Friday 17 March 2023

సారతమం



అమృతం కోసం క్షీరసాగరమథనం ప్రారంభమైంది. మథనం చేస్తున్నవారందరికీ ఒకటే పట్టుదల. మేము అమరులం కావాలి అని.


కవ్వపుతాడు కరువైతే భుజంగపతి వాసుకి అక్కరకు వచ్చాడు. హాలాహలం విజృంభిస్తే శంకరుడు దానిని వెన్నముద్దలా పట్టి గొంతులో దాచాడు. కవ్వమైన మందరాచలం మునిగిపోతుంటే శ్రీహరి శ్రీకూర్ముడై ఉద్ధరించాడు.

క్రమంగా క్షీరసాగరంనుండి అప్సరసలు ఉద్భవించారు. అయినా మథనం ఆగలేదు.

ఆ తరువాత ఉచ్చైఃశ్రవం, ఐరావతం, కౌస్తుభం, కల్పద్రుమం, కామధేనువు చంద్రుడు మొదలైనవన్నీ పుట్టుకొచ్చాయి. అయినా మథనం ఆగలేదు.

ఆ తరువాత లక్ష్మీదేవి పుట్టింది. అయినా మథనం ఆగలేదు.

చివరకు అమృతం పుట్టింది. అప్పుడు మథనం ఆగింది.

)))(((

రత్నాకరమంటే ఇక్కడ క్షీరసాగరం. రత్నాలకు నిలయమైనది అని. రత్నము అంటే చాల విలువైనది అని.

రత్నాకరంలో అసారం (సారహీనమైనది - ప్రమాదకరమైనది) ఉంటుంది. ఈ సందర్భంలో అది హాలాహలమన్నమాట.

రత్నాకరంలో అల్పసారం ఉంటుంది. (పెద్దగా సారం లేనిది) ఈ సందర్భంలో అప్సరసలవంటివారు అన్న మాట.

రత్నాకరంలో సారం ఉంటుంది. ఈ సందర్భంలో ఉచ్చైఃశ్రవం, ఐరావతం, కౌస్తుభం, కల్పద్రుమం, కామధేనువు వంటివి అన్న మాట.

రత్నాకరంలో సారతరం ఉంటుంది. (మునుపు చెప్పిన వాటన్నిటికన్న మరింత సారవంతమైనది) ఈ సందర్భంలో లక్ష్మీదేవి అన్న మాట.

రత్నాకరంలోనే సారతమం ఉంటుంది. (అన్నిటిని మించి సారవంతమైనది) ఈ సందర్భంలో అది అమృతమన్నమాట.

(అమృతం అనే పదానికి మోక్షం అనే అర్థమున్నదని గ్రహిస్తే ఇది లక్ష్మీదేవి కంటె గొప్పదా అనే మోహం గాని , భ్రాంతి గాని పుట్టవు.)

)))(((

అసారమల్పసారం చ
సారం సారతరం త్యజేత్।
భజేత్ సారతమం శాస్త్రే
రత్నాకర ఇవామృతమ్।।

అని ప్రస్తుతశ్లోకం.

ఈ విధంగా. శాస్త్రమనే క్షీరసాగరంలో అసారాన్ని, అల్పసారాన్ని మాత్రమే కాక, చివరకు సారాన్ని, సారతరాన్ని కూడా వదలి సారతమాన్ని మాత్రమే పరిగ్రహించాలి అని మన పెద్దలు చాల స్పష్టంగా వివరించి చెప్పారు. (దానినే పరమార్థమన్నారు)

)))(((

రత్నైర్మహాబ్ధేః తుతుషుర్న దేవాః
న భేజిరే భీమవిషేణ భీతిమ్।
సుధాం వినా న ప్రయయుర్విరామం
న నిశ్చితార్థాత్ విరమన్తి ధీరాః।।

అని భర్తృహరిసుభాషితం. దేవతలు క్షీరసాగరంనుండి మహారత్నాలు లభించాయనే ఆకర్షణకు లోనై మథనం ఆపలేదు. భయంకరమైన విషానికి భయపడి మథనం ఆపలేదు. అమృతం లభించేంతవరకు విశ్రమించలేదు. ధీరులు తాము నిశ్చయించిన ప్రయోజనాన్ని పొందేంతవరకు విరమించరు అని దాని అర్థం.

చూడండి, ఈ శ్లోకంలో భర్తృహరి కేవలం దేవతలను మాత్రమే పేర్కొన్నాడు కాని, వారితో పాటు మథనం చేసిన రాక్షసులను పేర్కొనలేదే అని ఎవరైనా అనవచ్చు.

కాని, లక్ష్యం నెరవేరేవరకూ నిర్విరామంగా శ్రమించిన రాక్షసులు కూడా దేవతలతో సమానులుగానే భర్తృహరి ఇక్కడ భావించడం వలన వారిని వేరుగా పేర్కొనలేదు.

కాని ఉమ్మడి లక్ష్యమైన అమృతం లభించేసరికి, ఇది మాకు మాత్రమే చెందాలి అని వారిలో కొందరు దానిని బలాత్కారపూర్వకంగా అపహరించేసరికి దేవదానవభేదం వచ్చేసింది.

మా మతంలో ఉంటేనే దేవుడు అనుగ్రహిస్తాడు, వాళ్లకు మాత్రమే స్వర్గం, లేకపోతే నరకం తప్పదు అని దబాయించేవారే దానవులన్న మాట. వారు తమ మతానికి (అభిప్రాయానికి) విరుద్ధంగా సర్వత్ర భగవద్దర్శనం చేసుకునే సాధువులను కూడా తమకు పరమవిరోధులుగా భావించి బ్రతుకనీయరు. క్రూరంగా చంపేస్తారు. అందుకు పురాణంలోనూ నిదర్శనాలున్నాయి, నిన్న గాక మొన్న మన ఎరుకలోనే, భారతదేశమంతటినీ దిగ్భ్రాంతికి గురి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

సరే, ఆ పైన ఇక చెప్పేదేముంది? అటువంటి దానవులను రాక్షసులను ఒకొక్కసారి పరాక్రమంతో, ఒకొక్కసారి వంచనతో ఎలా అణచాలో శ్రీహరి మనకందరకూ చక్కగా గుణపాఠాలు నేర్పించాడు.

కాని, మనమే నేర్చుకునేందుకు నిరాకరిస్తూ ఇంకా సెక్యులరిజమూ సమానత్వమూ అంటూ పనికిరాని పిచ్చి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాము.

)))(((

భారతసంస్కృతిని మనసారా ద్వేషించే కొందరు అనంతగంభీరక్షీరసాగరాల వంటి మన శాస్త్రాలలోను, పురాణాలలోను వేదాలలోను అసారాలను, అల్పసారాలను మాత్రమే వెతికి వెతికి మరీ గ్రహిస్తూ ఉంటారు.

శ్వానాలకు ఎండిపోయిన ఎముక ముక్క దొరికితే చాలు, అదే అమృతంగా తలచి నమిలి నమిలి నమలుతూ స్వర్గసుఖం ఇంతకంటె వేరే ఏమీ లేదని ఆనందిస్తూ ఉంటాయి.

శూకరాలకు బురదగుంట దొరికితే చాలు. అందులోనే సుఖంగా దొర్లుతూ అదే స్వర్గమని, ఆ బురదే అమృతమని భావిస్తాయి.

యుగయుగాలుగా కాలపరీక్షకు నిలిచిన మన శాస్త్రసంపదలో వారికి సారవంతమైనవి గాని, సారతరమైనవి గాని, సారతమమైనవి గాని ఎంతమాత్రం గోచరించవు. అది వారు తమ పూర్వజన్మలలో చేసుకున్న దురదృష్టఫలం. అంతే.

తమకు సారాన్ని గాని, సారతరాన్ని గాని, సారతమాన్ని గాని గ్రహించే నైపుణ్యం గాని శక్తిగాని లేక పుక్కిటి పురాణాలు అంటూ నిందిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు.

నక్క కూడా తనకు అందని ద్రాక్షను పుల్లన అని నిందిస్తుందని చిన్న పిల్లలకు కూడా తెలుసు.

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...