Showing posts with label Kalyanadurgam. Show all posts
Showing posts with label Kalyanadurgam. Show all posts

Tuesday, 4 January 2022

ఉష్ణకంటక లేదా కంటఫల

 


The Hindu (అక్టోబర్ 26, 2020) లో ఒక వార్త వచ్చింది.

ముంబై యూనివర్శిటీలో (ఎమ్మెస్సీ బోటనీ) చదువుతున్న ఒక విద్యార్థి సహ్యాద్రి పర్వతాలలో Echinops జాతికి చెందిన ఒక క్రొత్త రకం మొక్కను కనిపెట్టాడని, దానికి Echinops Sahyadricus అని పేరు పెట్టారని.
అరెరె. అదే మొక్కను నేను నిన్న మా చేని కంచెలో కనుగొన్నానే. Echinops Kalyanadurgicus అనే పేరు పెట్టే అవకాశం కోల్పోయాను కదా అనిపించింది.
కాని, తీరా చూస్తే Indian Medicinal Plants గూర్చి మంచి పరిశోధన చేసినవారందరూ ఇది భారత-ఉపఖండమంతటా సముద్రమట్టానికి 1500 మీటర్ల ఎత్తులోపల తరచు కనిపిస్తూ ఉంటుందని స్పష్టం చేశారు.
)))ఉష్ణకంటక (కంటఫల)(((
మా చేని కంచెలో ఈ అందమైన పూల చెండు కనిపించింది. ఇదేమై ఉంటుంది అని వెతికితే దీనిని గురించి కొన్ని విశేషాలు తెలిశాయి. దానిని ఇంగ్లీషులో Echinops Echinatus అని, సంస్కృతంలో ఉష్ణకంటక లేదా కంటఫల అని అంటారట.
ఈ గుల్మానికి బాగా ముండ్లు ఉండటం వల్ల కంటకఅనే పేరు వచ్చినట్టుంది. ఎంతగా ఎండ ఉంటే అంతగా ఇది పెరుగుతుందట. అందువల్ల ఉష్ణ అనే పేరు తగిలించారు కావచ్చు. రెండూ కలసి ఉష్ణకంటక అనే పేరు పెట్టారేమో. (ఏమో – నా ఊహ మాత్రమే)
ఇంగ్లీషులో Indian Globe Thistle అని వ్యవహారం కూడా ఉందట. గుండ్రంగా ఉన్నది కాబట్టి Globe అని, ముండ్లతో కూడి ఉన్నది కాబట్టి Thistle అని అలా అంటారు కాబోలు.
కన్నడభాషలో బ్రహ్మదండి అంటారు అన్నారు కాని, ఇది బ్రహ్మదండి కాదు. ఇది, బ్రహ్మదండి సజాతీయమైనవి కావచ్చును. అంతవరకే.
ఇది నూరు సెంటీమీటర్ల ఎత్తు పెరిగే వార్షికపు మొక్క అన్నారు కాని, నేను చూసినది నాకంటె ఎత్తైన మొక్క.
ఇది డిసెంబరు - జనవరి మాసాలలో పుష్పిస్తుందట. అందువల్లనే జూలై నుండి నవంబరు వరకు ఎప్పుడూ ఇది నా కంటబడలేదు. డిసెంబరులో కూడా కనబడలేదు. చివరకు జనవరిలో మాత్రం నా కంటబడకుండా తప్పించుకోలేకపోయింది.
మన భారతీయఆయుర్వేదులు కనుగొన్న ప్రకారం, ఇది Anti flammatory అట. అంట కాలిన గాయాలను, వాపులను తగ్గించే గుణం కలిగినదన్నమాట. ఇది Tonic కూడా అట. అంటే బాగా ఆకలిని పుట్టించి తద్ద్వారా బలాన్ని కలిగించేదన్న మాట. ఇది Diuretic అట. అంటే మూత్రవర్ధకం, రక్తంలో నీరు చేరుకొంటే దానిని తొలగిస్తుంది. రక్తనాళాలలో ప్రవహించే ద్రవాన్ని తగ్గించి, తద్ద్వారా రక్తపు పోటును (BP) నివారిస్తుంది. Antipyretic అట. అంటే జ్వరనివారిణి. Analgesic అట. అంటే నొప్పులు తగ్గించేది. Aphrodisiac అట. అంటే ధాతువృద్ధిని కలుగజేసేది. ఇంకా, కాలేయాన్ని చురుకుగా పని చేయిస్తుందట. కీళ్ల నొప్పులను పోగొడుతుందట.
పొడిదగ్గుకు (Hoarse cough), అపస్మారానికి (Hysteria), అజీర్ణానికి (Dyspepsia,) గండమాల అనే కుష్టుకు (Scrofula), కండ్లకలకకు (Opthalmia), ఇది మంచి ఔషధం.
కేవలం కొమ్మలకు ఆకులకు మాత్రమే ఈ విధమైన ఔషధగుణాలు ఉన్నాయనుకోకండి, వీటి వేళ్లు కూడా వైద్యప్రయోజనాలు కలిగినవే అంటున్నారు. వీటి వేర్లను పొడి చేసి తలకు రాసుకుంటే పేలు తొలగిపోతాయట. రాజస్థానంలోని భిల్లులు వీటి వేర్లను నీటిలో వేసుకుని, దగ్గుకు జలుబుకు మందుగా త్రాగుతారట. గుజరాత్, భావనగర్ ప్రాంతపు జనాలు వీటి వేళ్లను పొడి చేసి, దానిలో నీటిచుక్కలు కలిపి, తేలుకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారట. అది నీటిలో కలుపుకుని త్రాగితే బేదులకు కూడా మంచి మందని ఆంధ్రప్రదేశ్ లోని కోలాములు కనిపెట్టారట. సంతానం లేని వారికి సంతానం కూడా కలిగిస్తుందని ఆయుర్వేదవైద్యులు అంటారట.
ఓహో, ఇంత గొప్ప మొక్క మా చేను కంచెలో సహజంగా ఆవిర్భవించడం చాల గొప్ప విషయం కదా? కాని, దాని గొప్పతనమేమిటో ఈరోజే నాకు తెలిసింది. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదనే సామెత నాలాంటి వారు ఉండటం వల్లనే పుట్టిందేమో.
ఈ క్రింది లింకులలో మరింత బాగా ఈ మొక్కను గూర్చి తెలుసుకోవచ్చును.
రైతులు ఇటువంటి పొదలు తీగలతో కూడిన సహజమైన కంచెలను అనాలోచితంగా, వేలం వెర్రిగా తొలగించి, కృత్రిమమైన ఇనుపతీగల కంచెలను వేసుకొనడమనే పనిని మానుకోవాలి.
రైతులతో పాటు జీవవైవిధ్యం వర్ధిల్లాలి.
పుష్యశుక్లద్వితీయా, ప్లవః

Wednesday, 26 December 2018

కల్యాణదుర్గం పూటకూళ్లవ్వ కథ



కొన్ని వందల సంవత్సరాల క్రితం...
కల్యాణదుర్గం ముఖద్వారం. సూర్యాస్తమయం కావస్తోంది.


కోట పై బురుజున ఉన్న కాలగణనయంత్రం సూచన ఇవ్వగానే అక్కడి భటులు ఆరు గంటలు మ్రోగించారు. ద్వారం వద్ద ఉన్న కావలి వారు వాకిలి మూసేందుకు సంసిద్ధులయ్యారు. గంట మ్రోగిన ఐదు నిమిషాలలో ఖచ్చితంగా వాకిలి మూతబడవలసిందేనని రాజాజ్ఞ. అందువలన కోట లోపలి పోవలసిన వారు పరుగు పరుగున వస్తున్నారు. "బిరీన రాండి, బిరీన రాండి" అంటూ భటులు వారిని తొందర పెట్టి, కనబడుతున్నవారిలో చివరి వ్యక్తి లోనికి రాగానే తాము కూడా లోనికి వెళ్లి వాకిలి బిగించేశారు.

అలా బిగించిన కాసేపటికి గుఱ్ఱాలు నురగలు కక్కుతూ ఉండగా ఓ పెద్దాయన, ఆయనతో పాటు మరో నలుగురు యువకులూ స్వారీ చేసుకుంటూ వచ్చారు. "ఓ కావలివాండ్రూ! కాస్త వాకిలి తీయండయ్యా! అనుకోకుండా ఆలస్యమైపోయింది!" అన్నాడా పెద్దాయన కోటగోడపై కనిపిస్తున్న భటులతో.

"క్షమించండి సామీ, మళ్ళీ పొద్దున్నే వాకిలి తెరిచేది! రాజాజ్ఞ!" అన్నారు వారు.

"మా ఆలస్యానికి సుంకం చెల్లిస్తామయ్యా. మీ రాజుగారి ఖజానాకు లాభమే కదా!" అన్నాడాయన.
"మా కోటలో అట్లాంటి సుంకాలేమీ లేవు. మళ్ళీ రేప్పొద్దు పొడిసినంకే తెరిసేది! అప్పుడు రాండి" అన్నారు కావలి వాళ్ళు.

"యాంపా? అంతసేపు రాత్రంతా సల్లో మేము యాడుండేది?" అన్నాడో యువకుడు నిస్సహాయతను కనబరుస్తూ.

"రొవంతట్ల పడమటికి కూతవేటంత దూరం పోండి. ఆడొగ పూటకూళ్ళవ్వ వుండాది. మీయాకట్లోళ్లందురూ రాత్రికి ఆడుండి పొద్దునే వస్తుంటారు".

"సరేనపా, అట్లైతే అట్లే జేస్తాంలే" అన్నాడు ఆ పెద్దాయన. ఆయన, ఆయనతో పాటు వచ్చిన నలుగురు యువకులు ఆ పూటకూళ్ళవ్వ ఇంటికి చేరుకున్నారు.

పూటకూళ్ళవ్వ వారికి ప్రేమతో స్వాగతం పలికి, అప్పటికప్పుడు వంట చేసి వారికి కడుపు నిండా అన్నం పెట్టింది. అప్పుడు వారిని అడిగింది - "ఎక్కడ ఎంత పని ఉన్నా పొద్దుముణిగేతలికే కోటలోపలికి పోవల్ల గదా? మడి ఏమిటికాలస్యమైంది?" అని అడిగింది.

"యెబుడూ పొద్దుముణిగేతలికే వస్తుంటిమి అవా! ఈపొద్దు దావలో కొందురు దొంగోళ్లు నామిందకొచ్చినారు. అబుడు ఈ పిల్లోళ్ళొచ్చి వచ్చి నన్ను కాపాడినారు" అన్నాడు ఆ పెద్దాయన.

"అవునా! ఏమప్పా మడి నువ్వు సూస్తే సావుకారాకట్ల ఉండావు. ఈ పిల్లోళ్ళు సూస్తే యాదో బతుకెదుక్కుంటా తిరుగుతున్నట్ల ఉండారు. నువ్వేమన్న జేసి ఈ పిల్లోళ్ల బొదుకు నిలబెట్టరాదా?" అని అడిగేసింది పూటకూళ్ళవ్వ.

"అట్లేమడగొద్దు లేవా! ఈయప్ప కూడా అట్లే జెప్పి మమ్మల్ని ఎనకేసుకొచ్చినాడు. మేము ఈయప్పని కాపాడినామని శానా మురిసిపోయి రమ్మంటే సరేనని వొచ్చినాము" అన్నాడొక యువకుడు నవ్వుతూ.

"అవునా! సరే, మంచోడేలే ఈయప్ప! వొప్పుకుణ్ణ్యాను. మడి మీ కథ ఏమి, చెప్పండి."

"నా పేరు ప్రతాపుడు. మావూరు గుమ్మఘట్ట."
"నా పేరు తపనుడు. మావూరు రంగసముద్రం."
"నాపేరు పద్మనాభుడు. మావూరు చిన్నపల్లి."
"నాపేరు జయవంతుడు . మావూరు జయపురం".

"సరే, యాటికిట్లా బయల్దేరినారు?"

"ఇంకేమిటికవా? యాడన్నా యేమన్నా వుజ్జోగం జిక్కితే సేసుకుందామని రాజధానికి బయల్దేరినాము. దావలో ఈ పెద్దాయప్ప దొంగులకు చిక్కి కానొచ్చ. కాపాడితిమి. వొరే పిల్లోండ్లూ, నాతో రాండ్రా, యాడన్నా వుజ్జోగం యేపిస్తానంటే సరే పదాని యిట్లా ఆయప్పెనికినే వచ్చినాము."

"బాగుందే మీ కథ! యాంపా పెద్దమనిషీ, మడేమి వుజ్జోగమిప్పిస్తావప్పా యీ పిల్లోండ్లికి?"
"యాదో వొగుట్లేవా! ఆయప్ప ఆ మాట అనే తలికే మాకు ప్రాణాలు లేచొచ్చినయ్!" అన్నాడు జయవంతుడు.

"సరే, యింక అందరూ పండుకోండి. పొద్దునే పోదురంట!"

"సరే, మడి నీ కథ యేందవా? జనాలందరూ కోట లోపల్నే వుంటే నువ్వేమిట్ల కోట బయల్లో గుడిసేసుకోనుండావు? దొంగలు రారా? బయమేసెల్దా?"

"దొంగలు కూడా మనుషులే కదా? వాళ్ళు కూడా ఇంత బువ్వ తినిపోతారు. నాదగ్గర ఏముందని వాళ్ళు దోసుకుపొయ్యేకి?" అంది అవ్వ నవ్వి.
*****
పొద్దు పుట్టగానే ఆ పెద్దమనిషి వెనక కోటలోనికి పోయాక గాని ఆ యువకులకు తెలిసిరాలేదు, తాము కాపాడింది సాక్షాత్తు కళ్యాణదుర్గం ప్రభువైన తిమ్మరాయుడిని అని. ఆయన ఒంటరిగా ప్రజల మంచిచెడ్డలను తెలుసుకొనేందుకు మారువేషంలో కోట బయటకు వెళ్లి వస్తూ ఉండగా దారిలో దొంగలు దాడి చేయడం తాము ఆయనను కాపాడడం యాదృచ్ఛికంగా జరిగిపోయింది.

వారంతా సంభ్రమాశ్చర్యాలతో, భయభక్తులతో తెలియక అనుచితంగా ప్రవర్తించినా, మాట్లాడినా క్షమించమని కోరారు. తిమ్మరాయడు నిండు సభలో ఆ నలుగురు యువకులు తనను దొంగలబారినుండి కాపాడిన వైనాన్ని తెలియజేసి కృతజ్ఞతగా వారికేమి కావాలో కోరుకోమన్నాడు. వారు "తమ కొలువులో ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తే అదే చాలు" అన్నారు.

"సరే లెండయ్యా! ఉద్యోగం ఎట్లాగూ ఇస్తాను. అది కాకుండా, మీకు ఇంకేం కావాల్నో కోరుకోండి" అన్నాడు ప్రభువు.

"మా వూర్లో నాకొక మంచి ఇల్లు కావాలి" అన్నాడు ప్రతాపుడు.

"ఓయీ భవననిర్మాణమంత్రీ! రాబోయే పండుగ లోపు ప్రతాపునికి ఒక అద్భుతమైన ఇల్లు కట్టించి గృహప్రవేశం చేయించాలి" అన్నాడు ప్రభువు.

"చిత్తం ప్రభూ!"

"కళ్యాణదుర్గం నుండి మా వూరికి మంచి రహదారి కావాలి ప్రభూ, మావూరి ప్రజలకు మంచి సౌకర్యంగా ఉంటుంది." అన్నాడు తపనుడు.

"ఓయీ రహదారుల మంత్రీ! ఏ కాలంలోనైనా చెక్కుచెదరని చక్కని రహదారి ఒక నెలరోజులలో వేయించు." అన్నాడు ప్రభువు.

"చిత్తం ప్రభూ!"

"నాకు మంచి కుటుంబంలో పిల్లను చూసి పెళ్లి చేయండి ప్రభూ!'' అన్నాడు కాసింత సిగ్గుతో, పద్మనాభుడు.

"ఏమయ్యా జనసంక్షేమశాఖామంత్రీ! మీ అమ్మాయికి యోగ్యుడైన వరుడు కావాలని వెదుకుతున్నావు కదా! ఇటువంటి పరాక్రమశాలికంటే యోగ్యుడు ఎక్కడుంటాడయ్యా! వధువుకు, ఆమె తల్లికి ఇతనిని చూపించి, ఎవరికీ అభ్యంతరం లేకుంటే ఇతనికిచ్చి పెళ్లి చేయొచ్చు కదా!" అన్నాడు ప్రభువు.

"చిత్తం ప్రభూ!"

"ప్రభూ, ప్రతియేటా ఒకసారి తమరు మావూరికొచ్చి నా యింట భోంచేసి పోవాలి. ఇదే నా కోరిక" అన్నాడు జయవంతుడు.

అందరూ అది విని ఆశ్చర్యపోయారు. వీడేమి తిక్కలోడురా? ప్రభువంతటి ప్రభువు అనుగ్రహించి వరం కోరుకొమ్మంటే ఇలా అడిగేశాడు అనుకున్నారు. తిమ్మరాయప్రభువు మాత్రమే చిరునవ్వు నవ్వి సరే అన్నాడు.

ఆ తరువాత జయవంతుని కోర్కెను నెరవేర్చే పనిలో పడ్డారు రాజోద్యోగులు. జయవంతుని స్వగ్రామమైన జయపురానికి ప్రభువుగారి రాకపోకలు సౌకర్యంగా ఉండడం కోసం చక్కని రహదారి వేశారు. సాధారణంగా ప్రభువుగారితో పాటు ఆయన పరివారం కూడా వస్తుంది. వారందరికీ మంచి విడిది అవసరం. కాబట్టి, జయపురంలో గొప్ప భవనం కట్టి, దాని చుట్టూ గుఱ్ఱాలు, ఏనుగులు, భటులు విశ్రమించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రభువు గారికి ప్రభువుల ఇండ్లలో మాత్రమే భోజనం చేసే నియమం ఉంది. అందువల్ల జయవంతుని జయపురానికి, చుట్టుపక్కల గ్రామాలకు ప్రభువుగా ప్రకటించేశారు. బ్రహ్మచారి ఇంట ప్రభువు భోజనం చేయడం చిన్నతనం. కాబట్టి జయవంతునికి మరొక ప్రభువుల పిల్లను తెచ్చి పెళ్లి చేశారు. అప్పటికి గాని అందరికీ తెలియలేదు జయవంతుని కోరికలోని అంతరార్థం. 
***

మీకేమైనా సందేహం వచ్చిందా? జయవంతునికి వచ్చింది.
***

జయవంతునికి రోజులు బాధ్యతాయుతంగా, సుఖంగా, హాయిగా గడుస్తుండగా ఓరోజు -
"మరి - ప్రభువుల ఇండ్లలో మాత్రమే భోంచేసే ప్రభువు ఆరోజు రాత్రి పూటకూళ్ళవ్వ ఇంట ఎలా తిన్నాడు?" అనే సందేహం వచ్చింది.

వచ్చిందే తడవుగా పూటకూళ్ళవ్వ గుడిసెకు పోయి - "అవ్వా! నీకెవ్వరూ లేరు కదా? మావూరికొచ్చేయ్. నాతో పాటు ఉండిపో" అని అడిగాడు.

అపుడా అవ్వ నవ్వి,
"నాయనా జయవంతా! వొగు ముప్పై యేండ్ల ముందర మేము కూడా కోటలోనే వుంటిమి. నా కొడుకూ, వాళ్ళప్పా వొగుసారి యిట్లే బయటికి పొయ్యి లోనికొచ్చేతలికే వాకిలి మూసేసిండ్రి. వాళ్ళు అట్లే బయట్నే ఉంటే రాత్రి వాళ్ళని మెకాలు ఈడ్సుకుపోయి తిన్న్యాయి. అబుట్నుంచి మాయా కట్ల కష్టం ఎవురికీ రాగూడదని నేను ఇట్లా కోట బయట మా చేన్లో గుడిసేసుకుని ఉండాను.

ఈ విషయం తిమ్మరాయ ప్రభువుకు తెలిసింది. ఆయన చాలా బాధపడినాడు. ఇబుడు నువ్వొచ్చినట్లే అబుడు ఆయప్ప కూడా వచ్చి కోటలో తన యింట్లోనే తనకు తల్లిలా ఉండమని బ్రతిమలాడినాడు. అయినా నేను ఒప్పుకోలేదు. కోట వాకిలి పొద్దుమునిగే తలికి వేసి తీరల్ల! ఆ నియమాన్ని దాటేకి లేదు. చివరకు అలా ఆలస్యంగా వచ్చింది స్వయంగా ప్రభువైన సరే, కోట తలుపు తీయరాదు అని కఠిన నియమం!

కానీ కొందరు అదృష్టం బాగులేనోళ్ళు రాత్రికి బయటే వుంటే వారి గతి ఏమి కాను? అందుకే నేను కోట బయటనే గుడిసెలోనే ఉంటానంటిని. ప్రభువు చేసేదేమీ లేక సరేననె. కానీ, వచ్చినోళ్ళకి నేను యెట్లో వండిపెడతాను గాని దానికి అవసరమైన గింజలూ అవీ ఎట్లా సంపాదిచ్చేది? అందుకే, అవన్నీ తిమ్మరాయప్రభువే నాకు పంపిస్తాంటాడు. ఆయప్ప నెలకొగసారైనా వచ్చి నేను వొండింది తిని పోతాంటాడు. నేను వాళ్ళ అమ్మనంటాడు. ఆయప్ప యా వేషంలో వచ్చినా నాగ్గొత్తే కానీ కొత్త కాదు. దానికే ఆపొద్దట్ల మీ పిల్లోళ్ల బొతుకు నిలబెట్టమని ఆయప్పని అట్లా అడిగినాను." అని మొత్తం కథ అంతా చెప్పింది.

"అవ్వా! ఇపుడు అర్థమైంది. ప్రభువుల ఇండ్లలో తప్ప యాడా తినని రాజు నీ చేతి వంట ఎట్లా తిన్నాడో! నువ్వు మహా యోగినివి! ప్రభువులకన్నా గొప్పదానివి!" అంటూ పాదాభివందనం చేశాడు జయవంతుడు.

{ Disclaimer: రాజును రక్షించిన యువకులు అనే ఒక చిన్న పాత చందమామ కథకు మా కళ్యాణదుర్గం కథ పూటకూళ్ళవ్వ కథ కల్పించి ఏదో సరదాగా వ్రాశాను సుమా! మళ్ళీ నిజమనుకొనేరు!  }
Photo Credits: Internet

Tuesday, 18 December 2018

శెట్టూరు వారిదప్ప కథ

ఎర్రనేల చేను. అక్కడ బలిష్ఠులైన వస్తాదుల్లాంటి మనుషులు గునపాలు, పారలు, తట్టలు ముందేసుకుని కూర్చుని ఉన్నారు. వారి మధ్యలో వారిదప్ప దిగులుగా కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కనే అతని భార్య దిగులుగా కూర్చుంది. వారి బిడ్డ వారిద్దరి మధ్య దిగులుగా కూర్చుంది.
ఎవరూ మాట్లాడటం లేదు. అందరూ నిశ్శబ్దంగా మౌనవ్రతం పాటిస్తున్నట్టు ఉన్నారు. ఏమైంది? వారికేమైంది? జరిగిన విషయం తెలుసుకుంటే గాని, వారి అయోమయపు అవస్థ ఏమిటో అర్థం కాదు. పదండి తెలుసుకుందాం.
<><><>

వేసవి కాలం. చిటపటలాడిస్తున్న ఎండ. వేడిగా వీస్తున్న గాలి. క్రింద ఎర్రనేలపై కణకణలాడుతున్న చిన్నా పెద్దా రాళ్లు. నెత్తి మీద ఒక నీళ్ల కడవను మోస్తూ ఆ రాళ్లమీద ఒక స్త్రీ జాగ్రత్తగా నడుచుకుని వస్తోంది. ఆమె ప్రక్కనే ఒక పదేండ్ల పిల్ల కూడా చిన్నపాటి మరో కడవలో నీళ్లు మోసుకొస్తోంది.
ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. "మాట్లాడితే అందుకు వొంట్లో ఉన్న కొంత శక్తి ఖర్చు అవుతుందేమో, దానిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి" అన్న పట్టుదలతో ఉన్నట్లు నిశ్శబ్దంగా నెమ్మదిగా నడుస్తున్నారు.



అప్పుడప్పుడు ఆ పిల్ల, "అమ్మా! మోసి మోసి తలకాయ నస్తా వుంది" అంటే కాసేపు ఆగి, బరువు దించుకుని మరలా తలల మీదికి ఎత్తుకొని బయలుదేరుతున్నారు. పాపం, ఓ చెట్టు క్రింద నీడలోనైనా ఆగుదామంటే, చుట్టుపక్కల అక్కడక్కడ చిన్న చిన్న పొదలే తప్ప, చెట్లే లేవాయెను!
ఇంతలో ఉన్నట్టుండి రాళ్లకు తట్లుకొని ఆ పిల్ల ముందుకు తూలి పడినంత పని అయింది. "ఇట్లైతే దెబ్బలు తగులుతాయి పాపయ్యా, నీకేమన్నా అయితేగిన మీ యప్పకి పానం బోతాది. యాడన్నా ఉన్నీలే, ఆ నీళ్లు పారబోసి ఉత్త కడవ మోసుకురా. నాతానుండే నీళ్లు సాలు" అంది ఆమె.
"లేదమ్మా! ఈట్నుంచి సక్కగా నడుస్తాలే" అంది ఆ పిల్ల.
తల్లి కంట్లో చిన్న నీటి తెర పరచుకుంది. అట్లే తుడుచుకుని ముందుకు నడిచింది. ఆ పిల్ల అనుసరించింది.
ఇంతలో వారికి దూరం నుండి గుఱ్ఱాల డెక్కల చప్పుడు వినిపించింది. ఇద్దరూ ఒక్క క్షణం ఆగి ఆ వైపు చూశారు. ఇద్దరు రౌతులు తమవైపే వస్తూ ఉండటం కనిపించింది.
"ఎవరమ్మా వారు?"
"ఏమో పాపయ్యా!"
వారు చూస్తూ ఉండగానే ఆ రౌతులు వారి వద్దకు వచ్చారు. వారి దగ్గర ఉన్న కత్తులను చూసేసరికి తల్లీకూతుళ్ళిద్దరికీ భయం వేసింది. కానీ వారు మాత్రం వీరి భయాన్ని పోగొట్టేందుకన్నట్టు చిరునవ్వు నవ్వారు. వారి ముఖాలు సౌమ్యంగా, ప్రశాంతంగా ఉన్నాయి. తల్లీకూతుళ్ళిద్దరికీ భయం వేసినంతసేపు పట్టలేదు, ఆ భయం పోవడానికి.
"ఎవరమ్మా మీరు? పాపం చాలా దూరం నుండి నీళ్లు మోసుకువస్తున్నట్టున్నారు?" అన్నాడు వారిద్దరిలో ఒకాయన.
"అవును అన్నా, కరువు కాలం కదా, వానలు పడక మూడేండ్లాయె. పంటల్లేక జనమంతా మా వూరిడిసి పాయిరి. మా చేనితాన నీళ్లు లేవు. వీళ్ళయ్య ఆడ బాయి తోగుతాండాడు. ఆయప్పకి నీళ్లు కొండబోతాండాము."
"బాయి తోగుతాండారా? ఆడ నీళ్లు పడకోకుంటే ఏమి జేస్తారు మడి?" అన్నాడు రెండో ఆయన.
"పడతాయి అన్నా, వీళ్ళయ్యకి నీళ్ల శాస్త్రుము తెలుసు. ఆరు మొట్లులో నీళ్లు పడతాయన్న్యాడు."
"నీళ్ల శాస్త్రం తెలుసునా?" అన్నాడు మొదటి ఆయన. "అయితే నీళ్లు పడతాయా మరి?" అని అడిగాడు చిరునవ్వుతో.
"ఊ, పడతాయి!" అన్నది ఆ చిన్న పిల్ల కళ్ళలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుండగా.
"సరే పదప్పా, ఆ వింత ఏమిటో చూద్దాము మనం కూడా" అన్నాడు మొదటి ఆయన.
***

తన భార్యాబిడ్డలు పరిచయం చేయగా వారిదప్ప తవ్వకం పని కాసేపు ఆపి, ఆ ఆగంతుకులకు స్వాగతం పలికాడు. వారిదప్ప భార్య పరచిన తుంగ చాప మీద ఎండలోనే కూర్చున్నారు వారిద్దరూ.
"ఏమప్పా, నీకు నీళ్ల శాస్త్రం తెలుసునంట కదా! మడి మూడేండ్లనుండి కరువుంటే ముందరే బాయి తోక్కొని ఏంటికి సేజ్జెం సేసుకోకుపోతివి?"
"ఈ సేన్లోనే గాని, ఈ సగాల్లో యేడ్యాడా నీళ్లు లేవు పెద్దయ్యా!
అబుడు ఈ సేనేమో మాది గాకపాయె. ఆటికీ ఈ సేనాయప్పకి సెప్పితి, ఇట్ల ఊరందురుమూ గలిసి ఈ సేన్లాన వొగ బాయి తోక్కొందామప్పా, ఊర్లా సేన్లన్నిటికీ సరిపోయినన్ని నీళ్ళుండాయీడ అని. సెప్పి సెప్పి సాలైపాయ గాని ఈ సేనాయప్ప యినకపాయ, ఊర్లా జనాలు కూడా యినకపాయిరి. అందరూ ఈ మూడేండ్లలో ఊరిడిసి పాయిరి. ఈ సేనాయప్ప పోతా పోతా నాకు ఈ సేను అమ్మిడిసి పాయ. ఇంక నేనొగుణ్ణ్యే ఈడ మిగిలినాను. దానికే, నేనొగుడే బాయి తోగుతుండాను. నీళ్లు బడినంక ఊరిడిసి పోయినోళ్ళందర్నీ మళ్ళీ రమ్మనల్ల. మళ్ళీ మా వూరు మనుషులతో కలకలలాడల్ల!" అన్నాడు వారిదప్ప.
"సరేనప్పా, బాయి తోగుతావు, సరే, కానీ, వానలు రాకుంటే రానురాను ఈ బాయి కూడా యెండిపోదా? అప్పుడేమి సేసేకుంది మడి?"
"పెద్దయ్యా! నిజమే! వానలు రాకుంటే ఎంత పెద్ద బాయిలయినా ఎండిపోతాయి. దానికే మడి, బాగా సెట్లు పెంచల్ల. సెట్లు బాగుండేతలికే వానలు బాగొస్తాయి. నీళ్ళుండేతప్పుడే సెట్లు నాటుకొని వాటిని బాగా సాకల్ల! బాతు ఉంటే గుడ్డు వస్తుంది. గుడ్డు ఉంటే బాతు వస్తుంది. బాతును సంపితే గుడ్డు రాదు, గుడ్డు లేకుంటే బాతూ పుట్టదు. అట్లే, సెట్లుంటే వానలు వస్తాయి, వానలు ఉంటే సెట్లు ఉంటాయి. మా జనాలందరూ శానా తిక్కోళ్లు. సెట్లూ గుట్టలూ కొడతాంటారు. గుట్టలు కొడితే సేజ్జం భూమి ఎక్కువైతాది అనుకుంటారు. సెట్ల నీడ పడితే పంట సరిగా రాదని సెట్లు కొడతారు. ఇట్లా ఊర్లా ఉండే సెట్లూ గుట్టలూ కొట్టి కొట్టి వానలు లేకుండా సేసుకొని, ఇబుడిట్లా ఊరిడిసిపాయిరి సుడి!"
"ఊరికే నీళ్ల శాస్త్రమంటివి, నువు సూస్తే వానలశాస్త్రము కూడా సదివినట్లుండావే వారిదప్పా?"
"వానల శాస్త్రం కాదులే పెద్దయ్యా, ఏదో వానాకాలం చదువుల శాస్త్రం" అన్నాడు వారిదప్ప సిగ్గుపడుతూ.
"సరేనప్పా, ఆరు మొట్ల బాయంటే నువ్వొగుడే తోగేకి యెబుడయ్యీని? అంతకాలుము నీ భార్య, నీ బిడ్డ యిట్ల ఎంతదూరమునుండి నీళ్లు బువ్వ మోసుకురావల్ల?"
"నాదేముందిలే పెద్దయ్యా, గుంత తోగేదొకటే పని. కానీ, వీళ్లదే పాపుము అసలైన కష్టుము" అన్నాడు వారిదప్ప మొగం సన్నది జేసుకొని.
"మా కష్టుము ఏమిలే అన్నా, నీళ్లు మోసుకొచ్చేది మాకు కొత్తపనేమీ గాదు. ఈయప్పే, ఎర్రటి ఎండలో మాడుకుంటా తోగేది సూస్తుంటే మాకు యేమేమో ఐతాది" అన్నది వారిదప్ప భార్య కన్నీళ్లు పెట్టుకుంటా.
"రైతన్నెంక యెండలో బొతుకు జేయక నీడలో గూకుని ఉత్తుత్త మాటల్తో పొద్దుబుచ్చే వాడనుకుంటివా?" అంటూ వారిదప్ప గట్టిగా నవ్వేశాడు. "ఈయమ్మ మాటలకేమిలే పెద్దయ్యా, మంచి ఆకలి పొద్దుకొచ్చినారు. మీరు గూడా రొవంత బువ్వ తినిపొండి." అన్నాడు.
ఆ ఆగంతుకులు సంతోషంగా అందుకు అంగీకరించి, ఆ దంపతుల ఆతిథ్యం స్వీకరించారు. వారు వెళ్ళబోతూ ఇవ్వబోయిన డబ్బును ఆ దంపతులు వద్దంటే వద్దన్నారు. దాంతో మొదటి ఆయన తన మెడలో నున్న ఒక ఖరీదైన ముత్యాలహారాన్ని తీసి వారి కూతురి మెడలో వేశాడు.
"అయ్యో, వద్దన్నా" అని వారిదప్ప భార్య అంటే, "తల్లీ, నువ్వు నన్ను నోరారా అన్నా అన్నావు. మరి ఈ హారం మేనమామ తన మేనకోడలికి ఇచ్చిన కానుక అనుకో" అన్నాడు ఆయన చిరునవ్వుతో.
***

ఆ మరుసటి రోజు పొద్దునే వారిదప్ప, ఆయన భార్యాబిడ్డలు చేనులో తాము బావి తవ్వుతున్న స్థలానికి వచ్చేసరికి అక్కడ చాలామంది మనుషులు బావిని తవ్వే పనిముట్లతో సిద్ధంగా కనిపించారు.
"యెవురయ్యా మీరందరూ? యేమిటికి ఇట్లొచ్చినారు?" అన్నాడు వారిదప్ప వారిని ఆశ్చర్యంగా చూస్తూ.
"సామీ, తిమ్మరాయ ప్రభువులు మీరు ఎట్లా చెబితే అట్లా, ఎంత లోతుకంటే అంత లోతుకు మీ సేనులో బాయి తోగి రమ్మని పంపిచ్చినారు" అన్నాడు ఆ మనుషుల నాయకుడు.
తిమ్మరాయప్రభువంటే కళ్యాణదుర్గం ప్రభువు. వారిదప్ప ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు.
"ఆయప్పకి తాను బాయి తోగుతున్నట్ల ఎట్లా తెలిసింది? తెలిసినా గాని, ఇట్లా మనుషులను పంపిచ్చే అవసరము ఆయప్పకేముంది? ఇంత మంది మనుషులు తనకి సాయం జేస్తే బాగానే ఉంటుంది కానీ, కరువు కాలంలో నీళ్లు పడేదంకన్నా ఇంతమందిని బువ్వ బెట్టి సాకి, నీళ్లు బడినంక వీళ్లికి దుడ్లిచ్చి పంపిచ్చేకి తాను పెద్ద సావుకారేమీ కాదే? అట్లని మీ సాయమేమీ నాకొద్దు, మీ దారిన మీరు పోండప్పా అనేకి వాళ్ళు మామూలు మనుషులు కారే? ప్రభువులు పంపిన మనుషులను వద్దు పొమ్మని తిరస్కరిస్తే ప్రభువులకు ఆగ్రహం రాదా?"
ఆశ్చర్యంతో మొదలైన వారిదప్ప ఆలోచన కాస్త విషాదంగా పరిణమించింది. పాపం, ప్రభువుల అనుగ్రహం కూడా సామాన్యులకు మహాభారం అని ఆ ప్రభువులకు ఎట్లా తెలిసేది?
వారిదప్ప ఏమీ మాట్లాడకుండా, ఏమి చేయాలో, ఎలా చేయాలో కూడా చెప్పకుండా నిశ్శబ్దంగా తలపట్టుకు కూర్చున్నాడు. పాపం, వారిదప్ప భార్య, ఆయన బిడ్డ కూడా ఏమి చేయాలో తెలియక బిక్కు బిక్కు మంటూ అలాగే కూర్చున్నారు. నిన్నటి వరకు ఎవరి సాయమూ లేకపోయినా హాయిగా సాగిన వారి పని, ఇప్పుడు ఇంతమంది సహాయానికి వచ్చినా ముందుకు సాగలేక ఆగిపోయింది. వచ్చిన మనుషులు కూడా ఏం చేయాలో తెలియక అలాగే వారి చుట్టూ కూర్చుండి పోయారు. ఎవ్వరూ ఒకరితో ఒకరు ఏమి మాట్లాడాలో తెలియక సామూహిక మౌనవ్రతం ఆచరిస్తున్న మనుషుల్లా ఉండిపోయారు. అదీ జరిగిన కథ!
<><><>

మధ్యాహ్నసమయానికి వారిదప్ప బిడ్డ తన మెడలో ఉన్న గొలుసును తడుముకుంటూ ఉత్సాహంగా ఒక కేక వేసింది. "అమ్మా! అదిగో మామ వస్తున్నాడు"
దూరంగా వస్తున్న వారిని చూసి చుట్టూ కూర్చున్న మనుషులందరూ లేచి నిలబడ్డారు. వారు దగ్గరకు వచ్చి గుఱ్ఱాలు దిగగానే అందరూ తలలు వంచి, "ప్రభువులకు వందనాలు" అన్నారు.
వారిదప్ప కుటుంబం పొందిన భయసంభ్రమాశ్చర్యాలకు అంతే లేదు. తిమ్మరాయ ప్రభువు దగ్గరకు వచ్చి తన మేనకోడలిని ఎత్తుకున్నాడు. "ఏమి వారిదప్పా? వారికి పని చెప్పకుండా అట్లే కూర్చోబెట్టినావంట?" అన్నాడు నవ్వుతూ.
వారిదప్ప ఏమి మాట్లాడాలో తెలియక వినయంగా నమస్కారం చేసి నిలుచున్నాడు.
"వారిదప్పా! నేటినుండి నీవు రాజోద్యోగివి. ఇకపై నుండి వీరందరూ నీ అనుచరులు. నువ్వు వారిపై అధికారివి. నీకు, మా చెల్లెలికి ఇష్టమైతేనే సుమా! ముందు నీ చేనిలో బావి త్రవ్వకం పూర్తి చేసుకో. చెట్లు నాటు. ఆ తరువాత మన రాజ్యంలో పర్యటించి ఎక్కడ నీరు ఉందని నీకు అనిపిస్తే అక్కడ బావులు తవ్వించడం, చెట్లు నాటించడం నీపని. నీ చేతులమీదుగా మన రాజ్యం హరితసౌభాగ్యాన్ని పొందాలి. అది నా కోరిక!" అన్నాడు తిమ్మరాయ ప్రభువు.
"మహాప్రసాదం ప్రభూ!"
“"సరే, అందరికీ భోజనాలు కూడా తెప్పించాము, ప్రొద్దున నుండి అందరూ ఉపవాసం చేసి పుణ్యం బాగానే సంపాదించారు, ఇప్పుడు భోజనం చేసి కార్యరంగంలోకి ప్రవేశించండి! వారిదప్పా! నువ్వు మొదట చెట్లు నాటించబోయే నీ స్వగ్రామం ఇకపై నుండి "చెట్టూరు" గా పిలవబడుతుంది. మీ యింటిపేరు కూడా చెట్టూరు అవుతుంది!” అన్నారు ప్రభువులు చిరునవ్వు నవ్వుతూ.
"ధన్యుడిని ప్రభూ!" అన్నాడు శెట్టూరు వారిదప్ప.

((గమనిక: కథ కల్పితమే కానీ, కథలో వర్ణించబడిన పరిస్థితులు రాయలసీమలో నిజంగా ఉన్నవేనని, ఆ పరిస్థితులను నివారించేందుకు మన శెట్టూరు వారిదప్ప చెప్పిన విషయాలు పాటించదగినవే అని చదువరులు గ్రహించగలరు.))

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...