూడా (వినత కుమారుడైన గరుత్మంతుడు కూడా) ఆ కద్రువకు, కాద్రవేయులకు (కద్రువ కుమారులైన సర్పాలకు) దాసుడై వారు చెప్పిన ప్రతి పని చేయవలసి వచ్చేది.

ఇలా కాదు, మమ్మల్ని దాస్యం నుండి విడిచిపెట్టాలంటే మీకేం కావాలో చెప్పండి అన్నాడు గరుత్మంతుడు.

అమృతం తీసుకురా వదిలి పెడతాం అన్నారు సర్పాలు. గరుత్మంతుడు ఇంద్రుని ఓడించి వారికి అమృతం తెచ్చి ఇచ్చాడు. తనను, తన తల్లిని దాస్యం నుండి విడిపించుకున్నాడు. అయితే సర్పాలు అమృతం త్రాగకముందే ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. తనకు సహకరించినందుకు వరమిస్తానన్నాడు. అయితే నన్ను ఇంతకాలం ఏడిపించిన సర్పాలే నాకు ఆహారం కావాలన్నాడు గరుత్మంతుడు. తథాస్తు అన్నాడు ఇంద్రుడు.

ఆ విషయం తెలిసి సర్పాలన్నీ భయపడి రమణకద్వీపానికి పారిపోయాయి. అయినా గరుత్మంతుడు వాటిని వదలలేదు. అపుడు సర్పాలు గరుత్మంతుని వేడుకున్నాయి. తమ్ముడూ, మీ సోదరులమైన మమ్మల్ని చంపకు. మానవులు మాకు భయపడి మేము వారిని ఏమీ చేయకుండా ఉండేందుకు గాను ఆహారం సమర్పిస్తూ ఉంటారు. అందులో నీకు కూడా భాగమిస్తాం. అది స్వీకరించి మమ్మల్ని వదిలి పెట్టు అన్నారు. గొడవ ఎందుకులెమ్మని గరుత్మంతుడు సరేనన్నాడు.

అయితే సర్పాలన్నిటిలో కాళియునికి కాస్త బలగర్వం ఎక్కువ. ఒకరోజు గరుత్మంతునికి భాగం పెట్టకుండా తానే మొత్తం ఆహారం భుజించేశాడు. దాంతో గరుత్మంతుడు కోపగించి "వీని తలలు చీరి చెండాడి భోగంబు చించి వైచి ప్రాణములఁ బాపి వచ్చెద" అని విజృంభించాడు. కాళియుడు ధైర్యంగానే ఎదిరించాడు గాని, అప్పటికి గాని తన బలం గరుత్మంతుని ముందు ఎందుకూ కొరగానిది అని తెలిసిరాలేదు.

వెంటనే పాకిపోయి కాళింది మడుగు చేరాడు. ఆపత్కాలంలో వాలినుండి ఆత్మరక్షణకోసం సుగ్రీవునికి ఋశ్యమూకం దొరికినట్టు కాళియుడికి కాళింది మడుగు దొరికింది. కాళింది మడుగులోని జీవాలకు హాని చేస్తే గరుత్మంతుడు మరణిస్తాడు అని సౌభరి ముని శాపం ఉన్నది. ఆ విధంగా కాళియుడు యుక్తితో చావు తప్పించుకున్నాడు. గరుత్మంతుడు ఊరకున్నాడు.

ఆ తరువాత కాళియుడు కాళింది మడుగులో విజృంభించాడు. మడుగులోని సమస్తజలాన్ని విషమయం చేశాడు. దానిపైనుండి పక్షులు ఎగిరితే అందులో పడి చచ్చేవి. దాని మీదనుండి వచ్చిన గాలి సోకితే గట్టున దూరంగా ఉండే జీవులు కూడా చచ్చిపడవలసిందే! ఈ వ్యవహారం తమ పశువులకు, తమ మిత్రులకు ప్రమాదకరంగా పరిణమించే సరికి కృష్ణుడు ఈ సంగతేమిటో తేల్చేయాలనుకున్నాడు.

కటి చేలంబు బిగించి పింఛమునఁ జక్కం గొప్పు బంధించి దోస్తటసంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి తత్కుటశాఖాగ్రముమీఁదనుండి యురికెన్ గోపాలసింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానంబనూనంబుగన్.

కాళియుడికి కోపం వచ్చింది.
"బాలుండొక్కఁడు వీఁడు నా మడుఁగు విభ్రాంతోచ్చలత్కీర్ణ కల్లోలంబై కలఁగం జరించె నిట నే లోనుంటఁ జూడండు మత్కీలాభీలవిశాలదుస్సహవిషాగ్నిజ్వాలలన్ భస్మమై కూలంజేసెద నేడు నా కోపంబు దీపింపగన్"
అనుకున్నాడట.

చూడండి.
అదే పొగరంటే.
అది మామూలు పొగరు కాదు.
దానిని తల పొగరు అంటారు.

బలవంతుడైన శత్రువుకు భయపడి తలదాచుకొనేందుకు వచ్చినవాడు, ఆ మడుగు చొచ్చిన వాడు, ఆ మడుగులో మొదటినుండి ఉన్న మిగిలిన ప్రాణులతో స్నేహంగా ఉండక, అన్నిటినీ హతమార్చి, దురాక్రమణ చేసి, ఇపుడు నా మడుఁగు నా మడుఁగు అని రక్షకుడైన కృష్ణునిపైనే దౌర్జన్యం చేయబూనుకున్నాడు. ఆ తలపొగరు ఒక్క తలది కాదు. అది నూరు తలల పొగరు!

కాళియుడు నూరుతలలతోనూ బాలకృష్ణుని కరిచాడు. పెనవేసుకున్నాడు. ఒడ్డున చూస్తున్న వారందరూ భయభ్రాంతులైనారు. అయ్యయ్యో అని ఆర్తనాదాలు చేశారు.

ఆపై కృష్ణుని విజృంభణం మొదలైంది. కాళియుని తలలపై నృత్యం చేశాడు. కాళింది కెరటాల ఘోషలు మృదంగరావాలైనాయి. "మహితకాళియఫణిఫణామండపమున నళినలోచనవిఖ్యాతనర్తకుండు నిత్యనైపుణ్యమునఁ బేర్చి నృత్యమాడె" నట!

ఆ దెబ్బకు ఆ ఫణి (పాము) పడగలు బెండుపడిపోయాయి. యొండొండ ముఖంబుల రక్తమాంసంబులుమియ వచ్చాయి. కన్నుల విషంబు వెలిగ్రక్కబడింది. పాము ఉక్కు చెడింది. చిక్కింది. దిక్కులు చూచింది. కంఠగతప్రాణమైంది.

"బాలుఁడు మత్ఫణాశతము భగ్నముగా వెసఁ ద్రొక్కియాడెడిన్" అని భావించాడు.

అంతలోనే తటాలున కాస్త తెలివి తళుక్కుమంది.
మామూలు బాలుడు ఇంతటి పని చేయగలడా?

"ఈతడు సర్వచరాచరభూతేశుండైన పరమపురుషుండు" అని తెలుసుకున్నాడు.

ఇంతలో కాళియుని భార్యలు ఏడుస్తున్న తమ పిల్లలను వెంటేసుకుని వచ్చారు.

"క్రూరాత్ముని దండించుట క్రూరత్వము గాదు సాధుగుణము గుణాఢ్యా" అని కృష్ణుని ప్రశంసించారు.

చివరకు తమ భర్తను క్షమించమన్నారు. "చాలున్ నీ పదతాండవంబు పతిభిక్షంబెట్టి రక్షింపవే!" అని వేడుకున్నారు.

కాళియుడు కూడా శరణువేడాడు. "మనిచెదేనియు మన్నించి మనుపు నన్ను నిగ్రహించెదవేనియు నిగ్రహింపుమింక సర్వేశ్వరా" నన్నేమి చేసినా నీ యిష్టము" అనేశాడు.

"చూడు నాయనా! గోవులు, మనుషులు ఈ మడుగులో నీరు త్రాగుతూ ఉంటారు. ఇక్కడ నువ్వు ఉండటానికి వీల్లేదు. నువ్వు, నీ బంధువులు, మీ మీ భార్యాబిడ్డలతో సహా, ఈ మడుగును వదిలి సముద్రానికి పొండి. నీవును నీ బాంధవులును, నీ వనితలు సుతులుఁ జనుఁడు నేఁడంబుధికిన్" అని ఆజ్ఞాపించాడు.

అపుడు కాళియునికి తాను చేసిన పాత తప్పులు గుర్తుకొచ్చాయి. కాళింది మడుగులోనే తన ప్రతాపమంతా. బయటకు అడుగు పెడితే తక్షణమే గరుత్మంతుడు చీల్చి చెండాడేస్తాడు. ఇక్కడే ఉంటానంటే కృష్ణుడు దండిస్తాడు. తన మూర్ఖత్వం వల్ల, నూరు తలకాయలనిండా ఉన్న పొగరుల వల్ల, తాను సర్వస్థలభ్రష్టుడనైనానని తెలిసివచ్చింది పాపం.

కృష్ణుడు అతడి ఆలోచనను గ్రహించాడు. చిరునవ్వు నవ్వాడు. "భయపడకు కాళియా, నీ పడగలపై నా పాదముద్రలను చూసి గరుత్మంతుడు నీ జోలికి రాడు పో - మత్పదాబ్జలాంఛనములు నీ తలనుంటఁ జూచి యా పక్షిరాజు నిన్నుఁ బట్టఁడింక" అని వరమిచ్చాడు.

కాళియుడు సంతోషించి పుత్రమిత్రకళత్రసమేతంగా కృష్ణునికి ప్రదక్షిణలు చేసి నమస్కరించి సముద్రానికి తరలిపోయాడు.

కాళింది మరలా సుధావారిం బొలు పారె నెల్లవారికిఁ బ్రియమై.

అదీ కథ.
)()()()()(

ఈ ఫోటో చూశారా?
ఫణిందమనుడు. ఫణిమర్దనుడు. "ఫొణి"ని సముద్రంలోనికి తరిమిన జగన్నాథుడు.

ఈ బాలుడు మత్ఫణాశతమును భగ్నము చేయుచున్నాడని కాళియుడు భావించాడు కదా? మరి నూరు పడగలేవీ? ఒకటే పడగను శిల్పి చిత్రీకరించాడు.

కృష్ణుడెపుడూ అంతేనని ఆ శిల్పి భావించాడో ఏమో.

మరోసారి "కరసహస్రంబుల కండూతి వాయు నుపాయంబును లేద యీ భరము నెట్లోర్తున్నుమానాయకా? యుద్ధం చేయాలనే నా వేయిచేతుల తీట ఎపుడు తీరుతుందో అని సరదాపడిన బాణాసురుని వేయిచేతులలో ఓ నాలుగింటిని వదిలేసి మిగిలిన తొమ్మిన్నూట తొంబైయారు చేతులు నరకలేదా అదే కృష్ణుడు?

అట్లే, కాళియుని నూరు తలకాయల పొగరు దించేసి, ఒక తలకాయను అట్లే వదిలేసి ఉంటాడని ఆ శిల్పిగారి ఉద్దేశమేమో.
)()()()(

ఈ కథలు సాంకేతికమనిపిస్తూ ఉంటాయి. కశ్యపుడు అంటే ఒక paternal gene పేరు, కద్రువ వినత అనేవి maternal genes పేర్లు కావచ్చు. రామాయణభారతాలలో ఈ కశ్యపుడు సమస్తజీవజాలనికీ (జంతువులకు, పక్షలకు, చెట్లకు, మనుషులకు కూడా) మూలబీజమనే సిద్ధాంతం కనిపిస్తుంది.

కశ్యపునికి ఇంకా చాలమంది భార్యలున్నారు. ఉదాహరణకు దితి, అదితి. వారి నడుమ కూడా మాత్సర్యమున్నదట. వారి సంతానమే దైత్యులు (రాక్షసులు), అదైత్యులు (దేవతలు) అంటారు. రాక్షసులు దేవతలు అనేవి ప్రాణుల స్వభావాన్ని నిర్దేశించే మూలపదార్థాలు అయ్యుండవచ్చు. క్షీరసాగరమంటే మనస్సు అని, చెడుతలంపులు విషమని, మంచి తలంపులు అమృతమని చెప్పడం తెలిసిన విషయమే. కాబట్టి, దేవతలు రాక్షసులు అనేవి ప్రాణుల స్వభావాన్ని నిర్దేశించే వివిధ హార్మోన్లకు పెట్టిన సాంకేతికనామాలు అయ్యుండవచ్చు. దితి అదితి అనేవి ఆ హార్మోన్లను ఉత్పాదన చేసే glands అయ్యుండవచ్చేమో!

కాబట్టి, సమస్తప్రాణులన్నిటికీ paternal gene సమానమే అయినా maternal gene మాత్రం భిన్నమనిపిస్తుంది. కాబట్టి, కశ్యప దితి అదితి కద్రువ వినత అనేవి సాంకేతిక నామాలే తప్ప మనుషుల పేర్లు కాకపోవచ్చును. ఒక సిద్ధాంతాన్ని కథలా చెబితే కలకాలం గుర్తుంచుకుంటారని ఇలా చెప్పారేమో అనిపిస్తుంది.

అలాగే కాళియుని కథ, అది విషపూరితమైన జలావరణాన్ని మనిషి కాపాడుకున్న కథ కావచ్చును.

ఎన్ని వేలయేండ్లనాటివో ఈ కథలు! ఉన్నతమైన చదువు కొందరికే పరిమితం కావడం, వారు కూడా కాలక్రమేణా ఇతరసంస్కృతుల సమ్మేళనంతో ఆనువంశికమైన చదువులను, విజ్ఞానాన్ని కోల్పోవడం, ఈ కథలను మతానికి అంటగట్టడం, పుక్కిటి పురాణాలు అని గేలి చేయడం, విదేశీయుల చేతిలో మనకు కలిగిన పరాజయానికి మనం వివశులమై, ఆత్మన్యూనతాభావంచేత నిలువెల్లా ఆక్రమింపబడి మన కథలను, మన పురాణాలను మనమే వెక్కిరించుకొనడం ప్రారంభమైంది. ఈ పతనం ఇప్పటికి మరింత వేగమౌతోందే తప్ప ఆగటం లేదు.

చిటారు కొమ్మన మిఠాయిపొట్లమంటే తేనె గూడు కాదు. ఇటువంటి జ్ఞానఫలమే! చూడనివారికి అది దక్కదు. ప్రయత్నం చేయనివారికి అది దక్కదు. ప్రయత్నం చేసినా పొట్టిచేతులవారికి దక్కదు. శాఖాగ్రానికి చేరుకున్నా, అందుకోలేక అక్కడనుండి పతనం చెందేవారికి అది దక్కదు. కష్టించి పైకెక్కగలిగి, చాల జాగ్రత్తలు కలిగిన వారికే అది దక్కేది!

అందని ద్రాక్షలు పుల్లన అని వెక్కిరించే గుంటనక్కలకు వాటి అనుచరులకు ఈ లోకంలో కొదవ లేదు.
)()()()(

ఈ శిల్పం అలిపిరిలో గరుడవిగ్రహానికి అనతి దూరంలో ఉన్న లక్ష్మీనారాయణస్వామివారి ఆలయంలోనిది.

Saturday, 27 April 2019

తిరుగుబాటు

అది విశాలమైన గంభీరమైన మహాసముద్రం. ఒకానొక చోట దానికి నిర్మానుష్యమైన అతి సుందరమైన ప్రశాంతతీరం. అక్కడ టిట్టిభజాతికి చెందిన పక్షిదంపతులు సుఖంగా నివసించేవి.
ఒకరోజు ఆడపక్షి భర్తతో సిగ్గుపడుతూ చెప్పింది - "నాథా! నేను గుడ్లు పెట్టే సమయం దగ్గరపడింది. ఈ సముద్రానికి దూరంగా ఉపద్రవాలేమీ ఉండని స్థానం చూడండి".
"భద్రే! ఈ సముద్రతీరం ఎంత రమ్యంగా ఉన్నదో చూడు! మన పిల్లలు పుట్టి పెరిగేందుకు ఇదే అనుకూలమైన స్థలం. ప్రసవం ఇక్కడే జరగనీ" అన్నాడు భర్త.
"అలా కాదు, పూర్ణిమనాడు పర్వవేలాతరంగాలు విజృంభిస్తాయి. అవి మత్తగజేంద్రాలను కూడా అవలీలగా లాక్కుని పోగలవు. మనం దూరంగా ఉంటేనే మంచిది" అన్నది భార్య.
భర్తకు కొంచెం ఈగో ఉంది. గప్పాలు కొట్టాడు. "ఈ సముద్రుడు నా సంతానాన్ని అపహరించగలడా? మత్తగజేంద్రాల కుంభస్థలాలను చీల్చి అలసి సొలసి నిద్రిస్తున్న సింహాన్ని ఎవడైనా లేపగలడా? లేపితే వాడు యమసదనానికి పోయినట్లే! నీ భర్త జోలికి వచ్చినా అంతే!" అన్నాడు.
సరేనని భార్య సముద్రతీరంలోనే గుడ్లను ప్రసవించింది.
తరువాత ఒకసారి ఆ ఇద్దరూ ఆహారసంపాదనకోసం గూడు విడిచి వెళ్లారు. ఆ సమయంలో వేలాతరంగాలు చేతులు చాచాయి. గుడ్లను గూటితో సహా లోనికి లాక్కునిపోయాయి. పక్షిదంపతులు తిరిగివచ్చి జరిగిన ఘోరాన్ని చూశాయి.
భార్యకు దుఃఖం ముంచుకొచ్చింది. "మూర్ఖుడా! మంచి చెబితే విన్నావు కావు!" అని విలపించింది.
అపుడు టిట్టిభం తోటిపక్షులతో సమావేశమై, "సముద్రుడు మా గుడ్లను అపహరించాడు. రండి, అతడికి బుద్ధి చెబుదాం. అతడిని ఎండగట్టేద్దాం" అన్నది.
"ఒరే తిక్కోడా! ఎంత బలమున్నా ఏనుగు పోయి కొండను ఢీకొడితే దాని దంతాలే విరిగిపోతాయి. మనం సంఘటితమైనప్పటికీ మహాబలవంతుడైన సముద్రుణ్ణి మనమేం చేయలేం. కాబట్టి, మన పక్షిరాజైన గరుత్మంతునికి ఈ విషయాన్ని నివేదిద్దాం. తరువాత ఆ సంగతేమిటో ఆయనే చూసుకుంటాడు." అన్నాయి మిగిలిన పక్షులు.
టిట్టిభానికి కలిగిన కష్టం తెలుసుకున్న గరుత్మంతునికి కూడా కష్టం కలిగింది. దుఃఖం కలిగింది. కోపం వచ్చింది. "పదండి! పోయి సముద్రుణ్ణి ఎండగట్టేద్దాం!" అంటూ లేచాడు.
అలా లేచాడో లేదో - విష్ణుదూత వచ్చాడు. "గరుత్మంతులవారు సత్వరం వేంచేయాలని నారాయణులవారు చెప్పమన్నారు. ఏదో దేవకార్యం ఉన్నదట. అమరావతికి పోయిరావలెనట!" అని సందేశం చెప్పాడు.
గరుత్మంతునికి అభిమానం పొడుచుకొచ్చింది. "మాలాంటి పనికిమాలినవాళ్లు నారాయణసేవకు ఎందుకు లెండి? నా బదులు మరొక సమర్థుడైన పనివాణ్ణి వాహనంగా పెట్టుకోమనండి. నారాయణునికి నా నమస్కారాలు తెలియజేయండి" అన్నాడు.
విష్ణుదూత ఆశ్చర్యపోయి "స్వామిన్! గరుత్మన్! నారాయణుని గూర్చి మీరు ఇటువంటి నిష్ఠురోక్తులాడడం నేనెన్నడూ వినలేదు. భగవంతులవారు మిమ్ములను ఎన్నడూ ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని అవమానించినట్లుగా గాని బాధ పెట్టినట్లుగా గాని నేనెరుగను. అసలేం జరిగిందని ఇలా మాట్లాడుతున్నారు?" అని అడిగాడు.
గరుత్మంతుడు జరిగినదంతా చెప్పాడు.
"ఇపుడు నేను సముద్రుణ్ణి దండిస్తే మా నాన్నగారిని దండించావు కదా అని అమ్మవారు నాపై అలగవచ్చు. మా మామనే దండించేంతటివాడివా అని స్వామివారే స్వయంగా అలగవచ్చు. వారు నాపై అలుగుతారనే భయంతో నేను ఈ టిట్టిభదంపతులకు న్యాయం చేయలేక ఇలా రెక్కలు ముడుచుకుని కూర్చున్నాను. మరి ఇది నా అసమర్థత కాక మరేమిటి? అందువల్ల నన్ను ఆశ్రయించినవారికి న్యాయం జరగకుంటే ఇకపై స్వామివారికి సేవకునిగా ఉండే అర్హత నాకు లేదని నా మాటగా స్వామివారికి విన్నవించు" అని చెప్పాడు.
దూత ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న స్వామివారికి గరుత్మంతుని ప్రణయకోపంలో సామంజస్యం ఉందనిపించింది. గరుత్మంతుని వంటి సేవకుని ఆయన పోగొట్టుకొనదలచుకోలేదు. భక్తుడు శక్తుడు అయిన ఆ భృత్యుని పుత్రుడిలా లాలించాలని భావించాడు. స్వయంగా గరుత్మంతుడు ఉండే రుక్మపురానికి తరలి వెళ్లాడు.
తన ఇంటికి స్వయంగా స్వామివారు విచ్చేసేసరికి గరుత్మంతుడు సంభ్రమాశ్చర్యాలకు లోనైనాడు. తన మొండితనానికి సిగ్గుపడి తలదించుకున్నాడు. స్వామివారికి తగిన అతిథిసత్కారం చేసి, ఆ మీదట జరిగిన విషయమంతా చెప్పాడు.
"స్వామిన్! మీకు ఆశ్రయాన్నిచ్చిన సముద్రుడు ఇలా మా టిట్టిభదంపతులకు అన్యాయం చేశాడు. మీరున్నారని నేను ఇంతసేపు ఆగాను గాని, లేకుంటే సముద్రుడిని ఎపుడో దండించేవాడిని. యజమాని బాగా కలిగినవాడు అయితే కరిచిన అతని కుక్కను కొట్టేందుకు కూడా అందరూ భయపడతారు కదా? स्वामिभयात् शुनोऽपि प्रहारो न दीयते। ఇదీ నా పరిస్థితి" అని వినయంగా విన్నవించుకున్నాడు.
స్వామివారు అందుకు చాల చింతించి, "సముద్రుడా సముద్రుడా! టిట్టిభదంపతుల గుడ్లను తిరిగి ఇవ్వకుంటే నిన్ను నీళ్లు లేని భూమిగా చేసేస్తాను" అని హుంకరించిన మీదట సముద్రుడు భయపడి గుడ్లను తిరిగి తెచ్చి ఇచ్చాడు.
అందరూ హర్షించారు. టిట్టిభదంపతులను అభినందించారు. గరుత్మంతునికి ధన్యవాదాలు తెలిపారు. స్వామివారికి నమస్కారాలు చేసుకున్నారు.
గరుత్మంతుడు ఎంతో సంతోషపడుతూ "పదండి స్వామిన్! అమరావతికి వెళ్లేందుకు ఆలస్యమౌతుంది" అని స్వామివారిని తనపై ఎక్కించుకుని రివ్వున ఎగిరిపోయాడు.

🧒👧👦👩👨🧑👩‍⚕️🧓

వినడానికి చిన్న పిల్లల కథలా ఉంది కదా?
కాని, ఇది మహాపండితుడైన విష్ణుశర్మ రాజపుత్రులకు చెప్పిన రాజనీతికథ. 
పంచతంత్రకథ. మిత్రభేదం లోనిది.

సామాన్యప్రజలపై బలవంతుల దౌర్జన్యాలు ఎలా ఉంటాయో ఇందులో చెప్పారు.
సామాన్యప్రజలు సంఘటితశక్తిగా ఉన్నా అధికారబలం ఉన్నవారితో తలపడడం ఎంత కష్టమో వివరించారు.
తమపై నిజంగా ప్రేమ సానుభూతి ఉన్న నాయకుని అవసరం ప్రజలకు ఎంతగా ఉంటుందో చెప్పారు.
నాయకుడు తన ప్రజల సమస్యలను ఎంత చాకచక్యంగా పరిష్కరించుకోవాలో చెప్పారు.
ఒక నాయకుడు తన అధినాయకునిపై తిరుగుబాటు చేస్తే అది తన పదవిని తన పలుకుబడిని పెంచుకొనడం కోసం కాక ప్రజల మేలుకోసం చేయాలని చెప్పారు.
తన క్రిందివారు తనపై తిరుగుబాటు చేసినా అధినాయకుడు ఆగ్రహించకుండా వారి సమస్యలను జాగ్రత్తగా తెలుసుకుని పరిష్కరించాలని చెప్పారు.
సమర్థుడైన వాడు తిరుగుబాటు చేసినంతమాత్రాన అతడిని దూరం చేసుకోరాదని, అతడి సమస్యలు తీర్చి, ఆత్మీయుడిగా చేసుకోవాలని చెప్పారు.
యజమాని ఉన్నాడనే భయంతో కరిచిన కుక్కను కూడా కొట్టరు అని గరుత్మంతుడు అన్నాడు. - అంటే అధికారంలో ఉన్నాడనే భయంతో తమను పీడించే వాళ్లను కూడా ప్రజలు కొట్టరు అనే కదా అర్థం?
యజమాని ఆ కుక్కను వదిలించుకుంటే, మరుక్షణమే ఆ కరిచే కుక్కను వెంటదరిమి వెంటదరిమి కొడతారు. అలాగే అధికారం కోల్పోయినపుడు ఆ పీడించిన వాణ్ణి జనం చావగొట్టి చెవులు మూస్తారు.
కొన్ని రోజుల క్రితమే ప్రత్యక్షంగా చూశాం కదా?

👊👊👊

ఎప్పటి విష్ణుశర్మ!
ఎప్పటి పంచతంత్రం!
ఇప్పటికీ నిత్యనూతనంగానే ఉంది!

మనదేశంలో వెలుగు చూసి, ఈనాటికీ సమాజానికి ప్రతిబింబంలా కనిపించే గ్రంథం ఏనాటిదో ఇప్పటికీ సరైన నిర్ణయం జరగలేదు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు లిపి కలిగిన సమస్త భాషలలోనికీ అనువదింపబడి అందరిచేత ఆదరణ పొందిన జనప్రియగ్రంథం.
ఇది విష్ణుశర్మ చేసిన ప్రతిజ్ఞ -

अधीते य इदं नित्यं
नीतिशास्त्रं शृणोति च।
न पराभवमवाप्नोति
शक्रादपि कदाचन।।

"ఈ నీతిశాస్త్రాన్ని నిత్యమూ ఎవరు చదువుతారో, ఎవరు వింటారో, ఇంద్రునినుండి కూడా వారు పరాభవం పొందరు" (ఇంద్రుడు అంటే ఇక్కడ అత్యంతశక్తిమంతుడైన పాలకుడు అనుకుందాం.)

చదవడం వినడం అంటే - చదివినదాన్ని విన్నదాన్ని ఆచరణలో పెట్టడమని అర్థం సుమా.
పంచతంత్రం రాజనీతిశాస్త్రమని స్వయంగా విష్ణుశర్మే తన ప్రతిజ్ఞలో వెల్లడించాడు.
కాదు,
లోకరీతి అంటారా? అవును.
పిల్లల కథలంటారా? అవునవును. 
(అయినా, కొన్ని చోట్ల జాగ్రత్త అవసరం.)

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...