Showing posts with label Yathartha Bharathi. Show all posts
Showing posts with label Yathartha Bharathi. Show all posts

Thursday, 12 March 2020

జలదానమహిమ

అనగా అనగా...
పూర్వం శ్రుతసేనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు.  అతడి రాజధాని ఉజ్జయిని. అతనికి సుదేవి అని ఒక కుమార్తె ఉండేది.  ఆమె చాల అందమైనది.  చక్కని నడవడిక కలిగినది.  మంచి స్వభావం కలిగినది.  అందరితోనూ చక్కగా మాట్లాడేది.  దయతో వ్యవహరించేది.  ధర్మమార్గంలో సంచరించాలి అని దృఢమైన వ్రతాన్ని కలిగి ఉండేది.

ఆమె చిన్నతనం నుంచి కూడా జలదానం చేస్తూ ఉండేది.  (పానీయదానమకరోత్ సర్వధర్మోత్తమోత్తమమ్।)  

తన స్నేహితురాళ్లకు బంగారుపాత్రలలో లవంగాలు కలిపిన సుగంధభరితమైన నీరు తెచ్చి ఇస్తూ సంతోషపెట్టేది. 

మిగిలిన పనులన్నీ విడిచిపెట్టి జింకపిల్లలకు, చిలుకలకు, నెమళ్లకు, హంసలకు నీరుపోసి సంతోషపెట్టేది.  కాలువలు తవ్వించి వాటిగుండా ఉద్యానవనాలలోని చెట్లకు నీరు పెట్టేది.

బాటసారులు ప్రయాణించే దారులలో విశ్రాంతి కోసం తోటలను ఏర్పాటు చేసేది.  నూతులను త్రవ్వించేది.  వాటిలో ఎల్లప్పుడూ నీరు ఉండేలా చూసుకొనేది.  మరుభూములలో బావులను త్రవ్వించి నీరు పోయించేది.  దట్టమైన అడవులలో ప్రయాణించే వారికి కూడా నీళ్లను అందించి వారిని ఆనందింపజేసేది. (కాంతారేషు దురంతేషు పాంథానందవిధాయినీ।)

ఆవిడ త్రవ్వించిన పుష్కరిణులలో వికసించిన తెల్లని పద్మాలు ఉండేవి. నీటిపక్షులు అందులో సేద దీరుతూ ఉండేవి.  తటాకాలు పూడి పోకుండా వాటి గట్లు గట్టిగా ఉండేలా చేసింది.  అందులో చల్లటి నీరు ఉండేలా చేసింది.  ఇవన్నీ కేవలం తమ రాజ్యంలోనే కాక, ఇతర రాజ్యాలలో కూడా చేసింది.

ఈవిధంగా ఆమె జలదానాన్ని మించి మరొక ధర్మం లేదని భావించింది.  (జలదానాత్ పరం ధర్మం నాన్యం సా బహ్వమన్యత।) 

రాజపుత్రి చేస్తున్న పనులను చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆనందపడేవారు. ఆమె స్నేహితురాళ్ళు పౌరులు ఎంతో ఆశ్చర్యపోయేవారు.  జానపదులు తీర్థయాత్రికులు, అందరూ ఆ రాజపుత్రిని ఎంతో గౌరవించేవారు. మహామునులు కూడా ఆమెను ఎంతో ప్రశంసిస్తూ ఉండేవారు.  (మునయశ్చ ప్రశస్తాస్తాం ప్రశసంసురితస్తతః।)

ఒకసారి ధర్మతత్త్వజ్ఞులు అయిన మహర్షులు కొందరు రాజును కలుసుకొనేందుకు వచ్చారు.  రాజుచేత యథోచితంగా సత్కరింపబడి, రాజుకు ధర్మోపదేశం చేశారు.  ఆశీర్వదించారు.  ఇంతలో, వారు ఇంతకు మునుపే ఎవరిని గూర్చి విన్నారో ఆ రాజపుత్రి రాజుగారి సేవకులకు నీరు అందిస్తూ ఉండటం చూశారు.  రాజపుత్రి కూడా మహర్షులను చూసి వినయంగా నమస్కారం చేసింది.  వారు చాల సంతోషించి ఆమెను ప్రశంసించి దీవించారు. 

ఆ మహర్షులకు ఆమె విషయంలో ఎప్పటినుండో ఒక సందేహం ఉన్నది.  సమస్త-అభీష్టాలను తీర్చే ఎన్నో విధములైన ధర్మాలు ఉండగా,  ఆమె జలదానవ్రతాన్ని మాత్రమే ఎందుకు స్వీకరించిందో వారికి తెలియదు.  అందువల్ల, ఆ విషయాన్ని గూర్చి వారు రాజుగారి ఎదుటనే అడిగి, తమ సందేహాన్ని తీర్చమని అడిగారు.

అపుడు రాజపుత్రి వారికి ఒక కథను చెప్పింది. 

“గంగాకాళిందీతీరాలలో ఉండే వనాలలో కొందరు పుళిందులు ఉన్నారు.  వారు పక్షులను మృగాలను వేటాడుతూ ఉంటారు.  వారిలో అతి క్రూరుడైన ఒక పుళిందుడు ఉండేవాడు. 

ఒకసారి వేసవికాలంలో అతడు తన భార్యతో సహా అడవిలో వేటకోసం వెళ్లాడు.  అడవిలో ఎంతగా సంచరించినా వారికి ఒక్క జంతువు కూడా కనబడలేదు.  కాని, ఎండలో తిరిగి తిరిగి బాగా అలసిపోయారు.  అందువల్ల గంగానదిలో దిగి స్నానం చేయసాగారు. 

ఇంతలో పుళిందుడికి ఒడ్డున ఒక జింక కనిపించింది.  వెంటనే అతడు స్నానం మాని,ఆ జింకను వేటాడదలచి తన భార్యను నదిలో అలాగే వదిలిపెట్టి, ధనుస్సును అందుకుని దాని వెంట పడ్డాడు.  ఆమె స్నానం పూర్తిచేసుకుని నదినుండి బయటకు  వచ్చింది.  నిప్పులాగా కాలిపోతున్న ఆ ఇసుక తిన్నెల మీద తన భర్త వెళ్లిన దిశగా పరుగెత్తింది. 

అయితే ఆమెకు ఎంతో దూరం ముందుకు పోలేకపోయింది.  తీక్ష్ణమైన ఆ ఎండలో ఆమెకు బాగా దాహం ఎక్కువ అయింది.  ముందుకు కదలడానికి కూడా శక్తి లేకపోయింది. కాసేపు ఆ నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు క్రింద చల్లటి నీడలో నిలబడింది. 

ఇంతలో ఆమెకు అదే చెట్టు నీడలో ఉన్న ఒక బకోటపక్షి (కొంగజాతికి చెందిన ఒక పక్షి) కనిపించింది.  అది కూడా అతి తీవ్రమైన సూర్యకిరణాల దెబ్బకు నిశ్చేష్టమై పడిపోయి ఉంది.  ఎంతో దాహంతో పరితపిస్తోంది.  దాని ప్రాణాలు కంఠంలోనికి వచ్చి ఉన్నాయి.  నోరు తెరిచి ఆయాసపడుతూ కదలలేకుండా ఉన్నది. 

దానిని చూసిన ఆ పుళిందుని భార్య ఎంతో జాలి పడింది.  ఆమె మనసు కరుణతో నిండి పోయింది.  "అయ్యో, ఇది దాహంతో ప్రాణాలు వదిలేలా ఉన్నదే!  పాపం దీనికి కాసిని నీళ్ళు పోయాలి" అనుకుంది.

నిర్దాక్షిణ్యంగా జంతువుల ప్రాణాలు తీసే ఆమెకు ఆ కొంగ మీద జాలి కలగడం చాలా ఆశ్చర్యం. 

ఎంతటి పాపాత్మునికైనా ఎప్పుడో ఒకప్పుడు పుణ్యం చేసే బుద్ధి తప్పకుండా కలుగుతుంది.  (పాపినోऽపి మతిః పుణ్యా కదాచిత్ జాయతే భృశమ్।)  

అందువల్లనే ఆ పుళిందస్త్రీకి అటువంటి మంచి బుద్ధి పుట్టింది. 

అప్పుడు ఆమె తన జుత్తుముడిని విప్పి, ఆ జుత్తును తన చేతులతో పట్టుకొని, కొంగ నోటిలో నీటిని పడేలా పిండింది.  అంతకు మునుపే ఆమె గంగలో మునకలు వేసి స్నానం చేసి ఉండటం వలన ఆమె తడి జుత్తులో నీరు ఉండింది. 

దాంతో ఆ కొంగకు కొద్దిగా ఆశ్వాసన కలిగింది.  పోతున్న ప్రాణాలు తిరిగి వచ్చాయి.  నెమ్మదిగా తల ఎత్తింది.  ముక్కుపుటాలను కొంచెం కదిలించింది.  పుళిందస్త్రీ మళ్లీ మరోసారి తన జుత్తును పిండి దాని నీటిలోనికి నీళ్లు పడేలా చేసింది. 

ఆ కొంగ ఒకొక్క చుక్క ఒకొక్క చుక్కగా నీటిని త్రాగింది.  నెమ్మదిగా అది తిరిగి నిలబడగలిగింది.

అయితే, అప్పటికి కూడా తన భర్త ఇంకా తిరిగి రాకపోవడం చూసి, ఎండ కూడా కాస్త తగ్గడం చూసి, ఆమె తన భర్తను వెతుకుతూ, ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయింది.

ఆ సంఘటన జరిగిన కొంతకాలానికి ఆ పుళిందస్త్రీ మరణించింది.”

ఇలా చెప్పి రాజపుత్రి తన కథను ముగిస్తూ, “ఓ మహర్షులారా! తాను చేసిన జలదానం ఫలితంగా ఆ పుళిందస్త్రీ మరుసటి జన్మలో రాజపుత్రికగా పుట్టింది.  మరెవరో కాదు, నేనే ఆ రాజపుత్రికను.  ఇప్పటికీ ఆ పూర్వజన్మజ్ఞానం ఉండటం వల్ల నాకు జరిగినదంతా గుర్తున్నది.  అందువలన, జలదానమనే అంతటి పుణ్యకార్యాన్ని ఈ జన్మలో కూడా నేను వదిలిపెట్టకుండా చేస్తూ ఉన్నాను” అని తెలియజేసింది.

ఆమె కథను విన్నవారందరూ ఎంతో ఆశ్చర్యపోతూ ఉండగా, రాజపుత్రి ఇంకా ఇలా చెప్పింది -

“కేవలం కొన్ని నీటిచుక్కలతో ఒక ప్రాణిని సంతోషపెట్టడం వల్లనే ఇంతటి గొప్ప పుణ్యం వచ్చింది కదా, అటువంటిది తటాకాలు మొదలైన వాటిని నిర్మించి జలదానం చేస్తూ ఉంటే మరెంతటి పుణ్యం వస్తుందో కదా! 

నాకు సనాతనమైన సూక్ష్మమైన ధర్మం గురించి పెద్దగా తెలియదు.  కాని, మీవంటి మహాత్ముల నోటి నుండి నేను విన్నదాన్ని మాత్రమే నేను గ్రహించాను.

దాహంతో బాధపడుతున్న వాడికి నీటిని దానం చేసి సంతోషపెడితే వెయ్యి అశ్వమేధయాగాలు చేసినంత ఫలం లభిస్తుంది.  ఒక నూతిని త్రవ్వించిన వాడికి వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన వాడికి మించి నూరు రెట్లు ఫలితం లభిస్తుంది.  ఎవరైతే ఎన్నడూ ఎండిపోని ఒక పెద్ద దిగుడు బావిని త్రవ్విస్తారో, అతడికి నూతిని త్రవ్వించిన వానికి మించి వేయి రెట్లు ఫలితం లభిస్తుంది.  అలాగే, ఒక పుష్కరిణిని త్రవ్వించిన వానికి దిగుడుబావిని తవ్వించిన వానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది.  ఎవరైతే ఒక సరస్సును నిర్మిస్తారో వారికి పుష్కరిణిని త్రవ్వించిన వానిని మించి పదివేల రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది.  అలాగే, కాలువను త్రవ్వించి అందులో నీటిని ప్రవహింపజేసే వాళ్లకు వచ్చే ఫలితాన్ని గురించి చెప్పాలంటే అది వేయితలలు కలిగిన ఆదిశేషునికే సాధ్యం.  నిత్యం నీళ్లు ఊరే తటాకాన్ని త్రవ్వించిన వానికి వచ్చే ఫలితాన్ని గురించి చెప్పాలంటే సాక్షాత్తు పరమశివుడికే సాధ్యం. 

అందువల్ల మనుషులు జలదానం చేయాలనే బుద్ధిని కలిగి ఉండాలి.  అందువల్ల ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అతనికి సిద్ధి కలుగుతుంది” అని రాజపుత్రి ముగించింది. 

మహర్షులు, రాజు, పౌరులు, సభాసదులు అందరూ ఆమె కథను విని, ఆమె దృఢనిశ్చయానికి తగిన కారణం విని ఎంతో ఆనందించారు.  ఆమెను ప్రశంసించారు.  దీవించారు.

(ఫిబ్రవరి,2020 యథార్థభారతి పత్రికలో ప్రచురింపబడింది.)
🌳🌳🌳

మనం కూడా మనుషులమే కదా?
మనం కూడా జలదానం చేయవచ్చు.  ముఖ్యంగా ఎండలు క్రమంగా ముదురుతున్న కాలంలో మొదలు పెట్టి మంచి వర్షాలు పడేంత కాలం వరకు ఏదో ఒకవిధంగా చేయవచ్చు.

Tuesday, 23 July 2019

తపస్సు చేద్దాం రండి


పతంజలి యోగాన్ని అష్టాంగయోగంగా వ్యవహరిస్తారు. అందులో ఎనిమిది అంగాలు ఉంటాయి కాబట్టి, దానికి ఆ పేరు.  వాటిలో రెండవ అంగానికి నియమాలు అని పేరు. ఆ నియమాలు ఐదు. అందులో ఒకటి తపస్సు. తపస్సు అంటే ఒకదానిని సాధించడంకోసం తపించడం అని అర్థం చేసుకోవచ్చు.  

ఆ తపస్సు మూడు రకాలట.   
1 సాత్త్వికము,
2 రాజసికము,
3 తామసికము.

తామసికమైన తపస్సుకు ఉదాహరణ రాక్షసులది. హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలైనవారిది. వారు తమ అభివృద్ధి కోసం కంటే కూడా ఇతరులను ఏడిపించడం కోసమే తపస్సు చేశారు. నిజం చెప్పాలంటే అటువంటి తపస్సు చేశారు కాబట్టే, అటువంటి పీడను కొనసాగించారు కాబట్టే, వారు కశ్యపుడు, పులస్త్యుడు వంటి గొప్ప బ్రహ్మర్షుల వంశంలో పుట్టినప్పటికీ రాక్షసులు అనిపించుకున్నారు.

రాజసికమైన తపస్సుకు ఉదాహరణ ధ్రువుడిది. తనకు జరిగిన అన్యాయం సహించలేక ఉన్నత స్థానాన్ని ఆశించి గొప్ప తపస్సు చేసి చరితార్థుడైనాడు. రాజులైనప్పటికీ, అటువంటి గొప్ప తపస్సు చేసినవారు రాజర్షులుగా కూడా పిలువబడ్డారు.

సాత్త్వికమైన తపస్సు మహర్షులది. వారి కోరిక అంతా ''లోకాః సమస్తాః సుఖినో భవంతు'' అనేది మాత్రమే.  

న త్వహం కామయే రాజ్యం
న స్వర్గం నాపునర్భవమ్।
కామయే దుఃఖతప్తానాం
ప్రాణినామార్తినాశనమ్।।

నేను రాజ్యాన్ని కాని, స్వర్గాన్ని కాని, మోక్షాన్ని కాని కోరను, కేవలం ప్రాణుల దుఃఖం పోవాలని మాత్రమే కోరుకుంటాను అని తపించిన రంతి దేవుడు రాజైనప్పటికీ, ఆయన చేసినది సాత్త్వికమైన తపస్సు.
         
అయితే, తపస్సును చేయాలి అనిపించడం పూర్వజన్మపుణ్యఫలం. (తపస్సు అంటే ఒక దానిని సాధించడం కోసం తపించడం అని మునుపే చెప్పుకున్నాము.)  ఒక విద్యార్థికి విద్యార్జనమే తపస్సు కావచ్చు. ఒక వ్యాధికి మందు కనిపెట్టడమే ఒక శాస్త్రజ్ఞుడికి తపస్సు కావచ్చును. ఆవిధంగా అన్నమాట. అటువంటి తపస్సును మొదలు పెట్టగలగడం కూడా మహాభాగ్యఫలం.  

ఇక నిర్విఘ్నంగా తపస్సు చేయడం అంటే భగవంతుని అనుగ్రహం మనకు తపస్సు పూర్తికావడం కంటే ఎంతో ముందుగానే లభించినట్లు లెక్క.
         
తపోభంగం చేయడానికి ఎన్నో శక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి. కామాన్ని పురికొల్పుతాయి. క్రోధాన్ని కలిగిస్తాయి. లోభాన్ని ప్రేరేపిస్తాయి. మోహంలో ముంచెత్తుతాయి. మదంతో కండ్లు మూసుకుపోయేలా చేస్తాయి. మాత్సర్యానికి రెక్కలు తొడిగి ఎగిరింపజేస్తాయి.

ఉదాహరణకు, ఒక విద్యార్థి చదువుకుందామని కృతనిశ్చయుడై ఉన్నాడనుకోండి. అతడి మిత్రుడు ఒకడు మన ఇద్దరికోసం సినిమా టికెట్లు తెచ్చాను, రా అని అతడిని తీసుకుపోవచ్చు. ఈ విధంగా తన లక్ష్యమైన చదువును వదలి మరొక పని చేయాలి అని, అతని ఏకాగ్రతకు భంగం కలిగించే ఎటువంటి కోరిక అయినా, అది కామం.
         
అతడు చదువుకుంటున్న సమయంలో పెద్ద శబ్దంతో ఇతరులు పాటలు వింటూ అతడికి కోపం తెప్పించవచ్చు. వారితో తగవు పెట్టుకొనేలా ప్రేరేపించేది క్రోధం.
         
చదువు పూర్తి కాకముందే ఏదో ఒక ఉద్యోగం వస్తే చదువును వదలి ఉద్యోగం చేయాలి అనిపించవచ్చు. ఆ విధంగా చదువుకు అడ్డుకట్ట వేసేది లోభం.
         
చదువు లేక పోయినప్పటికీ ఏ క్రీడాకారులో లేక ఏ సినిమానటులో చదువుకున్న వాడి కంటే బాగా సంపాదించి సుఖపడున్నారు అనిపించి మనసు అటువైపు మొగ్గు చూపవచ్చు. ఆ ఆలోచన చదువుకు ఆటంకం కలిగించితే అది మోహం.
         
నేను ఫస్ట్ ర్యాంకు విద్యార్థిని, ఒక్క సారి చదివితే మొత్తం అర్థం చేసుకోగలను అనే గర్వం తలెత్తి అతడు చదువుకోసం కేటాయించే సమయం తగ్గవచ్చు. అదుగో, అందుకు కారణం మదం.
         
తనకు పోటీగా మరొక విద్యార్థి చక్కగా చదువుతూ ఉంటే, అతడితో స్నేహం చేసి, వివిధవిషయాలను గూర్చి చర్చిస్తూ జ్ఞానసముపార్జన చేయడం మంచి పద్ధతి. అలా కాకుండా ఆ పోటీని గూర్చి చింతిస్తూ, తనను ఆ పోటీదారు మించితే బాధపడుతూ, తానే అతడిని మించితే ఆనందపడుతూ, ఈ విధంగా చదువును గూర్చి కంటే ఆ పోటీదారుని గూర్చి ఎక్కువగా ఆలోచించడం అనేది మాత్సర్యం.

క్షత్రియుడైన విశ్వామిత్రుడు మొదట వసిష్ఠమహర్షి పట్ల మాత్సర్యభావంతోనే తపస్సు మొదలు పెట్టినప్పటికీ, చివరకు ఆ తపఃప్రభావంతో పైన పేర్కొన్న కామాది అరిషడ్వర్గాలను జయించి, రాజర్షి స్థాయిని మించి బ్రహ్మర్షి అయిన కథ మనకుతెలుసు.
         
ఈ కాలంలో కూడా తపస్సు చేయవచ్చు. అది లోకానికి హాని చేసేది అయితే తామసికతపస్సు. అది కేవలం తనకు లేదా తనవారికి మాత్రమే ఉపయోగపడేది అయితే రాజసికతపస్సు. తమతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడేది అయితే సాత్త్వికతపస్సు.

శ్రద్ధయా పరయా తప్తం
తపస్తత్ త్రివిధం నరైః
ఆఫలాకాంక్షిభిర్యుక్తైః
సాత్త్వికం పరిచక్షతే।।
         
“గొప్ప శ్రద్ధతో, తనకోసం ఏమీ కోరకుండా, (లోకసంక్షేమాన్ని కోరుతూ) నిత్యం చేయబడే సత్కర్మలే సాత్త్వికతపస్సు” అని సాక్షాత్తు భగవంతుడే గీతలో (17-17) మనకు మార్గదర్శనం చేశాడు.
         
భగవంతుని నిత్యం స్మరిస్తూ, మనం చేసే సమస్తకర్మలను భగవదర్పితం చేస్తూ ఉంటే, మనం తప్పక సాత్త్వికులం కాగలం.  అపుడు మన సంకల్పాలు, తద్వారా మనం చేసే అన్ని పనులు సాత్త్వికమే కాగలవు.  అది చెట్లు నాటడం కావచ్చు.  ఎండాకాలంలో చలివేంద్రాలు నిర్వహించడం కావచ్చు.  పదిమంది పిల్లలను పోగు చేసి వారికి చదువు చెప్పడం కావచ్చు.  మురికివాడలను శుభ్రం చేయడం కావచ్చు.  పరిసరాల పరిశుభ్రతను గూర్చి ప్రజలందరికీ అవగాహన కలిగించి, వారిలో ఆరోగ్యస్పృహను కలిగించడం కావచ్చు.  నీటిని సంరక్షించుకొనడం, పొదుపుగా వాడుకొనడం ప్రజలకు అలవాటు చేయడం కావచ్చు. 
         
ఇలా, పేరును, ధనాన్ని, పలుకుబడిని మరొక మరొక లాభాన్ని ఆశించకుండా నిష్కామంతో చేసే పనులు లోకానికి ఎంతో మేలును చేకూరుస్తాయి.  ఇతరులు కూడా అటువంటి పనులు చేసేందుకు  ప్రేరణ కలిగిస్తూ, మన తరువాత కూడా లోకానికి శుభపరంపరను కలిగిస్తూ ఉంటాయి. 
         
అందువల్ల, లోకానికి శుభం కోరుతూ ఒక మంచి పనిని చేద్దాం అని సంకల్పించుకుని, దానిని నెరవేర్చే బాధ్యతను భారాన్ని భగవంతునిపై మోపి, మనం చిత్తశుద్ధితో ప్రయత్నం చేద్దాం.  అదే సాధారణమనుషులమైన మనం చేయగలిగిన తపస్సు. 

లోకాః సమస్తాః సుఖినో భవంతు.

(2019 జూలై నెల, యథార్థభారతి పత్రికలో ప్రచురింపబడిన నా వ్యాసము)

Tuesday, 26 March 2019

సంతృప్తి లేని రాజు


డా|| పాటీలు శ్రీనివాసకృష్ణ

          పూర్వం సదయుడు అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి విమలుడు అనే కుమారుడు ఉండేవాడు.  ఒక సమయం వచ్చేసరికి, సదయుడు తనకు వార్ధక్యం వచ్చిందని అర్థం చేసుకుని, విమలుడు రాజ్యపరిపాలనకు సమర్థుడు అని భావించి, అతడికి పట్టాభిషేకం చేశాడు.  పిమ్మట రాజధానికి దూరంగా, ఒక వనంలో తపస్సు చేసుకుంటూ నివసించసాగాడు. తన కుమారుని రాజ్యపాలనావిశేషాలను గూర్చిన సమాచారం ఎప్పటికప్పుడు అతనికి తెలుస్తూనే ఉండేది.

          తాను నేర్చిన మంచి విద్యల ప్రభావం వలన విమలుని పాలన మొదట సక్రమంగానే ఉండింది.  కాని, అతడి చుట్టూ క్రమంగా కొందరు దుష్టమంత్రులు చేరారు.  అసంతుష్టో ద్విజో నష్టః, సంతుష్టస్తు మహీపతిః” (సంతృప్తి లేని ద్విజుడు నశిస్తాడు, సంతృప్తి కలిగిన రాజు నశిస్తాడు) అని పెద్దలు చెప్పిన సుభాషితాన్ని అతనికి చెప్పి, “రాజు తనకున్నదానితోనే సంతృప్తి చెందితే నశించిపోతాడు, అందువల్ల మరింత అధికంగా సంపదలను పొందేందుకు ప్రయత్నించాలిఅని ఉపదేశించారు.

          దానితో విమలుడు తన రాజ్యాన్ని విస్తరించాలని భావించాడు.  అందుకు పెద్ద సైన్యం అవసరం.  ఆ సైన్యాన్ని పోషించేందుకు పెద్ద మొత్తంలో ధనం అవసరం.  అందువల్ల, ధనాన్ని సేకరించేందుకు గాను ప్రజలపై క్రొత్త క్రొత్త పన్నులు విధించి, వసూలు చేయసాగాడు.  ప్రజలలో రాజుపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.

          ఇది తెలుసుకున్న సదయుడు ఆందోళన పడి, తన కుమారుని రమ్మని కబురు చేశాడు.  విమలుడు అడవికి వెళ్లి తన తండ్రిని కలుసుకున్నాడు.  తన కుమారుని ఉద్దేశాన్ని కనుగొని, సదయుడు విచారం వ్యక్తం చేశాడు. 

          “నాయనా, పరాక్రమం చూపడం, యుద్ధం చేయడం క్షత్రియధర్మమే.  నేను కాదనను.  కాని, సాధారణపరిస్థితులలో స్వదేశాన్ని కాపాడుకొనేందుకు యుద్ధం చేయడం మాత్రమే ధర్మం.  అసాధారణపరిస్థితులు కూడా అప్పుడప్పుడు తలెత్తుతాయి.  ఇతరరాజులు అధర్మపరులైనపుడు ధర్మరక్షణకు గాను వారిపై యుద్ధం ప్రకటించవచ్చు.  విదేశాలలో రాజు క్రూరుడై, ప్రజాసంక్షోభకారకుడు అయినపుడు, ఆ ప్రజలను సంరక్షించేందుకు దండయాత్ర చేయవచ్చు.  లేదా, సువిశాలమైన దేశంలో, ఆయా రాజ్యాల రాజులు నిష్కారణంగా కలహించుకుంటూ అలజడులు రేకెత్తిస్తున్నపుడు, వారినందరినీ అదుపులో ఉంచేందుకుగాను అశ్వమేథం వంటి యాగాలు కూడా చేయవచ్చును.  కాని, ఇటువంటి కారణాలు ఏమీ లేకుండా, స్వయంగా నువే, దురాశతో, ఇతరదేశాలమీదకు దండెత్తి ఆక్రమింపజూడటం అధర్మం.  నువు బలవంతుడవైనందువల్ల గాని, కాలం అనుకూలించినందువల్ల గాని, తాత్కాలికంగా గెలిచినప్పటికీ, చిరకాలంపాటు ఆ రాజ్యాన్ని నిలబెట్టుకోలేవుఅని నచ్చజెప్పజూశాడు.
     
          “మరి, సంతృప్తి కలిగిన రాజు నశిస్తాడుఅని పెద్దలు చెప్పిన మాట అసత్యమా?” అని విమలుడు తండ్రిని ప్రశ్నించాడు.

          “అసత్యం కాదు, నిజమే!

          “మరి, యుద్ధానికి పోవద్దని మీరు నన్ను ఎందుకు వారిస్తున్నారు?”

          “నాయనా!  రాజు, రాజ్యసంపాదనవిషయంలో సంతృప్తిని కలిగి ఉండాలి.  దానివల్ల హాని లేదు.  అందువల్లనే, పాండవులు తమకు మొత్తం రాజ్యం అవసరం లేదని, ఐదు ఊళ్లు ఇచ్చినా చాలని దుర్యోధనునికి సందేశం పంపించారు.  అంతవరకు ధర్మం.  కాని, అసంతృప్తి కలిగిన దుర్యోధనుడు మాత్రం సూదిమొన మోపినంత భూమిని కూడా ఇవ్వనని తిరస్కరించాడు.  అది అధర్మం.  చివరకు సంతృప్తి కలిగిన పాండవులే జయించారు.  తనకున్న మహాసామ్రాజ్యంలో, కేవలం ఐదు ఊళ్లు తక్కువైనప్పటికీ తట్టుకోలేని అసంతృప్తిని కలిగిన దుర్యోధనుడు మాత్రం తన మిత్రులతో సహా నశించాడు కదా?” అని చెప్పాడు సదయుడు.

          “నిజమే నాన్నగారూ!  కాని, ఓవైపు ఆ సుభాషితం నిజమే అని మీరు చెప్పారు.  మరోవైపు, వాస్తవంగా ఆ సుభాషితంలో చెప్పబడి ఉన్నదానికి విరుద్ధంగా జరిగిందని కూడా మీరే ఉదాహరణ చూపుతున్నారు.  ఇపుడు, ఈ రెండిటిలో నేను దేనిని గ్రహించి ఆచరించాలి?” అని విమలుడు ప్రశ్నించాడు.

          “నాయనా!  సుభాషితంలో చెప్పబడినదీ నిజమే, కౌరవపాండవుల కథ కూడా నిజమే!  కాని, ఆ సుభాషితాన్ని మనం తప్పుగా అర్థం చేసుకొనడం వల్ల, ‘ఇక్కడ వైరుద్ధ్యం ఉన్నది కదాఅని సంశయం కలుగుతుంది. 

రాజుకు సంతృప్తి ఉండరాదుఅనేది ఆ సుభాషితం యొక్క ఆశయం.  ‘ఏవిషయంలో అటువంటి సంతృప్తి ఉండరాదు?’ – అంటే – ‘నేను నా ప్రజలను ధర్మంలో నడిపిస్తున్నాను కదా, ఇక నేను చేయవలసిన పనులేమీ లేవుఅని రాజు సంతృప్తిని చెందరాదు అని భావించాలి.  ఎందువల్లనంటే, ఆ ధర్మాన్ని దారి తప్పించే శక్తులు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూ ఉంటాయి.  రాజు అప్రమత్తంగా ఉంటూ వాటినుండి ప్రజలను కాపాడుతూ ఉండాలి.  ‘నా ప్రజలకు దొంగలనుండి రక్షణ కల్పించాను, అగ్నిప్రమాదాలనుండి రక్షణ కల్పించాను, ఈతిబాధలనుండి రక్షణ కల్పించాను.  కనుక, ఇంతకంటె నేను చేయవలసిన గొప్ప పనులేమీ లేవుఅని రాజు సంతృప్తిని చెందరాదు.  

ఆ రాజు ప్రజలను కామక్రోధాది-అరిషడ్వర్గాల నుండి కూడా కాపాడుకోవాలి.  ఎందుకంటే, ఆ శత్రువుల దాడికి గురైనవారు జీవితంలో సుఖపడలేరు.  మిగిలిన శత్రువులు ఒక జన్మకు మాత్రమే పరిమితమౌతారేమో గాని, ఈ అంతర్గతశత్రువులు మాత్రం జన్మజన్మలకూ వదలకుండా వేధిస్తూనే ఉంటారు.  ఆ శత్రువులనుండి ప్రజలను కాపాడడానికి ఒకటే మార్గం.  వారందరికీ చక్కని ఆధ్యాత్మవిద్యను  అందించాలి.  ప్రజలందరూ తమ తమ శక్తిసామర్థ్యాలు, అభిరుచులమేరకు వివిధవృత్తినైపుణ్యాలను సంపాదించేందుకు, పెంపొందించుకొనేందుకు, తదనుగుణంగా జీవనోపాధిని పొందేందుకు తగిన ఏర్పాట్లను చేయడమే కాకుండా, వారిలో ఆధ్యాత్మికప్రవృత్తిని పెంపొందించేందుకు కూడా తగిన కార్యక్రమాలను చేపట్టాలి.  అత్యంతబలవంతమైన ఈ అంతఃశత్రువులను జయించిన వ్యక్తి అరిందమనుడు అని పిలువబడతాడు.   

నాయనా!  ఈ విధంగా, తన రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా జీవించేందుకు గాను, రాజు, ఎక్కడ ఎటువంటి లోటు జరుగుతుందో అనే భయంతో, తాను మాత్రం సంతృప్తి లేకుండా, నిత్యజాగరూకుడై ఉంటూ, పరిపాలన చేస్తూనే ఉండాలి.  ఇది ఆ సుభాషితం యొక్క అంతర్గతభావం.  అంతేగాని, తనకున్న రాజ్యభూభాగం చాలదనే అసంతృప్తిని చెందుతూ, ఇతరదేశాలమీదకు దండెత్తి, సంక్షోభం సృష్టించమని దాని అర్థం కాదుఅని సదయుడు వివరించాడు.

          విమలునికి చాల సంతోషం కలిగింది.  అతని సందేహాలన్నీ పటాపంచలైనాయి.  “తండ్రీ!  నాకు చక్కని ఉపదేశం చేసి, జ్ఞానోదయం కలిగించారు.  ఆ సుభాషితం యొక్క ఉదాత్తమైన భావాన్ని నేను మీ అనుగ్రహం ద్వారా చక్కగా గ్రహించాను.  మీ ఆజ్ఞతో, మీరు చెప్పిన విధంగా, సక్రమమైన పరిపాలనను ప్రజలకు అందిస్తూ, వారిని అన్నిరకాల అంతర్గతశత్రువులనుండి కాపాడేందుకు నా శాయశక్తులా ప్రయత్నం చేస్తానుఅని సదయునికి పాదాభివందనం చేశాడు.

          అప్పటినుండి విమలుని పాలన చాల చక్కగా కొనసాగింది.  ఆదర్శపరిపాలకునిగా, ధర్మప్రభువుగా అతడు గొప్ప కీర్తిని సంపాదించాడు.

          చదువు చాల విలువైనది.   అయితే, ‘తేభ్యః క్రియాపరాః శ్రేష్ఠాః’.  చదువుకుని, విషయజ్ఞానం పొందిన వారికంటె, దానిని సక్రమంగా ఆచరించేవారే శ్రేష్ఠులని స్మృతివచనం.  అయినప్పటికీ, సరిగా అర్థం చేసుకున్నపుడే సరియైన ఆచరణ సాధ్యమౌతుంది.  చదువుకున్న విషయం యొక్క సారాన్ని సరిగా తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ఆచరించేందుకు పూనుకుంటే వ్యతిరేకఫలాలు వస్తాయి.  అందువల్ల, గురుముఖతః విద్యను నేర్చుకొమ్మని మన పెద్దవారు చెబుతారు.  అందువల్ల, పరీక్షలో ఉత్తీర్ణులు కావడం కంటె, పాఠశాలలకు చక్కగా హాజరౌతూ, పాఠాలను శ్రద్ధతో వినడం చాల ముఖ్యం.

(ఈ వ్యాసంయథార్థభారతి - మార్చ్ నెల, 2019 సంచికలో ప్రచురింపబడింది.) 


సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...