Thursday 19 March 2020

స్వీయరక్షణ


ప్రతి పాఠశాలకూ మూడు ఎకరాల భూమి ఉండాలి. ఒక ఎకరంలో పాఠశాల భవనాలూ, తోట ఉండాలి. మరొక ఎకరంలో క్రీడాంగణం ఉండాలి. ఈ రెండు ఎకరాల చుట్టూ సజీవమైన కంచెను వేయాలి. మరొక ఎకరం భూమిని చుట్టూ కంచె లేకుండా వదిలివేయాలి.

రక్షణకోసం కంచెలేని ఆ ఎకరం భూమి సరిహద్దులను విద్యార్థులందరికీ ప్రతిసంవత్సరం చూపాలి. ఇదంతా మనదే మనదే అని బుర్రకెక్కేలా చెప్పాలి. విద్యార్థులు మూడునెలలకొకసారి ఆ భూమిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎవరికీ ఎటువంటి ఫంక్షన్లకూ అద్దెకివ్వరాదు. అయ్యప్ప స్వాములు కావచ్చు, రంజాన్ ప్రార్థనలు కావచ్చు, రాజకీయనాయకుల మీటింగులు కావచ్చు, ఎగ్జిబిషన్‌లు కావచ్చు, తిరణాళ్లు కావచ్చు, పాఠశాల పిల్లలకు ఐసుక్రీములు, షరబత్తులు అమ్మేవారిని కూడా అక్కడ ఉండనివ్వరాదు. ఎటువంటి కార్యకలాపాలైనా అక్కడ జరగడానికి అవకాశం ఇవ్వరాదు. పాఠశాల విద్యార్థులతో సహా ఎవ్వరూ అక్కడ ఆడుకొనేందుకు కూడా అనుమతిని ఇవ్వరాదు. అలాగని కంచె వేయరాదు, ఇది మా స్థలమే అని బోర్డు కూడా పెట్టరాదు.

ఆ కంచె లేని భూభాగంలో జరుగుతున్న మార్పులు, చేర్పులు, పాఠశాలలోని ప్రతి క్లాసు లీడరు ప్రతిరోజు గమనిస్తూ, వాటిని ఒక ప్రత్యేకమైన నోట్‌బుక్‌లో రాసుకుంటూ ఉండాలి. తమ తమ క్లాసులోని పిల్లలకు వారానికొకరోజు వివరిస్తూ ఉండాలి.

బయటి వ్యక్తి ఎవరైనా ఆ భూభాగంలో ప్రవేశించి, ఒకటి రెండు రోజులు తిష్ఠవేసినట్టనిపిస్తే, (బిచ్చగాడైనా సరే) క్లాసు లీడర్లందరూ కలిసి వెళ్లి అతడిని ఆ భూభాగం బయటకు వెళ్లిపొమ్మని చెప్పాలి. ఒకరిద్దరు వ్యక్తులు కాకుండా కొంతమంది వ్యక్తులు ప్రవేశించి తిష్ఠవేస్తే మొత్తం పాఠశాల విద్యార్థులందరూ కలిసి వెళ్లి, ఇది మా పాఠశాలకు చెందిన భూమి, ఖాళీ చేసి వెళ్లిపొమ్మని చెప్పాలి. (అధ్యాపకులు వారికి రక్షణగా వెనుకనే మౌనంగా నిలబడాలి. పరిస్థితులు తీవ్రమైతే పోలీసు సహాయం కోరాలి.).

ఆ సందర్భంగా ఆక్రమింపజూసిన వారిని సమర్థించే అదృశ్యశక్తులను గూర్చి విద్యార్థులు తెలుసుకుంటారు. కంచె లేకపోవడం బోర్డు లేకపోవడం అనేది బాధ్యతారాహిత్యం కాబట్టి... అని తప్పును ఎత్తిచూపే మాటలను వింటారు. తప్పు ఆక్రమణదారులదే అయినా తమ మీద వచ్చే వత్తిడులు ఎలా ఉంటాయో అవగతం చేసుకుంటారు. మానవత్వమూ మానవహక్కులూ అనే పేరిట జరిగే రకరకాల వాదోపవాదాలు చిన్నప్పుడే వారి చెవులబడాలి. వాటిలోని ఔచిత్యానౌచిత్యాలు క్రమంగా వారికే అర్థమౌతాయి.

ప్రతి పాఠశాలవిద్యార్థులకూ ఇటువంటి శిక్షణ ఇవ్వాలి. అప్పుడే ఆ కాబోయే పౌరులకు తమదైన భూభాగాన్ని రక్షించుకొనడం ఎంత కష్టమో, అయినప్పటికీ దాన్ని కాపాడుకొనడం ఎలాగో తెలుస్తుంది. తాము ఒంటరిగా కాకుండా సమైక్యంగా పోరాడడం వలన తమ శక్తిసామర్థ్యాలను తెలుసుకుంటారు. ఆటంకాలను అధిగమించే మెలకువలను తెలుసుకుంటారు. పౌరులైన తరువాత, పాఠశాల భూమిని రక్షించుకున్నట్లే తమ దేశభూభాగాన్ని కూడా రక్షించుకుంటారు.

జనాభా విచ్చలవిడిగా పెరగడం వల్లనే ఇతరుల సొమ్ము మీద, ఇతరుల భూభాగం మీద ఆక్రమణలు జరుగుతాయనే విషయాన్ని వారు అర్థం చేసుకుంటారు.

బహుభార్యాత్వాన్ని నిరసిస్తారు. ఇద్దరిని మించి సంతానాన్ని కనరాదని తెలుసుకుంటారు. కొందరి కోసం అందరూ బాధపడరాదని అర్థం చేసుకుంటారు.

ఒక దేశంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండవలసిన తత్క్షణావసరాన్ని గుర్తిస్తారు.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...