Showing posts with label Service. Show all posts
Showing posts with label Service. Show all posts

Thursday, 19 March 2020

పితృసేవ


కాశ్యపకులోద్భవుడైన పిప్పలుడనే ముని హిమాలయాలలో ఘోరమైన తపస్సు మొదలు పెట్టాడు. అతడు ఆహారంపై అన్ని రకాల కోర్కెలను వదులుకున్నాడు. ఇతరులపై ఈర్ష్యాసూయలు వదులుకున్నాడు. సమస్త ఇంద్రియాలపై సంపూర్ణమైన అదుపును సాధించాడు.

అతని తపస్సును మెచ్చి దేవతలు అతనిపై పుష్పవృష్టిని కురిపించారు. "ఓ పిప్పలా! తపస్సును చాలించి ఏమి వరం కావాలో కోరుకో" అని అడిగారు.

"నాకు ఈ సమస్తవిశ్వమూ వశం కావాలి. నేను విద్యాధరుడను (మహావిద్యావంతుడను) కావాలి" అని పిప్పలుడు కోరాడు.

దేవతలు తథాస్తు అన్నారు. సమస్త ప్రపంచము, సమస్త విద్యలు పిప్పలుని స్వాధీనంలోకి వచ్చాయి. వాటితో పాటు లోకంలో నా అంతటి వాడు లేడు అనే గర్వం కూడా అతనికి వచ్చింది.

ఒకనాడు అతడు సంధ్యావందనం కోసం సరస్వతీ తీరానికి చేరుకోగా, అక్కడ ఉన్న ఒక కొంగ అతనిని చూసి నవ్వింది.

"ఏమయ్యా పిప్పలా! కేవలం అర్వాచీనవిద్యలను (Modern Education) సంపాదించి ఇంతగా గర్వపడుతున్నావే? అయ్యో! పరాచీనవిద్యలను కూడా సంపాదించాలనే స్పృహ నీకు ఉన్నట్టే లేదే? అన్నది.

అంతటి మహావిద్యావంతుడైన పిప్పలునికి ఆ మాటలతో సిగ్గు వేసింది. "అయ్యా కొంగ గారూ, మీరు బ్రహ్మవిష్ణుమహేశ్వరులలో ఎవరో ఒకరు అయి ఉంటారు. దయచేసి నాకు ఆ పరాచీనవిద్యలను కూడా బోధించండి" అని వినయంగా అడిగాడు.

అప్పుడు ఆ కొంగ, "నాయనా, కురుక్షేత్రంలో కుండలుడు అనే మహాత్ముడు ఉన్నాడు. అతని పుత్రుడైన సుకర్ముని వద్దకు పో. అతడు నీకు కావలసినదంతా బోధించగలడు" అని చెప్పింది.

పిప్పలుడు సుకర్ముని చెంతకు వెళ్ళాడు. సుకర్ముడు అతని ప్రార్థనను మన్నించి, అతనికి అర్వాచీన,పరాచీన,సనాతనవిద్యలను బోధించాడు.

అతడి జ్ఞానానికి అబ్బురం చెందిన పిప్పలుడు, "మహాత్మా మీరు ఏ తపస్సును చేసి ఇంత జ్ఞానం సంపాదించారు?" అని అడిగాడు.

"నేను ఎటువంటి తపస్సునూ చేయలేదు. కేవలం నా తల్లిదండ్రులను భక్తితో సేవించుకొనడం వల్లనే నాకు ఈ జ్ఞానం అబ్బింది" అని సుకర్ముడు స్పష్టం చేశాడు.

"సర్వవేదేషు యత్పుణ్యం
సర్వయజ్ఞేషు యత్ఫలమ్।
తత్ఫలం సమవాప్నోతి
మాతాపిత్రోశ్చ సేవయా॥"

"సర్వవేదాలను అధ్యయనం చేసినంత పుణ్యం, సర్వయజ్ఞాలను చేసినంత ఫలం, కేవలం తల్లిదండ్రులను సేవించినంత మాత్రాన కలుగుతాయి" అని చెప్పాడు.

తల్లిదండ్రులకు పుష్టికరమైన ఆహారాన్ని పెట్టి అటు పిమ్మటనే నేను భుజిస్తాను. అందువల్ల నాకు సమస్త తీర్థయాత్రల ఫలం లభించింది. మహా తపస్సును చేసినంత ఫలం లభించింది. తల్లిదండ్రులు ఏ సంతానం వలన ఆనందాన్ని పొందుతారో, ఆ సంతానం సకలధర్మాలను నిర్వర్తించినట్టే. తల్లిదండ్రుల సేవ మాత్రమే ప్రధానధర్మం. మిగిలినవన్నీ కేవలం ఉపధర్మాలు మాత్రమే.

ద్వౌ గురూ పురుషస్యేహ
పితా మాతా చ ధర్మతః।

ఒక మనిషికి తల్లిదండ్రులే గురువులు అని ధర్మశాస్త్రం చెబుతోంది. నేను నేర్చిన సమస్తజ్ఞానము వారి అనుగ్రహం వల్లనే నాకు లభించింది."
అని వివరించాడు.

పిప్పలుడు మహానందభరితుడై, సుకర్మునికి సాష్టాంగ నమస్కారం చేసి, సమస్తప్రపంచంపై తన అధికారాన్ని వదులుకొని, తన తల్లిదండ్రులను సేవించుకునేందుకు వెళ్లిపోయాడు.
)))(((

ఈ కథ పద్మపురాణంలోనిది. విశ్వరాజ్యాధికారం కన్నా తల్లిదండ్రుల సేవ గొప్పది అని బోధించడం ఈ కథ యొక్క గొప్పతనం. ఎంతటి మహా విద్యావంతుడైనా, తల్లిదండ్రులకు సేవ చేసుకొనడం ధర్మం అని బోధించిన కథ ఇది.

Tuesday, 23 July 2019

తపస్సు చేద్దాం రండి


పతంజలి యోగాన్ని అష్టాంగయోగంగా వ్యవహరిస్తారు. అందులో ఎనిమిది అంగాలు ఉంటాయి కాబట్టి, దానికి ఆ పేరు.  వాటిలో రెండవ అంగానికి నియమాలు అని పేరు. ఆ నియమాలు ఐదు. అందులో ఒకటి తపస్సు. తపస్సు అంటే ఒకదానిని సాధించడంకోసం తపించడం అని అర్థం చేసుకోవచ్చు.  

ఆ తపస్సు మూడు రకాలట.   
1 సాత్త్వికము,
2 రాజసికము,
3 తామసికము.

తామసికమైన తపస్సుకు ఉదాహరణ రాక్షసులది. హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలైనవారిది. వారు తమ అభివృద్ధి కోసం కంటే కూడా ఇతరులను ఏడిపించడం కోసమే తపస్సు చేశారు. నిజం చెప్పాలంటే అటువంటి తపస్సు చేశారు కాబట్టే, అటువంటి పీడను కొనసాగించారు కాబట్టే, వారు కశ్యపుడు, పులస్త్యుడు వంటి గొప్ప బ్రహ్మర్షుల వంశంలో పుట్టినప్పటికీ రాక్షసులు అనిపించుకున్నారు.

రాజసికమైన తపస్సుకు ఉదాహరణ ధ్రువుడిది. తనకు జరిగిన అన్యాయం సహించలేక ఉన్నత స్థానాన్ని ఆశించి గొప్ప తపస్సు చేసి చరితార్థుడైనాడు. రాజులైనప్పటికీ, అటువంటి గొప్ప తపస్సు చేసినవారు రాజర్షులుగా కూడా పిలువబడ్డారు.

సాత్త్వికమైన తపస్సు మహర్షులది. వారి కోరిక అంతా ''లోకాః సమస్తాః సుఖినో భవంతు'' అనేది మాత్రమే.  

న త్వహం కామయే రాజ్యం
న స్వర్గం నాపునర్భవమ్।
కామయే దుఃఖతప్తానాం
ప్రాణినామార్తినాశనమ్।।

నేను రాజ్యాన్ని కాని, స్వర్గాన్ని కాని, మోక్షాన్ని కాని కోరను, కేవలం ప్రాణుల దుఃఖం పోవాలని మాత్రమే కోరుకుంటాను అని తపించిన రంతి దేవుడు రాజైనప్పటికీ, ఆయన చేసినది సాత్త్వికమైన తపస్సు.
         
అయితే, తపస్సును చేయాలి అనిపించడం పూర్వజన్మపుణ్యఫలం. (తపస్సు అంటే ఒక దానిని సాధించడం కోసం తపించడం అని మునుపే చెప్పుకున్నాము.)  ఒక విద్యార్థికి విద్యార్జనమే తపస్సు కావచ్చు. ఒక వ్యాధికి మందు కనిపెట్టడమే ఒక శాస్త్రజ్ఞుడికి తపస్సు కావచ్చును. ఆవిధంగా అన్నమాట. అటువంటి తపస్సును మొదలు పెట్టగలగడం కూడా మహాభాగ్యఫలం.  

ఇక నిర్విఘ్నంగా తపస్సు చేయడం అంటే భగవంతుని అనుగ్రహం మనకు తపస్సు పూర్తికావడం కంటే ఎంతో ముందుగానే లభించినట్లు లెక్క.
         
తపోభంగం చేయడానికి ఎన్నో శక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి. కామాన్ని పురికొల్పుతాయి. క్రోధాన్ని కలిగిస్తాయి. లోభాన్ని ప్రేరేపిస్తాయి. మోహంలో ముంచెత్తుతాయి. మదంతో కండ్లు మూసుకుపోయేలా చేస్తాయి. మాత్సర్యానికి రెక్కలు తొడిగి ఎగిరింపజేస్తాయి.

ఉదాహరణకు, ఒక విద్యార్థి చదువుకుందామని కృతనిశ్చయుడై ఉన్నాడనుకోండి. అతడి మిత్రుడు ఒకడు మన ఇద్దరికోసం సినిమా టికెట్లు తెచ్చాను, రా అని అతడిని తీసుకుపోవచ్చు. ఈ విధంగా తన లక్ష్యమైన చదువును వదలి మరొక పని చేయాలి అని, అతని ఏకాగ్రతకు భంగం కలిగించే ఎటువంటి కోరిక అయినా, అది కామం.
         
అతడు చదువుకుంటున్న సమయంలో పెద్ద శబ్దంతో ఇతరులు పాటలు వింటూ అతడికి కోపం తెప్పించవచ్చు. వారితో తగవు పెట్టుకొనేలా ప్రేరేపించేది క్రోధం.
         
చదువు పూర్తి కాకముందే ఏదో ఒక ఉద్యోగం వస్తే చదువును వదలి ఉద్యోగం చేయాలి అనిపించవచ్చు. ఆ విధంగా చదువుకు అడ్డుకట్ట వేసేది లోభం.
         
చదువు లేక పోయినప్పటికీ ఏ క్రీడాకారులో లేక ఏ సినిమానటులో చదువుకున్న వాడి కంటే బాగా సంపాదించి సుఖపడున్నారు అనిపించి మనసు అటువైపు మొగ్గు చూపవచ్చు. ఆ ఆలోచన చదువుకు ఆటంకం కలిగించితే అది మోహం.
         
నేను ఫస్ట్ ర్యాంకు విద్యార్థిని, ఒక్క సారి చదివితే మొత్తం అర్థం చేసుకోగలను అనే గర్వం తలెత్తి అతడు చదువుకోసం కేటాయించే సమయం తగ్గవచ్చు. అదుగో, అందుకు కారణం మదం.
         
తనకు పోటీగా మరొక విద్యార్థి చక్కగా చదువుతూ ఉంటే, అతడితో స్నేహం చేసి, వివిధవిషయాలను గూర్చి చర్చిస్తూ జ్ఞానసముపార్జన చేయడం మంచి పద్ధతి. అలా కాకుండా ఆ పోటీని గూర్చి చింతిస్తూ, తనను ఆ పోటీదారు మించితే బాధపడుతూ, తానే అతడిని మించితే ఆనందపడుతూ, ఈ విధంగా చదువును గూర్చి కంటే ఆ పోటీదారుని గూర్చి ఎక్కువగా ఆలోచించడం అనేది మాత్సర్యం.

క్షత్రియుడైన విశ్వామిత్రుడు మొదట వసిష్ఠమహర్షి పట్ల మాత్సర్యభావంతోనే తపస్సు మొదలు పెట్టినప్పటికీ, చివరకు ఆ తపఃప్రభావంతో పైన పేర్కొన్న కామాది అరిషడ్వర్గాలను జయించి, రాజర్షి స్థాయిని మించి బ్రహ్మర్షి అయిన కథ మనకుతెలుసు.
         
ఈ కాలంలో కూడా తపస్సు చేయవచ్చు. అది లోకానికి హాని చేసేది అయితే తామసికతపస్సు. అది కేవలం తనకు లేదా తనవారికి మాత్రమే ఉపయోగపడేది అయితే రాజసికతపస్సు. తమతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడేది అయితే సాత్త్వికతపస్సు.

శ్రద్ధయా పరయా తప్తం
తపస్తత్ త్రివిధం నరైః
ఆఫలాకాంక్షిభిర్యుక్తైః
సాత్త్వికం పరిచక్షతే।।
         
“గొప్ప శ్రద్ధతో, తనకోసం ఏమీ కోరకుండా, (లోకసంక్షేమాన్ని కోరుతూ) నిత్యం చేయబడే సత్కర్మలే సాత్త్వికతపస్సు” అని సాక్షాత్తు భగవంతుడే గీతలో (17-17) మనకు మార్గదర్శనం చేశాడు.
         
భగవంతుని నిత్యం స్మరిస్తూ, మనం చేసే సమస్తకర్మలను భగవదర్పితం చేస్తూ ఉంటే, మనం తప్పక సాత్త్వికులం కాగలం.  అపుడు మన సంకల్పాలు, తద్వారా మనం చేసే అన్ని పనులు సాత్త్వికమే కాగలవు.  అది చెట్లు నాటడం కావచ్చు.  ఎండాకాలంలో చలివేంద్రాలు నిర్వహించడం కావచ్చు.  పదిమంది పిల్లలను పోగు చేసి వారికి చదువు చెప్పడం కావచ్చు.  మురికివాడలను శుభ్రం చేయడం కావచ్చు.  పరిసరాల పరిశుభ్రతను గూర్చి ప్రజలందరికీ అవగాహన కలిగించి, వారిలో ఆరోగ్యస్పృహను కలిగించడం కావచ్చు.  నీటిని సంరక్షించుకొనడం, పొదుపుగా వాడుకొనడం ప్రజలకు అలవాటు చేయడం కావచ్చు. 
         
ఇలా, పేరును, ధనాన్ని, పలుకుబడిని మరొక మరొక లాభాన్ని ఆశించకుండా నిష్కామంతో చేసే పనులు లోకానికి ఎంతో మేలును చేకూరుస్తాయి.  ఇతరులు కూడా అటువంటి పనులు చేసేందుకు  ప్రేరణ కలిగిస్తూ, మన తరువాత కూడా లోకానికి శుభపరంపరను కలిగిస్తూ ఉంటాయి. 
         
అందువల్ల, లోకానికి శుభం కోరుతూ ఒక మంచి పనిని చేద్దాం అని సంకల్పించుకుని, దానిని నెరవేర్చే బాధ్యతను భారాన్ని భగవంతునిపై మోపి, మనం చిత్తశుద్ధితో ప్రయత్నం చేద్దాం.  అదే సాధారణమనుషులమైన మనం చేయగలిగిన తపస్సు. 

లోకాః సమస్తాః సుఖినో భవంతు.

(2019 జూలై నెల, యథార్థభారతి పత్రికలో ప్రచురింపబడిన నా వ్యాసము)

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...