Showing posts with label Enemy. Show all posts
Showing posts with label Enemy. Show all posts

Friday, 20 March 2020

తెలుగు మీడియం తప్పేముంది?



అయ్యా ముఖ్యమంత్రి గారూ,

మొదట్లో నిర్బంధపు ఇంగ్లీషు మీడియం నిర్ణయాన్ని ప్రశ్నించేవారు ఎవరైనా సరే, వారందరినీ పేదవారికి శత్రువులుగా చిత్రీకరించారు.

ఇపుడు ప్రశ్నించేవారిని సాక్షాత్తు మీకు (ముఖ్యమంత్రికి) శత్రువులుగా కూడా ప్రకటించేశారా?

అయ్యా, అంతటి ఆగ్రహం ఎందుకు? మేము మీకు వోటు వేసిన వాళ్లము. ఆంధ్రప్రదేశ్ పౌరులము. మీ ప్రజలము. మేము ముఖ్యమంత్రి అభ్యర్థులము కాము. మీకు పోటీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని పార్టీ పెట్టుకుని కూర్చున్నవాళ్లము కాము.

తెలుగు మా మాతృభాష. మీరు మాకు పరిచయం కాకముందే ఈ భాషతో చక్కని పరిచయాన్ని మేము కలిగి ఉన్నాము. అందువలన, మా భాషకు తగిన స్థానం కోసం మేము అడుగుతాము. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. దేశద్రోహం కాదు, రాజద్రోహం కూడా కాదు కదా?

100% ప్రభుత్వ ఉద్యోగాలన్నిటినీ తెలుగులో నాలుగు ప్రావీణ్యాలను (1 వినడం, 2 మాట్లాడటం 3 చదవటం 4 వ్రాయడం) కలిగిన వారికే ఇస్తామని మొదట వాగ్దానం చేయండి. మేము మీ ప్రయోగానికి కొంతకాలం సహకరిస్తాము. అంగీకరిస్తాము.

మీ నిర్బంధపు ఇంగ్లీషు మీడియం ప్రయోగం 100% సఫలమౌతుంది అనే నమ్మకం మీకు ఉన్నదా? అది ఆవిధంగా సఫలమౌతుంది అని నిరూపించేందుకు మీకు ఎంతకాలం కావాలి?

తెలుగు ఒక సబ్జెక్టుగా కొనసాగుతుంది కాబట్టి తెలుగు అందరికీ వస్తుంది అంటున్నారు.

లెక్కలు కూడా ఒక సబ్జెక్టుగా కొనసాగుతుంది కదా? మరి అందరూ లెక్కలలో శ్రీనివాస రామానుజన్ లంతటివారైపోతున్నారా?

సోషల్ స్టడీస్ కూడా ఒక సబ్జెక్టుగా ఉంటోంది కదా? మరి అందరూ తలపండిన రాజకీయవేత్తలు గాని, ఆర్థికవేత్తలుగాని అయిపోతున్నారా?

సైన్సు కూడా ఒక సబ్జెక్టుగా ఉంటోంది కదా? మరి అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతున్నారా?

ఇంగ్లీషు కూడా ఒక సబ్జెక్టుగా ఉంటోంది కదా? వారందరూ షేక్స్‌పియర్లు ఎందుకు కారు?

ఎవరికి ఏ సబ్జెక్టులో అభిరుచి కలుగుతుందో వారు ఆ సబ్జెక్టులో భాషాతీతంగా ఎదగగలరు. అది మీకు తెలియని విషయమా?

మీరు చిన్నతనం నుండి పాలిటిక్స్ అనే సబ్జెక్టు చదవడం వల్లనే ఈ రోజు ముఖ్యమంత్రి కాగలిగారా?

పోనీ, మీరు ఈ రాష్ట్రంలోని అత్యున్నతస్థానమైన ముఖ్యమంత్రి పదవిని అలంకరించారంటే అందుకు కారణం మీకు ఇంగ్లీషు రావడం మాత్రమేనా?

రావాలి జగన్ కావాలి జగన్ అనే పాటను జనాలు ఇంగ్లీషులో విన్నారా?

మీరు చేసిన సుదీర్ఘ పాదయాత్రలో మీరు ప్రజలతో ఇంగ్లీషులో మాట్లాడారా?

మీరు చేసిన ఉపన్యాసాలన్నీ ఇంగ్లీషులోనే చేశారా?

మీరు ముఖ్యమంత్రి అనే అత్యున్నత స్థానానికి ఎదగడానికి మీకు తోడ్పడింది మీ శ్రమ, మీ పట్టుదల, మీ ఓర్పు, మీ దీక్ష. మీ తపన.

మేము వీటిని చూసి మీకు వోట్లు వేశామే గాని, మీరు ఇంగ్లీషు భాషలో ఆయా ఛానెళ్లవారికి ఇచ్చిన ఇంటర్వ్యూలను చూసి కాదు.

అటువంటి శ్రమ, పట్టుదల, ఓర్పు, దీక్ష, తపన ఒక విద్యార్థికి నిజంగా ఉంటే అతడు ఒక గొప్ప డాక్టర్ కావడానికి గాని, ఒక గొప్ప ఇంజనీరు కావడానికి గాని, ఒక గొప్ప మేనేజర్ కావడానికి గాని, ఒక గొప్ప ఆఫీసర్ కావడానికి గాని, ఇంగ్లీషు భాష అనేది నిజంగా ఒక అడ్డంకి అవుతుందా? శ్రమించని వాడికి అసలు ఉన్నత స్థానం పొందే హక్కు ఉందా?

విద్యార్థుల వెనుకబాటుతనానికి చాలా కారణాలున్నాయి.

1.1 అలసత్వం.
సోమరితనం. రేపు చదువుతాను, ఎల్లుండి చదువుతాను అంటూ వాయిదాలు వేస్తూ పోవడం. ఇలాంటి విద్యార్థులు చదువులో రాణించకపోతే అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పా?

1.2 గర్వం.
నేను చాల తెలివైనవాడిని, ఒకటి రెండు క్లాసులకు హాజరు కాకపోయినా స్వంతంగా చదువుకోగలను, పరీక్షలకు నెలరోజుల ముందు చదివితే పికప్ చేయగలను వంటి అతివిశ్వాసం. ఇలాంటి విద్యార్థులు విఫలమైతే అది చిన్నప్పుడు చదివిన తెలుగు మీడియం తప్పా?

1.3 వ్యామోహం.
కొందరికి సినిమా వ్యామోహం. కొందరికి సినిమా నటులమీద వ్యామోహం. కొందరికి రాజకీయనాయకుల పట్ల వ్యామోహం. కొందరికి క్రికెట్ వ్యామోహం. కొందరికి ప్రేమ వ్యామోహం. కొందరికి సోషల్ మీడియా వ్యామోహం. ఇలాంటి విద్యార్థులు విఫలమైతే అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పా?

1.4 చపలత్వం.
కొందరు విద్యార్థులకు ఏకాగ్రత ఉండదు. కాసేపు చదువుకుంటారు. కాసేపు టీవీ చూస్తారు. కాసేపు రోడ్డు మీద పడి తిరుగుతారు. కాసేపు మిత్రులతో ముచ్చట్లు వేస్తారు. కాసేపు ఇంటి పనులు చేస్తారు. వీరు చదువులో రాణించకపోతే అది చిన్నప్పుడు చదివిన తెలుగు మీడియం తప్పా?

1.5 అనాసక్తి.
ప్రతి విద్యార్థి కేవలం సాంకేతికమైన చదువుల కోసమే పుట్టలేదు. కేవలం ఉద్యోగాలు చేయడానికి మాత్రమే పుట్టలేదు. అతడు మంచి సంగీతకారుడు కావచ్చు. గొప్ప ఆటగాడు కావచ్చు. గొప్ప కవి కావచ్చు. రచయిత కావచ్చు. గొప్ప చిత్రకారుడు కావచ్చు. వాళ్ల మనసు తమకు ఇష్టమైన రంగాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. వారిని తీసుకొచ్చి డాక్టర్లుగా ఇంజనీర్లుగా చేస్తామంటూ కాలేజీలలో పడేస్తే, వారికి ఉండే అనాసక్తి వల్ల చదువులో రాణించలేక పోవచ్చు. అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.

1.6 స్వార్థం.
ఒకప్పుడు చక్కగా చదువుకునే ఒక విద్యార్థి, అంత గొప్పగా చదవలేని తన తోటి విద్యార్థులకు ఒక సబ్జెక్టును గురించి వివరించి చెప్పడం, వాటిని గూర్చి చర్చించడం, వారి సందేహాలకు సమాధానం చెప్పడం చేసేవాడు. ఇటువంటివన్నీ మునుపు జరిగేవి. కానీ, ప్రస్తుతం అనారోగ్యకరమైన పోటీ ఉంది. ర్యాంకుల పేరిట రూపొందించబడిన విద్యావిధానం, విద్యార్థులలో వేలం వెర్రిని పెంచడం వలన, ఆ విద్యార్థులు తమ జ్ఞానాన్ని తోటి విద్యార్థులతో పంచుకొనలేకపోతున్నారు. ఇది కూడా చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.

1.7 తప్పుడు మార్గదర్శనం
"ఫలానా సబ్జెక్టు చాలా సులువు, ఒక్కరోజులో, ఓవర్ నైట్ దానిని చదివేసి పరీక్ష పాస్ అయిపోవచ్చు అని కొందరు సీనియర్లు చెబుతుంటారు. మరొక సబ్జెక్టు భూతం. దానిని రాత్రింబగళ్లు ఎంత చదివినా అది అర్థం అయి చావదు. దాంట్లో యావరేజ్ మార్కులు తెచ్చుకొని పాస్ అయిపోతే చాలు". ఇటువంటి మాటల వల్ల జూనియర్ విద్యార్థి ప్రభావితం అవుతూ ఉంటాడు. ఒక్కసారి ఆమాటలు మనసులోకి ఎక్కితే అవి ఒక పట్టాన వదలవు. ఇది కూడా చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం వలన వచ్చే సమస్య కాదు.

పైన చెప్పినవన్నీ విద్యార్థుల యొక్క దోషాలు. ఇప్పుడు అధ్యాపకుల దోషాలను చూడండి.

2.1 ప్రిపరేషన్ లేకపోవడం.
ఒక విషయం ఒక అధ్యాపకునికి చాలా అలా అభిమానపాత్రమైన విషయమై ఉంటుంది. ఈ సబ్జెక్టును మా సారు కళ్ళు మూసుకుని చెప్పగలరు అని విద్యార్థులలో పేరు ఉంటుంది అటువంటి మాటలకు పొంగిపోయి అధ్యాపకుడు ఆ విషయంపై మరింత పరిశోధన చేయడం గాని మరిన్ని కొత్త విషయాలు చెబుదామని గాని ప్రయత్నం చేయడు. ఇది కూడా విద్యార్థి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం దోషం కాదు.

2.2 విషయం దాటవేయడం
కొందరు మంచి తెలివైన విద్యార్థులు ఉంటారు. వారు ప్రశ్నించడం మొదలు పెడితే కొందరు అధ్యాపకులు భయపడతారు కూడా. అందువల్ల వారు అటువంటి విద్యార్థులకు తమ క్లాసులో మాట్లాడే అవకాశం ఇవ్వరు. "ఈ విషయం తర్వాత డిస్కస్ చేద్దాం ఇప్పుడు పాఠం కొనసాగనివ్వు" అని అని సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తారు. ఆ తర్వాత అంటే ఏ తర్వాత? ఆ సందర్భం మళ్లీ రాకపోవచ్చు. ఇది కూడా విద్యార్థి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.

2.3 పాఠానికి సంబంధం లేని విషయాలను ప్రస్తావించడం.
కొందరు అధ్యాపకులకు కేవలం విద్యార్హత ఉంటుంది. కాని, వారికి సబ్జెక్టుపై అవగాహన ఉండదు. క్లాసుకు వచ్చి పాఠానికి అవసరమైన విషయాలు చెప్పడం మాని విద్యార్థులతో పోసుకోలు కబుర్లు చెబుతూ వారిని కవ్విస్తూ నవ్విస్తూ ఆ రోజు క్లాసు అయిపోయింది అనిపిస్తారు. ఇటువంటి వారికి విద్యార్థులలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుంది. మేనేజ్‌మెంటుకు ఆ విషయం తెలిసి కూడా, అటువంటి వారు మరుసటి సంవత్సరం తమ సంస్థలోనికి అడ్మిషన్లు తీసుకురాగలిగిన సమర్థులుగా భావించి వారిని కొనసాగిస్తూ ఉంటారు. ఇటువంటి వారి క్లాసులలో విద్యార్థులకు సబ్జెక్టు రాకపోతే అది వారు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు మీడియం తప్పు కాదు.

2.4 అధ్యాపకవృత్తిపై ప్రేమ లేకపోవడం.
కొందరు అధ్యాపకులు తాము తమ తోటి విద్యార్థుల వలె ఇంజనీర్లుగా డాక్టర్లుగా జీవితంలో "సెటిల్" కాలేక పోయామని నిత్యం చింతిస్తూనే ఉంటారు. వారు కేవలం మొక్కుబడిగా మాత్రమే పాఠాలు చెబుతారు. అది అర్థం అయిన వారికి అర్థమైనంత. అర్థం కాకపోతే విద్యార్థులు తమ చిన్నతనంలో చదివిన తెలుగు మీడియం తప్పు కాదు.

2.5 విద్యార్థులకు ఆదర్శంగా నిలబడలేక పోవడం.
ఒక అధ్యాపకుడు తన ప్రవర్తనలో గాని చదువుపై ప్రేమలో గాని తన విద్యార్థులకు ఆదర్శంగా ఉండవలసిన అవసరం ఉన్నది. అతడు ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్నవాడైతే విద్యార్థులు అంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు. అతడికి సబ్జెక్టుపై ఎంత అవగాహన, ఎంత ప్రేమ ఉంటుందో, అదంతా అతడి పాఠాలలో ప్రతిఫలిస్తుంది. అప్పుడు విద్యార్థులకు కూడా ఆ సబ్జెక్టుపై అంతటి ప్రేమాభిమానాలు, అంతటి ఆసక్తి కలుగుతాయి. అధ్యాపకుడు ఆ విధంగా లేకపోతే, విద్యార్థికి నిజంగా నష్టమే. అది చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకొనడం వల్ల జరిగిన తప్పు కాదు.

ఇంకా, దోషాలు కేవలం విద్యార్థులలో అధ్యాపకులలో మాత్రమే కాదు, ఆయా విద్యాసంస్థల యొక్క యజమానులలో కూడా ఉంటాయి.

3.1 తల్లిదండ్రుల మెప్పు కోసం ప్రయత్నించడం.
సంస్థల యొక్క మనుగడ విద్యార్థుల చేరికపై ఉంటుంది. అది తల్లిదండ్రుల యొక్క చేతిలో ఉంటుంది. ఆ తల్లిదండ్రుల నమ్మకాన్ని పొందటం ఆ సంస్థలకు చాలా అవసరం. అందువల్ల తల్లిదండ్రుల గొంతెమ్మ కోరికలు అన్నిటినీ వారు చేతనైనంత వరకు ఆమోదించవలసి ఉంటుంది. వారి కోరికలను సంతృప్తి పరిచేందుకు వీరు అధికప్రాధాన్యతను ఇస్తూ, విద్యార్థులకు పాఠాలు ఎలా చెప్పాలి అనేదానిపై స్వతంత్ర నిర్ణయాలను తీసుకొనలేకపోతున్నారు. చివరగా నష్టం కలిగేది విద్యార్థులకే. ఇది తెలుగు మీడియం వలన జరిగే తప్పు కాదు.

3.2 అధ్యాపకులను నియంత్రించడం.
మేము మీ పిల్లలను "ఇంత" చక్కగా చూసుకుంటాము అని తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన తరువాత ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు అధ్యాపకులకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాయి. ఆలస్యంగా వచ్చినా వారిని ఏమీ అనకండి. హోంవర్క్ చేయకపోయినా రేపు చేసి తీసుకురమ్మని చెప్పండి కానీ కోపపడవద్దు. క్లాసులో ఎవరైనా అల్లరి చేసినా మాట్లాడిన మాకు చెప్పండి గాని, వారిని క్లాసులో నిలబెట్టడం వంటి చిన్న చిన్న శిక్షలు కూడా వేయకండి - ఇలా. ఇలా ఐతే ఎలా? ఇది తెలుగు మీడియం వలన జరిగే తప్పు కాదు.

3.3 అధ్యాపకులను ఇతర పనులకు వినియోగించుకోవడం.
కొన్ని యాజమాన్యాలు తమ అధ్యాపకులను అడ్మిషన్లు తీసుకువచ్చేందుకు పంపిస్తూ ఉంటారు. మరికొందరు అధ్యాపకులను మీడియాతో మాట్లాడేందుకు వినియోగిస్తూ ఉంటారు. మరికొందరు అధ్యాపకులను తమ వాణిజ్య ప్రకటనలను రూపొందించవలసినదిగా కోరుతుంటారు. ఇటువంటి పనులు నిత్యం చేస్తూ ఉంటే చివరకు తమ అసలు పని అయిన విద్యాబోధన కంటే ఈ పనులే ముఖ్యమని వారు భావించేలా చేస్తారు. అందువలన విద్యార్థులకే నష్టం. ఇది తెలుగు మీడియం వలన జరిగే తప్పు కాదు.

3.4 కొందరు అధ్యాపకులను వదులుకోలేకపోవడం.
ముందు చెప్పినట్లుగా కొందరు అధ్యాపకులు క్లాసులో పిల్లలను నవ్వించడం కవ్వించడం చేస్తే వారికి చాల అభిమానపాత్రులైన అధ్యాపకులుగా మారుతారు. (!). వారి వలన మన సంస్థకు ఆకర్షణ పెరిగే మాట నిజమే. అయినప్పటికీ వారు సక్రమంగా పాఠాలు చెప్పలేక పోవడం వలన విద్యలో నాణ్యత లోపిస్తుంది. కానీ అటువంటివారికి విద్యార్థులను ఆకర్షించే శక్తి ఉండటం వలన విద్యాసంస్థలు వారిని వదులుకోలేవు. అందువల్ల విద్యార్థులకు నష్టం. ఇది తెలుగు మీడియం వల్ల జరిగే తప్పు కాదు.

ఈ విధంగా విద్యావ్యవస్థలలో ఎన్నెన్నో లోపాలు ఉన్నాయి. ఎందరెందరిలోనూ ఉన్నాయి. వాటినన్నింటినీ పక్కన పడేసి, వారందరూ నిర్దోషులని, అమాయికులని భావిస్తూ, విద్యార్థులు చదువులో రాణించలేక పోవడానికి ఏకైక కారణం తెలుగు మీడియం మాత్రమే అని, దానిని బలిపశువుగా మార్చి, దానిని గిలెటిన్ యంత్రంలో పెట్టి తల నరికే శిక్ష వేయడం దారుణం.

అయ్యా ముఖ్యమంత్రివర్యా,

విద్యార్థులందరూ తమ తప్పులను తెలుసుకొని, వాటిని సరిదిద్దుకొని, నాలా శ్రమించండి, నాలా ఉన్నత స్థానాన్ని పొందండి అని మీరు విద్యార్థులకు సందేశం ఇవ్వండి.

ఆ విధంగా శ్రమించే విద్యార్థులకు తగిన సమస్త సౌకర్యాలను ఇవ్వండి. అధ్యాపకుల కోసం తరచు సెమినార్లనునిర్వహించండి. సక్రమంగా పాఠాలను చెప్పమని వారికి ప్రబోధించండి. వారి సమస్యలను తీర్చండి. యాజమాన్యాలకు ఏమైనా చిక్కులు ఉంటే వాటిని పరిష్కరించండి. అపుడు అందరూ హర్షిస్తారు. అందరూ సహకరిస్తారు.

అంతే గాని, తప్పులన్నిటినీ కేవలం తెలుగు మీడియం వల్ల జరుగుతున్న తప్పులుగా చిత్రీకరించడం మీ స్థాయిలో ఉన్నవారికి తగదు.

మీరు తెలుగు మీడియాన్ని రద్దు చేయడంపై ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని మీకు శత్రువులుగా భావించడం మీకు మీ ప్రజలకు కూడా శ్రేయస్కరం కాదు.

21 నవంబరునెల, 2019 సంవత్సరం నాటి  లేఖ

Tuesday, 26 March 2019

సంతృప్తి లేని రాజు


డా|| పాటీలు శ్రీనివాసకృష్ణ

          పూర్వం సదయుడు అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి విమలుడు అనే కుమారుడు ఉండేవాడు.  ఒక సమయం వచ్చేసరికి, సదయుడు తనకు వార్ధక్యం వచ్చిందని అర్థం చేసుకుని, విమలుడు రాజ్యపరిపాలనకు సమర్థుడు అని భావించి, అతడికి పట్టాభిషేకం చేశాడు.  పిమ్మట రాజధానికి దూరంగా, ఒక వనంలో తపస్సు చేసుకుంటూ నివసించసాగాడు. తన కుమారుని రాజ్యపాలనావిశేషాలను గూర్చిన సమాచారం ఎప్పటికప్పుడు అతనికి తెలుస్తూనే ఉండేది.

          తాను నేర్చిన మంచి విద్యల ప్రభావం వలన విమలుని పాలన మొదట సక్రమంగానే ఉండింది.  కాని, అతడి చుట్టూ క్రమంగా కొందరు దుష్టమంత్రులు చేరారు.  అసంతుష్టో ద్విజో నష్టః, సంతుష్టస్తు మహీపతిః” (సంతృప్తి లేని ద్విజుడు నశిస్తాడు, సంతృప్తి కలిగిన రాజు నశిస్తాడు) అని పెద్దలు చెప్పిన సుభాషితాన్ని అతనికి చెప్పి, “రాజు తనకున్నదానితోనే సంతృప్తి చెందితే నశించిపోతాడు, అందువల్ల మరింత అధికంగా సంపదలను పొందేందుకు ప్రయత్నించాలిఅని ఉపదేశించారు.

          దానితో విమలుడు తన రాజ్యాన్ని విస్తరించాలని భావించాడు.  అందుకు పెద్ద సైన్యం అవసరం.  ఆ సైన్యాన్ని పోషించేందుకు పెద్ద మొత్తంలో ధనం అవసరం.  అందువల్ల, ధనాన్ని సేకరించేందుకు గాను ప్రజలపై క్రొత్త క్రొత్త పన్నులు విధించి, వసూలు చేయసాగాడు.  ప్రజలలో రాజుపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.

          ఇది తెలుసుకున్న సదయుడు ఆందోళన పడి, తన కుమారుని రమ్మని కబురు చేశాడు.  విమలుడు అడవికి వెళ్లి తన తండ్రిని కలుసుకున్నాడు.  తన కుమారుని ఉద్దేశాన్ని కనుగొని, సదయుడు విచారం వ్యక్తం చేశాడు. 

          “నాయనా, పరాక్రమం చూపడం, యుద్ధం చేయడం క్షత్రియధర్మమే.  నేను కాదనను.  కాని, సాధారణపరిస్థితులలో స్వదేశాన్ని కాపాడుకొనేందుకు యుద్ధం చేయడం మాత్రమే ధర్మం.  అసాధారణపరిస్థితులు కూడా అప్పుడప్పుడు తలెత్తుతాయి.  ఇతరరాజులు అధర్మపరులైనపుడు ధర్మరక్షణకు గాను వారిపై యుద్ధం ప్రకటించవచ్చు.  విదేశాలలో రాజు క్రూరుడై, ప్రజాసంక్షోభకారకుడు అయినపుడు, ఆ ప్రజలను సంరక్షించేందుకు దండయాత్ర చేయవచ్చు.  లేదా, సువిశాలమైన దేశంలో, ఆయా రాజ్యాల రాజులు నిష్కారణంగా కలహించుకుంటూ అలజడులు రేకెత్తిస్తున్నపుడు, వారినందరినీ అదుపులో ఉంచేందుకుగాను అశ్వమేథం వంటి యాగాలు కూడా చేయవచ్చును.  కాని, ఇటువంటి కారణాలు ఏమీ లేకుండా, స్వయంగా నువే, దురాశతో, ఇతరదేశాలమీదకు దండెత్తి ఆక్రమింపజూడటం అధర్మం.  నువు బలవంతుడవైనందువల్ల గాని, కాలం అనుకూలించినందువల్ల గాని, తాత్కాలికంగా గెలిచినప్పటికీ, చిరకాలంపాటు ఆ రాజ్యాన్ని నిలబెట్టుకోలేవుఅని నచ్చజెప్పజూశాడు.
     
          “మరి, సంతృప్తి కలిగిన రాజు నశిస్తాడుఅని పెద్దలు చెప్పిన మాట అసత్యమా?” అని విమలుడు తండ్రిని ప్రశ్నించాడు.

          “అసత్యం కాదు, నిజమే!

          “మరి, యుద్ధానికి పోవద్దని మీరు నన్ను ఎందుకు వారిస్తున్నారు?”

          “నాయనా!  రాజు, రాజ్యసంపాదనవిషయంలో సంతృప్తిని కలిగి ఉండాలి.  దానివల్ల హాని లేదు.  అందువల్లనే, పాండవులు తమకు మొత్తం రాజ్యం అవసరం లేదని, ఐదు ఊళ్లు ఇచ్చినా చాలని దుర్యోధనునికి సందేశం పంపించారు.  అంతవరకు ధర్మం.  కాని, అసంతృప్తి కలిగిన దుర్యోధనుడు మాత్రం సూదిమొన మోపినంత భూమిని కూడా ఇవ్వనని తిరస్కరించాడు.  అది అధర్మం.  చివరకు సంతృప్తి కలిగిన పాండవులే జయించారు.  తనకున్న మహాసామ్రాజ్యంలో, కేవలం ఐదు ఊళ్లు తక్కువైనప్పటికీ తట్టుకోలేని అసంతృప్తిని కలిగిన దుర్యోధనుడు మాత్రం తన మిత్రులతో సహా నశించాడు కదా?” అని చెప్పాడు సదయుడు.

          “నిజమే నాన్నగారూ!  కాని, ఓవైపు ఆ సుభాషితం నిజమే అని మీరు చెప్పారు.  మరోవైపు, వాస్తవంగా ఆ సుభాషితంలో చెప్పబడి ఉన్నదానికి విరుద్ధంగా జరిగిందని కూడా మీరే ఉదాహరణ చూపుతున్నారు.  ఇపుడు, ఈ రెండిటిలో నేను దేనిని గ్రహించి ఆచరించాలి?” అని విమలుడు ప్రశ్నించాడు.

          “నాయనా!  సుభాషితంలో చెప్పబడినదీ నిజమే, కౌరవపాండవుల కథ కూడా నిజమే!  కాని, ఆ సుభాషితాన్ని మనం తప్పుగా అర్థం చేసుకొనడం వల్ల, ‘ఇక్కడ వైరుద్ధ్యం ఉన్నది కదాఅని సంశయం కలుగుతుంది. 

రాజుకు సంతృప్తి ఉండరాదుఅనేది ఆ సుభాషితం యొక్క ఆశయం.  ‘ఏవిషయంలో అటువంటి సంతృప్తి ఉండరాదు?’ – అంటే – ‘నేను నా ప్రజలను ధర్మంలో నడిపిస్తున్నాను కదా, ఇక నేను చేయవలసిన పనులేమీ లేవుఅని రాజు సంతృప్తిని చెందరాదు అని భావించాలి.  ఎందువల్లనంటే, ఆ ధర్మాన్ని దారి తప్పించే శక్తులు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూ ఉంటాయి.  రాజు అప్రమత్తంగా ఉంటూ వాటినుండి ప్రజలను కాపాడుతూ ఉండాలి.  ‘నా ప్రజలకు దొంగలనుండి రక్షణ కల్పించాను, అగ్నిప్రమాదాలనుండి రక్షణ కల్పించాను, ఈతిబాధలనుండి రక్షణ కల్పించాను.  కనుక, ఇంతకంటె నేను చేయవలసిన గొప్ప పనులేమీ లేవుఅని రాజు సంతృప్తిని చెందరాదు.  

ఆ రాజు ప్రజలను కామక్రోధాది-అరిషడ్వర్గాల నుండి కూడా కాపాడుకోవాలి.  ఎందుకంటే, ఆ శత్రువుల దాడికి గురైనవారు జీవితంలో సుఖపడలేరు.  మిగిలిన శత్రువులు ఒక జన్మకు మాత్రమే పరిమితమౌతారేమో గాని, ఈ అంతర్గతశత్రువులు మాత్రం జన్మజన్మలకూ వదలకుండా వేధిస్తూనే ఉంటారు.  ఆ శత్రువులనుండి ప్రజలను కాపాడడానికి ఒకటే మార్గం.  వారందరికీ చక్కని ఆధ్యాత్మవిద్యను  అందించాలి.  ప్రజలందరూ తమ తమ శక్తిసామర్థ్యాలు, అభిరుచులమేరకు వివిధవృత్తినైపుణ్యాలను సంపాదించేందుకు, పెంపొందించుకొనేందుకు, తదనుగుణంగా జీవనోపాధిని పొందేందుకు తగిన ఏర్పాట్లను చేయడమే కాకుండా, వారిలో ఆధ్యాత్మికప్రవృత్తిని పెంపొందించేందుకు కూడా తగిన కార్యక్రమాలను చేపట్టాలి.  అత్యంతబలవంతమైన ఈ అంతఃశత్రువులను జయించిన వ్యక్తి అరిందమనుడు అని పిలువబడతాడు.   

నాయనా!  ఈ విధంగా, తన రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా జీవించేందుకు గాను, రాజు, ఎక్కడ ఎటువంటి లోటు జరుగుతుందో అనే భయంతో, తాను మాత్రం సంతృప్తి లేకుండా, నిత్యజాగరూకుడై ఉంటూ, పరిపాలన చేస్తూనే ఉండాలి.  ఇది ఆ సుభాషితం యొక్క అంతర్గతభావం.  అంతేగాని, తనకున్న రాజ్యభూభాగం చాలదనే అసంతృప్తిని చెందుతూ, ఇతరదేశాలమీదకు దండెత్తి, సంక్షోభం సృష్టించమని దాని అర్థం కాదుఅని సదయుడు వివరించాడు.

          విమలునికి చాల సంతోషం కలిగింది.  అతని సందేహాలన్నీ పటాపంచలైనాయి.  “తండ్రీ!  నాకు చక్కని ఉపదేశం చేసి, జ్ఞానోదయం కలిగించారు.  ఆ సుభాషితం యొక్క ఉదాత్తమైన భావాన్ని నేను మీ అనుగ్రహం ద్వారా చక్కగా గ్రహించాను.  మీ ఆజ్ఞతో, మీరు చెప్పిన విధంగా, సక్రమమైన పరిపాలనను ప్రజలకు అందిస్తూ, వారిని అన్నిరకాల అంతర్గతశత్రువులనుండి కాపాడేందుకు నా శాయశక్తులా ప్రయత్నం చేస్తానుఅని సదయునికి పాదాభివందనం చేశాడు.

          అప్పటినుండి విమలుని పాలన చాల చక్కగా కొనసాగింది.  ఆదర్శపరిపాలకునిగా, ధర్మప్రభువుగా అతడు గొప్ప కీర్తిని సంపాదించాడు.

          చదువు చాల విలువైనది.   అయితే, ‘తేభ్యః క్రియాపరాః శ్రేష్ఠాః’.  చదువుకుని, విషయజ్ఞానం పొందిన వారికంటె, దానిని సక్రమంగా ఆచరించేవారే శ్రేష్ఠులని స్మృతివచనం.  అయినప్పటికీ, సరిగా అర్థం చేసుకున్నపుడే సరియైన ఆచరణ సాధ్యమౌతుంది.  చదువుకున్న విషయం యొక్క సారాన్ని సరిగా తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ఆచరించేందుకు పూనుకుంటే వ్యతిరేకఫలాలు వస్తాయి.  అందువల్ల, గురుముఖతః విద్యను నేర్చుకొమ్మని మన పెద్దవారు చెబుతారు.  అందువల్ల, పరీక్షలో ఉత్తీర్ణులు కావడం కంటె, పాఠశాలలకు చక్కగా హాజరౌతూ, పాఠాలను శ్రద్ధతో వినడం చాల ముఖ్యం.

(ఈ వ్యాసంయథార్థభారతి - మార్చ్ నెల, 2019 సంచికలో ప్రచురింపబడింది.) 


సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...