Friday 17 March 2023

అవునా? నిజమా? ఎలాగో చెప్పు మరి?

 


పేద కార్మికుల సంపద అంతా అంబానీకి బదిలీ అయిపోతూ వుందా?
ఎందుకురా అబద్ధాలు?

ఎలా బదిలీ అవుతోంది?

అదేమైనా నగదు బదిలీనా?
అంటే పేద కార్మికుల జేబుల్లోంచి అంబానీ లాక్కుంటున్నాడా? లేదా అంబానీ బ్యాంకులతో లాలూచీ పడి పేదవాళ్ల అకౌంట్లలోని డబ్బును దొంగతనంగా తన అకౌంటులోనికి మార్పించుకుంటున్నాడా?

అదేం లేనపుడు, మరి పేదవారి సంపద అంబానీకి బదిలీ అయిపోతోందని ఎందుకు గగ్గోలు పెడుతున్నావు?

పోనీ అదేమైనా ఆస్తి బదిలీనా?
అంటే పేదవాళ్ల ఇండ్లు, పొలాలు, గొడ్డూ గోదా వంటి ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను ఎమ్మార్వో ఆఫీసులకు వెళ్లి తన పేరున దొంగతనంగా రాయించుకుంటున్నాడా అంబానీ?

అదేం లేనపుడు, మరి పేదవారి సంపద అంబానీకి బదిలీ అయిపోతోందని ఎందుకు గగ్గోలు పెడుతున్నావు?

ఒరే మూర్ఖుడా,

అంబానీ సంస్థల విలువ పెరుగుతోంది అంటే, అది అంబానీ ఒక్కడిదే కాదు. ఆ సంస్థలకు చెందిన వేలాది లక్షలాది షేర్ హోల్డర్ల సంపద కూడా పెరుగుతోంది అని అర్థం.

కనీసం ఆ సంపద కూడా భౌతికమైనది కూడా కాదు. అంబానీ తన తెలివితేటలతో చక్కగా వ్యాపారం చేస్తూ మంచి లాభాలను సంపాదిస్తూ వాటిని షేర్ హోల్డర్లందరికీ న్యాయంగా పంచుతూ ఉండటం వల్ల సహజంగానే ఆ సంస్థలకు చెందిన షేర్ల విలువ స్టాక్ మార్కెట్లో పెరుగుతుంది. అదీ ఇక్కడ సంపద విలువ పెరగడమంటే. ప్రపంచంలో ఎక్కడైనా అలాగే జరుగుతుంది.

అంతే కాదు, అంబానీ సంస్థలలో లక్షలాది భారతీయులు పని చేస్తూ చక్కగా సంపాదించుకుంటూ బ్రతుకుతున్నారు. మరిన్ని లక్షలమంది వారి ఉత్పత్తులను రవాణా చేస్తూ, అమ్ముతూ, పరోక్షంగా ఉపాధిని పొందుతున్నారు. అంబానీ సంస్థల సేవలను దేశంలో కోట్లాది ప్రజలు ఉపయోగించుకుంటూ లాభపడుతున్నారు.

అసలు నీ సంగతే చెప్పు, నువ్వు ఈ ఫొటోలోని పనికి మాలిన సందేశాన్ని కూడా అందరికీ సోషల్ మీడియాలో పంచగలగటానికి కారణం అంబానీ నీకు చాల చవకగా ఇచ్చిన జియో డేటానే కదా?

అందువల్ల, అంబానీ సంపద ఎంత పెరిగినా అది దేశానికి, దేశంలోని ప్రజలకు ఉపయోగపడుతుంది. మరి నీ పనికిమాలిన రెచ్చగొట్టుడు మాటల వల్ల ఎవరికిరా ఉపయోగం, చెప్పు?

ఇది అర్థం చేసుకొనడం చేతగాని నువ్వు, అంబానీ పేదవారి కంచంలోని బువ్వను లాక్కు పోతున్నట్టు ఆ అరుపులు ఆ కేకలు ఆ దుష్ప్రచారం ఏమిటిరా? నీలాంటి అజ్ఞాని మాటలు విని నిజమే కాబోలు అనుకుని ఎంతమంది ఆవేశపరులైన యువకులు తప్పుదారిన పడతారో కదా? తమకు ఉపాధిని కల్పించగల సంస్థలనే వారు తిరస్కరిస్తే వారికి ఉపాధిని మీరు కల్పిస్తారా?

కేరళను దశాబ్దాల తరబడి మీరు పాలిస్తున్నారే? అక్కడ పేదరికం లేదా? అక్కడ ధనవంతులు లేరా? అక్కడ అంబానీ సంస్థలవల్ల ఎవరికీ మేలు జరగడం లేదా? అంబానీ వల్ల కేరళీయులకు ఉపాధి కలగటం లేదా?

పోనీ, కేరళలో పేదవారి సొమ్మును మీరన్నట్టు అంబానీ నిజంగానే దారుణంగా దోచేస్తున్నాడనే అనుకుందాం. మరి మీరేం చేస్తున్నారు? అంబానీ ఆస్తులను స్వాధీనం చేసుకుని, వారిని తన్ని తరిమేయవచ్చు కదా? అలా మీరు ఎందుకు చేయటం లేదు మరి?

ఎందుకంటే మీరు అలా చేస్తే అంబానీ ద్వారా ఉపాధి పొందుతున్న కేరళప్రజలే మీమీద తిరగబడతారు. జనాలకు మీ మాటలలోని అబద్ధాలు స్పష్టంగా తెలిసి పోతాయి. అదీ మీ భయం.

అసలు అంబానీ ఒక్కడే ఎందుకు వ్యాాపారం చేయాలి, మిగిలిన వారు వ్యాపారం చేయవద్దా అని మీరు అడగవచ్చు. చేయండి. అంబానీ అంత తెలివిగా సమర్థవంతంగా చేయండి. ఎవరు వద్దంటారు?

కాని, దురదృష్టవశాత్తు మన విద్యావ్యవస్థ అటువంటి తెలివైనవారిని తయారు చేయడానికి అనుగుణంగా రూపుదిద్దుకోలేదు. మాటలు కూడా సరిగా రాకముందే ఇంగ్లీషు మీడియంలో చదివి, ఇంకొకరి క్రింద ఉద్యోగాలనే పేరిట గులాం గిరీ చేసే ఆత్మగౌరవం లేని మనుషులను సృష్టించడానికి మాత్రమే అది ఉపయోగపడుతోంది. మీలాంటి వారి మాటలలోని నిజానిజాలను చక్కగా ఆలోచించి గ్రహించడానికి కూడా ఆ విద్యావ్యవస్థ తోడ్పడదు. బుర్రను పెంచే చదువు నీకు అబ్బి ఉంటే ఇలాంటి తెలివి తక్కువ మాటలను నువు అసలు మాట్లాడేవాడివేనా?

అందువల్ల సహజప్రతిభాసంపన్నుడైన అంబానీ వంటి వ్యాపారవేత్త, ఉపాధిసృష్టికర్త మన దేశంలో ఎక్కడో కోటికో వంద కోట్లకో ఒకడు అప్పుడప్పుడు పుడుతూ ఉంటాడు. వారి బుద్ధివైభవాన్ని, అభివృద్ధిని చూసి స్వయంగా బాగుపడటం చేతగాక ఈర్ష్యపడే మీలాంటి వాళ్లు మాత్రం అటువంటి వారిని మీ స్థాయికి దిగజార్చి ఆనందపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

సరే, మీకు పేద కార్మికుల మీద అంత ప్రేమే గనుక ఉంటే, వారికి అంబానీ సంస్థలలో షేర్లు కొని ఇవ్వండి. అంబానీ సంపద పెరిగితే వారి సంపద కూడా పెరుగుతుంది.

సాక్షిగాడు మీకంటె ఘోరం. అంబానీ సంస్థలను అమ్మేసి ఆ డబ్బును దేశప్రజలకు పంచేస్తే తలసరి మొత్తం ఎంత వస్తుంది అంటూ ఆ మధ్య లెక్కలేసి మరీ వ్యాసం రాశాడు. మరి సాక్షి తనను తన యజమాని అమ్మేసి ఆ సొమ్మును తనకోసం పని చేస్తున్న జర్నలిస్టులు, ఎడిటర్లు, ప్రింటర్లు, హాకర్లకు పంచేస్తే ఎంత వస్తుందని లెక్కలు ఎందుకు వేయటం లేదో మరి ?

అందువల్ల, పనిలో పని, నెల నెలా ఉచితపంపకాలు మాని అంబానీ కంపెనీల షేర్లు ఒకే ఒక్కసారికి పేద ప్రజలకు కేటాయించమని మన ముఖ్యమంత్రికి సలహా ఇవ్వండి. నెమ్మదిగా వారు కూడా బాగుపడతారు. ఆయనకు ఉచితపంపకాల సరదా ఎక్కువౌతున్నకొద్దీ ఇక్కడ మా జేబులు గుల్లైపోతున్నాయి. 

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...