Showing posts with label comparison. Show all posts
Showing posts with label comparison. Show all posts

Friday, 20 March 2020

సుగ్రీవుడు తెచ్చిన న్యూస్ పేపర్లు




అనగా అనగా రావణాసురుడు.

బ్రహ్మనుగూర్చి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోవయ్యా అంటే - దేవ, దానవ, గంధర్వ, యక్ష, రక్షః, సుర, అసుర, కిన్నర, కింపురుష, నాగ, పశు, పక్ష్యాదులు - వీరిలో నేను ఎవరిచేతిలోనూ చావకూడదు అని ఒక స్వతంత్రబలప్రతిపత్తిని కోరుకున్నాడు.

సరే, నీ చావు నువ్వే చావు అని బ్రహ్మ అతడు కోరుకున్న స్వతంత్రబలప్రతిపత్తిని వరంగా ఇచ్చేశాడు.

అపుడు అతడి పక్కన అతడి మేనమామ ప్రహస్తుడు చేరి స్వతంత్రబలప్రతిపత్తిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సలహాలు ఇవ్వడం మొదలు పెట్టాడు.

ఆ సలహాను అనుసరించి, రావణాసురుడు లంకనుండి తన సోదరుడైన కుబేరుడిని అతని అనుచరులను తరిమి వేశాడు. లంక నాకు ఎలాగో నీకు కూడా అలాగే, మనం అందరమూ కలసి లంకలో హాయిగా జీవిద్దాం అని కుబేరుడు నచ్చజెప్పినా కూడా వినలేదు. తరిమేశాడు. వెళ్ళని వారిని చంపేశాడు.

ఆ తరువాత రావణాసురుడు తన మేనమామ అదుపు తప్పిపోయాడు.  కాని ఆ మేనమామ ఊహించిన దానికంటె ఎక్కువగా విజృంభించి అందరినీ చావగొట్టటం మొదలుపెట్టాడు. బ్రహ్మ అతడికి స్వతంత్రబలప్రతిపత్తిని ఇచ్చాడు అని అందరూ అతడిని ఏమీ చేయలేక ఊరుకున్నారు.

రావణాసురుడి దురాగతాలు మరీ ఎక్కువ అయ్యాయి. రాజకన్యలను ఎత్తుకొచ్చాడు. ఋషికన్యలను ఎత్తుకొచ్చాడు. గంధర్వ కన్యలను ఎత్తుకొచ్చాడు. దేవకన్యలను ఎత్తుకొచ్చాడు. నాగకన్యలను ఎత్తుకొచ్చాడు. యక్షకన్యలను ఎత్తుకొచ్చాడు. ఇలా కంటికి అందంగా కనిపించిన ప్రతివారినీ ఎత్తుకొచ్చాడు.

బ్రహ్మ ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తి ప్రభావంతో అతడిని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. లంకలో జనాలకు ఇది చాల గొప్ప విషయంలా అనిపించింది. అలా చేయడం లంకారాజ్యానికి ఒక హక్కు అని వారికి అనిపించే స్థాయికి వారిని రావణుడు తీసుకుపోయాడు. అలా చేయడం తప్పు అని చెప్పే విభీషణుడు లాంటి వారు ఉన్నా, వారి గొంతు వినబడకుండా నొక్కేశారు.

ఒకసారి రావణాసురుడు రాముని భార్య అయిన సీతను గూర్చి విన్నాడు. తన స్వతంత్రబలప్రతిపత్తి విషయం రాముడికి కూడా తెలిసే ఉంటుంది, నన్ను ఏమీ చేయలేడు అనుకుని, సీతమ్మను కూడా ఎత్తుకొచ్చేశాడు. సీతమ్మ "ఉరే ఇది తప్పురా వెధవా, రాముడికి ఈ విషయం తెలిస్తే చంపేస్తాడురా" అన్నది.

"ఓ సీతా, రాజ్యం పోగొట్టుకున్న రాముడి గూర్చి ఇంకా ఆలోచన ఎందుకు? ప్రపంచంలోకెల్లా అందమైన నా లంకలో ప్రపంచంలోకెల్లా ఐశ్వర్యవంతుడనైన నా అండన నీవు బ్రతుకు" అన్నాడు రావణుడు. అసలు నిన్ను ఎత్తుకురావడం రాక్షసధర్మం. నా జన్మహక్కు పొమ్మన్నాడు.

అప్పుడు కూడా లంకాజనాలు రావణాసురుడు చేసిన పనిని మెచ్చుకున్నారు. లంక పరువునిలబెట్టాడు అని జేజేలు కొట్టే స్థాయిలో ఉన్నారు.

ఇంతలో రాముడికి సీత ఎక్కడ ఉందో తెలిసింది. దండెత్తి వచ్చాడు. లంకలో జనాలు గగ్గోలు పెట్టారు. రాముడు అలా రావడానికి వీల్లేదు అన్నారు.

మరి సీతను ఎందుకు ఎత్తుకొచ్చాడు రావణుడు? అని అడిగితే -

మరి హనుమంతుడు వచ్చి మా లంకను తగలబెట్టచ్చా? అని ఎదురు ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు.

రాముడు లంకకు వంతెన కట్టడం తప్పని, అలా కడితే బ్రహ్మ ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తికి భంగం కలిగించినట్టే అని వాదించడం మొదలు పెట్టారు.

"హనుమంతుడు వచ్చి అశోకవనం ధ్వంసం చేశాడు. అది తప్పు" అన్నారు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేస్తే హనుమంతుడు దాన్ని విడిపించుకుపోయి బ్రహ్మకు అవమానం చేశాడు, ఆ విధంగా లంక ప్రజల మనోభావాలను గాయపరిచాడు" అన్నారు.

ఈ లోపల లంక బయట ఉన్న రాక్షససమర్థకులు కొందరు నోరు విప్పి నినాదాలు చేయడం మొదలు పెట్టారు.

రాముడు శూర్పణఖ ముక్కు కోయడం తప్పు అన్నారు. ఖరదూషణులను చంపడం తప్పు అన్నారు. అసలు రాముడు దండకారణ్యానికి రావడమే పెద్ద తప్పు అన్నారు.

రాముడు తాటకను చంపడం తప్పు అన్నారు. రాముడు బంగారు లేడిని చంపడం తప్పు అన్నారు. విశ్వామిత్రుడి యజ్ఞాన్ని కాపాడడానికి రాముడు రావడం తప్పున్నర తప్పు, అలా చేయడం లంక ప్రజలను రెచ్చగొట్టడమే అన్నారు.

ఈవిధంగా రాముడు ఇన్ని తప్పులు చేయడం వల్లనే రాక్షసులు మరింత మరింతగా రెచ్చిపోయారు అని, ఈవిధంగా రాముడి వల్లనే మనుషులకు రాక్షసులకు మధ్యలో సత్సంబంధాలు అన్నీ బెడిసి కొట్టాయని అన్నారు.

అందువల్ల, మనుషులకు రాక్షసులకు మరలా మంచి సంబంధాలను నెలకొల్పే సత్సంకల్పంతోనే రావణుడు సీతను ఎత్తుకు రావలసి వచ్చింది అని, అందులో తప్పేమీ లేదని వాదించడం మొదలుపెట్టారు.

రావణాసురుడు ఎత్తుకొచ్చింది ఒక్క సీతనే కాదు కదా?  అంతకు ముందు కూడా చాలా మంది స్త్రీలనే ఎత్తుకు వచ్చాడు కదా, మరి ఆ స్త్రీలకు సంబంధించిన వారందరూ నిశ్శబ్దంగా ఊరికినే ఉండగా ఒక్క రాముడే ఎందుకు దండెత్తి వచ్చాడు?  ఊరుకున్న వాళ్లందరికీ న్యాయం తెలియదా?  ధర్మం తెలియదా? నఈ రాముడు మాత్రమే పెద్ద న్యాయం ధర్మం తెలిసిన పోటుగాడా? అని దుమ్మెత్తి పోయడం మొదలు పెట్టారు.

బ్రహ్మ గారు రావణాసురుడికి ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తిని భంగం చేయడానికి వీల్లేదు అని, అసలు రాముడిని సృష్టించినది కూడా బ్రహ్మేనని, సకలలోకాలనూ సృష్టించిన ఆ బ్రహ్మగారికంటే నిన్న గాక మొన్న పుట్టిన రాముడికి ఎక్కువ తెలుసా? అని ఏకి పారేయడం మొదలు పెట్టారు.

ఏ పరిస్థితులలో బ్రహ్మ అటువంటి ప్రతిపత్తిని రావణాసురుడికి ఇచ్చాడో కూడా తెలుసుకోలేక రాముడు దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నాడని అన్నారు.

లంక చుట్టూ తన సైన్యాన్ని నిలిపి, లంకానగరం మీద బాణాలు ఎక్కుపెట్టి, సీతను తిరిగి ఇమ్మని అడగడం ఏరకం ప్రజాస్వామ్యమని తీవ్రంగా ప్రశ్నించారు. ఈ విధంగా రాముడు దౌర్జన్యం చేస్తే, లంకకు ఒక రావణాసురుడు కాదు, ఇంటింటా ఒక రావణాసురుడు వెలుస్తాడు జాగ్రత్త అన్నారు.  ఆ రావణాసురుల పుట్టుకకు రాముడే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఇదంతా రాక్షసజాతి మీద రాముడు నిష్కారణంగా పగబట్టి చేస్తున్న దౌర్జన్యమే తప్ప మరొకటి కాదన్నారు.

రాముడికి రాజ్యవ్యామోహం ఎక్కువని, అందువల్లనే వాలిని చంపాడని ఆరోపించారు. మూర్ఖులైన వానరులు దాన్ని అర్థం చేసుకోలేక అతడిని ఫాలో అవుతున్నారని అన్నారు. రాముడితో చేతులు కలిపి వాలికి ద్రోహం చేసిన సుగ్రీవుడు, చివరకు తాను కూడా అదే గతిని పొందుతాడని అన్నారు.

రాముడిని దగ్గరగా చూసిన కైకేయికి రాముడి స్వభావం బాగానే తెలుసునని, అందువల్లనే అడవికి పంపించేసిందని అన్నారు. ఒక ఆడది గెంటించి వేస్తే దిక్కులేక అడవిలో పడ్డ రాముడు, లంక జోలికి పోతే రాక్షసులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

భరతుడు వచ్చి బ్రతిమాలినా రాముడు అయోధ్యకు వెనుతిరిగి పోకుండా ఉండటం రాక్షసులను రెచ్చగొట్టడం కోసమే తప్ప వేరు కాదన్నారు. నిజానికి అది దశరథుడి కొడుకులందరూ కలిసి ఆడిన నాటకమన్నారు.

విభీషణుడు లంకాద్రోహి అని, అతడివల్ల లంక సర్వనాశనం అవుతుందని, యుద్ధం ముగిసిన తరువాత రాముడు విభీషణుడిని, సుగ్రీవుడిని కూడా చంపేసి, ఇద్దరి రాజ్యాన్ని తానే ఆక్రమిస్తాడని, అయితే అప్పటికి తమకు జరిగిన మోసం తెలుసుకొనేందుకు రాక్షసులు, వానరులు ఎవరూ మిగిలి ఉండరని జోస్యాలు చెప్పడం మొదలు పెట్టారు. ఇలా నానా శాపనార్థాలు పెట్టారు.

బ్రహ్మగారు ఇచ్చిన స్వతంత్రబలప్రతిపత్తికి వీరందరూ వ్యతిరేకులని, రాక్షసజాతి ఔన్నత్యాన్ని తట్టుకోలేక అందరూ ఇలా కుమ్మక్కు అయి, లంక మీదకు దండెత్తి వచ్చారని అన్నారు.

ఆయా న్యూస్ పేపర్లలో పడిన ఈ వార్తలను సుగ్రీవుడు తీసుకొచ్చి రాముడికి చూపించాడు. అన్నీ చదివిన రాముడు చిన్న చిరునవ్వు నవ్వి, వాటిని పక్కన పడేసి, సుగ్రీవా, నువ్వు టైం ట్రావెల్ చేసి, రెండు యుగాలు ముందుకు పోయి ఈ పేపర్లు పట్టుకొచ్చినట్టున్నావు. అప్పుడు ఎంత ధర్మమైన విషయానికి కూడా కొందరు ఆలోచనాశూన్యులు, కార్యశూన్యులు ఇలాగే గొడవలు చేస్తారు. జస్ట్ ఇగ్నోర్ ఇట్. లెట్స్’ డూ వాట్ వీ హావ్ టు డూ’ అన్నాడు.

తరువాత జరగాల్సిందేదో జరిగింది. ఏమి జరిగిందో అందరికీ తెలుసు. సుగ్రీవుడు, విభీషణుడు, రాముడు హాయిగా ధర్మబద్ధంగా ఎవరి రాజ్యాలువాళ్లు పరిపాలించుకున్నారని ఎవరికి తెలియదో వారు చేతులు ఎత్తవచ్చు. లంక మాత్రం స్వతంత్రబలప్రతిపత్తి పీడను వదిలించుకుని స్వేచ్చగా బ్రతికింది.

Monday, 23 July 2018

నక్క ఉపవాసము

అనగా అనగా ఒక నక్క.
రోంత వయసు ముదురు నక్క.

ఆ నక్క ఒగు దినుము దినాముకట్లే ఆకలి తీర్చుకొనేకి తొండేబిక్కిల్ని, ఉడతలని యెదుకులాడుకుంటా బయలుదేర. దానికంటె ముందరే చిన్న నక్కలు వుషారు వుషారుగా వేటాడేసి కడుపు నింపుకుంటా కానొచ్చె. దీనికిమాత్రం తొండేబిక్కలు, ఉడతలు దొరక్కుండా తప్పిసుకుంటుండాయి. తన కండ్లముందురే కళ్లిచెట్టు బుడుముతాన బొక్కలోకి దూరి దాపెట్టుకున్న తొండేబిక్కిని ఎట్లైనా బయటికి యెల్లబీకల్లని మొన్ను తోగి తోగి దానికి మిగిలిన గోళ్లు కూడా సమిసిపాయ. తన చాటుమాల్నుండి చటుక్కున చెట్టుమిందికెగిరిన ఉడతని పండ్ల మధ్యన యిరికించుకోవల్లని దుంకితే దాని కోరలన్నీ మానులోకి ఇరుక్కుని అర్ధము యిరిగిపాయ.

ఇంత గోరుము జరిగినంక దాని బలమేమో దానికే అర్థమైపాయ. ఇంగ నాకి వయసైపాయరా, అందరితానా యేట్లాడి యేట్లాడి సంపాదిచ్చేది ఇంగ నాకి శాతకాదు అని తెలిసిపాయ. అది యిచారంగా బోయి అడివిలోన గుడికాడ కూకొనిడిశ. ఆ గుడితాన మనుషులు అపుడపుడు కోళ్లూ మేకలూ బలిచ్చి కోసుకుతింటాంటారు. అపుడు ఆడాడ యేమన్నా నేలబడింటే యేరుకుతినొచ్చు అని దాని ఆశ. కానీ, ఆ ఆశ కూడా నిరాశ ఐపాయ.

దావన బొయ్యే ఇంకో నక్క “ఏమిరా అల్లుడూ ఈడ ఇట్ల్నే మొగుము యేలాడదీసుకుని కూకునుండావు? ఈ పొద్దు తొలి ఏకాదశి, అందుకే ఈ పొద్దు ఎవరూ బలిచ్చేది లేదు, నీకు కడుపు నిండేదీ లేదు” అని జెప్పి దాని దోవకి అది బాయ.

కడుపాకలి తట్టుకోలాపుక ఆ నక్క ఇంగ బాగ ఏడిశిడిశ. ఇట్లా టైములో ఏమి చేయాల్నో నేను చదివిన రెండులక్షల పుస్తుకాలలో ఏ వొక్క పుస్తుకంలోనైనా ఉండునా అని బాగ ఆలోచన చేశ. అప్పుడుసగం చిరిగిన యెర్రట్ట పుస్తకంలో తాను చదివిన ఒగు విషయం దానికి నెప్పికొచ్చ.

ఏకాదశీ ఉపవాసవ్రతమాహాత్మ్యము! ఆ పొద్దు పూర్తిగా ఉపాసముంటే దండిగా పున్నెము వస్తాదంట. పున్నెము అంటే ఏమిడిదో దానికి రోంత రోంత తెలుసు. పిట్ట మాంసము, పుంజు మాంసము, మేక మాంసము – ఇవన్నీ కలిపి తింటే - అదీ పున్నెము అంటే! అంతకంటే గొప్ప పున్నెము ప్రపంచంలో యాడ్యాడా ఉండుదని ఆ పుస్తుకములాన ఘోస ఘోస పెట్టి ఉన్న్యారు. దానికి అవకాసము వచ్చింది గదాని, నక్కకి ఆ పొద్దు ఉపాసము ఉండాల్నని బుద్ది పుట్టిడిశ. యెట్లోగట్ల నెలకు రెండు దినాలు ఇట్ల ఉపాసముంటే ఇంక మిగిలిన దినాలన్నీ పున్న్యాలంటే పున్న్యాలు!

ఉపాసమున్నపుడు నీళ్లు దాగినా యేమీ వ్రతభంగం కాదని దానికి తెలుసును. దానికే దగ్గర్లో వుండిన యేటితాకి యెట్లో కాళ్లీడ్సుకుంటాబాయ. యేటి వొడ్డున అనుకోకుండా ఒక దృశ్యం చూసేతలికే దాని కండ్లు మిల మిల మెరిసిపాయ.

సన్న మేకపిల్ల వొగిటి ఆడ మే మే అని అర్సుకుంటా తిరుగుతాండాది. ఎట్ల్నో తప్పిపయినట్లుండాది. రాజుగారి తోటలోన మేతకు బోయి, రాణిగారి పూలచెట్లు మేత మేస్తూ, తోటమాలి కొట్టవస్తే తుర్రుమని కానొచ్చిన దిక్కులో పారి పారి వచ్చిన బుజ్జి మేక అదే! అట్లా దూరుం దూరుం పారి పారొచ్చి వాళ్లమ్మను కానకపాయ. అబుడు శాన బయమేసి నోటిలో ఉన్నశక్తినంతా ఉపయోగిచ్చి గొంతు వూడొచ్చేలా పిలుస్తాంటే అయ్యో పాపుమని యెవురికన్నా కనికరము బుట్టాల్సిందే!

పాపం ఆ బుజ్జి మేకపిల్ల రొంత సేపు ఆ యాకునీ ఈ యాకునీ వాసన జూస్తాది, అర్సతాది. రొంత ముందరకి పొయ్యి జూస్తాది, మళ్లీ యెనిక్కొచ్చి అర్సతాది. పొడుగాటి చెవుల్ని అట్లా ఇట్లా అల్లాడిచ్చుకుంటా తలకాయ తిప్పుతాది, అర్సతాది. రోంత సేపు వంకర టింకరగా అడ్డడ్డుము ఎగర్లాడతాది, అర్సతాది. రెండు గడ్డిపరకలు నముల్తాది, తలెత్తి మళ్లీ అర్సతాది. ఆడ ఒగ యెత్తైన రాయుంటే దాని మింద ముందరికాళ్లు పెట్టి నిలబడి తలకాయ అట్లా ఇట్లా తిప్పుకుంటా అమ్మ కనిపిస్తాదేమో అని దిక్కులు చూస్తాది, అర్సతాది. కాళ్లు నొచ్చుతాయేమో, రోంతసేపు నేలమీద పండుకుని ముకుము డొక్కలా పెట్టుకుంటాది. అంతలోనే, మళ్లీ పండుకుంటే పనులు జరగవని అంతరాత్మ ప్రబోధం జరిగినట్టు లేచి మళ్లీ అర్సతాది. పాపుము అది అట్లా అరిసేతప్పుడు సూడల్ల, నోట్లోంచి నాలుక రొవంత బయటకివచ్చి కానొస్తాది. మెడ ఎంత దూరుము సాచి అరిస్తే అంత దూరుము యినిపిస్తాది, అబుడుమా అమ్మ యాడున్నా పారి పారి నాతాకి వస్తాది అన్నట్ల ఆ సన్న మెడని ఇంత పొడుగు నీలిగిచ్చి నీలిగిచ్చి అర్సతాది. కండ్ల నిండా బయం బయం నింపుకుని అర్సతాది.

నక్క ఆ మేకపిల్లని చాటునుంచి దూరం నుంచి శానా సేపు సూసుకుంటా అట్ల్నే నిలబడినాది. వాళ్లమ్మ ఆడ్నే యాడ్నో వుంటాది, నేను తొందరపడి దాన్ని పట్టుకునేకి పోతే వాళ్లమ్మ వచ్చి నన్ను డొక్కలో కుమ్మి పారేస్తాది అని నక్క భయం నక్కది.
కాని, ఆ మేకపిల్ల యెంతసేపు అర్సినా వాళ్లమ్మ రాకపాయ. ఆర్సీ ఆర్సీ ఆ మేకపిల్ల అలిసిపాయ. నేలమింద పండుకుని ముకుము కడుపులాకి దూర్సుకునిడిశ.

శానాసేపైనా అది మళ్లీ లెయ్యకోకుండేది సూసి నక్క ఇదే మంచి అవకాశమురా దీన్ని పట్టుకునేకి అనుకునింది. మెల్లగా సప్పుడు కాకుండా దానిపక్క పొదల పక్కనే నక్కుకుంటా పాయ. వచ్చ, వచ్చ, దగ్గరకు వచ్చిడిశ! ఇంకా ఆడ్నే వుంది మేకపిల్ల. అమ్మే యెట్లోగట్ల నన్ని యెతుక్కుంటా వస్తాదిలే అనుకునిందో యేమో! అడివిలో గండాలు ఇట్లిట్లా వుంటాయని దానికి యేమి తెలుసు పాపుము?

నక్క ఊపిరి బిగబట్టుకున్య. రెండడుగులు ముందుకేసి ఒక్క దూకు దూకితే, ఇంగ ఆమేకపిల్ల తనదే! విందు భోజనమే! దేముడుండే స్వర్గానికి పోయినా కూడా అంత మంచి భోజనం యెవురూ పెట్టలాపురు అనిపించింది. ఒకటో అడుగు వేసింది. ఇంతలో గాలి వీచి, ఆకులు గలగలలాడినాయి. మేకపిల్ల తల యెత్తింది. నక్క చప్పున వంగి తలను భూమికి ఆనిచ్చిడిశ. పొద యెనుకనున్న ఆ నక్కను మేకపిల్ల కానక పాయ. కాని, యేమో అనుమానమొచ్చి అది అట్ల్నే లేసి నిలబడ. కాని, యాటికీ కదలకపాయ. అది తన దిక్కు చూడలేదని నక్క గమనిచ్చుకుని రెండో అడుగు ముందుకేశ. దాని దురదృష్టము, ఆడ గాలికి కొట్టుకొచ్చిన రెండు ఎండుటాకులు ఉండ్య. నక్క అడుగు పడగానే అవి కరకరమని శబ్దం చేసుకుంట యిరిగిపాయ. మేకపిల్ల చప్పున తలదిప్పి చూసిందీ, నక్కయెగిరి దానిమిందికి దుంకిందీ ఒకేసారి జరిగిపాయ.

కానీ, నక్క మేకపిల్ల మీద పడల్యా. నేలమీదనే పడింది. యేమిటికంటే, మేకపిల్ల దానికంటె ముందరే యెగిరి బండమీదకి దుంకింది. నక్కకి ఆశాభంగమైపాయ. మేకపిల్ల గూడా నక్కను కండ్లారా చూసిడిశ. అంతే! ఒక్కు క్షణుము గూడా ఆడ నిల్సుకోకుండా అట్ల్నే దుంకుకుంటా దుంకుకుంటా యేటిపక్కకి పార్య. నక్క ఆశ యిడిసిపెట్టలాపుక దాన్ని యెంటదరుముకుంట పాయ. యెదురుగ్గా పెద్ద సప్పుడు సేసుకుంటా జోరు జోరున పారుతున్న యేరుని చూసి మేకపిల్లకి బయమేసి పాయ. యెనిక్కి తిరిగేతలికే తనని పట్టుకునేకి పారి పారి వస్తుండిన నక్క కనబడ్య. అంతే! మేకపిల్ల ఇంకేమీ ఆలోచన చేయకుండా యెగిరి యేట్లోకి దుంకిడిశ.

అంతదంకన్నా పారి పారొచ్చిన నక్కకి దానెనికినే యేట్లోకి దుంకేకి దమ్ము లేకపాయ. అట్ల్నే దాన్ని తేరిపారజూసుకుంటా నిలబడుకొనిడిశ. బుజ్జి మేక యేట్లో బడి కొట్టుకుపోతా, అట్లా ఇట్లా కాళ్ళు అల్లాడిచ్చుకుంటా యెట్ల్నో మొత్తానికి అవతలి గడ్డకి పడ్య.

గడ్డకి పడినంక కడుపును అట్లా ఇట్లా అల్లాడిస్తే దాని బొచ్చునుండి నీళ్లన్నీ వానచినుకులా కట్ల టప టప రాలి పడ్య. అప్పుడది యెనిక్కి తిరిగి అవతలి గట్టున నిలబడిన నక్కను చూశ. నక్క గూడా దాన్ని సూసుకుంటానే ఉణ్ణింది. అప్పుడు బుజ్జిమేక ఒకసారి మెడ ముందుకు చాచి నాలుక కొంచెం బయటకు కనబడేలా మే మే అంటూ అరిచింది. ఆనెంక నక్క దిక్క తిరిగి చూడకుండా అరుసుకుంటా అట్ల్నే నడుసుకుంటా ఆదిక్క అట్లే పాయ.

నక్కకి మళ్లీ యేడుపొచ్చ. ఆ వొక్క క్షణం గాలి వీచకుండా ఉండివుంటే – ఆ వొక్క అడుగు తాను యెండిపోయిన ఆకుల మీద వేయకపోయి వుండివుంటే - ఈ పాటికి ఆ బుజ్జిమేక తన కడుపులో చేరి ఆకలి తీర్చి వుండేది! దేవుడు తనకు ఆ అవకాశం ఇవ్వలేదు!

దేవుడు అనుకునేతాలికే నక్కకు బిరీన నెప్పికొచ్చ... – తను సంకల్పించిన ఏకాదశీ ఉపవాసం గురించి. అరెరే! అనుకొన్య.

అవును సుమా! నేను దాని గూర్చి నేను మరిచే పోయినాను! ఈ పొద్దు నేను ఉపాసం ఉండాల్నని అనుకుంటి గదా! మరి ఈ మేక నాకు చిక్కింటే నాకు వ్రతభంగం అయితాండ కదా? అనుకుంది. పశ్చాత్తాపపడింది. నేను చేసింది తప్పే! అనుకునింది. లెంపలేసుకుంది. దేవుడికి క్షమాపణ చెప్పుకుంది. నువ్వే నాకు మేకను చిక్కకుండా చేసి నన్ను మహాపాపం నుండి కాపాడావని మెచ్చుకుంది. గుంజీలు తీసింది. నా బుద్ధిని యెప్పుడూ ఇట్లే సక్రమమార్గంలో నడిపిచ్చు తండ్రీ అనుకుంది. దాని మనసు తేలికపడింది. యెట్లో యేట్లో కాసిని నీళ్ళు గతికి, నెమ్మదిగా గుడి దగ్గరకు బయలుదేరింది.

ఇంతలో మళ్ళీ మే మే అని అరుపులు వినిపించాయి. వెంటనే గబా గబా పక్కనున్న గుట్టెక్కి చూసింది. మేకలమంద! అందులో ఒక మేక కంగారు కంగారుగా అటూ ఇటూ వెదుకుతోంది. బుజ్జిమేకవాళ్ల అమ్మ కాబోలు! నక్కకి నోట్లో నీళ్లు ఊరాయి. ఎన్ని మేకలు! ఎన్నెని మేకలురా దేవుడా! ఇన్ని మేకల్లో ఒక్కటైనా నాకు దొరక్కపోతుందా అనుకుంది. ఉపాసముంటానని దేముడికిచ్చిన మాట దానికి మళ్లీ మళ్లీ గుర్తుకొస్తోంది, పక్కనుండే పొదలో ముండ్లు మళ్లీ మళ్లీ గుచ్చుకుంటున్నాయి. హే, అంటూ ఆ ముండ్లను విదిలిచ్చుకుంటూ ఒక్కమేకనైనా ఎట్లా పట్టేది అని ఆలోచనలో పడింది.

దేవుడా, ఏకాదశి ఉపవాసం వదిలి రేపు ద్వాదశినాడు ఉపాసముంటాలే – ఎప్పుడు చేస్తే ఏముంది, ఉపాసం ఉపాసమే కదా! అని దేముడికి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది.

ఇంతలో హే హే అంటూ మనిషి గొంతు వినిపించింది. మెడ నిక్కించి చూసింది. మంద వెనుక చాలమంది కాపర్లు ఉన్నారు. వాళ్ల చేతుల్లో ఇంతింతలేసి దుడ్డుకఱ్ఱలు ఉన్నాయి. ఇంక నక్క అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేదు. దేముడా! ఇంక పోస్టుపోనుమెంట్లు లేవు. ఈపొద్దే నా ఏకాదశి ఉపవాసం కన్ఫాం చేసుకో అంటూ గుడిదిక్క పరుగులు తీశ.
***

((DISCLAIMER – ఈ కథ చదువుతున్నపుడు గాని, చదివిన తరువాత గాని, బుజ్జి మేకపిల్ల అంటే “రాజ్యసభ సీటు” అని ఎవరికైనా అనిపిస్తే నా బాధ్యత లేదు. ఏకాదశీ ఉపవాసం చేయడం అంటే “పార్టీ పెట్టి ప్రజాసేవ చేయడం” అనిపించినా సరే, నా తప్పు లేదు. నక్క ఎవరు అంటూ ఎవరూ నన్ను ప్రశ్నలు వేయవద్దు, మీ ఊహలకు నేను బాధ్యుడిని కాజాలను.))

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...