Friday, 17 March 2023

ధీమంతుడు



అబ్బో ఆ మనిషి గొప్ప ధీమంతుడురా అంటూ ఉంటాం. లేదా వింటూ ఉంటాం. మనకున్న అభిమానాన్ని బట్టో కలిగిన ఆశ్చర్యాన్ని బట్టో ఎవరినైనా అలా ప్రశంసిస్తాం గాని...

...అందరూ ధీమంతులు కాగలరాా? ధీగుణాలు కలిగినవారు మాత్రమే ధీమంతులు కాగలరు. మరి ధీగుణాలు ఏమిటి?

ఎనిమిది ధీగుణాలు కామందకీయరాజనీతిశాస్త్రంలో చెప్పబడ్డాయి. (వాటిని శంకరార్యులు తన జయమంగళవ్యాఖ్యలో నిర్వచించారు. శంకరార్యులు వేరు, శంకరాచార్యులు వేరు)

వాటిని క్రింద పట్టికలో పొందుపరచాను.

చాణక్యులవారు తమ అర్థశాస్త్రంలో కూడా ఈ ఎనిమిది ధీగుణాలను చెప్పారు. ఈ క్రింద చెప్పిన క్రమంలో కాక, ధారణకు ఊహకు నడుమ 'విజ్ఞానం' అనే ధీగుణాన్ని పేర్కొన్నారు.

విజ్ఞానం అంటే నిర్వచనం - వివిధసాధ్యసాధనస్వరూపవివేకజ్ఞానమ్ - అని. అంటే అర్థం చేసుకున్న విషయాలలో నేను సాధింపదగినది ఇది అని, సాధించేందుకు ఉపయోగపడే సాధనం ఇది అని వాటి నడుమ తేడాను తెలుసుకొనగలగటం. సాధనం అంటే పరికరం - instrument.

బుద్ధి, నైపుణ్యం, తెలివితేటలు సాధ్యాలు. అంటే సాధింపదగినవి. వాటిని సాధించాలంటే పుస్తకాలు కేవలం సాధనాలు. సాధించవలసినది పుస్తకాలను కాదు కదా?

{{ అలాగే, మనిషి సుఖపడాలంటే ధర్మం చేయాలి. కాబట్టి ధర్మం అనేది సాధ్యం. (సాధింపదగినది.) తల్లిదండ్రులను గురువులను సేవించడం, అతిథులను ఆదరించటం, పేదలను ఆదుకొనటం, ప్రాణుల పట్ల దయతో వ్యవహరించటం, చెట్లు నాటటం, చెఱువులు బావులు తవ్వించటం మొదలైనవి ధర్మకార్యాలు అనుకుందాం.

అయితే ఇవన్నీ చేయటం అంత సులువు కాదు. అందుకు తగినంత ధనం కావాలి. కాబట్టి ధనం అనేది ధర్మం సాధించడానికి ఒక సాధనం (instrument) మాత్రమే.

((ఒకప్పుడు సాధ్యమైన వస్తువు మరొకప్పుడు అంటే సాధింపబడిన తరువాత వేరొక దానిని సాధించేందుకు సాధనం కావచ్చు.))

ధనాత్ ధర్మం - తతః సుఖమ్ అనేది క్రమం. సంపాదించిన ధనంతో ధర్మం చేయాలి. ఆ ధర్మం వలన సుఖం కలుగుతుంది అనేది క్రమం. అలా కాకుండా నేరుగా ధనంతో సుఖాన్ని పొందగోరటమే అక్రమం.

కాని, మనుషులు ధనమే సాధ్యమనుకుని, ధర్మాన్ని మరచిపోయి ధనాన్ని సాధించడంలోనే తమ యావజ్జీవితాన్ని గడిపేస్తున్నారు. అంటే దేవుడి పటాన్ని దానికి చేయవలసి పూజను విడిచిపెట్టి ఆ పటాన్ని గోడకు వేలాడదీయటానికి ఉపయోగపడే మేకులను పోగుచేసుకుంటున్నాడన్నమాట.

ధనం సంపాదిస్తే చాలు సుఖపడతాం కదా, మరలా ధర్మం దేనికి అనుకోవచ్చు. అలాగని, ధర్మం విడిచి, అక్రమార్జన చేస్తే, దొంగతనాలు, దోపిడీలు మోసాలు చేసి ధనం సంపాదిస్తే ఆ మనిషికి భౌతికంగానో లేదా మానసికంగానో పీడ తప్పదు. అతడు ధనం సంపాదించిన తీరు తెలిస్తే అతడికి భౌతికంగా దండన తప్పదు. ఒక వేళ అధికారులకు తెలియకున్నా, మానసికంగా నేను ఎప్పుడు పట్టుబడతానో అనే భయం అతన్ని వేధిస్తూ సుఖపడనివ్వకుండా చేస్తుంది కదా.

అటువంటి అధర్మపరుడు బయటకు చాల అందంగా కనిపిస్తున్నా లోపల చెదలు కొట్టేసిన చెట్టులాంటివాడు. }}

సరే,, తాను రాజు కావాలని కోరుకున్నవాడికి ఈ ధీగుణాలు తప్పక ఉండాలని రాజనీతిశాస్త్రజ్ఞుల తాత్పర్యం.

కాని, మన దురదృష్టవశాత్తు కాస్త డబ్బుండి, కాస్త మాటకారితనం ఉండి, కాస్త జనాలను పోగేయగలగటం చేతనైనవారందరూ ఈ రోజుల్లో నాయకులు రాజులు ఐపోతున్నారు.

అయితే వారందరూ గొప్ప రాజులు కాలేరు. మిణుగురుపురుగు స్వయంప్రకాశకం కాబట్టి దానిని సూర్యుడు అనగలమా? 

ఫలకాలు చెప్పే పాఠాలు - 6


క్షరం తు అవిద్యా - అమృతం తు విద్యా
''అవిద్య నశించిపోయేది. విద్య మాత్రము అమరం."
"కోటి విద్యలు కూటి కొరకే" అంటారు కదా? మరి ఆ కోటి విద్యలూ అమరమేనా?
కాదు. ఎందుకంటే అవి నిజానికి అవిద్యలు. మనం ఎంతో ప్రేమగా కూడు పెట్టి పోషించుకునే ఈ శరీరమే పెద్ద అశాశ్వతమైన వస్తువు. అశాశ్వతమైన దాన్ని పోషించుకునే విద్య శాశ్వతం అమరం ఎలా అవుతుంది? కానే కాదు. ఇవన్నీ నిజానికి మనం విద్యలని భ్రమిస్తున్న అవిద్యలు.
మరి విద్య ఏమిటి?
"సా విద్యా యా విముక్తయే". విముక్తిని కలిగించేదే అసలైన విద్య. విముక్తి అంటే బంధనం నుండి బయటపడటం.
అంటే? ఉద్యోగం రాగానే తన వాళ్లనుండి విముక్తిని పొంది వేరే వూరికో వేరే దేశానికో పరుగులెత్తేందుకు ఉపయోగపడేదేనా విద్య అంటే?
కాదు. అది బంధువులతో వచ్చిన బంధాన్ని తెగదెంపి కొత్త బంధాన్ని కల్పించేది మాత్రమే. తల్లిదండ్రుల బాధ్యతను వదులుకుని ఆఫీసు పనుల బాధ్యతను స్వీకరిస్తే అది విముక్తి ఎలా అవుతుంది?
మరి?
"ద్వే విద్యే వేదితవ్యే పరా చైవాపరా చేతి" అని ముండకోపనిషద్బోధ. (1.4)
అపరా విద్య అంటే వేదవేదాంగాలు. (వీటి వలన కూడా విముక్తి లేదు.
ఇవి అసలైన విద్యను సాధించేందుకు తోడ్పడే సాధనాలు మాత్రమే.)
"అథ పరా యయా తదక్షరమధిగమ్యతే" - ఏ విద్య వలన అమృతత్వం, అమరత్వం (విముక్తి) లభిస్తాయో అదే పరా విద్య.
నిజానికి బంధనమంటే జననమరణాలే. ఈ జన్మలో పడినన్ని బాధలు పడి మరణించినా బంధనం నుంచి తప్పించుకోలేము. మళ్లీ పుట్టవలసిందే. మళ్లీ మరణించవలసిందే. ఈ జననమరణాలు అనంతచక్రంలా పరిభ్రమిస్తూనే ఉంటాయి. ఈ మహాబంధనం నుండి విముక్తిని కలిగించేదే విద్య. నిజమైన విద్య. పరా విద్య.
అదే ఆత్మవిద్య. (తాను ఎవరో తాను తెలుసుకునే విద్య.) అదే బ్రహ్మవిద్య కూడా.
కస్త్వమ్? కోఽహమ్? కుత ఆయతః? తత్త్వం చింతయ తదిహ భ్రాతః! (తమ్ముడూ, నువ్వెవడవో? నేనెవడనో? నువు ఎక్కడనుంచి వచ్చావో? ఆ తత్త్వాన్ని గురించి చింతన చేయవయ్యా) అంటారు శంకరులు తమ మోహముద్గరంలో. ఆత్మవిద్యను నేర్చుకున్నవారు మాత్రమే ఆ క్వశ్చన్ పేపరును ఆన్సర్ చేయగలరు.
సరే. ఆవిద్యను నేర్చుకొనడం ఎలా?
అద్భుతం. అసలు ఇలా ఆత్మవిద్యను నేర్చుకుందామనే సంకల్పం కలగడమే కోటానుకోట్ల జన్మల పుణ్యఫలం.
ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనమ్
ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః।
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శృత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్।।
(గీత2.29)
ఈ ఆత్మవిద్యను ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు. మరొకడు ఆశ్చర్యంగా చెబుతాడు. వేరొకడు ఆశ్చర్యంగా వింటాడు. కాని ఈ చూసినా, చెప్పినా, విన్నా దానిని తెలుసుకోగలిగినవాళ్లే ఎవరూ లేరు. ఎందుకంటే అది బ్రహ్మవిద్య మరి!
కాని, ఆ విద్యను నేర్చుకుందామనే సంకల్పం అందరికీ కలగదనుకున్నాం కదా? వేలాది మనుషులలో ఎవడో ఒక్కడికి సంకల్పం కలిగి ప్రయత్నిస్తాడు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే. అలా ప్రయత్నించే వారిలో నూటికో కోటికో ఒకరికి సిద్ధి కలుగుతుందట. (గీత 7.3)
వారు ముక్తులంటే. అదీ విద్య అంటే.
విద్యాపీఠంలో నడుస్తుంటే ఇటువంటి ఫలకాలు దారి పక్కనే నిలబడి పలకరిస్తూ మనకు చిన్న చిన్న వాక్యాలతో పెద్ద పెద్ద పాఠాలను బోధిస్తూ ఉంటాయి.

సారతమం



అమృతం కోసం క్షీరసాగరమథనం ప్రారంభమైంది. మథనం చేస్తున్నవారందరికీ ఒకటే పట్టుదల. మేము అమరులం కావాలి అని.


కవ్వపుతాడు కరువైతే భుజంగపతి వాసుకి అక్కరకు వచ్చాడు. హాలాహలం విజృంభిస్తే శంకరుడు దానిని వెన్నముద్దలా పట్టి గొంతులో దాచాడు. కవ్వమైన మందరాచలం మునిగిపోతుంటే శ్రీహరి శ్రీకూర్ముడై ఉద్ధరించాడు.

క్రమంగా క్షీరసాగరంనుండి అప్సరసలు ఉద్భవించారు. అయినా మథనం ఆగలేదు.

ఆ తరువాత ఉచ్చైఃశ్రవం, ఐరావతం, కౌస్తుభం, కల్పద్రుమం, కామధేనువు చంద్రుడు మొదలైనవన్నీ పుట్టుకొచ్చాయి. అయినా మథనం ఆగలేదు.

ఆ తరువాత లక్ష్మీదేవి పుట్టింది. అయినా మథనం ఆగలేదు.

చివరకు అమృతం పుట్టింది. అప్పుడు మథనం ఆగింది.

)))(((

రత్నాకరమంటే ఇక్కడ క్షీరసాగరం. రత్నాలకు నిలయమైనది అని. రత్నము అంటే చాల విలువైనది అని.

రత్నాకరంలో అసారం (సారహీనమైనది - ప్రమాదకరమైనది) ఉంటుంది. ఈ సందర్భంలో అది హాలాహలమన్నమాట.

రత్నాకరంలో అల్పసారం ఉంటుంది. (పెద్దగా సారం లేనిది) ఈ సందర్భంలో అప్సరసలవంటివారు అన్న మాట.

రత్నాకరంలో సారం ఉంటుంది. ఈ సందర్భంలో ఉచ్చైఃశ్రవం, ఐరావతం, కౌస్తుభం, కల్పద్రుమం, కామధేనువు వంటివి అన్న మాట.

రత్నాకరంలో సారతరం ఉంటుంది. (మునుపు చెప్పిన వాటన్నిటికన్న మరింత సారవంతమైనది) ఈ సందర్భంలో లక్ష్మీదేవి అన్న మాట.

రత్నాకరంలోనే సారతమం ఉంటుంది. (అన్నిటిని మించి సారవంతమైనది) ఈ సందర్భంలో అది అమృతమన్నమాట.

(అమృతం అనే పదానికి మోక్షం అనే అర్థమున్నదని గ్రహిస్తే ఇది లక్ష్మీదేవి కంటె గొప్పదా అనే మోహం గాని , భ్రాంతి గాని పుట్టవు.)

)))(((

అసారమల్పసారం చ
సారం సారతరం త్యజేత్।
భజేత్ సారతమం శాస్త్రే
రత్నాకర ఇవామృతమ్।।

అని ప్రస్తుతశ్లోకం.

ఈ విధంగా. శాస్త్రమనే క్షీరసాగరంలో అసారాన్ని, అల్పసారాన్ని మాత్రమే కాక, చివరకు సారాన్ని, సారతరాన్ని కూడా వదలి సారతమాన్ని మాత్రమే పరిగ్రహించాలి అని మన పెద్దలు చాల స్పష్టంగా వివరించి చెప్పారు. (దానినే పరమార్థమన్నారు)

)))(((

రత్నైర్మహాబ్ధేః తుతుషుర్న దేవాః
న భేజిరే భీమవిషేణ భీతిమ్।
సుధాం వినా న ప్రయయుర్విరామం
న నిశ్చితార్థాత్ విరమన్తి ధీరాః।।

అని భర్తృహరిసుభాషితం. దేవతలు క్షీరసాగరంనుండి మహారత్నాలు లభించాయనే ఆకర్షణకు లోనై మథనం ఆపలేదు. భయంకరమైన విషానికి భయపడి మథనం ఆపలేదు. అమృతం లభించేంతవరకు విశ్రమించలేదు. ధీరులు తాము నిశ్చయించిన ప్రయోజనాన్ని పొందేంతవరకు విరమించరు అని దాని అర్థం.

చూడండి, ఈ శ్లోకంలో భర్తృహరి కేవలం దేవతలను మాత్రమే పేర్కొన్నాడు కాని, వారితో పాటు మథనం చేసిన రాక్షసులను పేర్కొనలేదే అని ఎవరైనా అనవచ్చు.

కాని, లక్ష్యం నెరవేరేవరకూ నిర్విరామంగా శ్రమించిన రాక్షసులు కూడా దేవతలతో సమానులుగానే భర్తృహరి ఇక్కడ భావించడం వలన వారిని వేరుగా పేర్కొనలేదు.

కాని ఉమ్మడి లక్ష్యమైన అమృతం లభించేసరికి, ఇది మాకు మాత్రమే చెందాలి అని వారిలో కొందరు దానిని బలాత్కారపూర్వకంగా అపహరించేసరికి దేవదానవభేదం వచ్చేసింది.

మా మతంలో ఉంటేనే దేవుడు అనుగ్రహిస్తాడు, వాళ్లకు మాత్రమే స్వర్గం, లేకపోతే నరకం తప్పదు అని దబాయించేవారే దానవులన్న మాట. వారు తమ మతానికి (అభిప్రాయానికి) విరుద్ధంగా సర్వత్ర భగవద్దర్శనం చేసుకునే సాధువులను కూడా తమకు పరమవిరోధులుగా భావించి బ్రతుకనీయరు. క్రూరంగా చంపేస్తారు. అందుకు పురాణంలోనూ నిదర్శనాలున్నాయి, నిన్న గాక మొన్న మన ఎరుకలోనే, భారతదేశమంతటినీ దిగ్భ్రాంతికి గురి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

సరే, ఆ పైన ఇక చెప్పేదేముంది? అటువంటి దానవులను రాక్షసులను ఒకొక్కసారి పరాక్రమంతో, ఒకొక్కసారి వంచనతో ఎలా అణచాలో శ్రీహరి మనకందరకూ చక్కగా గుణపాఠాలు నేర్పించాడు.

కాని, మనమే నేర్చుకునేందుకు నిరాకరిస్తూ ఇంకా సెక్యులరిజమూ సమానత్వమూ అంటూ పనికిరాని పిచ్చి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాము.

)))(((

భారతసంస్కృతిని మనసారా ద్వేషించే కొందరు అనంతగంభీరక్షీరసాగరాల వంటి మన శాస్త్రాలలోను, పురాణాలలోను వేదాలలోను అసారాలను, అల్పసారాలను మాత్రమే వెతికి వెతికి మరీ గ్రహిస్తూ ఉంటారు.

శ్వానాలకు ఎండిపోయిన ఎముక ముక్క దొరికితే చాలు, అదే అమృతంగా తలచి నమిలి నమిలి నమలుతూ స్వర్గసుఖం ఇంతకంటె వేరే ఏమీ లేదని ఆనందిస్తూ ఉంటాయి.

శూకరాలకు బురదగుంట దొరికితే చాలు. అందులోనే సుఖంగా దొర్లుతూ అదే స్వర్గమని, ఆ బురదే అమృతమని భావిస్తాయి.

యుగయుగాలుగా కాలపరీక్షకు నిలిచిన మన శాస్త్రసంపదలో వారికి సారవంతమైనవి గాని, సారతరమైనవి గాని, సారతమమైనవి గాని ఎంతమాత్రం గోచరించవు. అది వారు తమ పూర్వజన్మలలో చేసుకున్న దురదృష్టఫలం. అంతే.

తమకు సారాన్ని గాని, సారతరాన్ని గాని, సారతమాన్ని గాని గ్రహించే నైపుణ్యం గాని శక్తిగాని లేక పుక్కిటి పురాణాలు అంటూ నిందిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు.

నక్క కూడా తనకు అందని ద్రాక్షను పుల్లన అని నిందిస్తుందని చిన్న పిల్లలకు కూడా తెలుసు.

Saturday, 16 July 2022

జనకసభ


                 పూర్వం విదేహరాజ్యాన్ని పరిపాలించే రాజులకు జనకుడు అనే నామాంతరం ఉండేది.  వారిలో ఒకానొక జనక మహారాజు ఒకసారి బహుదక్షిణం అనే పేరు కలిగిన గొప్ప యజ్ఞం చేశాడు.  ఆ యజ్ఞానికి నానా ప్రాంతాల నుండి అనేకమంది వేదపండితులు శాస్త్రపండితులు విచ్చేశారు.  వారిని, వారి అపరిమేయమైన వైదుష్యాన్ని గమనించిన జనకమహారాజు హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది.  ఆ సమయంలోనే అతడికి ఒక జిజ్ఞాస కూడా కలిగింది.  కో ను ఖలు అత్ర బ్రహ్మిష్ఠః?” (వీరందరిలోనూ అతి గొప్ప బ్రహ్మజ్ఞానము కలిగిన వారు ఎవరు?) అని.  కాని, ఆ మాటను నేరుగా ఆ విద్వత్పరిషత్తులోనే అడగటం మర్యాద కాదు.  అందువలన జనకమహారాజు ఒక ఉపాయం చేశాడు.

             తన గోశాలనుండి వేయి మంచి ఆవులను తెప్పించాడు.  ప్రతి ఆవుకు రెండు కొమ్ములు ఉంటాయి కదా.  ఒక్కొక్క కొమ్ముకు ఐదేసి పాదముల బంగారాన్ని కట్టించాడు.  తరువాత అక్కడ చేరిన విద్వత్పరిషత్తును ఉద్దేశించి, “మహాత్ములారా! యో వో యుష్మాకం బ్రహ్మిష్ఠః సః ఏతాః గాః ఉదజతామ్ (మీ అందరిలోనూ అతిశయించిన బ్రహ్మజ్ఞానం ఎవరికి కలదో, వారు ఈ ఆవులను తమ ఇంటికి తోలుకుపోవచ్చును.) అని ప్రకటించాడు.

             అప్పుడు అక్కడున్న వారు ఎవరూ నేనే అందరికంటే గొప్ప బ్రహ్మిష్టుడను అని చెప్పలేక మౌనంగా ఉండి పోయారు.

             అప్పుడు అక్కడున్న యాజ్ఞవల్క్యమహర్షి తన శిష్యుడిని పిలిచి, “ఏతాః సౌమ్య ఉదజ సామశ్రవా3 (సామశ్రవా, ఈ ఆవులను మన ఇంటికి తోలుకుపో నాయనా) అని చెప్పాడు.

             ఆ మాట విన్న పండితులందరికీ చాల కోపం వచ్చింది.  వారిలో అశ్వలుడు ఒకడు.  ఆయన జనక మహారాజు గారి యాజ్ఞికులలో హోత.  త్వం ను ఖలు నో యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠోసి?” (ఓ యాజ్ఞవల్క్యా, మన అందరిలోనూ నువ్వేనా అతి గొప్ప బ్రహ్మవేత్తవు?)  అని తీవ్రంగా అడిగాడు.

             మనలో ఎవరైతే అతి గొప్ప బ్రహ్మిష్ఠుడో అతడికి నా నమస్కారం.  నాకు ఆవుల అవసరం చాలా ఉన్నది.  అందుకనే నేను తోలుకుపోదామని అనుకున్నాను అని యాజ్ఞవల్క్యుడు మందహాసం చేశాడు.

             నీకు ఎంత అవసరం ఉన్నప్పటికీ, ఈ ఆవులు అతి గొప్ప బ్రహ్మవేత్త కోసం ఉద్దేశింపబడ్డాయి.  కాబట్టి మా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి నీవు ఆవులను తీసుకొని పోవచ్చును అని అశ్వలుడు సవాలు చేశాడు.

         యాజ్ఞవల్క్యుడు చిరునవ్వు నవ్వి, సరే ప్రశ్నించండి అని అడిగాడు.

         అశ్వలుడు యజ్ఞానికి, యజ్ఞము చేయించే విధానానికి, యజ్ఞం చేయించేవారికి సంబంధించిన అతి కఠినమైన ప్రశ్నలను వేశాడు.  యాజ్ఞవల్క్యుడు వాటికి అతి సులువుగా సమాధానం చెప్పాడు.  అశ్వలుడు యాజ్ఞవల్క్యుని సమాధానాలను ఆమోదించి, ఇక అడుగవలసిన ప్రశ్నలు తన వద్ద లేవని విరమించుకున్నాడు.

     అప్పుడు జరత్కారువంశీయుడైన కృతభాగుని పుత్రుడైన ఆర్తభాగుడు అనే మహర్షి ప్రశ్నించేందుకు పూనుకున్నాడు.  అతడు గ్రహములను గూర్చి అతిగ్రహములను గూర్చి అడిగిన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు చక్కగా సమాధానం చెప్పాడు.  (ఇక్కడ గ్రహములు అంటే planets కావు.  గ్రహించే వాటిని గ్రహములు అంటారు.). మరణించిన వ్యక్తి ఏమవుతాడు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాడు.  అప్పుడు యాజ్ఞవల్క్యుడు అజేయుడు అని గ్రహించిన ఆర్తభాగుడు మౌనం వహించాడు.

         అప్పుడు లహ్యుని కుమారుడైన భుజ్యుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు.  పారిక్షితుల స్థానాన్ని గూర్చి అతడు అడిగాడు.  (పారిక్షితులు అంటే అశ్వమేధయాగాన్ని చేసిన మహాత్ములు). యాజ్ఞవల్క్యుడు దానికి కూడా సరైన సమాధానం చెప్పాడు.  దాంతో భుజ్యుడు కూడా మౌనం వహించాడు. 

         అప్పుడు చక్రుని కుమారుడైన ఉషస్తి ప్రశ్నించేందుకు ముందుకు వచ్చాడు.  ఆత్మకు సంబంధించిన అతని ప్రశ్నకు కూడా యాజ్ఞవల్క్యుడు సులువుగా సమాధానం చెప్పాడు.  దాంతో ఉషస్తి కూడా తన ప్రయత్నాలను విరమించుకున్నాడు.

         అప్పుడు కుషీతకుని పుత్రుడైన కహోలుడు తన ప్రశ్నలను ప్రారంభించాడు.  అతడు కూడా ఆత్మను గురించి విభిన్నంగా ప్రశ్నించాడు.  యాజ్ఞవల్క్యునినుండి తనకు సరైన సమాధానం లభించడంతో మౌనం వహించాడు.

         అప్పుడు వచక్నుని కుమార్తె అయిన గార్గి తన ప్రశ్నలను ప్రారంభించింది.  వారి మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది -

 

గార్గి

ఒక వస్త్రం దారాలలో ఓత ప్రోతంగా ఎలా వ్యాపించి ఉన్నది కదా, ఆ విధంగా నీరు దేనిలో వ్యాపించి ఉన్నది?”

 

యాజ్ఞవల్క్యుడు

వాయువులో

 

గార్గి

వాయువు దేనిలో వ్యాపించి ఉన్నది?”

 

యాజ్ఞవల్క్యుడు

అంతరిక్షలోకాలలో

 

గార్గి

అంతరిక్షలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

గంధర్వలోకాలలో

 

గార్గి

గంధర్వలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి

 

యాజ్ఞవల్క్యుడు

ఆదిత్యలోకాలలో

 

గార్గి

ఆదిత్యలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

చంద్రలోకాలలో

 

గార్గి

చంద్రలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

నక్షత్రలోకాలలో

 

గార్గి

నక్షత్రలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

దేవలోకాలలో

 

గార్గి

దేవలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

ఇంద్ర లోకాలలో

 

గార్గి

ఇంద్రలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

ప్రజాపతిలోకాలలో

 

గార్గి

ప్రజాపతిలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”

 

యాజ్ఞవల్క్యుడు

బ్రహ్మలోకాలలో

 

గార్గి

బ్రహ్మలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి?”

గార్గి ఆ ప్రశ్నను వేసేసరికి యాజ్ఞవల్క్యుడు ఆమెను కనికరం నిండిన దృష్టులతో చూశాడు.  ఓ గార్గీ, అతిప్రశ్నలను వేయకు. నీ తల ఊడి పడుతుంది అని హెచ్చరించాడు.

         (బ్రహ్మలోకం అనిర్వచనీయమని, అతీంద్రియమని, అవాఙ్మానసగోచరమని శాస్త్రం చెబుతుంది.  ఆ విధంగా కన్నులకు గాని, మనసుకు గాని ఇతర-ఇంద్రియాలకు గాని అందని విషయాన్ని గురించి ప్రశ్నించడాన్ని అతిప్రశ్న అంటారు.  ఎందుకంటే ఇంద్రియాలకు మనసుకు అందని దానిని ఎవరికి వారు స్వీయానుభవంతో తెలుసుకోవాలి.  బ్రహ్మలోకాలను గూర్చి తెలుసుకునేందుకు ఆ విధంగా ప్రయత్నించకుండా అవి ఎలా ఉంటాయి అవి ఎందులో ఉంటాయి అని ప్రశ్నించడమే ఈ సందర్భంలో అతి ప్రశ్న.  అంతేకాక, వేదవాక్కును మించిన ప్రమాణం లేదు.  దానిని పక్కకు త్రోసి అనుమానప్రమాణాన్ని ఆశ్రయించి అది వేదం కంటె గొప్పదనటం కూడా అతి.  ఆ విధంగా వేదాన్ని అతిక్రమించి అనుమానప్రమాణానికి అధికప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్రశ్నిస్తే అప్పుడు కూడా అది అతి ప్రశ్న అవుతుంది.)

         యాజ్ఞవల్క్యుడు అలా చెప్పేసరికి తన పొరపాటున గ్రహించిన గార్గి కూడా మౌనం వహించింది.

         అప్పుడు అరుణపుత్రుడైన ఉద్దాలకుడు ప్రశ్నించడం ప్రారంభించాడు.  ఓ యాజ్ఞవల్క్యా! నాకు సూత్రాత్మగా ఉన్న అంతర్యామిని గూర్చి తెలుసును. నీకు కూడా ఆ అంతర్యామి తెలిసినట్లయితే సరే.  కాని, అంతర్యామిని గూర్చి ఏమీ తెలియకుండా నీవు ఆవులను తీసుకువెళ్లదలిస్తే నీ తల ఊడి పడుతుంది అని హెచ్చరించాడు.  యాజ్ఞవల్క్యుడు అంతర్యామిని గురించి చక్కగా వివరించాడు.  సరైన సమాధానం లభించేసరికి ఉద్దాలకుడు మౌనం వహించాడు.

         అప్పుడు గార్గి మరలా నిలబడింది.  యాజ్ఞవల్క్యుని మరొకసారి ప్రశ్నించేందుకు పండితసభ అనుమతిని కోరింది.  ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పగలిగితే ఇక ఈ సభలో ఎవరూ యాజ్ఞవల్క్యుని ఓడించలేరు.  అటువంటి ప్రశ్న వేసేందుకు మీ అనుమతిని కోరుతున్నాను అని వినయంగా అడిగింది. సభ అందుకు అనుమతినిచ్చింది.  అప్పుడు గార్గి ఈ విధంగా సవాలు చేసింది. 

            ఓ యాజ్ఞవల్క్యా, నేను వేయబోయే ప్రశ్న ధనుస్సును ఎక్కు పెట్టి సంధింపబడి విడుదలకాబోతున్న పదునైన బాణం వంటి ప్రశ్న.  నీ దగ్గర సమాధానం ఉందా?” అని అడిగింది.




             యాజ్ఞవల్క్యుడు మందహాసం చేసి "వెంటనే ప్రయోగించవమ్మా నీ బాణాన్ని" అన్నాడు. 

ద్యు లోకానికి పైన, పృథ్వీలోకానికి క్రిందన, ఏది వ్యాపించి ఉన్నదో, ఈ ధ్యావాపృథ్వీలోకాలకు నడుమ ఏది ఉన్నదో, దేనికి భూతము భవము భవిష్యత్తు (Past, Present, Future) అనేవి ఉండవో, అయ్యది దేనిలో ఓతప్రోతంగా వ్యాపించి ఉన్నది?”

         ఈ విధంగా గార్గి అడిగిన ప్రశ్నను విని అందరూ దిగ్భ్రాంతి చెందారు.  అసలు ఆ ప్రశ్నలోని విషయం కూడా ఊహకు అందదు.  ఇక దానికి సమాధానం ఎవరు చెప్పగలరు అనుకున్నారు.  మునుపు గార్గి వేసిన ప్రశ్న మాటలకు అందనిదైనందున అతి ప్రశ్న అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.  కాని, ఇప్పుడు గార్గి తన మాటలతో వర్ణించినందువలన అది అతి ప్రశ్న కాజాలదు.  యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం వచ్చింది.

         అయితే ఆ విద్వత్పరిషత్తులోని మిగిలిన విద్వాంసులందరూ వేరు, యాజ్ఞవల్క్యుడు వేరు.  అతడికి గార్గి వేసిన ప్రశ్న కరతలామలకంలా అనిపించింది. 

         ఓ గార్గీ, అది ఆకాశంలో వ్యాపించి ఉన్నది అని యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాడు. 

     సభ నిశ్చేష్టమై నిశ్శబ్దంగా మారిపోయింది.  గార్గి మ్రాన్పడిపోయింది.  తన ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు అంత సులువుగా సమాధానం చెబుతాడని ఆమె ఊహించనేలేదు.  నిజానికి ఆమె అడిగినది ఊహాతీతమైన పరబ్రహ్మ గురించి.  పరబ్రహ్మ వర్ణింప వీలుకానిది. కాబట్టి, యాజ్ఞవల్క్యుడు మౌనం వహించాలి.  గార్గి అడిగినది అతిప్రశ్న కాకపోయినప్పటికీ, సమాధానం చెప్పలేక మౌనం వహిస్తే, ఆమె ప్రశ్నకు సమాధానం నావద్ద లేదని యాజ్ఞవల్క్యుడు తన పరాజయాన్ని అంగీకరించినట్లే.  అందువల్ల గార్గి చాల తెలివిగా యాజ్ఞవల్క్యుని ఇరుకున పెడదామని ఆ విధంగా ప్రశ్నించింది.  కాని, ఆమె తన ప్రశ్నలో ఒక పొరపాటు చేసింది.  ద్యావాపృథ్వీలోకాలు అని ఆమె ఉచ్చరించడంతో అవి కేవలం భౌతిక పదార్థాలు మాత్రమే అయినాయి.  అందువల్ల అవి ఆకాశంలో ఉంటాయని యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాడు.  ఆ సమాధానం లౌకికంగానూ శాస్త్రీయంగాను కూడా సత్యమే.  మొదటి సారి నీవు అడిగినది అతిప్రశ్న అయితే రెండవసారి నీవు అడిగిన ప్రశ్న అతి సాధారణమైన ప్రశ్న అన్నట్లుగా యాజ్ఞవల్క్యుడు తేల్చేశాడు.  అంతే కాదు, ఆకాశం కంటె కూడా నీవడగదలుచుకున్న పరబ్రహ్మ మరింత గొప్పది అని పరోక్షంగా తగిన సమాధానం కూడా సూచించాడు.  (తస్మాద్వా ఏతస్మాదాత్మనః ఆకాశః సంభూతః అని తైత్తిరీయవాక్కు.)

         తెల్లబోయిన గార్గి కాసేపటికి తేరుకుని, “ఆ ఆకాశం దేనిలో వ్యాపించి ఉన్నది?” అని అడిగింది.  దానిని అక్షరం అంటారు (అక్షరం = క్షరము కానిది = నాశనం లేనిది) అని యాజ్ఞవల్క్యుడు చెప్పి, దాని స్వరూపం వర్ణింప వీలులేనిది కాబట్టి, నేతి (న+ఇతి) వాదం ప్రకారం సమాధానం చెప్పాడు.  (ఆ అక్షరస్వరూపం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇలా ఉండదు అంటూ వర్ణించాడు.). అటువంటి అక్షరంలో ఈ ఆకాశం వ్యాపించి ఉన్నది అని చెప్పాడు.  గార్గికి తగిన సమాధానం లభించింది.  ఆమె పన్నిన ఉచ్చులో యాజ్ఞవల్క్యుడు ఇరుకున పడలేదు.  తామరతూడు ఏనుగును బంధించలేదు కదా.

ఆ సమాధానం విన్న గార్గి వినమ్రురాలయింది. యాజ్ఞవల్క్యునికి సవినయం నమస్కారం చేసింది.  వినీతులు ఎంతటి జిగీషులైనప్పటికీ, మహాత్ముల చెంత వారి సహజస్వభావం పెల్లుబుకుతూనే ఉంటుంది కదా. అయ్యా పండితులారా! మీరు కూడా ఈయనకు నమస్కారం చేసి, ఈయన మనలో అతి గొప్ప బ్రహ్మవేత్త అని అంగీకరించండి.  సత్యాన్ని అంగీకరిస్తే అది మనకు విజయమే కాని పరాజయం కాదు. మీరెవరు ఈయనను జయింపలేరు అని సభలోని విద్వాంసులతో హితవు పలికింది.

         అయితే గార్గి మాటలను శాకల్యుడు సహించలేకపోయాడు.  తాను కూడా ప్రశ్నించి యాజ్ఞవల్క్యుని పరీక్షిద్దామని ముందుకు వచ్చాడు.

 

శాకల్యుడు

వైశ్వదేవంలో దేవతల సంఖ్య ఎంత?”

 

యాజ్ఞవల్క్యుడు

3306 మంది

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

33 మంది

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఆరుగురు

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ముగ్గురు

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఇద్దరు

 

శాకల్యుడు

సరే, ఎంత మంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఒకటిన్నర మంది

 

శాకల్యుడు

సరే, ఎంతమంది దేవతలు?”

 

యాజ్ఞవల్క్యుడు

ఒక్కరు

 ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు తాను చెప్పిన ఆయా దేవతల సంఖ్యలను గురించి కూడా చక్కగా వివరించాడు.

         అయినప్పటికీ శాకల్యుడు శాంతించలేదు.  ఏ విధంగానైనా యాజ్ఞవల్క్యుడిని జయించాలనే కోరికతో ప్రశ్న మీద ప్రశ్నలను అడుగుతూ పోయాడు.  (సత్యాన్ని తెలుసుకోవాలని కోరికతో కాకుండా, తనకు సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని ఎంతమాత్రం ప్రతిపాదించకుండా, కేవలం తన ప్రత్యర్థి మాటలను నిరాధారంగా నిష్కారణంగా అసూయతో ఖండిస్తూ వాదించడాన్ని వితండవాదం అంటారు.).

         చివరకు శాకల్యుని దురాగ్రహాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు, ఓ శాకల్యా, నీకు సమాధానం తెలియని ప్రశ్నను నన్ను అడుగవద్దు.  సమాధానం తెలియకుండా నన్ను ప్రశ్నించినట్లయితే నీ తల తెగిపడుతుంది అని హెచ్చరించాడు.  అయినప్పటికీ, శాకల్యుడు తనకు సమాధానం తెలియని ప్రశ్నను అడిగేశాడు.  దాంతో శాకల్యుని తల అందరి సమక్షంలోను తెగి క్రింద పడింది.

      అప్పుడు యాజ్ఞవల్క్యుడు, సభను ఉద్దేశించి, “అయ్యా, మీలో ఇంకా ఎవరెవరు ఏమేమి ప్రశ్నలను అడగదలుచుకున్నారో విడివిడిగా అడగవచ్చు.  లేదా అందరూ కలిసి ఒకే ప్రశ్నను వేయవచ్చు.  నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నాను అని పలికాడు.

         అప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. 

       అప్పుడు యాజ్ఞవల్క్యుడే స్వయంగా పండితపరిషత్తును ఉద్దేశించి ప్రశ్నించాడు.  ఆత్మ అనే పురుషుని వృక్షంతో పోల్చి చెప్పి, చెట్టును వేళ్లతో సహా విత్తనంతో సహా నాశనం చేస్తే ఆ చెట్టు మరల మొలకెత్తదు.  కాని, మన ముందే మరణించి, శరీరం కాల్చివేయబడినప్పటికీ, ఆ వ్యక్తి మరలా జన్మిస్తాడు. (ధ్రువం జన్మ మృతస్య అని శాస్త్రం)  కో న్వేయం జనయేత్ పునః?  (మరణించిన వ్యక్తిని మరలా పుట్టేట్లుగా చేస్తున్న ఆ శక్తి ఏమిటి?) అని అడిగాడు.

     ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు.  యాజ్ఞవల్క్యుడు సభకు నమస్కరించి, ఆవులను తోలుకొని పోయాడు. 

విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్దాతుః పరాయణం తిష్ఠమానస్య తద్విద ఇతి – అని బృహదారణ్యకోపనిషత్తు ఆ శక్తిని గూర్చి చెబుతుంది.  ఆ శక్తి పేరు విజ్ఞానం.  ఆ శక్తి పేరు ఆనందం.  ఆ శక్తి పేరు బ్రహ్మ.  అదే పరమగతి.

 

ఇతి శమ్

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...