Showing posts with label Corona. Show all posts
Showing posts with label Corona. Show all posts

Friday, 3 April 2020

నీతో విభేదిస్తున్నాను తిరుమలా




నీతో విభేదిస్తున్నాను తిరుమలా.

కొవ్వొత్తులు వెలిగించమని మోదీ చెబితే తప్పేముందో నాకు అర్థం కాలేదు.

దేశంలోని ప్రజలందరూ సుదీర్ఘమైన లాక్ డౌన్ ఆవశ్యకతను అర్థం చేసుకున్న మాట నిజమే. కాని, అది ఆలస్యంగా ప్రకటించారని కొందరు, అది తమ మతానికి విరుద్ధమంటూ కొందరు రకరకాల అభిప్రాయాలను నిరసన వ్యక్తం చేశారు. ట్రోల్ చేశారు. నిరసనలు చేశారు. తిట్టారు.

అవును. మూర్ఖభక్తులు ఉన్నారు. చప్పట్లు కొట్టమంటే అత్యుత్సాహంతో రోడ్డెక్కి గందరగోళం సృష్టించారు. ఫలితంగా తిట్లు తిన్నారు. ఏం చేస్తాం? అనాదిగా ఇటువంటి కణ్ణప్పలు మన సమాజంలో సహజంగానే ఒక భాగం. మనం వారి మధ్యలో ఉన్నాము. ఇప్పుడు ఆయన కొవ్వొత్తులు వెలిగించమన్నారు. మునుపు తిట్లు తిన్న అనుభవంతో ఇప్పుడు ఎలా చేస్తారో చూడవలసి ఉంది.

మరి కొందరు మేధావులు ఊహించినట్లు మోదీ కొవ్వొత్తులు వెలిగించమంటే ఆయన కరోనాపై పోరాటంలో అలసిపోయి ఇక నాకు చేతకాదని చేతులెత్తేసి రాజీనామా చేస్తున్నట్లు కానే కాదు.

క్రింద ఒక ఫోటో ఇస్తున్నాను చూడు. ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ ప్రజలకు కరోనా సోకిన కేసులు సరాసరి 146 ఉన్నాయి. కాని, 138 మిలియన్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యంత జనసమ్మర్దం కలిగిన మన దేశంలో 1 మిలియన్ ప్రజలలో సరాసరి కేసుల సంఖ్య కేవలం 1.82 గా ఉన్నదంటే అది ఎంతటి గొప్ప Crisis/Disaster Management ఊహించు. అదే ఫోటోలో మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలలో కేసుల సరాసరిని గమనించు. దేశమంతటా ఆపత్కాలంలో తనకు పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయంతో మోదీ చేస్తున్న పోరాటంలోని సమర్థత అర్థమౌతుంది. చూశారా నా ఘనత అని మోదీ చెప్పుకోలేదు. దాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు.

మన ప్రజలకు సహనం చాల ఎక్కువ. కాని, ఆలోచన తక్కువ. ఇంతటి కష్టకాలంలో కూడా నిత్యావసరాలకు కొఱత లేదు. కొందరికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురైనా వెంటనే తగిన చర్యలు తీసుకొనడం జరిగింది. కాని, పనిగట్టుకుని వ్యాధిని వ్యాపింపజేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని తెలియడంతో ఏదో తెలియని ఆందోళనలో భయగ్రస్తులై ఉన్నారు. ఆ శక్తులను నిందిస్తే ప్రపంచప్రళయం వచ్చి సర్వనాశనం జరుగుతుంది కాబట్టి, ఎవరిని తిడితే బాగుంటుందని ప్రత్యామ్నాయం కోసం గాఢంగా ఎదురు చూస్తున్నారు. మోదీ దొరికాడు.

రామభక్తులు భారతీయులు కాజాలరు అని వివాదం రాజేయడానికి ఒక ఒవైసీ ప్రయత్నించాడు. కానీ జనాలు అతనిని చూసీ చూడనట్లు వదిలేశారు. మోదీ కొవ్వొత్తులు వెలిగించమన్నా మీద పడి తిడుతున్నారు. కొవ్వొత్తులే కదా వెలిగించమన్నది? కాని ఆయనేదో కత్తులు తీసుకుని ఎవరినో నరకమన్నంత ఘోరమైన ప్రసంగం చేసినట్లుగా భావించి ఎందుకు ఆయన మీద విరుచుకుపడుతున్నారు? ఎవడికి వాడు మహాకథకుడైై రకరకాల పిచ్చి ఊహలను సృష్టించి, అదే మోదీ ఉద్దేశమని ఆయనకు అంటగడుతున్నారు.

భారతీయత పట్ల మనసు నిండా ద్వేషం ఉంటే దాని గొప్పతనం పట్ల అసూయ ఉంటే ఎవరు ఏమన్నా దానిని ద్వేషించడం వెక్కిరించడం మనకు అలవాటైంది.

స్వచ్ఛభారత్ అంటే నవ్వారు. పరిశుభ్రత గొప్పతనం తెలుసుకోలేని లేదా చెప్పలేని మేధావులు దేశానికి ఎందుకు పనికొస్తారు?

యోగం అంటే నవ్వారు. ప్రపంచంలో ఉండే ప్రతివస్తువూ తన ఇంట్లో ఉండవలసిందే అని భావించే ఆశపోతుజనాలకు దాని గొప్పతనం ఎలా అర్థమౌతుంది?

ఇప్పుడు తన ప్రసంగంలో ఆయన ప్రజలకు ధైర్యం చెప్పారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేశమంతా నిజాముద్దీన్ తబ్లిగీ జమాత్ కారణంగా ఒక వర్గంపట్ల ద్వేషాన్ని పెంటుకుంటూ ఉంటే ఆ టాపిక్ ను డైవర్ట్ చేయడానికి, ప్రజలలో కాస్త శాంతియుతభావాన్ని పెపొందించడానికి (కనీసం తన మాటను మన్నించేవారిలోనైనా) ఆయన అలా చెప్పినట్లు నాకు అనిపించింది.

భారతదేశానికి ఆర్థికమాంద్యం వస్తుందనే నీ ఆందోళన అర్ధం చేసుకొనదగిందే. కాని, ప్రజలంటూ క్షేమంగా ఉంటే ఆ తరువాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు.

కొవ్వొత్తులు వెలిగించడం పాపకార్యమని, అది వెనుకబాటుతనానికి నిదర్శనమని, అలా చేస్తే నవ్వులపాలౌతామని ఎవరైనా భావిస్తే వారు నిరభ్యంతరంగా మానేయవచ్చు. పోలీసులు తలుపు తట్టి అరే నువ్వు ఎందుకు వెలిగించలేదురా అని వారిని బెదిరిస్తారు అనుకోను.

ఎవరి ఇంట్లోనైనా కొవ్వొత్తులు లేకుంటే వెలిగించడం మానేయండి. దానికోసం బయటకు వెళ్లి ప్రమాదంలో ఇరుక్కోకండి అని మాత్రం చెబుదాం. 

Tuesday, 24 March 2020

సెల్ఫ్ ఐసోలేషన్‌లో బీర్బల్




అక్బర్ తన రవీజల్‌ వుజారా (ముఖ్యమంత్రి) అయిన బీర్బల్ మాటకు ఎంతో విలువనిచ్చేవాడు.  

బీర్బల్ తెలివితేటలు కేవలం అక్బర్ చెంత మాత్రమే కాక మొగల్ సామ్రాజ్యం అంతటా ప్రఖ్యాతి గాంచాయి.  పాదుషా తరువాత పాదుషా అంతటి వాడిగా ప్రజలందరూ అతడిని గుర్తించి గౌరవించారు.

అయితే ఇది అక్బర్ గారి వ్యక్తిగత హల్లాకు (మంగలి) అయిన రజాక్‌కు నచ్చలేదు. బీర్బల్ వచ్చిన తరువాత అక్బర్ తన లొల్లాయి సలహాలను అంతగా పట్టించుకోకపోవడమే అందుకు కారణం.  

ఇటువంటి కడుపుసంకటం కేవలం రజాక్‌కు మాత్రమే కాదు.  అక్బర్ మహ్‌కమా‌ (సభ) లోని వారందరికీ కూడా ఉండింది.  వారందరూ  అక్బర్‌ను ప్రతిరోజూ కలిసే రజాకుతో కలిసి బీర్బల్ పీడను ఎలా వదిలించుకోవాలో బాగా ఆలోచన చేసి ఒక పథకం వేశారు.

ఆ పథకం ప్రకారం, 
ఒకరోజు రజాక్ సభకు వచ్చి "ఆలంపనా, ఆలంపనా, నాకు రాత్రి ఒక ముఖ్యమైన కల వచ్చింది" అని పాదుషాకు అందరిముందూ విన్నవించుకున్నాడు.



"అవునా?  ఏమిటా కల?"

"ఆలంపనా!  గతరాత్రి మీ అబ్బాజాన్ గారైన హుమయూన్ నా కలలోకి వచ్చారు."

అక్బర్ సంతోషపడ్డాడు.  "శభాష్!  నీ రాజభక్తి మెచ్చదగింది" అన్నాడు.

"కానీ, ఆలంపనా" అంటూ రజాక్ నసిగాడు.

అతడి ముఖాన్ని చూసిన అక్బర్‌కు అనుమానం వేసి,  "ఏమైంది రజాక్? మా అబ్బాజాన్‌కు ఏమైనా సమస్య వచ్చిందా?" అని అడిగాడు.

"జీ, ఆలంపనా" అన్నాడు రజాక్.  
"జన్నత్‌లో మీ అబ్బాజాన్ దిగులుతో ఉన్నారు.  తమకు ఇక్కడ  బీర్బల్ ఉన్నట్లుగా జన్నత్‌లో తనకు ఎవరూ సరైన సలహాదారు లేడని చాల బాధగా ఉన్నారు.  అందువలన వెంటనే బీర్బల్‌ను తన చెంతకు పంపి, ఇక్కడ మీరు వేరొకరిని చూసుకొనవలసిందిగా తమకు చెప్పమన్నారు" అని చెప్పేశాడు .

సభ నిండా హాహాకారాలు చెలరేగాయి.  "యా ఖుదా!  పాదుషా గారి అబ్బాజాన్‌కు ఎంత కష్టం వచ్చింది!" అని అందరూ ముక్తకంఠంతో విచారం వ్యక్తం చేశారు.

పాదుషా తన అబ్బాజాన్ మాటను తప్పక గౌరవించాలని అందరూ ఒత్తిడి చేశారు.

అక్బర్ బీర్బల్ వైపు చూశాడు. 



బీర్బల్ ఠక్కున లేచి నిలబడ్డాడు.  "జహాపనా!  ఈ సభలో మరెవ్వరికీ కలుగని అపురూపమైన అదృష్టం నాకు కలగడం నాకు ఎంతో ఖుషీకీ బాత్.  నేను తప్పకుండా జన్నత్‌కు పోయి మీ అబ్బాజాన్‌కు సలహాదారుగా ఉంటాను.  అయితే నా కుటుంబానికి వీడ్కోలు చెప్పేందుకు గాను నాకు ఒక వారం రోజుల వ్యవధిని ఇవ్వవలసింది" అని కోరాడు.

అక్బర్ అందుకు అంగీకరించాడు.  బీర్బల్ కుటుంబం యావజ్జీవితం సుఖంగా ఉండేందుకు తగినన్ని ధన కనక వస్తు వాహనాలను ముందుగానే ఇచ్చేశాడు.

ఈ వారం రోజులలో బీర్బల్ తన ఇంటి నుంచి పాదుషా తోటలోనికి రహస్యంగా ఒక భూసొరంగం తవ్వించాడు.  

వారం రోజుల తర్వాత తిరిగి వచ్చి, తోటలో ఒక స్థలాన్ని చూపి, "జహాపనా, మీ అబ్బాజాన్‌గారు నాకు కలలో కనబడి, ఇక్కడ నన్ను సజీవంగా పూడ్చిపెట్టమన్నారు.  అలా చేస్తే నేను నేరుగా జన్నత్‌కు చేరుకుంటానట" అని చెప్పాడు.

అక్బర్ అలాగే ఆ ప్రాంతంలో గొయ్యి తవ్వించి అందులో బీర్బల్‌ను దింపించాడు.  దాని పైన పలకలు వేసి అందమైన సమాధిని కట్టించేశాడు.

బీర్బల్ సొరంగం గుండా హాయిగా తన ఇంటికి చేరుకున్నాడు.  ఆరు నెలలు మరీ హాయిగా కడుపులో చల్ల కదలకుండా సెల్ఫ్ ఐసోలేషన్‌లో కాలం గడిపాడు.

తరువాత ఒక శుభముహూర్తాన అక్బర్ తన దర్బారులో ఉండగా విచ్చేశాడు.  ఇంత బారున జులపాలు, గడ్డం పెరిగి ఉన్న బీర్బల్‌ను ఎవరూ వెంటనే గుర్తుపట్టలేకపోయారు.

బీర్బల్ తనను తాను పరిచయం చేసుకునేసరికి గుర్తించిన అక్బర్ ఎంతో ఆనందపడ్డాడు.  

మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోయారు.   కుట్రదారులు భయపడ్డారు. 

బీర్బల్ సభలోని వారందరికీ జన్నత్ లోని అనేక విషయాలను కథలుకథలుగా చెప్పాడు.  బీర్బల్ జన్నత్‌కు వెళ్లి తిరిగి వచ్చాడు అనే విషయం అందరికీ ఖచ్చితంగా తెలిసిపోయింది.  

"బీర్బల్! ముందుగా ఈ విషయం చెప్పు - మా అబ్బాజాన్ గారు కులాసాగా ఉన్నారా?" అని పాదుషా అడిగాడు. 

"అంతా బాగానే ఉంది కానీ జహాపనా" అని బీర్బల్ నసుగుతూ రజాక్ వైపు ఒక చూపు చూశాడు.

ఆ చూపులో ఏం కనిపించిందో ఏమో గాని, రజాక్ నిలువెల్లా గజ గజ వణికి పోయాడు.




"చెప్పు బీర్బల్! అక్కడ మా అబ్బాజాన్ గారికి ఏదైనా ఇబ్బందిగా ఉన్నదా?"

"అవును జహాపనా!" అన్నాడు బీర్బల్, మునివేళ్ళతో తన గడ్డం నిమురుకుంటూ.  

"అదేమి జన్నతో గాని జహాపనా, అక్కడ  ఒక్క హల్లాకు (మంగలి) కూడా లేడు.  నేను కేవలం ఆరు నెలలు మాత్రమే జన్నతులో ఉన్నానా?  అయినా నా గడ్డం చూడండి, ఎంతగా పెరిగిపోయిందో!   అటువంటిది, ఇప్పటికే సంవత్సరాల తరబడి అబ్బాజాన్ గారు జన్నత్‌లో ఉంటూ ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకొని, మీ వ్యక్తిగత హల్లాకు అయిన రజాక్‌ను వెంటనే తన చెంతకు పంపమని మీకు చెప్పవలసిందిగా నాకు హుకం జారీ చేశారు" అని తాపీగా చెప్పాడు.

☠💀☠💀☠💀

ఆ తరువాత ఏమి జరిగిందో చదువరులే తమ తమ ఊహానుగుణంగా తెలుసుకొనగలరు.

🍎నీతి🍎
ఎంత కాలము సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నచో మనకు అంతగా బుద్ధిసూక్ష్మత పెరుగును.  కావున, సెల్ఫ్ ఐసొలేషన్ కాలమును దిగులు చెందక, సంతోషంగా, హాయిగా గడుపుదుము గాక!

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...